టీఆర్ఎస్ బిల్డప్! 600 కార్ల కాన్వాయ్‌తో మహారాష్ట్రకి సీఎం కేసీఆర్

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి దేశవ్యాప్తంగా తన సత్తా చాటుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తాపత్రయ పడుతున్నారు. ఇందులో భాగంగానే మరో తెలుగు రాష్ట్రమైన ఏపీతో పాటు తెలంగాణతో సరిహద్దుల్ని కలుపుకొని ఉన్న మరికొన్ని రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా మహారాష్ట్రలో పార్టీని విస్తరించేందుకు ఎక్కువ అవకాశాలు ఉండటంతో ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలువురు నేతల్ని పార్టీలో చేర్చుకోవటం.. భారీ ఎత్తున ప్యాకేజీలతో వారిని ఉక్కిరిబిక్కిరి చేసిన గులాబీ బాస్.. మహారాష్ట్రకు చెందిన మీడియా సంస్థలకు కోట్లాది రూపాయిల ప్రకటనలతో వారిని ఆనందానికి గురి చేశారు. ఇక ఇప్పుడు గ్రాండియర్ అంటే ఏమిటో అక్కడ ప్రజలకు చూపిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ సోమవారం (జూన్ 26) మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరి వెళ్లారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్‌తో సీఎం మహా పర్యటనకు వెళ్లారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు కూడా ఉన్నారు. బీఆర్ఎస్ కార్ ర్యాలీతో ముంబాయి రహదారి మొత్తం గులాబీమయమైంది. గులాబీ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు ముంబాయి రహదారిపై వస్తున్న కేసీఆర్ కాన్వాయిపై గులాబీ పువ్వులు,  గులాబీ కాగితాలను వెదజల్లుతూ స్వాగతం పలికారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై భారత్ నినాదాలతో ర్యాలీ వెళ్లే ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. కాగా  మధ్యాహ్నం 1 గంటకు మహారాష్ట్రలోని ధారాశివ్‌ జిల్లా ఒమర్గాకు చేరుకోగా.. ఒమర్గాలో మధ్యాహ్న భోజనం చేసి, అక్కడి నుంచి సాయంత్రం 4.30కి సోలాపూర్‌ బయలుదేరారు. రాత్రి సోలాపూర్‌లోనే బస చేసి మంగళవారం (జూన్ 27) ఉదయం 8 గంటలకు సోలాపూర్‌ నుంచి పండరీపురం చేరుకున్నారు. అయితే, పక్కనే ఉన్న మహారాష్ట్రకి వెళ్లేందుకు 600 వందల కార్లు ఏంటి? అవి కాకుండా రెండు హైక్లాస్ లగ్జరీ బస్సులలో మంత్రులు, ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీలను తీసుకెళ్లడం ఏంటి? కేసీఆర్ అసలేం చేస్తున్నారు? ఏం చేయాలనుకుంటున్నారన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఆసక్తిగా మారింది. 600 కార్ల కాన్వాయ్‌తో ర్యాలీగా వెళ్లాల్సిన అవసరం ఏముందని సోషల్ మీడియాలో చర్చ మొదలవగా.. కేసీఆర్ సార్ ఈసారి ఎలాంటి స్కెచ్ వేశారో? కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వెనక అసలు కారణం ఏంటో? అసలు ఈ బిల్డప్ ఏంటి బాబాయ్ అంటూ నెటిజన్లు   కామెంట్స్ చేస్తున్నారు. కానీ, కేసీఆర్ లెక్కలు కేసీఆర్ కు ఉంటాయి. రాజకీయాలలో, అందునా తన పార్టీని ఎలా అభివృద్ధి చేసుకోవాలో కేసీఆర్ కు తెలిసినంతగా టక్కు టమార విద్యలు మరెవరికీ తెలీదనే చెప్పాలి. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు నిరూపించారు కేసీఆర్. గడిచిన కొన్ని నెలలుగా మహారాష్ట్రలో స్పెషల్ ఫోకస్ చేయటమే కాదు.. అక్కడి నేతల్ని తెలంగాణకు తీసుకొచ్చి.. వారికి ఊహించని రీతిలో ఆహ్వానం పలకడం నుండి వారిని సాగనంపే వరకు చేసిన సేవతో  వారి మనసు దోచుకున్నారు. ఇప్పటికే నాగపూర్ లో పార్టీ తొలి కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్.. తన ఎత్తులతో తాను అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఇదీ నా సైన్యం అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలను తీసుకెళ్లగా.. ఇదీ నా సత్తా అంటూ 600 కార్ల ర్యాలీతో మహారాష్ట్రలో అడుగుపెట్టారు. ఇంత భారీతనం మరాఠా రాజకీయాలకు పెద్దగా పరిచయం లేదు. అందుకే కేసీఆర్ ఇప్పుడు అందరి కన్ను తన మీద పడేలా చేసుకొనే ప్రణాళికలో భాగంగా ఇంత గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారనిపిస్తుంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

నాలుగేళ్ళ నరకం! వైసీపీపై తెలుగుదేశం పాశుపతాస్త్రం

ఏపీలో ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం ఉన్నా రాజకీయాలు మాత్రం రోజురోజుకీ హీటెక్కుతుతూనే ఉన్నాయి. అటు అధికార  వైసీపీ, ఇటు ప్రతిపక్ష  తెలుగుదేశం ఆధిపత్యం కోసం కొత్త కొత్త స్ట్రాటజీలతో ప్రజల మధ్యకి వస్తున్నాయి. ఎలాగూ ప్రతిపక్షాలకి ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు బోలెడన్ని అంశాలు, అవకాశాలు   ఉంటాయి. ఈ క్రమంలో తులుగుదేశం ఇప్పటికే వైసీపీ అరాచకాలు దౌర్జన్యాలు, రాష్ట్రంలో పెరిగిన నేరాలపై తూర్పార పడుతూ ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అంటూ ఓ కార్యక్రమంతో ముప్పు తిప్పలు పెట్టింది. రాష్ట్రంలో ప్రతి దానిపై విధిస్తున్న పన్నులపై ప్రజలలో అవగాహనా కల్పించేలా బాదుడే బాదుడు అనే మరో కార్యక్రమాన్ని కూడా టీడీపీ దిగ్విజయంగా నిర్వహిస్తున్నది. ఇప్పుడు దీనికి తోడుగా మొత్తం నాలుగేళ్ళ జగన్ ప్రభుత్వంలో అన్యాయాలు, అక్రమాలు, అఘాయిత్యాలు, దౌర్జన్యకాండలను ప్రజలకు గుర్తు చేస్తూ జగన్ కు తగిన బుద్ది చెప్పేందుకు నాలుగేళ్ళ నరకం అనే మరో కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ఓ వీడియోని విడుదల చేశారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా తొలి రోజు 'ఇది రాష్ట్రమా....? రావణ కాష్ఠమా..?' అంటూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు గురించి ప్రశ్నిస్తూ తొలి వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఇటీవల బాపట్ల జిల్లాలో బాలుడి హత్య, ఏలూరు జిల్లాలో మహిళపై జరిగిన దారుణం, అలాగే నెల్లూరు జిల్లాలో పట్టపగలు మహిళపై అత్యాచారం వంటి వాటితో పాటు, ఆయా ఘటనల్లో వైసీపీ నేతలు, ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన స్పందన వంటి వాటిని చూపించారు. ఇక, ఈ ప్రచార కార్యక్రమం 'నాలుగేళ్ళ నరకం'లో రంగాల వారీగా జరిగిన అన్యాయాన్ని ఎత్తి  చూపుతూ.. నాలుగేళ్ళలో నలభై ఏళ్లు రాష్ట్రాన్ని వెనక్కి ఎలా నెట్టారో చూపిస్తూ ప్రజల వద్దకు తీసుకెళ్లనున్నారు.  జగన్ రెడ్డి పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియచేయడమే తెలుగుదేశం ముఖ్య ఉద్దేశం కాగా, దాదాపు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం సాగనుంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా  తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రానున్న రోజుల్లో ఈ నాలుగేళ్ళ నరకం పేరుతో టీడీపీ గల్లీ నుండి పట్టణాలు, నగరాల వరకు ప్రజలకి జరిగిన అన్యాయాన్ని, వైఎస్ఆర్సీపీ నాయకుల అక్రమాలను ఎత్తి చూపుతూ ముందుకు సాగనున్నారు. వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం తొలి నుండి లేవనెత్తుతున్న అంశం లా అండ్ ఆర్డర్. జగన్ ప్రభుత్వంలో వ్యవస్థలు పరిధి దాటి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడిచాయి ఇదే విషయంలో న్యాయస్థానాలతో ఎన్నోసార్లు మొట్టికాయలు తిన్నది జగన్ సర్కార్. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం కోర్టు బోనులలో నిలబడి న్యాయమూర్తుల చేత చీవాట్లు తినాల్సి వచ్చింది. ఇక, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేసి వారిని మతి స్థిమితం లేని పిచ్చి వారిని చేసిన వైనాలు కూడా రాష్ట్ర ప్రజలు చూశారు. దీంతో పాటు వైసీపీ నేతల ఆగడాలు, ఇసుక నుండి మట్టి వరకు యథేచ్ఛగా జరిగిన దోపిడీ, కొండలను సైతం పిండిచేసి అమ్ముకోవడం ఇలా ఒక్కటేమిటీ చెప్పుకుంటూ పోతే మరో నాలుగేళ్లు కావాలేమో. ఇలాంటి వాటన్నిటినీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ   గుర్తు చేస్తూ  జగన్  నాలుగేళ్లు ప్రజలకు ఎలా నరకం చూపించారో కళ్ళకు కట్టినట్లు చూపించనున్నారు. ఈ కార్యక్రమంతో తెలుగుదేశం సమరశంఖం ఊదడంతో వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే. మరి ఈ కార్యక్రమంపై అటునుంచి అంటే వైసీపీ నుంచి స్పందన ఎలా వస్తుందో చూడాల్సి ఉంది.

