విజయసాయి నోట వీజీటీఎమ్.. విసారెడ్డి అసలు వ్యూహం ఇదేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి స్టైలే వేరు. ఆయన రూటే సెపరేటు. రాజకీయ సన్యాసం అని ప్రకటించి వ్యవసాయమే తన వ్యాపకమన్న చాటిన తరువాత కూడా విజయసాయి.. రాజకీయాలే మాట్లాడుతున్నారు. మనిషిగా ఆయన రాజకీయాలకు దూరం అని చెబుతున్నా.. ఆయన మనసు మాత్రం రాజకీయాలతోనే ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి ఖరారైన తరువాత కూడా జగన్ కు అనుకూలంగా.. విజయసాయిరెడ్డి తాజాగా రాజధాని విషయంలో చేసిన కొత్త ప్రతిపాదన ఈ విషయాన్ని నిర్ధారిస్తోంది. నిన్నటి వరకు వైస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించిన ఆయన, ఇప్పుడు జగన్ మనసులోని ఆలోచనలను ప్రతిబింబించేలా, రాజధాని విషయంలో కొత్త డిమాండ్ను తెరపైకి తీసుకువచ్చి.. జగన్ పై తనకున్న భక్తిని, అభిమానాన్నీ చాటుకున్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికలకు తమ నినాదంమావిగన్' (మచిలీపట్నం - విజయవాడ - గుంటూరు) అని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అన్నట్టుగా సాగుతాయని కూడా జగన్ చెప్పారు. ఇక్కడే విజయసాయి రెడ్డి పైకి మావిగన్ ను వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తూనే.. జగన్ ప్రతిపాదించిన మూడు నగరాలకు అదనంగా మంగళగిరిని కూడా చేర్చి, మచిలీపట్నాన్ని తొలగించి తెనాలి పేరును తీసుకువచ్చి విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి (వీజీటీఎమ్) ప్రాంతాన్ని ఏపీ రాజధానిగా అభివృద్ధి చేయాలన్నారు. గతంలో శివరామకృష్ణ కమిషన్ కూడా ఈ వీజీటీఎం ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని సూచించిన విషయం తెలిసిందే. కేవలం ఒకే చోట అమరావతిని నిర్మించడం కంటే.. ఈ నాలుగు నగరాలను సమగ్రంగా విస్తరిస్తూ కనెక్టివిటీని పెంచితే, అది ఆటోమేటిక్గా రాష్ట్రానికి ఒక అద్భుతమైన మెగా రాజధాని అయిపోతుందంటూ విజయసాయి సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఒకవైపు అమరావతిపై విమర్శలు చేస్తూ, అక్కడ భారీగా అవినీతి జరిగిందని ఆరోపించడమే కాకుండా, ఈ వివాదంపై త్వరలోనే న్యాయస్థాన్ని ఆశ్రయిస్తానంటూ.. జగన్ చెప్పిన మాటలనే మరో డిక్షన్ తో విజయసాయి చెబుతున్నారు. విజయసాయిరెడ్డి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 స్థానంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి విదితమే. అప్పట్లో అమరావతిని ఏకాభిప్రాయంతో రాజధానిగా నిర్ణయించినప్పుడు గానీ, ఆ తర్వాత జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చినప్పుడు గానీ ఆయన ఎన్నడూ వీజీటీఎం ప్రస్తావన తీసుకు రాలేదు. ఇప్పుడు.. వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన తరువాత...వీజీటీఎమ్ అంటూ మాట్లాడటం విజయసాయి అసలు ఉద్దేశాన్ని బయటపెడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. AP Capital Row, Amaravati Controversy, VGTM Proposal, Mavigan Concept
Publish Date: Jul 4, 2026 11:55AM