స్పీడ్ న్యూస్- 1

1.పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ త్వరలో ఇన్ స్టాలో అభిమానులను పలకరించనున్నారు. ఇన్ స్టాగ్రాంలోకి పవన్ ఎంట్రీ ఇవ్వనున్నారని ఆయన సోదరుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు పేర్కొన్నారు. 2.50 లక్షల విలువైన వజ్రపుటుంగరాన్ని దొంగిలించిన ఓ యువతి ఆ తర్వాత పోలీసుల భయంతో దానిని టాయిలెట్ కమోడ్‌లో పడేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగిందీ ఘటన 3.ఎన్సీపీలో పెను కలకలానికి కారణమైన ఆ పార్టీ నేత అజిత్ పవార్ సహా 9 మంది రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలకు ఎన్సీపీ సిద్ధమైంది. వారిపై అనర్హత పిటిషన్ దాఖలు చేసినట్టు పార్టీ అధినేత జయంత్ పాటిల్ తెలిపారు.  4. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సింహాచలంలో నిన్న సాయంత్రం ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఈ ఉదయం సింహాద్రి గిరులు కిక్కిరిసిపోయాయి.అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లోనే ఆయన ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 5.చైనా బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా అకస్మాత్తుగా పాకిస్థాన్‌లో పర్యటించడం తీవ్ర చర్చకు కారణమైంది. జూన్ 29న లాహోర్‌లో వాలిపోయిన జాక్ మా 23 గంటలపాటు అక్కడే ఉన్నట్టు బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ మాజీ చైర్మన్ ముహమ్మద్ అజ్ఫర్ ఎహసాన్ తెలిపారు. 6.అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లోనే ఆయన ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 7. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరలోనే కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా, ఇదే విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు స్పందిస్తూ ఖమ్మం సభ ముగించుకుని గత రాత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌ను కలిసేందుకు వచ్చిన  ఆయన మాట్లాడారు.  8.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో త్వరలోనే ప్రియాంకగాంధీ పర్యటించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ విషయాన్ని వెల్లడించారు. 9.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. కొద్దిరోజులుగా కేంద్ర కేబినెట్ లో మార్పులు చోటుచేసుకోనున్నాయని ప్రచారం జరుగుతుండడం, ఆదివారం మహారాష్ట్రలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 10.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 144వ రోజు నెల్లూరు రూరల్ కాకుపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా యువనేతకు మహిళలు హారతులతో నీరాజనాలు పడుతూ, దిష్టి తీస్తూ ఘనస్వాగతం పలికారు.

జగన్ ముందస్తు ముచ్చట..ఓ అంతులేని కథ

వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం కోల్పోతే ఏం జరుగుతుందో ఏపీలో  హేతువుతో సంబంధం లేకుండా సాగుతున్న ఊహాగాన సభలను గమనిస్తు ఇట్టే అర్ధమైపోతుంది. ఈ ఏడాది చివరిలో దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. ఇక రెండు మూడు నెలలలో షెడ్యూల్ విడుదల కూడా జరిగిపోతుంది. అయినా ఏపీలో ముందస్తు ముచ్చటకు సంబంధించిన ఊహాగానాలూ, అంచనాలూ ఇసుమంతైనా ఆగడం లేదు. ఏపీ సీఎం స్వయంగా ముందస్తు ప్రశ్నే లేదు.. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు అని విస్పష్టంగా ప్రకటించినా.. పరిశీలకుల నుంచి, రాజకీయ విశ్లేషకుల దాకా, సామాన్య జనం నుంచి ప్రతి పక్ష పార్టీల వరకూ ఏపీలో ముందస్తు ఖాయమంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు.  తాజాగా మరో మారు ఏపీలో ముందస్తు ఎన్నికలపై మరో సారి విస్తృత స్థాయి చర్చలకు తెరలేచింది. ఇందుకు కారణం ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ హస్తిన పర్యటనకు ముహూర్తం ఖరారు కావడమే. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు పలువురు బీజేపీ కీలక నేతలు, మంత్రులతో కూడా భేటీ అవుతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మోడీ, షాల అప్పాయింట్ మెంట్ ఖరారైందని కూడా చెబుతున్నాయి. జగన్ ఈ పర్యటన విషయంలో బయటకు చెబుతున్న కారణాలు ఏపీకి రావలసిన అంశాలపై చర్చే అని చెబుతున్నా.. వాస్తవ కారణం మాత్రం ముందస్తు కోసం మోడీకి బతిమలాడుకోవడం కోసమేనని అంటున్నారు. అంతే కాకుండా మోడీ కూడా ముందస్తు యోచన చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో జగన్ పర్యటన  రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీ తన అప్పుల పరిమితి దాదాపు వాడేసుకుంది. ఎడాపెడా అప్పులు, కేంద్రం నుంచి ఉదారంగా నిధులూ వచ్చినా కూడా ఆగస్టు నుంచి ఉద్యోగుల జీతాలే కాదు, బటన్ నొక్కుడు సంక్షేమానికీ ఇబ్బందులు తప్పవు. దీంతో జగన్ కేంద్రం వద్ద మీరు ఆదుకోవాలి అంటూ వేడుకోవడం, అలాగే దీపం ఉండగానే ఇళ్లు చక్కపెట్టుకుంటాను.. ముందస్తుకు అవకాశం ఇవ్వండి అని విజ్ణప్తి చేయడం వినా మరో గత్యంతరం లేదని పరిశీలకలు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్  ఈ నెల5, 6 తేదీలలో హస్తినలో పర్యటించనుండటం ప్రభుత్వ పెద్దలతోనే కాకుండా, బీజేపీ అగ్రనాయకులతో కూడా సమావేశం కానుండటంతో.. మోడీ ప్రమేయంతో ముందస్తుకు అవకాశం దక్కేలా చేసుకుంటారన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. 2014 ఎన్నికలలో తన పార్టీని విజయ పథంలో నడిపించి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ఆ తరువాత చుట్టూ సమస్యలు చుట్టుముట్టడంతో వ్యూహాత్మకంగా 2019 వరకూ ఆగకుండా ఆర్నెళ్లు ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి 2018లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ సారి మాత్రం ఆయన అంతే వ్యూహాత్మకంగా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు వెడుతున్నారు.  ఇక జగన్ విషయానికి వస్తే 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించిన ఆయన నాలుగేళ్లలోనే అంతులేనంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలలో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత  రోజు రోజుకూ పెరుగుతున్నదే కానీ తగ్గడం లేదు. అలా తగ్గే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. సంక్షేమం అంటూ బటన్లు నొక్కి లబ్ధి దారుల ఖాతాలలో సొమ్ములు వేస్తున్నా.. ఎక్కడా సంతృప్తి అన్నది ప్రజలలో మచ్చుకైనా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో బటన్ నొక్కుడు కూడా కష్టమయ్యేలా భవిష్యత్ అద్దంలో కనిపిస్తుండటంతో జగన్ లో ఆందోళన పెరుగుతోంది. దీంతో  షెడ్యూల్ వరకూ వేచి చూడాలని ఆయన భావిస్తున్నా.. ముందస్తుకు వెళ్లకుంటే మొదటికే మోసం వస్తుందన్న ఆందోళనా ఆయనను వెన్నాడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ హస్తిన పర్యటన వెనుక ముందస్తు మంతనాలు జరపడం అన్నదే ప్రధాన కారణమై ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 

బండి సంజయ్ కు స్థాన భ్రంశం.. కేబినెట్ లోకేనా?

బీజేపీలో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు స్థానం భ్రంశం తప్పదన్న విషయం దాదాపుగా ఖరారైంది.  తెలంగాణ బీజేపీలో తలెత్తిన వర్గ పోరుకు ఫెల్ స్టాప్ పెట్టి.. పార్టీ పరిస్థితిని చక్కదిద్దాలన్న నిర్ణయానికి ఆ పార్టీ హై కమాండ్ వచ్చేసిందని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇప్పుడో ఇహనో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పిస్తూ ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై పార్టీ హై కమాండ్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసిందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు అమిత్ షా, అలాగే కార్యనిర్వాహక అధ్యక్షుడు బీఎల్ సంతోష్ ఈ విషయంపై విస్తృతంగా, సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చేశారని కూడా అంటున్నారు.  కాగా సోమవారం (జులై 3)న కేంద్ర కేబినెట్ భేటీలో ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఈ భేటీలోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కూడా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, అలాగే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర కేబినెట్ లోని కొందరిని పార్టీ అవసరాల కోసం తప్పించే అవకాశాలున్నాయంటున్నారు. అలాగే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్రాలకు చెందిన కొందరిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలూ ఉన్నాయి.  ఇక మళ్లీ తెలంగాణ విషయానికి వస్తే.. బండి సంజయ్ ను కేబినెట్ లోకి తీసుకుని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కేబినెట్ నుంచి తప్పించి.. రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించే అవకాశాలున్నాయన్న చర్చ బీజేపీ శ్రేణుల్లో జరుగుతోంది.  ఇక ఈటల రాజేందర్ కు కూడా  కీలక పదవి అప్పగించే అవకాశాలను కొట్టిపారేయలేమని పార్టీ కీలక నేతలే చెబుతున్నారు. ఆయనకు ఎన్నికల కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు.   పార్టీలో సంస్థాగతంగా జరిగే మార్పులతో అసంతృప్తి తలెత్తి, నేతలు జారిపోకుండా ఇతర బాధ్యతలతో సంతృప్తి పరచాలన్న వ్యూహంతో బీజేపీ హైకమాండ్ ఉంది.    బీజేపీ ప్రధానంగా  ఈ ఏడాది చివరిలో  ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  మార్పు చేర్పుల విషయంలో ఆ రాష్ట్రాలపైనే బీజేపీ హై కోమాండ్ ఫోకస్ పెట్టింది. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మార్పు విషయంలో పార్టీ అగ్రనేతల మధ్యే భిన్న వార్తలు వినవస్తున్న నేపథ్యంలో  బండి సంజయ్ స్వయంగా కార్యకర్తలతో మాట్లాడుతూ మోడీ రాష్ట్ర పర్యటనలో తాను బీజేపీ రాష్ట్ర చీఫ్ హోదాలో పాల్గొంటానో లేదో తెలియదని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.  రాష్ట్ర పార్టీలో పలువురు నేతల మధ్య  సయోధ్య లేకపోవడంతో  ఏ నిర్ణయం తీసుకుంటే ఏమౌతుందన్న ఉత్కంఠ తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో నెలకొంది.   వరంగల్‌లో ఈ నెల 8న ప్రధాని కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కోసం ఆదివారం జరిగిన సన్నాహక సమావేశంలో ఈటల రాజేందర్, బండి సంజయ్ ల మధ్య ఇసుమంతైనా సయోధ్య లేదన్న సంగతి వారి బాడీ లాంగ్వేజ్ ను బట్టి స్పష్టంగా తేలిపోయింది. ఈ సమావేశంలో వారిరువురూ ఎడముఖం, పెడముఖంగా వ్యవహరించారు.   

కాంగ్రెస్ వర్గ పోరు భూతం బీజేపీని ఆవ‌హించిందా!?

