ఆమంచి చూపు.. జనసేన వైపు.!
ఆమంచి చూపు.. జనసేన వైపు.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ జనసేన గూటికి చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా రాజకీయాలలో క్రీయాశీలంగా ఉండకుండా మౌనం వహించిన ఆమంచి ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకుంటారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేసి కరణం బలరాం చేతిలోపరాజయం పాలయ్యారు. ఆ ఓటమి తరువాత వైసీపీలో ఆమంచి కృష్ణమోహన్ ను ఇసుమంతైనా ప్రాధాన్యత దక్కలేదు. దీంతో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమంచి కృష్ణమోహన్ వైసీపీని వీడి.. వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టింది. దీంతో ఆమంచి రాజకీయంగా ఇన్ యాక్టివ్ అయ్యారు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆయన తన అనుచరులు, నియోజకవర్గ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఆ చర్చలలో చీరాలలో తన పట్టు నిలుపుకోవాలన్నా, రాజకీయంగామనుగడ సాగించాలన్న జనసేనలో చేరడమే కరెక్ట్ అన్న నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జనసేనను మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్ష్ ఒక్కటే మార్గమని భవించిన.. ఆమంచి నేడో రేపు ఇదే విషయాన్ని బహిరంగంగా ప్రకటించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే జనసేన ముఖ్యులతో ఆమంచి చర్చలు జరిపారనీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అప్పాయింట్ మెంట్ ఖరారైన తరువాత ఆయన జనసేన చేరిక ప్రకనట చేసే అవకాశం ఉందనీ, జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది. Amanchi Krishna Mohan, Janasena Party, Pawan Kalyan, Chirala Politics, Teluguone

Publish Date: Jul 4, 2026 3:36PM
మిడ్జిల్ నుంచి సీఎం పీఠం వరకు..రేవంత్ రెడ్డి  20 ఏళ్ల  పొలిటికల్ జర్నీ..!
మిడ్జిల్ నుంచి సీఎం పీఠం వరకు..రేవంత్ రెడ్డి 20 ఏళ్ల పొలిటికల్ జర్నీ..!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. కేవలం ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా మొదలైన ఆయన ప్రయాణం, నేడు తెలంగాణ రాష్ట్రాన్ని శాసించే ముఖ్యమంత్రి స్థాయికి చేరి సరిగ్గా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈ 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక భావోద్వేగ భరితమైన పోస్ట్‌ను పంచుకున్నారు. రెండు దశాబ్దాల తన ప్రజా జీవితం మరుపురాని మధుర జ్ఞాపకం అని ఆయన కొనియాడారు. కేవలం రేవంత్ రెడ్డి అనే పేరుతో ప్రారంభమైన తన రాజకీయ ప్రయాణాన్ని, ప్రజలు ఆదరించి 'రేవంతన్న'గా తమ గుండెల్లో నిలిపిన తీరును ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం నుంచి ప్రారంభమైన తన తొలి రాజకీయ అడుగులను రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్థానిక సంస్థల ప్రతినిధిగా మిడ్జిల్ లో మొదలైన ప్రయాణమే తనను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ 20 ఏళ్ల కాలంలో ఎన్నో సందర్భాలు, మరెన్నో రాజకీయ పరిణామాలు, తీవ్రమైన సంఘర్షణలను ఎదుర్కొన్నానని, అయితే ప్రతి కష్టకాలంలోనూ, ప్రతి మలుపులోనూ ప్రజలు తనకు అండగా నిలిచారని ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సుదీర్ఘ ప్రస్థానం తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన అధ్యాయమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇదే ప్రజాదరణ, స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత సేవ చేయాలనేదే తన ఏకైక సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తాను ఒక సామాన్య శ్రామికుడిగా నిరంతరం శ్రమిస్తానని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కలలను నెరవేర్చే ఒక నమ్మకమైన సేవకుడిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. అధికార గర్వం లేకుండా, కేవలం ప్రజల మనిషిగా, అందరి 'రేవంతన్న'గా ప్రజా హృదయాల్లో మరింత ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవడమే తన ఆశయమని ఆయన ఈ మైలురాయి సందర్భంగా ఉద్ఘాటించారు. 2006 నుంచి 2026 వరకు సాగిన ఈ రెండు దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, ఒంటరి పోరాటాలు చేసి, చివరకు ప్రజా బలంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన రేవంత్ రెడ్డి ప్రయాణం తెలుగు రాజకీయాల్లో ఒక సంచలనం.

