Read more!

ఇంట్లోనే నూనెను ఇలా  తయారుచేసి వాడితే పొడవాటి జుట్టు మీ సొంతం!

ఇంట్లోనే నూనెను ఇలా  తయారుచేసి వాడితే పొడవాటి జుట్టు మీ సొంతం!   జుట్టు పొడవుగా, మందంగా,  ఆరోగ్యంగా పెరగాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ ఇప్పటి జీవనశైలి వల్ల పొడవాటి జుట్టు చాలామందికి కలగానే మిగిలిపోతోంది. చిన్నతనంలో ఒత్తుగా, పొడవుగా జుట్టు ఉన్నవాళ్లు పెద్దయ్యాక తమ జుట్టు ఎందుకు అంత పలుచగా, ఎదుగుదల లేకుండా మారిపోతోందో తెలియక తికమక పడుతుంటారు. జుట్టు పెరుగుదల కోసం బోలెడు రకాల నూనెలు కూడా వాడుతుంటారు. కానీ జుట్టు పెరుగుదలకు ఇంట్లోనే ఈజీగా నూనె తయారుచేసుకుని వాడచ్చు. ఈ నూనెను వాడితే జుట్టు నల్లగా,  ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగడం ఖాయం. నువ్వుల నూనె ఆయుర్వేదంలో చాలా విధాలుగా ఉపయోగిస్తారు.  చాలా రకాల ఆయుర్వేద నూనెల తయారీలో నువ్వుల నూనెకు ప్రాధాన్యత ఉంది.  నువ్వుల నూనె, మెంతి గింజలు కలిపి వాడటం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది.  దీని కోసం నూనెను ఎలా తయారుచేయాలంటే.. నువ్వుల నూనెను,  మెంతి గింజలను సమాన పరిమాణంలో తీసుకోవాలి.  ఈ రెండింటిని ఒక ఇనుప కడాయిలో వేసి సన్నని మంట మీద ఉడికించాలి.  దీన్ని కనీసం 5 నుండి 10 నిమిషాలు ఉడికిన తరువాత  స్టౌ ఆఫ్ చేయాలి.  నూనె చల్లబడిన తరువాత  వడగట్టి గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.  ఈ నూనెను తలస్నానం చెయ్యడానికి గంట ముందు తలకు అప్లై చెయ్యాలి.  గంట తరువాత గాఢత లేని షాంపూ లేదా కుంకుడు కాయ రసంతో స్నానం చెయ్యాలి.  ఇది జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.  తెల్లజుట్టు రాకుండా చేస్తుంది.  జుట్టు పొడవుగా పెరగడంలో సహాయపడుతుంది.  దీన్ని వారంలో 2 నుండి 3 సార్లు అప్లై చేయవచ్చు. నువ్వుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, కాల్షియం,  ప్రొటీన్లు మంచి మొత్తంలో ఉంటాయి. ఈ నూనె నుండి అమైనో ఆమ్లాలు, విటమిన్లు B, E, K కూడా లభిస్తాయి. నువ్వుల నూనెను ఆయుర్వేద ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ నూనెను ఉపయోగించడం వల్ల సెల్ డ్యామేజ్ తగ్గుతుంది, జుట్టు రాలడం ఆగిపోతుంది, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది, స్కాల్ప్‌కు హైడ్రేషన్ అందిస్తుంది, ఈ నూనె ప్రభావం సూర్యుడి హానికరమైన కిరణాల నుండి జుట్టును రక్షించడంలో పనిచేస్తుంది.  ఇది చుండ్రు సమస్యను తొలగిస్తుంది. మెంతి గింజలు జుట్టుకు  అనేక ప్రయోజనాలను అందిస్తాయి. మెంతి గింజలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి,  జుట్టు  మందాన్ని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ గింజల్లో ప్రొటీన్,  ఐరన్ పుష్కలంగా ఉంటాయి. జుట్టుకు  మేలు చేసే అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. హెయిర్ ఫాల్ అరికట్టడం,  జుట్టు పెరుగుదలను పెంచడమే కాకుండా, మెంతి గింజలను తలపై అప్లై చేయడం వల్ల జుట్టు తొందరగా  నెరసిపోయే అవకాశాలను తగ్గిస్తుంది. మెంతి గింజలు స్కాల్ప్ నుండి చుండ్రును తొలగించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.                                                  *రూపశ్రీ.  

వర్షాకాలంలో వేధించే చుండ్రుకు ఇలా చెక్ పెట్టవచ్చు..!

  వర్షాకాలంలో వేధించే చుండ్రుకు ఇలా చెక్ పెట్టవచ్చు..!   చుండ్రు జుట్టుకు సంబంధించి చాలామంది ఎదుర్కునే సమస్యలలో ప్రదానమైనది. స్కాల్ప్ పై చర్మం విపరీతంగా పొడిబారినప్పుడు చుండ్రు సమస్య మొదలవుతుంది. చుండ్రు ఉన్నప్పుడు   తలను దువ్వినా, తలను గోక్కున్నా తెల్లని పొడిలాగా రాలుతూ ఉంటుంది. దీని కారణంగా చాలామంది ఇబ్బందికి గురవుతారు. చుండ్రు కారణంగా  తలలో వివిధ ప్రదేశాలలో దురద కూడా ఉంటుంది. ఇది మెల్లగా ముఖం మీద కూడా దురద, ఇతర చర్మపు చికాకులు రావడానికి కారణం అవుతుంది.  ఈ చుండ్రును వదిలించుకోవడానికి ఇంట్లోనే కొన్ని ఈజీ టిప్స్ తెలుసుకుంటే.. బేకింగ్ సోడా.. జుట్టును తేలికగా తడిపి బేకింగ్ సోడాను తలకు పట్టించాలి. దీన్ని  వేళ్లతో రుద్దాలి.  సుమారు 5 నిమిషాలు ఉంచి ఆపై దానిని కడగాలి. బేకింగ్ సోడా చుండ్రును తొలగిస్తుంది. అయితే జుట్టు పాడవకుండా ఉండాలంటే పరిమిత పరిమాణంలో మాత్రమే దీన్ని వాడాలి.   నిమ్మరసం.. 2 చెంచాల నిమ్మరసాన్ని తలకు పట్టించి కొన్ని నిమిషాలు ఉంచడం వల్ల అద్భుతమైన ప్రభావాలు కనిపిస్తాయి. ఒక కప్పు నీటిలో అర నిమ్మకాయ రసాన్ని మిక్స్ చేసి జుట్టు మూలాల నుండి చివర్ల వరకు అప్లై చేయాలి. చుండ్రును తొలగించడానికి, ఈ మిశ్రమాన్ని కొన్ని నిమిషాలు అలాగే ఉంచి ఆపై  జుట్టును కడగాలి. ఆస్పిరిన్ .. ఆస్పిరిన్ మాత్రలు చుండ్రును తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. 2 ఆస్పిరిన్ మాత్రలను గ్రైండ్ చేసి  షాంపూలో కలపాలి.  ఈ షాంపూతో మీ జుట్టును కడగాలి. 2 నుండి 3 నిమిషాలు జుట్టు మీద షాంపూ ఉంచుకోవాలి. తద్వారా ఆస్పిరిన్  ప్రభావం కనిపిస్తుంది. ఆస్పిరిన్‌లో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది.  ఇది చుండ్రు షాంపూలలో కనిపించే ఒక పదార్ధం. అలోవెరా.. తాజా కలబంద గుజ్జును జుట్టు  మూలాలపై రుద్దాలి. కలబందను కొంత సేపు అలాగే ఉంచిన తర్వాత  జుట్టును కడిగి శుభ్రం చేసుకోవాలి. జుట్టు నుండి చుండ్రు తొలగిపోవడమే కాదు దురద సమస్య కూడా పోతుంది. జుట్టు మృదువుగా మారుతుంది. కొబ్బరి నూనె.. కొబ్బరి నూనె కూడా చుండ్రును తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. 3 నుంచి 4 చెంచాల కొబ్బరి నూనెలో నిమ్మరసం మిక్స్ చేసి తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. చుండ్రును తొలగించడంలో ప్రభావం చూపిస్తుందిది. ఆపిల్ సైడర్ వెనిగర్.. ఆపిల్ సైడర్ వెనిగర్ ప్రభావం జుట్టును శుభ్రపరచడంలో కూడా పనిచేస్తుంది. ఒక కప్పు నీటిలో 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి తలకు పట్టించాలి. యాపిల్ సైడర్ వెనిగర్ నీళ్లను జుట్టుకు పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. చుండ్రు తొలగిపోతుంది.                                         *రూపశ్రీ.

మహిళలూ ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తప్పనిసరి!

మహిళలూ ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తప్పనిసరి! మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. నేటికీ కొంతమంది మహిళలు ఆర్థికపరమైన విషయాల్లో తండ్రి, సోదరుడు, భర్త...ఇలా ఎవరొకరిమీద ఆధారపడుతుంటారు. ఆర్థికపరమైన అంశాలపట్ల సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణమంటున్నారు నిపుణులు. ఇంకొంతమంది మహిళలు తాము సంపాదించిన మొత్తాన్ని పరిస్థితులకు అనుగుణంగా తమ భర్త చేతిలో పెట్టడం వల్ల చిన్న చిన్న అవసరాలకు కూడా వాళ్ల వద్ద చేయి చాచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా చేతినిండా సంపాదన ఉన్నా...చాలా మంది మహిళలు ఆర్థికపరంగా నేటికీ పురుషులపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఇకనైనా మేల్కోని ఈ ధోరణిని మార్చుకోవాలి. లేదంటే అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలో వివాహం జరిగినప్పటినుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని చెబుతున్నారు. ఉద్యోగం మానకూడదు: కొంతమంది వ్యక్తిగత కారణాలు, కుటుంబ పరిస్థితుల కారణంగా అప్పటివరకు తాము చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేస్తుంటారు. ఇంకొంతమంది సంపాదించాల్సిన అవసరం లేదని ఈ నిర్ణయం తీసుకుంటారు. ఈ రెండూ కూడా ఆర్థికంగా చేటు చేసే నిర్ణయాలే అని చెబుతున్నారు నిపుణులు. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత భవిష్యత్తులో ప్రతి చిన్న అవసరానికీ భర్త మీదే ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి పెళ్లైనా ఉద్యోగం మానకపోవడమే మంచిది. తద్వారా భవిష్యత్తులో ఒంటరిగా జీవించాల్సి వచ్చినా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవగాహన పెంచుకోవాలి: ఆర్థిక విషయాల్లో పెళ్లికి ముందు తండ్రిపై...పెళ్లి తర్వాత భర్తపై ఆధారపడే అమ్మాయిలు ఈ కాలంలో చాలా మంది ఉన్నారు. ఆర్జన వరకు బాగానే ఉన్నా...డబ్బు పొదుపు మదుపు విషయాల్లో అవగాహన లోపమే దీనికి కారణం. అయితే ప్రతి చిన్న దానికీ ఇతరులపై ఆధారపడటం వల్ల వాళ్లు అందుబాటులో లేనప్పుడు ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. కాబట్టి డబ్బులను ఎందులో పొదుపు చేయాలి లాభాలు ఆర్జించాలంటే వేటిలో పెట్టుబడులు పెట్టాలనే ప్రథమిక విషయాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు అలాని ఒకేసారి అన్ని విషయాల గురించి తెలుసుకోవడం ఎవరితోనూ సాధ్యం కాదు. కాబట్టి నిపుణుల సలహాలు పాటిస్తూ ఉండాలి. ఇవి కూడా గుర్తుంచుకోవాలి... మహిళలు తప్పకుండా వైద్య బీమా చేయించుకోని ఉండాలి. అనుకోని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టకుండా ఉంటుంది. మీ అత్తమామలు, భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఏవైనా పత్రాలపై సంతకం చేయమని అడుగుతే గుడ్డిగా చేయకండి. వాటిని క్షుణ్ణంగా చదివిన తర్వాతే చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోండి. పెళ్లికి ముందు తర్వాత మహిళలకు పుట్టింటివారు మెట్టినింటి వారి నుంచి వచ్చే బహుమతులు, కానుకలు స్త్రీధన్ అంటారు. అవి పెట్టుబడులు, స్థిరాస్తి, చరాస్తి, డబ్బు, బంగారం ఇలా ఏ రూపంలో అయినా ఉండవచ్చు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను జాగ్రత్తగా భద్రపరుచుకోవడం ముఖ్యం.  

ఇంట్లోనే గోల్డ్ ఫేషియల్ ఇంత ఈజీగా చేసుకోవచ్చా?

