అదానీకి అమెరికా షాక్!?

అదాని భారత వ్యాపార సామ్రాజ్యంలోనే కాదు ఇండియన్ పాలిటిక్స్ లో కూడా ఈ పేరు గట్టిగా వినబడుతుంది. అదాని వ్యాపార సామ్రాజ్య విస్తరణకు మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పడిన బీజం.. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ వేగంగా పెరిగి ఒక మహావృక్షంగా మారిందని బీజేపీ వ్యతిరేకులు ఆరోపిస్తుంటారు. అటువంటి అదానీ వ్యాపార సామ్రాజ్యం ఒకే ఒక్క నివేదికతో వేగంగా పతనం కావడం వెనుక మోడీ వ్యతిరేకుల కుట్ర ఉన్నదని  బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. అదానీ వ్యాపార సామ్రాజ్య పతనం వెనుక కుట్రలో  భారత్ కే చెందిన మరో వ్యాపార దిగ్గజం విప్రో ప్రేమ్ జీ  హస్తం కూడా ఉందని ఒకానొక సమయంలో ఆరోపణలు వెల్లువెత్తాయి.   హిడెన్ బర్గ్ నివేదికతో మొదలైన అదానీ వ్యాపార సామ్రాజ్య పతనం.. మోడీ సర్కార్ అండదండలతో ఆగినా.. పూర్వ వైభవాన్ని మాత్రం అందుకోలేదన్నది కాదనలేని వాస్తవం. హిడెన్ బర్గ్ నివేదిక అనంతరం అదానీ గ్రూప్ షేర్లు వేగంగా పతనమౌతున్న సమయంలో ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్ ఆర్గనైజర్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది.  హిండెన్‌బర్గ్ వెనుక ఒక కమ్యూనిస్ట్ నాయకుడి సతీమణి, జర్నలిస్ట్, నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా పేరున నడిచే ఒక స్వస్చంద సంస్థ, వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేసే ఒక వెబ్‌సైట్ ఉన్నాయనీ, వీటన్నింటికీ అజీమ్ ప్రేమ్‌జీ నడిపే స్వచ్చంద సంస్థ ఐపీఎస్ఎంఎఫ్ నిధులు సమకూరుస్తుందని అప్పట్లో ఆర్గనైజర్‌  ఓ కథనాన్ని ప్రచురించింది.  ఆస్ట్రేలియాలో పర్యావరణ పరిరక్ష ణ ముసుగులో పనిచేస్తున్న బాబ్ బ్రౌన్ ఫౌండేషన్ (బీబీఎఫ్) అనే స్వచ్చంద సంస్థ, అదానీవాచ్ డాట్ ఓఆర్ జి అనే వెబ్‌సైట్‌ను నడుపుతోంది. అదానీ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి ఉద్దేశించిన ఈ వెబ్‌సైట్‌కు అజీమ్ ప్రేమ్‌జీ నిర్వహించే సోరోస్, ఫోర్డ్ ఫౌండేషన్, రాక్‌ఫెల్లర్, ఒమిడ్యార్, బిల్ గేట్స్‌లు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారు.  హిండెన్‌బర్గ్  కేవలం బంటు. అసలు సూత్రధారి అజీమ్ ప్రేమ్‌జీ, అతని కోసం పనిచేస్తున్న వామపక్ష భావజాల సంస్థలు, వ్యక్తులు ఉన్నారని ఆర్గనైజర్‌ కథనం పేర్కొంది. అలాగే, ది వైర్ ఎడిటర్ సీమా చిస్తీ ( సిపిఎం నేత సీతారాం ఏచూరి భార్య) కూడా అదానీ వ్యతిరేక కుట్రలో భాగస్వామిగా ఉన్నారని, ఆస్ట్రేలియాలో అదానీ కాల్ ప్రాజెక్ట్స్ కు వ్యతిరేకంగా 2017లోనే  ది వైర్ కథనాలు రాసిందని ఆర్గనైజర్‌ పేర్కొంది. అదానీ ఒక సాకు మాత్రమే, అజీమ్ ప్రేమ్‌జీ లక్ష్యం మోడీ అనీ, అందుకే ఆల్ట్‌న్యూస్, ది వైర్, ది కారవాన్, ది న్యూస్ మినిట్ వంటి మోదీ వ్యతిరేక వెబ్‌సైట్‌లన్నింటికీ ప్రేమ్ జీ  భారీ మొత్తంలో డబ్బు ఇస్తున్నారని, ఆర్గనైజర్‌ ఆరోపించింది. అయితే, ఎంత కాదన్నా నిప్పు లేనిదే పోగారాదు. అలాగే, ఎవరు ఎన్ని  ఆరోపణలు చేసినా, ఎవరు ఎంతగా ఎదురు దాడి చేసినా, నిజం నిలకడ మీద తెలుస్తుంది.  ఇది గతం అయితే ప్రస్తుతానికి వస్తే మోడీ అమెరికా  పర్యటనలో ఉన్న సమయంలోనే ఆ దేశం మోడీకి సన్నిహితుడిగా గుర్తింపు పొందిన అదానీకి గట్టి షాక్ ఇచ్చింది. మోడీ పర్యటన పూర్తి చేసుకుని అమెరికా నుంచి భారత్ కు తిరిగి వచ్చిన అనంతరం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. భాతర పారిశ్రామిక దిగ్గజం అదానీకి అమెరికా ప్రభుత్వం  అవకతవకలకు సంబంధించి సమన్లు జారీ చేసింది.  ఈ ఏడాది జనవరిలో యూఎస్‌ హెడ్జ్‌ ఫండ్‌ హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌తో అతలాకుతలమైన అదానీ గ్రూప్‌పై తాజాగా అమెరికా నియంత్రణా సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. దీంతో విదేశీ ఫండ్స్‌ బాసటతో రెండు నెలలుగా ఊపిరి పీల్చుకుంటున్న అదానీ గ్రూప్‌ షేర్లు గత వారం ఒక్కసారిగా కుప్పకూలాయి. అదానీ గ్రూప్‌లో పెద్ద వాటాల్ని కొన్న అమెరికా ఫండ్స్‌కు బ్రూక్లిన్‌లోని యూఎస్‌ అటార్నీ ఆఫీస్‌ నుంచి సమన్లు వెళ్లాయని బ్లూంబర్గ్‌ వార్తా సంస్థ వెల్లడించింది. హిండన్‌బర్గ్‌ రిపోర్ట్‌ వెలువడిన తర్వాత కొద్ది రోజులకు విదేశీ ఫండ్స్‌ నుంచి అదానీ గ్రూప్‌ భారీ నిధుల్ని సమీకరించి, రుణ ఊబి నుంచి తాత్కాలికంగా గట్టెక్కింది. ఈ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి అమెరికా ఇన్వెస్టర్లకు అదానీ గ్రూప్‌ ఏమి చెప్పిందన్న అంశాలపై ఆరా తీస్తూ అటార్నీ ఆఫీసు సమన్లు పంపిందనేది సమాచారం. ఇదే తరహా దర్యాప్తును మార్కెట్‌ రెగ్యులేటర్‌ యూఎస్‌ సెక్యూరిటీస్‌ ఎక్సేంజ్‌ కమిషన్‌ (సెక్‌) కూడా చేస్తున్నదని సంబంధిత వర్గాల్ని ఉటంకిస్తూ బ్లూంబర్గ్‌ తెలిపింది.  అయితే తమ ఇన్వెస్టర్లకు  తమ ఇన్వెస్టర్లకు అమెరికా రెగ్యులేటర్లు సమన్లు జారీచేసిన విషయం   తెలియదని అదానీ గ్రూప్‌ అంటోంది. 

కవిత కేంద్రంగా తెలంగాణ రాజకీయం!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలోనే కాదు..  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా..  తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. బతుకమ్మ చుట్టి ఆడింది.. పాడింది. అయితే ప్రస్తుత ఎన్నికల సీజన్ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు మాత్రం.. కల్వకుంట్ల కవితమ్మ చుట్టు తిరుగుతోన్నాయి.   ఢిల్లీ మద్యం కుంభకోణంలో పలువురు ప్రముఖలతో పాటు కల్వకుంట్ల కవిత పేరు సైతం ప్రముఖంగా వినిపించింది. ఆ క్రమంలో పలుమార్లు ఢిల్లీలోని ఈడీ ఎదుట విచారణకు   ఆమె హాజరైంది. ఒకానొక సమయంలో కల్వకుంట్ల కవిత ఇహనో.. ఇప్పుడో అరెస్ట్ కావడం ఖాయమనే ఓ ప్రచారం సైతం గట్టిగానే నడిచింది.  అయితే ఇప్పుడు మాత్రం ఆమె అరెస్ట్  ఆగిపోయిందని ఓ ప్రచారం జోరుగా సాగుతోంది.  కానీ ఆ అరెస్ట్   తాత్కాలికంగా ఆగిందా? లేక..? అన్న అనుమానాలు మాత్రం సర్వత్రా వినవస్తున్నాయి. అయితే  ప్రస్తుత పరిస్థితుల్లో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయితే  అది తమకే లాభమని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటుంటే.. ఆమె అరెస్టు ఎంత జాప్యమైతే అంత మేరకు తమకు నష్టమని బీజేపీ భావిస్తోంది.  కవిత కనుక అరెస్ట్ అయితే.. బీఆర్ఎస్ పార్టీపై, తెలంగాణపై మోదీ ప్రభుత్వం కక్ష కట్టిందన్న భావన ప్రజలలో కలిగి.. అది సానుభూతిగా మారి  బీఆర్ఎస్ కు రాజకీయవాతావరణం సానుకూలంగా మారిపోతుందన్నది బీఆర్ఎస్ భావనగా ఉంటే.. కవితను అరెస్టు చేయకుండా వదిలేస్తే.. విపక్ష పార్టీలను బ్లాక్ మెయిల్ చేయడానికే కేంద్రంలోని బీజేపీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్ధలను వాడుకుంటోందని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చినట్లవుతుందనీ, ఇది రాష్ట్రంలో తమ పార్టీ ప్రతిష్టను పలుచన చేస్తుందనీ తెలంగాణ బీజేపీ భావిస్తోంది. అంతే కాకుండా ఇప్పటికే కవిత విషయంలో దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయకుండా తాత్సారం చేస్తుండటంతో బీఆర్ఎస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం అన్న కాంగ్రెస్ ప్రచారానికి ప్రజలలో మంచి స్పందన లభిస్తోంది. ఒక విధంగా కవిత ఎపిసోడ్ బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య లాలూచీ అన్న భావన జనంలో వ్యక్తం అవుతుండటంతో  రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ వేగంగా పెరుగుతోంది.   అసెంబ్లీ ఎన్నికల నాటికి  కూడా కవిత అరెస్టు కాకుండా ఉంటే..  మోడీ, కేసీఆర్ .. ఇద్దరూ ఇప్పటి  చేసినదంతా డ్రామా అన్న భావన జనంలో  బలపడుతుందన్న భావన ఇరు పార్టీలలో బలంగా వ్యక్తమౌతోంది. ప్రజలలో పడిపోతున్న గ్రాఫ్ పెరగాలంటే కల్వకుంట్ల కవిత అరెస్టు ఒక్కటే మార్గం అని బీఆర్ఎస్ భావిస్తుంటే.. కవిత అరెస్టు కాకుంటే తెలంగాణపై బీజేపీ ఆశలు వదిలేసుకోవలసిందే అన్న భావన  రాష్ట్ర బీజేపీ నేతలలో వ్యక్తమౌతోంది.  ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని చూస్తే కర్నాటకలో బీజేపీ ఏ పరిస్థితి అయితే ఎదుర్కొందే అదే పరిస్థితి తెలంగాణలోనూ పునరావృతం అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   మొత్తం మీద కవిత కేంద్రంగా తెలంగాణ రాజకీయం రసకందాయంలో పడింది. 

నిన్నటి దాకా తెగడ్తలు.. ఇప్పుడు పొగడ్తలు వైసీపీ వ్యూహం మార్చిందా?

వైసీపీ ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ.. మరోసారి అధికారంలోకి రావడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది. కళ్లెదుట కనిపిస్తున్న ప్రజా, ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి ఎదురీదుతోంది. ప్రజలను ఎలాగా ఆకట్టుకోలేం.. విపక్షాలను చీల్చి చెండాడితే చాలని భావిస్తోంది. విపక్షాల ఐక్యతకు గండి కొట్టడానికి ఎక్కడ లేని ఎత్తులూ వేస్తోంది. వ్యూహరచన పేరిట నేల విడిచి సాము చేస్తోంది. అయినా గ్రాఫ్ పెరగడం లేదన్న ఆందోళన ఆ పార్టీలో పై నుంచి కింది వరకూ కనిపిస్తోంది. ఒక వైపు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలు, మరో వైపు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలకు వస్తున్న జన స్పందన, ప్రభుత్వంపై, జగన్ పై, వైసీపీ నేతలపై వారు చేస్తున్న విమర్శలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనతోనే ఖంగారు పడుతున్న వైసీపీకి జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో  కంగారు రెట్టింపైంది. పవన్ విమర్శలు, సూటి ప్రశ్నలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి అరికాళ్ల కింద భూమి కదిలినట్లైంది. పవన్ పై వైసీపీ నేతలు రిటార్డ్ ఇవ్వడం.. దానికి జనసైనికుల నుంచి అంతకు రెట్టింపు తీవ్రతతో ప్రతి విమర్శలు రావడంతో పవన్ విషయంలో వైసీపీ వ్యూహం మార్చుకుంది. పవన్ పై విమర్శలు కాదు.. పొగడ్తల ద్వారా ఆయన విమర్శల తీవ్రత తగ్గేలా చూసుకోవడం మేలని భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. అందుకే ఒక్కరొక్కరుగా వైసీపీ గెస్ట్ ఆర్టిస్టులు తెరపైకి వస్తున్నారు. పవన్ కల్యాణ్ చాలా మంచివాడని కితాబులిస్తున్నారు. ఆయన అమాయకుడనీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్రాప్ లో పడి వాస్తవాలను గుర్తించడం లేదనీ మెత్తమెత్తగా మాట్లాడటం ప్రారంభించారు. పోసాని కృష్ణమురళి, లక్ష్మీ పార్వతి వంటి వారు మైకుల ముందుకు వచ్చి, మీడియా సమావేశాలు పెట్టి మరీ జనసేనాని పట్ల ఎక్కడ లేని సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ తన కెరీర్ ను పవన్ నాశనం చేశాడంటూ గొంతెత్తి అరచిన పోసాని కృష్ణ మురళి.. ఇప్పుడు ఆయన అమాయకుడంటూ మీడియా ముందుకు వచ్చారు. వాస్తవానికి పోసాని కృష్ణ మురళి కేవలం తమ పార్టీ అధినేత జగన్ కు అవసరమైనప్పుడు మాత్రమే మీడియా ముందుకు వస్తారు. ఒకటి రెండు రోజులు వరుస ప్రెస్ మీట్లతో హడావుడి చేసి ఆ తరువాత యధా ప్రకారం టీవీలలో రియాల్టీ షోలకు గెస్టుగానో, ఉంటే ఏదైనా షూటింగ్ లోనో పాల్గొంటూ తన మానాన తను తన పని చేసుకుంటుంటారు. ఇక లక్ష్మీ పార్వతి విషయానికి వస్తే ఆయన ఎప్పుడు ఎందుకు మాట్లాడతారో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న వైసీపీకే కాదు ఆమెకు కూడా తెలియదని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతుంటాయి.   ఇక అనుకోని విధంగా కాదు.. కాదు అనూహ్యంగా పోసాని, లక్ష్మీపార్వతిలకు పవన్ కల్యాణ్ ఎలా మంచివాడైపోయాడు, ఆయనపై ఎక్కడ లేని సానుభూతి ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నలకు పవన్  వారాహియాత్రకు జనంలో వస్తున్న స్పందనే కారణమంటున్నారు. నిన్న మొన్నటి వరకూ పవన్ వెంట కాపు సామాజికవర్గం కదలకుండా నిలువరించడానికి వైసీపీ నేతలు చేసిన ప్రయత్నం రివర్స్ కావడం, ఇక పార్టీ బయట నుంచి ముద్రగడ వంటి వారు సంధించిన లేఖాస్త్రాలు బూమరాంగ్ కావడంతో.. ఇక ఎదురెళ్లి లాభం లేదన్న నిర్ణయానికి వచ్చిన వైసీపీ అగ్రనేత వ్యూహం మార్చి తెగడ్తలకు ఫుల్ స్టాప్ పెట్టి పొగడ్తల మార్గం పట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీలో ఇంత వరకూ పవన్ ను ఇష్టారీతిగా విమర్శించి, కొండొకచో దూషించిన పేర్ని నాని, అంబటి రాంబాబు వంటి కాపు నేతలు  హఠాత్తుగా ప్లేట్ ఫిరాయించి పొగడ్తల వర్షం కురిపిస్తే జనం ఛీకొడతారన్న భయంతో గెస్ట్ ఆర్టిస్టులను జగన్ రంగంలోకి దింపారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే జగన్ కొత్త ఎత్తుగడ పని చేసే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదు.  ఎందుకంటే ఇంత కాలం పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగి, ఆయనను ఆయన సొంత సామాజికవర్గానికి దూరం చేయాలన్న ఎత్తుగడ బూమరాంగ్ అయ్యి  చివరికి కాపు సామాజికవర్గ ఓటర్లు వైసీపీకి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడటంతో ప్లేట్ ఫిరాయించి పవన్ కు కితాబులిచ్చేస్తే..  అంతా సానుకూలం అయిపోతుందని వైసీపీ భావించడం అమాయకత్వమైనా కావాలి లేదా అతి విశ్వాసమైనా అయ్యుండాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మోడీ టార్గెట్ కవిత!

ప్రధాని నరేంద్రమోడీ మరో సారి అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఆయన భోపాల్ లో చేసిన ప్రసంగం మొత్తం విపక్షాలే అవినీతికి పాల్పడుతున్నాయని ఎలుగెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత విషయాన్నీ ప్రస్తావించారు. తమ ప్రభుత్వంలో మంత్రులు, పార్టీ నేతలూ మాత్రం పులికడిగిన ముత్యాలని చెప్పుకొచ్చారు. ఆయన ప్రసంగ సారాంశమేమిటంటే.. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారంతా అవినీతి పరులేనని, అలాంటి వారెవరైనా బీజేపీలో చేరితే వారి పాపాలూ, అవినీతి అక్రమాలన్నీ.. గంగలో మునిగితే పాపాలు పోయినట్లు మాయమైపోయి పునీతులౌతారని అన్నట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ  తెలంగాణ ఆవల తొలి సారిగా బీఆర్ఎస్ అధినేత కుమార్తె కల్వకుంట్ల కవిత మద్యం కుంభకోణంలో ఎదుర్కొంటున్న ఆరోపణలను ప్రస్తావించారు.  ఈడీ, సీబీఐ నజర్ లో ఉన్న సంగతి ఎత్తి చూపారు. అంతే కాదు తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలన కొనసాగాలని కోరుకునే వారు మాత్రమే బీఆర్ఎస్ కు ఓటు వేయాలనీ, స్వచ్ఛమైన, అవినీతి రహిత పాలన కావాలనుకుంటే బీజేపీకి ఓటేయండి అని పిలుపు నిచ్చారు.  మోడీ భోపాల్ పర్యటన వందేభారత్ ఎక్స్ ప్రెస్ ల ప్రారంభం కోసం.. సరే ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. మోడీ  ఆ రాష్ట్రంలో సమస్యలు, అక్కడి రాజకీయాల గురించి ప్రస్తావిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. కానీ మధ్యప్రదేశ్ గడ్డ మీద నుంచి ఆయన తెలంగాణలో అవినీతి సర్కార్ అంటూ ఆక్షేపించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తెపై కేసుల గురించీ, ఆరోపణల గురించీ కూడా చెప్పారు. అక్కడ నుంచి తెలంగాణ ప్రజలను బీజేపీకి ఓటేయాల్సిందిగా కోరారు. సరే ఆవిషయాన్ని కాసేపు పక్కన పెడితే.. ప్రధాని మోడీ గంపగుత్తగా  విపక్ష పార్టీలన్నీ అవినీతి పార్టీలే అని ప్రకటించేసి... బీజేపీకి క్లీన్ చిట్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిని బీజేపీలో చేర్చుకుని వారికి క్లీన్ చిట్ ఇవ్వడం ద్వారా కమలం పార్టీ మొత్తం అవినీతి రహిత పార్టీ అని ప్రధాని ఎలా సర్టిఫికెట్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు విపక్ష నేతలపై దర్యాప్తు చేయడం వినా మరో పని లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు. సంక్షేమం పేరుతో విపక్షాలు అవినీతికి గ్యారంటీ ఇస్తుంటే.. తాను, తన సర్కార్  మాత్రం అవినీతి పరులకు శిక్షలు వేయించడానికి గ్యారంటీ ఇస్తున్నట్లు ఘనంగా ప్రకటించుకున్నారు. ఇక్కడే అవినీతి ఆరోపణలకు ఎదుర్కొంటూ బీజేపీ గూటికి చేరి హఠాత్తుగా పునీతులైపోయిన నేతల గురించి  మోడీ ఏం చెబుతారని ప్రశ్నిస్తున్నారు.  గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన సొంత నేతల్నే జైలుకు పంపిన రికార్డు ఉంది కానీ.. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం  మాత్రం సొంత పార్టీ నేతల అవినీతిని పట్టించుకోవడం లేదు. అంతే కాదు అలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుటన్నవారు కమలం గూటికి చేరగానే  క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నది. గతంలో కాంగ్రెస్  హయాంలో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలపై అధికార పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షాత్తూ సుప్రీం కోర్టే  గతంలో సీబీఐని పంజరంలో చిలుకగా అభివర్ణించింది. ఇప్పుడు మోడీ హయాంలో అయితే  కేంద్ర దర్యాప్తు సంస్థలు మరబొమ్మలుగా మారిపోయాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం కీ ఇస్తే కదులుతున్నాయి. లేకపోతే ఆగిపోతున్నాయి. మోడీ భోపాల్ వేదికగా ప్రస్తావించిన కల్వకుంట్ల కవిత వ్యవహారమే తీసుకుంటే.. కేసీఆర్ కేంద్రం మీద విరుచుకుపడుతూ.. మోడీపై విమర్శలు గుప్పించినంత కాలం మద్యం కుంభకోణంలో కవిత విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు యమా స్పీడుగా వ్యవహరించాయి. ఇహనో, ఇప్పుడో కవిత అరెస్టు తథ్యం అనిపించేలా హడావుడి చేశాయి. హస్తినకు పిలిపించుకుని మరీ ఈడీ విచాణ చేసింది. ఆమె ఫోన్లను స్వాధీనం చేసుకుంది. పలువురిని అప్రూవర్లుగా మార్చి మరీ కవితను టార్గెట్ చేసింది. ఎప్పుడైతే కేసీఆర్  కేంద్రంపై విమర్శలకు విరామం ప్రకటించారో.. ఆ వెంటనే కవిత విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు సైలెంట్ అయిపోయాయి. ఈ తొమ్మిదేళ్లుగా మోడీ సర్కార్ అవినీతినై ప్రకటించిన యుద్ధం అంతా ఇలానే సాగింది. గత ఎన్నికలకు ముందు అప్పటి తెలుగుదేశం నేతలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లను దర్యాప్తు సంస్థలు ముప్పుతిప్పలు పెట్టాయి. ఎప్పుడైతే వారిరువురూ తెలుగుదేశం వీడి కమలం గూటికి చేరారో అప్పటి నుంచి వారిపై అవినీతి మరక లేదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.  ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు సంగతి ఎంత తక్కువ చెబితే అంత మంచిది.   అందుకే మోడీ అవినీతిపై పోరాటం అంటూ ఇస్తున్న నినాదాలను ప్రజలు విశ్వసించడం మానేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కర్నాటక ఫలితం ఇదే తెల్చి చెప్పిందని అంటున్నారు. విపక్షాల మీద విమర్శలు గుప్పించే మోడీ సర్కార్ కర్నాటకలో కమిషన్ల సర్కార్ అంటూ ఎదుర్కొన్న విమర్శల గురించి మాత్రం పన్నెత్తి మాట్లాడటం లేదెందుకని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. 

ఈటలకు వై క్యాటగిరి భద్రత

మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ కు కేంద్ర బలగాల భద్రత ఏర్పాటైంది. ఆయనకు వై కేటగిరి భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు కూడా జారీ  కానున్నాయి. మంగళవారం (జూన్ 27)న ఈటల రాజేందర్, ఆయన భార్య జమున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్నాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ మీడియా సమావేశంలో ఈటల సతీమణి జమున తన భర్తకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యెక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత మెప్పు పొందేందుకు పాడి కౌశిక్ రెడ్డి తన భర్తను హత్య చేసేందుకు  ప్రణాళిక రచించారని  పాడి కౌశిక్ రెడ్డి నుండి తన భర్తకు ఈటల రాజేందర్ కు ప్రాణ హాని ఉందని  జమున ఆరోపించిన గంటల వ్యవధిలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.   తెలంగాణ బీజేపీ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు   వై కేటగిరి  భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నేడో రేపో విడుదల కానున్నాయి.  

SPEED NEWS 3

1. డ్రగ్స్ వ్యవహారంలో  అరెస్టైన సినీ నిర్మాత కేపీ చౌదరి  కాల్ లిస్ట్ లో  తన పేరు ఉందంటూ వస్తున్న వార్తలను నటి అషురెడ్డి ఖండించారు.  అయితే మీడియాలో వస్తున్న వార్తలతో రెండు రోజుల నుంచి తాను మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నానని,  తప్పుడు ప్రచారం చేయవద్దని  అషురెడ్డి అన్నారు.   2.క్రికెట్ వరల్డ్ కప్   అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5న తొలి మ్యాచ్ జరగనుండగా.. నవంబర్ 15న ఇదే వేదికపై ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈమేరకు వరల్డ్ కప్ షెడ్యూల్ ను మంగళవారం మధ్యాహ్నం ఐసీసీ విడుదల చేసింది.   3. వారాహి యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉపవాస దీక్షలో ఉన్న పవన్  అస్వస్థతకు గురి కావడంతో పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో విశ్రాంతి తీసుకుంటున్నారు.   4. మహారాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ ప్రభావం ఏ మాత్రం ఉండబోదని శివసేన ఉద్ధవ్ థాక్రే నేత, ఎంపీ సంజయ్‌రౌత్అన్నారు.  కేసీఆర్ మహారాష్ట్రలోకి వచ్చి డ్రామా చేస్తున్నారు. ఇలానే నాటకాలాడితే తెలంగాణలోనూ అధికారం కోల్పోవడం ఖాయమని రౌత్ అన్నారు.   5. ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత, బీఎస్పీ మాజీ నేత ముత్యాల సునీల్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరికకు రెడీ అయ్యారు. ఆయనకు రూట్ క్లియర్ అయ్యింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఆయన ఢిల్లీకి పయనమయ్యారు.   6. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం భోపాల్‌లోని రాణి కమలపాటి స్టేషన్ నుండి ఐదు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో రెండు రైళ్లను ప్రత్యక్షంగా ప్రారంభించగా.. మరో మూడు రైళ్లను వర్చువల్ ద్వారా ప్రారంభించారు.   7. తీను  వైసీపీకి దూరమయ్యాకే తెలుగుదేశం పార్టీ నుంచి  ఆహ్వానం అందిందని  నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పారు. ఈ రోజు నెల్లూరులో తెలుగుదేశం సమావేశంలో మాట్లాడిన ఆయన  లోకేష్ పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోందన్నారు.   8.  వైసీపీ ప్రభుత్వం పై ప్రజలు విసుగ్గా ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధిస్తుందని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులో జరిగిన తెలుగుదేశం సమావేశంలో ఆయన మాట్లాడారు.   9.తెలంగాణలో వచ్చే ఎన్నికలలో ఎంఐఎం పోటీపై ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎంఐఎంకు బలం ఉన్న అన్ని స్థానాలలోనూ అభ్యర్థులను పోటీలో నిలుపుతామన్నారు. వచ్చే ఎన్నికలలో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని అసద్ చెప్పారు.   10. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెల  4న రాష్ట్రపర్యటనకు రానున్నారు.  ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి  రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటుచేశారు.   

మూడు ప్రశ్నలు.. సమాధానం చెబితే మూడు లక్షలు!

ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి.. లక్ష రూపాయిలు తీసుకెళ్లండి.. రెండో ప్రశ్నకు జవాబు చెప్పండి.. ఇంకో లక్ష రూపాయిలు తీసుకెళ్లండి.. ముచ్చటగా మూడో ప్రశ్నకు సమాధానం చెప్పండి.. మరో లక్ష రూపాయిలు ముచ్చట పడుతూ తీసుకెళ్లండి.. ముచ్చటగా మూడు ప్రశ్నలకు ఇలా సమాధానం చెప్పి.. అలా మూడు లక్షల రూపాయిలు తీసుకు వెళ్లండంటూ... ఓ వార్తా కథనం అయితే అటు మీడియలో ఇటు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.   అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి.. లక్షాధికారి అయిపోవాలంటూ చిన్న పిల్లల నుంచి విషయ పరిజ్జానం కలిగిన మేధావులు వరకు అందరూ రంగంలోకి దిగి.. ఏమా ప్రశ్నలు.. ఏమా మూడు లక్షల రూపాయిలంటూ వాయువేగంతో ఆరా తీయడం.. అంతే వేగంతో డల్‌గా.. డైలామాలో పడిపోతుడడం మహా విశేషం. ఇంతకీ ఆబాలగోపాలాన్ని ఓ రేంజ్‌లో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఈ మూడు ప్రశ్నలు ఏమిటంటే 1) ఇంతకీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ? 2)  పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికీ పూర్తి అవుతుంది? 3) ప్రైవేటీకరణ నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించేవారు ఎవరు? అయితే ఈ మూడు ప్రశ్నలు చూసి.. ప్రపంచంలోని ప్రతీ తెలుగు వాడు అవాక్కయిపోతుండడం గమనార్హం. ఈ ప్రశ్నలు చూడాడానికి చాలా సింపిల్‌గా ఉన్నా.. చెప్పటానికి సాధ్యం కాని బేతాళ ప్రశ్నలుగా ఉన్నాయనే ఓ చర్చ   సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ మూడు ప్రశ్నలను సంధించింది  జన జాగరణ సమితి.  రాష్ట్ర విజభన జరిగి తొమ్మిదేళ్లు అయినా.. నేటికి రాష్ట్రానికి రాజధాని లేకపోవడం.. అలాగే ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం సైతం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా అయిపోవడం.. అదే విధంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరాటాలతో.. ప్రాణ త్యాగాలతో.. సాధించుకొన్న విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ.. ప్రైవేటీకరణ కార్యక్రమం వాయువేగంతో జరిగిపోతుండడం.. ఇలా విభజనతో తీవ్ర అన్యాయమై పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. మళ్లీ ఈ విధంగా వరస దెబ్బలతో విలవిల్లాడిపోతుండడంతో.. విశాఖపట్నం నగరానికి చెందిన ప్రజా సంఘం జన జాగరణ సమితి.. తనదైన శైలిలో ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఈ ప్రశ్నలు సంధించింది.    ఇక 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్రమంలో నవ్యంధ్రకు రాజధాని అమరావతి అని ప్రకటించారు. అందులో భాగంగా రాజధాని కోసం తూళ్లూరు, వెలగపూడి తదితర 29 గ్రామాలకు చెందిన రైతుల నుంచి వ్యవసాయ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వచ్ఛందంగా సేకరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం  సోమవారం ను పోలవారంగా మార్చి.. దాదాపు 70 శాతం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చంద్రబాబు హయాంలోనే పూర్తి చేశారు. అయితే  అప్పటి ప్రతిపక్ష నాయకుడు,వైసీపీ అధినేత   జగన్.. అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి   మద్దతు ప్రకటించారు.  అయితే 2019 అసెంబ్లీ ఎన్నికలు రానే వచ్చాయి. ఈ ఎన్నికల్లో  వైసీపీ పార్టీ విజయ ఢంకా మోగించడంతో... ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కారు. అధికార వికేంద్రీకరణ పేరుతో నవ్యంధ్రకు మూడు రాజధానులు ఉండాలంటూ.. అందులో ఒకటి న్యాయ రాజధానిగా కర్నూలు, కార్యనిర్వహాక రాజధానిగా విశాఖపట్నం, ఇక శాసన రాజధానిగా అమరావతి ఉండాలని ఆయన ప్రకటించారు. ఇక పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని.. రివర్స్ టెండరింగ్‌లో భాగంగా.. మరో కాంట్రాక్టర్‌కి కట్టెబెట్టిందీ జగన్ ప్రభుత్వం. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఎంతవరకు వచ్చిందంటే.. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి గారు సైతం చెప్పలేని దుస్థితి నెలకొంది. అలాంటి వేళ రాష్ట్ర పరిస్థితిపై తీవ్ర ఆందోళన చెందుతూ.. విశాఖపట్నానికి చెందిన ప్రజా సంఘం జన జాగరణ సంస్థ.. ఈ మూడు ప్రశ్నలకు ప్రజలకు సంధించింది.  మరోవైపు క్విజ్ పోటీల్లో గెలిచిన విజేతలకు ప్రముఖులు రాసిన పుస్తకాలో.. పార్కర్ పెన్నులో వగైరా వగైరా బహుమతులుగా నిర్వాహకులు అందజేస్తూ ఉంటారని... కానీ ఒక ప్రశ్నకు సమాధానం చెబితే.. లక్ష రూపాయిలు ఇస్తామనే వాళ్లు మాత్రం చాలా అరుదుగా ఉంటారని.. అలా ప్రకటిస్తే అయినా ప్రజల్లో ఓ విధమైన ఆలోచన కలుగుతోందేమోనని.. దీంతో వారి ఆలోచన తీరు మారీ.. అభివృద్ధి, దార్శనికత, నీతి, నిజాయితీ కలిగిన నేతలకు ఓటు వేసి..  వచ్చే ఎన్నికల్లో వారిని గెలిపించడం ద్వారా  రాష్ట్రం ప్రగతి పథంలో పయినిస్తుందనే ఉద్దేశంతో.. ఈ ఆలోచన చేసినట్లుగా ఉందనే ఓ చర్చ సైతం ప్రజాస్వామిక వాదుల్లో నడుస్తోంది. అదీకాక.. ఈ మూడు లక్షలు కొట్టేసే ఒకే ఒక్క మొనగాడు ఎవరు..? లేకుంటే ఒక్కో ప్రశ్నకు జవాబు చెప్పి విడి విడిగా లక్ష చొప్పున కొట్టేసే మొనగాళ్లు ఎవరు అనే చర్చ సైతం అటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు.. ఆ మొనగాడు ఎక్కడా.. ఎవరా అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అవినాష్ నన్ను కొనేయాలని చూస్తున్నాడు!

మాజీ సీఎం రాజశేఖరరెడ్డి సోదరుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యకేసులో వైసీపీ ఎంపీ, జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి పేరు గట్టిగా  వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసినా బెయిల్ పై బయటపడ్డారు కానీ చేసిన పాపం మాత్రం ఇంకా వీడలేదు. డ్రైవర్ దస్తగిరి రూపంలో వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో ఇప్పటికే సంచలన ఆరోపణలు చేసిన డ్రైవర్ దస్తగిరి తాజాగా మరోసారి అంతకి మించిన ఆరోపణలతో బయటకొచ్చారు. అది కూడా ఈ కేసులో కీలక సూత్రధారిగా చెప్పుకుంటున్న అవినాష్ రెడ్డి తనకు కొనేందుకు ప్రయత్నిస్తున్నారని.. తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని కూడా ఆరోపించాడు. దీంతో ఈ వ్యవహారం మరోసారి చర్చకు దారితీస్తుంది. వివేకా హత్యకేసులో అప్రూవర్ గా మారిన తనను వైసీపీ ఎంపి అవినాష్ రెడ్డి అనుచరులు బెదిరిస్తున్నారని దస్తగిరి తెలిపాడు. ఇదే సమయంలో తనను ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపించాలని అవినాష్ వర్గం కుట్ర పన్నుతున్నదని ఆరోపించాడు. పులివెందులలో ఓ పిల్లాడిని తాము నిర్బంధించి హింసించామంటూ తమపై తప్పుడు కేసులు పెట్టారని తెలిపాడు. ఈ మేరకు తన భార్య షబానాతో కలిసి కడప ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన దస్తగిరి.. పులివెందుల పోలీసులు తనపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆయనకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఈ కేసు గురించి సీబీఐ ఎస్పీకి కూడా సమాచారం అందించినట్లు చెప్పాడు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులపై దస్తగిరి కీలక వ్యాఖ్యలు చేశాడు. వివేకా హత్యకేసులో తనను వారితో రాజీకి రావాలని వైసీపీ నేతలు రాయబారాలు పంపుతున్నారని వ్యాఖ్యానించిన దస్తగిరి.. పెద్ద మనుషుల సమక్షంలో రాజీ చేసుకొని డబ్బులు తీసుకెళ్లాలని కోరుతున్నట్లు చెప్పారు. అయితే, తాను చావడానికైనా సిద్ధం కానీ రాజీపడే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చాడు. వివేకా హత్య కేసులో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారని చెప్పిన దస్తగిరి.. ఈ కేసులో దోషులందరికీ శిక్ష పడాల్సిందేనని కోరారు. కాగా, ఈ కేసులో ఇప్ప‌టికే సీబీఐ విచార‌ణ నెమ్మదించేలా తెర‌వెనుక కొందరు ప్ర‌య‌త్నించారని ప్రతిపక్ష పార్టీల నేతలు విమ‌ర్శ‌లు వినిపిస్తుండగా, క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేస్తామ‌ని ఆ మధ్య ప్ర‌క‌టించిన సీబీఐ ఇప్పుడు ఆయ‌న‌ను ప్ర‌తి శ‌నివారం విచారించి వదిలేయడం ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. కాగా  ఈ నెలాఖరుకల్లా ఈ కేసు ముగించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. కానీ సీబీఐ వ్యవహారం చూస్తే మాత్రం ఈ నెల కాదు వచ్చే నెల కూడా కేసును తేల్చే సూచనలు కనిపించడం లేదు. దీంతో అసలు ఈ కేసులో దోషులకు శిక్ష పడుతుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోవైపు అవినాష్ లాంటి వాళ్ళు బయటవుంటే ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేస్తారని, బెయిల్ రద్దు చేసి అవినాష్ ను అదుపులోకి తీసుకోవాలని వివేకా కుమార్తె సునీత కోర్టును కోరినా.. ఆ పిటిషన్ ను కోర్టు అత్యవసర విచారణకు తీసుకోలేదు. ఈలోగా సునీత అనుమానిస్తున్నట్లే అవినాష్ వర్గం తనను బెదిరిస్తున్నారని దస్తగిర్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో.. ఎప్పటికి తేలుతుందో చూడాలి.

SPEED NEWS 2

1. ఉప్పల్ చౌరస్తాలో స్కై వాక్ అందుబాటులోకి వచ్చింది. పాతిక కోట్లతో నిర్మించిన ఈ స్కై వాక్ ను మంత్రి కేటీఆర్ నిన్న ప్రారంభించారు. అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తా వద్ద రోడ్డు దాటేందుకు పాదచారులకు ఈ స్కైవాక్ ఎంతగానో దోహదపడుతుంది.  2. హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.   3. బహుళజాతి వ్యాపార దిగ్గజం లులు తెలంగాణ రాష్ట్రంలో  3వేల 500 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. బియ్యం సేకరణ, ఫిష్, మీట్ ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పటుతో పాటు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు పేర్కొంది.   4. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని తెలంగాణ సర్కార్ కనీస వేతన చట్టం పరిధిలోనికి తీసుకువచ్చింది. దీంతో ఈ రంగంలో  పని చేసే ఉద్యోగులు, కార్మికులకు ఇక నుంచి కనీస వేతన చట్టం పరిధిలోకి వస్తారు. ఈ మేరకు కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఉత్తర్వ్యులు జారీ చేసింది.   5. ధరణి పోర్టల్ విషయంలో బీజేపీ పూటకో మాట చెబుతోందని మంత్రి హరీష్ రావు అన్నారు. ధరణి విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని బీజేపీ అధ్యక్షుడు నడ్డా ప్రకటించడాన్ని తప్పుపట్టారు. 6.పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అటవీ ఉత్పత్తులు దోహదపడతాయని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అధ్యయనం వెల్లడించింది. పశ్చిమబెంగాల్ ఆదివాసీలు అధికంగా ఉండే ప్రాంతాలలో ఆదివాసీ మహిళల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడంలో అటవీ ఉత్పత్తులు దోహదం చేశాయని ఆ అధ్యయనం వెల్లడించింది.   7.తిరుమలలో టీకప్పుపై శిలువ గుర్తు కలకలం రేపింది. ఆ కప్పుపై టి అక్షరాన్ని శిలువగుర్తుగా ముద్రించడం వివాదానికి దారి తీసింది. భక్తుల ఫిర్యాదు మేరకు టీటీడీ అధికారులు తిరుమలలో టీ దుకాణాలలో తనిఖీలు నిర్వహించి ఓ దుకాణాన్ని సీజ్ చేశారు.  8. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను ఖతం చేస్తామంటూ గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ హెచ్చరించాడు. కెనడాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన గోల్డీబ్రార్ ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటుడు సల్మాన్ తన హిట్ లిస్ట్ లో ఉన్నట్లు పేర్కొన్నాడు.   9.అధిక పెన్షన్ దరఖాస్తు గడువును వచ్చే నెల 11 వరకూ పొడిగిస్తూ ఈపీఎఫ్ వో నిర్ణయం తీసుకుంది. ఈ దరఖాస్తు గడువును పొడగించడం ఇది మూడో సారి. ఇదే చివరి అవకాశమని ఈపీఎప్ వో సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.   10. మణిపూర్ లో జరుగుతున్న హింసాకాండపై ప్రధాని మోడీ మౌనం వీడాలని కాంగ్రెస్ అధ్యక్షడు మల్లి కార్జున్ ఖర్గే అన్నారు. అలాగే హింసాకాండను అదుపుచేయడంలో విఫలమైన మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. 

అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి ఒకే.. కేంద్రం తీరే వేరులే!

ఏపీ రాజధాని అమరావతి విషయంలో రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ స్టాండ్ క్లియర్ కట్ గా ఉంటుంది. రాజధానిగా అమరావతి ఉండేందుకు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డికి సుతరామూ ఇష్టం లేదు. సీఎంగా జగన్ మోహన్ రెడ్డి అమరావతిని అభివృద్ధి చేసినా రాజధాని క్రెడిట్ మాత్రం పునాది రాయి వేసిన చంద్రబాబుకే దక్కుతుంది. ముందు ముందు తరాలు అమరావతి చరిత్ర తీస్తే ముందు పేరు చంద్రబాబుదే వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డికి అసలు ఇష్టం లేదు. అందుకే సవాలక్ష కారణాలు చెప్పి అమరావతిని నాశనం చేస్తున్నారు. వైసీపీ నేతలు సైతం అమరావతి రాజధానిగా ఒప్పుకునే పరిస్థితిలో  లేరు. కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా.. అమరావతి రైతులు తమ బాధ ఎన్ని రకాలుగా విన్నవించుకున్నా దున్నపోతు మీద వాన మాదిరి ప్రభుత్వంలో అసలు చలనమే లేదు. అయితే  ఏపీ రాజధానిగా అమరావతి అంశంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స్టాండ్ ఏంటన్నది మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు. ఒకవైపు రాజధానిగా అమరావతే ఉండాలని.. అది కూడా ఏకైక రాజధాని అమరావతి మాత్రమే అంటూ బీజేపీ నేతలు ఘంటాపదంగా చెప్తారు. కానీ, అమరావతిని నాశనం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతి కోరినా కేంద్ర ప్రభుత్వం అడిగిన వెంటనే చేసేస్తారు. మా స్టాండ్, మా ఓటు అమరావతికి అంటూనే.. రాజధాని అమరావతి కాకుండా చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి సాయం చేస్తారు. దీంతో బీజేపీ ప్రభుత్వం ఆడే ఈ డబుల్ గేమ్ రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకి దారితీస్తున్నది. ఇప్పటికే పలుమార్పు బీజేపీ ఇలాంటి డబుల్ గేమ్ ఆడుతూ ఏపీ ప్రజలలో చులకన కాగా.. ఇప్పుడు అలాంటిదే మరోసారి తెరమీదకి వచ్చింది. రాజధాని అమరావతిని చంద్రబాబు తరతరాలకు సంపద సృష్టించే వరల్డ్ క్లాస్ సిటీగా నిర్మించాలనుకుని ఇప్పటికే అక్కడ అందుకు తగిన ప్రాథమిక సౌకర్యాల కల్పన కూడా చేశారు. అయితే జగన్ సర్కార్ ఇప్పుడు అక్కడ పరిపాలనా భవనాలను కాకుండా నివాస గృహాలను నిర్మించాలని, అది కూడా రాజధానేతర  ప్రాంతాల వారికి ఇళ్లను నిర్మించాలని భావిస్తున్నది. ముందుగా ఆర్ 5 జోన్ లో ఈ ఇళ్లకు స్థలాల పట్టాలు ఇస్తూ జీవో కూడా జారీచేసింది. అయితే  ప్రస్తుతం ఈ అనుమతుల వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉండగా ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకూ వెళ్ళింది. జగన్ ప్రభుత్వం ఇచ్చే పట్టాలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని.. తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రత్యేక ప్రయోజనాలు కోరే హక్కు లబ్థిదారులకు ఉండదని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టు పరిధిలో ఉన్న ఈ గృహాల నిర్మాణ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కేంద్రాన్ని అనుమతి కోరగా.. కేంద్రం కూడా రాష్ట్రం అడిగిన వెంటనే అనుమతులు ఇచ్చేసింది. ఆర్ 5 జోన్ లో కట్టాలని భావిస్తున్న 47 వేల ఇళ్లకు కేంద్రంలోని సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ భేటీలో అనుమతులు ఇస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. అమరావతిలో ఇప్పటికే రాజధానేతరులైన 50793 మందికి ఇళ్ల పట్టాల్ని పంపిణీ చేయగా.. వీరిలో 47 వేల మందికి కేంద్రం ఇళ్లు మంజూరుకి అనుమతిచ్చింది. మిగిలిన ఇళ్ల నిర్మాణానికి కూడా తదుపరి సమావేశంలో అనుమతులు ఇస్తామని పేర్కొంది. కేంద్రం నుంచి అనుమతులు లభించడంతో ఏపీ ప్రభుత్వం జులై 8న గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టనుంది. ఈ మొత్తం వ్యవహరాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం నెల వ్యవధిలోనే పూర్తి చేయటం ఆసక్తికరం. మరి  రాజధాని అంశంలో వైఖరి ఏంటో బీజేపి ఇప్పటికైనా స్పష్టంగా చెప్పాలని అమరావతి ప్రాంత వాసులు కోరుతున్నారు.

speed news

1.బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కుమార్తె తుల్జా భవానీపై  రాజుభాయ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  తన తండ్రే రాజు భాయ్ తో తనపై కేసు పెట్టించారని భవాని ఆరోపిస్తున్నారు. 2.  ఇకపై అమెరికాలోని న్యూయార్క్‌లోనూ పాఠశాలలకు దీపావళి సెలవు ఇవ్వనున్నట్లు నగర మేయర్  ప్రకటించారు. అయితే ఈ సెలవు వచ్చే ఏడాది నుంచి అమలులోకి వస్తుంది.  3. జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ చ10 లక్షల మంది సబ్ స్క్రైబర్లను  సాధించింది. ఈ విషయాన్ని జనసేన అధికారికంగా ప్రకటించింది.   4.తెలంగాణ కాంగ్రెస్ లో ఓ వైపు జోష్, మరో వైపు అసమ్మతి సమాంతరంగా కనిపిస్తున్నాయి. తాజాగా  పార్టీ వ్యవహారాలలో అనేక లోపాలు ఉన్నాయని, వాటి గురించి రాహుల్ కు చెబుతాననీ  ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. 5. విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు కిడ్నాప్ ఉదంతంతో మంత్రి అమర్నాథ్ కు చెమటలు పడుతున్నాయి. ఆయన తాజాగా గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 6. నైరుతి రుతుపవనాల  ఆలస్యం, వర్షాభావ పరిస్థితుల కారణంగా టమాటా ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. కిలో టమాటా వంద రూపాయలకు చేరువైంది.  (టమాటా) 7. ఉత్తరప్రదేశ్‌ లో  తుపాకీ పేలింది. డజనుకు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న మోస్ట్ వాంటెడ్‌ క్రిమినల్‌ గుఫ్రాన్‌  ఈ రోజు ఉదయం  ఎన్‌కౌంటర్‌ హతమయ్యాడు. (ఎన్ కౌంటర్) 8. తెలంగాణ కాంగ్రెస్ లో నయా జోష్ కనిపిస్తోంది. పొంగులేటి, జూపల్లి సహా 35 మంది నేతలు  నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకోగా, ఈ రోజు  ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై స్ట్రాటజీ మీటింగ్ జరిగింది. 9.తెలంగాణ సీఎం కేసీఆర్  మ‌హారాష్ట్ర‌ పండ‌రీపుర్ లోని  విఠోభ రుక్మిణి ఆల‌యాన్ని ద‌ర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ‌వ్యాప్తంగా రైతులు అంతా క్షేమంగా ఉండాల‌ని ఆయ‌న ప్రార్ధించారు.   10.  రాజ్యసభ మాజీ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి  కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు.  70 ఏళ్ల పాటు రాజకీయాలలో క్రియాశీలంగా పనిచేసి మచ్చలేని నేతగా పేరుపొందిన రామచంద్రారెడ్డి మరణం పూడ్చలేని లోటని సీఎం కేసీఆర్ సంతాప సందేశంలో పేర్కొన్నారు. 

మొన్న ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్.. నేడు మంత్రి గన్ లైసెన్స్ అర్జీ !

ఏపీలో అసలు సామాన్య ప్రజలకు రక్షణ ఉందా అంటే లేదని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. అందుకు వైసీపీ నేతల దారుణ పరిస్థితే ఉదాహరణగా కూడా చెప్పొచ్చు. రాష్ట్రంలో దోపిడీలు, అమలు కానీ చట్టాలు, అఘాయిత్యాలు, అక్రమాలు, దౌర్జన్యాలు ఇవన్నీ ప్రతిపక్షాల ఆరోపణలని ప్రభుత్వం కొట్టిపారేసినా సాక్షాత్తు ప్రభుత్వంలో ఉన్న వైసీపీ నేతలు అందునా ఎమ్మెల్యేలు, ఎంపీలకు రక్షణ లేకపోవడాన్ని ప్రభుత్వం సమర్ధించుకోలేకపోతుంది. ఈ మధ్యనే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుతోపాటు, ఎంపీ ఎంవీవీ భార్య, కుమారుడు కిడ్నాప్ కు గురయ్యారు. జీవీ వృత్తిరీత్యా ఆడిటర్‌.. వైసీపీ నేతగా కూడా ఉన్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ముందుగా ఎంపీ కుటుంబాన్ని అపహరించిన కిడ్నాపర్లు రూ.50కోట్లు డిమాండ్ చేస్తూ ఆడిటర్ జీవీకి ఫోన్ చేశారు. ఆ తర్వాత ఆయన కూడా కనిపించలేదు. రిషికొండలోని ఎంపీ ఇంట్లోకి దూరిన దుండగులు కుటుంబసభ్యులను కిడ్నాప్ చేశారు. ఉదయం 6-7 గంటల మధ్య ఈ ఘటన జరగగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు. ముందుగా దుండగులు సీతమ్మధారలో ఉన్న జీవీకి ఎంపీ భార్యతో ఫోన్ చేయించారు. ఆయన వచ్చాక ముగ్గురిని అపహరించారు. అప్పుడు ఈ వ్యవహారంపై స్పందించిన ఎంపీ సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం ఈ కిడ్నాప్ జరిగిందన్న ఎంపీ ఇకపై విశాఖలో ఉండలేనని హైదరాబాద్ కు తన కుటుంబంతో సహా షిఫ్ట్ అవుతున్నట్లు కూడా చెప్పారు. విశాఖలో ప్రజలు సంతోషంగానే ఉన్నా తనకు ఇకపై విశాఖలో ఉండాలని లేదని చెప్పారు. ఈ సంఘటన రాజకీయాలలో కలకలం రేపితే రాష్ట్ర ప్రజలలో ఆందోళన మొదలైంది. ఒక ఎంపీ తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన వారిని తేల్చాలని, ఏకంగా సిబిఐ దర్యాప్తు కోరడం అంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ పై నమ్మకం లేనట్లే అవుతుంది. ఒక ఎంపీకి ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటన్నదానిపై రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. కాగా, ఇప్పుడు వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్ గన్ లైసెన్స్ కావాలని పోలీస్ శాఖకు దరఖాస్తు చేసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఎప్పుడూ అంటి పెట్టుకొని ఉండే గన్ మెన్లు, ఇంటి చుట్టూ మూడంచెల భద్రత ఉండే ఒక మంత్రి ఒక గన్ లైసెన్స్ కావాలని అర్జీ పెట్టుకున్నారంటే.. తనకి తన ఇంట్లో కూడా ఆత్మ రక్షణ భయం పట్టుకుందని భావించాలి. ఇదే ఇప్పుడు విశాఖలో అతి పెద్ద చర్చకు దారితీస్తోంది. ఎంపీలు, మంత్రులు తమకి ఆత్మ రక్షణ కోసం, తన భద్రత కోసం గన్ లైసెన్సులు కోరితే సామాన్యుల పరిస్థితి ఏంటి అన్నది కూడా అందరిలో మెదులుతున్న సందేహంగా ఉంది. ఎంవీవీ ఫ్యామిలీ కిడ్నాప్ ఉదంతం తరువాత గుడివాడ అమర్నాధ్ కూడా అలెర్ట్ అయినట్లుగా ఇది కనిపిస్తుంది. ఈ రెండు ఉదంతాలను చూస్తే విశాఖలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? వైసీపీ ప్రభుత్వం రాజధాని బూచి చూపించి విశాఖ నగరాన్ని ఏ విధంగా దోచుకుంటుందో.. వైసీపీ ప్రభుత్వం అక్కడ ప్రజల ప్రశాంతతను ఎంతగా నాశనం చేసారో స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు రుషికొండ లాంటి వాటిని పిండి చేసేసిన జగన్ ప్రభుత్వం, రాజధాని పేరుతో నగరంలో భారీ ఎత్తున అక్రమ రియల్టర్లను పెంచి పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే విశాఖ నగరంలో అరాచకాలు పెరిగిపోయి ఇప్పుడు సాక్షాత్తు ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకే వణుకు మొదలయ్యే స్థాయికి చేరింది. మరి ఇక ఇది ఇంకెంత దారుణ పరిస్థితులకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.

కేసీఆర్‌కు గులాబీ ముళ్లు గుచ్చుకుంటున్నాయా?

తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల నగరా మరికొద్ది నెలల్లో మోగనుంది. అందులోభాగంగా అన్ని పార్టీల నేతల్లో హడావుడి మొదలైంది. ఆ క్రమంలో అధికార బీఆర్ఎస్  నేతలు  ఓ రేంజ్‌లో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.  ఇప్పటికే వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ను ముచ్చటగా మూడోసారి కూడా అధికార పీఠం ఎక్కించేందుకు బీఆర్ఎస్  శ్రేణులు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.  అయితే ఆ కంగారులో పార్టీ శ్రేణులు ఏం చేస్తున్నాయో వారికే అర్థం కానీ పరిస్థితి  నెలకొందనే  చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోమవారం (జూన్ 26) ఉప్పల్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్కైవాక్‌ను ప్రారంభించారు.  అయితే కేటీఆర్ ఉప్పల్ వస్తున్న సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పరిశ్రమలు మరియు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం - సుస్వాగతం అంటూ ముద్రించారు. కాగా   ఈ ఫ్లెక్సీలను సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేయడంతో..  ప్రజలతోపాటు గులాబీ పార్టీ శ్రేణులు సైతం ఒక్కసారిగా ఉలిక్కిపడి..  అవాక్కవుతోన్నాయి. సదరు శాఖల మంత్రి కేటీఆర్ అయితే కేసీఆర్ అని రాశారంటూ చర్చకు తెర తీశాయి.     ఆ ఫ్లెక్సీలను అటు ఉప్పల్‌లోని పార్టీ శ్రేణులు కానీ.. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుబాష్ రెడ్డి కానీ.. స్థానిక మున్సిపల్ సిబ్బంది కానీ పట్టించుకోక పోవడం గమనార్హం. దీంతో దొరికిందే సందు అన్నట్లుగా నెటిజన్లు గులాబీ శ్రేణులపై సెటైర్లతో ఓ ఆటాడుకుంటున్నారు. కేబినెట్లో ఎంత మంది మంత్రులు ఉన్నా.. కేటీఆర్ ఒక్కరే అన్నట్లుగా అంతా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని  వారు వ్యక్తం చేస్తున్నారు. బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటూ గొంతు చించుకోవడం కాదని.. నగరంలో సామాన్య ప్రజలు పడుతోన్న వెతలను గుర్తించాలని వారు కారు బీఆర్ఎస్ నేతలను ప్రశ్నిస్తున్నారు. మహానగరంలో రాత్రి పది గంటలు దాటితే.. పలు ప్రాంతాలకు కనీస బస్సు సౌకర్యం కూడా లేకపోవడంతో.. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతోన్నారని అంటున్నారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్న హైదరాబాద్ కంటే..  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న హైదరాబాద్ మహా నగరం బాగుందని అభిప్రాయపడుతోన్నారు. నగరంలో ట్రాపిక్ సమస్య నేటికీ తీరలేదని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తమది ప్రజా ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం అంటూ గొంతులు చించుకోవడం కాదని.. ప్రజలకు ఏం కావాలో తెలుసుకోని వాటిని అమల్లో ఉంచితే సరిపోతోందని నెటిజన్లు.. ఈ సందర్బ:గా గలాబీ నేతలకు చురకలంటిస్తున్నారు. అంతేకాదు.. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే కాదు.... ప్రభుత్వంలోని  లోపాలను ఎవరైనా బహిరంగంగా విమర్శించినా.. వారిపై బలవంతంగా కేసులు నమోదు చేయించి.. తమ కసి తీర్చుకొనే సర్కార్‌కు ప్రజల గోడు ఏ మాత్రం పడుతుందనే సందేహాన్ని సైతం నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.

సీన్ అర్థమైందా?

వరుసగా ముచ్చటగా మూడోసారి నెల్లూరు నగర ఎమ్మెల్యేగా గెలుపొందాలని ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ ఆశ పడుతోన్నారు. అయితే ఆయన ఆశలపై జగనన్న చల్లని పెన్నా నది నీళ్లు చల్లారనే ఓ చర్చ  నెల్లూరు నగరంలో ఊపందుకొంది.  జూన్ 21వ తేదీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 18 మంది ఎమ్మెల్యేలు చాలా డల్‌గా ఉన్నారని.. కష్టపడాలని.. లేకుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్లు రావనీ.. అలాగే టికెట్లు ఇచ్చేది కూడా తాను కాదంటూ పార్టీ అధినేత వైయస్ జగన్ ఈ సందర్బంగా క్లియర్‌ కట్‌గా పార్టీ ఎమ్మెల్యేలకు ఓ క్లారిటీ   ఇచ్చేశారని.. అయితే ఈ సమావేశం జరిగిన 48గంటల్లోనే  అనిల్ కుమార్ యాదవ్.. నెల్లూరులో పార్టీ శ్రేణులకు ఉద్దేశించి మాట్లాడారని... ఆ క్రమంలో ఆయన మాట్లాడిన మాటలను తరచి తరచి చూస్తే.. ఓ విధమైన మూడ్ ఆఫ్‌లో ఆయన ఉన్నారనే ఓ టాక్  వైరల్ అవుతోంది.     అంతేకాదు సీఎం జగన్ చెప్పిన 18 మంది డల్ ఎమ్మెల్యేల్లో అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారనే వార్త సైతం నెల్లూరు నియోజకవర్గంలో చల్ చల్ గుర్రం చలాకీ గుర్రం అన్నట్లుగా హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయం తెలిసిన అనిల్.. తీవ్రంగా హర్ట్ అయి బుంగమూతి పెట్టుకొన్నారని తెలుస్తోంది.  అదీకాక ఆయన సొంత బాబాయి, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ స్థానికంగా వైసీపీ కోసం సొంత బిల్డింగ్ కట్టి దానికి జగనన్న భవనం అంటూ నామకరణం చేయడమే కాకుండా.. గతంలో అనిల్‌కి చేదోడు వాదోడుగా ఉన్న వారందరిని.. ఆయస్కాంతం ఆకర్షించినట్లు ఆకర్షించేయడం ద్వారా అబ్బాయికి గట్టిగానే  హ్యాండ్ ఇచ్చేశారని... దీంతో  నియోజకవర్గంలో అనిల్ ఒంటరిగా మిగిలిపోయారనే ఓ చర్చ   వాడి వేడిగా  సాగుతోంది.  మరోవైపు అనిల్‌ కుమార్ యాదవ్‌ను పక్కన పెట్టి.. ఆయన బాబాయి రూప్ కుమార్‌తో నెల్లూరు జిల్లాలో రాజకీయ చక్రం తిప్పించాలనే ఓ పదునైన వ్యూహంతో పార్టీ అధినేత, సీఎం  జగన్ ఆలోచనతో ఉన్నట్లు.. ఆ క్రమంలో   ప్రణాళిక బద్దంగా వ్యూహాత్మకంగా  ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు మంత్రిగా ఉన్న సమయంలో అనిల్ చాలా చాలా ఎక్స్ ట్రాలు చేశారని.. ఆ క్రమంలో అనిల్‌కు కట్టబెట్టిన భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా కాకుండా బూతుల నోటి పారుదల శాఖ మంత్రిగా ఇమేజ్   సంపాదించారని.. ఈ నేపథ్యంలో రూప్ కుమార్‌ను తెరపైకి తీసుకు వస్తున్నట్లు చర్చ సైతం నడుస్తోంది. అదీకాక జగన్ ప్రభుత్వంపై నెల్లూరు పెద్దారెడ్లు అసమ్మతి గళం వినిపిస్తుండడంతో..  వచ్చే ఎన్నికల్లో జిల్లాలో గెలుపు అంత ఈజీ కాదనే విషయం వైయస్ జగన్‌కు పక్కాగా అర్థమైందని.. దీంతో అబ్బాయిని పక్కన పెట్టి బాబాయికి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నగర ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా.. ఆశ్చర్య పోనక్కర్లేదనే ఓ చర్చ సైతం కొనసాగుతోంది. ఇంకోవైపు అనిల్ ఒంటరి అయిపోయినట్లు.. ఇప్పటికే సర్వే నివేదికలు సీఎం జగన్ టేబుల్‌పైకి చేరినట్లు తెలుస్తోంది.  ఇక అనిల్ కుమార్ యాదవ్‌కి మంత్రి పదవి హుళక్కి అయిన తర్వాత.. చాలా చాలా కామ్ అయిపోయారని.. కానీ అనిల్ మంత్రిగా ఉన్న సమయంలో సహచర మంత్రులుగా ఉన్న నాని బ్రదర్స్‌కు పదవి లేకపోయినా.. బూస్ట్ తాగినట్లు నిత్యం యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉంటారని  ఈ నేపథ్యంలో ప్రస్తుత నెల్లూరు నగర ఎమ్మెల్యే వ్యవహారంలో సీఎం జగన్ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఓ చర్చ సైతం కొన.. సాగుతోంది.  అందుకే నెల్లూరులో మళ్లీ తన సత్తా చాటాలని అనిల్ కుమార్ యాదవ్ ప్రణాళికలు సిద్దం చేసుకొంటున్నారు. అందులోభాగంగా త్వరలో ఓ భారీ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని.. దీనికి తన హితులు, సన్నిహితులు, పరిచయస్తులను పిలవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరి అనిల్ ఆహ్వానాన్ని మన్నించి.. దూరమైన వారంతా మళ్లీ దగ్గరకు.. అంటే ఆత్మీయ సమావేశానికి వస్తారా? అంటే సందేహమే అనే చర్చ సైతం నడుస్తోంది.    ఇంకోవైపు గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు పది స్థానాలు గెలుచుకొన్న ఫ్యాన్ పార్టీకి నేడు ఆ పరిస్థితి లేకపోవడంతో ... సీఎం జగన్ చాలా పకడ్బందీగా వ్యూహా రచనకు శ్రీకారం చేసినట్లు ఓ టాక్ అయితే స్థానికంగా హల్‌చల్ చేస్తోంది.

టీడీపీ జనసేనకు ఇచ్చే సీట్లివేనా?

ఏపీలో ప్రతిపక్షాల పొత్తు దాదాపుగా ఖరారైంది. తానే సీఎం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కాస్త ఈ అంశంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినా ఆయన మనసులో ఉన్నది మాత్రం టీడీపీతో పొత్తుగా ఎన్నికలకు వెళ్లడమే. ఇదే విషయాన్ని ఆయన రెండేళ్లుగా చెప్తూనే ఉన్నారు. ఇప్పుడూ అదే మాట చెప్తున్నారు. అయితే, ఇప్పటికే బీజేపీతో జనసేన పొత్తులో ఉండగా.. ఇద్దరూ టీడీపీతో కలిసి వెళ్తారా అనే అంశంలో కాస్త క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఈసారి ఎన్నికలకు పొత్తులు ఖరారైనట్లే కనిపిస్తుంది. పొత్తులు మాత్రమే కాదు జనసేనకు టీడీపీ కేటాయించే సీట్లు కూడా ఇవే అంటూ రెండు పార్టీలతో పాటు రాజకీయ వర్గాలలో కూడా ప్రచారం జరుగుతుంది. దానికి కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహీ యాత్ర రూట్ మ్యాప్. పొత్తులో జనసేనకి కేటాయించే సీట్లలోనే ప్రస్తుతం పవన్ యాత్ర కొనసాగిస్తున్నట్లు కనిపిస్తుంది. టీడీపీ-జనసేన పొత్తులలో జనసేనకి 25 నుండి 30 స్థానాలను కేటాయించే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల సమాచారం కాగా బీజేపీ కూడా కలిసి వస్తే దానిని బట్టి ఈ సంఖ్య ఖరారు అయ్యే ఛాన్స్ ఉంటుంది. బీజేపీ పొత్తులో ఉంటే ఐదు స్థానాలను కేటాయించే అవకాశం ఉండగా జనసేనకి 25 స్థానాలను కేటాయిచనున్నారు. ఇక పొత్తులో ప్రధాన పార్టీ టీడీపీ ఎటు తిరిగి 140 స్థానాలకు పైగా పోటీ చేయాలని నిర్ణయించుకోగా.. ఈ 140 స్థానాలలో కూడా అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ పైనే స్థానాలను గెలుచుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. తాము 88 స్థానాలపైనే విజయం సాధిస్తామని టీడీపీ నేతలు బాహాటకంగానే చెప్పుకుంటున్నారు. ఇక, జనసేనకి కేటాయించే సీట్ల విషయానికి వస్తే కాపు సామజిక వర్గం అధికంగా ఉండే ప్రాంతాలలో ఎక్కువ శాతం సీట్లను కేటాయించనున్నారు. వీటిలో ఉత్తరాంధ్ర నుండి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక్కో స్థానంతో పాటు విశాఖలో రెండు స్థానాలను కేటాయించనున్నారు. విశాఖ జిల్లాలో చూస్తే గాజువాక, మాడుగుల స్థానాలలో జనసేన ఇప్పటికే ప్రచారం కూడా మొదలు పెట్టింది. ఇక, ఉభయ గోదావరి జిల్లాలలో ఎక్కువ శాతం స్థానాలను జనసేన దక్కించుకునే అవకాశం ఉంది. ఈ జిల్లాలలో పిఠాపురం, కాకినాడ రూరల్, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం, నర్సాపురం, తాడేపల్లి గూడెం, భీమవరం, నిడదవోలు జనసేనకు దక్కనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక మిగతా రాష్ట్రానికి వస్తే.. కోస్తా ప్రాంతంలో కృష్ణా జిల్లా అవనిగడ్డ, పెడన, కైకలూరు, విజయవాడ వెస్ట్ సీట్లు జనసేనకే ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైందని చెప్తున్నారు. అలాగే గుంటూరు జిల్లాలో తెనాలి, గుంటూరు పశ్చిమ సీట్లను జనసేన కోరుతుండగా టీడీపీ ఈ స్థానాలలో ఇంకా తేల్చుకోలేకపోతుంది. అయితే, ప్రత్తిపాడు సీటు జనసేనకు ఇచ్చేందుకు సిద్ధమైంది. అలాగే ప్రకాశం జిల్లా నుండి దర్శి, నెల్లూరు నుండి నెల్లూరు సిటీ, చిత్తూరు జిల్లా నుండి తిరుపతి, కడప నుండి రాజంపేట సీట్లను కూడా జనసేన దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇవి కాకుండా మరో నాలుగైదు స్థానాలను కూడా జనసేన పట్టుబడుతోండగా.. ఆయా స్థానాలను టీడీపీ వదులుకునేందుకు తటపటాయిస్తుంది. మొత్తంగా రెండు పార్టీల మధ్య 25 నుండి 30 స్థానాలకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తుంది. ఈ అసెంబ్లీ స్థానాలతో పాటు మూడు ఎంపీ సీట్లు కూడా జనసేనకి ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని అంటున్నారు. జనసేనకి కేటాయించిన ఎంపీ స్థానాలు కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నంగా తెలుస్తుంది.

ఎన్టీఆర్ అభిమాని కోసం ఏకమైన అందరు హీరోల అభిమానులు!

ఒక జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మృతి అందరు హీరోల అభిమానులను ఏకం చేసింది. అలాగే తెలుగుదేశం నేతలు కూడా ఆ అభిమానికి మద్దతుగా గళం విప్పారు. శ్యామ్ అనే ఎన్టీఆర్ అనే అభిమాని మరణం పట్ల అతనికి, అతని కుటుంబానికి న్యాయం జరగాలంటూ అందరు హీరోల అభిమానులు ఏకమై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా శ్యామ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.  తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 23 ఏళ్ల శ్యామ్ ఎన్టీఆర్ కి వీరాభిమాని. ఎన్టీఆర్ సినిమా విడుదలైనా, ఈవెంట్ జరిగినా హంగామా చేసే శ్యామ్ ఎందరికో సుపరిచితం. అయితే ఉన్నట్టుండి అతను ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త అందరినీ బాధ పెట్టింది. మొదట అందరూ ఆత్మహత్యగానే భావించారు. కానీ అది ఆత్మహత్య కాదని, హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే అనుమానం రావడంతో అభిమానులు పోరాటానికి దిగారు. #WeWantJusticeForShyamNTR అనే హ్యాష్ ట్యాగ్ ని నేషనల్ వైడ్ గా ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.   ప్రేమ వ్యవహారంలో శ్యామ్ ని హత్య చేసి, రాజకీయ అండదండలతో దానిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు. జాబ్ లేదని శ్యామ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతుండటాన్ని వారు ఖండిస్తున్నారు. జాబ్ గురించి ఇంట్లో ఎలాంటి ఒత్తిడి లేదని, అలాంటప్పుడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడని నిలదీస్తున్నారు. అతని మెడ మీద ఉరి వేసుకున్నట్టు ఎలాంటి ఆనవాళ్లు లేవని, పైగా అతని ఒంటిమీద తీవ్ర గాయాలు ఉన్నాయని.. అలాంటప్పుడు దీనిని ఆత్మహత్య అని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై పోరాడటానికి శ్యామ్ కుటుంబసభ్యులు భయపడుతున్నారని, సినీ రాజకీయ ప్రముఖులు వారికి అండగా నిలిచి న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయంపై టాలీవుడ్ హీరోల అభిమానులతో పాటు ఇతర భాషలకు చెందిన హీరోల అభిమానులు కూడా తమ గళాన్ని వినిపిస్తున్నారు. 

వీహెచ్ ఇంత మాట అనేశారేంటి!

ఈ మధ్య కాలంలో మారుతున్న తెలుగు రాజకీయాలలో ప్రాముఖ్యంగా వినిపిస్తున్న కొన్ని పేర్లలో వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల కూడా ఒకరు. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పేరుతో రాజకీయ పార్టీ పెట్టి అప్పుడు సంచలనం రేపగా.. అప్పటి నుండి యాత్రల, ధర్నాలు, నిరసనలు చేపట్టి ఏదో ఒక విధంగా తన పార్టీకి గుర్తింపు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎన్ని చేసినా పార్టీకి మైలేజీ దక్కకపోవడంతో ఇప్పుడిక ఆమె పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారని కొద్ది రోజులుగా తీవ్ర ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చలు కూడా పూర్తి కాగా త్వరలోనే ఆమె పార్టీని విలీనం చేయడం ఒక్కటే బ్యాలెన్స్ అని కూడా చెప్పుకుంటున్నారు.  అటువంటిదేమీ లేదని షర్మిల స్వయంగా ఖండించినా ఆ ప్రచారం ఆగడం లేదు. ఆమె ఖండన అశ్వత్థామ హత: కుంజరహ: చందంగా ఉందని పరిశీలకులు  సైతం విశ్లేషిస్తున్నారు.  అయితే, కాంగ్రెస్  సీనియర్ నేత, షర్మిల తండ్రి వైఎస్ఆర్ తో మంచి అనుబంధం ఉన్న నేత, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కురు వృద్ధుడైన వీ హనుమంతరావు మాత్రం షర్మిలను పూచిక పుల్ల లెక్కన మాట్లాడేశారు. “ష‌ర్మిల లేదు.. గిర్మిల లేదు.. పోవాయ్.. గామెను ఏపీలోకి పొమ్మ‌ను.. అక్క‌డ బాగుంట‌ది”అని వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందుగా ష‌ర్మిల ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌న్న వీహెచ్ ఇటీవ‌ల కాలంలో పేప‌ర్ల‌లో ఎవ‌రో ఏదో రాస్తున్నార‌ని.. మీడియా ప్ర‌తినిధులు వైఎస్ కుమార్తె అని గుర్తు చేయ‌డంతో.. “`ఆ.. ఆ.. ఆమెనా.. వైఎస్ కూతురా?” అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్న విషయం తనకు తెలియదన్న ఆయన అయినా ఆమెకి తెలంగాణలో కంటే ఏపీలో ఉంటేనే ఉపయోగమని సూచించారు. “గిక్క‌డ ఆమెకు బోన‌మెత్తుట తెల్సా.. తెలంగాణ యాస తెలుసా? బాస తెలుసా?.. గేం చూసి ఆమె రాజ‌కీయం చేస్త‌ది. మాకు అవ‌స‌రం లేదు. ఆమె వ‌స్తానంటే.. ఎవ‌రు మాత్రం రానిస్త‌రు” అని ఆమెని సీమ బిడ్డగానే వీహెచ్ మాట్లాడారు. ఒకవైపు షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకురావాలని పలువురు పెద్దలు సంప్రదింపులు జరుపుతున్న వేళ వీహెచ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. కర్ణాటక ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు కథనాలొస్తున్నాయి. డీకే శివకుమార్ వైఎస్ఆర్ హయం నుండే ఆ కుటుంబంతో మంచి అనుబంధం ఉన్న కారణంగా ఇప్పటికే షర్మిలతో రెండు మూడు సార్లు సంప్రదింపుల కూడా జరిపినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ముందుగా పొంగులేటి, జూపల్లి లాంటి నేతల చేరికల అనంతరం షర్మిల విలీనం కూడా ఉంటుందని కాంగ్రెస్ క్యాడర్ కూడా బలంగా నమ్ముతున్న వేళ వీహెచ్ ఇలా షర్మిల లేదు గిర్మిల లేదు అంటూ వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది. షర్మిల గనుక తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే ఆమెని రాజ్యసభకు కూడా నామినేట్ చేసేందుకు  సిద్ధంగా ఉన్నట్లు అధిష్టానం హామీ ఇచ్చిందని కూడా తాజాగా కథనాలొస్తున్నాయి. అది కూడా కర్నాటక కోటాలోనే డీకే ఆధ్వర్యంలోనే షర్మిలను రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని షర్మిల పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే, షర్మిలను తెలంగాణ రాజకీయాలలోనే ఉంచుతారా? ఏపీ రాజకీయాలకు పంపిస్తారా అనే చర్చలు కూడా సాగిపోతుండగా.. వీహెచ్ ఇలా షర్మిల తెలంగాణ రాజకీయాలకు అవసరం లేదని.. ఆమెకి అసలు తెలంగాణ గురించి ఏం తెలుసంటూ ఎద్దేవా చేయడం ఇప్పడు మరో చర్చకు దారి తీసింది. మరి ఇంతకీ షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా? చేస్తే ఏపీకా? తెలంగాణకా? ఏమో చూద్దాం!

వైసీపీ నుంచి కౌంటర్లు కరువు.. తత్వం బోధపడిందా?!

ఆ మధ్య విజయవాడ శివారు పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌ లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరై ఎన్టీఆర్ కుటుంబం, చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మంచితనం, కష్టపడే తత్వం, ఆయన ఛరిష్మా గురించి నాలుగు ముక్కలు మాట్లాడారు. అంతే మంత్రుల నుండి వైసీపీ ఎమ్మెల్యేల వరకు అందరూ రజనీకాంత్ ను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు. కొడాలి నాని, మంత్రి రోజా లాంటి వాళ్ళైతే అసలు రజనీకాంత్ అనే వ్యక్తి తమిళనాడులో సూపర్ స్టార్ ఏమో కానీ.. ఏపీలో మాత్రం జీరో అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో రజని అభిమానులు వైసీపీ నేతలను ఓ రేంజిలో ఆట ఆడేసుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఊసే లేకుండా చంద్రబాబు మంచోడు, కష్టజీవి అని మాట్లాడినా అంతగా రెచ్చిపోయి విమర్శలు చేసిన ఆ బ్యాచ్ అంతా.. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డిపై రోజూ పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నా రివర్స్ కౌంటర్లు కరువయ్యాయి. దీంతో ఏపీ రాజకీయాలలో ఇప్పుడు ఇదే చర్చ మొదలైంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను చేపట్టిన వారాహీ యాత్రలో జగన్ మోహన్ రెడ్డిపైనా, ఆయన ప్రభుత్వ పాలనపైనా రోజూ విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే.. మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకూ పేరు పేరునా పవన్ కడిగి పారేస్తున్నారు. అయినా వైసీపీ నేతల నుండి కౌంటర్ రెస్పాన్స్ రావడం లేదు. పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపైనే నేరుగా విమర్శలు చేస్తున్నారు. ఏ నియోజకవర్గానికి వెళ్తే అక్కడి ఇష్యూస్‌ పై ఆయన లేవనెత్తే అంశాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. అయినా, వైసీపీ నుంచి కౌంటర్లు కరవవుతున్నాయి. గతంలో ఇలా పవన్ ఏదైనా అంటే వైసీపీ నేతలు పవన్ పర్సనల్ లైఫ్ మీద కూడా విమర్శలు చేసే వాళ్ళు. కానీ ఇప్పుడు కనీసం ఆయన లేవనెత్తిన అంశంపై కూడా వైసీపీ నుండి సమాధానం రావడం లేదు. కనీసం వచ్చే ఎన్నికలలో టికెట్లు ఆశించే నేతలు కూడా పవన్ విమర్శలపై స్పందించడం లేదు. పైగా, టెక్నికల్‌గా వైసీపీకి బయట ఉన్న ముద్రగడ పద్మనాభం లాంటి పాత కాపును పవన్‌పై ప్రయోగిస్తున్నారు.  దీంతో పవన్ పై వైసీపీ మౌనం వెనక ఏదైనా వ్యూహం ఉందా? లేక తత్వం బోధపడిందా? అని చర్చలు జరుగుతున్నాయి. పవన్ విషయంలో వైసీపీ నేతలంతా ఆచితూచి మాట్లాడుతున్నారు. లేదంటే మౌనంగానే ఉండిపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉండడం.. పవన్ కొత్త ఊపుతో ఉండడంతో పవన్ పై వ్యక్తిగత దాడి చేసి మరింత వ్యతిరేకత మూటగట్టుకోవడం ఎందుకనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తుంది. ఒకరిద్దరు మినహా వైసీపీ నేతలంతా సైలెంట్ అయిపోయారు. ఆఖరికి పవన్ పై దాడికి వైసీపీ బాగా వాడుకున్న అంబటి లాంటి వాళ్ళు కూడా నోరు మెదపడం లేదు. దీంతో సొంత పార్టీలో నేతలు విమర్శలు చేసి విమర్శలపాలై సినీ అభిమానులను, కాపు సామజిక ఓటర్లను దూరం చేసుకొనే ఉద్దేశ్యాన్ని వెనక్కి తీసుకొని ఆ స్థానంలో పవన్ పై నెగటివ్ ప్రచారం స్ప్రెడ్ చేసేందుకు ముద్రగడ లాంటి వాళ్ళని ఉపయోగించుకుంటున్నట్లుగా కనిపిస్తుంది.