కాంగ్రెస్ పార్టీ అంటే ముందుగా గుర్తుకొచ్చేది వ‌ర్గ‌ పోరు పార్టీ.. అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నా బంగాళాఖాతంలో ఎప్పుడూ నీరున్న‌ట్లు ఆ పార్టీలో నేత‌ల మ‌ధ్య నిత్యం వ‌ర్గం పోరు తారస్థాయిలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ముందుగా గుర్తుకొచ్చేది వ‌ర్గ‌ పోరు పార్టీ.. అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నా బంగాళాఖాతంలో ఎప్పుడూ నీరున్న‌ట్లు ఆ పార్టీలో నేత‌ల మ‌ధ్య నిత్యం వ‌ర్గం పోరు తారస్థాయిలో ఉంటుంది. ప‌ద‌వుల విష‌యంలో, నాయ‌క‌త్వం విష‌యంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు ఆ పార్టీలోని నేత‌లు కుమ్ములాడుకుంటూనే ఉంటారు. వ‌ర్గ‌ పోరు ఆ పార్టీకి అనేక సార్లు అధికారాన్ని దూరం చేసినా నేత‌ల్లో మాత్రం మార్పు క‌నిపించ‌దు. దీంతో కాంగ్రెస్ పార్టీకి 'వ‌ర్గ‌పోరు భూతం' ఎప్పుడూ ఆవ‌హించే ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చ‌మ‌త్క‌రిస్తూ ఉంటారు. ప్ర‌స్తుతం ఈ వర్గపోరు భూతం బీజేపీని సైతం ఆవ‌హించిన‌ట్లు క‌నిపిస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ నేత‌ల మ‌ధ్య వ‌ర్గ‌ పోరు తార స్థాయికి చేరింది. సాధార‌ణంగా బీజేపీలో నేత‌ల మ‌ధ్య విబేధాలు త‌క్కువ స్థాయిలోనే క‌నిపిస్తుంటాయి. ప్ర‌స్తుతం, తెలంగాణ బీజేపీలో నువ్వా నేనా అనే స్థాయిలో నేత‌ల మ‌ధ్య వ‌ర్గ‌ పోరు న‌డుస్తుండ‌టం ఆ పార్టీ అధిష్టానాన్ని క‌లవ‌ర‌పాటుకు గురి చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మ‌రికొద్ది నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మూడు నాలుగు నెలలలో ఎప్పుడైనా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీంతో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు బూచి చూపించి అనుకున్న దాని కంటే అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధించిన కేసీఆర్‌. ఈసారి కొత్త ఎత్తుగ‌డ‌ల‌తో ప్ర‌తిప‌క్షాల‌ను బురిడీ కొట్టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌రోవైపు బీఆర్ఎస్ పార్టీని గ‌ద్దెదించేందుకు   బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీ ప‌డుతున్నాయి. రెండు పార్టీల నేత‌లు అధికారంలోకి వ‌చ్చేది మేమంటే మేమంటూ ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, రెండు పార్టీల్లోనూ నేత‌ల‌ వ‌ర్గ విబేధాలు ఆయా పార్టీల అధిష్టానాల‌కు త‌ల‌నొప్పిగా మారుతున్నాయి.  క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ క‌నీసం పోటీ ఇచ్చే ప‌రిస్థితుల్లో కూడా క‌నిపించ‌లేదు. అక్క‌డ పార్టీ ఘ‌న విజ‌యం సాధించ‌డంతో తెలంగాణ‌లోనూ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. రెండు నెల‌ల కాలంలోనే ఊహించ‌ని రీతిలో కాంగ్రెస్ పుజుకుంది. అదే స‌మ‌యంలో బీజేపీ ప్ర‌భావం త‌గ్గుతూ వ‌చ్చింది. దీంతో బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మైన నేత‌లుసైతం యూట‌ర్న్ తీసుకొని కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌కు ఒక్క‌సారిగా ప్ర‌జ‌ల్లో పెరిగిన గ్రాఫ్‌తో కేంద్ర అధిష్టానం సైతం అల‌ర్ట్ అయింది. రాష్ట్రంలోని ముఖ్య‌ నేత‌లంద‌రినీ ఢిల్లీకి పిలిపించి ఐక్యంగా ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ఆదేశాలిచ్చింది. అదే విధంగా కాంగ్రెస్ కూడా పార్టీ నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించి ఐక్యంగా ముందుకు సాగే విధంగా దిశానిర్దేశం చేసింది. ఎవ‌రైనా హ‌ద్దు దాటితే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయంటూ రాహుల్ గాంధీ స్వ‌యంగా కాంగ్రెస్ నేత‌ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ నేత‌లు మేమంతా క‌లిసిపోయాంటూ కొత్త‌రాగం అందుకున్నారు.  కాంగ్రెస్ నేత‌లంతా ఐక్యతారాగం ఆల‌పిస్తున్న వేళ.. తెలంగాణ బీజేపీలో నేత‌ల మ‌ధ్య వ‌ర్గ విబేధాలు  పీక్స్ కు చేరాయి. బీజేపీలో ఇలాంటి ప‌రిస్థితి గతంలో ఎన్నడూ కనిపించిన దాఖలాలు లేవు. ఒక‌వేళ  విబేధాలు ఉన్నా.. పార్టీలో అంత‌ర్గ‌తంగానే కొన‌సాగాయి. ఈసారి, బీజేపీలోని నేత‌లు బ‌హిరంగంగానే ఒక‌రిపై ఒక‌రు కాలుదువ్వుకొనే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. బండి సంజ‌య్‌ను అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి త‌ప్పిస్తార‌ని, ఈట‌ల‌కు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. దీనికితోడు ఆ పార్టీలోని నేత‌లు కొంద‌రు బండి సంజ‌య్ ప‌ద‌వి ఊడిన‌ట్లేనంటూ ప్ర‌చారం చేయ‌డం పార్టీలో వ‌ర్గ విబేధాల‌ ఆజ్యం పోసిన‌ట్ల‌యింది. ఇదే స‌మ‌యంలో తెలంగాణ బీజేపీ నేత‌ల ప‌ట్ల కేంద్ర పార్టీ అధిష్టానం ఎలా వ్య‌వ‌హ‌రించాలో చెబుతూ.. మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి చేసిన వీడియో ట్వీట్ తెలంగాణ బీజేపీలో పెను దుమారాన్నే రేపింది. దీంతో ఈట‌ల వ‌ర్గం, సంజ‌య్ వ‌ర్గం అన్న‌ట్లుగా బ‌హిరంగంగానే ఆ పార్టీ నేత‌లు వాదులాడుకొనే స్థాయికి చేరింది.  ఆదివారం హ‌న్మంకొండ‌లో జ‌రిగిన బీజేపీ స‌భ‌లో కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్, ఈట‌ల పాల్గొన్నారు. అయితే, ఈట‌ల‌, సంజయ్ ఎడ‌మొహం పెడ‌మొహంలానే ఉన్నారు. దీంతో ఎప్పుడూ కాంగ్రెస్‌ను ప‌ట్టిపీడించే వ‌ర్గ‌పోరు భూతం.. ఈసారి బీజేపీని  ఆవ‌హించింద‌ని రాజ‌కీయా విశ్లేష‌కులు చ‌మ‌త్క‌రిస్తున్నారు. అలాఅని కాంగ్రెస్‌ను సైతం వ‌ర్గ‌పోరు భూతం పూర్తిగా వీడ‌లేదు. దీంతో ఎన్నిక‌ల నాటికి ఈ రెండు పార్టీల్లోని నేత‌లతో వ‌ర్గ‌పోరు భూతం ఎన్ని విన్యాసాలు చేయిస్తుందో వేచి చూడాల్సిందే.

ఇడుపుల పాయకు సోనియా, రాహుల్.. షర్మిల పార్టీ విలీనం ఖాయమేనా?

పర్యవశానాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ ఇటీవలి కాలంలో ఎన్నడూలేనంత రేంజిలో రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తుంది. ఇంకా చెప్పాలంటే గత తొమ్మిదేళ్లుగా నిస్తేజంగా కనిపించిన కాంగ్రెస్  ఇప్పుడు ఒక్కసారిగా జూలు విదిలించి పంజా విసిరేందుకు సిద్ధమైన సింహంగా కనిపిస్తోంది. కర్ణాటకలో  ఫలితాలకు అంతకు ముందే రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రతో ఆ పార్టీలో వచ్చిన కదలిక తోడై కాంగ్రెస్ కోటలో మళ్ళీ అధికారంపై ఆశలు చిగురించాయి. దేశవ్యాప్తంగా ప్రజలలో కూడా ఈ పార్టీ పట్ల ఆసక్తి, ఆదరణ కనిపిస్తోంది. దీంతో ఆ పార్టీ పెద్దలు కూడా పరిస్థితికి అనుకూలంగా కొత్త కొత్త ప్రణాళికలు రచించి అమలు చేస్తున్నారు.  అందుకోసం పాత మిత్రులను, కలిసి వచ్చే శత్రువులను సైతం కలుపుకొని వెళ్లేందుకు సై అంటున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో తమ నేతల మధ్య వైరాన్ని రూపుమాపి స్నేహాన్ని పెంచేలా చర్యలు మొదలు పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలుగురాష్ట్రాల పార్టీ వ్యవహారాలను స్వయంగా పార్టీ అగ్రనాయకత్వమే పర్యవేక్షిస్తున్నట్లు కనిపిస్తున్నది.  తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2024 సాధారణ ఎన్నికల ముందే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇక్కడి ఫలితాల ప్రభావం దేశమంతా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకులను, కేసీఆర్ శత్రువులను ఇంకా కలిసి వచ్చే వారిని కలుపుకు పోతున్నది. ఈ క్రమంలో ఇప్పటికే భారీగా చేరికలు మొదలు కాగా,  పాత కాంగ్రెస్ నేతలను కూడా మళ్ళీ వెనక్కి వచ్చేలా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక, ఏపీ విషయానికి వస్తే ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పుంజుకోవాలంటే సామాన్య విషయం కాదు. అందుకే అధిష్టానం ఒక ప్రయత్నంగా వైఎస్ కుటుంబాన్నే ప్రయోగించాలని చూస్తున్నట్లు కనిపిస్తుంది. వైఎస్ కుమార్తె, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలను తమతో కలుపుకోవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే షర్మిల పార్టీ విలీనంపై ఈ మధ్య తీవ్ర ప్రచారం జరిగింది.  కాగా, ఇప్పుడు ఈ వ్యవహారంపై ఏకంగా   సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. ఇన్నాళ్లు కాంగ్రెస్ తో షర్మిల పార్టీ విలీనంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాయబారం నడిపారు. షర్మిలను ఆయన రాష్ట్రం కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తారనీ ప్రచారం జరిగింది. కాగా, ఇప్పుడు ఏకంగా సోనియా, రాహుల్ వైఎస్ఆర్ సతీమణి విజయమ్మతో సంప్రదింపులు జరపనున్నారని ప్రచారం మొదలైంది. ఇందు కోసం వేదిక కూడా ఖరారైంది. జులై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఆ రోజున సోనియా, రాహుల్ గాంధీ  కడప  జిల్లాలోని ఇడుపులపాయకు రానున్నారు. అక్కడి వైఎస్ఆర్ ఘాట్లో నివాళులు అర్పించనున్నారు. ఇక్కడే వారు విజయమ్మతో భేటీ కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది. సోనియా, రాహుల్ పర్యటనకు సంబంధించి వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇప్పటికే ఇడుపులపాయకు వచ్చి   ఏర్పాట్లు పరిశీలించి వెళ్లారని.. సెక్యూరిటీ టీం క్లియరెన్స్ ఇస్తే సోనియా రాక ఖాయం కానున్నట్లు తెలుస్తున్నది.   ఇదే నిజమైతే రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిణామాలు గుణాత్మకంగా మారతాయనడంలో సందేహం లేదు. వైఎస్ ఉన్నంత కాలం ఈ కుటుంబంతో సోనియా, రాహుల్ కు మంచి అనుబంధం ఉండేది. జగన్ కాంగ్రెస్ ను వ్యతిరేకించిన తర్వాత వ్యవహారం చెడింది. అయితే, ఇప్పుడు వైఎస్ కుటుంబం రెండుగా విడిపోయింది. తల్లి విజయమ్మ పూర్తిగా కుమారుడు జగన్ కు దూరంగా ఉంటూ కుమార్తె షర్మిలకు అండగా ఉంటున్నారు.. ఈ మధ్య షర్మిల పార్టీ వ్యవహారాలలో కూడా విజయమ్మ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే సోనియా, రాహుల్ స్వయంగా ఏపీకి వచ్చి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది.

మరోసారి ఢిల్లీకి జగన్.. రెండు రోజుల మకాం వెనక మతలబేంటి?

సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. ఈ మేరకు జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ నెల 5, 6 తేదీల్లో సీఎం జగన్ ఢిల్లీలో ఉండనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోనూ సీఎం జగన్ సమావేశం కానున్నారు. 5వ తేదీ రాత్రికి మోడీ, అమిత్ షాతో సీఎం భేటీ ఖరారు అయినట్లు తెలుస్తోండగా.. ఆలస్యం అయితే 6వ తేదీ సమావేశం కానున్నారు. వీరితో పాటు ఢిల్లీలో మరికొందరు పెద్దలతో కూడా భేటీ కానున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు, వైసీపీ నేతలు ఈ భేటీ గురించి ప్రచారం కూడా మొదలు పెట్టారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి, పోలవరం అడహక్ నిధులకు సంబంధించిన అంశాలపై సీఎం జగన్ కేంద్రం వద్దకు వెళ్తున్నారని చెప్తున్నారు.  అయితే, ఒకవైపు రాష్ట్రంలో, కేంద్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారుతోంది. 2019 ఎన్నికల ముందు నుండే సీఎం జగన్ బీజేపీతో సఖ్యత పెంచుకున్నారు. ఇక సీఎం అయ్యాక మొదలు ఇప్పటి వరకు కేంద్రంలో తన అవసరం ఉన్నా లేకపోయినా.. బీజేపీ అడిగినా అడగకపోయినా బీజేపీ ప్రభుత్వానికి ప్రతి అంశంలోనూ మద్దతు ఇచ్చారు. అయితే, అప్పుడు పరిస్థితి వేరు.  ఇది ఎన్నికల సమయం. ఎవరికి వారికి ఇప్పుడు సొంత ఎజెండా  తప్పదు. దీంతో మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వానికి నొప్పి కలిగేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయని బీజేపీ పెద్దలు ఈ మధ్య టోన్ మార్చారు.  తాజాగా ఏపీకి వచ్చిన అమిత్ షా జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో ప్రభుత్వ అవినీతి పెచ్చుమీరిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో అన్నీ అక్రమాలే అంటూ దుయ్యబెట్టారు. జగన్ ప్రభుత్వంపై అమిత్ షా ఘాటు విమర్శల అనంతరం ఇప్పుడు తొలిసారి సీఎం జగన్ అమిత్ షా వద్దకు వెళ్లనున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ భేటీ అయి కూడా చాలా కాలం అయింది. ఆ మధ్య ఒకసారి కలుస్తారని ప్రచారం జరిగినా ఎందుకో అప్పుడు అది కుదరలేదు. మోడీ సైతం జూలైలో ఏపీకి వస్తారని, ఇక్కడ బహిరంగ సభ కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈసారి కలయిక మీద చాలానే చర్చ సాగుతోంది.  ప్రస్తుత పరిస్థితిలో  జగన్ ప్రధానితో భేటీ కావడాన్ని రాజకీయంగా కీలకమైన పరిణామంగానే చూడాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    ఏపీ రాజకీయాలలో ఎన్నికల హీట్ ఎప్పుడో మొదలైంది. ఒక వైపు వైసీపీ వై నాట్ 175 అంటూ తన సంక్షేమం మీదనే ఆశలు పెట్టుకొని జగన్ బ్రాండ్ ఉపయోగించుకుని మరోసారి అధికారం దక్కించుకోవాలని ఆరాటపడుతుండగా.. రాష్ట్రంలో కుంటుపడిన అభివృద్ధి, సీఎంగా జగన్ చేసిన అప్పులు,తప్పులు,  రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరంగా ఇబ్బందులను ప్రజలలోకి బలంగా తీసుకెళ్లి తాము గద్దెనెక్కాలని ప్రతిపక్షాలు ఇప్పటికే వార్ మొదలు పెట్టాయి. మరో వైపు రాష్ట్రంలో పార్టీల మధ్య పొత్తులపై కూడా తీవ్ర ప్రచారం జరుగుతున్నది. టీడీపీ-జనసేన మధ్య దాదాపుగా పొత్తు ఖరారైందనీ, బీజేపీ కూడా కలిసే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలలో చర్చలు సాగుతున్నాయి. వైసీపీ ఒంటరైతే విజయానికి దూరమైనట్లేనని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో జగన్ ఇప్పుడు బీజేపీ పెద్దలతో భేటీ కావడం  ఆసక్తికరంగా మారింది. మరోవైపు జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. అత్యవసరంగా ఈ కేసు విచారణ పూర్తి చేయాలని కూడా సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో వైసీపీ ఎంపీ, జగన్ సోదరుడు అవినాష్  బెయిల్ మీద ఉన్నారు. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇప్పటికే జైల్లో ఉన్నారు. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో కూడా కదలిక మొదలైంది. దీంతో ఎన్నికల ముందు ఈ రెండు కేసులు వైసీపీకి తలపోటుగా మారనున్నాయనే ఊహాగానాలు కూడా మొదలవగా.. ఇప్పటికిప్పుడు జగన్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరనుండడం పలు ఊహాగానాలకు తావిస్తుంది. మరి ఈ రెండు రోజుల పర్యటన వెనుక మతలబేంటో.. ప్రధాని, అమిత్ షాలతో భేటీ వెనుక ఆంతర్యమేమిటో అన్నచర్చ జోరుగా సాగుతోంది.

ఏపీలో బీజేపీ తెరవెనుక వ్యూహం?

రానున్న ఎన్నికలలో ఏపీలో ప్రతిపక్షాల మధ్య పొత్తు ఉంటుందా? ప్రధాన పార్టీ టీడీపీతో జనసేన కలిసే ఎన్నికలకు వెళ్తుందా? లేక గత ఎన్నికల మాదిరి విడిగానే బరిలో దిగుతారా? టీడీపీతో పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ చాలాకాలం క్రితమే చెప్పేసినా ఈ మధ్య కాలంలో ఆయన ప్రసంగాలలో మాటలు ఎందుకు మారాయి? ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ టీడీపీ-జనసేన పొత్తులో కూడా ఉంటుందా? లేక జనసేనతో తెగదెంపులు చేసుకొని ఒంటరిగా పోటీచేస్తుందా? ఇదే ఇప్పుడు ఏపీలో ఎక్కడ నలుగురు చేరినా జరుగుతున్న చర్చ. నిజానికి టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందని దాదాపుగా రాజకీయాలలో ఖరారైన అంశమే కాగా ఎందుకో.. ఎక్కడో జనసేన, బీజేపీ కదలికలు చూస్తే అనుమానించక తప్పట్లేదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అందులో కూడా ప్రధానంగా బీజేపీ రాజకీయాల గురించి చూస్తే ఈ అనుమానానికి మరింత బలం చేకూరుతుంది. ఎన్నికలలో ప్రభుత్వ అనుకూల ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని రెండు భాగాలుగా విభజించుకోవాలి. ఏపీలో ఈ లెక్కన చూస్తే.. ప్రభుత్వ   వ్యతిరేక ఓటు టీడీపీ, జనసేన పంచుకుంటాయి. రాష్ట్రంలో బీజీపీకి ఉన్న ఓటు శాతం అత్యంత స్వల్పం. ఆ పార్టీకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇసుమంతైనా మళ్లే అవకాశాలు లేవు. కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుగా వెళ్తే ఈ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కూటమి ఖాతాలో పడుతుంది. సరిగ్గా  ఇక్కడే బీజేపీ ఏమైనా రాజకీయాలు చేస్తున్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.  వైసీపీకి అధికారం దక్కలా వద్దా అన్న సంగతెలా ఉన్నా టీడీపీని దెబ్బ తీయాలనే ఆలోచన ఉంటే మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు జనసేన-బీజేపీ వైఖరి చూస్తే ఈ ఓటు చీల్చే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిన్నటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహీ యాత్రలో పొత్తులపై ఎలాంటి ప్రకటన చేయకపోగా.. అక్కడక్కడా తానే సీఎం అనే మాటలు కూడా అన్నారు. దీనికి తోడు పవన్   వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. పవన్ ప్రసంగాలు  వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అనేలా ఉన్నాయి. అవుట్ అండ్ అవుట్ వైసీపీని తూర్పార పట్టిన పవన్ టీడీపీతో పొత్తుల గురించి ఎక్కడా ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. మూడు నెలల క్రితం వరకు పొత్తులు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు గురించి చెప్పిందే చెబుతూ వచ్చిన పవన్ వారాహీ విజయయాత్రలో టీడీపీ ప్రస్తావన తేలేదు. దీంతో ఇది వ్యూహమా.. భవిష్యత్ సంకేతమా అనే చర్చ మొదలైంది.  పవన్ ఈ మధ్య కొత్తగా తనకు సీఎం అయ్యేందుకు అవకాశం ఇవ్వాలని అడగటం, తనతో పాటుగా తన పార్టీ వారిని కూడా అసెంబ్లీకి పంపాలని కోరడం, ఒక్క అవకాశం తమకు ఇచ్చి చూడాలని ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేయడం ఇవన్నీ రాష్ట్ర రాజకీయాలలో కొత్త కొత్త ఆలోచనలకు దారితీస్తున్నాయి. కొద్ది నెలల క్రితం వరకు సీఎం తాను అయ్యే అవకాశం లేదని చెప్పిన పవన్.. ఈ మధ్య తానే సీఎం అవుతానని చెప్పటం వెనుక బీజేపీ వ్యూహం ఉందంటూ పరిశీలకులు విశ్లేషణలకు పని చెప్పారు.    పవన్ స్వతహాగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే నమ్మకం ఎవరికీ కలగడం లేదు. బీజేపీ వయా పవన్ మీదగా రాజకీయ ఎత్తుగడలకు సిద్దమైందా అనే అనుమానాల బలంగా వ్యక్తమౌతున్నాయి.  ఈ మధ్య కాలంలో పవన్ చేసిన వ్యాఖ్యలను చూస్తే.. ఒకటి టీడీపీతో గ్యాప్ అయినా పెరగాలి.. రెండు పొత్తులో డిమాండ్లు సాధించేలా ఒత్తిడి పెంచే ప్రయత్నం అయినా కావాలి. మూడు బీజేపీ ఏదైనా కొత్త ప్రణాళిక రచించి అది పవన్ తో అమలు చేయిస్తునైనా ఉండాలి. దేశవ్యాప్తంగా బీజేపీ రాజకీయ శైలిని చూస్తే చాలా రాష్ట్రాలలో ఇలా పాత మిత్రులను సైడ్ చేసి తాను ఎదుగుతూ రావడం గమనించొచ్చు. ఏపీలో కూడా బీజేపీ ఇలాంటి పన్నాగం ఏమైనా పన్నిందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నిజానికి టీడీపీ సింగల్ గా పోటీచేసినా ప్రభుత్వాన్ని నెలకొల్పే సీట్లను సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదని ఇప్పటికే చాలా సర్వేలు చెప్తున్నాయి. టీడీపీ నేతల్లో కూడా ఈ ధీమా కనిపిస్తున్నది. అదే ఇప్పుడు బీజేపీకి మింగుడు పడక తెరవెనక దెబ్బతీసే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం ఏమీ లేదని పరిశీలకులు అంటున్నారు. రాజకీయం అంటే రాజకీయమే కదా..   లోగుట్టు ఆ పెరుమాళ్ళకెరుక!

మ‌ద్య నిషేధం నా వల్ల కాదు.. కుండబద్దలు కొట్టేసిన పవన్

ఒకప్పుడు రాజకీయాలు వేరు.. ఇప్పుడు రాజకీయాలు వేరు. ఇప్పుడు రాజకీయాలలో ప్రజా పాలన, ప్రజా రక్షణ పక్కన పెట్టి ఒకరి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి.. దాన్నే విమర్శలగా మలచి దాడులు చేయడం పరిపాటిగా మారిపోయింది. ఇలా నేతలు తిట్టి పోసుకుంటుంటే కార్యకర్తలు దీన్ని తలా ఒక చేయి వేసి ఆజ్యం పోస్తున్నారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలు గాలికి వదిలేస్తున్నారు. ఒకరకంగా ఇదో రకం డైవర్షన్ పాలిటిక్ లాగా తయారైంది. ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ లో వైసీపీ నేతలు డాక్టరేట్స్ పొందారు. సాక్షాత్తు సీఎం నుండి ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా చాలామంది నేతలు ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరిపోయారు. అలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసేందుకు వైసీపీ నేతలు ఎంచుకున్న బాష దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్. అప్పుడప్పుడు ఆయన పెళ్లిళ్లను కూడా హైలెట్ చేస్తుంటారు. అలా సీఎం జగన్ ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ మాదిరిగా మనం నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేం అంటూ విమర్శలు చేశారు. రెండు రోజుల క్రితం పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన జగనన్న అమ్మఒడి నిధుల విడుదల కార్యక్రమంలో కూడా జగన్ మరోసారి సెటైర్లు వేశారు. చంద్రబాబు కోసం ఓ దత్తపుత్రుడు లారీ ఎక్కి ఊగిపోతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఆయనలా మ‌నం రౌడీల్లా తొడ‌లు కొట్ట‌లేం.. బూతులూ తిట్టలేం.. వారిలా న‌లుగురిని పెళ్లి చేసుకుని, నాలుగేళ్ల‌కోసారి భార్య‌నూ మార్చ‌లేం.. పెళ్లి అనే పవిత్ర వ్య‌వ‌స్థ‌ను రోడ్డుమీదికి తీసుకురాలేం.. అవ‌న్నీ ప‌వ‌న్‌కు మాత్రమే సాధ్యం అంటూ సెటైర్లు వేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న భావితరం, స్కూల్ పిల్లలున్న సభలో ఇలా పెళ్లిళ్ల గురించి, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడి విమర్శలు చేయడం కరెక్టేనా అని కొంచెం కూడా ఆలోచన లేకుండా సీఎం జగన్.. పవన్ మీద ఇలా నోరు పారేసుకున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ చేసుకున్నది మూడు పెళ్లిళ్లే. అది ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో కూడా ఆయనే పలుమార్లు కామెడీగా చెప్పారు.. సీరియస్ గా హెచ్చరిస్తూ కూడా చెప్పారు. అయినా విమర్శించడానికి, మట్టాడడానికి ఇంకేం అంశాలు లేవన్నట్లు సీఎం స్థాయి వ్యక్తి కూడా దిగజారి ఇలా  వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. దీంతో ఇప్పుడు జన సైనికులు సీఎం జగన్ టార్గెట్ గా వ్యక్తిగత విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. జగన్ తాతల కాలం నుండి వారి కుటుంబంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారిని ఉదాహరణగా చూపిస్తూ పోస్టులు కుమ్మరిస్తున్నారు. జగన్ తాత రాజారెడ్డికి ఇద్దరు భార్యలన్న సంగతి అందరికీ తెలిసిందే. రెండో భార్య సంతతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. రాజా రెడ్డి మొదటి భార్యకు మనవడే అవినాష్ రెడ్డి. దీన్నే కోడ్ చేస్తూ సీఎం జగన్ ను విమర్శలతో ఏకి  పారేస్తున్నారు  జనసైనికులు. ఇక జగన్ సోదరి షర్మిళ విషయాన్ని కూడా సీన్ లోకి తెస్తున్న కొందరు  విమర్శలకు దిగుతున్నారు. ఇక, జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా రెండో పెళ్లి సంగతి కూడా ఆయన మరణానంతరం ఓపెన్ అయిన సంగతి గుర్తుచేస్తున్నారు. అలాగే  ఆయన హత్యను కూడా కలిపి సోషల్ మీడియా వాల్స్ బద్దలయ్యేలా  నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, జనసేన నాయకుల్లో ఒకరైన డాక్టర్ సందీప్ అయితే ఒక టీవీ ఛానెల్ చర్చలో 'జగన్ ఒక్క పెళ్లే చేసుకున్నారా. మరి ప్రత్యేక హోదా ఏదీ?.. జగన్ ఒక్క పెళ్లే చేసుకున్నారా.. మరి సీపీఎస్ రద్దు చేశారా? జగన్ ఒక్క పెళ్లే చేసుకున్నారు.. మరి ప్రతి ఏడాది జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారా’.. అంటూ జగన్ వైఫల్యాలను కూడా పెళ్ళితోనే ముడిపెట్టి ఎండగట్టారు.   జనసేన సోషల్ మీడియా ఖాతాలలో అయితే.. ప్రశ్న: ప్రత్యేక హోదా ఎందుకు తేలేకపోయారు? జగన్: పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రశ్న: పోలవరం ఎందుకు కట్టలేకపోయారు?, జగన్: పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు, ప్రశ్న: రాజధాని మాటేంటి? మన రాజధాని ఏది? జగన్: నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రభుత్వ వైఫల్యాలను తూర్పార పడుతున్నారు. దీంతో జగన్ అడిగి మరీ తిట్టించుకున్నట్లే అయిందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

