రో-కో తగ్గేదేలే.. విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద

స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు.  వీరిద్దరూ కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. వీరిద్దరూ ఆడితే చూడాలని అభిమానులు తపిస్తున్న నేపథ్యంలో వచ్చింది.. విజయ్ హజారే ట్రోఫీ. సఫారీలతో రెండు సెంచరీలతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ ఢిల్లీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తుండగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ముంబై తరఫున ఆడుతున్నారు. ఈ టోర్నీలోనూ రో-కో పరుగుల వరద పారిస్తున్నారు.   జైపుర్ వేదికగా సిక్కింతో బుధవారం (డిసెంబర్ 24) జరిగిన మ్యాచ్లో ముంబై దూకుడు ప్రదర్శింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిక్కిం నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది. అనంతరం 237 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి  దిగిన ముంబై 30.3 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసి ఆటను ముగించింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 94 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, 9 సిక్సులతో 155 పరుగులు చేశాడు. దీంతో రోహిత్ ఫ్యాన్స్ అంతా ముంబై ఛా రాజా అంటూ నినాదాలు చేస్తున్నారు. కాగా హిట్‌మ్యాన్  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇక ఆంధ్రతో జరిగిన మ్యాచ్ లో   ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో వన్ డౌన్‌లో బరిలోకి దిగిన స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 85 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 3 సిక్సులతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలుత బ్యాటింగ్‌కి ఆంధ్ర జట్టు 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకి దిగిన ఢిల్లీ 27.4 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ఆ స్టేజ్‌‌లో కోహ్లీతో కలిసి ప్రియాంక్ ఆర్య(74) రాణించడతో ఢిల్లీ 37.4 ఓవర్లో లక్ష్యాన్ని సునాయాసంగా అందుకుని విజయ సాధించింది

చంద్రబాబు.. విజన్ ఎహెడ్.. 2047 అండ్ బియాండ్!

అందరూ రేపటి గురించి ఆలోచిస్తే.. చంద్రబాబు రెండు  దశాబ్దాల ముందు గురించి ఆలోచిస్తారు. అదీ ఆయన విజన్. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ రోజే ప్రణాళికలు రూపొందిస్తారు. అదీ ఆయన దూరదృష్టి. అందుకే రెండు దశాబ్దాలకు ముందు ఆయన విజన్ 2020 అన్నారు. ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులూ కూడా చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ ను, దూరదృష్టినీ ప్రశంసిస్తారు. రాజకీయ విభేదాలతో మరుగుల పడేయాలని ప్రయత్నించిన నేతలూ ఉన్నారనుకోండి. వారి ప్రయత్నాలు విఫ లమై వారే మరుగుల పడే పరిస్థితికి రావడం మనం చూస్తున్నాం. సంక్షోభాల నుంచీ అవకాశాల అన్వేషించే అభివృద్ధికాముకుడు చంద్రబాబు. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు, సృజన, ఆలోచనలు, సంస్కరణలతో అందరినీ అబ్బుర పరుస్తుంటారు. ప్రభుత్వ కార్యాలయాలలో కంప్యూటర్లు, బయోమెట్రిక్ అటెండన్స్ ఇవన్నీ చంద్రబాబు ముందు చూపునకు నిదర్శనాలే.  వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను, పథకాలను ప్రజలకు అరచేతిలో పెట్టిన ఘనత కూడా చంద్రబాబుదే.  ఇప్పుడు తాజాగా మరింత మెరుగ్గా ప్రజలకు సేవలు అందించేందుకు   స్పీడ్ అఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు చంద్రబాబు.   ఇందు కోసం కార్యాచరణ కార్యాచరణ రూపొందించాలని   ఉన్నతాధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. స్వర్ణాంధ్ర లక్ష్యాలు, 10 సూత్రాల అమలుపై సచివాలయంలో  సిఎస్ విజయానంద్ పాటు ఆయా  శాఖల ఉన్నతాధికారులతో  బుధవారం (డిసెంబర్ 24) భేటీ అయిన చంద్రబాబు  స్పీడ్ అఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానంపై వారికి దిశా నిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానం  ద్వారా పౌరులకు వేగంగా, మెరుగైన సేవలు అందించాలన్న ఆయన ఆ మేరకు కార్యాచరణ రూపొందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సుస్థిర అభివృద్ధి, అదే సమయంలో స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధన కోసం తీసుకోవలసిన చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించిన చంద్రబాబు, ప్రభుత్వ శాఖల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలని, తక్కువ ఖర్చుతో ఇంధనం, విద్యుత్, రవాణా, నీటి భద్రత వంటి సేవలను అందించడమే లక్ష్యంగా ప్రణాళికల రూపకల్పన తదితర అంశాలపై అధికారులకు స్పష్ట మైన లక్ష్యాలను నిర్దేశించారు.  జీరో పావర్టీ, మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, టెక్నాలజీ వంటి అంశాల ఆధారంగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులను ఆదేశించారు.

అట‌ల్, పీవీ.. పోలిక‌లు.. వ్యత్యాసాలు!

ఒకే నెలలో ఇద్ద‌రు దిగ్గ‌జాల జ‌యంతి, వ‌ర్ధంతి. తేడా ఏంటో చూస్తే డిసెంబ‌ర్ 25న వాజ్ పేయి జ‌యంతి. ఈ ఉత్స‌వాలు ఎలా జ‌రుగుతున్నాయి? అదే పీవీ వ‌ర్ధంతి ఎలా జ‌రిగింది? అన్న వ్య‌త్యాసం చూస్తే.. ముందుగా  ఈ ఇద్ద‌రి మధ్యా పోలికలను ఒక సారి గుర్తుచేసుకోవాలి.   అట‌ల్ బీహారీ  వాజ్ పేయి, పీవీన‌ర‌సింహ‌రావు  ఇద్ద‌రిదీ దాదాపు ఒక‌టే వ‌య‌సు అనే కంటే సమకాలీనులు అనడం బెటర్. 1924లో వాజ్ పేయి జన్మించారు.  1921లో పీవీ జన్మించారు. ఇక వీరి రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే.. వాజ్ పేయి 1957లో బ‌ల‌రాంపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించి  ఎంపీగా పార్ల‌మెంటులో అడుగు పెట్టారు. అదే ఏడాది పీవీ మంథ‌ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా  గెలిచారు. అట‌ల్ మొద‌టి నుంచి జాతీయ రాజ‌కీయాల్లోనే రాణిస్తూ రాగా.. పీవీ  తొలుత రాష్ట్ర రాజ‌కీయాలలో రాణించి, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. ఆ తరువాతే కేంద్ర మంత్రిగా జాతీయ రాజకీయాలలోకి అడుగుపెట్టారు. అట‌ల్, పీవీ ఇద్ద‌రూ  క‌వులే. మంచి వ‌క్త‌లే. అయితే వాజ్ పేయి ప్ర‌సంగాల‌కు వ‌చ్చిన గుర్తింపు పీవీకి రాలేద‌నే  చెప్పాలి. వాజ్ పేయి ఆర్ఎస్ఎస్ నేప‌థ్యం క‌లిగి ఉండ‌టం, అది కూడా ప్ర‌తిప‌క్షంలో ఉండ‌టంతో .. ఆయ‌న వ‌క్తృత్వ ప్రతిభ ప్రజలను ఆకట్టుకుంది.   అట‌ల్ ప్ర‌సంగిస్తుంటే, అంద‌రూ శ్ర‌ద్ధ‌గా  వినేవారు. కోట్లాది  మంది అట‌ల్ ప్ర‌సంగాలకు అభిమానుల‌య్యారు. ఇక్క‌డ అధికార విప‌క్షాల‌న్న  తేడా  క‌నిపించేది కాదు. పీవీ కాంగ్రెస్ లో ఉన్నందు వ‌ల్లో ఏమో ఇందిర ముందు మ‌రే నాయ‌క‌త్వం ఎద‌గ‌డానికి వీలు లేని ప‌రిస్థితుల మ‌ధ్య 1991 త‌ర్వాత మాత్ర‌మే పీవీ ప్ర‌సంగాలు ఎక్కువ‌గా వెలుగులోకి వ‌చ్చాయి.   ఇక్క‌డ ఈ ఇద్ద‌రికీ  మ‌ధ్య గ‌ల మ‌రో పోలిక ఏంటంటే.. వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా  ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే..   పీవీ  నాన్ గాంధీ  కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి  ఏలి రికార్డు సృష్టించారు. ఈ విషయంలో  ఇద్దరూ కూడా చరిత్ర సృష్టించారు.  వాజ్ పేయిని ఆయ‌న పార్టీ  ఇత‌ర నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఇప్ప‌టికీ త‌మ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. అదే పీవీ ప‌రిస్థితి అలా లేదు. ఆయ‌న‌కు పార్టీ ఇచ్చిన  గౌర‌వం అంతంత  మాత్ర‌మే. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే 2018 ఆగస్టు 16న అటల్ బిహారీ వాజపేయి మరణించారు. ఆయనకు ఆయన పార్టీ అంతా ఒక్కటై ఘన నివాళులర్పించింది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా  వాజ్ పేయి అంతిమ యాత్రలో పాల్గొని  4 కిలో మీటర్లు నడిచారు. ఆయన పాడె మోశారు.   ఇక పీవీ విషయానికి వస్తే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పీవీ నరసింహారావు మరణించారు.  డిశంబర్ 23, 2004న ఆయన మరణించిన సమయంలో  ఆయన అంతిమ సంస్కారానికి పార్టీ అగ్రనేతలెవరూ హాజరు కాలేదు. ఆయన ఢిల్లీలో మరణించినా, పార్టీ కార్యాలయంలోనికి ఆయన పార్థీవదేహానికి ప్రవేశం లేకుండా పోయింది. ఇక అంత్యక్రియలు కూడా ఢిల్లీలో కాకుండా హైదరాబాద్ లో నిర్వహించారు.   అట‌ల్ బిహారీ వాజ్ పేయి జ‌యంతి సంద‌ర్భంగా ఏపీ అమ‌రావ‌తిలో ఆయ‌న స్మృతివ‌నం ఏర్పాటు చేయ‌డంతో పాటు.. విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్రమాలు నిర్వ‌హిస్తున్నారు.. ఈ కార్య‌క్ర‌మానికి మాధ‌వ్ వంటి బీజేపీ నేత‌ల‌తో పాటు.. ఏపీ  సీఎం చంద్ర‌బాబు  స‌హా ప‌లువురు హాజ‌ర‌య్యారు. ఇదిలా ఉంటే శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా.. ఇప్ప‌టికే ధ‌ర్మ‌వ‌రం నుంచి ఏలూరు వ‌ర‌కూ ప‌లు ప్రాంతాల్లో అట‌ల్ జీ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌లు చేశారు. అట‌ల్- మోడీ సుప‌రిపాల‌నా  యాత్ర సైతం నిర్వ‌హించి అట‌ల్    ప్రేమాభిమానాలు కురిపించారు. కానీ పీవీ విష‌యంలో   ఆయ‌న వ‌ర్ధంతి సంద‌ర్భంగా  ఖ‌ర్గే చిన్న ట్వీట్ తో స‌రిపెట్టారు. ద‌టీజ్ డిఫ‌రెన్స్ బిట్వీన్ కాగ్రెస్ అండ్  బీజేపీ  అంటూ ప‌లువురు ఈ వ్యత్యాసాల‌ను ఎత్తి చూపుతున్నారు.  

అమరావతిలో వాజ్ పేయి విగ్రహం.. ఆవిష్కరించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్   రాజధాని అమరావతిలో   మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ముఖ్య మంత్రి చంద్రబాబు గురువారం (డిసెంబర్ 25) ఆవిష్కరించారు.  డిసెంబర్ 25న వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని అమరావతిలోని వెంకటపాలెంలో చంద్రబాబు ఆవిష్కరిం చారు. రాజకీయాలలో అజాతశత్రువుగా గుర్తింపు పొందిన వాజ్‌పేయి విగ్రహాన్ని అమరావతిలో తొలి విగ్రహంగా నెలకొల్పడం.. ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం పెరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.   వాజ్ పేయీ శతజయంతి ఉత్సవాలలొ భాగంగా ఆయన జయంతి రోజున  వెంకటపాలెంలో  వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. వాజ్ పేయితో తనకు ఉన్న అనుబంధాన్ని నమరువేసుకున్నారు. వాజ్ పేయి హయాంలో ఆంద్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన అందించిన సహాయ సహకారాలను గుర్తు చేసుకున్నారు.  14 అడుగుల ఎత్తులో  అమరావతిలో ఏర్పాటు చేసిన ఈ కాంస్య విగ్రహావిష్కరణ  కార్యక్రమానికి  కేంద్ర మంత్రులు భూపతి శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్,  శివ రాజ్ సింగ్ చౌహాన్, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.  

క‌ర్ణాటకం.. ఎండ్ లెస్!

కొండంత రాగం తీసి కూసింత పాట పడిన సామెతలా తయారైంది క‌ర్ణాట‌క అధికార  మార్పు వ్య‌వ‌హారం. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌ర ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా డీకే శివ‌కుమార్  తనకు సీఎం పీఠం కోసం ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేశారు. అధిష్టానం ఓకే అంటే  త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేదు. ఏ విష‌యం త్వ‌ర‌గా తేల్చండ‌ని సీఎం సిద్ద‌రామ‌య్య సైతం అన్నారు.  ఈ నాన్చుడు ధోర‌ణి ప్రభావం పాల‌న‌పై ప‌డ‌కూడ‌ద‌ని సిద్దరామయ్య చెప్పారు.  కొంత కాలం పాటు బెంగ‌ళూరు టు ఢిల్లీ అన్నట్లుగా ప్ర‌త్యేక ఎపిసోడ్లు న‌డిచాయి. రాహుల్ గాంధీ డీకేకి  స్పెష‌ల్ మెసేజీలు పెట్టారు.  క‌ట్ చేస్తే ఏదో  అనుకుంటే ఏమీ కాలేదు అన్నట్లుగా  క‌ర్ణాట‌క‌లో సీఎం మార్పు జరగలేదు. కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది.  అయితే దీనికి సంబంధించి ఢిల్లీ  క‌ర్ణాట‌క భ‌వ‌న్ లో జ‌రిగిన మీడియా సమావేశంలో డీకే విలేకరులు  సంక్రాంతి త‌ర్వాత చ‌ర్చ‌లు ఉంటాయట నిజమేనా అని అడిగారు. దీనికి డీకే ఒకింత అసహనం, మరింత ఘాటు కలగలిపిన సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో సీఎం మార్పునకు సంబంధించిన చర్చలు  మీడియాలో త‌ప్ప మా మ‌ధ్య జ‌ర‌గ‌డం లేద‌న్న డీకే.. అక్కడితో ఆగకుండా,   అన్ని విష‌యాలు  చెప్పుకునేవి కావ‌ని కూడా వ్యాఖ్యానించారు. దీంతో కర్నా టక సీఎం మార్పు వ్యవహారం  ముగిసిపోయిందా? అన్నచర్చ జోరందుకుంది. దానికి తోడు డీకే మ‌రి కొన్ని కీల‌కమైన  కామెంట్లు కూడా చేశారు. త‌న‌కు అధికారం క‌న్నాకాంగ్రెస్  కార్య‌క‌ర్త‌గా ఉండట‌మే ఎక్కువ ఇంట్ర‌స్టన్నారు. 80వ దశకం నుంచీ  తానిలాగే హ్యాపీగా ఉన్నానన్నారు. తామంతా అంటే, డీకే, సిద్ధూ, ఇత‌ర కార్య‌క‌ర్త‌లంద‌రం క‌ల‌సి కాంగ్రెస్ ఇక్క‌డ అధికారంలోకి రావ‌డానికి  కృషి చేశామ‌నీ.. అలాగ‌ని అధికారంలో భాగ‌స్వామ్యం కావాల‌ని తాను కోరుకోవ‌డం లేద‌ని చెప్పుకొచ్చారు. విదేశాల నుంచి రాహుల్ రాగానే ఆయ‌న్ను వెళ్లి ఇబ్బంది పెట్ట‌లేన‌ని కూడా ముక్తాయించారు.  దీనంత‌టిని బ‌ట్టిచూస్తే డీకే త‌న త‌ర‌ఫు అటెంప్ట్ లు అన్నీచేసి ఫలితం కోసం వేచి చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక్క‌డ పార్టీ ప‌ర‌మైన ఆటంకాలేంట‌ని చూస్తే సిద్ధూని తొలగిస్తే ఒక స‌మ‌స్య‌. ఆయ‌న వ‌ర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా సామాజిక వ‌ర్గాలు పార్టీప‌ట్ల వ్య‌తిరేకత‌ను పెంచుకుంటాయి. ఇక డీకేని నిర్ల‌క్ష్యం చేస్తే.. క‌ష్ట‌ప‌డ్డ వారికి అంద‌లం ద‌క్క‌ద‌న్న సంకేతం వెళ్తుంది. దీంతో అధిష్టానం కూడా సందిగ్దావ‌స్థలో ఉన్నట్లు తెలుస్తోంది.

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను స్వయంగా పర్యవేక్షించిన సీపీ సజ్జనార్

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసు కోకుండా హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టడీ సర్కిల్  వద్ద బుధవారం (డిసెంబర్ 24) అర్ధరాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ స్వయంగా  పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు జరుగుతున్న తీరును పరిశీలించిన సీపీ సజ్జనార్ సిబ్బంది పనితీరును ప్రశంసిస్తూనే.. పలు సూచనలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారుల తో నేరుగా మాట్లాడిన ఆయన, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణ నష్టం, కుటుంబాలపై పడే ప్రభావం గురించి స్పష్టంగా వివరించారు. చదువుకున్న వారు కూడా బాధ్యత లేకుండా ఇలా వ్యవహ రించడం దురదృష్టకరమన్నారు. న్యూ ఇయర్ మరియు క్రిస్మస్ సెలబ్రేషన్స్ నేపథ్యం లో గత వారం రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా  ప్రత్యేక నిఘా, తనిఖీలు ముమ్మరం గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 31 రాత్రి వరకు హైదరాబాద్ నగరమంతటా  స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్  కొనసాగుతుందని  సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 120 ప్రాంతాల్లో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామనీ, ఇందు కోసం అదనంగా  ఏడు ప్లాటూన్ల బలగాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పబ్‌లకు వెళ్లే వారు తప్పనిసరిగా డ్రైవర్ల ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.  డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే వాహనం సీజ్ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదన్నారు. తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తామని సిపి తెలిపారు. 

అత్యవసర పరిస్థితుల్లోనూ వేగంగా స్పందించరా?.. కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఫైర్

దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్సీఆర్ లో వాయుకాలుష్యం తీవ్రత ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. సాక్షాత్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీయే.. హస్తినలో మూడు రోజులుంటే చాలు అలర్జీలు, గొంతు నొప్పి ఖాయమని చెప్పారంటే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది అర్ధమౌతుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని అన్ని పాఠశాలల్లోనూ ఎయిర్ ప్యూరిఫయర్లు ఏర్పాటు చేసి పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఢిల్లీ ప్రభుత్వం నడుంబిగించింది. అయితే ఎయిర్ ప్యూరిఫయర్లపై 18శాతం జీఎస్టీ ఆర్థిక భారంగా పరిణమించింది. ఈ తరుణంలో ఢిల్లీ హైకోర్టులో ఎయిర్ ప్యూరిఫయర్లపై 18 శాతం జీఎస్టీ సమంజసం కాదని పేర్కొంటూ, దానిని ఐదు శాతానికి తగ్గించాలని ఆదేశించాలంటూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కపిల్ మదన్ అనే న్యాయవాది ఈ పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ ను బుధవారం (డిసెంబర్ 24)విచారించిన ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు కాలుష్యం కారణంగా జనం నానా ఇబ్బందులూ పడుతుంటే, అనారోగ్యానికి గురై మరణిస్తుంటే.. ఎయిర్ ప్యూరిఫయర్లపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నది. కాలుష్యాన్ని నియంత్రించి ప్రజలకు స్వచ్ఛమైన గాలి ఎటూ అందించలేరు.. కనీసం  ఎయిర్ ఫ్యూరిఫయర్లపై జీఎస్టీని కూడా తగ్గించలేరా? అంటూ నిలదీసింది. జీఎస్టీ కౌన్సిల్ ఏం చేస్తోంది? వేగంగా నిర్ణయాలు తీసుకోవడం చేతకాదా అని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై  స్పందించేందుకు పక్షం రోజులు గడువు అడిగిన ప్రభుత్వ న్యాయవాదిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రతను గుర్తు చేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.  వీలైనంత త్వరగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై, ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీని తగ్గించాలని ఆదేశిస్తూ కేసు విచారణను శుక్రవారానికి (డిసెంబర్ 26)కు వాయిదా వేసింది.  

బాంబు బెదరింపు.. శంషాబాద్ లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

బాంబు బెదరింపుతో ఓ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. సౌదీ అరేబియా విమానయాన సంస్థకు చెందిన విమానంలో ఆర్డీఎక్స్ బాంబులు పెట్టినట్టుగా శంషాబాద్ విమానాశ్రయానికి గురువారం (డిసెంబర్ 25) ఈమెయిల్ వచ్చింది. దీంతో అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.   ఆ తరువాత విమానంలోని ప్రయాణీకులను దించివేసి బాంబ్ స్క్వాడ్ తో విమానంలో తనిఖీలు చేపట్టారు.  ఇటీవలి కాలంలో విమానాలలో బాంబులు పెట్టామంటూ బెదరింపు ఈ మెయిల్స్ వస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ తరహా బెదరింపులు ఇటీవలి కాలంలో దాదాపు నిత్యకృత్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేయడమే కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటుంన్నారు. తాజాగా మరోమారి బాంబు బెదరింపు మెయిల్ రావడంతో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. 

చంద్రబాబు, పవన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు   క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతిదూత ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకునే క్రిస్మస్  అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని  కోరుకుంటున్నానంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా  క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు చూపిన మార్గంలో  నడవాలని పిలుపునిచ్చారు. నేటి సమాజానికి  ప్రేమ, క్షమ, సహనం, సేవ వంటి విలువలు  అత్యంత అవసరమని పేర్కొన్న చంద్రబాబు.. క్రీస్తు అదే మార్గంలో నడవాలని ఉద్బోధించారని పేర్కొన్నారు.   జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ట్విట్టర్ వేదికగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ క్రైస్తవుల జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ కూడా క్రిస్మస్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ లో ప్రభువైన ఏసుక్రీస్తు జన్మించిన పవిత్ర దినం సందర్భంగా ఆయన చూపిన ప్రేమ‌, శాంతి, స‌హ‌నం పాటిద్దామని పేర్కొన్నారు.  అంద‌రూ ఆనంద‌మ‌యంగా క్రిస్మస్ పండుగ జ‌రుపుకోవాల‌ని  నారా లోకేశ్ పేర్కొన్నారు. 

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది సజీవదహనం

కర్నాటక రాష్ట్రంలో గురువారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది సజీవదహనమయ్యారు. మరో 12 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు నుంచి గోకర్ణకు వెడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి కంటైనర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. బుధవారం బెంగళూరులోని గాంధీనగర్ నుంచి 30 మంది ప్రయాణీకులతో గోకర్ణకు బయలు దేరిన ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గురువారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో  48వ నంబర్ జాతీయ రహదారిపై హిరియూర్ సమీపంలో అదుపుతప్పి కంటైనర్ ను ఢీ కొంది.  వెంటనే బస్సులో మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి.  ఈ ఘటనలో 18 మంది  సజీవదహనం అయ్యారు. మిగిలిన వారు  తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో అందరూ గాఢ నిద్రలో ఉండటంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఓ 12 మంది మాత్రం కిటీకీ అద్దాలు పగుల గొట్టుకుని బయటపడగలిగారు. అయితే వారికి  సైతం తీవ్రమైన కాలిన గాయాలయ్యాయని చెబుతున్నారు. బయటపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళణ వ్యక్తం అవుతున్నది.  ప్రమాద సమాచారం అందిన వెంటనే చిత్రదుర్గ జిల్లా పోలీసులు, అగ్నిమాపక దళం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రికి తరలించారు.  

నకిలీ ఈచలాన్ లింకులతో సైబర్ మోసాలు!

నకిలీ ఈ-చలాన్  చెల్లింపు లింకుల ద్వారా జరుగు తున్న సైబర్ మోసాలపై హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. మీ వాహనానికి ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి అంటూ  సైబర్ నేరగాళ్లు ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ సందేశాల ద్వారా నకిలీ లింకులు పంపిస్తూ ప్రజలను మోసగిస్తున్నారని హెచ్చరించారు. ఈ నకిలీ లింకులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లను పోలి ఉండే విధంగా  ఉండటంతో.. చాలామంది అవి నిజమైనవని నమ్మి క్లిక్  చేసి మోసపోతున్నారని పేర్కొన్నారు. ఆ  నకిలీ లింక్ పై  క్లిక్ చేసిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయాలని, ఆ తరువాత  చెల్లించాల్సిన మొత్తం చూపించి వెంటనే చెల్లింపు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని వెల్లడించారు. చెల్లింపు చేసిన వెంటనే బాధితుల మొబైల్ ఫోన్లలో మాల్వేర్ ఇన్‌స్టాల్ కావడం, బ్యాంకింగ్ వివరాలు హ్యాక్ కావడం జరుగుతోందని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. తెలిపారు. దీని వల్ల బాధితుల ఖాతాల నుంచి అనధికార లావాదేవీలు జరిగి భారీగా డబ్బు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు.  ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే చేయాలని, ఎస్ఎమ్ఎస్ లు, వాట్సాప్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులపై ఎట్టి పరిస్థితు ల్లోనూ క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. ప్రభుత్వ శాఖలు వ్యక్తిగత సందేశాల ద్వారా చెల్లింపు లింకులు పంపవని స్పష్టం చేశారు. ఇలాంటి సైబర్ మోసాలకు గురైన బాధితులు వెంటనే తమ మొబైల్ డేటా లేదా వై-ఫైని నిలిపివేయాలని, బ్యాంకును సంప్రదించి కార్డులు లేదా లావాదేవీలను బ్లాక్ చేయించుకోవాలని సూచించారు. అలాగే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయడంతో పాటు, www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.  

మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్న హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్

పేరు మోసిన హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. గతంలో పోలీస్ కస్టడీ నుండి తప్పిం చుకొని పరారైన ఈ నింది తుడు ప్రస్తుతం తమిళ నాడులో వరస నేరాలకు పాల్పడుతున్నట్లు గా తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడింది. గతంలో హైదరాబాదులోని ప్రిజం పబ్ లో కాల్పులు జరిపి హల్చల్ సృష్టించిన బత్తుల ప్రభాకర్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు పిటి వారెంట్ మీద అతన్ని ఆంధ్రప్రదేశ్ కు తరలించి కోర్టులో హాజరుపరిచారు. సెప్టెంబర్ నెలలో విజయ వాడ కోర్టులో హాజరు పరిచిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్న సమయంలో పోలీసులు మార్గమ ధ్యంలో ఉన్న ఒక హోటల్ వద్ద ఆగారు.అదే సమయంలో బత్తుల ప్రభాకర్ మూత్ర విసర్జనకు అంటూ  పోలీసుల కస్టడీ నుండి తప్పించుకొని పారిపోయాడు. అప్పటి నుండి అతడి కోసం గాలింపు సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో  ఇటీవల బయటకు వచ్చిన ఒక వీడియో పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. బత్తుల ప్రభాకర్ ప్రస్తుతం తమిళనాడులో ఉంటూ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ లను టార్గెట్గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ట్లుగా ఆ వీడియో ద్వారా వెల్లడైంది. ఈ క్రమంలోనే చెన్నైలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బత్తుల ప్రభాకర్ చోరీ కి పాల్పడినట్లు  పోలీసులు గుర్తించారు. ఆ కాలేజీ లాకర్ నుండి 60 లక్షల వరకు నగదు కొట్టేసినట్లుగా పోలీసులు గుర్తించారు.     ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చి హైదరాబాదులోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో దొంగతనానికి వచ్చిన ప్రభాకర్ అక్కడ పోలీసుల నుండి తప్పించుకొని ప్రిజం పబ్బులోకి వెళ్లి కాల్పులు జరిపాడు. అనంతరం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతన్ని తీసుకొని కోర్టులో హాజరు పరిచి రాజమండ్రి జైలుకు తరలిస్తున్న సమయంలో విజయ వాడ నుండి తప్పించుకొని పారిపోయాడు. అలా తప్పించుకొని పారిపోయిన బత్తుల ప్రభాకర్ చెన్నైలో సెటిల్ అయ్యి అక్కడ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలను టార్గెట్ గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు ఆ విధంగా చోరీల ద్వారా సంపా దించిన డబ్బుతో బత్తుల ప్రభాకర్ జల్సాలు చేస్తున్నట్లు సమాచారం. చెన్నై కాలేజీ చోరీకి సంబంధించిన కీలక సీసీటీవీ ఫుటేజ్ పోలీసుల చేతికి చిక్కడంతో బత్తుల ప్రభాకర్ జాడ కనుక్కున్నారు. ప్రస్తుతం అతడిపై మరిన్ని కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నారు. పరారీలో ఉన్న బత్తుల ప్రభాకర్ తమిళనాడులో ప్రత్యక్షమై చోరీలకు పాల్పడుతూ ఉండడంతో అతన్ని పట్టుకునేందుకు తమిళనాడు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ పరారీలో ఉన్న నేరస్తుల్ని అదుపులోకి తీసుకునేందుకు మూడు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. నేర చరిత్ర కలిగిన బత్తుల ప్రభాకర్ పట్టుకోవడం పోలీసులకు ఒక సవాలుగా మారింది.

మాటకు కట్టుబడి.. పవన్ ఇప్పటం పర్యటన

మాట తప్పను, మడమ తిప్పను అని పదే పదే చెప్పుకున్న జగన్ అధికారం దక్కి మాట నిలుపుకునే అవకాశం వచ్చినప్పుడు ముఖం చాటేశారు. ప్రజల కష్టాల సంగతి సరే, వారి ముఖం చూడటం కూడా ఇష్టం లేదన్నట్లుగా రోడ్లకు ఇరువైపులా పరదాలు కట్టుకుని మరీ పర్యటలను సాగించారు. అందుకు భిన్నంగా జనసేనాని పవన్ కల్యాణ్ మాటకు కట్టుబడి నడుచుకుంటున్నారు. తాను అధికారంలో లేనప్పుడు ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేర్చారు.  విషయమేంటంటే.. 2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు. ఆ మాటను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో నిలబెట్టుకున్నారు.  బుధవారం (డిసెంబర్ 24) ఆయన ఇప్పటం గ్రామంలో పర్యటించారు.  ఈ పర్యటనలో భాగంగా ఆయన బండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లారు. ఆమె తన కష్టాలను పవన్ కు కన్నీటితో తెలియజేశారు. గతంలో ఇప్పటంలో పర్యటించిన సమయంలో పవన్  క ల్యాణ్ ఆమెకు ధైర్యం చెప్పారు. తాను తిరిగి వస్తాననీ, ఖచ్చితంగా ఆదుకుంటాననీ ఆమెకు మాట ఇచ్చారు. ఈ పర్యటనలో తాను నాడు ఆమెకు ఇచ్చిన హామీని నెరవేర్చారు.  నాగేశ్వరమ్మకు ఆమె ఇంటి పెద్దకొడుకుగా తాను అండగా నిలుస్తానని మాట ఇచ్చారు. అన్నట్లుగానే తన జీతం నుంచి ఆమెకు నెలనెలా ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. అలాగే మూగవాడైన నాగేశ్వరమ్మ మనవడి చదువుకు అవసరమైన ఆర్థిక సాయం అందించడమే కాకుండా, చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం కూడా ఇప్పిస్తానని చెప్పారు. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న నాగేశ్వరమ్మ కుమారుడి వైద్యం కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటం గ్రామానికి వచ్చి పవన్ ఆత్మీయత చాటారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక జనసేన శ్రేణులైతే పవన్ కల్యాణ్ ది రాజకీయ పర్యటగా కాక బాధ్యత కలిగిన నేతగా పవన్ కల్యాణ్ మానవత్వాన్ని చాటుకున్న తీరుగా అభివర్ణిస్తున్నారు. 

రికార్డుల మోత.. క్రికెట్ చరిత్ర తిరగరాస్తున్న వైభవ్ సూర్యవంశీ

చిచ్చరపిడుగు, యువ సంచలనం వైభవ్ సూర్యవంశి రికార్డుల మోత మోగిస్తున్నాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సులో ప్రొఫెషనల్ క్రికెట్ లో సెంచరీ చేసి రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ..డొమెస్టిక్ క్రికెట్ లో కూడా అదే దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా, బ్యాటుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ.  క్రీజులోకి దిగాడంటే సెంచరీ బాదాల్సిందే అన్నట్లు విరుచుకుపడుతున్నాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో బిహార్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్ సూర్యవంశీ కేవలం  84 బంతుల్లో190 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఈ క్రమంలో రెండు ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్‌ చరిత్ర సృష్టించాడు. కేవలం 36 బంతుల్లోనే తొలి లిస్ట్-ఏ సెంచరీ పూర్తి చేశాడు. ప్రొఫెషనల్ వన్డే టోర్నీలోనూ 14 ఏళ్ల వయసులో శతకం సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. భారతీయులలో వేగవంతమైన లిస్ట్-ఏ శతకాల జాబితాలో వైభవ్ సూర్యవంశీ  రెండో స్థానంలో నిలిచాడు. గత ఏడాది అన్మోల్‌ప్రీత్ సింగ్ 35 బంతుల్లో సెంచరీ చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. శతకం తర్వాత మరింత ఉగ్రరూపం దాల్చిన వైభవ్‌ కేవలం 54 బంతుల్లోనే 150 పరుగుల మార్క్‌ను దాటాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఏబీ డివిలియర్స్‌ (64 బంతులు) పేరిట ఉండేది. డబుల్ సెంచరీ రికార్డును కూడా బద్దలు కొట్టే దిశగా సాగిన వైభవ్‌.. 190 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అయినా అతడి ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. 16 ఫోర్లు, 15 భారీ సిక్సర్లతో  226.19 స్ట్రైక్‌రేట్‌తో ఆడి అరుణాచల్ బౌలర్లను వణికించాడు. వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరు ఇప్పటికే క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా, రాజస్థాన్ రాయల్స్ తరఫున సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డులు నెలకొల్పాడు. అలాగే ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్  ఏ  జట్టు తరఫున 32 బంతుల్లోనే శతకం బాదాడు. విజయ్ హజారే ట్రోఫీ కొనసాగుతున్న కొద్దీ, ఇప్పుడు అందరి చూపు  వైభవ్ సూర్యవంశీ పైనే ఉంది. 14 ఏళ్ల వయసులోనే రికార్డులు బద్దలు కొడుతూ, యువ క్రికెటర్  నిర్వచనాన్నే మార్చేస్తున్నాడు. అతడి ప్రయాణం ఇప్పుడే మొదలైంది… మున్నందు ఆ యువకెరటం దాటాల్సిన  మైలురాళ్లు ఇంకా ఎన్ని ఎదురుచూస్తున్నాయో?

మాజీ మావోల కొత్త పొలిటికల్ పార్టీ?

ఆయుధాలను విసర్జించి లొంగిపోయిన మావోయిస్టులు ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. నక్సల్ రహిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఆయుధాలు విడిచి లొంగిపోయిన మావోయిస్టుల సంఖ్య ఆరు వేలకు పైగానా ఉంటుంది. ఇలా లొంగిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారు. వారు ఆయుధాలు విడిచి లొంగిపోవడమే కాకుండా, ఇంకా ఉద్యమంలో కొనసాగుతున్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలంటూ పిలుపు కూడా ఇచ్చారు. సాయుధ పోరాటానికి కాలం చెల్లిందని ప్రకటించడమే కాకుండా జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి శాంతియుత మార్గాన్ని అనుసరించాలని చెప్పారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయంగా ముందుకు వెడతామని ఆయన అన్న మాటలు మాజీ మావోయిస్టులు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న చర్చకు దారి తీసింది.  లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్ల పల్లి వాసుదేవరావు తదితరుల నేతృత్వంలో ఒక కొత్త రాజకీయపార్టీ ఆవిర్భవించే అవకాశం ఉందని పరిశీలకులు సైతం వారి ప్రకటనలు ఉటంకిస్తూ విశ్లేషిస్తున్నారు. భారత రాజ్యాంగానికి లోబడే వీరు ఏర్పాటు చేసే కొత్త రాజకీయ పార్టీ పని చేసే అవకాశాలున్నాయంటున్నారు.  ఇటీవల మల్లోజుల వేణుగోపాల్ ఒక జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ మావోల కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.   మరో సారి ఆయుధాలు చేపట్టే ప్రశ్నే లేదన్న ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటామని విస్పష్టంగా చెప్పారు.  ఆపరేషన్ కగార్ తరువాత మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు, కీలక అగ్రనేతలు సహా దాదాపు ఆరువేల మంది లొంగిపోయిన సంగతి తెలిసిందే. లొంగుబాటు తరువాత కూడా వీరంతా ఒకరితో ఒకరు టచ్ లోనే ఉణ్నారంటున్నారు. పైగా లొంగిపోయిన వారంతా ప్రస్తుతం వేర్వేరు రాష్ట్రాలలో పోలీసు కేంద్రాలలోనే ఉన్నారు. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన గడువు ముగిసిన తరువాత వీరంతా జనజీనవ స్రవంతిలోకి వస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లోజుల మాటలు మాజీ నక్సల్స్ కోత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారన్న అభిప్రాయం కలిగేలా చేశారు.  మావోయిస్టులు కొత్త రాజకీయ పార్టీ అంటూ ప్రారంభిస్తే.. వారి మేనిఫెస్టో ఎలా ఉంటుంది? గతంలో తిరస్కరించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానానికి అనుగుణంగా వీరు తమ సిద్ధాంతాలకు ప్రజలలో ఎలా ప్రాచుర్యం కల్పిస్తారు అన్నది వేచి చూడాల్సిందే. 

దానం నాగేందర్ రాజీనామాకు రెడీ అయిపోయారా?

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్  అనర్హత వేటుకు సిద్ధమైపోయారా అన్నఅనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా విజయం సాధించిన దానం నాగేందర్.. ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరి.. సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా సికిందరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికలో ఆయన పరాజయం పాలయ్యారు. అయితే తన అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై  అనర్హత వేటు వేలాడుతోంది. మామూలుగా  పార్టీ ఫిరాయింపుల విషయంలో ఆధారాల సేకరణకు సమయం పడుతుంది. అయితే దానం విషయంలో  మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే   కోర్టులో , అలాగే  స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకూ ఆయన స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ లో లేననీ, తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ దానం నాగేందర్ కుండ బద్దలు కొట్టేశారు. అంతే కాంకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలవబోతోందన్నారు. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ జీహెచ్ఎంసీలో 300 స్థానాలలో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ అనర్హత వేటుకు సిద్ధమైపోయారా, లేక నేడో రేపో తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారా? అన్న చర్చ ప్రారంభమైంది.   ఇలా ఉండగా పరిశీలకులు మాత్రం దానం నాగేందర్ స్పీకర్ అనర్హత వేటు వేసే వరకూ ఆగకుండా అంతకు ముందే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు. ఆయన రాజీనామా చేస్తే ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం తథ్యం.  అప్పుడు కాంగ్రెస్ తరఫున మళ్ళీ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఎన్నికవ్వాలన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందంటున్నారు.  

ఫోన్ టాపింగ్ కేసులో పెన్ డ్రైవ్ ప్రకంపనలు

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును కొత్త సిట్ చేపట్టిన తరువాత కీలక పరిణామాలు సంభవిస్తున్నాయి. కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా సిట్ చేతికి చిక్కిన ఒక పెన్ డ్రైవ్ ప్రకంపనలు సృష్టిస్తున్నది.  ఆ పెన్ డ్రైవ్ ఆధారంగా ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని దర్యాప్తు అధికారులు బావిస్తున్నాయి.  మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు.   ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్   ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ కేసులో ప్రభాకర్ రావు తన వాంగ్మూలంలో పదేపదే మాజీ డిజిపి మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రస్తావిం చడంతో అప్పటికే సిట్ అధికారులు మాజీ డిజిపి ని విచారణ చేసి వాంగ్మూలం నమోదు చేశారు. అలాగే  ఫోన్ టాపింగ్ రివ్యూ కమిటీ లో సభ్యులైన మాజీ  సిఎస్ లు సోమేష్ కుమార్, శాంత కుమారి ఇతర అధికారులు తిరుపతి, శేషాద్రి లను కూడా  విచారించారు. ఇక  మంగళవారం  ఈ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారించాలని సిట్ నిర్ణయించింది. కెసిఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా నోటీసులు ఇవ్వడానికి సిట్ అధికారులు సిద్ధమవుతున్నట్లు  తెలుస్తున్నది.   ఇక బుధవారం(డిసెంబర్ 24) సిట్ విచారణలో వెలుగులోకి వచ్చిన  పెన్ డ్రైవ్ తీవ్ర కలకలం సృష్టిస్తున్నది.  ఈ కేసుకు సంబంధించిన ఈ పెన్ డ్రైవ్  కీలక ఆధారంగా మారను న్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు తన పదవీకాలంలో ఫోన్ టాపింగ్ కు సంబంధించిన కీలక వివరాలను ఈ పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసి ఉంచినట్లుగా సిట్ గుర్తించింది. ఈ పెన్ డ్రైవ్ లో వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ప్రధానంగా  రాజకీయ నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన ఫోన్ నెంబర్లతో పాటు ప్రొఫైల్స్ కూడా ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ పెన్ డ్రైవ్ డేటాను ప్రభాకర్ రావు ముందు ఉంచి సిట్ అధికారులు విచారిస్తున్నట్లు  తెలుస్తోంది.  సిట్ అధికారులు ఈ పెన్ డ్రైవ్ ద్వారానే ఫోన్ టాపింగ్ గురైన ఫోన్ నెంబర్ల ను ఇప్పటికే  గుర్తించారు. ఫోన్ టాపింగ్ వ్యవహారం కొనసా గుతున్న సమయంలో పోలీసుల చేతికి చిక్కకుండా ప్రభాకర్ రావు టీమ్ అన్ని ఆధారాలు ధ్వంసం చేసినా కూడా ఈ పెన్ డ్రైవ్ ప్రత్యేక దర్యాప్తు బృందం చేతికి చిక్కడం దర్యాప్తులో కీలక మైలురాయిగా మారింది. ఈ కేసు ఛేదించడానికి  పెన్ డ్రైవ్ సాలిడ్ ఎవిడెన్స్ అని సిట్ అధికా రులు చెబుతున్నారు.  ప్రభాకర్ రావు నుండి ఇంకా పూర్తి వివరాలు సేకరించేందుకు ఎల్లుండి వరకూ  విచారించడానికి సమయం ఉందని అధికారులు తెలిపారు.  

ప్రధాని పదవికి రాహుల్ అనర్హుడా?.. రాబర్ట్ వధేరా మాటల ఆంతర్యమేంటి?

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సొంత కుటుంబం నుంచే వ్యతిరేక సెగ తగులుతోందా? ఇటీవలి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం తరువాత ఇండీ కూటమి నేతలు రాహుల్ నాయకత్వంపై ఒకింత ఆసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా పలువురు నేతలు రాహుల్ నాయకత్వ సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాహుల్ సొదరి ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వధేరా కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. నేరుగా రాహుల్ పేరు ఎత్తకుండానే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  పార్టీలో ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వికి త‌న భార్య, వ‌య‌నాడ్‌  ఎంపీ ప్రియాంక గాంధీ అర్హురాల‌ంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక పెను చీలికకు దారి తీసే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.    రాబర్ట్ వధేరా.. ప్రియాంక వధేరా లోక్ సభలో బలమైన గళం వినిపించారనీ,  ఆమెకు ప్రధాన మంత్రి పదవి చేపట్టడానికి అవసరమైన అన్ని అర్హతలూ ఉన్నాయనీ అన్నారు. అక్కడితో ఆగకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటిస్తేనే దేశంలో కాంగ్రెస్ కు ఆదరణ పెరుగుతుందని, అప్పుడే దేశంలో కాంగ్రెస్ విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకోగలుగుతుందనీ రాబర్ట్ వధేరా అన్నారు.  లోక్ సభ శీతాకాల సమావేశాల ముగింపు సందర్భంగా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే  కొందరు  ఎంపీల నంచి కూడా వచ్చిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రాబర్ట్ వధేరా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయమనీ, వాటితో పార్టీకి సంబంధం లేదంటూ కొందరు సీనియర్లు వివాదం పెరగకుండా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇక ప్రియాంక వధేరా గాంధీ అయితే, తన భర్త వ్యాఖ్యలపై స్పందించకుండా మౌనం వహించారు.  దీనిపై రాహుల్ ఏ విధంగా స్పందిస్తారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది.