చిన్నమ్మ నెగ్గుకొచ్చేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా దుగ్గుబాటి పురేందేశ్వరిని నియమిస్తూ.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును తొలగిస్తారంటూ ఏడాదిగా ప్రచారం జరిగినా.. ఆయన్ని ఇలా తొలగించి.. ఆ పదవిని  అలా పురేందేశ్వరికి  కట్టబెట్టడం చకచకా జరిగిపోయాయి. అయితే చిన్నమ్మ.. ఆ పార్టీ పగ్గాలు చేపట్టి.. ఆ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లగలుగుతారా? అలాగే అధికార  వైసీపీ వై నాట్ 175 కోసం సాగిస్తున్న సోషల్ మీడియా దాడి.. పురేందేశ్వరీని సైతం లక్ష్యంగా చేసుకొంటుందా? ఇప్పటికే.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై సామాజిక మాధ్యమంలో దుష్ప్ర చారానికి జగన్ పార్టీ తెర తీసింది. ఆ జాబితాలో దుగ్గుబాటి పురేందేశ్వరిని సైతం చేరుస్తారా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.    కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉన్నా.. జగన్ పాలన పగ్గాలు చేపట్టి నాలుగున్నరేళ్లు అయింది. ఈ సమయంలో రాష్ట్ర విభజన సమయంలో  ఇచ్చిన హామీలు ఎన్ని అమలు అయ్యాయి. ఇంకా ఎన్ని అమలు కావాల్సి ఉంది. అలాగే మూడు రాజధానులు అంశం అశం,   ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పి ప్రత్యేక ప్యాకేజీలపై పురందేశ్వరి ప్రజలను ఎలా సమాధాన పరుస్తారన్న ప్రశ్నలు సైతం ఉత్పన్నమౌతున్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయిందా అంటే చెప్పే నాథుడే లేరు.  రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల ఆందోళనలు, ధర్నాలు పాదయాత్రలపై  కేంద్రంలోని మోదీ ప్రభుత్వం  ప్రేక్షక పాత్ర వహించిందే తప్ప  జగన్ ప్రభుత్వాన్ని అదిలించి..  ప్రశ్నించింది లేదన్న విషయం అందరికీ తెలిసిందే.  ఇక గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమె.. విశాఖపట్నం నుంచి వరుసుగా రెండు సార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికై.. నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన సమయంలో హస్తం పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీ గుటికి చేరి.. ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట నుంచి లోక్ సభ సభ్యురాలిగా బరిలోకి దిగి.. ఓటమి పాలవుతూ వస్తున్నారు. అలాంటి వేళ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోన్న సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి.. ఈ చిన్నమ్మ నెట్టుకొస్తారా? లేదా అనే ఓ ప్రశ్న అయితే పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.

పెళ్లి కాని ప్రసాదులకు పెన్షన్!

పిల్ల దొరక్క పెళ్లి ఈడు దాటిపోయి... ఒంటరిగా మిగిలిపోయి.. దిగులు పడుతున్న పెళ్లి కాని ప్రసాదులకు హార్యానా ప్రభుత్వం  జిలేబీ లాంటి తీపి కబురు చెప్పింది.  బెండకాయ ముదిరినట్లు ముదిరిపోయిన ఒంటరి మగవారికి ఇకపై ప్రతీ నెల పెన్షన్ ఇచ్చే పథకాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. రాష్ట్రంలో 45 నుంచి 60 ఏళ్ల వయస్సు గల పురుషులు ఈ పథకానికి అర్హులని ఆయన చెప్పారు. ఈ పథకం ద్వారా  రాష్ట్రంలో ఉన్న దాదాపు 2 లక్షల మంది పెళ్లి కాని ప్రసాదులకు లబ్ది చేకూరుతుంది కర్నల్ జిల్లాలో కమలాపూర్ గ్రామంలో ఇటీవల నిర్వహించిన జన్ సంవాద్ కార్యక్రమంలో భాగంగా.. 60 ఏళ్ల వయస్సు ఉండి వివాహ యోగానికి నోచుకోని పురుషులకు పెన్షన్‌ అంశంపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. ముఖ్యమంత్రి కట్టర్‌ సానుకూలంగా స్పందించారు.   అయితే ఇదే కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్‌కు ఇస్తున్న పెన్షన్ మరో 250 రూపాయిలు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో  సీనియర్ సిటిజన్ల పెన్షన్  3 వేల రూపాయిలకు పెరుగుతుంది. పెళ్లి కాని ప్రసాదుల కోసం ప్రభుత్వం త్వరలో అందజేయనున్న ఈ పెన్షన్ ఎంత అనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న పెన్షనే.. వీరికీ ఇవ్వాలన్న అభిప్రాయంతో సీఎం ఉన్నట్లు   ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై త్వరలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు 2024లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని తెరపైకి తీసుకు వచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదీకాక రాష్ట్రంలో మగవారి సంఖ్య  పెరుగుతోంది అయితే  ఆ నిష్పత్తిలో ఆడవారి సంఖ్య పెరగడం లేదు. దీంతో మగవారిలో అవివాహితులుగా మిగిలిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇంకోవైపు దేశంలో భూణ హత్యల జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో హర్యానా కూడా  ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో మహిళల సంఖ్య గణనీయంగా తగ్గిందనే ప్రచారం నడుస్తోంది.   అయితే రాష్ట్రంలో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో.. హిమాచల్‌ప్రదేశ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ మహిళలను బలవంతంగా హర్యానా పురుషులు వివాహం చేసుకున్నారు. అలా  ఇతర రాష్ట్రాలకు చెందిన దాదాపు 1.35 లక్షల మంది మహిళలను.. హర్యానా పురుషులు వివాహం చేసుకొన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఆడపిల్ల సంఖ్యను పెంచే క్రమంలో.. ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏమైనా ఉన్నాయా అంటే.. ఆ విషయంలో ప్రభుత్వ పెద్దలకే ఓ స్పష్టత లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఏపీలో జగన్ వర్సెస్ షర్మిల?

దివంగత వైఎస్సార్ తనయ.. ఏపీ సీఎం జగన్ సోదరి.. షర్మిల.. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం.. ఇప్పుడు ఆమె జగనన్నపై కాంగ్రెస్ సంధించిన అస్త్రం కాబోతోందా? వైసీపీ అధినేత జగన్  జైలులో ఉండగా, పాదయాత్ర చేసిన ఆయన సోదరి షర్మిల అప్పట్లో ప్రతి ప్రసంగంలోనూ తాను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకునే వారు. ఆ తరువాత.. అంటే జగన్ ఏపీ సీఎం అయిన తరువాత  జగన్ ఆ బాణాన్ని పక్కన పెట్టేశారు. అవసరమే లేదన్నట్లుగా వదిలేశారు. పార్టీలో ఇసుమంతైనా ప్రాముఖ్యత ఇవ్వకుండా, ఆమె స్వయంగా పార్టీనీ, రాష్ట్రాన్నీ వీడి పొరుగు రాష్ట్రంలో సొంత కుంపటి పెట్టుకుని రాజకీయాలు చేసుకునే విధంగా తరిమేశారు. సొంత పార్టీని నడిపేందుకు ఆమె ఇబ్బందులు పడుతున్నా ఇసుమంతైనా సహాయం చేయలేదు. దీంతో ఇరువురి మధ్యా పూడ్చలేని అగాధం ఏర్పడింది. ఆ పరిస్థితినే ఇప్పుడు కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నది. జగన్ వైసీపీ ఆవిర్భావంతో కాంగ్రెస్ పార్టీ వైఎస్ బ్రాండ్ ను కోల్పోయింది. ఇప్పుడు షర్మిలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా జగన్ నుంచి ఆ బ్రాండ్ ను  లాగేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది.  ఏపీలో  నామమాత్రంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి జవసత్వాలు తీసుకువచ్చి, కొత్త ఊపిరులూదేందుకు షర్మిల కాంగ్రెస్ కు ఒక ఆయుధంగా కనిపిస్తున్నది.   దివంగత మహానేత వైఎస్‌ ముద్దుల బిడ్డ, వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు, రంగం దాదాపు  సిద్ధమైపోయిందనే అంటున్నారు.  ఇందుకు సంబంధించిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయనీ, షర్మిల కోరినట్లుగా ఆమె తెలంగాణలో పార్టీకి సేవలు అందించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించలేదు. ఆమె ఏపీలోనే పార్టీకి సేవలందించాలని కాంగ్రెస్ విస్పష్టంగా చెప్పేసింది. అవసరమైతే ఏపీ పీసీసీ చీఫ్ గా ఆమెను నియమించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పేసింది. ఇందుకు ఆమె తొలుత ముందు వెనుకలాడినా.. చివరకు అంగీకరించినట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమనీ, అయితే ఎప్పుడు ఎవరి సమక్షంలో చేరుతారన్నదే ఖరారు కావాల్సి ఉందని అంటున్నారు.   వైఎస్‌ ఆత్మ, ఆ కుటుంబంతో విడదీయలేని బంధం ఉన్న కెవిపి రామచంద్రరావు కూడా.. షర్మిల కాంగ్రెస్‌లో చేరుతుందన్న సమాచారం ఉందని చెప్పడాన్ని బట్టి షర్మిల కాంగ్రెస్ లో చేరిక లాంఛనమేననీ, ఇడుపుల పాయలో సోనియా, రాహుల్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని పరిశీలకులు భావిస్తున్నారు.   షర్మిల చేరికతో ఏపీలో కాంగ్రెస్ బలోపేతమౌతుందని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది.  ఆమె రాక వైసీపీని  గట్టిగా దెబ్బతీస్తుందని  కాంగ్రెస్‌ సీనియర్లు నమ్ముతున్నారు.  అన్నిటికీ మించి వైసీపీ అధినేత, సీఎం జగన్ కు  షర్మిల రాక శరాఘాతం కాకతప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సొంత  జిల్లా కడపలో జగన్‌కు సరిసమానమైన ఆదరణ షర్మిలకు ఉందని చెబుతున్నారు. ఆమె రాకతో ఏపీలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతాయని అంచనా వేస్తున్నారు.  