స్పీడ్ న్యూస్- 2

1.రేపు ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నారు.విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు రేపు సాయంత్రం ప్రత్యేక విమానంలో ఆయన చేరుకుంటారు. 2.ప్రస్తుతం దేశం అత్యంత సంక్షోభంలో ఉందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సంక్షోభంలో మన గణతంత్రం - విశ్లేషణ అనే అంశంపై ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా సంస్థ నిర్వహించిన సదస్సులో పరకాల ప్రభాకర్ మాట్లాడారు. 3.జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డిల మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధిగా తన విధులను నిర్వర్తించకుండా తన కూతురు, అల్లుడు అడ్డుకుంటున్నారంటూ హైకోర్టులో  ఆయన పిటిషన్ వేశారు.  4.జూన్ మాసం జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్రం నేడు వెల్లడించింది. గత నెలలో వసూలైన జీఎస్టీ రూ.1,61,497 కోట్లు అని కేంద్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 5.ప్రముఖ సినీ నటుడు నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ విడాకులు తీసుకున్నారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. 6.ముఖ్యమంత్రి జగన్ టీమ్ ప్రతిపక్షాలను ఇబ్బందిపెట్టి పైశాచిక ఆనందం పొందుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడూతూ... వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీధీ రౌడీల్లా వ్యవహరిస్తూ పైశాచిక ఆనందం పోందుతున్నారని విమర్శించారు. 7.వైఎస్సార్టీపీ స్థాపించి తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించిన వైఎస్ షర్మిల త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహన్ ఖండించారు. 8.ఖమ్మం సభ తర్వాత తమ పార్టీలోకి ఇతర పార్టీలకు చెందిన చాలామంది నేతలు వస్తారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ తో పాటు బీజేపీకి చెందిన నేతలు కూడా తమతో టచ్ లో ఉన్నట్లు చెప్పారు. 9.‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా‌తో తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక ఇండియ‌న్ స్కూల్స్ బోర్డ్ ఫ‌ర్ క్రికెట్ (ఐఎస్‌బీసీ) గౌరవాధ్యక్షుడిగా రాజ‌మౌళి నియ‌మితుల‌య్యారు. 10. సాధారణ వ్యక్తులు సైతం కేరళలో లాటరీ గెలిచి కోటీశ్వరులయ్యారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన బిర్షు రాంబ అనే వలస కార్మికుడు కేరళ లాటరీ విజేతగా నిలిచాడు. 

ఖమ్మంలో జన గర్జనతో కాంగ్రెస్ఎ న్నికలకు శంఖారావం!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కనీవినీ ఎరుగని స్థాయిలో ఊపు మీదుంది. కర్ణాటకలో ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ కు జవసత్వాలు మొదలవగా తెలంగాణలో సాధారణ ఎన్నికల కంటే ముందే ఎన్నికలు జరగనుండడం ఆ పార్టీకి మరింత కలిసి వచ్చింది. దీంతో ఎలాగైనా తెలంగాణలో తమ సత్తా చాటి దేశంలో తన ఛరిస్మాను చాటుకోవాలని కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు కూడా తెలంగాణపైనే స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని భావిస్తున్న నేతలను కూడా తనలో కలుపుకుంటున్న కాంగ్రెస్.. మరికొందరు ఇతర పార్టీల నేతలకు కూడా గాలం వేస్తుంది. ఈ క్రమంలోనే మరింతగా తన పూర్వపు వైభవాన్ని చాటేలా ఒక బహిరంగ సభను ప్లాన్ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం వేదికగా భారీ సభకు సర్వం సిద్ధమవుతోంది. తెలంగాణ జన గర్జన పేరుతో నిర్వహించనున్న ఈ సభను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తోంది. ఈ సభా వేదికగా పొంగులేటితో పాటు పలువురు కాంగ్రెస్ జెండా కప్పుకొని అధికారంగా కాంగ్రెస్ నేతలు కానున్నారు. మరో వైపు భట్టి విక్రమార్క పాదయాత్ర కూడా ఇక్కడే ముగుస్తుంది. హై కమాండ్‌ ఆదేశంతోనే పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర చేస్తున్న భట్టి..108 రోజులు 1250 కిలోమీటర్ల లక్ష్యంగా ప్రజలతో మమేకమై నడిచారు. జులై 2న ఖమ్మం జిల్లాలో అడుగు పెట్టడంతో ఆయన పాదయాత్ర ముగుస్తుంది. ఒక వైపు పొంగులేటి అధికారిక చేరిక, మరొకవైపు భట్టీ పాదయాత్ర ముగింపునకు రాహుల్ గాంధీ హాజరు కానుండడం తదితర కారణాలతో ఈ సభ ఆసక్తిగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న అతి పెద్ద బహిరంగ సభ ఇదే కాగా ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ బ్యాక్ టూ ఫామ్ అని ప్రజలకు, ఇతర పార్టీలకు తెలిసేలా చేయాలని కంకణం కట్టుకుంది. అందుకోసం ఇప్పటికే చుట్టుపక్కల జిల్లాల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు కాంగ్రెస్ శ్రేణులు పిలుపునివ్వగా ఈ సభకు కాంగ్రెస్ భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నది. ఇక ఈ సభలో మాటలు కూడా ఘాటు పెరగడం ఖాయం. ఒక రకంగా ఇదే వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నది. ఓ మేనిఫెస్టోను కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఖమ్మం సభ విజయవంతం చేయటం ద్వారా ఆపరేషన్ ఆకర్ష్ ను మరింత ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. ఇతర పార్టీల నేతలను పార్టీలోకి తీసుకోవటంతో పాటు, త్వరలోనే అభ్యర్థుల జాబితా ప్రకటించటం ద్వారా బీఆర్ఎస్ తో పాటు బీజేపీకి గట్టి సవాల్ విసిరాలని భావిస్తోంది. ఈ ఖమ్మం వేదికగా రాహుల్ గాంధీ ఏం మాట్లాడబోతున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇదే సభ నుండి బీఆర్ఎస్, బీజేపీలకు ఒకేసారి అటాక్ చేయాల్సి ఉండగా.. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందన్నది చెప్పాల్సి ఉంటుంది. దీంతో ఈ సభలో రాహుల్ గాంధీ స్పీచ్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. ఒకరకంగా ఈ సభ విజయవంతం చేయడమే కాంగ్రెస్ పార్టీకి మొదటి సక్సెస్ కానుంది. ఎందుకంటే ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య సఖ్యత కరవై ప్రజలలో పలుచన అయ్యారు. ఇప్పుడు తామంతా ఒక్కటే అనే సంకేతాలు ప్రజలలోకి పంపాలి. నిజానికి భట్టి తన పాదయాత్ర ముగింపును ఓ స్థాయిలో ప్లాన్ చేసుకున్నారు. వైఎస్‌ మహాప్రస్థానం మాదిరి ముగింపు సభను నిర్వహించాలనుకున్నారు. అయితే, అదే రోజున పొంగులేటి చేరిక బహిరంగ సభ కూడా ఉండడంతో రాహుల్ గాంధీ రెండూ వేర్వేరుగా కాకుండా కలిపే ప్లాన్ చేయాలని సూచించారు. ఇందుకు భట్టిని ఒప్పించే బాధ్యతను ఠాక్రే భుజానికెత్తుకుని పొంగులేటిని కూడా భట్టి వద్దకు తీసుకెళ్ళి ఒప్పించారు. దీంతో ఇలా ఒకే సభతో కాంగ్రెస్ ఒక్కటిగా ఎన్నికల శంఖారావానికి సిద్ధమైంది. మరి ఈ సభ ఎలాంటి రాజకీయ కదలికలు తెస్తుందో చూడాలి.

