ఏపీ అసెంబ్లీలో తమాషా సంఘటన!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమాషా సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితి మీద శ్వేతపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం కేసులు పెట్టిన వాళ్ళు లేచి నిల్చోండి అన్నారు. దాంతో పవన్ కళ్యాణ్‌తో సహా మెజారిటీ సభ్యులు లేచి నిల్చున్నారు. దాంతో సభలో నవ్వులు విరిశాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం వీళ్ళని లోపల వేయాలని కేసులు పెట్టింది. కానీ ప్రజలు వీళ్ళని అసెంబ్లీకి పంపించారు అని అన్నారు. ఆ తర్వాత కేసులేవీ లేని వాళ్ళు లేచి నిల్చోండి అని అడిగారు. అప్పుడు చాలా కొద్దిమంది మాత్రమే లేచి నిల్చున్నారు. ‘మీరు అదృష్టవంతులు’ అని చంద్రబాబు ఈ సందర్భంగా చమత్కరించారు.

గురివింద అమెరికా!

గురివింద గింజ సామెత చాలామందికి తెలిసే వుంటుంది. ‘‘అబ్భ.. నేనెంత ఎర్రగా వున్నానో’’ అని గురివింద గింజ అనుకుంటూ వుంటుందట. కానీ, తన డాష్ కింద ఏముందో తనకి తెలియదట. అగ్రరాజ్యంలాగా ప్రపంచం మీద ఆధిపత్యం చేయాలని చూసే అమెరికా పరిస్థితి కూడా గురివింద గింజ మాదిరిగానే తయారైంది. తమ దేశంలో తప్ప మిగతా ప్రపంచంలో ఎక్కడా భద్రత వుండదని భావిస్తూ వుంటుంది. అందుకే, అప్పుడప్పుడు వివిధ దేశాలలో వున్న తన పౌరులకు భద్రతపరమైన సూచనలు ఇస్తూ వుంటుంది. ఆ సూచనలు ఎలా వుంటాయంటే, అమెరికా చాలా సేఫెస్ట్ ప్లేస్... మిగతా ప్రపంచం అంతా దారుణాలకు నిలయం అన్నట్టుగా వుంటాయి. లేటెస్ట్.గా ఇండియాలో వున్న తమ పౌరులకు అమెరికా కొన్ని భద్రతాపరమైన సూచనలు చేసింది. ఇండియాలో ఏయే ప్రాంతాలకు అమెరికా పౌరులు వెళ్ళొద్దో సూచిస్తూ ఒక పెద్ద లిస్టు విడదల చేసింది. ఆ లిస్టుని ఎవడైనా ఎరగని వాడు చూశాడంటే, ఇండియాకి రావడానికి కూడా భయపడిపోతాడు. అమెరికా రిలీజ్ చేసిన లిస్టు ప్రకారం దేశంలోని చాలా రాష్ట్రాలకు అమెరికా పౌరులు వెళ్ళకూడదు. వెళ్ళాల్సివస్తే రాజధానులకు మాత్రమే వెళ్ళాలి. ఈ స్టేటు, ఆ స్టేటు అని కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలనూ అమెరికా తన లిస్టులో పేర్కొంది. కొన్ని రాష్ట్రాలకు వెళ్తే తీవ్రవాదుల సమస్యట, మరికొన్ని రాష్ట్రాల్లో మావోయిస్టు సమస్య వుందట. అదే విధంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ వుంటాయి కాబట్టి అటువైపు వెళ్ళనే వెళ్ళొద్దట... అంత దారుణంగా వుంది ఈ లిస్టు.  నిజానికి అమెరికా పౌరులు ఇండియాలో ఏ రాష్ట్రానికైనా నిస్సంకోచంగా వెళ్ళవచ్చు.. తమదేశం అమెరికా వెళ్ళడానికే భయపడాలి.. ఆలోచించాలి. ఎందుకంటే, అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా వుంది. ఎవడికి ఎప్పుడు బుద్ధి పుట్టినా, తన జేబులోంచి రివాల్వర్ తీసి ఎవరు కనబడితే వాళ్ళని కాల్చిపారేస్తూ వుంటాడు. మొన్నీమధ్యే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద హత్యాయత్నం కూడా జరిగింది. ప్రపంచంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు వుంటాయేమో.. అమెరికాలో అణువణువునా ఉద్రిక్తమే. జేబులో రివాల్వర్ వున్న ప్రతి ఒక్కడూ ఉగ్రవాదే. అందువల్ల ఇతర దేశాలకు భద్రత విషయంలో సర్టిఫికెట్లు ఇవ్వడం మానుకుని, తమ దేశంలో భద్రత గురించి అమెరికన్లు ఆలోచించుకుంటే మంచిది.

అమరావతికి పోటీగా రేవంత్ ‘మాస్టర్ ప్లాన్’!

గత పన్నెండు సంవత్సరాల నుంచి హైదరాబాద్, హైదరాబాద్ పరిసర ప్రజలు రెగ్యులర్‌గా వింటున్న మాట ‘మాస్టర్ ప్లాన్’. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో మొత్తం ఐదు మాస్టర్ ప్లాన్స్ వున్నాయి. వాటిని మొత్తాన్నీ మిక్స్ చేసి హెచ్ఎండీఏ పరిధి వరకు సరికొత్త ‘మాస్టర్ ప్లాన్’ని తీసుకురావాలన్నది నాయకుల ప్లాన్. మాస్టర్ ప్లాన్ తీసుకురాబోతున్నాం.. రెండు మూడు నెలల్లో వచ్చేస్తుంది అని పన్నెండు సంవత్సరాల నుంచి నాయకులు, అధికారులు ప్రకటిస్తూనే వున్నారుగానీ, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి వుంది. ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2012లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ విడుదలైంది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ అధికారంలో వున్న దాదాపు పదేళ్ళ కాలంలో సంవత్సరానికోసారి ‘ఇదిగో మరో మాస్టర్ ప్లాన్ వచ్చేస్తోంది’ అంటూ ఊరిస్తూ వచ్చారే తప్ప పని జరగలేదు.  ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వానికి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పథంలో దూసుకువెళ్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలర్ట్ అయినట్టు సమాచారం. పన్నెండేళ్ళుగా అంగుళం కూడా ముందుకు కదలని మాస్టర్ ప్లాన్ అంశాన్ని ఈ ఏడాది చివరికి ఒక కొలిక్కి తేవడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరాంతానికి కొత్త సమగ్ర మాస్టర్ ప్లాన్‌ని ప్రకటించాలన్నది రేవంత్ రెడ్డి లక్ష్యం. లేటెస్ట్.గా అమరావతికి కేంద్ర ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయలను గ్రాంట్‌గా ప్రకటించిన నేపథ్యంలో అలెర్ట్ అయి హైదరాబాద్ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం వుందని రేవంత్ రెడ్డి గుర్తించారు. దీనికి తొలి అడుగుగా సమగ్ర మాస్టర్ ప్లాన్‌ని రూపొందించాలని సంకల్పించారు. అసలు ‘సమగ్ర మాస్టర్ ప్లాన్’ వల్ల ఉపయోగాలు ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే, ప్రధాన నగరం మీద ఒత్తిడి తగ్గుతుంది. సరికొత్త నివాస ప్రాంతాలు, సరికొత్త వ్యాపార ప్రాంతాలు, సరికొత్త పారిశ్రామిక ప్రాంతాలు పెరుగుతాయి. తద్వారా నగర అభివృద్ధి విస్తృతం అవుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతుంది. అమరావతి ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద పడకుండా వుండాలంటే యథాతథ స్థితిని కొనసాగించడం కాకుండా, హైదరాబాద్ చుట్టూ సరికొత్త అవకాశాలను సృష్టించాలి. అప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వెనుకబడకుండా వుంటుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈసారి మాత్రం సమగ్ర మాస్టర్ ప్లాన్ విషయంలో చాలా పట్టుదలగా వున్నట్టు తెలుస్తోంది. మరి ఈ పట్టుదల గత ప్రభుత్వం ‘పట్టుదల’ మాదిరిగా మాటలకే పరిమితం అవుతుందో, ఆశించిన ఫలితాలను తెస్తుందో వేచి చూడాలి.

‘హు కిల్డ్ బాబాయ్?’కి సమాధానం దొరకబోతోంది!

