జగన్ వద్దు.. కాంగ్రెస్ ముద్దు.. కాంగ్రెస్ వైపు వైసీపీ సీనియర్ల చూపు?
జగన్ వద్దు.. కాంగ్రెస్ ముద్దు.. కాంగ్రెస్ వైపు వైసీపీ సీనియర్ల చూపు?

జగన్ ఏకపక్ష నిర్ణయాలు. ఒంటెత్తు పోకడల పట్ల వైసీపీలో తీవ్ర అసంతప్తి వ్యక్తం అవుతోంది. దీంతో ఆ పార్టీ కీలక నేతలు రహస్య భేటీలు నిర్వహించుకుని తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీలో అంతర్గత సంక్షోభం అంతర్గత సంక్షోభం ముదురుతోంది. గత ఎన్నికల ఘోర పరాజయం తర్వాత కూడా జగన్ తన తీరు మార్చుకోకుండా పాత పద్ధతులనే అవలంబిస్తుండటంపై వైసీపీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. 2014 నుండి 2019 మధ్య కాలంలో జగన్ రాజకీయ వ్యూహాలు అప్పట్లో సత్ఫలితాలను ఇచ్చాయి. కానీ 2019లో అధికారం చేపట్టిన తరువాత జగన్ తీసుకున్న నిర్ణయాలు, అవలంబించిన విధానాల కారణంగా ప్రజలలో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వచ్చింది. ఫలితంగా 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని కేవలం 11 స్థానాలలోనే విజయాన్ని కట్టబెట్టిన ప్రజా తీర్పు విస్పష్టంగా తేల్చి చెప్పింది. ఇప్పడు కూడా జగన్ తన పాత పద్ధతిని మార్చుకోకుండా తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రకటనలు తమ రాజకీయ భవిష్యత్ ను ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయన్న ఆందోళన, అసంతృప్తీ పార్టీ నేతలలో గూడుకట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. . పార్టీని బలోపేతం చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోకపోగా.. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను కూడా జగన్ పట్టించుకోవడం లేదని సొంత పార్టీ నేతల నుంచే కాకుండా శ్రేణుల నుంచి కూడా ఆరోపణలు వెల్లువెత్తుతన్నాయి. జగన్ ఏకపక్ష నిర్ణయాల వల్ల తాము రాజకీయంగా నష్టపోతున్నామని పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నేతలు అంతర్గత సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికలలో పార్టీ అజెండా మావిగన్ అని జగన్ ప్రకటన చేసిన తరువాత.. వైసీపీ సీనియర్లలో నిరాశా, నిస్ఫృహలు నెలకొన్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇంకా జగన్ తోనే ఉంటే.. రాజకీయ భవిష్యత్ శూన్యం అన్న భావన వారిలో ప్రస్ఫుటంగా వ్యక్తమౌతోంది. ఈ కారణంగానే వైసీపీకి చెందిన కొందరు సీనియర్, కీలక నేతలు ఇటీవలి కాలంలో రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుని మరీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుంటున్నట్లు ఏపీ రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. పార్టీ భవిష్యత్తు, తమరాజకీయ భవిష్యత్ పై కేవలం చర్చలకే పరిమితం కావడమే కాకుండా.. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. జగన్ సోదరి, వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు కావడంతో వైసీపీలోని వైఎస్ రాజశేరరెడ్డి అనుయాయులు, అభిమానులు ఆమెతో ఇటీవలి కాలంలో నిరంతరం టచ్ లో ఉంటున్నట్లు చెబుతున్నారు. జగన్ తీరు ఇలాగే ఉంటే.. సమీప భవిష్యత్ లోనే పలువురు కీలక వైసీపీ నేతలు హస్తం గూటికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. YSRCP Crisis, YS Jagan, Secret Meetings, AP Congress, YS Sharmila, AP Politics, Teluguone

Publish Date: Jul 4, 2026 11:32AM
కెన్యా మాయాద్వీపం మిస్టరీ.. అడుగుపెడితే శవాలు కూడా దొరకవు..?
కెన్యా మాయాద్వీపం మిస్టరీ.. అడుగుపెడితే శవాలు కూడా దొరకవు..?

ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి. అలాంటి ఒక భయంకరమైన, అంతుచిక్కని మాయాద్వీపమే కెన్యాలో ఉంది. హాలీవుడ్ సినిమాల్లో చూపించే అడ్వెంచర్ ఐలాండ్స్ లాగా, అక్కడికి వెళ్లిన వాళ్లు వెళ్లినట్లే మాయమైపోతారు. కనీసం వారి శవాలు కూడా దొరకవు. ఉత్తర కెన్యాలోని రుడాల్ఫ్ సరస్సు మధ్యలో ఉన్న ఈ వింత ద్వీపం పేరు 'ఎన్వైటెనెట్'. స్థానిక గిరిజన తెగ అయిన 'ఎల్ మోలో' భాషలో ఈ పేరుకు అర్థం "నో రిటర్న్" అంటే తిరిగి రావడం లేదని అర్థం. చుట్టూ అందమైన సరస్సు, దట్టమైన అడవి ఉన్నప్పటికీ ఈ ద్వీపంలో ప్రస్తుతం ఒక్క మనిషి కూడా నివసించడం లేదు. ఈ దీవికి ఏదో శాపం ఉందని, అందుకే అక్కడికి వెళ్లిన వారంతా మరణిస్తున్నారని స్థానికులు గట్టిగా నమ్ముతారు. చాలా ఏళ్ల క్రితం ఈ ద్వీపంలో కొంతమంది గిరిజనులు నివసించేవారని చరిత్ర చెబుతోంది. వారు వేటాడుతూ, చేపలు పడుతూ హ్యాపీగా బతికేవారు. బాగా నాగరికత తెలిసిన ఆ ద్వీపవాసులు తరచూ బయటి ప్రపంచంలోకి వచ్చి వ్యాపారాలు కూడా చేసేవారు. అయితే చాలా సంవత్సరాల పాటు ప్రశాంతంగా సాగిన వారి జీవితాల్లో ఒక రాత్రి ఊహించని విపత్తు సంభవించింది. ఒక రోజు వారు మెయిన్ ల్యాండ్‌కు రావడం హఠాత్తుగా ఆపేశారు. దాంతో అనుమానం వచ్చిన పక్క ఊరి ఎల్ మోలో తెగవారు గుంపుగా కలిసి ఆ ద్వీపానికి వెళ్లి చూశారు. అక్కడ వారికి కనిపించిన దృశ్యం చూసి ఒళ్లు గగుర్పొడిచింది. ఆ ద్వీపమంతా ఘోరమైన నిశ్శబ్దంతో, పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయింది. అక్కడ ఎంత వెతికినా ఒక్క మనిషి కూడా కనిపించలేదు. కానీ ఆశ్చర్యకరంగా వారి గుడిసెలు, బాణాలు, నిల్వ చేసుకున్న ఉల్లిగడ్డలు మరియు వస్తువులన్నీ అలాగే చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆరిపోయిన పొయ్యిల దగ్గర కుళ్ళిపోతున్న చేపలు కనిపించాయి. అంటే వారు ముందే ప్లాన్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఒకవేళ ఎవరైనా దాడి చేసి చంపేస్తే కనీసం శవాలు లేదా రక్తపు గుర్తులు ఉండాలి, కానీ అలాంటి ఆధారాలేవీ అక్కడ లేవు. ఆ దీవిలో ఉన్న భయానక వాతావరణాన్ని తట్టుకోలేక వచ్చిన వారు హుటాహుటిన వెనక్కి తిరిగొచ్చారు. ఆ తర్వాత ఆ ద్వీపానికి వెళ్లిన వారిలో చాలామంది గాయపడ్డారు, కొందరు వికలాంగులయ్యారు, మరికొందరు చనిపోయారు. గజఈతగాళ్లు సైతం ఆ సరస్సులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ అంతుచిక్కని మిస్టరీని ఛేదించడానికి 1935 లో వివినా ఫష్ అనే బ్రిటిష్ రీసెర్చర్ ఒక సాహసోపేతమైన ప్రయత్నం చేశాడు. తన ఇద్దరు నమ్మకస్థులైన రీసెర్చర్లు ఎం.షెప్లిస్, బి. దేసన్లను ఆ ద్వీపంలో పరిశోధనల కోసం పంపాడు. వారు ప్రతిరోజూ సాయంత్రం తాము సురక్షితంగా ఉన్నామని చెప్పడానికి ద్వీపంలోని ఎత్తైన ప్రదేశంలో దీపం వెలిగించి సిగ్నల్స్ ఇచ్చేవారు. అంతా సజావుగానే సాగుతోంది అనుకుంటున్న తరుణంలో, రెండు వారాల తర్వాత హఠాత్తుగా ఆ దీపాలు వెలగడం ఆగిపోయాయి, సిగ్నల్స్ నిలిచిపోయాయి. ఆందోళనతో రీసెర్చ్ బృందం ద్వీపానికి వెళ్లి వెతకగా వారి గుడారం అలాగే ఉంది కానీ ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు మాయమైపోయారు. కనీసం వారి మృతదేహాలు కూడా లభించలేదు. విమానాలతో గాలించినా, చెట్టు చెట్టు వెతికినా వారి ఆచూకీ దొరకలేదు. అక్కడ క్రూర జంతువులు కూడా లేవు, మరి వారు ఏమయ్యారనేది నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. స్థానిక ఇతిహాసాల ప్రకారం ఆ ద్వీపంలో భూమి లోపలికి చొచ్చుకుపోయిన కొన్ని వింత పైపులు ఉన్నాయి. వాటి నుండి అప్పుడప్పుడు మంటలు వస్తుంటాయని నమ్ముతారు. అలాగే ఆ దీవి ఎప్పుడూ దట్టమైన పొగమంచుతో నిండి ఉంటుందని, అక్కడ ఎవరికీ కనిపించని ఒక మాయా నగరం దాగి ఉందని గిరిజనులు చెబుతుంటారు. ఆ నగరం నుండి వచ్చే కాంతి ఇంద్రధనుస్సులా, బంగారు ఆభరణాలు మెరిసినట్లు తళతళా మెరుస్తుందని, అక్కడి అద్భుతమైన టవర్ల నుండి వింత శబ్దాలు వస్తాయని అంటారు. ఆ శబ్దాలు విన్నవారు కొన్నాళ్లపాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడతారని స్థానికుల నమ్మకం. సైన్స్‌కు సైతం అంతుచిక్కని ఈ 'నో రిటర్న్' ఐలాండ్ రహస్యం ఇప్పటికీ ఎవరికీ తెలియని ఒక పెద్ద మిస్టరీ.

Publish Date: Jul 3, 2026 5:03PM
మావిగన్.. పేరు ప్రచారానికే జగన్ పరిమితం.. వ్యూహమేంటో గందరగోళం.!
మావిగన్.. పేరు ప్రచారానికే జగన్ పరిమితం.. వ్యూహమేంటో గందరగోళం.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మావిగన్ హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వచ్చే ఎన్నికలలో తమ నినాదం మావిగన్ రాజధాని అని ప్రకటించడం రాజకీయాలలో సంచలనంగా మారింది. పొలిటికల్ హీట్ క్రియేట్ చేసింది. అయితే ఎవరూ మెచ్చని, ఎవరికీ నచ్చని మావిగన్ నినాదం ప్రతిపాదన వెనుక జగన్ వ్యూహం ఏమిటన్నదానిపై ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మచిలీపట్నంలోని తొలి రెండు అక్షరాలు ఎమ్ఏ, విజయవాడ లోని తొలి రెండు అక్షరాలు విఐ, గుంటూరులోని తొలి మూడు అక్షరాలు జియుఎన్ లను తీసుకుని ఈ మూడు నగరాల కలయికే మావిగన్ అంటున్నారు జగన్. జగన్ గతంలో జపించిన మూడు రాజధానుల జపానికి, అప్పటి ఆయన సిద్ధాంతానికి ఇప్పుడు ఆయన చెబుతున్న మావిగన్ కు పొంతన లేదని పరిశీలకులు అంటున్నారు. గతంలో జగన్ మూడు రాజధానులు అన్నప్పుడు ఆయన చెప్పిన ఆ మూడు ప్రాంతాలూ వేర్వేరుగా దూరంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయన మూడు నగరాల కలయిక రాజధాని అంటున్నారు. అయితే ఇప్పుడు జగన్ గతంలో తాను చెప్పిన వికేంద్రీకరణకు తిలోదకాలిచ్చేసి.. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి కొత్త ప్లాన్ ను తెరపైకి తెచ్చారు. అయితే జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదన.. మూడు రాజధానులని గతంలో ఆయన చెప్పిన దాని కంటే గందరగోళంగా, ఏ మాత్రం క్లారిటీ లేకుండా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ ప్రతిపాదిత మావిగన్ లో సచివాలయం ఎక్కడ ఉంటుంది? హైకోర్టు ఎక్కడ నిర్మిస్తారు? అసెంబ్లీ ఎక్కడ? అన్నదానిపై జగన్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అసలా వివరాల జోలికి ఏ మాత్రం పోలేదు. ఈ మూడు ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాలు కనుక రాజధానిని చేసేస్తే అమరావతి అభివృద్ధి చేయనవసరంలేదు కదా అన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమరావతిలో ప్రతిష్టాత్మక భవనాల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తోంది. మరి జగన్ అధికారంలోకి వస్తే అమరావతిలో ఉన్న ఆ భవనాలనే వినియోగిస్తారా? లేక గతంలోలాగే అమరావతిని నిర్వీర్యం చేస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు పరిశీలకులు భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు. ఇందుకు గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను పాడుపెట్టిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అందుకే జగన్.. మావిగన్ విషయంలో తన వ్యూహాన్ని మూడేళ్ల తరువాత వచ్చే ఎన్నికల నాటి వరకూ వెల్లడించే అవకాశం ఇసుమంతైనా లేదని అంటున్నారు. ఎందుకంటే.. తాను అధికారంలోకి వస్తే ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువస్తామని చెబితే.. అమరావతికి ప్రత్యామ్నాయం మావిగన్ అంటూ జగన్ చెప్పిన మాటలు అబద్ధాలు అవుతాయి. అలా కాకుండా, వాటిని వినియోగించం, పాడు పెడతాం, పక్కన పెడతాం అని జగన్ ప్రకటిస్తే.. ప్రజలు ఇప్పటి నుంచే జగన్ ను పక్కన పెట్టేయడం మొదలెడతారు. విఫలమైన మూడు రాజధానుల సిద్ధాంతాన్నే జగన్ పట్టుకు వెళాడుతున్నారన్న అభిప్రాయం ప్రజలలోకి బలంగా వెడుతుంది. అందుకే.. జగన్ మావిగన్ ఏమిటో, ఆయన వ్యూహం ఏమిటో మరో మూడేళ్ల వరకూ వెళ్లడించకుండా.. మావిగన్ అన్న పేరును ప్రచారంలో ఉంచడానికే పరిమితమౌతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. Teluguone, AP Capital Issue, Amaravati vs MAVIGUN, YS Jagan Mohan Reddy

Publish Date: Jul 3, 2026 11:23AM
 జగన్  మావిగన్ జపం..  బాబు అభివృద్ధి వ్యూహం!
జగన్ మావిగన్ జపం.. బాబు అభివృద్ధి వ్యూహం!

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి దశాబ్ద కాలం దాటినా, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ ఇంకా రాజధాని చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. నిలకడైన విధానాలు, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాల్సిన రాజధాని అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి రూటు మార్చారు. నిన్నటి వరకు మూడు రాజధానుల నినాదంతో విశాఖపట్నం చుట్టూ రాజకీయాన్ని తిప్పిన జగన్, ఇప్పుడు మావిగన్ మంత్రం పఠిస్తున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు. తాజాగా 2029 ఎన్నికలలో వైసీపీ ప్రధాన నినాదం మావిగన్ అని ప్రకటించారు. అమరావతి కావాలనుకునే వారు తెలుగుదేశం కూటమికి, మవిగన్ కోరుకునే వారు వైసీపీకి ఓటు వేయాలంటూ సవాల్ విసిరారు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న సమయంలో రుషికొండ ప్యాలెస్ నిర్మాణం సహా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను గట్టిగా ప్రొజెక్ట్ చేసిన వైసీపీ, ఇప్పుడు హఠాత్తుగా ఆ నినాదాన్ని పక్కన పెట్టి మావిగన్ జపం చేయడంపై రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తం అవుతోంది. వైసీపీని, ఆ పార్టీ అధినేతను నెటిజనులైతే ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. రాజథాని విషయంలో జగన్ తరచుగా మాట మారుస్తుండటం, ఆయన పార్టీ వైసీపీకే నష్టం చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కేవలం మూడు రాజధానుల వల్లే సాధ్యమంటూ ప్రజల్లోకి వెళ్లిన వైసీపీ కేడర్.. ఇప్పుడు.. తూచ్ మూడు రాజధానులు కాదు.. మావిగన్ అంటూ ప్రజలలోకి ఎలా వెళ్లాలో తెలియక అయోమయానికి గురౌతోంది. రాజథాని విషయంలో ఒక స్థిరమైన విధానం లేకపోతే రాష్ట్రానికి పెట్టుబడిదారులు, పరిశ్రమలు ఎలా వస్తాయంటూ జగన్ విధానంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక మరో వైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, ఆ ప్రభుత్వాధినేత చంద్రబాబు.. అమరావతిని ఏకైక రాజధానిగా విస్పష్టంగా పేర్కొంటూనే.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు భారీగా పెట్టుబడులను, ఐటీ, పారిశ్రామిక ప్రాజెక్టులను వేగంగా తరలిస్తూ జగన్ మావిగన్ మంత్రాన్ని ప్రజలు ఇసుమంతైనా పట్టించుకోనవసరం లేదని చాటుతోంది. విశాఖపట్నం కేంద్రంగా మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాల సృష్టిపై బాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. రాజధానిని మార్చకుండానే ఉత్తరాంధ్ర), రాయలసీమ ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయవచ్చని చంద్రబాబు చేతల్లో చూపిస్తున్నారు. వచ్చే మూడేళ్లలో ఈ ప్రాజెక్టులు పూర్తై, యువతకు ఉపాధి కల్పిస్తే, వైసీపీ వాదన పూర్తిగా బలహీనపడుతుంది. తెలుగుదేశం మొదటి నుంచి అమరావతి విషయంలో ఒకే స్టాండ్‌తో ప్లస్ పాయింట్‌గా మారింది. 2029 ఎన్నికల కురుక్షేత్రంలో జగన్ తెచ్చిన మావిగన్ నినాదాన్ని ప్రజలు పట్టించుకునే అవకాశమే ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Publish Date: Jul 2, 2026 11:14AM
వైసీపీలో పెద్దిరెడ్డి, చెవిరెడ్డిల ఆధిపత్య పోరు!
వైసీపీలో పెద్దిరెడ్డి, చెవిరెడ్డిల ఆధిపత్య పోరు!

ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిలకు జగన్‌‌తో డైరెక్ట్ రాపో ఉంది. వారిద్దరిలో ఎవర్నీ జగన్ కాదనలేరంటారు. వైపీపీ పవర్‌లో ఉన్నంత కాలం పెద్దిరెడ్డి రాయలసీమ సీఎంలా చెలాయించారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అటు పెద్దిరెడ్డి, ఇటు చెవిరెడ్డి కేసులతో అల్లాడుతున్నారు. అది చాలదన్నట్లు ఆ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మైదలైంది. పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు. అయితే.. ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన తర్వాత పెద్దిరెడ్డి విషయంలో వైసీపీ నేతల తీరు మారింది. ప్రధానంగా ఇప్పుడు పెద్దిరెడ్డిని జగన్‌కు దూరం చేయడానికి చెవిరెడ్డి చక్రం తిప్పుతున్నారని పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఏపీ లిక్కర్ స్కాం కేసులో పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డి, చెవిరెడ్డిలు అరెస్ట్ అయి బెయిల్‌పై బయటకు వచ్చారు. మరి ఆ కేసుకు సంబంధించి వాటాల లెక్కల్లో తేడా వచ్చిందో? ఏమో కాని రామచంద్రారెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారట. లిక్కర్ కేసు వ్యవహారంతో పెద్దిరెడ్డి ఫ్యామిలీ విషయంలో జగన్ వైఖరి మారిందంటున్నారు. సరిగ్గా అదే సమయంలో తాడేపల్లి లో చేరారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పెద్దిరెడ్డి ఫ్యామిలీ విషయంలో చెవిరెడ్డి ఇస్తున్న సమాచారాన్ని జగన్ నమ్ముతున్నారని వైసీపీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఆ ఇద్దరు నేతల మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయని.. ఆ ఇద్దరు నేతలను సర్ది చెప్పలేక .. ఎవరి మాట వినరని పేరున్న జగన్ సైతం తెగ ఇదై పోతున్నారంట.

Publish Date: Jul 1, 2026 3:05PM
కేంద్ర మంత్రిగా డీకే అరుణ.. లీక్ ఇచ్చిన మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
కేంద్ర మంత్రిగా డీకే అరుణ.. లీక్ ఇచ్చిన మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక లీక్ ఇచ్చారు. రాబోయే కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు, 2029 సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి వరుసగా నాలుగో సారి అధికారపగ్గాలు అందుకోవడమే లక్ష్యంగా మోడీ కేబినెట్ ను ప్రక్షాళన చేయనున్నారని రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి విదితమే. పార్లమెంట్ వర్షాకాలసమావేశాలకు ముందే మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న జాతీయ రాజకీయాలలో గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ రాబిన్ రాష్ట్ర పర్యటన సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడిన కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగానో, యధాలాపంగానో వెల్లడించారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో తెలంగాణ నుండి ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో ఒకరు క్యాబినెట్ జి. కిషన్ రెడ్డి కాగా, మరొకరు బండి సంజయ్ కుమార్. రాబోయే ఎన్నికల వ్యూహాల్లో భాగంగా తెలంగాణ నుండి మరొకరికి కూడా అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. సామాజిక సమతుల్యతను సాధించడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు తెలంగాణ నుంచి మరో మంత్రికి అవకాశం ఇవ్వాలన్నది హైకమాండ్ ఆలోచనగా చెబుతున్నారు. అయితే ఈ తరుణంగా కిషన్ రెడ్డి డీకే అరుణ పేరు ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన సామాజికవర్గానికే చెందిన డీకే అరుణకు కేంద్ర కేబినెట్ లో స్థానం అని ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. కేబినెట్ బెర్త్ రేసులో ఎంపీ ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అదే సమయంలో ప్రస్తుతం కేబినెట్ లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని కూడా పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. అందుకే కిషన్ రెడ్డి డీకే అరుణ పేరు ప్రస్తావించారని అంటున్నారు. ఇక ఇదే సందర్భంగా బండి సంజయ్ భవితవ్వంపై కూడా రకరకాలుగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. కుమారుడిపై పోక్సో కేసు నేపథ్యంలో బండి సంజయ్ కు కూడా కేబినెట్ నుంచి ఉద్వాసన పలికి ఆయనకు కూడా పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనీ, అప్పుడు రాష్ట్రం నుంచి ముగ్గురికి కొత్తగా కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉందనీ అంటున్నారు. అప్పడు సామాజిక సమతుల్యాన్ని పాటించి అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యమైన వారికి కేబినెట్ లో చోటు కల్పించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

Publish Date: Jun 30, 2026 12:20PM
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్లు.. రేసులో నలుగురు.. దక్కేదెవరికి?
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్లు.. రేసులో నలుగురు.. దక్కేదెవరికి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది. ఖాళీ అవుతున్న ఈ రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలనూ తెలుగుదేశం తన పార్టీ అభ్యర్థులకే కట్టబెట్టనుంది. అయితే ఉన్నవి రెండే సీట్లు అయినా వీటి కోసం తెలుగుదేశం నుంచి నలుగురు నేతలు సీరియస్ గా పోటీ పడుతున్నారు. గత ఎన్నికల సమయంలో కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా త్యాగాలు చేసిన నలుగురు కీలక నేతలు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీలో ఉన్నారు. ఈ నలుగురిలో ఎస్వీఎస్ఎన్ వర్మ(పిఠాపురం వర్మ), దేవినేని ఉమ, వంగవీటి రాధా, మహాసేన రాజేష్‌ ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం కోసం తన సొంత సీటును త్యాగం చేసి మరీ జనసేనాని విజయం కోసం శ్రమించిన ఎస్వీఎస్ఎన్ వర్మ ఈ రేసులో ముందు వరుసలో ఉన్నారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ విజయం కోసం అప్పట్లో చంద్రబాబు నాయుడు స్వయంగా వర్మతో మాట్లాడి మరీ ఒప్పించారు. అప్పటిలో ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ వాగ్దానం చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఇటీవల వర్మను పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ పదవి నుంచి తప్పించడంతో.. గవర్నర్ కోటాలో పిఠాపురం వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ కేడర్ లో ప్రచారం జరుగుతోంది. ఇక వంగవీటి రాథా కూడా ఈ రేసులో ఉన్నారు. బెజవాడ రాజకీయాల్లో కీలక నేత అయిన వంగవీటి రాధాకృష్ణ గత రెండు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోయినప్పటికీ.. ఆయన పార్టీ లైన్ దాటకుండా విధేయతతో కొనసాగుతున్నారు. ఆయనకు ఈసారి ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని ఆయన అభిమానులు ఆశతో ఉన్నారు. అదీ కాకుండా, ఇటీవల కాపు సాజాజిక వర్గం కేంద్రంగా రాష్ట్రంలో రాజకీయ హీట్ పెరిగిన నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే విధంగా.. తెలుగుదేశం సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు కూడా. . పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన ఉమ, గత ఎన్నికల వేళ తన చిరకాల ప్రత్యర్థి వసంత కృష్ణప్రసాద్ కోసం మైలవరం సీటును త్యాగం చేశారు. ఆయన కూడా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఇక ఈ రేసులో దళిత సామాజిక వర్గం నుంచి బలమైన వాయిస్ వినిపించే మహాసేన రాజేష్ కూడా ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఆయనకు మొదట పి. గన్నవరం టికెట్ కేటాయించినప్పటికీ.. గతంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో కూటమి ప్రయోజనాల కోసం ఆయనే అప్పట్లో స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు. కేవలం 2 స్థానాలు మాత్రమే ఖాళీగా ఉండటంతో చంద్రబాబు నాయుడు ఈ నలుగురిలో ఏ ఇద్దరిని ఎంపిక చేస్తారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.

Publish Date: Jun 29, 2026 12:20PM
తెలంగాణ ఆలయాలకు తిరుమల నిధులు.. ఎందుకు వివాదం అవుతోందంటే?
తెలంగాణ ఆలయాలకు తిరుమల నిధులు.. ఎందుకు వివాదం అవుతోందంటే?

కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చుట్టూ ఇప్పుడు కొత్త వివాదం రాజుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఒక జీవో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. టిటిడి బోర్డు, శ్రీవాణి ట్రస్ట్ తీర్మానాల ప్రకారం.. మొత్తం 6 పురాతన ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి కోసం నిధులను ఉపయోగించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడమే ఇందుకు కారణం. పురాతన ఆయయాల అభివృద్ధికి టీటీడీ నిధుల కేటాయింపునకు అనుమతి ఇస్తూ జారీ అయిన జీవో వివాదాస్పదం కావడానికి, పెను రాజకీయ చర్చకు దారి తీయడానికి కారణమేంటంటే.. ఈ ఆరు ఆలయాల్లో మూడు తెలంగాణలోని ఆలయాలు కావడమే. ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీవాణి ట్రస్ట్ నిధులను తెలంగాణలోని దేవాలయాలకు ఎలా కేటాయిస్తారంటూ, పెద్ద ఎత్తున విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా వింగ్, వైసీసీ ఈ అంశాన్ని రాజకీయం చేస్తూ.. ప్రాంతీయ విద్వేషాలు పెచ్చరిల్లేలా వ్యవమరిస్తున్నాది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇ ఏపీ ప్రజల సొమ్మును తెలంగాణలో తమ రాజకీయ ప్రయోజనాల కోసం, అక్కడ తమ పార్టీల బలోపేతం చేసుకోవడం కోసం వాడుకుంటున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని, తెలంగాణ ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించడాన్ని తప్పుపడుతున్న వారూ.. విస్మరిస్తున్న కీలక అంశమేంటంటటే.. ట్రస్ట్ నిధులను తెలంగాణలో మూడు ఆలయాల అభివృద్ధికి వినియోగించడాన్ని అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందే కానీ, ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క పైసా కూడా పొరుగురాష్ట్రానికి తరలించడంలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం సొంత నిధులను తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి వినియోగించడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లాంటిది ఏపీ సర్కార్ విడుదల చేసిన జీవో. ఇక తిరుమలేశుడికి భక్తులు కానుకల ద్వారా సమర్పించుకున్న నిధుల వినియోగం విషయంలో కూడా ప్రాంతీయ బేధాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు విమర్శలు చేయడం సరికాదంటున్నారు పరిశీలకులు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి, ప్రాంతీయ సరిహద్దులు, కుల, మతాల భేదాలు ఉండవు. తిరుమలేశునికి కానుకలు సమర్పించుకున్న వారిలో తెలంగాణ ప్రజలు కూడా భారీ సంఖ్యలో ఉంటూ స్వామివారి హుండీకి కోట్ల రూపాయల కానుకలు సమర్పిస్తున్నారు. ఒక్క తెలుగురాష్ట్రాల నుంచి అని కాకుండా, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచీ కూడా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తుంటారు. కానుకలు సమర్పించుకుంటారు. ఆ కానుకల ద్వారా వచ్చిన నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం.. తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశ విదేశాలలో కూడా ఆలయాల నిర్మాణానికి, ఆధ్యాత్మిక ధర్మ ప్రచారానికీ వినియోగించడం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇది పూర్తిగా ఒక ధార్మిక కార్యక్రమం, దీనికి రాజకీయాలను, ప్రాంతీయతలను ఆపాదించడం ఇసుమంతైనా సరికాదు. హిందూ ధర్మాన్ని రక్షణ, పురాతన ఆలయాల అభివృద్ధి విషయంలో టిటిడి, ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రాంతీయ కోణంలో చూడటం తగదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Publish Date: Jun 26, 2026 12:22PM
ఏపీలో మరింత బలోపేతానికి  జనసేన వ్యూహం.. వైసీపీ మహిళానేతలే టార్గెట్?!
ఏపీలో మరింత బలోపేతానికి జనసేన వ్యూహం.. వైసీపీ మహిళానేతలే టార్గెట్?!

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. రానున్న కాలంలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే క్షేత్రస్థాయి సమీకరణాలను మార్చేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఆ పార్టీకి చెందిన కీలక మహిళా నేతలను జనసేనలోకి తీసుకువచ్చేందుకు వ్యూహరచన చేస్తోంది. రాజకీయవర్గాలలో విస్తృతంగా జరుగుతున్న చర్చ మేరకు.. ఇటీవల పార్లమెంట్ వేదికగా చోటుచేసుకున్న పరిణామాలు ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి. గత నెలలో పార్లమెంట్ ఉభయ సభల ముందుకు వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. చట్టసభల్లో మూడింట రెండు వంతుల ప్రత్యేక మెజారిటీ అవసరమైన తరుణంలో లోక్‌సభలో ఈ బిల్లుల ఆమోద ప్రక్రియలో ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే దీనిని బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పార్లమెంటు ఆమెదం పొందేందుకు ఈ బిల్లులను ఈ వర్షాకాల సమావేశాలలోనే మళ్లీ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. ఆ బిల్లులు ఇమోదం పొందితే చట్ట సభల్లో స్థానాలు గణనీయంగా పెరుగుతాయి. ముఖ్యంగా మహిళలకు కేటాయించే స్థానాలను దక్కించుకునే వ్యూహంతో జనసేన వైసీపీ మహిళా నేతలకు తమ పార్టీ తలుపులు బార్లా తెరవాలని నిర్ణయానికి వచ్చినట్ల జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ.. క్షేత్రస్థాయిలో పట్టున్న మహిళా నేతలను గుర్తించిందని చెబుతున్నారు. వారిలో వైసీపీలో సరైన ప్రాధాన్యత లేక, అసంతృప్తితో ఉన్న పలువురు మాజీ మహిళా మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో ఇప్పటికే జనసేన వర్గాలు సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు. మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే.. రిజర్వ్ అయ్యే స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా విజయావకాశాలను మెరుగుపరుచుకోవచ్చన్న ఉద్దేశంతో జనసేన వారికి టికెట్లు ఆఫర్ చేయడం ద్వారా పార్టీలో చేర్చుకోవాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే డీలిమిటేషన్ కూడా ఏపీ రాజకీయాల్లో మార్పులకు దోహదపడనుంది. జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో, కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో ముందస్తుగా పట్టు సాధించడం అన్ని పార్టీలకూ అనివార్యంగా మారింది. ఈ పునర్విభజన సమయంలోనే మహిళా రిజర్వేషన్ల కోటాను కూడా అనుసంధానం చేసే అవకాశం ఉండటంతో, జనసేన పార్టీ ఈ స్ట్రాటజీని తెరపైకి తెచ్చిందంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం తర్వాత వైసీపీలో పలువురు మహిళా నేతలు సైలంట్ అయ్యారు. ఇప్పుడు జనసేన అటువంటి వారిపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇందుకు వారి నుంచి కూడా సానుకూలత వ్యక్తమౌతోందని అంటున్నారు. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం కూటమి హవా, భవిష్యత్ రాజకీయ అవకాశాల దృష్ట్యా పలువురు వైసీపీ మహిళా నేతలు.. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Publish Date: Jun 24, 2026 11:41AM
వైసీపీలో ‘కాపు’ చిచ్చు.. వికటిస్తున్న జగన్ వ్యూహం!
వైసీపీలో ‘కాపు’ చిచ్చు.. వికటిస్తున్న జగన్ వ్యూహం!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యూహాలు వికటిస్తున్నాయా? ఆయన వ్యూహాల పట్ల సొంత పార్టీలోనే అసంతృప్తి పెచ్చరిల్లుతోందా? అన్న ప్రశ్నకు జరుగుతున్న పరిణామాలను బట్టి ఔననే సమాధానమే వస్తున్నది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాపు సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసేందుకు జగన్ అను సరిస్తున్న వ్యూహాలు వైసీపీలోని రెడ్డి సామాజిక వర్గ నేతలకు మింగుడుపడటం లేదు. ఇదే విధానంతో వ్యూహాలతో ముందుకు వెడితే మొదటికే మోసం వస్తుందన్న ఆందోళన వారిలో వ్యక్తం అవుతోంది. ఈ విషయాన్ని పలువురు వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో గట్టిగా చెబుతున్నారు. ఇంత కాలం ఎస్సీలు, బీసీలు అంటూ వచ్చిన జగన్ ఇప్పుడు కాపు సామాజిక వర్గం విషయంలో అనుసరిస్తున్న విధానం.. పార్టీకి బీసీలనూ, ఎస్సీలనూ దూరం చేసే ప్రమాదం తీసుకువస్తున్నదని అంటున్నారు. అన్నిటికీ మించి.. వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం పెట్టి, ఇప్పుడు కాపు సామాజికవర్గాలనికి జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్న చర్చ పార్టీలో మొందలైంది. అధికారంలో ఉన్న సమయంలో కీలక పదవులు, ప్రాధాన్యత కలిగిన స్థానాల్లో సొంత వర్గానికి ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదనే భావన మొదటి నుంచీ ఉంది. అయినప్పటికీ పార్టీ లైన్‌కు కట్టుబడి ఉన్న నేతలకు, తాజా రాజకీయ పరిణామాలు మింగుడు పడటం లేదు. ముఖ్యంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఓట్ల కోసం.. జగన్ సిద్ధం చేసిన ప్రణాళికల పట్ల వైసీపీలో అసంతృప్తి భగ్గుమంటోంది. రాజకీయంగా పట్టు సాధించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహం వల్ల ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకులు దూరం అయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వైసీపీ నాయకులలో వ్యక్తం అవుతోంది. దూరం జరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను ఆకట్టుకోవడం అంత సులువు కాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న నేపథ్యంలో.. కాపు సామాజికవర్గం వైసీపీ వైపు గంపగుత్తగా మొగ్గు చూపే అవకాశాలు దాదాపుగా లేవని అంటున్నారు. అసలు తొలి నుంచీ రాజకీయ వ్యూహల విషయంలో జగన్ విఫలమౌతున్నారని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు నా బీసీలు అంటూ బీసీ పల్లవి అందుకున్న జగన్ అప్పట్లో కాపు సామాజికవర్గాన్ని పట్టించుకోలేదంటున్నారు. ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంటూ.. సొంత పార్టీలోని కాపు నేతలతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయించడం వల్ల మిగతా సామాజిక వర్గాలు దూరమయ్యే ప్రమాదాన్ని జగన్ గుర్తించడం లేదని అంటున్నారు. అన్ని కులాలకూ సమప్రాధాన్యత ఇవ్వకుండా.. కుల రాజకీయాలను నమ్ముకుంటే మొదటికే మోసం రావడం తథ్యమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది.

Publish Date: Jun 22, 2026 1:58PM
TeluguOne Picks For You
rss-imgRss Feeds