అనడం ఎందుకు.. అనిపించుకోవడమెందుకు?.. జగన్ VS పవన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో పది నెలల వ్యవధి ఉన్నా రాష్ట్రంలోని రాజకీయ పార్టీల కోయిలలు తొందరపడి ముందే కూస్తున్నాయి. అధికారపార్టీ వైసీపీ సహజ ప్రత్యర్థి అయిన టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధించడం గతంలో చూశాం. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా వైసీపీ, జనసేనల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మంటోంది. పవన్ కల్యాణ్ చేస్తున్న వారాహి యాత్రలో జనసేనాని చేస్తున్న వ్యాఖ్యలపై స్థానిక నాయకులు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ కూడా పవన్ పై ఆయన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారు. పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్న సభల్లో కూడా జగన్ దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.  ప్రభుత్వ పథకాల ప్రారంభ సభలు, పార్టీ కార్యక్రమాలు, ఇలా ప్రతి చోటా జగన్ పదునైన వ్యాఖ్యలతో పవన్ పై విరుచుకుపడుతున్నారు. చివరికి పవన్ మాట్లాడే శైలిని కూడా జగన్ వదలడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా వ్యక్తిగత దూషణలకు దిగుతుంటే.. జనసేన నేతలు ఊరుకుంటారా? వారు కూడా దీటుగా జవాబివ్వడం మొదలు పెట్టారు. దీంతో ఎవరు ఎవర్ని ఏం తిడుతున్నారో? ఎందుకు తిడుతున్నారో అనేది అర్ధం కావడం లేదు. అయితే శుక్రవారం (జూన్ 30) భీమవరం సభలో  మాట్లాడిన పవన్ తాను నోరు విప్పితే జగన్ బాగోతం బయటపడుతుందని హెచ్చరించారు.  మరో అడుగు ముందుకు వేసి జగన్ చేసిన దుర్మార్గాలు బయటపెడితే జగన్ తట్టుకోలేరంటూ సెటైర్లు వేశారు.  జగన్ వ్యక్తిగత జీవితం చిట్టా, అరాచకాల చిట్టా, తన దగ్గర ఉన్నాయని పవన్ చెబుతున్నారు.  తెలుసుకోవాలనుకున్న వారికి జగన్ చరిత్ర చెబుతానని పవన్ బహిరంగంగా ప్రకటించారు.  అయినా జగన్ జీవితం తెరిచిన పుస్తకమేనని ఆయన పార్టీ నేతలే అంటున్నారు. పవన్ ఏం చెబుతారు, 2004 నుంచి 2009 వరకూ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని  జగన్ చేసిన అక్రమాల గురించి చెబుతారా? అదంతా ప్రజలకు తెలిసిందే కదా. 2004లో పరిటాల హత్య వెనుక జగన్ ఉన్నారని పవన్ చెబుతారా? ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. 2005లో బాబాయి వివేకాని కడప ఎంపీ పదవికి రాజీనామా చేయాలంటూ ఒత్తిడి చేసి ఢిల్లీ పంపారని చెబుతారా? బెంగళూరు ఎలహంకలో పాతిక ఎకరాల్లో నిర్మించిన ప్యాలెస్ గురించి చెబుతారా? 2019 ఎన్నికలలో తనపై 31 క్రిమినల్ కేసులు ఉన్నాయని జగన్ స్వయంగా అంగీకరించి ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ ఇచ్చారని చెబుతారా? నూటికి 15 మంది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి కూడా దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా ఎలా ఎదిగారని అడుగుతారా?  నవరత్నాల ఆశచూపి నాలుగేళ్లుగా ఆంధ్రప్రజలకు నవ దరిద్రాలను చూపిస్తున్నారని చెబుతారా? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానంటూ రాష్ట్రాన్ని మద్యంలో ముంచేశారని చెబుతారా? స్వంత పినతండ్రి ప్రాణాలకు, స్వంత పార్టీ ఎంపీ కుటుంబ భద్రతకు, దళితుల ప్రాణాలకు ఏపీలో దిక్కులేదని చెబుతారా? అవినాష్ రెడ్డిని కాపాడు కోవడానికి అన్ని అడ్డదారులు ఎందుకు తొక్కుతున్నావ్ జగన్ అని అడుగుతారా? రాష్ట్రంలో సహజవనరులన్నీ దోచుకుంటూ ఈర్థిక స్థితిని దిగజార్చిన విషయం గురించి అడుగుతారా? రాష్ట్రంలో భూమిని, ఇసుకని, అడవిని, గనులను అప్పనంగా అప్పడంగా నమిలేశారని అడుగుతారా? రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాకుండా సరిహద్దుల్లో బాంబులు పట్టుకుని జగన్ కాపలా కాస్తున్నారని నిలదీస్తారా? తల్లిని, చెల్లిని పక్క రాష్ట్రంలో బతకమని ఎందుకు తరిమేశావ్  అని జగన్ని అడుగుతారా? పేరు పక్కన రెండక్షరాలు లేకపోతే ఎలాంటి అవకాశాలూ రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నావని మా జగన్ ను అడుగుతావా? నెలనెలా డబ్బులు పంచడం తప్ప మరో అభివృద్ధి కార్యక్రమం చేతకాని జగన్ పరిస్థితిపై నిలదీస్తావా? హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆస్తులను, హక్కులను కేసీఆర్ కు ఎందుకు రాసిచ్చేశావ్ అని నిలదీస్తారా? జిల్లాకో గూండాని తయారు చేసి రాష్ట్రమంతా  పులివెందుల పాలన, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయడాన్ని ప్రశ్నిస్తారా పవన్ గారూ అంటూ వైసీపీ నేతలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు.   జగన్ దుర్మార్గాల గురించి చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవని వైసీపీ అభిమానులే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ-టీడీపీ మధ్య సాగాల్సిన పొలిటికల్ వార్ వైసీపీ్ర జనసేనల మధ్య జరగడం వెనుక బీజేపీ వ్యూహం ఉందేమో అన్న అనుమానం కొంతమంది విశ్లేషకుల్లో మొదలైంది. అదలా ఉంటే.. ఈ విషయాలు తెలియనిదెవరికంటూ అంతా నవ్వుకుంటున్నారు.

ఉల్లి, టమాటా ధరలూ.. రాజకీయాలు

మనిషి జీవితమన్నాక ఎత్తు పల్లాలు సహజం. అలా అయితేనే జీవితం.. జీవితం అలాగ ఉంటేనే అయిన వారు ఎవరో.. కానీ వారు ఎవరో ఎప్పుడో ఒక్కప్పుడు తెలుస్తోంది. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. జీవితంలో కింద పడినప్పుడే మనిషికి.. రూపాయి విలువ తెలుస్తోంది. అలాగే మనుషుల్లోని అసలు రంగు సైతం బహిర్గతమవుతోంది. ఆ పైవాడు సృష్టించిన మనిషి జీవితం ఎలా ఉంటుందో.. కూరగాయాల్లో టమాటా జీవితం కూడా దాదాపుగా అలాగే ఉంటుందనేది సుస్పష్టం.  కూరగాయాల్లో రాజా ఎవరంటే అంతా వంకాయే అంటారు. కానీ కూరగాయాల్లో  టమాటా మాత్రం మనిషి జీవితానికి దగ్గరగా ఉంటుందనే ఓ చర్చ అయితే జన బాహుళ్యం ఎప్పటి నుంచో సాగుతోంది. మనిషి జీవితంలో ఒడుదుకుల్లాగానే.. టమాటా ధరల్లో సైతం ఉత్థాన పతనాలు ఉంటాయని...   ఒక్కొసారి కిలో టమాటా ధర 120 రూపాయిల నుంచి 150 రూపాయిల వరకు పలుకుతోంది, అదే టమాటా ఒక్కోసారి కిలో 5 రూపాయిలకు లేదా 10 రూపాయిలకు పతనం అవుతోంది ఇక ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్నది నానుడి. అందుకే ఉల్లి  ధరలు ప్రభుత్వలను సైతం కూల్చివేయగలవు. అటువంటి సంఘటనలు భారతావనిలో పలు మార్లు జరిగాయి. ఉల్లిపాయి ధర   రాకెట్‌లా  పైకి ఎగబాకీ.. ఆకాశాన్నంటినా.. ఆ తర్వాత.. ధరలు తగ్గితే 20 రూపాయిలకు మించి కిందకు దిగదన్న విషయం విదితమే.  దీంతో ఉల్లిపాయే ధర అంతకంటే కిందకి దిగదన్న విషయం ప్రతీ ఒక్కరికీ తెలిసిపోయింది. కానీ టమాట పరిస్థితి అలా కాదు.. అయితే కిలో టమాటా 5 రూపాయిలు లేదా 10 రూపాయిలు.. అదీ ఇది కాకుంటే కిలో 120 రూపాయిలు లేదా 150 రూపాయిలు అయిపోతోంది. ఓ వేళ గిట్టుబాటు ధర లేకపోతే.. ఆ పంట పండించిన రైతు టమాటాను నడిరోడ్డుపైన పడేస్తాడన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. మనిషి టైమ్ బాగున్నప్పుడు టమాట ధరలాగా ఎగిరెగిరి పడతాడు. అదే మనిషి...  టైమ్ బ్యాడ్ అయినప్పుడు టమాట ధర తగ్గినట్లు అమాంతంగా సైలెంట్ అయిపోతాడు..   టైమ్ బ్యాడ్ అయినప్పుడు అదే మనిషి నడి రోడ్డున పడతాడు. అంటూ గిట్టుబాటు ధర లేనప్పుడు టమాటలాగా అన్నమాట.  అయితే టమాటా ధరలతో అధికారం కోల్పోయిన దాఖలాలు ఈ దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఇంత వరకు ఎక్కడా కనిపించలేదు.. వినిపించలేదు. కానీ భారత్‌లో మాత్రం ఉల్లి పాయి చేసే పవర్ పాలిటిక్స్.. భవిష్యత్ లో టమాటా చేసే అవకాశం ఉందా? అంటే సందేహమే. ఎంతైనా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. అలాంటి మన దేశంలో ఓ పార్టీని అధికారంలో నుంచి దింపాలన్నా.. మరో పార్టీకి అధికారం కట్టబెట్టాలన్నా.. ఉల్లిపాయి, టమాట, కోడిగుడ్డు ఎక్సెట్రా ఎక్సెట్రా... ఆహార పదార్థాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం.. భారతమాత ముద్దు బిడ్డలకు బుర్రతో పెట్టిన విద్య.. కాదంటారా?.. ఒక్క సారి ఆలోచించండి.  

స్పీడ్ న్యూస్

1.  టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న నీరజ్ చోప్రా మరోమారు అదరగొట్టాడు.లుసానె డైమండ్ లీగ్ పోటీల్లో 87.66 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి విజేతగా నిలిచాడు. 2.మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరావు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే... కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో  శని త్రయోదశి సందర్భంగా శని దోష నివారణ కోసం తైలాభిషేకం చేయిస్తుండగాకళ్లు తిరిగి తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.  3.తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు జరగబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమయ్యేలానే కనిపిస్తోంది.  4.గత కొన్నిరోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి తక్కువగా నమోదైంది. అయితే నిన్న తొలి ఏకాదశి కావడం, వీకెండ్ కూడా రావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. 5.కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి మంచి మనసు చాటుకున్నారు. యాసిడ్ దాడి బాధితురాలికి తన సచివాలయంలో ఉద్యోగం కల్పించాలని సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారు. 6.ఆధార్ ను పాన్ కార్డ్ తో లింక్ చేసుకోవడానికి శుక్రవారంతో గడువు ముగిసింది. అయితే నిన్న చివరి రోజు కావడంతో ఆధార్ ను లింక్ చేసుకోవడానికి ఆన్ లైన్ లో ప్రజలు పోటెత్తారు. 7.ఒడిశాలో జరిగిన ఘోర రైల్వే ప్రమాదం తర్వాత అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది.   తాజాగా సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ అర్చనా జోషిపై ప్రభుత్వం వేటువేసింది. 8. 2015లో తన ఫ్యాన్స్ కు, ప్రభాస్ ఫ్యాన్స్ కు మధ్య జరిగిన గొడవపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ  ఆ ఘటన తనను ఎంతో బాధించిందని చెప్పారు. అప్పట్లో ఇద్దరి ఫ్యాన్స్ మధ్య పోస్టర్ల వైరం జరిగింది. 9.బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటికి వార్నింగ్ ఇస్తూ ఖమ్మంలో పోస్టర్లు వెలిశాయి. పొంగులేటి అనుచరుల శవాలు కూడా మిగలవంటూ పోస్టర్లలో హెచ్చరికలు జారీ చేశారు. 10. పాక్ ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిదీ తన పదునైన నిప్పులు చెరిగే బంతులతో సరికొత్త చరిత్రను సృష్టించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ లోనే 4 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.   

వైసీపీ.. పోకిరీల కిరికిరి

ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లలో మందు.. చిందు.. పసందు.. క్యాసినో కార్యక్రమాలు అడ్డు ఆపు లేకుండా పోయిందన్న ఓ చర్చ  సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. గుడివాడ కాసినో గురించి ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, వల్లభనేని వంశీలపై ఆరోపణలు ఎవరూ మరచిపోలేదు. తాజాగా   ఓ గ్రామ సర్పంచ్‌తోపాటు ఆ గ్రామానికి చెందిన అధికార పార్టీ నేతలు  ప్రిన్స్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాలోని పాటలతో రికార్డింగ్ డ్యాన్సులు చేస్తూ.. ఊగిపోయారు. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమంలో  హల్‌చల్ చేస్తున్నాయి.  ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం యర్రవరంలో గ్రామ సర్పంచ్, వైసీపీ నాయకుడు  బీశెట్టి అప్పలరాజు జన్మదినం సందర్బంగా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో రికార్డింగ్ డ్యాన్సు చేస్తున్న మహిళలతో కలిసి.. వైసీపీ నేతలూ  చిందులేశారు. అలా చిందులేసిన వారిలో ఏలేశ్వరం జెడ్పీటీసీ నీరుకొండ రామకుమారి భర్త సత్యనారాయణ, యర్రవరం సర్పంచ్ బేశెట్టి అప్పల రాజు, స్థానిక ఆంజేనేయస్వామి వారి దేవస్థానం చైర్మన్ గుల్లంపూడి గంగాధర్ తదితరులు ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు.. రింగ రింగా అంటు సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతోన్నాయి. మామూలుగా జాతరలు, తీర్థాలలో ఎవరైనా రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేస్తే అనుమతి లేదంటూ నిలిపివేస్తున్న  పోలీసులు.. అధికార పార్టీ నేతలకు మాత్రం ఎలా  అనుమతి ఇస్తున్నారని జనం నిలదీస్తున్నారు.   అయినా.. ఇటీవల ఎమ్మెల్సీగా ఎంపికైన.. ఇదే జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు.. ఇటువంటి రికార్డింగ్ డ్యాన్సుల్లో పాపలతో కలిసి స్టెపులు వేస్తున్న ఓ వీడియో.. సోషల్ మీడియాలో ప్రపంచాన్ని చుట్టేసింది. దీంతో సదరు ప్రజా ప్రతినిధి.. మీడియా ముందుకు వచ్చి .. సదరు రికార్డింగ్ డ్యాన్స్ వీడియోలో ఉన్నది తానేనని స్పష్టం చేస్తునే.. అయితే.. ఇది ఎమ్మెల్సీ పదవి చేపట్టక ముందు వేసిన చిందులాట అంటు తన తప్పును నిజాయితీగా.. మీడియా సాక్షిగా చెప్పేసుకొని.. ఒప్పేసుకొని..  చెపంలేసుకుని తన చిత్తశుద్ది ఐఎస్ఐ మార్క్ లాంటిందని తనకు తానే ప్రకటించేసుకున్నారు. అయినా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. జగన్ తొలి కేబినెట్‌లోనే కాదు... మలి కేబినెట్‌లోని మంత్రులు సైతం నా బూతే నా భవిష్యత్తు అన్నట్లుగా మాట్లాడుతుండం.. అలాగే మీసాలు తిప్పడం, తోడలు కొట్టడం, మైక్ ముందు రెచ్చిపోయి మాట్లాడడం..చూసి చూసి అలవాటై పోయిన సగటు ఏపీవాసి ఈ రికార్డింగ్ డ్యాన్స్‌ల తీరును చూసి.. మనిషన్నాక కాసంత కళాపోషణ ఉండాలని.. కానీ ఈ ఫ్యాన్ పార్టీ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల్లో మాత్రం అది కాస్తంత  ఎక్కువ మోతాదులో ఉందని భావిస్తున్నాడు. ఈ తాజా వైసీపీ నేతల రికార్డింగ్ డ్యాన్స్ చిందులపై నెటిజన్లు ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు. 

అనీల్ మళ్లీ మొదలెట్టేశారు!

వివాదాస్పద వ్యాఖ్యలతో   వార్తల్లో  నిలిచేందుకు  మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నానా అగచాట్లూ పడుతున్నారంటూ తెలుగుదేశం విమర్శలు గుప్పిస్తున్నది. నెల్లూరు సిటీ  నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ గా మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు పి. నారాయణను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం ( జూన్ 30) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగితే.. ఆ స్థానం నుంచి తనను తానే వైసీపీ అభ్యర్థిగా ప్రకటించుకున్న అనీల్ కుమార్ యాదవ్ సినిమా ఎత్తిపోయినట్లేనని నెల్లూరు వైసీపీ శ్రేణులే బాహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు వివాదాలతో నిండా మునిగి ఉన్న అనీల్ కుమార్ యాదవ్ నియోజకవర్గంలో ప్రజాదరణను కోల్పోయారనీ, సొంత పార్టీలోనే ఆయన పట్ల తీవ్రమైన అసంతృప్తి వెల్లువెత్తుతోందనీ వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. అంతే కాకుండా ఇటీవల గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ నిర్వహించిన వర్క్ షాప్ లో పెర్ఫార్మెన్స్ సరిగా లేదంటూ ప్రకటించిన 19 మంది ఎమ్మెల్యేలలో అనీల్ కుమార్ యాదవ్ కూడా ఒకరు అన్న వార్తలు వెలువడ్డాయి. అందుకు తగ్గట్టుగానే చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న అనీల్ కుమార్ యాదవ్ గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ తరువాత ఒక్కసారిగా నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే వైసీపీ క్యాడర్ మాత్రం ఆయన వెంట నడిచే పరిస్థితులు కనిపించకపోవడంతో ఫ్రస్ట్రేషన్ కు లోనయ్యారు. హైదరాబాద్ లో ఓ పార్కింగ్ ప్లేస్ వద్ద సెక్యూరిటీ గార్డుపై చేయి చేసుకుని వార్తల్లోకెక్కిన మరుసటి రోజే నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ నారాయణపై సంచలన ఆరోపణలు చేసి మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు.  నారాయణ గత కార్పొరేషన్ ఎన్నికలలో  సొంత పార్టీ అయిన తెలుగుదేశం అభ్యర్థులను ఓడించమంటూ తనకు సొమ్ములు పంపారని నిరాధార ఆరోపణలు గుప్పించారు.  అయితే తాను అందుకు అంగీకరించలేదనీ, నారాయణ పంపిన డబ్బులను వాసస్ చేశాననీ అనీల్ పేర్కొన్నారు. సందర్భం రాకపోవడంతో ఈ విషయాన్ని తాను ఎందుకు ఇంత వరకూ బయటపెట్టలేదన్నారు. తాను ఇషామాషీగా ఈ ఆరోపణలు చేయలేదనీ, వాటికి కట్టుబడి ఉన్నాననీ, ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమని అనీల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.  అంతే కాకుండా తెలుగుదేశం పార్టీలో జెండా మోసిన వారిని మోసం చేయడం అన్నది మాలూలు విషయమేనని  అనీల్ కుమార్ యాదవ్ అన్నారు.  నారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగితే... ఒక వేళ తనకు వైసీపీ టికెట్ వస్తే ఇస్తే ఓటమి తప్పదన్న భయంతోనే  అనీల్ కుమార్ యాదవ్ ఇప్పుడీ ఆరోపణలు చేస్తున్నారని  తెలుగుదేశం నాయకులు అంటున్నారు.  నారాయణపై అనీల్ కుమార్ యాదవ్ చేసిన ఆరోపణలు ఆయనలోని ఫ్రస్ట్రేషన్ కు నిలువెత్తు నిదర్శనమని అంటున్నారు.

ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులు.. పిల్లన గ్రోవి స్థానంలో కత్తి

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శతజయంతి సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో లకారం ట్యాంక్‌బండ్‌ వద్ద శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న అన్నగారి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని వాస్తవంగా మే 28.. అయన జయంతి సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్  చేత ఆవిష్కరింప చేయాలని నిర్వాహకులు భావించారు.  బేస్‌మెంట్‌తో కలిసి 54 అడుగులు ఎత్తు ఉన్న ఈ విగ్రహం తల భాగం అయిదు అడుగులు, కాళ్ల భాగం అయిదు అడుగులు, ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు 45 అడుగులు గా రూపొందించారు.  తానా అసోసియేషన్‌తోపాటు పలువురు ప్రముఖుల సహకారంతో దాదాపు 4 కోట్ల రూపాయిల వ్యయంతో  రూపుదిద్దుకున్న ఈ విగ్రహాన్ని హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో బుద్దుడి విగ్రహాం వలే..   ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేశారు.   మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ విగ్రహావిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లను అప్పట్లో స్వయంగా పర్యవేక్షించారు.  పెద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం కోసం.. జూనియర్ ఎన్టీఆర్ వస్తుండడం పట్ల అప్పట్లో ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.    అయితే ఎన్టీఆర్ విగ్రహం శ్రీకృష్ణుడి రూపంలో ఉండడంపై పలు యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకెక్కాయి. దీంతో తెలంగాణ హైకోర్టు తొలుత విగ్రహం ఏర్పాటుపై స్టే ఇచ్చి, ఆ తరువాత శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు నో చెప్పింది.  దీంతో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహంలో పలు మార్పులు చేయడానికి నిర్వాహకులు ఉపక్రమించారు.  ఎన్టీఆర్ విగ్రహం చేతిలో ఉన్న పిల్లన గ్రోవిని తొలగించారు. పింఛం కూడా తీసేశారు.     పిల్లనగ్రోవి స్థానంలో ఖడ్గాన్ని చేర్చారు. అలాగే కిరీటం, నెమలి పింఛం, విష్ణు చక్రం తొలగించినట్లు తెలుస్తోంది. లకారం చెరువుపై విగ్రహావిష్కరణకు హైకోర్టు అనుమతి  ఇవ్వకపోవడంతో   ప్రైవేట్ స్థలంలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విగ్రహావిష్కరణ ఆగస్టులో జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు.