తెలుగు ప్రజలను గత ఐదేళ్ళుగా సమాధానం దొరక్కుండా వేధిస్తున్న ప్రశ్న ‘హు కిల్డ్ బాబాయ్?’ బేతాళుడి ప్రశ్నలకు సమాధానాలు విక్రమార్కుడు చెప్పేవాడు. కానీ ‘హు కిల్డ్ బాబాయ్’ అనే ప్రశ్నకు ఇంతవరకు సమాధానం చెప్పేవారు ఎవరూ లేరు. ఈ ప్రశ్నకు త్వరలో సమాధానం దొరకబోతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘వివేకా హత్యకేసు ఎన్నో మలుపులు తిరిగింది. హత్య జరిగిన తర్వాత ఘటనా స్థలికి సీఐ వెళ్ళారు. సీబీఐకి వాస్తవాలన్నీ తెలియజేయడానికి ఆయన సిద్ధమయ్యారు. కానీ, ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి సీఐకి ప్రమోషన్ ఇచ్చింది. విచారణాధికారి మీద కేసు పెడితే హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది. అసలు నేరస్థుడు ముఖ్యమంత్రి కావడంతో పోలీసులు కూడా వంత పలకాల్సిన పరిస్థితి వచ్చంది. వివేకా హత్యకేసు నిందితులను అరెస్టు చేయడానికి వెళ్ళిన సీబీఐ సిబ్బంది ఏమీ చేయలేక వెనుదిరిగారు. గతంలో ఈ కేసు విషయంలో ఎన్నో అవరోధాలు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. త్వరలో ‘హు కిల్డ్ బాబాయ్?’ అనే ప్రశ్నకు సమాధానం దొరకబోతోంది’’ అన్నారు.

మంచితనం ఒక్కటే చాలదు బాబూ.. కాఠిన్యమూ ఉండాలి!

రాజ్యాన్ని పాలించే రాజుకు మంచిత‌నం మాత్ర‌మే ఉంటే స‌రిపోదు.. ఎప్పుడూ ప్ర‌జ‌ల అభివృద్ధికోసం ఆలోచించ‌డ‌మే కాదు.. రాజ్యంపై దండెత్తే ప్ర‌త్య‌ర్థులపైనా, దోపిడీ దారుల‌పైనా కఠినంగానూ ఉండాలి. అప్పుడే రాజ్యంలోని ప్ర‌జ‌లు ఎలాంటి భ‌యాలు లేకుండా సంతోషంగా జీవ‌నం సాగిస్తారు. వ్యాపారాలు అభివృద్ధి చెంది ఆ రాజ్యం ఆర్థికంగానూ బ‌లోపేతం అవుతుంది. ఆ సూత్రాన్ని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు  పట్టించుకున్నట్లు లేదు. ఫ‌లితంగా ప్ర‌తిప‌క్ష హోదా సైతం కోల్పోయిన వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న అనుచ‌రులు రెచ్చిపోతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండు నెల‌లు కూడా పూర్తి కాక‌ముందే.. రాష్ట్రం మొత్తం అల్ల‌క‌ల్లోలం అవుతోందనీ.. శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణించాయనీ వైసీపీ నేత‌లు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. త‌మ‌కు ఇష్ట‌మొచ్చిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తూ.. అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన పోలీసుల‌కు సైతం వార్నింగ్ లు ఇస్తున్నారు. రాష్ట్రంలో జ‌గ‌న్‌, వైసీపీ నేత‌ల ప్ర‌వ‌ర్త‌న చూస్తున్న ప్ర‌జ‌లు ఏపీలో అధికారంలో ఉంది వైసీపీనా, తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వ‌మా అనే అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. దీనంత‌టికి చంద్ర‌బాబు నాయుడు మంచితనమే కార‌ణ‌మ‌ని కొంద‌రు తెలుగుదేశం నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే శాంతి భ‌ద్ర‌త‌లు, అభివృద్ధే ముఖ్యంకాదు.. త‌ప్పుడు ప్ర‌చారం చేసే ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌పై కొర‌డా ఝుళిపించి వారిని అదుపులో పెట్టాల్సిన అవ‌స‌రం కూడా ఉంటుంద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గ‌త ఐదేళ్ల జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో ప్ర‌జ‌లు వ‌ణికిపోయారు. ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌శ్నించిన వారిపై అక్ర‌మ కేసులుపెట్టి జైళ్ల‌కు పంపించారు. ఫ‌లితంగా రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణించాయి. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు  వ్యాపార‌ వేత్త‌లు వెనుక‌డుగు వేశారు. ఏపీ ఆర్థికంగా తీవ్రంగా దెబ్బ‌తింది. ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగాఅడుగంటి పోయింది.   అప్పుల‌తోనే ఐదేళ్లు రాష్ట్రాన్ని జ‌గ‌న్ న‌డిపిస్తూ వ‌చ్చారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయ‌డంపై దృష్టి పెట్టారు. పాల‌నాప‌రంగా సుదీర్ఘ అనుభ‌వం క‌లిగిన చంద్ర‌బాబు.. తొలుత‌ రాష్ట్రంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొల్పేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఘ‌ర్ష‌ణ‌లకు, దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డితే వైసీపీ, టీడీపీ, జ‌నసేన పార్టీ నేత‌లు అనే తేడాలేకుండా కేసులు న‌మోదు చేస్తున్నారు.  రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు అదుపులో ఉండేలా కూట‌మి ప్ర‌భుత్వం చర్యలు తీసుకుంటుంది. మ‌రోవైపు అభివృద్ధి ప‌నుల్లో వేగం పెంచారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై దృష్టి సారించారు. మొత్తంగా చెప్పాలంటే కూట‌మి ప్ర‌భుత్వం 50రోజుల పాల‌న‌లో ప్ర‌జ‌లు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జీవ‌నం సాగిస్తున్నారు. ఇది జీర్ణించుకోలేని వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆ పార్టీ నేత‌లు రాష్ట్రంలో అల్ల‌ర్లు సృష్టించేలా రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. రాష్ట్రంలో వ్య‌క్తుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చ‌కుంటూ.. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణించాయ‌ని త‌మ అనుకూల మీడియా ద్వారా ప్ర‌చారం చేస్తున్నారు. ఫ‌లితంగా రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపుతున్న వ్యాపారుల‌ను భ‌యాబ్రాంతుల‌కు గురిచేసేలా జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు ప్ర‌వ‌ర్తిస్తున్నారు.  వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆ పార్టీ నేత‌లు ఇష్టానుసారంగా రెచ్చిపోవ‌టానికి సీఎం చంద్ర‌బాబ నాయుడు మంచితనం కూడా కార‌ణ‌మ‌ని ప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌లు వాపోతున్నారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లకు విఘాతం క‌లిగించేవారిపై లాఠీలు ఝుళింపించాలని, అప్పుడే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లాంటి వారు, వైసీపీ నేత‌లు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని మాట్లాడుతార‌ని పేర్కొంటున్నారు. అసెంబ్లీ వ‌ద్ద జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోలీసుల‌పై వ్య‌వ‌హ‌రించిన తీరును చూస్తుంటే టీడీపీ, జ‌న‌సేన నేత‌ల‌కు ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంది. అసెంబ్లీ వ‌ద్ద నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించిన వైసీపీ ఎమ్మెల్యేల‌కు అడ్డు చెప్పినందుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోలీసుల‌పై చిందులేశాడు. అధికారంలో  ఉంది వైసీపీ.. నేనే సీఎంను అన్న‌ట్లుగా అహంకార పూరితంగా మాట్లాడారు. ఐదేళ్లు అవినీతి, అక్ర‌మాల‌తో రాష్ట్రాన్ని దోచుకున్న జ‌గ‌న్, వైసీపీ నేత‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన మొద‌టి రోజు నుంచే కొర‌డా ఝుళిపించి ఉంటే ప్ర‌స్తుతం ఈ ప‌రిస్థితి ఉండేది కాద‌ని కొంద‌రు తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌లు అంటున్నారు.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాజాగా ట్విట‌ర్ లో షేర్ చేసిన పోస్టును చూసిన నెటిజ‌న్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే జ‌గ‌న్ రెడ్డిని జైలుకు పంపిస్తే బాగుండేద‌ని అభిప్రాయపడుతున్నారు.    కేవలం 50 రోజుల్లోనే కూట‌మి ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందింద‌ని జ‌గ‌న్ ట్వీట్ చేయడం గమనార్హం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అరాచక పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది.. రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాలంటూ జ‌గ‌న్ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. అంతేకాదు.. చంద్ర‌బాబు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని చూసి భ‌య‌ప‌డుతున్నాడ‌ట‌. వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే అసెంబ్లీలో ప్రశ్నిస్తారన్న భయంతో కూట‌మి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం లేదంటూ జ‌గ‌న్ ట్వీట్ లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. మ‌రో అడుగు ముందుకేసి.. చంద్రబాబునాయుడి పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది అంటూ జ‌గ‌న్ ట్వీట్ చేయడం పట్ల ప్రజలు మండిప‌డుతున్నారు. ఇప్పటికైనా సుదీర్ఘ పాలనా అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు అభివృద్ధే లక్ష్యంతో పాటు.. రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టి ఘ‌ర్ష‌ణ‌లు సృష్టించే వైసీపీ మూక‌ల ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ప్రజలు కోరుతున్నారు.  