బీజేపీ ఏపీ పగ్గాలు పురంధేశ్వరికి.. వ్యూహమేంటంటే?

తెలుగు  రాష్ట్రాల్లో అధికారం కోసం ప్రయత్నాలు  చేస్తున్న బీజేపీ.. సినీ ప్రముఖుల మద్దతు  కోసం ఉవ్విళ్లూరుతోంది.  ఇందు కోసం ప్రయత్నాలు చేస్తున్నది.  జాతీయ స్థాయిలో బీజేపీకి పలువురు బాలీవుడ్ ప్రముఖలు మద్దతుగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే పలు రాష్ట్రాలలో కూడా  రాష్ట్రాల్లో  కూడా సినిమా తారల మద్దతు ఉన్న సంగతి విదితమే.  అయితే తెలుగు రాష్ట్రాలలో  మాత్రం.. బీజేపీకి సినీ తారల నుంచి మద్దతు  పెద్దగా లేదు.  గతంలో బీజేపీ నేతగా ఉన్న కృష్ణంరాజు.. కేంద్ర మంత్రిగా  కూడా పనిచేశారు. ఇప్పుడు ఆ స్థాయి సినీ ప్రముఖుల మద్దతు బీజేపీకి లేదు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా బీజేపీ అగ్ర నేతలు తెలుగు సినీ ప్రముఖులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.  తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి  పురందేశ్వరిని, తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కిషన్ రెడ్డిల  నియామకం జరిగిన నేపథ్యంలో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కిషన్ రెడ్డి విషయానికి వస్తే.. ఆయనకు సౌమ్యుడిగా పేరుంది. పలువురు సినీ ప్రముఖులతో ఆయన మంచి పరిచయాలే ఉన్నాయి. మరోవైపు దగ్గుబాటి పురందేశ్వరి విషయానికి వస్తే.. సీనియర్ ఎన్టీఆర్ కుమార్తెగా ఆమె కుటుంబానికి సినీ పరిచయాలు ఎక్కువే. ఆమె సోదరుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఆమె తండ్రి స్థాపించిన టీడీపీలో ఉన్నారు. మరోవైపు మరో సోదరుడు హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్‌లు మాత్రం..  ఏ పార్టీ తరఫున యాక్టివ్‌గా లేరు.  జూనియర్ ఎన్టీఆర్ గతంలో టీడీపీ కోసం పనిచేసినా,  ఇప్పుడు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  అయితే పురందేశ్వరి కుటుంబంతో మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌కు స్నేహపూర్వక బంధమే ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పురందేశ్వరి ద్వారా.. సీనియర్ ఎన్టీఆర్ మద్దతుదారులలో కొందరినైనా తమ వైపుకు తిప్పుకోవడంతో పాటు, జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా పార్టీ వైపు తీసుకొచ్చే ప్రణాళికలను బీజేపీ అధిష్టానం రచిస్తున్నదా? అనే చర్చ కూడా సాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయినప్పటి నుంచే.. ఆయనను బీజేపీ  ప్రచారానికి వాడుకోవాలనే ఆలోచనతో బీజేపీ ఉందనే ప్రచారం సాగింది. ఇక  నందమూరి కుటుంబంలోని హీరోలతోనే కాకుండా.. టాలీవుడ్‌లోని ఇతర సినీ ప్రముఖలతో కూడా పురందేశ్వరికి స్నేహపూర్వక సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పురంధేశ్వరి నియామకం వెనుక బీజేపీకి సినీ తారలను పార్టీలోకి ఆకర్షించాలనే వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

నిస్తేజంలో తెలంగాణ బీజేపీ

తెలంగాణ బీజేపీలో నిస్తేజం ఆవరించిందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. రాష్ట్ర బీజేపీలో ప్రక్షాళన పేరిట హైకమాండ్ మంగళవారం (జూలై4) కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తొలగించి ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని నియమించింది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించడంతో ఆయన రానున్న రోజులలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అది పక్కన పెడితే రాష్ట్ర పార్టీలో మాత్రం ఈ మార్పులపై ఎటువంటి స్పందనా కనిపించడం లేదు. వ్యక్తిగతంలో ఖమ్మంలో ఒకరు, నల్గొండ జిల్లాలో ఒకరు తమ అసంతృప్తి వ్యక్తం చేసినా శ్రేణుల్లో ఎటువంటి స్పందనా కనిపించలేదు. బండి సంజయ్ సొంత జిల్లా అయిన కరీంనగర్ లో అయితే తుపాను ముందు ప్రశాంతతలా పరిస్థితి ఉంది. కార్యకర్తలు, నాయకులు ఎవరూ బండి ఉద్వాసనకు నిరసన వ్యక్తం చేయడం కానీ, కిషన్ రెడ్డి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేయడం కానీ కనిపించలేదు. రాష్ట్ర నాయకులలో కూడా బండి తొలగింపుపై స్పందన లేదు, కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడంపై హర్షం లేదు. బీజేపీ సంప్రదాయానికి విరుద్ధంగా బయటి నుంచి వచ్చిన ఈటలకు కీలక పదవి ఇవ్వడంపై కూడా ఎవరూ స్పందించిన దాఖలాలు లేవు. ఈటల మాత్రం మీడియా ముందుకు వచ్చి తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తాననీ, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తాననీ చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో మాత్రం ఎలాంటి ఉత్సాహం, ఉత్తేజం కనిపించడం లేదు. వాస్తవానికి బండి సంజయ్ కు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించిన తరువాత తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు పలు మార్లు బాహాటంగానే చెప్పారు. మోడీ అయితే వేదికపైనే బండి భుజం తట్టి మరీ అభినందనలు తెలిపారు. బండి  ఆధ్వర్యంలో  ప్రజాసంగ్రమ యాత్ర, నిరుద్యోగ దీక్ష, నిరుద్యోగ మార్చ్​ వంటి కార్యక్రమాలు విజయవంతం కావడంతోపాటు అధికార పార్టీకి బీజేపీ దీటుగా ఎదిగింది.  అటువంటి బండి తొలగింపుతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో పార్టీ విజయం పట్ల విశ్వాసం సన్నగిల్లడమే ఈ నిస్తేజానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

బీజేపీది వ్యూహమా? సెల్ఫ్ గోలా?

