నాలుగు   నామినేషన్లూ సక్రమమే!
నాలుగు నామినేషన్లూ సక్రమమే!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రం నుండి ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు జరిగిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మంగళవారం (జూన్ 9) అధికారికంగా పూర్తయింది. ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 18 న జరగబోయే ఈ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులందరి పత్రాలు చెల్లుబాటు కావడంతో తదుపరి ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున నలుగురు ప్రముఖ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. అదేవిధంగా, కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ కోటా కింద ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ తన నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 4 స్థానాలకు గానూ కూటమి తరఫున ఈ నలుగురు అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. దీంతొ ఈ నలుగురు అభ్యర్థుల ఎన్నిక కగ్రీవం కానుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు.

Publish Date: Jun 9, 2026 4:35PM
2027.. జగన్, కేసీఆర్ యాత్ర స్పెషల్ సంవత్సరం!?
2027.. జగన్, కేసీఆర్ యాత్ర స్పెషల్ సంవత్సరం!?

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు. ముందుగా వైసీపీ అధినేత జగన్ ప్లాన్ ఏమిటని చూస్తే.. ఆయన 2027వ సంవత్సరంలో తాను సరికొత్త చారిత్రాత్మక పాదయాత్రను ప్రారంభించబోతున్నట్లు ఆయన బహిరంగంగానే వెల్లడించారు. ఈ పాదయాత్రకు సంబంధించిన పూర్తి రూట్ మ్యాప్‌ను రాబోయే కొద్ది నెలల్లోనే వైసిపి శ్రేణులు సిద్ధం చేయనున్నాయి. అయితే ఈసారి జగన్ వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. 2027లో అడుగు ముందుకు వేస్తే, మళ్లీ 2029 అసెంబ్లీ ఎన్నికల ముగింపు వరకు ఆయన నిరంతరం ప్రజల మధ్యే ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. గతంలో 2019 ఎన్నికలకు ముందు జగన్ చేసిన పాదయాత్ర ఏపీ రాజకీయ చరిత్రను తిరగరాసి ఆయనకు బంపర్ మెజారిటీని తెచ్చిపెట్టింది. ఇప్పుడు 2026 దాటి 2027 రాగానే అదే మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేయాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను పూర్తిగా తన వైపు తిప్పుకోవడానికి ఈ సుదీర్ఘ పాదయాత్రే ఏకైక మార్గమని ఆయన నమ్ముతున్నారు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు విషయానికి వస్తే.. ఆయన కూడా జగన్ రూట్ నే ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆయన కూడా ప్రజలతో మమేకం అవ్వడం ద్వారా మళ్లీ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అయితే జగన్ పాదయాత్ర ద్వారా ప్రజలలోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటుంటే.. కేసీఆర్ బస్సు యాత్ర అంటున్నారు. అదోక్కటే తేడా మిగతాదంతా సేమ్ టూ సేమ్. ఇద్దరూ ఒకే రకమైన వ్యూహంతో ముందుకు సాగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు తమ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికీ.. వచ్చే 2029 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ పీఠాన్ని దక్కించుకోవడానికి 2027ను కీలకంగా భావిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ దాదాపు ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. అయితే ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ 2027 ప్రారంభం నుండి కేసీఆర్ సరికొత్త అవతారంలో ప్రజల ముందుకు రానున్నట్లు ఆ పార్టీ కీలక నేత తన్నీరు హరీష్ రావు అధికారికంగా స్పష్టం చేశారు. 2027 నుండి కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో అత్యంత చురుకైన పాత్ర పోషించబోతున్నారు. ఇందుకోసం ఆయన బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గాన్ని తాకుతూ సాగే ఈ బస్ యాత్ర ద్వారా ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు గులాబీ బాస్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. చూడాలి మరి ఏపీలో జగన్ పాదయాత్ర, తెలంగాణలో కేసీఆర్ బస్సు యాత్రలకు జన స్పందన ఎలా ఉంటుందో?