Publish Date: Jul 4, 2026 3:36PM
టీఆర్ఎస్ కుదరదు.. మరో పేరు పెట్టుకోండి.. కల్వకుంట్ల కవితకు ఈసీ తాఖీదు.!
టీఆర్ఎస్ కుదరదు.. మరో పేరు పెట్టుకోండి.. కల్వకుంట్ల కవితకు ఈసీ తాఖీదు.!

కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆమె స్థాపించిన కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సమితి పేరుపై భారీ ఎత్తున అభ్యంతరాలు వచ్చిన కారణంగా పార్టీ పేరు మార్చుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు పార్టీకి అధికారిక సమాచారం ఇచ్చింది. ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది. తన పార్టీకి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేర్కొంటూ.. రిజిస్ట్రేషన్ కోసం కవిత ఈసీకి దరఖాస్తు చేసుకున్న సంగతి విదితమే. అయితే.. ఈ పేరుపై వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని అందువల్ల మూడు ప్రత్యామ్నాయ పేర్లను కు సర్పించాలని ఈసీ కవితకు లేఖ రాసింది. కాగా ఈసీ నుంచి వచ్చిన అభ్యంతరాలపై స్పందించిన కవిత.. ఈసీ కోరినట్లు ప్రత్యామ్నాయంగా కొత్త పేర్లు ఇచ్చే ప్రసక్తే లేదనీ.. ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామనీ తెలిపారు. గత ఫిబ్రవరిలో తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజా శక్తి పేర్లను సూచిస్తూ కవిత సీఈసీకి లేఖ రాశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 25న మునీరాబాద్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో తమ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించిన కవిత, అదే సభలో పార్టీ జెండాను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన మూడు రోజులకు కవిత కొత్త పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేన గా ఈసీ ప్రాథమికంగా గుర్తించింది. తాజాగా ఈసీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ప్రత్యామ్నాయ పేర్లు ఎంపిక చేసుకోవాలని సూచించడం తెలంగాణలో రాజకీయ సంచలనానికి తేరతీసింది. ECI, Kalvakuntla, Kavitha, TRSname, Teluguone, Telangana Politics

Publish Date: Jul 4, 2026 1:41PM
2029 ఎన్నికల్లోనూ ఓటమే.. వైపీపీ ఇప్పుడే డిసైడైపోయిదా?
2029 ఎన్నికల్లోనూ ఓటమే.. వైపీపీ ఇప్పుడే డిసైడైపోయిదా?

వైసీపీ వచ్చే ఎన్నికలలోనూ ఓటమి ఖరారని ఇప్పుడే మానసికంగా ఫిక్సైపోయిదా? వచ్చే ఎన్నికలలో కూడా పరాజయం తప్పదన్న నిర్ణయానికి వచ్చేసిందా? అన్న ప్రశ్నలకు తాజాగాకేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్) విషయంలో ఆ పార్టీ లేవనెత్తుతున్న అభ్యంతరాలు, చేస్తున్న విమర్శలను ఎత్తి చూపుతూ పరిశీలకులు ఔననే అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు అధికార పక్షానికి కొమ్ముకాసేలా ఉన్నాయంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులు (ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించే ప్రక్రియను గత నెల 15 నుండి ప్రారంభించారు. ఈ సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, ఓటర్ల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. దీని ఆధారంగా జూలై 21న ఓటర్ల ప్రాథమిక ముసాయిదా విడుదల కానుంది. ఆ తర్వాత అభ్యంతరాలు, చేర్పులు, మార్పుల ప్రక్రియ ముగిశాక, సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. అయితే ఈ 3 నెలల సుదీర్ఘ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని వైసీపీ విమర్శిస్తోంది. ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది. బూత్‌కు 50 చొప్పున తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను అధికార కూటమి ప్రభుత్వం తొలగిస్తోందనీ సర్ గడువు నెల రోజులు పెంచాలంటూ వైసీపీ వినతిపత్రాలు ఇస్తోంది. ఇదే ఇప్పుడు వైసీపీ మూడేళ్ల తర్వాత జరిగే ఎన్నికలలో ఓటమికి ఇప్పటి నుంచే రెడీ అయిపోతోందా? అన్న అనుమానాలు కలిగేలా చేస్తున్నదంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియ ఎలా జరుగుతుందన్న విషయంలో రహస్యమేదీ ఉండదు.. రాజకీయ పార్టీలకే కాదు.. సామాన్య ప్రజలకు కూడా ఈ ప్రక్రియ పట్ల సంపూర్ణ అవగాహన ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి.. నివాసం ఉంటున్న వారినే ఓటర్లుగా గుర్తిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిశీలనలో అర్హులైన ఏ పౌరుడి ఓటు పోయే అవకాశమే ఉండదు. పోతే గీతే.. ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో చేర్చిన దొంగ ఓట్లు.. చనిపోయిన వారి పేరుతో ఉన్న బోగస్ ఓట్లు, ఒకే వ్యక్తికి రెండు, మూడు నియోజకవర్గాల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లను మాత్రమే తొలగిస్తారు. ఇదే వైసీపీని భయపెడుతోంది. అలా తొలగిపోయే ఓట్లన్నీ తమవేనని చెప్పుకుంటోంది. అలా చెప్పుకోవడం ద్వారా.. ప్రతి బూత్ కూ తమవి దాదాపు 50 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పకనే చెప్పుకుంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో.. వైసీపీ నేతలు ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి బూత్‌లోనూ భారీగా దొంగ ఓట్లను చేర్పించారన్న బలమైన ఆరోపణలను చూపిస్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ, క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ద్వారా ఆ దొంగ ఓట్లు తొలగిపోతుండటంతో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందంటున్నారు. YSRCP Allegations on ECI, Voter Verification Process AP, Special Intensive Revision

Publish Date: Jul 4, 2026 12:35PM
విజయసాయి నోట వీజీటీఎమ్.. విసారెడ్డి అసలు వ్యూహం ఇదేనా?
విజయసాయి నోట వీజీటీఎమ్.. విసారెడ్డి అసలు వ్యూహం ఇదేనా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి స్టైలే వేరు. ఆయన రూటే సెపరేటు. రాజకీయ సన్యాసం అని ప్రకటించి వ్యవసాయమే తన వ్యాపకమన్న చాటిన తరువాత కూడా విజయసాయి.. రాజకీయాలే మాట్లాడుతున్నారు. మనిషిగా ఆయన రాజకీయాలకు దూరం అని చెబుతున్నా.. ఆయన మనసు మాత్రం రాజకీయాలతోనే ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి ఖరారైన తరువాత కూడా జగన్ కు అనుకూలంగా.. విజయసాయిరెడ్డి తాజాగా రాజధాని విషయంలో చేసిన కొత్త ప్రతిపాదన ఈ విషయాన్ని నిర్ధారిస్తోంది. నిన్నటి వరకు వైస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించిన ఆయన, ఇప్పుడు జగన్ మనసులోని ఆలోచనలను ప్రతిబింబించేలా, రాజధాని విషయంలో కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చి.. జగన్ పై తనకున్న భక్తిని, అభిమానాన్నీ చాటుకున్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికలకు తమ నినాదంమావిగన్' (మచిలీపట్నం - విజయవాడ - గుంటూరు) అని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అన్నట్టుగా సాగుతాయని కూడా జగన్ చెప్పారు. ఇక్కడే విజయసాయి రెడ్డి పైకి మావిగన్ ను వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తూనే.. జగన్ ప్రతిపాదించిన మూడు నగరాలకు అదనంగా మంగళగిరిని కూడా చేర్చి, మచిలీపట్నాన్ని తొలగించి తెనాలి పేరును తీసుకువచ్చి విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి (వీజీటీఎమ్) ప్రాంతాన్ని ఏపీ రాజధానిగా అభివృద్ధి చేయాలన్నారు. గతంలో శివరామకృష్ణ కమిషన్ కూడా ఈ వీజీటీఎం ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని సూచించిన విషయం తెలిసిందే. కేవలం ఒకే చోట అమరావతిని నిర్మించడం కంటే.. ఈ నాలుగు నగరాలను సమగ్రంగా విస్తరిస్తూ కనెక్టివిటీని పెంచితే, అది ఆటోమేటిక్‌గా రాష్ట్రానికి ఒక అద్భుతమైన మెగా రాజధాని అయిపోతుందంటూ విజయసాయి సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఒకవైపు అమరావతిపై విమర్శలు చేస్తూ, అక్కడ భారీగా అవినీతి జరిగిందని ఆరోపించడమే కాకుండా, ఈ వివాదంపై త్వరలోనే న్యాయస్థాన్ని ఆశ్రయిస్తానంటూ.. జగన్ చెప్పిన మాటలనే మరో డిక్షన్ తో విజయసాయి చెబుతున్నారు. విజయసాయిరెడ్డి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 స్థానంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి విదితమే. అప్పట్లో అమరావతిని ఏకాభిప్రాయంతో రాజధానిగా నిర్ణయించినప్పుడు గానీ, ఆ తర్వాత జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చినప్పుడు గానీ ఆయన ఎన్నడూ వీజీటీఎం ప్రస్తావన తీసుకు రాలేదు. ఇప్పుడు.. వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన తరువాత...వీజీటీఎమ్ అంటూ మాట్లాడటం విజయసాయి అసలు ఉద్దేశాన్ని బయటపెడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. AP Capital Row, Amaravati Controversy, VGTM Proposal, Mavigan Concept

