హస్తిన చేరిన కర్నాటకం!
హస్తిన చేరిన కర్నాటకం!

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి లేదా మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతున్న తరుణంలో..కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. హస్తిన వేదికగా కన్నడ రాజకీయాలపై హైకమాండ్ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను అత్యవసరంగా ఢిల్లీకి పిలిపించింది. రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొన్న కొన్ని విభేదాలకు స్వస్తి పలికి.. రాబోయే రోజుల్లో పాలన మరింత ముమ్మరంగా సాగేలా చూసేందుకు హైకమాండ్ నడుంబిగించింది. ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది. ముఖ్యంగా సీఎం పీఠం మార్పిడి లేదా మంత్రివర్గంలో సమూల మార్పులు చేయడం ద్వారా అసంతృప్తిని చల్లార్చవచ్చని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి మార్పునకు సంబంధించిన అంశం ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ ఇరు వర్గాల మధ్య పూర్తిస్థాయి సయోధ్య కుదరని పక్షంలో, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాలలో జరుగుతోంది. కేవలం సీఎం మార్పు మాత్రమే కాకుండా.. రాబోయే రాజ్యసభ స్థానాల భర్తీ, రాష్ట్ర శాసనమండలి ( స్థానాల కేటాయింపు, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై కూడా ఈ సమక్షంలో చర్చించనున్నారు. సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ, అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పించడమే లక్ష్యంగా హైకమాండ్ ముందుకు సాగుతోంది. ఈ సందిగ్ధతను తొలగించడానికి అధిష్ఠానం కొన్ని ప్రత్యేక ఫార్ములాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో సరికొత్త ఉత్తేజాన్ని నింపడానికి, అలాగే కేడర్‌లో నమ్మకాన్ని పెంచడానికి నాయకత్వ మార్పు అనివార్యమనే కోణంలో కూడా చర్చలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా మొదటి ఫార్ములా ప్రకారం ప్రస్తుత ముఖ్యమంత్రిని అలాగే కొనసాగిస్తూ, కేవలం మంత్రివర్గంలో మాత్రమే భారీ మార్పులు చేయడం, పనితీరు సరిగ్గా లేని మంత్రులను తొలగించి కొత్తవారికి అవకాశం కల్పించడం ఒక మార్గంగా కనిపిస్తోంది. అయితే, అంతర్గత విభేదాలు పూర్తిగా సమసిపోవాలంటే రెండో ఫార్ములా ప్రకారం అగ్రనాయకత్వంలోనే మార్పులు చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం కూడా సీనియర్లలో వ్యక్తం అవుతున్నట్లు సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నాటి నుండి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య అధికార పంపకాలపై లోపాయకారీ ఒప్పందాలు జరిగాయనే వార్తలు నిరంతరం వస్తూనే ఉన్నాయి. గత ఏడాది కాలంగా నాయకత్వ మార్పుపై పార్టీ లోపల వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు, కొందరు మంత్రులపై వస్తున్న ఆరోపణలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయి. దీంతో ఇద్దరు అగ్రనేతలను ఒకే వేదికపైకి తెచ్చి, ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని ప్రకటించేందుకు ఢిల్లీ వేదికగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పరిపాలన పరంగా , పార్టీ పరంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు సామాజిక సమతుల్యత కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని వివిధ సామాజిక వర్గాల మద్దతుతోనే పార్టీ అధికారంలోకి వచ్చినందున, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని సామాజిక వర్గాలకు మంత్రివర్గంలోనూ, ఇతర కీలక పదవుల్లోనూ సముచిత స్థానం కల్పించడమే ఈ కీలక సమావేశం ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఒకవేళ అధిష్ఠానం సీఎం మార్పునకే మొగ్గు చూపితే రాష్ట్రంలో సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలవుతుంది. అలా కాకుండా కేవలం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో సరిపెడితే, అసంతృప్త నేతలను ఏ విధంగా ప్రసన్నం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక నూతన అధ్యాయానికి తెరలేపడం ద్వారా పాలనను మరింత వేగవంతం చేయాలని, ప్రజల్లో ఉన్న అంచనాలను అందుకోవాలని అధిష్ఠానం భావిస్తోంది.

Publish Date: May 26, 2026 11:13AM
రాజారెడ్డిని చంపిన వాళ్ల‌ను...టీడీపీ ఆఫీసులో దాచి పెట్టారా?
రాజారెడ్డిని చంపిన వాళ్ల‌ను...టీడీపీ ఆఫీసులో దాచి పెట్టారా?

వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి. అస‌లీ కేసులో ఏం జ‌రిగింది? జ‌గ‌న్ చెప్పిన‌ట్టు ఇది కూడా ఆయ‌న దృష్టిలో చంద్ర‌బాబు చేయించిన హ‌త్యేనా? ఈ కేసు ప్ర‌స్తుతం ఏ ద‌శ‌లో ఉంది? ఆ నాడు ఈ కేసులోని వారు ఇప్పుడు ఏమంటున్నారు? ఏమిటా వివ‌రాలు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజారెడ్డి హత్య కేసు దశాబ్దాల నాటిదైనా, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ అంశం మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు నేపథ్యం, జగన్ ఆరోపణలు, నిందితుల స్పందన, ప్రస్తుత స్థితికి అద్దం ప‌డుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి, వైఎస్ జగన్ రెడ్డి తాత- వైఎస్ రాజారెడ్డి 1998 మే 23న కడప జిల్లా వేముల సమీపంలో బాంబు దాడిలో హత్యకు గురయ్యారు. పులివెందుల ప్రాంతంలో అప్పట్లో ఉన్న ఫ్యాక్షన్ రాజకీయాల కార‌ణంగా ఈ ఘోరం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా ప్రాంతీయ విభేదాలు, గనుల వ్యాపార వివాదాలు.. కీల‌కంగా ఉన్నాయని అప్పట్లో నిర్ధారించారు పోలీసులు. జగన్ చెప్పినట్లు చంద్రబాబే చేయించారా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతికితే.. ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వైఎస్ జగన్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. 1999 ఎన్నికలకు ఏడాది ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తన తాత రాజారెడ్డిని దారుణంగా చంపారని ఆరోపించారు జగన్. వైఎస్సార్‌ను పులివెందులకే పరిమితం చేయాలనే రాజకీయ కుట్రతోనే టీడీపీ ఈ హత్య చేయించిందని, హత్య చేసిన త‌ర్వాత‌ నిందితులను హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో దాచిపెట్టి అధికార బలంతో రక్షించారని ప్రస్తావించారు జగన్. తెలుగుదేశం పార్టీ ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. రాజారెడ్డి హత్య పూర్తిగా కడప జిల్లాలోని స్థానిక ఫ్యాక్షన్, గనుల వివాదాల వల్ల జరిగిందని, దానికి పార్టీకి లేదా చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తోంది. న్యాయపరంగా చూస్తే ఈ కేసు ఎప్పుడో ముగిసిపోయింది. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు, నిందితులకు శిక్షలు కూడా విధించింది. రాజారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నవారికి కోర్టులు జీవిత ఖైదు శిక్ష విధించాయి. శిక్షా కాలం పూర్తి చేసుకుని, చట్టపరమైన నిబంధనల ప్రకారం నిందితులు ఇప్పటికే జైలు నుంచి విడుదలయ్యారు. చట్టపరంగా ఈ కేసు ముగిసినప్పటికీ, రాజకీయంగా మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి దీన్ని వాడుకుంటున్నారు. ఆ నాడు ఈ కేసులో నిందితులుగా ఉన్న‌ వారు ఇప్పుడు ఏమంటున్నారు? అని గ‌మ‌నిస్తే.. జగన్ వ్యాఖ్యలపై ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, శిక్ష అనుభవించి విడుదలైన పార్థసారథిరెడ్డి కడపలో మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసిన ఆరోపణలను పార్థసారథిరెడ్డి పూర్తిగా తిప్పికొట్టారు. నీ తాత రాజారెడ్డి మనుషులు నన్ను ఎలా నరికారో, అలాగే నా వర్గీయులు మీ తాతను నరికారు. అది ఫ్యాక్షన్ గొడవ అంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. తాను ఎంతో మంచి వాడిన‌ని చెప్పుకుంటున్న జ‌గ‌న్ ఒక న‌ర‌రూప రాక్ష‌సుడ‌ని.. తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌డ‌ని వ్యాఖ్యానించారాయ‌న‌.గతంలో వైఎస్సార్‌ కుటుంబం తన అంగబలాన్ని, ఆర్థిక బలాన్ని దెబ్బతీసి ఎన్నో చిత్ర‌ హింసలకు గురిచేసిందని, మంగలి కృష్ణ అనే వ్యక్తితో కలిసి.. తనపై సూట్‌కేస్ బాంబు దాడి చేయించి చంపాలని చూశారని ఆరోపించారు పార్థసారథిరెడ్డి. తమపై కక్ష సాధింపు చర్యలు జరిగాయని, తాము ఎన్నో పోరాటాలు చేసి నిలబడ్డామని, జగన్ తమకు ఎలాంటి ప్రాణభిక్ష పెట్టలేదని ఆయన మండిపడ్డారు.రాజారెడ్డి హత్య అనేది 1998లో జరిగిన ఒక ఫ్యాక్షన్ ఉదంతం. న్యాయస్థానాలు దీనిపై తీర్పునిచ్చి ఎప్పుడో కేసు క్లోజ్ అయినప్పటికీ, ఏపీలో వైసీపీ-టీడీపీ మధ్య నడుస్తున్న హత్యా రాజకీయాల సవాల్-ప్రతిసవాళ్లలో భాగంగా ఈ పాత కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. అంతే కాదు గొడ్డ‌లి పార్టీ అంటూ చంద్ర‌బాబు జ‌గ‌న్ పార్టీని అన‌డంతో అస‌లీ గొడ‌వంతా మొద‌లైంది. ఎవ‌రిది క్రిమిన‌ల్ బ్రైన్? అంటూ జ‌గ‌న్ పాత కాల‌పు కేసుల‌న్నిటినీ తిర‌గ‌దోడారు. అందులో భాగంగా ఇదంతా మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

Publish Date: May 22, 2026 12:25PM
ఇస్లామీకరణను పక్కన పెట్టి లాహోర్ లో హిందూ దేవుళ్ల పేర్లు.. పాక్ వ్యూహం ఏంటి?
ఇస్లామీకరణను పక్కన పెట్టి లాహోర్ లో హిందూ దేవుళ్ల పేర్లు.. పాక్ వ్యూహం ఏంటి?

పాకిస్తాన్‌లోని చారిత్రాత్మక నగరమైన లాహోర్ పాత సాంస్కృతిక మూలాలను మళ్లీ వెలికితీస్తోంది. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఇస్లామీకరణ ధోరణిని పక్కనపెట్టి.. దేశ విభజనకు ముందు ఉన్న చారిత్రక హిందూ, సిక్కు, జైన్ గుర్తింపులను పాకిస్థాన్ ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. ఇందులో భాగంగానే లాహోర్ లోని పలు ప్రాంతాలలో వలస పాలన కాలం నాటి అంటే బ్రిటిష్ కాలం నాటి, దేశ విభజనకు పూర్వం ఉన్న పాత పేర్లు తిరిగి దర్శనమిస్తున్నాయి. రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు. ఈ మార్పుల్లో భాగంగా ఇస్లాంపురా ప్రాంతానికి కృష్ణానగర్ గా, బాబ్రీ మసీదు చౌక్ ను జైన్ మందిర్ చౌక్ గా, రెహమాన్ గల్లీ ని రామ్ గల్లీ గా మార్చారు. వీటితో పాటు 'ఫాతిమా జిన్నా రోడ్డును పాత పేరైన క్వీన్స్ రోడ్డుగా పునరుద్ధరించారు. ఈ మార్పుల వెనుక పాకిస్తాన్ అంతర్జాతీయ వ్యూహం దాగి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాము ఉగ్ర ధోరణులను వీడి, అందరినీ కలుపుకుపోయే సహనశీల, అలాగే.. బహుళ సంస్కృతుల దేశంగా మారుతున్నట్లు ప్రపంచ దేశాలకు చాటిచెప్పేందుకు పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటున్నారు. దీని ద్వారా అంతర్జాతీయ సమాజం నుండి దౌత్య, ఆర్థిక సహాయాన్ని సులభంగా పొందవచ్చని పాక్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఉగ్రవాద నిధుల ఆరోపణల వల్ల పాక్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే వేల కోట్ల డాలర్ల నష్టాన్ని చవిచూసింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు మళ్లీ ఆంక్షలు విధించకుండా నివారించడానికి, తాము తీవ్రవాదానికి దూరంగా జరుగుతున్నామనే నమ్మకాన్ని కలిగించేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నమే ఈ పేర్ల మార్పు అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్.. మనుగడ కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి ) బెయిల్ అవుట్ ప్యాకేజీపైనే పూర్తిగా ఆధారపడింది. ఆర్థిక అంశాలతో పాటు, ఆయా దేశాల రాజకీయ, సామాజిక వాతావరణాన్ని కూడా ఐఎంఎఫ్ పరిగణనలోకి తీసుకుంటుంది కనుక.. విదేశీ పెట్టుబడిదారులలో, ఐఎంఎఫ్ ప్రతినిధులలో నమ్మకాన్ని పెంపొందించేందుకు ఈ చారిత్రక పునరుద్ధరణ చర్యలను పాకిస్థాన్ చేపట్టిందని అంటున్నారు. ఈ పేర్ల మార్పు ప్రక్రియ 2025లోనే మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియం షరీఫ్‌ల నేతృత్వంలో ప్రారంభమైంది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 50 బిలియన్ పాకిస్తానీ రూపాయల ప్రాజెక్ట్ అయిన లాహోర్ హెరిటేజ్ ఏరియా రివైవల్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ద్వారా దేశ సాంస్కృతిక రాజధానిగా వెలుగొందిన లాహోర్‌కు విభజన కు ముందు నాటి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా చారిత్రక, వారసత్వ పర్యాటకాన్ని ప్రోత్సహించి, ప్రభుత్వానికి కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోవాలని పాక్ యోచిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని చారిత్రక ప్రాంతాలకు వాటి పాత పేర్లను అధికారికంగా పునరుద్ధరించే అవకాశం ఉంది.

Publish Date: May 20, 2026 1:42PM
ఓరి మీ ఎలివేషన్‌లో...విజ‌య్ లంచ్ బాక్స్ వెన‌క‌...ఇంత మేట‌రుందా?
ఓరి మీ ఎలివేషన్‌లో...విజ‌య్ లంచ్ బాక్స్ వెన‌క‌...ఇంత మేట‌రుందా?

విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది. ఒక సీఎం అంటే ఫుడ్, హెల్త్ ఇత‌ర అలవెన్సుల‌న్నీ ప్ర‌భుత్వ‌మే చూసుకుంటుంది. సాధార‌ణ ఎమ్మెల్యేకే ఈ వ‌స‌తులుంటాయి. అలాంటిది ఒక ముఖ్య‌మంత్రికి స‌క‌ల సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తుంది ప్ర‌భుత్వం. అయితే మోదీ సూచించిన పొదుపు సూత్రాలు పాటించ‌డంలో భాగమా లేక‌, బేసిగ్గానే విజ‌య్ సినిమాటిక్ డ్రామా పండించ‌డంలో ఇదొక ఎత్తా? తెలీదు. కానీ, ఓవ‌రాల్ గా అయితే విజ‌య్ సీఎంగా కోటు వేసుకోవ‌డం నుంచి మొద‌లు పెడితే, అసెంబ్లీలో నోట్స్ రాసుకోవ‌డం. ఇప్పుడు చూస్తే లంచ్ బాక్స్ ఇంటి నుంచి తెప్పించుకోవ‌డం వంటివి.. సోష‌ల్ మీడియాలో ట్రోలింగులు, ఎలివేష‌న్లు బాగా ఎక్కువ‌య్యాయి. మాములుగా మ‌న పాల‌కుల విష‌యానికి వ‌స్తే కేసీఆర్, జ‌గ‌న్ కేవ‌లం ఆహారం కోసం పెట్టిన మొత్తం గ‌తంలో చాలా పెద్ద చ‌ర్చ‌నీయాంశం. ఇప్పుడు విజ‌య్ ఫుడ్డు కూడా త‌న సొంత ఖ‌ర్చులే అన‌డం వెన‌క చాలా పెద్ద అర్ధ‌ముంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ప్రగతి భవన్‌లో జరిగిన అధికారిక సమావేశాలు, విందులు, ఆతిథ్య ఖర్చులపై- RTI ద్వారా కొన్ని ఆసక్తికరమైన వివరాలు బయటకు వచ్చాయి. కేసీఆర్ హయాంలో ప్రగతి భవన్‌లో వివిధ కార్యక్రమాలు, కలెక్టర్ల సమావేశాలు, ప్రజాప్రతినిధుల విందులు, ఇతర హాస్పిటాలిటీ కోసం సుమారు రూ.1,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.ఇందులో ముఖ్యంగా తెలంగాణ సంప్రదాయ వంటకాలు, మాంసాహార విందులతో పాటు వీఐపీలకు ఏర్పాటు చేసిన ఆతిథ్య ఖర్చులు అత్యధికంగా ఉన్నట్లు ఈ నివేదికలు తేల్చి చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కేవలం స్నాక్స్, లంచ్ కోసం పెట్టిన ఖర్చుపై ప్రస్తుత అధికార పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ముగ్గురు తిన‌డానికి ఒక మ‌ధ్యాహ్నం డెబ్బై వేల రూపాయ‌లు వ‌చ్చించి లంచ్ తెప్పించుకున్నారంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల ముఖ్యమంత్రి కాలంలో సీఎంఓ పరిధిలో కేవలం ఎగ్ పఫ్స్ ఇతర స్నాక్స్ కోసమే రూ.3.62 కోట్లు ఖర్చు చేశారని టీడీపీ నేతలు అధికారిక లెక్కలను చూపిస్తూ విమర్శించారు. ఈ లెక్కల ప్రకారం ఏడాదికి సగటున రూ.72 లక్షలు, అంటే రోజుకు సుమారు వెయ్యి ఎగ్ పఫ్స్ చొప్పున ఐదేళ్లలో దాదాపు 18 లక్షల పఫ్స్‌లను క్యాంప్ ఆఫీస్‌లో వాడినట్లు ట్రెండింగ్ నెరేటివ్ నడిచింది. దీనిని అప్పట్లో కూటమి నేతలు ఎగ్ పఫ్ స్కామ్ అని కూడా పిలిచారు. అయితే ఈ ఆరోపణలపై ఆయా ప్రతిపక్ష పార్టీలు ఘాటుగానే స్పందించాయి. ముఖ్యమంత్రి నివాసానికి, కార్యాలయానికి ప్రతిరోజూ వందలాది మంది అధికారులు, విదేశీ ప్రతినిధులు, సందర్శకులు, పార్టీ క్యాడర్ వస్తుంటారని... అది కేవలం సీఎం ఒక్కరే తిన్న ఖర్చు కాదని అంటారు వైసీపీ లీడ‌ర్లు. అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడు కూడా తన హయాంలో 2014-19 మ‌ధ్య‌ స్నాక్స్, ఆతిథ్యం కోసం రూ.8.5 కోట్లకు పైగా ఖర్చు చేశారని ఎదురుదాడి చేసింది వైసీపీ. ఇక బీఆర్‌ఎస్ వాదన ఎలాంటిదంటే.. ప్రగతి భవన్‌లో జరిగినవన్నీ అధికారిక సమావేశాలని, రాష్ట్ర ప్రగతి కోసం దేశ విదేశీ ప్రతినిధులకు, అధికారులకు ఇచ్చే ప్రోటోకాల్ ఆతిథ్య ఖర్చులను ఇలా వ్యక్తిగత ఖర్చులుగా చూపించడం రాజకీయ కక్షసాధింపేనని కొట్టిపారేసింది. మొత్తంగా చూస్తే, ప్రజాధనంతో నడిచే ముఖ్యమంత్రి కార్యాలయాల్లో జరిగే ఈ భారీ ఆతిథ్య ఖర్చులు ఎప్పుడూ అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద రాజకీయ యుద్ధానికి కారణమవుతూనే ఉంటాయి. మంత్రి నారా లోకేష్ తన 77 విమాన ప్రయాణాలకు గానూ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా టికెట్ ఖర్చుల కింద తీసుకోలేదు. అధికారిక పర్యటనలు, పెట్టుబడుల సాధన కోసం చేసిన ప్రయాణాలు, వ్యక్తిగత పర్యటనలు.. ఇలా అన్నింటికీ ఆయన తన సొంత నిధులనే ఉపయోగించారు. గతంలో వైసీపీ హయాంలో లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు.. ఆయన ఆఫీస్ స్నాక్స్, టీ బిల్లుల కింద రూ.25 లక్షలు ప్రజాధనం ఖర్చయిందంటూ వచ్చిన పాత ఆరోపణలపై లోకేష్ అప్పట్లోనే తీవ్రంగా స్పందించారు. తాజాగా వైఎస్ జగన్ హయాంలో సీఎంఓలో కేవలం ఎగ్ పఫ్స్, స్నాక్స్ కోసమే రూ.3.62 కోట్లు ఖర్చయ్యాయనే నిజాలు బయటకు వచ్చిన తరుణంలో.. లోకేష్ తన విమాన ప్రయాణాలు, ఆహారం, కనీసం తాగే వాటర్ బాటిల్ ఖర్చులను కూడా ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా తనే చూసుకుంటున్నారని టీడీపీ శ్రేణులు ఆర్టీఐ రికార్డులను చూపిస్తూ గట్టిగా కౌంటర్ ఇస్తున్నాయి. ఇటీవల లోకేష్ భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి శ్రీలంక వెళ్లినప్పుడు కూడా రాష్ట్రం అప్పుల్లో ఉంటే మంత్రి లగ్జరీ టూర్లు వేస్తున్నారు అని విమర్శించాయి వైసీపీ శ్రేణులు. అయితే ఆ టూర్‌కు సంబంధించిన ఫ్లైట్ టికెట్లు, హోటల్ స్టే, ఫుడ్ ఖర్చులన్నీ లోకేష్ తన సొంత అకౌంట్ నుంచే కట్టారని, ప్రభుత్వానికి సంబంధం లేదని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా స్పష్టం చేసింది. రాజకీయాల్లో నాయకులు ప్రభుత్వ ప్రోటోకాల్ కింద‌ ఖర్చులను వాడుకోవడం సర్వసాధారణం. కానీ, లోకేష్ తనపై వస్తున్న రాజకీయ ఆరోపణలకు చెక్ పెట్టడానికి, తన పరిపాలనలో పారదర్శకతను చూపించడానికి.. అధికారిక పర్యటనల ఖర్చులను కూడా తన సొంత జేబు నుండే పెట్టుకుంటున్నారని ఈ అధికారిక లెక్కలు నిరూపించాయి. ఇలా లోకేష్ ఆల్రెడీ ఈ పొదుపు సూత్రం పాటిస్తున్నారు. ఇప్పుడు కొత్త‌గా విజ‌య్ వ‌చ్చి ఈ నిరాడంబ‌ర‌త పాటించ‌డం లేద‌న్న‌ది కొంద‌రి కామెంట్. అయితే విజ‌య్ విష‌యంలో కొస‌మెరుపు ఏంటంటే త్రిష ఆయ‌న‌గారి కోసం ఎలాంటి వంట‌లు చేస్తున్నారు? అవెలాంటి రుచిని క‌లిగి ఉన్నాయి? వెజ్ వంట‌లా- నాన్ వెజ్ వంట‌లా? అన్న స‌ర‌దాతో కూడిన సెటైర్లు వేస్తున్నారు కొంద‌రు.

Publish Date: May 17, 2026 4:56PM
వైసీపీ నోరు మూయించేలా చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్.. వర్చువల్ పద్ధతిలో మహానాడు
వైసీపీ నోరు మూయించేలా చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్.. వర్చువల్ పద్ధతిలో మహానాడు

తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పసుపు పండుగ మహానాడు నిర్వహణలో ఈ ఏడాది ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ఏటా ఘనంగా, భారీ జనసందోహం మధ్య భౌతికంగా నిర్వహించే ఈ మహాసభను ఈసారి పూర్తిగా సరికొత్త పంథాలో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపునకు అనుగుణంగా.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏటా మే 27, 28 తేదీల్లో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులను భాగస్వామ్యం చేస్తూ మహానాడును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది వైసీపీకి పెట్టని కోటలాంటి కడప జిల్లాలో మహానాడును విజయవంతంగా నిర్వహించిన టీడీపీ.. ఈసారి నెల్లూరు వేదికగా నిర్వహిం చాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం నెల్లూరులో ఇప్పటికే ఏర్పాట్లు కూడా ప్రారంభ మయ్యాయి. అయితే పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన వనరుల పొదుపుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో చంద్రబాబు నాయుడు తన వ్యూహాన్ని మార్చారు. కొత్త ప్రణాళిక ప్రకారం కేవలం పొలిట్‌బ్యూరో సభ్యులు మాత్రమే మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌కు నేరుగా హాజరవుతారు. అక్కడ జరిగే తీర్మానాలు, ప్రసంగాలు, వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలకు ఎక్కడికక్కడ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చేరవేయనున్నారు. అందుకోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 1,845 క్లస్టర్లను గుర్తించి, అక్కడ పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనివల్ల వేలాది మంది కార్యకర్తలు సుదూర ప్రాంతాల నుండి ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండా, తమ సొంత ప్రాంతాల నుంచే ఈ పండుగలో భాగస్వాములు కావచ్చు. వాస్తవానికి నెల్లూరులో భారీ ఎత్తున సభ నిర్వహించేందుకు పనులు శరవేగంగా సాగుతున్న తరుణంలో.. అధిష్టానం నుండి వచ్చిన ఈ తాజా ఆదేశాలతో శుక్రవారం (మే 15) సాయంత్రం నుంచే అక్కడ వేదిక పనులు నిలిచిపోయాయి. సాంకేతికతను సమర్థవంతంగా వాడుకుంటూనే వనరులను ఆదా చేసే ఉద్దేశంతో పార్టీ అధినేత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు చంద్రబాబు నిర్ణయం వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. నిన్నటి దాకా ప్రధాని పొదుపు అంటుంటే.. మహానాడును ఆర్భాటంగా ఎలా నిర్వహిస్తారు. తెలుగుదేశం పార్టీ ఈ ప్రతిష్ఠాత్మక మహానాడు వేడుకను కుదించుకుంటుందా? అంటూ సోషల్ మీడియాలో వైసీపీ విమర్శలు గుప్పించింది. అయితే చంద్రబాబు నిర్ణయంతో వైసీపీయుల నోళ్లు మూతపడ్డాయి. ఇటు ఇంధన పొదుపు బాధ్యతను చాటుకుంటూనే.. , అటు డిజిటల్ మాధ్యమాల ద్వారా గ్రామీణ స్థాయి క్యాడర్‌ను ఏక తాటిపైకి తెచ్చేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ఎప్పుడూ ముందుండే చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ తాజా వ్యూహం భవిష్యత్తులో మిగిలిన పార్టీలకు కూడా మోడల్ గా మారే అవకాశాలున్నాయని అంటున్నారు.

Publish Date: May 16, 2026 10:50AM
నుదుట సింధూరం.. జగన్ ఆహార్యంపై సర్వత్రా చర్చ
నుదుట సింధూరం.. జగన్ ఆహార్యంపై సర్వత్రా చర్చ

భారత రాజకీయ వ్యవస్థ వేగంగా పరివర్తన చెందుతోంది. రాజకీయ వాతావరణం ఇప్పుడు హిందూ వాదం వైపు బలంగా మొగ్గు చూపుతోంది. వాస్తవానికి బీజేపీ ద్వారా మొదలైన ఈ పవనం, ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకూ విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ధోరణి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అనుసరిస్తున్నారు. ఆయన ఇటీవల తన నుదుటిపై సింధూర తిలకంతో బహిరంగంగా కనిపించారు. జగన్‌కు లౌకికవాద ముద్ర ఉంది, ఆయన తనను తాను క్రైస్తవ లేదా హిందూ విశ్వాసాలకు మాత్రమే పరిమితం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఆయన నుదుటిపై సంప్రదాయ హిందూ బొట్టు కనిపించడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. వాస్తవానికి గత కొంతకాలంగా.. మతం, మతతత్వ రాజకీయాల పేరుతో జగన్‌ పలు విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఇటీవలి కాలంలో తరచూ హిందూ దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఇక ఇప్పుడు నుదుటిపై సింధూర తిలకంతో బహిరంగంగా కనిపిండం.. హిందూ సమాజంతో తనకున్న అనుబంధాన్ని చాటిచెప్పేందుకు చేసిన బలమైన ప్రయత్నంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో ఎన్నికల ప్రచార సమయంలో లేదా ఆలయాల సందర్శనలో మాత్రమే.. జగన్ తాను హిందూ సంప్రదాయాలను పాటిస్తున్నట్లు చూపించుకోవడానికి ప్రయత్నించేవారు. ఆయా సందర్భాలలో జగన్ పొడవాటి నామంతో కనిపించేవారు. ఆయా సందర్భాలలో.. కేవలం ఓట్ల కోసమే ఈ వేషధారణ అంటూ జగన్ నెటిజన్లకు టార్గెట్ గా మారి ట్రోలింగ్ కు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా గుండ్రటి సింధూర బొట్టుతో కనిపించడంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతున్నది. గత ఎన్ని కలలో ఘోర పరాజయం తర్వాత జగన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సింధూర ధారణను ఆశ్రయించారా అన్న చర్చ జరుగుతోంది. దీనిపై నెటిజన్లు సిస్టమ్ అప్‌డేట్ అయినట్లుంది, నామం పోయి బొట్టు వచ్చిందంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు.

Publish Date: May 13, 2026 11:37AM
తెల్ల చొక్కా.. నల్ల కోటు.. తమిళనాడు ముఖ్యమంత్రి ఆహార్యం
తెల్ల చొక్కా.. నల్ల కోటు.. తమిళనాడు ముఖ్యమంత్రి ఆహార్యం

భారత రాజకీయాలలో విజయ్ తన విలక్షణతను చాటుకున్నారు. సాధారణంగా పొలిటీషియన్స్ ట్రేడ్ మార్క్ దుస్తులను ధరిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని తీసుకుంటే.. ఆయన అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ఒకే రకంగా ఖద్దరు చొక్కా ఫ్యాంట్ తోనే కనిపిస్తారు. అలాగే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ నిత్యం తెల్ల చొక్కా ఖాకీ ప్యాంట్ ఆయన ట్రేడ్ మార్క్ డ్రెస్సింగ్. అలాగు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఒకే రకమైన ఆహార్యంతో కనిపిస్తుంటారు. వీరే కాదు.. సాధారణంగా రాజకీయ నాయకులంతా కూడా బహిరంగంగా కనిపించే సమయాల్లో తమదైన గుర్తింపు దక్కేలా ఒకే రకమైన దుస్తులతో కనిపిస్తారు. ఇదొక ఒరవడిగా, సాప్రదాయంగా స్థిరపడిపోయింది. అయితే.. ఈ ఒరవడిని, సంప్రదాయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బద్దలు కొట్టారు. ఆదివారం (మే 11) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సమయంలో విజయ్ తెల్ల చొక్కాపై నల్ల కోటు వేసుకున్నారు. ఒక ముఖ్యమంత్రిని ఎన్నడూ అలాంటి ఆహార్యంలో చూడని జనం ఆశ్చర్యపోయారు. అభినందించారు. విజయ్ ఆహార్యం సమ్ థింగ్ స్పెషల్ అని భావించారు. అంతే కాకుండా సోమవారం ( మే 12) ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా అదే లుక్ లో అంటే తెల్లచొక్కా, నల్ల కోటు వేసుకుని వచ్చారు. దీనిని బట్టి ఇక సీఎంగా విజయ్ ఇదే డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రీ కూడా ఇలాంటి ఆహార్యాన్ని ఎంచుకోలేదు.నల్లకొటు ధరించే ఏకైక ముఖ్యమంత్రి విజయ్ అనడంలో సందేహం లేదు. సీఎంలు, ప్రముఖ పొలిటీషియన్లు ధరించే సాధారణ చొక్కాలు, ప్యాంట్లు మొనాటనీ అయిపోయి జనం వాటిని పట్టించుకోవడమే మానేశారని చెప్పొచ్చు. సరిగ్గా అలాంటి సమయంలో.. విజయ్ ఒక డిఫరెంట్ లుక్ ను ఎంచుకున్నారు. ఇది తమిళనాటే కాదు.. దేశ వ్యాప్తంగా అందరి ఆసక్తినీ చూరగొంది.

Publish Date: May 11, 2026 3:15PM
మొరార్జి టు విజ‌య్...మైనార్టీ ప్ర‌భుత్వాలు వాటి  ప‌ర్యావ‌స‌నాలేంటి?
మొరార్జి టు విజ‌య్...మైనార్టీ ప్ర‌భుత్వాలు వాటి ప‌ర్యావ‌స‌నాలేంటి?

మాములుగా పార్ల‌మెంటు థియ‌రీ అంటే ఏమిటంటే ప్ర‌ధాని మాత్ర‌మే నిర్ణ‌యాలు తీసుకునేది కాదు. అది మొత్తం పార్ల‌మెంటు ఆమోదం ద్వారా తీసుకునే నిర్ణ‌యం. ఈ స్ఫూర్తి ఇలా ఉంటే, ఒక ప్ర‌భుత్వంలోనే ఒక మినీ పార్ల‌మెంటు అంటే, వివిధ పార్టీల క‌ల‌య‌క ఉంటే అది మ‌రో ర‌క‌మైన స‌మ‌స్య‌గానూ మారుతుంది. ఆనాటి మొరార్జిదేశాయ్ నుంచి నేటి విజ‌య్ వ‌ర‌కూ.. సంకీర్ణ ప్ర‌భుత్వాల పుట్టినిల్లు కేర‌ళతో క‌లుపుకుని చూస్తే.. సంకీర్ణ ప్ర‌భుత్వాలేంటి? భార‌త్ లో వాటి చ‌రిత్ర ఏంటి? ఎదుర్కునే స‌వాళ్లు ఎలాంటివి సోదాహ‌ర‌ణ‌గా గ‌మ‌నిస్తే.. మ‌న‌కు అనేక అంశాలు క‌నిపిస్తాయి. భారతీయ రాజకీయాల్లో సంకీర్ణ శకం అనేది ఒక అనివార్యమైన మలుపు. మొరార్జి దేశాయ్ కాలం నుంచి నేటి విజయ్- టీవీకే వరకు రాజకీయాల్లో అధికారం పంపిణీ అయ్యే తీరు మారింది. ఒకప్పుడు ఒకే పార్టీ ఆధిపత్యం ఉంటే, ఇప్పుడు అనేక‌ ప్రాంతీయ శక్తులు కేంద్ర బిందువులుగా మారాయి. ఇదిలా ఉంటే సంకీర్ణ ప్రభుత్వాల చరిత్ర, భారత్ లో పరిణామ క్రమం మొత్తం మూడు ప్రధాన దశలుగా చూడవచ్చు.. ప్రారంభ దశ 1977-1989 నాటిది. కాంగ్రెసేతర పక్షాలన్నీ కలిసి 1977లో జనతా పార్టీగా ఏర్పడి తొలి సంకీర్ణ ప్రభుత్వాన్ని మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ఏర్పాటు చేశాయి. అయితే, అంతర్గత కుమ్ములాటలతో ఇది రెండేళ్లకే కుప్పకూలింది. 1989-1999 మ‌ధ్య కాలానికి వ‌స్తే.. 1991లో పీవీ నరసింహారావు మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహించినా, బయటి నుంచి మద్దతు కూడగట్టుకుని ఐదేళ్లు పూర్తి చేశారు. ఆ తర్వాత వచ్చిన యునైటెడ్ ఫ్రంట్.. ద్వారా ఏర్ప‌డ్డ‌ దేవెగౌడ, ఐ.కె. గుజ్రాల్ ప్రభుత్వాలు మద్దతు ఉపసంహరణల వల్ల తక్కువ కాలం మాత్ర‌మే పనిచేశాయి. స్థిరమైన సంకీర్ణాల దశ 1999-2014గా చెప్పాలి. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని NDA 24 పార్టీల‌ను క‌లుపుకుని.. సంకీర్ణ ధర్మాన్ని పాటించి, ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని- UPA పదేళ్ల పాటు సంకీర్ణ పాలన సాగించింది. ఇక‌ కేరళను.. సంకీర్ణ ప్రభుత్వాల పుట్టినిల్లుగా చెప్పాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా కేరళలో దశాబ్దాలుగా సంకీర్ణాలే రాజ్యాధికారాన్ని చెలాయిస్తున్నాయి. అక్కడ LDF, UDF అనే రెండు బలమైన కూటములు ఉన్నాయి. చిన్న చిన్న పార్టీలు కూడా ఈ కూటముల్లో చేరి ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. కేరళ మోడల్ ఏంటంటే—రాజకీయంగా విబేధించినా, కామన్ మినిమం ప్రోగ్రామ్ ద్వారా పాలన సాగించడం. సంకీర్ణ ప్రభుత్వాలు ఎదుర్కొనే సవాళ్లు ఎలాంటివో ప‌రిశీలిస్తే.. సంకీర్ణ పాలన అనేది కత్తి మీద సాము లాంటిది. ఇందులో ప్రధానంగా మూడు రకాల సవాళ్లు ఉంటాయని చెప్పాల్సి ఉంటుంది. ఏదైనా పెద్ద నిర్ణయం ఫ‌ర్ స‌పోజ్.. ఆర్థిక సంస్కరణలు లేదా విదేశీ పెట్టుబడుల విష‌యంలై డెసిష‌న్ తీసుకోవాలంటే అన్ని మిత్రపక్షాలు ఒప్పుకోవాలి. ఒక్క పార్టీ అడ్డుపడినా ప్రభుత్వం ముందుకు వెళ్లలేదు. ఉదాహ‌ర‌ణ‌కు UPA-1 కాలంలో లెఫ్ట్ పార్టీల ఒత్తిడి వల్ల అణు ఒప్పందంలో తీవ్ర జాప్యం జరిగిన‌ట్టు. చిన్న పార్టీలు తమ ప్రాంతీయ ప్రయోజనాల కోసం లేదా పదవుల కోసం మద్దతు ఉపసంహరించుకుంటామని కేంద్రాన్ని బెదిరిస్తుంటాయి. గతంలో జయలలిత AIADMK వాజ్‌పేయి ప్రభుత్వాన్ని ఒక్క ఓటుతో పడగొట్ట‌గ‌లిగింది. సంకీర్ణ ప్ర‌భుత్వాల్లో ఉమ్మడి కనీస ప్రణాళిక- CMP అత్య‌వ‌స‌రం. విభిన్న సిద్ధాంతాలు కలిగిన కాంగ్రెస్, క‌మ్యూనిస్ట్, ముస్లీం లీగ్, ద‌ళిత వ‌ర్గాల‌కు చెందిన‌ పార్టీలు కలిసి పనిచేసేటప్పుడు ఎవరి ఎజెండా అమలు చేయాలనే దానిపై నిరంతరం సంఘర్షణ చెల‌రేగుతుంది. తమిళనాడులో విజయ్ ఇప్పుడు కాంగ్రెస్‌తో జతకట్టడం ద్వారా ఒక కొత్త కూటమిని నిర్మించాలని చూస్తున్నారు. ఇందులో విజ‌య్ ఎదుర్కునే ప్ర‌ధాన‌మైన స‌మ‌స్య ఏంటంటే.. ఒకవైపు మిత్రధర్మాన్ని పాటించాలి, మరోవైపు తన సొంత ఉనికిని సైతం కాపాడుకోవాలి. విజయ్ వంటి కొత్త నాయకులకు సంకీర్ణ నిర్వహణ అనేది పరీక్షా సమయం. ఎందుకంటే, అధికారం పంచుకోవడం అనేది కేవలం పదవుల పంపిణీ మాత్రమే కాదు, బాధ్యతల పంపిణీ కూడా. భారతదేశం వంటి భిన్నత్వంతో కూడిన దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలే ప్రజాస్వామ్యానికి నిజమైన ప్రతిబింబాలు. ఇవి ఏ ఒక్క పార్టీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకుంటాయి. కానీ, అది సమర్థవంతమైన పాలన దారి తీస్తుందా లేక అస్థిరతకు కార‌ణ‌మ‌వుతుందా? అనేది ఆ కూటమిని నడిపే నాయకుడి నేతృత్వంపై ఆధారపడి ఉంటుంది. పీవీ నరసింహారావు తన మేధస్సుతో మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపినట్లు, విజయ్ తన సినీ బుర్ర‌తో సంకీర్ణాన్ని ఎలా నడిపిస్తారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే ఒక సినిమా అంటేనే- 24 క్రాఫ్ట్ ల స‌మాహారం. సినిమాల నుంచి వ‌చ్చిన విజ‌య్ కి ఈ మాత్రం తెలియంది కాదు. తానొక హీరోగా నిర్మాత‌ల‌పై ఎన్నో డిమాండ్ల‌తో ఒత్తిడి తెచ్చి ఉంటారు. ఇప్పుడాయ‌న త‌న సంకీర్ణ ప్ర‌భుత్వానికి తానే ఒక‌ నిర్మాత వంటి వారు. మ‌ రి ఒక‌టీ అరా సీట్లిచ్చి కూడా భారీ ఎత్తున ప్ర‌యోజ‌నాల‌ను కోరే వారిని ఆయ‌న ఎలా శాంత ప‌రుస్తారు? ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవుతారు? ఎలాంటి ప్ర‌య‌రోగాలు చేసి వారిని కంట్రోల్లోకి తెచ్చుకుంటార‌న్న నాట‌కం ఇక ముందు ముందు రంజుగా మార‌నుంద‌ని మాత్రం అంటున్నారు. మ‌రి చూడాలి.. ఈ అనుభ‌వ రాహిత్యంతో కూడిన సినీ హీరో ట‌ర్న‌డ్ పొలిటీషియ‌న్ ఉద్దండ పిండాలైన ఈ సీనియ‌ర్ త‌మిళ‌ పొలిటీషియ‌న్ల‌ను ఎలా దారిలోకి తెస్తారో తేలాల్సి ఉంది. అన్నిటిక‌న్నా ముందు.. త‌న హామీల‌ను ఆయ‌న ఎలా నెర‌వేర్చుతార‌న్న‌ది కూడా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ని త‌ల‌పిస్తోంది.