Publish Date: Jun 9, 2026 11:48AM
పవన్ ఆదేశాలకూ దిక్కులేదా?
పవన్ ఆదేశాలకూ దిక్కులేదా?

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదా? సాధారణంగా ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైళ్లు నత్తనడకన సాగుతాయని, మంత్రులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు తరచూ ఆరోపిస్తుంటారు. అధికారులు మంత్రుల మాటలను కూడా పెద్ద ఖాతరు చయరన్న విమర్శలూ వినవస్తుంటాయి. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. విషయమేంటంటే.. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పవన్ కళ్యాణ్ ఇటీవల రాజమహేంద్రవరంలో పర్యటించారు. ఆ సందర్భంగా పుష్కర్ ఘాట్ నుంచి పడవలో ప్రయాణిస్తూ గోదావరి నది పరివాహక ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఆ పర్యటనలో పవన్ కళ్యాణ్ ఎన్నో పారిశ్రామిక విభాగాలు, ఫ్యాక్టరీల నుంచి వస్తున్న రసాయన వ్యర్థాలు, నగరంలోని మురుగునీరు, ప్లాస్టిక్ వ్యర్థాలు నేరుగా గోదావరి నదిలోకి కలిసిపోతుండటాన్ని గమనించారు. కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే పుష్కరాల సమయానికి నది ఇంతలా కలుషితమైతే ప్రజల ఆరోగ్యం ఏమైపోతుందని ఆయన అధికారులను గట్టిగా నిలదీశారు. గోదావరిని కలుషితం చేస్తున్న పరిశ్రమలను తక్షణమే గుర్తించి, వాటికి నోటీసులు జారీ చేయాలని ఆయన స్థానిక అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. డిప్యూటీ సీఎం స్వయంగా ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. కానీ తాజాగా సోమవారం(జూన్ 8) నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్‌కు తాను ఆదేశాలు ఇచ్చి ఇన్ని రోజులైనా, కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమల్లో కనీసం ఒక్కటంటే ఒక్క సంస్థకు కూడా అధికారులు ప్రాథమిక నోటీసులు జారీ చేయలేదని తెలిసింది. దీంతో పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి సున్నితమైన, ప్రజా ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని సీనియర్ అధికారులపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ముఖ్యంగా గోదావరి నదిలోకి శుద్ధి చేయని రసాయన వ్యర్థాలను వదులుతోందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్ర పేపర్ మిల్స్ కు తక్షణమే నోటీసులు జారీ చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో పాటు, ఈ వ్యవహారంలో పర్యవేక్షణ లోపించి, బాధ్యతారహితంగా వ్యవహరించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులకు కూడా నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బ్యూరోక్రసీకి ఒక బలమైన హెచ్చరికను పంపారు. గతంలో తాను ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసిన అధికారులపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అదే సమయంలో నిబంధనల ప్రకారం పనిచేసే అధికారులకు ఆయన ఒక భరోసానిచ్చారు. కాలుష్య కారక సంస్థలపై లేదా అక్రమార్కులపై చర్యలు తీసుకునేటప్పుడు మీకు రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదనీ.. ఆ విషయాలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. అవసరమైతే ఆ ఒత్తిళ్లపై తాను క్యాబినెట్ సమావేశంలోనో, అసెంబ్లీ వేదికగానో ప్రశ్నిస్తానని, అధికారులకు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగకుండా అడ్మినిస్ట్రేషన్ తన పని తాను నిష్పక్షపాతంగా చేయాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు.

Publish Date: Jun 9, 2026 11:38AM
మహాయతి కూటమిలో ముసలం..  ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు ఏక్ నాథ్ నో ఇన్విటేషన్
మహాయతి కూటమిలో ముసలం.. ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు ఏక్ నాథ్ నో ఇన్విటేషన్

మహారాష్ట్ర రాజకీయాల్లో మిత్ర భేదం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమం కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య తీవ్ర విభేదాలకు కేంద్రబిందువుగా మారింది. మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు. ఈ పరిణామం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విమానాశ్రయ ప్రాజెక్టును పర్యవేక్షించే అత్యున్నత ప్రభుత్వ సంస్థ సీఐడీసీవో నేరుగా షిండే నేతృత్వంలోని పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోనే పనిచేస్తుంది. అయినా.. ఆ శాఖ మంత్రికే ఆహ్వానం అందకపోవడం సంచలనంగా మారింది. ఈ వేడుకను అదానీ ఎయిర్‌పోర్ట్ అథారిటీ, సీఐడీసీవో సంయుక్తంగా అత్యంత వైభవంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరై.. 20 అడుగుల శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వేదికపై రాష్ట్ర మంత్రులు గణేశ్ నాయక్, అదితి తత్కరేలు ఉన్నారు. అయితే.. డిప్యూటీ సీఎంలు ఏక్‌నాథ్ షిండేతో పాటు సునేత్రా పవార్‌లకు కనీసం ఆహ్వానం కూడా అందకపోవడంతో వారు రాలేదు. దీంతో షిండే నేతృత్వంలోని శివసేన వర్గం ఆగ్రహంతో రగిలిపోతున్నది. కొందరు ప్రభుత్వ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనీ, ఈ ప్రతిష్ఠాత్మక ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు క్రెడిట్ ఏక్‌నాథ్ షిండేకు దక్కకుండా చేసేందుకేఆయనకు ఆహ్వానం కూడా పంపకుండా తెరవెనుక కుట్ర జరిగిందనీ మంత్రి సంజయ్ శిర్సాత్ బహిరంగంగానే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలపై శివసేన (యూబీటీ) నేత అంబాదాస్ దాన్వే మహాయుతి కూటమిలో అసలు ఏక్‌నాథ్ షిండే ప్రాధాన్యత మరియు ఆయన స్థానం ఏంటో ఈ సంఘటనతో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. కూటమిలో ముసలం ముదిరిపోయిందన్నారు. ఈ వివాదం మరింత ముదరకుండా ముఖ్యమంత్రి కార్యాలయం నష్టనివారణ చర్యలకు దిగింది. ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి, ఉప ముఖ్యమంత్రులను ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి దూరం పెట్టడంపై 24 గంటల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని కోరుతూ సీఐడీసీవో, అదానీ ఎయిర్‌పోర్ట్ అథారిటీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అత్యంత కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలు వేగంగా సమీపిస్తున్న తరుణంలో.. క్రెడిట్ రాజకీయం చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Publish Date: Jun 9, 2026 10:55AM
ఇండియా కూటమి కీలక నిర్ణయం...ఇకపై రెండు నెలలకు ఒకసారి భేటీ!
ఇండియా కూటమి కీలక నిర్ణయం...ఇకపై రెండు నెలలకు ఒకసారి భేటీ!

దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది. కేంద్రంలోని అధికార ఎన్డీఏ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తు కార్యాచరణను మరింత బలోపేతం చేసేందుకు విపక్షాలు సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాయి. న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన తాజా సమావేశంలో ఇండియా బ్లాక్ నేతలు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, ప్రజల సమస్యలపై నిరంతరం అప్రమత్తంగా ఉండేందుకు గాను ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి తప్పనిసరిగా సమావేశం కావాలని కూటమి ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ క్రమంలోనే తమ తదుపరి కీలక భేటీని 2026, ఆగస్టు 8వ తేదీన నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించి రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించారు. ఈ చారిత్రాత్మక సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 25 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై తమ గళాన్ని వినిపించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సాగిన ఈ సుదీర్ఘ చర్చల్లో దేశాన్ని వేధిస్తున్న ఐదు అత్యంత కీలకమైన అంశాలపై కూటమి నేతలు ఒకే తాటిపైకి వచ్చారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR) ప్రక్రియలో జరుగుతున్న వ్యూహాత్మక లోపాలు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ఓటర్ల హక్కుల ఉల్లంఘనపై ఇండియా కూటమి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) కి నేరుగా ఒక సమగ్రమైన లేఖ రాయాలని 25 పార్టీల ప్రతినిధులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ అధికారిక లేఖను అత్యంత త్వరలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించనున్నారు. దేశంలోని విద్యావ్యవస్థను అతలాకుతలం చేస్తున్న నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్‌లు, అలాగే సీబీఎస్ఈ (CBSE) మూల్యంకనంలో వెలుగుచూసిన ఘోరమైన అవకతవకలపై విపక్షాలు నిప్పులు చెరిగాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఇండియా కూటమి అత్యున్నత వేదిక నుండి డిమాండ్ చేసింది. దీనితో పాటు దేశంలో పెరుగుతున్న బంధుప్రీతి పెట్టుబడిదారీ విధానం, బీజేపీయేతర లేదా ఎన్డీఏయేతర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలపై కేంద్రం చేస్తున్న దాడులు, సమాజంలో అణగారిన వర్గాలపై జరుగుతున్న అఘాయిత్యాలు, మరియు మోదీ ప్రభుత్వ ప్రస్తుత విదేశాంగ విధానంలో లోపాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. ఈ ఐదు ప్రధాన అంశాలపై దేశవ్యాప్తంగా ఐక్యంగా ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయించారు. అయితే, ఈ కీలక భేటీకి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), డీఎంకే (DMK) దూరంగా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వైఖరిపై అసంతృప్తితో ఉన్న డీఎంకే ఈ భేటీకి డుమ్మా కొట్టగా, ఆప్ వ్యూహాత్మకంగా దూరంగా నిలిచింది. అయినప్పటికీ, మిగిలిన భాగస్వామ్య పక్షాలు ఆగస్టు 8 భేటీ కోసం ఇప్పటి నుంచే సమరశంఖం పూరిస్తున్నాయి.

Publish Date: Jun 8, 2026 5:30PM
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్

రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు. సోమవారం అమరావతి అసెంబ్లీ భవనంలో సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్. వనితా రాణికి అందచేశారు. ఈ నామినేషన్ల దాఖలు ప్రక్రియలో కూటమి పార్టీ నేతలు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు.రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా సానా సతీష్ రెండు సెట్ ల నామినేషన్ లను సమర్పించారు. ప్రతిపాదకులుగా చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీ నారాయణ,పంతం వెంకటేశ్వరరావు(నానాజి), తంగిరాల సౌమ్య సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా భాష్యం రామకృష్ణ రెండు సెట్ ల నామినేషన్ లను సమర్పించారు. ప్రతిపాదకులుగా మంత్రి అచ్చెన్నాయుడు,ఎమ్మెల్యేలు బి.రామాంజనేయులు,కొలిశెట్టి శ్రీనివాస్, శ్రీరాం తాతయ్యలు సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా చింతకాయల విజయ్ రెండు సెట్లు నామినేషన్లు సమర్పించారు. ప్రతిపాదకులుగా మంత్రి కొలుసు పార్థసారథి,ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్,సుందరపు విజయ్ కుమార్,బోడే ప్రసాద్ లు సంతకాలు చేశారు. ఈకార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎం. అఖిల్ కుమార్, పి.విజయ కుమారి తోపాటు కూటమి నేతలు జ్యోతుల వెంకట అప్పారావు(నెహ్రూ),వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు)వరుపుల సత్య ప్రభ,బండారు సత్యానంద రావు పాల్గొన్నారు. ఇంకా 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తదతర నేతలు పాల్గొన్నారు.

Publish Date: Jun 8, 2026 4:52PM
9 నుంచి ఏపీ సర్కార్ ప్రజాబాట!
9 నుంచి ఏపీ సర్కార్ ప్రజాబాట!

