నవరత్నాలు ప్లస్ V/s ఆరు గ్యారెంటీలు

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా వైసీపీ అధినేత జ‌గ‌న్  రాష్ట్రం చుట్టి వ‌చ్చారు క‌దా..., విష‌యం అర్థం అయి వుంటుంది. అందుకే  సి.ఎం.జగన్, ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఎన్నికలు జరగక ముందే జగన్ చేతులెత్తేశారనే మాటలు ప్రతిపక్షాల నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్క‌డ రెండు విష‌యాలు మ‌నం మాట్లాడుకుంటే  1. నామినేష‌న్ల ప‌ర్వం చాలా పేల‌వంగా, జ‌న‌మే లేకుండా వైసీపీ అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేశారు. జ‌నాన్ని త‌ర‌లించాలంటే డ‌బ్బు పెట్టాలి. ఎలాగూ ఓడిపోతాం క‌దా అని అనుకున్నారేమో కానీ, నామినేష‌న్ల ఘ‌ట్టంలో వైసీపీ అభ్య‌ర్థులు జ‌నాన్ని త‌ర‌లించ‌లేక‌పోయారు.  2. గేమ్ ఛేంజర్ గా ఉంటుందని ప్ర‌చారం జ‌రిగిన మేనిఫెస్టో.... అదే పాత మేనిఫెస్టోని కొంచెం మార్చి ప్ర‌క‌టించేశారు.  పాత‌ ఎన్నికల మేనిపెస్టోనే మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పారు అంతే.  వృద్ధుల పెన్షన్ల విషయంలో మరో నాలుగేళ్ల పాటు మూడు వేల పెన్షనే ఉంటుందని వచ్చే ఎన్నికలకు ముందు రెండు విడతలుగా రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుతానని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇప్పటికే నాలుగు వేలు చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ కూడా నాలుగు వేలు చేస్తారని అనుకున్నారు. కానీ అలాంటి మార్పు క‌నిపించ‌లేదు. మరో ఐదేళ్ల వరకూ కూడా మూడువేలే ఉంటుందని తేల్చేశారు. ఇతర పథకలకు డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పారు. కానీ వృద్ధుల పెన్షన్ విషయంలో మాత్రం వెనుకడుగు వేశారు.   మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసి ఇప్పుడు బాధ‌ప‌డుతున్నారు.  క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు స్ప‌ష్టంగా కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే, విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మూడు రాజధానుల అంశం ప్రధాన ఎజెండాగా మారింది. విశాఖ పరిపాలనా రాజధాని చేస్తామన్నారు. చట్టపరంగా సాధ్యం కాని అంశం ఇది. అయినా, మేనిఫెస్టోలో పెట్టారు. పోలవరం ప్రాజెక్టు వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామని మ‌ళ్ళీ పాత పాటే పాడారు.   టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లారు. మూడు ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, నాలుగు వేలపెన్షన్ ప్రజల్లో విస్తృత చర్చ జ‌రుగుతోంది. వీటితో పాటు  జనసేన చెప్పిన మరో 4 పథకాలను కూడా కలిపి.. 10 గ్యారెంటీ హామీలను ఇస్తామంటోంది.  వైసీపీ ఇప్పుడు మేనిఫెస్టో విడుదల చేసేసింది. వైసీపీ మేనిఫెస్టో తేలిపోయింది కాబట్టి, ఇక టీడీపీ కూటమి మేనిఫెస్టో ఎలా ఉంటుంది అనేది ప్రజల్లో ఉత్కంఠ‌త నెల‌కొంది. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

పిఠాపురంలో మెగాస్టార్ ప్రచారం.. డేట్ కన్ ఫర్మ్?

రాజకీయాలను తాను వదిలేసినా రాజకీయాలు తనను వదల లేదంటూ చిరంజీవి ఏదో సినిమాలో ఓ డైలాగ్ చెబుతారు. నిజమే చిరంజీవి రాజకీయాలకు దూరమై చాలా కాలమైంది.  అయినా ఆయన ఎప్పుడూ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే నిలుస్తూ వస్తున్నారు. 2014 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగిన చిరంజీవి, ఆ తర్వాత  కొంత కాలం రాజకీయాల్లో ఉండీ  లేనట్లు కొనసాగారు. అంతే  ఆ తర్వాత చిరంజీవి రాజకీయలకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు.  తమ్ముడు పవన్ కళ్యాణ్  రాజకీయాల్లో కిందా మీద అవుతున్నా, మరో బ్రదర్ నాగబాబు  ఎన్నికల్లో పోటీ చేసినా చిరంజేవి మాత్రం   ఆ దిక్కు  అడుగేయలేదు సరికదా కనీసం ఓ లుక్కు కూడా వేయలేదు.   కానీ  చిరంజీవి  పేరు తరచూ రాజకీయ చర్చల్లో ప్రస్తావనకు వస్తూనే ఉంది.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగించిన సమయంలోనే, ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష  బాధ్యతలను చిరంజీవికి అప్పగించాలని  భావించారు. ఇందుకోసం చిరంజీవితో మాట్లాడే బాధ్యతను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాంద్ కి అప్పగించారు.  ఆవసరమైతే    తానే స్వయంగా చిరంజీవితో మాట్లాడతానని రాహుల్ అన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే చిరంజీవి వీటికి వేటికీ స్పందించలేదు. సై అనలేదు. రాజకీయం తన వంటికి పడదు అన్నట్లుగా మౌనంగానే ఉండి పోయారు.  ఆ తరువాత కూడా మళ్లీ చిరంజీవి రాజకీయ ప్రవేశం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది ఎప్పుడంటే... ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  సినిమా టికెట్  రేట్లను తగ్గించి సినిమా హీరోలు, నిర్మాతలను తన చుట్టూ తిప్పుకున్న సమయంలో, చిరంజీవికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ప్రత్యేకంగా తాడేపల్లి ప్యాలెస్ కు పిలిచి  చర్చలు జరిపారు.  ఆ సమయంలో   చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ, రాజ్యసభ టికెట్ అంటూపెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే చిరంజీవి వాటన్నిటినీ ఖండించి రాజకీయాలకు తాను దూరం అని మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపారు.  ఆ తరువాత మరోసారి చిరు పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడ్డాయి. ఆ సందర్భం అల్లూరి సీతారామరాజు జయంతి సభ. భీమవరంలో జరిగిన ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. ఆ సభలో చిరంజీవే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ముఖ్యమంత్రి జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి రోజాలు ఉన్న ఆ వేదికపై ప్రధాని మోడీ వారందరి కంటే చిరంజీవికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. స్వయంగా ఎదురెళ్లీ మరీ స్వాగతం పలికారు. ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. దీంతో చిరంజీవి బీజేపీ గూటికి చేరడం ఖాయమని పరిశీలకులు విశ్లేషణలు సైతం చేశారు. తరువాత మళ్లీ మామూలే చిరంజీవి మాత్రం రాజకీయాలతో తన దూరాన్ని మెయిన్ టైన్ చేశారు.  అయితే ఇప్పుడు అంటే ఏపీలో ఎన్నికల వేళ ఆయన అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన కూటమి తరఫున ప్రచారం చేస్తారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఈ సారి వాటిని చిరంజీవి ఖండించలేదు. దీంతో పిఠాపురం నుంచి పోటీలో ఉన్న తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఆయన ప్రత్యక్షంగా ప్రచారం చేసే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. కూటమి అభ్యర్థి సీఎం రమేష్ కు బహిరంగంగా మద్దతు పలికి, ఆయనకు ఓటేసి గెలిపించాలని వీడియో సందేశం కూడా ఇచ్చిన తరువాత సోదరుడు పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేయడానికి వెనుకాడరని అన్నారు. ఇప్పుడు చిరంజీవి కూడా తన సోదరుడి విజయం కోసం ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వచ్చే నెల 5 నుంచి ఆయన పిఠాపురంలో ప్రచారం చేయనున్నారు. రోడ్ షోలలో పాల్గొననున్నారు. తన కుమారుడు హీరో రామ్ చరణ్ తో కలిసి పిఠాపురంలో పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేయనున్నారు.  చిరు ప్రచారంలో పెద్ద సంఖ్యలో మెగా అభిమానులూ, బీజేపీ, తెలుగుదేశం శ్రేణులూ కూడా పాల్గొనేలా కూటమి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది. అదే విధంగా ఆయన అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ కోసం కూడా ప్రచారం చేసే అవకాశం ఉందం టున్నారు. అంటే చిరంజీవి ప్రచారం పిఠాపురం, అనకాపల్లికే పరిమితమైనా ఆ ప్రభావం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి ప్లస్ అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ప్రత్యేక హోదా పై ఆ ముగ్గురు నోరెత్తట్లేదుగా? మళ్లీ అదే డ్రామానా!

2014, 2019 ఏపీ ఎన్నికలలో ప్రత్యేక హోదా ప్రముఖ అంశం అయింది కానీ, 2024 ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు ఆ అంశాన్నే ప‌క్క‌న పెట్టేశాయి.  ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌ గానీ, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గానీ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గానీ ప్రత్యేక హోదా అనే పదాన్ని ప్రస్తావించడం లేదు.  25 ఎంపీల్లో 22 ఎంపీ సీట్లు గెలుచుకున్నప్పటికీ సిఎం జ‌గ‌న్ తాను ఇచ్చిన‌ హామీని నిలబెట్టుకోలేదు. రాష్ట్రానికి హోదా సాధించడంలో జగన్ వైఫల్యాన్ని ఎత్తిచూపడంలో టీడీపీ, జనసేన పార్టీలు గ‌ట్టిగా నిల‌బ‌డ‌డం లేదు. ఎందుకంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, టీడీపీ, జనసేనలు మిత్రపక్షం కాబట్టి.  గత రెండు ఎన్నికల్లో ఇది కీలకమైన అంశంగా మారగా, ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అంశంగా మారింది.   అయితే అంతగా ప్రాధాన్యం లేని కాంగ్రెస్ పార్టీ, అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌ ప్ర‌త్యేక హోదా అంటూ జ‌పం చేస్తున్నారు. హోదా హామీతో కాంగ్రెస్ బలం పెరుగుతుందన్న గ్యారెంటీ లేదు.  అయినా కాంగ్రెస్ పుంజుకునే సూచనలు కనిపించడం లేదు.  ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు, సీట్లు వస్తాయా, రావా, అనే విషయాన్ని పక్కనపెడితే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హోదా విషయంలో హామీ ఇవ్వడం మాత్రం విశేషమే.  ప్రత్యేక హోదా ప్రకటన విషయంలో ఆనాడు బీజేపీ ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలుసు. హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని డిమాండ్ చేసిన ఆ నోళ్లు, ఆ తర్వాత మూతబడ్డాయి.  ఏపీలో కాంగ్రెస్ కి పట్టినగతే బీజేపీకి కూడా పట్టింది.  ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీ ఎప్పటికీ నెరవేర్చదనే విషయం తేలిపోయింది. ఏపీలో మొత్తానికి మొత్తం లోక్ సభ సీట్లు ఒకే పార్టీకి వచ్చినా ఆ పార్టీ పార్లమెంట్ ముందు తొడగొట్టే అవకాశం లేదు. కేంద్రాన్ని మెడలు వంచేంత సీన్ లేదని ఈపాటికే ఏపీ ప్రజలకు తెలిసొచ్చింది.  అందుకే  నేతలంతా హోదాపై రాజీ పడటంతో ప్రజలు కూడా హోదాపై ఆశలు వదులుకున్న‌ట్లు క‌నిపిస్తున్నారు. ప్రత్యేక హోదా  గురించి మాట్లాడుతుంటే జ‌నం వింతగా చూస్తున్నారని  వైఎస్ షర్మిల ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. గ‌డిచిన పదేళ్లలో ప్రత్యేక హోదా కోసం ప్ర‌ధాన పార్టీలు పోరాటాలు చేయ‌లేద‌ని ఆమె ఆరోపించారు.   ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు అని.. ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్ కృషి చేస్తుందని ష‌ర్మిల చెబుతున్నారు. 10 ఏళ్లు దాటిన ఏపీకి రాజధాని లేకుండా పోయింది. ఇతర రాష్ట్రాలు అభివృద్ది దూసుకెళుతుంటే.. ఏపీ 25 ఏళ్లు వెనక్కి వెళ్లింది. ఆంధ్ర అభివృద్ధికి మోదీ హామీ ఇచ్చారని.. అయితే ఏ ఒక్క హామీ సైతం నెరవేరలేదని ష‌ర్మిల చెబుతున్నారు. ఏపీ ప్రత్యేక హోదా, రాజకీయ వివాదంగా మారి ప‌దేళ్ళైంది. అప్పుడు అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టకుండా ప్రధాని చేత నోటి మాట అనిపించి మమ అనిపించారు. ఆ తరువాత వచ్చిన బీజేపీకి అది ముగిసిన అధ్యాయం అని చెప్పేసింది. రాజకీయ సుడిగుండంలో త‌మ అవసరాల మేరకు ప్ర‌ధాన పార్టీలు ప్ర‌త్యేక హోదా ఈ అస్త్రాన్ని వాడుకుంటున్నాయి.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌

జలగన్నకి జలగ లేఖ!

నమస్తే జలగన్నా. అలియాస్ జగనన్నా. నాపేరు జలగశ్రీ. నువ్వేమో సింబాలిక్ జలగవి.. నేనేమో రియల్ జలగని! నేను ఈమధ్యే పుట్టాను. నేను రక్తం పీల్చడానికి ట్రై చేస్తున్నప్పుడు అంత టాలెంటెడ్‌గా పీల్చలేకపోతున్నాను. దాంతో మా పెద్దలందరూ నా మీద చాలా సీరియస్ అవుతున్నారు. జలగ పుటక పుట్టి జలగలాగా రక్తం పీల్చలేకపోవడం దారుణమని అన్నారు. మనిషిలాగా పుట్టి జలగలా జనం రక్తం పీలుస్తున్న నీ దగ్గర్నుంచి మన జలగ జాతి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా వున్నాయని చెప్పారు. నువ్వు జనం రక్తం ఎలా పీల్చావో మా పెద్దలు వివరిస్తుంటే విని, నాకు జలగ జన్మ మీదే విరక్తి కలిగింది. నువ్వు ఇంత బాగా జనం రక్తం పీల్చుతున్నావు కాబట్టే నిన్ను అందరూ ప్రేమగా ‘జలగన్నా’ అని పిలుస్తున్నారని అర్థమైంది. నువ్వు జనం నుంచి ఏయే పద్ధతుల ద్వారా వాళ్ళ రక్తం పీల్చావో మా పెద్దలు చెబుతుంటే, నాకు లీటర్ రక్తం ఒకేసారి తాగినంత ఆనందం కలిగింది. నీ రక్తం పీల్చుడు చరిత్రని మావాళ్ళు చెప్తే విని తరించాను. అవి నేను మరోసారి నీముందు ప్రస్తావించి తరించాలని అనుకుంటున్నాను. -- ‘రక్తం’తో లింకు వున్న రెండు సంఘటనలను క్రియేట్ చేయడం ద్వారా లాస్ట్ టైమ్ నువ్వు అధికారంలోకి వచ్చావంటగా. -- వచ్చీరాగానే రాజధాని రైతుల రక్తాన్ని పీల్చావంటగా. -- ఐదేళ్ళపాటు దిక్కుమాలిన మద్యంతో జనం రక్తాన్ని జుర్రేశావంటగా. -- రోడ్లు వేయకుండా జనాన్ని హింసించింది, ఆ రోడ్ల కారణంగా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా నీ రక్త దాహాన్ని తీర్చుకున్నావంటగా. -- వందలాది మంది రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం నీ రక్తదాహమేనంటగా. -- పారిశ్రామికవేత్తల రక్తాన్నీ పీల్చి వాళ్ళు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశావంటగా. -- పన్నులతో, ఛార్జీల పెంపుతో, అవినీతి, అక్రమాలతో జనం రక్తాన్ని స్ట్రా వేసి లాగేశావంటగా. -- ఇసుక, గనులు, కొండలు... ఇలాంటి ప్రకృతి వనరులని పీల్చి పిప్పిచేశావంటగా. -- భారీ సంఖ్యలో దాడులు, రక్తపాతాలతో నీ రుధిరదాహం తీర్చుకున్నావంటగా. -- లక్షల కోట్లు అప్పులు చేసి, జనాన్ని రుణగ్రస్థుల్ని చేసి, తరతరాల ప్రజల రక్తాన్ని ఎలా స్వాహా చేశావో తెలిసింది. .... ఇలా చెప్పుకుంటూ వెళ్తే ‘జలగన్న’ రక్త చరిత్రలో ఇంకా ఎన్నో ఎన్నెన్నో హైలైట్స్ తెలుసుకుని తరించాను. నీ దగ్గరకి వచ్చి రక్తం పీల్చడం ఎలా అనే పాఠాలు నేర్చుకోవాలని నాక్కూడా వుందిగానీ, నువ్వు నా రక్తాన్ని కూడా పీల్చేస్తావని భయపడి నీ దగ్గరకి రావడం లేదు.. బైబై జలగన్నా.

 పల్నాటి బొబ్బిలి బ్రహ్మానందరెడ్డి రాకతో మాచర్లలో టిడిపి గెలుపు ఖాయం 

పౌరుషానికి మారు పేరు పల్నాడు. అయితే జగన్ ప్రభుత్వంలో పల్నాడు ప్రాంతాన్ని అన్ని విధాల  దోచుకుంటున్న వారికి తగిన బుద్ది చెప్పడానికి గుంటూరు జిల్లా మాచర్ల నియోజక వర్గ టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి నడుంబిగించారు. పల్నాడు పౌరుషం, ఆత్మాభిమానం నిలువెల్లా నిండి ఉన్న జూలకంటికి జనం జేజేలు కొడుతున్నారు. పల్నాడు ప్రాంతంలో జూలకంటి పేరు చెబితేనే జనం కేరింతలు  కొడుతున్నారు. జూలకంటి మాతృమూర్తి దుర్గాంబ కూడా ఇదే నియోజకవర్గం నుంచి విశేష సేవలందించారు. ఆమె గుడ్ విల్   బ్రహ్మానందరెడ్డి గెలుపుకు దోహదపడనుంది.  1999లో మాచర్ల నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగరడానికి ప్రధాన కారణం దుర్గాంబ. అయితే ఈ సారి కూడా టిడిపి జెండా ఎగరేయడానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లయ్యింది. తల్లిదండ్రులిద్దరూ ఎమ్మెల్యేగా సేవలందించడంతో బ్రహ్మనందరెడ్డికి సానుకూలాంశం. బ్రహ్మానందరెడ్డి  తండ్రి జూలకంటి నాగిరెడ్డి 1972 లో స్వతంత్ర అభ్యర్థిగా మాచర్ల శాసనసభకి పోటీ చేసి విజయం సాధించగా 1983 లో గురజాల నుండి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు , రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతున్న బ్రహ్మానందరెడ్డి  ఈ సారి కూటమి అభ్యర్థిగా గెలుపొందే అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. పల్నాడులో గత 20 ఏళ్ల నుంచి టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేకపోయిన నియోజకవర్గం మాచర్ల. ఇక్కడ పిన్నెల్లి కుటుంబం హవా నడుస్తోంది. ఈ సారి టీడీపీ జూలకంటి బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇవ్వడంతో గెలుపు సునాయసం కానుంది. జగన్ ప్రభుత్వం పట్ల ప్ర జా  వ్యతిరేకత రోజు రోజుకు ఎక్కువ కావడంతో బ్రహ్మానందరెడ్డి గెలుపు ఖాయమని   తేలిపోయింది.పల్నాడు జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో మాచర్ల ఒకటి. మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారంపూడి మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.  1955లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం నుంచి అత్యధికసార్లు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే ఎన్నికయ్యారు. 1955లో మాచర్ల తొలి ఎమ్మెల్యేగా సీపీఐ నేత మండపాటి నాగి రెడ్డి విజయం సాధించారు. 1962లో ముదావత్ కేశవ్ నాయక్ గెలవగా.. 1967లో వెన్న లింగా రెడ్డి గెలిచారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 1972లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన జూలకంటి నాగిరెడ్డి గెలుపొందగా.. 1978లో కాంగ్రెస్ (ఐ) అభ్యర్థి చల్లా నారప రెడ్డి గెలుపొందారు.1983 నుంచి 1999 వరకు మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ హవా నడిచింది. 1985 మినహా మిగతా నాలుగు పర్యాయాలు తెలుగు దేశం పార్టీ అభ్యర్థులే ఇక్కడ గెలుపొందారు. కానీ 2004 నుంచి ఇక్కడ టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. 1983లో కొర్రపాటి సుబ్బారావు విజయం సాధించగా.. 1989లో నిమ్మగడ్డ శివరామ కృష్ణ ప్రసాద్, 1994లో కుర్రి పున్నా రెడ్డి, 1999లో జూలకంటి దుర్గాంబ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 1985లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ సినీ నటుడు , దివంగత నేత  కృష్ణ విజయం సాధించారు.2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పోటీ చేస్తుండగా.. టీడీపీ ఏరి కోరి మరీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డికి టికెట్ కేటాయించింది. జూలకంటి బ్రహ్మానందరెడ్డి తల్లిదండ్రులైన జూలకంటి నాగిరెడ్డి, దుర్గాంబ ఇద్దరూ మాచర్ల ఎమ్మెల్యేలుగా పని చేశారు. నాగిరెడ్డి 1972లో ఇండిపెండెంట్‌గా గెలవగా.. దుర్గాంబ 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి పిన్నెల్లి లక్ష్మారెడ్డిపై గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన జూలకంటి బ్రహ్మానంద రెడ్డి కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బ్రహ్మానందరెడ్డి గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ.. బలమైన అభ్యర్థిని పోటీలో నిలపాలనే ఉద్దేశంతో టీడీపీ ఆయనకు టికెట్ ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో మాచర్ల నియోజకవర్గం పేరు తరచూ వినిపిస్తుంటుంది. ఇక్కడ రెండు కుటుంబాల మధ్యే రాజకీయ పోటీ వుంటుంది... ఇందులో ఒకటి పిన్నెల్లి, మరోటి జూలకంటి కుటుంబం. మరోసారి ఈ రెండు కుటుంబాలకు చెందినవారే బరిలోకి దిగుతుండటంతో  మాచర్ల ప్రజల తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అధికార వైసిపి మళ్లీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టిడిపి జూలకంటి బ్రహ్మానందరెడ్డిని బరిలోకి దింపింది. పల్నాడులో టీడీపీ కంచుకోటగా పిలువబడే మాచర్ల నియోజకవర్గానికి ఇంచార్జ్ గా జూలకంటి బ్రహ్మనందరెడ్డిని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. బ్రహ్మానందరెడ్డికి  బాధ్యతలు అప్పగించడంతో కార్యకర్తలు, నాయకులు  అప్పట్లో పండుగ చేసుకుంటున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సమర్థవంతంగా ఢీకొట్టాలంటే, అందుకు సరైనోడు జేబీఆర్ మాత్రమేనని టీడీపీ అధిష్టానం కూడా భావిస్తోంది. రెండేళ్ల క్రితం  మాచర్ల నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జిగా నియమితులైన బ్రహ్మానందరెడ్డి  అటు పార్టీకి ఇటు ప్రజలకు విశేష సేవలందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి గెలుపును కన్ఫర్మ్ చేశారు. 

ఏపీలో అధికారం కూటమిదే.. తేల్చేసిన బీజేపీ

ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టబోయేది ఎవరో బీజేపీ తేల్చేసింది. రాష్ట్రంలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,  కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచరుడు అయిన సునీల్ బన్సల్ పేర్కొన్నారు. బీజేపీకి అందిన నివేదిక ప్రకారం ఏపీలో తెలుగుదేశం కూటమి 145 అసెంబ్లీ, 23 లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తుందన్నారు. కూటమి ప్రభంజనం ముందు వైసీపీ ఫ్యాన్ కొట్టుకు పోతుందని5 పేర్కొన్నారు.  సునీల్ బన్సల్ చెప్పిన సంఖ్యలు ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై వెలువడిన సర్వేలను మించి ఉన్నాయి. ఇప్పటి వరకూ ఎపీ ఎన్నికలపై దాదాపు 11 సర్వేలు వెలువడ్డాయి. దాదాపు అన్ని సర్వేలూ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభంజనం సృష్టించబోతున్నదనే చెప్పాయి. ఇప్పుడు తాజాగా సునీల్ బన్సల్ కూడా అదే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పటికీ వైసీపీ కానీ, ఆ పార్టీ అధినేత జగన్ కానీ బీజేపీపై చిన్న పాటి విమర్శకూడా చేయడం లేదు. అదే సమయంలో తెలుగుదేశం, జనసేనలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ చేసిన ప్రకటనను ఎత్తి చూపుతూ రాష్ట్రంలో చంద్రబాబు ముస్లింలను దగా చేయడానికి రెడీ అయిపోయారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.  పొత్తులో భాగంగా ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం 144, బీజేపీ 10. జనసేన 21 స్థానాలలో పోటీ చేస్తున్నాయి. వీటిలో 145 స్దానాలలో కూటమి అభ్యర్థులే జయకేతనం ఎగురవేస్తున్నట్లుగా తమకు నివేదిక అందిందని సునీల్ బన్సల్ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా పోటీలో ఉంది. అంటే మిగిలిన 30 స్ఖానాలనూ వైసీపీ కాంగ్రెస్ లు పంచుకుంటాయని భావించాల్సి ఉంటుంది. అంటే ఎలా చూసుకున్నా వైనాట్ 175 అన్న ధీమా వ్యక్తం చేసిన జగన్ పార్టీకి 30 కంటే తక్కువ స్థానాలే వస్తాయని సునీల్ బన్సల్ చెబుతున్నారు. ఇక  లోక్ సభ స్థానాలైతే మరీ కనాకష్టంగా రెండు కంటే తక్కువ వస్తాయని బీజేపీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. సునీల్ బన్సల్ ప్రకటనపై వైసీపీ స్పందన ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది. 

జగన్ బ్యాండేజీ తీసేశారు.. సెప్టిక్ భయమే కారణమా?!

జగన్ గులకరాయి దాడిలో గాయపడి రెండు వారాలుగా కంటికి వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఎట్టకేలకు తీసేశారు. హఠాత్తుగా ఆయన బ్యాండేజీ తీయడానికి ఆయన బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత సెప్టిక్ అవుతుంది జాగ్రత్త అన్నయ్యా అని చేసిన హెచ్చరికే కారణమా? అంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. మేమంతా సిద్ధం అంటూ ఆయన చేపట్టిన బస్సుయాత్ర విజయవాడలో సాగుతున్న సమయంలో ఆయనపై రాయి దాడి జరిగింది. ఆ దాడిలో ఆయన కంటి పైభాగాన గాయమైంది.   ఆ దాడిని హత్యాయత్నంగా అభివర్ణిస్తూ సెంటిమెంట్ ను పండించి ఎన్నికల గండం గట్టెక్కాలని వైసీపీ విశ్వ ప్రయత్నం చేసింది. కోడికత్తి దాడిలా ఈ దాడి కూడా జగన్ పై ప్రజలలో సానుభూతి పొంగి పొర్లిపోయి ఓట్లు రాలుస్తుందని భావించింది. అయితే వైసీపీ ప్రయత్నం నవ్వుల పాలైందది. జగన్ ప్రతిష్ఠ దిగజారింది. ఆ దాడి జగన్ చేత జగన్ కోసం జగనే చేయించుకున్న దాడి అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. వాటిని వేటినీ పట్టించుకోకుండా ఆ దాడి హత్యాయత్నమేననీ, దీని వెనుక ఉన్నది చంద్రబాబు, తెలుగుదేశమేననీ వైసీపీ నేతలు జనాలను నమ్మించడానికి శతధా ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ దాడి కేసులో తెలుగుదేశం నేతను ఇరికించడానికి చేసిన ప్రయత్నమూ విఫలమైంది. దాడి విషయంలో భద్రతా వైఫల్యం ఏమీ లేదనీ, పోలీసుల వైఫల్యం అస్సలు లేదనీ ప్రభుత్వ సలహాదారు మీడియా ముందుకు వచ్చి మరీ నెత్తీ నోరూ బాదుకుని చెప్పారు. అయినా  ఎన్నికల సంఘం నమ్మలేదు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ కమిషనర్ ఆఫ్ పొలీస్ పై బదలీ వేటు వేసింది. ఎన్నికలకు సంబంధం లేని విధులను కేటాయించాల్సిందిగా ఆదేశించింది.  దీంతో జగన్ పరిస్థితి వ్రతమూ చెడింది, ఫలితమూ దక్కలేదన్నట్లు తయారైంది. దానికి తోడు కుట్లు పడేలా అయిన గాయానికి బ్యాండ్ ఎయిడ్ తో జనం ముందుకు వచ్చి ఏదో కాస్తయినా సెంటిమెంటును పిండుకుందామనుకున్నారు. అయితే గాయం తగిలిన వెంటనే వేసిన బ్యాండ్ ఎయిడ్ కూ డాక్టర్ల బృందం చికిత్స తరువాత వేసిన బ్యాండ్ ఎయిడ్ కు సైజులో వ్యత్యాసం ఉండటంతో జగన్ గాయంపై నెటిజన్లు సెటైర్లు వేశారు.   ఆ ట్రోలింగ్ రోజురోజుకూ పెరుగుతుండటం కారణమో, వైద్యులు సరైన సలహా ఇవ్వలేదా? బ్యాండేజీ ఎక్కువ రోజులు ఉంటే గాయం మానదు, సెప్టిక్ అవుతుంది జాగ్రత్త అంటూ డాక్టర్ సునీత చేసిన హెచ్చరికతో భయపడో తెలియదు కానీ జగన్ మొత్తానికి శనివారం బ్యాండ్ ఎయిడ్ లేకుండా దర్శనమిచ్చారు. సరే ఇక్కడ విశేషం ఏమిటంటే రాయిదాడిలో తగిలిన గాయానికి కొన్ని కుట్లు కూడా పడ్డాయని చెప్పుకున్న జగన్ రెండు వారాల తరువాత ఆ బ్యాండ్ ఎయిడ్ తీసేసిన తరువాత గాయం జరిగిన ప్రాంతంలో చిన్న మచ్చ, గీత కూడా లేకపోవడం విశేషం. ఈ జగన్మాయ ఏమిటి ముఖ్యమంత్రిగారూ అంటూ సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.  

పిఠాపురంలో పవన్ కు మద్దతుగా చిరు ప్రచారం? మెగా హీరోలందరూ కూడా!

రాష్ట్రంలోని హాట్ సీట్లలో ముందుగా చెప్పుకోవలసింది జనసేన అధినేత పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా వంగా గీత రంగంలో ఉన్నారు. జనసేనాని ఓటమే లక్ష్యంగా జగన్ ఈ నియోజకవర్గ బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డిలకు అప్పగించారు. ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అయితే గతంలోలా కాకుండా పవన్ కల్యాణ్ ఇప్పుడు తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారాన్ని పర్యవేక్షించడంతో పాటు తాను కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ రోడ్ షోలతో జనాలకు దగ్గరౌతున్నారు. చంద్రబాబుతో కలిసి రాష్ట్రంలోని బహిరంగ సభలలో పాల్గొనేందుకు మాత్రమే జనసేనాని నియోజకవర్గం వదిలి వెడుతున్నారు. అలా నియోజకవర్గంపై పూర్తి దృష్టి కేంద్రీకరించి విజయమే లక్ష్యంగా అగుడులు వేస్తున్నారు. అలాగే సినీ పరిశ్రమకు చెందిన పలువురు కూడా జనసేనాని గెలుపు లక్ష్యంగా పిఠాపురంలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. జబర్దన్ కమేడియన్లు ఆది, గెటప్ శ్రీను, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ తదితరులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే మెగా హీరో వరుణ్ తేజ్ కూడా శనివారం నియోజకవర్గంలో తన చిన్నాన్న తరఫున ప్రచారం చేశారు.  ఇవన్నీ ఒకెత్తైతే మెగాస్టార్ చిరంజీవి త్వరలో పిఠాపురంలో  పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేయనుండటం కూటమికి గట్టి బలం కానుంది. అయితే చిరంజీవి ప్రచారానికి వస్తారా అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి. చాలా కాలంగా చిరంజీవి రాజకీయ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నది లేదు. ఏవో సినిమాలలో రాజకీయాలను నేను వదిలినా అవి తనను వదలడం లేదన్న డైలాగులు వినా చిరంజీవి ప్రత్యక్షంగా రాజకీయ ప్రసంగాలు చేసిన సందర్భం కూడా లేదు. అయితే ఇటీవల మాత్రం చిరంజీవి బహిరంగంగా కూటమి అభ్యర్థి సీఎం రమేష్ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ కు మద్దతుగా చిరు ప్రచారం చేయడం ఖాయమని మెగా అభిమానులు గట్టిగా చెబుతున్నారు. చిరు ప్రచారంతో పిఠాపురంలో జనసేనానికి ఇక తిరుగే ఉండదని అంటున్నారు. చిరు ప్రచారం ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూటమికి పెద్ద బూస్ట్ అవుతుందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద రానున్న రోజులలో సినీ రంగం నుంచి పలువురు ప్రముఖులు, ముఖ్యంగా మెగా హీరోలు జనసేనానికి మద్దతుగా ప్రత్యక్షంగా ప్రచారంలోకి దిగే అవకాశాలున్నాయని అంటున్నారు.   

కేటీఆర్ విశ్వాసం లేని డాష్.. డాష్..!

శనివారం నాడు మాజీ టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. ఈ ఉత్సవం సోషల్ మీడియాలో తప్ప మరెక్కడా జరిగిన దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికే చాలావరకు ఖాళీ అయిపోగా, అక్కడక్కడ మిగిలి వున్న పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్లర్లో కొన్ని లైన్లు పోస్టు చేశారు. తమ పార్టీ పుట్టుక సంచలనం అని, దారిపొడవునా రాజీలేని రణం.. అని ఏవేవో సోత్కర్ష లాంటి పదాలు పోస్టు చేశారు. ఇండియాలో ఎవరూ ఇంకొకరి డబ్బా కొట్టరు.. ఎవరి డబ్బా వాళ్ళే కొట్టుకోవాలి కాబట్టి కేటీఆర్ ట్విట్టర్లో సొంతడబ్బా కొట్టుకున్నారని అనుకోవచ్చు. కానీ ఆయన అందులో వాడిన ఒక వాక్యం చూస్తుంటే, కేటీఆర్ని విశ్వాసం లేని డాష్.. డాష్ అన్నా తప్పులేదని అనిపిస్తోంది. ఇంతకీ ఆ పదం ఏమిటంటే, ‘పరపీడన చెర విడిపించిన ఉద్యమ జెండా’.. ఈ పదం రాయడానికి సిగ్గు లేకుండా అయినా వుండాలి.. లేదా బుద్ధి అయినా లేకుండా వుండాలి. కేటీఆర్ తండ్రి రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినప్పుడు తెలుగువాళ్ళందరి మీద అధికారం చెలాయించాడా లేక తెలంగాణ ప్రాంతం మీదే అధికారం చెలాయించాడా? తెలంగాణ ప్రాంతానికి చెందిన మిగతా మంత్రులుగానీ, ముఖ్యమంత్రులుగానీ తెలంగాణ ప్రాంతం మీదే అధికారం చెలాయించారా? బ్రిటీష్ వాళ్ళ మీద ఉపయోగించిన ‘పరాయి పాలన’ అనే పదాన్ని తోటి భారతీయుల మీద ఉపయోగించడమంత దుర్మార్గం మరొకటి వుండదు. అలాంటి దుర్మార్గాలు ఎన్నో చేసిన పాపం మూటగట్టుకుంది కేసీఆర్ ఫ్యామిలీ.  మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ రాష్ట్రమంతా తుడిచిపెట్టుకునిపోయింది. ఆ పార్టీకి హైదరాబాద్‌లో ఒక్క స్థానం తప్ప అన్ని స్థానాలు దక్కాయి. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రావాళ్ళు ఓట్లు వేయబట్టే బీఆర్ఎస్ పరువు హైదరాబాద్‌లో అయినా మిగిలింది. తెలంగాణ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో వున్న తెలంగాణ స్థానికులు అందరూ బీఆర్ఎస్‌ని బొందపెడితే, హైదరాబాద్‌లో తమ పార్టీ పరువు నిలిపింది ఆంధ్రావాళ్ళేననే విశ్వాసం కూడా లేని డాష్ డాష్ కేటీఆర్‌కి పార్లమెంట్ ఎన్నికలలో ‘పరాయి’ వాళ్ళు బుద్ధి చెబుతారు.

నిప్పుల కుంపటి తెలంగాణ!

వచ్చే నాలుగు రోజులు తెలంగాణ నిప్పుల కుంపటిగా మారబోతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర  ప్రాంతాలు నిపుల గుండంగా మారనున్నాయని పేర్కొంది.  మొత్తంమీద ఈ నాలుగు రోజులూ రాష్ట్రంలో సాధారణం కంటే ఐదు నుంచి ఆరు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. మండే ఎండలకు తోడు వేడి గాలులు కూడా వీస్తాయనీ, వడదెబ్బ ప్రమాదం హెచ్చుగా ఉంటుందనీ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉంటే మేలని పేర్కొంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉంటాయనీ, ఉక్కపోత తీవ్రత ఎక్కువ అవుతుందని తెలిపింది.   ఇక వచ్చే నెలలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.  ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకూ నమోదౌతున్నాయనీ, రానున్న రోజులలో ఇవి 50 డిగ్రీలకు చేరే అవకాశాలున్నాయనీ పేర్కొంది.   

వైసీపీ నేతల నుంచే లక్ష్మీనారాయణకు ముప్పు!

విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో వున్న జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్‌పీ) అధ్యక్షుడు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణకు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని వుందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన విశాఖ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్‌ని కలసి ఆయన వినతిపత్రం సమర్పించారు. తన ప్రాణాలకు వైసీపీ నాయకుల నుంచి ముప్పు వుందని, తనకు ఎలాంటి హాని జరిగినా నంబాల రాజేష్ కుమార్, విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కేకే రాజు బాధ్యులని లక్ష్మీనారాయణ ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. నంబాల రాజేష్ కుమార్, వీవీ రాజు, గాలి జనార్దనరెడ్డి కలసి వున్న ఫొటోను కూడా ఈ సందర్భంగా ఆయన పోలీసులకు అందించారు. ‘‘నేను సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా వున్న సమయంలో అనధికార మైనింగ్ విషయంలో గాలి జనార్దనరెడ్డిని విచారించాను. ఆ సమయంలో గాలి జనార్దనరెడ్డికి సన్నిహితుడిగా ప్రచారంలో వున్న నంబాల రాజేష్‌కుమార్ కూడా విచారణను ఎదుర్కొన్నారు. ‘నా బాస్ గాలి జనార్డనరెడ్డిని లక్ష్మీనారాయణ చాలా ఇబ్బంది పెట్టారు. ప్రతీకారం తీర్చుకుని మా బాస్‌కి బహుమతి ఇస్తాను. నాకు కేకే రాజు అండగా వుంటారు’ అంటూ ఇటీవల జరిగిన ఓ సమావేశంలో నంబాల రాజేష్ అందరి ముందూ బాహాటంగానే మాట్లాడారు’’ అంటూ లక్ష్మీనారాయణ తన వినతిపత్రంలో పేర్కొన్నారు. లక్ష్మీనారాయణకు ఏదైనా ముప్పు ఏర్పడకముందే పోలీసులు స్పందించాల్సిన అవసరం వుంది.

ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు 

పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వం  బార్లు, రెస్టారెంట్లలో  అక్రమంగా కార్యకలాపాలు  నిర్వహిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపింది.  బిఆర్ఎస్ హాయంలో యదేచ్చగా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న వారిని ముచ్చెమటలు పట్టిస్తోంది.   బేగంపేటలోని ప్రముఖ ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ను ఎక్సైజ్ అధికారులు రద్దు చేశారు. లైసెన్స్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బార్ లో నిబంధనలకు విరుద్ధంగా యువతుల చేత ఆశ్లీల నృత్యాలు చేయించడం, యువకులను రెచ్చగొట్టడం, చెవులు చిల్లులు పడే డీజే శబ్దాల హోరులో మద్యం తాగుతూ చిందులు వేయడం వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 3న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపారు. ఆ సందర్భంగా బార్ నిర్వాహకులతో పాటు మొత్తం 107 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 30 మంది యువతులు, 60 మంది యువకులు, 17 మంది నిర్వాహకులు ఉన్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ కేసును బేగంపేట పోలీసులకు అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన బేగంపేట పోలీసులు బార్ లో అశ్లీల కార్యకలాపాలు జరుగుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా బార్ ను నిర్వహిస్తున్నారని నిర్ధారించారు. ఆధారాలు సహా ఎక్సైజ్ శాఖ అధికారులకు నివేదికను ఇచ్చారు. ఈ క్రమంలో ఊర్వశి బార్ లైసెన్స్ ను ఎక్సైజ్ శాఖ అధికారులు రద్దు చేశారు.

ఎన్నికల ప్రచారంలో విక్టరీ వెంకటేష్

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి వేసవి ఎండలను మించిపోయింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తై పోలింగ్ ఇక రోజుల వ్యవధిలోకి రావడంలో పార్టీలూ, పోటీలో ఉన్న అభ్యర్థులూ తమ ప్రచారాన్ని మరింత హోరెత్తించడానికి సమాయత్తమౌతున్నారు. పార్టీల అధినేతలు రోడ్ షోలు, భారీ బహిరంగ సభలతో ప్రచారంలోకి దూసుకుపోతున్నారు. సహజంగా తమ ప్రచారానికి సినీగ్లామర్ ను కూడా జోడించాలని సినీ పరిశ్రమతో సంబంధాలు, బంధుత్వాలు ఉన్న అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే టాలీవుడ్ కు చెందిన ప్రముఖులను ప్రచారంలోకి దింపుతున్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా తమ బంధువులు, స్నేహితుల కోసం ప్రచారం చేయడానికి ముందుకు వస్తున్నారు.  ఇందులో భాగంగానే చీరాల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న ఎంఎం కొండయ్యయాదవ్ తరఫున నటుడు నిఖిల్ సిద్ధార్థ  ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్ షోలో కూడా పాల్గొని తెలుగుదేశం కూటమి అభ్యర్థికి ఓటేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు. ఇక పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ కోసం ప్రచారం చేసేందుకు పలువురు నటులు రంగంలోకి దిగారు. ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్, కమేడియన్ ఆది తదితరులు పిఠాపురంలో మకాం వేసి జనసేనాని తరఫున ప్రచారం చేస్తున్నారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా తన బాబాయ్ పవన్ కల్యాణ్ కు మద్దతుగా శుక్రవారం పిఠాపురంలో సందడి చేశారు. రానున్న రోజులలో మెగా హీరోలంతా కూడా పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది. అలాగే మెగా హీరో చిరంజీవి కూడా పవన్ కల్యాణ్ కు మద్దతుగా పిఠాపురంలో ప్రచారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి.  అదే విధంగా సాధారణంగా రాజకీయాలకూ పూర్తిగా దూరంగా ఉండే వెంకటేష్ కూడా ఈ సారి ఎన్నికల ప్రచార రంగంలో  కీలకంగా వ్యవహరించనున్నారు. ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పోటీలో ఉన్న తన బంధువుల తరఫున ప్రచారంలో పాల్గొననున్నారు. తెలంగాణలో ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన వియ్యంకుడు రామసహాయం రాఘవ రెడ్డి తరఫున వెంకటేష్ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని కైకులూరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివస్ తరఫున కూడా వెంకటేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కామినేని శ్రీనివాస్ వెంకటేష్ సతీమణి నీరజకు స్వయాన మేనమామ. దీంతో తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల బరిలో నిలిచిన తన సమీప బంధువుల తరఫున వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. 

ఎపిలో పించన్ల పంపిణీ పట్ల  కేంద్రఎన్నికల సంఘం అసంతృప్తి 

పించన్ల పంపిణీ విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల కేంద్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు తగిన మార్గదర్శకాలను సూచించింది పింఛన్ దారులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పెన్షన్లను అందించాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించింది. పింఛన్ సహా, నగదు బదిలీ పథకాలకు సంబంధించి మార్చి 30న జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. తమ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి స్పష్టం చేసింది. పెన్షన్ల పంపిణీకి శాశ్వత ఉద్యోగులకు మాత్రమే వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇంటింటికీ పెన్షన్లను పంపిణీ చేసేందుకు వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఆదేశించింది. పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. లబ్ధిదారులు కూడా చాలా ఇబ్బందులకు గురైనట్టు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. శాశ్వత ఉద్యోగులు, ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయవచ్చని గత మార్గదర్శకాల్లోనే సూచించామని తెలిపింది.

హరీష్‌రావు రాజీడ్రామాలు చూసి జనం నవ్వుతున్నారు!

తెలంగాణలో అధికారం కోల్పోయిన షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోని తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్ గత కొన్ని రోజులుగా జనంలోకి వచ్చి ఆడుతున్న డ్రామాలు చూస్తూ జనం ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్రెడీ కొద్దిరోజులు తండ్రి, అన్నలతో కలసి డ్రామాలాడిన బాలనటి కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో రెస్టు తీసుకుంటోంది. ఇప్పుడు ఈ డ్రామా కంపెనీలోకి మరో ఛైల్డ్ ఆర్టిస్టు ఎంటరయ్యాడు. ఆ డ్రామా ఆర్టిస్టు మరెవరో కాదు... కేసీఆర్ ముద్దుల మేనల్లుడు హరీష్ రావు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ఫ్యామిలీ ఎన్ని డ్రామాలు ఆడినా, ఉద్యమ స్ఫూర్తితో వున్న జనం నమ్మారు. ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణ కోసమే కదా అని క్షమించారు. పదేళ్ళు అధికారంలో అహంకారంతో వ్యహరించినప్పుడు సమయం కోసం వేచి చూశారు. ఆ సమయం రాగానే గద్దె దించారు. అహంకారం, డ్రామాలు ఎప్పుడూ పనికిరావన్న విషయాన్ని తెలుసుకోలేని ఈ కుటుంబం ఇంకా తమ పంథా మార్చుకోకుండా జనంలో పరువు పోగొట్టుకుంటోంది. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఆగస్టు 15వ తేదీ లోపల చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను పట్టుకుని హరీష్ రావు డ్రామా క్రియేట్ చేశాడు. రేవంత్ రెడ్డి తాను చెప్పినట్టు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరాడు. అయితే రాజీనామా లేఖ రెడీగా పెట్టుకో, ఆగస్టు 15 తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా వుండు అని రేవంత్ రెడ్డి చెప్పడంతో హరీష్ రావు ఆత్మరక్షణలో పడ్డాడు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తే తాను తట్టాబుట్టా సర్దుకోవాల్సి వస్తుందని అర్థం చేసుకుని వెంటనే ప్లేటు తిప్పేశాడు. అయితే, నేను నా రాజీనామా లేఖ అమరవీరుల స్థూపం దగ్గరకి తెస్తా.. నువ్వూ నీ రాజీనామా లేఖ తీసుకుని  శుక్రవారం నాడు అక్కడకి రా అని సవాల్ విసిరాడు. ముఖ్యమంత్రి హోదాలో వున్న వ్యక్తి రాజీనామా లేఖ తీసుకుని అమరవీరుల స్థూపం దగ్గరకి వస్తాడా? కేసీఆర్ గవర్నమెంట్ అధికారంలో వున్నప్పుడు అలా ఎప్పుడైనా వచ్చిన దాఖలాలు వున్నాయా? ముఖ్యమంత్రి పరామర్శించాల్సిన సందర్భాల్లో అయినా ఆయన వెళ్ళిన చరిత్ర వుందా? వాళ్ళు మాత్రం ముఖ్యమంత్రి రాజీనామా లేఖ పట్టుకుని వాళ్ళు చెప్పిన దగ్గరకి రావాలి. ముఖ్యమంత్రి ఎలాగూ రాడని తెలుసు, శుక్రవారం నాడు హరీష్ రావు అమరవీరుల స్థూపానికి ఏదో ముక్కుబడిగా నాలుగు పూలు చల్లేసి, ఒక నమస్కారం పారేసి సీఎం అక్కడకి రాలేదని ఫీలయ్యారు. స్పీకర్‌కి రాసిన రాజీనామా లేఖను అక్కడే వున్న మీడియా వాళ్ళకి ఇచ్చారు. రాజీనామా లేఖ అంటే స్పీకర్ ఫార్మాట్లో వుండాలి. తనకు చేతికి వచ్చినట్టు రాసి ఇదే రాజీనామా లేఖ అనుకో అంటే కుదరదు. హరీష్ రావు తన రాజీనామాలో ఏదేదో చేట భారతం అంతా రాశారు. ప్రస్తుతానికి ఇలా చేటభారతం రాజీనామా లేఖ రాశానని, రుణ మాఫీ చేశాక స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ ఇస్తానని, ఆ తర్వాత ఉప ఎన్నికలో పోటీ కూడా చేయనని ప్రకటించారు. ఈ తిరకాసు వ్యవహారమంతా ఎందుకు? ఆ ఇచ్చేదేదో స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా లేఖ ఇవ్వచ్చుగా..  మొన్నటి వరకు ‘ఆగస్టు 15 లోగా 2 లక్షల రైతు రుణ మాఫీ’ అనే పాయింట్ మీదే హడావిడి చేసిన హరీష్ రావు.. ఇప్పుడు అమరవీరుల స్థూపం దగ్గర ఇంకా ఏవేవో అంశాలను ప్రస్తావించి ఇవన్నీ నెరవేరిస్తేనే నా రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో ఇస్తా అని మెలిక పెట్టాడు. రాజీనామా చేసే దమ్ము లేనప్పుడు రాజీనామా సవాళ్ళు విసరసం ఎందుకు.. ఇప్పుడు రాజీనామా గండం నుంచి బయటపడటానికి పనికిరాని నాటకాలన్నీ ఆడటం ఎందుకు? రేపు ఆగస్టు 15 లోపు సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీని చేయడంతోపాటు ఇంకెన్ని హామీలను అమలు చేసినా హరీష్ రావు ఏదో మెలికో, తిరకాసో పెట్టి రాజీనామా చేయకుండా తప్పించుకుంటాడని అందరికీ తెలిసిన విషయమే. ఈ మనుషులు ఎప్పటికి మారతారో!

ప్రచారవ్యూహం లేక వైసీపీ మల్లగుల్లాలు.. జగన్ చేతులెత్తేశారా?

ఎప్పుడైనా ఎన్నికల వేళకి అధికార పార్టీలో  ఒక స్పష్టత ఉంటుంది. అధికారంలో ఉన్న కాలంలో చేసిన అభివృద్ధీ, ప్రజలకు అందించిన సంక్షేమం వివరించి ఓట్లు అడగడానికి వెసులుబాటు ఉంటుంది. అయితే వాస్తవంగా అధికారంలో ఉన్న కాలంలో అభివృద్ధి సంక్షేమాలపై ప్రభుత్వం ప్రజలమెప్పు పొందిందా లేదా అన్నది ఓటర్లు తమ ఓటు ద్వారా తీర్పు ఇస్తారు. అది వేరే సంగతి. కానీ అధికారంలో ఉన్న పార్టీకి మాత్రం ప్రచారం చేసుకునే విషయంలోనూ, పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ విపక్షం కంటే ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. అలాగే అసమ్మతి బెడదా తక్కువ ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి పూర్తి రివర్స్ లో ఉంది. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీలో గాభరా కనిపిస్తోంది. ఓటమి తప్పదన్న బెదురు కానవస్తోంది. అదే సమయంలో విపక్షంలో ధీమా కనిపిస్తోంది. జనం మావైపే ఉన్నారన్న భరోసా కానవస్తోంది. ఇందుకు కారణాల గురించి చెప్పుకునే ముందు విపక్షంగా తెలుగుదేశం ఓంటరిగా పోరు చేయడం లేదు. జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగింది. అలాంటి సమయంలో భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటు, ఆ సర్దుబాటు కారణంగా అనివార్యంగా కొన్ని త్యాగాలకు సిద్ధపడటం, అందు వల్ల ఆశించిన సీటు దక్కక నేతల్లో పెచ్చరిల్లే అసంతృప్తి ఇన్నిటిని సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీ ఆ ఇబ్బందులు, ఇరకాటాలన్నిటినీ అలవోకగా దాటేసింది. అదే సమయంలో అధికారంలో ఉండటం చేత ఉన్న సానుకూలాలన్నిటినీ వైసీపీ చేజేతులా ప్రతికూలంగా మార్చేసుకుంది.  అందుకే  ఏపీలో  జనసేన, బీజేపీలతో పొత్తు కుదుర్చుకుని, సీట్ల సర్దుబాటు చేసుకుని, ఆ కారణంగా పార్టీలో తలెత్తిన అసమ్మతిని బుజ్జగించి పార్టీలో అసంతృప్తి అనవాలే లేకుండా చేసుకుని ధీమాగా కనిపిస్తుంటే.. అధికార వైసీపీలో  మాత్రం ఆందోళన, గందర గోళం కనిపిస్తోంది.  పార్టీ టికెట్ లభించిన అభ్యర్థులు ధైర్యంగా ప్రజలలోకి వెళ్లి ప్రచారం చేసుకోలేని పరిస్థితి కానవస్తోంది. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ బస్సు యాత్రకు సైతం జనం స్పందన కానరాక పార్టీలో  ఓటమి భయం కనిపిస్తోంది.  ఏపీలో పోలింగ్ తేదీ మే 13. అంటే మరో 17 రోజులలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికీ వైసీపీ ప్రచారం జోరందుకోలేదు. విరామాలతో సాగిన జగన్ బస్సు యాత్ర తప్ప అధికార పార్టీ ప్రచారం జోరు పెంచింది లేదు. మరో వైపు తెలుగుదేశం కూటమి మాత్రం ప్రచారం జోరు పెంచింది. తెలుగుదేశం, జనసేన అధినేతలు ఉమ్మడి ప్రచారంతో పాటుగా ఎవరికి వారుగా కూడా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. వారి ఎన్నికల ప్రచార సభలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు.  అధికార వైసీపీ మాత్రం ప్రచార వ్యూహం లేక మల్లగుల్లాలు పడుతోంది. పరిస్థితి చూస్తుంటే అధికార పార్టీ అధినేతలో గెలుపు ధీమా కాగడాపెట్టి వెతికినా కూడా కనిపించడం లేదని పరిశీలకలుు విశ్లేషిస్తున్నారు. ఫలితం  తెలిసిపోయిన తరువాత ఇంక చేసేదేముంది అని చేతులెత్తేసినట్లుగా జగన్ తీరు ఉందంటున్నారు. 

న్యూట్రల్ ఓటును కూడా కూటమికి దఖలు పరిచేసిన జగన్

నిజానిజాల సంగతి పక్కన పెడితే ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల ప్రచారాలు కోటలు దాటేస్తాయి. పార్టీలు, నేతలు చెప్పేది ఏది నిజం, ఏది అబద్ధం అన్నది వేరే విషయం. ఎవరి మాటలను జనం విశ్వసిస్తున్నారు. ఎవరి మాటలను నమ్మడం లేదు అన్నది జనం ఓటుతో చెప్పే వరకూ అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ ఎవరికీ తెలియదు.   అయితే  సర్వేలు మాత్రం ప్రజానాడిని పట్టి చూపుతాయి. అందుకే సర్వేల పట్ల అందరిలోనూ సహజంగా ఆసక్తి ఉంటుంది.  అయితే సర్వేలు కూడా నూరు శాతం నిజం అయ్యే అవకాశాలు లేవని ఎన్నికల వ్యూహకర్త, సర్వేలకు పెట్టింది పేరు అయిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే పలు సందర్భాలలో చెప్పారు.    ఎన్నికల వేళ ప్రజల నాడి మారిపోవడానికి ఒక  బలమైన సంఘటన చాలు అని ఆయన గతంలో చెప్పారు.  ఔను నిజమే  రాజకీయాలు ఎప్పుడు చలన రహితంగా, నిశ్చలంగా ఉండవు. అన్నిటికీ మించి రాజకీయ పార్టీల మద్దతు దారులు, కార్యకర్తలు పార్టీల సభ్యులు వారు వారు ప్రాతినిథ్యం వహించే పార్టీలవైపే ఉంటారు అదులో సందేహం లేదు. అయితే ఎన్నికలలో జయాపజయాలను నిర్ణయించేది మాత్రం తటస్థ ఓటర్లు. ఔను న్యూట్రల్ ఓటర్లు ఎటుమొగ్గితే విజయం అటువైపు ఉంటుందన్నది రాజకీయపండితులు చెప్పే మాట.  అయితే ఇప్పుడు వారే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితి ఉందంటున్నారు. ఏపీలో కాగడా పెట్టి వెతికినా తటస్థులు కనిపించడం లేదని విశ్లేషిస్తున్నారు. ఐదేళ్ల జగన్ అస్తవ్యస్త, అరాచక పాలన కారణంగా తటస్థ ఓటరనే వాళ్లు లేకుండా అందరూ జగన్ వ్యతిరేక శిబిరానికి అంటే తెలుగుదేశం కూటమికి జై కొట్టేశారని చెబుతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో వెలువడిన ప్రతి సర్వే కూటమి ఘనవిజయాన్నే సూచిస్తోందంటున్నారు.  ఇక  కొద్దో గొప్పో తటస్థ ఓటర్లు ఉన్నా జగన్ వారిని కూడా తెలుగుదేశం కూటమికి చేరువ చేసేశారని తాజాగా ఆయన తన సొంత చెల్లి చీరపై చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ చెబుతున్నారు. పోలింగ్ కు రోజుల ముందు ఆయన కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల కట్టుకున్న చీర రంగుపై చేసిన వ్యాఖ్యలు తటస్థులను జగన్ కు వ్యతిరేకంగా మార్చేశాయని అంటున్నారు.   అంటే జగన్ తన అనుచిత వ్యాఖ్యలతో, అస్తవ్యస్త పాలనతో తటస్థ ఓటర్లను కూడా కూటమికే జై కొట్టేలా మార్చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కొడాలి నాని, బుగ్గన నామినేషన్లకు ఆమోదం.. నిబంధనలకు విరుద్ధమంటున్న విపక్షం

వైసీపీకి ఇప్పుడు అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి. ఏదీ కలిసిరావడం లేదు. గత ఎన్నికలలో అన్నీ కలిసివచ్చి అందలం దక్కింది. ఈ సారి అన్నీ ఎదురుతిరిగి అధికారం దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. స్వయంగా పార్టీ అధినేత, సీఎం జగన్ రంగంలోకి దిగి బస్సు యాత్ర చేపట్టినా జనంలో స్పందన కనిపించలేదు. చివరాఖరికి సొంత గడ్డ కడపలో కూడా జగన్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కడప జిల్లాలో ఓటర్ మూడ్ ను జగన్ సొంత చెల్లెలు షర్మిల మార్చేశారని అంటున్నారు. అన్న టార్గెట్ గా షర్మిల సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలకు వైసీపీ వద్ద జవాబే లేకుండా పోయిందంటున్నారు.  అదలా ఉంచితే.. వైసీపీ కీలక నేతల నామినేషన్లే తిరస్కరణకు గురయ్యే పరిస్థితి వచ్చింది. విపక్ష నేతలపై అనుచిత భాషా ప్రయోగంతో రెచ్చిపోవడంలో చూపే శ్రద్ధ వైసీపీ నేతలు తమ ఎన్నికల నామినేషన్ల దాఖలుపై చూపలేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రి బుగ్గన,  మాజీ మంత్రి కొడాలి నాని, పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్ రాజ్ దాఖలు చేసిన నామినేషన్ లలో పూర్తి వివరాలు పొందుపరచలేదన్న ఆరోపణలపై వారి నామినేషన్ల ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి బుగ్గన   ఎన్నికల అఫిడవిట్ లో లోపాలు ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన డోన్ ఆర్డీవో ఆయన నామినేషన్ ను పెండింగ్ లో పెట్టారు. బుగ్గన తన అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు పొందుపరచలేదంటూ డోన్  తెలుగుదేశం అభ్యర్థి కోట్ల అభ్యంతరం తెలిపారు. దీంతో బుగ్గన నామినేషన్ ను ఆర్వో పెండింగ్ లో పెట్టి పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా సూచించారు. ఇక గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే.. బూతుల ఎక్స్పర్ట్ గా పేరొందిన కొడాలి నాని అయితే తన ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆధారాలతో సహా విపక్ష నేతలు ఫిర్యాదు చేశారు. కొడాలి తన ఎన్నికల అఫిడవిట్ లో తాను ఎటువంటి ప్రభుత్వ భవనాన్ని వినియోగించలేదని వెల్లడించారు.   అయితే కొడాలి నాని ఎమ్మెల్యే గా  ప్రభుత్వ భవనమైన మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంప్ కార్యాలయంగా వినియోగించారంటూ అందుకు తగ్గ సాక్ష్యాధారాలతో గుడివాడ తెలుగుదేశం నేతలు  రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసారు. భవనాన్ని అద్దెకు ఇచ్చినట్లుగా మున్సిపల్ అధికారులు ఇచ్చిన పత్రాలను ఆధారంగా చూపించారు. దీంతో కొడాలి నాని నామినేషన్ వివాదంలో పడింది.   అయితే కొడాలి, బుగ్గన నామినేషన్లను ఆయా ఆర్వోలు చివరి నిముషంలో ఆమోదించారు. నిబంధనలకు విరుద్ధంగా వారి నామినేషన్లను ఆమోదించడంపై తెలుగుదేశం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టపరంగా ముందుకు వెడతామని చెబుతున్నారు.