Publish Date: Jul 4, 2026 11:55AM
 జగన్ మావిగన్ సవాల్.. రగిలిపోతున్న  ధర్మాన.!?
జగన్ మావిగన్ సవాల్.. రగిలిపోతున్న ధర్మాన.!?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ చాలెంజ్ ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలను డిఫెన్స్ లో పడేసింది. జనాలకు ముఖం ఎలా చూపించాలో తెలియనంతగా ఆత్మరక్షణలో పడ్డారు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి, ఉత్తరాంధ్రలో ఒకప్పుడు తిరుగులేని నేతగా చక్రం తిప్పిన ధర్మానను జగన్ తీరు మరీ ఇబ్బందుల్లోకి నెట్టేసింది. వైఎస్ హయాంలో ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాలలో కూడా చక్రం తిప్పిన ధర్మా ప్రసాదరావు జగన్ మావిగన్ చాలెంజ్ పై అగ్గిమీద గుగ్గిలంలా మండి పడుతున్నారు. 2014 ఎన్నికలకు ముందు ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రభావమంతమైన నాయకుడు. ప్రజల్లో కూడా ఆయన పట్ల అభిమానం, గౌరవం ఉండేవి. తన వాగ్ధాటితో, విశ్లేషణలతో ప్రజా సమస్యలపై అసెంబ్లీలోనూ, బయటా గళం విప్పి ప్రజామన్ననలు అందుకున్నారు. అయితే అదంతా గతం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ధర్మాన ప్రభ రోజురోజుకూ తగ్గుతూ వచ్చింది. అందుకు కారణం.. జగన్మోహన్ రెడ్డి నాయకత్వ శైలిని, ఏకపక్ష పోకడలను ధర్మాన ప్రసాదరావు అంతర్గతంగా విభేదించడమేనని వైసీపీ వర్గాలే చెబుతుంటాయి. ఆ కారణంగానే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినా ధర్మానకు అంత సీనియర్ అయి ఉండి కూడా తొలి మూడేళ్లలో మంత్రి పదవి దక్కలేదు. ఆ తర్వాత జరిగిన కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కిందనుకోండి. అది వేరే సంగతి. విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి. అయినా ధర్మాన ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ను వదల లేదు. కానీ ఇప్పుడు జగన్ మావిగన్ అనడం ధర్మానకు మింగుడు పడటం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. జగన్ మావిగన్ ప్రతిపాదనతో ధర్మాన పూర్తి ఆత్మరక్షణలో పడిపోయారనీ, జగన్ తీరు కారణంగా తన సొంత ఇమేజ్ దెబ్బతింటోందని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారంటున్నారు. నాడు విశాఖ రాజధాని అంశంపై గట్టిగా నిలబడిన తాను ఇప్పుడు జగన్ మావిగన్ అనడంతో ప్రజలలో చులకన అయ్యాననీ బాధపడుతున్నారని చెబుతున్నారు. మొత్తం మీద జగన్ మావిగన్ నినాదంతో ధర్మాన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మావిగన్ ను బాహాటంగా వ్యతిరేకించాలన్న ఆగ్రహంతో ఆయన ఉన్నారని అంటున్నారు.

Publish Date: Jul 3, 2026 5:02PM
జగన్ కోసం  అంత చేసిన ముద్రగడకు దక్కిందేంటి?
జగన్ కోసం అంత చేసిన ముద్రగడకు దక్కిందేంటి?

ముద్రగడ పద్మనాభం.. కాపు ఉద్యమ నేతగా రాష్ట్రంలో ఈ పేరు చిరపరిచితం. 2024 ఎన్నికలలో వైసీపీ తరఫున క్రియాశీలంగా పని చేసిన ఆయన.. ఉమ్మడి తూర్పుగోదావరిలో వైసీపీకి అత్యంత కీలక నేతగా వ్యవహరించారు. వైసీపీ పరాజయం పాలైతే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించి, అంత పనీ చేశారు. అయితే ఆయన విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అనుసరించిన వైఖరి ఎవరికీ అర్ధం కావడం లేదు. వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి వస్తే తామే వద్దు అన్నాం అంటూ ఆయన కుమారుడితో చెప్పించారు. ముద్రగడ పద్మనాభంకు రాజకీయ నాయకుడిగా కంటే.. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగానే ఎక్కువ గుర్తింపు ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడుకు ముద్రగడ సమకాలీనుడు. వారితో పాటే.. 1978లో అసెంబ్లీలో అడుగు పెట్టారు. మంత్రిగా, ఎంపీగా కూడా పని చేశారు. అయితే తదననంతర పరిణామాలలో ఆయన ఎమ్మెల్యేగా కూడా పరాజయం పాలయ్యారు. దీంతో చాలా కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అటువంటి ముద్రగడ.. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడమే కాకుండా, కాపు రిజర్వేషన్ ఉద్యమంతో ముందుకు వెళ్లారు. అయితే ఆ ఉద్యమం కాపులకు ఇసుమంతైనా ప్రయోజనం చేకూర్చలేదు సరికదా.. జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చింది. అసలు చంద్రబాబుకు వ్యతిరేకంగా, జగన్ కు అనుకూలంగా ముద్రగడ ఆ కాపు ఉద్యమాన్ని నడిపారన్న వాదన కూడా అప్పట్లో బలంగా వినిపించింది. ఆ వాదనకు బలం చేకూర్చే విధంగానే.. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ముద్రగడ.. కాపు రిజర్వేషన్ నినాదాన్ని, ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు. ఇంత చేసినా ముద్రగడకు వైసీపీలో వీసమెత్తు ప్రాధాన్యత ఇవ్వలేదు జగన్. అయినా కూడా ముద్రగడ.. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. విస్తృతంగా ప్రచారం చేశారు. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను పిఠాపురంలో ఓడించకుండా తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. అలాగే పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ అద్భుతమైన మెజారిటీతో ఘన విజయం సాధించారు. దీంతో అన్నట్లుగానే ముద్రగడ తన పేరును ముద్రగడ పద్మనాభంగా అధికారికంగా మార్చుకున్నారు. జగన్ కోసం ఇంత చేసిన ముద్రగడకు.. జగన్ నుంచి వీసమెత్తు గుర్తింపు కూడా లేకుండా పోయిందని కాపు సామాజికవర్గ నేతలు, ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడను జగన్ కనీసం పరామర్శించను కూడా పరామర్శించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. జగన్ పరామర్శించకుంటే పోయె.. కానీ జగన్ తమకు అన్నివిధాలుగా అండగా నిలిచారనీ, ఆయన ముద్రగడను పరామర్శించడానికి వస్తానంటే.. తామే వద్దన్నామంటూ ముద్రగడ కుమారుడు వీడియో విడుదల చేయడంపై కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని పరామర్శిస్తామంటే ఎవరైనా ఎలా, ఎందుకు వద్దంటారు? అంటూ, జగన్ ఒత్తిడి మేరకే ముద్రగడ కుమారుడు ఆ వీడియో విడుదల చేసి ఉంటారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ముద్రగడను పరామర్శించడానికి జగన్ రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Publish Date: Jul 3, 2026 4:05PM
అప్పుడు మూడుముక్కలాట.. ఇప్పుడు మావిగన్ పాట.!
అప్పుడు మూడుముక్కలాట.. ఇప్పుడు మావిగన్ పాట.!

