ఏపీలో స్థానిక సమరం.. వైసీపీలో అయోమయం.!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ఆరంభమైన వేళ వైపీపీలో గందరగోళం నెలకొంది. ఒకవైపు వైపీపీ స్థానిక పోరులో సత్తా చాటలని ఆ పార్టీ అధినేత జగన్ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చి దిశా నిర్దేశం చేసినప్పటికీ పార్టీలో ఇసుమంతైనా ఉత్సాహం కనిపించడం లేదు. ఏకగ్రీవాలు కూడదు, అన్ని స్థానాలలోనూ గట్టి అభ్యర్థులను నిలబెట్టాలని జగన్ విస్పష్ట ఆదేశాలు ఇచ్చినప్పటికీ స్థానిక పోరులో అనుసరించాల్సిన వ్యూహాలపై మాత్రం ఆయన ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. దీంతో క్షేత్రస్థాయి నాయకత్వం అయోమయంలో పడింది. ముఖ్యంగా పార్టీ అధినేత.. జగన్ వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే రాష్ట్రానికి రావడం, అదీ తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం కావడం పట్ల క్షేత్ర స్థాయి క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఆదేశాలు వినా ఆయన.. స్థానిక పోరుకు సంబంధించిన ప్రణాళిక, వ్యూహాల గురించి మాట్లాడకపోవడంతో అసలేం చేయాలి? స్థినిక ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి అన్న విషయంలో పార్టీలో అయోమయ పరిస్థితులలో ఉందని పరిశీలకులు అంటున్నారు. పార్టీ శ్రేణులు కూడా జగన్ ఆదేశాల పట్ల పెదవి విరుస్తున్నారు. వ్యూహం లేకుండా స్థానిక పోరులో సత్తా చాటండి అన్న అదేశాలు నిష్ప్రయోజనమన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమౌతోంది. రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి. ఇసుమంతైనా అవకాశం, బలం లేని చోట్ల పోటీలో నిలిచి ప్రయోజనం ఏమిటన్న అభిప్రాయాన్ని వైసీపీ సీనియర్లే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పార్టీ అధినేత ప్రకటిస్తున్న లక్ష్యాలు, తీసుకుంటున్న నిర్ణయాలకూ, క్షేత్రస్థాయిలో పరిస్థితులకూ అసలు పొంతనే లేదన్న అభిప్రాయమే పార్టీ వర్గాల్లో ఎక్కువగా వ్యక్తమౌతోంది. రాష్ట్రంలో పార్టీ పరిస్థతి, క్షేత్రస్థాయిలో క్యాడర్ ఇబ్బందులు, సమస్యలు ఇవేవీ జగన్ దృష్టికి వెళ్లడంలేదని, అందుకే ఆయన నేల విడిచి సాము చేస్తున్న చందంగా నిర్ణయాలు తీసుకుంటూ, ఆదేశాలు జారీ చేస్తున్నారని క్యాడర్, స్థానిక నాయకులు అంటున్నారు. వీటన్నిటికీ మించి క్షేత్రస్థాయిలో వైసీపీ సీనియర్లు, స్థానిక నేతల మధ్య సమన్వయ లోపం, అంతర్గత విభేదాల కారణంగా పోటీలో నిలబడినా.. అది నామమాత్రమే అవుతుందన్న ఆవేదన క్షేత్రస్థాయి క్యాడర్ లో వ్యక్తమౌతోంది. ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకుని క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకులు, క్యాడర్ ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలనీ, అలాగే పార్టీలో అంతర్గత విభేదాలను సర్దుబాటు చేసి, ద్వితీయ శ్రేణి నాయకులకు భరోసా ఇవ్వకుంటే.. స్థానిక పోరులో భంగపాటు తప్పదని వైసీపీ నేతలే అంటున్నారు. (YCP Cader Confusion, Ap Local Body Elections, YCp Local Body Elections Strategy, YCP Leaders Unrest, Andhra Pradesh Politics, Telugu One)
Published on: Fri Aug 28, 2026 1:53PM