జిమ్ ట్రైనర్ల ముసుగులో స్టెరాయిడ్ల దందా..హైదరాబాద్‌లో ఆరుగురు అరెస్ట్..!
జిమ్ ట్రైనర్ల ముసుగులో స్టెరాయిడ్ల దందా..హైదరాబాద్‌లో ఆరుగురు అరెస్ట్..!

హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది. ముషీరాబాద్ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త దాడుల్లో జిమ్ ట్రైనర్లు సహా ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. ప్రధాన నిందితులైన బట్టే శివ (32), మహమ్మద్ ఫుర్ఖానుద్దీన్ ఫైసల్ (28) లతో పాటు మహమ్మద్ సైఫ్ అలియాస్ మహమ్మద్ ఎహ్సాన్ ఉల్హక్ (20), ఫర్జాన్ ఖాన్ (20), మహమ్మద్ యూసుఫ్ (26), సోంభట్టిని అభిలాష్ (24) ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. వీరంతా జిమ్‌కు వచ్చే యువతను లక్ష్యంగా చేసుకుని "త్వరగా కండరాలు పెరుగుతాయి, బాడీ బిల్డింగ్ వేగంగా జరుగుతుంది" అంటూ వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, హార్మోన్ డ్రగ్స్, బాడీ సప్లిమెంట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు బట్టే శివ గతంలో 'ఐరన్ హౌస్ జిమ్' యజమాని, ట్రైనర్‌గా పనిచేసినట్లు తేలింది. ప్రస్తుతం ఆన్‌లైన్ జిమ్ ట్రైనర్‌గా ఉంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముదిద్ చౌహాన్ నిర్వహిస్తున్న 'మెడ్‌హౌస్ ఫార్మా' ద్వారా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు తెప్పించి మహమ్మద్ యూసుఫ్, సోంభట్టిని అభిలాష్‌లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మరో ప్రధాన నిందితుడు మహమ్మద్ ఫుర్ఖానుద్దీన్ ఫైసల్ పంజాబ్‌కు చెందిన రాజన్ ప్రీత్ సింగ్ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ వేదిక ద్వారా స్టెరాయిడ్లు, బాడీ సప్లిమెంట్లు తెప్పించి మహమ్మద్ సైఫ్, ఫర్జాన్ ఖాన్‌లకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ముదిద్ చౌహాన్, రాజన్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ దాడుల్లో 440 టెర్మిన్ (నియాన్) వయల్స్, 336 మెఫెన్‌టెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు, టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్లు, సొమాట్రోపిన్, డ్రోస్టానోలోన్, ఇతర బాడీ సప్లిమెంట్లు, 336 టాబ్లెట్లు, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ సుమారు రూ.6.50 లక్షలు. ప్రాథమిక విచారణలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి అక్రమంగా స్టెరాయిడ్లు సరఫరా అవుతున్నట్లు, అలాగే వైద్యుల ప్రిస్క్రిప్షన్లను కృత్రిమ మేధ (AI) సాయంతో నకిలీగా తయారు చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ జిమ్ యజమానులు, ట్రైనర్లు, యువతకు హెచ్చరిక జారీ చేశారు. వైద్యుల సలహా లేకుండా స్టెరాయిడ్లు, హార్మోన్ ఇంజెక్షన్లు, ఇతర బాడీ బిల్డింగ్ సప్లిమెంట్లను వినియోగించవద్దని సూచించారు. తాత్కాలికంగా కండరాలు పెరిగినట్లు కనిపించినా, దీర్ఘకాలంలో గుండె, కాలేయం, మూత్రపిండాలు తదితర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నగరంలోని జిమ్‌లపై నిరంతర నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం వ్యక్తం చేశారు

Publish Date: Jul 4, 2026 8:55PM
అభివృద్ధి కోసం యజ్ఞం చేస్తుంటే.. రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు..! : సీఎం చంద్రబాబు
అభివృద్ధి కోసం యజ్ఞం చేస్తుంటే.. రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు..! : సీఎం చంద్రబాబు

ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు. తరతరాలుగా సాగుచేస్తున్న భూములకు అధికారిక హక్కు పత్రాలు అందుకోవడంతో లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కుప్పం నియోజకవర్గంలోని కంగుందిలో నిర్వహించిన డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 460.19 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. పట్టాల పంపిణీకి సంబంధించి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. 61 సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా గ్రామస్థులను వేధిస్తున్న భూ సమస్యను సమగ్ర రికార్డుల పరిశీలన, వివిధ కోణాల్లో అధ్యయనం చేసి పరిష్కరించినట్లు తెలిపారు. అడవి పొరంబోకు భూమిని అసైన్డ్ వేస్ట్ డ్రై భూమిగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తీసుకుని రైతులకు భూములు అందించినట్లు చెప్పారు. పేదలకు పట్టాల పంపిణీ సంతోషంగా ఉంది.. రైతుల పక్షాన న్యాయం ఉండటంతోనే ఈ సమస్యను పరిష్కరించగలిగామని పేర్కొన్న సీఎం, 322 మంది రైతులకు 460.19 ఎకరాల భూమిని పట్టాల రూపంలో ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని చెప్పారు. కంగుంది కోట సాక్షిగా రైతులకు పట్టాలు అందించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో అనేక రెవెన్యూ, భూ సమస్యలు ఉన్నాయని, ఇటీవల శెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించడం ద్వారా ప్రభుత్వానికి 90 ఎకరాల భూమి దక్కడంతో పాటు రైతులకు కూడా న్యాయం జరిగిందన్నారు. వట్టిచెరుకూరు గ్రామంలో వందల ఏళ్లుగా కొనసాగుతున్న భూ సమస్యను కూడా పరిష్కరించామని, ఇప్పుడు కంగుంది సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశముందని పేర్కొన్నారు. గూండాయిజానికి తావులేదు.. గత ప్రభుత్వ హయాంలో అనేక భూ వివాదాలు సృష్టించారని ఆరోపించిన సీఎం, ప్రజల పట్టాదార్ పాస్ పుస్తకాలపై గత పాలక పార్టీ నేతల ఫొటోలు ముద్రించారని విమర్శించారు. వాటిని తొలగించి రాజముద్రతో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశామని చెప్పారు. భూ వివాదాల పరిష్కారంలో ఓపికతో వ్యవహరించి అన్ని రికార్డులను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల భూములకు భద్రత కల్పించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు. కుటుంబ ఆస్తి వివాదాల కారణంగా కూడా అనేక భూములు వివాదాస్పదమవుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, సోదరీమణుల హక్కులను గౌరవించాలని సూచించారు. రౌడీయిజం, గుండాయిజానికి రాష్ట్రంలో తావులేదని స్పష్టం చేసిన ఆయన, పెట్టుబడులు ఆకర్షిస్తూ పరిశ్రమలు తీసుకొస్తున్నామని, కుప్పంలోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. భవిష్యత్తులో కుప్పాన్ని టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసి మరిన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అభివృద్ధిని ఆపలేరు... అడ్డుకోలేరు.. ‘కుప్పం ప్రజలంతా సోలార్ విద్యుత్‌కు ప్రాధాన్య మివ్వాలనీ సీఎం అన్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగం బదులు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఈ సైకిళ్లు, ఈ వెహికల్స్ వినియోగం పెంచాలనీ సూచించారు. నెట్ జీరో విధానంలో స్వచ్ఛ కుప్పం-స్వర్ణ కుప్పం సాధించాలనీ పిలుపు నిచ్చారు. డ్వాక్రా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా ప్రొత్సహిస్తున్నామని.. ఇప్పటికే 1.50 లక్షల మందిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దామని వివరించారు. డ్వాక్రా మహిళా ఉత్పత్తుల కోసం స్వయం బ్రాండ్ ఏర్పాటు చేశామని..దీని ద్వారా అంతర్జాతీయ స్థాయికి డ్వాక్రా ఉత్పత్తులకు మార్కెటింగ్ వచ్చేలా చేస్తామని తెలిపారు. కుప్పం పొగురుపల్లిలో రూ.9,322 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 30 ప్రాజెక్టుల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు తెలిపారు. గత పాలనలో రాష్ట్రానికున్న బ్రాండ్ పొగొట్టారనీ.. పరిశ్రమలను వెళ్లగొట్టారు. కానీ ఈ రెండేళ్ల కాలంలో పోయిన బ్రాండ్ ను తిరిగి తెచ్చామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం చేస్తుంటే.. గొడ్డలి పార్టీ నేతలు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారనీ సీఎం ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.