సంక్షిప్త వార్తలు

1. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ బీజేపీ కోవర్ట్ అని ఆయన అన్నారు. 2. టీడీపీ యువనేత నారా లోకేశ్ కు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. దమ్ముంటే నెల్లూరులో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. 3.కేంద్ర సర్కారు నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్ పీఎస్) లో మార్పులు చేయనుందని సమాచారం. ఉద్యోగులు తమ సర్వీసులో చివరిగా డ్రా చేసిన వేతనంలో కనీసం 40 శాతాన్ని పెన్షన్ గా పొందే విధంగా నిబంధనలు మార్చనుంది. 4.హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఆ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న నేతలిద్దరూ నిన్న నాగర్ కర్నూలులో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్న సభకు గైర్హాజరు కావడం ఇందుకు ఊతమిస్తోంది. 5. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని అందరూ భావిస్తున్న తరుణంలో ఆ పార్టీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.వరంగల్ జిల్లాలో బీజేపీ నేతల మధ్య సఖ్యత కొరవడి నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి డ్యామేజ్ కలిగించే స్థాయికి చేరింది.  6. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు. రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్ తో ఆయన రోడ్డు మార్గంలో పయనమయ్యారు. ఆయన వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.  7.గుంటూరు జిల్లాలో కృష్ణా నదీతీరాన నాగ ప్రతిమలు కనిపించడం స్థానికంగా పెద్ద చర్చకు దారి తీసింది. జిల్లాలోని తాడేపల్లి సీతానగరంలో నది ఎగువ భాగాన భారీ సంఖ్యలో నాగ ప్రతిమలు బయటపడ్డాయి. 8.తనంటే అమితమైన విశ్వాసం చూపించే పెంపుడు కుక్క అంటే ఆ వ్యక్తికి ప్రాణం. కానీ, కుటుంబసభ్యులు మాత్రం కుక్కను ఇంట్లోంచి గెంటేయాలని అల్టిమేటమ్ ఇచ్చారు. ఇది నచ్చని ఆ వ్యక్తి తన కుక్కను తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేశాడు. 9. బీజేపీ నేత, భారత రెజ్లింగ్ సమాఖ్య  అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఐదు నెలలుగా చేస్తున్న ఆందోళనను రెజర్లు విరమించారు. ఇకపై కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించారు. 10.‘టైటానిక్’ హీరో లియోనార్డో డికాప్రియో, భారత సంతతికి చెందిన బ్రిటిష్ పంజాబీ మోడల్ నీలమ్ గిల్  మరోమారు కెమెరాలకు దొరికిపోయారు. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్టు ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి.  11.కుటుంబ బాధ్యతలను భార్య చక్కబెట్టడం వల్లే ఒత్తిడి లేకుండా భర్త బయటకు వెళ్లి పనిచేయగలడని.. అంటే భర్త సంపాదనకు పరోక్షంగా భార్య సహకరిస్తుందని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. అందువల్ల భర్త సంపాదించిన ప్రతీ ఆస్తిలోనూ భార్యకు సమాన వాటా ఉంటుందని స్పష్టం చేసింది.  12. జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో ఏపీ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. రాష్ట్రంలోని ఐదున్నర కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరి తలపై జగన్ రూ. 1.80 లక్షల కోట్ల అప్పును పెట్టారని అన్నారు. 13.వంద మంది రాజారెడ్డిలు కలిస్తే ఒక జగన్‌మోహన్ రెడ్డి అవుతారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ‘‘రాజారెడ్డి ఏమైనా విలనా? ఆయన రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి, జగన్‌మోహన్ రెడ్డిని అందించారు’’ అని అన్నారు. 14. గత కొంతకాలంగా వివిధ పర్యటనలకు టీమిండియాను ప్రకటించినప్పుడల్లా సర్ఫరాజ్ ఖాన్ పేరు తెరపైకి వస్తూనే ఉంది. దేశవాళీ క్రికెట్లో పరుగుల వర్షం కురిపిస్తూ, వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్న ముంబయి బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటిదాకా జాతీయ జట్టుకు ఎంపిక కాకపోవడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 15.రాజోలు నియోజకవర్గం మలికిపురం సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ సభకు వస్తుంటే మహేశ్ బాబు అభిమాని ఒకరు తనను కలిశారని వెల్లడించారు. 16. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సూళ్లూరుపేట నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సాయంత్రం ఆయన పాదయాత్ర నాయుడుపేట చేరుకుంది. 17.  టాక్ తో సంబంధం లేకుండా ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతోంది. వెల్లువెత్తుతున్న విమర్శల మధ్యే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. 18. ప్రధాని నరేంద్ర మోదీ ఖాతాలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. ఈజిప్టు పర్యటనలో ఉన్న మోదీని అక్కడి ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద నైల్ తో సత్కరించింది. 19.నాగర్ కర్నూలులో బీజేపీ నవ సంకల్ప సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. 20. డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టయిన నిర్మాత కేపీ చౌదరి కస్టడీలో వెల్లడైన అంశాలు టాలీవుడ్ లో కలకలం రేపాయి. బిగ్ బాస్ ఫేమ్ ఆషూ రెడ్డి, నటి జ్యోతి, నటి సురేఖవాణిల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. 21. ఇటీవలే టీడీపీలో చేరిన సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ పరిణామాలపై స్పందించారు. టీడీపీ తొలి విడత మేనిఫెస్టోకు ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని వెల్లడించారు. 22. లండన్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం నిన్న వాతావరణం అనుకూలించకపోవడంతో జైపూర్‌లో అత్యవసరంగా ల్యాండైంది. ఆ తర్వాత విమానం నడిపేందుకు పైలట్ నిరాకరించడంతో అందులోని 350 మంది ప్రయాణికులు 5 గంటలపాటు విమానంలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. 23.హిమాచల్ ప్రదేశ్ లోని పలు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షానికి పలు నదుల్లో నీటి ప్రవాహం పెరిగిపోయింది. 24.సరిగ్గా 40 ఏళ్ల కిందట టీమిండియాకు తొలి ప్రపంచకప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్..‘ఒరిజినల్ కెప్టెన్‌ కూల్’ అని గవాస్కర్ అన్నాడు. ‘‘1983 ప్రపంచకప్‌లో కపిల్‌దేవ్ బ్యాటింగ్‌లో రాణించడంతోపాటు బంతితోనూ అదరగొట్టాడు. 25.ఈ మధ్య కాలంలో మలయాళం నుంచి ఎక్కువమంది ఆర్టిస్టులు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఫహాద్ ఫాజిల్ .. షైన్ టామ్ చాకో వంటి వారు ప్రేక్షకులకు చేరువైతే, త్వరలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా తెలుగు తెరపై కనిపించనున్నాడు.  

కాంగ్రెస్ కు క్యూ కడుతున్న  విజయశాంతి..?

దేశ రాజకీయాలలో కాంగ్రెస్ కర్ణాటక విజయం.. కొత్త ఉత్సాహం.. కొత్త సమీకరణాలకు శ్రీకారం చుట్టింది.  ఇక తెలంగాణలో.. కాంగ్రెస్ కర్ణాటక కాంగ్రెస్ గెలుపుతో.. ఆ పార్టీ గ్రాఫ్ పైకి దూసుకెళ్లుతుంది. పార్టీలో చేరికలు ..భారీగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. బీజేపీని వదిలేసి తొందరలో కాంగ్రెస్ లో చేరబోయే నేతల పేర్లలో విజయశాంతి పేరు కూడా ప్రచారమవుతోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణల పేర్లు వినబడుతున్నాయి. ఒకపుడు విజయశాంతి కాంగ్రెస్ లో ఉన్నవారే. అయితే వివిధ కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో తనకు గుర్తింపు దక్కటం లేదనే తీవ్ర అసంతృప్తి ఈమెను పట్టి పీడిస్తోంది. తన సేవలను ఉపయోగించుకోవాల్సిన పార్టీ ఏమాత్రం పట్టించుకోవటంలేదని బాహాటంగానే తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. చాలాకాలంగా పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా యాక్టివ్ గా లేరు.అందుకనే తొందరలోనే కమలం పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రచారంలో నిజం కూడా లేకపోలేదనే అనుకుంటున్నారు. ఎందుకంటే అందుకు విజయశాంతి వైఖరే కారణం. ఆమె బీజేపీలో గుర్తింపు  లేక..ఇబ్బంది పడుతున్నారు. ఏ పార్టీలో ఉన్నా తనకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం దక్కాలని కోరుకుంటారు. అయితే అందరు ప్రత్యేకంగా గుర్తించటానికి, గౌరవించటానికి ఆమెకున్న కెపాసిటి ఏమిటి అనే విషయాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  నిజానికి సినీ గ్లామర్ అన్న ఒక్క విషయాన్ని పక్కనపెట్టేస్తే విజయశాంతిలో మరే ప్రత్యేకతా లేదు. జనాలను ఆకర్షించేంత వాగ్దాటిలో కూడా జీరోనే.  రాష్ట్రంలోని ఏ ఒక్క నియోజకవర్గంలో కానీ వర్గంలో కానీ ఆమెకు పట్టులేదు. సినిమాల్లో అయితే ఆమె బాగానే రాణించారు. అది గతం.  అదే విధమైన గుర్తింపు రాజకీయాల్లో కూడా రావాలంటే దొరకదని ఆమె నమ్మి తీరాలి.  ఎటువంటి ప్రత్యేకత, పట్టులేని విజయశాంతిని ఏ పార్టీ అయినా ఎందుకు అంతగా ప్రాధాన్యతిస్తుంది ? పైగా తల్లి తెలంగాణా అనే పార్టీ పెట్టారు. దుకాణం సరిగా నడవకపోవటంతో దాన్ని టీఆర్ఎస్ లో కలిపేశారు. అక్కడినుండి ఒకసారి ఎంపీగా గెలిచారు. తాను ఎంపీగా గెలవగానే అంత తన గొప్పతనమే అనుకున్నారు. దాంతో కేసీయార్ తో వ్యక్తిగతంగా చెడింది. అందుకనే టీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరారు. మళ్ళీ బయటకు వచ్చేస్తారనే ప్రచారం పెరిగిపోతోంది. విషయ పరిజ్ఞానం లేదు... వాక్పటిమ లేదు.. జనాకర్షణ లేదు... ఇక రాజకీయ పరిణతి అసలే లేదు. అలాంటి నాయకురాలిని ఏ పార్టీ కూడా  చేర్చుకునేందుకు ముందుకు రాదు.   ఆమె ఏ పార్టీలో చేరినా..  మూడునాళ్ల ముచ్చటే.  ప్రస్తుతం విజయశాంతి రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇంతకూ భారతి ఎందుకు నవ్వింది?