శ్రీవాణి ట్రస్ట్ సాక్షిగా గంగలో కలిసిన బీజేపీ పరువు

శ్రీవాణి ట్రస్ట్ విషయంలో బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి  వ్యాఖ్యలు  బీజేపీ విశ్వసనీయతను దెబ్బతీశాయి. బీజేపీ, వైసీపీల మధ్య ఇంత కాలం రహస్యం అనుకుంటున్న మైత్రిని బహిర్గతం చేశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం   శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి  అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రశీదు కూడా ఇవ్వడం లేదని  డబ్బులు ఎక్కడికి వెళుతున్నాయంటూ విపక్షాలు ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నాయి. దానితో రంగంలోకి దిగిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి.. శ్రీవాణి ట్రస్టులో ఎలాంటి అవకవకలు జరగలేదని ప్రకటించి విమర్శలకున, ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రకటనపై ప్రజలలో విశ్వసనీయత లేదని వారికి వారే భావించుకుని పలువురు మఠాథిపతులు, ప్రముఖులతో కూడా ప్రకటనలు ఇప్పించారు.   శ్రీవాణి ట్రస్టు లెక్కలు తాము పరిశీలించామని, అందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని, వారంతా మూకుమ్మడిగా తేల్చేశారు. అయితే శ్రీవాణి ట్రస్ట్ లెక్కల తనిఖీకి  ఎంపిక చేసిన కొంత మందినే  అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.  అన్ని పార్టీలకూ.. లెక్కలు తనిఖీ చేసే అవకాశం ఇవ్వాలన్న డిమాండ్‌ జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే జనసేనాని పవన్‌ కల్యాణ్‌   శ్రీవాణి ట్రస్టుపై ఆరోపణల వర్షం కురిపించారు. తాము అధికారంలోకి వస్తే దానిపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. అంతకంటే ముందు తెలుగుదేశం పార్టీ కూడా  శ్రీవాణి ట్రస్టుపై  ఆరోపణలు గుప్పించింది. రశీదు ఎందుకివ్వడం లేదంటూ ప్రశ్నించింది.  శ్రీవాణి ట్రస్టు లెక్కలపై, శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. ఆ తరువాత పవన్‌ కల్యాణ్‌ మరో అడుగు ముందుకువేసి  ట్రస్టు లెక్కలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ప్రెస్‌ మీట్‌ పెట్టి, వారి ఆరోపణలు ఖండించడం, టీటీడీ కూడా శ్రీవాణి ట్రస్టులో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రకటనలివ్వడం జరిగింది.  ప్రభుత్వంపై విపక్షాలు చేసే ఆరోపణలను, శరవేగంగా ఖండించే మంత్రులు.. శ్రీవాణి ట్రస్టుపై వచ్చిన ఆరోపణలను మాత్రం ఖండించలేదు.  అయితే  ఈ  వ్యవహారంలో తిరుపతికి చెందిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి  శ్రీవాణి ట్రస్ట్ కు క్లీన్ చిట్ ఇస్తూ మీడియా ముందుకు రావడంతో కథ కొత్త మలుపు తిరిగింది. సాధారణంగా  విపక్షాలు ప్రభుత్వంలో జరిగే అవినీతిని ఎండగట్టేందుకే ప్రాధాన్యం ఇస్తాయి. అలాంటి అవకాశం కోసం వేయికళ్లతో ఎదురు చూస్తాయి. అలాంటి అవకాశం వస్తే ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ఇరుకున పెట్టడానికి వెనుకాడవు. కానీ  బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు.  శ్రీవాణి ట్రస్టులో ఎలాంటి అవకతవకలు జరగలేదని భానురెడ్డి చేసిన ప్రకటన, రాజకీయంగా  బీజేపీని  సంకట ఇబ్బందుల్లో పడేసింది.  ఇప్పటికే  జగన్ సర్కార్ కు బీజేపీ అన్ని విధాలుగా అండదండగా నిలుస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో  శ్రీవాణి ట్రస్ట్ పై భానుప్రకాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు  ఆ ఆరోపణలకు బలం చేకూర్చాయి. వైసీసీ, బీజేపీ అంటకాగుతున్నాయన్న అనుమానాలకు మరింత బలోపేతం చేశాయి. హిందుత్వం- హిందూ ఆలయాలపై దాడుల విషయంలో గళం విప్పే బీజేపీ నేతలే.. ఈ విధంగా శ్రీవాణి ట్రస్టుపై వస్తున్న ఆరోపణలు ఖండిస్తూ టీటీడీకి వకాల్తా పుచ్చుకోవడంపై పార్టీ సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవాణి ట్రస్టులో ఎలాంటి అవకతవకలు జరగడం లే దన్నది భానురెడ్డి వాదన. ఆ మేరకు తాను ఈఓ కార్యాలయానికి వెళ్లి పరిశీలించానని, అక్కడ అవకతవకలు జరిగినట్లు తనకు కనిపించలేదని స్పష్టం చేశారు. అనవసరమైత ఆరోపణలు చేయవద్దని ఆయన కోరడం, బీజేపీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. శ్రీవాణి ట్రస్టు లెక్కలు తనిఖీ చేయమని, పార్టీ నాయకత్వం ఏమైనా భానురెడ్డిని అధికారికంగా పంపిందా? పంపితే ఆ మేరకు అనుమతి కోరుతూ ఈఓకు ఏమైనా లేఖ రాసిందా? రాస్తే ఆ లేఖ రాసింది ఎవరు? అలాగైతే అన్ని పార్టీలకూ లెక్కల తనిఖీలకు అనుమతి ఇస్తారా? లేక బీజేపీకి మాత్రమే అది పరిమితమా? అన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. శ్రీవాణి ట్రస్టులో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తే, తాము మాత్రం అలాంటిదేమీ లేదని క్లీన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారంటే .. అది పవన్‌ను అవమానించడమే కదా? అని బీజేపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై జనసేన తిరుపతి ఇన్చార్జి కిరణ్‌ రాయల్‌ అడిగిన ప్రశ్నలకు తమ వద్ద జవాబు లేదని బీజేపీ సీనియర్లు వాపోతున్నారు. ‘‘శ్రీవాణి ట్రస్టులో అవకతవకలు లేవన్న భానుప్రకాష్‌రెడ్డి వ్యాఖ్యలు ఆయన సొంతవా? పార్టీ స్టాండా? దీనిపై సోము వీర్రాజు స్పందించకపోతే, ఇవి సోము వీర్రాజు అనుమతితో చేసిన వ్యాఖ్యలుగానే భావిస్తామని’’ కిరణ్‌ స్పష్టం చేశారు. దీనితో జనసేనకు ఏం సమాధానం చెప్పాలో తెలియక, బీజేపీ సీనియర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. పైగా శ్రీవాణి ట్రస్టుకు సంబంధించిన లెక్కల్లో.. టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి- బీజేపీ నేత భానురెడ్డి చేసిన ప్రకటనల మధ్య పొంతన లేకపోగా, 300 కోట్లు తేడా కనిపించడం మరో వివాదానికి తెరలేపినట్లయింది. ట్రస్టుకు 800 కోట్ల నిధులు వచ్చాయని చైర్మన్‌ సుబ్బారెడ్డి ప్రకటించారు. కానీ బీజేపీ నేత భానురెడ్డి మాత్రం 1100 కోట్లు వచ్చాయని వెల్లడించడమే ఆ గందరగోళానికి కారణం. ట్రస్టు లెక్కలను సమర్ధించిన భానురెడ్డి చెప్పినట్లు.. మిగిలిన ఆ 300 కోట్ల రూపాయలు ఏమయ్యాయని జనసేన ఇన్చార్జి కిరణ్‌రాయల్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఈ అంశంలో ఆయన భానుప్రకాష్‌రెడ్డిపై విరుచుకుపడటం ఆసక్తికరంగా మారింది. ‘అసలు టీటీడీ తరఫున మాట్లాడేందుకు భానురెడ్డి ఎవరు? ఆయనేమైనా చైర్మన్‌ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి అధికార ప్రతినిధా? టీటీడీ ఈఓ మమ్మల్ని కూడా భానురెడ్డి మాదిరిగానే అనుమతించి, లెక్కలు చూపాలి. అధికారులు భానురెడ్డికి ఏం చూపించారో, ఆయనేం చూశారో మేము కూడా పరిశీలిస్తాం. పవన్‌ కల్యాణ్‌ పెదవి విప్పిన తర్వాత సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఎందుకు టెన్షన్‌ పడుతున్నారో అర్ధం కావడం లేదు. హిందుత్వం, గుళ్లపై ఎక్కువగా మాట్లాడే బీజేపీ, శ్రీవాణి అవకతవలను సమర్థించిన భానురెడ్డిపై చర్యలు తీసుకోవాలి’’ అని జనసేన నేత కిరణ్‌ రాయల్‌ డిమాండ్‌ చేశారు. కాగా భానురెడ్డి వ్యవహారశైలి.. మొత్తం పార్టీని ఇరికించడంతో, పార్టీ వర్గాలు సంకటస్థితిలో ఉన్నాయి. ప్రధానంగా ఇది అధ్యక్షుడు సోము వీర్రాజుకు, ప్రాణసంకటంలా పరిణమించింది. వీర్రాజు అనుమతి లేనిదే భానురెడ్డి ఎందుకు మాట్లాడతారని అటు జనేసైనికులు ప్రశ్నిస్తుంటే.. ఇలాంటి సున్నిత అంశంపై మాట్లాడేందుకు వీర్రాజు పార్టీ నేత భానురెడ్డికి ఎలా అనుమతి ఇచ్చారో అర్ధం కావడం లేదని బీజేపీ సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇది రెండు పార్టీలకు సంబంధించిన సున్నిత అంశం. పైగా జనసేన ఇంకా మాతో పొత్తులోనే ఉంది. రెండురోజుల క్రితమే మా అధ్యక్షుడు, తాము జనసేనతో మాత్రమే కలసి పోటీ చేస్తామని మీడియాకు చెప్పారు. అలాంటిది శ్రీవాణి ట్రస్టుపై పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలు చేశారని తెలిసి కూడా భానురెడ్డి, ఆయన వ్యాఖ్యలకు విరుద్ధంగా టీటీడీని సమర్థించడం పొత్తు ధర్మం కాదు. ఇది చాలా దూరం వెళ్లే ప్రమాదం కనిపిస్తోంది. అందువల్ల భానురెడ్డిపై చర్యలు తీసుకుంటేనే, ఈ సమస్య ఇక్కడితో ముగుస్తుంది. లేకపోతే పవన్‌ అభిప్రాయాలను ఖండించిన మేం, ఆయనతో ఎలా మనస్ఫూర్తిగా నడవగలం’ అని తూర్పు గోదావరికి చెందిన ఓ బీజేపీ నేత వ్యాఖ్యానించారు. భాను వ్యాఖ్యలపై పార్టీ అధ్యక్షుడు వీర్రాజు, స్వయంగా వివరణ ఇస్తే స్పష్టత వస్తుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. కాగా పవన్‌ వ్యాఖ్యలకు విరుద్ధంగా మాట్లాడిన భాను ప్రకటన, యూట్యూబ్‌ లింక్‌, ఆంగ్ల మీడియాలో వచ్చిన క్లిప్పింగులను ఇప్పటికే కొందరు నేతలు ఢిల్లీకి పంపినట్లు సమాచారం.

మీరేం ఉద్ధరించారని.. ముద్రగడకు ఘాటు లేఖ!

ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాలలో తీవ్రంగా వినిపిస్తున్న పేరు ముద్రగడ పద్మనాభం. ఈ పేరు చాలా కాలంగా ఏపీ రాజకీయాలలో వినిపిస్తున్నా.. అప్పుడప్పుడు తళుక్కున మెరిసి ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికో కానీ ఫోకస్ లోకి రాకపోవడం ఈయన నైజం. గత ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపులకు కూడా రిజర్వేషన్ కావాలని ముద్రగడ ఓ ఉద్యమం లేవనెత్తారు. మరీ తెలంగాణ ఉద్యమం అంత కాకపోయినా అప్పట్లో ఈ ఉద్యమం కూడా సక్సెస్ అయింది. ఆ సమయంలో రాజకీయంగా ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. రైళ్లు తగలబడ్డాయి.. మరికొన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే, ఇదంతా ఒక్క ముద్రగడ లేవనెత్తిన ఉద్యమం వలన మాత్రమే కాదు. కాపులలో సామాజికంగా, ఆర్ధికంగా, రిజర్వేషన్ పరంగా ఉన్న అసమానతల కారణంగా ముద్రగడ ఎత్తుకున్న ఉద్యమం వారికి ఆసరాగా దొరికింది.  అయితే, ముద్రగడ ఉద్యమంతో ఏం సాధించారు? ఆయన అన్నట్లే కాపులకు  రిజర్వేషన్ తెచ్చారా? రిజర్వేషన్ రాకుండానే ముద్రగడ ఎందుకు సైలెంట్ అయ్యారు? అసలు ముద్రగడ అనే వ్యక్తి కాపు సామజిక వర్గానికి రిజర్వేషన్ కోసమే ఉద్యమం చేశారా? లేక  హిడెన్ అజెండా ఏదైనా ఉందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గత ప్రభుత్వ హయంలో ఉద్యమాన్ని ఓ స్థాయిలో నడిపించిన ముద్రగడ ప్రభుత్వం మారి జగన్ సీఎం అయ్యాక పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహీ యాత్ర మొదలు పెట్టాక మాత్రమే బయటకొచ్చారు. అది కూడా ఫక్తు వైసీపీ వాదిగా.. కేవలం పవన్ ను విమర్శిస్తూ లేఖలను రాయడానికి మాత్రమే కనిపిస్తున్నారు.  దీంతో అసలు ముద్రగడ నిజ స్వరూపం ఏంటన్నది ప్రజలకు అర్ధం అవుతుంది. అసలు అప్పుడు ముద్రగడ అనే వ్యక్తిని చూసి మాత్రమే అతన్ని కాపు సామజిక వర్గం ఒక బ్రాండ్ గా భావించలేదు. నిజానికి ఆయన్ను మించి ఆయన కుటుంబానికి దక్కిన గౌరవం అది. ముద్రగడ కుటుంబం ఏంటి? ఆయనను కాపు సామజిక వర్గం ఎందుకు ఒక ఐకాన్ గా భావిస్తుంది అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. ముద్రగడ పద్మనాభం తాత పద్మనాభం సుమారు 700 ఎకరాల భూస్వామి, కిర్లంపూడి చుట్టుప్రక్కల 10, 12 గ్రామాలకు మునసుబుగా ఉన్నారు. పద్మబనాభం తండ్రి ముద్రగడ వీరరాఘవరావు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వీరరాఘవరావు మంచికి మారు పేరుగా జీవించారు. అందుకే అప్పట్లోనే తండ్రి పద్మనాభం ఆస్థి 700 ఎకరాల నుండి 300 ఎకరాలకు తగ్గింది. ఆయన నిజాయతీ, మంచితనానికి మెచ్చి ఆ ప్రాంతంలో చాలామందికి పిల్లల పేర్లు ఆయన పేరు కలిసేలా పెట్టుకున్నారు. ఆ తర్వాత పద్మనాభం హయం వచ్చేసరికి అది కాస్త 7,8 ఎకరాలు మాత్రమే మిగిలింది.  ఇక, ఇప్పుడున్న పద్మనాభం విషయానికి వస్తే తాత, తండ్రికి పూర్తిగా విరుద్ధం. సొంత సామాజికవర్గంలో చిచ్చుపెట్టి తన పబ్బం గడుపుకోవాలని తాపత్రయంపడుతున్న వ్యక్తిగా మాత్రమే కనిపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన సహచరుడు, మిత్రుడు, ఆయనను దగ్గరగా చూసిన సలాది వెంకటరమణ అనే నేత ఘాటు లేఖ రాశారు. గౌరవనీయులైన మద్రగడ పద్మనాభం అంటూనే ముద్రగడ శైలిని తూర్పార పట్టారు. ఆయన రాసిన రేఖను యధాతదంగా చూస్తే.. అమలాపురం నుండి మీతో సుమారు 15 సంవత్సరాలుగా మిమ్ముల్ని అనుసరిస్తూ మీరు తీసుకొనే ప్రతి నిర్ణయంలో మిమ్మల్నే అనుసరించే సలాది వెంకటరమణ సమస్కరిస్తూ వ్రాయునది అంటూ లేఖను మొదలు పెట్టారు.  ఈ లేఖలో 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా ముద్రగడ గెలిచి అసెంబ్లీకి వచ్చిన రోజున ఫోటో దిగిన రోజున జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఆ ఫోటోలో పీవీఎస్ రామారావు, పడాల అమ్మిరెడ్డి, పంఠంశెట్టి సత్తిరాజు, ఎమ్మీఎస్ సుబ్బరాజు, బిరుదా ఫకీర్‌రావు కూడా జనతాపార్టీ ఎమ్మెల్యేలుగా ఆ ఫోటోలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో 1978లో మీతో పాటు తొలి సారిగా అసెంబ్లీకి వచ్చిన Y.S.రాజశేఖర్‌రెడ్డి, నారా చంద్రబాబునాయుడు,  వెంకయ్యనాయుడు, ఆ తర్వాత 5 సంవత్సరాలకు వచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఏస్థాయిలో ఉన్నారు?.. వారి కుటుంబాలు ఏ స్థాయిలో ఉన్నాయి? వారు వారి కులాల వారి ద్వారా ఏ స్థాయి అభివృద్దిలో ఉన్నారు. ఒక సారి మీరు ఆలోచించండి అంటూ లేఖలో చురకలు వేశారు. మీ కుటుంబం మిగిల్చిన కాకినాడలో కళ్యాణ మండపం, కిర్లంపూడిలో పాత సినిమా ధియేటర్‌ ఆస్థితో రాజకీయ జీవితం ప్రారంభించిన మీరు ఏ స్థాయికి ఎదిగారు? మీరు ఉద్యమం చేసిన కాపులను ఏ స్థాయికి ఉన్నతులుగా చేసారో చెప్పాలని ప్రశ్నించారు. కాపు కులాన్ని మీరు మీకు రాజకీయ గుర్తింపు లేని సమయాల్లో రోడ్డు ఎక్కించడం.. ఆ తర్వాత ఆపివేయడం.. మమ్మల్ని నమ్ముకుని వచ్చిన వారికి పోలీసులు కేసులు, జైళ్ళు, బెయిళ్ళు, మీరు పరామర్శించడం, ఇతర కులాలు అందరూ ఈ కులాన్ని విరోధులుగా చూసే స్థాయికి తీసుకెళ్లడం మీరు కాపు కులానికి చేసిన మేలు. కాపు రిజర్వేషన్‌ ఉద్యమం చేసే సమయంలో బోనం వెంకటచలమయ్య(BVC కాలేజ్‌ అధినేత) ఒరే రమణా ఎందుకురా ఈబిసి రిజర్వేషన్లు, వీటి కోసం ఆందోళనలు తద్వారా యువకులను ప్రక్కదారి పట్టించడం మన జాతిలో యువతీ యువకులు చక్కగా చదువుకుంటే సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి వెళితే ఏ రిజర్వేషన్లు అక్కర్లేకుండా సామాన్యుడు కూడా లక్షాధికారులు అవుతారు కదా అందుకే ఈ కాలేజ్‌లు నిర్మిస్తున్నాను అన్నారు. ఆనాడు ఆయన అన్న ఆ మాటల పరమార్ధం ఏమిటో నేను ఈ రోజు చూస్తున్నాను. మా ప్రాంతంలో సాధారణ రైతులు రైతు కూలీలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు పిల్లలు ఎంతో ఉన్నత స్ధితిలోకి దేశ విదేశాల్లో స్ధిరపడియున్నారు. ఇటువంటి విజన్‌తో మీరు ఎందుకు ఆలోచించ లేదో నాకు అర్ధం కావడం లేదు. నిజంగా కాపు సామాజికవర్గం బాగు కోరుకొనే వారైతే ఈ విధంగా ఆలోచన చేసి ఉంటే బాగుండేది. అప్పట్లో చిరంజీవి, దాసరి నారాయణరావు, తులసి రామచంద్రప్రభు లాంటి ఎందరో పారిశ్రామిక వేత్తలు, విద్యావేత్తలు, వ్యాపార వేత్తలు ఎందరో మీ వద్దకు వచ్చి సంఫీుభావం తెలిపినా మీరు వారికి తగిన గుర్తింపు ఇవ్వలేదు. ఎందుకో మీకు ఇగో ఫీలింగ్‌. మీరు చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణం చేసిన 5వ రోజున చిరంజీవి ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కి వెళ్తే.. ఆయన ఎంతో సాధరంగా ఆహ్వానించి మీతో ఎన్నో విషయాలు చర్చించుకున్నారు. కానీ, మీరు ఈ మధ్య లేఖలో మీరు మెగా కుటుంబం కులానికి ఏమి చేసింది అని అడుగుతున్నారు.  ఇకపోతే 1978 నుండి మీ వ్యక్తిగత రాజకీయ విధానాలను చూస్తే 1983  వరకు జనతా పార్టీలో ఉండి 6 మాసాలు ముందే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టిడిపి పార్టీలో చేరారు. 1983 ఎమ్మెల్యేగా గెలిచిన మిమ్మల్ని డ్రైనేజీ బోర్డు ఛైర్మన్‌గా నియమించగా మీరు ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసి కిర్లంపూడి వచ్చేశారు. తదుపరి నాదెండ్ల భాస్కరరావు వ్యవహారం జరిగితే మీరు ఎన్టీఆర్ కు మద్దతుగా 1985లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మిమ్మల్ని మొదటి క్యాబినేట్‌లో ట్రాన్స్‌పోర్టు మంత్రిగా నియమించారు. 1986లో విజయవాడ సిటిబస్‌లు వ్యవహారంలో మీరు కోపం ప్రదర్శించి మంత్రి పదవికి రాజీనామా చేసి కిర్లంపూడికి వచ్చేశారు. ఆ తర్వాత పెద్దలు వచ్చి మిమ్మల్ని శాంతింపజేసి మళ్ళీ ఎన్‌.టి.ఆర్‌ వద్దకు తీసుకుని వెళితే.. అప్పుడు మిమ్మల్ని ఎక్సైజ్‌ శాఖకు మార్చారు.  1988లో కాపునాడు ఉద్యమం కాకినాడ ఆనంద భారతిలో ఆకుల శివయ్యనాయుడు, మిరియాల వెంకట్రావు, పోతుల సీతారామయ్య ఆధ్వర్యంలో మీరు ముఖ్య అతిధులుగా పాల్గొని విజయవాడలో కాపునాడుకి పిలుపు ఇచ్చారు. అప్పుడు తెలుగునాడు పార్టీ ఏర్పాటు చేసి తదుపరి తెలుగునాడు పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసి కత్తిపూడిలో భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రకటించారు. తదుపరి రంగా హత్య అనంతరం జరిగిన 1989లో మీ ద్వారా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి మీ నియోజకవర్గంలో మిమ్మల్ని గ్రామాల్లో అన్ని వర్గాల వారు మిమ్మల్ని రోడ్డుపై చీరలు పరిచి పువ్వులు జల్లుతూ మిమ్మల్ని నడిపించేవారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మీకు ఇప్పుడు ఆ పరిస్ధితి ఉందా?  తదుపరి రాజీవ్‌గాంధీ హత్యానంతరం పి.వి.నరసింహారావు చెన్నారెడ్డిని తప్పించే క్రమంలో రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా వేరే సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కుసుమ కృష్ణమూర్తి, జనార్ధన పూజారి మీ వద్దకు సీఎం పదవి మీకే ఇస్తామని రాయబారం వస్తే మీరు తిరస్కరించి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఇవ్వాలని  ప్రతిపాదించారు. ఆ కారణంగానే ఎన్‌.జనార్ధనరెడ్డి క్యాబినేట్‌లో మీకు స్థానం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి కావాల్సినటువంటి వ్యక్తికి మంత్రి పదవి కూడా లేకుండా పోయింది. తదుపరి నేదురుమల్లి జనార్ధనరెడ్డిని తప్పించి కె.విజయభాస్కరరెడ్డిని ముఖ్యమంత్రి చేసిన క్యాబినేట్‌లో కూడా మీకు మంత్రి పదవి దక్కలేదు. అప్పుడు మీకు కోపం పెరిగిపోయి ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నారు. పిలిచి ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే వేరే వారి పేరు చెబుతారు. మీకు మంత్రి పదవి ఇవ్వకుంటే కోపంతో రగిలిపోతారు. లాబీయింగ్‌ ఎవరైనా చేస్తామంటే వద్దంటారు. ఆ కోపంలో నుండి వచ్చినదే ఈ కాపు బిసి రిజర్వేషన్ల ఉద్యమం, దాని నిమిత్తం మీరు అమలాపురం వచ్చారు.  1994లో జరిగిన ఎన్నికలలో ప్రత్తిపాడులో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తే మిమ్మల్ని ఇతర వర్గాల ప్రజలు తిరస్కరించారు. వెంటనే మీరు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి.. వైట్‌ అండ్‌ వైట్‌ తప్ప ఖాకి కలర్‌ ప్యాంటు, వైట్‌ షర్టుతో ఎరగని మాకు అలా చూసే అదృష్టం కూడా మాకు కల్పించారు. ఆ తర్వాత అనకాపల్లి నుండి బిజేపి పార్టీ మిమ్మల్ని ఎంపిగా పోటీ చేయమంటే వద్దు అని చెప్పి కృష్ణంరాజును నిలబెట్టి మీరు అన్ని నియోజకవర్గాలు తిరిగి ఆయనను గెలిపిస్తే ఆయన వద్దకు మీరు వెళ్ళేటప్పటికి ఆయన కుర్చీలో కూర్చుని మిమ్మల్ని ప్రక్క కుర్చిలో కుర్చోండి అన్నారని, లేచి నిలబడలేదని మీకు కోపం వచ్చి యధావిధిగా ఎప్పటిలాగే మీరు బిజేపికి రాజీనామా చేశారు. తర్వాత 1999లో బొడ్డు భాస్కర రామారావు, జిఎంసి బాలయోగి వచ్చి టీడీపీలో చేరి కాకినాడ ఎంపిగా పోటీ చేయించడం.. అప్పుడు మీరు గెలవడం జరిగింది. కానీ, 2004లో యధావిధిగా టిడిపికి రాజీనామా చేసి ప్రతిపాడులో ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఆటో గుర్తుపై పోటీ చేస్తే 6 వేల ఓట్లు వచ్చాయి.  2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి గోదావరి జిల్లాలకు మిమ్మల్ని నాయకత్వం వహించమని రాయబారం పంపితే రాజశేఖర్‌రెడ్డి వద్దకు వెళ్ళి పిఠాపురం కాంగ్రెస్‌ టికెట్‌ పుచ్చుకుని పోటీ చేసి ప్రజారాజ్యం అభ్యర్ధి శ్రీమతి వంగా గీత చేతిలో మూడవ అభ్యర్ధిగా ఓడిపోయారు. 2014 ఎన్నికలకు మీరు హాలీ డే ప్రకటించి.. 2016లో చంద్రబాబు కాపు కులానికి రిజర్వేషన్‌ కల్పిస్తానని హామి ఇచ్చి ఇంకా చేయలేదని ఈ లేఖలు వ్రాయడం మొదలు పెట్టారు. మీ ఒత్తిడి వల్ల మేమందరం మీ వెనుక వస్తే.. తుని సభను విజయవంతం చేయడానికి అన్ని ప్రాంతాల నుండి మీకు మద్దతుగా వస్తే.. ఒక్క నాయకుడుని కూడా ప్రసంగించనీయకుండా సభకు వచ్చిన అశేష జనవాహిణిని రోడ్డు రోకోకు, రైలు రోకోకు తరలించడం ఎంతవరకు సమంజసం?. ఆ సంఘటన ద్వారా అన్ని జిల్లాలోని పోలీసులు సభకు వెళ్ళిన వారి వివరాలు తీసుకుని ఆయా పోలీస్‌స్టేషన్లలో ఎందరో యువకుల్ని, మాలాంటి నాయకుల్ని ఎంతో ఇబ్బందులకు గురి చేశారు. అయినా సహించి మీరు కంచాలు బాదమంటే ఇంటిళ్ళపాది పిల్లజల్ల, ముసలి ముతక అందరం కంచాలు బాదారు.  ఈ ఉద్యమంలో మీరు నిస్వార్ధంగా మా కోసం మీ కుటుంబాన్ని ఫణంగా పెట్టి పోరాడుతున్నారని మేము గుడ్డిగా నమ్మి.. ఈ ఉద్యమంలో రహస్య అజెండా ఉందని అనుమానించలేదు. ప్రస్తుతం జనసేన వారాహి యాత్ర ద్వారా మీలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఎన్నో విషయాలు ప్రపంచానికి మీరే స్వయంగా చాటి చెప్పారు. చౌకబారు సహాయాల్లో కూడా అందరి వద్ద మీరు ఇలా చేతులు చాచుతారని మేము ఎప్పుడు ఊహించలేదు. నా వద్దకు ఎందరో యువకులు వచ్చి మిమ్మల్ని నానా మాటలు అంటుంటే నేను భరించలేక నేను సూచన చేస్తున్నాను. ఇప్పటికైనా మీ వయస్సు రీత్యా, మీ భార్య ఆరోగ్య రీత్యా మీరు ఏ విధమైన టెన్షన్లు లేకుండా ఏ వివాదాలకు తావు లేకుండా వ్యవహరించి మీ అబ్బాయికైనా మంచి భవిష్యత్‌ను ఏర్పాటు చేయండి.  పద్మనాభం గారు మనతరం వేరు, ఇప్పటి యువతరం వేరు, మీరు ఎంతో ఉన్నత కుటుంబం అని పొగిడిన రెడ్డి గారి తాతను, తండ్రిని బేడీలు వేసి పోలీసులు తీసుకుని వెళ్ళడం ఉన్న ఫోటోను 24 గంటల గడవక ముందే ప్రపంచానికి చూపించారు. అది ఇప్పటి యువత ఘనత. అటువంటి యువత అంతా ని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు మద్దతుగా నిలబడుతున్నది. లోగడ చంద్రశేఖర్‌రెడ్డి పబ్లిక్‌ ప్రెస్‌మీట్‌లో పవన్‌కళ్యాణ్‌ ఈ జిల్లా నుంచి పోటీ చేస్తే ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెట్టి ఓడించి తీరుతాను అని చెప్పారు. మీరు అతని ఆధ్వర్యంలో ఎక్కడైనా పోటీ చేస్తే ఇప్పుడు ఉన్నటివంటి పరిస్ధితులకన్నా... ఇంకా చులకన అయిపోతారు. ఇప్పుడు ఉన్నటివంటి యువతకు ఆవేశం వస్తే మనవంటి పెద్దలను కూడా లెక్కచేయరు. ఈ విషయాన్ని గమనించి మన గౌరవ మర్యాదలు మనం కాపాడుకోవడం మంచిదని భావిస్తున్నానని రాసుకొచ్చారు.