Publish Date: Jul 4, 2026 8:47PM
ప్రశ్న రావణ్‌కు బెయిల్.. న్యాయవాదితో కలిసి ఇంటికి..!
ప్రశ్న రావణ్‌కు బెయిల్.. న్యాయవాదితో కలిసి ఇంటికి..!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రశ్న’ రావణ్ అలియాస్ జోసెఫ్‌కు న్యాయస్థానం నుంచి కీలక ఊరట లభించింది. అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి కోర్టు ఈ వివాదానికి సంబంధించిన కేసులో ఆయనకు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉప ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పోలీసులు జోసెఫ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించారు. కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే జోసెఫ్ తన న్యాయవాది జడ శ్రవణ్ కుమార్‌తో కలిసి జైలు నుంచి విడుదలయ్యారు. న్యాయప్రక్రియ పూర్తి కావడంతో ఆయన నేరుగా తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మద్దతుదారులు, అనుచరులు కోర్టు ప్రాంగణం వెలుపల హర్షం వ్యక్తం చేశారు. అయితే జోసెఫ్‌పై రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వేర్వేరు జిల్లాల్లోని నాలుగు న్యాయస్థానాలు ఆయనకు బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. వరుస కేసుల నమోదుపై జోసెఫ్ తరఫు న్యాయ బృందం కోర్టుల్లో గట్టిగానే పోరాడుతోంది. ఈ అరెస్టుల పర్వం మరియు పోలీసుల తీరుపై జోసెఫ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తనపై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులు పెట్టారనే అభిప్రాయాన్ని ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వాలు వ్యవహరించడం సరికాదంటూ కొన్ని పౌర హక్కుల సంఘాలు కూడా ఈ వ్యవహారంపై స్పందించాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో నేతల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే హెచ్చరించింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన శ్రేణులు జోసెఫ్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతూ పలుచోట్ల ఫిర్యాదులు చేశారు. తన అరెస్టుల వెనుక ఉన్న అసలు కారణాలు, పోలీసుల విచారణ విధానం మరియు భవిష్యత్తు కార్యాచరణపై పూర్తి వివరాలను వెల్లడించేందుకు జోసెఫ్ సిద్ధమవుతున్నారు. త్వరలోనే పత్రికా విలేకరుల సమావేశం (ప్రెస్ మీట్) ఏర్పాటు చేసి అన్ని విషయాలను బహిరంగంగా పంచుకుంటానని ఆయన స్వయంగా ప్రకటించారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా మరిన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. కోర్టుల ద్వారా బెయిల్ పొందినప్పటికీ, మున్ముందు ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందనేది మరియు ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందనే అంశంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Publish Date: Jul 4, 2026 8:38PM
కేసీఆర్ ఫ్యామిలీపై రేవంత్ నిప్పులు..వేల కోట్ల ఆస్తులు ఎక్కడివి..!
కేసీఆర్ ఫ్యామిలీపై రేవంత్ నిప్పులు..వేల కోట్ల ఆస్తులు ఎక్కడివి..!

సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు. నాడు స్థానిక ప్రజలు నాటిన చిన్న మొక్కే, నేడు రాష్ట్రంలో ఒక మహా వృక్షంగా ఎదిగిందని ఆయన వ్యాఖ్యానించారు. 2006 జూలై 4వ తేదీన మిడ్జిల్ ప్రాంత ప్రజలు అందించిన ఆశీస్సులే తనను ఈ స్థాయికి చేర్చాయని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. తన రెండు దశాబ్దాల రాజకీయ ప్రయాణాన్ని సింహావలోకనం చేసుకుంటూ, నాటి పాలమూరు జిల్లా వెనుకబాటుతనాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. గతంలో ఈ ప్రాంతం తీవ్రమైన కరువుతో, 'డార్క్ మండలాలు'గా వర్గీకరించబడి ఉండేదని వివరించారు. తాను స్థానికేతరుడైనప్పటికీ కేవలం నమ్మకంతోనే నాటి ఎన్నికల్లో స్వతంత్ర జడ్పీటీసీ అభ్యర్థిగా గెలిపించి, తన ఎదుగుదలకు పునాది వేసిన మిడ్జిల్, కల్వకుర్తి ప్రాంత ప్రజల రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నారు. పాలమూరు మట్టి గొప్పతనాన్ని వివరిస్తూ నాటి హైదరాబాద్ రాష్ట్ర తొలి సీఎం బూర్గుల రామకృష్ణారావు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వంటి మహామహులు ఈ గడ్డపై నుంచే దేశానికి సేవలందించారని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే వెనుకబడిన మిడ్జిల్ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందుకే ఈ మండలాన్ని దత్తత తీసుకొని ప్రత్యేక నిధులు కేటాయించాలని సభాముఖంగానే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను సీఎం కోరారు. మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ కుటుంబంపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తమ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు. గత పదేళ్ల కాలంలో పేదలకు సొంత ఇళ్లు ఇవ్వకుండా గాలికొదిలేశారని, తమ పాలనలో ప్రతి గ్రామంలో 'ఇందిరమ్మ ఇళ్లు' నిర్మించి పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నామని వివరించారు. గత పాలకుల హయాంలో జరిగిన దోపిడీ వల్లే రాష్ట్ర అప్పులు రూ. 70 వేల కోట్ల నుండి ఏకంగా రూ. 8.50 లక్షల కోట్లకు చేరాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఎలా వచ్చిందని, కేటీఆర్, కవిత, హరీష్ రావులకు వేల కోట్ల విలువైన ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన నిలదీశారు. తెలంగాణ కోసం పోరాడిన గద్దర్ వంటి ప్రజా గాయకుడిని సైతం నాటి దొరలు గడీల ముందు గంటల తరబడి నిలబెట్టి అవమానించారని మండిపడ్డారు. ఈ కృతజ్ఞత సభ తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక సాధారణ స్వతంత్ర జడ్పీటీసీ సభ్యుడి స్థాయి నుండి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన రేవంత్ రెడ్డి కెరీర్ గ్రాఫ్‌పై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం స్వయంగా ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టడం, డిప్యూటీ సీఎం దత్తత అంశాన్ని ప్రస్తావించడంతో రాబోయే రోజుల్లో మిడ్జిల్ మండలానికి కొత్త నిధులు, మౌలిక వసతులు సమకూరుతాయని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Publish Date: Jul 4, 2026 8:26PM
టాస్ గెలిచిన భారత్.. తుది జట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
టాస్ గెలిచిన భారత్.. తుది జట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!

చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..! మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఎంతో కాలంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌తో అతను భారత జట్టు తరఫున సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని భారీ స్కోరు సాధించడమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. హోరాహోరీగా సాగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలవడం భారత్‌కు మొదటి సానుకూల అంశంగా మారింది. రెండో టీ20 మ్యాచ్ ప్రారంభానికి ముందు వైభవ్ సూర్యవంశీ భారత వైస్ కెప్టెన్ తిలక్ వర్మ చేతుల మీదుగా తన డెబ్యూ క్యాప్‌ను అందుకున్నాడు. ఈ ఘనతతో కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ ఆటగాడిగా వైభవ్ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా ఆశించిన స్థాయిలో రాణించలేక, వరుసగా విఫలమవుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌పై సెలెక్టర్లు చివరకు వేటు వేశారు. అతని పేలవ ఫామ్ కారణంగా జట్టు యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. సంజు శాంసన్ స్థానంలోనే యువ రక్తం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం కల్పించారు. వైభవ్ సూర్యవంశీ జట్టులోకి రావడంపై క్రీడా విశ్లేషకులు మరియు అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువ ఆటగాడు, అంతర్జాతీయ వేదికపై కూడా అదే స్థాయి ప్రదర్శనను పునరావృతం చేస్తాడని మాజీ క్రికెటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంజు స్థానంలో వచ్చిన వైభవ్ తన అందివచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా తుది జట్టులో శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, శివం దూబె, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. ఇంగ్లండ్ జట్టుకు హ్యారీ బ్రూక్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్‌లో నిలవాలంటే భారత్‌కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. సరికొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయతీరాలకు చేరుస్తాడని, భవిష్యత్ టీమిండియా స్టార్‌గా ఎదుగుతాడని సగటు భారత క్రికెట్ అభిమాని బలంగా ఆకాంక్షిస్తున్నాడు.

Publish Date: Jul 4, 2026 8:09PM
తెలంగాణ అప్పులపై భట్టి విక్రమార్కవి పచ్చి అబద్ధాలు.. : హరీశ్ రావు
తెలంగాణ అప్పులపై భట్టి విక్రమార్కవి పచ్చి అబద్ధాలు.. : హరీశ్ రావు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ నేతలు ఈ విధమైన అసత్య ప్రచారాలకు తెరలేపారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొత్త డ్రామాలకు తెరలేపారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అసలు లేని అప్పులను కూడా ఉన్నట్లుగా చూపిస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు పాలక పక్షం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ఎంత కోపంతో ఊగిపోయినా వాస్తవాలను దాచలేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ చేసిన రూ.15 వేల కోట్ల అప్పును కూడా బీఆర్‌ఎస్‌ ఖాతాలో చూపారని హరీశ్ రావు విమర్శించారు . రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారిపోవంటూ ఘాటుగా స్పందించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దిగిపోయేనాటికి చెల్లించాల్సిన మొత్తం అప్పు రూ.4.14 లక్షల కోట్లు మాత్రమే. కల్యాణ లక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ వంటి పథకాలను మాజీ సీఎం కేసీఆర్‌ అమలు చేశారని ఆయన అన్నారు. గత ఎన్నికల ముందు ప్రజల ఓట్లు దండుకోవడానికే కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డగోలుగా గ్యారంటీ కార్డులను పంచారని హరీశ్ రావు గుర్తు చేశారు. తీరా అధికార పీఠం దక్కిన తర్వాత ఆ వాగ్దానాలను అమలు చేసే సత్తా లేక ఇలాంటి కుంటిసాకులు వెతుకుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన మాటను తప్పించుకోవడానికే రోజుకో అబద్ధం, పూటకో సాకు చెబుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజా సమస్యలను గాలికొదిలేశారని, ఇచ్చిన గ్యారంటీలను ఎగ్గొట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మాజీ మంత్రి విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న తీవ్ర అసంతృప్తిని, డ్యామేజ్‌ను కవర్ చేసుకునేందుకే భట్టి విక్రమార్క ఇలాంటి గోబెల్స్ ప్రచారానికి దిగుతున్నారని ఆరోపించారు. ఈ విధమైన రాజకీయ ఎత్తుగడలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజలు మరిచిపోలేరని హరీశ్ రావు పేర్కొన్నారు. తాము చేసిన వ్యూహాత్మక అప్పుల వల్ల రాష్ట్రంలో సంపద సృష్టి జరిగిందే తప్ప నష్టం జరగలేదని గులాబీ శ్రేణులు సమర్థిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అప్పుల సాకుతో కాలం గడపడంపై ప్రజల్లో కూడా చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా అబద్ధాల ప్రచారాన్ని పక్కనబెట్టి, అసెంబ్లీ ఎన్నికల వేళ తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను సంపూర్ణంగా ఎలా అమలు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో హామీల అమలుపై కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ తాము ప్రజా క్షేత్రంలోనే పోరాటం చేస్తామని బీఆర్‌ఎస్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అప్పుల సాకుతో రోజులు నెట్టుకొస్తున్న సర్కార్‌పై ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

Publish Date: Jul 4, 2026 7:59PM
సాయికృష్ణ కాళ్లపై మేకులు కొట్టి సీఐ నాగరాజు చంపాడు : తల్లి
సాయికృష్ణ కాళ్లపై మేకులు కొట్టి సీఐ నాగరాజు చంపాడు : తల్లి

కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా....! గాదె సాయికృష్ణ లాక్‌అప్ డెత్ కేసులో ఆయన తల్లి తీవ్ర ఆవేదనతో సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడిని అమానుషంగా హింసించి, మేకులు కొట్టి దారుణంగా చంపారని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు."నా కొడుకును ఎంత చిత్రహింసలకు గురి చేశారో ఆలోచిస్తే గుండె పగిలిపోతోంది. మమ్మల్ని కూడా చంపాలని చూస్తున్నారు. కనీసం నా కొడుకు బూడిదైనా మాకు అప్పగించండి. లేకపోతే పెట్రోల్ పోసుకుని ప్రాణాలు తీసుకుంటా" అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు లేదా ఐదుగురిని మాత్రమే అరెస్ట్ చేశారని, అయితే తన కుమారుడిపై దాడి చేసి హింసించిన మరికొందరు ఇంకా బయటే తిరుగుతున్నారని ఆమె ఆరోపించారు. లాకప్ డెత్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, ఉన్నత స్థాయి వ్యక్తులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. దర్యాప్తు తీరుపైనా ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసును నిష్పాక్షికంగా విచారించి, ఘటనలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, దర్యాప్తు అధికారులను కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. "పోలీస్ స్టేషన్ పైన లభించిన బూడిద, ఎముకల ముక్కలు నా కుమారుడివేనని గ్యారెంటీ ఏంటి? ఖాకీల అండతో ఇలాంటి దారుణాలు ఇంకెన్ని జరిగాయో ఎవరికి తెలుసు?" అంటూ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. కనీసం తన కొడుకు అస్తికలనైనా తనకు అప్పగిస్తే అంత్యక్రియలు చేసుకుంటానని, లేనిపక్షంలో తాను కూడా ప్రాణాలు తీసుకుంటానని హెచ్చరించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే నిందితులుగా మారడంపై స్థానికంగా మరియు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యుడైన సీఐతో పాటు ఈ ఘటనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ సర్వీస్ నుంచి సస్పెండ్ చేసి జైలుకు పంపాలని మానవ హక్కుల సంఘాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు మెజిస్టీరియల్ విచారణ పరిధిలో ఉండటంతో.. ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలని, ఖాకీల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజా సంఘాలు గట్టిగా కోరుతున్నాయి.

Publish Date: Jul 4, 2026 7:30PM
ఆంధ్రాలో బ్రిటిష్ గ్రామాలు..వాటి వెనుక దాగిన చరిత్ర ఇదేనా..!
ఆంధ్రాలో బ్రిటిష్ గ్రామాలు..వాటి వెనుక దాగిన చరిత్ర ఇదేనా..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి. ముఖ్యంగా అధికార వికేంద్రీకరణ, సంక్షేమ పథకాలు, మరియు ప్రాంతీయ అభివృద్ధి చుట్టూ ఇక్కడి రాజకీయ ముఖచిత్రం తిరుగుతూ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి నమూనాల మధ్య, పరిపాలనా సంస్కరణలు మరియు చారిత్రక వారసత్వాల పరిరక్షణపై తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థలను, నామకరణాలను నేటి ఆధునిక రాజకీయ అవసరాలకు అనుగుణంగా మార్చడం లేదా వాటి ప్రాధాన్యతను తగ్గించి నూతన ప్రాంతీయ అస్తిత్వాన్ని తెరపైకి తేవడం ఒక ముఖ్యమైన వ్యూహాత్మక ఎత్తుగడగా మారింది. ఈ అంశంపై టోన్‌ న్యూస్ ఆసక్తికర చర్చ నిర్వహించింది. ప్రస్తుత రాజకీయ వ్యూహాలను పరిశీలిస్తే, గ్రామీణ స్థాయిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు పాలకుల పేర్ల గుర్తింపును మార్చడం ప్రధాన అస్త్రంగా కనిపిస్తోంది. గడిచిన కాలంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా మరియు గోదావరి జిల్లాల పరిధిలోని ఎన్నో ప్రాంతాలకు ఉన్న చారిత్రక నామాలను స్థానిక సామాజిక సమీకరణాల ఆధారంగా రీ-బ్రాండింగ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఒకప్పుడు బ్రిటిష్ అధికారులు లేదా మతబోధకులు చేసిన సేవల ఆధారంగా ఏర్పడిన ఊర్లు, పేటల పేర్లను మార్చి, ప్రాంతీయ నాయకుల లేదా జాతీయ వీరుల పేర్లను పెట్టడం ద్వారా ఓటు బ్యాంకును స్థిరీకరించుకోవాలనేది ప్రధాన పార్టీల అంతర్గత వ్యూహం. ఈ ప్రక్రియ కేవలం నామకరణాలకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రభుత్వ నిధులతో నిర్మించే ప్రతి చిన్న ప్రాజెక్టు లేదా ఆర్చ్‌లపై సైతం ప్రస్తుత పాలకుల పేర్లను ప్రముఖంగా లిఖించుకునే స్థాయికి చేరింది. ఈ వ్యూహాత్మక మార్పుల వల్ల రాజకీయంగా మరియు సామాజికంగా లోతైన ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు, చారిత్రక ఆధారాలను మరియు స్థానిక వారసత్వాన్ని రాజకీయ అవసరాల కోసం మార్చడం వల్ల మేధావుల నుండి మరియు చారిత్రక పరిశోధకుల నుండి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరొకవైపు, సామాన్య ప్రజల్లో ప్రాంతీయ అస్తిత్వం, కుల లేదా సామాజిక సమీకరణల ఆధారంగా సెంటిమెంట్‌ను రగిల్చేందుకు ఇది దోహదపడుతోంది. అభివృద్ధి అనేది కేవలం భౌతిక నిర్మాణాలకే పరిమితం కాకుండా, పేర్ల మార్పిడి మరియు గుర్తింపు రాజకీయాల చుట్టూ తిరగడం వల్ల నిజమైన పరిపాలనా సంస్కరణలు మరుగున పడే ప్రమాదం ఉంది. భవిష్యత్తు రాజకీయ ప్రభావాన్ని అంచనా వేస్తే, ఈ విధమైన గుర్తింపు రాజకీయాలు దీర్ఘకాలంలో ఓటర్లలో స్పష్టమైన విభజనకు దారితీయవచ్చు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ తమకు అనుకూలమైన పేర్లను, చిహ్నాలను రుద్దే సంస్కృతి పెరిగిపోతుంది. రాబోయే ఎన్నికల్లో కేవలం సంక్షేమం లేదా మౌలిక వసతుల కల్పన మాత్రమే కాకుండా, 'ప్రాంతీయ గౌరవం మరియు చారిత్రక వారసత్వ పునరుద్ధరణ' అనే అంశాలు కీలక ప్రచార అస్త్రాలుగా మారనున్నాయి. పరిపాలకులు కేవలం తమ పేర్లను శాశ్వతం చేసుకోవాలనే తపనతో కాకుండా, ఆనాడు సర్ ఆర్థర్ కాటన్ లేదా సి.పి. బ్రౌన్ వంటి వారు ప్రజల హృదయాల్లో సంపాదించుకున్న శాశ్వత స్థానాన్ని స్ఫూర్తిగా తీసుకుని, దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే ప్రాజెక్టులపై దృష్టి పెట్టినప్పుడే నిజమైన రాజకీయ లబ్ధి మరియు ప్రజాదరణ లభిస్తాయి. ఇలాంటి అంశాలపై పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.

Publish Date: Jul 4, 2026 6:28PM
రూ.232 కోట్ల బ్యాంకు రుణాల మోసం.. రంగంలోకి సీబీఐ..!
రూ.232 కోట్ల బ్యాంకు రుణాల మోసం.. రంగంలోకి సీబీఐ..!

భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది. మొత్తం రూ.232 కోట్లకు పైగా విలువైన రెండు బ్యాంకు మోసాల కేసుల్లో శనివారం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించింది. నిందిత కంపెనీల డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలను జల్లెడ పట్టిన అధికారులు కీలక పత్రాలతో పాటు డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులోని బ్యాంకింగ్ సెక్యూరిటీ అండ్ ఫ్రాడ్స్ బ్రాంచ్ (BSFB)లో నమోదైన మొదటి కేసు ఆర్‌ఎల్ జ్యువెల్స్ లిమిటెడ్‌కు సంబంధించినది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు నమోదైన ఈ కేసులో సంస్థ డైరెక్టర్లు, గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు కలిసి నేరపూరిత కుట్ర పన్ని బ్యాంకుకు రూ.103.58 కోట్ల నష్టం కలిగించినట్లు సీబీఐ ఆరోపించింది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను దుర్వినియోగం చేయడంతో పాటు ఇతర బ్యాంకుల ఖాతాల ద్వారా నిధులను మళ్లించడం, ఖాతాల రికార్డులను తారుమారు చేయడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. మరో కేసు అశాపురా గార్మెంట్స్ లిమిటెడ్‌కు సంబంధించినది. కానరా బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియాన్ని మోసం చేసి రూ.128.23 కోట్ల నష్టం కలిగించినట్లు సంస్థ డైరెక్టర్లు, మరికొందరిపై కేసు నమోదు చేశారు. వస్త్ర పరిశ్రమ కోసం తీసుకున్న రుణాలను ఉక్కు, అల్యూమినియం, బొగ్గు వ్యాపారాలకు మళ్లించి నిధులను దారి మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ రెండు కేసులకు సంబంధించి నిర్వహించిన సోదాల్లో నిధుల మళ్లింపుకు సంబంధించిన కీలక పత్రాలు, డిజిటల్ డేటా, ఇతర దర్యాప్తుకు ఉపయోగపడే ఆధారాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. నిధుల ప్రవాహం ఎలా సాగింది? మోసంలో ఇంకెవరి పాత్ర ఉంది? అనే కోణాల్లో అధికారులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భారీ ఆర్థిక అక్రమాల వెనుక ఉన్న పూర్తి కుట్రను ఛేదించడమే లక్ష్యంగా సీబీఐ దర్యాప్తును మరింత వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Publish Date: Jul 4, 2026 5:48PM
అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త.. అనాథగా చిన్నారి..!
అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త.. అనాథగా చిన్నారి..!

భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే. అయితే ఒకరిపై మరొకరికి ప్రేమ, నమ్మకం ఉంటేనే సంసారం సాఫీగా సాగుతుంది. అదే బంధంలో అనుమానం అనే విషబీజం చొరబడితే కుటుంబాల్లో కలహాలు చెలరేగి విషాదాంతాలకు దారితీస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అలాంటి విషాద ఘటన చోటుచేసుకుంది. సురేష్, జెస్సికాలకు 2015లో వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం పదేళ్ల కుమార్తె ఉంది. ఇద్దరూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకానగర్‌లో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా భార్య జెస్సికాపై సురేష్ అనుమానం పెంచుకోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన సురేష్ భార్యపై దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం సురేష్ జెస్సికా సోదరికి ఫోన్ చేసి, "జెస్సికాను హత్య చేశాను" అని చెప్పి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడు సురేష్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ కలహాలు, భార్యపై అనుమానం ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఒకవైపు తల్లి మృతి చెందగా, మరోవైపు తండ్రి పరారీలో ఉండటంతో పదేళ్ల చిన్నారి జీవితంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లి మృతదేహాన్ని చూసి ఆ చిన్నారి రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. క్షణిక ఆవేశం, నిరాధార అనుమానం ఓ కుటుంబాన్ని శాశ్వతంగా ఛిద్రమయ్యేలా చేశాయి.

Publish Date: Jul 4, 2026 5:41PM
TeluguOne Picks For You
rss-imgRss Feeds