జగన్ బ్యాండేజీ తీసేశారు.. సెప్టిక్ భయమే కారణమా?!

జగన్ గులకరాయి దాడిలో గాయపడి రెండు వారాలుగా కంటికి వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఎట్టకేలకు తీసేశారు. హఠాత్తుగా ఆయన బ్యాండేజీ తీయడానికి ఆయన బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత సెప్టిక్ అవుతుంది జాగ్రత్త అన్నయ్యా అని చేసిన హెచ్చరికే కారణమా? అంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. మేమంతా సిద్ధం అంటూ ఆయన చేపట్టిన బస్సుయాత్ర విజయవాడలో సాగుతున్న సమయంలో ఆయనపై రాయి దాడి జరిగింది. ఆ దాడిలో ఆయన కంటి పైభాగాన గాయమైంది.   ఆ దాడిని హత్యాయత్నంగా అభివర్ణిస్తూ సెంటిమెంట్ ను పండించి ఎన్నికల గండం గట్టెక్కాలని వైసీపీ విశ్వ ప్రయత్నం చేసింది. కోడికత్తి దాడిలా ఈ దాడి కూడా జగన్ పై ప్రజలలో సానుభూతి పొంగి పొర్లిపోయి ఓట్లు రాలుస్తుందని భావించింది. అయితే వైసీపీ ప్రయత్నం నవ్వుల పాలైందది. జగన్ ప్రతిష్ఠ దిగజారింది. ఆ దాడి జగన్ చేత జగన్ కోసం జగనే చేయించుకున్న దాడి అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. వాటిని వేటినీ పట్టించుకోకుండా ఆ దాడి హత్యాయత్నమేననీ, దీని వెనుక ఉన్నది చంద్రబాబు, తెలుగుదేశమేననీ వైసీపీ నేతలు జనాలను నమ్మించడానికి శతధా ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ దాడి కేసులో తెలుగుదేశం నేతను ఇరికించడానికి చేసిన ప్రయత్నమూ విఫలమైంది. దాడి విషయంలో భద్రతా వైఫల్యం ఏమీ లేదనీ, పోలీసుల వైఫల్యం అస్సలు లేదనీ ప్రభుత్వ సలహాదారు మీడియా ముందుకు వచ్చి మరీ నెత్తీ నోరూ బాదుకుని చెప్పారు. అయినా  ఎన్నికల సంఘం నమ్మలేదు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ కమిషనర్ ఆఫ్ పొలీస్ పై బదలీ వేటు వేసింది. ఎన్నికలకు సంబంధం లేని విధులను కేటాయించాల్సిందిగా ఆదేశించింది.  దీంతో జగన్ పరిస్థితి వ్రతమూ చెడింది, ఫలితమూ దక్కలేదన్నట్లు తయారైంది. దానికి తోడు కుట్లు పడేలా అయిన గాయానికి బ్యాండ్ ఎయిడ్ తో జనం ముందుకు వచ్చి ఏదో కాస్తయినా సెంటిమెంటును పిండుకుందామనుకున్నారు. అయితే గాయం తగిలిన వెంటనే వేసిన బ్యాండ్ ఎయిడ్ కూ డాక్టర్ల బృందం చికిత్స తరువాత వేసిన బ్యాండ్ ఎయిడ్ కు సైజులో వ్యత్యాసం ఉండటంతో జగన్ గాయంపై నెటిజన్లు సెటైర్లు వేశారు.   ఆ ట్రోలింగ్ రోజురోజుకూ పెరుగుతుండటం కారణమో, వైద్యులు సరైన సలహా ఇవ్వలేదా? బ్యాండేజీ ఎక్కువ రోజులు ఉంటే గాయం మానదు, సెప్టిక్ అవుతుంది జాగ్రత్త అంటూ డాక్టర్ సునీత చేసిన హెచ్చరికతో భయపడో తెలియదు కానీ జగన్ మొత్తానికి శనివారం బ్యాండ్ ఎయిడ్ లేకుండా దర్శనమిచ్చారు. సరే ఇక్కడ విశేషం ఏమిటంటే రాయిదాడిలో తగిలిన గాయానికి కొన్ని కుట్లు కూడా పడ్డాయని చెప్పుకున్న జగన్ రెండు వారాల తరువాత ఆ బ్యాండ్ ఎయిడ్ తీసేసిన తరువాత గాయం జరిగిన ప్రాంతంలో చిన్న మచ్చ, గీత కూడా లేకపోవడం విశేషం. ఈ జగన్మాయ ఏమిటి ముఖ్యమంత్రిగారూ అంటూ సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.  

పిఠాపురంలో పవన్ కు మద్దతుగా చిరు ప్రచారం? మెగా హీరోలందరూ కూడా!

రాష్ట్రంలోని హాట్ సీట్లలో ముందుగా చెప్పుకోవలసింది జనసేన అధినేత పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా వంగా గీత రంగంలో ఉన్నారు. జనసేనాని ఓటమే లక్ష్యంగా జగన్ ఈ నియోజకవర్గ బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డిలకు అప్పగించారు. ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అయితే గతంలోలా కాకుండా పవన్ కల్యాణ్ ఇప్పుడు తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారాన్ని పర్యవేక్షించడంతో పాటు తాను కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ రోడ్ షోలతో జనాలకు దగ్గరౌతున్నారు. చంద్రబాబుతో కలిసి రాష్ట్రంలోని బహిరంగ సభలలో పాల్గొనేందుకు మాత్రమే జనసేనాని నియోజకవర్గం వదిలి వెడుతున్నారు. అలా నియోజకవర్గంపై పూర్తి దృష్టి కేంద్రీకరించి విజయమే లక్ష్యంగా అగుడులు వేస్తున్నారు. అలాగే సినీ పరిశ్రమకు చెందిన పలువురు కూడా జనసేనాని గెలుపు లక్ష్యంగా పిఠాపురంలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. జబర్దన్ కమేడియన్లు ఆది, గెటప్ శ్రీను, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ తదితరులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే మెగా హీరో వరుణ్ తేజ్ కూడా శనివారం నియోజకవర్గంలో తన చిన్నాన్న తరఫున ప్రచారం చేశారు.  ఇవన్నీ ఒకెత్తైతే మెగాస్టార్ చిరంజీవి త్వరలో పిఠాపురంలో  పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేయనుండటం కూటమికి గట్టి బలం కానుంది. అయితే చిరంజీవి ప్రచారానికి వస్తారా అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి. చాలా కాలంగా చిరంజీవి రాజకీయ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నది లేదు. ఏవో సినిమాలలో రాజకీయాలను నేను వదిలినా అవి తనను వదలడం లేదన్న డైలాగులు వినా చిరంజీవి ప్రత్యక్షంగా రాజకీయ ప్రసంగాలు చేసిన సందర్భం కూడా లేదు. అయితే ఇటీవల మాత్రం చిరంజీవి బహిరంగంగా కూటమి అభ్యర్థి సీఎం రమేష్ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ కు మద్దతుగా చిరు ప్రచారం చేయడం ఖాయమని మెగా అభిమానులు గట్టిగా చెబుతున్నారు. చిరు ప్రచారంతో పిఠాపురంలో జనసేనానికి ఇక తిరుగే ఉండదని అంటున్నారు. చిరు ప్రచారం ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూటమికి పెద్ద బూస్ట్ అవుతుందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద రానున్న రోజులలో సినీ రంగం నుంచి పలువురు ప్రముఖులు, ముఖ్యంగా మెగా హీరోలు జనసేనానికి మద్దతుగా ప్రత్యక్షంగా ప్రచారంలోకి దిగే అవకాశాలున్నాయని అంటున్నారు.   

కేటీఆర్ విశ్వాసం లేని డాష్.. డాష్..!

శనివారం నాడు మాజీ టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. ఈ ఉత్సవం సోషల్ మీడియాలో తప్ప మరెక్కడా జరిగిన దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికే చాలావరకు ఖాళీ అయిపోగా, అక్కడక్కడ మిగిలి వున్న పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్లర్లో కొన్ని లైన్లు పోస్టు చేశారు. తమ పార్టీ పుట్టుక సంచలనం అని, దారిపొడవునా రాజీలేని రణం.. అని ఏవేవో సోత్కర్ష లాంటి పదాలు పోస్టు చేశారు. ఇండియాలో ఎవరూ ఇంకొకరి డబ్బా కొట్టరు.. ఎవరి డబ్బా వాళ్ళే కొట్టుకోవాలి కాబట్టి కేటీఆర్ ట్విట్టర్లో సొంతడబ్బా కొట్టుకున్నారని అనుకోవచ్చు. కానీ ఆయన అందులో వాడిన ఒక వాక్యం చూస్తుంటే, కేటీఆర్ని విశ్వాసం లేని డాష్.. డాష్ అన్నా తప్పులేదని అనిపిస్తోంది. ఇంతకీ ఆ పదం ఏమిటంటే, ‘పరపీడన చెర విడిపించిన ఉద్యమ జెండా’.. ఈ పదం రాయడానికి సిగ్గు లేకుండా అయినా వుండాలి.. లేదా బుద్ధి అయినా లేకుండా వుండాలి. కేటీఆర్ తండ్రి రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినప్పుడు తెలుగువాళ్ళందరి మీద అధికారం చెలాయించాడా లేక తెలంగాణ ప్రాంతం మీదే అధికారం చెలాయించాడా? తెలంగాణ ప్రాంతానికి చెందిన మిగతా మంత్రులుగానీ, ముఖ్యమంత్రులుగానీ తెలంగాణ ప్రాంతం మీదే అధికారం చెలాయించారా? బ్రిటీష్ వాళ్ళ మీద ఉపయోగించిన ‘పరాయి పాలన’ అనే పదాన్ని తోటి భారతీయుల మీద ఉపయోగించడమంత దుర్మార్గం మరొకటి వుండదు. అలాంటి దుర్మార్గాలు ఎన్నో చేసిన పాపం మూటగట్టుకుంది కేసీఆర్ ఫ్యామిలీ.  మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ రాష్ట్రమంతా తుడిచిపెట్టుకునిపోయింది. ఆ పార్టీకి హైదరాబాద్‌లో ఒక్క స్థానం తప్ప అన్ని స్థానాలు దక్కాయి. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రావాళ్ళు ఓట్లు వేయబట్టే బీఆర్ఎస్ పరువు హైదరాబాద్‌లో అయినా మిగిలింది. తెలంగాణ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో వున్న తెలంగాణ స్థానికులు అందరూ బీఆర్ఎస్‌ని బొందపెడితే, హైదరాబాద్‌లో తమ పార్టీ పరువు నిలిపింది ఆంధ్రావాళ్ళేననే విశ్వాసం కూడా లేని డాష్ డాష్ కేటీఆర్‌కి పార్లమెంట్ ఎన్నికలలో ‘పరాయి’ వాళ్ళు బుద్ధి చెబుతారు.

నిప్పుల కుంపటి తెలంగాణ!

వచ్చే నాలుగు రోజులు తెలంగాణ నిప్పుల కుంపటిగా మారబోతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర  ప్రాంతాలు నిపుల గుండంగా మారనున్నాయని పేర్కొంది.  మొత్తంమీద ఈ నాలుగు రోజులూ రాష్ట్రంలో సాధారణం కంటే ఐదు నుంచి ఆరు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. మండే ఎండలకు తోడు వేడి గాలులు కూడా వీస్తాయనీ, వడదెబ్బ ప్రమాదం హెచ్చుగా ఉంటుందనీ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉంటే మేలని పేర్కొంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉంటాయనీ, ఉక్కపోత తీవ్రత ఎక్కువ అవుతుందని తెలిపింది.   ఇక వచ్చే నెలలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.  ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకూ నమోదౌతున్నాయనీ, రానున్న రోజులలో ఇవి 50 డిగ్రీలకు చేరే అవకాశాలున్నాయనీ పేర్కొంది.   

వైసీపీ నేతల నుంచే లక్ష్మీనారాయణకు ముప్పు!

విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో వున్న జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్‌పీ) అధ్యక్షుడు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణకు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని వుందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన విశాఖ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్‌ని కలసి ఆయన వినతిపత్రం సమర్పించారు. తన ప్రాణాలకు వైసీపీ నాయకుల నుంచి ముప్పు వుందని, తనకు ఎలాంటి హాని జరిగినా నంబాల రాజేష్ కుమార్, విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కేకే రాజు బాధ్యులని లక్ష్మీనారాయణ ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. నంబాల రాజేష్ కుమార్, వీవీ రాజు, గాలి జనార్దనరెడ్డి కలసి వున్న ఫొటోను కూడా ఈ సందర్భంగా ఆయన పోలీసులకు అందించారు. ‘‘నేను సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా వున్న సమయంలో అనధికార మైనింగ్ విషయంలో గాలి జనార్దనరెడ్డిని విచారించాను. ఆ సమయంలో గాలి జనార్దనరెడ్డికి సన్నిహితుడిగా ప్రచారంలో వున్న నంబాల రాజేష్‌కుమార్ కూడా విచారణను ఎదుర్కొన్నారు. ‘నా బాస్ గాలి జనార్డనరెడ్డిని లక్ష్మీనారాయణ చాలా ఇబ్బంది పెట్టారు. ప్రతీకారం తీర్చుకుని మా బాస్‌కి బహుమతి ఇస్తాను. నాకు కేకే రాజు అండగా వుంటారు’ అంటూ ఇటీవల జరిగిన ఓ సమావేశంలో నంబాల రాజేష్ అందరి ముందూ బాహాటంగానే మాట్లాడారు’’ అంటూ లక్ష్మీనారాయణ తన వినతిపత్రంలో పేర్కొన్నారు. లక్ష్మీనారాయణకు ఏదైనా ముప్పు ఏర్పడకముందే పోలీసులు స్పందించాల్సిన అవసరం వుంది.

ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు 

పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వం  బార్లు, రెస్టారెంట్లలో  అక్రమంగా కార్యకలాపాలు  నిర్వహిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపింది.  బిఆర్ఎస్ హాయంలో యదేచ్చగా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న వారిని ముచ్చెమటలు పట్టిస్తోంది.   బేగంపేటలోని ప్రముఖ ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ను ఎక్సైజ్ అధికారులు రద్దు చేశారు. లైసెన్స్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బార్ లో నిబంధనలకు విరుద్ధంగా యువతుల చేత ఆశ్లీల నృత్యాలు చేయించడం, యువకులను రెచ్చగొట్టడం, చెవులు చిల్లులు పడే డీజే శబ్దాల హోరులో మద్యం తాగుతూ చిందులు వేయడం వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 3న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపారు. ఆ సందర్భంగా బార్ నిర్వాహకులతో పాటు మొత్తం 107 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 30 మంది యువతులు, 60 మంది యువకులు, 17 మంది నిర్వాహకులు ఉన్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ కేసును బేగంపేట పోలీసులకు అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన బేగంపేట పోలీసులు బార్ లో అశ్లీల కార్యకలాపాలు జరుగుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా బార్ ను నిర్వహిస్తున్నారని నిర్ధారించారు. ఆధారాలు సహా ఎక్సైజ్ శాఖ అధికారులకు నివేదికను ఇచ్చారు. ఈ క్రమంలో ఊర్వశి బార్ లైసెన్స్ ను ఎక్సైజ్ శాఖ అధికారులు రద్దు చేశారు.

ఎన్నికల ప్రచారంలో విక్టరీ వెంకటేష్

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి వేసవి ఎండలను మించిపోయింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తై పోలింగ్ ఇక రోజుల వ్యవధిలోకి రావడంలో పార్టీలూ, పోటీలో ఉన్న అభ్యర్థులూ తమ ప్రచారాన్ని మరింత హోరెత్తించడానికి సమాయత్తమౌతున్నారు. పార్టీల అధినేతలు రోడ్ షోలు, భారీ బహిరంగ సభలతో ప్రచారంలోకి దూసుకుపోతున్నారు. సహజంగా తమ ప్రచారానికి సినీగ్లామర్ ను కూడా జోడించాలని సినీ పరిశ్రమతో సంబంధాలు, బంధుత్వాలు ఉన్న అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే టాలీవుడ్ కు చెందిన ప్రముఖులను ప్రచారంలోకి దింపుతున్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా తమ బంధువులు, స్నేహితుల కోసం ప్రచారం చేయడానికి ముందుకు వస్తున్నారు.  ఇందులో భాగంగానే చీరాల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న ఎంఎం కొండయ్యయాదవ్ తరఫున నటుడు నిఖిల్ సిద్ధార్థ  ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్ షోలో కూడా పాల్గొని తెలుగుదేశం కూటమి అభ్యర్థికి ఓటేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు. ఇక పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ కోసం ప్రచారం చేసేందుకు పలువురు నటులు రంగంలోకి దిగారు. ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్, కమేడియన్ ఆది తదితరులు పిఠాపురంలో మకాం వేసి జనసేనాని తరఫున ప్రచారం చేస్తున్నారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా తన బాబాయ్ పవన్ కల్యాణ్ కు మద్దతుగా శుక్రవారం పిఠాపురంలో సందడి చేశారు. రానున్న రోజులలో మెగా హీరోలంతా కూడా పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది. అలాగే మెగా హీరో చిరంజీవి కూడా పవన్ కల్యాణ్ కు మద్దతుగా పిఠాపురంలో ప్రచారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి.  అదే విధంగా సాధారణంగా రాజకీయాలకూ పూర్తిగా దూరంగా ఉండే వెంకటేష్ కూడా ఈ సారి ఎన్నికల ప్రచార రంగంలో  కీలకంగా వ్యవహరించనున్నారు. ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పోటీలో ఉన్న తన బంధువుల తరఫున ప్రచారంలో పాల్గొననున్నారు. తెలంగాణలో ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన వియ్యంకుడు రామసహాయం రాఘవ రెడ్డి తరఫున వెంకటేష్ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని కైకులూరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివస్ తరఫున కూడా వెంకటేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కామినేని శ్రీనివాస్ వెంకటేష్ సతీమణి నీరజకు స్వయాన మేనమామ. దీంతో తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల బరిలో నిలిచిన తన సమీప బంధువుల తరఫున వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. 

ఎపిలో పించన్ల పంపిణీ పట్ల  కేంద్రఎన్నికల సంఘం అసంతృప్తి 

పించన్ల పంపిణీ విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల కేంద్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు తగిన మార్గదర్శకాలను సూచించింది పింఛన్ దారులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పెన్షన్లను అందించాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించింది. పింఛన్ సహా, నగదు బదిలీ పథకాలకు సంబంధించి మార్చి 30న జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. తమ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి స్పష్టం చేసింది. పెన్షన్ల పంపిణీకి శాశ్వత ఉద్యోగులకు మాత్రమే వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇంటింటికీ పెన్షన్లను పంపిణీ చేసేందుకు వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఆదేశించింది. పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. లబ్ధిదారులు కూడా చాలా ఇబ్బందులకు గురైనట్టు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. శాశ్వత ఉద్యోగులు, ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయవచ్చని గత మార్గదర్శకాల్లోనే సూచించామని తెలిపింది.

హరీష్‌రావు రాజీడ్రామాలు చూసి జనం నవ్వుతున్నారు!

తెలంగాణలో అధికారం కోల్పోయిన షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోని తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్ గత కొన్ని రోజులుగా జనంలోకి వచ్చి ఆడుతున్న డ్రామాలు చూస్తూ జనం ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్రెడీ కొద్దిరోజులు తండ్రి, అన్నలతో కలసి డ్రామాలాడిన బాలనటి కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో రెస్టు తీసుకుంటోంది. ఇప్పుడు ఈ డ్రామా కంపెనీలోకి మరో ఛైల్డ్ ఆర్టిస్టు ఎంటరయ్యాడు. ఆ డ్రామా ఆర్టిస్టు మరెవరో కాదు... కేసీఆర్ ముద్దుల మేనల్లుడు హరీష్ రావు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ఫ్యామిలీ ఎన్ని డ్రామాలు ఆడినా, ఉద్యమ స్ఫూర్తితో వున్న జనం నమ్మారు. ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణ కోసమే కదా అని క్షమించారు. పదేళ్ళు అధికారంలో అహంకారంతో వ్యహరించినప్పుడు సమయం కోసం వేచి చూశారు. ఆ సమయం రాగానే గద్దె దించారు. అహంకారం, డ్రామాలు ఎప్పుడూ పనికిరావన్న విషయాన్ని తెలుసుకోలేని ఈ కుటుంబం ఇంకా తమ పంథా మార్చుకోకుండా జనంలో పరువు పోగొట్టుకుంటోంది. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఆగస్టు 15వ తేదీ లోపల చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను పట్టుకుని హరీష్ రావు డ్రామా క్రియేట్ చేశాడు. రేవంత్ రెడ్డి తాను చెప్పినట్టు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరాడు. అయితే రాజీనామా లేఖ రెడీగా పెట్టుకో, ఆగస్టు 15 తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా వుండు అని రేవంత్ రెడ్డి చెప్పడంతో హరీష్ రావు ఆత్మరక్షణలో పడ్డాడు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తే తాను తట్టాబుట్టా సర్దుకోవాల్సి వస్తుందని అర్థం చేసుకుని వెంటనే ప్లేటు తిప్పేశాడు. అయితే, నేను నా రాజీనామా లేఖ అమరవీరుల స్థూపం దగ్గరకి తెస్తా.. నువ్వూ నీ రాజీనామా లేఖ తీసుకుని  శుక్రవారం నాడు అక్కడకి రా అని సవాల్ విసిరాడు. ముఖ్యమంత్రి హోదాలో వున్న వ్యక్తి రాజీనామా లేఖ తీసుకుని అమరవీరుల స్థూపం దగ్గరకి వస్తాడా? కేసీఆర్ గవర్నమెంట్ అధికారంలో వున్నప్పుడు అలా ఎప్పుడైనా వచ్చిన దాఖలాలు వున్నాయా? ముఖ్యమంత్రి పరామర్శించాల్సిన సందర్భాల్లో అయినా ఆయన వెళ్ళిన చరిత్ర వుందా? వాళ్ళు మాత్రం ముఖ్యమంత్రి రాజీనామా లేఖ పట్టుకుని వాళ్ళు చెప్పిన దగ్గరకి రావాలి. ముఖ్యమంత్రి ఎలాగూ రాడని తెలుసు, శుక్రవారం నాడు హరీష్ రావు అమరవీరుల స్థూపానికి ఏదో ముక్కుబడిగా నాలుగు పూలు చల్లేసి, ఒక నమస్కారం పారేసి సీఎం అక్కడకి రాలేదని ఫీలయ్యారు. స్పీకర్‌కి రాసిన రాజీనామా లేఖను అక్కడే వున్న మీడియా వాళ్ళకి ఇచ్చారు. రాజీనామా లేఖ అంటే స్పీకర్ ఫార్మాట్లో వుండాలి. తనకు చేతికి వచ్చినట్టు రాసి ఇదే రాజీనామా లేఖ అనుకో అంటే కుదరదు. హరీష్ రావు తన రాజీనామాలో ఏదేదో చేట భారతం అంతా రాశారు. ప్రస్తుతానికి ఇలా చేటభారతం రాజీనామా లేఖ రాశానని, రుణ మాఫీ చేశాక స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ ఇస్తానని, ఆ తర్వాత ఉప ఎన్నికలో పోటీ కూడా చేయనని ప్రకటించారు. ఈ తిరకాసు వ్యవహారమంతా ఎందుకు? ఆ ఇచ్చేదేదో స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా లేఖ ఇవ్వచ్చుగా..  మొన్నటి వరకు ‘ఆగస్టు 15 లోగా 2 లక్షల రైతు రుణ మాఫీ’ అనే పాయింట్ మీదే హడావిడి చేసిన హరీష్ రావు.. ఇప్పుడు అమరవీరుల స్థూపం దగ్గర ఇంకా ఏవేవో అంశాలను ప్రస్తావించి ఇవన్నీ నెరవేరిస్తేనే నా రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో ఇస్తా అని మెలిక పెట్టాడు. రాజీనామా చేసే దమ్ము లేనప్పుడు రాజీనామా సవాళ్ళు విసరసం ఎందుకు.. ఇప్పుడు రాజీనామా గండం నుంచి బయటపడటానికి పనికిరాని నాటకాలన్నీ ఆడటం ఎందుకు? రేపు ఆగస్టు 15 లోపు సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీని చేయడంతోపాటు ఇంకెన్ని హామీలను అమలు చేసినా హరీష్ రావు ఏదో మెలికో, తిరకాసో పెట్టి రాజీనామా చేయకుండా తప్పించుకుంటాడని అందరికీ తెలిసిన విషయమే. ఈ మనుషులు ఎప్పటికి మారతారో!

ప్రచారవ్యూహం లేక వైసీపీ మల్లగుల్లాలు.. జగన్ చేతులెత్తేశారా?

ఎప్పుడైనా ఎన్నికల వేళకి అధికార పార్టీలో  ఒక స్పష్టత ఉంటుంది. అధికారంలో ఉన్న కాలంలో చేసిన అభివృద్ధీ, ప్రజలకు అందించిన సంక్షేమం వివరించి ఓట్లు అడగడానికి వెసులుబాటు ఉంటుంది. అయితే వాస్తవంగా అధికారంలో ఉన్న కాలంలో అభివృద్ధి సంక్షేమాలపై ప్రభుత్వం ప్రజలమెప్పు పొందిందా లేదా అన్నది ఓటర్లు తమ ఓటు ద్వారా తీర్పు ఇస్తారు. అది వేరే సంగతి. కానీ అధికారంలో ఉన్న పార్టీకి మాత్రం ప్రచారం చేసుకునే విషయంలోనూ, పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ విపక్షం కంటే ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. అలాగే అసమ్మతి బెడదా తక్కువ ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి పూర్తి రివర్స్ లో ఉంది. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీలో గాభరా కనిపిస్తోంది. ఓటమి తప్పదన్న బెదురు కానవస్తోంది. అదే సమయంలో విపక్షంలో ధీమా కనిపిస్తోంది. జనం మావైపే ఉన్నారన్న భరోసా కానవస్తోంది. ఇందుకు కారణాల గురించి చెప్పుకునే ముందు విపక్షంగా తెలుగుదేశం ఓంటరిగా పోరు చేయడం లేదు. జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగింది. అలాంటి సమయంలో భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటు, ఆ సర్దుబాటు కారణంగా అనివార్యంగా కొన్ని త్యాగాలకు సిద్ధపడటం, అందు వల్ల ఆశించిన సీటు దక్కక నేతల్లో పెచ్చరిల్లే అసంతృప్తి ఇన్నిటిని సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీ ఆ ఇబ్బందులు, ఇరకాటాలన్నిటినీ అలవోకగా దాటేసింది. అదే సమయంలో అధికారంలో ఉండటం చేత ఉన్న సానుకూలాలన్నిటినీ వైసీపీ చేజేతులా ప్రతికూలంగా మార్చేసుకుంది.  అందుకే  ఏపీలో  జనసేన, బీజేపీలతో పొత్తు కుదుర్చుకుని, సీట్ల సర్దుబాటు చేసుకుని, ఆ కారణంగా పార్టీలో తలెత్తిన అసమ్మతిని బుజ్జగించి పార్టీలో అసంతృప్తి అనవాలే లేకుండా చేసుకుని ధీమాగా కనిపిస్తుంటే.. అధికార వైసీపీలో  మాత్రం ఆందోళన, గందర గోళం కనిపిస్తోంది.  పార్టీ టికెట్ లభించిన అభ్యర్థులు ధైర్యంగా ప్రజలలోకి వెళ్లి ప్రచారం చేసుకోలేని పరిస్థితి కానవస్తోంది. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ బస్సు యాత్రకు సైతం జనం స్పందన కానరాక పార్టీలో  ఓటమి భయం కనిపిస్తోంది.  ఏపీలో పోలింగ్ తేదీ మే 13. అంటే మరో 17 రోజులలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికీ వైసీపీ ప్రచారం జోరందుకోలేదు. విరామాలతో సాగిన జగన్ బస్సు యాత్ర తప్ప అధికార పార్టీ ప్రచారం జోరు పెంచింది లేదు. మరో వైపు తెలుగుదేశం కూటమి మాత్రం ప్రచారం జోరు పెంచింది. తెలుగుదేశం, జనసేన అధినేతలు ఉమ్మడి ప్రచారంతో పాటుగా ఎవరికి వారుగా కూడా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. వారి ఎన్నికల ప్రచార సభలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు.  అధికార వైసీపీ మాత్రం ప్రచార వ్యూహం లేక మల్లగుల్లాలు పడుతోంది. పరిస్థితి చూస్తుంటే అధికార పార్టీ అధినేతలో గెలుపు ధీమా కాగడాపెట్టి వెతికినా కూడా కనిపించడం లేదని పరిశీలకలుు విశ్లేషిస్తున్నారు. ఫలితం  తెలిసిపోయిన తరువాత ఇంక చేసేదేముంది అని చేతులెత్తేసినట్లుగా జగన్ తీరు ఉందంటున్నారు. 

న్యూట్రల్ ఓటును కూడా కూటమికి దఖలు పరిచేసిన జగన్

నిజానిజాల సంగతి పక్కన పెడితే ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల ప్రచారాలు కోటలు దాటేస్తాయి. పార్టీలు, నేతలు చెప్పేది ఏది నిజం, ఏది అబద్ధం అన్నది వేరే విషయం. ఎవరి మాటలను జనం విశ్వసిస్తున్నారు. ఎవరి మాటలను నమ్మడం లేదు అన్నది జనం ఓటుతో చెప్పే వరకూ అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ ఎవరికీ తెలియదు.   అయితే  సర్వేలు మాత్రం ప్రజానాడిని పట్టి చూపుతాయి. అందుకే సర్వేల పట్ల అందరిలోనూ సహజంగా ఆసక్తి ఉంటుంది.  అయితే సర్వేలు కూడా నూరు శాతం నిజం అయ్యే అవకాశాలు లేవని ఎన్నికల వ్యూహకర్త, సర్వేలకు పెట్టింది పేరు అయిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే పలు సందర్భాలలో చెప్పారు.    ఎన్నికల వేళ ప్రజల నాడి మారిపోవడానికి ఒక  బలమైన సంఘటన చాలు అని ఆయన గతంలో చెప్పారు.  ఔను నిజమే  రాజకీయాలు ఎప్పుడు చలన రహితంగా, నిశ్చలంగా ఉండవు. అన్నిటికీ మించి రాజకీయ పార్టీల మద్దతు దారులు, కార్యకర్తలు పార్టీల సభ్యులు వారు వారు ప్రాతినిథ్యం వహించే పార్టీలవైపే ఉంటారు అదులో సందేహం లేదు. అయితే ఎన్నికలలో జయాపజయాలను నిర్ణయించేది మాత్రం తటస్థ ఓటర్లు. ఔను న్యూట్రల్ ఓటర్లు ఎటుమొగ్గితే విజయం అటువైపు ఉంటుందన్నది రాజకీయపండితులు చెప్పే మాట.  అయితే ఇప్పుడు వారే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితి ఉందంటున్నారు. ఏపీలో కాగడా పెట్టి వెతికినా తటస్థులు కనిపించడం లేదని విశ్లేషిస్తున్నారు. ఐదేళ్ల జగన్ అస్తవ్యస్త, అరాచక పాలన కారణంగా తటస్థ ఓటరనే వాళ్లు లేకుండా అందరూ జగన్ వ్యతిరేక శిబిరానికి అంటే తెలుగుదేశం కూటమికి జై కొట్టేశారని చెబుతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో వెలువడిన ప్రతి సర్వే కూటమి ఘనవిజయాన్నే సూచిస్తోందంటున్నారు.  ఇక  కొద్దో గొప్పో తటస్థ ఓటర్లు ఉన్నా జగన్ వారిని కూడా తెలుగుదేశం కూటమికి చేరువ చేసేశారని తాజాగా ఆయన తన సొంత చెల్లి చీరపై చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ చెబుతున్నారు. పోలింగ్ కు రోజుల ముందు ఆయన కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల కట్టుకున్న చీర రంగుపై చేసిన వ్యాఖ్యలు తటస్థులను జగన్ కు వ్యతిరేకంగా మార్చేశాయని అంటున్నారు.   అంటే జగన్ తన అనుచిత వ్యాఖ్యలతో, అస్తవ్యస్త పాలనతో తటస్థ ఓటర్లను కూడా కూటమికే జై కొట్టేలా మార్చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కొడాలి నాని, బుగ్గన నామినేషన్లకు ఆమోదం.. నిబంధనలకు విరుద్ధమంటున్న విపక్షం

వైసీపీకి ఇప్పుడు అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి. ఏదీ కలిసిరావడం లేదు. గత ఎన్నికలలో అన్నీ కలిసివచ్చి అందలం దక్కింది. ఈ సారి అన్నీ ఎదురుతిరిగి అధికారం దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. స్వయంగా పార్టీ అధినేత, సీఎం జగన్ రంగంలోకి దిగి బస్సు యాత్ర చేపట్టినా జనంలో స్పందన కనిపించలేదు. చివరాఖరికి సొంత గడ్డ కడపలో కూడా జగన్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కడప జిల్లాలో ఓటర్ మూడ్ ను జగన్ సొంత చెల్లెలు షర్మిల మార్చేశారని అంటున్నారు. అన్న టార్గెట్ గా షర్మిల సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలకు వైసీపీ వద్ద జవాబే లేకుండా పోయిందంటున్నారు.  అదలా ఉంచితే.. వైసీపీ కీలక నేతల నామినేషన్లే తిరస్కరణకు గురయ్యే పరిస్థితి వచ్చింది. విపక్ష నేతలపై అనుచిత భాషా ప్రయోగంతో రెచ్చిపోవడంలో చూపే శ్రద్ధ వైసీపీ నేతలు తమ ఎన్నికల నామినేషన్ల దాఖలుపై చూపలేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రి బుగ్గన,  మాజీ మంత్రి కొడాలి నాని, పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్ రాజ్ దాఖలు చేసిన నామినేషన్ లలో పూర్తి వివరాలు పొందుపరచలేదన్న ఆరోపణలపై వారి నామినేషన్ల ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి బుగ్గన   ఎన్నికల అఫిడవిట్ లో లోపాలు ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన డోన్ ఆర్డీవో ఆయన నామినేషన్ ను పెండింగ్ లో పెట్టారు. బుగ్గన తన అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు పొందుపరచలేదంటూ డోన్  తెలుగుదేశం అభ్యర్థి కోట్ల అభ్యంతరం తెలిపారు. దీంతో బుగ్గన నామినేషన్ ను ఆర్వో పెండింగ్ లో పెట్టి పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా సూచించారు. ఇక గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే.. బూతుల ఎక్స్పర్ట్ గా పేరొందిన కొడాలి నాని అయితే తన ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆధారాలతో సహా విపక్ష నేతలు ఫిర్యాదు చేశారు. కొడాలి తన ఎన్నికల అఫిడవిట్ లో తాను ఎటువంటి ప్రభుత్వ భవనాన్ని వినియోగించలేదని వెల్లడించారు.   అయితే కొడాలి నాని ఎమ్మెల్యే గా  ప్రభుత్వ భవనమైన మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంప్ కార్యాలయంగా వినియోగించారంటూ అందుకు తగ్గ సాక్ష్యాధారాలతో గుడివాడ తెలుగుదేశం నేతలు  రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసారు. భవనాన్ని అద్దెకు ఇచ్చినట్లుగా మున్సిపల్ అధికారులు ఇచ్చిన పత్రాలను ఆధారంగా చూపించారు. దీంతో కొడాలి నాని నామినేషన్ వివాదంలో పడింది.   అయితే కొడాలి, బుగ్గన నామినేషన్లను ఆయా ఆర్వోలు చివరి నిముషంలో ఆమోదించారు. నిబంధనలకు విరుద్ధంగా వారి నామినేషన్లను ఆమోదించడంపై తెలుగుదేశం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టపరంగా ముందుకు వెడతామని చెబుతున్నారు. 

జగన్ ప్రచారంలో బాబాయ్ నామస్మరణ

కోడలికి బుద్ధి చెప్పి అత్త మూకుడు నాకిందనే సామెత తెలుగువారందరికీ తెలిసే వుంటుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీరు ప్రస్తుతం ఈ సామెత చెప్పినట్టే వుంది. బాబాయి వివేకా హత్యను ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష తెలుగుదేశంతోపాటు, తన సొంత చెల్లెళ్ళు షర్మిల, సునీత  ప్రస్తావించే అవకాశం వుంది కాబట్టి, అలా ప్రస్తావిస్తే అది తనకు నెగటివ్ అయ్య ప్రమాదం వుంది కాబట్టి వైసీపీ వర్గాలు కోర్టును ఆశ్రయించాయి. ప్రతిపక్ష పార్టీలతోపాటు వివేకా కుటుంబ సభ్యులు కూడా వివేకా హత్య గురించి మాట్లాడకూడదని కోర్టు  ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఎవరూ వివేకా హత్య గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడ్డం లేదు. కానీ, ఇప్పుడు వివేకా హత్య గురించి ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడే బాధ్యతను స్వయంగా జగనే తీసుకున్నారు. ఏ సభలో మాట్లాడినా వివేకా ప్రస్తావన తప్పకుండా తెస్తున్నారు. చిన్నాన్నకి రెండో భార్య వున్నట్టు అందరికీ తెలుసు కదా అని జనంతో అంటున్నారు. అవినాష్ రెడ్డి చాలా అమాయకుడు అన్నట్టు సర్టిఫికెట్ ఇస్తున్నారు. కోర్టు వివేకా హత్య గురించి ప్రతిపక్షాలు, షర్మిల, సునీత మాట్లాడవద్దని అన్నదే తప్ప నన్ను కాదు కదా అని జగన్ భావిస్తున్నారో ఏమో. ఏది ఏమైనా వివేకా హత్య గురించి ప్రస్తావించి రాజకీయంగా లాభం పొందాలని జగన్ అనుకుంటే అది బూమ్‌రాంగ్ అవడం ఖాయం.

ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీకి 3 సీట్లు వ‌స్తే, ముద్ర‌గ‌డ ఇంట్లో అంట్లు తోముతా

ప్రస్తుతం ఏపీ రాజ‌కీయాల్లో స‌వాళ్ల ప‌ర్వం స్టార్ట్ అయింది.  ప్ర‌చారంలో ప్రధాన పార్టీల నేత‌లు మాట‌ల‌ ప‌దును పెంచుతున్నారు. రాజ‌కీయ స‌వాళ్ళు, ప్ర‌తిస‌వాళ్ళ‌తో నేత‌లు, ఓట‌ర్ల‌ను వినోదాన్ని పంచుతున్నారు. “హాష్ ట్యాగ్ బ్యాండైడ్ ఛాలెంజ్” పేరుతో ట్విట్టర్ లో ఛాలెంజ్ విసురుకుంటున్నారు. టీడీపీ నేటిజన్లు జగన్ బ్యాండేజ్ సైజు పెరిగిందంటూ పోస్టులు పెడుతున్నారు. జగన్ ఇకపై ఆ బ్యాండేజ్ తీసేస్తేనే బెటర్, లేకపోతే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉందని  వైఎస్ వివేకా కుమార్తె సునీత ట్వీట్ చేశారు. ఇదే విషయం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ట్విట్టర్ లో స్పందించారు. "2014, 2019 ఎన్నికల్లో శవరాజకీయాలతో నెట్టుకొచ్చిన జగన్... ఈసారి ఒక డ్రామాతో వచ్చాడు. కనపడని ఒక గులకరాయి తగిలిందంట. బ్యాండ్ వేసాడు. రోజురోజుకు ఆ బ్యాండ్ పెద్దదవుతోంది. మే 13 ఎన్నికల రోజు వరకు డ్రామా ఆడిస్తానే ఉంటాడు ఈ నాటకాల రాయుడు" అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు!  మరోపక్క టీడీపీ శ్రేణులు పోస్టులు పెడుతున్నారు. ఈ నెల 13న బ్యాండేజ్ సైజు చిన్నగా ఉంది.. ప్రస్తుతం అది పెద్దగా అయ్యింది అంటూ... “హాష్ ట్యాగ్ బ్యాండైడ్ ఛాలెంజ్” పేరుతో ట్విట్టర్ లో ఛాలెంజ్ విసురుకుంటున్నారు. అయితే నేను వున్నాను. న‌న్ను గుర్తించండి అంటూ థర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ, టాలీవుడ్ న‌టుడు పృథ్వీ రాజ్ ఓ ఛాలెంజ్ విసిరారు. జ‌న‌సేన త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తూ ముద్ర‌గ‌డ‌ను ల‌క్ష్యంగా  చేసుకొని ఆయ‌న విమ‌ర్శ‌లు చేసారు.  ముద్రగడ కాపు ఉద్య‌మ నాయ‌కుడిగా ప్ర‌స్థానం ప్రారంభించి, ఇప్పుడు రెడ్డి ఉద్య‌మ నాయ‌కుడిగా, రెడ్డి సేవ‌కుడిగా మారార‌ని ఆరోపించారు.  కిర్లంపూడి లో కూర్చుని క‌బుర్లు చెబుతున్న ముద్ర‌గ‌డ‌ త‌న ప‌రిశ్ర‌మ‌ల‌కు, రైస్ మిల్లుల‌కు ఉన్న విద్యుత్ బ‌కాయిలు ఎంతో చెప్పాల‌ని ఆయన డిమాండ్ చేశారు. ఉత్త‌రాంధ్ర లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ కనీసం మూడు సీట్లు కూడా గెలిచే ప‌రిస్థితి లేద‌న్నారు. ఒక‌వేళ మూడు సీట్లు వైసీపీ గెలిస్తే మాత్రం నేను ఆయన ఇంట్లో అంట్లు తోముతాన‌ని అన్నారు.  ప్రస్తుతం ముద్ర‌గ‌డను ప‌ట్టించుకునేవారు, న‌మ్మేవారు ఎవ‌రూ లేర‌ని పృథ్వీ గట్టిగా చెబుతున్నారు. మెగా కుటుంబంలో చిరంజీవి, రామ్‌చరణ్ స‌హా ప‌లువురు కూటమికి మద్దతుగా ప్ర‌చారం చేసేందుకు త్వ‌ర‌లోనే రాబోతున్నాట‌. అలాగే సీఎం జ‌గ‌న్‌పై కూడా పృథ్వీ విమ‌ర్శ‌లు చేసారు. అయితే దీనిపై వైసీపీ నాయ‌కులు స్పందించారు.  ఉత్తరాంద్ర లో వైసీపీ గెలవడం పక్కా అని,  తాను చెప్పినట్లు అంట్లు తోమాడానికి గిన్నెలు కూడా రెడీగా ఉన్నాయని వైసీపీ నాయకులు అంటున్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

వంశీకి దింపుడు కళ్లెం ఆశకూడా మిగల్లేదుగా?

 వల్లభనేని వంశీ  నామినేషన్ దాఖలు చేసిన రోజునే ఓటమిని అంగీకరించేశారా? అంటే పరిశీలకలు ఔననే అంటున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించడం ద్వారా తనకు గెలుపు ఆశలు ఆవిరి అయిపోయాయని చెప్పకనే చెప్పేశారు.  అలా చెప్పేస్తూనే ఏదో ఓ మేరకు సానుభూతి ఓట్లను రాబట్టుకోవడానికి చివరి ప్రయత్నం కూడా చేశారు. గన్నవరం నుంచి ఇక తాను పోటీ చేయనని చెప్పిన వల్లభనేని వంశీ.. వచ్చే ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి దుట్టారామచంద్రరావు కుమార్తె పోటీ చేస్తారనీ, తాను ఆమెకు మద్దతు ఇస్తానని చెప్పారు. ఇదంతా ఆయన ఎన్నికల నిమినేషన్ ర్యాలీ వెలవెలబోయిన తరువాత మీడియాతో మాట్లాడుతూ వంశీ పలికిన పలుకులు.  దుట్టారామచంద్రరావు కుమార్తెకు వచ్చే ఎన్నికలలో మద్దతు ఇస్తానంటూ వంశీ చెప్పడం వెనుక ఈ ఎన్నికలో దుట్టా వర్గం కనీసం ఇప్పటికైనా తనకు మద్దతుగా చురుగ్గా పని చేస్తుందన్న చివరి ఆశ ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే వైసీపీలో వంశీకి మద్దతు కరవైంది. తెలుగుదేశం పార్టీలో ఉండగా వంశీ అనుచరులుగా ఉన్నవారిలో 90 శాతం మందికి పైగా ఆయన తెలుగుదేశం వీడగానే ఆయనకు దూరం అయ్యారు. ఇక వైసీపీ నుంచి తెలుగుదేశం గూటికి చేరి గన్నవరం తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు వెంట ఆయన అనుచరవర్గమంతా టీడీపీ పంచన చేరిపోయింది. ఇక నియోజకవర్గంలో బలమైన దుట్టా రామచంద్రరావు వంశీకి మద్దతుగా పని చేయడానికి ససేమిరా అంటున్నారు.  ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి వంశీ చేసినదేమీలేదన్న ఆగ్రహం నియోజకవర్గ ప్రజలలో బలంగా కనిపిస్తోంది.   అది వంశీ నామినేషన్ ర్యాలీలో ప్రస్ఫుటంగా కనిపించింది. తీసుకువచ్చిన కూలి జనం కూడా మధ్యలోనే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయారు. అదే తెలుగుదేశం అభ్యర్థిగా యార్లగడ్డ నామినేషన్ ర్యాలీ కళకళలాడింది. భారీ జనసందోహంతో  జైజై ధ్వానాలతో ఆ ర్యాలీ సాగింది. జనం స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో  వంశీకి పరిస్థితి అర్ధమైంది.  దుట్టాను శరణుజొచ్చారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేయను.. మీ కుమార్తెకే మద్దతు ఇస్తానంటూ బతిమలాడుతున్నారు. అయితే ఇప్పటికే పరిస్థితి చేయిజారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  దుట్టా మెత్తబడినా ఆయన వర్గం మాత్రం వంశీకోసం పని చేసే పరిస్థితి లేదని సోదాహరణంగా వివరిస్తున్నారు.  మొత్తం మీద వంశీకి గెలుపుపై దింపుడు కళ్లెం ఆశకూడా మిగలలేదని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. 

జగన్ మీద హైపర్ ఆది వేసిన పంచ్‌ల లిస్టు!

జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కమెడియన్ హైపర్ ఆది ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా హైపర్ ఆది వేస్తున్న పంచ్‌లు అదరిపోతున్నాయి. ఆది స్పీచ్‌లకు ప్రజల నుంచి విశేష ప్రతిస్పందన లభిస్తోంది. ఇదిగో హైపర్ ఆది జగన్ బ్యాచ్ మీద వేస్తున్న పంచ్‌ల లిస్టు.. 1. కూటమిని చూసి వైసీపీ వాళ్ళు భయపడిపోతున్నారు. కానీ, పైకి మాత్రం సింహం సింగిల్‌గా వస్తుంది అంటున్నారు. మరి 2014లో కూడా సింహం సింగిల్‌గా వచ్చింది కదా.. మరి ఎందుకు ఓడిపోయింది? ఈసారి కూడా అదే కూటమి ఏర్పడింది.. ఈసారి కూడా కూటమికి అదే విజయం.. వైసీపీ అదే ఓటమి దక్కుతుంది. 2. షూటింగ్‌లన్నీ ఆపుకుని ప్రచారానికి వచ్చాను.. అక్కడ షూటింగ్‌లు లేకపోయినా.. ఇక్కడ కూటమికి వ్యతిరేకంగా వుండే వాళ్ళని మాటలతో షూట్ చేయడం కంటిన్యూ అవుతుంది. 3. కమెడియన్ ప్రచారానికి వచ్చాడని వైసీపీ వాళ్ళు అంటున్నారు.. నేను ప్రొఫెషనల్‌గానే కమెడియన్‌ని.. వాళ్ళలాగా పొలిటికల్ కమెడియన్‌ని కాదు. 4. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు అంటూ వైసీపీ వాళ్ళు ఊదరగొడుతున్నారు. రెండు చోట్ల ఓడిపోయినా ఎంతోమంది కష్టాన్ని తీర్చాడు.. అదే ఆయన గెలిస్తే, ప్రజల కష్టం కాంపౌండ్ దాటకుండా చూసుకుంటాడు. 5. రికార్డులు కొల్లగొట్టడానికో, ఆస్తులు కూడబెట్టుకోవడానికో సినిమాలను ఒప్పుకునే హీరోలను చూసి వుంటాడు.. కానీ, కౌలు రైతుల కష్టాలు తీర్చడానికి సినిమా ఒప్పుకున్న హీరో పవన్ కళ్యాణ్. 6. ఆయన ప్రెజెంట్ ఆస్తి ఎంత వుంటుందో తెలుసా? నాకు తెలిసి ఈ స్టేజీ మీద వున్న నాయకుల ఆస్తికంటే తక్కువే వుంటుంది. ఎందుకంటే, వచ్చింది వచ్చినట్టు పంచుకుంటూ వెళ్ళడమే తప్ప, డబ్బులు పెంచుకుంటూ వెళ్ళే మనస్తత్వం ఆయనకి లేదు. 7. వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్‌ని తిట్టడానికి రెడీగా వుంటారు. వాళ్ళకి పవన్ కళ్యాణ్‌ని తిట్టే శాఖ అని పేరు పెట్టుకుంటే సరిపోతుంది. 8. వారాహి బండి యాత్ర ఆపేస్తారా? ఆయనకి తిక్కరేగితే పాదయాత్ర చేస్తాడు.. అప్పుడు మీ పని కాశీ యాత్రే. 9. పవన్ కళ్యాణ్ జనాల పక్షాన వున్నాడు కాబట్టే జనసేనానిగా వున్నాడు. మీరు ఇలాగే విసిగిస్తే ‘వీరమల్లు’ బయటకి వస్తాడు.. జాగ్రత్త. 10. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ కాదురా.. ప్రేమకు లొంగే స్టార్.. 11. దత్తపుత్రుడు.. దత్తపుత్రుడు అన్న నోళ్ళతోనే అంజనీ పుత్రుడు అనిపించుకునే రోజు వస్తుంది. 12. మీ పాపులారిటీ కోసం ఆయన పర్సనాలిటీని దెబ్బతీసేలా మాట్లాడారా? ఈసారి జనసేన కొట్టే దెబ్బకి మీ అబ్బ గుర్తొస్తాడు. 13. 151 మంది ఒక్కడికి భయపడిపోతున్నారు. 14. పవన్ కళ్యాణ్‌ది నిలకడలేని రాజకీయం కాదు.. నిఖార్సైన రాజకీయం.

హిందూపురం తెలుగుదేశం అభ్యర్థిగా బాలయ్య భార్య నామినేషన్!

అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇప్పటికే తన నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ ముంగిట నిలిచిన బాలకృష్ణకు పోటీగా, అదే పార్టీ నుంచి నందమూరి వసుంధర నామినేషన్ దాఖలు చేయడం ఏమిటి అనుకుంటున్నారా?  ఉండండి అక్కడికే వస్తున్నాం. ఆమె తెలుగుదేశం డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇలా డమ్మి అభ్యర్థుల చేత నామినేషన్ దాఖలు చేయించడం సహజమే. సాధారణంగా ఆ డమ్మి అభ్యర్థులు ఆయా అభ్యర్థుల కుటుంబీకులే అయి ఉంటారు. ఏదైనా సాంకేతిక కారణాల చేత నిమినేషన్ తిరస్కరణకు గురైతే బ్యాక్ అప్ గా ఉండేందుకు ఇలా డమ్మి క్యాండిడేట్లు నామినేషన్లు దాఖలు చేస్తారు. అయితే బాలకృష్ణ ఇలా బ్యాక్ అప్ కోసం నామినేషన్ దాఖలు చేయించడం ఇదే తొలి సారి. ఈ సారి ఏపీలో నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఏ విధంగానూ రిస్క్ తీసుకోరాదన్న ఉద్దేశంతోనే బాలకృష్ణ డమ్మి అభ్యర్థిగా తన భార్య వసుంధర చేత నామినేషన్ వేయించారని అంటున్నారు. హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి హిందూపురం నియోజకవర్గంలో ఎన్నిక జరిగిన ప్రతిసారీ తెలుగుదేశం పార్టీయే గెలుస్తూ వస్తోంది. జగన్ వేవ్ కొనసాగిన 2019 ఎన్నికలలో కూడా తెలుగుదేశం అభ్యర్థిగా బాలకృష్ణ విజయం సాధించారు. విశేషం ఏమిటంటే 2019 ఎన్నికలలో ఆయనకు 2014 ఎన్నికలలో కంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది.