Top Stories

political-news-img

భారీ వర్షాలకు ముంబై మునక?.. విద్యాసంస్థలకు సెలవు.!

భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ శనివారం (జులై 4) మధ్యాహ్నం నుంచే నగరంలోని అన్ని సెలవు ప్రకటించింది. ముంబైతో పాటున థానే, పాల్ఘర్, రాయగఢ్ జిల్లాల పరిధిలోని విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. ఈ వారం ప్రారంభం నుంచే ముంబైని ముంచెత్తుతున్న వానలు, గత 24 గంటల్లో మరింత ఉధృత రూపం దాల్చాయి. శనివారం నాటికి నగరంలోని పలు ప్రాంతాల్లో గరిష్టంగా 100 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది.ఆది, సోమ(జులై 5, 6) వారాలలో కూడా ముంబై వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబైతో పాటు థానే, పాల్ఘర్, రాయగఢ్ జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ప్రజలకు సూచించింది. భారీ వర్షాల కారణంగా ముంబైలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ముంబై లైఫ్ లైన్ గా పిలిచే సబర్బన్ లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వేలాది మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్లలోనే చిక్కుకుపోయారు. అంధేరి ఈస్ట్ సబ్‌వే వంటి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అక్కడ చేరిన వర్షపు నీటిని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన డీవాటరింగ్ పంపులతో ఏర్పాటు చేసి నీటిని తోడేస్తున్నారు. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. IMD red alert Mumbai, BMC school holiday, Thane rain alert, Teluguone

Publish Date: Jul 5, 2026 7:51AM

political-news-img

సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఉద్ధృతితో ఉత్తరాంధ్ర తీరం అల్లకల్లోలంగా మారింది. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ నెల 1వ తేదీన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ ఏడుగురు మత్స్యకారులు ఒకే బోటుపై సముద్రంలోకి వేటకు వెళ్లారు. బంగాళాఖాతంలో వాతావరణం వేగంగా మారిపోవడం, అల్పపీడన తీవ్రత పెరగడంతో సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగింది. వాతావరణం అనుకూలించకపోవడాన్ని గమనించిన తీరంలోని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే శనివారం ఉదయం వారిని మొబైల్ ఫోన్ల ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో మత్స్యకారులు స్పందిస్తూ, వాతావరణం బాలేదని, అందువల్ల శనివారం మధ్యాహ్నానికల్లా ఎలాగైనా సురక్షితంగా తీరానికి చేరుకుంటామని కుటుంబ సభ్యులకు చెప్పారు. కానీ వారు చెప్పిన సమయానికి తిరిగి రాలేదు. వారికి ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు, పక్కపక్క ప్రాంతాల వారు ఇద్దరు ఇలా ఒకేసారి సముద్రంలో చిక్కుకుపోవడంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న మత్స్యశాఖ అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం, వారి బోటును గుర్తించడం కోసం కోస్ట్‌గార్డ్, స్థానిక నావికా దళాల సహాయంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. Missing Fishermen, Visakhapatnam Fishing Harbour, Bay of Bengal Low Pressure, North Andhra Fishermen,

Publish Date: Jul 5, 2026 7:13AM

political-news-img

ఇంగ్లాండ్ తో రెండో టి20.. టీమ్ ఇండియా ఓటమి.!

ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ టో టీమ్ ఇండియా పరాజయాన్ని మూటకట్టుకుంది. . హై-స్కోరింగ్ థ్రిల్లర్‌గా సాగిన ఈ పోరులో ఇంగ్లండ్ ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్, ఇండియా టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షార్పణమైన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించి ఈ సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు ఆరంభంలోనే టీమిండియా స్పీడ్‌స్టర్ అర్ష్‌దీప్ సింగ్ గట్టి షాకిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ప్రమాదకర ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, కెప్టెన్ జోస్ బట్లర్ లను డకౌట్ గా పెవిలియన్ పంపాడు. కేవలం 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ తీవ్ర కష్టాల్లో పడిన వేళ, కెప్టెన్ హ్యారీ బ్రూక్ కేవలం 15 బంతుల్లోనే 39 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బ్రూక్ అవుటైన తర్వాత యువ సంచలనం జాకబ్ బెథెల్ ఇన్నింగ్స్ బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. టామ్ బాంటన్ తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన బెథెల్, ఆ తర్వాత టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోతూ కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బెథెల్ పవర్ హిట్టింగ్ ధాటికి ఇంగ్లండ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే, అంటే 19 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 191 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు. అనంతరం వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 37 పరుగులతో బాధ్యతాయుతంగా రాణించాడు. ఇక ఆఖర్లో యువ ఆటగాడు తిలక్ వర్మ కేవలం 11 బంతుల్లోనే 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో భారత్ భారీ స్కోరు సాధించగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో శామ్ కరన్ 3 వికెట్లతో రాణించాడు. ఇంతటి భారీ స్కోరు చేసినప్పటికీ బౌలింగ్ వైఫల్యం, ముఖ్యంగా జాకబ్ బెథెల్ వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా భారత్‌కు ఓటమి తప్పలేదు. ఇరు జట్ల మధ్య సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి మూడో టీ20 మ్యాచ్ జులై 7న జరగనుంది. ఇక పోతే.. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల 99 రోజుల వయసులో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. దీంతో సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 205 రోజులు పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. తన తొలి మ్యాచ్‌లోనే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ తల మీదుగా కొట్టిన అద్భుతమైన సిక్సర్‌తో సహా 10 బంతుల్లో 14 పరుగులు చేసి స్టంపౌట్ అయ్యాడు. Jacob Bethell power hitting, Ind vs Eng, Vaibhav Suryavamshi, Entry

Publish Date: Jul 5, 2026 7:05AM

political-news-img

జిమ్ ట్రైనర్ల ముసుగులో స్టెరాయిడ్ల దందా..హైదరాబాద్‌లో ఆరుగురు అరెస్ట్..!

హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది. ముషీరాబాద్ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త దాడుల్లో జిమ్ ట్రైనర్లు సహా ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. ప్రధాన నిందితులైన బట్టే శివ (32), మహమ్మద్ ఫుర్ఖానుద్దీన్ ఫైసల్ (28) లతో పాటు మహమ్మద్ సైఫ్ అలియాస్ మహమ్మద్ ఎహ్సాన్ ఉల్హక్ (20), ఫర్జాన్ ఖాన్ (20), మహమ్మద్ యూసుఫ్ (26), సోంభట్టిని అభిలాష్ (24) ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. వీరంతా జిమ్‌కు వచ్చే యువతను లక్ష్యంగా చేసుకుని "త్వరగా కండరాలు పెరుగుతాయి, బాడీ బిల్డింగ్ వేగంగా జరుగుతుంది" అంటూ వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, హార్మోన్ డ్రగ్స్, బాడీ సప్లిమెంట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు బట్టే శివ గతంలో 'ఐరన్ హౌస్ జిమ్' యజమాని, ట్రైనర్‌గా పనిచేసినట్లు తేలింది. ప్రస్తుతం ఆన్‌లైన్ జిమ్ ట్రైనర్‌గా ఉంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముదిద్ చౌహాన్ నిర్వహిస్తున్న 'మెడ్‌హౌస్ ఫార్మా' ద్వారా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు తెప్పించి మహమ్మద్ యూసుఫ్, సోంభట్టిని అభిలాష్‌లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మరో ప్రధాన నిందితుడు మహమ్మద్ ఫుర్ఖానుద్దీన్ ఫైసల్ పంజాబ్‌కు చెందిన రాజన్ ప్రీత్ సింగ్ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ వేదిక ద్వారా స్టెరాయిడ్లు, బాడీ సప్లిమెంట్లు తెప్పించి మహమ్మద్ సైఫ్, ఫర్జాన్ ఖాన్‌లకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ముదిద్ చౌహాన్, రాజన్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ దాడుల్లో 440 టెర్మిన్ (నియాన్) వయల్స్, 336 మెఫెన్‌టెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు, టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్లు, సొమాట్రోపిన్, డ్రోస్టానోలోన్, ఇతర బాడీ సప్లిమెంట్లు, 336 టాబ్లెట్లు, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ సుమారు రూ.6.50 లక్షలు. ప్రాథమిక విచారణలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి అక్రమంగా స్టెరాయిడ్లు సరఫరా అవుతున్నట్లు, అలాగే వైద్యుల ప్రిస్క్రిప్షన్లను కృత్రిమ మేధ (AI) సాయంతో నకిలీగా తయారు చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ జిమ్ యజమానులు, ట్రైనర్లు, యువతకు హెచ్చరిక జారీ చేశారు. వైద్యుల సలహా లేకుండా స్టెరాయిడ్లు, హార్మోన్ ఇంజెక్షన్లు, ఇతర బాడీ బిల్డింగ్ సప్లిమెంట్లను వినియోగించవద్దని సూచించారు. తాత్కాలికంగా కండరాలు పెరిగినట్లు కనిపించినా, దీర్ఘకాలంలో గుండె, కాలేయం, మూత్రపిండాలు తదితర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నగరంలోని జిమ్‌లపై నిరంతర నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం వ్యక్తం చేశారు

Publish Date: Jul 4, 2026 7:55PM

political-news-img

అభివృద్ధి కోసం యజ్ఞం చేస్తుంటే.. రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు..! : సీఎం చంద్రబాబు

ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు. తరతరాలుగా సాగుచేస్తున్న భూములకు అధికారిక హక్కు పత్రాలు అందుకోవడంతో లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కుప్పం నియోజకవర్గంలోని కంగుందిలో నిర్వహించిన డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 460.19 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. పట్టాల పంపిణీకి సంబంధించి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. 61 సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా గ్రామస్థులను వేధిస్తున్న భూ సమస్యను సమగ్ర రికార్డుల పరిశీలన, వివిధ కోణాల్లో అధ్యయనం చేసి పరిష్కరించినట్లు తెలిపారు. అడవి పొరంబోకు భూమిని అసైన్డ్ వేస్ట్ డ్రై భూమిగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తీసుకుని రైతులకు భూములు అందించినట్లు చెప్పారు. పేదలకు పట్టాల పంపిణీ సంతోషంగా ఉంది.. రైతుల పక్షాన న్యాయం ఉండటంతోనే ఈ సమస్యను పరిష్కరించగలిగామని పేర్కొన్న సీఎం, 322 మంది రైతులకు 460.19 ఎకరాల భూమిని పట్టాల రూపంలో ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని చెప్పారు. కంగుంది కోట సాక్షిగా రైతులకు పట్టాలు అందించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో అనేక రెవెన్యూ, భూ సమస్యలు ఉన్నాయని, ఇటీవల శెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించడం ద్వారా ప్రభుత్వానికి 90 ఎకరాల భూమి దక్కడంతో పాటు రైతులకు కూడా న్యాయం జరిగిందన్నారు. వట్టిచెరుకూరు గ్రామంలో వందల ఏళ్లుగా కొనసాగుతున్న భూ సమస్యను కూడా పరిష్కరించామని, ఇప్పుడు కంగుంది సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశముందని పేర్కొన్నారు. గూండాయిజానికి తావులేదు.. గత ప్రభుత్వ హయాంలో అనేక భూ వివాదాలు సృష్టించారని ఆరోపించిన సీఎం, ప్రజల పట్టాదార్ పాస్ పుస్తకాలపై గత పాలక పార్టీ నేతల ఫొటోలు ముద్రించారని విమర్శించారు. వాటిని తొలగించి రాజముద్రతో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశామని చెప్పారు. భూ వివాదాల పరిష్కారంలో ఓపికతో వ్యవహరించి అన్ని రికార్డులను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల భూములకు భద్రత కల్పించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు. కుటుంబ ఆస్తి వివాదాల కారణంగా కూడా అనేక భూములు వివాదాస్పదమవుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, సోదరీమణుల హక్కులను గౌరవించాలని సూచించారు. రౌడీయిజం, గుండాయిజానికి రాష్ట్రంలో తావులేదని స్పష్టం చేసిన ఆయన, పెట్టుబడులు ఆకర్షిస్తూ పరిశ్రమలు తీసుకొస్తున్నామని, కుప్పంలోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. భవిష్యత్తులో కుప్పాన్ని టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసి మరిన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అభివృద్ధిని ఆపలేరు... అడ్డుకోలేరు.. ‘కుప్పం ప్రజలంతా సోలార్ విద్యుత్‌కు ప్రాధాన్య మివ్వాలనీ సీఎం అన్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగం బదులు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఈ సైకిళ్లు, ఈ వెహికల్స్ వినియోగం పెంచాలనీ సూచించారు. నెట్ జీరో విధానంలో స్వచ్ఛ కుప్పం-స్వర్ణ కుప్పం సాధించాలనీ పిలుపు నిచ్చారు. డ్వాక్రా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా ప్రొత్సహిస్తున్నామని.. ఇప్పటికే 1.50 లక్షల మందిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దామని వివరించారు. డ్వాక్రా మహిళా ఉత్పత్తుల కోసం స్వయం బ్రాండ్ ఏర్పాటు చేశామని..దీని ద్వారా అంతర్జాతీయ స్థాయికి డ్వాక్రా ఉత్పత్తులకు మార్కెటింగ్ వచ్చేలా చేస్తామని తెలిపారు. కుప్పం పొగురుపల్లిలో రూ.9,322 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 30 ప్రాజెక్టుల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు తెలిపారు. గత పాలనలో రాష్ట్రానికున్న బ్రాండ్ పొగొట్టారనీ.. పరిశ్రమలను వెళ్లగొట్టారు. కానీ ఈ రెండేళ్ల కాలంలో పోయిన బ్రాండ్ ను తిరిగి తెచ్చామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం చేస్తుంటే.. గొడ్డలి పార్టీ నేతలు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారనీ సీఎం ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.

Publish Date: Jul 4, 2026 7:47PM

political-news-img

ప్రశ్న రావణ్‌కు బెయిల్.. న్యాయవాదితో కలిసి ఇంటికి..!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రశ్న’ రావణ్ అలియాస్ జోసెఫ్‌కు న్యాయస్థానం నుంచి కీలక ఊరట లభించింది. అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి కోర్టు ఈ వివాదానికి సంబంధించిన కేసులో ఆయనకు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉప ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పోలీసులు జోసెఫ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించారు. కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే జోసెఫ్ తన న్యాయవాది జడ శ్రవణ్ కుమార్‌తో కలిసి జైలు నుంచి విడుదలయ్యారు. న్యాయప్రక్రియ పూర్తి కావడంతో ఆయన నేరుగా తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మద్దతుదారులు, అనుచరులు కోర్టు ప్రాంగణం వెలుపల హర్షం వ్యక్తం చేశారు. అయితే జోసెఫ్‌పై రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వేర్వేరు జిల్లాల్లోని నాలుగు న్యాయస్థానాలు ఆయనకు బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. వరుస కేసుల నమోదుపై జోసెఫ్ తరఫు న్యాయ బృందం కోర్టుల్లో గట్టిగానే పోరాడుతోంది. ఈ అరెస్టుల పర్వం మరియు పోలీసుల తీరుపై జోసెఫ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తనపై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులు పెట్టారనే అభిప్రాయాన్ని ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వాలు వ్యవహరించడం సరికాదంటూ కొన్ని పౌర హక్కుల సంఘాలు కూడా ఈ వ్యవహారంపై స్పందించాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో నేతల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే హెచ్చరించింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన శ్రేణులు జోసెఫ్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతూ పలుచోట్ల ఫిర్యాదులు చేశారు. తన అరెస్టుల వెనుక ఉన్న అసలు కారణాలు, పోలీసుల విచారణ విధానం మరియు భవిష్యత్తు కార్యాచరణపై పూర్తి వివరాలను వెల్లడించేందుకు జోసెఫ్ సిద్ధమవుతున్నారు. త్వరలోనే పత్రికా విలేకరుల సమావేశం (ప్రెస్ మీట్) ఏర్పాటు చేసి అన్ని విషయాలను బహిరంగంగా పంచుకుంటానని ఆయన స్వయంగా ప్రకటించారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా మరిన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. కోర్టుల ద్వారా బెయిల్ పొందినప్పటికీ, మున్ముందు ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందనేది మరియు ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందనే అంశంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Publish Date: Jul 4, 2026 7:38PM

MOVIE NEWS