చెప్పేవి విలువల్స్.. పక్కనే క్రిమినల్స్!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున తన మార్క్ హంగామా ప్రదర్శించారు. ఆయన తీరు నీతులు చెప్పడానికే కానీ ఆచరించడానికి కాదని ఫిక్సైపోయినట్లు ఉంది. ఓ వైపు విలువల గురించి మాట్లాడుతూ.. అదే సమయంలో శవాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబును పక్కన పెట్టుకున్నారు. అలాగే దళితుడి శిరోముండనం కేసులో కోర్టు దోషిగా తేల్చి శిక్ష విధించిన తోట త్రిమూర్తులూ ఆయన పక్కనే ఉన్నారు. మొత్తం మీద జగన్ అసెంబ్లీ సజావుగా సాగడం జగన్ కు సుతరామూ ఇష్టం లేదన్న సంగతిని తొలి రోజు విస్పష్టంగా బయటపెట్టుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై చర్చించే ఉద్దేశం అంతకన్నా లేదని ఆయన చాటారు. ఏదో విధంగా సభలో గలాటా సృష్టించి వాకౌట్ చేయడమో, లేదా సస్పెండ్ అవ్వడమో లక్ష్యంగా ఆయన వ్యవహార శైలి ఉందన్న విమర్శలను మూటకట్టుకున్నారు. అసెంబ్లీలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి.. తద్వారా ఈ నెల 25న తాను తలపెట్టిన ఢిల్లీ ధర్నాకు మైలేజ్ వచ్చేలా చూసుకోవాలన్న తాపత్రేయం ఆయనలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇక సోమవారం (జులై22) జగన్ ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చొచ్చుకుని పోవడానికి ప్రయత్నించారు. నిబంధనల ప్రకారం సభలోకి ప్లకార్డులను తీసుకువెళ్లడానికి వీలు లేదు. ఆ కారణంగా పోలీసులు అడ్డుకుంటే వారితో ఘర్షణ పడినంత పని చేశారు. ప్రజాస్వామ్యం, నిబంధనలు అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ప్రజాస్వామ్యం, పోలీసుల విధులు అంటూ ఆయన ప్రసంగించారు. పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆయన పోలీసులకు పోలీసు విధులు, ధర్మం, న్యాయం  అంటూ సూక్తులు చెబుతున్న వీడియోలో ఆయన పక్కనే ఇటీవలే శిరోముండనం కేసులో కోర్టులో దోషిగా తేలిన తోట త్రిమూర్తులు ఉన్నారు. అంతే కాదు ఆయన వెంట ఉన్న బృందంలో హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కూడా ఉన్నారు. వాళ్లిద్దరినీ పక్కన పెట్టుకుని జగన్ ప్రజాస్వామ్యం, హక్కులు, పోలీసుల విధులు అంటూ ప్రసంగించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాను అధికారంలో ఉండగా ప్రజాస్వామ్యం ఖూనీ అయినా పట్టించుకోని, పైపెచ్చు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన అనంతబాబు, తోట త్రిమూర్తులు లాంటి వారిని వెనకేసుకొచ్చిన జగన్ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అంటూ నినాదాలు చేయడం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

జగన్‌కి ఆస్కార్ అవార్డు?

గౌరవనీయులైన ఆస్కార్ అవార్డుల అకాడమీ వారికి నమస్కారం. ఈసారి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో మీరు ఉత్తమ నటుడి అవార్డు ఎవరికి పడితే వాళ్లకి ఇవ్వకుండా, ఒక అంతర్జాతీయ స్థాయి గొప్ప నటుడికి ఇవ్వాలన్న ఉద్దేశంతో మీకు ఈ లేఖ రాయడం జరుగుతోంది. ఇండియాలో, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో జగన్ అనే ఒక మహా నటుడు వున్నాడు. ఈసారి ఆస్కార్ అవార్డు ఆయనకి ఇవ్వాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన సినిమా నటుడు కాదు కదా అనే సందేహం మీకు రావచ్చు.. కానీ, ఆయన సినిమా వాళ్ళకి అమ్మమొగుడు లాంటి నటుడు. అవార్డులకు అర్హత నటనే కావాలిగానీ, సినిమాలు కాకూడదనే అభిప్రాయంతో మీకు ఈ లేఖ రాయడం జరుగుతోంది. దయచేసి ఈసారి అవార్డుల ప్రదానం సందర్భంగా జగన్ అనే మహా నటుడిని పరిగణనలోకి తీసుకోవల్సిందిగా కోరుతున్నాం.  ఏదో అభిమానం కొద్దీ చెప్పడం కాదు.. మీరు కూడా జగన్‌కి సంబంధించిన వీడియోలు గట్రాలు తెప్పించుకుని చూడండి. ముఖ్యంగా గత ఐదేళ్ళ కాలంలో ఆయన నటనా చాతుర్యం చూసి మీరు ముక్కు మీద వేలేసుకుంటారు. లేటెస్ట్ వీడియోలు కావాలంటే, మొన్నటి ఎన్నికల ప్రచారం, ఇంటర్వ్యూలు, రీసెంట్‌గా నెల్లూరు సెంట్రల్ జైల్‌కి వెళ్ళిన వీడియోలు, శుక్రవారం నాడు వినుకొండ వెళ్ళిన వీడియోస్ చూడండి.. ఆయన ఎంత మహా నటుడో, మీ హాలీవుడ్ నటుల్ని మడతెట్టి పక్కనపెట్టే నటుడో మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా బాబాయ్ మర్డర్ సమయంలో ఆయన మర్డర్ జరిగిన తీరును వివరించిన వీడియో చూశారంటే, మీరు రాబోయే వందేళ్ళపాటు వరుసగా జగన్‌కే ఆస్కార్ అవార్డు ఇచ్చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అసలు మేం మాటల్లో చెప్పిన దానికంటే, మీరు మా జగన్ వీడియోలు సేకరించి చూడండి సార్.. ఇంత మహా నటుడిని ఇంతకాలం మిస్సయిపోయామని మీరే పశ్చాత్తాపపడతారు. మీరు మా జగన్ వీడియోలు చూస్తారని, ఈసారి ఆస్కార్ అవార్డ్స్.లో ఉత్తమ నటుడి అవార్డు మా జగన్‌కి ఇస్తారని ఆశిస్తున్నాం. ఇట్లు మహానటుడు జగన్ అభిమాన సంఘం..

‘కమ్మ’ అంటే అమ్మలాంటి వాళ్ళు.. రేవంత్‌రెడ్డి

కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న కమ్మ గ్లోబల్ సమిట్  కార్యక్రమం హైదరాబాద్‌లోని హైటెక్స్.లో శనివారం నాడు ప్రారంభమై అత్యంత వైభవంగా జరుగుతోంది. రెండు రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి శనివారం నాడు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘ఈ కార్యక్రమానికి ఆలోచన రెండేళ్ళ క్రితం రూపుదిద్దుకుంది. మిత్రుడు కుసుమకుమార్‌కి రెండేళ్ళ క్రితమే ఏర్పాటు చేయాలని భావించారు. అప్పుడు కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఎన్నికలు, ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు... 90 రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా ప్లాన్ చేయడం చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు నిర్వాహకులను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. కులం అనేది వృత్తినిబట్టి వచ్చేది. ‘కమ్మ’ అంటే అమ్మలాంటి వాళ్ళు. ఆకలి మీద వున్న వాళ్ళకి అమ్మలాగా అన్నం పెట్టే కులం ఇది. అమ్మ ఎవరిదైనా కడుపు చూస్తుంది. కమ్మ వాళ్ళు కూడా ఎదుటివారి కడుపు నింపాలని చూస్తారు. కమ్మవారు నేలతల్లని నమ్ముకుని, వ్యవసాయం చేసి మట్టిలో నుంచి బంగారం లాంటి పంటలు పంటలు పండించి, పదిమందికీ సాయం చేస్తారు. అందుకే ఒక సినిమాలో.. కొండపైన అమ్మవారు... కొండ కింద కమ్మవారు అని అన్నారు. కమ్మవాళ్ళు ఎక్కడ వున్నారో మనం గుర్తు పట్టాలంటే, పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సారవంతమైన భూములు, సమృద్ధిగా నీరు ఎక్కడైతే వుంటుందో అక్కడ తప్పకుండా కమ్మవారు వుంటారు అని నేను నా మిత్రులతో అంటూ వుంటాను. అది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, కర్నాటక అయినా.! కమ్మవారి ఆలోచన ఎప్పుడూ శ్రమించాలి, పంటలు పండించాలి.. పదిమందికీ ఉపయోగపడాలి.. పదిమందిని ఆదుకునే ఆలోచన చేయాలని అన్నదే కమ్మ కులంలో వున్న నేపథ్యం. అదే కమ్మ కులంలో వున్న డీఎన్ఏ.  కమ్మ కులంతో నాకున్న సన్నిహిత సంబంధాల గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, నేను ఎక్కడ వున్నా నన్ను కమ్మవారు ఎలా అభిమానిస్తారో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ లైబ్రరీలో చదువుకునే నేను చాలా నేర్చుకున్నాను. ఎన్టీఆర్ లైబ్రరీలో నేను చదువుకున్న చదువు నేను జీవితంలో ఉన్నత స్థానానికి రావడానికి ఉపయోగపడిందని నేను గట్టిగా చెప్పడానికి ఎంతమాత్రం జంకను. మనం వచ్చిన నేపథ్యం, మనకి అవకాశం ఇచ్చినవాళ్ళని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. చిన్నగా చేసి చూడటం పద్ధతి కాదు.  ఎన్టీఆర్ కంటే ముందు 52 మంది కమ్మ కులానికి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వున్నారని అంటూ వుంటారు. కానీ, ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఆయన ‘ఎన్టీఆర్’ అనే బ్రాండ్ క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ పాలిటిక్స్.లో ఒక బ్రాండ్.. ఎన్టీఆర్ లీడర్‌షిప్‌లో ఒక బ్రాండ్. వారు ఇచ్చిన అవకాశాల వల్లే ఆ రాష్ట్రమైనా, ఈ రాష్ట్రమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఈరోజు నాయకులు వున్నారూ అంటే, ఎన్టీఆర్ ఆనాడు ఇచ్చిన అవకాశాలే కారణం. ఎన్టీఆర్‌ని అవమానిస్తూ మాట్లాడే వాళ్ళకి కూడా అవకాశాలు ఇచ్చింది ఎన్టీఆరే. అది ఎన్టీఆర్ లోపం, ఎన్టీఆర్ తప్పు కాదు.. ఎన్టీఆర్ అందరికీ అవకాశం ఇచ్చారు.. అవకాశాన్ని అందుకున్నవాళ్లలో ఒక్కొక్కరు ఒక్కోరకంగా వుండొచ్చు. అది వారి వారి విజ్ఞత. అలాగే ఎన్జీ రంగా, వెంకయ్య నాయుడు, అలాగే.. చంద్రబాబు నాయుడు.. చంద్రబాబు నాయుడి గురించి ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు.. బలమైన నాయకురాలిగా ఇందిరాగాంధీని ఎదుర్కొనేవాళ్ళే లేరు అనే పరిస్థితులు వున్నప్పుడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే ఈరోజు దేశాన్ని ఏలుతున్న వారికి అవకాశాలు ఇచ్చాయన్న విషయాన్ని మరవకూడదు. ఒకనాడు దేశంలో బీజేపీ రెండు పార్లమెంట్ స్థానాలు మాత్రమే గెలిస్తే, హనుమకొండ నుంచి పీవీ నరసింహారావుని ఓడించిన బీజేపీ అభ్యర్థి జంగారెడ్డి తెలుగుదేశం మద్దతుతోనే గెలిచారన్న విషయాన్ని మరవకూడదు. బీజేపీ ఎక్కడో గుజరాత్‌లో ఒక స్థానంలో గెలిచింది. ఇక్కడ తెలుగుదేశం మద్దతుతో మరో స్థానంలో గెలిచింది. నేషనల్ ఫ్రంట్ కావచ్చు, యునైటెడ్ ఫ్రండ్ కావచ్చు, ఎన్డీయే కావచ్చు.. ఎప్పుడెప్పుడు అధికారంలోకి వచ్చినా ఎన్టీఆర్ సంకీర్ణ రాజకీయాల ఆలోచనే కారణం.  కమ్మ కులస్తులు వ్యవసాయం నుంచి లాయర్లుగా, డాక్టర్లుగా, వ్యాపారవేత్తలుగా అమరావతి నుంచి సిలికాన్ వ్యాలీ వరకు రాణిస్తున్నారు. సత్య నాదెళ్ళ దగ్గర మొదలుపెడితే, పెద్దపెద్ద మల్టీ నేషనల్ కంపెనీల సీఈవోలుగా కమ్మవారు వున్నారు. అమెరికాలో తానా సోదరులు పెట్టే బహిరంగ సభల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమావేశం జరపడం ఆనందకరం. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చడంలో కమ్మవారు కూడా భాగస్వాములుగా కావాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆహ్వానిస్తున్నాను. మీ కులంలో నిపుణులను, నైపుణ్యాన్ని అన్నిరకాలుగా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సంసిద్ధంగా వుంది. హైదరాబాద్ ప్రపంచ నగరంగా మారాలంటే, ప్రపంచంలో రాణించిన కమ్మ సోదరులకు ఇక్కడ అన్నిరకాలుగా అవకాశాలు కల్పించాల్సిన అవసరం వుంది. వాటిని కల్పించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా వుంది.  ప్రపంచంలో నిరసన తెలపడం అనేది ప్రాథమిక హక్కు. పన్నులు కడుతున్న ప్రాంతంలో ఎవరైనా తమకు నచ్చని విషయాల మీద నిరసన తెలపడానికి అవకాశం వుంది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అమెరికాలో వైట్ హౌస్ ముందు నిరసన తెలపడానికి అనుమతి వచ్చింది. కానీ, తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది తమ నిరసన తెలపాలని అనుకుంటే అప్పటి ప్రభుత్వం ఆ నిరసనను ఆపాలన్న ఆలోచన చేసింది. అదే వారి పతనానికి నాంది పలికింది.  ఢిల్లీలో మనకు ఒక గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిన వెంకయ్య నాయుడు రాష్ట్రపతి అవ్వాలని, నేను వేరే పార్టీ వాడిని అయినప్పటికీ కోరుకున్నాను. ఢిల్లీలో మన తెలుగు వారి వాయిస్ బలంగా వినిపించే వాళ్ళు లేరు. ఆ విషయంలో చాలా లోటు వుంది. ఆ లోటును పూరించే విషయాన్ని అందరం ఆలోచించాలి.  కమ్మ సంఘం నిర్మాణానికి ఐదెకరాలు గతంలో కేటాయించారు. కానీ, అది వివాదాలతో కూడిన భూమి. ఆ వివాదాలను పరిష్కరించి భూమిని స్వాధీనం చేయడానికి, అద్భుతమైన కమ్మ సంఘం భవనం నిర్మాణానికి సహకరించడానికి నేను, నా మంత్రివర్గ సహచరులం సిద్ధంగా వున్నాం. పేద కమ్మ వారిని, ఇతర పేదవారిని ఆదుకోవడానికి కమ్మవారంతా ముందుకు రావాలి. కమ్మవారు ఇతరులకు సహాయపడే తమ ప్రధాన లక్షణాన్ని, తమ డీఎన్ఏని వదులుకోకుండా వుండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను’’ అన్నారు. 

శాంతిని కూతుర్లా భావించావా... మా నాయనే!

‘ఏరా’ విజయసాయిరెడ్డి కళింగిరి శాంతిని కూతుర్లా భావించాట్ట. ఈ గొప్ప విషయాన్ని తెలియజేస్తూ శనివారం నాడు ‘ఏరా’ విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేశాడు. సాధారణంగా ‘ఏరా’ ఎప్పుడైనా ట్వీట్ చేశాడంటే, దాని నిండా కడుపులో తిప్పే స్థాయిలో బూతులు, ఆరోపణలు వుంటాయి. ఇప్పుడు కళింగిరి శాంతి వ్యవహారంలో పీకల దాకా కూరుకుపోయి వున్న ‘ఏరా’ విజయసాయిరెడ్డి ట్వీట్లు డిఫెన్స్ మోడ్‌లోకి మారిపోయాయి. పరనిందతో నిండి వుండే ఆయన ట్వీట్లు ఇప్పుడు ఆత్మస్తుతిలోకి షిఫ్ట్ అయిపోయాయి. శనివారం నాడు ‘ఏరా’ విజయసాయిరెడ్డి హృదయాలను కదిలించే విధంగా ట్వీట్ చేశాడు. అందులో మేటర్ ఏంటంటే, ‘‘అవాస్తవాలు ప్రచారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్ళు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజా ప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం వుంది. శాంతి కళింగిరిని 2020 సంవత్సరంలో ఎండోమెంట్స్ ఆఫీసర్‌గా వైజాగ్ సీతమ్మధార ఆఫీసులో మొట్టమొదటగా మీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూతురుగానే భావించాను. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్ళి పరామర్శించాను. మా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను. ఏ పరాయి మహిళతోను, అనైతిక / అక్రమ సంబంధాలు లేవు. నేను నమ్మిన దేవదేవులు శ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా చెప్తాను’’ ఇదీ మేటర్... ఈ ట్వీట్ మీద అసలు మేటర్లోకి వెళ్ళేముందు, ‘ఏరా’ విజయసాయి రెడ్డికి ఒక హెచ్చరిక... నీ తొక్కలో ఇష్యూలన్నిట్లోకి వెంకటేశ్వరస్వామిని లాగకు. ఆయనతో పెట్టుకుని నీ ఏ1, ఆయన ఫాదర్ కూడా మటాష్ అయిపోయారు. శాంతిని కూతుర్లా భావించావో, నాయనమ్మలా భావించావో... నీ ఏడుపేదో నువ్వు ఏడువు.. నీ తంటాలు నువ్వు పడు.. ఓవర్ బిల్డప్ ఇవ్వడానికి స్వామివారి పేరు ఉపయోగించావంటే నీకు మామూలుగా ఇత్తడైపోదు.. బీ కేర్‌ఫుల్! ఇక అసలు మేటర్లోకి వస్తే, ‘ఏరా’ విజయసాయిరెడ్డికి, శాంతి అక్రమ సంబంధం వుందనిగానీ, ఆమెకి పుట్టిన కొడుకుకు తండ్రి విజయ సాయిరెడ్డి అని గానీ, మీడియావాళ్ళు ఎవరూ అనడం లేదు. సదరు శాంతి భర్త నెత్తీనోరూ బాదుకుంటూ మీడియా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చెప్పుకుంటున్నారు. మొన్న నువ్వు వైజాగ్‌లో ఒక దిక్కుమాలిన ప్రెస్‌మీట్ పెట్టి చెత్త వాగుడంతా వాగితే మీడియా కవరేజ్ ఇచ్చింది కదా.. అదే విధంగా శాంతి భర్త మదన్ మొత్తుకుంటున్నదానికి కూడా కవరేజ్ ఇస్తోంది అంతే. ఆమాత్రం దానికి నువ్వు మీడియా వాళ్ళని ఆడిపోసుకుంటూ, ‘ఏరా’, ‘ఒరేయ్’ అని నోరు పారేసుకుంటూ టాపిక్‌ని డైవర్ట్ చేస్తున్నావు. ‘‘నేను డిఎన్ఎ టెస్టుకి ఒప్పుకుంటున్నాను’’ అనే ఒక్కమాటతో అయిపోయే విషయాన్ని సాగదీస్తున్నావు. లేనిపోని అనుమానాలు కలిగేలా చేస్తున్నావు. ఈ సోది ట్వీట్లు చేసేబదులు, ఆ టెస్టుకు ఒప్పుకోవచ్చు కదా.. అందరి నోళ్ళూ మూయించొచ్చు కదా? ఇంకో ఇంపార్టెంట్ పాయింట్.... అసలు నువ్వు శాంతిని కూతుర్లాగా ఎందుకు భావించాలి? నువ్వొక ఎంపీవి, ఆమె ఒక గవర్నమెంట్ ఆఫీసర్. మీ ఇద్దరి మధ్య రిలేషన్ అంతవరకే వుండాలి తప్ప.. ఆమెని నువ్వు ఎందుకు కూతుర్లా భావించాలి? ఆమె ఇంటికి నువ్వెందుకు వెళ్ళాలి? నీ ఇంటికి ఆమె ఎందుకు రావాలి? ప్రభుత్వ వ్యవహారాల్లో మీ పర్సనల్ మేటర్స్ ఏంటి? ఎందుకు నువ్వు తండ్రిలా ఆమెకి సహాయం చేయాలి? ఎంపీ హోదాలో వున్న నువ్వు నీ దగ్గరకి వచ్చిన వాళ్ళందరిలో కూతుర్నో, పిన్నినో, బాబాయ్‌నో చూసుకోవడమేంటి? అసలు ఏంటి ఇదంతా? 

‘ఆంధ్రా బెర్లిన్ గోడ’ కూల్చివేత!

జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు, ప్రభుత్వానికి అడ్డుగా కట్టిన గోడ ఇప్పుడు కూలిపోయింది. ‘బెర్లిన్ గోడ’ లాగా అవరోధాన్ని కలిగిస్తున్న ఈ గోడను ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశాలతో కూల్చేశారు. అసెంబ్లీ దగ్గరకు అమరావతి రైతులు రాకుండా జగన్ ప్రభుత్వం అసెంబ్లీ రెండో గేటుకి అడ్డంగా ఈ గోడ కట్టించింది. మూడు రాజధానుల పేరుతో అమరావతి రాజధానిని ముక్కలు చేయాలన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐదేళ్ళపాటు అమరావతి రైతులు ఉద్యమించారు. వారి ఆందోళనల నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఈ గోడను కట్టించింది. ఈ గోడను కూల్చేసిన సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ‘‘ప్రజలు వారి సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత. ప్రజాస్వామ్య నిలయమైన శాసనసభ గేట్లు తెరిచే వుండాలి. రాష్ట్రంలో ఇప్పుడున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజలకు అందుబాటులో వుండే ప్రభుత్వం. ఇది ప్రజా అసెంబ్లీ’’ అన్నారు.

రేవంత్ మాస్టర్ స్ట్రోక్.. రుణమాఫీ !

సకల రోగాలకూ మందు జాలిమ్ లోషన్ అన్నట్లుగా.. రాజకీయంగా తాను ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ రైతు రుణమాఫీయే విరుగుడు అని రేవంత్ భావిస్తున్నారు. అందుకే రూ. రెండు లక్షల రుణమాఫీని కటాఫ్ డేట్ కంటే ముందే ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నికలలో కూడా చేయనంత ప్రచారం చేస్తున్నారు. గురువారం (జులై 18)న  లక్ష   రూపాయల వరకూ రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించి, రైతుల ఖాతాలలో నిధులను జమ చేయడానికి రెడీ అయిపోయారు. అసలు తొలుత రుణమాఫీకి రేవంత్ పెట్టిన కటాఫ్ డేట్ ఆగస్టు 15.ఆ విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు కూడా. అయితే  జులై 18నే రుణమాఫీ నిధులను విడుదల  ప్రారంభించేశారు. రెండు లక్షల రుణమాఫీని మూడు విడతలుగా అందిస్తామని ప్రకటించిన ఆయేన తాను చెప్పిన ఆగస్టు 15 గడువు కంటే ముందే రైతులకు రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. అందులో భాగంగా  లక్ష రూపాయల వరకూ రుణమాఫీని గురువారం (జులై 18) ప్రారంభించారు.  ఇక లక్షన్నర వరకూ ఉన్న రుణాలను ఈ నెలాఖరులోగా, రెండు లక్షల వరకూ ఉన్న రైతు రుణాలను ఆగస్టులో మాఫీ చేస్తామని ప్రకటించారు. రేవంత్ నిర్ణయంతో ఒక్కసారిగా ఆయన సర్కార్ పట్ల సర్వత్రా సానుకూలత వ్యక్తం అవుతోంది. ఇటీవల  రేవంత్ రెడ్డి  ఇంటా బయటా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షాల నుంచే కాకుండా కాంగ్రెస్ లో కూడా ఆయన తీరు పట్ల ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అలాగే  బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలాగే  నిరుద్యోగుల ఆందోళన కూడా రేవంత్ సర్కార్ కు తలనొప్పిగా మారింది.  ప్రభుత్వంపై   అసంతృప్తి పెరుగు తోందన్న భావన ఏర్పడుతున్న సమయంలో  రేవంత్ రుణమాఫీ అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. దీంతో విపక్షాల నోళ్లు మూతపడే పరిస్థితి కల్పించారు. లబ్ధిదారులలో కోత విధించారంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన బాట పట్టడానికి ప్రయత్నించినా అప్పటికే రేవంత్ వారిపై పై చేయి సాధించేశారు.  మొత్తంగా రుణమాఫీ పేరుతో రేవంత్  ప్రభుత్వాన్ని ఒకదాని వెనుక ఒకటిగా చుట్టుముడుతున్న సమస్యలను దూరం చేశారు. 

పార్టీ కండువా మార్చేసిన హరీష్ రావు.. దేనికి సంకేతం?

బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం వలసల పర్వం కొనసాగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కాంగ్రెస్ లోకి చేరిపోతుండగా, ఆ పార్టీకి రాజ్యసభలో ఉన్న నలుగురు సభ్యులూ గంపగుత్తగా  కాషాయ కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ మనుగడపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ వ్యవహారాలలో క్రియాశీలంగా వ్యవహరించడం లేదు. పార్టీ నుంచి వలసలను నిరోధించడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన చేతులెత్తేశారు. ఏం జరగాలని రాసుంటే అదే జరుగుతుందన్న ధోరణిలో కేసీఆర్ ఉన్నారు. ఇక ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కూడా అడపాదడపా ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్ పై విమర్శలు, సవాళ్లు వినా, పార్టీలోనూ, పార్టీ క్యాడర్ లోనూ జోష్ నింపడంలో పూర్తిగా విఫలమయ్యారు. కాగా ఆ పార్టీలో మరో కీలక నేత హరీష్ రావు కూడా జెండా మార్చేస్తున్నారా అన్న అనుమానాలు పార్టీలో వ్యక్తం అవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే బీజేపీ ఆయనకు గేలం వేస్తున్నది. బీఆర్ఎస్ లో సమర్థ నేత హరీష్ రావు ఒక్కరే అంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు కొత్త పల్లవి అందుకున్నారు. బీజేపీ మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి హరీష్ రావు బీజేపీలోకి వస్తారని సంకేతాలు ఇచ్చేలా ఇటీవల కొన్ని సభలలో ప్రసంగించారు.  ఈ నేపథ్యంలోనే పటాన్ చెరు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు బీఆర్ఎస్ కండువా ధరించలేదు. దీంతో ఆయన పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నారా అన్న చర్చ మొదలైంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. హరీష్ రావు బీఆర్ఎస్ కండువా ధరించ లేదు సరే.. మరి ఏ పార్టీ కండువా ధరించారు. ఆయన ధరించింది బీజేపీ కండువా కాదు, కాంగ్రెస్ కండువా కూడా కాదు. మరి ఏమిటి? అంటే ఆయన టీఆర్ఎస్ కండువా ధరించారు. దీంతో ఆయన జెండా మార్చేశారన్న అభిప్రాయం గ ట్టిగా వినిపిస్తోంది. తొలి నుంచీ జాతీయ రాజకీయాల కోసం పార్టీలోని తెరాస పేరును తొలగించడాన్ని బాహాటంగా కాకపోయినా పార్టీ వేదికల మీద హరీష్ రావు గట్టిగా అభ్యంతరం తెలిపారు. పార్టీ పేరు మార్పు తెలంగాణ సెంటిమెంట్ ను గాయపరుస్తుందని ఆయన కేసీఆర్ కూ చెప్పారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  సరే ఏమైనా టీఆర్ఎస్ పేరు తొలగించి పార్టీకి బీఆర్ఎస్ అని నామకరణం చేసేశారు కేసీఆర్. అయితే పేరు మార్పు తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. ఈ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికలలోనూ బీఆర్ఎస్ ప్రదర్శన మరింత అద్వానంగా మారింది. లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు జీరో రిజల్ట్ వచ్చింది. దీంతో పేరు మార్పు సరికాదు అన్న హరీష్ రావు వంటి నేతల మాటలను ఎందుకు పట్టించుకోలేదా అని కేసీఆర్ భావిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే పటాన్ చెరు కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు బీఆర్ఎస్ కండువా మార్చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ ఆయన ఏ కండువా కప్పుకున్నారంటే.. టీఆర్ఎస్ కండువా. దీంతో బీఆర్ఎస్ పేరు మళ్లీ టీఆర్ఎస్ గా మారిపోనుందా అంటూ సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.  

ఏపీలో వైసీపీ గాయెబ్!?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు వైసీపీ ఎక్కడా కనిపించడం లేదు. ఏదో ఆ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాలో వార్తలు, ప్రకటనల్లో తప్ప.. రాష్ట్రంలో ఎక్కడా ఆ పార్టీ నేతలు కనిపించడం లేదు. ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ క్రమంగా కనుమరుగౌతోందా అన్న అనుమానాలు రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. ఎన్నికల తరువాత మీడియా ముందుకు వచ్చిన నేతలు కూడా ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. ఆఖరికి ఆ పార్టీ అధినేత జగన్ కూడా ఆర్ఘాటంగా ప్రకటించిన ప్రజాదర్బార్ ను సైతం రద్దు చేసుకుని ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చెక్కేశారు. ఆయన రాష్ట్రానికి వచ్చేది ఎప్పుడు అన్న విషయంలో క్లారిటీ లేదు. ఇక వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ప్రత్యర్ధులపై, తెలుగుదేశం నేతలపై బూతులతో విరుచుకుపడిన నాయకులెవరి గొంతులూ ఇప్పుడు వినిపించడం లేదు. ఇప్పటికే చ ాలా మంది రాష్ట్రం దాటేశారన్న సమాచారం ఉంది. ఇక రాష్ట్రంలో ఉన్న నేతలూ కూడా ఎవరికీ కనిపించకుండా, వినిపించకుండా దాదాపు అజ్ణాత వాసం చేస్తున్నారు.    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీ హయాంలో వివిధ రంగాలలో జరిగిన విధ్వంసంపై ఇప్పటి వరకూ నాలుగు శ్వేత పత్రాలు విడుదల చేశారు.  ఆ శ్వేత పత్రాలలో వైసీపీ అరాచక పాలన కారణంగా రాష్ట్రానికి జరిగిన భారీ నష్టం వెలుగులోనికి వస్తుంది. అంచనాలకు మించి వైసీపీ సర్కార్న, నేతలు రాష్ట్ర సంపదను కొల్లగొట్టారని తేటతెల్లం అవుతోంది. అమరావతి, పోలవరం, విద్యుత్, సహజ సంపద దోడిపీపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రాల ద్వారా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  వైసీపీ అరాచ, అధ్వాన పాలన, దోపిడీపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయినా చంద్రబాబు శ్వేత పత్రాలలో వెల్లడించిన అంశాలను, జగన్ పలనా వైఫల్యం, అరాచకత్వం, అక్రమాలపై చేసిన ఆరోపణలను ఖండించడానికి  వైసీపీ అధినేత సహా ఏ నాయకుడూ ముందుకు రావడం లేదు.  మాజీ మంత్రి పేర్ని నాని వంటి వారు మీడియా ముందుకు వచ్చి ఏవో నాలుగు మాటలు మాట్లాడి తూతూ మంత్రంగా చంద్రబాబు శ్వేతపత్రాలపై విమర్శలు గుప్పించి మిన్నకున్నారు. ఆ మీడియా సమావేశాలలో వారు రాసుకొచ్చిన స్క్రిప్ట్ చదివేసి విలేకరుల ప్రశ్నలకు బదులివ్వకుండా, అసలు వారికి ప్రశ్నలు వేసే అవకాశమే ఇవ్వకుండా తాము చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్లిపోతున్నారు.   రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి. ఎక్కడా వైసీపీ నేతలు కనిపించడం లేదు. పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనా రాయణ, పుంగనూరు పుడింగి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం తొడకొట్టి మీసం మెలేసి మరీ ప్రత్యర్థులపై విరుచుకుపడిన మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్, సమయం సందర్భంతో పనిలేకుండా మీడియా కనిపిస్తే చాలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై విరుచుకుపడిన రోజా,  వాడు, వీడు అంటూ విపక్ష నేతలపై బూతుల వర్షం కురిపించడానికే మీడియా ముందుకు వచ్చిన కొడాలి నాని వీరెవరూ ఇప్పుడు నోరెత్తడానికి కూడా సాహసించడం లేదు. బొత్స సత్యనారాయణ  అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఆయన మాట్లాడే మాటలు, చేసే వ్యాఖ్యలు  వైసీపీ మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టేవిగానే ఉంటున్నాయి. ఆయన చూపులు కాంగ్రస్ వైపు మళ్లినట్లుగా పార్టీ వర్గాల్లోనే గట్టిగా వినిపిస్తోంది. ఇక ధర్మాన ప్రసాదరావు,  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ ఇలా పార్టీలోని సీనియర్లు ఎవరూ కూడా  నోరు విప్పి మాట్లాడటం లేదు. అసలు పార్టీలో కొనసాగుతారో లేదో తెలియడం లేదు. పలువురు వైసీపీ సీనియర్లు కాషాయ కండువా కప్పు కోవడానికి తహతహలాడుతున్నట్లు రాజకీయవర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.  అసలు పార్టీ సీనియర్ నేతలలో చాలా మంది ఇప్పటికే రాష్ట్రం దాటేశారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. వారెవరూ ఇప్పట్లో రాష్ట్రానికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నాయి. స్వయంగా పార్టీ అధ్యక్షుడే తాడేపల్లి ప్యాలెస్ నుంచి బిచాణా ఎత్తేసి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు పలాయనం చిత్తగించారు, ఇక వైసీపీ నేతల పరార్ ఒక లెక్కా అని తెలుగుదేశం శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి.  మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం వైసీపీ అజ్ణాతంలోకి వెళ్లిపోయిందా అన్నట్లుగి పరిస్థితులు ఉన్నాయి.  

మోడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపగలరా?

నరేంద్రమోడీ ముచ్చటగా మూడో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు దాటింది. గత రెండు సార్లు ఆయన ప్రధానిగా ఉన్నప్పటి పరిస్థితి వేరు. మూడో సారి ప్రధానిగా ఆయన ప్రస్థానం వేరు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తొలి రెండు సార్లూ మోడీ నేతృత్వంలోని ఎన్డీయే పేరుకే సంకీర్ణం. కానీ బీజేపీకి భాగస్వామ్య పక్షాల మద్దతు అవసరం లేకుండానే సొంతంగా సర్కార్ ను ఏర్పాటు చేయగలిగినంత బలం ఉంది. ఆ కారణంగానే మోడీ పాలన ఆయన ఇష్టారాజ్యంగా సాగింది. పేరుకు భాగస్వామ్య పక్షాలకు తన కేబినెట్ లో స్థానం కల్పించినా. వాటికి కేటాయించిన శాఖలు అత్యంత అప్రాధాన్యమైనవి. అలాగే భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలకు ఇసుమంతైనా విలువ ఇవ్వకుండానే ఆయన పాలన సాగింది. అదే సమయంలో  మోడీ భాగస్వామ్య పక్షాలను నిర్వీర్యం చేయడానికీ, వాటిలో చీలిక తీసుకురావడానికి ఇసుమంతైనా వెనుకాడని పరిస్థితి ఉండేది. ఆ కారణంగానే ఒక దశలో ఎన్డీయే నామమాత్రం అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది. అందుకు తగ్గట్టుగానే పలు పార్టీలు ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశాయి.  2014 ఎన్నికల ముందు నాటికి జాతీయ ప్రజాస్వామ్య కూటమి.. అదే ఎన్డీయే కథ ముగిసిపోయిందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి. వాజ్ పేయి హయాంలో 24 పార్టీలతో కూటమిగా  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చక్రం తిప్పిన ఎన్డీయే కూటమి పరిస్థితి 2024 నాటికి అగమ్య గోచరంగా మారిపోయింది. అసలా కూటమికి శుభం కార్డు పడిందా అన్న అనుమానాలు సైతం పరిశీలకుల నుంచి వ్యక్తం అయ్యాయి. చివరాఖరికి ఎన్డీయేకు ఏదో ఒక స్థాయిలో కూటమి అన్న గుర్తింపు రావడానికి కారణమైన బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ కూడా ఒక దశలో కాడె వదిలేసి కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగట్ బంధన్ లో చేరి తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకున్నారు. అయితే ఇండియా కూటమి సారథ్యం వహించాలన్న ఆయన ఆకాంక్ష సాకారమయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో మళ్లీ వెనక్కు వచ్చారనుకోండి అది వేరే సంగతి. వాస్తవానికి 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ‘ఏకపార్టీ’ ఆధిక్యత సాధించిన రోజునే, ఎన్డీఎ కథ ఇక ముగిసినట్లే అన్న విశ్లేషణలు వెలువడ్డాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా 2014 ఎన్నికలలో లోక్ సభలో బీజేపీ సొంతగా సాధారణ మెజారిటీ (272) కంటే  10 సీట్లు అదనంగా (282) గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ సొంత బలమే 303 కు చేరింది.  అదే సమయంలో  ప్రతిపక్ష కూటమి యూపీఎ పరిస్థితి అంతకంతకూ దిగజారుతూ వచ్చింది. ఇక బీజేపీ విషయానికి వస్తే.. అయినా 2014లో తిరిగి 2019లో  కూడా బీజీపీ  ప్రధాని మోడీ సారధ్యంలో ఎన్డీఎ సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పాటు చేసింది.  ప్రధాని నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో తెలుగు దేశం, శివసేన, అకాలీదళ్, సహా అనేక ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఆ తర్వాత  ఎవరి కారణాలు వారికీ ఉన్నా, ఒక్కొక్క పార్టీ ఎన్డీఎకి దూరమవుతూ వచ్చింది.   2019 ఎన్నికల్లోనూ అకాలీ దళ్, శివసేన, పాశ్వాన్ పార్టీ ఎల్’జేపీ, ఎఐఎడిఎంకే, జేడీ(యు)సహా అప్నా దళ్, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి మరికొన్ని చిన్నా చితక పార్టీలు సహా మొత్తం తొమ్మిది పార్టీలు మాత్రమే ఎన్డీయేలో ఉన్నాయి. 2014 వచ్చే సరికి వాటిలో కొన్న బీజేపీకి తద్వారా ఎన్డీయేకి దూరమయ్యాయి.   దీంతో  2024 ఎన్నికల  నాటికి ఎన్డీయేలో ఉన్న ఏ పార్టీకీ, జేడీయూ వినా సొంతంగా ఒకటి రెండు స్థానాలకు మించి గెలుచుకునే అవకాశాలు కూడా లేని చితనా చితకా పార్టీలు మాత్రమే కూటమిలో మిగిలాయి. అలా మిగిలిన ఏ పార్టీకీ కూడా లోక్ సభలో ఒకటి, రెండు స్థానాలకు మించి లేవు.   బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థానాలలో విజయం సాధించే అవకాశం లేదన్న సర్వేలతో కంగారుపడిన బీజేపీ మళ్లీ ఎన్డీయేను బలోపేతం చేసేందుకు కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే ఎన్డీయేకు దూరమైన పార్టీలను ఆహ్వానిస్తూ అమిత్ షా పిలుపునిచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా బీజేపీ, తెలుగుదేశం పార్టీలు పొత్తుతో కలవాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. అలా చివరి నిముషంలో బీజేపీ మేల్కొని ఎన్డీయే కూటమి పటిష్టతకు నడుంబిగించి ఒకటికి రెండు మెట్లు దిగిరావడంతో మోడీ మూడో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగలిగారు. లేకుంటే బీజేపీ మూడో సారి అధికార కూటమికి నేతృత్వం వహించగలిగేది కాదని 2024 సార్వత్రిక ఎన్నికలు తేటతెల్లం చేశాయి. ఇప్పుడు కేంద్రంలో మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం  మనుగడ పూర్తిగా భాగస్వామ్య పార్టీల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉంది.  దీంతో ఐదేళ్ల పాటు భాగస్వామ్య పక్షాల మద్దతు పొందేలా మోడీ పాలన సాగించగలరా? అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో ఎదురౌతున్నాయి.  మోడీ, షా జోడీ నాయకత్వంలో బీజేపీ నిన్నటి వరకూ శతృ మిత్ర బంధాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలనూ నిర్వీర్యం చేయడమనే ఫార్ములాను అనుసరించింది.  అన్ని పార్టీలను రాజకీయ ప్రత్యర్ధులుగానే చూసింది.    ఏక పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం దిశగా బీజేపీ అడుగులు వేస్తొందని పరిశీలకుల విశ్లేషణలకు అనుగుణంగానే మోడీ 2014, 2019లలో అధికారం చేపట్టినప్పుడు వ్యవహరించారు.   కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యంగా అడుగులు వేసిన మోడీ సర్కార్.. ఆ పేరుతో ఇతర రాజకీయ పార్టీలను కూడా కబలించేయడానికి శతథా ప్రయత్నించింది. విఫలమైంది. దీంతో ఇప్పుడు మూడో సారి మోడీ నేతృత్వంలోని సర్కార్ కేంద్రంలో కొలువుదీరిన తరువాత మారిన పరిస్థితులకు అనుగుణంగా మోడీ తీరు మారుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   

రామసేతు వాస్తవం..రామాయణం నిజం!

హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడు. త్రేతా యుగంలో రాముడు అయోధ్యను పాలించాడని పురాణాలు చెబుతున్నాయి. రావణుడు అపహరించిన సీతను తీసుకురావడానికి  లంక వెళ్లి రావణుని సంహారించి  వెనక్కి తీసుకువచ్చాడు శ్రీరాముడు. అందుకోసం 100యోజనాల దక్షిణసముద్రానికి వానరుల సహాయంతో వారధి కట్టారని రామాయణ కధనం. దాన్నే నేడు రామసేతు అంటున్నారు. 2018లోనే నాసా రామసేతు నిజమని చెప్పింది.ఇప్పుడు మన ఇస్రో శాస్త్రవేత్తలు నాసా సహాయంతో మరింత సమాచారం, మరిన్ని ఫోటోలు సేకరించారు.ఈ ఫోటోలలో 10మీటర్ల మ్యాప్ లో వంతెన పూర్తిగా కనిపిస్తున్నది. సముద్రగర్భం నుంచి 8మీటర్లు ఎత్తులో ఈ రామసేతు ఉందని తేల్చారు. రామసేతు దాదాపు 99.9శాతం సముద్రంలో మునిగిపోయిందన్నారు. కేవలం  కొద్ది భాగం మాత్రమే కనిపిస్తున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  రామసేతు తమిళనాడు రామేశ్వరం సమీపంలోని ధనుష్కోటి నుంచి శ్రీలంక లోని మన్నారు ద్వీపంలోని తలైమన్నారు వరకూ నిర్మించాలని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిని బండరాళ్లు, సున్నం రాళ్లతో  నిర్మించారని తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఐస్ శాట్-2 సహాయంతో మ్యాప్ విడుదల చేసారు. ఈ వంతెన 29కిలోమీటర్లు వరకూ ఉందని పేర్కొన్నారు. క్రీ.శ.9వ శతాబ్దం వరకూ పర్షియన్లు సేతు బందైగా పిలిచేవారు. రామేశ్వరం ఆలయ వర్గాల మేరకు తుఫానులతో ఈ వంతెన ధ్వంసమైందని తెలిసింది. క్రీ.శ.1480 నాటివరకూ వంతెన కనిపించిందని తెలిపారు. 

