TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

political-news-img

పిప్పళ్లు ఆరోగ్యానికి చేసే మేలు ఎంత..ఆయుర్వేదంలో వీటిని ఎందుకు ఉపయోగిస్తారు.!

భారతీయ సాంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదంలో పిప్పళ్లకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. నల్లగా, చిన్న పొడుగు ఆకారంలో ఉండే ఈ పిప్పళ్లు కేవలం వంటగదిలోని దినుసు మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న దివ్యౌషధం. శతాబ్దాల నుంచి మన పెద్దలు, ఆయుర్వేద నిపుణులు రకరకాల ఆరోగ్య సమస్యల నివారణకు పిప్పళ్లను ప్రధానంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. పిప్పళ్లు చేసే మేలు.. పిప్పళ్లలో ఉండే కెమికల్ కాంపౌండ్ పైపరీన్ శరీరంలో జీవక్రియలను వేగవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పిప్పళ్లు చేసే మేలు అపారం. జలుబు, దగ్గు, ఉబ్బసం, గొంతు నొప్పి, ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి పిప్పళ్లు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. పిప్పళ్ల పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం సులభంగా బయటకు వచ్చేస్తుంది. పిప్పళ్ల గురించి ఆయుర్వేదం ఏం చెబుతుంది? ఆయుర్వేదంలో పిప్పళ్లను రసాయన మూలికగా వర్గీకరించారు. అంటే ఇవి శరీరానికి పునరుజ్జీవనాన్ని అందిస్తాయి. ఆయుర్వేదంలో దీనిని త్రిదోషాలలో ప్రధానమైన కఫ, వాత దోషాలను సమతుల్యం చేయడానికి ఉపయోగిస్తారు. శరీరంలో జఠరాగ్నిని అంటే జీర్ణశక్తిని రగిల్చే గుణం పిప్పళ్లకు ఉంది. తిన్న ఆహారం సరిగ్గా అరగకపోయే సమస్యను, ఆకలి మందగించడాన్ని ఇది నివారిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ లేదా విష పదార్థాలను బయటకు పంపడంలో ఆయుర్వేద వైద్యంలో పిప్పళ్లను క్రియాశీలకంగా ఉపయోగిస్తారు. పిప్పళ్ల వల్ల కలిగే మరికొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. జీర్ణ వ్యవస్థ మెరుగుపడటం.. గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను పిప్పళ్లు త్వరితగతిన నివారిస్తాయి. జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి ఆహారం వేగంగా అరిగేలా చేస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుదల.. యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తరచూ వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. బరువు నియంత్రణ.. శరీరంలో జీవక్రియల వేగాన్ని పెంచి, చెడు కొవ్వును కరిగించడంలో పిప్పళ్లు ఎంతో సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి సహజ నివారణి. నొప్పులు , వాపుల నివారణ.. పిప్పళ్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాతపు నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాలేయ ఆరోగ్యం.. కాలేయంలోని వ్యర్థాలను తొలగించి, కాలేయం సరిగ్గా పనిచేయడానికి పిప్పళ్లు తోడ్పడతాయి. పిప్పళ్లను నిత్య జీవితంలో తగిన మోతాదులో వాడటం వల్ల అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ఇవి శరీరంలో వేడిని పెంచే గుణం కలిగి ఉంటాయి కాబట్టి, పిత్త ప్రకృతి ఉన్నవారు లేదా గర్భిణులు ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవడం మంచిది. *రూపశ్రీ.

Published on: Fri Aug 28, 2026 9:43PM

political-news-img

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు తినాల్సిన ముఖ్యమైన ఆహారాలు ఏమిటి.!

కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థం. ఇది శరీరంలోని కణాల నిర్మాణానికి మరియు కొన్ని రకాల హార్మోన్ల తయారీకి ఎంతో అవసరం. అయితే, రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెరిగితే అది గుండె ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడి, గుండెపోటు , పక్షవాతం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ప్రస్తుతం కాలంలో ఉన్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహార లోపం , తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో కొలెస్ట్రాల్ సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే సరైన ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడమే కాకుండా, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాలు ఏమిటో, అవి ఎలా సహాయపడతాయో తెలుసుకుంటే.. ఫైబర్.. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో పీచు పదార్థం లేదా ఫైబర్ పాత్ర చాలా కీలకమైనది. ముఖ్యంగా కరిగే పీచు పదార్థం పుష్కలంగా ఉండే ఆహారాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఓట్స్ , బార్లీ వంటి ధాన్యాలలో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించి, శరీరం నుండి దాన్ని బయటకు పంపడానికి సహాయపడతాయి. రోజూ ఉదయం అల్పాహారంలో ఓట్స్ లేదా బార్లీ చేర్చుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. పప్పుధాన్యాలు, గింజలు.. వివిధ రకాల పప్పుధాన్యాలు , గింజలు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి. శనగలు, పెసలు, రాజ్మా, మినుములు , కందిపప్పు వంటి వాటిలో ప్రోటీన్లు, విటమిన్లు , పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగించి, అనవసరమైన కేలరీలు తీసుకోకుండా నిరోధిస్తాయి. అలాగే నట్స్ అని పిలిచే బాదం, వాల్‌నట్స్ , పిస్తా పప్పులు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే అసంతృప్త కొవ్వులు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. కాకపోతే వీటిని పరిమిత పరిమాణంలోనే తీసుకోవడం మంచిది. తాజా కూరగాయలు , ఆకుకూరలు.. రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. పాలకూర, తోటకూర, మెంతి కూర వంటి ఆకుకూరలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బెండకాయ, వంకాయ, క్యారట్ , బీట్‌రూట్ వంటి కూరగాయలలో కరిగే పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఇవి కొలెస్ట్రాల్ శోషణను అడ్డుకుంటాయి. వెల్లుల్లి.. వెల్లుల్లి రక్తనాళాలను శుభ్రపరచడంలో , కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. రోజూ ఒకటో రెండో వెల్లుల్లి రెబ్బలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా తగ్గుతుంది. పండ్లు.. పండ్లు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. బొప్పాయి, ఆపిల్, నారింజ, జామ, దానిమ్మ వంటి పండ్లలో పెక్టిన్ అనే ప్రత్యేకమైన కరిగే పీచు పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించడంలో ఎంతగానో దోహదపడుతుంది. అలాగే పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి. నిమ్మజాతి పండ్లు.. నిమ్మ జాతి పండ్లలో ఉండే విటమిన్ సి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హెల్తీ ఫ్యాట్స్.. చేపలు , ఆరోగ్యకరమైన నూనెలు కూడా కొలెస్ట్రాల్ నిర్వహణకు సహాయపడతాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలను తినడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గుతాయి. వంటల కోసం ప్రాసెస్ చేసిన నూనెలకు బదులుగా ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె లేదా ఆవనూనె వంటి వాటిని పరిమితంగా ఉపయోగించడం మంచిది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచకుండా కాపాడతాయి. ఈ ఆహారాలు తినకూడదు.. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు కొన్ని ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన మాంసం, మైదాతో చేసిన పదార్థాలు, తీపి పదార్థాలు, బేకరీ ఆహారాలు , పూర్తి కొవ్వు ఉన్న పాల పదార్థాలను తగ్గించాలి. వీటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ , సంతృప్త కొవ్వులు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను వేగంగా పెంచుతాయి. ఆహారాలు మాత్రమే కాదు.. ఇవి కూడా ముఖ్యమే.. కేవలం మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా, రోజువారీ జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం అవసరం. ప్రతిరోజూ కనీసం ముప్పై నిమిషాల పాటు నడక లేదా ఇతర వ్యాయామాలు చేయడం, తగినంత నీరు తాగడం, ఒత్తిడిని తగ్గించుకోవడం , మంచి నిద్ర వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. సరైన ఆహార నియమాలు , ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే కొలెస్ట్రాల్‌ను సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. *రూపశ్రీ.

Published on: Thu Aug 27, 2026 3:37PM

political-news-img

శరీరానికి ఎంతో అవసరమైన ఒమేగా 3 కోసం ఖరీదైన ఫుడ్ అక్కర్లేదు.. చవకగా లభించే ఈ ఫుడ్ చాలు..!

ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మెదడు పనితీరును పెంచడంలో , శరీరంలో మంటను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా ఒమేగా3 అనగానే ఖరీదైన సప్లిమెంట్లు లేదా సాల్మన్ వంటి పెద్ద చేపలే గుర్తొస్తాయి. కానీ మనకు సులభంగా , తక్కువ ధరలో లభించే ఆహార పదార్థాల ద్వారా కూడా ఒమేగా3 ని పొందవచ్చు. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. అవిసె గింజలు.. అవిసె గింజలు ఒమేగా3 పొందడానికి అత్యంత చౌకగా లభించే పదార్థం. వీటిని కాస్త వేయించి పొడి చేసుకుని రోజువారీ ఆహారంలో, పెరుగులో లేదా నీటిలో కలుపుకుని తీసుకోవచ్చు. ఇవి గుండె ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తాయి. చియా విత్తనాలు.. శాకాహారులకు ఇవి మంచి ఎంపిక. వీటిని నీటిలో నానబెట్టి స్మూతీలు, జ్యూస్‌లు లేదా మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. ఇవి ఒమేగా3 తో పాటు శరీరానికి కావలసిన పీచు పదార్థాన్ని కూడా అందిస్తాయి. చిన్న చేపలు (సార్డిన్స్, మకేరల్).. ఖరీదైన విదేశీ చేపల జోలికి వెళ్లకుండా స్థానిక మార్కెట్లలో దొరికే చిన్న రకం చేపలను ఎంచుకోవచ్చు. సార్డిన్స్, మకేరల్ వంటి చిన్న చేపల్లో ఒమేగా3 సమృద్ధిగా ఉంటుంది. ఇవి ధరలో తక్కువగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. సోయాబీన్స్.. మొక్కల ఆధారిత పోషకాల్లో సోయాబీన్స్ ఒకటి. వీటిని కూరగాయల రూపంలో లేదా సోయా పాలు, తోఫు రూపంలో తీసుకోవడం వల్ల ఒమేగా3 తో పాటు మంచి ప్రొటీన్ లభిస్తుంది. నువ్వులు.. భారతీయ ఇళ్లలో సాధారణంగా వాడే నువ్వులు కూడా మంచి పోషకాలను అందిస్తాయి. వీటిని వివిధ వంటకాల రూపంలో తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. పాలకూర మరియు ఆకుకూరలు.. రోజువారీ వంటల్లో వాడే ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూరలో కొంత పరిమాణంలో ఒమేగా3 లభిస్తుంది. ఇవి శరీరానికి ఇతర విటమిన్లు , ఖనిజాలను కూడా అందిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండానే మన రోజువారీ ఆహారంలో ఈ సాధారణ పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ఒమేగా3 లోపాన్ని నివారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. *రూపశ్రీ.

Published on: Tue Aug 25, 2026 7:18PM

political-news-img

కడుపునొప్పి, గ్యాస్ సమస్య వేధిస్తోందా.. అమ్మమ్మల కాలం నాటి ఈ చిట్కా మ్యాజిక్ చేస్తుంది..!

మారుతున్న వాతావరణంతో, పిల్లల నుండి పెద్దల వరకు ప్రతిఒక్కరినీ కడుపునొప్పి, గ్యాస్, దగ్గు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. గ్రామీణ ప్రాంతాలలోనూ, ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నప్పుడు మెడికల్ స్టోర్ మందులకు బదులుగా పెద్దవాళ్లు తమ సాంప్రదాయ వైద్యాన్ని, పెద్దలు నేర్పించిన ఇంటి చిట్కాలను పాటిస్తుంటారు. నిజానికి ఈ చిట్కాలు చాలా వరకు మ్యాజిక్ లాగా పనిచేస్తాయి కూడా. అలాంటి అద్బుతమైన చిట్కా గురించి తెలుసుకుంటే.. కడుపునొప్పికి వేడి ఉప్పు ప్యాక్.. కడుపు నొప్పికి ఒక సాంప్రదాయ ఇంటి చికిత్స ఉంది. గోరువెచ్చని ఉప్పు కాపడాన్ని పెట్టడం చాలా ప్రబావవంతంగా పనిచేస్తుంది. దొంతర ఉప్పు లేదా దొడ్డు ఉప్పును ఒక గుడ్డలో చుట్టి, కొద్దిగా వేడి చేసి, ఆ తర్వాత కడుపుపై ఉంచుతారు. ఆ వెచ్చదనం ఉదర కండరాలలోని తిమ్మిర్లు లేదా బిగువు నుండి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది. గ్యాస్ లేదా తేలికపాటి తిమ్మిర్ల వంటి సమస్యలు ఉన్నవారికి గోరువెచ్చని కాపడాలు చాలా బాగా సహాయపడతాయి. అయితే కడుపు నొప్పి వేరే ఏదైనా సమస్యల వల్ల వచ్చి ఉంటే.. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్, అలర్జీలు లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా కడుపు నొప్పి రావచ్చు. ఇలాంటి సమస్యల వల్ల కడుపు నొప్పి వచ్చి ఉంటే.. ఆ కడుపు నొప్పి కూడా వాంతులు, జ్వరం, విరేచనాలు, కడుపు ఉబ్బరం, లేదా కడుపులో రక్తం వంటి లక్షణాలతో కూడి ఉంటే అలాంటి సమస్యలకు ఈ ఉప్పు కాపడం అనేది సరైనది కాదు.. కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. వేడి ఉప్పు కాపడం వాడే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. ఉప్పు ప్యాకె ను మరీ ఎక్కువగా వేడి చేయకూడదు. దీనిని నేరుగా చర్మం మీద పెట్టడానికి బదులుగా ఒక సన్నని క్లాత్ ను పొట్ట మీద ఉంచి ఆ తర్వాత కాపడం పెట్టాలి. పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది, కాబట్టి వారి విషయంలో ఉష్ణోగ్రత విషయంలో జాగ్రత్త వహించాలి. నిద్రపోతున్నప్పుడు వెచ్చని ప్యాక్‌ను అలాగే పెట్టుకుని పడుకోకూడదు. ఒకవేళ ఎరుపు, మంట లేదా నొప్పి వంటివి కలిగితే ఉప్పు కాపడం ఆపెయ్యాలి. కఫ సమస్యలకు ఉప్పు కాపడం.. దగ్గు, కఫం లేదా ఛాతిలో భారంగా అనిపించడం వంటి వాటికి చాలా ఇళ్లలో వేడి ఉప్పు కాపడం ఉపయోగించడం ఒక సాధారణ పద్ధతి. ఉప్పును వేడి చేసి, ఒక గుడ్డలో లేదా టవల్‌లో ఉంచి, కొద్దిసేపు ఛాతిపై ఉంచుతారు. ఆ వెచ్చదనం ఛాతి పట్టేసినట్టు ఉండటం నుండి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా దీని ఫలితం ఉండవచ్చు. వేడి ఉప్పు టవల్ దగ్గుకు పూర్తీ చికిత్స కాదు. . వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, అలర్జీలు, ఆస్తమా లేదా ఇతర కారణాల వల్ల కూడా దగ్గు రావచ్చు. అందువల్ల, కేవలం ఈ ఇంటి చిట్కాపై మాత్రమే ఆధారపడటం మంచిది కాదు. *రూపశ్రీ.

Published on: Tue Aug 25, 2026 7:01PM

political-news-img

పంటి నొప్పి, చిగుళ్ల రక్తస్రావం.. డాక్టర్ శిరీష కీలక సూచనలు!

పంటి నొప్పి, పిప్పిపంటి, పంటి సెన్సిటివిటీ, చిగుళ్ల నుంచి రక్తం రావడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ఆయుర్వేద వైద్య నిపుణురాలు డాక్టర్ శిరీష నోటి మరియు దంత ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలు, పిప్పిపంటి వంటి సమస్యల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నోటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? వంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అలాగే నోటి క్యాన్సర్‌కు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు, నోటి పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి కూడా ఉపయోగకరమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం వీడియోను చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం అవగాహన కోసం మాత్రమే. దంతాలు లేదా చిగుళ్లకు సంబంధించిన సమస్యలు కొనసాగితే అర్హత కలిగిన డెంటిస్ట్‌ను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)

Published on: Tue Aug 25, 2026 6:17PM

political-news-img

థైరాయిడ్ సమస్యలకు ఉజ్జయి ప్రాణాయామం.. ఇలా చేయండి!

థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో ఒత్తిడి, ఆందోళన, అలసట, ఏకాగ్రత తగ్గడం వంటి ఇబ్బందులు కనిపించవచ్చు. ఇలాంటి సమయంలో ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు యోగా, ప్రాణాయామం కూడా కొంతమందికి ఉపయోగకరంగా ఉండొచ్చు. అలాంటి ప్రాణాయామాల్లో ఉజ్జయి ప్రాణాయామం (Ujjayi Pranayama) ఒకటి. దీనిని చేస్తూ శ్వాస తీసుకునేటప్పుడు గొంతు భాగంలో స్వల్పంగా శబ్దం వస్తుంది. అందుకే దీనిని కొందరు “Ocean Breath” అని కూడా అంటారు. ఈ వీడియోలో సీనియర్ యోగా థెరపిస్ట్, ఆయుర్వేద డైటీషియన్ స్రవంతి రఘు ఉజ్జయి ప్రాణాయామాన్ని ఎలా చేయాలి? శ్వాసను ఎలా నియంత్రించాలి? రోజువారీ జీవితంలో దీనిని ఎలా ప్రాక్టీస్ చేయాలి? వంటి విషయాలను సులభంగా వివరిస్తున్నారు. థైరాయిడ్ సమస్యలతో పాటు ఒత్తిడి, మానసిక ఆందోళన లేదా ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఉన్నవారు ఈ ప్రాణాయామం గురించి తెలుసుకోవచ్చు. అయితే ప్రాణాయామం థైరాయిడ్‌కు వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. థైరాయిడ్‌కు మందులు వాడుతున్నవారు వైద్యుల సూచనలను తప్పకుండా పాటించాలి. గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాత యోగా లేదా ప్రాణాయామాన్ని ప్రారంభించడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)

Published on: Mon Aug 24, 2026 7:17PM

political-news-img

Best Before Use By అంటే ఏమిటి..తేదీ దాటిన ఆహారాన్ని తినవచ్చా..తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవీ..!

సూపర్‌మార్కెట్‌లో, షాప్స్ లో, చిన్న అంగళ్లలో కొనుగోలు చేసే బిస్కెట్లు, ప్యాకెట్ ఫుడ్స్, పాల ఉత్పత్తులు, జ్యూస్‌లు, సాస్‌లు, రెడీ-టు-ఈట్ ఆహార పదార్థాలపై “Best Before”, “Use By”, “Expiry Date” వంటి పదాలు కనిపిస్తుంటాయి. చాలామందికి వీటి మధ్య తేడా స్పష్టంగా తెలియదు. “తేదీ అయిపోయింది కదా… ఇక ఆహారం మొత్తం పారేయాలా?” అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అంతే కాదు.. తేదీ దాటి ఇంకా ఒక్కరోజే, ఒక్క వారమే.. కాబట్టి ఏమి కాదు అనుకుని వాడేవాళ్ళు కూడా ఉంటారు. అయితే Best Before తేదీ , Use By/Expiry తేదీ ఒకే అర్థాన్ని ఇవ్వవు. ఆహారం ఎంతకాలం నాణ్యతగా ఉంటుంది? ఎప్పుడు దాన్ని తినడం సురక్షితం కాదు? అనే విషయాల్లో ఈ తేదీలకు చాలా తేడా ఉంది. దీని గురించి ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. తేదీ ఎందుకు వేస్తారు? ఆహార పదార్థాలను తయారు చేసిన తర్వాత వాటి రుచి, వాసన, రంగు, ఆకృతి, పోషకాల నాణ్యత, భద్రత కాలం గడిచేకొద్దీ మారవచ్చు. అందుకే తయారీదారులు ప్యాకెట్‌పై ఒక నిర్దిష్ట తేదీని సూచిస్తారు. అయితే ఆ తేదీ ప్రతి సందర్భంలో “ఆ రోజు తర్వాత ఆహారం విషంగా మారుతుంది” అని అర్థం కాదు. ఇక్కడే Best Before, Use By మధ్య తేడా వస్తుంది. “Best Before” అంటే ఏమిటి? Best Before అంటే ఆ ప్యాక్ లో ఉన్న ఆహార పదార్థం మంచి నాణ్యతను కలిగి ఉండే కాలం. అంటే, ప్యాకెట్‌పై.. ఒక నిర్దిష్ట తేదీ వరకు ఆహారం తన రుచి, వాసన, క్రిస్పీనెస్, రంగు వంటి నాణ్యతలను బాగా కలిగి ఉంటుందనీ అర్ధం. తేదీ దాటిన వెంటనే ఆహారం పాడైపోతుందా? సరిగ్గా నిల్వ చేసిన కొన్ని ఆహార పదార్థాలు Best Before తేదీ దాటిన తర్వాత కూడా కొంతకాలం తినడానికి అనుకూలంగా ఉండవచ్చు. అయితే వాటి నాణ్యత తగ్గి ఉండవచ్చని చెబుతున్నారు. ఉదాహరణకు.. బిస్కెట్లు మెత్తబడవచ్చు, సీరియల్స్ క్రిస్పీనెస్ కోల్పోవచ్చు, కొన్ని ప్యాకెట్ ఫుడ్స్ రుచి తగ్గవచ్చు, టీ, కాఫీ వంటి పదార్థాల సువాసన తగ్గవచ్చు. అందుకే Best Before అనేది ప్రధానంగా నాణ్యతకు సంబంధించిన అంశం అని చెబుతారు. “Use By” అంటే ఏమిటి? Use By అనేది ఆహారం భద్రతకు సంబంధించిన గడువు. ఈ తేదీ ముఖ్యంగా త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలకు వర్తిస్తుంది. ఉదాహరణకు: కొన్ని తాజా పాల ఉత్పత్తులు, తాజా మాంసం, చేపలు, కొన్ని రెడీ-టు-ఈట్ ఆహారాలు, త్వరగా పాడయ్యే ఇతర ఆహారాలు ప్యాకెట్‌పై నిర్ణీత తేదీ ఉంటే.. ఆ తేదీ దాటిన తర్వాత అది బయటికి చూడటానికి లేదా వాసనకు బాగానే ఉన్నప్పటికి తినడం సురక్షితం అని అని అనుకోకూడదు. అందుకే Use By తేదీ దాటిన ఆహారాన్ని తినకుండా ఉండటం మంచిది. Best Before తేదీ దాటితే ఏం చేయాలి? ఆహారం ఏ రకమైనది, ఎలా నిల్వ చేశారు, ప్యాకెట్ తెరిచారా లేదా అనే విషయాలపై ఇది ఆధారపడి ఉంటుంది. కొన్ని ఆహారాలు ఈ తేదీ దాటిన తర్వాత కూడా తినడానికి అనువుగానే ఉంటాయి. కానీ వాటిలో నాణ్యత మాత్రం తగ్గిపోయి ఉంటుంది. అలాంటి ఆహారం తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాసన చూసి ఆహారం సురక్షితమా కాదా తెలుసుకోగలమా? కొన్ని హానికరమైన బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవులు ఆహారంలో పెరిగినా, ఆహారంలో దుర్వాసన, రంగు మార్పు కనిపించకపోవచ్చు కూడా. అందువల్ల ఆహారం వాసన రాలేదనే కారణంతో తినడం సరైనది కాదు. ముఖ్యంగా Use By తేదీ దాటిన ఆహారాన్ని కేవలం వాసన లేదా రుచి చూసి ఏమి కాదని నిర్ధారించుకోవడం సరైన పద్ధతి కాదు. ప్యాకెట్ తెరిచిన తర్వాత గడువు మారుతుందా? కొన్ని ఆహార పదార్థాలకు ఇది చాలా ముఖ్యమైన విషయం. కొన్ని ఆహారాల మీద best before అని ఉన్నా.. ప్యాకెట్ లు లేదా బాటిల్ మూతలు తెరిచిన తర్వాత వాటిని ఎక్కువ రోజులు వాడటం మంచిది కాదు. వాటిని తొందరగా వాడేయాలి. *రూపశ్రీ.

Published on: Sat Aug 22, 2026 7:22PM

political-news-img

ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది... ఎవరికి ఎక్కువ ప్రమాదం..!

ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా గుర్తించాలి? అనే విషయాలను ఈ వీడియోలో డాక్టర్ ఆర్. బాలాజీ సులభంగా వివరిస్తున్నారు. కాలేయ కణాల్లో అధికంగా కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ (Fatty Liver Disease) అంటారు. చాలా మందిలో దీనివల్ల ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే కొంతమందిలో అలసట, బరువు తగ్గడం లేదా పొత్తికడుపులో అసౌకర్యం వంటి సమస్యలు కనిపించవచ్చు. అధిక బరువు, ఊబకాయం, జీవనశైలి వంటి కారణాలు ఫ్యాటీ లివర్‌కు దారితీయవచ్చు. ఆహారపు అలవాట్లలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువును నియంత్రించుకోవడం ద్వారా ప్రమాద కారకాలను తగ్గించుకోవచ్చు. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. కొంతమందిలో ఈ సమస్య కాలేయంలో తీవ్రమైన మార్పులకు దారితీసే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్‌కు కారణాలు ఏమిటి? దాని లక్షణాలు ఏంటి? ఎలా నిర్ధారిస్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి పూర్తి వివరాలను డాక్టర్ ఆర్. బాలాజీ ఈ వీడియోలో వివరించారు. వీడియోను పూర్తిగా చూడండి.. ఫ్యాటీ లివర్ గురించి ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి. గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు లేదా లక్షణాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)

Published on: Sat Aug 22, 2026 6:31PM

political-news-img

మునగాకు పొడి ఇలా తీసుకుంటే.. షుగర్, కీళ్ల నొప్పులకు చెక్!

మునగాకు (Moringa Leaves) మనకు ప్రకృతి అందించిన పోషక విలువలు ఉన్న ఆహారాల్లో ఒకటి. మునగాకులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. మునగాకు పొడిని ఎలా తీసుకోవాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? షుగర్, కీళ్ల నొప్పులు, రోగనిరోధక శక్తి వంటి విషయాల్లో మునగాకు ఎలా ఉపయోగపడుతుంది? అనే అంశాలను ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించారు. మునగాకు పొడిని సరైన విధంగా తీసుకోవడం, ఆహారంలో ఎలా చేర్చుకోవాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గమనిక: మునగాకు లేదా మునగాకు పొడి ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఉపయోగపడవచ్చు. అయితే డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది. మందులకు బదులుగా మునగాకు పొడిని ఉపయోగించకండి. TeluguOne Health లో ఆరోగ్యానికి సంబంధించిన తాజా సమాచారం, నిపుణుల సూచనలు, ఉపయోగకరమైన ఆరోగ్య చిట్కాలను తెలుసుకోండి.

Published on: Fri Aug 21, 2026 7:45PM

political-news-img

నీరు పుష్కలంగా తాగిన తర్వాత కూడా దాహం వేస్తుందా.. ఈ సమస్య గురించి నిజాలు ఇవే..!

దాహంగా అనిపించినప్పుడు, గొంతు పొడిగా మారినప్పుడు నీరు తాగడం సహజం. అయితే ఇలా నీరు తాగగానే.. మళ్లీ కాసేపటికే వెంటనే దాహం వేస్తుంది కొందరికి. దీని గురించి చాలామంది పట్టించుకోరు. ఇదేమైనా ఆరోగ్య సమస్య ఏమో అని కొందరు సందేహ పడుతూ ఉంటారు. కానీ నిజానికి ఇదిశరీరంలో ఏదో అనారోగ్యానికి సంకేతం కాదని, కానీ.. శరీరంలో ఏదో ఒక సమస్యను మాత్రం ఖచ్చితంగా సూచిస్తుందని అంటున్నారు. చాలా వరకు ఎన్ని సార్లు నీరు తాగినా మళ్లీ దాహం వేయడానికి అసలు కారణం శరీరం డీహైడ్రేషన్ అవ్వడమే.. ఎక్కువ శారీరక కష్టం చేయడం.. అధికంగా చెమట పట్టడం, ఎండకు గురికావడం లేదా అధికంగా ఉప్పు తీసుకోవడం వంటివన్నీ శరీరాన్ని డీహైట్ర్ అయ్యేలా చేసి ఎక్కువ దాహం వేయడానికి కారణం అవుతాయి. కానీ ఎక్కువ దాహం కావడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. మధుమేహం.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, తరచుగా చాలా దాహం వేయడం అనేది మధుమేహానికి ఒక తొలి లక్షణం కావచ్చని అంటున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, శరీరం అదనపు గ్లూకోజ్‌ను మూత్రం ద్వారా బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది, ఈ ప్రక్రియలో నీరు కూడా విసర్జించబడుతుంది, దీనివల్ల తరచుగా దాహం వేస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యం.. మూత్రపిండాలు శరీరంలో నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే, ఈ సమతుల్యతకు భంగం వాటిల్లి, తరచుగా దాహం వేయడానికి దారితీస్తుంది. ఈ లక్షణం మూత్రపిండాలకు సంబంధించిన సమస్యను కూడా సూచించవచ్చు. డయాబెటిస్ ఇన్సిపిడస్.. డయాబెటిస్ ఇన్సిపిడస్ అనేది శరీరంలో ఒక నిర్దిష్ట హార్మోన్ లోపించడం వల్ల కలిగే సమస్య. దీనివల్ల అధిక దాహం , తరచుగా మూత్రవిసర్జన కలుగుతాయి. ఇది డయాబెటిస్ మెల్లిటస్ కు భిన్నంగా ఉంటుంది, కానీ దీని లక్షణాలు చాలా వరకు ఒకేలా ఉంటాయి. నోరు పొడిబారడం.. కొన్నిసార్లు, తగినంత లాలాజలం ఉత్పత్తి కాకపోవడం వల్ల ఎప్పుడూ దాహం కలుగుతుంది, ఈ పరిస్థితిని నోరు పొడిబారడం అంటారు. దీనివల్ల నోరు, గొంతు, నాలుక పొడిబారవచ్చు, కొన్నిసార్లు పెదవులు కూడా పగలవచ్చు. ఈ సమస్య కొన్ని మందుల దుష్ప్రభావంగా కూడా ఎదురవుతుంది. వైద్యుడిని ఎప్పుడుసంప్రదించాలి? పై లక్షణాలు కొనసాగితే, ముఖ్యంగా మధుమేహం, మూత్రపిండాల వ్యాధి లేదా హార్మోన్ల సమస్యలు వంటి ముందు నుంచే ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో, వాటిని తేలికగా తీసుకోకూడదు. ఈ లక్షణాలు పిల్లలు , వృద్ధులలో మరింత తీవ్రంగా ఉంటాయి. కాబట్టి సకాలంలో రోగ నిర్ధారణ , సరైన చికిత్స చాలా అవసరం. *రూపశ్రీ.

Published on: Fri Aug 21, 2026 7:35PM