  ఇంట్లోనే గోల్డ్ ఫేషియల్ ఇంత ఈజీగా చేసుకోవచ్చా?   ప్రతిరోజూ టీవీ  లోనూ సోషల్ మీడియాలోనూ అందానికి సంబంధించి  బోలెడు యాడ్స్ చూస్తుంటాం.  ఈ యాడ్స్ లో ఎక్కువగా ముఖం బంగారంలా మెరిసిపోవడానికి గోల్డ్ ఫేషియల్ గురించి చెబుతుంటారు.  గోల్డ్ మాస్క్ గురించి కూడా యాడ్స్ ఎడాపెడా కనిపిస్తుంటాయి. అయితే అందరికీ బ్యూటీ పార్లర్ కు వెళ్లి గోల్డ్ ఫేషియల్ చేయించుకునే స్థోమత ఉండదు. అలాగని మార్కెట్లో ఉత్పత్తులు వాడితే చర్మానికి మరింత హాని జరిగే అవకాశం కూడా ఉంటుంది.  అందుకే కేవలం నాలుగు స్టెప్స్  ఫాలో అవ్వడం ద్వారా ఇంట్లోనే గోల్డ్ ఫేషియల్ చేసుకోవచ్చు.  అదెలాగో తెలుసుకుంటే... క్లెన్సింగ్.. ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవడం మొదటిదశ. మురికి,  మృత కణాలు,  జిడ్డు మొదలైన వాటిపైన ఏదైనా అప్లై చేస్తే అది చర్మాన్ని దెబ్బతీస్తుంది. అందుకే ముఖాన్ని పచ్చిపాలతో శుభ్రం చేసుకోవాలి.  పచ్చిపాలలో కాటన్ బాల్  ముంచి దాంతో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.  తరువాత మంచినీటితో ముఖం కడుక్కోవాలి.  దీనివల్ల మురికి తొలగిపోతుంది. ముఖం మీద మచ్చలు కూడా తగ్గుతాయి. స్కబ్బింగ్.. గోల్డెన్ గ్లో పొందడానికి రెండవ దశ స్క్రబ్బింగ్. ఇది  ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్,  వైట్ హెడ్స్ ను శుభ్రం చేయడానికి పని చేస్తుంది. దీనికోసం ఒక గిన్నెలో చక్కెర, తేనె,  నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీన్ని ముఖంపై 5-6 నిమిషాల పాటు స్క్రబ్ చేసి తర్వాత ముఖం కడుక్కోవాలి. స్టీమింగ్.. స్టీమింగ్  చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది చర్మ రంధ్రాలను తెరుస్తుంది,  మురికిని లోతుగా శుభ్రపరుస్తుంది. అందువల్ల   ఆవిరి పట్టుకోవడం చాలా ముఖ్యం. కావాలంటే లవంగం, నిమ్మరసం, వేప ఆకులను ఆవిరి పట్టే నీటిలో వేసుకోవచ్చు. ఇవన్నీ చర్మానికి మేలు చేస్తాయి. గోల్డెన్ గ్లో ఫేస్ ప్యాక్.. పార్లర్ లో చేసే ఫేషియల్ లాంటి గోల్డెన్ గ్లో  కావాలి అంటే ఇంట్లోనే ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవచ్చు.  ఇందుకోసం ఒక గిన్నెలో 1 టీస్పూన్ కొబ్బరి నూనె, 1 టీస్పూన్ తేనె, 1/2 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ నిమ్మరసం,  ఒక టీస్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి.  దీన్ని  ముఖానికి అప్లై చేసి 5 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత ముఖం కడగాలి.  ఇలా చేసిన తరువాత ముఖానికి  గోల్డెన్ గ్లో  సొంతమవుతుంది.  చివరగా మాయిశ్చరైజర్ రాయాలి.                                           *రూపశ్రీ.

ప్రెగ్నెన్సీ సమయంలో నిద్ర సరిగా రాదు ఎందుకని...నిద్ర బాగా పట్టాలంటే ఏం చెయ్యాలి?

  ప్రెగ్నెన్సీ సమయంలో నిద్ర సరిగా రాదు ఎందుకని...నిద్ర బాగా పట్టాలంటే ఏం చెయ్యాలి? మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరికీ తగినంత నిద్ర అవసరం. కానీ గర్భధారణ సమయంలో తగినంత నిద్రపోవడం మహిళలకు పెద్ద సవాలుగా మారుతుంది.  అయితే గర్భం దాల్చిన తొమ్మిది నెలల కాలం చాలా విలువైనది. నిద్రలేమి సమస్య ఈ 9నెలల కాలాన్ని చాలా క్లిష్టతరంగా మారుస్తుంది. సాధారణంగా అలసటగా ఉన్నప్పుడు చాలామంది హాయిగా నిద్రపోతారు. కానీ   అలసటగా అనిపించినా సరైన నిద్ర పట్టడం లేదని చాలామంది మహిళలు వాపోతుంటారు. మహిళలకు నిద్రలేమి  వెనుక హార్మోన్లలో మార్పులు, వెన్నునొప్పి, కడుపులో బిడ్డ   చురుకుగా మారడం వంటి అనేక కారణాలు ఉన్నాయి. రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేయడానికి లేవడం  వల్ల చాలాసార్లు నిద్రకు ఆటంకం కలుగుతుంది. దీని కారణంగా మరుసటి రోజు అలసటగా,  నీరసంగా అనిపిస్తుంది. గర్భిణీ స్త్రీ రాత్రిపూట 7-8 గంటలు నిద్రపోవాలని, పగటిపూట కనీసం రెండు గంటలు నిద్రపోవాలని,  ఇది తల్లి,  బిడ్డ ఇద్దరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని మహిళా వైద్యులు చెబుతున్నారు.  గర్భవతులు హాయిగా నిద్రపోవాలంటే ఏం చేయాలో తెలుసుకుంటే.. ప్రెగ్నెన్సీ సమయంలో రోజంతా యాక్టివ్ గా ఉండటం వల్ల రాత్రి బాగా నిద్ర పడుతుంది. చురుగ్గా ఉండటం అంటే భారీ పని కాదు. పగటిపూట లైట్ యోగా,  వ్యాయామం చేయడం వల్ల  రాత్రి బాగా నిద్ర పడుతుంది. డిజిటల్ గాడ్జెట్లు  మనస్సును  చురుకుగా ఉంచుతాయి. పదే పదే మొబైల్ చూడటం,  ఏదో  ఒకటి ఆపరేట్ చేయడం చేస్తుంటారు.  ఇవి  నిద్రపై అత్యధిక ప్రభావం చూపుతాయి. పడుకునే రెండు గంటల ముందు ఫోన్, టీవీ, కంప్యూటర్, ల్యాప్‌టాప్ స్విచ్ ఆఫ్ చేసి నిద్రపై దృష్టి పెట్టడం మంచిది. పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ప్రశాంతమైన నిద్ర వస్తుంది. ఇలా చేయడం వల్ల రోజంతా అలసట, టెన్షన్ తొలగిపోయి స్నానం చేసి పడుకోగానే గాఢ నిద్రలోకి జారుకుంటారు. రాత్రి పడుకునే ముందు వేడి లేదా చల్లని కాఫీ వంటి కెఫిన్ ఉన్న పానీయాలను తాగడం మానుకోవాలి. నిద్రవేళకు రెండు మూడు గంటల ముందు వీటిని తీసుకోవడం మానేస్తే,  ఆహ్లాదకరమైన నిద్రను సొంతం అవుతుంది. పడుకునే ముందు చాలా తక్కువ మొత్తంలో నీరు త్రాగాలి. దీనితో  తరచుగా మూత్ర విసర్జన చేయవలసిన అవసరం ఉండదు .  నిద్రకు కూడా ఆటంకం కలగదు. నిద్రవేళకు ముందు ఒకసారి మూత్ర విసర్జనకు వెళ్లి రావాలి. ఇలా చేయడం వల్ల గాఢ నిద్ర నుండి మళ్లీ మళ్లీ మేల్కొనే అవసరం ఉండదు. ప్రెగ్నెన్సీ సమయంలో ఎప్పుడూ వీపుపై నేరుగా పడుకోకూడదు.  కుడి లేదా ఎడమ వైపున నిద్రించడానికి ప్రయత్నించాలి.  మనకు వెన్నుపాము పైన రక్త నాళాలు ఉంటాయి.  దానిపై కడుపులో శిశువు నెమ్మదిగా  పెరుగుతుంటాడు. వెల్లికిలా పడుకోవడం వల్ల నాళాలపై ఒత్తిడి ఏర్పడుతుంది.  దీని కారణంగా శిశువుకు రక్త సరఫరా ఆగిపోతుంది. అంతేకాదు గర్భవతుల కాళ్లు  గుండెకు రక్త సరఫరా కూడా ఆగిపోతుంది. అదే ఒకవైపుకు తిరిగి పడుకోవడం ద్వారా పిల్లల మొత్తం బరువు రక్తనాళాలపై పడదు. దాని కారణంగా కడుపులో బిడ్డ పెరుగుదల బాగుంటుంది.                                             *రూపశ్రీ.

డెలివరీ తరువాత బరువు తగ్గాలంటే ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..!

డెలివరీ తరువాత బరువు తగ్గాలంటే ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..!   గర్భధారణ సమయంలో మహిళలు చాలా బరువు పెరుగుతారు. డెలివరీ తర్వాత   అంత ఈజీగా బరువు తగ్గరు.  ఇలాంటి మహిళలు బరువు తగ్గే విషయంలో చాలా కష్టపడుతుంటారు. కొంతమంది మహిళలు లావుగా ఉన్నామని చాలా ఫీలవుతారు. తల్లి అయిన తర్వాత  శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు కూడా  బరువు పెరగడానికి,   ఆ తరువాత బరువు అంత సులువుగా తగ్గలేకపోవడానికి కారణం అవుతుంది. ముఖ్యంగా సిజేరియన్  ద్వారా పిల్లలను కన్న వారికి బరువు తగ్గడంలో సమస్యలు ఎక్కువ. దాదాపు 6 నెలల పాటు ఎటువంటి తీవ్రమైన వ్యాయామం చేయకూడదని వైద్యులు చెబుతుంటారు కాబట్టి ఇలాంటి వారు బరువు తగ్గడానికి సాహసం చేయరు. అంతే కాదు సిజేరియన్ కారణంగా పొట్ట భాగంలో కొవ్వు  పెరగడం కూడా వేగంగానే ఉంటుంది.  అయితే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల, కొన్ని ఆహారాలు, పానీయాలు తీసుకోవడం వల్ల డెలివరీ తరువాత బరువు తగ్గడం సులువుగా ఉంటుంది.  అదెలాగో ఓ లుక్కేస్తే.. వాము నీరు.. ప్రసవం తర్వాత తల్లికి వాము నీరు త్రాగడానికి ఇస్తారు.  ఈ నీటి రుచిని మహిళలు ఇష్టపడనప్పటికీ  క్రమం తప్పకుండా తాగడం వల్ల కడుపులో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. దీని కోసం  నీటిలో వాము గింజలు వేసి నీటిని మరిగించాలి.  చల్లగా అయిన తరువాత  రోజంతా ఈ నీటిని త్రాగాలి. 1-2 నెలల తర్వాత ఉదయం 1 గ్లాసు వాము నీరు తాగడం మొదలు పెట్టాలి. ఇందుకోసం రాత్రంతా వాము గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి అలాగే ఉంచాలి.  ఉదయాన్నే ఈ నీటిని వడగట్టి తాగాలి.  బరువు, పొట్ట భాగంలో కొవ్వు కూడా తగ్గుతాయి. గ్రీన్ టీ.. డెలివరీ  తర్వాత బరువు తగ్గడానికి  గ్రీన్ టీని చేర్చుకోండి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువును తగ్గించడంలో సహాయపడతాయి. తినడానికి ముందు లేదా తర్వాత 1 కప్పు గ్రీన్ టీ త్రాగాలి. మిల్క్ టీ తాగే అలవాటు ఉంటే దాని  బదులుగా గ్రీన్ టీ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఊబకాయం తగ్గి చర్మం కూడా ఆరోగ్యవంతంగా మారుతుంది. అయితే గ్రీన్ టీకి చక్కెర జోడించకూడదు. దాల్చిన చెక్క,  లవంగాలు.. దాల్చిన చెక్క,  లవంగాలు పొట్టలోని కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. దాల్చినచెక్క,  లవంగాల వినియోగం గర్భధారణ తర్వాత బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా  ఉంటుంది. 1 గ్లాసు నీటిలో 2 నుండి 3 లవంగాలు,  దాల్చిన చెక్క ముక్కను ఉడకబెట్టాలి. ఈ నీటిని వడగట్టి ఉదయాన్నే తాగాలి. కావాలంటే ఈ నీటిని రోజంతా గోరువెచ్చగా తాగవచ్చు. జాజికాయ పాలు.. స్థూలకాయం తగ్గాలంటే పాలలో జాజికాయ కలుపుకుని తాగాలి. ఇది బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. రాత్రి పడుకునే ముందు జాజికాయ పాలు తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. దీని కోసం 1 కప్పు పాలలో 1/4 టీస్పూన్ జాజికాయ పొడిని కలపాలి. ఈ  పాలు గోరువెచ్చగా త్రాగాలి. బాదం,  ఎండుద్రాక్ష.. బాదం,  ఎండుద్రాక్షలను రోజూ తినడం వల్ల కూడా త్వరగా బరువు తగ్గుతారు. బాదంపప్పు పూర్తి ఫైబర్ మూలం.  ఎండుద్రాక్ష కడుపుని శుభ్రంగా ఉంచుతుంది. డెలివరీ సాధారణమైతే  కొన్ని రోజుల తర్వాత బాదం,  ఎండుద్రాక్ష తినవచ్చు. ఆపరేషన్ ద్వారా బిడ్డ పుడితే వైద్యుల సలహా మేరకు బాదం, ఎండు ద్రాక్ష తినవచ్చు. రోజుకు 10 ఎండుద్రాక్ష,  4 నుండి 8 వరకు బాదంపప్పులు తినడం వల్ల బరువు తగ్గుతారు.                                         *రూపశ్రీ.

