ఇక తెలుగుదేశం గెలుపు ‘గంట’ల మోతేనా?

Publish Date:Mar 21, 2023

గంటా ఎక్కడుంటే గెలుపు అక్కడ ఉంటుంది. ఒకవేళ అలా జరగకపోతే.. గెలుపు ఉన్న దగ్గరకే గంటా వెళ్తారు. గెలుపుకి, గంటాకి ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. గెలుపు గంటల మోత వినకపోతే గంటా శ్రీనివాసరావుకు నిద్రపట్టదు అనుకుంటా. అదేంటో విజయం కూడా ఆయన దగ్గరకు గెంతుకుంటూ వస్తుంది. 2004 లో తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యంలోకి జంప్ చేశారు. ప్రజారాజ్యం ఘోర పరాజయంపాలైనా గంటా మాత్రం మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాదు ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమవ్వడంతో మంత్రి కూడా అయ్యారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం విజయాన్ని ముందుగానే ఊహించిన ఆయన.. 2014 ఎన్నికలకు ముందు మళ్ళీ పసుపు కండువా కప్పుకున్నారు. ఆయన ఊహించినట్లుగానే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచింది. ఆయన కూడా గెలిచి మంత్రి పదవి చేపట్టారు. 2019 లో ఫ్యాన్ గాలి జోరులోనూ గంటా విజయ ఢంకా మోగించారు. అయితే   తెలుగుదేశం అధికారంలో లేకపోవడంతో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారనే వార్తలు ఆమధ్య బలంగా  వినిపించాయి. గంటా సైతం కొంతకాలం తెలుగుదేశంతో అంటీముట్టనట్టుగా ఉన్నారు. అయితే ఇప్పుడు లెక్క మారింది. 2014 సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందని, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు ఖాయమని ఆయన ముందుగానే ఊహించినట్టు ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం గంటా నమ్మకాన్ని బలపరిచింది. అందుకే ఆయన సైకిల్ మీదే నా ప్రయాణం అంటున్నారు. తాజాగా ఆయన తెలుగుదేశం యువనేత నారా లోకేష్ తో కలిసి యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. దీంతో తెలుగుదేశం శ్రేణులు సంబరపడుతున్నారు. "గంటా ఉన్న దగ్గర గెలుపు ఉంటుంది, గెలుపు ఉన్న దగ్గర గంటా ఉంటాడు" అనే మాట 2024 లో మరోసారి రుజువు అవుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక గంటా ముందుగానే ప్రజా నాడి ఏమిటన్నది తెలుసుకున్నారనడానికి లోకేష్  పాదయాత్ర ప్రారంభించడానికి ముందు హైదరాబాద్‌లో ఆయనను ఓ సారి కలిసి పాదయాత్ర విజయవంతం అవుతుందని ప్రకటించారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా విస్తృత ప్రచారం చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదట చిన్న లక్ష్మి కుమారి అభ్యర్థిత్వాన్ని పార్టీ ప్రకటించినప్పటికీ అనుకున్నప్పటికీ, గంటా సూచనతోనే చివరి క్షణంలో చిరంజీవి రావును అభ్యర్థిగా పార్టీ అధినేత ప్రకటించారని కూడా చెబుతారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో గంటా విస్తృతంగా ప్రచారం కూడా చేశారు.  ఇప్పుడు గంటా శ్రీనివాస్ పాదయాత్రలో ఉన్న లోకేష్ వద్దకు వెళ్లారు. కలిశారు.  

80 ఏళ్ల‌కు గమ్యం చేరిన పెయింటింగ్!

Publish Date:Jun 19, 2022

ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!

చంద్రబాబుకు సీఐడీ నోటీసులు

Publish Date:Mar 15, 2021

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు..ఆయన నోటీసులు ఇచ్చారు. అమరావతి రాజధానిలో అసైన్డ్ భూములు కొనుగోలు అమ్మకాలపై చంద్రబాబుపై కేసు నమోదు అయింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది.  41సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు. నోటీసులు  ఇచ్చాక ఇన్వెస్టిగేషన్ కు పిలుస్తామని ఏపీ సీఐడీ అధికారులు చెబుతున్నారు. అమరావతి నుంచి రెండు సీఐడీ బృందాలు హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులుకూ సీఐడీ నోటీసులు  అందాయి. 41 సీఆర్పీసీ కింద మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. 

ప్రకృతిలో త్రిగుణాలు ఎలా ఉంటాయి?

Publish Date:Mar 21, 2023

ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువులో అంటే కదలనివి (పర్వతములు, కొండలు, గుట్టలు, రాళ్లు), కదలకుండా కదిలేవి (చెట్లు, మొక్కలు, వృక్షములు), కదిలేవి (నాలుగు కాళ్ల, రెండు కాళ్ల జంతువులు, మనుషులు), మూడు గుణములు అంటే సత్వ రజో తమోగుణములు ఉన్నాయి అని తెలుసుకున్నాము. ఉదాహరణకు, పర్వతములు, కొండలు, గుట్టలు, రాళ్లు, ఇవి కదలవు. వీటిలో తమోగుణము 98 శాతం ఉంటే రజోగుణము 1 శాతం సత్వగుణం 1 శాతం ఉంటుంది. రెండవ రకం వృక్షములు, చెట్లు, మొక్కలు, అవి కదలవు కానీ నీటిని పీల్చుకుంటాయి, శ్వాసిస్తాయి. వాటి ఆకులు వివిధగుణములు కలిగి ఉంటాయి. కొన్ని మొక్కలు అయితే తన దగ్గరకు వచ్చిన జంతువులను తనలోకి లాక్కుంటాయి. కొన్ని తాకితే ముడుచుకుంటాయి. కొన్ని స్పందిస్తాయి. మొక్కలు పుట్టడం, పెరగడం, పెద్దవి కావడం మన కళ్లముందే జరుగుతుంది. కాని కదలలేవు. వీటిలో తమోగుణము 50శాతము, రజోగుణము 45 శాతము, సత్వగుణము 5 శాతం ఉంటుంది. ఇంక జీవజాతులు, రెండు కాళ్ల మనుషులు, నాలుగు ఇంకా అనేక కాళ్లతో నడిచే జంతువులు, వీరిలో వారి వారి ప్రవృత్తులను బట్టి మూడు గుణాల నిష్పత్తి మారుతూ ఉంటుంది. జంతువులలో వాటి స్వభావాన్ని బట్టి గుణాలు ఒకేసారి మారతాయి.  కాని మానవుడికి వయసు పెరిగే కొద్దీ పరిసరాలకు అనుగుణంగా, కాలానికి అనుగుణంగా, వారి వారి గుణాలు మారుతుంటాయి. కొంతమంది సాత్వికులు అవుతారు, మరి కొంత మంది రజోగుణ ప్రధానులు అవుతారు. మరి కొంత మంది తమోగుణ ప్రధానులు అవుతారు. అది ఎలాగంటే. ఈ మూడు గుణములు పైన చెప్పబడిన వాటిలో ఒకే విధంగా, ఒకే మోతాదులో ఉండవు. హెచ్చుతగ్గులుగా ఉంటాయి. సత్వగుణము మోతాదు ఎక్కువగా ఉంటే, అది మిగిలిన రజో, తమోగుణములను అణగదొక్కుతుంది. తాను మాత్రమే ప్రధానంగా ప్రకటితమౌతుంది. అదే రజోగుణము ఎక్కువగా ఉంటే అది సత్త్వ, తమోగుణములను అణగదొక్కి తాను మాత్రమే ఎక్కువగా ప్రకటితమౌతుంది. అలాగే తమోగుణము ఎక్కువగా ఉన్నప్పుడు అది సత్వ, రజోగుణములను అణగదొక్కుతుంది. ఈ విధంగా ఒక్కొక్క పదార్థములో ఒక్కో గుణము ఎక్కువగా ఉంటుంది. కొందరిలో రెండుగుణాలు ఎక్కువ ఒక గుణము తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఈ మూడు గుణములు వివిధములైన పాళ్లలో బంధనములను కలుగజేస్తుంటాయి. అంతే కాదు. ప్రతిరోజూ ప్రకృతిలో కూడా ఈ గుణాలు మారుతుంటాయి. సాధారణంగా మానవులలో ఉదయం 4 నుండి 8 వరకు సత్వగుణము ప్రధానంగా ఉంటుంది. అందుకే ఆ సమయంలోనే స్నానం, సంధ్య, హెూమం, పూజ చేయాలని చెప్పారు. ఎండ ఎక్కేకొద్దీ రజోగుణము ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆ సమయంలో ఎవరెవరికి నిర్దేశింపబడిన కర్మలు వారు చేయాలి. సూర్యుడు అస్తమించగానే, తమోగుణము ప్రధానంగా ఉంటుంది. కాబట్టి నిద్రపోవాలని చెప్పారు. (కాని మనం ఏం చేస్తున్నాము! ధన సంపాదన కొరకు, రాత్రిళ్లు పని చేస్తూ, పగలు కునికిపాట్లు పడుతున్నాము. లేక విలాసాలతో రాత్రి 1 గంటదాకా క్లబ్బులు పబ్బులలో గడుపుతూ నిశాచరులము అవుతూ ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాము. కాబట్టి వివేకి అయినవాడు ఏ గుణమునకు బంధితుడు కాకూడదు. అన్నీ సమానంగా, పరిమితంగా అనుభవించాలి. దేనికీ అడిక్ట్ కాకూడదు. అతి, విపరీతధోరణి పనికిరాదు. శాస్త్రఅధ్యయనం చేయాలి. ఇష్టదైవాన్ని ఉపాసించాలి. ధ్యానం చేయాలి. జీవనానికి ఏదో ఒక ఉద్యోగం, వ్యాపారం ధర్మబద్దంగా, న్యాయబద్ధంగా, శ్రద్ధతో చేయాలి. అవసరము ఉన్నంత వరకే సంపాదించాలి. జీవితం ఆనందంగా గడపాలి. అంతేకానీ ఏదో ఒక గుణమునకు కట్టుబడి పోకూడదు.  ◆ వెంకటేష్ పువ్వాడ.
[

Health

]

మెంతి కూర మంచిదే !

Publish Date:Mar 21, 2023

మెంతి కూర ఇదేంటి అని మాత్రం అనకండి. ఎందుకంటే మెంతి ఆకు తో చాలానే లాభాలు ఉన్నాయని తెలుస్తోంది .బ్లడ్ షుగర్ నియంత్రణ,బరువు ఊబకాయం తగ్గడం లో మెంతి ఆకు చాలా బాగా పనిచేస్తుంది మెంతి ఆకు వల్ల లాభాలు ఏమిటో చూద్దాం. చలికాలం లో పచ్చటి ఆకు కూరలు బగాలభిస్తాయి. పచ్చటి మెంతి కూర ఆకులు ఈ వాతావరణం లో లభిస్తాయి. ఈ ఆకుతో కూరవండుతారు. మెంతికూర పెసర పప్పు,మెంతికూర టమాట కాస్త చెడు గా తగిలినా నోటికి రుచిగా ఉంటుంది. మెంతికూర పప్పు అదుర్స్,మెంతికూర పరాటా ఇంకా అదుర్స్ఆరోగ్యానికి మంచిది. ఒక వేళా మీకు మార్కెట్లో మెంతికూర లేదా మెంతి ఆకు లభిస్తే తీసుకోండి మెంతి ఆకు వల్ల లాభాలు ఏమిటో తెలుసుకుందామా మరి. బరువు... మెంతి ఆకులో పీచు పదార్ధం అధిక మొత్తంలో ఉంటుంది. మెంతి ఆకు తినడం వల్ల మీకు ఆకలి వేయదు. మీపోట్ట నిండుగా ఉంటుంది.మెంతులు కూడా బరువు తగ్గించేందుకు దోహదం చేస్తాయి. మీరు బరువుతగ్గాలంటే మీరోజువారీ ఆహారం లేదా డైట్ ప్లాన్ లో కూరగా వాడండి.లేదా పులుసుగా వాడవచ్చు. బ్లడ్ షుగర్... మీ బ్లడ్ షుగర్ వస్తే మీకు మెంతి ఆకును తీసుకోవచ్చు. ఇందులో డయాబెటిస్ ను నియంత్రించే గుణాలు ఉన్నట్లు గుర్తించారు. మీ ఆరోగ్యానికి అత్యంత లాభాదాయకం కాగలదని నిపుణులు వివరించారు. పంచేంద్రియాలు... శరీరంలో ఉండే పంచేంద్రియాలలో వచ్చే సమస్యను దూరం చేయడం లో సహాయ పడుతుంది. అది గుండెకు సంబందించిన సమస్యలతో బాధపడే వారికి మెంతి ఆకు కూర తీసుకోవచ్చు. కొలస్ట్రాల్... శరీరంలో బ్లడ్ కొలస్ట్రాల్ ను పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమయం లో మీరు మెంతికూర తీసుకుంటే కొలస్త్రాల్ ను తగ్గించడం లో మీకు సహాయ పడుతుంది. నోటి దుర్వాసన... మీనోటి నుండి దుర్వాసన వస్తుంటే మెంతి ఆకును తినడం ద్వారా మెంతి ఆకు టీ తాగవచ్చు అలా చేయడం ద్వారా నోటి దుర్వాసన నుండి విముక్తి కల్పించడం లో సహాయ పడుతుంది మెంతి ఆకుకు సంబంధించి వచ్చే సమస్య నుండి దూరం చేసేది మెంతి ఆకు మాత్రమే అని నిపుణులు అంటున్నారు.

కండ్ల ముందే ప్రపంచం.. కళ్లజోడు లోనే సమస్తం

Publish Date:Jul 17, 2020

సాంకేతిక రంగంలో మరో విప్లవానికి రిలయన్స్ సంస్థ తెరతీసింది. జియో ఇంటర్నెట్ తో లక్షలాది మంది వినియోగదారులను తన ఖాతాలో జమచేసుకున్న ఈ సంస్థ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన జియో గ్లాసెస్ డిజిటల్ ప్రపంచాన్ని కొత్త కోణంలో చూపించబోతున్నాయి. రిలయన్స్ సంస్థ 43న వార్షికోత్సవంలో జియో గ్లాస్ ను ఆవిష్కరించారు. ఈ కళ్లజోడుతో ఇప్పటివరకు అరచేతిలో ఇమిడిన ప్రపంచం ఇంక కంటి ముందు సాక్షాత్కరించబోతుంది. కరోనా వ్యాప్తి కారణంగా ప్రపంచమంతా డిజిటలైజ్ అయ్యిన తరుణంలో ఆన్ లైన్ క్లాస్ లు, వీడియా కాన్ఫరెన్సులు, జూమ్ మీటింగ్ లు సగటు మనిషి జీవితంలో సాధారణమైన తరుణంలో ఈ జియో గ్లాస్ లు ఎంతో ఉపయోగకరంగా ఉండ బోతున్నాయి. అయితే వీటి ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు. జియో గ్లాస్ ఫీచర్స్ - నల్లని రంగు..కాస్త మందంగా.. కూలింగ్ గ్లాసెస్ లను పోలిన వీటి బరువు కేవలం 75 గ్రాములు మాత్రమే. - ఈ గ్లాసెస్ ద్వారా మన స్మార్ట్ ఫోన్ నుంచి 25 మిక్సిడ్ రియాలిటీ యాప్స్ పనిచేసేలా సెట్టింగ్ చేసుకోవచ్చు. - ప్రత్యేకంగా పొందుపరిచిన 3 డి హోలో గ్రాఫిక్ డిజైన్ ద్వారా వర్చువల్ రియాల్జీలో మీటింగ్స్ నిర్వహించుకోవచ్చు. - ఇందులో అమర్చిన సెన్సార్లు, హార్డ్ వేర్ అధునాతన టెక్నాలజీలో పనిచేస్తాయి. ఎక్స్ ఆర్ సౌండ్ సిస్టం ద్వారా ఎలాంటి కేబుల్ అటాచ్ మెంట్ లేకుండా మీకు ఇష్టమైన మ్యూజిక్ వినవచ్చు. ఆన్ లైన్ క్లాస్ లు వినవచ్చు. అన్ని రకాల ఆడియో ఫార్మెట్లను సపోర్ట్ చేసే టెక్నాలజీ ఇందులో ఉంది. - హై రిజల్యూషన్ లో ఉండే డిస్ ప్లే ద్వారా గేమింగ్, షాపింగ్ ఎంజాయ్ చేయవచ్చు. - ఇందులోని హోలా గ్రాఫిక్ వీడియో కాల్ ద్వారా పెద్ద స్క్రీన్ పై ప్రజెంటేషన్లు ఇవ్వచ్చు. - అంతేకాదు 3డీ వర్చువల్ అవతార్, 2డి వర్చువల్ ఇంటరాక్షన్ ద్వారా కూడా మీకు కావల్సిన విధంగా ఈ కళ్లజోడు పనిచేస్తుంది. - జియో మిక్స్ డ్ రియాలిటీ క్లౌడ్ అందుబాటులో ఉండటంతో ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహించేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. - ప్రపంచాన్నిసుందరంగా చూపించగల టెక్నాలజీని ఈ కళ్లజోడుతో అందిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపార వేత్తలు ఇలా అన్నిరంగాల వారికి ఉపయోగపడేలా ప్రపంచాన్ని అరచేతిలో నుంచి కండ్లముందుకు తీసుకువస్తున్నారు.