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువయ్యేలా సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. వైసీసీ హయాంలో జగన్ ప్రజలకు అందుబాటులో ఉండకుండా, కేవలం కోటరీకే పరిమితమై దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు ప్రజలతో మమేకమైన జగన్.. అధికార పగ్గాలు చేపట్టగానే, ప్రజలకు చేరువయ్యే అన్ని మార్గాలనూ మూసేసుకున్నారు. కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ ప్రజాబాటలో భాగంగా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంయుక్తంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లనున్నాయి. జూన్ 9న సంక్షేమ పథకాలపై కేంద్రీకరిస్తూ భారీ ఎత్తున తొలి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు పథకాలు అందుతున్న తీరు, అందులో మార్పుల వంటి పలు అంశాలపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత జూన్ 12న అమరావతి వేదికగా ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా పాలనాపరమైన ఇబ్బందులు, ప్రజల సమస్యలపై వినతులను స్వీకరిస్తారు. ఇక జూన్ 15న విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనపై స్థానిక ప్రజలు, మేధావుల నుండి నేరుగా సూచనలు, సలహాలు సేకరించనున్నారు. వైసీపీ హయాంలో సీఎంగా ఉన్న జగన్ ప్రజలతో నేరుగా కలిసే అవకాశాలకు తాళం వేసేశారు. ప్రజల నుండి క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ తీసుకోకపోవడంతోనే 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైందన్నది పరిశీలకుల విశ్లేషణ. ఆ రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలించిన ఎన్డీఏ కూటమి, అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ప్రజలతో మమేకం అయ్యే వ్యూహాలనే అనుసరిస్తున్నది. తాజాగా చేపట్టిన ప్రజాబాట. ద్వారా సామాన్య ప్రజలు తమ ప్రాంత ప్రతినిధులను, ప్రభుత్వాన్ని నేరుగా కలిసి అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే ప్రభుత్వం భవిష్యత్తులో తన పరిపాలనను మరింత మెరుగుపరుచుకుంటూ, ప్రజామోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుందని తెలుగుదేశం కూటమి సర్కరా్ భావిస్తోంది.

Publish Date: Jun 7, 2026 12:12PM
. అమరావతిపై విషం.. రాజకీయ ఉనికి కోసం కవిత వ్యర్థ ప్రయత్నం
. అమరావతిపై విషం.. రాజకీయ ఉనికి కోసం కవిత వ్యర్థ ప్రయత్నం

తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత.. మాటలతో గారడీ చేసే విద్యను తండ్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) నుంచి పుణికి పుచ్చుకున్నట్లుగా కనిపిస్తారు. తెలంగాణ రాజకీయాలలో ఆమె శైలి ఒకింత భిన్నంగా ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ స్థాపించిన కల్వకుంట్ల కవిత రాజకీయ ఉనికి కోసం వివాదాస్పద విమర్శల దారి ఎంచుకున్నట్లుగా కనిపిస్తున్నది. అందులో భాగంగానే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. వర్షాల కారణంగా అమరావతి సచివాలయంలోని ముఖ్యమంత్రి కుర్చీ నీరు కారుతోందని, అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రజలు పడవల్లో తిరుగుతున్నారని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్‌తో కవితకు ఏవైనా రాజకీయ విభేదాలు ఉంటే, ఆమె రాజకీయ స్థాయిలో ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడాన్ని ఎవరూ తప్పుపట్టరు కానీ.. ఆమె అమరావతిపై విమర్శలు చేయడంపై ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతంది. రాజకీయాల్లోని విభజన, ప్రాంతీయత అంశాన్ని గతంలో కేసీఆర్ వీలైనంతగా వాడుకున్నారు. ఇప్పుడు కవిత మళ్లీ అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. అయితే ఆమె అమరావతి లక్ష్యంగా చేస్తున్న వ్యాఖ్యల పట్ల తెలుగు రాష్ట్రాలలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తన రాజకీయ ఉనికి కోసం కవిత అమరావతిపై విషం కక్కడం వ్యర్థ ప్రయత్నంగా పరిశీలకులు అభివర్ణిస్తుననారు.