Publish Date: May 10, 2026 3:53PM
విజయ్ కోసం డీఎంకేతో కటిఫ్.. కాంగ్రెస్ కు మైనసేనా?
విజయ్ కోసం డీఎంకేతో కటిఫ్.. కాంగ్రెస్ కు మైనసేనా?

తమిళనాడు రాజకీయ యవనికపై సంభవించిన పరిణామాలు, కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారనున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే)కి మద్దతు పలకడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సాహసోపేతమైన, ప్రమాదకరమైన అడుగు వేసిందంటున్నారు. దశాబ్దాలుగా విశ్వాసపాత్రమైన మిత్రపక్షంగా ఉన్న డీఎంకేతో బంధాన్ని తెంచుకుని.. విజయ్‌కు హస్తం పార్టీ అండగా నిలవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాకుండా.. రానున్న సార్వత్రిక సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఇండియా కూటమిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 107 స్థానాలను గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు మాత్రం చేరుకోలేకపోయింది. ఈ క్లిష్ట సమయంలో దశాబ్దాల నాటి డీఎంకే స్నేహాన్ని తెంచుకుని మరీ.. కాంగ్రెస్ విజయ్‌కు మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం డీఎంకే అధినాయకత్వానికి మింగుడుపడలేదు. ఫలితంగా కాంగ్రెస్‌తో ఇకపై ఎలాంటి పొత్తు ఉండదని డీఎంకే స్పష్టం చేయడమే కాకుండా.. పార్లమెంటులో కూడా ఆ పార్టీ ఎంపీల పక్కన కూర్చునేందుకు నిరాకరిస్తుండటం రాజకీయ వేడిని పెంచుతోంది. ఈ పరిణామం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలాన్ని గణనీయంగా తగ్గించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం లోక్‌సభలో డీఎంకేకు 22 మంది సభ్యులు ఉన్నారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ తర్వాత అత్యధిక ఎంపీలు కలిగిన మూడో పెద్ద పార్టీ డీఎంకే కావడం గమనార్హం. ఇప్పుడు స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి నుంచి వైదొలగడంతో.. ఇండియా కూటమి బలం ఒక్కసారిగా 232 నుండి 210కి పడిపోయింది. కేవలం 100 మంది ఎంపీలు మాత్రమే ఉన్న కాంగ్రెస్.. ఇలాంటి సమయంలో కీలకమైన మిత్రపక్షాన్ని దూరం చేసుకోవడం రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల పరంగా చూస్తే తమిళనాడులో కాంగ్రెస్ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారనుంది. గత ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు కారణంగా కాంగ్రెస్ 9 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఒకవేళ డీఎంకే సహకారం లేకపోతే.. రాష్ట్రంలో కాంగ్రెస్ కనీసం ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు అన్నది వాస్తవం. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ప్రభంజనం సృష్టించినా, పార్లమెంట్ ఎన్నికల నాటికి ఓటర్ల మొగ్గు ఎలా ఉంటుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. మరోవైపు విజయ్‌కు మద్దతు ఇస్తున్న వీసీకే, సీపీఐ, సీపీఎం వంటి పార్టీలకు లోక్‌సభలో నామమాత్రపు బలం మాత్రమే ఉంది. ఈ చిన్న పార్టీల మద్దతుతో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో తన స్థానాన్ని పదిలపరుచుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. డీఎంకే వంటి బలమైన ప్రాంతీయ శక్తిని దూరం చేసుకోవడం వల్ల ఎన్డీఏ కూటమికి లాభం చేకూర్చడం వినా మరో ప్రయోజనం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. డీఎంకేను కాదని విజయ్ కు కాంగ్రెస్ మద్దతు పలకడాన్ని కాంగ్రెస్ పెద్ద తప్పిదమంటున్నారు.

Publish Date: May 9, 2026 1:38PM
పిఠాపురం నిత్య పంచాయతీకి ఇకనైనా ఫుల్ స్టాప్ పడేనా
పిఠాపురం నిత్య పంచాయతీకి ఇకనైనా ఫుల్ స్టాప్ పడేనా

పార్టీకి నాయకులు కాదు, కార్యకర్తలు ముఖ్యం. ఈ మాట తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు తరచూ చెబుతూనే ఉంటారు. అందుకు భిన్నంగా వ్యవహరించే నాయకులపై పార్టీ వేటు వేయడం కూడా కద్దు. తాజాగా ఆ కోవలోనే.. పిఠాపురం వర్మపై పార్టీ వేటు వేసింది. ఆయనను పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ పదవి నుంచి తొలగించింది. ఇందుకు కారణం.. పిఠాపురం నియోజకవర్గంలో తరచూ కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య వాగ్వాదాలు తలెత్తుతుండటమే. ఈ వాగ్వాదాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుండటం, పరిస్థితి నిత్య పంచాయతీగా మారిపోవడంతో తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గ ఇన్ చార్జ్ వర్మను ఆ పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రకటన వెలువడిన తర్వాత వర్మ మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఇయన ఒకింత భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమైనా... తనకు నియోజకవర్గ ఇన్ చార్జ్ పదవి నుంచి ఉద్వాసన పలకడంపై ఆయన స్పందించిన తీరు నిస్సందేహంగా హుందాగా ఉంది. ఆయన ఎక్కడా తన తొలగింపుపై నిరసన స్వరం వినిపించలేదు. పార్టీ నిర్ణయంపై పన్నెత్తి ఒక పరుష వాక్యం కూడా మాట్లాడలేదు. అంతే కాకుండా తన తొలగింపు విషయం తనకు పార్టీ ముందే చెప్పిందన్నారు. మంత్రి నారా లోకేష్‌ ఈ విషయాన్ని తనకు ముందే చెప్పారన్నారు. ఆ తరువాతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నారాయణ ఈ విషయం తనకు తెలిపారని వర్మ చెప్పారు. అక్కడితో ఆగకుండా.. తనకు పార్టీయే ముఖ్యమన్న వర్మ.. అందుకోసం త్యాగాలు చేయడానికి తాను ఎప్పుడూ వెనుకాడనన్నారు. తాను క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం కార్యకర్తనని చెప్పారు. ఆ సందర్భంగా ఆయనలో తనకు అన్యాయం జరిగిందన్న బాధ కించిత్తు కనిపించింది. ఆయన బాధపడటాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. తప్పుపట్టరు కూడా. ఎందుకంటే.. గత ఎన్నికలలో పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కేటాయించినప్పుడు ఆయన పార్టీ ప్రయోజనాలు, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించారు. పార్టీ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని తన సీటుని పవన్ కళ్యాణ్‌ కోసం త్యాగం చేసి, ఆయన తరపున ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించారు. ఆయన త్యాగాన్ని, తన విజయం కోసం ఆయన చేసిన కృషిని గుర్తించిన పవన్ అప్పట్లో తాను పిఠాపురం ఎమ్మెల్యే అయినప్పటికీ.. పిఠాపురానికి వర్మే నిజమైన ప్రతినిథి అన్నారు. వర్మతో చెపితే నాతో చెప్పినట్లే. వర్మ చెపితే నేను చెప్పినట్లే అని సముచిత గౌరవం, గుర్తింపు ఇచ్చారు. అక్కడి వరకూ ఓకే కానీ, తర్వాత తర్వాత పిఠాపురంలో జనసేన, వర్మ అనుచరులకు మద్య పలు సందర్భాలలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అదీ సహజమే.. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు. ఆ విషయం తెలిసి కూడా ఇంత కాలం నియోజకవర్గంలో తెలుగుదేశం, వర్మ వర్గీయుల మధ్య గ్యాప్ పూడ్చడానికి ఇటు తెలుగుదేశం అధిష్ఠానం కానీ, అటు జనసేనానిని కానీ ప్రయత్నించకపోవడమే పరిస్థితి ఇంత వరకూ రావడానికి కారణమైందని పరిశీలకులు అంటున్నారు. కనుక ఇకనైనా పిఠాపురంలో పరిస్థితిని చక్కదిద్దడానికి రెండు పార్టీలూ చర్యలు తీసుకోవాలి. వర్మ తొలగింపు ఆయనపై వేటుగా కాకుండా.. మరో పదవి ఇచ్చేందుకు మార్గంగా నియోజకవర్గ కార్యకర్తలు భావిస్తున్న పరిస్థితిని గమనించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇక జనేసేన కూడా.. స్థానిక జనసేన క్యాడర్ కూడా పొత్త ధర్మం ప్రకారం నడుచునునేలా చూసే బాధ్యత పవన్ కల్యాణ్ తీసుకోవాలి. లేకుంటే పరిస్థితి మరింత దిగజారి వైసీపీకి అవకాశం ఇచ్చేందుకు దోహదడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Publish Date: May 8, 2026 1:32PM
TeluguOne Picks For You
rss-imgRss Feeds