ఓట్ మీల్ ఫేస్ మాస్క్ తో భలే అందం..!

  అమ్మాయిలు చర్మ సంరక్షణ విషయంలో అస్సలు రాజీ పడరు. అందుకే వాణిజ్య ఉత్పత్తుల నుండి ఇంటి చిట్కాల వరకు ప్రతి ఒక్కటి ఫాలో అవుతారు.   వాణిజ్య ఉత్పత్తులలో ఎక్కువ శాతం రసాయనాలుండటం వల్ల చాలామంది సహజంగా చర్మాన్ని మెరిపించుకోవడం కోసం ట్రై చేస్తారు.  అలాంటి వారికి ఓట్మీల్ చక్కని ఆప్షన్. సాధారణంగా ఆరోగ్య స్పృహ ఉన్నవారు  ఓట్మీల్ ను ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటారు. దీంతో ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలుంటాయి. కానీ దీన్ని పేస్ కు మాస్క్ లాగా వేసుకుంటే మ్యాజిక్ ఫలితాలు ఉంటాయి. ఇంతకీ ఓట్మీల్ అంటే ఏంటి?దీన్నెలా తయారుచేసుకోవాలి?  ఎలా అప్లై చేసుకోవాలి? తెలుసుకుంటే.. ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు,  మినరల్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి  ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం. కానీ వీటితో పేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం నుండి మురికి,  నూనెను తొలగించడంలో, చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో, చర్మానికి  తేమను అందించడంలో, అకాల వృద్ధాప్యానికి గురికాకుండా చేయడంలో.. ఇలా చాలా రకాలుగా సహాయపడుతుంది. ఓట్ మీల్ తేనె ఫేస్ మాస్క్.. పొడి చర్మం,  సున్నితమైన చర్మం ఉన్నవారికి ఈ ఫేస్ మాస్క్ మంచిది. కావలసినవి: 1 టేబుల్ స్పూన్ గ్రౌండ్ వోట్మీల్ 1 టేబుల్ స్పూన్ తేనె 1 టీస్పూన్ వెచ్చని నీరు. విదానం.. ఒక చిన్న గిన్నెలో, గ్రైండ్ చేసిన ఓట్ మీల్, తేనెను కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి.  ఈ మిశ్రమానికి గోరువెచ్చని నీరు వేసి బాగా కలపాలి.  ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి.  15-20 నిమిషాలు అలాగే ఉంచాలి. గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుని,  ఇష్టమైన మాయిశ్చరైజర్‌ని ముఖానికి రాసుకోవాలి. ఓట్ మీల్ పెరుగు ఫేస్ మాస్క్.. ఈ ఫేస్ మాస్క్ అన్ని చర్మ రకాల వారికి, ముఖ్యంగా జిడ్డుగల లేదా మొటిమల బారిన పడే చర్మం ఉన్నవారికి సరిపోతుంది. కావలసినవి.. 2 టేబుల్ స్పూన్లు గ్రౌండ్ వోట్మీల్ 2 టేబుల్ స్పూన్లు సాదా పెరుగు 1 టీస్పూన్ తేనె విధానం.. ఒక చిన్న గిన్నెలో, గ్రౌండ్ వోట్మీల్,  పెరుగు కలపాలి. ఇందులోనే  తేనె జోడించాలి.  ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసి  15-20 నిమిషాలు అలాగే ఉంచాలి. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ముఖం పొడిగా మారిన తరువాత తేలికపాటి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఓట్ మీల్,  అరటిపండు ఫేస్ మాస్క్: ముడుతల చర్మం ఉన్నవారికి ఈ ఫేస్ మాస్క్ సరైనది. కావలసినవి: 1/2 పండిన అరటి 1 టేబుల్ స్పూన్ గ్రౌండ్ వోట్మీల్ 1 టీస్పూన్ తేనె విధానం.. ఒక చిన్న గిన్నెలో, అరటిపండును మెత్తని పేస్ట్‌గా  చెయ్యాలి.  అరటిపండు గుజ్జులో గ్రైండ్ చేసిన   ఓట్ మీల్,  తేనె వేసి బాగా కలపాలి. ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుని  15-20 నిమిషాలు అలాగే ఉంచాలి. గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ముడుతలు ఉన్న చర్మానికి తగిన మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి.                                                      *రూపశ్రీ.

ఉత్తర ప్రదేశ్ నుండి కేన్స్ వరకు.. నాన్సీ త్యాగీ సక్సెస్ ఇదీ..!

ఫ్యాషన్ ప్రపంచం చాలా పెద్ది. ట్యాలెంట్ ఉండాలే కానీ తళుక్కున మెరవచ్చు. చాలామంది ఏ రంగం అయినా బ్యాక్గౌండ్ లేకపోతే ముందుకు సాగలేరని అంటుంటారు. ముఖ్యంగా మహిళలు ఎదగాలంటే చాలా సవాళ్లు ఎదుర్కోవాలని కూడా అంటుంటారు. దీనికి ఉదాహరణగా చాలామంది మహిళలు తమకు ఎదురైన అనుభవాలు చెబుతుంటారు. అయితే కొందరు మాత్రం అన్నింటిని తట్టుకుని నిలబడి విజయ కేతనం ఎగురవేస్తారు. ఆ కోవలోకి చెందినదే నాన్సీ త్యాగి. ఈమె ఒక ఫ్యాషన్ ఇన్ఫ్లూమెన్సర్. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఈమె తన ఫ్యాషన్ ప్రతిభతో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తళుక్కున మెరిసింది. ఇలాంటి  విజయాలు ఎంతో మంది మహిళలను, యువతులను ఇన్పైర్ చేస్తాయి.  విజయం వైపు నాన్సీ త్యాగి  ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుంటే.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రాయ్ బచ్చన్,  కియారా అద్వానీ వంటి  సెలబ్రిటీలు సాధారణంగా తమ ఫ్యాషన్ తో హోయలు పోయి ప్రశంసలు కొట్టేసేవారు. కానీ  దానికంటే ఎక్కువ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ త్యాగికి  ప్రశంసలు లభిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన నాన్సీ త్యాగి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తను సొంతంగా డిజైన్ చేసిన గౌనుతో ఈవెంట్ కు అట్రాక్షన్ గా నిలిచి ప్రశంసలు కొట్టేసింది. ఈమె ధరించిన  గౌను ఫ్యాషన్ ప్రపంచంలో  ఈమెకు గొప్ప గుర్తింపు తీసుకొచ్చింది. నాన్సీ త్యాగి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో  పింక్ రఫుల్ గౌను ధరించింది. దీన్ని తయారు చేసేందుకు ఆమెకు  1000 మీటర్ల క్లాత్ అవసరమైంది. దీన్ని నెల రోజుల్లో సిద్ధం చేసినట్టు పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె వీడియోలు పోస్ట్ చేస్తుండేది. అవి కాస్తా  వైరల్ కావడంతో  నాన్సీ త్యాగికి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు వచ్చింది. నాన్సీ స్వయంగా డ్రెస్ కుట్టించి తన అకౌంట్ లో  పోస్ట్ చేసేది. మొదట్లో నాన్సీ తన డిఫరెంట్  శైలి ప్రెజెంట్ చేసే క్రమంలో చాలా ట్రోల్స్ కు గురైంది.  దీంతో ఆమె పోస్టింగ్ శైలిని మార్చుకుంది. అంతే..  నెటిజన్లు ఆమె ట్యాలెంట్ ను గుర్తించడం  మొదలుపెట్టారు.  ప్రస్తుతం  ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ల మంది నాన్సీని ఫాలో అవుతున్నారు.   ఆమె ఇయర్ పోస్ట్‌కు 1.9 మిలియన్ లైక్‌లు ఉన్నాయి. నాన్సీ ప్రతిభ ఆమెను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ వేదికలకు తీసుకెళ్లింది. నాన్సీ స్వయంగా కుట్టిన దుస్తులను సోనమ్ కపూర్, అర్జున్ కపూర్, ఈషా గుప్తా, దేవోలీనా భట్టాచార్జీ వంటి పలువురు ప్రముఖులు..  సోషల్ మీడియా ప్రభావశీలులు ప్రశంసించారు.  అంతేనా నాన్సీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వరకు వెళ్లడం మాత్రమే కాకుండా గుర్తింపు తెచ్చుకున్నందుకు నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రత్యేక ఈవెంట్ కోసం నాన్సీ మూడు లుక్స్ లో కనిపించింది.  తన ఫస్ట్ లుక్‌లో నాన్సీ పింక్ రఫిల్డ్ గౌనులో  కనిపించగా, సెకండ్ లుక్‌లో ఆమె హెడ్ ఎంబ్రాయిడరీ చీరను ధరించింది.  ఈ చీరను స్వయంగా తనే సిద్ధం చేసింది. తన మూడవ లుక్ లో  నాన్సీ నల్లటి దుస్తులను ధరించింది. ఇది కూడా ఆమె స్వయంగా   స్టైల్ చేసింది. నాన్సీ స్వయంగా ఈ  దుస్తులను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.                         *నిశ్శబ్ద.

గర్భిణీ స్త్రీలు ఏం తినాలి? ఏం చెయ్యాలి, ఏం  చేయకూడదు..!

గర్భిణీ స్త్రీలు ఏం తినాలి? ఏం చెయ్యాలి, ఏం  చేయకూడదు..!   ప్రతి ఆడపిల్ల జీవితంలో  గర్భధారణ చాలా కీలకమైన, ముఖ్యమైన దశ. ఈ దశలో మహిళల జీవనశైలి, ఆహారపు అలవాట్లు అన్నీ పూర్తీగా మార్పుకు లోనవుతాయి. ఇక శరీరంలో మార్పులు సరే సరి.. ఈ దశల గర్భవతులు, కడుపులో పెరుగుతున్న వారి బిడ్డలు కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం అనుసరించాల్సిన విషయాలు.. అనుసరించకూడని విషయాలను ICMR పేర్కొంది. వీటి గురించి తెలుసుకుంటే.. గర్భిణీ తల్లులు సరైన నిష్పత్తిలో అన్ని ఆహార సమూహాలను కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అంటే మీ భోజనంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, సన్న మాంసాలు, గుడ్లు, చిక్కుళ్ళు మరియు పాల ఉత్పత్తులు వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. శిశువు  పెరుగుదల,  అభివృద్ధికి కీలకమైన ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం,  ప్రోటీన్ వంటి అవసరమైన పోషకాలు తినాలి. ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12, అయోడిన్ మరియు n-3 పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వంటి కొన్ని పోషకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఐరన్,  ఫోలిక్ సప్లిమెంట్స్ తీసుకోవాలి.  అయోడిన్ కూడా తప్పనిసరి.  B12 పెరుగు లేదా మాంసం  నుండి లభిస్తుంది. మాంసాహారులైతే ఒమేగా-3 కోసం  కొవ్వు చేపలు.. శాఖాహారులైతే   విత్తనాలు, ఆకు కూరలు,  గింజల తీసుకోవచ్చు. 1000రోజుల పోషకాహారం.. స్త్రీ గర్భం దాల్చినప్పటి నుండి బిడ్డ పుట్టే వరకు (270 రోజులు). బిడ్డ  పుట్టినప్పటి నుండి ఆమె బిడ్డ 2వ పుట్టినరోజు (365+365 రోజులు) వరకు 1000రోజులు ఉంటాయి. ఈ  మొదటి 1000 రోజులు పిల్లల భవిష్యత్తును రూపొందించే కీలకమైన కాలం. ఈ కాలంలో, తల్లి కడుపులోని పిండం చాలా వేగంగా పెరుగుతుంది.  తల్లి నుండి పోషకాహారాన్ని తీసుకుంటుంది. దీని కోసం, గర్భం ప్రారంభంలో తల్లికి అవసరమైన అన్ని విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు,  శక్తిని అందించాలి. కనీసం 10-12 కిలోల బరువు పెరగాలి. తక్కువ బరువు ఉన్న మహిళలు తమ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.   బరువు పెరుగుటను నిశితంగా పరిశీలించాలి. అధిక బరువు ఉన్నవారు 5g-9kg కంటే ఎక్కువ బరువు పెరగకూడదు. చేయాల్సివి.. విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరి, జామ,  నారింజ వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. మొక్కల ఆహారాలు ఐరన్  శోషణను మెరుగుపరుస్తాయి.  ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవాలి. వికారం,  వాంతులు ఉన్నట్లయితే రోజుకు 4 నుండి 6 సార్లు చిన్న మొత్తంలో ఎక్కువ సార్లు   భోజనం చేయాలి. తగినంత విటమిన్ డి పొందడానికి కనీసం 15 నిమిషాల పాటు ప్రత్యక్ష సూర్యకాంతిలో గడపాలి. చేయకూడనివి.. కార్బోనేటేడ్ డ్రింక్స్ మానుకోవాలి. ధూమపానం చేయకూడదు.  పొగాకు తీసుకోకూడదు. మద్యం సేవించకూడదు. కెఫిన్ కలిగిన పానీయాలు తీసుకోకూడదు.   హైడ్రోజనేటెడ్ కొవ్వుతో చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. భారీ వస్తువులను ఎత్తకూడదు. లేదా కఠినమైన శారీరక శ్రమ చేయకూడదు.                                              *రూపశ్రీ.  

మేరీ కాం- బాక్సింగ్ చేసే అమ్మ!

  మేరీ కాం- బాక్సింగ్ చేసే అమ్మ! ఆడది అమ్మయితే ఇక ఆమె వ్యక్తిగత జీవితం ఆఖరు అనుకుంటారు చాలామంది. కానీ జీవితంలో ఎదగాలన్న తపనే ఉంటే అటు కుటుంబ జీవితంలోను, ఇటు లక్ష్య సాధనలోనూ అద్భుతాలు సాధించవచ్చని నిరూపించిన మనిషి మేరీ కాం. మహిళలకు అనువుగాని ఆటలనీ, అందులోనూ తల్లి అయ్యాక దూరంగా ఉండాల్సిన పోటీలని భయపడిపోయే బాక్సింగ్‌లో పతకాల పంటని పండిస్తున్న మేరీ కాం గురించి మరికొంత... పేదరికం... మేరీ కాం మణిపూర్‌లోని కన్‌గెతే అనే మారుమూల గ్రామంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు పొలం పనులు చేసుకునే కూలీలు. మేరీ కాం కూడా పూట గడిచేందుకు తరచూ ఆ పొలం పనులకు వెళ్లి తల్లిదండ్రులకు సాయపడాల్సి వచ్చేది. లక్ష్యం... మేరీ కాంకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టంగానే ఉండేది. కానీ తన రాష్ట్రానికే చెందిన డింగ్‌కో సింగ్‌ ఎప్పుడైతే ఆసియా క్రీడలలో బాక్సింగ్‌లో బంగారు పతకాన్ని తీసుకువచ్చాడో, అప్పటి నుంచి తాను కూడా బాక్సింగ్‌లో రాణించాలని నిర్ణయించేసుకుంది. పోరాటం... మేరీ ఆశయాన్ని ప్రపంచమంతా ఎగతాళి చేసింది. బాక్సింగ్‌ అనేది పురుషుల ఆటనీ, ఆడవాళ్లకు తగిన సున్నితమైన ఆటని వెతుక్కోమని హెచ్చరించింది. ఆఖరికి మేరీ తల్లిదండ్రులు కూడా ఆమె ఆసక్తిని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా మేరీ తన పట్టు వీడలేదు. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌కు చేరుకుంది. అక్కడ నర్జిత్‌ సింగ్‌ అనే బాక్సింగ్‌ శిక్షకుడి వద్దకు తనకు బాక్సింగ్‌ నేర్పమంటూ ప్రాథేయపడింది. శిక్షణ... తొలుత నర్జిత్‌ సింగ్‌ మేరీని తేలికగా తీసుకున్నాడు. కానీ ఇతరులకంటే తీవ్రమైన ఆమె సంకల్పాన్ని గ్రహించిన తరువాత తన శిక్షణపటిమనంతా ఆమెకు అందించాడు. నర్జిత్‌ ఆశలకు అనుగుణంగా మేరీ కాం రాష్ట్ర స్థాయి నుంచి ఒకో పోటీలో గెలుస్తూ 2001 నాటికి ప్రపంచ బాక్సింగ్‌ పోటీలలో రజతాన్ని సాధించింది. ఆ తరువాత మరో ఐదు సార్లు ప్రపంచ బాక్సింగ్‌ పోటీలలో బంగారు పతకాన్ని గెల్చుకుని, ఆ పోటీలలో ఆరు పతకాలను గెల్చుకున్న ఏకైక మహిళగా రికార్డు సాధించింది. పెళ్లి... 2001లో మేరీ, ఆన్లర్‌ కామ్‌ను కలుసుకుంది. మేరీ ప్రతిభతో ముగ్ధుడైన ఆన్లర్‌ ఆమెతో ప్రేమలో పడిపోయాడు. 2005లో ఆ జంట వివాహం చేసుకుంది. మేరీ వివాహం చేసుకుంటే ఆమె కెరీర్‌ నాశనం అయిపోతుందని నర్జిత్‌ సింగ్‌ వంటి పెద్దలంతా భయపడ్డారు. వారు ఊహించినట్లుగానే మేరీ 2006-08 కెరీర్‌కు దూరమయ్యింది. ఈ మధ్యలో ఆమెకు కవల పిల్లలు కూడా జన్మించారు. కుటుంబం అడ్డుకాలేదు... అందరి భయాలనూ తిప్పికొడుతూ మేరీ 2008లో తన కెరీర్‌ను తిరిగి ప్రారంభించింది. మళ్లీ ఒకదాని తరువాత ఒక పోటీని నెగ్గుకుంటూ పతకాల పంటని ప్రారంభించింది. ఒక పక్క గుండెజబ్బుతో బాధపడుతున్న పిల్లవాడిని గమనించుకుంటూ, ఆ బాధని దిగమింకుకుంటూనే రికార్డుల మోత మోగించింది. ఈ సందర్భంగా ఆమె భర్త ఆన్లర్‌ కామ్‌ అందించిన ప్రోత్సాహం కూడా అసామాన్యం. 2011 ఆమె ఆసియా కప్‌లో స్వర్ణాన్ని సాధించి వచ్చేనాటికి ఆమె పిల్లవాడికి ఆపరేషన్‌ కూడా విజయవంతంగా పూర్తయ్యింది. చరిత్ర ముగిసిపోలేదు... 2012లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళగా రికార్డు నెలకొల్పడమే కాదు, ఆ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి తన పతకాల రికార్డుని మరింత పదిలం చేసింది. మేరీ కామ్‌ ప్రతిభను గమనించిన కీర్తి ఆమె వెంటపడింది. పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో ఆమెను వరించాయి. మేరీ కాం జీవిత చరిత్ర ఆధారంగా 2013లో ‘అన్‌బ్రేకబుల్‌’ అనే పుస్తకాన్నీ, ఆ పుస్తకం ఆధారంగా ప్రియాంక చోప్రా ముఖ్యపాత్రతో చలనచిత్రాన్ని రూపొందించారు. మేరీకాం ప్రతిభను, పోరాటపటిమను గమనించిన కేంద్ర ప్రభుత్వం ఆమెను రాజ్యసభకు ఎంపికచేసింది. అయినా మేరీ కాం ప్రస్థానం ఇక్కడితో ఆగేట్లు లేదు. ఈ ఏడాది బ్రెజిల్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో అర్హత సాధించడం మీదే ఆమె దృష్టంతా! - నిర్జర.

అమ్మతో కాసేపు

  అమ్మతో కాసేపు గోరుముద్దలు - గోరింటాకులు, పాల బుగ్గలు - పట్టుపావడాలు, చందమామ కథలు - చద్దిఅన్నాలు ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ మనకిచ్చే తీపి జ్ఞాపకాలు ఎన్నో లెక్కకి కూడా అందవు. మనసు వాకిటిని తడితే చాలు దొర్లుకుంటూ వచ్చే తల్లి తలపులకు ఆనకట్ట వెయ్యటం కొంచెం కష్టమే. స్కూల్ నుంచి వచ్చాకా అక్కడ జరిగినవన్నీ అమ్మకి చెప్పకపోతే  నిద్ర పట్టదు. మనం సైకిల్ తొక్కినా అమ్మ చూడాలి, చెట్టెక్కి గెంతాలన్నా అమ్మే చూడాలి. మొత్తానికి మనం ఏం చేసినా అమ్మ పక్కనే ఉండాలి. మనతో ఇంతలా అల్లుకుపోయిన అమ్మని విడిచి దూరంగా వెళ్ళాల్సి వస్తే మన ప్రాణాలని ఎవరో తెలియకుండా లాగేసుకుంటునట్టు ఉండదూ. ఎన్నేళ్ళు వచ్చినా మనం ఇంకొకరికి అమ్మ అయినా మన అమ్మ మీదున్న ప్రేమ ఇసుమంతైనా తగ్గదు. పెద్ద చదువులకి వెళ్ళాకా పెద్ద ఉద్యోగాలు వచ్చాకా అమ్మతో గడిపే సమయం కరువవుతుంటే ఏం చేయటం. నిజంగానే మీకు అమ్మతో కాసేపు గడపి ఆమెని సంతోషంగా ఉంచాలంటే  ఎలా ప్లాన్ చేసుకోవచ్చో చూద్దామా. అమ్మకి ఇష్టమైన కాఫీని ఆమె లేచే లోపే తయారుచేసి రెడీగా ఉంచితే? లేవగానే ఒక చిరునవ్వుతో కాఫీని అందించి చూడండి. తనకోసం ఎవరెస్ట్ శిఖరాన్ని గుమ్మం ముందు తెచ్చి ఉంచితే ఎంత ఆశ్చర్యపోతుందో అంత ఆశ్చర్యాన్ని, దాని వెనక ఆనందాన్ని అమ్మ కళ్ళల్లో చూడచ్చు. అలాగే తనకిష్టమైన ప్లేస్ ఏముందో తెలుసుకుని ఆ ప్లేస్ కి సడన్ గా తీసుకెళ్ళి ఆమె కళ్ళల్లోకి తొంగి చూడండి. ఆ రోజంతా అమ్మని అంటిపెట్టుకుని ఉండి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ బయటనే చేసి ఇంటికి తిరిగి రండి. అంతలా తిరిగి వచ్చినా అమ్మ కళ్ళల్లో కనిపించని నీరసాన్ని చూసి మీకు నీరసం రావాలి. అమ్మకిష్టమైన వ్యక్తులని ఇంటికి పిలిచి సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేసి ఆమెకి ఆనందాన్ని ఇవ్వచ్చు. ఎప్పుడూ మన పనులతో బిజీగా ఉండే ఆవిడ తనకిష్టమైన వాళ్ళతో గడిపుతూ ఎలా సేద తీరుతుందో మీ కళ్ళతో మీరే చూడచ్చు. ఒక మంచి ఫోటో ఆల్బం కొని  అమ్మకి సంబందించిన అన్నీ ఫొటోస్ పెట్టి  దాన్ని గిఫ్ట్ గా ఇవ్వచ్చు. తనే మరిచిపోయిన ప్రపంచాన్ని తన కళ్ళ ముందు పరవచ్చు. ప్రతిక్షణం  మనకోసమే అలోచించి తన ఉనికినే మర్చిపోయే అమ్మకి ఆనందాన్ని గుర్తుచేద్దాం. ఇలా ఒక రోజు అమ్మని ఆనందంలో ముంచెత్తి మిగిలిన రోజుల్లో తన గురించి ఆలోచించకుండా ఉండటం మాత్రం ఎంతమాత్రం సబబు కాదు. నిజంగా అమ్మంటే ప్రేముంటే ప్రతిరోజూ ఆమె గురించి ఆలోచిద్దాం. ప్రతి క్షణం ఆమెని సంతోషంగా ఉంచుదాం. కళ్యాణి

వేసవికాలంలో చెమట పట్టకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి!

వేసవికాలంలో చెమట పట్టకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి!   ప్రతి సీజన్ ప్రజలకు ఇష్టమైనవి, ఇష్టం లేనివి అంటూ కొన్ని మార్పులను వెంటబెట్టుకొస్తుంది. వేసవిలో మామిడిపండ్లు, తాటిముంజలు, ఆవకాయ వంటి రుచులే కాకుండా భగభగ మండే ఎండలు, ఈ ఎండల ధాటికి ఎదురయ్యే చెమట, చెమట వెంట చెమటకాయలు, నలుగురిలో అసౌకర్యం వంటి చికాకు పెట్టే సంఘటనలు కూడా ఉంటాయి. సాధారణంగా అబ్బాయిలను మాత్రమే వేధించే అతి చెమట సమస్య వేసవి కాలంలో అమ్మాయిలను కూడా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా చెమట కారణంగా అమ్మాయిల ముఖం కాంతిని కోల్పోవడమే కాదు.. మొటిమలకు, దురదలకు, చర్మం కందిపోవడానికి కారణం అవుతుంది.  అయితే కింది ఫేస్ ప్యాక్ లు వేసుకుంటే వేసవి కాలంలో చర్మం తాజాగా ఉండటమే కాదు..  చెమట పట్టకుండా కూడా ఉంటుంది.  వేసవిలో అమ్మాయిలు ట్రై చెయ్యాల్సిన ఫేస్ ప్యాక్ లు ఏంటో ఓ లుక్కేస్తే.. పెరుగు, అలోవెరా ప్యాక్.. సూర్యరశ్మికి గురికావడం వల్ల  ముఖం కాంతిని కోల్పోయి  నిర్జీవంగా ఉంటుంది. దీనికి పెరుగు, కలబంద ప్యాక్ బెస్ట్ ట్రీట్మెంట్.   ఈ ప్యాక్ ముఖాన్ని  చల్లగా తాజాగా ఉంచడంలో సహాయపడతుంది. ఒక గిన్నెలో ఒక చెంచా పెరుగు,  మూడు చెంచాల అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. ఈ  మిశ్రమాన్ని  ముఖానికి అప్లై చేసిన తర్వాత 15 నుండి 20 నిమిషాలు అలాగే వదిలేయాలి. తరువాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ముల్తానీ మట్టి,  పుదీనా ఫేస్ మాస్క్.. పుదీనా శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.   ముల్తానీ మట్టి అదనపు నూనెను క్లియర్ చేస్తుంది.  ఈ మాస్క్ వేసుకుంటే ముఖ చర్మం మంటను తగ్గించుకోవచ్చు.  ఎండవేడి నుండి  ముఖాన్ని చల్లగా ఉంచుకోవచ్చు. ఒక గిన్నెలో 1 టీస్పూన్  పుదీనా పొడి లేదా పుదీనా పేస్ట్..  2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిని కలపాలి. అవసరమైతే దీనికి  కొన్ని చుక్కల నీటిని జోడించవచ్చు,  ఈ పేస్ట్ ను ముఖం,  మెడకు  అప్లై చేసిన తర్వాత అది ఆరిపోయే వరకు వెయిట్ చెయ్యాలి. అనంతరం సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. టమోటా, తేనె ఫేస్ మాస్క్.. ఒక గిన్నెలో ఒక మీడియం సైజ్ టొమాటో  గుజ్జు..  ఒక చెంచా తేనె కలపాలి.  ముఖానికి అప్లై చేసిన తర్వాత  20 నిమిషాలు అలాగే ఉంచాలి.  తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. జిడ్డుగల లేదా మోటిమలు వచ్చే చర్మానికి తేనెలోని యాంటీ బాక్టీరియల్   లక్షణాలు అద్భుతంగా పనిచేస్తాయి. మరోవైపు టొమాటోలు టానింగ్‌ను నిరోధించే లక్షణాలను కలిగి ఉంటాయి. వేసవిలో ఈ రెండింటి కలయిక మంచి ఫలితాలు ఇస్తుంది.   రోజ్ వాటర్, చందనం ఫేస్ మాస్క్.. వేసవికాలంలో వచ్చే మొటిమలు,  ముఖ చర్మంలో  అసౌకర్యానికి గంధం  ఎప్పటినుండో అందుబాటులో ఉన్న చిట్కా. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది.  అదనపు నూనెను, చర్మంలో ఉండే డస్ట్ ను తొలగిస్తుంది.   చర్మం  మెరుపును మెరుగుపరుస్తుంది.  2 టీస్పూన్ల స్వచ్ఛమైన గంధపు పొడిని రోజ్ వాటర్‌తో కలపాలి. ఈ పేస్ట్ ను  ముఖంపై  అప్లై చెయ్యాలి.  ఆరిన తరువాత సాధారణ నీటితో ముఖం కడుక్కోవాలి. పుచ్చకాయ, పెరుగు ఫేస్ మాస్క్.. ముఖానికి అవసరమైన  విటమిన్ ఎ,  సి పుచ్చకాయలో లభిస్తాయి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి మెరుపును ఇస్తుంది. జిడ్డుగల చర్మానికి ఇది మంచి ఎంపిక. ఒక గిన్నెలో 1 టీస్పూన్ పెరుగు,   పుచ్చకాయ గుజ్జు వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి ప్యాక్ లాగా అప్లై చేయాలి. టాన్ ఉన్న  ప్రాంతాలలో కాస్త మందం పొర వేసుకోవాలి.  పది నుండి పదిహేను నిమిషాల తర్వాత  ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్‌ని ఉపయోగించిన తర్వాత సన్‌బర్న్ అయిన ప్రాంతాలు ఉపశమనం పొందుతాయి.                                            *రూపశ్రీ.

ఆడవాళ్లకు అలెర్ట్.. మార్కెట్లో దొరికే కాటుకను ఎడాపెడా వాడేస్తే ఇంతే!

ఆడవాళ్లకు అలెర్ట్.. మార్కెట్లో దొరికే కాటుకను ఎడాపెడా వాడేస్తే ఇంతే! ఆడవాళ్ల అందాన్ని కవులు మామూలుగా వర్ణించలేదు. ముఖంలో ప్రతి భాగాన్ని చాలా ప్రత్యేకంగా అభివర్ణిస్తారు. నిజానికి కవుల వర్ణణ వల్ల అమ్మాయిల ముఖారవిందానికి ఎక్కువ మార్కులు వస్తాయో.. అమ్మాయిల అందం వల్ల కవులకు అంత మంచి వర్ణనలు దొరుకుతాయో చెప్పడం కాస్త కష్టమే.. అమ్మాయిల ముఖంలో కళ్ళను కలువరేఖలు అని వర్ణిస్తుంటారు. ఇక కళ్ళకు పెట్టుకునే కాటుకను చీకటితోనూ, నల్లని  తీర రేఖతోనూ పోలుస్తారు. కళ్లకు ఎక్కడలేని అందాన్ని తెచ్చిపెట్టే కాటుక ఈనాటిది ఏమీ కాదు.. కాటుక దిద్దిన కళ్లు చూస్తే ఫిదా అవ్వనివారు ఉండరు. ఇప్పట్లో సాధారణంగా రెఢీ అయినా సరే..  అమ్మాయిలు కేవలం కళ్లకే కాదు.. కళ్లకు కాస్త అటు ఇటు కూడా కాటుకను పొడవునా పెట్టి కనురెప్పలతో కలిపి అట్రాక్ట్ చేస్తారు. కానీ ఇప్పట్లో మార్కెట్లో దొరుకుతున్న కాటుక ఎడాపెడా వాడేయడం ఎంత వరకు మంచిదనే విషయం ఇప్పట్లో చర్చకు దారితీస్తోంది. మార్కెట్లో దొరికే కాటుక ఎక్కువ వాడితే కలిగే నష్టాలేంటో ఒక్కసారి తెలుసుకుంటే.. కళ్ళు పొడిబారతాయి.. కాటుక తయారీలో  కొన్ని పదార్థాలు వినియోగిస్తారు. వీటి వల్ల  కళ్ళు పొడిగా మారుతాయి . దీని కారణంగా, కళ్లలో దురద లేదా నొప్పి ఎదురవుతుంది. కళ్లు పొడిబారే సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే కళ్లు దెబ్బతింటాయి. కళ్లలో అలెర్డీ.. మార్కెట్లో దొరికే కాటుకను రెగ్యులర్ గా వేసుకునే అలవాటు ఉన్నవారికి కళ్ళ అలెర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కళ్ల చుట్టూ దురద, వాపు, దద్దుర్లు  వంటి లక్షణాలు కనిపిస్తాయి. కంటి చికాకు.. కాటుకను రెగ్యులర్ గా పెడుతూ ఉంటే కళ్లలో చికాకు వస్తుంది. కళ్లలో నొప్పి వంటి ఇబ్బందులు కలుగుతాయి. డార్క్ సర్కిల్స్.. కాటుకను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కళ్ల చుట్టూ మచ్చలు వస్తాయి. కొందరికి లైట్ గా ఉన్న డార్క్ సర్కిల్స్ కాటుక కారణంగా చాలా ఎక్కువగా కనిపిస్తాయి. కాజల్ స్మడ్జ్ ఫ్రూఫ్ కాదు కాబట్టి ఇలా జరుగుతుంది. కళ్లలో నీరు కారడం.. రెగ్యులర్ గా కాటుక పెడుతూ ఉంది అది కంటి మీద ప్రభావం చూపించి కళ్లలో నీరు రావడానికి కారణం అవుతుంది. ఎప్పుడైనా పండుగలు, శుభకార్యాలు, ఫంక్షన్స్, పార్టీలు మొదలైన సందర్బాలలో మాత్రమే మార్కెట్లో కొనుగోలు చేసే కాటుకను వాడాలి. మార్కెట్లో కొనే కాటుక వాడేముందు దాని ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి. లేకపోతే గడువు దాటిన కాటుక వల్ల కొన్నిసార్లు కంటిచూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.                                          *రూపశ్రీ.

మహిళలలో వెజినల్ యాక్నే ఎందుకొస్తుంది?  దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే!

  మహిళలలో వెజినల్ యాక్నే ఎందుకొస్తుంది?  దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే! చాలామంది మహిళలు బయటకు మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడే అంశం ప్రైవేట్ పార్ట్స్ గురించి.  ఆ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉన్నా,  ఏవైనా ఇబ్బందులు తలెత్తినా చాలావరకు మౌనంగా భరించడానికే మొగ్గుచూపుతారు. సాధారణంగా చాలామంది మహిళలలో యోనికి సంబంధించిన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిలో యోని ప్రాంతంలో మొటిమల్లాంటివి రావడం కూడా ఒకటి. అసలు యోని ప్రాంతంలో ఇలా యాక్నే లేదా మొటిమలు ఎందుకొస్తాయి. దీనికి ట్రీట్మెంట్ ఏంటి?  తెలుసుకుంటే.. వెజినల్ యాక్నే కు కారణాలు.. యోని ప్రాంతంలో కూడా సహంజంగానే వెంట్రుకల పెరుగుదల ఉంటుంది. ఈ వెంట్రుకల కుదుళ్లు ఆయిల్, డెడ్ స్కిన్ సెల్స్, బ్యాక్టీరియా తో నిండినప్పుడు సాధారణంగా ముఖం మీద వచ్చే ఎరుపు, వాపును పోలిన మొటిమల్లాంటి గడ్డలు వస్తాయి. ప్రైవేట్ పార్స్ట్ లో గాలి చాలా పరిమితంగా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో అధిక తేమ కారణంగా ఆ ప్రాంతంలో వచ్చే మొటిమలు కూడా అంత తొందరగా తగ్గవు. వీటిని నిర్లక్ష్యం చేస్తే అంటువ్యాధులు, వాపులు మొదలైన సమస్యలకు కారణం అవుతాయి. దీనికి మరొక కారణం. ఆ ప్రాంతంలో చెమట గ్రంధుల నుండి అధికంగా చెమట విడుదల కావడం. ఆ ప్రాంతంలో అవాంచిత రోమాలను తొలగించుకోవడానికి  వ్యాక్సింగ్, షేవింగ్ వంటి ప్రక్రియలు ఎక్కువగా చేయడం కూడా దీనికి కారణం అవుతుంది. ట్రీట్మెంట్ ఏంటంటే.. వెజినల్ ప్రాంతంలో మొటిమలు రావడం అనేది అమ్మాయిలను చాలా ఇబ్బంది పెట్టే అంశం. ఎక్కువ శాతం మంది ఈ సమస్య వచ్చినా బయటకు చెప్పుకోలేరు. కొన్ని రోజుల్లో అవే తగ్గిపోతాయని అనుకుంటూ వాటిని అలాగే భరిస్తారు.  అయితే ఇవి తగ్గించుకోవడానికి, ఇకమీదట రాకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు. యోని ప్రాంతంలో తగినంత గాలి ఆడేలా కాస్త వదులుగా ఉన్న దుస్తులు వేసుకోవాలి. బిగుతుగా ఉన్నవాటిని నివారించాలి. కాటన్ దుస్తులు అయితే మంచిది. ఆ ప్రాంతంలో ఎక్కువ తేమ ఉండకుండా జాగ్రత్త పడాలి. మొటిమలు వచ్చినప్పుడు వాటిని తగ్గించుకునే క్రమంలో సున్నితంగా వ్యవహరించాలి. యాంటీ బ్యాక్టీరియల్ సబ్బు,  మొటిమల నొప్పి నివారణకు వెచ్చని కంప్రెసర్ లు ఉపయోగించవచ్చు. ఈ మొటిమల ప్రభావం చాలా ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతుంటే మాత్రం చర్మ సంబంధ నిపుణులను కలవడం మంచిది. ఇక అమ్మాయిలు ఆ ప్రాంతంలో అవాంచిత రోమాల తొలగించుకోవడానికి సేఫ్టీ పద్దతులు ఫాలో అవ్వాలి. ఆహారం విషయంలోనూ, అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొటిమలు వచ్చినప్పుడు అతి జాగ్రత్తతో మొటిమలను ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. శరీరంలో వేడి పెరగడం వల్ల కూడా ఆ ప్రాంతంలో మొటిమలు వస్తుంటాయి. కాబట్టి దీన్ని నిర్మూలించడానికి  ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. హార్మోన్ల అసమతుల్యత లేకుండా జాగ్రత్త పడాలి.                                              *నిశ్శబ్ద.  

ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా చక్రవర్తి రజియా సుల్తానా!

ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా చక్రవర్తి రజియా సుల్తానా!   స్త్రీ....  అంటే ఓ చైతన్యం. అతివ.. ..అంటే ఓ అపూర్వం.  పడతి.... అంటే ఓ ప్రగతి.  అరచేతిని అడ్డుపెట్టి అరుణోదయాన్ని ఎలాగయితే ఆపలేమో. కట్టుబాట్ల అడ్డుగోడలు, కష్టాల కన్నీళ్ళు, స్త్రీమూర్తిని ఆపలేవు. సాధించాలన్న తపన ...లక్ష్యం చేరాలన్న ఆశయం ..ఆమెను ఆకాశమంత చేస్తాయి. ఆమె వేసే ఒక్కో అడుగు.. వేల మార్పులకు శ్రీకారం.  మహిళామణులు అందరికీ 'మహిళా దినోత్సవ' శుభాకాంక్షలు. 1908 సంవత్సరం మార్చి 8వ తేదీన అమెరికా దేశంలో మహిళలు తమకు ఉద్యోగాలలో సమాన అవకాశాలు, వేతనలు కావాలనీ డిమాండ్ చేస్తూ చేపట్టిన భారీ నిరసన ఉద్యమం చేపట్టారు. ఈ చారిత్రక నేపథ్యాన్ని పురస్కరించు కొని ప్రతి సంవత్సరం యావత్ ప్రపంచం మార్చి 8 తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. సమాన అవకాశాలు, స్వేఛ్చ అందించగలిగితే మహిళలు పురుషులకు మిన్నగా అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. అకాశంలో సగమైన మహిళ ఆత్మగౌరవం కోసం, అభ్యున్నతి కోసం ప్రతీ ఒక్కరు పని చేయడమే నిజమైన నాగరికతగా భావించాలి  గృహిణిగా, శ్రమజీవిగా, ఉద్యోగిగా, ప్రజాప్రతినిధిగా, అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నా ఆమెకు తగిన గుర్తింపు రావడం లేదు. ఇప్పటికీ సమాన పనికి సమాన వేతనం దక్కడం లేదు. ప్రజాప్రతినిధులుగా స్థానం సంపాదించినా భర్తల చేతిలో కీలుబొమ్మలుగానే ఉన్నారు. మహిళల సమానత్వం ప్రచార ఆర్భాటాలకే తప్ప ఆచరణలో కానరావడం లేదు. నేటికీ మహిళగానూ, శ్రామిక మహిళగానూ, పౌరురాలిగానూ దోపిడీకి గురౌతూనే ఉంది. ఇన్ని సమస్యలున్నా కొందరు విజయం వైపు దూసుకెళ్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.  సృష్టికి మూలం ఆడది. అసలు ఆడదే లేకపోతే సృష్టే లేదు. అంతటి మహోన్నత ప్రశస్తి కలిగిన మహిళ నేటి ప్రస్తుత నవ సమాజంలో అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. సాటి సభ్య సమాజాన్ని చూసి ఆమె కన్నీరు పెడుతుంది..! ఆడపిల్ల పుట్టిందంటేనే భారంగా భావించే రోజులు దాపురించాయి. అసలు బయటి ప్రపంచాన్ని చూడకుండానే అసువులు బాసిన ఆడపిల్లలు కోకొల్లలు. ఏ దేశంలో లేని దుస్థితి మన దేశంలో ఎందుకు..? ఆడపిల్లని కనడం, చదివించడం, పెళ్లి చేయడం లాంటి తదితరాలన్నింటినీ భారంగా భావించే తల్లిదండ్రులు మన దేశంలో ఎందరో..! అసలు ఆడపిల్ల పుట్టిందంటేనే అదో పెద్ద శిక్షగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆడపిల్లల సంఖ్య రోజురోజుకూ క్షీణిస్తుంది.  భారత  రాజ్యాంగం భారతీయ మహిళలందరికీ సమానత్వం (ఆర్టికల్ 14), రాష్ట్రాలనిబట్టి ఎటువంటి వివక్షా చూపించకుండా ఉండడం (ఆర్టికల్ 15 (1) ), అవకాశంలో సమానత్వం (ఆర్టికల్ 16), సమాన పనికి సమాన జీతం (ఆర్టికల్ 39 (డి) ) మొదలైన హామీల నిస్తున్నది. రాష్ట్రాలు స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక సదుపాయాలను అందించే వీలు కలుగజేస్తుంది (ఆర్టికల్ 15 (3)). మహిళల గౌరవానికి భంగం కలిగించే చర్యలను త్యజించాలని (ఆర్టికల్ 51 (ఎ) ) సూచిస్తోంది. అలాగే స్త్రీలకు ప్రసూతి సెలవలు ఇవ్వడానికి, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడాన్ని అనుమతిస్తుంది. (ఆర్టికల్ 42).   ఆదర్శాలకీ వాస్తవాలకూ మధ్య చాలా సందర్భాల్లో పొంత్యన కుదరదన్న విషయాన్నే దేశంలో ఎల్లెడలా పరుచుకుపోయిన అసమానతలు చాటుతున్నాయి. వివిధ రంగాల్లో స్త్రీ పురుషుల మధ్య సామానత్వ సాధనలో ఏఏ దేశాలు ఎంతెంత వెనకబడి ఉన్నాయో ఆ నివేదిక కళ్లకు కడుతుంది. 2017 చివర్లో వెలువడిన ఓ నివేదిక ప్రకారం మొత్తం 145దేశాల పరిస్థితులను విశ్లేషిస్తే భారత్  108వ స్థానంలో ఉంది. ఆర్ధిక భాగస్వామ్యంలో 139, విద్యలో 125, వైద్యం, ఆరోగ్యంలో 143 వ స్థానాన్ని ఆక్రమించింది. సమానత్వ సూచీలో పేర్కొన్న గణాంకాల ప్రకారం 145 దేశాల్లో ఏ ఒక్కటీ స్త్రీ పురుష అంతరాలను తగ్గించడంలో వంద శాతం విజయం అందించలేదు.  ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ వంటి దేశాలు 80 శాతం వరకు అధిగమించి సమానత సాధన దిశలో ముందు వరసల్లో ఉన్నాయి. బలమైన ఆర్ధిక వ్యవస్థలున్న సమాజాలు సమానత్వ సాధనలో వెనకబడిపోవడానికి మహిళా శక్తిని గుర్తించలేకపోవడంతో పాటు పాతుకుపోయిన పురుషాధిక్య భావజాలమూ ప్రధాన కారణమే. భారత్‌లో మహిళలు పురుషులతో పోలిస్తే రోజూ అయిదు గంటల పాటు ఎలాంటి ప్రతిఫలం లభించని పని చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. పని విభజనలో తారతమ్యం ఏ దేశంలోనూ ఈ స్థాయిలో ఉండదు. ఆర్ధిక సాధికారతలో వెనకబాటుకు ప్రధాన కారణమదే. మహిళా యాజమాన్యంలోని సంస్థలు అతి తక్కువ శాతం ఉన్నదీ భారత్ లోనే.  ప్రపంచవ్యాప్తంగా గడిచిన పదేళ్లలో మహిళా కార్మిక శక్తి 150 కోట్ల నుంచి 175 కోట్లకు పెరిగింది. కానీ మహిళల వార్షిక వేతనం చూస్తే ప్రస్తుతం స్త్రీలు సంపాదిస్తున్న జీతం పదేళ్ల క్రితం పురుషుడు సంపాదించిన దానితో సమానం. ప్రగతి బాటలో స్త్రీ పురుషుల మధ్య అంతరం తగ్గుతూ పోయిన కొద్దీ జీడీపీ పెరుగుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ రంగంలో అంతరాలను అధిగమించిన దేశం సుసంపన్నం అవుతోంది.  భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్ లో "అనసూయా సారాభాయ్ -టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌" అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్‌, విమలారణదివే, కెప్టెన్‌ లక్ష్మిసెహగల్‌, అహల్యారంగ్నేకర్‌, పార్వతీకృష్ణన్‌ ప్రముఖులు.. కొన్ని సహస్రాబ్దులు గా  భారత దేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనౌతూ వచ్చింది. ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగివున్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అణచబడటం, అనేకమంది సంఘ సంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడం, ఇలా భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది.  ఆధునిక భారతదేశంలోమహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించి దేశ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడింపచేసారు. పతంజలి, కాత్యాయనుడు వంటి ప్రాచీన భారత వ్యాకరణకర్తల రచనల ప్రకారం, వేదకాలపు ఆరంభంలో మహిళలు చదువుకోనేవారని తెలుస్తోంది. ఆ సమయంలో మహిళలు యుక్తవయస్సులో పెళ్ళి చేసుకోనేవారని, వారు భర్తను ఎన్నుకొనే హక్కుని కలిగి ఉండేవారని ఋగ్వేద శ్లోకాలు తెలుపు తున్నాయి. తరువాత (సుమారుగా 500 బి.సి.) నుండి మహిళల హోదా తగ్గడం మొదలయ్యింది  మధ్యయుగ సమాజంలో మహిళల స్థాయి ఇంకా దిగజారింది.   కొంత  మంది మహిళలు రాజకీయ, సాహిత్యం, విద్య, మత రంగాలలో రాణించారు. రజియా సుల్తానాఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా చక్రవర్తి.  గోండు రాణి దుర్గావతి పదిహేనేళ్ళు పరిపాలన సాగించింది. ఆమె మొఘల్ చక్రవర్తి అక్బర్ ను ఎదుర్కొంది. అక్బర్ ను  1590లో చాంద్ బీబీ ఎదుర్కొని అహ్మద్ నగర్‌ను రక్షించింది.  జహంగీర్ భార్య నూర్జహాన్  సార్వభౌమ అధికారాన్ని ప్రతిభావంతంగా చెలాయించి మొఘల్ మకుటం వెనుక ఉన్న నిజమైన శక్తిగా గుర్తింపు పొందింది.  మొఘల్ యువరాణులు జహనారా, జేబున్నీసాలు మంచి పేరున్న రచయిత్రులు.  శివాజీ తల్లి జిజియాబాయి యోధురాలిగాను, పాలకురాలి గానూ చాటుకున్న సమర్థత వలన సమర్ధురాలైన రాణిగా గణుతి కెక్కింది.  దక్షిణ భారతంలో చాలామంది మహిళలు గ్రామాలు, పట్టణాలు, మండలాలను పాలించారు. అనేక సామాజిక, మత సంస్థలకు ఆద్యులయ్యారు. భక్తి ఉద్యమం మహిళల హోదాని తిరిగి నిలపడానికి ప్రయత్నించి కొన్ని రకాల అణిచివేతలను అడ్డుకుంది. మీరాబాయి అనే ఒక మహిళా సాధు కవయిత్రి భక్తి ఉద్యమపు ముఖ్య వ్యక్తులలో ఒకరు. ఈ కాలపు ఇతర మహిళా సాధు-కవయిత్రులు అక్క మహాదేవి, రామి జనాభాయి, లాల్ దేడ్.   యూరోపియన్ పరిశోధకులు 19వ శతాబ్దపు భారత స్త్రీలు మిగతా స్త్రీలకంటే "సహజంగా శీలవంతులు", "ఎక్కువ ధర్మపరులు" అని గమనించారు.  బ్రిటిషు పాలన సమయంలో రామ్ మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, జ్యోతిరావు ఫులే మొదలైన సంఘసంస్కర్తలు మహిళా అభ్యున్నతికి పోరాడారు. పండిత రమాబాయి వంటి చాలామంది మహిళా సంస్కర్తలు కూడా మహిళా అభ్యున్నతికి కృషి చేసారు. కర్ణాటకలోని కిట్టుర్ రాజ్య రాణి కిట్టుర్ చెన్నమ్మ బ్రిటిషువారి కాలదోషం పట్టిన సిద్ధాంతాలకి ప్రతిస్పందనగా వారికీ వ్యతిరేకంగా సైన్యాన్ని నడిపించింది. తీరప్రాంత కర్ణాటక రాణి అబ్బక్క రాణి యురోపియన్ సైన్యాల ఆక్రమణలకి ముఖ్యంగా 16వ శతాబ్దంలో పోర్చుగీసు ఆక్రమణలకి ఎదురునిలిచింది. రాణి లక్ష్మీ బాయి ఝాన్సీ రాణి బ్రిటిషువారికి వ్యతిరేకంగా 1857 భారతీయ తిరుగుబాటుని నడిపించింది. ఆమె నేడు జాతీయ హీరోగా భావించబడుతున్నది.  అవద్ సహా-పాలకురాలు బేగం హజ్రత్ మహల్ 1857 తిరుగుబాటును నడిపించిన ఇంకో పాలకురాలు. ఈమె బ్రిటిషువారితో ఒప్పందాలని నిరాకరించి తరువాత నేపాల్ కి వెళ్ళిపోయింది. మహిళలు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యపాత్ర పోషించారు. కొంతమంది ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాళ్ళు భికాజి కామా, డా. అనీ బిసెంట్, ప్రీతిలత వడ్డేదార్, విజయలక్ష్మి పండిట్, రాజకుమారి అమ్రిత్ కౌర్, అరుణ అసఫ్ ఆలీ, సుచేత కృపలానీ, కస్తుర్బా గాంధీ. మరికొందరు ముఖ్యులు ముత్తులక్ష్మీ రెడ్డి, దుర్గాబాయి దేశ్ముఖ్మొదలైనవారు. సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ, లక్ష్మీ సెహగల్ని కెప్టన్‌గా, మొత్తం మహిళలతో కూడిన  ది రాణి అఫ్ ఝాన్సీ రెజిమెంట్ ను ఏర్పాటు చేసింది. కవయిత్రి, స్వాతంత్ర్య సమర యోధురాలూ అయిన సరోజినీ నాయుడు, భారత జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ. భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నరయిన మొదటి మహిళ కూడా. నేటి భారతీయ మహిళ విద్య, రాజకీయాలు, మీడియా, కళలు, సంస్కృతీ, సేవా విభాగాలు, విజ్ఞాన, సాంకేతిక రంగాలు వంటి అన్ని రంగాలలో పాల్గొంటోంది. పదిహేనేళ్ళపాటు భారతదేశపు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ ప్రపంచంలో ప్రధానమంత్రిగా ఎక్కువకాలం పని చేసిన మహిళ. ఈదేశంలో  మనం కొందరు   మహిళలు గురించి తెలుసుకోవాలి.. జాన్ ఇలియట్ డ్రింక్ వాటర్ బెతూనే 1849లో బెతూనే స్కూల్ ప్రారంభించింది, ఇది 1879లో బెతూనే కళాశాలగా వృద్ధి చెంది భారతదేశంలో మొదటి మహిళా కళాశాల అయింది. 1883 లో చంద్రముఖి బసు,  కాదంబినీ గంగూలీ బ్రిటిషు సామ్రాజ్యపు మొదటి మహిళా పట్టభధ్రులయ్యారు. కాదంబినీ గంగూలీ, ఆనందీ గోపాల్ జోషి భారతదేశమునుండి పాశ్చాత్యవైద్యంలో శిక్షణ పొందిన మొదటి మహిళలు. 1905 లో సుజన్నే ఆర్ డి టాటా కారు నడిపిన మొదటి భారతీయ మహిళ. 1916 జూన్ 2న సంఘసంస్కర్త  దొండో కేశవ్ కార్వేగారిచేత కేవలం ఐదుమంది విద్యార్థులతో మొదటి మహిళా విశ్వవిద్యాలయం SNDT మహిళా విశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1917 లో అన్నే బిసెంట్ భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలయింది. 1919 లో ఆమె విలక్షణమైన సామజిక సేవకు గుర్తింపుగా పండిత రమాబాయి బ్రిటీష్ రాజ్ నుంచి కైజర్-ఇ-హింద్ పురస్కారం పొందిన మొదటి మహిళ. 1925 లో సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్కి భారతదేశంలో పుట్టిన మొదటి మహిళా అధ్యక్షురాలు. 1944 లో భారతీయ విశ్వవిద్యాలయంనుంచి సైన్స్ డాక్టరేట్ అందుకున్న మొదటి మహిళ అసిమా చటర్జీ. 1947 ఆగస్టు 15 స్వతంత్రం తరువాత సరోజినీనాయుడు యునైటెడ్ ప్రావిన్సులకి గవర్నర్ అయింది, ఈవిడ భారతదేశపు మొదటి మహిళ గవర్నరు. 1951లోడెక్కన్ ఎయిర్వేస్ కు చెందినా ప్రేమ మాథుర్ భార్తదేశపు మొదటి మహిళా వాణిజ్య పైలట్. 1953లో  విజయలక్ష్మి పండిట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి మొదటి మహిళా అధ్యక్షురాలు  (మొదటి భారతీయ)  1959లో  అన్నా చండీ హైకోర్టుకి మొదటి మహిళా జడ్జ్ (కేరళ హై కోర్టు)  1963లో  సుచేత కృపలానీ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయి, భారతదేశంలోని ఏ రాష్ట్రములోనైనా ఆస్థాయిని పొందిన మొదటి మహిళ అయ్యారు. 1966 లో  కేప్టన్ దుర్గ బెనర్జీ ఒక రాష్ట్ర ఎయిర్లైన్స్, ఇండియన్ ఎయిర్లైన్స్ కి పైలట్ అయిన మొదటి భారతీయ మహిళ. 1966లో  కమలాదేవి చటోపాధ్యాయ  వర్గ నాయకత్వానికిగానూ రామన్ మెగాసస్సే పురస్కారం గెలుచుకున్నారు. 1966లో ఇందిరాగాంధీ భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి. 1970లో కమల్జిత్ సందు ఏషియన్ గేమ్స్ లో బంగారు పతకం గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ. 1972లో  కిరణ్ బేడి ఇండియన్ పోలీస్ సర్వీస్ కి ఎన్నికయిన మొదటి మహిళా అభ్యర్థి. 1979లో  మదర్ థెరిస్సా నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా పౌరురాలు. 1984 మే 23న బచేంద్ర పాల్ మౌంట్ ఎవరెస్ట్ను  అధిరోహించిన మొదటి మహిళ అయ్యారు. 1989 లో జస్టిస్ ఎం.ఫాతిమా బీవీ సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాకి మొదటి మహిళా జడ్జ్ గా ఎన్నికయ్యారు. 1997లో కల్పనా చావ్లా గగనంలోకి వెళ్ళిన మొదటి భారత జన్మిత మహిళ. వీరందరి స్ఫూర్తితో మన సోదరీమణులు ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...💐💐💐

మచ్చలేని ముఖచర్మానికి ఇంట్లోనే  బ్యూటీ క్రీమ్ ఇలా సిద్దం చేసుకోండి!

 మచ్చలేని ముఖచర్మానికి ఇంట్లోనే  బ్యూటీ క్రీమ్ ఇలా సిద్దం చేసుకోండి! ఎవరిని అయినా సరే మొదట చూడగానే వారి ముఖమే గమనిస్తారు. ముఖం అందంగా ఉంటే ఇట్టే ఏదో ఆకర్షణ పుడుతుంది. అందుకే అమ్మాయిలు అందంగా తయారవ్వడానికి కష్టపడతారు. ఇప్పుడున్న మేకప్ ల ప్రభావం కారణంగా ఎలాంటి వారు అయినా మేకప్ వేయగానే హీరోయిన్స్ ను తలదన్నేలా ఉంటారు. అయితే ఎంతసేపూ ఇలా మేకప్ లు వేసి ముఖాన్ని కవర్ చేయడం, ముఖం సహజంగా అందంగా మారడం కోసం బ్యూటీ క్రీములు వాడటం చేస్తుంటారు. కానీ ఎంత వాడినా అవి  తగిన ఫలితం ఇవ్వవు. అయితే దీనికి సహజమైన చక్కని పరిష్కారం ఉంది. ఇంట్లోనే ఈజీగా బ్యూటీ క్రీమ్ తయారుచేసుకుని వాడటం వల్ల మచ్చలేని, యవ్వనమైన ముఖ చర్మం సొంతమవుతుంది. దీన్నెలా తయారుచెయ్యాలో, దీనికి కావలసిన పదార్థాలేంటో  తెలుసుకుంటే.. ఇంట్లోనే బ్యూటీ క్రీమ్ తయారుచేయడానికి కావలసిన పదార్థాలు ఇవీ.. బాదం నూనె.. 1/2టేబుల్ స్పూన్ గ్లిజరిన్..1/2 టేబుల్ స్పూన్ కొబ్బరినూనె..1/2టేబుల్ స్పూన్ యాపిల్ జ్యూస్.. 2టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్.. 1 టేబుల్ స్పూన్ విటమిన్ -ఇ టాబ్లెట్.. 1 పై పదార్థాలు అన్నీ ఒకచిన్న గిన్నెలో ఒకదాని తరువాత ఒకటి వేస్తూ మిశ్రమాన్ని బాగా మిక్స్ చెయ్యాలి. దీన్ని ఎక్కువసేపు మిక్స్ చేస్తే ఇది క్రీమ్ లాగా తయారవుతుంది. ఈ క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుంటూ ఉంటే ముఖం మీద మచ్చలు, గీతలు,ముడతలు అన్నీ క్రమంగా తగ్గుతాయి. మరీ ముఖ్యంగా ముఖం కాంతివంతంగా తయారవుతుంది.  ఈ క్రీమ్ ను ఏ సమయంలో అయినా ఉపయోగించవచ్చు. దీన్ని చిన్న కంటైనర్ లో భద్రపరిచి ఫ్రిజ్ లో ఉంచితే వారం రోజుల పాటూ ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ ఫలితాలు కావాలంటే ఈ క్రీమ్ ను రాత్రి పడుకునేముందు ముఖాన్ని శుభ్రం చేసుకుని నైట్ క్రీమ్ లాగా రాసుకుని పడుకోవాలి.                                             *నిశ్శబ్ద.

పట్టుచీరలు  ఐరన్ చేసేటప్పుడు ఈ టిప్స్ తప్పక పాటించండి!

పట్టుచీరలు  ఐరన్ చేసేటప్పుడు ఈ టిప్స్ తప్పక పాటించండి! భారతీయ సాంప్రదాయానికి మెరుగులు దిద్దేవి పట్టుచీరలు. పట్టుచీరలలో అమ్మాయిలు ముస్తాబైతే వారిని చూడటానికి రెండు కళ్లు సరిపోవు. నిజానికి భారతీయత అంతా పట్టుచీరలలోనే తిష్ట వేసుకుందేమో అనిపిస్తుంది. ఇకపోతే ప్రతి మహిళ దగ్గరా పట్టుచీరలు ఉండటం కామన్. పండుగ, శుభకార్యాల సమయాలలో సందర్బానుసారంగా పట్టుచీరలు కట్టి పండుగకు మరింత అందం తెస్తారు. అయితే పట్టుచీరలను ఐరన్ చేసేటప్పుడు కొన్ని టిప్స్  పాటిస్తే మాత్రం లుక్ రెట్టింపు అవుతుంది. దుస్తులు కూడా సురక్షితంగా ఉంటాయి. ఇంతకీ పట్టుచీరలను ఐరన్ చేసేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. ముందు జాగ్రత్త.. పట్టుచీరలను జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే దానికి చెయ్యాల్సిన మొదటి పని కొనుగోలు చేసేటప్పుడే ఆ చీరలను ఐరన్ చెయ్యచ్చా లేదా అనే విషయం తెలుసుకోవడం. ఒకవేళ పెద్ద షాప్స్ లో కొంటూ ఉంటే ఆ పట్టు రకం, దాని ఖరీదు మొదలైనవాటితో పాటూ సదరు చీరను ఐరన్ చెయ్యచ్చా లేదా అనే విషయం కూడా అందులో పొందుపరిచి ఉంటారు.  అవి చూసుకోవాలి. కవరింగ్.. పట్టుచీరలను ఎప్పుడూ నేరుగా ఐరన్ చెయ్యకూడదు. పట్టుచీర మీద ఐరన్ బాక్స్ నేరుగా పెట్టకూడదు. దానిబదులు మొదట చీరను జాగ్రత్తగా ఒక పెద్ద టేబుల్ మీద ఉంచి, చీర మీద కాటన్ క్లాత్ లేదా కాటన్ టవల్ వంటివి ఉంచాలి.పైన క్లాత్ ఐరన్ చేస్తుంటే కింద చీర ఐరన్ అయిపోతుంది. ఇలా ఐరన్ చేస్తే చీర దారప్పోగులు, రంగు దెబ్బతినవు. సెట్ చేయాలి.. ఐరన్ బాక్స్ తో ఐరన్ చేసేటప్పుడు ప్రతి ఫ్యాబ్రిక్ కు తగినట్టు  టెంపరేచర్ సెట్ చేసే సౌకర్యం ఉంటుంది. దాన్ని అనుసరించి పట్టుచీరల కోసం సిల్క్ సెట్టింగ్ చేయాలి. ఇలా చేస్తే పట్టుబట్టలకు తగినంత మాత్రమే ఉష్ణోగ్రత ప్రసారం అవుతుంది. మొదలు ఇక్కడే.. పట్టుచీరలను మొదట అంచు నుండి ఐరన్ మొదలుపెట్టాలి. తరువాత చీరల మధ్యలో ఐరన్ చెయ్యాలి. ఇలా చేస్తే ముడతలు ఉండవు. కానీ చీరలు పాడవకుండా ఉండాలన్నా, ఏమాత్రం నష్టం జరగకూడదు అన్నా ఐరన్ బాక్స్ ను చీరమీద ఒకేచోట ఎక్కువ సేపు ఉంచకూడదు. ఫైనల్ స్టెప్ మిస్టేక్.. చీరలు ఐరన్ చేశాక జాగ్రత్తగా మడతేసి బీరువాలో పెట్టడం మగువలకు అలవాటు. అలా కాకుండా ఐరన్ చేసిన చీరలను హ్యాంగర్ కు పెట్టి దాన్ని వార్డ్ రోబ్ లో వేలాడదీయాలి. కవర్లలో పెట్టడం ఇరుకైన డ్రాయర్లలో పెట్టడం చెయ్యకూడదు.                                       *నిశ్శబ్ద.

సర్వైకల్ క్యాన్సర్..  మహిళలకు ప్రాణాంతక జబ్బు ఇది..!

సర్వైకల్ క్యాన్సర్..  మహిళలకు ప్రాణాంతక జబ్బు ఇది..! మహిళల ఆరోగ్యానికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య రక్కసిలా కోరలు చాపుకుని పొంచి ఉంటుంది. తాజాగా బాలీవుడ్ నటి , మోడల్.. పూనమ్ పాండే మహిళల ప్రాణాలను అధికంగా బలితీసుకుంటున్న సర్వేకల్ క్యాన్సర్ తో మృతిచెందింది. అప్పటికే ఈ క్యాన్సర్ గురించి పలు అవగాహనా వార్తలు, చర్యలు తీసుకుంటుంటగా.. పూనమ్ పాండే మృతి ఈ సమస్య మీద గట్టిగా చర్చించాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది.  32ఏళ్ల వయసుకే  పూనమ్ పాండే మరణానికి కారణం అయిన సర్వైకల్ క్యాన్సర్  ఎలా వస్తుంది? దీనికి చికిత్స లేదా? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. మహిళలలో యోని, గర్భాశయాన్ని కలిపే భాగాన్ని సర్వైకల్ అని పిలుస్తారు. ఈ సర్వైకల్  ప్రాంతంలో క్యాన్సర్ కణాలు పెరిగి అవి క్రమంగా గర్బాశయంలోకి వ్యాపించి వ్యాధిని వ్యాప్తి చేస్తాయి. దీన్నే సర్వైకల్ క్యాన్సర్ లేదా గర్బాశయ క్యాన్సర్ అని అంటారు.  నిజానికి సర్వైకల్ క్యాన్సర్ అనేది అంటువ్యాధి.  హ్యూమన్ పాపిల్లోమావైరస్ ఈ వ్యాధికి కారణమవుతుంది.  కానీ ఈవైరస్ వచ్చినప్పుడు చాలా వరకు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దీన్ని అధిగమిస్తుంది. ఈ  హ్యూమన్ పాపిల్లోమావైరస్  కూడా చాలా రకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని మాత్రమే గర్భాశయ క్యాన్సర్ కు కారణం అవుతాయి. ఈ వైరస్ ఎలా సంక్రమిస్తుందంటే.. చాలావరకు ఈ వైరస్ శారీరక సంభోగం వల్లే వస్తుంది. అక్రమ సంబంధాలు కలిగి ఉండటం. ఎక్కువ మందితో రిలేషన్ మెయింటైన్ చేయడం వంటివి ఈ వైరస్ కు ఎక్కువ కారణాలు.  యోని ప్రాంతంలో ఇన్పెక్షన్లు రావడం వంటివి కూడా ఈ వైరస్ రావడానికి ప్రధాన కారణం అవుతాయి. గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు.. కటి నొప్పి మూత్రంలో రక్తం లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే ఎక్కువ పీరియడ్స్ ముగిసిన తర్వాత కూడా రక్తస్రావం కావడం వింత వాసనతో కూడిన బ్లడ్ లేదా యోని నుండి ద్రవాలు రావడం అలసట ఆకలి నష్టం వెన్నునొప్పి కాళ్ళలో వాపు గర్భాశయ క్యాన్సర్ నాలుగు దశలలో ఉంటుంది. దీనికి చికిత్స క్యాన్సర్ దశను బట్టి జరుగుతుంది. కీమెథెరపీ, రేడియేషన్ థెరపీ, టార్లెటెడ్ థెరపీ, శస్త్రచికిత్స, ఇమ్యునోథెరపీ మొదలైన పద్దతులలో దీనికి చికిత్స చేస్తారు.                                                *నిశ్శబ్ద.

విడాకులు తీసుకోవడానికి సిద్దపడ్డారా..ఈ ఐదు విషయాల గురించి స్పష్టత ఉందా !

విడాకులు తీసుకోవడానికి సిద్దపడ్డారా..ఈ ఐదు విషయాల గురించి స్పష్టత ఉందా ! స్నేహితులు, బంధుమిత్రుల సమక్షంలో  ఒక్కటై జీవితాంతం కలసి ఉండాలనే ఆలోచనతో పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ ఇక ఇద్దరూ కలసి ఉండటం అసాధ్యమని, ఇద్దరూ ఒక చోట ఉంటే అక్కడ పెద్ద గొడవకే దారి తీస్తుందనే పరిస్థితి వచ్చాక చట్టప్రకారంగా విడాకులు తీసుకుని విడిపోతారు. ఈ మధ్యకాలంలో విడాకులు కూడా చాలా సాధారణం అయిపోయింది.  నిజానికి భార్యాభర్తలు కష్టంగా కలసి ఉండటం కంటే ఇద్దరూ మాట్లాడుకుని ఆరోగ్యకరంగానే విడిపోవడం మంచిది. దీనివల్ల కొత్త జీవితం ప్రారంభించే అవకాశం ఉంటుంది. అయితే విడాకులు తీసుకోవడానికి సిద్దమయ్యక కొన్ని విషయాల మీద స్పష్టత అవసరం అవుతుంది. ఆ విషయాల గురించి పూర్తీగా క్లారిటీ వచ్చిందన్నాకే విడాకులు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా మహిళల జీవితంలో విడాకులు పెద్ద కుదుపుకే కారణం అవుతాయి. అప్పటికే పిల్లలున్నా, కుటుంబాలు కాస్త సాంప్రదాయంగానూ, పెద్దవిగానూ అయినా చాలా ఇబ్బందులే ఎదుర్కొంటారు. అందుకే ఈ ఐదు విషయాల మీద స్పష్టత ఉండటం ఎంతో అవసరం అవుతుంది. విడాకుల ప్రక్రియ.. విడాకులు తీసుకోవాలని  నిర్ణయించుకోవడం వేరు దాన్ని చట్టప్రకారంగా అమలు దిశగా తీసుకెళ్లడం వేరు. విడాకులు తీసుకోవాలని  నిర్ణయించుకున్నాక అనుభవజ్ఞులైన న్యాయవాదుల దగ్గరకే వెళ్లాలి. వారు విడాకుల నిర్ణయం ఎంతవరకు సరైనదో కూడా చెబుతారు. దీనివల్ల ఆవేశం మీద చీలిపోయే బంధాలు కూడా నిలబడే అవకాశం ఉంటుంది. చట్టప్రకారంగా విడాకులు తీసుకుంటే ఆ తరువాత హక్కులు, బాధ్యతలు వంటి విషయాల గురించి కూడా న్యాయవాదులు స్పష్టత ఇస్తారు. ఆర్థిక పరిస్థితి.. భర్త సంపాదిస్తున్నాడు కదా ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటే అదే సంతోషం అనుకుని చాలామంది మహిళలు పెళ్లయ్యాక ఉద్యోగాలు మానేస్తుంటారు. దీనివల్ల విడాకుల తరువాత ఇబ్బందులు తలెత్తుతాయి. భర్త నుండి భరణం లభించినా అది నేటి ఖరీదైన జీవనానికి ఎంతవరకు సరిపోతుందో చెప్పలేం. ఇకపోతే మగవారు విడాకులు తీసుకోవాలి అనుకుంటే ముందుగా తమ ఆర్థిక పరిస్థితి గమనించుకోవాలి. తమ సంపాదనలో భార్యకు భరణం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దాని గురించి ఆలోచించి ముందడుగు వెయ్యాలి. పిల్లల గురించి ఆలోచన.. చాలా కేసులలో భార్యాభర్తల గొడవల కారణంగా పిల్లలు తల్లిదండ్రుల  ప్రేమను కోల్పోతారు. తల్లిదండ్రుల విడాకుల తరువాత ఇద్దరి ప్రేమను ఉమ్మడిగా పొందే అవకాశం పిల్లలకు ఉండదు. పైపెచ్చు పిల్లలు ఎవరో ఒకరి దగ్గరున్నా, వారి సంరక్షణ విషయంలో ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఎదురవుతాయి. నిజానికి విడిపోయిన తల్లిదండ్రుల కారణంగా పిల్లలు కూడా సమాజం నుండి చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటి గురించి ఆలోచించాలి. విడాకులు తీసుకోవడం అంత ఈజీ కాదు.. సినిమాల్లోనూ, సీరియళ్లలోనూ చూపించినంత ఈజీగా విడాకుల వ్యవహారం ముగిసిపోదు. దానికి చాలా పెద్ద తతంగమే నడుస్తుంది. విడాకుల గోల నడుస్తుండగానే ఆ ఒత్తిడి భరించలేక చాలా సార్లు డిప్రెషన్ వంటి సమస్యలు కూడా ఎదురుకావచ్చు. అందుకే విడాకుల విషయం పూర్తీగా స్పష్టత వచ్చాకనే ముందుకు వెళ్లాలి. ఆ తరువాత కూడా కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో కలుస్తూ గతం తాలూకు విషయాలు చాలా వరకు అధిగమించాలి. భాగస్వామ్యం అవసరం.. విడాకులు కావాలంటే ఓ లాయర్ ను నియమించుకోవాలి. కేవలం లాయర్ ను నియమించుకుంటేనే కాదు.. విడాకులకు గల కారణాలను ఆధారాలతో సహా కోర్టు వారి ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కోర్టు అడిగే ప్రతి విషయంలో చురుగ్గా స్పందించాలి. విడాకుల చట్టంలో నియమాలు, సందేహాలు తప్పని సరిగా తెలుసుకోవాలి. లీగల్ ప్రోసీడింగ్ గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా భవిష్యత్తు గురించి ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి.                                                  *నిశ్శబ్ద.  

వాషింగ్ మెషీన్ లో దుస్తులు వేసే అలవాటు ఉంటే ఈ పనులు మాత్రం చెయ్యకండి!

వాషింగ్ మెషీన్ లో దుస్తులు వేసే అలవాటు ఉంటే ఈ పనులు మాత్రం చెయ్యకండి! స్నానం చెయ్యడం, ఉతికిన  దుస్తులు ధరించడం పిల్లల నుండి పెద్దల వరకు పాటించే అలవాటు. అయితే వాషింగ్ మెషిన్ వాడే అందరికీ అందులో దుస్తులు వేయడం గురించి సరైన అవగాహన ఉండదు. కొందరు తెలిసీ తెలియక కొన్ని రకాల దుస్తులు వేయడం వల్ల దుస్తులు చాలా దారుణంగా దెబ్బతింటాయి.  అసలు వాషింగ్ మెషీన్లో వేయకూడని దుస్తులేంటో తెలుసుకుంటే.. ఉన్ని దుస్తులు.. ఉన్నిదుస్తులను వాషింగ్ మెషీన్లో అస్సలు వేయకూడదు. దీనివల్ల దుస్తులు చాలా దారుణంగా దెబ్బతింటాయి. ముఖ్యంగా ఉన్ని దారాల మధ్య గ్యాప్ పెరిగిపోయి దుస్తులు చాలా వదులుగా తయారవుతాయి. దీనివల్ల ఈ దుస్తులను చలికాలంలో వేసుకున్నా చలిని నియంత్రించలేవు. పైపెచ్చు ఉన్నిదుస్తులు వాషింగ్ మెషీన్లో వేస్తే రంగు కోల్పోయనట్టు డల్ గా తయారవుతాయి. లెదర్ దుస్తులు.. అబ్బాయిలు లేదా అమ్మాయిలు లెదర్ దుస్తులను వాడుతుంటారు. ముఖ్యంగా లెదర్ జాకెట్లు చాలామందికి ఉంటాయి. అదే విధంగా తోలుతో తయారైన ఇతర దుస్తులు కూడా ఉంటాయి.  కానీ వీటిని వాషింగ్ మెషీన్లో వేయకూడదు. ఇవి తొందరగా మన్నిక తగ్గడమే కాదు, రంగు నుండి చాలా విధాలుగా నష్టం జరుగుతుంది. పట్టుబట్టలు.. పట్టు దుస్తులు  అమ్మాయిల దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. ఆడవాళ్ళు వీటిని చాలా అపురూపంగా చూసుకుంటారు. పైగా ఇవి ఖరీదు కూడా ఎక్కువ. తెలిసీ తెలియనితనంతో పొరపాటుగా  పట్టు దుస్తులను వాషంగ్ మెషీన్లో వేస్తే అంతే సంగతులు. దుస్తుల పోగులు పైకి లేవడమే కాకుండా పట్టుదుస్తులు వాషింగ్ మెషీన్లో వేస్తే బట్ట కుచించుకుపోతుంది. దుస్తుల రూపమే మారిపోతుంది. స్టక్చర్డ్ దుస్తులు.. ఫ్యాషన్లో భాగంగా ముడతలతో కూడిన దుస్తులు వస్తుంటాయి. వీటిని ప్లీటెడ్ దుస్తులు అని కూడా అంటారు. ఈ దుస్తులను వాషింగ్ మెషీన్లో అస్సలు వేయకూడదు. ఇలాంటి దుస్తులు వాషింగ్ మెషీన్లో వేస్తే బట్టల నాణ్యత దెబ్బతింటుంది. దుస్తుల రూపం చెడిపోతుంది.                                      *నిశ్శబ్ద.