జగన్ మావిగన్ సవాల్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. అసలు జగన్ చెబుతున్న మావిగన్ అంటే ఏమిటో భగవంతుడికే తెలియాలంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల.. వైసీపీ అదినేత జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. అమరావతి పనుల్లో విపరీతమైన అవినీతి జరుగుతోందని ఆరోపణలు గుప్పించారు.. ఆ అవినీతికి విరుగుడుగా.. తాను అధికారంలోకి వస్తే మావిగన్ ను రాజధాని చేస్తానని ప్రకటించారు. అదే తన ఎన్నికల నినాదమని చెప్పారు. సహజ వనరులు, ముందే సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాల వల్ల మావిగన్ లాభదాయకమన్నారు. జగన్ మావిగన్ ప్రకటనపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులావారిపల్లెలో జరిగిన విక్సిత్ భారత్-గ్రామ్ స్కీమ్ ప్రారంభోత్సవంలో చంద్రబాబు జగన్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. అసలా మావిగన్ ఏమిటో దేవుడికే తెలియాలని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఒకప్పుడు అమరావతికి మద్దతు పలికిన జగన్.. ఆ తర్వాత మూడు రాజధానులంటూ ఐదేళ్ల కాలం పాటు రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారనీ, ఇప్పుడు ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణం కోసం అప్పట్లో 29 వేల మంది రైతులు 33వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వచ్ఛందంగా అప్పగించారని గుర్తు చేసిన ఆయన అటువంటి అమరావతిని గత ప్రభుత్వం శ్మశానంగా మార్చే ప్రయత్నం చేసిందన్నారు. రాజకీయ స్వార్థం కోసం చెరుకు తోటలకు నిప్పు పెట్టి, ఆ నెపం ఇతరులపై నెట్టే కుట్రలు చేశారని గుర్తు చేశారు. తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్ లాంటి శాశ్వత రాజధానులు ఉంటే, ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏదో చెప్పలేని దుస్థితి గత ఐదేళ్లలో దాపురించిందన్న చంద్రబాబు.. 2026లో పార్లమెంటు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టాన్ని ఆమోదించిందని, ఇది జూన్ 2024 నుండి పాత తేదీతో అమల్లోకి వచ్చిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కేంద్రం అందించిన ఈ చట్టబద్ధమైన రక్షణతో అమరావతి ఎదుగుదలను భూమిపై ఏ శక్తి కూడా ఆపలేదన్న చంద్రబాబు.. రాజకీయ నాయకుడు మాట మీద నిలబడాలని.. పూటకో మాట మార్చే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని చంద్రబాబు హెచ్చరించారు. అమరావతిని 2028 నాటికి క్వాంటం వ్యాలీగా, నాలెడ్జ్ హబ్‌గా పూర్తిస్థాయిలో నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు.

Publish Date: Jul 3, 2026 12:46PM
కడప జగన్ చేజారిపోయిందా?
కడప జగన్ చేజారిపోయిందా?

వైసీపీకి పెట్టని కోటగా, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ కోట అయిన కడప ఇప్పుడు ఆయన చేజారిపోయిందా? అంటే ఇటీవలి పరిణామాలను గమనించిన పరిశీలకులు ఔననే అంటున్నారు. ఒకప్పుడు వైఎస్ కుటుంబం కోసం జిల్లాలో.. కేడర్ నుంచి లీడర్ల వరకు అందరూ ఏకతాటిపైకి వచ్చేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. జగన్‌కు తన సొంత జిల్లాపైనే పట్టు సడలినట్లు కనిపిస్తోందన్న భావన రాజకీయవర్గాలలో బలంగా వ్యక్తం అవుతోంది. అందుకు.. జగన్ కడప జిల్లాలో ఇటీవల జరిపిన మూడు రోజుల పర్యటన నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పర్యటనలో జగన్.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తన పార్లమెంటు నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాధారణంగా పార్టీ అధినేత జిల్లా పర్యటనకు వస్తున్నారంటే.. పార్టీ క్యాడర్ లో, లీడర్లలో ఉత్సాహం కనిపిస్తుంది. పార్టీలో పండుగ వాతావరణం నెలకొంటుంది. కానీ జగన్ తాజా పర్యటనలో అటువంటివేవీ కనిపించలేదు. పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు. అధినేత పట్ల, పార్టీ కార్యక్రమాల పట్ల వైసీపీ కడప జిల్లా నేతలలో నెలకొన్న నిర్లిప్తతకు, అసంతప్తికి పరిశీలకులు దీనినే కడప జగన్ చేజారిపోయిందనడానికి నిదర్శనంగా చూపుతున్నారు. నిజానికి 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. జగన్ శ్రద్ధపెట్టి పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలి. మరీ ముఖ్యంగా.. పార్టీకి పెట్టని కోటలాంటి కడప, బలమైన పట్టు ఉన్న నెల్లూరులలోనే వైసీపీ పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా తయారైంది. అయితే పార్టీ వర్గాలు మాత్రం వైసీపీ కడప జిల్లాలో దయనీయంగా మారడానికి జగన్ స్వయంకృతాపరాథమే కారణమని అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. జగన్ తన ఏకపక్ష నిర్ణయాలతో లీడర్లను, క్యాడర్ ను దూరం చేసుకున్నారంటున్నారు. గతంలో నాయకులను ఇష్టానుసారంగా మార్చడం, స్థానిక సమీకరణాలను పట్టించుకోకుండా, ఎవరికీ ఇష్టం లేకపోయినా కొత్త వారికి అవకాశాలు కల్పించడం వంటి చర్యలు సీనియర్లను నెమ్మదిగా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనకుండా నివారించాయనీ, ఇక తొలి నుంచీ పార్టీని నమ్ముకున్న రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదని వారిలో అప్పట్లో వ్యక్తమైన అసంతృప్తి ఇప్పటికీ అలానే ఉందనీ అంటున్నారు. మరోవైపు కీలకమైన జమ్మలమడుగు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ క్రమంగా విస్తరిస్తుండగా, కడపలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే బలమైన విజయాన్ని దక్కించుకుంది. ఇంత జరుగుతున్నా పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలూ, కనీసం కేడర్‌కు భరోసా ఇచ్చే చర్యలు తీసుకోకపోవడంతో వైసీపీ పరిస్థితి కడప జిల్లాలో నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారిందని వైసీపీ నేతలే అంటున్నారు.

Publish Date: Jul 3, 2026 12:18PM
 రాజకీయ దుమారం రేపుతున్న కల్వకుంట్ల కవిత అరెస్ట్ విజువల్స్.!
రాజకీయ దుమారం రేపుతున్న కల్వకుంట్ల కవిత అరెస్ట్ విజువల్స్.!

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. ఇటీవల బోడుప్పల్ పరిధిలోని ఉప్పల్ భగాయత్ వద్ద చోటు తెలంగాణ రక్షణ సమితి(టీఆర్ఎస్) నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాల కేటాయింపు జరపాలంటూ సాగిన ఈ పోరాటంలో టీఆర్ఎస్ అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో కవితను మహిళా పోలీసులు అరెస్టు సమయంలో జరిగిన తోపులాటలో ఆమె కిందపడిపోయారు. ఆ తరువాత ఆమెను అరెస్టు చేసిన తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. కల్వకుంట్ల అరెస్టుకు సంబంధించిన విజువల్స్ లో మహిళా పోలీసులు కవితను చుట్టుముట్టి లాక్కెళ్లేందుకు ప్రయత్నించడం, ఆ తీవ్ర తోపులాటలో కవితతో పాటు మహిళా పోలీసులూ కిందపడిపోవడం స్పష్టంగా కనిపించింది. ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది. నెటిజనులైతే.. పోలీసులు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికంగా, హింసాత్మకంగా ఉందని ఫైర్ అవుతున్నారు. కవితను పోలీసులు అరెస్టు చేసిన తీరు పట్ల రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తున్నాయి. కేవలం టీఆర్ఎస్ శ్రేణులే కాదు.. జనసేన, బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా పోలీసుల తీరును తప్పుపడుతున్నారు. జనసేన తెలంగాణ జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూరి కవిత అరెస్టు సందర్భంగా పోలీసుల దురుసు వైఖరిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు, రాజకీయ వైరుధ్యాలు ఉండటం సహజమన్న ఆయన.. ఒక మహిళా నేత పట్ల ఇంత అగౌరవంగా, కనీస మర్యాద లేకుండా వ్యవహరించడం ఏ మాత్రం సరికాదని, ఇసుమంతైనా ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు

Publish Date: Jul 3, 2026 11:50AM
TeluguOne Picks For You
rss-imgRss Feeds