చదవేస్తే ఉన్న మతి పోయిందన్నట్లుంది తెలుగురాష్ట్రాలలో పార్టీ ప్రక్షాళన పేరుతో బీజేపీ హైకమాండ్ చేసిన మార్పుల వ్యవహారం. రెండు రాష్ట్రాలలోనూ కూడా బీజేపీ హైకమాండ్ కు రహస్య మిత్రులున్నారు. ఆ విషయాన్ని పార్టీ రాష్ట్ర నాయకులకు కూడా తెలియనీయకుండా హైకమాండ్ జాగ్రత్త పడింది. తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి పార్టీ అధిష్ఠానం ఆ రాహస్య మిత్రుల కోసం పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని బలి చేసింది. పార్టీ పరువును గంగలో కలిపేయడానికీ సిద్ధ పడింది. తెలుగురాష్ట్రాలలో పార్టీ భవిష్యత్ ను వదిలేసుకుంది. ఆ రహస్య మిత్రుల విషయం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అయినా బీజేపీ అధిష్ఠానం మాత్రం కళ్లు మూసుకుని పిల్లి పాలు తాగినట్లు వ్యవహరించింది. వ్యవహరిస్తోంది.అదేదో బ్రహ్మరహస్యం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చింది.  ఇంతకీ బీజేపీకి ఉన్న ఆ రహస్య మిత్రులు ఎవరంటే తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో జగన్ నాయకత్వంలోని వైసీపీ అని పరిశీలకులు చెబుతున్నారు. సామాన్య జనం కూడా అదే నమ్ముతున్నారు.  ముందుగా తెలంగాణ విషయం తీసుకుంటే.. బీఆర్ఎస్ ను గద్దె దింపడమే లక్ష్యంగా కమలం పార్టీ కోసం సర్వం ఒడ్డి పోరాడిన బండి వంటి నేతలకు హైకమాండ్ దిమ్మదిరిగేలా షాక్ ఇచ్చింది. పండుగాడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే అన్నట్లుగా రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం ఇక తేరుకోలేనంతగా దెబ్బకొట్టింద. స్వయంగా అధిష్ఠానమే కాళ్ల కింద భూమిని లాగేస్తే.. అందుకోబోతున్న అధికార అందలాన్ని అందకుండా చేస్తే.. ఇక  రాష్ట్రంలో బీజేపీ బలపడేదెలా?  బీజేపీ కోసం అరెస్టులకు, లాఠీ దెబ్బలకు, కేసులకు వెరవకుండా పని చేసిన రాష్ట్ర నాయకులు జనాలకు ముఖం చూపేదెలా అని పార్టీ శ్రేణులే అవేదన వ్యక్తం చేస్తున్నాయి.   బీజేపీ రాష్ట్ర నాయకుడు  బండి సంజయ్  విషయమే తీసుకుంటే.. బండి సంజయ్ పార్టీ రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన తరువాతే తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఆయన కుటుంబ పాలనను, కుటుంబ సభ్యుల అవినీతినీ ప్రతి వేదిక మీదా ఎండగడుతూ.. బీఆర్ఎస్ సర్కార్ కు పక్కలో బల్లెంగా మారారు. ఇప్పుడు ఆ బాధ్యతలను కేంద్ర మంతి కిషన్ రెడ్డికి అప్పగించింది బీజేపీ హైకమాండ్. దీంతో బీఆర్ఎస్ పార్టీకి   ఫస్ట్ టార్గెట్ గా మారిన బండి సంజయ్ ను ఏ రక్షణా లేకుండా పార్టీ హైకమాండ్ బీఆర్ఎస్ కు ఎరవేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బండి సంజయ్ దూకుడు కారణంగానే తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కు దీటుగా ఎదిగింది.  పార్టీకి అధికారంలోకి రాగలమన్న విశ్వాసాన్ని ఇచ్చింది. అయితే బీజేపీ అధిష్ఠానం అనూహ్యంగా తెలంగాణలో బీజేపీ కూర్చున్న కొమ్మనే నరికేసింది.  ఇందుకు జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతన దెబ్బతీయడానికి బీఆర్ఎస్‌తో రహస్య రాజకీయ అవగాహనే కారణమని పార్టీ శ్రేణులే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నాయి. కేసీఆర్ ఒత్తిడి కారణంగానే బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బీజేపీ అధిష్ఠానం తప్పించిందని అంటున్నారు.   ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అసలు ఇంత కాలం ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును కొనసాగించడమే వింత అనుకుంటే.. హఠాత్తుగా ఆయనను తప్పించి ఆ బాధ్యతలను పురంధేశ్వరికి అప్పగించడం మరో వింతగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ అగ్ర నేతలు ఏపీ పర్యటనలకు వచ్చినప్పుడు జగన్ సర్కాన్ ను విమర్శలతో ఎండగట్టడం, హస్తినకు వెళ్లగానే సైలెంట్ అయిపోతుండటం ఇటీవలి కాలంలో చూస్తూనే ఉన్నాం.  రాష్ట్ర పార్టీ  మొత్తం సోము వీర్రాజును వ్యతిరేకిస్తున్నా చర్య తీసుకోకుండా ఇంత కాలం నిమ్మకు నీరెత్తినట్లు బీజేపీ అగ్రనాయకత్వం వ్యవహరించడానికి సోము తీరు ఏపీలో పార్టీకి నష్టం చేసినా అధికారంలో ఉన్న జగన్ కు ప్రయోజనం చేకూర్చేదిగా ఉండటమే కారణమని ఏపీలో ఇంత కాలం విస్తృతంగా చర్చ జరుగుతూ వచ్చింది.  ఇక ఇప్పుడు ఉరుము లేని పిడుగులా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని  ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి అప్పగిం అప్పగించడం ద్వారా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశంతో పొత్తుకు అవకాశాలు లేవన్న సందేశాన్ని బీజేపీ హైకమాండ్ ఇచ్చిందా అన్న అనుమానాలు రాజకీయ సర్కిల్స్ లో వ్యక్తమౌతున్నాయి.  సోము వీర్రాజును తప్పించడం ద్వారా వైసీపీకి బీజేపీ అనుకూలమన్న  ముద్రను తుడిచేసుకోవడం, అదే సమయంలో  జగన్ కు మేలు చేకూర్చే విధంగా పొత్తుకు అవకాశం లేకుండా చేయడం బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహంగా చెబుతున్నారు.  మొత్తం మీద దక్షిణాదిపై ఆశలు వదిలేసుకున్న బీజేపీ.. జాతీయ స్థాయిలో  ప్రయోజనాల కోసం తెలుగురాష్ట్రాలలో పార్టీని బలి చేయడానికి రెడీ అయ్యిందని అంటున్నారు. 

పవన్ పెళ్లిళ్లపై విమర్శలు.. జగన్ పరువుతీసుకున్నట్లేనా?

ఒకప్పుడు రాజకీయాలు వేరు.. ఇప్పుడు రాజకీయాలు వేరు. ఇప్పుడు రాజకీయాలలో ప్రజా పాలన, ప్రజా రక్షణ పక్కన పెట్టి ఒకరి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి.. దాన్నే విమర్శలగా మలచి దాడులు చేయడం పరిపాటిగా మారిపోయింది. ఇలా నేతలు తిట్టి పోసుకుంటుంటే కార్యకర్తలు దీనికి తలా ఒక చేయి వేసి ఆజ్యం పోస్తున్నారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలు గాలికి వదిలేస్తున్నారు. ఒక రకంగా ఇదో రకం డైవర్షన్ పాలిటిక్ లాగా తయారైంది. ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ లో వైసీపీ నేతలు డాక్టరేట్స్ పొందారు. సాక్షాత్తు సీఎం జగన్ నుండి ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా చాలామంది నేతలు ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరిపోయారు. అలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసేందుకు వైసీపీ నేతలు ఎంచుకున్న బాష దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్. అలాగే  ఆయన పెళ్లిళ్లను   హైలెట్ చేయడం. అలా సీఎం జగన్ ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ మాదిరిగా మనం నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేం అంటూ విమర్శలు చేశారు. ఇటీవల పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన జగనన్న అమ్మఒడి నిధుల విడుదల కార్యక్రమంలో కూడా జగన్ మరోసారి సెటైర్లు వేశారు. చంద్రబాబు కోసం ఓ దత్తపుత్రుడు లారీ ఎక్కి ఊగిపోతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఆయనలా మ‌నం రౌడీల్లా తొడ‌లు కొట్ట‌లేం.. బూతులూ తిట్టలేం.. వారిలా న‌లుగురిని పెళ్లి చేసుకుని, నాలుగేళ్ల‌కోసారి భార్య‌నూ మార్చ‌లేం.. పెళ్లి అనే పవిత్ర వ్య‌వ‌స్థ‌ను రోడ్డు మీదికి తీసుకురాలేం.. అవ‌న్నీ ప‌వ‌న్‌కు మాత్రమే సాధ్యం అంటూ సెటైర్లు వేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న భావితరం, స్కూల్ పిల్లలున్న సభలో ఇలా పెళ్లిళ్ల గురించి, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడి విమర్శలు చేయడం కరెక్టేనా అని కొంచెం కూడా ఆలోచన లేకుండా సీఎం జగన్.. పవన్ మీద   నోరు పారేసుకున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ చేసుకున్నది మూడు పెళ్లిళ్లే. అది ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో కూడా ఆయనే పలుమార్లు కామెడీగా చెప్పారు.. సీరియస్ గా హెచ్చరిస్తూ కూడా చెప్పారు. అయినా ఇంకేం లేవన్నట్లు సీఎం స్థాయి వ్యక్తి కూడా దిగజారి ఇలా అదే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. దీంతో ఇప్పుడు జన సైనికులు సీఎం జగన్ టార్గెట్ గా వ్యక్తిగత విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. జగన్ తాతల కాలం నుండి వారి కుటుంబంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారిని ఉదాహరణగా చూపిస్తూ పోస్టులు కుమ్మరిస్తున్నారు.  వైఎస్ రాజశేఖరరెడ్డి తాత వెంకటరెడ్డికి ఇద్దరు భార్యలన్న సంగతి అందరికీ తెలిసిందే. రెండో భార్య సంతతే వైఎస్ రాజారెడ్డి.. వెంకటరెడ్డి మొదటి భార్యకు మనవడే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి. దీన్నే కోడ్ చేస్తూ సీఎం జగన్ ను విమర్శలతో ఏకి పారేస్తున్నారు. ఇక జగన్ సోదరి షర్మిళ విషయాన్ని కూడా సీన్ లోకి తెస్తూ కొందరు   విమర్శలకు దిగుతున్నారు. ఇక, జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా రెండో పెళ్లి సంగతి కూడా ఆయన మరణానంతరం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. వివేకా రెండో పెళ్లితో పాటు ఆయన హత్యను కూడా కలిపి సోషల్ మీడియా వాల్స్ బద్దలయ్యేలా విమర్శలు వినిపిస్తున్నాయి.  ఇక, జనసేన నాయకుల్లో ఒకరైన డాక్టర్ సందీప్ అయితే ఒక టీవీ ఛానెల్ చర్చలో 'జగన్ ఒక్క పెళ్లే చేసుకున్నాడు. మరి ప్రత్యేక హోదా ఏదీ?.. జగన్ ఒక్క పెళ్లే చేసుకున్నాడు.. మరి సీపీఎస్ రద్దు చేశాడా? జగన్ ఒక్క పెళ్లే చేసుకున్నాడు.. మరి ప్రతి ఏడాది జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాడా’.. అంటూ జగన్ వైఫల్యాలను కూడా పెళ్ళితోనే ముడిపెట్టి ఎండగట్టారు. ఇక జనసేన సోషల్ మీడియా ఖాతాలలో అయితే.. ప్రశ్న: ప్రత్యేక హోదా ఎందుకు తేలేకపోయారు? జగన్: పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రశ్న: పోలవరం ఎందుకు కట్టలేకపోయారు?, జగన్: పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు, ప్రశ్న: రాజధాని మాటేంటి? మన రాజధాని ఏది? జగన్: నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రభుత్వ వైఫల్యాలను తూర్పార పట్టేస్తున్నారు. దీంతో జగన్ అడిగి మరీ తిట్టించుకున్నట్లే అయిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