ఓ వైపు ఎన్నికలు దూసుకొచ్చేస్తున్నాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచి.. మన ముఖ్యమంత్రి జగనన్నే ఎప్పటికీ... అనిపించుకోవాలని ఫ్యాన్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైయస్ జగన్ తాపత్రయపడుతోన్నారు. అందులోభాగంగా జగనన్న వదిలిన మరో బాణం.. వ్యూహం.  ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌లో.. అంటే ఎన్నికలకు జస్ట్ కొద్ది రోజుల ముందు విడుదల చేయనున్నారని సమాచారం. అయితే ఈ చిత్ర టీజర్‌ శనివారం (జూన్ 24) విడుదలైంది.  2 నిమిషాల 45 సెకన్ల పాటు సాగిన ఈ టీజర్‌లో... అలా ఆలోచించడానికి చంద్రబాబుని కాదు అంటూ జగన్ పాత్రలో అజ్మల్ చెప్పిన ఒక్కే ఒక్క డైలాగ్ తప్ప.. మరో డైలాగ్ లేకపోవడం గమనార్హం.  మరోవైపు మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్‌లో ప్రయాణం చేస్తుండడంతో ప్రారంభమైన ఈ టీజర్.. అజ్మల్ చెప్పే ఒక్కే ఒక్క డైలాగ్‌తో ముగుస్తుంది. దీంతో ఈ టీజర్.. మహానేత మరణం నుంచి జననేత జగన్ ఎన్నికల్లో విజయం సాధించి..ముఖ్యమంత్రిగా కారు ఎక్కే క్రమంలో ప్రజలకు అభివాదం చేస్తుండడం.. అలా ఆలోచించడానికి నేను చంద్రబాబుని కాదంటూ అచ్చుగుద్దినట్లు జగన్ గొంతుతో చెప్పడంతో ఈ టీజర్ ముగుస్తుంది. ఈ టీజర్ ప్రారంభం నుంచి ముగింపు వరకు..  సీరియస్‌గా సాగిన ఈ టీజర్‌లో కాసిన్ని కన్నీళ్లు, కూసింత ఆందోళన, మరికొంత ఆదుర్ధాతోపాటు వైయస్ జగన్ భార్య వైయస్ భారతీ  నవ్వుతూ.. తన భర్తకు మనస్పూర్తిగా.. అదీ తన మామ వైయస్ రాజశేఖరరెడ్డి ఫోటో సాక్షిగా షేక్ హ్యాండ్ ఇవ్వడంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ చర్చ  వాయువేగంతో ఊపుందుకోవడం విశేషం.   ఈ చిత్రంలో వైయస్ భారతీ నవ్విన నవ్వు దేనికి సాంకేతమని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ షేక్ హ్యాండ్‌.. తన చిన్న మామ వైయస్ వివేకా దారుణ హత్య వార్త విని.. ఈ విధంగా స్పందించారా? అని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు వైయస్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి సెల్ కాల్ డేటా లిస్ట్‌లో వైయస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, అలాగే వైయస్ భారతీ పీఏ నవీన్‌ల సెల్‌ ఫోన్లకు అర్థరాత్రి వేళ.. అంటే వైయస్ వివేకా హత్య జరిగిన సమయానికి ముందు ఆ తర్వాత.. కాల్స్ వెళ్లినట్లు సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.  ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఓఎస్డీ, భారతీ పీఏ నవీన్‌లను సీబీఐ విచారించిందని... అలాంటి వేళ ఈ షేక్ హ్యాండ్.. ఆ ఫోన్ కాల్స్ వచ్చిన వేళ.. చేసుకొన్న షేక్ హ్యాండ్‌యేనా అని నెటిజన్ల సందేహాన్ని  వ్యక్తం చేస్తున్నారు. అలా కాకుంటే.. ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఇనాడే ఎదురైనట్లు.. అంటే అనుకున్నది అనుకున్నట్లుగా.. ముఖ్యమంత్రి పీఠాన్ని తన భర్త వైయస్ జగన్ అధిరోహించినందుకా? ఈ షేక్ హ్యాండ్ అని నెటిజన్లు మధనపడుతూ ప్రశ్నిస్తున్నారు.    అంతేకాదు ఈ టీజర్‌లో చంద్రబాబును చూపించే ముందు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు ఫొటోపై కెమెరాను ఫోకస్ చేసి.. ఆ తర్వాత చంద్రబాబును చూపించడం విశేషం. ఇక ఈ టీజర్‌లో ఒకే ఒక్క డైలాగ్.. అదీ జగన్ చెప్పిందీ.. అలా ఆలోచించడానికి  నేను చంద్రబాబుని కాదని చెప్పడం.. ఇది అక్షరాల నిజమేనని.. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. చంద్రబాబు ఆలోచన తీరు ఎలా ఉంటుందో.. వైయస్ జగన్ ఆలోచన సరళి ఎలా ఉంటుందో వరంగల్‌కు చెందిన కొండా మురళి, కొండా సురేఖ దంపతులు ఇటీవల ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్ కట్‌గా సోదాహరణతో చెప్పిన విషయాన్ని ఈ సందర్బంగా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అయితే రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ వ్యూహం.. జగన్‌కు ఫలిస్తుందా? లేక వికటిస్తుందా? అనేది తెలియాలంటే మాత్రం వచ్చే ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు వేచి చూడక తప్పదనేది నెటిజన్లు స్పష్టం చేస్తుండడం మహా విశేషం.

అధికారాన్ని వీళ్ళలా ఎవరూ వాడుకోలేరేమో!

ఎంపీ వైఎస్ అవినాష్ జైలుకు వెళ్లక తప్పదు.. రేపో మాపో సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయనుంది. ఈసారి సీబీఐ విచారణకి అవినాష్ హాజరవుతారా? లేక సాకులు చెప్పి డుమ్మా కొడతారా? ఈసారి సీబీఐ విచారణలో ఏమైనా కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయా? అసలు వివేకా హత్యకేసులో కోర్టు విచారణ ముగుస్తుందా? సీబీఐ అసలు ఈ కేసులు తేల్చేస్తుందా? ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో మొన్నటి వరకు ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు, అంతకు మించిన ఊహాగానాలు ప్రచారంలో ఉండేవి. కానీ, ఇప్పుడు అవేమీ ఎక్కడా వినిపించడం లేదు. మొన్నటి వరకు బ్రేకింగులు, ప్యాకేజీలు, ఎపిసోడ్లకు ఎపిసోడ్లు ప్రసారం చేసిన మీడియా చానెళ్లు సైతం ఈ కేసు అంశాన్ని పక్కన పెట్టేశాయి. ఈ హత్య కేసులో కీలకంగా కొన్ని వారాల పాటు రోజూ వినిపించిన అవినాష్ కూడా మళ్ళీ తిరిగి ప్రజల మధ్యకి వచ్చేశాడు. ఔను.. ఎంపీ అవినాష్ రెడ్డి గడపగడపకి కార్యక్రమంలో భాగంగా కడప నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మందీ మార్బలంతో ఇంటింటికీ తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించి ప్రజలకు వివరిస్తున్నారు. వార్తా పత్రికల కడప జిల్లా పేజీలలో కూడా అవినాష్ పర్యటనను బాగా ప్రచారం అయ్యేలా చూసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ కాస్త సైడ్ అయిపోయిన అవినాష్ మెల్లగా మళ్ళీ రాజకీయాలపై ఫోకస్ పెంచుతున్నారు. దీంతో ఈ విషయం చూసిన స్థానిక ప్రజలు, సోషల్ మీడియాలో అవినాష్ పర్యటన పోస్టులను చూసిన నెటిజన్లు అసలు ఈ కేసులో దోషులకు శిక్ష పడుతుందా? అసలు ఈ కేసు విచారణ తేలేదేనా? అంటూ చర్చించుకుంటున్నారు. అయితే, ఈ హత్య జరిగిన తీరు, సీబీఐ దర్యాపు, ఏపీలో పోలీసుల వ్యవహారం, మొత్తంగా ఈ హత్య కేసు విచారణ చుస్తే.. అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చా? ఎంతటి నేరాల నుండైనా తప్పించుకోవచ్చా? అనే అనుమానాలు రాక మానవు. అంతేకాదు, బహుశా అసలు వీళ్ళలా అధికారాన్ని ఎవరూ వాడుకోలేరేమో అని కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ కేసు విచారణను గమనిస్తే తొలి రోజు నుండే ఎక్కడిక్కడ భారీ ఎత్తున వ్యవస్థలను మ్యానేజ్ చేశారని స్పష్టమవుతుంది. సీబీఐ కూడా పలుమార్లు న్యాయస్థానాలకు అదే వెల్లడించింది. చివరికి సీబీఐ అధికారులను కూడా ఈ కేసు విచారణకు రాకుండా అడ్డుకొనేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఇక పోలీసుల గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివేకా కూతురు సునీతనే ఎన్నోసార్లు మీడియా ముందు మొరపెట్టుకున్నారు. కేసును కూడా పక్క రాష్ట్రానికి కేటాయించే వరకు శ్రమించారు. ఈ కేసులో హైలెట్ అంశం అవినాష్ రెడ్డి. అతను నేరం చేశాడా లేదా అన్నది రేపో మాపో కోర్టు తెలుస్తుంది కానీ.. తనకి ఉన్న ఓపిక మాత్రం సాధారణమైనది కాదు. ఈ కేసు విచారణ ఎన్నో మలుపులు తిరిగినా.. అన్నీ అవినాష్ వైపే ఉన్నా.. అతను మాత్రం ఓర్పుతో నేర్పుతో చాకచక్యంగా వ్యవహరించారు. చివరికి ఆయన మాతృమూర్తి శ్రీలక్ష్మీ అనారోగ్య పరిస్థితిని కూడా తనకి అనుకూలంగా మలచుకోవడంలో అవినాష్ రెడ్డి వందకి వంద మార్కులు కొట్టేశారు. ఏదైతేనేం మళ్ళీ అవినాష్ ప్రజల మధ్యకి వస్తున్నారు. ఇక్కడ న్యాయం గెలిచిందా? వ్యవస్థలు గెలిచాయా అన్నది ముందు ముందు తేలాల్సి ఉంది. అయితే, కాస్త ఆలస్యం అయినా చివరికి గెలిచేది న్యాయమే అనే పాత సామెత అందరికీ తెలిసిందే. ఒకవేళ ఆ న్యాయస్థానాలలో న్యాయం మరింత ఆలస్యమైనా ప్రజా క్షేత్రంలో ప్రజలే సరైన న్యాయం చెప్పడం గ్యారంటీ!

పేటీఎం వర్మా నీ రేటెంత.. సోషల్ మీడియాలో దుమ్ముదుమారం!

సోషల్ మీడియా విస్తృతం అయ్యాక సెలబ్రిటీలు దాన్నే వ్యాపారంగా మలచుకొని కాసులు పోగేసుకుంటున్నారు. బాలీవుడ్ హీరోలనే తీసుకుంటే వీళ్ళు ఒక్కో ఇన్ స్టాగ్రామ్ పోస్టుకు రూ.కోట్లలోనే వసూలు చేస్తారు. వ్యాపార సంస్థలు వారి ప్రోడక్ట్స్ సేల్ చేసుకొనేందుకు వీరిని ఉపయోగించుకుంటారు. వ్యాపారసంస్థలు ఈ సెలబ్రిటీలకు ఇన్‌ఫ్లూయెన్షర్లు అని పేరు కూడా ఒకటి పెట్టుకున్నారు. ఈ ఇన్‌ఫ్లూయెన్షర్లు వ్యాపార సంస్థల నుంచి డబ్బు తీసుకుని వారి ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారు. దీనికి ప్రధాన ఆయుధం సోషల్ మీడియానే. ఇందులో ఎంత ఫాలోయింగ్ ఉంటే అంత డబ్బు ఈ సెలబ్రిటీల సొంతం అవుతుంది. దీనిని వ్యాపార భాషలో చెప్పాలంటే డిజిటల్ మార్కెట్ అని కూడా అంటుంటారు.  అలాగే, అదే సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు కూడా తమదైన శైలిలో వాడుకుంటుంటాయి. తమకి గిట్టని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలపై రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ద్వారా బురదజల్లే పని చేస్తుంటాయి. దీని కోసం ఏ పార్టీకి ఆ పార్టీ డిజిటల్ విభాగాలను సైతం ఏర్పాటు చేసుకొని భారీగానే ఖర్చు చేస్తుంటుంది. ఈ డిజిటల్ విభాగాలు భారీగా నిరుద్యోగ యువతను రిక్రూట్ చేసుకొని వారితో ఈ యాక్టివిటీలను చేయించడంతో పాటు నెటిజన్లతో కూడా రాజకీయాలు, పార్టీలు, నేతల వ్యక్తిగత జీవితాలపై కూడా పోస్టులు, కామెంట్లు చేయిస్తూ ఒక్కో పోస్టుకు ఇంత అని డబ్బులు ముట్టజెప్తుంటాయి. మొదట్లో ఈ లావాదేవీలన్నీ డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారానే జరిగేది. ఇప్పుడు రకరకాల మార్గాల ద్వారా ఈ లావాదేవీలు జరుగుతున్నాయి.  కాగా, టాలీవుడ్ ఒకప్పటి స్టార్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా వ్యూహం అనే సినిమా టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. యధావిధిగా ఈ టీజర్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా, చంద్రబాబును నెగటివ్ గా చూపించే ప్రయత్నం చేశాడు. వైఎస్ఆర్ మరణం నుండి జగన్ సీఎం అయ్యేవరకు జరిగిన కథతో తెరకెక్కిన సినిమాగా చెప్పుకుంటున్న ఈ సినిమా కథలో చంద్రబాబే అంతా చేయించాడనే మాదిరి టీజర్ ద్వారా ప్రేక్షకులను నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో ఈ టీజర్ తోనే ఈ సినిమా భవిష్యత్ తేలిపోయింది. అయితే, ఈ టీజర్ చూసిన టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు వర్మపై ఓ రేంజిలో ఫైర్ అవుతున్నారు. నిజానికి వాస్తవ కథ పేరుతో వైసీపీ స్క్రిప్ట్ ఆధారంగా ఈ సినిమాను వర్మ తెరకెక్కించడం ఆయనను ఇష్టపడే వారికి సైతం వెగటుగా మారింది. ఇక టీడీపీ ఫాలోవర్లయితే సోషల్ మీడియాలో విమర్శలతో దుమ్ము  రేపుతున్నారు. వర్మ సినిమాలను ప్రేక్షకులు అసలు పట్టించుకోవడం కూడా మానేయడంతో బార్లు, పబ్బుల ఖర్చుల కోసం తన టాలెంట్ ను జగన్మోహన్ రెడ్డికి అమ్మేసుకున్నాడని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఎవడబ్బ సొమ్ము కాదు టాలెంటు అంటూనే వైసీపీ కోసం ఇంతకి దిగజారి పోయావా వర్మా అంటూ ఏకి పారేస్తున్నారు. నీ రేటెంతో చెప్పు పేటీఎం వర్మా.. ఒక్క రూపాయి ఎక్కువే ఇస్తాం అసలు నిజాలు బయటపెట్టు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ కి పోస్టుకి రూ.5 ఇస్తే.. నీకు రూ.10 ఇచ్చారా వర్మా అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరి ఒక్క టీజర్ కే ఇంతలా ఈ యుద్ధం మొదలైతే.. రేపు ట్రైలర్.. ఆ తర్వాత సినిమాపై ఎలాంటి వ్యతిరేకత వస్తుందో.. ఇంకెన్ని కామెంట్లు చదవాల్సి వస్తుందో!

జగన్నాటకంలో మడతడిపోయిన ఆర్జీవీ!

ఆర్జీవీ.. పేరు ఏదైనా కొత్తగా సినీ పరిశమ్రకి వచ్చే దర్శకులకు ఆయనో ఐకాన్. కెమెరాతో ఎన్ని ట్రిక్కులు చేయొచ్చో కెమెరా మెన్లకు సైతం పాఠాలు చెప్పేంత నేర్పరి. మూసబోయిన వెండితెరని మలుపులు తిప్పగల మేధావి. సినిమా అంటే ఇలానే ఉండాలని లిఖించిన చరిత్ర పుస్తకాన్ని చెడామడా నలిపేసి విసిరేసి, చింపేసి.. మరో కొత్త చరిత్రను రాసుకున్న నిపుణుడు. ఇదంతా నిజమే. కానీ.. ఒకప్పుడు. గతమెంతో ఘనకీర్తి ఉన్న ఈ స్వయంకృత మేధావి ఇప్పుడు ఆర్బీఐ బ్యాన్ చేసిన రూ.1000 నోటుతో సమానమైపోయాడు. ఆ రూ.1000 నోటును రిజర్వ్ బ్యాంక్ చెల్లకుండా చేస్తే.. వర్మ అతి తెలివే అతన్ని పనికిరాకుండా చేసింది. అప్పట్లో వరస సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఈడ్చి కొడుతుంటే ఏం చేయాలో పాలుపోక.. దెయ్యాలు, భూతాలను చూపించి కొన్నాళ్ళుబతికి బట్టకట్టేశాడు. ఆ తర్వాత వాటికీ ప్రేక్షకులు భయపడకపోవడంతో టెర్రరిస్ట్ అటాక్స్ మీద సినిమా ప్లాన్ చేశాడు. అక్కడే బీజం పడింది రాజకీయ నాయకులతో సహవాసం. అసలే కోతి ఆపైన కళ్ళు తాగిన చందంగా పొలిటికల్ పార్టీలతో సంబంధం ఉన్న వాళ్ళు కొందరు నిర్మాతలుగా మారి వర్మని బుక్ చేసుకోవడం మొదలు పెట్టారు. సాధారణంగా సినిమాను ప్రేక్షకులు చూస్తేనే దర్శకులకు డిమాండ్.. కానీ వర్మ లాంటి వాళ్లకి సినిమా రిజల్ట్ తో పనేముంది. ఆ మాటకొస్తే వర్మ తీసే సినిమా నిర్మాతలే డబ్బు కోసం సినిమాలు తీయరు. పొలిటికల్ పార్టీలకి వీడియో అడ్వర్టైజ్ మెంట్ కోసం ఖర్చు పెట్టినట్లే.. వర్మ సినిమాకి ఖర్చు పెట్టేస్తారు. ఎలాగూ ఇది ఎన్నికల ఖర్చులోకి లెక్క కూడా రాదు. అలా గత 2019 ఎన్నికలకు ముందు వచ్చినవే లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. ఈ సినిమాల సమయంలో ఏదో ఒక ఊపు ఊపేస్తాయని చాలామంది భ్రమ పడ్డారు. కానీ, ఫలితం శూన్యం. పోర్న్ స్టార్స్ తో సినిమా చేస్తేనే చాలా చూశాంలే ఆర్జీవీ పక్కకి సర్దుకోమన్న ప్రేక్షకులు.. అందరికీ తెలిసిన బాగోతాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇదే నిజం అంటే ప్రేక్షకులు నమ్మేస్తారని ఆశపడ్డ వారు బొక్కబోర్లా పడ్డారు. దీంతో తొలి రోజే థియేటర్లలో బొమ్మ బొరుసయ్యింది.  బొమ్మ ఆడకపోయినా అప్పుడు ఆ ఎన్నికలలో ఆశించిన వారే గెలిచారు. దీంతో వర్మ సినిమానే సెంటిమెంట్ అనుకుంటున్నారో.. లేక అప్పుడు ఆ సినిమానే కళాఖండం అని భ్రమ పడుతున్నారో ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్నికల కోసం తగుదునమ్మా అంటూ మరో సినిమాను తెచ్చారు. అదే 'వ్యూహం'. తాజాగా వచ్చిన ఈ టీజర్ లో హీరో జగన్మోహన్ రెడ్డి, విలన్ చంద్రబాబు. ఇవే పాత్రల పేర్లు. రాజశేఖరరెడ్డి మరణంతో మొదలయ్యే సినిమా జగన్ సీఎం కావడంతో ముగుస్తుంది. వైఎస్ఆర్ మరణం నుండి జగన్ సీఎం అయ్యే వరకు జరిగే కథనే ఇందులో చూపించారని వర్మ అండ్ కో చెప్పుకుంటున్నారు. కానీ, ఇందులో చంద్రబాబు విలన్ ఎక్కడ అయ్యారో టీజర్ చూసిన ఎవరికీ అర్ధం కాదు. ఎందుకంటే ఆ మొత్తం ఎపిసోడ్ అప్పటి కాంగ్రెస్ పెద్దలు, జగన్ మధ్య జరిగినదే. ఇది అప్పటికే కాస్త మూతి మీద వెంట్రుకలొచ్చినా అందరికీ తెలుసు. కానీ, ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లేవు కదా. బహుశా అందుకేనేమో ఈ సినిమాలో కూడా చంద్రబాబునే విలన్ ని చేసినట్లున్నాడు.  ఒక్కసారి వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా కథకు వెళ్తే సినిమా మొత్తం వైసీపీ నేత లక్ష్మీ పార్వతి అల్లిన కథే కనిపిస్తుంది. ఎన్టీఆర్ హయాంలో జరిగినది తెలిసిన వాళ్ళు ఆ సినిమా చూసి ముక్కున వేలేసుకున్నారు. అప్పటి చరిత్ర విన్న వాళ్ళు సైతం ఇదేదో తేడాగా ఉందే అనుకున్నారు. కానీ, ఇప్పుడు వర్మ వ్యూహం కథ మొత్తం గత 13 క్రితం నుండి నాలుగేళ్ళ క్రితం వరకు జరిగిందే. ఆ తొమ్మిదేళ్లలో ఏం జరిగిందో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇంకా కళ్ళ ముందే కనిపిస్తుంది. అందుకే టీజర్ లో చంద్రబాబు పాత్రను చూడగానే ఇది వైసీపీ ఎన్నికల ప్రచార సినిమా అని ప్రేక్షకులు ఫిక్సయిపోయారు. దీనికి తోడు సరిగ్గా ఐదు రోజుల క్రితమే వర్మ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇక చెప్పేదేముంది.. ఇది 'వ్యూహం' కాదు జగన్నాటకమని!

కమలం కంగారు.. తప్పదు ఇక పోయిరావలె హస్తినకు!

దేశంలో ఇక మాకు తిరుగే లేదనుకున్న బీజేపీ..  పునాదుల నుండి అంతస్థుల వరకు సహకరించిన మిత్రులను సైతం తొక్కేసి ఇంకా ఇంకా ఎదగాలనుకుంది. ఇదే ప్లానింగ్ లో కొంతమేర సక్సెస్ అయింది కూడా. కానీ, ఇప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. కర్ణాటక రూపంలో గట్టి షాక్ తగిలింది. దీంతో ఇప్పుడు నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టింది. ఈలోగా అదే కర్ణాటక ఇచ్చిన విజయం తాలూకూ ఉత్సాహాన్ని కాంగ్రెస్ రెట్టింపు చేసుకొనేలా మరింతగా ఎదిగే ప్రణాళికలు రచించుకుంది. దీంతో బీజేపీలోఇప్పుడు కంగారు మొదలైంది. అది స్పష్టంగా తెలంగాణ తెలంగాణలో కనిపిస్తున్నది. ఔను.. గత రెండు వారాలుగా చూస్తే ఈ కంగారు స్పష్టం కనిపిస్తున్నది. తెలంగాణలో ఇక కాంగ్రెస్ కు ఆశలు లేవన్న బీజేపీ త్వరలోనే మరో రాష్ట్రంలో కూడా తమదే హవా అని విర్రవీగింది. రాష్ట్ర నేతలలో కూడా ఆ వ్యవహార శైలిలో కొట్టొచ్చినట్లు కనిపించింది. కానీ, ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితులతో అటు ఢిల్లీ పార్టీ పెద్దల నుండి రాష్ట్ర నేతల వరకు మరో రాష్ట్రం కూడా చేజారుతుందా అని కంగారు మొదలైంది. దీంతో రాష్ట్ర నేతలంతా అనివార్యంగా హస్తినకు క్యూ కట్టారు. పట్టారు. మొన్నటికి మొన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ వెళ్లి మూడు రోజుల పాటు పెద్దలను కలిసి సంప్రదింపులు జరిపారు. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు అంశంపైనే ఇదంతా జరిగిందని ప్రచారం జరిగింది. కానీ, అసలు విషయం రాష్ట్ర పార్టీకి తగలబోతున్న కుదుపుకు నష్ట నివారణే ఈ పర్యటన  సారాంశంగా కనిపిస్తుంది. ఇక, ఇప్పుడు ఢిల్లీ పెద్దలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ఢిల్లీకి పిలిచారు. ఈ ఇద్దరూ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైనట్లు గత వారం రోజులుగా ముమ్మర ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. అందుకే ఈ ఇద్దరికీ ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది. ఇక ఈ వీరిద్దరితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో హైదరాబాద్ నుంచి ఆయన హడావుడిగా బయల్దేరారు. అధిష్ఠానం నిర్వహించనున్న    రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కి కూడా మళ్లీ పిలుపు వచ్చిందా,   రాలేదా అనేది తెలియదు కానీ ఈ ముగ్గురి ఢిల్లీ పర్యటన, పెద్దలతో సమావేశం మాత్రం ఖరారైంది.  కాగా, గత కొన్ని రోజులుగా ఈటల రాజేందర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు రెండు రోజుల క్రితం తన నియోజకవర్గ కార్యకర్తలు, అనుచరులతో రహస్య సమావేశం కూడా నిర్వహించినట్లు కథనాలొచ్చాయి. ఇక దాదాపుగా ఈటల   కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని అంతా ఫిక్సయిపోయారు. అలాంటి సమయంలో ఢిల్లీ నుండి పిలుపొచ్చింది. మరో నేత రాజగోపాల్ రెడ్డిది కూడా అదే పరిస్థితి. ఈటల కంటే ముందే ఈయన కాంగ్రెస్ లోకి చేరాల్సి ఉన్నా.. సరైన సమయం కోసం ఓపికగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆ సమయం రావడంతో ముహూర్తం చూసుకుంటుండగా బీజేపీ పెద్దల నుండి పిలుపు వచ్చింది. మరి ఈ సమావేశంలో ఆ పెద్దలు ఏం చెప్పనున్నారో.. వీళ్ళు బీజేపీలోనే ఉంటారా? లేక అనుకున్నట్లే పార్టీ మార్పుకు మొగ్గు చూపుతారా అన్నది తేలాల్సి ఉంది.

ముప్పేట దాడి.. జగన్ ఉక్కిరిబిక్కిరి!

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ ప్రతిపక్షాలు అధికార పార్టీపై దండయాత్ర మొదలు పెడుతున్నాయి. అధికార పార్టీ అంటే ఎలాగూ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పేరిట ప్రజల మధ్యకి వెళ్తారు. అదే ప్రతిపక్షాలైతే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల మధ్యకి వెళ్ళాలి. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్షాలు కూడా అదే చేస్తున్నాయి. అయితే, ఈసారి ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుండి ఇప్పటికే నారా లోకేష్ పాదయాత్రతో రాష్ట్రాన్ని చుట్టేస్తుండగా.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కూడా బస్సు యాత్ర మొదలుపెట్టారు. లోకేష్, చంద్రబాబుకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు కూడా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. మరోవైపు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహీ విజయయాత్రతో కార్యకర్తలలో జోష్ నింపుతున్నారు. అధికార పార్టీపై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేస్తూ పవన్ యాత్ర కొనసాగుతుంది. జనసేనకి ఓటు బ్యాంక్ ఎంత, పవన్ సభలకు.. యాత్రలకు వచ్చే వారంతా ఓటర్లేనా అన్నది పక్కనపెడితే పవన్ కళ్యాణ్ విజయయాత్రకి భారీ స్పందన వస్తున్నది. కార్యకర్తల ఉత్సాహం చూసి పవన్ లో కూడా రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది. అయితే, ఈ యాత్రలు, పర్యటనలను పరిశీలిస్తే ఓ ఆసక్తికర అంశం స్పష్టమవుతుంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సైలెంట్ గా ప్రజల మధ్యకి వెళ్లి ప్రభుత్వాన్ని ఎండగడుతూ.. హుందాగా రాజకీయాలు చేస్తూ ప్రజలలో బలం పెంచుకొనే పని చేస్తుంది. కానీ, జనసేన కావాలనే చేస్తుందో.. వైసీపీ రియాక్షన్ వలన అలా అవుతుందో కానీ పవన్ వారాహీ యాత్ర వైలెంట్ పాలిటిక్స్ కి దారితీస్తున్నది. నారా లొకేషన్ పాదయాత్ర మొదలు పెట్టిన తొలి రోజుల్లో ఘాటు విమర్శలు చేసేవాళ్ళు.. వైసీపీ నుండి కూడా అదే స్థాయిలో రియాక్షన్ ఉండేది. ఇప్పుడు లోకేష్ మాటల ఘాటు కంటే ప్రజలతో మమేకమయ్యేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పిల్లల నుండి వృద్ధుల వరకు అందరినీ కలుపుకుంటూ సమయపాలనతో పాదయాత్ర కొనసాగుతుంది. ఇక చంద్రబాబు ఎలాగూ ఆయన స్థాయికి తగ్గట్లు ప్రజలను ఆలోచింపజేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కానీ, పవన్ మాత్రం మాటలతోనే ఆటం బాంబులు పేల్చేస్తున్నారు. వైసీపీ నుండి కూడా అదే స్థాయిలో రియాక్షన్ వస్తుండడం, దానికి జనసైనికులు మరింతగా అటాక్ చేయడంతో ఆటోమేటిక్ గా వైలెంట్ అవుతోంది. అయితే, ఇది కూడా ఒకరకంగా రాజకీయ ఎత్తుగడ లాగే కనిపిస్తుంది.  చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురూ మూడు ప్రాంతాలలో కార్యక్రమాలు చేపట్టారు. ఒకరి కార్యక్రమానికి మరొకరి కార్యక్రమంతో పోలికే లేదు. కానీ, అందరి ఎజెండా ఒక్కటే. జగన్ మోహన్ రెడ్డిని గద్దె దింపడమే. రాష్ట్రంలో ఇంకా పొత్తుల వ్యవహారం తేలలేదు. ఈలోగా అందరూ ఒకే మూస పద్ధతిలో చేపట్టే కార్యక్రమాలు ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేవు. పైగా అందరి కార్యక్రమాలకు ఒకేసారి అటెన్షన్ దక్కదు. అందుకే ఇలా తలా ఒక పద్ధతిలో డిజైన్ చేసుకోవడం మంచిదే. అలాగే అందరూ కలిసి ప్రభుత్వంపై దాడి చేస్తున్నారనే నెగటివ్ ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది. ఎన్నికల సమయంలో వైసీపీ కూడా ప్రచారం మొదలు పెట్టి సభలు నిర్వహిస్తుంటే అప్పుడు మూకుమ్మడి అటాక్ చేసినా అది ప్రజలలో నెగటివ్ భావన కలిగించదు. అందుకే ఇలా ఒకరు సైలెంట్ గా ప్రజల మధ్యకి చొచ్చుకుపోతుంటే.. మరొకరు వైలెంట్ గా ప్రభుత్వాన్ని అటాక్ చేస్తున్నారనిపిస్తుంది. మరి ఇది ఎవరిపై ఎంత ప్రభావం చూపిస్తుందో.. ఎవరికి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.

‘వ్యూహం’ఫలించేనా?

ఎన్నికల ముందు రాజకీయ ప్రచార చిత్రాలు రావడం కొత్త విషయమేమీ కాదు. రామగోపాల్ వర్మతోనే ఈ ఒరవడి మొదలు కాలేదు. గత ఎన్నికల ముందు యాత్ర నుంచి ఆర్జీవీ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ వరకూ, అలాగే క్రిష్ దర్శకత్వంలో  వచ్చిన కథానాయకుడు నుంచి మహానాయకుడి వరకూ రాజకీయ ప్రయోజనాలను ఆశించి తీసిన సినిమాలే. అయితే వీటిలో ఆర్జీవీ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను మినహాయిస్తే.. యాత్ర, కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు సినిమా పరంగా ఉన్నత సాంకేతిక విలువలతో వివాదాలకు దూరంగా చాలా వరకూ ఉన్నదున్నట్లుగా వెలువడిన సినిమాలు. సినిమా లిబర్టీ తీసుకుని హీరోయిక్ బిల్డప్ ఉంటే ఉండొచ్చు కానీ వాటిని ఒక పార్టీకి ప్రచారం కోసం తీసిన చలన చిత్రాలుగా చెప్పడానికి వీలులేదు. అయితే కచ్చితంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏదో మేర ఆయా పార్టీలకు రాజకీయ లబ్ధి చేకూరుతుందన్న భావన ఆయా సినిమాల నిర్మాతలలో ఉన్న మాట మాత్రం వాస్తవం. అయితే వ్యక్తిగత జీవితంలోనే కాదు వృత్తిగత జీవితంలోనూ విలువలూ, పద్ధతులూ పాటించేది లేదని బాహాటంగా చెప్పే రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మాత్రం సినిమా లిబర్టీ హద్దులను దాటేసి.. ఆయన మద్దతు ఇస్తున్న.. లేదా అ సినిమా నిర్మాత రాజకీయ ప్రయోజనాలకోసం ఊహాగానాలు, వదంతుల ఆధారంగా తీసిన సినిమా అనడంలో సందేహం లేదు. ఆయా సినిమాల జయాపజయాల సంగతి పక్కన పెడితే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా మాత్రం కచ్చితంగా సినిమాకు ఉండాల్సిన ఏ లక్షణం లేకుండా తెరకెక్కిందని సినీ విమర్శకులే కాదు ఆ సినిమా చూసిన అతి కొద్ది మంది ప్రేక్షకులు సైతం కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశారు. చివరాఖరికి ఆయన ఏ పార్టీ ప్రయోజనం కోసం కనీసమైన విలువలకు  తిలోదకాలిచ్చేసి ఆ సినిమా తీశారో  ఆ పార్టీ వాళ్లు కూడా ఇదేం సినిమా అని ముక్కున వేలేసుకున్నారు. అది పక్కన పెడితే నాలుగేళ్లు గిర్రున తిరిగి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మరో తొమ్మది నెలలలో జరగననున్నాయనగా.. రామ్ గోపాల్ వర్మ మరో సినిమాను పట్టాలెక్కించారు. ఆ సినిమా పేరు ‘వ్యూహం’ ఆ సినిమా టీజర్ శుక్రవారం (జూన్ 24)న విడుదలైంది. హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణించ‌డంతో  మొదలైన ఈ టీజర్   జ‌గ‌న్‌పై సీబీఐ ఎంక్వైరీ, అరెస్ట్‌ వంటి విషయాలను స్పుృశించింది.  మంచి టెక్నీషియన్ గా శివ, క్షణ క్షణం, రంగీలా వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రాం గోపాల్ వర్మ ఎక్కడో ట్రాక్ తప్పారు. అక్కడి నుంచి నిజ సంఘటనలంటూ కథా, కథనాలు లేకుండా రీళ్లు చుట్టేయడంతో ఆయన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయ్యాయో కూడా ఎవరికీ తెలియకుండా వచ్చి వెళ్లిపోతున్నాయి. ఇప్పుడు జగన్ జీవిత ‘వ్యూహం’గా తీసిన ఈ చిత్రం టీజర్ చూస్తే ఇది కూడా అదే కోవలో వచ్చిపోయే సినిమాగానే అనిపిస్తోంది. 

పోసాని గెస్ట్ ఆర్టిస్టా.. పెయిడ్ ఆర్టిస్టా?

జగన్ రెడ్డిని భుజాన మోయడంలో పోసానికి ఎవరూ పోటీ రాలేరు. అటువంటి పోసాని కృష్ణ మురళి కూడా జగన్ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తరువాత కానీ  ఓ నామినేటెడ్ పోస్టుకు నోచుకోలేదు. అయితే పార్టీ కోసం పని చేసినందుకు పోసానికి ఆ పోస్టు వచ్చిందని స్వయంగా పోసాని కూడా నమ్మడం లేదు. ఇక పార్టీ శ్రేణులైతే పోసానికి పోస్టుపై భయంకరమైన జోకులు కూడా వేసుకుంటున్నాయి. 2019 ఎన్నికలకు ముందు జగన్ పార్టీ కోసం పలువురు సినీ ఇండస్ట్రీకి  చెందిన వారు పని చేసినప్పటికీ.. అందరిలోకీ బాగా గుర్తింపు వచ్చిందీ, అలా వచ్చేలా విపక్షాలపై నోరు వేసుకు పడిపోయిందీ మాత్రం ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్, మాటల రచయత నుంచి నటుడిగా, రచయతగా, దర్శక నిర్మాతగా చివరాఖరికి రాజకీయ వేత్తగా మారిన పోసాని కృష్ణ మురళీ మాత్రమే. ఇక కమేడియన్ అలీ అన్ని పార్టీలనూ చుట్టేసి ఎక్కడ తనకు సేఫ్ అని బేరిజు వేసుకుని మరీ గత ఎన్నికల ముందు వైసీపీ గూటికి చేరారు. పృధ్వీరాజ్, పోసాని ఎన్నికలలో పోటీ  కోసం టికెట్ ఆశించలేదు కానీ, ఆలీ మాత్రం ఎన్నికలలో పోటీ చేసి అసెంబ్లీకో లేకపోతే పార్లమెంటుకో చెక్కేద్దామని మాత్రం భావించారు.   ఇక పృధ్వికి అయితే సొంత కెరీర్ ను ఫణంగా పెట్టి మరీ చేసిన ఓవర్ యాక్షన్ కు తగ్గ ఫలితం వెంటనే వచ్చింది. ఎస్వీబీసీ చైర్మన్ గా ఈ ధర్టీ  ఇయర్స్ ఇండస్ట్రీకి ఓ పొస్టు దక్కింది. అది మూణ్నాళ్ల ముచ్చటే అయ్యిందనుకోండి అది వేరే విషయం. కానీ అలీ, పోసోనిలకు మాత్రం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ తరువాత తీరిగ్గా మూడేళ్లు పూర్తయ్యాకా ఇద్దరికీ చెరో   పదవీ ఇచ్చి జగన్ చేతులు దులిపేసుకున్నారు. అలీ వరకూ అయితే వచ్చే ఎన్నికలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ ఇచ్చి పోటీకి నిలబెడతానన్న హామీ దక్కిందని పార్టీ వర్గాల సమాచారం. ఇక పోసాని విషయానికి వస్తే.. ఆయన గత ఎన్నికల ముందు నుంచీ వైసీపీకి గెస్ట్ ఆర్టిస్ట్ గానే సేవలందిస్తూ వస్తున్నారు. ఏదో ఒక అంశాన్ని వివాదం చేయడానికి సినిమాలలో సంభాషణల రచయతగా తనకున్న అనుభవాన్నంతా రంగరించి భాషా పాండిత్యాన్ని మీడియా ముందు ప్రదర్శించడం.. ఆ తరువాత  బుల్లి తెరలో రియాల్టీ షోలు, ఇతర సరదా కార్యక్రమాలలో తన విలక్షణ నటనకు పరిమితమైపోవడం పరిపాటిగా మారింది. అయితే విషయమేమిటంటే ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత ఆయన జగన్ సర్కార్ కు అనుగుణంగా ఏర్పాటు చేసిన, చేస్తున్న ప్రతి మీడియా సమావేశంలోనూ పెయిడ్ ఆర్టిస్టుగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా ప్రభుత్వంపై, వైసీపీ నాయకులపై ఎక్కుపెడుతున్న విమర్శనాస్త్రాలకు అధికార పార్టీ కాళ్ల కింద భూమి కదిలిపోతోందా అన్నట్లుగా ఖంగారు పడుతున్నారు. ఒక వైపు లోకేష్ పాదయాత్ర, మరో వైపు వారాహి యాత్ర వైసీపీని గాభరాపెడుతున్నాయి. వారి యాత్రలకు వస్తున్న అశేష జనసందోహం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో గోదావరి జిల్లాలలో ఎన్నికలలో గెలుపుఓటములను ప్రభావితం చేయగలిగే కాపు సామాజిక వర్గంలో చీలిక తీసుకురావడం ద్వారా పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రభావాన్ని తగ్గించే వ్యూహంలో భాగంగా పవన్ భాషను తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం పేర్ని నాని వంటి కాపునాయకుల ఎదురుదాడి పెద్దగా ప్రభావం చూపకపోవడంతో  కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ తెరపైకి వచ్చారు. పవన్ కల్యాణ్ కాకినాడ ఎమ్మెల్యే పై చేసిన విమర్శలను తప్పుపడుతూ తెరముందుకు వచ్చిన ముద్రగడ పవన్ పై విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగకుండా గతంలో కాపు ఉద్యమానికి ఉప్మాలు, లారీలు సప్లై చేసిన ద్వారంపూడిని విమర్శిస్తావా అంటూ బహిరంగ లేఖ రాశారు. అది బూమరాంగై కాపు సామాజిక వర్గాన్ని ఏకం చేసింది. ఇవిగో నీ ఉప్మా డబ్బులు అంటూ కాపు సామాజిక వర్గానికి చెందిన యువత ముద్రగడకు మనీయార్డర్లను వెల్లువలా పంపింది. కాపు ఉద్యమాన్ని వైసీపీకి తాకట్టు పెట్టేశారంటూ ముద్రగడపై విమర్శలు గుప్పించింది. ఆయన కారణంగానే కాపు రిజర్వేషన్లు అందకుండా పోయాయని దుమ్మెత్తి పోసింది. దీంతో ముద్రగడకు మద్దతుగా మాట్లాడేందుకు  పోసానిని వైసీపీ వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకువచ్చింది.   పోసాని ముద్రగడ కు మద్దతుగా.. పవన్ కు వ్యతిరేకంగా తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేశారు అది పక్కన పెడితే  పవన్ కల్యాణ్ భాష విషయంలో ఒకింత సంయమనం పాటించాలనీ, హుందాగా ఉండా లని పోసాని సుద్దులు చెప్పారు.  విషయం లేక పోసాని సినిమా స్టైల్ లో మాయ చేయాలనుకున్నారనీ.. కానీ గతంలో ఇదే పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి అసభ్యంగా పోసాని మాట్లాడిన మాటలను సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ఎత్తి చూపి నిలదీస్తున్నారు. నీతులు చెప్పే వారు నీతిగా ఉండటం అవసరమనీ, ముందుగా పోసాని తన భాషను సంస్కరించుకోవాలని హితవు చెబుతున్నారు.  గతంలో అమరావతి రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణించిన ఈ నట శూన్యకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి సొమ్ములు తీసుకుంటూ.. రాజకీయ విమర్శలు చేయడం పెయిడ్ వ్యవహారంగా కనిపించడం లేదా అని నిలదీస్తున్నారు. ప్రభుత్వ నామినేటెడ్ పోస్టు  పొంది అధికార పార్టీకి అడ్డగోలుగా వత్తాసు పలకుతున్న పోసాని తీరును జనసైనికులే కాదు.. సామాన్య జనం కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. 

జగన్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట!

రాజకీయ ప్రయోజనం కోసం ఏపీ సీఎం జగన్ ఎంతకైనా తెగిస్తారనడానికి తాజాగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి అన్న ప్రచారం వెనుక ఆయన ప్రమేయం ఉందని సాగుతున్న ప్రచారమే సాక్ష్యం.  వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం తీసుకోవడం వెనుక జగన్ వ్యూహం ఉన్నదా అన్న చర్చ సాగుతూనే ఉంది. జగన్ తో ఆస్తి తగాదాలు, రాజకీయ వరసత్వ తగాదాలు ఉన్న షర్మిల ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టి  అన్నపై సవాల్ చేయకుండా తెలంగాణకు ఎందుకు వచ్చినట్లు? చెల్లిని తెలంగాణకు సాగనంపిన అన్న అదే దారిలో తల్లిని కూడా ఎందుకు సాగనంపినట్లు? అప్పటి నుండీ మోడీ, షాల ఆశీస్సులతో కోర్టు మెట్లు కూడా ఎక్కకుండా 11 కేసులలో బెయిలుపై రాజకీయాలు నడుపుతున్న జగన్, ఇప్పుడు చెల్లిని కాంగ్రెస్ రాజకీయాలవైపు ఎందుకు పంపిస్తున్నట్లు? జులై8వ తేదీన ఇడుపులపాయ వేదికలో జగన్ కాంగ్రెస్ అధినాయకులకు ఎదురుపడతారా లేదా? ఇడుపులపాయ కార్యక్రమాన్ని షర్మిల ఒక ఉమెన్ షోలా నడిపిస్తారా? అన్న ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరకడం లేదు. మిత్రుడు కేసీఆర్ కు సహకరించడానికే షర్మిలను తెలంగాణకు పంపారన్న పుకార్లు గతంలో వినిపించినా ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో జగన్ కన్ను కాంగ్రెస్ పై పడింది. ఇంత వరకూ రాసుకుపూసుకుని తిరిగిన బీజేపీకి, కేసీఆర్ కి ద్రోహం చేయడానికి ఏమాత్రం వెనకాడని జగన్ తన తోలు కాపాడుకునే పనిలో ఉన్నారు. షర్మిలకు కర్నాటక నుంచి రాజ్యసభకు పంపి ఇఠు తెలంగాణలో పవర్ సెంటర్ కాకుండా, అటు వైసీపీకి వ్యతిరేకంగా పని చేసే విధంగా షర్మిలను తయారు చేసే పనిలో కాంగ్రెస్ ఉంది. షర్మిల ఎక్కడ ఏమి మాట్లాడినా అందులో కామెడీ తప్ప రాజకీయం ఉండదు కాబట్టి జగన్ లైట్ గా తీసుకుంటున్నాడు.మొత్తం మీద జగన్ అవకాశవాద రాజకీయాలకు షర్మిల, విజయలక్ష్మిలు మరోసారి బలవుతున్నారనడంలో  ఎలాంటి సందేహం లేదు.

జగన్‌లో బాలయ్య టెన్షన్

ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నందమూరి ఫ్యామిలీకి కంచుకోట అన్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి ప్రముఖ నటుడు, తెలుగుదేశం నాయకుడు నందమూరి బాలకృష్ణ వరుసగా గెలుపొందుతున్నారు. అయితే ఆ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడించేందుకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే హిందూపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ జా దీపిక అనే మహిళను ఎంపిక చేసే ఆలోచనలో జగన్ ఉన్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.   జూన్ 21వ తేదీన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంపై సీఎం జగన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దీపికను సీఎం వైయస్ జగన్ ఆహ్వానించడం.. ఆమెకు  తొలి వరుసలో మహిళామంత్రుల పక్కనే కూర్చునే అవకాశం ఇవ్వడం, అందుకు సంబంధించిన వీడియోలు  అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో బాలయ్య ప్రత్యర్థి దీపికేనా అన్న చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.   హిందూపురం నియోజకవర్గంలో అగ్రనేతలు ఇక్బాల్, అగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్‌లను పక్కన పెట్టి మరీ దీపికను పిలవడంతో నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం రసకందాయంలో పడిందనే  అంటున్నారు.  కాగా హిందూపురంలో వైసీపీలో గ్రూపు రాజకీయాలకు కొదవే లేదు. అటువంటి గ్రూపుల్లోని   వ్యక్తిని కాకుండా.. ఎప్పుడూ ఎవరూ ఊహించని విధంగా  దీపికను  ఇలా ఒక్క సారిగా తెరపైకి తీసుకు రావడం వెనుక జగన్ ఆంతర్యం ఏమిటనే సందేహం స్థానిక నేతలను  ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. అయితే ఈ ఎపిసోడ్‌లో పార్టీ రాయలసీమ ఇన్‌చార్జ్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రం తిప్పినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదీకాక కర్ణాటక అసెంబ్లీకి ఇటీవలే ఎన్నికైన ఓ రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేతోపాటు  ఈ దీపిక.. తాజాగా సీఎం జగన్‌తో భేటీ అయినట్లుటాక్. అయితే దీపికకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన సీఎం జగన్.. తమకు  ఎందుకు ఇవ్వడం లేదని అటు నిశ్చల్ వర్గం, ఇటు ఇక్బాల్ వర్గం, మరోవైపు మధుమిత వర్గం గుర్రుగా ఉన్నాయని సమాచారం.     మరోవైపు హిందూపురం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు... చేపడుతోన్నారు. ఆ క్రమంలో అన్నా క్యాంటీన్లు, ఆరోగ్య సంజీవినీ తదితర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు సైతం చేపట్టి.. ప్రజల మనస్సులు చూరగొని.. తనదైన శైలిలో ఆయన దూసుకు పోతున్నారు. గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో సైతం రాయలసీమలో తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలను కైవసం చేసుకొంది. అందులో హిందూపురం ఒకటి కావడం గమనార్హం.  ఇంకోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. తన యువగళం పాదయాత్రను రాయలసీమ నుంచి ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ఆయన నిర్వహించిన పాదయాత్రకు అక్కడ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిన విషయం విదితమే. అలాగే ఇటీవల తూర్పు, పశ్చిమ రాయలసీమల్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక్లలో సైతం టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అలాంటి వేళ టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాల కోసం సీఎం జగన్ అన్వేషణ చేపట్టారు. ఆ అన్వేషణలో భాగంగానే దీపికను బాలయ్యకు ప్రత్యర్థిగా ఎంపిక చేశారని అంటున్నారు.

తెలంగాణలో కమలం వాడిపోతోందా?

తెలంగాణ కమలం వికాసం మాట దేవుడెరుగు వాడిపోకుండా చూసుకోవడానికే నానా తంటాలూ పడుతోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందు వరకూ తెలంగాణ తటాకంలో కమల వికాసం ఖాయమన్న భావన బీజేపీ రాష్ట్ర నాయకులలోనే కాదు. అధిష్ఠానంలో కూడా చాలా చాల గట్టిగా కనిపించేది. అయితే ఆ భావన కానీ, ఆ విశ్వాసం కానీ కర్నాటక ఎన్నికల ఫలితంతోనే  మాయమైపోయినట్లుగా కనిపిస్తోంది.  ఇతర పార్టీల నుంచి చేరిన అగ్రనేతలు, వచ్చినంత వేగంగా వెనక్కివెళ్లిపోవడానికి రెడీ అయిపోతుండటం, కొత్తవారు వచ్చి చేరే అవకాశాలు మృగ్యమైపోవడంతో  తెలంగాణలో బీజేపీ పరిస్థితి మధ్యలో వచ్చిన వాపు మధ్యలోనే మాయమైపోయి.. రాష్ట్రంలో ఎక్కడ మొదలయ్యిందో అక్కడే ఉందన్న చందంగా మారింది.  తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నుంచి బహిష్కృతులైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు.. తమ కంటే ముందే పార్టీ నుంచి బహిష్కృతుడై బీజేపీ గూటికి చేరి  ఉపఎన్నికలో ఆ పార్టీ నుంచి  అభ్యర్థిగా విజయం సాధించి, బీజేపీలో కీలక స్థానంలో ఉన్న ఈటల రాజేందర్ దారిలోనే బీజేపీలో చేరుతారని అంతా భావించారు. పొంగులేటి, జూపల్లి కూడా తొలుత కేసీఆర్ ను గద్దె దించాలన్న తమ పంతం నెగ్గించుకోవాలంటే కమలం పార్టీయే సరైన ప్రత్యామ్నాయం అని భావించారు. అయితే పరిస్థితులను గమనించి, విశ్లేషించుకుని మనసు మార్చుకుని కాంగ్రెస్ పంచన చేరడమే మేలని నిర్ణయించుకున్నారు. అంతే కాదు.. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటలకు సైతం వారు బీజేపీని వదిలి రావడమ మంచిదని సలహా కూడా ఇచ్చారు. ఆ విషయాన్ని ఈటలే స్వయంగా చెప్పారు. జూపల్లి, పొంగులేటి ల విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. వేరే పార్టీల నుంచి బీజేపీ గూటికి చేరిన నాయకులకు ఆ పార్టీలో ఉక్కపోత తప్పడం లేదు. కరుడుగట్టిన హిందుత్వ పార్టీ ముద్ర ఉన్న బీజేపీలో ఇతర పార్టీల నుంచి రాజకీయ అవసరాల కోసం వచ్చి చేరిన వారికి ఊపిరి ఆడే పరిస్థితి ఉండదని ఈటల వంటి వారు ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు కూడా. సరే ఇక తెలంగాణ బీజేపీ విషయానికి వస్తే.. ఓ నాలుగు ఎంపీ సీట్లు, ఉప ఎన్నికలో విజయాలతో ఆ పార్టీ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అన్న ధీమాను పెంచుకుంది. దక్షిణాదిలో బలం పెంచుకోవడానికి తెలంగాణను గేట్ వేగా భావించింది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు కేసీఆర్ కుటుంబ అవినీతిని తెరమీదకు తెచ్చింది. ఊరూవాడా ఏకం అయ్యేలా మద్యం కుంభకోణంలో కవిత ప్రమేయంపై సీబీఐ, ఈడీలను మించి దర్యాప్తు చేసేసిన బీజేపీ నేతలు.. కర్నాటక ఫలితం తరువాత ఒక్క సారిగా చప్పబడిపోయారు. మద్యం కుంభకోణం కేసులో కవిత ప్రమేయంపై దర్యాప్తు మందగించిందో, నిలిచిపోయిందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కేంద్ర మంత్రుల అప్పాయింట్ మెంట్ లు అడిగీ అడగగానే దొరికేస్తున్నాయ్. తెలంగాణ కాంగ్రెస్ ముక్త  లక్ష్యం కోసం బీఆర్ఎస్ ఉద్దేశ పూర్వకంగా బీజేపీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రంలో ఎదిగేందుకు దోహదపడిందన్న గత విమర్శలు ఇప్పుడు మళ్లీ తెరమీదకు వస్తున్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయంతో ఇంత కాలం ఆ పార్టీ రాష్ట్రంలో సోదిలోకి కూడా లేదంటూ విమర్శలు గుప్పించి.. తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీయే అన్న బీఆర్ఎస్ అధినేత ఇప్పుడు  బీజేపీ ఊసే ఎత్తడం లేదు. కాంగ్రెస్ పుంజుకుంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాళీ అన్న భయం, ఆందోళన ఇప్పడు బీఆర్ఎస్ లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  

ఏపీ నీది.. తెలంగాణ నాది.. జగన్, షర్మిల వ్యూహం?

పేకాట పేకాటే.. తమ్ముడు తమ్ముడే అన్నది నానుడి. రాజకీయాలలో కూడా సాధారణంగా అదే పరిస్థితి ఉంటుంది. రాజకీయం కోసం అన్నా తమ్ముళ్లు, అక్కా చెళ్లెల్లు, భార్యాభర్తలు పోటీ పడటం కామనే. కానీ వైసీపీ కుటుంబంలో మాత్రం ఆ పోటీ పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా సాగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నతో తగాదాలు (అవి ఆస్తితగాదాలని పెద్దగా ప్రచారంలో ఉంది) కారణంగా ఏపీ సీఎం వైస్ జగన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పుట్టిల్లు వదిలేసి అంటే ఏపీని వదిలేసి మెట్టినిల్లంటూ తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారు. ఆమె వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా, వారానికో దీక్ష చేసినా, తెలంగాణలో అధికార పార్టీ, ఆ పార్టీ అధినేత, ఆయన కుటుంబంపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించినా, ఉద్రిక్తతలను పెచ్చరిల్లేలా విమర్శలు చేసి, ధర్నాలు చేసి అరెస్టైనా ఆమెకు కానీ, ఆమె వైఎస్సార్టీపీ కి కానీ పెద్దగా  మైలేజీ రాలేదు. దీంతో ఆమె చూపు తండ్రి జీవించి ఉన్నంత కాలం కొనసాగిన కాంగ్రెస్ పార్టీపై పడింది. స్వయంగా ఆమె బెంగళూరు వెళ్లి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో వరుస భేటీల ద్వారా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా అన్న ఊహాగానాలకు తావిచ్చారు. అక్కడ నుంచి వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది, ఆమె ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా పగ్గాలు చేపట్టి అన్న, ఏపీ సీఎం జగన్ కు పక్కలో బల్లెంగా మారతారన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి. అవి పీక్స్ కు చేరేదాకా వేచి చూసిన షర్మిల విలీనం ప్రశక్తే లేదని మెల్లిగా, తన ఆశ, శ్వాస తెలంగాణయే అంటూ గట్టిగా ప్రకటించారు. ఆమె ఎంతగా విలీనం లేదు మొర్రో అని మొరపెట్టుకుంటున్నా.. కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం వార్తలు మాత్రం ఆగడం లేదు. ఆమె తన పార్టీపై పెట్టిన కాన్సన్ ట్రేషన్ ను తెలంగాణలో సీఎం కేసీఆర్ అవినీతి పాలన, ఆయన కుటుంబ అక్రమాలపై పెట్టండంటూ మీడియాకు హితవు పలికినా.. ఆమె వరుస భేటీలూ, ఆమె తండ్రి కుటుంబానికి సన్నిహితుడైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రినివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోవడం.. ఇటీవలి కాలంలో పొంగులేటి అటు జగన్ తోనూ, ఇటు షర్మిలతోనూ భేటీ కావడం వీటన్నిటినీ చూస్తుంటే.. 2019 ఎన్నికలకు ముందు ఏపీలో ఆమె తన సోదరుడి విజయం కోసం కృషి చేసినట్లే..  వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి తెలంగాణకే పరిమితం కావడం ద్వారా మరోసారి జగన్ కు ఆమె అండగా నిలిచేందుకు సిద్ధమయ్యారని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు. అయితే షర్మిలను కాంగ్రెస్ ఏపీ పీసీసీ చీఫ్ ను చేస్తుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.   తాను ఏపీకి వెళ్లేది లేదని.. తెలంగాణ బిడ్డడా.. తుది శ్వాస వరకూ తెలంగాణలో రాజకీయం చేస్తానని కొట్లాడుతానని విస్పష్టంగా చెప్పేయడం ద్వారా ఆమె ఏపీలో జగన్ కు ఇసుమంతైనా నష్టం చేయడానికి రెడీగా లేరన్నది తేటతెల్లం చేశారు.   డీకే శివకుమార్.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే సహా తెలంగాణ సీనియర్లు  ఆమె తెలంగాణలో అవసరం లేదని.. ఆమె పార్టీ విలీనానికి ఓకే కానీ ఆమె అవసరం తెలంగాణలో లేదనీ, ఏపీలోనే ఉందని అంటున్నారు. ఆ దిశగా ఆమెను ఒప్పించేందుకు శతథీ ప్రయత్నిస్తున్నారు. కానీ నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం షర్మిలను  తెలంగాణ రాజకీయాల్లోనే  కొనసాగాలని పార్టీ నాయకులకు గట్టిగా చెబుతున్నారు.  విలీనానికి ఓకే కానీ..ఏపీకి వెళ్లనని షర్మిల అంటున్నారు. అయితే షర్మిల విలీనానికి మెగ్గు చూపుతూనే ఏపీకి దూరం అనడం వెనుక  అన్నాచెల్లెళ్ల వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం షర్మిలను ఎలాగైనా ఒప్పించి   ఏపీలో పార్టీ పగ్గాలు అప్పగించాలని భావిస్తోంది. ఏం జరుగుతుందన్నది రానున్న రోజుల్లో తేలిపోతుంది. 

ఎవరికీ పట్టని ముద్రగడ సవాల్!

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు. కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేసిన ఆయన ఆ ఒక్క అంశం తప్ప ఇప్పటి వరకూ మరే విషయాన్నీ పట్టించుకోలేదు. అందుకే కాపు సామాజిక వర్గంలో ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఔను ఉండేది.. ఇప్పుడు అది లేదు. ఆయన జగన్ కోసం తన సామాజిజక వర్గంలో తనకున్న పరపతిని ఉపయోగించడం మొదలెట్టారని ఆరోపణలు వినవస్తున్నాయి. అవి ఆరోపణలకు మాత్రమే కాదు పచ్చి నిజాలు అని తాజాగా ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ కు రాసిన రెండు లేఖల ద్వారా బహిర్గతమైంది. అంతే కాదు ఆయన కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఎవరి సొమ్ములతో నడిపారో కూడా ఆయనే స్వయంగా వెల్లడించడంతో సొంత సామాజిక వర్గం నుంచే ముద్రగడపై ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. నాడు ఉద్యమం సందర్భంగా మీరు మాకు సరఫరా చేసిన ఉప్మా డబ్బులు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాం తీసుకోండి అంటూ కాపు యువత ఆయనకు మనీఆర్డర్లు పంపిస్తోంది. దీంతో ఆయన ఇంత కాలం కాపాడుకుంటూ వచ్చిన కాపు ఉద్యమ నేత గుర్తింపును తన లేఖల ద్వారా ఆయనే చెరిపేసుకున్నట్లైంది. ఇక ఆయన వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకుని మరీ పవన్ కు సవాళ్లు విసిరారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారం పూడి పై పోటీ చేయకుంటే పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఆయనకు ప్రత్యర్థిగా తానే నిలబడతానని ముద్రగడ సవాల్ విసిరారు. ప్రత్యక్ష రాజకీయాలకు  గుడ్ బై చెబుతానని గతంలోనే ప్రకటించిన ఆయన ఇప్పుడా నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని మరీ పవన్ క ల్యాణ్ పై పోటీకి సై అంటున్నారు. ఇంత గట్టిగా సవాల్ విసురుతున్న ముద్రగడ పిఠాపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగారంగంలోకి దిగుతానని మాత్రం చెప్పడం లేదు. అన్యాపదేశంగా తాను వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు. తన కుమారుడి కోసం తనకు సొంత సామాజిక వర్గంలో ఉన్న గౌరవాన్ని, గుర్తింపును వదిలేసుకోవడానికి కూడా సిద్ధపడిన ముద్రగడ.. ఇప్పుడు అధికార పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకుని మరీ పవన్ కు సవాళ్లు విసురుతున్నారు. మరీ ముఖ్యంగా గత తెలుగుదేశం ప్రభుత్వం కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం చంద్రబాబు చేసిన ప్రయత్నాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా  చేసి రిజర్వేషన్ల ప్రశక్తే లేదన్న ఏపీ సీఎం జగన్ కు మద్దతుగా మాట్లాడడం, అలాగే కాపు సామాజిక వర్గాన్ని చులకనగా, అసభ్య పదజాలంతో దూషించిన ద్వారంపూడికి వత్తాసుగా జనసేనానిపై విమర్శలకు దిగడమే కాకుండా జనసేనాని పవన్ కల్యాణ్ భాష సంస్కరించుకోవాలంటూ హితవు పలకడంతో ముద్రగడ పట్ల ఆయన సొంత నియోజకవర్గ నేతలలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.   కాపు ఉద్యమానికి ద్వారంపూడి ఆర్ధికంగా సహకారం అందించారని తన లేఖలో పేర్కొనడం కూడా ఆ సామాజికవర్గంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడానికి కారణమైంది. దీంతో కాపు సామాజిక వర్గ నేతలంతా ఒక్క వైసీపీలోని ఆ సామాజిక వర్గ నేతలను మినహాయిస్తే.. ముద్రగడపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.  ద్రోహిగా అభివర్ణిస్తూ నిరసనలకు దిగుతున్నారు. అని నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అందుకే పవన్ కల్యాణ్ కు ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతానంటూ ముద్రగడ విసిరిన సవాల్ ను ఆయన తప్ప ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. నిజంగా ఆయన పవన్ కు ప్రత్యర్థిగా నిలబడితో సొంత సామాజిక వర్గం ఆయన మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ముద్రగడ సవాల్ ను వైసీపీతో సహా ఎవరూ సీరియస్ గా పరిగణనలోనికి తీసుకోలేదు. ఉత్తర కంచి ఉద్యమం ద్వారా హీరోగా కాపు సామాజిక వర్గంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ముద్రగడ ఇప్పుడు అదే సమాజికవర్గానికి ఒక ద్రోహిగా, సామాజికవర్గంలో ఐక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్న విలన్ గా కనిపిస్తున్నారు. 

కేసీఆర్ కే అంతు చిక్కని కాంగ్రెస్ రాజకీయాలు!

రాజకీయాలలో అపర చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆయన రాజకీయ చతురత ఏంటో పెద్దగా ఎవరికీ తెలియదు కానీ.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారం దక్కించుకున్న అనంతరం ఆయన ఏమిటో, ఆయన చాణక్యం ఏమిటో అందరికీ అంతుబట్టింది. తెలంగాణ మూలలోకి వెళ్లి వారిని పలకరించేలా మాట్లాడే ఆయన మాటలు, ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ఆయన  రచించే ప్రణాళికలు ఇలా ఒక్కొక్కటీ బయటకొచ్చే కొద్దీ ఆయన రాజకీయం ఏంటో అందరికీ అవగతమైంది. గిట్టని వాళ్ళు, ప్రతిపక్షాలు ఆయన మీద ఎన్ని విమర్శలు చేసినా.. ఆయన ఒక్కసారి మైకు అందుకుంటే వాటన్నిటికీ తనదైన శైలిలో మూడే ముక్కలలో సమాధానం చెప్పగల నేర్పరి ఆయన. అయితే, వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పన్నడంలో దిట్టగా.. రాజకీయ దురంధ‌రుడిగా పేరున్న ఆయనకే అర్ధం కాకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాజకీయం చేస్తుందా అనిపిస్తుంది.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చకచకా రాజకీయాలను చక్కబెట్టే పనిలో ఉంది. నిన్న మొన్నటి వరకు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు కలిసి కట్టుగా నేతలను లాగేసుకొనే పనిలో ఉన్నారు. అంతర్గత కుమ్మలాటలను కాసేపు పక్కన పెట్టేసి అధికార పార్టీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించే పనిలో పడ్డారు. అసలు  వీరి కలయిన సాధ్యమయ్యే పనేనా అన్నట్లుగా భావించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా చేయి చేయి కలిపి వెళ్లి పార్టీలోకి రావాల్సిందిగా ఇతర పార్టీల నేతలకు సాదర స్వాగతాలు పలుకుతున్నారు. ఎవరినైతే కేసీఆర్ కాదనుకున్నారో వాళ్లందరినీ పోగుచేసి గులాబీ బాస్ కి చుక్కలు చూపించే పనిని మూకుమ్మడిగా నెత్తికి ఎత్తుకుంటున్నారు. అసలు వీళ్ళకి ఉన్న ఈగోకి వీళ్ళేం చేస్తార్లే అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఒకటికి వంద మెట్లు దిగి మీరు వస్తే చాలు మీదే రాజ్యం అన్నట్లు అసలైన రాజకీయాన్ని అవలంబిస్తున్నారు.దీంతో ఇప్పుడు గులాబీ బాస్ కి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి కనిపిస్తున్నది.  పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూప‌ల్లి కృష్ణారావు, నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి వంటి వారికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా గాలం వేసి పట్టేసింది. హస్తం నీడకి వీరు చేరడం ఇక లాంఛనప్రాయమే. వీరిని ఇప్పటికే బీఆర్ఎస్ ముప్పుతిప్పలు పెట్టిసి వదిలేసింది. దీంతో వీరు తమ వర్గాన్ని కూడగట్టుకొని మరింత బలంగా మారి ఇప్పుడు సీన్ లోకి ఎంటర్ అయ్యారు. ఒకప్పుడు రాజకీయ ఉద్దండులైన వీరిని బీఆర్ఎస్ లైట్ తీసుకోవడంతో వీరు అసంతృప్త వర్గాన్ని మోపుజేసి ఒక జట్టుగా చేసి పెట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ ముందు వీళ్ళని ఎలాగైనా పట్టేస్తే.. మిగిలిన పని సులభంగా చక్కపెట్టేయొచ్చని కాళ్లకు బలపం కట్టుకొని వీళ్ళ కోసం వీర ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి వీళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఇక కౌంట్ డౌన్ మొదలైనట్లేనని భావిస్తున్నారు. ఇప్పటికే సొంత పార్టీలో పనితీరులో అట్టడుగులో ఉన్న ఎమ్మెల్యేల జాబితా విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న కేసీఆర్ కు.. వాళ్ళలో రెబల్స్ అయ్యే వారిని ఎలా బుజ్జగించాలో అర్ధం కాని పరిస్థితిలో ఉండగా.. కాంగ్రెస్ వాళ్ళకి కూడా గాలమేసి ఉసిగొల్పితే జరిగే నష్టం లెక్క వేయలేనిది. మరోవైపు వైఎస్ షర్మిలను కూడా రంగంలోకి దింపేందుకు శక్తిమేరా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మరోవైపు టీడీపీ ఎవరితో పొత్తుకు వెళ్తుందో ఇంకా స్పష్టత రాలేదు. ఇటు షర్మిల, అటు టీడీపీ అంశం కూడా క్లారిటీ వస్తే అన్ని వైపులా బీఆర్ఎస్ పార్టీకి ఉచ్చు బిగిసి అష్టదిగ్బంధనంగా మారుతుంది. అయితే, ఎలాంటి చిక్కుముడినైనా చాకచక్యంగా విప్పగల నేర్పరిగా పేరున్న కేసీఆర్ ఈ పొలిటిల్ రైడ్ ను ఎలా గమ్యానికి చేరుస్తారో చూడాలి.