Publish Date: Jun 7, 2026 11:55AM
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు...సామాజిక సమీకరణాలకే పెద్దపీట!
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు...సామాజిక సమీకరణాలకే పెద్దపీట!

ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముగ్గురు నేతల పేర్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ కోసం కష్టపడిన విధేయత, సామాజిక సమీకరణాలు, యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ దఫా పెద్దల సభకు వెళ్లే అభ్యర్థుల జాబితాలో ప్రముఖ విద్యావేత్త భాష్యం రామకృష్ణ, ప్రస్తుత ఎంపీ సానా సతీష్ బాబు, యువ నాయకుడు చింతకాయల విజయ్ స్థానం దక్కించుకున్నారు. శనివారం రాత్రి వీరందరికీ చంద్రబాబు స్వయంగా పార్టీ తరఫున బీ-ఫామ్‌లను అందజేశారు. దీంతో గత కొన్ని రోజులుగా అభ్యర్థుల ఎంపికపై సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యంగా మూడో స్థానం ఎంపికలో పార్టీ అధిష్ఠానం తీవ్ర కసరత్తు చేసింది. సీనియర్ నాయకుడు వర్ల రామయ్య పేరు చివరి నిమిషం వరకు పరిశీలనలో ఉన్నప్పటికీ, బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో చింతకాయల విజయ్ వైపు మొగ్గు చూపారు. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడైన విజయ్, గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఐటీడీపీ ఇన్‌ఛార్జిగా సాంకేతిక విభాగంలో పార్టీ బలోపేతానికి, కార్యకర్తలపై నమోదైన కేసుల ఉపశమనానికి విశేషంగా శ్రమించారు. గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు ఆశించినా పొత్తుల వల్ల త్యాగం చేయాల్సి రావడంతో ఇప్పుడు పెద్దల సభకు పంపుతున్నారు. మరో అభ్యర్థి, భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ పార్టీ విపక్షంలో ఉన్న కష్టకాలంలో ఆర్థికంగా, నైతికంగా అండగా నిలిచారు. గత ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ టికెట్ దక్కకపోయినా పార్టీ శిక్షణా కార్యక్రమాల్లో క్రియాశీలంగా వ్యవహరించినందుకు గుర్తింపుగా ఆయనకు ఈ పదవి దక్కింది. ఇక కాకినాడకు చెందిన సానా సతీష్ బాబు గత ఉప ఎన్నికల్లో కేవలం ఏడాదిన్నర కాలానికే ఎన్నికవ్వడంతో, సామాజిక సమతూకం దృష్ట్యా ఆయనకు చంద్రబాబు మరోసారి పూర్తి కాలానికి అవకాశం కల్పించారు. మొత్తంగా ఏపీలో ఖాళీ అయిన నాలుగు స్థానాలలో కూటమి ఒప్పందం ప్రకారం మూడు టీడీపీ, ఒకటి జనసేన పంచుకున్నాయి. జనసేన తరఫున ఇప్పటికే లింగమనేని రమేష్ నామినేషన్ వేయగా, టీడీపీ అభ్యర్థులు సోమవారం తమ పత్రాలను దాఖలు చేయనున్నారు. అసెంబ్లీలో కూటమికి ఉన్న భారీ మెజారిటీ నేపథ్యంలో ఈ నలుగురి ఎన్నిక కేవలం ఏకగ్రీవంగా పూర్తి కావడం లాంఛనంగానే కనిపిస్తోంది. రాష్ట్రంలో యువతకు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో పార్లమెంట్‌లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ ముగ్గురు నేతలు గళం విప్పుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Publish Date: Jun 7, 2026 11:30AM
 ఐటీ నుంచి పెద్దల సభ వరకూ చింతకాలయ విజయ్   ప్రస్థానం
ఐటీ నుంచి పెద్దల సభ వరకూ చింతకాలయ విజయ్ ప్రస్థానం

చింతకాయల విజయ్ అంటే కేవలం చింతకాలయ అయ్యన్న పాత్రుడు రాజకీయ వారసుడు మాత్రమే కాదు. ఉన్నత విద్యావంతుడు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించి, రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో రాకముందు కార్పొరేట్ రంగంలో పనిచేశారు. ఐటీ, బిజినెస్ మేనేజ్‌మెంట్ రంగాలపై ఆయనకున్న అవగాహన టెక్నాలజీని రాజకీయ వ్యూహాల్లోకి ఎలా అమలు చేయాలో నేర్పింది. ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది. ఆ సమయంలో టీడీపీ ఐటీ వింగ్, సోషల్ మీడియా విభాగాల బాధ్యతలను విజయ్ భుజానికెత్తుకున్నారు. పార్టీ కోసం ఒక పటిష్టమైన సోషల్ మీడియా ఆర్మీని అంటే టీడీపీ డిజిటల్ వింగ్ ను నిర్మించారు. కేవలం అమరావతి, హైదరాబాద్‌కే పరిమితం కాకుండా గ్రామ స్థాయి వరకు వాట్సాప్, ఎక్స్), ఫేస్‌బుక్ గ్రూపుల ద్వారా పార్టీ లూప్‌ను కనెక్ట్ చేశారు. అప్పటి అధికార వైసీపీ ఐప్యాక్ టీమ్ సోషల్ మీడియాలో సంధించే విమర్శలను, ట్రోల్స్‌ను అంతే వేగంగా డిజిటల్ వేదికలపై తిప్పికొట్టడంలో విజయ్ వ్యూహాలు కీలకంగా పనిచేశాయి. 2019, 2024 మధ్య కాలంలో ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసినందుకు, పార్టీ వాయిస్‌ను గట్టిగా వినిపించినందుకు విజయ్ తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లను, న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో జగన్ సర్కార్ విజయ్‌పై పలు కేసులు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి ఏపీ సీఐడీ పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడం, విచారణల పేరుతో ఇబ్బంది పెట్టడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ ఒత్తిళ్లకు లొంగకుండా ఆయన నిలబడటం, న్యాయపోరాటం చేయడం ద్వారా పార్టీ క్యాడర్‌లో ఆయనపై గౌరవం పెరిగింది. కేవలం ఏసీ రూముల్లో కూర్చునే నేత కాదనీ.. , పార్టీ కోసం కేసులు ఎదుర్కొనే ఫైటర్ అనీ తెలుగుదేశం క్యాడర్ గుర్తించింది. దీంతో యూత్ లో చింతకాలయ విజయ్ కు ఫాలోయింగ్ పెరిగింది. ఇక విజయ్ తండ్రి చింతకాలయ అయ్యన్నపాత్రుడు సుదీర్ఘ కాలంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బలమైన బీసీ సామాజికవర్గ నేతగా ఉన్నారు. అయ్యన్నపాత్రుడు ప్రస్తుతం స్పీకర్ హోదాలో ఉండటంతో ప్రత్యక్ష రాజకీయ విమర్శలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఈ తరుణంలో ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ.. ఉత్తరాంధ్రలో పార్టీ యువతను సమూహపరచడంలో విజయ్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అన్నిటికీ మించి చింతకాయల విజయ్ కేవలం ఒక నియోజకవర్గానికో లేదా జిల్లాకో పరిమితమైన నాయకుడు కాదు. సాంకేతికతను, సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ డిజిటల్ క్యాడర్‌ను లీడ్ చేసిన అనుభవం ఆయనకుంది. అందువల్లే, నేటి ఆధునిక రాజకీయాల్లో, మారుతున్న ఢిల్లీ సమీకరణాలకు అనుగుణంగా ఇలాంటి టెక్-సావీ, అలాగే దూకుడుగా వ్యవహరించే యువనాయకుడిగా గుర్తించిన తెలుగుదేశం అధినాయత్వం చింతకాలయ విజయ్ ను రాజ్యసభకు పంపించాలని నిర్ణయించుకుంది.

Publish Date: Jun 7, 2026 11:20AM
TeluguOne Picks For You
rss-imgRss Feeds