3 నుండి 7 విడతలలో ఏపీలో ఎన్నికలు.. జగన్ స్ట్రాటజీ ఇదేనా?!

ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలి. ఇదే ఇప్పుడు ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ఆలోచన. ఆ మాట కొస్తే అన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసమే కదా. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. ఈసారి ఎన్నికలలో అధికారం దక్కించుకుంటే ప్రతిపక్షాలను పూర్తిగా అణచివేయొచ్చు. రాజధానిని అమరావతి సహా  రాష్ట్రాన్ని తనకి ఇష్టం వచ్చినట్లుగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా టీడీపీని కోలుకోలేని విధంగా దెబ్బకొట్టొచ్చు. తొలిసారి సీఎం కనుక తన పాలనకు వచ్చే ఎన్నికలను రెఫరెండంగా చెప్పుకోవచ్చు. అందుకే జగన్ ఈసారి ఎన్నికలకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహాలలో దేశవ్యాప్తంగా పేరు గాంచిన ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ ను రంగంలోకి దించిన జగన్.. వారి వ్యూహాలకు అనుగుణంగా సోషల్ మీడియాను సిద్ధం చేసుకుంటున్నారు. అంతే కాకుండా ఎలక్షన్ స్ట్రాటజీలో భాగంగా జగన్ మరో వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తుంది. ఏపీలో ఈసారి ఎన్నికలను ఒకే విడతలో కాకుండా 3 నుండి 7 విడతలలో నిర్వహించాలని కోరుతున్నట్లు తెలుస్తుంది. ఇందు కోసమే తాజాగా జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్లు రాజకీయ వర్గాలలో ఒక చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ ఏపీలో ఒకే దశలో ఎన్నికలు జరగగా ఇప్పుడు దశల వారీగా ఎన్నికలు జరపాలని జగన్ కోరుతున్నట్లు కథనాలొస్తున్నాయి. ఒకే దశలో ఎన్నికలు జరిగితే ఎంత అధికారంలో ఉన్నా రాష్టవ్యాప్తంగా పోల్ మేనేజ్ మెంట్   చేయడం కష్టమవుతుంది. అందులోనూ ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటంగా కళ్లకు కడుతున్న పరిస్థితుల్లో ఎంతగా అధికారాన్ని అడ్డుపెట్టుకున్నా ప్రజాగ్రహాన్ని బలప్రయోగంతో అణచివేయడం అంత సులువు కాదు. అదే దశల వారీగా జరిగితే ఒక్కో దశలో జరిగే ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టేందుకు అవకాశం ఉంటుంది. అధికారంలో ఉండే పార్టీలకు, అందునా రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీకి ఇలా దశల వారీ ఎన్నికలతో అడ్వాంటేజ్ ఉంటుంది. దీంతో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే జగన్ ఈ తరహా ప్రతిపాదనను కేంద్రం ముందుంచినట్లు తెలుస్తున్నది.  అయితే, 175 మాత్రమే స్థానాలున్న ఏపీలో ఇలా దశలవారీగా ఎన్నికలు అవసరమా? అసలు ఎన్నికల కమిషన్ ఈ తరహా ఆలోచన చేస్తుందా అంటే ఆ అవకాశం లేకపోలేదు. గత ఏడాది గుజరాత్‌ ఎన్నికలలో రెండు ఫేజ్‌లలో, మణిపుర్‌లో రెండు ఫేజ్‌లలో, యూపీలో 7 ఫేజ్‌లలో ఎన్నికలు జరిగగా.. ఈ మూడు రాష్ట్రాలలో మణిపుర్ ఏపీ కంటే తక్కువ సీట్లున్న రాష్ట్రం. అంతకు ముందు 2021లో 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను 8 ఫేజ్‌లలో నిర్వహించారు. కనుక ఏపీలో విడతల వారీగా ఎన్నికలను నిర్వహించినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.  ఇక ఇప్పుడు ఏపీ  విషయానికి వస్తే 175 సీట్లు ఉండగా మొత్తం  7 విడతలలో పోలింగ్ నిర్వహించాలని వైసీపీ కోరుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ పెద్దలను కలిసిన జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు వారి వద్ద ఒక ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తున్నది. అయితే, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్   బీజేపీ చెప్పినట్లుగా నడుచుకుంటుందా అంటే ఇండియాలో ఏదైనా సాధ్యమేనంటున్నారు పరిశీలకులు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే..  కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నికల కమిషన్ మధ్య ఆ మాత్రం సంబంధాలు ఉండడం సహజమే. అందుకే ఈ మధ్య కాలంలో దేశంలో జరిగిన ఎన్నికలను చూస్తే దాదాపుగా బీజేపీకి సౌలభ్యంగా ఉన్న రోజులలోనే పోలింగ్ జరిగింది. అయితే, ఏపీలో జగన్ మోహన్ రెడ్డి కోరినట్లుగా 7 విడతలలో అంటే కష్టమైన పనే కాగా అందుకు ఈసీ అంగీకరించకపోవచ్చు. కానీ మూడు నుండి ఐదు విడతలలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

పురంధేశ్వరికి బీజేపీ పగ్గాలు.. టీడీపీని కొట్టేందుకా? రాష్ట్రాన్ని గెలిచేందుకా?

బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ పదవుల ప్రక్షాళన చేపట్టింది. ఈ క్రమంలోనే బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఆ పార్టీ అధిష్ఠానం మాజీ సీఎం నందమూరి రామారావు కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించింది. ఇప్పటి వరకు పురంధేశ్వరి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగానే కాకుండా ఒడిశాకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా కూడా వ్యవహరింారు. ఇప్పుడు ఏపీ అధ్యక్షురాలిగా బీజేపీ అధిష్ఠానం నియమించింది. బీజేపీ అధ్యక్ష మార్పు ఊహాగానాలు రావడంతో సత్యకుమార్, సుజనా చౌదరి పేర్లు కూడా అధ్యక్ష రేసులో వినిపించాయి. కానీ అధిష్ఠానం చివరికి పురంధేశ్వరి పేరు ఖరారు చేస్తూ ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా ప్రకటించింది.  సహజంగానే పురంధేశ్వరి సీనియర్ రాజకీయ నాయకురాలు కావడం, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు రాష్ట్రంలో కీలకమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, అన్నింటినీ మించి ఎన్టీఆర్ కుమార్తె కావడం ఆమెకు ఈ పదవిని తెచ్చిపెట్టినట్లుగా భావించాలి. ఆమె ఏ పార్టీలో ఉన్నారన్నది.. రాజకీయాలను పక్కన పెడితే పురంధేశ్వరి పనితీరును ఆక్షేపించాల్సిన పనిలేదు. పురంధేశ్వరి అనగానే గుర్తుకొచ్చేది ఎన్టీఆర్ కుమార్తె అనే అయినా ఆమె పనితీరుతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయంగా ఆమె ఎంట్రీకి వారసత్వం పనికి వచ్చినా.. మంత్రిగా ఆమె సమర్ధత, ఆమె హుందాతనం, వ్యవహార శైలి ఆమెకి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఇంకా చెప్పాలంటే సో కాల్డ్ మహిళా నేతలు ఆమెను చూసి నేర్చుకోవాల్సింది కొండంత. అయితే, ఇప్పటికిప్పుడు బీజేపీ పగ్గాలు పురంధేశ్వరికి అప్పగించడం వెనక బీజేపీ వ్యూహం ఏంటన్నది సహజంగానే చర్చకు తావిస్తున్నది. అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియామకం టీడీపీని దెబ్బతీసేందుకా.. లేక రాష్ట్రాన్ని గెలిచేందుకా అనే చర్చలు సాగుతున్నాయి. నిజానికి ఏపీలో బీజేపీకి అధ్యక్షులుగా ఎవరిని నియమించినా పెద్దగా చర్చ అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీకి అసలు స్టేక్ లేదు. ఈ పార్టీకి ఏపీలో ఒక  శాతం ఓట్లు దక్కడమే గగనం. అయితే ఇలాంటి చోట ఇంతలా చర్చ జరుగుతున్నదంటే దానికి కారణం బీజేపీ వ్యవహారశైలే. ఏమీ లేని చోట కూడా అవకాశాన్ని వెతుక్కోవడం బీజేపీ నైజం. దేశంలో చాలా రాష్ట్రాలలో ఇదే తరహా ప్రణాళికతో పని చేసిన బీజేపీ కొన్ని చోట్ల సక్సెస్ అయింది. ఈ కారణంగానే ఏపీలో బీజేపీ వ్యూహాన్ని అనుమానించాల్సి వస్తుంది. ఏపీలో రాజకీయ పరిస్థితులను చూస్తే టీడీపీ, వైసీపీ మధ్యనే ప్రజల పోలరైజేషన్ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి చోట నిలబడాలంటే ఏదొక పార్టీ స్థానాన్ని ఆక్రమించాలి. టీడీపీ, వైసీపీని పోలిస్తే బీజేపీ తన వైపుకు తిప్పుకోనేందుకు ఎక్కువ అవకాశం ఉన్న పార్టీ టీడీపీ. ఈ తరహా ఆలోచనతోనే బీజేపీ ఇన్నాళ్లు కాపు సామజిక వర్గానికి చెందిన వారికి పార్టీని అప్పగిస్తూ వచ్చింది. అయితే, ఇప్పుడు ఆ సామాజిక వర్గాన్ని కూడా జనసేన క్యాప్చర్ చేసుకొనే పనిలో ఉంది. దీంతో బీజేపీ ఇప్పటికే తనతో ఉన్న నేతలలో ఎక్కువ శాతం బలమైన నేతలుగా ఉన్న కమ్మ సామజిక వర్గ నేతలకు పార్టీని అప్పగించినట్లుగా కనిపిస్తుంది. అయితే, స్థానికంగా వేళ్లూనుకుపోయిన టీడీపీ దెబ్బకొట్టడం అంటే   ఆషామాషీ విషయం కాదు. ఇక బీజేపీ మరో ఆలోచనగా చర్చిస్తే ఇది టీడీపీ-జనసేనతో కలిసి రాష్ట్రాన్ని జయించేందుకు వేసిన ప్రణాళికగా కూడా భావించవచ్చు. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా రాజకీయాలు సాగుతుండగా.. జనసేన, బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ మూడవ ప్రత్యామ్నాయం కావాలని ఆశపడుతున్నాయి. అయితే, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజు కారణంగా ఇరు పార్టీల మధ్య పొత్తున్నా లేనట్లుగానే కనిపించింది. ఇలాంటి సమయంలో బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా కమ్మ-కాపు సామజిక వర్గాల కలయికను ప్రజలలోకి పంపినట్లే అవుతుంది. ప్రచారం జరుగుతున్నట్లుగా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఖరారైతే పురంధేశ్వరి, చంద్రబాబు కాంబినేషన్ తో ప్రజల మధ్యకి వెళ్లి అధికారాన్ని కొల్లగొట్టడం మరింత సులువు అవుతుందనే ఆలోచన కూడా చర్చకి వస్తున్నది. మరి బీజేపీ వ్యూహం ఏంటో..  

స్పీడ్ న్యూస్ - 5

41.గతేడాది ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న రష్యాలోనూ పరిస్థితులు సజావుగా ఉన్నాయని చెప్పలేని పరిస్థితి నెలకొంది. అప్పుడప్పుడు రష్యా అధీనంలోని భూభాగాల్లో కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి.  42. సోషల్ మీడియాలో ఓ చేపకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.  దీని పేరు హెయిర్ టెయిల్ ఫిష్. ప్రపంచవ్యాప్తంగా ఇది శీతల ప్రాంతాల్లో తప్ప మిగిలిన అన్ని సముద్ర జలాల్లో కనిపిస్తుంది.  43.చమురు మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరలను మాత్రం యథాతథంగా ఉంచారు.  44. ఇన్స్టాగ్రామ్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ షేక్ చేస్తున్నారు. సోషల్ మీడియా చరిత్రలోనే పవన్ కనీవినీ ఎరుగని రికార్డును క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు పుట్టినరోజును పురస్కరించుకుని పవన్ కల్యాణ్ ఇన్స్టాగ్రామ్ లో ఖాతాను ఓపెన్ చేశారు. 45. కేరళపై నైరుతి రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంది. గత కొన్ని రోజులుగా కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.  46. తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. 47.తెలంగాణ జన గర్జన సభను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జన గర్జన సభకు పెద్ద ఎత్తున హాజరుకావాలన్న సంకల్పంతో ప్రజలు ప్రభుత్వ అడ్డంకులు తొలగించుకొని మరీ సభకు వచ్చారన్నారు.  48. రాహుల్‌గాంధీపై  బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ మల్లు రవి  తిప్పికొట్టారు. ‘‘పరిపక్వత లేని నేతలు బీఆర్‌ఎస్ వాళ్లే అని ఆయన ఎద్దేవా చేశారు.  49. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. సోము వీర్రాజును అధ్యక్ష పదవి నుంచి తొలగించిన పార్టీ హైకమాండ్ పురందేశ్వరికి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను అప్పగించింది.  50. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని అధిష్ఠానం నియమించింది. పురందేశ్వరి, కిషన్ రెడ్డిలను తెలుగు రాష్ట్రాలను అధ్యక్షులుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించినట్టు అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.

పవన్ పెళ్లిళ్లపై జగన్ విమర్శలు.. జోగయ్య చురకలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ సభ్యుడు చేగొండి హరిరామజోగయ్య మంగళవారం(జూన్ 4) బహిరంగ లేఖ రాశారు.  మీ నాన్నగారు వైఎస్ఆర్‌తో తనకు సన్నిహిత సంబంధం ఉండేదన్నారు. మొదట్లో ఆయన్ని విమర్శించినా.. ఆ తర్వాత ఆయన అభిమానిగా మారానని గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్ష నాయకుల పట్ల ఆయన అప్పుడప్పుడు చేస్తుండే విమర్శనాస్త్రాలు ఎంతో హుందాగా ఉండేవని.. ఆ విషయం ప్రజలందరికి తెలిసిందేనని ఆయన వివరించారు. ముఖ్యమంత్రిగా మీ తండ్రిగారి హుందాతనంలో 10వ వంతు కూడా మీకు లేవని.. మీ ప్రవర్తన చూస్తుంటే అనిపిస్తోందంటూ సీఎం వైయస్ జగన్‌కు సుతిమెత్తగా చురకలంటించారు.  ప్రజల ఆరాథ్య నాయకుడు, ప్రతిపక్ష నేత పవన్ కల్యాణ్ పట్ల మీరు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు విన్న తర్వాత సినిమాల్లో విలన్ పాత్రధారిగా మిమ్మల్ని వర్ణించ వచ్చనిపిస్తోందన్నారు. చట్టపరంగా ఆయన ఎన్ని పెళ్లిళ్లు చేసుకొంటే ప్రజలకెవ్వరికీ లేని అభ్యంతరం మీకేందుకని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌పై బురదజల్లడానికి మరో కారణం లేక.. ఇటువంటి చవకబారు కారణాలతో లబ్ది పొందాలని మీరు చుస్తున్నట్లుగా ఉందని అన్నారు. మరోసారి చవకబారు విమర్శలు చేయకుండా.. మీ నోరు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిదంటూ సీఎం జగన్‌కు హితవు పలికారు. మాట్లాడితే పవన్ కల్యాణ్.. చంద్రబాబుకి దత్త పుత్రుడు, ప్యాకేజీ అంటూ విమర్శిస్తుంటారని.. మరీ మీరు తెలంగాణ సీఎం కేసీఆర్‌కి దత్తపుత్రుడుగా 2019 ఎన్నికల్లో ఓటర్లను కొనుక్కునే నిమిత్తం కోట్లాది రూపాయిలు ప్యాకేజీ తీసుకొని ఆంధ్రప్రదేశ్‌ని తెలంగాణకు తాకట్టు పెట్టలేదా? అని ప్రశ్నించాల్సి ఉంటుందన్నారు. మీ తాతా రాజారెడ్డి నుంచి మీ వరకు మీ కుటుంబంలో అందరికీ దోచుకోవడం, దాచుకోవడం అలవాటే కదా? కాదని చెప్పగల దమ్ము.. మీకుందా? అంటూ సీఎం జగన్‌కు జోగయ్య సవాల్ విసిరారు. లేకుంటే.. మీ అందరి అవినీతి చిట్టా అంతా మరోసారి ప్రజల ముందుకు తీసుకురమ్మంటారా? అని హరిరామ జోగయ్య ప్రశ్నించారు.   ఇకపై ప్రతిపక్ష నాయకులపై ముఖ్యంగా పవన్ కల్యాణ్‌పై అనవసర దుర్బాషలాడటం మానుకొంటే బాగుపడ్తారు. ఒకటి అని నాలుగు అనిపించుకోవడం ఏ సలహాదారు నేర్పారు మీకు అంటూ ప్రశ్నించారు. మంచిగా మాట్లాడి మంచి రోజులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండంటూ సీఎం జగన్‌కి  సూచించారు. మీపై ఈ అభియోగాలు మోపవలసిన పరిస్థితి వచ్చినందుకు తనకు చాలా బాధాగా ఉందని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తప్పనిసరి పరిస్థితి అయిందన్నారు. తనకు మొదటి నుంచి ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం అలవాటని.. అది అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా తప్పు అంటూ ఉంటే.. ముఖంపైన కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడడమే తన నైజమని ఈ సందర్బంగా వైయస్ జగన్‌కు హరిరామజోగయ్య స్పష్టం చేస్తూ.. సారీ అంటూ లేఖను ఆయన ముగించారు.

కిషన్ ఇన్.. బండి ఔట్.. బీజేపీలో ప్రక్షాళన ఇదేనా ?

బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అనంతరం బండి సంజయ్ రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర నాయకత్వంలో బీజేపీ హైకమాండ్‌ పెను  మార్పులు చేస్తుండటం ఎలాంటి ఫలితాన్నిస్తుందన్న ఉత్కంఠ వ్యక్తమౌతోంది.   తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన తథ్యమని గత కొంత కాలంగా గట్టిగా వినిపిస్తోంది. బండి సంజయ్ స్వయంగా తాను మోడీ పర్యటన నాటికి బీజేపీ రాష్ట్ర చీఫ్ గా ఉండే అవకాశం లేదని  కార్యకర్తలతో గతంలోనే చెప్పేశారు. ఇప్పటి వరకు తెలంగాణ చీఫ్ గా ఉన్న బండి సంజయ్ ను క్యాబినెట్ లోకి తీసుకొని.. ఇక్కడ రాష్ట్ర నాయకత్వాన్ని కిషన్ రెడ్డికి అప్పగించనున్నారని రాజకీయ వర్గాలు బలంగా చెప్తున్నాయి. అయితే  సోమవారం ( జూలై 3) కేబినెట్ భేటీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఎటువంటి చర్చా జరగలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 8 నెలల ముందు బీజేపీ అధిష్టానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తూ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమనే చెప్పాలి. గతంలో బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ బండిని మార్చే ప్రశక్తేలేదని చెప్పిన సంగతి తెలిసిందే.  మొత్తం మీద రాష్ట్ర బీజేపీలో సమూల  ప్రక్షాళన  జరిగితేనే పార్టీకి ఉనికి ఉంటుందని హైకమాండ్ నిర్ణయించుకున్నట్లు తాజా నిర్ణయంతో తేటతెల్లమైంది.  కాగా రాష్ట్ర బీజేపీలో  భారీ మార్పుల గురించి ఇటీవల కొంత కాలంగా వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.  ఈటెల రాజేందర్ కు బీజేపీ ప్రచార సారధ్య బాధ్యతలు అప్పగించవచ్చని చెప్తున్నారు.   కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవిని వదులుకుని పార్టీ రాష్ట్రఅధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు పెద్దగా సుముఖత చూపకుంటే.. ఆయనను  కేవలం పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలకు పరిమితం చేయకుండా బీజేపీ తన సంస్కృతిని పక్కనపెట్టేసి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే  అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తంగా తెలంగాణలో అధికారం మాదే అనే స్థాయి నుంచి పార్టీని కాపాడుకుంటే చాలన్న స్థాయికి బీజేపీ దిగజారిందని ఇటీవలి పరిణామాలను బట్టి అర్ధమౌతోంది. మరింత దిగజారకముందే పార్టీలో ధిక్కారాన్ని అణచివేసి మళ్లీ పార్టీని విజయం దిశగా నడిపించేందుకు బీజేపీ హై కమాండ్ శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు.  అయితే కేవలం నాయకత్వ మార్పుతోనే  బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందా? అంటే పరిశీలకులు అనుమానం అనే అంటున్నారు. 

పవన్‌పై పూనమ్ కౌర్ అస్త్రం.. ఇదీ ఫేకే?

ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇప్పటికే ప్రజలలో వ్యతిరేకత బహిర్గతం అవుతుండగా.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే కొందరు అధిష్టానంపై రివర్స్ అవుతున్నారు. వచ్చే ఎన్నికలలో టికెట్లు దక్కవని అనుమానిస్తున్న నేతలు కొందరు రెబల్స్ గా మారేందుకు చాపకింద నీరులా నియోజకవర్గాలలో పనులు చక్కబెట్టుకుంటున్నారు. మరోవైపు నాలుగేళ్ళలో వైసీపీ తప్పిదాలను, వైసీపీ నేతల దారుణాలను, ప్రభుత్వం కక్షకట్టి చేసిన నష్టాన్ని ప్రతిపక్షాలు ఎండగడుతూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఒకవైపు టీడీపీ నుండి నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ కార్యకర్తలలో ఒకడిగా దూసుకెళ్తూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శల బాణాలతో వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ ను నిలువరించేందుకు వైసీపీ రకరకాల ఎత్తులు వేస్తున్నది. ఇప్పటికే పవన్ వ్యక్తిగత జీవితాన్ని   టార్గెట్ చేసిన వైసీపీ నేతలు జనసేన నేతలు తీవ్ర ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు. సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డే పవన్ పెళ్లిళ్ల విషయాన్ని ప్రస్తావించి పవన్ కళ్యాణ్ కి కౌంటర్ గా వైసీపీకి ఒక లీడ్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతున్నారు. ఇందులో భాగంగానే హీరోయిన్ పూనమ్ కౌర్ పేరిట ఒక ఫేక్ ఆడియో రికార్డును వైరల్ చేస్తున్నారు. పవన్ క్యారెక్టర్ ను బ్యాడ్ చేసేలా.. పవన్ ను స్త్రీ లోలుడిగా చిత్రీకరించేలా వైసీపీ ఈ జిత్తులు మారి  ఎత్తుగడ వేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పవన్ కళ్యాణ్ పొలిటికల్ యాక్టివిటీ పెరిగిన ప్రతిసారీ వైసీపీ ఇలాగే పూనమ్ కౌర్ పేరిట సోషల్ మీడియాలో తెగ ఫేక్ ముచ్చట్లను తెర మీదకి తీస్తుండగా ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి పూనమ్ మాట్లాడినట్లుగా ఒక ఫేక్ కాల్ రికార్డును వైసీపీ సోషల్ మీడియా విడుదల చేసింది.  ఈ ఆడియోలో పవన్ కల్యాణ్‌కు అమ్మాయిలతో ఉన్న సంబంధాలపై నటి పూనమ్ కౌర్ వ్యాఖ్యలు చేసినట్లు ఉంది.  ‘పవన్ కల్యాణ్‌కు చాలామంది అమ్మాయిలతో సంబంధాలున్నాయి. వాళ్లందరినీ మోసం చేశాడు. వాళ్లే కోపం వచ్చినప్పుడు వాడిని చంపొచ్చు. అంత కామమైన నీచమైన వ్యక్తి పవన్ కళ్యాణ్’ అని పూనమ్ కౌర్ అన్నట్లుగా ఆడియో సృష్టించారు. ‘నేను నోరు మూసుకున్నా పవన్‌ కళ్యాణ్‌ను చంపడానికి చాలామంది రెడీగా ఉన్నారు. ఆయన చాలామంది అమ్మాయిలతో తప్పు చేశారు. నా విషయంలో జరిగింది నేను ఫ్రూఫ్‌లు చూపిస్తే పవన్ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు. నేను ప్రేమించాను కాబట్టి బయటకు రాలేదు. నాకు ఐ లవ్ యూ చెప్పి వేరే అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు. పవన్ వల్ల నా పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది’ అని పూనమ్ కౌర్ గొంతును పోలిన ఓ వాయిస్ రికార్డ్‌ను వైసీపీ అనుకూల వర్గాలు షేర్ చేస్తున్నాయి. దీనిపై జనసేన కార్యకర్తలు, జనసేన సోషల్ మీడియా టీం సైతం కౌంటర్లు మొదలు పెట్టింది. ఇది ఫేక్ అని కొట్టిపారేస్తున్న జనసేన వర్గాలు.. ఆడియోలో పవన్‌ను చంపడం అనే మాట చూస్తుంటే ఏదో కుట్ర జరుగుతోందని.. పవన్‌కు ప్రాణ హాని ఉందని అనుమానిస్తున్నారు. మరికొందరు జనసేన ఫాలోవర్లయితే గతంలో మహిళలతో అసభ్యంగా మాట్లాడిన వైసీపీ నేతలు అంబటి, అవంతి లాంటి వారి ఆడియోలను మళ్ళీ షేర్ చేస్తూ.. ఇదీ మీ సంస్కృతి.. ఫేక్ ఆడియోలు, ఫేక్ వీడియోలను తెచ్చి లోకమంతా అలాగే ఉంటుందని నమ్మించేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నదని గట్టి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, పూనమ్ పేరిట తెచ్చిన ఈ ఆడియో మాత్రం వైసీపీ ఎన్నికల కోసం ఎంతకైనా దిగజారుతుందని చెప్పకనే చెబుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

సోము వీర్రాజుకు ఉద్వాసన

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజుకు పార్టీ హై కమాండ్ ఉద్వాసన పలికింది. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా స్వయంగా వీర్రాజుకు ఫోన్ చేసి తెలియజేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా మీ పదవీ కాలం ముగిసిందని  సోము వీర్రాజుకు గుర్తు చేసిన నడ్డా.. ఆయనను తొలగిస్తున్నట్లు చెప్పారు. వెంటనే పదవికి రాజీనామా చేయాల్సిందిగా సూచించారు. దీంతో చాలా కాలంగా సోము వీర్రాజు తొలగింపుపై వస్తున్న వార్తలు వాస్తవమయ్యాయి. ఎట్టకేలకు ఏపీ బీజేపీ అధ్యక్షుడిని తొలగించిన బీజేపీ ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తుందన్నది చూడాల్సి ఉంది.   అసలు చాలా కాలం నుంచీ సోము వీర్రాజు వ్యవహారశైలిపై పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. సోము వీర్రాజు వ్యవహార శైలి కారణంగానే ఆ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దూరమయ్యారు. మిగిలిన నేతలలో కూడా అత్యధికులు సోము వీర్రాజు పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా సోము వీర్రాజు పార్టీ అధ్యక్షులను మారుస్తూ  తీసుకున్న నిర్ణయం పట్ల కూడా సర్వత్రా వ్యతిరేకత వెల్లువెత్తింది. అంతే కాకుండా మిత్రపక్షమైన  జనసేన పట్ల సోము వీర్రాజు వ్యవహారశైలి పట్ల కూడా పార్టీ లో అసంతృప్తి వ్యక్తమౌతున్నది.  రాష్ట్రంలో బీజేపీకి మిత్రపక్షమైన జనసేనతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ.. జగన్ కు   సన్నిహితంగా మెలగడం ద్వారా  అధికార పార్టీకి ప్రయోజనం కలిగేలా సోము వీర్రాజు వ్యవహరిస్తున్నారని రాష్ట్ర పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతున్నది. పలు సందర్భాలలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా సోము వీర్రాజు వ్యవహారశైలి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే కాకుండా తనకు రాష్ట్ర నాయకత్వంతో పని లేదనీ, ఏదైనా బీజేపీ అగ్రనాయకత్వంతోనే తేల్చుకుంటాననీ పవన్ ఒక   స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాజకీయంగా సోము వీర్రాజుకు పార్టీలోనూ, మిత్రపక్షం నుంచే కాకుండా బయట నంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తమ భూములను సోము వీర్రాజు కబ్జా చేశారంటూ దళిత సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి.  ఈ నేపథ్యంలోనే వీర్రాజును తొలగించడం ఖాయమని గత కొంత కాలంగా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు బీజేపీ అధిష్ఠానం సోము వీర్రాజును పార్టీ ఏపీ అధ్యక్షుడిగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

స్పీడ్ న్యూస్- 4

31. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ ఇరిటేషన్ స్టార్, చంద్రబాబు ఇమిటేషన్ స్టార్,  సీఎం జగన్ ఇన్స్పిరేషన్ స్టార్ అని అన్నారు. 32.అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ కమలం పార్టీలో కల్లోలం మెుదైలంది. నాయకత్వం మార్పు, పదవుల విషయమై నేతల అసంతృప్తి, రఘునందన్ ఘాటు వ్యాఖ్యలు ఇలా పార్టీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 33. మరోకొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇప్పిస్తామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.,మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పోటాపోటీగా ప్రకటనలు చేస్తుండటంతో.. దుబ్బాక పాలిటిక్స్ ఇప్పటినుంచే రసవత్తరంగా మారుతున్నాయి. 34.ఏడాదిన్నరగా తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ను ఆదుకోడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి  ముందుకొచ్చింది. 3 బిలియన్ డాలర్ల స్వల్పకాలిక ఆర్థిక ప్యాకేజీని ఐఎంఎఫ్ శుక్రవారం అందజేసింది.  35.తమిళనాడు ఏంటి.. లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? ఇప్పుడు కాదులేగానీ.. మరో ఏడేళ్లలో వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా అవతరించాలని తమిళనాడు లక్ష్యంగా పెట్టుకుంది.  36.ఎన్సీపీలో ముసలంతో మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అజిత్‌ పవార్ తిరుగుబాటుతో రెండుగా చీలిపోయిన ఎన్సీపీలో పోటాపోటీగా తొలగింపులు, నియామకాలు జరిగాయి. 38.ఇటీవలి కాలంలో కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థినులపై.. ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లే లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలోని ఓ కాలేజీలో విద్యార్థినులను వేధించిన ప్రొఫెసర్ తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 39. మన దేశం నుంచి కూడా చాలా మంది పర్యాటకులు థాయిలాండ్ వెళ్తూ ఉంటారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రోడ్డు మార్గంలో కూడా థాయిలాండ్ చేరుకోవచ్చని తెలిపింది. 40.మెట్రో ప్రయాణ ఛార్జీల్లో రాయితీలు ఎత్తివేసిన హైదరాబాద్‌ మెట్రో.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది. మెట్రో మాల్స్, వారికి కేటాయించిన కొన్ని స్థలాల్లో ఇప్పటివరకు ఉచిత పార్కింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తోన్న హైదరాబాద్ మెట్రో.. దీన్ని కూడా ఉపసంహరించుకోవాలని యోచిస్తోంది.

యువతకు దిశా నిర్దేశం స్వామి వివేకానంద బోధనలు

చిన్న కష్టానికే హడలిపోతున్నారు. అర్ధం లేని కారణాలకు ఆత్మ త్యాగాలను చేస్తున్నది ఈ జనరేషన్. కారణం ఇంట్లో సరి అయిన మార్గనిర్దేశం చేయాల్సిన తల్లిదండ్రులు ఉద్యోగ వ్యాపారాలలో పడి పిల్లలతో సరిగా మాట్లాడలేకపోవడం. ఎవరి పరుగు వాళ్లది. అయితే ఈ తరం వాళ్లలో స్ఫూర్తి నిండాలంటే స్వామి వివేకానందను చదవాలి. స్వామి వివేకానంద కొత్త తరాలను జాగృతం చేసే గొప్ప మాటలను గ్రంథస్తం చేశారు. యువతే భావిభారత నిర్మాణానికి పునాదులని, వారి చైతన్యమే దేశ భవిష్యత్ కు కరదీపమని భావించి  గొప్ప సూక్తులను ఉపదేశించారు. ఆ క్రమంలో ఎన్నో సందేశాలను ప్రవచించారు. ప్రతి పౌరుడు హృదయంలో చెరగని సంతకంగా నిలిచిపోయారు. కాలం మారింది, సామాజిక పరిస్థితులు మారాయి పాశ్చాత్య పోకడలు నవీన నాగరికతను నిర్వచిస్తున్నాయి. ఈ సమయంలోనే మనం తరం జాగృతం కావాలి " బలమే జీవనం - బలహీనతే మరణం" (strength is life - weakness is death) అంటారు వివేకానంద. ప్రకృతి ఉపద్రవాలు వైపరీత్యాలు, మనిషి ఉనికినే ప్రశ్నిస్తున్న కరోనా లాంటి వాటిని దీటుగా ఎదుర్కొని నిలబడాలంటే   మానిసికంగా ఎంతో బలపడాల్సి ఉంది. బలహీనతల్ని ఐక్యతతో ఎదుర్కోవాల్సి ఉంది. ఇంకా ఆర్ధిక అసమానతలతో నిరుద్యోగ యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి అదే బలహీనతగా దారి తీసి చీకటి అగాధంలోకి జారిపోయి ఆత్మ త్యాగాలను చేసే ఎంతోమంది అమాయక యువతను మానసికంగా శారీరకంగా బలమే జీవనం అని నమ్మి నవ ఉత్తేజంతో ముందుకు సాగాలంటే వివేకానంద పుస్తకాలను చదవడమే మార్గం. ఎవరైతే తనని తాను విశ్వసించడో వాడే పెద్ద నాస్తికుడు" అంటారు స్వామి వివేకానంద. ప్రస్తుతం యువత ఆస్థికతకు నాస్తికతకు మధ్య ఎటూ తేల్చుకోలేక ఊగిసలాడుతున్నారు.  దేవుడు- నమ్మకం గురించి అనవసర చర్చలు జరిపి దేశ యువతిని భారతీయతకు దూరం చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో కల్పిక నాస్తికతపై ఎక్కువ చర్చ జరిగి యువ సమాజం అయోమయంలో పడిపోతున్నది. ఇలాంటి యువతకు వెలుగు మార్గం చూపే సందేశాలను స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు. దేవుడి కంటే ముందు నిన్ను నువ్వు నమ్ము అంటాడు వివేకానంద. ఇలా ప్రతి సంక్షోభానికి వివేకానందను చదివితే పరిష్కారం దొరుకుతుంది. ఇలా తన జ్ఞాన తేజస్సుతో స్ఫూర్తినిచ్చే ఎన్నో మాటల్ని మూటకట్టి విజ్ఞాన బాండాగారాన్ని మనకోసం వదిలేసి వెళ్లిపోయారు. అందుకే ఆయన చెప్పిన మాటలు నిత్యం మనం స్మరణం చేసుకుంటే చాలు. నిరాశ నిస్తేజం కి చోటు ఉండదు. (స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా)

స్పీడ్ న్యూస్- 3

21.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పార్టీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి ఆయనను తొలగించింది. సోము వీర్రాజుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేరుగా ఫోన్ చేశారు. 22.దేశ వ్యాప్తంగా టమోటా ధరలు చుక్కలు చూపెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే కిలో టమోటా ధర సెంచరీ నుంచి డబుల్ సెంచరీ వరకూ వెళ్లింది. 23.టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోందని మాజీ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు రూరల్ లో పాదయాత్ర కొనసాగుతున్నప్పటికీ... యాత్రలో రద్దీ ఎక్కువ కావడం వల్లే తాను తిరిగి వచ్చానని చెప్పారు. 25.ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ లో 43 ఏళ్ల వయసులో 24వ సారి బరిలోకి దిగిన అమెరికా టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్ కు చుక్కెదురైంది. ఈ టోర్నీ మహిళల సింగిల్స్ లో అతి పెద్ద వయస్కురాలైన వీనస్ తొలి రౌండ్ లోనే ఓడిపోయి నిరాశ పరిచింది. 26.యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టులో రనౌట్ దుమారం సద్దుమణగడం లేదు. ఇంగ్లాండ్‌ ఆటగాడు బెయిర్‌ స్టోను వివాదాస్పదంగా ఔట్‌ చేసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 27.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణలో పూర్తి స్థాయిలో పుంజుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇదే సమయంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని... ఆమెకు ఏపీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నారు. 28.దత్తత వెళ్లిన వారికి తాము జన్మించిన కుటుంబం ఆస్తిలో హక్కు ఉండదని తెలంగాణ హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. దత్తతకు మునుపే ఆస్తి పంపకాలు పూర్తయితేనే పుట్టింట కుటుంబంలో ఆస్తి హక్కు దక్కుతుందని పేర్కొంది.  29. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇద్దరి మధ్య చెక్ బౌన్స్ వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్ దాకా చేరింది. మాజీ మంత్రి వినోద్ కుమార్ ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 30.పూనమ్‌ పోస్ట్‌పై చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్‌లో ఓ ప్రముఖ డైరెక్టర్‌‌ను గురూజీ అని పిలుస్తారు. ఆయన్నే టార్గెట్ చేసుకుని పూనమ్ విమర్శలు చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రంగా చుట్టూ ఏపీ రాజకీయం

వంగవీటి మోహన్ రంగా.. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ రాజధానిగా పేరొందిన బెజవాడ ( విజయవాడ)కు ఎంత పేరుందో, బెజవాడ కేంద్రంగా రాజకీయ చక్రం తిప్పిన, దివంగత కాపు నేత వంగవీటి మోహన రంగాకు అంత పేరుంది. అప్పుడే కాదు, ఆయన కన్నుమూసి మూడు దశాబ్దాలకు పైగా అయిన ఈనాటికీ, రంగా పేరు ఏపీలో  పొలిటికల్  వైబ్రేషన్స్ సృష్టిస్తున్నాయి. నిజానికి,  రంగాను కాపులు మాత్రమే కాదు బడుగు బలహీన వర్గాలు పేదలందరూ తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. రాజకీయ పండితులు బడుగు బలహీన వర్గాలు పొలిటికల్ లెజెండ్’గా రంగాను అభివర్ణిస్తారు. ఆయన అకాల మరణం తరువాత ఆ స్థాయిలో ఉన్న బలమైన నాయకుడు కాపులకు లభించలేదు. అయితే మోహన్ రంగా భౌతికంగా లేకున్నా.. ఆయన ఇచ్చిన స్ఫూర్తి అంతా ఇంతా కాదు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి రంగా పేరు మార్మోగుతుంది. ఇప్పడు అదే జరుగుతోంది. అందరివాడుగా పేదల గుండెల్లో నిలిచిన రంగా, మావాడంటే మావాడు అని తమ సొంతం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. రంగా బొమ్మపెట్టుకుని  కాపులు, బడుగు బలహీనవర్గాల వారి ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. రంగా కన్నుమూసిన తర్వాత  జరిగిన ప్రతి ఎన్నికలోనూ, రంగా పేరు గెలుపు ఓటములను నిర్ణయించే ఒక ఫాక్టర్’గా నిలిచింది అంటే అతిశయోక్తి కాదు. నిజానికి రాష్ట్రంలో ఇప్పడు ఎన్నికలు లేవు, కానీ, ఎన్నిక వాతావరణం వుంది. అందుకే రంగా జయంతి (జూలై4) సందర్భంగా రాజకీయ చలిమంటలు భగ్గుమంటున్నాయి. అందుకే, పార్టీలు, పార్టీలకు అతీతంగానూ నాయకులు  పోటీపడి మరీ రంగాకు జై కొడుతున్నారు. వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా, విజయవాడలో రంగా విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. అదలా ఉంటే, గతంలో రంగా పేరు చెప్పుకుని ఓట్లు దండుకున్న వైసీపీ, ఆ తర్వాత రంగా వారసుడు, ఆయన కుమారడు వంగవీటి రాధాకృష్ణకు అన్యాయం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా   గుర్తు చేస్తున్నారు. రాధాకృష్ణకు టిక్కెట్ ఇవ్వకుండా జగన్ మోసం‌ చేశారని.. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు రాజకీయ అనవసరాల కోసం డైలాగ్ లు చెబుతున్నారని రంగా, రాధా అభిమానులు ఆక్షేపిస్తున్నారు. రాధా సేవలను తొమ్మిదేళ్లు ఉపయోగించుకుని, జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో మొండి చేయి చూపించారని, అయిఆ ఆనాడు నోరు విప్పని వైసీపీ నానీలు  ఈ రోజు ఏముఖం పెట్టుకుని, రంగా జయంతికి హడావుడి చేస్తున్నారని  వంగవీటి అభిమానులు వైసీపీ  నేతలను ప్రశ్నిస్తున్నారు.  అందుకే  రాధా, రంగా అభిమానులు వచ్చే ఎన్నికల్లో జగన్‌కు తగిన బుద్ది చూపుతారని పరిశీలకులు అంటున్నారు. కొత్త జిల్లాకు రంగా పేరు పెట్టాలని‌ కోరినా.. జగన్ స్పందించ లేదని,  వైఎస్సార్‌సీపీ నాయకులపై  ఫైర్ అవుతున్నారు. మరోవంక  గతంలో వంగవీటి రాధ హత్యకు ‘రిక్కి’ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రాబాబు నాయుడు స్వయంగా ఇంటికి వెళ్లి పలకరించడమే కాకుండా.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.  నిజానికి రాధా తెలుగు దేశం పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అందుకే, రంగా అభిమానులు మరో మారు, తెలుగుదేశం విజయం కోసం కృషి చేస్తామని రాంగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు.