political-news-img

నౌహిరా షేక్ కేసులో ఐఏఎస్ అధికారి ని విచారించిన ఈడి

హీరా గ్రూప్‌ అధినేత్రి నౌహిరా షేక్ కు సంబంధిం చిన మనీలాండరింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు లో భాగంగా ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ సుదీర్ఘంగా ప్రశ్నించారు. దాదాపు 11 గంటల పాటు కొనసాగిన ఈ విచారణలో హీరా గ్రూప్‌కు చెందిన ఆస్తుల విక్రయాలు, అనుమతులు, అధికారిక నిర్ణయాలపై వివరణలు కోరినట్లు సమాచారం. హీరా గ్రూప్‌పై మనీలాండరింగ్‌, పెట్టుబడిదారుల మోసం వంటి ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఇప్పటికే పలు ఆస్తులను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ అటాచ్‌ చేసిన ఆస్తులను విక్రయించేందుకు అనుమతులు ఇచ్చే ప్రక్రియలో అమోయ్ కుమార్ సహకరించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నౌహీరా షేక్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ, ఆస్తుల అమ్మకాల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారనే అనుమానాలపై ఈడీ అధికారులు అమోయ్ కుమార్ పైప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. విచారణ సందర్భంగా హీరా గ్రూప్‌కు చెందిన భూములు, భవనాలు, ఇతర ఆస్తుల బదిలీలపై పలు పత్రాలను ఈడీ అధికారులు పరిశీలించినట్లు సమాచారం. అలాగే సంబంధిత ఫైళ్ల క్లియరెన్స్‌, అధికారిక అనుమతుల జారీ, ప్రభుత్వ నిబంధనల అమలు వంటి అంశాలపై కూడా అమోయ్ కుమార్‌ను వివరణ కోరినట్లు తెలిసింది. ఈ కేసులో నౌహీరా షేక్‌ ఆస్తుల అమ్మకాల వెనుక అధికార యంత్రాంగంలోని కొందరి పాత్ర ఉందా అనే కోణంలో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే హీరా గ్రూప్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడిదారుల నుంచి సేకరించిన నిధుల వినియోగంపై ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా ఐఏఎస్ అధికారి విచారణకు హాజరుకావడం ఈ కేసులో మరింత ప్రాధా న్యత సంతరించుకుంది. విచారణ అనంతరం అమోయ్ కుమార్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. మరోవైపు, అవసరమైతే మళ్లీ విచారణకు పిలిచే అవకాశం ఉందని ఈడీ వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Publish Date: May 26, 2026 10:20AM

political-news-img

సీజ్ ఫైర్ ఉల్లంఘించి మరీ ఇరాన్ పై అమెరికా దాడులు

మిడిల్ ఈస్ట్‌లో శాంతి నెలకొంటుందని ప్రపంచమంతా ఆశిస్తున్న తరుణంలో అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ ఇరాన్ పై దాడులకు పాల్పడింది. గత నెల 7న కుదిరిన చారిత్రాత్మక సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని పక్కనబెట్టి, అమెరికా సైనిక దళాలు ఇరాన్‌పై ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఇరాన్‌కు చెందిన వ్యూహాత్మక ప్రాంతాలైన ఖేష్మ్ పోర్ట్, బందర్ అబ్బాస్ లక్ష్యంగా అమెరికా జరిపిన ఈ వైమానిక దారులు గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ పరిధిలో అమెరికా నౌకాదళ ఆస్తులపై ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ దాడులు పరిమిత సైనిక చర్య మాత్రమేనని, పూర్తి స్థాయి యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించడం తమ ఉద్దేశం కాదని అమెరికా సీనియర్ అధికారులు పేర్కొన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భీతావహంగా మారింది. ఇరాన్ అధికారిక మీడియా కథనాల ప్రకారం.. ఖేష్మ్ ఐలాండ్, బహమన్ పీర్, బందర్ అబ్బాస్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. అమెరికా దళాలు తమ పౌర నివాస ప్రాంతాలను, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని కాల్పుల విరమణ ఒప్పందాన్ని దారుణంగా ఉల్లంఘించాయని ఇరాన్ ఆరోపించింది. దీనికి ప్రతిచర్యగా, హోర్ముజ్ జలసంధిలో ఉన్న శత్రు దళాలపై ఇరాన్ నేవీ మిస్సైల్, డ్రోన్ విభాగాలు ఎదురుదాడికి దిగాయి. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఈ పరిస్థితిపై స్పందిస్తూ.. హోర్ముజ్ ప్రాంతంలో ఇరుపక్షాల మధ్య కాల్పులు జరిగినప్పటికీ సీజ్‌ఫైర్ ముగిసిపోలేదు అని ప్రకటించారు. డ్రోన్ హబ్‌లు, క్షిపణి ప్రయోగ కేంద్రాలు, నిఘా కేంద్రాల నుండి పొంచి ఉన్న ముప్పును అణచివేయడానికే తాము ఈ దాడులు నిర్వహించామని అమెరికా సైనిక వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వివాదంపై స్పందిస్తూ కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా అమలులోనే ఉందన్నారు. అయితే.. ఇరాన్ గనుక అణు ఒప్పందానికి అంగీకరించకపోతే భవిష్యత్తులో ఇంతకంటే ఘోరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Publish Date: May 26, 2026 9:55AM

political-news-img

కెప్టెన్సీ నుంచి ఆ ముగ్గురికీ ఉద్వాసనేనా?

ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ పూర్తయ్యింది. ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లేఆఫ్స్‌లో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి.మిగిలిన జట్లు ఇంటిబాట పట్టాయి. ముఖ్యంగా ప్లేఆఫ్స్ చేరని జట్ల కెప్టెన్లపై ప్రస్తుతం ఉద్వాసన కత్తి వేళాడుతోంది. టీ20 ఫార్మాట్‌లో నాయకుడి పాత్ర ఎంతవరకు ఉంటుంది అనేదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, జట్టు ఓటమికి కెప్టెన్ బాధ్యత వహించక తప్పదు. ఈ నేపథ్యంలో మూడు జట్ల కెప్టెన్లు ఆ బాధ్యతల నుంచి వైదొలగడమో, ఉద్వాసనకు గురి కావడమో తప్పదని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆ ముగ్గురూ ఎవరంటే.. లక్నో సూపర్ జెయింట్స్ స్కిప్పర్ రిషభ్ పంత్, కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ స్కిప్పర్ రుతురాజ్ గైక్వాడ్. మొదటిగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ విషయానికి వస్తే.. లక్నో జట్టుకు సారథిగా రిషభ్ పంత్ పరిస్థితి గడిచిన రెండేళ్లుగా ఏమాత్రం బాగాలేదు. భారీ రికార్డు స్థాయి జీతంతో ఈ ఫ్రాంచైజీలోకి అడుగుపెట్టిన పంత్, ఆశించిన స్థాయిలో జట్టును నడిపించలేకపోయాడు. 2025 మరియు 2026 వరుస సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టును పాయింట్ల పట్టికలో ఏడో స్థానం కంటే ముందుకు తీసుకెళ్లడంలో అతడు పూర్తిగా విఫలమయ్యాడు. కెప్టెన్సీ ఒత్తిడి అతడి బ్యాటింగ్‌ను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో పంత్ కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీతో కేవలం 312 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తన జట్టు కాగితంపై బలంగానే ఉందని పంత్ పదే పదే చెప్పినప్పటికీ, మైదానంలో సరైన వ్యూహాలు అమలు చేయడంలో, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడ్డాడు. జట్టు సహాయక సిబ్బంది నిర్ణయాల జోక్యంపై అతడు అసంతృప్తిగా ఉన్నట్లు పరోక్ష వ్యాఖ్యలు కూడా చేశాడు. ఈ పరిస్థితుల్లో పంత్ కెప్టెన్సీ భారాన్ని పక్కనపెట్టి, కేవలం.. బ్యాటర్‌గా తన మునుపటి ముద్రను చూపిస్తేనే అతడి కెరీర్‌కు మళ్లీ పూర్వవైభవం వస్తుంది. అలాగే.. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే. రహానే మైదానం వెలుపల ఒక ప్రశాంతమైన, మంచి నాయకుడిగా కనిపించినప్పటికీ, ఒక ఓపెనింగ్ బ్యాటర్‌గా మాత్రం ఈ సీజన్ లో కేకేఆర్ జట్టుకు భారంగా మారాడు. ఆధునిక టీ20 క్రికెట్ వేగంగా దూసుకుపోతుంటే, రహానే పాతకాలపు యాంకర్ రోల్ పోషిస్తూ పవర్‌ప్లేలో వేగంగా పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. 2026 సీజన్ లో ఆడిన 14 ఇన్నింగ్స్‌లలో రహానే కేవలం 25.77 సగటుతో, అలాగే 135.08 స్వల్ప స్ట్రైక్ రేట్‌తో కేవలం 335 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మందకొడి బ్యాటింగ్ కారణంగా జట్టుపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ప్రస్తుత వేగవంతమైన టీ20 ప్రమాణాల ప్రకారం రహానేకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడమే కష్టంగా మారింది. అందువల్ల రహానే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటే, జట్టుకు కొత్త రక్తం అందుతుంది. అలాగే అవసరమైన కొన్ని ప్రత్యేక మ్యాచ్‌లలో అతడిని పించ్ హిట్టర్‌గా లేదా ఒక అనుభవజ్ఞుడైన బ్యాటర్‌గా వాడుకోవడానికి మేనేజ్‌మెంట్‌కు వీలుంటుంది. చివరిగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న సిఎస్కేను నడిపించడం అంత సులువైన విషయం కాదు. అయితే రుతురాజ్ గైక్వాడ్‌కు మాత్రం 2026 ఐపీఎల్ సీజన్ ఒక పీడకలలా మిగిలిపోయింది. కెప్టెన్‌గా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడమే కాకుండా, బ్యాటింగ్‌లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. లీగ్ చివరి మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 21 బంతుల్లో 15 పరుగులు, ముంబై ఇండియన్స్‌పై 14 బంతుల్లో 22 పరుగులు, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక పోరులో 7 బంతుల్లో 16 పరుగులు చేసి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. కొన్ని మ్యాచ్‌లలో అతడి స్ట్రైక్ రేట్ 46.15 మరియు 71.43 మాత్రమే ఉండటం అతడి పూర్ ఫామ్ ను తెలియజేస్తుంది. కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా గైక్వాడ్ తన సహజసిద్ధమైన ఆటను కోల్పోతున్నాడు. కాబట్టి.. ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్లు తమ కెప్టెన్సీని వదులుకుని, కేవలం ఆటగాళ్లుగా మైదానంలోకి దిగితేనే అటు జట్లకు, ఇటు వారి వ్యక్తిగత భవిష్యత్తుకు ఎంతో మేలు జరుగుతుందని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. గతంలో ఆర్సీబీ బెంగళూరు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ స్వచ్ఛందంగా తప్పుకుని బ్యాటర్ గా అమోఘంగా రాణిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

Publish Date: May 26, 2026 9:34AM

political-news-img

గ్రీన్ కార్డ్ నిబంధనలపై వెనక్కు తగ్గిన అమెరికా

అమెరికాలో స్థిరపడాలని ఆశపడే లక్షలాది మంది ఇండియన్ ఐటీ నిపుణులకు అమెరికా ప్రభుత్వం ఊరటనిచ్చే కబురు అందించింది. ఇటీవలి కాలంలో వీసా నిబంధనలు, గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలు ప్రవాస భారతీయులలో తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. ముఖ్యంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) తీసుకువచ్చిన ఒక వివాదాస్పద ప్రతిపాదన అమెరికాలోని భారతీయ టెక్కీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే మెజారిటీ అభ్యర్థులు అమెరికాలో ఉంటూ కాకుండా, తమ సొంత దేశాలకు వెళ్లి అక్కడి నుంచే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలనే నిబంధనను విధించారు. ఈ ఒక్క నిర్ణయం వల్ల హెచ్-1బీ వీసాపై ఆధారపడి అమెరికాలో జీవిస్తున్న లక్షలాది మంది భారతీయులు, వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. అమెరికా పౌరులను వివాహం చేసుకున్న జీవితభాగస్వాములు కూడా ఈ నిబంధన వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెచ్-1బీ వీసా హోల్డర్లలో దాదాపు 70 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులే కావడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నూతన గ్రీన్ కార్డ్ విధానం అమెరికా టెక్ పరిశ్రమను అతలాకుతలం చేసింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్న భారతీయ ప్రతిభను దూరం చేసుకుంటే ఐటీ రంగానికి భారీ నష్టం వాటిల్లుతుందని కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. కేవలం భారతీయ కంపెనీలే అమెరికా ఆర్థిక వ్యవస్థలో సుమారు 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయని, ఐటీ నిపుణుల సేవలు అమెరికాకు అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఐటీ రంగం నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి, ఆందోళనల కారణంగా ట్రంప్ ప్రభుత్వం మెట్టు దిగక తప్పలేదు. ఈ వివాదాస్పద ఆదేశాన్ని పాక్షికంగా ఉపసంహరించుకుంది. దీంతో అమెరికాలోనే ఉంటూ గ్రీన్ కార్డ్ ప్రక్రియను కొనసాగించేందుకు మార్గం సుగమమైంది. ఈ గ్రీన్ కార్డ్ నిబంధనల మార్పులపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పందిస్తూ.. ఈ ఆధునీకరణ ప్రక్రియ కేవలం భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని చేసింది కాదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలస విధానాన్ని క్రమబద్ధీకరించేందుకే ఈ సంస్కరణలు చేపట్టామనీ.. అయితే పరిపాలనాపరమైన మార్పుల సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవడం సహజమేనని ఆయన పేర్కొన్నారు. సుమారు 20 మిలియన్ల మంది అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించిన తరుణంలో.. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి చర్యలు తప్పడం లేదని సమర్థించారు. అయినప్పటికీ, చట్టబద్ధంగా అమెరికాలో ఉంటూ సేవలు అందిస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు ఈ తాజా ఉపసంహరణ నిర్ణయం ఎనలేని ఉపశమనాన్ని ఇచ్చింది. గతంలో ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన 1,00,000 డాలర్ల భారీ హెచ్-1బీ వీసా రుసుము నుండి ఇప్పటికే అమెరికాలో ఉన్న వీసా హోల్డర్లకు మినహాయింపు లభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గ్రీన్ కార్డ్ నిబంధనపై కూడా అమెరికా వెనక్కి తగ్గడంతోఇండియన్ టెక్కీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Publish Date: May 26, 2026 9:17AM

political-news-img

ఇరాన్, అమెరికా యుద్ధం ఎండ్ కార్డ్ ఆశలు మళ్లీ ఆవిరి?

ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం సుదీర్ఘంగా కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం దాదాపు ఖరారైందనీ, ఇక యుద్ధానికి ఎండ్ కార్డేనన్న వార్తల వినవచ్చాయి. అయితే.. ఆ ఒప్పందంలో అమెరికా విధించిన షరతులకు తాము అంగీకరించలేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. ఇరాన్ లో శుద్ధి చేసిన యురేనియంను విదేశాలను తరలించేందుకు ఆ దేశం అంగీకరించలేదు. ఈ విషయాన్ని ఇరాన్ సెమీ అఫీషియల్ వార్తా సంస్థ తస్నీమ్ తెలిపింది. ఇరాన్ తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను దేశం నుంచి తరలించడానికి సిద్ధంగా ఉందని సౌదీ అరేబియాకు చెందిన అల్ హదత్ మీడియా ప్రచురించిన కథనాన్ని తస్నిమ్ ఖండించింది. ఈ కథనంలో ఎలాంటి నిజం లేదని పేర్కొంది. అమెరికా, ఇరాన్ మధ్య జరగబోయే అవగాహన ఒప్పందం వివరాలు అంటూ.. అల్ హదత్ ప్రచురించిన నివేదిక పూర్తిగా అవాస్తవమని, ఇది అమెరికా చేస్తున్న తప్పుడు ప్రచారంలో భాగమని తస్నిమ్ పేర్కొంది. ఇప్పటివరకు ఉన్న ఒప్పంద ప్రతిపాదనలో అణు పదార్థాల తరలింపునకు సంబంధించిన నిబంధనలేవీ లేవని స్పష్టం చేసింది. శుద్ధి చేసిన యురేనియం తరలింపునకు ఇరాన్ అంగీకరించలేదని తస్నిమ్ తన కథనంలో విస్పష్టంగా పేర్కొంది. ఇలా ఉండగా, ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మహమ్మద్ బఘేర్ జోల్ఘదర్ సోమవారం (మే 25) వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌లను నిరాశపరచాలంటే దేశంలో ఐక్యత, సంఘీభావం అవసరమన్నారు. కాగా, అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు ఇరు దేశాలు ఒక అవగాహన ఒప్పందాన్ని ఖరారు చేసే పనిలో ఉన్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ అంతకుముందు చెప్పారు. 14 క్లాజులతో కూడిన ఈ ఒప్పందంపై 30 నుంచి 60 రోజుల్లో తుది ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. అమెరికా నావికాదళ దిగ్బంధనాన్ని ఆపడం, నిలిచిపోయిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటివి ఈ ఒప్పందంలో కీలక అంశాలని ఆయన పేర్కొన్నారు.

Publish Date: May 26, 2026 9:12AM

political-news-img

మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు

వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ధరను చమురు కంపెనీలు కిలోకు 2 రూపాయలు పెంచాయి. ఈ తాజా పెంపుతో ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ. 83.09కి చేరింది. ఈ నెల‌ 15 నుంచి ఇప్పటివరకు సీఎన్‌జీ ధరలు పెరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. 11 రోజుల వ్యవధిలోనే సీఎన్‌జీ ధర ఆరు రూపాయలు పెరిగింది. మే 15న కిలో సీఎన్జీ పై రూ. 2, మే 18న రూ. 1, మే 23న మరో రూపాయి చొప్పున ధరలను పెంచారు. తాజా పెంపుతో నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో కిలో సీఎన్‌జీ ధర రూ. 88.70కి చేరింది. గురుగ్రామ్‌లో రూ. 86.12, ముంబైలో రూ. 84గా ఉంది. ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధం, హ‌ర్మూజ్ జలసంధి వద్ద చమురు, గ్యాస్ సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలే ఈ వరుస పెంపులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. సీఎన్జీ ధర పెంపు ప్రభావం కేవలం వాహనదారులపైనే కాకుండా సామాన్యులపైనా పడుతుంది. ఆటో, క్యాబ్ చార్జీలు పెరగడంతో పాటు, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి.

Publish Date: May 26, 2026 8:47AM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img