కాళ్ళమీద పడొద్దు.. చంద్రబాబు రిక్వెస్ట్!

కాళ్ళకు నమస్కారాలు పెట్టే సంస్కృతిని మానాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఈ సూచన చేశారు. ‘‘ఎవరైనా నా కాళ్ళకు దణ్ణం పెడితే, వారి కాళ్ళకు నేను దణ్ణం పెడతా. ఈరోజు నుంచి నా కాళ్ళకు నమస్కారం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నాను. తల్లిదండ్రులు, భగవంతుడి కాళ్ళకి నమస్కారం పెట్టాలి తప్ప, నాయకులకు కాదు. నాయకుల కాళ్ళకి నమస్కారాలు పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దు. నాయకుల కాళ్ళకు ప్రజలు, పార్టీ శ్రేణులు దణ్ణం పెట్టే సంస్కృతిని ఇకనైనా ఆపాలి’’ అని చంద్రబాబు అన్నారు.

కుమార్తె కోసం పార్టీ పణం?!

గత ఏడాది తెలంగాణ  అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. ఆ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేక చతికిల బడింది. బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఆవిర్భావం తరువాత లోక్ సభలో స్థానం లేకుండా ఉన్న పరిస్థితి ఇదే తొలిసారి. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పార్టీ ఓటమి పరాభవం కంటే తన కుమార్తె కవిత మద్యం కుంభకోణంలో అరెస్టై బెయిలు కూడా దొరకకుండా తీహార్ జైల్లో మగ్గుతుండటం ఎక్కవగా బాధిస్తోందనడంలో సందేహం లేదు.  కవితపై సీబీఐ మరో చార్జిషీట్ దాఖలు చేయడం ఆయనను మరింత ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ కష్టాలన్నిటి నుంచీ బయటపడటానికి బీజేపీతో చెలిమి ఒక్కటే మార్గమని కేసీఆర్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు ఇటీవలి కాలంలో ఆయన మౌనాన్ని ఉదాహరణగా చెబుతున్నారు.  అయితే బీజేపీ నుంచి సానుకూల స్పందన లభించకపోవడం  కేసీఆర్ లో ఆందోళన మరింత పెరుగుతోంది.  పోనీ పార్టీని బలోపేతం చేయడం ద్వారా బలమైన విపక్షంగా నిలబడి కేసులను ఎదుర్కొందామా అనుకుంటే.. పార్టీ అస్థిత్వానికే ముప్పు వాటిల్లుతోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలు ఉన్నాయి. అలాగే రాజ్యసభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీల అడుగులు చూస్తుంటే నేడో రేపో బీఆర్ఎస్ రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఇంకో వైపు కేసీఆర్   ఫోన్ ట్యాపింగ్ కేసులో  పీకలోతు ఇరుక్కున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అలాగే  కాళేశ్వరం  సహా ఆ ప్రాజెక్టులో భాగంగా కట్టిన మేడిగడ్డ, సుందిళ్ల అక్రమాలు, అవినీతి, నాణ్యతా లోపాలు కూడా కేసీఆర్ మెడకే చుట్టుకోనున్నాయా అన్న అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఇన్ని ఇబ్బందులూ, కష్టాలలోనూ కేసీఆర్ దృష్టంతా కవితను బయటకు తీసుకురావడం ఎలా అన్నదానిపైనే ఉంది. అందుకోసం పార్టీని కూడా పట్టించుకోవడం లేదు. పార్టీలో తన తరువాత ప్రముఖులుగా గుర్పింపు ఉన్న తన తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావులను కవిత బెయిలు, బీజేపీతో రాజీ కోసం హస్తిన పంపించారు. హస్తినలో  కవిత బెయిలు కోసమే కాకుండా, ఆమెను మద్యం కుంభకోణం కేసు నుంచి బయటపడేసేందుకు సహకారం అందిస్తే.. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను మూకుమ్మడిగా బీజేపీలో చేర్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కేటీఆర్, హరీష్ రావు హస్తిన వెళ్లి వచ్చిన తరువాత జరిగిన పరిణామాలు ఆ వార్తలు వాస్తవమేననిపించేలా ఉన్నాయి.   స్థానిక ఎన్నికలలో బీజేపీకి మద్దతుగా నిలిచేందుకు కూడా బీఆర్ఎస్ మంతనాలు సాగిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ఈ ప్రయత్నాలన్నీ కేసీఆర్ పర్యవేక్షణ, మార్గదర్శకంలోనే జరుగుతున్నాయని అంటున్నారు. అటు కాంగ్రెస్ ను ఇరుకున పడేయడం, ఇటు తన కుమార్తె కవితను మద్యం కుంభకోణం కేసు నుంచి బయటపడేయడం లక్ష్యంగానే కేసీఆర్ బీఆర్ఎస్ భవిష్యత్ ను పణంగా పెడుతున్నారని అంటున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లకు మోక్షం.. తక్షణం రిపేర్లు!

ఆంధ్రప్రదేశ్‌లో దారుణంగా వున్న రోడ్ల పరిస్థితి మారనుంది. తక్షణం రిపేరు పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రహదారులు, భవనాల శాఖపై చంద్రబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రోడ్ల పరిస్థితిపై ఆరా తీశారు. జగన్ ప్రభుత్వంలో కనీసం గుంతలు కూడా పూడ్చలేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని తెలిపారు. గత ప్రభుత్వ తీరుతో ఇప్పుడు కాంట్రాక్టర్లు ఎవరూ రోడ్లు వేయడానికి ముందుకు రావడం లేదని అధికారులు వివరించారు. రోడ్ల మీద గుంతలు పూడ్చడానికి తక్షణం 3 వందల కోట్లు అవసరమని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వెంటనే టెండర్లు పిలిచి, రోడ్ల పనులను తక్షణం ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.   జగన్ ప్రభుత్వం రోడ్లను ఎంతమాత్రం పట్టించుకోలేదని, ప్రజలు ఐదేళ్ళపాటు గతుకుల రోడ్ల మీద నరకం చూశారని చంద్రబాబు చెప్పారు. ఈ పరిస్థితి మారేలా పనులు  మొదలవ్వాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 4,151 కిలోమీటర్ల మేర రోడ్ల మీద గుంతల సమస్య వుంది. తక్షణం మరమ్మతులు చేయాల్సిన రోడ్లు 2,936 కిలోమీటర్లు వున్నాయి. ఈ 7,087 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల మరమ్మతులు వెంటనే ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశించారు.

షర్మిల సెటైర్లు వింటే జగన్‌‌‌కి హార్టెటాక్ ఖాయం!

జగన్‌ని పొరపాటుగా చట్టం వదిలేసినా, ధర్మం వదిలేసినా, న్యాయం వదిలేసినా, జైళ్ళు వదిలేసినా, కేసులు వదిలేసినా... నేను మాత్రం వదలను అన్నట్టుగా వుంది జగన్ గారి చెల్లెమ్మ షర్మిలమ్మ పట్టుదల. సమయం, సందర్భం దొరికితే చాలు... జగన్ మీద విరుచుకు పడుతున్నారు. ఒకవేళ సమయం, సందర్భం దొరక్కపోతే, తానే ఆ రెండిటినీ కల్పించుకుని మరీ జగన్ని ఒక ఆట ఆడుకుంటున్నారు. లేటెస్ట్.గా జగన్ అండ్ బ్యాచ్ మీద షర్మిల విసిరిన పంచులు ఇవి.... * వైసీపీ అంటే, యువజన, శ్రామిక, రైతు పార్టీ. అంటే, డాక్టర్ రాజశేఖరరెడ్డికి, ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. * రాజశేఖరరెడ్డి గారి జయంతి రోజున జగన్ ఏం చేశారు? ఇడుపులపాయలో రాజశేఖరరెడ్డి స్మృతి  చిహ్నం దగ్గర కేవలం ఐదు నిమిషాలు మాత్రమే వున్నారు. సొంత తండ్రి జయంతి కార్యక్రమం ఎంత బాగా నిర్వహించాలి? సిద్ధం సభ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కదా.. వైఎస్సార్ జయంతికి ఏం చేశారు? జగన్ ఏమీ చేయలేదు.. ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏమీ చేయలేదు. ఇలాంటి జగన్ వైఎస్సార్ రాజకీయ వారసుడు ఎలా అవుతాడు? * జగన్ మీద, వైసీపీ మీద కోపంతో కొంతమంది రాజశేఖరరెడ్డి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. నా విజ్ఞప్తి ఏమిటంటే, వైసీపీకి, రాజశేఖరరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు.