దుబారా.. బాధ్యులెవరు? వ్యవస్థ లోపాలపై వాస్తవ వేదిక లో ప్రశ్నల పిడుగులు!

  సమాజం పట్ల అక్కర, బాధ్యత ఉన్న ఇద్దరు వ్యక్తులు వర్తమాన రాజకీయాలలో భ్రష్ఠత్వంపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. ఈ భ్రష్టత్వం అఖిల భారత సర్వీసు అధికారులకూ విస్తరించడాన్ని నిలదీశారు. తెలుగువన్  వాస్తవ వేదిక ద్వారా తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ వ్యవస్థ లోపాలపై విమర్శల శస్త్రాలు గుప్పించారు.  రాజకీయ నాయకుల దుబారా ఖర్చులు, ఆడంబర ప్రయాణ వ్యయాలు రాజకీయాలలో నాయకుల ఆర్థిక అరాచకత్వం చూస్తుంటే, ఆర్థిక నిబంధనలన్నవి సామాన్యులకేనా, నేతలకు వర్తించవా అన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇదే విషయాన్ని ‘వాస్తవ వేదిక‘ ద్వారా తెలుగువన్ ఎండీ కంఠం నేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్రప్రసాద్  మరోసారి లేవనెత్తారు.    ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,  నారా లోకేష్  ప్రభుత్వ ఖర్చుతోనే చార్టర్డ్ విమానాల్లో తిరుగుతు న్నారనీ, ప్రభుత్వం దగ్గర సొంత విమానం లేనందున గంటకు 6 నుండి 8 లక్షల రూపాయలు అద్దె చెల్లిస్తున్నారన్న ప్రచారం, అలాగే  విజయవాడ నుండి హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే ట్రిప్పుకు 10 నుండి 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, ఇది వ్యక్తిగత దుబారా అని  విమర్శించారు. లోకేష్ తన ప్రయాణ ఖర్చులకు సొంత డబ్బులు వినియోగిస్తున్నారన్న ఆర్టీఐ  వివరణ నమ్మశక్యంగా లేదని అభిప్రాయపడ్డారు.  ఆయన ముఖ్యమంత్రితో కలిసి ప్రయాణించడం వల్ల ఆ ఖర్చు ముఖ్యమంత్రి ఖాతాలోకి వెళ్తోందని పేర్కొన్నారు. అయితే ఇలా ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.  ఐఏఎస్ అధికారులు  నిబంధనల్లో లొసుగులను ఆసరా చేసుకుని వాటని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. కొందరు అధికారులు ఎలక్షన్ బడ్జెట్‌తో కార్లు కొనుక్కుంటున్నారని, ఒక్కో అధికారికి మూడు నుండి ఐదు కార్లు ఉంటున్నాయనీ అన్నారు.  గతంలో కలెక్టర్లు సొంత పనులకు రిక్షాల్లో వెళ్లేవారని, కానీ ఇప్పటి అధికారులకు ఆ నిబద్ధత లేదని, వారు ఉద్యోగంలో చేరగానే విల్లాలు, అపార్ట్‌మెంట్ల గురించి ఆలోచిస్తున్నారని విమర్శించారు.  దుబారాకు, ఆ దుబారాకు అధికారులు పలుకుతున్న వత్తాసుకు నిలువెత్తు ఉదాహరణగా రుషికొండ ప్యాలెస్ ను చెప్పుకోవచ్చన్న వారు.. తొలుత రుషికొండ ప్యాలెస్ కు 200 కోట్ల రూపాయలు మంజూరైతే.. అది పూర్తయ్యే నాటికి మొత్తం వ్యయం 600 కోట్లకు చేరిదనీ,  అంత ఖర్చు చేసీ  సిఆర్జెడ్, ఎన్విరాన్మెంట్, అటవీ నిబంధనల ఉల్లంఘనా యథేచ్ఛగా జరిగిందనీ దీనిని అడ్డుకోవలసిన అధికారులు ఏం చేస్తున్నారనీ ప్రశ్నించారు.  అదే విధంగా జగన్ హయాంలో ప్రభుత్వ భవనాలకు వైసీపీ  రంగులు వేయడానికి, తీరా వేసిన తరువాత హైకోర్టు మొట్టికాయలు వేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఆ రంగులను తొలగించడానికి దాదాపు ఐదువేల కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయం చేశారనీ, ఇంకా చెప్పుకుంటూ పోతే..  గతంలో విజయవాడలోని ఒక స్టార్ హోటల్ నుండి ముఖ్యమంత్రి కుటుంబం కోసం రోజుకు లక్షన్నర రూపాయల వరకు భోజన బిల్లులు ఉండేవని, ఐదేళ్లలో ఇది సుమారు 400 కోట్లు అయి ఉండవచ్చనీ పేర్కొన్నారు.    ఇక ప్రజాస్వామ్య దేవాలయంగా చెప్పుకునే అసెంబ్లీలో అర్ధవంతమైన చర్చలు ఇసుమంతైనా జరగడం లేదనీ, కేవలం స్వోత్కర్ష, పరనిందకే అసెంబ్లీని నేతలు వేదికగా చేసుకుంటున్నారనీ సోదాహరణంగా వివరించారు. తెలుగుదేశం, వైసీపీలు ప్రజల ముందే కొట్టుకుంటున్నట్టు కనిపిస్తాయి కానీ, అంతర్లీనంగా అవి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇంటి ఫెన్సింగ్‌కు 14 నుంచి 15 కోట్ల రూపాయలు ఖర్చు చేయడంపై ఎవరూ ప్రశ్నించడంలేదన్నారు. నేతల తప్పులను నిలదీయాల్సిన ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు నిర్వీర్యం అయిపోయాయి నామావశిష్టంగా మిగిలాయన్నారు.    మొత్తంగా వ్యవస్థలో  అలీబాబా   మారాడు తప్ప,  40 మంది దొంగలు (అధికారులు, కాంట్రాక్టర్లు, దోపిడీదారులు) అలాగే ఉన్నారనీ, నాయకులు మారినా వ్యవస్థలో దోపిడీ విధానం మారలేదనీ చెప్పారు. ఇక రాష్ట్ర ఉత్పాదకత పెరిగినా ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేకపోవడానికి కారణం   దుబారా, అవినీతేనన్నారు.   ఈ చర్చకు కొనసాగింపు గురువారం (జనవరి 8) రాత్రి ఏడు గంటలకు  తెలుగువన్ ‘వాస్తవ వేదిక‘లో ఈ దిగువన ఉన్న లింక్ ద్వారా చూడండి.

పేదలపై కక్షతోనే ఉపాధిహామీ పథకం నిర్వీర్యం.. మోడీ సర్కార్ పై రేవంత్ ధ్వజం

కేంద్రంలోని మోడీ సర్కార్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ భవన్ లో గురువారం (జనవరి 8) జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ప్రసంగించిన ఆయన 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ 400 స్థానాలలో విజయం సాధించి ఉంటే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసి ఉండేదన్న ఆయన కాంగ్రెస్ ప్రజలను అప్రమత్తం చేయడం వల్లనే ఆ పార్టీకి పూర్తి మెజారిటీని జనం ఇవ్వలేదని అన్నారు. మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు.   మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే  మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు. నిబంధనల మార్పు పేరుతో ఆ పథకాన్ని శాశ్వతంగా నిలిపివేయడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ కుట్రపన్ననుతోందని విమర్శించారు. అధికారం ఉందన్న అహంకారంతో చట్టసభలను వినియోగించి పేదలను అణిచివేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.  

గోబెల్స్ ను మించి జగన్ అసత్య ప్రచారం!

క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను పులివెందులలో జరుపుకున్న తరువాత బెంగళూరుకు వెళ్లిపోయిన జగన్ ఆ తరువాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ మీడియా సమావేశం అనే లాంఛనం పూర్తి చేసి తిరిగి బెంగళూరు వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయిన తరువాత జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వస్తున్న సంగతి తెలిసిందే. అలా వచ్చిన ప్రతి సారీ మీడియా సమావేశం పెట్టి ఏదో ఒక అంశంపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ఆనవాయితీగా మార్చుకున్నారు. తాజాగా కూడా ఆయన అదే పని చేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో గురువారం (జనవరి 8) మీడియా సమావేశంలో జగన్  సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.   సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి  సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అయితే వాస్తవానికి ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించి, నిలిపివేయడం జరిగింది  జగన్ హయాంలోనే. ప్రాజెక్టును ప్రారంభించిన ఆరు నెలలలోనూ ఆ  ప్రాజెక్టు చేపట్టిన ఆరునెలలలోగానే అప్పటి మంత్రి పెద్దిరెడ్డి కంపెనీకి భారీ చెల్లింపులు చేసి, పనులు నిలిపివేసింది జగన్ హయాంలోనే. అయితే ఆ తరువాత ఈ ప్రాజెక్టుకు అనుమతుల కోసం మూడేళ్ల పాటు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా, ఇప్పుడా ప్రాజెక్టును నిలిపివేసింది చంద్రబాబే అని విమర్శలు గుప్పించడం పట్ల పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.   తన హయాంలో నిలిచిపోయిన సీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు చంద్రబాబును బాధ్యుడిని చేస్తున్న జగన్.. చంద్రబాబు ఆలోచనతో ఆంకురార్పణ జరిగి, ఆయన హయాంలోనే పూర్తి అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ మాత్రం తన ఖాతాలో వేసుకోవడానికి తహతహ లాడుతున్నారంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు.  జగన్ తన వైఫల్యాలను చంద్రబాబు ఖాతాలోనూ, చంద్రబాబు విజయాలను తన ఖాతాలోనూ వేసుకోవడానికి తాపత్రేయపడుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రెడిట్ కోసం జగన్ అవాస్తవాలు వల్లెవేస్తూ గోబెల్స్ ను మించిపోతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ రెయిడ్స్.. మమత ఫైర్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్నాయి. హ్యాట్రిక్ విజయాలతో వరుసగా మూడు సార్లు రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్ నాలుగోసారి విజయం సాధించి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నది. అదే సమయంలో బీజేపీ కూడా రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వేడి రగులు కుం టోంది.  తాజాగా  రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుట్రపూరితంగా ఎన్నికల లబ్ధి కోసం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.    కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లో ఉన్న ఐ-ప్యాక్ ప్రధాన కార్యాలయంతో పాటు, సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలోనూ గురువారం (జనవరి 8) ఉదయంఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు.  కేంద్ర సాయుధ బలగాల   భద్రత నడుమ జరుగుతున్న దాడుల నేపథ్యంలో  మమతా బెనర్జీ, కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మతో కలిసి నేరుగా ప్రతీక్ జైన్ నివాసానికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి ఈడీ అధికారులతో మాట్లాడి, కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.    తృణమూల్ కాంగ్రెస్‌కు సంబంధించిన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారనీ, అయితే.. తాను వాటిని తిరిగి తీసుకువచ్చానని చెప్పిన మమతా బెనర్జీ,  హోంమంత్రి దేశాన్ని రక్షించలేరు, కానీ ఈడీ ద్వారా  తృణమూల్ ను ఇబ్బందులు పెట్టడానికి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అక్కడ నుంచి  సాల్ట్ లేక్‌లోని ఐ-ప్యాక్ కార్యాలయానికి కూడా  ఆమె వెళ్లారు.  2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అంటే 2020 నుంచి ఐ-ప్యాక్ సంస్థ తృణమూల్ కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. మమత చర్యలపై పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థ విధుల్లో మమతా బెనర్జీ నేరుగా జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు.   గతంలో కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లినప్పుడు కూడా ఆమె ఇదే విధంగా అడ్డుకున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ కార్యాలయంపై ఈడీ దాడి చేస్తే సీఎం మమతా బెనర్జీకి ఎందుకంత ఆందోళన అని ప్రశ్నించారు.    మొత్తం మీద పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల హీట్ పీక్ స్టేజికి చేరిందని ఈ పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. 

డేంజర్ జగన్నాథం.. దొంగలే దోస్తులు.. క్రిమినల్సే కావాల్సినోళ్లు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నేర చరిత్ర,  చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిని ప్రోత్సహిస్తారన్న గుర్తింపు ఉంది.  గత ఏడాది డిసెంబర్ లో జగన్ పుట్టిన రోజు సందర్భంగా  రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో జంతు బలి నిర్వహించి, ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేసిన సంఘటనలను ఆయన ఖండించకపోవడం, పైగా ఆయన పార్టీ నేతలు దానికి మద్దతుగా మాట్లాడటంతోనే ఇది రుజువైంది.  కాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా  పలువురు వైసీపీ కార్యకర్తలపై  జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే.   ఇప్పుడు జగన్ తాజాగా  ఈ  కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.   ఇలా జగన్ నుంచి హామీ పొందిన వారిలో అత్యధికులు గోపాలపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ తానేటి వనిత మద్దతుదారులని తెలుస్తోంది.   అయితే ఆయన ఇలా హామీ ఇవ్వడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు.  ఎందుకంటే ఇప్పటికే చట్టాన్నిచేతుల్లోకి తీసుకునే పార్టీ మద్దతుదారులను జగన్ ప్రోత్సహించడం తెలిసిందే. గంజాయి కేసుల్లో ఇరుక్కుని అరెస్టైన వారిని పరామర్శించడం వంటి చర్యలతో ప్రజలలో ఇప్పటికే జగన్ ప్రతిష్ఠ, పార్టీ ప్రతిష్ఠ ప్రజలలో బాగా దిగజారింది. ఇప్పుడు తాజాగా జంతుబలుల వ్యవహారంలో కేసుల్లో ఇరుక్కున్న వారికి పార్టీ మద్దతు అంటూ ప్రకటించడం ఆయన ప్రతిష్టను మరింత దిగజారుస్తుందని అంటున్నారు. 

ఒకే విడతలో తెలంగాణ మునిసిపోల్స్!

తెలంగాణలో మునిసిపోల్స్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమౌతోంది. రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని భావిస్తోంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ఇప్పటికే ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం, ఈ నెల 12న తుదిజాబితా ప్రకటించనుందని తెలుస్తోంది.   ఈ నేపథ్యంలోనే బుధవారం (జనవరి 7) జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్  రాణికుముదిని వారికి దిశా నిర్దేశం చేశారు.  ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 20న మునిసిపోల్స్ కు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అ య్యే అవకాశాలు ఉన్నాయి.  

దమ్ముంటే ఖమ్మంలో పోటీ చేయ్...కేటీఆర్‌కు పొంగులేటి సవాల్

  తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు. ఆయనకు దమ్ముంటే ఖమ్మం జిల్లాలో వచ్చి పోటీ చేయాలని చాలెంజ్ విసిరారు. నిన్న ఖమ్మం వచ్చిన కేటీఆర్ ఏదేదో మాట్లాడారని ముందు తన ఇంట్లో వ్యవహారం చక్కబెట్టుకోవాలని పొంగులేటి హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే సత్తా చూపిస్తామని హెచ్చరించారు. కేటీఆర్ అక్రమాలపై ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన  ఆరు నెలలకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారని మంత్రి సంచలన ఆరోపణలు చేశారు.  కేటీఆర్ మతి భ్రమించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై, గాంధీ కుటుంబంపై మాట్లాడుతున్నారని, సూర్యూడి పైకి ఉమ్మితే అది తిరిగి తన ముఖం మీదే పడుతుందనే విషయాన్ని కేటీఆర్ మర్చిపోతున్నారన్నారు. అవినీతి, అక్రమాలు, దోపిడీలకు పేటెంట్‍గా ఉన్న కల్వకుంట్ల ఫ్యామిలీ గాంధీ కుటుంబం గురించా మాట్లాడేది అని మండిపడ్డారు. జాతీయ నాయకుడిని విమర్శిస్తే తాను జాతీయ నాయకుడిని అవుతానని తాపత్రయపడటం తప్పులేదు కానీ ఆశకు కూడా హద్దు ఉండాలన్నారు. జూబ్లీహిల్స్, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికలను సెమీ ఫైనల్స్ అంటున్నారు. దేనికి సెమి ఫైనల్? అని మంత్రి  పొంగులేటి ప్రశ్నించారు  

కాకినాడ జిల్లాలో పవన్ పర్యటన.. పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం (జనవరి 8) నుంచి మూడు రోజుల పాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయ నున్నారు.  అలాగే  ప్రజాసమస్యలపై  అధికారులతో చర్చిస్తారు.  క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో  శుక్రవారం జరగనున్న  సంక్రాంతి సంబరాల్లో  పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.   అనంతరం  నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పవన్ కల్యాణ్ ప్రారంభిస్తారు. పిఠాపురం ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధితుల సమస్యలను నేరుగా తెలుసుకుంటారు.  ఈ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష, రంగరాయ మెడికల్ కాలేజీలో పలు శంకుస్థాపనల కార్యక్రమంలో  కూడా పాల్గొంటారు. 

కేంద్ర కేబినెట్ లోకి మరో తెలుగు మంత్రి.. ఎవరంటే?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ప్రధాని మోడీ సమాయత్తమౌతున్నారన్న వార్తలు వినవస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో చంద్రబాబు  అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి  పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా  కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.  ఇప్పటికే టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు చొప్పున ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అయితే మరో పదవి కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ బెర్త్ టీడీపీకి దక్కే ఛాన్సు లభిస్తుండటంతో.. ఆ అదృష్టవంతుడు ఎవరన్న కోణంలో  ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చ నడుస్తోంది. కొన్ని కొన్ని ఈక్వేషన్ల ప్రకారం  రెడ్డి సామాజిక వర్గానికి ఈ బెర్త్ కేటాయించాలన్న డిమాండ్  బలంగా వినిపిస్తోంది. అందులో భాగంగా  నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అదలా ఉంటే.. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో  టీడీపీకి చెందిన వారు ఇద్దరు, బీజేపీ ఎంపీ ఒకరు ఉండగా, జనసేన మాకేం తక్కువ అంటూ కేంద్ర కేబినెట్ బెర్త్ కోసం డిమాండ్ చేస్తున్నదంటున్నారు.  జనసేన ఎంపీలిద్దరిలో  మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్ కాబట్టి ఆయనను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్‌  కోరుతున్నట్లు చెబుతున్నారు. చూడాలి మరి కేంద్ర కేబినెట్ బెర్త్ ఎవరికి లభిస్తుందో? 

జవాబుదారీతనం ఎవరికి ఉండాలి?

సమాజహితమే లక్ష్యంగా దశాబ్దాలుగా తమ రంగంలో కృషి చేస్తున్న తెలుగువన్, జమీన్ రైతు పత్రిక సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘వాస్తవ వేదిక’.. నాయకులను ప్రశ్నిస్తూ, ప్రజలను మేల్కొలుపుతూ చరిత్రలో నిలిచిపోయే ప్రస్థానానికి నాంది పలికింది. తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.  జవాబుదారీ తనం ఎవరికి ఉండాలి? ప్రజలకా? పాలకులకా? అధికారులకా? ఎగ్జిక్యుటివ్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? తమ మేధాశక్తిని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు  ఎలా వాడుతున్నారు? పాలకుల తప్పులు కప్పడానికా; ప్రజల బాగు కోసమా? ప్రజాధనం దుర్వినియోగానికి బాధ్యులు ఎవరు?  ఇత్యాది సూటి ప్రశ్నలను సంధించారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా సాగుతున్నవాస్తవ వేదిక గురువారం (జనవరి 8) రాత్రి 7 గంటలకు తెలుగువన్  యూట్యూబ్ చానల్ లో తప్పక వీక్షించండి. https://youtu.be/T_mYTVE6Wgs

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి

రంగారెడ్డి జిల్లా  మీర్జాగూడ  సమీపంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.  మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత  చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.  మృతి చెందిన  విద్యార్థులను సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్‌లుగా పోలీసులు గుర్తించారు. కోకాపేట్‌లో బర్త్‌డే పార్టీలో పాల్గొని, తిరిగి వెడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.   కారులో మొత్తం ఐదుగురు ఐసీఎఫ్ ఏఐ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. వీరిలో నలుగురు మరణించగా, తీవ్రంగా గాయపడిన విద్యార్థిని నక్షత్ర తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.  అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.   

టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్

  ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాగవంశం అధ్యక్షులు గాడు అప్పలనాయుడు కుటుంబాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈ మేరకు విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలోని వారి నివాసానికి మంత్రి వెళ్లారు. ఈ సందర్భంగా గాడు అప్పలనాయుడు చిత్రపటం వద్ద పూలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం గాడు అప్పలనాయుడు సతీమణి, జీవీఎంసీ రెండో వార్డు కార్పోరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయిన  గాడు చిన్ని కుమారి లక్ష్మితో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. భవిష్యత్ లో కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.   

క.వి.త అంటే?

క.  క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి చెందిన క‌విత‌.. ప్రొఫైల్  చూస్తే ఆమె త‌న‌కు తాను చెప్పే మాట‌.. కేసీఆర్, ప్రొ. జ‌య‌శంక‌ర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వ‌చ్చి.. అటు పిమ్మ‌ట జాగృతి అనే  క సంస్థ ఏర్పాటు చేశాన‌నీ, అప్ప‌టి వ‌ర‌కూ అనాథ‌గా ఉన్న బ‌తుక‌మ్మ‌ను త‌న నెత్తికి ఎత్తుకుని దేశ విదేశాల్లో ఫేమ‌స్ చేశాన‌ని అంటారు క‌విత‌.  ఇక ఉద్య‌మ కాలంలో ఆమె జాగృతి పేరిట బాగా పాపుల‌ర్ అయ్యారు. ఏది ఏమైనా క‌ల్వ‌కుంట్ల క‌విత‌గా స్థిర‌ప‌డ్డారు. ఉద్య‌మ య‌త్నం ఫ‌లించి.. తండ్రి ముఖ్య‌మంత్రిగా ఉండటంతో.. తాను కూడా ఎంపీగా ప్ర‌మోట్ అయ్యారు. ప్ర‌మోష‌న్ ల‌భించిన త‌ర్వాత క‌విత‌.. ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు. దీంతో ఆమెను ఎమ్మెల్సీని చేసింది పార్టీ. త‌న సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంపీ క‌విత నుంచి ఎమ్మెల్సీ క‌విత‌గా మారారు. ఇంత‌లో పార్టీ 2023 ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఓడిపోవ‌డం.. కాంగ్రెస్ ఇక్క‌డ అధికారంలోకి రావ‌డంతో.. అతి ప్ర‌ధాన‌మైన ఘ‌ట్టం ముగిసిన‌ట్ట‌య్యింది ఆమె రాజ‌కీయ జీవితంలో. దీంతో త‌న అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కుతూ తండ్రికి లేఖ రాశారు క‌విత. ఇది బ‌య‌ట ప‌డ్డంతో మొత్తం గేమ్ ఛేంజ‌ర్ గా మారిపోయింది. ఈ వివాదం త‌ర్వాత పార్టీకి, ప‌ద‌వుల‌కు రాజీనామా ఇచ్చి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. త‌న త‌ట్టా బుట్టా స‌ర్దేసుకుని.. ఇక‌పై తాను బీఆర్ఎస్ క‌విత కాదు.. జాగృతి క‌విత అంటూ స్వ‌యం ప్ర‌క‌ట‌న‌లు చేశారు. వి.   అంటే విడిపోవ‌డం. క‌ల్వ‌కుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిపోవ‌డం. క‌విత జీవితంలో ఇది అత్యంత కీల‌క‌మైన మ‌లుపు. ఎప్పుడైతే ఆమె పార్టీ నుంచి బ‌య‌ట‌కొచ్చారో అప్ప‌టి నుంచీ కాంగ్రెస్ క‌న్నా మించి బీఆర్ఎస్ పై విమ‌ర్శ‌నాస్త్రాలు ఎక్కు పెట్టారు. మ‌రీ ముఖ్యంగా త‌న బావ హ‌రీష్ ని చెడుగుడు ఆడుకున్నారు.  పార్టీలో ట్ర‌బుల్ షూటర్ గా గుర్తింపు పొందిన హ‌రీష్ ని బ‌బుల్ షూటర్ అంటూ   అవ‌హేళ‌న చేశారు. హ‌రీష్ రాజ‌కీయ గిమ్మిక్కుల‌న్నిటినీ ఎండ‌గ‌ట్టారు. పార్టీకి అతి పెద్ద అడ్డంకి హ‌రీష్ రావ్ అంటూ తూర్పార బ‌ట్టారు. ఇక కాళేశ్వ‌రం అవినీతి మొత్తం హ‌రీష్ రావు పాప‌మే అంటూ దుయ్య‌బ‌ట్టారు. అంతేనా ఇటు సోద‌రుడు  కేటీఆర్, ఇంకో బావ సంతోష్ వంటి వారిని కూడా వ‌ద‌ల‌కుండా తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వీటితో పాటు.. బీఆర్ఎస్ లోని ఎంద‌రో ఎమ్మెల్యేలపై భూక‌బ్జా ఆరోప‌ణ‌లు చేసి వివాదాస్ప‌దం అయ్యారు. జాగృతి జ‌నం బాట అంటూ తెలంగాణ వ్యాప్తంగా యాత్ర‌లు చేసి.. బీఆర్ఎస్ లీడ‌ర్ల‌పై, మ‌రీ ముఖ్యంగా హ‌రీష్ పై   విమ‌ర్శ‌లు గుప్పించారు. ఒక స‌మ‌యంలో కాంగ్రెస్ లీడ‌ర్లు చేయాల్సిన ప‌ని క‌విత చేస్తున్నారా అన్న అనుమానం కలిగేలా ఆమె తీరు ఉంది.  కాంగ్రెస్ లీడ‌ర్లు కూడా క‌విత ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌మంటూ హ‌రీష్‌, కేటీఆర్ ల‌కు స‌వాల్ విసిరారంటే.. ఆమె విమర్శల ధాటి ఎంతగా ఉందో అర్ధమౌతుంది.  అయితే త‌న‌ది ఆస్తి కోసం పోరాటం కాద‌ని ఆత్మ‌గౌర‌వ‌ పోరాట‌మ‌నీ.. మండ‌లిలో క‌న్నీటి ప‌ర్యంత‌మై క‌విత‌..   ఎమోష‌న‌ల్ హైడ్రామాకు తెర‌లేపారు. త‌న ఎమ్మెల్సీ రాజీనామాను ఆమోదించ‌మ‌ని కోరారు. అన్న‌ట్టుగానే క‌విత రాజీనామా ఆమోదం పొందింది. త‌.    త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డ్డానికి కొత్త‌గా పార్టీ పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు క‌విత‌. ఒక టైంలో గాంధీ భ‌వ‌న్ వైపు ఆమె అడుగులు ప‌డుతున్నాయ‌న్న మాట వినిపించినా.. 2028 ఎన్నిక‌ల్లో తన పార్టీ అయితే ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌డం ఖాయమని చాటారు క‌విత‌. త‌న‌ది ఆత్మ‌గౌర‌వ పోరాట‌మంటోన్న క‌విత‌.. కాంగ్రెస్- బీజేపీ- బీఆర్ఎస్ వంటి హేమా హేమీల ముందు రాజ‌కీయంగా ఎంత మేర‌కు రాణించ‌గ‌ల‌రు? ఆమె చిర‌కాల వాంఛ సీఎం కావ‌డం  సాధ్య‌మ‌య్యే ప‌నేనా?  లేక  ష‌ర్మిళ‌లా ఆమె కూడా తేలిపోతారా? అన్న‌ది  క‌విత‌ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఆమె వెన‌క న‌డిచే నాయ‌క‌త్వాన్ని బ‌ట్టి  భవిష్య‌త్ రూపు దిద్ద‌కుంటుంది.

ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్

    ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు. వీరిలో ధనియాల రాథ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి ఉన్నారు. మరో ఐదుగురు కార్పొటర్లు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వంగా కలిశారు.  మరోవైపు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటన రోజే కాంగ్రెస్ పార్టీలో చేరటంతో  రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను కేటీఆర్‌ సన్మానించారు.  

ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్ల కొట్టివేత

ఐబొమ్మ రవి బెయిలు పిటిషన్లన నాంపల్లి కోర్టు కొట్టివేసింది. సినిమాల పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ రవిపై ఐదు కేసులు నమోదైన సంగతి తెలిసిదే.  ఈ క్రమంలోనే ఈ కేసులలో ఐబొమ్మ రవిని పోలీసులు దఫాల వారీగా కస్టడీలోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి.  పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబం ధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు. కేసుల విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో అతడికి బెయిలు లభిస్తే, దర్యాప్తునకు ఆటంకం కలిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.  అంతేకాకుండా ఐ బొమ్మ రవి విదేశాల్లో పౌరసత్వం కలిగి ఉన్నాడని, ఇటువంటి సమయంలో రవికి బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశాలు  ఉన్నాయని, అదే జరిగితే  కేసు విచారణ   దెబ్బతింటుందని పోలీసులు పేర్కొన్నారు. రవి భారతదేశం లోనే అందుబాటులో ఉండేలా కస్టడీలో ఉంచడం అత్యవసరమని పోలీసుల తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం నాంపల్లి కోర్టు పోలీసుల వాదనలను పరిగణనలోనికి తీసుకున్న కోర్టు రవి పై నమోదైన ఐదు కేసులకు సంబంధించి దాఖలైన అన్ని బెయిల్ పిటీషన్లను  కొట్టి వేసింది.  

భోగాపురం క్రెడిట్ వార్.. లైన్ లోకి విజయసాయి?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య జరుగుతున్న క్రెడిట్ వార్ లోకి వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి ఎంటరయ్యారు. అయితే ఆయన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ క్రెడిట్ లో తనకూ కొంత భాగం ఉందని మాత్రమే చెప్పారు. అలా చెప్పడంలో ఆయన వైసీపీనీ, ఆ పార్టీ అధినేత జగన్ ను పూర్తిగా విస్మరించారు. భోగాపురం విమానాశ్రయంలో ఫస్ట్ టెస్ట్ ఫ్లయిట్ ను స్వాగతిస్తూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు.  ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు. విజయసాయి ఈ వైఖరి పట్ల వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.  పలువురు వైసీపీ మద్దతుదారులు విజయసాయిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీకి క్రెడిట్ దక్కకుండా అడ్డుపడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు.  సరే అది పక్కన పెడితే.. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ పరిస్థితి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ చందంగా అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ ఎంపీగా నాడు సభలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం గళమెత్తిన విజయసాయి.. ఇప్పుడు పార్టీ ప్రస్తావన కూడా లేకుండా తాను వ్యక్తిగత స్థాయిలోనే భోగాపురం కోసం మాట్లాడానన్నట్లుగా సోషల్ మీడియాలో పేర్కొనడం.. వైసీపీ విమర్శకులకు కొత్త శక్తిని ఇచ్చినట్లైంది. ఈ నేపథ్యంలోనే  నాడు విపక్ష నేతగా భోగాపురం వద్దంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. విమానాశ్రయాన్ని అడ్డుకోవడానికి చేయగలిగినంతా చేసి ఇప్పుడు తగుదునమ్మా అని క్రెడిట్ కోసం పాకులాడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.  

ఉగాదికి కవిత కొత్త పార్టీ

  తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది. ఉగాదికి కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి పేరుతో పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాల ఇన్‌ఛార్జ్‌లు, కార్యదర్శులతో కవిత సమావేశమయ్యారు. జనం బాట కార్యక్రమానికి సంబంధించిన రివ్యూ తెలుసుకున్నారు. పార్టీ పెడితే ప్రజల్లోకి బలంగా వెళ్లగలమా? లేదా? అన్న సలహాలు, సూచనలు కార్యకర్తలు, నాయకుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నూతన పార్టీతోనే పోటీ చేయనున్నట్లు కవిత వెల్లడించిన సంగతి తెలిసిందే.  శాసనమండలిలో భావోద్వేగంతో మాట్లాడిన కవిత పలు సంచలన విషయాలు వెల్లడించారు. అయితే  కవిత తన జిల్లాల పర్యటనలను వాయిదా వేసుకున్నారు. వాస్తవంగా  ఇవాళ నుంచి సిరిసిల్ల జిల్లాలో పర్యటించాల్సి ఉంది. తన అన్న కేటీఆర్ ​ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో కవిత పర్యటన నేపథ్యంలో ఆసక్తి నెలకొంది.  జాగృతి సంస్థను రాజకీయ పార్టీగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే పార్టీ నాయకులందరు డిమాండ్​ చేస్తున్నారు.   

కవిత కాంగ్రెస్‌లో చేరొచ్చు...కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

  ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని మల్‌రెడ్డి హింట్ ఇచ్చారు. గతంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి నేతలు కాంగ్రెస్‌లోకి వస్తారని అనుకున్నా.. అనుకున్నట్టుగానే వచ్చారని ఆయన తెలిపారు.  మంత్రి పదవిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకే నష్టం అన్నారు. నిరాకరిస్తే నాకేం నష్టం లేదు. ఈ విషయంలో పార్టీ పెద్దలు ఆలోచించాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది ఊహాగానమేనని రంగారెడ్డి జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు అయినా చేసుకోవచ్చు. కానీ జిల్లా స్వరూపం పేరు మారొద్దున్నారు. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో ల్యాండ్ విలువ పెరిగి  భూములు ఎవరూ అమ్మడం లేదని ఆయన అన్నారు.  

తమిళనాట రచ్చ రేపుతున్న లాప్ ట్యాప్ రాజకీయం!

తమిళనాడులో రాజకీయ వెడి రోహిణీకార్తెను తలపిస్తున్నది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాలలో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన విజయ్.. అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.  ఈ నేపథ్యంలో తమిళనాడ రాజకీయ వాతావరణం వేడెక్కింది.ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే భావిస్తుంటే.. ఇరు పార్టీల పాలననూ చూసిన తమిళులు.. తనకు ఒక చాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని విజయ్ అంటున్నారు.  కాగా ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి స్టాలిన్ సర్కార్ ఫీబీస్ కు తెరలేపింది. విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీ చేపట్టింది. దీంతో కంగుతిన్న అన్నాడీఎంకే ఎన్నికల తాయిలాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు స్టాలిన్ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారంటూ విమర్శలకు తెరలేపింది. అయితే డీఎంకే మాత్రం ఇదేం కొత్త పథకం కాదనీ, దివంగత ముఖ్యమంత్రి జయలలిత విద్యార్థులకు లాప్ టాప్ ల పంపిణీ పథకాన్ని 2011లోనే ప్రారంభించారని చెబుతోంది.   2021లో అధికారంలోకి వచ్చిన డీఎంకే, గత పథకాలను కొనసాగిస్తామని ప్రకటించి, ఇప్పుడు ఏడాదికి 20 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. చెన్నైలో సీఎం ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా తొలి విడతగా 10 లక్షల మందికి ట్యాప్ టాప్ ల పంపిణీ చేపట్టింది. దీంతో ఎన్నికల వేళ తమిళనాట ట్యాప్ లాప్ రాజకీయం రచ్చ రేపుతోందని పరిశీలకులు అంటున్నారు.