TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

political-news-img

జగన్ మళ్లీ సీఎం కాలేరా? విశ్లేషకులు చెబుతున్నదేంటి?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారపగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయ్యింది. మరో మూడేళ్లలో మళ్లీ ఎన్నికలు రానున్నాయి. అయితే ముందస్తుగానే రాష్ట్రంలో రాజకీయ వేడి పీక్స్ కు చేరింది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా అన్న రేంజ్ లో పొలిటికల్ హీట్ ఉంది. రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న రాజకీయ సమీకరణాలపై చర్చోపచర్చలు మొదలయ్యాయి. తెలుగుదేశం ప్రభుత్వ పనితీరుపై వైసీపీ విమర్శలతో విరుచుకుపడుతోంది. అయితే.. అదే సమయంలో వైసీపీ ఈ రెండేళ్లలో ఇసుమంతైనా పుంజుకోలేదన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాని, ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించడంపై జన సామాన్యంలో కూడా అసంతృప్తి వెల్లువెత్తుదోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ సీఎంను అవుతానంటూ ధీమాగా ప్రకటనలు గుప్పిస్తున్న జగన్ పొలిటికల్ ఫ్యూచర్ పై రాజకీయ పండితులు, పరిశీలకులు ఆసక్తికర విశ్లేషణలు చేస్తున్నారు. ప్రస్తుత పాలనలోని కొన్ని అంశాలను తటస్థ వేదికలపై విమర్శించే విశ్లేషకులు సైతం.. రాబోయే ఎన్నికలలో వైపీపీ విజయం సాధించి అధికారంలోకి రావడం సాధ్యమేనా అంటే ఔనని చెప్పలేమంటున్నారు. వైసీపీకి ఏ మాత్రం సానుకూల పరిస్థితి లేదని, వైసీపీ పుంజుకుని జగన్ మళ్లీ సీఎం అవ్వడం సులువు కాదని ఎలాంటి శషబిషలూ లేకుండా చెబుతున్నారు. సాధారణంగా పబ్లిక్ ఒపీనియన్ ను ప్రభావితం చేయడంలో పొలిటికల్ అనలిస్టుల పాత్ర కీలకంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా తటస్థ అనలిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ రకంగా చూసినా తటస్థ విశ్లేషకులు సైతం వైసీపీ తీరుపై పెదవి విరుస్తున్నారు. వైసీపీ అసెంబ్లీ బహిష్కరణ ఆ పార్టీ చేసుకున్న సెల్ఫ్ గోల్ గా అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు లేదా లోపాలను ఎత్తిచూపుతూనే విశ్లేషకులు వైఎస్సార్సీపీకి అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు మృగ్యమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం. గతంలో అంటే 2014 నుండి 2019 మధ్యకాలంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయాన్ని గుర్తుచేసుకుంటే, నాటి రాజకీయ వాతావరణం వైసీపీకి సానుకూలంగా ఉండేది. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ . ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయడం, బలమైన మీడియా మద్దతు లభించడం మరియు అప్పటి జాతీయ సమీకరణాలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారాయి. ఆ కాలంలో ప్రతిపక్షంలో ఉన్న తీవ్రమైన దూకుడు, ప్రభుత్వ నిర్ణయాలను నిలదీసే నైతిక బలం జగన్ వైపు స్పష్టంగా కనిపించాయి. అంతేకాకుండా, 2014-2019 మధ్యకాలంలో నాటి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మేధావులు, రిటైర్డ్ అధికారులు, తటస్థ విశ్లేషకులు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. ఉదాహరణకు, నాటి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపట్టిన పలువురు ప్రముఖులు, ఐఏఎస్ అధికారులు మరియు ఇతర రంగాల ప్రముఖులు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని బహిరంగంగానే చెప్పారు. అయితే, 2019 నుండి 2024 వరకు సాగిన ఐదేళ్ల జగన్ పాలన తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆయన అధికారంలో ఉండా తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు, పాలనా విధానాలు విధానాల కారణంగా ప్రజా వ్యతిరేకత అధికమైంది. అదే 2024 ఎన్నికలలో ప్రభుత్వ పతనానికి కారణమైంది. అన్నిటికీ మించి మూడు రాజధానులు, బాబాయ్ గొడ్డలి పోటు, మద్యం కుంభకోణం వంటి అంశాలు జగన్ క్రెడిబులిటీని కోలుకోలేనంతగా దెబ్బతీశాయి. ఆ తరువాత అధికారం కోల్పోయిన తరువాత జగన్ ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితం కావడం, వారానికోసారి చుట్టపు చూపుగా రాష్ట్రానికి వచ్చినా తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా సమావేశాలతో సరిపెట్టేయడం వంటివి పార్టీ శ్రేణులలో నిరుత్సాహానికి కారణమయ్యాయి. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలు నామమాత్రమయ్యాయి. అన్నిటికీ మించి అధికారం కోల్పోయిన తర్వాత తిరిగి పుంజుకోవడానికి కావలసిన రాజకీయ వ్యూహాలు, ప్రజా విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నాలు జగన్ నుంచి కానీ, వైసీపీ నుంచి కానీ జరగలేదు. దీంతో పార్టీ ఇమేజ్ రోజురోజుకూ మసకబారుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విధానాలను విమర్శించే మేధావులు కూడా వైసీపీకి అనుకూలంగా మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. Can Jagan Become CM Again, AP politics, YS Jagan Mohan Reddy, YCPs Future, AP elections, Telugu One

Published on: Mon Aug 31, 2026 5:39PM

political-news-img

కొండా సురేఖపై కాంగ్రెస్ హైకమాండ్ సాఫ్ట్ కార్నర్?

తెలంగాణ కాంగ్రెస్ లో ఇటీవలి కాలంలో పెను సంచలనం సృష్టించిన కొండా సురేఖ ఎపిసోడ్ కు లాజికల్ కంక్లూజన్ దిశగా కాంగ్రెస్ హైకమాండ్ అడుగులు వేస్తున్నది. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించారనే ఆరోపణలపై కొండా సురేఖపై చర్యలకు సిఫారసు చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. దీంతో కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. అయితే రక్షాబంధన్ రోజున కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి అప్పాయింట్ మెంట్ తీసుకుని మరీ ఆయనతో భేటీ అవ్వడం, రాఖీ కట్టడం తెలిసిందే. ఆ తరువాత రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించిన ఆమె.. తన కుమార్తె వ్యాఖ్యలతో తనకు ఎటువంటి సంబంధం లేదని క్లియర్ కట్ గా, క్లారిటీ ఇచ్చారు. ఈనేపథ్యంలోనే కొండా సురేఖపై వేటు విషయంలో పార్టీ హైకమాండ్ వైఖరి మారిందని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నది. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు ఆమెపై చర్య తీసుకోవడం ఖాయమే అని చెబుతూనే.. త్వరలో రేవంత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఆమెకు ఉద్వాసన చెప్పడం కాకుండా.. రాజీనామా కోరాలని హైకమాండ్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టి కొత్తవారికి అవకాశం పేరుతో కొండా సురేఖను రాజీనామా చేయాల్సిందిగా సూచించేందుకే హైకమాండ్ భావిస్తోందంటున్నారు. ఏది ఏమైనా రానున్న రెండు రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వస్తుందని అంటున్నారు. [Congress High Command Softcorner on Konda Surekha, Telangana Congress, CM Revanth, Cabinet Expanssion, Telugu One]

Published on: Mon Aug 31, 2026 12:21PM

political-news-img

జగన్ వ్యాఖ్యలకు కొత్త భాష్యం చెప్పిన బొత్స.!

వైసీపీ అధినేత జగన్.. తన వ్యాఖ్యలతో పార్టీకి కలిగిన నష్టాన్ని నివారించేందుకు బొత్స రంగంలోకి దిగారు. నష్ట నివారణ కోసం ఆయన జగన్ వ్యాఖ్యలకు కొత్త భాష్యం చెప్పారు. స్థానిక ఎన్నికలలో ఏకగ్రీవాలు ఉండడానికి వీల్లేదన్న జగన్ ఆదేశాలకు భిన్నంగా, బొత్స సత్యనారాయణ స్థానిక ఎన్నికలలో ఏకగ్రీవాలు రెండు రకాలుగా ఉంటాయంటూ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. వాటిలో ఒకటి.. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం వాటిని ప్రోత్సహించడం. మరొకటి, రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలను నిర్వహించడమంటూ బొత్స చెప్పిన భాష్యంపై నెటిజనులు ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు. ఇక వైసీపీ వర్గాలైతే.. అసలు బొత్స చెప్పిందేంటో అర్ధం కాక తలలు పగలకొట్టుకుంటున్నారు. ఇంతకీ బొత్స చెప్పినదేంటంటే.. జగన్ ఆదేశించినంత మాత్రాన ఏకగ్రీవాలు జరగకుండా పోవని, అంటే పార్టీ అధినేత మాటను ఆయన ఖండిచారన్న మాట. ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల ప్రతినిధులకు తదుపరి ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు దక్కవంటూ జగన్ చేసిన హెచ్చరిక నేపథ్యంలో బొత్స వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అలాగే.. తాజాగా వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిపై కూడా బొత్స విరుచుకుపడ్డారు. విజయసాయిని ఆయన మరో కేఏపాల్ గా అభివర్ణించారు. విజయసాయి.. నోటికి వచ్చినట్లు మాట్లాడతారనీ, ఆయన మాటలకు ఇసుమంతైనా విలువ ఉండదని బొత్స అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చన్న స్పీకర్ హెచ్చరికపై.. తనదైన శైలిలో సవాల్ విసిరారు... నిజంగా స్పీకర్ కు ఆ అధికారం ఉంటే రద్దు చేసుకోవచ్చన్నారు. సభ్యత్వాలు రద్దు చేస్తే.. వైసీపీ రాజ్యాంగ బద్ధంగా పోరాడుతుందన్నారు. [Botsa New Interpretation on Jagan Comments, Botsa, YS Jagan Mohan Reddy, YCP Unanimous Elections, Localbodies, AP Politics, Telugu One]

Published on: Mon Aug 31, 2026 11:55AM

political-news-img

రాజేంద్రనగర్ నియోజకవర్గ MIM ఇన్‌చార్జ్‌గా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్..!

బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది. ఈ మేరకు పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పార్టీ తరఫున సంస్థాగత కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటు, పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో ప్రాతినిధ్యం వహించే బాధ్యతలను మహ్మద్ ముబీన్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన AIMIM పార్టీ పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు మహ్మద్ ముబీన్‌తో సమన్వయం చేసుకుంటూ పార్టీ సంస్థాగత కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని పార్టీ సూచించింది. నియోజకవర్గంలోని పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు, ఇతర సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి ఆయనతో సంప్రదింపులు జరపాలని పేర్కొంది. ముబీన్‌కు అప్పగించిన కొత్త బాధ్యతలతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. MLA Mohammed Mubeen, Rajendranagar MIM in-charge, AIMIM, Asaduddin Owaisi, MLC Rahmat Beg, Telugu news, Telugu one

Published on: Sun Aug 30, 2026 6:30PM

political-news-img

కడపలో ఫ్యాన్ గాలి ఆడటం లేదా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి అత్యంత బలమైన అనుకూల ప్రాంతంగా ఉంటూ వచ్చిన రాయలసీమలో 2024 ఎన్నికలలో ఆ పార్టీ దెబ్బతింది. ముఖ్యంగా వైసీపీకి కొండంత అండగా నిలుస్తూ, ఆ పార్టీకి పెట్టని కోట లాంటి కడన జిల్లాలో కూడా వైసీపీ వెనుక బడింది. కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని మొత్తం పది అసెంబ్లీ స్ధానాలలో ఏడింటిని తెలుగుదేశం కూటమి కైవశం చసుకుంది. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వైపీనీ కడప లోక్ సభ నియోజకవర్గాన్ని నిలబెట్టుకోగలిగింది. అయితే ఇండియా టుడే , సి-వోటర్ సంయుక్తంగా నిర్వహించిన తాజా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు కడప లోక్ సభ స్థానానికి జగన్, ఆయన పార్టీ తిలోదకాలొదిలేయడం ఖాయమని పేర్కొంది. ఏపీలో ఇప్పుడు గనక ఎన్నికలు జరిగితే వైసీపీ కడప పార్లమెంట్ స్థానంలో సైతం పరాజయం పాలౌతుందని సర్వే పేర్కొంది. ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి 20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 4 ఎంపీ స్థానాల సంఖ్య మరో స్థానం పెరిగి 5 కి చేరుకునే అవకాశం ఉందదని సర్వే పేర్కొన్నప్పటికీ, వైసీపీ కంచుకోట అయిన కడపలో ఓటమి మూటకట్టుకోవడం ఖాయమని ఇండియాటుడే సర్వే పేర్కింది, {India Today survey, Kadapa MP seat, YCP Kadapa Lok Sabha, India Today C Voter AP survey, TDP AP Lok Sabha seats, AP politics news, Telugu One}

Published on: Sat Aug 29, 2026 4:30PM

political-news-img

వైసీపీలో ఉత్తుత్తి సస్పెన్షన్లే.!

వైసీపీ లో క్రమశిక్షణా చర్యలు, సస్పెన్షన్లు కేవలం ప్రజాక్షేత్రంలో పరువు కాపాడుకోవడానికి వేసే ఉత్తుత్తి డ్రామాలు మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీకీ, పార్టీ ప్రతిష్ఠకు తీరని నష్టం జరిగే వివాదాలలో, ఆరోపణలలో నాయకులు చిక్కుకున్నప్పుడు మాత్రమే.. ప్రజాగ్రహం నుంచి దృష్టి మళ్లించడానికి కంటి తుడుపు చర్యగా వైసీపీలో సస్పెన్షన్లు ఉంటాయని అంటున్నారు. పేరుకే సస్పెన్షన్ తప్ప ఆ నేతలకు పార్టీలో ఉన్న స్థానం, వారి హోదాలు అలాగే కొనసాగుతుంటాయి. ఇందుకు పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీలు అనంతబాబు, దువ్వాడ శ్రీనివాస్ ల ఉదంతాలే నిలువెత్తు నిదర్శనం అని చెబుతున్నారు. అనంతబాబు విషయానికి వస్తే... తన వద్ద కారు డ్రైవర్ గా పని చేసి మానేసిన సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో హతమైతే, అతడి మృతదేహాన్ని తన సొంత కారులో తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు డోర్ డెలివరీ చేశారు ఎమ్మెల్సీఅనంతబాబు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనంతబాబు అరెస్టై జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు బెయిలుపై బయట తిరుగుతున్నారు అది వేరే సంగతి. కాగా మృతదేహం డోర్ డెలివరీ విషయంలో సర్వత్రా ఆగ్రహం వ్యక్తం కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లోవైసీపీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే పార్టీ నుంచి సస్పెండైనా ఆయన జగన్ పర్యటనల్లో, పార్టీ సమావేశాలలో యాక్టివ్ గా తిరుగుతూనే ఉన్నారు. ఒక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై శాశ్వత బహిష్కరణ లేదా శాసనమండలి సభ్యత్వ రద్దు దిశగా వైసీపీ ఎటువంటి చర్యా తీసుకోలేదు. కేవలం సస్పెన్షన్ ప్రకటనతో సరిపెట్టి చేతులు దులుపుకుంది. ఇక దువ్వాడ శ్రీనివాస్ విషయానికి వస్తే.. ఆయన సస్పెన్షన్ కూడా ఉత్తుత్తిదే అని పరిశీలకులు అంటున్నారు. దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు. ఇటీవల శాసనమండలిలో వైసీపీ పక్ష సభ్యుడిగా చర్చల్లో పాల్గొని అనుచిత వ్యాఖ్యలతో మరో సారి వివాదానికి కేంద్ర బిందువయ్యారు. ఇలా ఉత్తుత్తి సస్పెన్షన్లతో వైసీపీ ప్రజల దృష్టిలో మరింత పలుచన అవుతోందని పరిశీలకులు అంటున్నారు. {Token Gesture Suspenssions in YCP, MLC Anantha Babu, Duvvada Srinivas}

Published on: Sat Aug 29, 2026 1:33PM

political-news-img

మూడ్ ఆఫ్ ఏపీ.. తెలుగుదేశంకూటమి మళ్లీ క్లీన్ స్వీప్.!

రాజకీయాల్లో మళ్లీ సర్వేల వేడి రాజుకుంది. మూడ్ ఆఫ్ నేషన్ పేరిట ఇటీవల ఇండియా టుడే సర్వే నిర్వహించింది. అందులో భాగంగా మూడ్ ఆప్ ఆంధ్రప్రదేశ్ సర్వే కూడా ఉంది. ఆ సర్వే ఫలితం వైసీపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. ఎందుకంటే.. ఇటీవలే.. వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓ సర్వేను ఆ పార్టీ తన సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసింది. ఆ సర్వే ప్రకారం.. వచ్చే ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధిస్తుందనీ, జగన్ మళ్లీ సీఎం అవుతారనీ వైసీపీ చెప్పుకుని తన భుజాలను తానే చరుచుకుని సంబరాలు చేసుకుంది. అయతే.. ఆ సర్వే కు స్పష్టమైన ఆధారాలు గానీ, విశ్వసనీయత గానీ లేవన్న అభిప్రాయం రాజకీయవర్గాలతో పాటు.. వైసీపీ శ్రేణుల్లో కూడా వ్యక్తమైంది. అది పక్కన పెడితే.. ఇండియా టుడే సర్వే.. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులుకి, ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా ఉందంటున్నారు పరిశీలకులు. ఇంతకీ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ఆంధ్ర ఏం చెప్పిందంటే.. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికిప్రజాదరణ ఇసుమంతైనా తగ్గలేదనీ, ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే.. తెలుగుదేశం కూటమి మరో సారి ఘన విజయం సాధించి అధికారం చేపడుతుందనీ కుండబద్దలు కొట్టింది. అదే సమయంలో వైసీపీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయిందని పేర్కొంది. ఆ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం పాతిక లోక్ సభ స్థానాలలో తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది. 2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది. రాష్ట్ర ప్రజలలో తెలుగుదేశం కూటమి నాయకత్వంపై ఇసుమంతైనా నమ్మకం సడలలేదని సర్వేఫలితం పేర్కొంది. తెలుగుదేశం కూటమి 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టి రెండేళ్లయినప్పటికీ.. ఆ ప్రభుత్వం పట్ల ప్రజలలో ఉన్న సానుకూలత చెక్కు చెదరలేదని ఇండియా టుడే.. సీవోటర్ సర్వే విస్పష్టంగా తేల్చి చెప్పింది. ఇక వైసీపీ విషయానికి వస్తే.. ఆ సర్వే మేరకు ఆ పార్టీ గ్రాఫ్ ఈ రెండేళ్లలో ఇసుమంతైనా పెరగలేదు సరికదా మరింత కిందకు దిగజారింది. గత ఎన్నికల్లో 4 లోక్‌సభ స్థానాలకే పరిమితమైన వైసీపీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా అంతకు మించి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు లేవని పేర్కొంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి పాలన పట్ల ప్రజలలో పూర్తిస్థాయి విశ్వాసం కనిపిస్తోందన్నది సర్వే సారాంశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, అమరావతి, పోలవరం పనులను పరుగులు పెట్టించడం, అలాగే.. వైసీపీ హయాంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పునఃప్రారంభించి ముందుకు తీసుకెళ్లడం ప్రజల్లో చంద్రబాబు సర్కార్ పట్ల సానుకూలతను పెంచిందని సర్వే ఫలితం చెబుతోంది. {Mood of AP. Andhra Pradesh Political Survey, India Today Mood of the Nation AP, YCP MP Seats, Chandrababu Governance}

Published on: Sat Aug 29, 2026 12:44PM

political-news-img

టీటీడీ వేదపారాయణదారుల ఎంపికలో అన్యాయం? నిజాలేంటి?

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వేదపారాయణదారుల నియామక ప్రక్రియ తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీవారి సేవలో భాగస్వాములయ్యేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించిన అనేక వేద పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ఎన్నో ధృవీకరణ పత్రాలు సాధించిన అరుదైన వేదపండితులకు ఈ ఎంపికల్లో తీవ్ర అన్యాయం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు చెందిన వేద ఘనాపాఠీలు, క్రమాపాఠీలు ఈ నియామక సరళిపై తమ ఆవేదనను, నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వేద విద్యలో ఎంతో ప్రావీణ్యం ఉన్నప్పటికీ స్థానికత మరియు ఇతర ప్రాధాన్యతలే ఎంపికకు కొలమానాలుగా మారడం పండితుల వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఎంపికల సరళిని పరిశీలిస్తే, తెలంగాణ నుండి దరఖాస్తు చేసుకున్న వేదపండితులలో 20 మంది కంటే తక్కువ మందికే అవకాశం దక్కడం వివాదాన్ని మరింత పెంచింది. ఉద్యోగాలు పొందిన ఆ కొద్దిమందిలోనూ ఎక్కువ శాతం మంది స్థానిక టీటీడీ సంస్థల్లో పనిచేస్తున్న వారి పిల్లలు లేదా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ గురువుల వద్ద విద్యనభ్యసించినవారే ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అర్హత మార్కులు సాధించిన తర్వాత కూడా స్క్రీనింగ్ కమిటీ పేరుతో తెలంగాణ అభ్యర్థులకు స్థానికతను అడ్డంకిగా చూపి పక్కన పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలో ఏపీ పండితులకు తెలంగాణ ప్రాంతంలో అవకాశాలు ఇచ్చినా తాము ప్రశ్నించలేదని, కానీ ఇప్పుడు అర్హత ఉన్న తమను ఇలా తిరస్కరించడం ఎంతవరకు న్యాయమని వేదపండితులు ప్రశ్నిస్తున్నారు. మరొకవైపు ఈ నియామకాల్లో అన్యాయం కేవలం తెలంగాణ పండితులకే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల పండితులకు కూడా జరిగిందనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఎంపికల్లో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన కొందరు అధికారుల ప్రాబల్యం నడిచిందని, నిర్దిష్ట ఇంటిపేర్లు ఉన్నవారికి మాత్రమే ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, క్రమాపాఠి మరియు ఘనాపాఠి ఎంపికల ప్రక్రియలో అర్హత మార్కులను ఏకంగా 85 మార్కుల నుండి 40 మార్కులకు తగ్గించడం వెనుక పెద్ద కుట్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నిబంధనల సడలింపు వల్ల కనీస ధృవీకరణ పత్రాలు లేనివారు, పూర్తిగా పరీక్షలు రాయనివారు కూడా ఉద్యోగాలు సాధించారనే విషయాలు వెలుగు చూస్తున్నాయి. telangana veda scholars ttd selection issue,ttd veda pandit recruitment marks controversy.

Published on: Sat Aug 29, 2026 11:39AM

political-news-img

ఆగస్టు 29 టారో రాశి ఫలాలు: ఈ రాశుల వారికి అకస్మాత్తుగా జాక్‌పాట్ ఖాయం!

2026 ఆగస్టు 29వ తేదీ టారో కార్డుల విశ్లేషణ ప్రకారం ద్వాదశ రాశుల వారి జాతకం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్యం మరియు కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరం. మీ రాశి ప్రకారం ఈ రోజు మీకు ఎలా ఉండబోతుందో వివరణాత్మకంగా చూద్దాం. ముందుగా మేష రాశి వారికి కార్యాలయంలో పాత పనులే మళ్లీ చేయాల్సి రావడం వల్ల కాస్త విసుగు అనిపించవచ్చు. ఆర్థికంగా అంతర్జాతీయ మార్కెట్లను నిశితంగా గమనించడం వల్ల మీ పోర్ట్‌ఫోలియోను మెరుగ్గా ప్లాన్ చేసుకోగలరు. వైద్య, ఫార్మా, ఫిట్‌నెస్ రంగాలలో ఉద్యోగాలు వెతికే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఇక జీర్ణవ్యవస్థ, కాలేయ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. వృషభ రాశి వారి విషయానికి వస్తే, మీ కష్టానికి ఇతరులు క్రెడిట్ కొట్టేసే ప్రమాదం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో ఇతరుల మాటలు నమ్మి తొందరపడకూడదు. శస్త్రచికిత్స చేయించుకునే వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి ఆఫీసులో అదనపు బాధ్యతలు స్వీకరించడానికి మనసు రాకపోవచ్చు. వైద్యపరమైన అవసరాల కోసం కొంత ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు, మంచి విద్యార్హత కలిగిన జీవిత భాగస్వామి సంబంధాలు సింగిల్స్‌కు లభిస్తాయి. కర్కాటక రాశి వారు స్పష్టత లేకపోవడం వల్ల ఎక్కువ పనులను తలకెత్తుకునే అవకాశం ఉంది. స్వంత ఆరోగ్యం, సంరక్షణ కోసం ఖర్చులు పెరుగుతాయి. అలాగే సింగిల్స్ మోసపూరిత వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహ రాశి ఉద్యోగులకు సరైన బడ్జెట్ ప్లానింగ్ వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది. అయితే తొందరపాటులో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టి నష్టపోకండి. మానసిక ఒత్తిడి, ఆందోళనల నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. కన్యా రాశి వారు ఆర్థిక నిపుణులు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ సహాయం తీసుకోవడం చాలా శ్రేయస్కరం. ఆర్థికంగా ఈ రోజు లబ్ధి చేకూరుస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. తులా రాశి వారికి రాబక బకాయిలు, పాత అప్పులు వసూలు చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన రోజు. వ్యాపార అభివృద్ధి, రికవరీ విభాగాల్లో ఉన్నవారికి ఇది కలిసివస్తుంది. శస్త్రచికిత్స చేయించుకునే తులా రాశి వారికి మెరుగైన ఆరోగ్యం లభిస్తుంది. వృశ్చిక రాశి వారు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి పురోగతి సాధిస్తారు. బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. మెరుగైన జీతంతో కూడిన నూతన ఉద్యోగాలు లభించి ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. వివాహ రిజిస్ట్రేషన్ ప్లాన్ చేసుకునే వారికి ఈ రోజు శుభప్రదం. ధనూ రాశి వారు మీ సొంత నిర్ణయాల కంటే నిపుణుల సలహాలను పాటించడం వల్ల సఫలీకృతులవుతారు. మీడియా, గ్లామర్ రంగాల్లో ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. లీగల్ విషయాలలో నిరాశ ఎదురయ్యే సూచనలు ఉన్నందున అంచనాలను అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. telugu rasi phalalu august 29,tarot card reading vastu tips,astrology predictions august 2026.

Published on: Sat Aug 29, 2026 11:33AM

political-news-img

సొంత పార్టీ ఎమ్మెల్సీపై అసద్ సస్పెన్షన్ వేటు.. ఎందుకంటే?

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం... మజ్లీస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సొంత పార్టీ ఎమ్మెల్సీనే పార్టీ నుంచి సస్సెండ్ చేశారు. ఏఐఎమ్ఐఎమ్ ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. .ఇటీవలి కాలంలో హిజాబ్ వ్యవహారానికి సంబంధించి న్యాయస్థానాలు ఇచ్చిన పలు తీర్పులపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బాహాటంగానే అసంతృప్తి అసహనం వ్యక్తి చేసిన సంగతి విదితమే. మహిళల ఆత్మగౌరవాన్ని ప్రస్తావిస్తూ, ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణకు తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని ప్రకటనలుచేశారు. పలు వేదికలపై మహిళలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి మాట్లాడారు. అయితే అదే సమయంలో.. సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు. ముఖ్యంగా మహిళా సంక్షేమం, గౌరవం గురించి రహమత్ బేగ్ వ్యవహారంపై పార్టీకి స్పష్టమైన ఆధారాలు లభించడంతోనే అధినేత ఓవైసీ ఈ చర్య తీసుకున్నారని మజ్లిస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఇమేజ్‌కు భంగం కలిగించే ఏ చర్యలనైనా ఉపేక్షించేది లేదన్న స్పష్టమైన సందేశాన్నీ, సంకేతాన్ని అసదుద్దీన్ ఈ సస్పెన్షన్ వేటు ద్వారా ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. {AIMIM MLC Suspended, Asaduddin Owaisi, Mirza Rahmath Baig, Hyderabad AIMIM Controversy, AIMIM Action on MLC, Telugu One}

Published on: Sat Aug 29, 2026 10:18AM