సస్పెన్షన్ వ్యూహం బూమరాంగ్ అయినట్లేనా?

క్రాస్ ఓటింగ్ చేశారని నలుగురు ఎమ్మెల్యేల్ని వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. వారిపై అనర్హతా వేటు వేస్తారన్న చర్చ కూడా ప్రారంభమయింది.  అసలు అనర్హత వేటు వేయకుండా కేవలం సస్పెండ్ చేసి ప్రయోజనమేముందన్న వాదనా వినవస్తోంది. అనర్హత వేటు వేయకుండా కేవలం సస్పెండ్ చేయడం వల్ల ఎమ్మెల్యేలకు వచ్చే ఇబ్బందేమీ ఉండదన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. కేవలం సస్పెన్షన్ తోనే వదిలేస్తే.. పార్టీని ధిక్కరించి సస్పెన్షన్ వేటు వేయించుకునేందుకు పెద్ద సంఖ్యలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెడీ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ, పార్టీని ధిక్కరించడానికి ఇసుమంతైనా వెనుకాడకుండా ముందుకు వచ్చేవారి సంఖ్య పెద్దగానే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సస్పెండైన నలుగురిపైనా అనర్హత వేటు వేయడానికి అవసరమైన ప్రక్రియపై హై కమాండ్ దృష్టి పెట్టిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  అయితే ఇక్కడే రాజ్యాంగ నిపుణులు పార్టీ నుంచి సస్పెండ్ అయితే చేయగలరు కానీ, క్రాస్ వోటింగ్ పేరు చెప్పి వారిపై అనర్హత వేటు వేసే అవకాశాలైతే లేవని అంటున్నారు. క్రాస్ వోటింగ్ పేరు చెప్పి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా..  పార్టీలో అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉందన్న వార్తలు వినవస్తున్న నేపథ్యంలో వారిని కట్టడి చేయడానికి మాత్రమేనని అంటున్నారు.   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ఆ తరువాత తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఒకేసారి ఒకే సారి ఒకే పార్టీకి చెందిన, అందులోనూ అధికార పార్టీకి చెందిన  నలుగురు శాసనసభ్యులు పార్టీ నుండి సస్పెండ్‌ కావడం ఇదే తొలిసారి.   ఇక ఇప్పుడు వైసీపీ సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలలో ఇద్దరు చాలా కాలం కిందటి నుంచే పార్టీ విధానాలను బహిరంగంగా వినిపిస్తూ వస్తున్నవారే. మరో ఇద్దరిని క్రాస్ ఓటింగ్ ఆరోపణలతో సస్పెండ్ చేస్తూ గతం నుంచీ పార్టీ లైన్ కు భిన్నంగా బహిరంగంగా మాట్లాడుతున్నవారిపై కూడా వైసీపీ వేటు వేసింది. ఇక సస్పెన్షన్ తరువాత  ఏమిటి? అనర్హత వేటు పడుతుందా? అంటే.. ఆ అవకాశాలు లేవనే చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేపై కానీ ఎంపీపై కానీ అనర్హత వేటు వేయాలంటే వారు వేరే పార్టీలో చేరడమే, లేదా పార్టీ విప్ ను ధిక్కరించడమో చేయాలి.  ఇక్కడ ఇప్పుడు వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన వారెవరూ వేరే పార్టీలో చేరలేదు. ఇక రహస్య ఓటింగ్ లో విప్ ను ధిక్కరించారని తేల్చడానికి ఆధారాలు ఉండవు. అసెంబ్లీలో, లోక్ సభలో, రాజ్యసభలో బిల్లుల పైచర్చ సందర్భంగా జరిగే బహిరంగ ఓటింగ్ సందర్భంగా విప్ ధిక్కరించిన వారిని గుర్తించి అనర్హత వేటు వేయడానికి వీలు ఉంటుంది. అందుకే ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నలుగురూ డిస్ క్వాలిఫై అయ్యే అవకాశాలు లేవనే అంటున్నారు.  సో వైసీపీ నలుగురిని సస్పెండ్ చేసి  ఇంకా  అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతున్న పలువురిని పరోక్ష హెచ్చరిక జారీ చేసిందని భావించాల్సి ఉంటుంది. పార్టీ శ్రేణుల సమాచారం మేరకు  పాతిక మందికి పైగా అసంతృప్త ఎమ్మెల్యేల పేర్లతో ఐ ప్యాక్ ఒక జాబితాను జగన్ కు అందించిందని చెబుతున్నారు.   ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో మరో అభ్యర్థిని నిలబెట్టినా గెలిచి ఉండేవారమంటూ తెలుగుదేశం పేర్కొనడానికి కారణం కూడా అదేనని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే క్రాస్ ఓటింగ్ పేర నలుగురిని సస్పెండ్ చేసిన, డిస్ క్వాలిఫై చేస్తున్నామంటూ ప్రచారం చేయడం ద్వారా అసంతృప్తులకు గట్టి హెచ్చరిక పంపామని వైసీపీ భావిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఇలాంటి అనర్హతా వేటు ప్రచారంద ద్వారా కంట్రోల్ చేయాలనుకుంటున్నారనీ, అది సాధ్యమయ్యే పని కాదనీ అంటున్నారు. 

బీజేపీ తప్పులో కాలు?

లోక్‌సభలో రాహుల్ గాంధీ అనర్హత వేటు వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష పార్టీలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకించే ,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్, తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  సహా అన్ని పార్టీలూ, అందరు నాయకులు ఖండిస్తున్నారు. ఇక కాంగ్రెస్, కాంగ్రెస్ మిత్ర పక్షాల సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. నిజానికి ఈ పరిణామం, కాంగ్రెస్ అనుకూల, వ్యతిరేక విపక్షాలు అన్నిటినీ ఏకం చేసింది. తాత్కాలికంగా అయినా  ఏకతాటిపైకి   తీసుకువచ్చిందని బీజేపీ అనుకూల మీడియా, మేథావి వర్గాలు కూడా అంటున్నాయి. బీజేపీ తప్పులో కాలేసిందనే అభిప్రాయమే ఆ వర్గాల నుంచి వ్యక్తమౌతోంది.  ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన వ్యవసాయ చట్టాలు మొదలు, ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకున్న మరికొన్ని వివాదాస్పద నిర్ణయాలను చాలా గట్టిగా సమర్ధించిన లోక్ సత్తా నేత  జయ ప్రకాష్ నారాయణ్   సైతం ఈవిషయంలో మోడీ ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. ప్రతి చిన్న విషయానికీ అనర్హతను అస్త్రంగా ఉపయోగిస్తే ప్రజాస్వామ్యం క్షీణించిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  రాహుల్‌ గాంధీకి పై కోర్టులలో అప్పీల్‌ చేసుకునే వెసులుబాటు ఉందని.. ఒకవేళ పై కోర్టులో శిక్షను తగ్గించినట్లయితే, అనర్హత వేటును వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందని జయప్రకాష్ నారాయణ వివరించారు. ఇలాంటి సందర్భంలో లోక్‌సభ అధికారులు రాహుల్‌పై వెంటనే అనర్హత వేటు వేయకుండా  కాస్త వేచి చూస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఎన్నికల వ్యూహకర్త, ప్రశాంత్ కిషోర్ కూడా చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి అనుకూలంగా స్పందించారు. ఒక పరువు నష్టం కేసులో రెండేళ్ల శిక్ష పడటం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే అధికార పక్షం కూడా కొంత పెద్ద మనసు చేసుకోవాల్సిందని సూచించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసే నిర్ణయాన్ని అంత వేగంగా తీసుకుని ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు తీర్పును పై కోర్టులో అప్పీల్ చేసే గడువు ఇవ్వాల్సిందని పేర్కొన్నారు. నేను న్యాయ నిపుణుడిని కాదు. కానీ ప్రాసెస్ ఆఫ్ లాను చూస్తే రాహుల్ కి విధించిన శిక్ష మోతాదు ఎక్కువే అనిపిస్తున్నది. ఎన్నికల వేడిలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇదే చివరిదీ కాబోదు  అని అన్నారు. అటల్ బిహారీ వాజ్ పేయి  చిన్న హృదయంతో పెద్దోడివి కాలేవు అనే మాటను కేంద్రం గుర్తు చేసుకోవాలి  అని ప్రశాంత్ కిషోర్  అన్నారు. నిజానికి ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీకి ప్రత్యక్ష ప్రమేయం లేక పోయినా  సమయం, సందర్భాలను బట్టి తెర వెనక తతంగం అంటా కమల నాథులే కానిచ్చారనే విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆర్థిక అవకతవకల వ్యవహారంలో చిక్కున్న ఆదానీ వ్యవహారంలో మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడడం పలు అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోందని, అంటున్నారు. ఆదానీని కాపాడేందుకు రాహుల్ పై వేటు  వేశారనే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణకు బలం చేకురుతోందని మేథావులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో వంక కాంగ్రీస్ పార్టీ  రాహుల్ అనర్హతకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఆందోళనలకు పిలుపు నివ్వడంతో బీజేపీ ఇరకాటంలో పడిందనే అభిప్రాయం బలపడుతోంది. ఒక విధంగా సెల్ఫ్ గోల్ చేసుకుందని అంటున్నారు.

వైకాపాలో అసమ్మతి సునామీ?

వైసీపీలో ఏం జరుగుతోంది? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిపై పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? అధినాయకత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎమ్మెల్యేలు ఏం ఆలోచిస్తున్నారు? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే నెపంతో ఏకపక్షంగా నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని  ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, పార్టీ క్యాడర్ ఎలా చూస్తున్నారు? మరీ ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్ గురించి ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఈ ప్రశ్నలన్నిటికీ   సామాన్య ప్రజల నుంచి మేథావుల వరకు అందరూ అందరి నోటా వ్యక్తమౌతున్న ఎకాభిప్రాయం  ‘రోజులు దగ్గర పడ్డాయి’ అనే. పట్టభద్రుల నియోజక వర్గాల్లో వైకాపా ఓటమి, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలలో ఉన్న సొంత పార్టీపైనా, ప్రభుత్వంపైనా ఉన్న అసంతృప్తిని బహిర్గతం చేసిందని అంటున్నారు. ముఖ్యంగా, వైకాపా ఎమ్మెల్యేలో అసమ్మతి కొత్త వవిషయం కాదు. చాలా కాలంగా  చాలా మంది  ఎమ్మెల్యేలో అసమ్మతి అగ్గి రాగులు తూనే వుంది. భగ్గు మనేందుకు సిద్ధంగా వుంది. అయితే  ఇంతకాలం పిల్లి మేడలో గంట కట్టేదేవరనే దగ్గర ఆగిన అసమ్మతి లావా ప్రవాహానికి  స్వయంగా పార్టీ అధినాయకత్వమే గేట్లు ఎత్తేసింది. పొమ్మన కుండా పొగ పెట్టి  ఆనం రామ నారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని బయటకు పంపిన పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి క్రాస్ వోటింగ్ సాకు చూపి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఇక అసమ్మతి కట్టలు  తెంచుకుంటుందన్న పార్టీ లో చర్చ మొదలైంది.  ఈ నేపథ్యంలోనే  వైసీపీలో  చాలా మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని సస్పెన్షన్‌కు గురైన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు బహిరంగంగానే బయటికి వస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలో చాలా మంది లోలోపల ఉడికిపోతున్నారని చెప్పారు. మరో పార్టీలో చేరిక కోసం చాలా మంది ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు.  2024 ఎన్నికలలో ఎవరికి ఓటేయాలన్న విషయంలో రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి వెల్లడించారు. వచ్చే ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాల నుంచి వైసీపీ శాశ్వతంగా డిస్మిస్‌( సస్పెండ్) అవుతుందని జోస్యం చెప్పారు. 2024లో రాజకీయ ప్రజా సునామీ రాబోతోందని.. నిన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమే స్పష్టమైన ప్రజా తీర్పు అని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలనే తపన ఉన్న తాను.. విసిగి వేసారి చివరికి గట్టిగా మాట్లాడానని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. చివరికి పార్టీ (వైసీపీ)కి విధేయుడిగా ఉన్న తనపైనే నిఘా పెట్టారన్నారు. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే అనుమానించారని.. పరిష్కరించకుండా రాజకీయ కోణంలో ఆలోచించారని చెప్పారు.  అదలా ఉంటే, కడప మొదలు ప్రతి జిల్లాలోనూ, వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు,కార్యకర్తలు జగన్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా నిట్టనిలువుగా చీలిపోయారని అంటున్నారు. అక్కడక్కడా రహస్య సమావేశాలు జరుగుతున్న  సమాచారం కూడా పార్టీ పెద్దలకు చేరుతోందని అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల ప్రతి కదలిక పైనా ఒకరికి తెలియకుండా మరొకరిని నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీలో ఒకరిని ఒకరు నమ్మే పరిస్థితి లేకుండా పోయిందని, చివరకు మంత్రులు కూడా రాజకీయాల గురించి మాట్లాడేందుకు జంకుతున్నారని అంటున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే నిజంగానే కోటంరెడ్డి అన్నట్లుగా  వైసీపీని అసమ్మతి సునామీ ముంచేసేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎక్కడ?

ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపునకు.. క్రాస్ ఓటింగే కారణమంటూ.. అందుకు సంబంధించి నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితోపాటు ఉండవల్లి శ్రీదేవిపై అధికార ఫ్యాన్ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు మీడియా ముందుకు వచ్చి తమదైన శైలిలో స్పందించారు.  ఇక ఆనం రామనారాయణరెడ్డి అయితే సైకిల్ పార్టీలో చేరేందుకు చాలా కాలంగా వేచి చూస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఆయన పార్టీ మారే క్రమంలో క్రాస్ ఓటింగ్ వేయడం ద్వారా టీడీపీ అభ్యర్థిని బలపరిచి ఉంటారని అంతా భావిస్తున్నారు. అంత వరకు బానే ఉంది. కానీ ఇంత తతంగం జరిగినా... జరుగుతున్నా.. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాత్రం ఇప్పటి వరకు.. ఈ అంశంపై స్పందించక పోవడం పట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకొన్న తర్వాత తాడికొండ శ్రీదేవి ఎక్కడా కనిపించడం లేదు.ఆమె అజ్ణాతంలోకి వెళ్లారన్న చర్చ సమాజిక మాధ్యమంలో జోరుగా సాగుతోంది.  మరోవైపు  క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినది ఈ  నలుగురు ఎమ్మెల్యేలే అని వైసీపీ అధిష్ఠానం ప్రకటించగానే గుంటూరులోని ఎమ్మెల్యే శ్రీదేవి కార్యాలయంపై ఫ్యాన్ పార్టీ శ్రేణులు దాడి చేసి ఆమె ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. శ్రీదేవికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.  ఒక వైపు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకొంటుంటే.. కోటంరెడ్డి, మేకపాటి లాగా ఆమె కూడా మీడియా ముందుకు వచ్చి.. ఏ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయాలని.. తమ పార్టీ సూచించిందో.. ఆ అభ్యర్థికే తాను ఓటు వేశానని... అంతేకానీ.. తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని.. అయితే ఎవరో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి.. తన మీద ఇటువంటి ఆరోపణలు చేసి.. తన రాజకీయ జీవితాన్ని బలి చేస్తున్నారంటూ ప్రకటించే అవకాశం ఉన్నా.. ఎమ్మెల్యే శ్రీదేవి ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు.   తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీకి మరో సమన్వయకర్తగా గతంలో మాజీ మంత్రి డొక్క మాణిక్య వర ప్రసాద్‌ను ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ నేపథ్యంలో డొక్కా నియామకాన్ని శ్రీదేవితో పాటు ఆమె అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ క్రమంలో అప్పటి కప్పుడు అర్థరాత్రి వేళ.. జిల్లా పార్టీ ఇన్‌చార్జ్‌, హోంశాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత నివాసానికి చేరుకొని.. ఎమ్మెల్యే శ్రీదేవితోపాటు ఆమె అనుచరులు ఆందోళనకు దిగారు.  దాంతో వారిని మేకతోటి సుచరిత సముదాయించి.. ఆ తర్వాత ఆ పంచాయతీని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో పెట్టడంతో... ఎమ్మెల్యే శ్రీదేవి తాత్కాలికంగా కూల్ అయ్యారు. ఆ తరువాత కొద్ది రోజులకే.. పార్టీ జిల్లా  ఇన్‌చార్జ్ బాధ్యత నుంచి మేకతోటి సుచరిత తప్పుకోవడంతో.. ఆ బాధ్యతలను సైతం డొక్కా మాణిక్య వర ప్రసాద్‌కు వైసీపీ అధిష్టానం అప్పగించింది.    ఇంకోవైపు తాడికొండ నియోజకవర్గంలో పార్టీ అదనపు సమన్వయ కర్తగా కర్తగా సురేష్ కుమార్‌ను పార్టీ అధిష్టానం నియమించింది. దీంతో అతడి ఆధ్వర్యంలోనే స్థానికంగా  వైసీపీ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాలు సైతం కత్తెర సురేష్ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి.  దీంతో స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి ఉత్సవ విగ్రహాంగా మారడంతో.. ఆమె తీవ్ర అసంతృప్తికి లోనయ్యారనే చర్చ సైతం స్థానికంగా  కొనసాగుతోంది. అలాంటి వేళ ఆమె తెలుగుదేశం గూటికి చేరాలని నిర్ణయించుకొని ఉంటారని.. అందులో భాగంగానే ఎమ్మెల్యే శ్రీదేవి తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనూరాథకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదీకాక తాడికొండ నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో శ్రీదేవిని కాకుండా మరో  అభ్యర్థిని  బరిలోకి దింపేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించుకున్నారనీ, ఆ విషయం గ్రహించే శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కు పాల్పడి ఉంటారనీ పార్టీ శ్రేణులు అంటున్నాయి.

కేసీఆర్ సర్కార్ కు లీకేజీ చిక్కులు

టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానని హ్యాండిల్  చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందా? అంటే అవుననే అంటున్నారు  రాజకీయ విశ్లేషకులు. నిజానికి, రాజకీయ విశ్లేషకులు మాత్రమే కాదు అధికార బీఆర్ఎస్ నాయకులు కూడా అదే మాట అంటున్నారు.ఎనిమిదేళ్ళ పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నీ ఒకెత్తు అయితే, టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం చేసిన తప్పు ఒక్కటీ ఒకెత్తని బీఆర్ఎస్ నాయకులే వాపోతున్నారు. అంతేకాదు ఇప్పటికైనా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే  రాజకీయంగా భారీ మూల్యం చెల్లించక తప్పదని అంటున్నారు.  ముఖ్యంగా అదే సమయంలో ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) విచారణ ఎదుర్కోవలసి రావడంతో, ముఖ్యంత్రి టీఎస్పీఎస్సీ లీకేజీపై దృష్టి పెట్టలేదనీ, అందువలన  లీకేజీ వ్యవహారం కోతి పుండు బ్రహ్మరాక్షసి చందంగా మరింత జటిలంగా మారిందని బీఆర్ఎస్ సీనియర్ నేతలు అంటున్నారు. అలాగే  మంత్రి కేటీఆర్ లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడిన సమస్యతో తమకు సంబంధం లేదన్న విధంగా మాట్లాడడంతో విద్యార్ధులలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని అంటున్నారు. మళ్ళీ పరీక్షలు రాయండి అన్నం పెడతాం, ఫీజులు కడతాం అంటూ నిరుద్యోగులను అవమానపరిచే విధంగా మాట్లాడడం కూడా విద్యార్థుల ఆగ్రహానికి కారణం అవుతోందని అంటున్నారు. కొందరు నిరుద్యోగ యువకులు భౌతిక దాడులకు సైతం వెనుకాడమని హెచ్చరిస్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోందని అంటున్నారు. ఒక విధంగా సున్నితంగా పరిష్కరించవలసిన సమస్యను ప్రభుత్వ పెద్దల ధోరణి వలన జటిలం అయిందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.  అలాగే  ‘సిట్’ విచారణలో  టీఎస్సీఎస్సీ నిర్వాకం బయట పడిందని,  తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన, ‘నియామకాలు’ విషయంలో ప్రభుత్వం డొల్లతనం బయట పడిందని అంటున్నారు. ఒక విధంగా, టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల విషయంలో ప్రతిపక్షాలకు ప్రభుత్వమే ఆయుధాన్ని అందించిందనే అభిప్రాయం బీఆర్ఎస్ వర్గాలలోనే వినవస్తోంది.  అదలా ఉంటే, ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఇదే విషయంగా పోటాపోటీగా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే ,రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ బీజేపీ, శనివారం(మార్చి 25) నిరుద్యోగ మహాధర్నా నిర్వహించింది. గ్రూప్ వన్  పరీక్షల పేపర్‌ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్‌ అంధకారంలో పడిన నేపథ్యంలో వారి తరపున పోరాడేందుకు పార్టీ దశల వారీ ఉద్యమ కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో ఇందిరాపార్క్‌ వద్ద వేలాది మందితో ‘మా కొలువులు మాగ్గావాలే’ అనే నినాదంతో,   నిరుద్యోగ మహాధర్నా నిర్వహించారు.  కాగా  నిరుద్యోగ మహాధర్నా బీజేపీకే పరిమితమైన కార్యక్రమం కాదని, 30 లక్షల మంది నిరుద్యోగులు, వారి కుటుంబాల భవిష్యత్ కు ముడిపడి ఉన్న సమస్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. వారందరికీ అండగా ఉంటామని, కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేసేవరకూ వదలిపెట్టబోమని తేల్చి చెప్పారు. టీఎస్పీఎస్పీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్‌ పాత్ర లేదని సీఎం కేసీఆర్‌ భావిస్తే తక్షణం, హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి ఆధ్వర్యంలో విచారణను కోరాలని, సకాలంలో పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలని అన్నారు. తన కుమారుడి ప్రమేయాన్ని ఖండించని కేసీఆర్  రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు లక్షలాది మంది నిరుద్యోగులు, వారి కుటుంబాలను అంధకారంలోకి నెట్టడం కేసీఆర్‌ దుర్మార్గ చర్యలకు పరాకాష్ఠ  అని విమర్శించారు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మళ్ళీ మరోమారు, ఉద్యమం నాటి, వాతావరణం కనిపిస్తోందిని అంటున్నారు.  రెండు రోజుల కిందట వివిధ విద్యార్ధి సంఘాలు సంయుక్తంగా నిరుద్యోగ దీక్ష, ర్యాలీ నిర్వహించేందుకు చేసిన ప్రయత్నాలను పోలేసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వందల మంది విధ్యార్ధులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే  దీక్షలో పాల్గొనేందుకు సిద్దమైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యు నాయకులను ఎక్కడిక్కడ హౌస్ అరెస్ట్ చేశారు.  మరో వంక ఏప్రిల్ రెండవ వారంలో లక్షమందితో నిరుద్యోగ నిరసన దీక్ష నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని  సమస్య పరిష్కారానికి కృషి చేయాలని  లేదంటే  రాజకీయంగా భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని, బీఆరేస్ నాయకులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.

ఏపీ రాజకీయాల్లో కొత్త డైమెన్షన్!

రాజకీయాలలో ఏదీ శాశ్వతం కాదు. ఎవరూ శాశ్వతం కాదు. ఓడలు బండ్లవుతాయి. బండ్లు ఓడలవుతాయి.  అందుకే,   రాజకీయాలు నిశ్చలన చిత్రాలు కాదు, పాలిటిక్స్ ఈజ్ డైనమిక్  అనే నానుడి ఏర్పడింది. నిజం. ఎమ్మెల్సీ ఎన్నికల వరకు  ఏపీ రాజకీయాలు ఎటు  వెళుతున్నాయి, అనే విషయంలో చాలామందికి చాలా సందేహాలున్నాయి. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి  వచ్చింది మొదలు, మీటల మీదనే దృష్టి పెట్టి పేద ప్రజల ఓట్లను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు సాగిస్తూ వచ్చారు. అప్పులు చేసి మరీ ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామనే బిల్డప్  ఇచ్చారు.  అయితే, మీటలు నొక్కి ప్రజల ఖాతాల్లో పైసలు వేసినా ప్రజలను ఆకట్టుకోలేక పోయారు. సంక్షేమ ప్రయోజనాలు పొందుతున్న వర్గాల ప్రజల్లోనూ సర్కార్ విధానాల పట్ల వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. ఓ వంక మీటలు నొక్కుతూ మరో వంక  పన్నుల మోత, చార్జీల వాతలతో ప్రజలపై మోయలేని భారం వేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వంతో ప్రజలు విసిగెత్తి పోయారు. ఇసుక పాలసీ, మద్యం పాలసీ వంటి తలాతోకా లేని విధానాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న జగన్ సర్కార్ పై  ప్రజలు మండిపడుతున్నారు. ఇదేమి పాలనా ఇదెక్కడి పాలన  ఒక చేత్తో ఇచ్చి  చెత్త పన్ను వంటి చెత్త ఆలోచనలతో రెండు చేతులా దోచుకుంటున్న జగన్ రెడ్డికి  రెండో ఛాన్స్ ఇచ్చేది లేదనే నిర్ణయాని కొచ్చారు. అయితే. ఇంతవరకు అందుకు ఒక స్పష్టమైన రుజువు, ఆధారం దొరకలేదు. కానీ  ఇప్పడు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వం పట్ల  ముఖ్యంగా  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అహంకార పోకడల పట్ల ప్రజాగ్రహం స్పష్టమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం సారథ్యంలోనే వైసీపీ వ్యతిరేక కూటమి ఏర్పడుతుందనే స్పష్టత వచ్చందని అంటున్నారు. ఎమ్యెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఏకైక ప్రత్యాన్మయంగా టీడీపీ ఏమర్జ్  అయిన నేపథ్యంలో, పొత్తుల విషయంలో కూడా క్లారిటీ వస్తోందని పరిశీలకులు అంటున్నారు. నిజానికి  రాష్ట్రంలో రాజకీయ పొత్తులకు సంబంధించి చాలా కాలంగా చాలా చాలా చర్చలు,  వ్యూహాగానాలు సాగుతున్నా ఇంతవరకు ఒక స్పష్టత అయితే రాలేదు. ఈ నేపథ్యంలో  మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు పితాని సత్యనారాయణ కొత్త చర్చకు తెర తీశారు. పొత్తులపై ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం జరగలేదని చర్చలు మాత్రమే జరుగుతున్నాయన్నారు. ఏదైనా పార్టీ తమతో కలుస్తానంటేనే పొత్తులపై అధిష్ఠాన నిర్ణయం తీసుకుంటుందన్నారు.అంతే కాదు  నిజం అయినా కాకున్నా ఇంతవరకు జనసేన, బీజేపీ కూటమితో  పొత్తుకు టీడీపీ తహతహా లాడుతోందనే ప్రచారం జరిగింది. అయితే  పితాని  బీజేపీ పార్టీ పొత్తుల విషయంలో క్లారిటీ ఇవ్వాలని, వైసీపీ తో విడిపోతేనే ఆ పార్టీతో పొత్తు గురించి ఆలోచిస్తామని  బంతిని బీజేపీ కోర్టులోకి నెట్టారు.  అదే సమయంలో పితాని  టీడీపీ క్యాడర్ కు కూడా హిత బోధ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుతో సంబరాలు చేసుకుంటే సరిపోదు కష్టపడితేనే గెలుపు సాధ్యం అవుతుందన్నారు. ఆత్మ విమర్శ చేసుకుని చేసిన తప్పులు, సవరించుకుంటేనే విజయం వరిస్తుందని పితాని పేర్కొన్నారు. ప్రత్యేకించి తాడేపల్లిగూడెంలో టీడీపీ ఇంచార్జ్ వలవల బాబ్జీ గెలుపు కోసం క్యాడర్ ఇప్పటినుంచే కష్ట పడాలని సూచించారు. అధికార పార్టీ పతనం ప్రారంభమైందన్నారు. జగన్ మరలా అధికారంలోకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. జగన్ కు ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్ అయ్యిందన్నారు. ఏమైనా  ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఏపీ రాజకీయాల్లో కొత్త డైమెన్షన్  తీసుకొచ్చాయి. ఇది మాత్రం నిజం.

మోడీతో ఢీ అంటే ఢీ.. తగ్గేదేలే ..రాహుల్ !

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు  పార్లమెంట్ మాజీ సభ్యుడు రాహుల్ గాంధీ  ప్రధాని నరేంద్ర మోడీపై, తగ్గేదే లే అన్న తరహాలో మరో మారు విరుచుకు పడ్డారు. ప్రశ్నాస్త్రాలను సందించారు. గత లోక్ సభ ఎన్నికల సందర్భంగా, ‘మోడీలంతా దొంగలే’ అనే అర్థం వచ్చేలా చేసిన వ్యాఖ్య.. పై బీజేపీ ఎమ్మెల్యే ఒకరు సూరత్ కోర్టులో  వేసిన క్రిమినల్ డిఫమేషన్ కేసులో నాయస్థానం ఆయనకు రెండేళ్ళు జైలు శిక్ష విధించిన విషయం. కోర్టు తీర్పు నేపధ్యంగా రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దయిన విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ అనర్హత వేటు పడినా  తగ్గేదేలే అనే రీతిలో, అదానీ, మోడీ సంబంధాలను మరోమారు గట్టిగా గళమెత్తారు.  అనర్హత వేటు తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన ఆయన.. డిఫెన్స్ సెక్టార్‌తో ముడిపడి ఉన్న అదానీ షెల్ కంపెనీలలో ఎవరు పెట్టుబడి పెట్టారో చెప్పాలని ప్రధాని మోడీని ప్రశ్నించారు. అలాగే అదానీ కంపెనీ పెట్టుబడులలో  ఒక చైనా జాతీయుడికి కూడా సంబంధం  ఉందని ఆరోపించారు. అందుకే ఆ పెట్టుబడుల వివరాలేంటో చెప్పాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అలాగే  దేశంలో ప్రజస్వామ్య వ్యవస్థలపై దాడి జరుగుతోందని, దేశ విదేశాల్లో వివాదస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ,  తాను భారత దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడాను, పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. భారత్‌ జోడో యాత్రతో  ప్రజల్లోకి వెళ్లానని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజాస్వామ్యం పై విశ్వాసం లేదని,   ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తే అయితే తనకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ఫైరయ్యారు. భారత ప్రజల ప్రజాస్వామిక గొంతు వినిపించేందుకు, కాపాడేందుకే  తాను ఉన్నానని  భయపడేది లేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు ఇదివరకటిలా మీడియా సంస్థల నుంచి లభించిన మద్ధతు ఇప్పుడు లేదు. ఇది ఓబీసీల వ్యవహారం కాదు. ఇది మోడీ, అదానీల సంబంధానికి సంబంధించిన వ్యవహారం. దాన్నుంచి దృష్టి మళ్లించడం కోసం విదేశాల్లో నా వ్యాఖ్యల గురించి మాట్లాడతారు. అనర్హత అంశాన్ని తీసుకొస్తారు. ఇప్పుడు ఓబీసీ అంటున్నారు. నేను నిజం మాట్లాడతాను. మాట్లాడుతూనే ఉంటాను. నాపై అనర్హత వేటు వేసినా, జైల్లో పెట్టినా నాకు పెద్ద తేడా ఏమీ లేదు. అనర్హతలు లాంటివి నన్ను ఏం చేయలేవు. ఇలాంటి వాటిని నేను పట్టించుకోను. నా పోరాటాన్ని యథావిధిగా కొనసాగిస్తాను. మోడీని  ప్రశ్నిస్తూనే ఉంటాను. ఇది ఓబీసీ వ్యవహారం కాదు... మోదీ, ఆదానీ మధ్య ఉన్న బంధం పై ప్రశ్నిస్తున్నాను. రూ. 20 వేల కోట్లు ఎక్కడివి, ఎక్కడి నుంచి ఆదానీ షెల్ కంపెనీల్లోకి వచ్చాయో చెప్పాలని రాహుల్ గాంధీ విలేకరుల సమవేశంలో ప్రశ్నల వర్షం కురిపించారు.   కేసు, శిక్ష, తదుపరి కార్యాచరణ గురించి అడిగియన ప్రశ్నకు సమాధానమిస్తూ రాహుల్ గాంధీ, నేను దేశ న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. అందుకే న్యాయపరమైన అంశాల గురించి నేను ఇప్పుడు మాట్లాడను. . పార్లమెంటులో నేను మాట్లాడబోయే అంశాల గురించి మోదీ భయపడ్డారు. నాపై అనర్హత వేటు వేయడానికి అదే కారణం. నాకు సంఘీభావం, మద్ధతు ప్రకటించిన విపక్షాలకు కృతజ్ఞతలు. అందరం కలసి కట్టుగా పనిచేద్దాం. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, లేకున్నా నా పని నేను చేస్తా అని రాహుల్ ఉద్ఘాటించారు.   ప్రధాని ప్రతిపక్షాలకు ఒక గట్టి ఆయుధాన్ని ఇచ్చారు. ప్రధాని చర్యలతో ఆయన చేసిన తప్పు గురించి చర్చ జరుగుతోంది. అదానీ ఒక అవినీతి, అక్రమార్కుడని ప్రజలందరికీ తెలిసిపోయింది. అలాంటి వ్యక్తిని ప్రధాని మోడీ ఎందుకు కాపాడాలని చూస్తున్నారని జనం చర్చించుకుంటున్నారు. అదానీ గురించి అడిగితే.. దేశంపై దాడి అంటున్నారు. అంటే అదానీయే దేశం అని ప్రధాని చెబుతున్నారా?  అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కాగా  విలేకరుల సమావేశంలో రాహుల్  ప్రవర్తించిన తీరును గమనిస్తే  ఆయన  మోదీ మహా సంగ్రామానికి సిద్దమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

రాహుల్ అనర్హతపై సుప్రీంలో పిల్

క్రిమినల్ డిఫమేషన్ కేసులో దోషిగా తేల‌డంతో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దు అయిన నేప‌థ్యంలో ఆయనపై అనర్హత వేటు వేసిన ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8(3) చెల్లుబాటును సవాలు చేస్తూ  సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం  (పిల్) దాఖలైంది. రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల జైలు శిక్ష పడితే ఆటోమెటిక్‌గా ప్ర‌జాప్ర‌తినిధుల్ని అన‌ర్హులుగా ప్ర‌క‌టించే సెక్ష‌న్ 8   ఏక‌ప‌క్షంగా ఉంద‌ని పిటిషనర్ ఆరోపించారు. ప్రజా ప్రాతినిధ్య‌ చట్టంలోని సెక్షన్‌ 8 (3) రాజ్యాంగ చెల్లుబాటును కూడా పిటిష‌న‌ర్ సవాల్ చేశారు. కేరళకు చెందిన స్కాలర్, సామాజిక కార్యకర్త మురళీథరన్ ఈ పిల్ దాఖలు చేశారు.  సెక్ష‌న్ 8(3)  రాజ్యాంగ స్ఫూర్తికి వ్య‌తిరేక‌ంగా ఉందని ఆయన తన పిల్ లో  పేర్కొన్నారు. ఈ సెక్షన్ ఎంపీలు, ఎమ్మెల్యేల భావ ప్రకటనా స్వేచ్ఛ‌ను హరించేదిగా ఉందని పేర్కొన్నారు. ‘మోడీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో సూర‌త్ కోర్టు ఇటీవ‌ల రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడం, ఆ వెంటనే  రాహుల్ గాంధీ లోక్‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేస్తూ లోక్‌స‌భ స‌చివాల‌యం నోటిఫికేషన్ విడుదల చేయడం తెలిసిందే.

చింతకాయల విజయ్ కు సీఐడీ నోటీసులు

టీడీపీ యువ నేత చింతకాయల విజయ్ కు ఏపీ సీఐడీ  మళ్లీ నోటీసులు జారీ చేసింది. సామాజిక మాధ్యమంలో ఏపీ సీఎం జగన్ సతీమణి  వైఎస్ భారతికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన కేసులో ఈ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 28వ తేదీన  విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో నోటీసుల్లో పేర్కొన్నారు. నర్సీపట్నంలోని విజయ్ నివాసానికి వెళ్లి  సీఐడీ అధికారులు  ఆ  సమయంలో విజయ్ అక్కడ లేకపోవడంతో ఆయన తండ్రి, మాజీ మంత్రి  అయ్యన్న పాత్రుడుకి నోటీసులు అందజేశారు. అయితే చింతకాయల విజయ్ కు మరో సారి సీఐడీ నోటీసులపై తెలుగుదేశం శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి.  కక్ష సాధింపుల్లో భాగంగానే నోటీసులు ఇస్తున్నారని విమర్శిస్తున్నాయి. 

తెలుగు దేశంకు మద్దతుగా రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్!

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత తెలుగుదేశంలో నయా జోష్ కనిపిస్తోంది. అన్నీ మాంచి శకునములే అన్నట్లుగా ఆ పార్టీ శ్రేణులు సంబరపడిపోతున్నాయి. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర అశేష ప్రజాదరణతో 50 రోజులుగా సాగుతోంది. అడుగడుగునా జననీరాజనంతో ఆయన పాదయాత్ర సాగుతున్న తరుణంలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో సంపూర్ణ విజయం, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో అధికార వైసీపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే స్ధాయిలో దక్కిన విజయం పార్టీలో సహజంగానే ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసింది. నారా లోకేష్ పాదయాత్రలో శనివారం (మార్చి 25) నారా వారి కుటుంబానికి చెందిన హీరో నారా రోహిత్ పాల్గొన్నారు. సోదరుడితో అడుగు కలిపి నడిచారు. ఆ సందర్భంగా రోహిత్ మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలూ తెలుగుదేశంకే మద్దతు పలుకుతున్నారని స్పష్టం చేశారు. వైసీపీ వరుస పరాజయాలతో డిఫెన్స్ లో పడిన తరుణంలో రోహిత్ మరో బాంబు పేల్చారు. నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా రంగంలోకి దిగనున్నారని వెల్లడించారు.  వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ 2009లోనే విస్తృతంగా ప్రచారం చేశారు. అప్పట్లో ఆయన ప్రచారానికి బ్రహ్మాండమైన ప్రజా మద్దతు లభించింది. పాతికేళ్ల వయస్సులోనే ఆయన ప్రచారం ఎంతో పరిణితితో ఉందని పరిశీలకులు సైతం ప్రశంసలు కురిపించారు. 2009 తరువాత జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా రాజకీయాలలో క్రియాశీలంగా  లేరు. పూర్తిగా సినీ కెరీర్ మీదే దృష్టి పెట్టారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పీక్స్ లో ఉంది. పాన్ ఇండియా స్టార్ గా అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఆస్కార్ సాధించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆయన హీరోగా నటించారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాలలో క్రియాశీలంగా పాల్గొంటారా అన్న అనుమానాలు వ్యక్తం ఔతున్నప్పటికీ.. ఇటీవలి కాలంలో ఆయన తెలుగుదేశంకు మద్దతుగా వచ్చే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. దివంగత హరికృష్ణ కూడా నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం రోజున సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంకు మద్దతుగా రంగంలోకి దిగుతారని చెప్పిన సంగతిని తెలుగుదేశం శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. అలాగే పాదయాత్రలో భాగంగా లోకేష్ కూడా జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా రంగంలోకి దిగుతారనీ, సమయం వచ్చినప్పుడు ఆయన తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారని చెప్పారు. ఇప్పుడు తాజాగా నారా రోహిత్ కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి చెప్పడంతో ఆయన పార్టీకి మద్దతుగా రంగంలోకి దిగే సమయం దగ్గరకు వచ్చేసిందనే తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. 

అనర్హత వేటు.. రాహుల్ స్వయం కృతమేనా?

ఏ ముహూర్తాన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించారో ఏమో కానీ, అప్పటి నుంచి ఆయన వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్నారు. కానీ, అదే సమయంలో ఆయనను ఒకదాని వెంట ఒకటిగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా  ఎప్పుడో 2019 ‘దొంగలందరికీ మోడీ ఇంటిపేరు ఎలా వచ్చింది’ అని చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మార్చేసింది.   ‘మోడీలంతా దొంగలే’ అనే అర్ధం వచ్చేలా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై. అప్పట్లోనే బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ సూరత్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలు చేశారు. కేసు విచారణ జరిపిన  సూరత్ కోర్టు  గత గురువారం (మార్చి 23) రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించింది. రెండేళ్ళు జైలు శిక్ష విధించింది.  దీంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దయింది.   పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడటం, ఆ వెంటనే లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడు కావడం చకచకా జరిగి పోయాయి. ప్రస్తుతానికి అయితే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ... అంతే కాదు, 'మోడీ ఇంటిపేరు' వ్యాఖ్యపై క్రిమినల్ డిఫమేషన్ కేసులో సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించి, రెండేళ్ళు జైలు  శిక్ష విధించిన నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాహుల్‌  గాంధీ ఎనిమిదేళ్ళ పాటు  ఎన్నికలలో పోటీ చేసే అర్హతను కూడా కోల్పోయారు. అయితే, సూరత్ కోర్టు తీర్పుపై పై కోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు న్యాయస్థానం రాహుల్  గాంధీకి  30 రోజులు గడువు ఇచ్చింది. ఆ ప్రకారంగా రాహుల్ గాంధీకి  పై కోర్టులలో ఉపశమనం లభిస్తే లభించవచ్చును. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో జరుగుతున్న రాజకీయ చర్చను పక్కన పెడితే రాహుల్ గాంధీ చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకోవడం మాత్రం ఆయన స్వయం కృతమే అంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ అధికారంలో ఉన్న రోజుల్లో అప్పటి  ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒక  ‘మంచి’ ఆర్డినెన్స్‌ తెచ్చింది. అయితే, కాబినెట్ ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం పొందిన సదరు ఆర్డినెన్స్‌  కాపీని, రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో పరపరా చించి పారేశారు.  నేరస్తులను రక్షించేందుకు, ఆర్డినెన్స్‌ తీసుకురావడం సిగ్గుచేటని సొంత కూటమి సర్కార్ నే ఎడాపెడా కడిగి పారేశారు. తమకున్న వీటో పవర్ తో ఆర్డినెన్స్‌ రద్దు చేయించారు.  నిజానికి. జైలు శిక్ష పడిన ప్రజా ప్రతినిధిని తక్షణమే అనర్హుడిగా ప్రకటించకూడదని, అప్పీల్ కు సమయం ఇవ్వాలని, పై కోర్టు స్టే విధిస్తే  అనర్హత అంశం పై నిర్ణయం తీసుకోకూడదని పేర్కొంటూ  మన్మోహన్ సింగ్ సర్కార్ ముందుచూపుతో తెచ్చిన ఆర్డినెన్స్‌ అది. అది అలాగే ఉంది ఉంటే ఇప్పుడు రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పడేది కాదు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ఆ సెక్షన్ 8(4) ను  పునరుద్ధరిస్తూ అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ ను రూపొందించింది.  రాహుల్‌ సొంత పార్టీకి చెందిన ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ను అవమానించే ఉద్దేశంతో అప్పట్లో దానిని   ఆర్థం లేని ఆర్డినెన్స్‌, దోషులను కాపాడేలా ఉందంటూ అంటూ  చించేశారు. ఆ ఆర్డినెన్స్ పత్రాలను చించేసిన దాదాపు దశాబ్దం తరువాత రాహుల్ గాంధీ  స్వయంగా అనర్హతకు గురి కావడాన్ని పొయిటిక్ జస్టిస్ అనాలో మరేమనాలో కానీ   అయన స్వయంకృతం అనడంలో మాత్రం సందేహం అక్కరలేదు. అందుకే రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దుకు కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్లుగా  బీజేపీ, మోడీ కారణం అయితే కావచ్చును కానీ    రాహుల్ గాంధీ స్వయం కృతం కూడా కచ్చితంగా ఒక కారణం.  అలాగే, ఈ కేసును విచారించిన సూరత్‌ చీఫ్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ హెచ్‌.హెచ్‌.వర్మ తీర్పు ఇచ్చే సందర్భంగా, నిందితుడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. ప్రజల్లో ఆయన చేసే ప్రసంగాలకు ప్రభావం ఎక్కువ. నిందితుడికి స్వల్పశిక్ష విధిస్తే అది ప్రజలకు తప్పుడు సందేశం పంపిస్తుంది. ఎవరు ఎవరిపైనైనా సులువుగా అపనింద వేస్తారు. ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అని గతంలో నిందితుడు వ్యాఖ్యానించి క్షమాపణలు చెప్పిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ ఇకపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. అయినా ఆయన ప్రవర్తనలో మార్పేమీ ఉన్నట్లు కనిపించడం లేదు అని వ్యాఖ్యానించారు.  ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్య ద్వారా పరువునష్టం కలిగించారని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే ఈకేసులో చివరకు ఏమి జరుగుతుంది? అనేది పక్కన పెడితే  ఒక్క రాహుల్ గాంధీకి మాత్రమే కాదు నోరుంది కదా అని, నోరు పారేసుకునే నాయకులు అందరికీ ఇది ఒక హెచ్చరికే అని భావించాల్సి ఉంటుంది.

ముందస్తుకే జగన్ మొగ్గు.. తెలంగాణ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకీ?!

ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి .. ఎటూ పోలేని పరిస్థితిలో  జగన్ రెడ్డి ప్రభుత్వం ఉందా అన్న ప్రశ్నకు ప్రజల నుంచీ, రాజకీయ పరిశీలకుల నుంచీ కూడా ఔననే సమాధానమే వస్తోంది.   మహా కవి, శ్రీ శ్రీ సంధ్యా సమస్యలు కవితను గుర్తుకు తెచ్చేదిగా జగన్ రెడ్డి ప్రభుత్వం పరిస్థితి ఉందని అంటున్నారు.  గ్రాడ్యుయేట్ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి ఇక్కటే కాదు.. భవిష్యత్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఓటమి తప్పదన్న భయంతో జగన్ రెడ్డి వణికి పోతున్నట్లు కరిపిస్తోందని క్రాస్ ఓటింగ్ నెపంతో నలుగురిపై వేసిన సస్పెన్షన్ వేటును అభివర్ణిస్తున్నారు. నిజానికి, ఓటమి భయం తోనే వైసీపీ అధినేత  నేతలు ఏమి  చేయడమో ... ఎటు పోవడమో అర్థం కాని అయోమయ పరిస్థితిలో జగన్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. ముందస్తు ఎన్నికలకు పోదామంటే, ముందుగానే ఇంటికి పోతామని సొంత పార్టీ ఎమ్మెల్యేలే  సెటైర్లు వేస్తున్నారు. ఐదేళ్ల సమయం పూర్తయ్యే దాకా ఆగుదామా అంటే.. అయ్యో అలా ఎలా మొదటికే మోసం వస్తుందని మళ్లీ వాళ్లే అంటున్నారు. టుబీ ఆర్ నాట్ టుబి అన్నట్లుగా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో జగన్ కొట్టుమిట్టాడుతున్నారని పరిశీలకులు అంటున్నారు.  అందుకే అధికార పార్టీ నేతలు ముందస్తు ఎన్నికల అట్టును అటూ ఇటూ తిరగేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి ముందస్తు ముచ్చటను తెరపైకి తీసుకువచ్చినదే వైసీపీ నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి కంటే చాలా చాలా ముందుగానే.. ఒకటికి పది సార్లు వైసీసీలో, జగన్ రెడ్డి ప్రభుత్వంలో  సకల శాఖల మంత్రిగా చెలామణి అవుతున్న సజ్జల రామకృష్ణా రెడ్డి ఏడాది ఏణ్ణర్థం ముందు నుంచే ముందస్తు ఉందనీ లేదనీ చెబుతూ చర్చను ఎప్పటికప్పుడు సజీవంగా ఉంచుతూ వస్తున్నారు.  నిజానికి  ప్రతిపక్ష పార్టీలు ముందస్తు ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వ్యూహాత్మక తప్పటడుగులను, తప్పుటడుగులను పెద్దగా పట్టించుకోవడం లేదు.  అలాగే  ప్రజలు కూడా ముందస్తు ఉంటుందా, ఉండదా అన్న విషయంపై ఇసుమంతైనా ఆసక్తి చూపడంలేదు.  ఎన్నికలు ఎప్పడు వచ్చినా ‘ఒక్క ఛాన్స్’ మోసానికి గట్టిగానే బదులు తీర్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు.   ఇక ప్రజల నిర్ణయం, విపక్షాల వ్యూహాలు, ఉద్దేశాలతో పని లేకుండా జగన్ ముందస్తే మార్గమన్న నిర్ణయానికి వచ్చేసినట్లు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఏపీలో ముందస్తు ముహూర్తంపై చర్చోపచర్చలు జోరందుకున్నాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో కూడా అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న  అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్త మౌతోంది. జగన్ కూడా అదే సమయానికి ఎన్నికలకు వెళితే బెటర్ అని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఎంత ఆలస్యం చేస్తే అంతగా వైసీపీ నష్టపోతుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆగకుండా, వీలైతే అంత కంటే ముందుగా ఎన్నికలు జరిపిస్తే వైనాట్ 175 కాకపోయినా.. కొద్దో గోప్పో స్థానాలను గెలుచుకుని పరువు కాపాడుకునే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఒక సారి ప్రజలలో వ్యతిరేకత ఉందన్న విషయం బయటపడిన తరువాత ఎన్నికలు ఎంత ఆలస్యమైతే విపక్షం అంత బలపడుతుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇక చేతులు పూర్తిగా కాలిపోయాయి. ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదు అన్న భావన పార్టీ నాయకులలోనే వ్యక్తమౌతోంది. అందుకే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో నిర్భయంగా నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. సాంకేతికంగా అసెంబ్లీలో తెలుగుదేశంకు ఉన్న బలం మేరకే ఓట్లు పడినప్పటికీ.. వాస్తవ బలం కంటే నాలుగు ఓట్లు ఆ పార్టీకి ఎక్కువ పడిన సంగతి సుస్పష్టమే. సొంత పార్టీ ఎమ్మెల్యేలే, ఇంకా ఏడాదికి పైగా ప్రభుత్వానికి గడువు ఉందని తెలిసీ క్రాస్ ఓటింగ్ చేశారంటే.. వారిలో జగన్ సర్కార్ పట్ల ఎంత అసంతృప్తి గూడు కట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు. వాస్తవానికి జగన్ సర్కార్ పై, జగన్ తీరుపై అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 16 అని అధికార పార్టీ అగ్రనాయకత్వమే నిర్థారణకు వచ్చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆ విషయాన్ని నిఘా పెట్టడం ద్వారా వైసీపీయే తేటతెల్లం చేసింది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ నలుగురిపై సస్పెన్షన్ వేటు కూడా వేసేసింది. ఈ చర్యతో మిగిలిన అంసతృప్తులకు హెచ్చరిక పంపామని వైసీపీ భావిస్తున్నా.. అనర్హత వేటు పడిన తరువాత మేకపాటి మీడియాతో మాట్లాడిన మాటలు ‘ఎంతో రిలీఫ్’ ఫీలవుతున్నానంటూ చేసిన వ్యాఖ్యలూ ధిక్కారం ప్రదర్శించే విషయంలో ఆయనే కాదు, అసంతృప్తులెవరూ తగ్గేదే లే అన్న మూడ్ లోనే ఉన్నారని అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే.. పరిస్థితి ప్రభుత్వానికి అగమ్య గోచరంగా ఉంది. ముందు ముందు తన ఫ్లాగ్ మార్క్ గా చెప్పుకుంటున్న బటన్ నొక్కుడు సంక్షేమం పందేరం చేయడం అసాధ్యంగా మారిపోతుంది. అందుకే పథకాల అమలు ఆగిపోకముందే ముందస్తుకు వెళ్లడమే మంచిదన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారని అంటున్నారు. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీలు కూడా జరిగే విధంగా జగన్ వ్యూహరచనలో ఉన్నారని అంటున్నారు.  

జాతీయ రాజకీయాలలో మళ్లీ కేసీఆర్ క్రీయాశీలం?

రాహుల్ గాంధీపై అనర్హత వేటును కేసీఆర్ తన జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు ఒక అవకాశంగా భావిస్తున్నారా అంటే ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పటి వరకూ కాంగ్రెస్సేతర , బీజేపీయేతర కూటమి, ఫ్రంట్ అంటూ కాలికి బలపం కట్టుకు తిరిగినా జాతీయ స్థాయిలో కేసీఆర్ మార్క్ రాజకీయాలకు పెద్దగా స్పందన రాలేదు. దీంతో ఆయనే సొంత కుంపటి పెట్టుకుని తన వంతు ప్రయత్నాలు తాను సాగిస్తున్నా.. ఆ ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తప్ప మరే రాష్ట్రంలోనూ చివరాఖరికి తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కమిటీలు ఏర్పాటైన దాఖలాలు లేవు. ఈ లోగానే ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితపై ఆరోపణలు, విచారణలు, టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థి, నిరుద్యోగులలో కేసీఆర్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం నిరసనల రూపంలో వ్యక్తం అవుతుండటంతో ఆయన జాతీయ అడుగులకు విరామం తప్పదా అన్న అనుమానాలు రేకెత్తాయి. అందుకు తగ్గట్టుగానే కవితను ఈడీ విచారణ నేపథ్యంలో ఆయన తెలంగాణ సెంటిమెంటును మళ్లీ తెరపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు  కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషణలు సైతం చేశారు. సరిగ్గా ఇదే సమయంలో క్రిమినల్ డిఫమేషన్ కేసులో రాహుల్ కు గుజరాత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం, దాంతో పార్లమెంటు ఆయనపై అనర్హత వేటు వేయడంతో కేసీఆర్ మరోసారి జాతీయ స్థాయిలో తన గళం బలంగా వినిపించేందుకు నడుం బిగించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనకు మద్దతుగా నిలవడానికి రెడీ అయిపోయారు. అంతే కాదు ఆ ఆందోళనలో క్రీయాశీలంగా వ్యవహరించాలని కూడా నిర్ణయించారు. పలు ప్రాతీయ పార్టీల నాయకులతో ఇప్పటికే మంతనాలు ప్రారంభించారని కూడా చెబుతున్నారు. రాహుల్ గాంధీకి సంఘీభావం ప్రకటించేందుకు ఆయన స్వయంగా ఢిల్లీ వెళ్లాలని కూడా భావిస్తున్నట్లు బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.  రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్ సభ గెజిట్ విడుదల చేసిన వెంటనే సీఎం కేసీఆర్ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటన విడుదల చేశారు.  రాహుల్ సభ్యత్వం రద్దుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టనున్న దేశ వ్యాప్త ఆందోళనకు కేసీఆర్ మద్దతు ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఈ విషయంలో ఆయన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్,  జేడీయూ అధినేత నితీష్ కుమార్, తమిళనాడు సీఎంస్టాలిన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని కూడా   చెబుతున్నాయి.  

తెలంగాణలో తెలుగుదేశం సైలెంట్ వేవ్!

తెలంగాణ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. రాష్ట్రంలో ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్  ఎలాగైనా రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు వేటికవి వాటి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాయి. తెరాస పేరు మార్చి బీఆర్ఎస్ అంటూ జాతీయ పార్టీగా మారిన తరువాత.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలకు విఘ్నాలు ఎదురౌతున్నాయని పరిశీలకులు అంటున్నారు.  ముఖ్యంగా గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండటంతో సహజంగానే అధికార పార్టీగా యాంటీ ఇన్ కంబెన్సీని ఎదుర్కొంటున్నది. రెండు ఉప ఎన్నికలలో విజయం సాధించి బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా దూకుడుగా సాగుతోంది. ఇక టీపీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం పెరిగిందని పరిశీలకులు అంటున్నారు. అధికారమే లక్ష్యంగా ఈ మూడు పార్టీలూ దూకుడుగా సాగుతుంటే..  చాపకింద నీరులా తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రం విడిపోయిన తరువాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో నామమాత్రంగా మారిపోయింది.    2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున తెలంగాణలో గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ తర్వాత   టీఆర్ఎస్( ఇప్పుడు బీఆర్ఎస్) పంచన చేరిపోయారు. దీంతో తెలంగాణ అసెంబ్లీలో  తెలుగుదేశం కు  ప్రాతినిథ్యం లేకుండా పోయింది.    అలాంటి వేళ.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పార్టీ అధినేత చంద్రబాబు కంకణం కట్టుకున్నారు.  తెరాస బీఆర్ఎస్ గా మారిన తరువాత ఆ పార్టీ బలహీనపడుతోందన్న అంచనాలున్నారు. ఈ నేపథ్యంలోనే  తెలుగుదేశం తెలంగాణలో తన సత్తా చాటేందుకు పావులు కదపుతోంది.  ఈ నేపథ్యంలోనే ఈ నెల  29న తెలుగుదేశం పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని హైదరాబాద్ లోని  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. 1982, మార్చి 29న హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీని విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు స్థాపించిన సంగతి అందరికీ తెలిసిందే. పార్టీని స్థాపించిన జస్ట్ 9 నెలలకే ఆయన అధికారం చేపట్టి తెలుగువాడిలోని వాడి వేడిని రుచి చూపించిన విషయం విదితమే.  అలా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా.. తనదైన శైలిలో పాలన సాగించడమే కాకుండా.. పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను సైతం తీసుకు వచ్చారు. ఆ తర్వాత పార్టీ పగ్గాలు.. చంద్రబాబు చేతిలోకి వెళ్లడం.. ఆ క్రమంలో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు దీటుగా సైబరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సరే రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం తెలంగాణలో ప్రాభవం కోల్పోయింది. నాయకులు లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది తప్ప కార్యకర్తలంతా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారని పరిశీలకలు చెబుతూ వస్తున్నారు. ఇది వాస్తవమేనని   గతేడాది డిసెంబర్ మొదటి వారంలో ఖమ్మం వేదికగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సారథ్యంలో నిర్వహించిన శంఖారావ సభ.. సూపర్ డూపర్ సక్సెస్ నిరూపించింది. దీంతో తెలంగాణ ప్రజల గుండెల్లో తెలుగు దేశం పార్టీ చిరస్థాయిగా భద్రంగా ఉందని స్పష్టం కావడం అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎక్కడ ఉందంటూ ప్రశ్నించిన వారి నోళ్లు మూయించినట్లు అయింది.   మరోవైపు ఈ ఏడాది జరగనున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ.. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో జరగనుందంటూ .. ఓ చర్చ అయితే గట్టిగానే ఊపందుకొంది. కానీ చివరకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలి రానున్నాయని సమాచారం.  ఇక టీఆర్ఎస్ పార్టీ కాస్తా ఇటీవల బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందింది. అలాగే కేంద్రంలోని బీజేపీ పాలనపై కూడా రాష్ట్రంలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. సరిగ్గా ఈ సమయంలో  ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ తీసుకు వచ్చిన పలు సంక్షేమ పథకాలు, రాష్ట్రాభివృద్ధి, శాంతి భద్రతలు, రాష్ట్ర ఆర్ధికాభివృద్ధి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో చోటు చేసుకోన్న అభివృద్ధి పరిణామాలను ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రజల్లోకి టీడీపీ శ్రేణులు చాలా బలంగా తీసుకు వెళ్తున్నాయి. అలాగే   పార్టీ ఆవిర్భావ సభ ద్వారా.. ప్రజలను మరింత చైతన్యం చేయగలిగితే.. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని ఘనంగా చాటడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏది ఏమైనా తెలంగాణలో తెలుగుదేశం సైలెంట్ వేవ్ ఉందన్న అభిప్రాయమే పొలిటికల్ సర్కిల్స్ లో సర్క్యులేట్ అవుతోంది. 

ఒక్క ఫలితం.. అనేక పరాభవాలు

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీని ఖతం చేయాలనుకున్న వైసీపీ ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. తీవ్ర పరాభవాన్ని మిగిల్చాయి. తెలుగుదేశం పార్టీకి వాస్తవంగా ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఒక ఎమ్మెల్సీ స్థానం ఆ పార్టీకే దక్కాని. కానీ టీడీపీకి దూరం జరిగి వైసీపీతో జట్టుకట్టిన నలుగురు ఎమ్మెల్యేల బలం చూసుకుని వైసీపీ తెలుగుదేశం పార్టీకి ఆ స్థానం దక్కకుండా చేయాలని చేసిన ప్రయత్నం వికటించింది. సొంత పార్టీ నుంచే క్రాస్ ఓటింగ్ జరుగుతుందని కనీసం ఊహామాత్రంగానైనా అనుకోలేదు. చివరికి వచ్చే సరికి సొంత పార్టీ వారే ఎదురు తిరుగుతారన్న అనుమానం ఆ పార్టీని వణికించింది. దీంతో క్యాంపు ఏర్పాటు చేసింది. అనుమానం ఉన్న సొంత పార్టీ ఎమ్మెల్యేలను బుజ్జగించింది. బతిమలాడుకుంది. నిఘా పెట్టింది. ఎన్ని చేసినా చివరకు తమ పార్టీ ఎమ్మెల్యేల మీద తనకు ఏ మాత్రం నియంత్రణ లేదన్న విషయాన్ని జగన్ కు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు తేటతెల్లం చేశాయి. అలా కాకుండా వైసీపీ టీడీపీకి ఉన్న సంఖ్యా బలం ప్రకారం ఒక స్థానం ఆ పార్టీ గెలుచుకుంటుందని వదిలేసి ఉంటే కొద్దో గొప్పో గౌరవం అయినా నిలబడి ఉండేది.  అలా కాకుండా అహంకారానికి పోయి అప్రతిష్ఠ మూటగట్టుకోవడమే కాదు.. సొంత పార్టీలో ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేయడానికి భయపడే పరిస్థితుల్లో లేరని తనకు తాను చాటుకున్నట్లైంది. కుప్పం స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం తరువాత అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ముఖం చూడాలని ఉందంటూ సీఎం జగన్ అహంకారంతో చేసిన వ్యాఖ్యల తరువాత తెలుగుదేశం నుంచి అటువంటి వ్యాఖ్యలే వస్తాయనడంలో సందేహం లేదు. ఇక విషయానికి వస్తే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనూరాథ ఏ విధంగా చూసినా విజయం సాధించే అవకాశాలు లేవమాత్రంగా కూడా లేవన్నది అంకెలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆ పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో నలుగురు వైసీపీ శిబిరంలో ఉన్నారు. దీంతో తెలుగుదేశం బలం 19కి పడిపోయింది. ఎమ్మెల్సీ గెలవాలంటే కనీసం 22 మంది మద్దతు ఉండాలి. పోనీ వైసీపీలో ఇద్దరు పార్టీతో విభేదించి ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తామని ప్రకటించారు కనుక వారిరువురూ తెలుగుదేశం అభ్యర్థికి ఓటు వేసిన తెలుగుదేశంకు వచ్చే ఓట్లు 21 మాత్రమే. అంటే ఎలా చూసినా పంచుమర్తి అనూరాథ పరాజయం పాలవ్వక తప్పదు. ఇదీ వైసీపీ లెక్క. మరి తెలుగుదేశం ఎందుకు గెలచింది. పంచుమర్తి అనూరాధకు 23 ఓట్లు ఎలా వచ్చాయి? అధికార పార్టీ నుంచే క్రాస్ ఓటింగ్ జరిగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా వైసీపీకి పరాభవమే ఎదురైంది. ఎన్నికలు జరిగిన మూడు స్థానాలలోనూ తెలుగుదేశం విజయఢంకా మోగించింది.  అందులోనూ వైసీపీకి పెట్టని కోటగా భావించే రాయలసీమలోనూ పరాజయ పరాభవమే జగన్ కు ఎదురైంది.   ఇక పులివెందుల విషయానికి వస్తే అక్కడ వైఎస్ ఫ్యామిలీ తప్ప,  ఎవరూ సాధించని అమోఘ ఫలితాన్ని టీడీపీ అభ్యర్ధి రాజగోపాల్‌రెడ్డి సాధించారు. ఆ దెబ్బకు వైసీపీ అధినేత దిమ్మతిరిగి ఉంటుంది. ఆ పరాభవం నుంచి తేరుకోకముందే..   ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బ తగిలింది. ఈ వరుస ఎదురుదెబ్బల వెనుక ఉన్న అసలు కారణమేమిటన్నది అందరికీ ఇప్పటికే అర్ధమైంది. ఇక అర్ధం కావాల్సిందల్లా అధికార పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికే.  ఔను  గ్రాడ్యుయేట్ ఎన్నికలు గానీ, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు గానీ అన్నిటిలోనూ జయాపజయాలకు బాధ్యుడు ఒకే ఒక్కడు . ఆ ఒక్కడూ జగన్ రెడ్డే. ఆయన ఎవరి సలహాలు కానీ, సూచనలు కానీ పట్టించుకునే వ్యక్తి కాదు. ఆయన నిర్ణయమే ఫైనల్. ఆయన వద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇలా ఎవరికీ కనీస గౌరవం దక్కదు. మర్యాద ఉండదు. ఈ విషయాన్ని తనపై సస్పెన్షన్ వేటు పడిన తరువాత ఎమ్మెల్యే మేకపాటి స్వయంగా చెప్పారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా చిన్న విషయమనీ, తనకు అందిన సమాచారం మేరకు కనీసం 50 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారనీ, ఏ క్షణంలోనైనా వారు బయటపడే అవకాశం ఉందని ఆయన చెప్పారు.  ఇందుకు కారణం జగన్ ఎమ్మెల్యేలు, నాయకులతో పనిలేదన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరే కారణమని వివరించారు. పీకే సర్వేలు, వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది,  తాను బటన్ నొక్కడంతో ఖాతాలలో సొమ్ములు పడుతున్న లబ్ధిదారులు చాలన్నది జగన్ భావనగా మేకపాటి అభివర్ణించారు.   జగన్ తీరు కారణంగానే తమతమ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు పూచికపుల్ల గౌరవం కూడా దక్కడం లేదు. అధికారులు మాట వినడం లేదు.  ఈ కారణంగానే ఆత్మాభిమానం ఉన్న ఎమ్మెల్యేలెవరూ మరో సారి జగన్ వెంట నడవడానికి ఇష్టపడరన్నది మేకపాటి మాటల సారాంశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వారు సైతం, సీఎంఓలో అధికారుల అపాయింట్‌మెంట్ల కోసం గంటలు ఎదురుచూడాల్సిందే. ఈ విషయాన్ని మేకపాటి తనకు ఎదురైన అనుభవాలను చెప్పడం ద్వారా తేటతెల్లం చేశారు. సీఎంను కలవడం కోసం తనలాంటి సీనియర్లు వెళ్లినా పలకరించే నాథుడు ఉండడని మేకపాటి చెప్పారు.  ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి వంటి సీనియర్లు దూరం కావడానికీ అదే కారణం.  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరాభవం కంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాభవ భారం ప్రభావం పార్టీ భవిష్యత్ లోనూ వెంటాడుతూనే ఉంటుంది. ఇకపై జగన్ నిర్ణయాలను పార్టీ గతంలోలా తలూపేసి ఓకే చెప్పేసే పరిస్థితి ఉండదన్నది పరిశీలకుల విశ్లేషణ.     

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యింది. త్వరలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలసిందే. ఈ సారి కర్నాటకలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ అందుకు అన్ని విధాలుగా సమాయత్తమౌతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సొంత రాష్ట్రం అవ్వడంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే రాష్ట్రంలో పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను శనివారం (మార్చి 25) ప్రకటించింది. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ద్వారా తొలి జాబితాను విడుదల చేసింది.  మొత్తం 124 మందికి తొలి జాబితాలో టికెట్ కేటాయించింది.  ఆ జాబితా ప్రకారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపుర నుంచి పోటీ చేయనున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి సిద్ధిరామయ్యకు టికెట్ దక్కింది.  మాజీ ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర, మాజీ మంత్రి మునియప్ప,  పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే తదితరులు తొలి జాబితాలో టికెట్ దక్కించుకున్నవారిలో ఉన్నారు.

అదానీ అంశం లేవనెత్తినందుకే.. ప్రియాంక

గాంధీ కుటుంబంపై విమర్శలు చేయడమే బీజేపీ నేతల పనిగా కనిపిస్తోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా వధేరా గాంధీ అన్నారు. రాహుల్ గాంధీపై పార్లమెంటు అనర్హత వేటు వేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. అదాని అంశాన్ని లేవనెత్తినందుకే రాహుల్ గాంధీపై పరువునష్టం దావా కేసు తెరపైకి వచ్చిందని అన్నారు. వాస్తవానికి రాహుల్ గాంధీపై పరువునష్టం కేసుకు సంబంధించి కోర్టులో స్టే ఉందని ప్రియాంక అన్నారు. అదానీ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తినందుకే పరువునష్టం దావా తెరపైకి వచ్చి వేగంగా విచారణ పూర్తై తీర్పు కూడా వచ్చేసిందని ప్రియాంక ఆరోపించారు.  అధికార పార్టీ ఎన్ని వేధింపులకు గురిచేసినా తన సోదరుడు రాహుల్ అన్యాయానికి తలవంచడని ప్రియాంక తేల్చిచెప్పారు. అయనా గాంధీ కుటుంబాన్ని  విమర్శించడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని,   అయినా కూడా ఏ జడ్జి కూడా వారికి రెండేళ్ల శిక్ష విధించరని, వారిపై అనర్హత వేటు పడదని ప్రియాంక అన్నారు.

జగన్ వైనాట్ 175 అని ఎలా అనగలుగుతున్నారు.. మేకపాటి

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి జగన్ పై నేరుగా విమర్శలు గుప్పించారు. అలాగే జగన్ కు ఉన్న అసంఖ్యాక సలహాదారులు చేస్తున్న పనేంటని నిలదీశారు. అసలు జగన్  వై నాట్ 175 అని  ఏ ధైర్యంతో అనగలుగుతున్నారో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. తనపై  సస్పెన్షన్ వేటు పడిన తరువాత ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు ప్రస్తావించారు. పార్టీ అధినాయకత్వం వద్దకు తన వంటి సీనియర్లు వెళితే కూడా పలకరించే దిక్కు లేదన్నారు.  ఎమ్మెల్యేలకు సీఎం   గౌరవం ఇవ్వడంలేదన్నారు. సీఎంకు పెద్ద సంఖ్యలో ఉన్న సలహాదారులు చేసే పనేంటో కూడా ఎవరికీ తెలియదని మేకపాటి అన్నారు.   నాకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు అది వద్దని జగన్ తో చెప్పాను" అని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. దాదాపు 50 మంది వరకూ ఎమ్మెల్యేలు పార్టీపైనా, పార్టీ అధినేతపైనా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు.