ఏపీ సర్కార్ కు మరో సలహాదారు..!

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ కు ఎంత మంది సలహాదారులున్నా సరిపోవడం లేదు. రోజుకొక సలహాదారు చొప్పున నియామకాలు  జరుగుతున్నాయా అన్నట్లుగా తయారైంది పరిస్థితి. అసలే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కనిపించిన వారందరికీ పదవులు కట్టబేట్టేయాలన్న తొందర జగన్ లో కనిపిస్తోంది. ఎవరిలోనైనా పదవి దక్కలేదన్న కించిత్ అసంతృప్తి పొడసూపుతోందన్న అనుమానం వస్తే చాలు వారకి ఓ సలహాదారు పదవి కట్టబెట్టేస్తున్నారు.  పార్టీలో రాజకీయ నిరుద్యోగం లేకుండా చేసేయాలన్న ఆత్రంతో సలహాదారు పదవుల పందేరంలో మరే విషయంలోనూ లేనంత వేగం చూపుతున్నారు ముఖ్యమంత్రి జగన్ . తాజాగా వైసీపీ అధికార ప్రతినిథి నారమల్లి పద్మజకు సలహాదారు పదవిని కట్టబెట్టేశారు. ఆమెకు మహిళాశిశుసంక్షేమ, దివ్యాంగ వృద్ధుల విభాగానికి సలహాదారుగా పదవిని కట్టబెట్టేసారు. ఈ పదవి దక్కిన ఆమెకు నెలకు లక్షల్లో వేతనం లభిస్తుంది. సలహాదారు పదవుల నియామకం విషయంలో జగన్ ఒక పద్ధతీ పాడూ పాటించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా ఖాతరు చేయడం లేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలిచ్చే దిక్కు లేదు కానీ.. అయిన వారికి సలహాదారు పేరుతో లక్షల ప్రజాధనాన్ని వేతనాలుగా నిర్ణయించి నియామకాలు కానిచ్చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నాలుగళ్ల కిందట వైసీపీ గూటికి చేరిన నారుమల్లి  పద్మజారెడ్డి ఇంత కాలం వైసీపీ అధికార ప్రతినిథిగా మీడియా ముందుకు వచ్చి, లేదా సామాజిక మాధ్యమంలో విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ ఉండటమే పనిగా పెట్టుకున్నారు. ఇంతగా నోరు చేసుకున్నందుకు ఏదో పదవి కావాలని ఆమె గత నాలుగేళ్లుగా జగన్ ను కోరుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల వేడి మొదలు కావడంతో  ఇప్పటికీ పదవి ఇవ్వక పోతే ఆమె నొచ్చుకుంటారనుకున్నారో ఏమో.. జగన్ మరో సలహాదారు పదవిని సృష్టించి ఆమెకు కట్టబెట్టేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఏయే శాఖలలో అయితేనేం దాదాపు 80 మంది సలహాదారులు ఉన్నారు. రానున్న రోజులలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  

రోజాకు ఉద్వాసనేనా?

ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆ పదవీ బాధ్యతల్లో ఎంత సమర్ధంగా పనిచేస్తున్నారన్న విషయం అంతుచిక్కని అంశంగా ఉంది. పదవీ బాధ్యతల సంగతి ఎలా ఉన్నప్పటికీ నిరంతరం మంత్రి హోదాలో ఆమె గుళ్లూ, గోపురాలు తిరగడం, తీర్థయాత్రలు చేయడం, సొంత నియోజకవర్గం నగరిలో బలమైన తన వ్యతిరేక వర్గంతో ఏదో ఒక పేచీ పెట్టుకుంటుండడం, తాజాగా జనసేన శ్రేణులను  కెలికి మరీ వార్తల్లోకి ఎక్కుతున్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలమైన నేత. జిల్లా మొత్తంలో ఆయనకు మంచి పట్టుంది. అలాంటి జిల్లాలో తొలి నుంచి తనతో విభేదిస్తున్న రోజాకు జగన్ తన రెండో మంత్రివర్గంలో స్థానం కల్పించడం పెద్దిరెడ్డికి సుతరామూ ఇష్టం లేదంటారు. నిజానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ కోటరీలో అత్యంత ముఖ్యమైన వారు అంటారు. అలాంటి పెద్దిపెద్దితో పరోక్షంగా రోజా చిన్న చిన్న విషయాలకు కూడా గిల్లికజ్జాలు పెట్టుకోవడం.. ఆపైన వైసీపీ అధినేత వద్ద పంచాయతీగా మారుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. రోజాకు జగన్ పలుమార్లు సర్దిచెప్పినా.. ఆమె మళ్లీ మొదటికే వస్తుండడంతో ఆయనలో అసహనం పెరిగిపోతోందంటున్నారు. నగరి నియోజకవర్గంలోని వడమాలపేటలో పంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి మంత్రి రోజా ఇటీవల సిద్ధమయ్యారు. అయితే.. పెద్దిరెడ్డి వర్గానికి చెందిన స్థానిక జెడ్పీటీసీ నేత ఆ భవనం ప్రారంభోత్సవానికి అడ్డుపడి రచ్చరచ్చచేశారు. ఆ భవనం నిర్మాణం బిల్లులు పెండింగ్ లో ఉండగా ఎలా ప్రారంభిస్తారంటూ దానికి తాళం వేసి మరీ వెళ్లిపోయారట ఆ జెడ్పీటీసీ. పంచాయతీ భవనాన్ని డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆహ్వానించకుండా ఎలా ప్రారంభిస్తారని జెడ్పీటీసీ నిలదీశారని అంటున్నారు. అయితే.. రాజకీయాల్లో మంత్రి రోజా ఫైర్ బ్రాండ్ కదా..! పోలీసుల సాయం తీసుకుని మరీ ఆ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం అయిందనిపించారు. ఒకే జిల్లాలో ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఉంటే.. ఒకరంటే మరొకరికి పడే ఛాన్స్ ఉండదు. పైగా జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలమైన నేత. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజుల నుంచీ కూడా పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాకు పెదద్దిక్కుగా ఉంటున్నారు. జిల్లా అంతటా ఆయనకు మంచి పరిచయాలు, అనుచరులు ఉన్నారు. పెద్దిరెడ్డిని కాదని జగన్ కూడా ఏమీ చెయ్యరంటారు. అలాంటి పెద్దిరెడ్డితో రోజా ఢీకొనాలని చూడడం పార్టీలో కూడా చాలా మందికి నచ్చడం లేదంటారు. దాంతో పాటు నగరి నియోజకవర్గంలోని పెద్దిరెడ్డి వర్గం ఆమకు కంటి మీద కునుకు లేకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మొన్నా మధ్య ఓ భవన నిర్మాణం కార్యక్రమానికి ప్రోటోకాల్ పట్టించుకోకుండా మంత్రిగా రోజాను ఆహ్వానించకుండా స్థానిక నేతలే చేశారు. రోజా ఏ కార్యక్రమం సజావుగా నిర్వహించకుండా చూస్తారు. ఆమెతో తగవు కూడా పెట్టుకుంటారు. దీంతో కంగుతిన్న రోజా ఎవరో మరో నేతతో ఫోన్ లో చాలా బాధగా మాట్లాడిన ఆడియో మీడియాలో వైరల్ అయింది. మరో పక్కన తన నగరి నియోజకవర్గంలో స్థానిక వ్యతిరేక వర్గం నుంచి ఎదురవుతున్నాయంటూ జగన్ వద్ద మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ వైసీపీ అధినేత ఆమె మొరను పట్టించుకోలేదు. రోజు ఏదో ఒక తలనొప్పి తీసుకొస్తున్న రోజా అంటే జగన్ విసుగెత్తిపోతున్నారని ఆ పార్టీ వర్గాల్లోనే ఓ చర్చ అయితే జరుగుతోందని తెలుస్తోంది. మరో పక్న రోజా పనితీరుపై జగన్ చేయించుకుంటున్న సర్వేల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు నివేదికలు వస్తున్నాయంటున్నారు. తాజాగా జనసేన శ్రేణులతో కూడా రోజా తలపడుతున్నారు. ఇది కూడా ఆమెకు మైనస్ అంటున్నారు. ఇవన్నీ కలగలిపి రోజా మంత్రి పదవి త్వరలోనే ఊస్టింగ్ అవుతుందని పెద్దిరెడ్డి వర్గం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. రోజాకు వచ్చే ఎన్నికల్లో అసలు టికెట్ కూడా వస్తుందో రాదో అనే అనుమానాలు స్థానికంగా వస్తున్నాయి.

టీడీపీ అభ్యర్థిగా వైఎస్ వివేకా కుమార్తె సునీత పోటీ?

కడప మాజీ ఎంపీ, మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారా? కొన్ని సంఘటనలు, కొందరి మాటలను బట్టి చూస్తే.. నిజమే కావచ్చనే అంచనాలు రాజకీయ వర్గాలు, విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డిని పులివెందులలో ఆయన నివాసంలోనే దుండగులు అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపేశారు. ఆ సమయంలో టీడీపీ అధికారంలో ఉంది. ఆ హత్యతో అప్పటి సీఎం చంద్రబాబుకు ముడిపెట్టిన జగన్ రెడ్డి మీడియా ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ ఊరూవాడా గగ్గోలు పెట్టింది. అయితే.. సీబీఐ దర్యాప్తులో వివేకా హత్య కుట్ర వెనుక ప్రముఖుల హస్తం ఉందనే అంచానా వచ్చింది. తర్వాత 2019లో జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్ ఏర్పాటైంది. జగన్ సర్కార్ వచ్చి నాలుగేళ్లవుతున్నా.. వివేకా హత్య కేసు కొలిక్కి రాకుండా సూత్రధారులతో పాటు ‘ముఖ్య నేత’ కూడా అడ్డుపడుతున్నారనే ఆరోపణలు, అనుమానాలు వచ్చాయి. అంతేకాదు.. స్వయంగా వివేకా కుమార్తె సునీత అదే విధమైన అనుమానాలు వ్యక్తం చేశారు. దివంగత వివేకానందరెడ్డి సీఎం జగన్ కు సొంత బాబాయ్. పినతండ్రి హత్య కేసులో చిక్కుముడి విప్పించాలని సోదరి అయిన సునీత స్వయంగా జగన్ వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, పైగా లైట్ తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన జగన్.. తానే సీఎం అయ్యాక ఈ కేసును నీరుగార్చేలా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పైగా వివేకా కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులను కొందరు బెదిరించడం, తిరిగి వారిపైనే కేసులు పెట్టడంతో విసిగిపోయిన సునీత సీబీఐ విచారణను ఏపీలో కాకుండా మరే ఇతర రాష్ట్రానికైనా బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పోరాడారు. కేసు పూర్వాపరాలు సమీక్షించిన సుప్రీంకోర్టు కేసు విచారణను మరో రాష్ట్రాన్ని బదిలీ చేయడానికి అంగీకరించింది. తండ్రి హత్య కేసులో నిందితులెవరో.. సూత్రధారులెవరో.. తేల్చేందుకు వివేకా కుమార్తె సునీతారెడ్డి పట్టు వదలని విక్రమార్కుడిలా ధైర్యంగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. తండ్రి హత్య విషయంలో సీఎం స్థానంలో ఉన్న అన్న జగన్ నుంచి సహకారం అందకపోయినా ఆమె విశ్రమించడం లేదు. పులివెందుల గల్లీ నుంచి దేశ రాజధాని ఢిల్లీ దాకా ఆమె కాలికి బలపం కట్టుకుని ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో వైఎస్ సునీతకు అనూహ్యంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నుంచి మద్దతు లభిస్తోంది. సునీత పోరాటానికి మద్దతుగా నిలబడాలని ఆయన కొద్ది రోజుల క్రితమే నిర్ణయించారు. కొన్ని సభల్లో చంద్రబాబు సునీత పోరాటాన్ని ప్రశంసించారు. తోడ్పాటుగా ఉంటామని కూడా చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ‘బాదుడే బాదుడు’ పేరిట చేస్తున్న జిల్లాల పర్యటనల్లో సునీతకు మద్దతు గురించి బహిరంగంగా చెబుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు ఈ విషయం స్వయంగా ప్రకటించారు. సునీతకు మద్దతుగా నిలబడదామని టీడీపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు జిల్లాల పర్యటనల సందర్భంగా వచ్చే ఎన్నికలకు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుండడం విశేషం. రాజకీయంగా తన ఆగర్భ శత్రువు జగన్ ను ఢీకొట్టే ఎన్నికల వ్యూహాన్ని ఈ అపర చాణక్యుడు రచించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జగన్ పై వైఎస్ సునీతను టీడీపీ అభ్యర్థిగా బరిలో దింపాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఎందుకంటే.. పులివెందులలో వైఎస్ రాజశేఖరరెడ్డికి, జగన్ కు మంచి పట్టు ఉంది. అయితే.. అంతే పట్టు హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డికి కూడా ఉందంటారు. ఒక సందర్భంలో వైఎస్ రాజశేఖరరెడ్డే ఈ విషయం చెప్పారంటారు. తండ్రి వివేకాకు ఉన్న పలుకుబడి, ఆపైన ఆయన దారుణ హత్యకు గురయ్యారనే సానుభూతి కూడా సునీత విజయానికి మార్గం వేస్తాయని చంద్రబాబు అంచనా వేస్తున్నారంటున్నారు. ఒకవేళ సునీత పులివెందులలో పోటీకి చేయడానికి ఒప్పుకోకపోతే.. కడప ఎంపీ స్థానంలో అయినా బరిలో దిగేలా ఒప్పించాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ సునీత కడప ఎంపీ స్థానంలో పోటీకి ఒప్పుకుంటే.. తన తండ్రి హత్య వెనుక ఉన్నారనుకుంటున్న వారిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందంటున్నారు. కడప ఎంపీ సీటు విషయంలో వచ్చిన విభేదాలే వివేకానందరెడ్డి దారుణ హత్యకు కారణం అంటారు. సునీతారెడ్డిని చంద్రబాబు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో కలిశారని, ఆమెకు పులివెందుల నుంచి జగన్ పై బరిలో దింపాలనుకుంటున్నట్లు.. లేదా కడప ఎంపీ స్థానంలో పోటీ చేయించే ప్రతిపాదన గురించి చెప్పారని విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు ప్రతిపాదనకు సునీతను ఒప్పించేందుకు ఓ టీడీపీ ముఖ్య నేత సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలకు సునీత తొలుత కాస్త విముఖంగా ఉన్నా తర్వాత ఆలోచనలో పడ్డారని అంటున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో సునీత స్వయంగా టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారా? లేక తన ఫ్యామిలీ నుంచి మరొకరితో పోటీ చేయిస్తారా? అనేది స్పష్టం కావాల్సి ఉందంటున్నారు. వైఎస్ సునీత టీడీపీ అభ్యర్థిగా పులివెందుల నుంచి పోటీ చేసినా.. కడప బరిలో దిగినా ‘వన్ షాట్ టూ బర్డ్స్’ సామెతను చంద్రబాబు మరోసారి నిరూపించినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

దాడుల విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వైసీపీ తీరు.. జనం తిరగబడతారు జాగ్రత్త అంటూ బాబు హెచ్చరిక

రాష్ట్రంలో ప్రభుత్వం అనేది అసలు ఉందా అనిపించేలా వైసీపీ శ్రేణుల దాడులు ఉంటున్నాయి. వ్యతిరేకించే వారిపై దాడులు, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే జర్నలిస్టులపై దాడు..ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తినా, కళమెత్తినా దాడులే అన్నట్లుగా ఏపీలో పరిస్థితులు ఉన్నాయి. ఆఖరికి విపక్ష నేత, తెలుగుదేశం అధినేత పర్యటనలలో కూడా వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. కుప్పంలో  చంద్రబాబు పర్యటన సందర్బంగా చోటుచేసుకున్న సంఘటనలు మరువక ముందే ఆయన కర్నూలు పర్యటనలో కూడా దాడులు పునరావృతమయ్యాయి. కర్నూలు జిల్లా ఆదోనీ, ఎమ్మిగనూరులో రోడ్ షో సందర్బంగా సోమప్ప సర్కిల్ వద్ద చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. వైసీపీ శ్రేణులే రోడ్ షోను భగ్నం చేయాలన్న ఉద్దేశంతోనే రాళ్ల దాడికి పాల్పడ్డాయంటూ తెలుగుదేశం శ్రేణులు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కర్నాలూ జిల్లా పర్యటనలో అడుగడుగునా జనం బ్రహ్మరథ పడుతున్నారు. ఆయన పర్యటన, రోడ్ షోలకు జనం ప్రభంజనంలా తరలి వచ్చారు. జగన్ సర్కార్ పై జనాగ్రహం విపక్ష నేత పర్యటనకు జనం పోటెత్తడంలో ప్రస్ఫుటంగాకనిపిస్తోంది. అసంఖ్యాకంగా తరలివచ్చిన సన సముద్రాన్ని చూసి చంద్రబాబు సైతం మరింత ఉత్సాహంతో అధికార పక్షంపై ఈటెల లాంటి మాటల విమర్శలను సంధిస్తున్నారు. చంద్రబాబు ప్రతీ మాటకూ, ప్రతీ విమర్శకూ జనం నుంచి విశేష స్పందన వస్తోంది. దానిని చూసి రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు ముందుకు కదులుతున్నారు. జగన్ సర్కార్ నుంచి రాష్ట్రానికి తెలుగుదేశం అధికారంలోకి రావడం తోనే విముక్తి కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ దుష్ట పాలనకు ఓటుతో బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. సోమప్ప సర్కిల్ లో తన కాన్వాయ్ పై జరిగిన రాళ్ల దాడిని ప్రస్తావిస్తూ నేరుగా ముఖ్యమంత్రినే సవాల్ చేశారు చంద్రబాబు. ముఖ్యమంత్రీ లా అండ్ ఆర్డర్ నీ చేతిలో ఉంది.. నా కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఎక్కడికెళ్లినా దాడులకు పాల్పడుతున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత నీది. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి నాపై రాళ్ల దాడులకు పాల్పడుతున్నావు. ప్రజలు తిరగబడితే నేను బాధ్యుడను కాను అని హెచ్చరించారు. ‘ఈ రోడ్‌ షోకు వచ్చిన జనాలను చూసి వైకాపా వారి కళ్లు తిరిగాయి. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం ఈ జన ప్రభంజనంతో ప్రస్ఫుటమౌతోంది ’ అని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘నేను ముఖ్యమంత్రిగా మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు మీరందరూ ఆశీర్వదించాలన్నారు’ రాయలసీమలోనే మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ జనం స్వచ్ఛందంగా ముక్త కంఠంతో నినదిస్తున్నారు. చంద్రబాబు తాను రాజకీయాలలో కొనసాగాలో లేదో మీరే నిర్ణయించాలని అని అనడం ఆఖరి అవకాశం లాస్ట్ చాన్స్ అని అడగడం కాదని తెలుగు దేశం నేతలు అంటున్నారు. రాష్ట్రం బాబుపడేందుకు ఆయన ఆఖరి అవకాశం ఇస్తున్నారని వివరిస్తున్నారు. కాదు మరో సారి జగన్ కే అవకాశం ఇద్దాం అనుకుంటే  రాష్ట్రం వల్లకాడు అయిపోవడం ఖాయమనీ, అప్పుడు వగచినా ప్రయోజనం ఉండదనీ వల్లకాడును ఏలడానికి ముందుకు ఎవరొస్తారని వారంటున్నారు. 

చంద్రబాబు పర్యటనలకు జన ప్రభంజనం దేనికి సంకేతం?

1982 నాటి ఎన్టీఆర్ ప్రభంజనం గుర్తుకు వస్తున్నదా? చంద్రబాబు కర్నూలు పర్యటనకు జనం ప్రభంజనంలా తరలి రావడంతో నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయా? అంటే తెలుగుదేశం సీనియర్ నాయకులు ఔననే అంటున్నారు. ఒంగోలు వేదికగా జరిగిన తెలుగుదేశం మహానాడు నుంచి ఆ పార్టీ అధినేత ఎక్కడకు వెడితే అక్కడ జనం నీరాజనం పడుతున్నారు. జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విపక్షం వెనుక ర్యాలీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మూడు రోజులుగా సాగుతున్న ఆయన పర్యటనలో ఆయన పర్యటన సాగిన దారంతా జన సముద్రంగా మారిపోయింది. అశేష జన సందోహం అడుగడుగునా నీరాజనం పడుతుండటంతో ఆయన పర్యటన షెడ్యూల్ టైం కంటే కనీసం ఎనిమిది తొమ్మిది గంటలు ఆలస్యంగా సాగుతోంది. అయినా జనం కదలకుండా ఓపిగ్గా నిరీక్షిస్తున్నారు. అదే జగన్ సభలకు జనాన్ని బలవంతంగా సమీకరించి తీసుకువచ్చినా వారు సభ లో కూర్చో లేక బయటకు వెళ్లిపోతున్నారు. పోలీసులు అడ్డుపడుతుంటే కూడా విదిలించుకుని వెళ్లిపోతున్నారు. అదే చంద్రబాబు కర్నూలు పర్యటనలో జనం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చారు. చంద్రబాబు పర్యటనలో విపరీతమైన జాప్యం జరిగినా ఓపికగా వేచి చూశారు. ఆయన ప్రసంగం శ్రద్ధగా విన్నారు. సాధారణంగా ఒక పార్టీ అధినేత పర్యటనకు వస్తున్నప్పడు జనసమీకరణ ఉంటుంది. అలాగే చంద్రబాబు పర్యటనకూ తెలుగుదేశం జిల్లా నాయకులు జన సమీకరణ చేసే ఉంటారు. అయితే ఆ సమీకరణ చాలా పరిమితం. ఎందుకంటే జనాన్ని తరలించడానికి విపక్షానికి ఆర్టీసీ బస్సులను అద్దెకిచ్చే పరిస్థితి లేదు. డ్వాక్రా మహిళలు వచ్చే అవకాశమూ లేదు. ఎందుకంటే ఆర్టీసీ, డ్వాక్రా మహిళలూ కూడా ప్రభుత్వ బంధనాల్లో చిక్కుకుని ఉన్నాయి. దీంతో కర్నూలు పర్యటనలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన అశేష జనవాహిని అంతా స్వచ్ఛందంగానే వచ్చిందేనని చెప్పాలి. చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన అనగానే వైసీపీ శ్రేణులు మూడు రాజధానుల పేరుతో ర్యాలీలు నిర్వహించారు. అయితే అవి ఎవరికీ పట్లని ర్యాలీలుగా మిగిలిపోయాయి. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామన్న గంభీర ప్రకటనలు సైతం చేశారు. అయితే బాబు పర్యటనకు వచ్చిన అనూహ్య స్పందనతో నిరసనల ఊసెత్తడానికి కూడా వారు భయపడే పరిస్థితి వచ్చింది. కర్నూలు గడ్డపై మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు అన్న నినాదాలు ప్రతిధ్వనించాయి. ఒక్క కర్నూలు అనే కాదు ఇటీవలి కాలంలో చంద్రబాబు ఎక్కడ పర్యటించినా జన స్పందన భారీగా ఉంటోంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే పథకాలు నిలిపేస్తారని వైసీపీ చేస్తున్న హెచ్చరికలను జనం విశ్వసించడం లేదనడానికి ఆయన పర్యటనలకు వస్తున్న విశేష స్పందనే నిదర్శనం.  

కందకు లేని దురద కత్తిపీటకా.. ఏపీకి లేని బెంగ కేసీఆర్ కా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ప్రస్తుతం గతంలో ఎన్నడూ ఎదుర్కొనటువంటి టెన్షన్ ను ఎదుర్కొంటున్నారు. ఒక వైపు.. జాతీయ రాజకీయాలలోకి అడుగు పెట్టేశారు. కొత్త పార్టీ బీఆర్ఎస్ ను ప్రకటించేశారు. టీఆర్ఎస్ స్థానంలో బీఆర్ఎస్ ఉంటుందనీ, జాతీయ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తుందనీ, కేంద్రంలో మోడీ సర్కార్ పతనానికి బీఆర్ఎస్ నాంది పలుకుతుందనీ గంభీర ప్రసంగాలు సైతం చేసేశారు. అయితే ఆ తరువాతే ఆయనకు అసలు పరీక్షలు వరుసగా ఎదురౌతున్నాయి. తెలంగాణ ఉద్యమ పునాదులపైన ఏర్పడిన పార్టీ ఇప్పుడు ఆ ఉద్యమ చిహ్నాలను అనివార్యంగా వదిలించుకోవాల్సిన పరిస్థితి. మోడీ వ్యతిరేకత తప్ప కేసీఆర్ తన కొత్త జాతీయ పార్టీ ఆవిర్బావ సభ సందర్బంగా కొత్తగా చెప్పినదేమీ లేదు. ఇప్పుడు ఆయనకు సొంత రాష్ట్రంలో బీఆర్ఎస్ సత్తాను చాటాల్సిన పరిస్థితి ఉంది. అయితే మునుగోడు ఉప ఎన్నికలో చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా సాధించిన విజయంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెరాసకు విజయం సిద్ధిస్తుందా? అన్న అనుమానాలు పార్టీలోనే వ్యక్త మౌతున్న పరిస్థితి. సరే ఇక్కడ గెలిచినా సార్వత్రిక ఎన్నికలలో కేసీఆర్ ఆశిస్తున్నట్లుగా వంద స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోగలిగే సత్తా బీఆర్ఎస్ కు ఉందా అంటే ఇప్పటికిప్పుడైతే ఔననే సమాధానం వచ్చే పరిస్థితి లేదు. సర్వేలను బట్టి చూస్తు హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో మరో సారి బీజేపీ అధికార పగ్గాలు అందుకోవడం ఖాయమన్న అంచనాలు వెలువడుతున్న సమయంలో.. ఆ తరువాత ఓ నాలుగైదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ విస్తరణ సాధ్యమౌతుందా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. అన్నిటికీ మించి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఆంధ్రప్రాంత ప్రజలపై, పాలకులపై చేసిన పరుష వ్యాఖ్యలు ఆయనక సాటి తెలుగు రాష్ట్రంలో కాలుపెట్టే పరిస్థితి లేకుండా చేశాయి. సాటి తెలుగు రాష్ట్రమే బీఆర్ఎస్ ను గుర్తించని పరిస్థితి ఉంటే.. ఇక దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఇది ఎలాంటి సందేశం ఇస్తుందన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు ఏపీ నుంచి మద్దతు అనివార్యంగా అవసరం అన్న పరిస్థితి ఏర్పడింది. ఏపీ సీఎం జగన్ తో ఆయనకు సత్సంబంధాలే ఉన్నా.. రాజకీయాలకు, ఇరు రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న జల వివాదాలకూ అతీతంగా ఇప్పటి వరకూ ఇరువురూ కూడా పరస్పర రాజకీయ సహకారం అందించుకుంటున్నారనే విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఒక సారి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపైనా, ప్రధాని మోడీపైనా యుద్ధం ప్రకటించేసిన తరువాత గతంలోలా ఈ సహకారం ఉంటుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. రాజకీయ పరిశీలకులైతే లోపాయికారీగా ఉన్నా బహిరంగంగా బీఆర్ఎస్ కు జగన్ మద్దతు ప్రకటించే అవకాశాలు ఇసుమంతైనా లేవనే చెబుతున్నారు. తెరాస అధినేత మొడీ విధానాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ యుద్ధ భేరి మోసిస్తుంటే.. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి మాత్రం మోడీ అడుగులకు మడుగులొత్తుతూ ఆయన ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీలో తనకు మద్దతు కూడగట్టుకోవాలంటే కేసీఆర్ కు జగన్ కు మోడీతో ఉన్న బంధాన్ని తెగ్గొట్టక తప్పదన్న అంచనాకు వచ్చారు. అందుకే ఎమ్మెల్యేక కొనుగోలు బేరసారాలు తెలంగాణతో ఆగవనీ, అవి ఏపీకీ విస్తరిస్తాయనీ జగన్ ను పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. బీజేపీ ఏపీలో జగన్ సర్కార్ ను కూలదోసేందుకు ప్రయత్నిస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో ప్రభుత్వాన్ని మోడీ సర్కార్.. పడగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటే ఆ విషయంలో స్పందించాల్సింది జగన్ కానీ, కేసీఆర్ కు ఎందుకు  అని పరిశీలకులే కాదు, ఇరత పార్టీల వారూ, స్వయంగా తెరాస నేతలే ప్రశ్నిస్తున్నారు. పొరుగు రాష్ట్రం ఊసెందుకన్న భావన ఏపీలో కూడా వ్యక్తమౌతోంది. కందను కోసిన కత్తిపీటకు దురదంటే ఎవరు నమ్ముతారని నెటిజన్లు సైతం సెటైర్లు వేస్తున్నారు. బీజేపీ ఏపీ సర్కార్ ను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నదన్న కేసీఆర్ వ్యాఖ్యలు జగన్ ను బీఆర్ఎస్ కు మద్దతుగా కూడగట్టే వ్యూహంతోనే తప్ప ఆయన వ్యాఖ్యలలో, ఆరోపణల్లో వాస్తవాలున్నాయని ఎవరూ నమ్మడం లేదంటున్నారు.  తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని అస్తిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణ చీప్ పబ్లిసిటీ అన్నారు. కట్టుకథలు, కాల్పనిక విషయాలు సృష్టించి రాజకీయ సంచలనం కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు. ఆయన పూర్తిగా అవాస్తవం, నిరాధారమైన కట్టు కథ అల్లుతున్నారని.. కేసీఆర్‌ను ఏమైనా వైసీపీ స్పోక్స్ పర్సన్‌గా నియమించారా అని ప్రశ్నించారు. వైసీపీకి లేని భయాలు కేసీఆర్‌కు ఎందుకు అని నిలదీశారు. కేసీఆర్ వైసీపీని నడిపిస్తున్నారా లేదా ఆ పార్టీకి ప్రతినిధిగా మాట్లాడుతున్నారా అని సూటి ప్రశ్న వేశారు. తన పార్టీకి భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకున్నారు కాబట్టి అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడాలని కేసీఆర్ మీడియా కవరేజ్ కోసం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. అబద్ధాలు, అవాస్తవాలు ద్వారా ప్రచారం పొందాలని చూస్తే విశ్వసనీయతకు భంగం వాటిల్లడం ఖాయమన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ తప్పుడు వ్యాఖ్యలు, కథనాలు మానుకుంటే మంచిదని సూచించారు. తెలంగాణలో జరిగిందే అవాస్తవమని.. ఆ విషయాన్ని తమ నాయకత్వం గట్టిగా చెప్పిందన్నారు. 2024లో భారతీయ జనతాపార్టీ, జనసేనతో కలిసి ప్రత్యామ్నాయంగా మారతామన్నారు. ఎన్నికల ముందు తమ పార్టీలోకి విస్తృతంగా చేరికలు ఉంటాయన్నారు. తెలుగు రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు చేరికలను ప్రోత్సహిస్తామన్నారు. వైసీపీని అస్థిరపరుస్తున్నామనేది కేసీఆర్ కల్పించుకున్న కొత్త స్క్రిప్ట్ అని.. కథ, నిర్మాత అంతా కేసీఆరే అని జీవీఎల్ ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాలలో, ఆమాటకొస్తే దేశంలో రాజకీయాలే కాదు, రాజకీయ చర్చలు,విశ్లేషణలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. చిత్ర విచిత్రంగా వంపులు పోతున్నాయి. కొత్త కొత్త ఎత్తులు, వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.  ఒక్క ముక్కలో చెప్పాలంటే, రాజకీయాల దారిలోనే రాజకీయ విశ్లేషకులు సాగుతున్నారు. వాస్తవాల కంటే ఉహాలకు, వ్యూహహాగానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ తీసుకున్న, ‘జాతీయ’ నిర్ణయం సహజంగానే రాజకీయ, మీడియా వర్గాల్లో సంచలనంగా మారింది. చర్చోపచర్చలు సాగుతున్నాయి. నిజానికి, కేసీఆర్ తీసుకున్న,పార్టీ పేరు మార్పు నిర్ణయం, ఇప్పటికిప్పుడు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుందని,కేసీఆర్ సహా ఎవరు ఉహించడం లేదు.ఆశించడం లేదు.  నిజానికి ప్రాంతీయ వాదం పునాదిగా, రాజకీయంగా,(గిట్టని వాళ్ళు ఆర్థికంగా కూడా అంటారు) ఎదిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఆయన అవసరాల కోసం, కాలం చెల్లిన తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని, పక్కన పెట్టి జాతీయ నినాదాన్ని అందుకున్నారు. అందుకోసంగా, ఆయన దసరా పండగ రోజున తెలంగాణ భవన్ వేదికగా, తెరాస పార్టీ పేరును మార్చారు. భారతీయ రాష్ట్ర సమితిగా నామకరణం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే, జాతీయ రాజకీయాల్లో ఎంట్రీకి అడ్డుగా ఉన్న ‘తెలంగాణ’ అనే పదాన్ని తెసీసి ‘భారతీయ’ అనే పదాన్ని చేర్చారు. నిజానికి, ఆ క్రతువుకు ఏమి పేరు పెట్టినా, ప్రొఫెసర్ కోదండ రామ్’  చెప్పినట్లుగా ఈ మొత్తం క్రతువు వెనక ఉన్న మూల మంత్రం తెలంగాణలో అధికారాన్ని, కుటుంబ పాలనను నిలుపుకోవడం. ఇదొక్కటే ఇప్పుడు కేసీఅర్ ముందున్న లక్ష్యం. ఇదొక్కటే ఆయన ముందున్నసవాలు. తెలంగాణ సెంటిమెంట్’ను అడ్డుపీతుకుని, 1200 యువకుల బలిదానాల బాటలో అధికార పీఠాన్ని అందుకున్న కేసేఆర్, ఇప్పుడు కొత్త దారిని ఎంచుకున్నారు, అనే వాళ్ళున్నారు.  సరే, తెరాస పేరును కేసేఆర్ ఎందుకు బీఆర్ఎస్’గా మార్చారు,తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ ఎలా ప్రభావితం చేస్తుంది.  జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని పక్కన పెడితే, దాయాది రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్’ రాజకీయాలపై బీఆర్ఎస్ ప్రభావం ఎలా ఉంటుంది? ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీలను బీఆర్ఎస్ ఎలా ప్రభావితం చేస్తుంది? ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే ఆసక్తికర చర్చ సాగుతోంది.  అయితే, ఇందుకు సంబంధించి ఎవరెన్ని విశ్లేషణలు చేసినా,తెలుగు దేశం పార్టీ  అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాటలు లేకుండా ఓ చిన్న చిరునవ్వుతో చేసిన విశ్లేషణ ముందు అవ్వన్నీ దిగతుడుపే. బీఆర్ఎస్పై సాధికారిక వ్యాఖ్య ఎవరైనా చేశారంటే , అది చంద్రాబాబు ఒక్కరే,  ఏపీ రాజకేయాలపై బీఆర్ఎస్ ప్రభావం గురించి మాత్రమే కాదు., అసలు బీఆర్ఎస్’ గురించి ఇంతవరకు వచ్చిన విశ్లేషణలు అన్నిట్లోకి చద్రబాబు ‘చిరునవ్వు’ ఒక్కటే  సాధికారిక విశ్లేషణ, అనుకోవచ్చును. అవును, బీఆర్ఎస్ గురించి చంద్రబాబు చేయని విశ్లేషణ, ఆయన అనుభవానికి, విజ్ఞతకు అడ్డపడుతోంది.  ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయం అయితే చెప్పనే అక్కరలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నంత వరకు, మోడీ, షా సిట్టంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఆయన ముందు మరో ఆప్షన్ లేదు. మోడీ షా కూర్చోమంటే కూర్చోవాలి నుంచో మంటే నుంచోవాలి లేదంటే,ఏమిజరుగుతుందో వేరే చెప్పనక్కర లేదు.నిజానికి, జగన్ రెడ్డి, 2019 ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే, బీజేపీకి సరెండర్ అయిపోయారు. ప్రత్యేక హోదా విషయంలో మోడీ దయ మన ప్రాప్తం అని చేతులేత్తేసింది మొదలు ఇంతవరకు మళ్ళీ ఆయన ఎత్తిన చేతులు దించలేదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఎన్నికల విషయంలోనే కాదు, పార్లమెంట్’లో వివదాస్పద బిల్లుల ఆమోదం వరకు ఎక్కడా,  కేంద్రానికి రుచించని నిర్ణయం ఏదీ తీసుకోలేదు. ఎక్కడి వరకో ఎందుకు, కొద్ది రోజుల క్రితం, వైసీపీ ఎంపీ, విజయసాయి రెడ్డి, ఉప రాష్ట్రపతి జగదేష్ ధన్కర్’కు వంగివంగి దండాలు పెడుతున్న దృశ్యం చూస్తేనే, వైసీపీ స్టాండ్ ఏమిటో అర్థమవుతుంది. అయితే, బీఆర్ఎస్ ప్రభావం ఏపీ రాజకీయాలపై అసలే ఉండదా అంటే ఉంటుంది. నిజానికి, ఒక్కఎపీలోనే కాదు దేశంలో ఏ ఒక్క ఒక రాష్ట్రం నుంచి పేరున్న పార్టీలు ,వ్యక్తులు ఎవరు కూడా కేసేఆర్’తో చేతులు కలిపేందుకు, సిద్ధంగా లేరు. అయినా, ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. చిన్నా చితక పార్టీలు, ప్రజాసంఘాలను కూడగట్టి జాతీయ రాజకీయాల్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో.. బీఆర్ఎస్ ప్రభావం ఏపీ పై అసలే ఉందని చెప్పలేము, కానీ ఆ ప్రభావం ఎలా ఉంటుందనేది మాత్రం, ఇప్పుడే చెప్పే విషయం కాదు. అదలా ఉంటే బీఆర్ఎస్ ఏపీలో ఎంటర్ కావడానికి ముందు చాలా హార్డిల్స్ దాట వలసి ఉంటుంది. కొవిడ్ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఈపీ కొవిడ్ రోగులను సరిహద్దుల వద్దే అడ్డుకున్న కేసేఆర్, అదే సరిహద్దు దాటి ఏపీలో ఎంటర్ అవుతానంటే, ఆరాష్ట్ర ప్రజలు అనుమతిస్తారా? తెలంగాణ ఉద్యమ సమయంలో కేసేఆర్ ఆంధ్రులను అవమానించిన తీరును మరిచి పోతారా? నిన్నగాక మొన్న తెలంగాణ శాసన సభలో ఏపీపై విషం చిమ్మిన కేసీఆర్’కు ఆ రాష్ట్ర ప్రజలు రెడ్ కార్పెట్’ వేసి స్వాగతం పలుకుతారా?  కేసీఆర్, నేను మరిపోయానై అంటే, ఏపీ ప్రజలు నమ్ముతారా? కేసేఆర్ నమ్మించగలరా? అవును, ఆయనకు రాజకీయ టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు అన్నీ కొట్టిన పిండి, ఆయినా  ఆయన ఏపీ ప్రజలను నమ్మించగల రని అనుకున్నా, అది పొరపాటే అవుతుంది.  నిజానికి, కేసేఆర్ ఏపీలో ఎంటర్ అవ్వాలంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఒక సారి కాదు, వెయ్యిసార్లు ముక్కు నేలకు రాసి, క్షమాపణలు చెప్పవలసి ఉంటుందిని అంటున్నారు. కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా? ఏపీ ప్రజలకు క్షమాపణలు చెపుతారా? అది జరగని పని,అ దే జరిగితే, తెలంగాణ నూకలు చెల్లినట్లే అవుతుంది. సో .. అది జరగదు. నిజానికి, ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెట్టినట్లు, ఏపీ రాజకీయాల్లో కేసేఆర్ వేలు పెట్టలేరు, అందుకే ఆయన ఇంతవరకు ఏపీ విషయంలో గుంభనంగా, మైదానాన్ని ఊహాగానాలకు వదిలేశారని అంటున్నారు.

అక్షర క్రమంలోనే కాదు.. అప్పుల్లోనూ నంబర్ వన్ ఏపీ.. ఇది జగన్ ఘనతేగా మరి!

అక్షరక్రమంలో నే కాదు... అభివృద్ధిలోనూ అగ్రగామే. విభజిత ఆంధ్రప్రదేశ్ ను ఉద్దేశించి గతంలో  దేశం యావత్తూ అన్న మాట. ఇప్పుడు కూడా అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలోనే నిలిచింది. అయితే అభివృద్ధిలో మాత్రం కింది నుంచి మొదటి స్థానానికి పోటీ పడుతోంది. జగన్ పాలనలో ఈ మూడేళ్లలోనూ ఏపీ సాధించిన ఘనత ఇది. అదొక్కటే కాదు.. మరో విషయంలో కూడా ఏపీ దేశంలోని ఏ ఇతర రాష్ట్రం కనీసం పోటీలో కూడా ఉండలేని విధంగా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. అభివృద్ధిలో అధమ స్థానానికి పడిపోయిన ఏపీ.. ఈ మూడేళ్లలో ఏ విషయంలో నంబర్ వన్ గా నిలిచిందో తెలుసా.. అప్పుల్లో. అవును దేశంలో ఏ రాష్ట్రం చేయనన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసి అప్పుల్లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల కాలానికి ఏ రాష్ట్రమూ తీసుకోన్ని రుణాలను ఆంధ్ర ప్రదేశ్ తీసుకుంది.    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడాది మొత్తం మీద 48,724.12 కోట్ల రుణం అవసరమవుతుందని ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. సెప్టెంబరు నెలాఖరు నాటికే ఏకంగా 49,263.34 కోట్ల రుణాన్ని రాష్ట్రం వినియోగించుకుంది. అంటే అంచనాలను మించి వంద శాతం కంటే ఎక్కువ రుణాలను ఇప్పటికే ఏపీ తీసేసుకుంది. దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రంలో చెప్పుకునే బీహార్ కంటే ఏపీ పరిస్థితి అధ్వానమని కాగ్ నివేదికే వెల్లడించింది. బీహార్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి  25,885.10 కోట్ల రుణం అవసరమవుతుందని ప్రతిపాదించి,  తొలి 6 నెలల్లో తీసుకున్న రుణం 30,407.14 కోట్లు మాత్రమే.  ఈ గణాంకాలను పరిగణనలోనికి తీసుకుని చూస్తే   ప్రతిపాదిత అప్పు, వినియోగించిన అప్పు విషయంలో ఆంధ్రప్రదేశ్‌  ఇప్పటికే ఏడాది మొత్తం అంచనాలను దాటేసి రుణాలు చేసేసింది. అదే తమిళనాడు అయితే 96,613.71 కోట్ల రుణం అవసరమని ప్రతిపాదించి ఇప్పటి వరకూ 18,726.34 మాత్రమే అప్పు చేసింది.  కర్ణాటక, తెలంగాణ ఇలా అనేక రాష్ట్రాలు కూడా అంచనాల రుణపరిమితిని దాటలేదు. అయితే ఏపీ మాత్రం అంచనా రుణన్ని దాటేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలలోనే పరిమితికి మించి వంద శాతం అధికంగా అప్పులు చేసింది. ఈ అప్పులు కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్పీవీ) ద్వారా  తీసుకున్న రుణాలు అదనం.   వీటికి అదనంగా ఏపీఎస్‌డీసీ, బేవరేజస్‌ కార్పొరేషన్‌ ల ద్వారా తీసుకున్న రుణాలు ఉన్నాయి. బేవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా తీసుకున్న 8,300 కోట్ల రుణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్నదే. ఆర్థిక సంఘం, కేంద్ర ఆర్థికశాఖ లెక్కల ప్రకారం ఈ రుణాన్ని ప్రభుత్వ రుణంగా పరిగణించాల్సి ఉంటుంది. రాష్ట్రం ఈ కార్పొరేషన్ల లెక్కలు కాగ్‌కు తెలియజేయడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రం కాగ్‌కు సమర్పించిన 49,263 కోట్ల రుణం కన్నా ఇంకా ఎక్కువే ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా అందిన కాడికల్లా అప్పులు చేస్తున్నా  ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగానే ఉంది. ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వలేక.. కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు చెల్లించలేక సతమతమవుతోంది. మరి ఈ రుణాలన్నిటీనీ దేనికి ఖర్చు పెడుతున్నట్లు.. ఉచితాలకే వ్యయం చేస్తున్నదా అంటే ఈ మొత్తంలో నాలుగో వంతు మాత్రమే ఉచితాలకు ఏపీ సర్కార్ వ్యయం చేస్తున్నది.  అప్పుల్లో అగ్రస్థానానికి ఏపీని చేర్చిన జగన్ సర్కార్ తీసుకున్న రుణాలను ఎందుకోసం వ్యయం చేస్తున్నదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతున్నది. తెలుగుదేశం, ఇతర విపక్షాలూ సొమ్ము దొంగ ఖాతాల ద్వారా తరలిపోతున్నదని ఆరోపిస్తున్నాయి. ప్రైవేట్ చార్టర్డ్ విమానాల ఉదంతాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నాయి. ఒక్క బేగం పేట విమానాశ్రయం నుంచే కాకుండా గన్నవరం విమానాశ్రయం, విశాఖ పాత విమానాశ్రయం నుంచి ప్రైవేటు విమానాల రాకపోకలపై కూడా దర్యాప్తు చేస్తే మరిన్ని సంచలన విషయాలు బయటపడతాయని తెలుగుదేశం అధికార ప్రతినిథి పట్టాభి అంటున్నారు. మరి ఆ దిశగా ఈడీ దృష్టి సారిస్తుందా లేదా చూడాల్సి ఉంది.

నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో మంటలు..తప్పిన పెను ప్రమాదం

నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. అయితే స్టేషన్ కు సమీపంలోనే ప్రమాదం జరగడంతో వెంటనే రైల్వే అధికారులు వాటిని అదుపులోనికి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళుతున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. గూడూరు రైల్వే జంక్షన్ కు రైతు చేరుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గూడూరు జంక్షన్ కు రైలు రాగానే అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. రైలులోని ప్యాంట్రీ కారులో ప్రమాద వశాత్తు మంటలు చెలరేగాయని చెబుతున్నారు. రైల్వో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు తీవ్ర భయందోళనలకు గురయ్యారు. ఈ ఘటనతో దాదాపు గంటకు పైగా రైలును గూడూరులోనే నిలిపివేశారు. రైల్వే అధికారులు అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు.ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

సెల్ ఫోన్ లకే నేరుగా టీవీ ప్రసారాలు!

బ్యాంకు, కెమెర, కేలిక్యులేటర్, సినిమా థియేటర్ ఇలా చాలా వరకూ అన్ని అవసరాలనూ సెల్ ఫోన్ తీర్చేస్తోంది. ఇప్పటికే ఓటీటీల ద్వారా చాలా వరకూ జనం బిగ్ స్క్రీన్ జోలికి వెల్లకుండా టీవీలలోనో, మొబైల్ లోనే చూసేస్తున్నారు. అలాగే దాదాపు అన్నిటెలివిజన్ షోలనూ మొబైల్ లోనే యూట్యూబ్ ద్వారా చూసేస్తున్నారు. ఇక ముందు అసలు టీవీ అవసరమే లేకుండా చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు అనే పరిస్థితి త్వరలో వచ్చేయ నుంచి. టీవీ ప్రోగ్రామ్స్ కూడా నేరుగా సెల్ ఫోన్ కే ప్రసారం చేసేస్తారు. ఆ విధానం త్వరలో అందుబాటులోకి వస్తోంది. ఈ విధానాన్ని తొలుత ప్రయోగాత్మకంగా ఢిల్లీలో అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రచార మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.   ఇందు కోసం బ్రాడ్ బ్యాండ్, బ్రాడ్ కాస్ట్ టెక్నాలజీలను జుగల్ బందీ చేసి మొబైల్ ఫోన్లలో టీవీ కార్యక్రమాలు నేరుగా ప్రసారమయ్యేలా చేస్తారని చెబుతున్నారు. ఇదే జరిగితే వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు.దేశంలో 120 కోట్ల మంది సెల్ ఫోన్ వినియోగస్తున్నారు. అయితే టీవీ వీక్షకుల సంఖ్య 20 కోట్ల మంది మాత్రమే. ఇప్పుడు సెల్ ఫోన్లలోనే నేరుగా టీవీ కార్యక్రమాలు వీక్షించే అవకాశం వస్తే వీక్షకుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 

జగన్ దారెటు.. ముందస్తే దిక్కు!

ఏపీలో జగన్ ప్రభుత్వానికి అన్ని వైపుల నుంచీ చిక్కులే ఎదురౌతున్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా బూమరాంగ్ అవుతోంది. ఏ పని చేసినా చేదు అనుభవంగానే మిగులుతోంది. అసలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ని సార్లు కోర్టుల చేత అక్షింతలు వేయించుకుని ఉండదు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లయ్యింది. ఇంకా ఏడాదిన్నర గడువు ఉంది మరో సారి ప్రజా తీర్పు కోరడానికి. ప్రజలు మనవైపే ఉన్నారు.. ఈ సారి 151 కాదు.. 175కు 175 స్థానాలలోనే మనదే గెలుపు అంటూ జగన్ గంభీరంగా ప్రకనటలు గుప్పిస్తున్నా.. అదే మాట చెప్పి క్యాడర్ లో ఉత్సాహాన్నినింపాలని ప్రయత్నిస్తున్నా.. పరిస్థితులు చూస్తుంటే మాత్రం అది కేవలం మేకపోతు గాంభీర్యంతో చేస్తున్న ప్రకటనలేనని పార్టీ వర్గాలకే అర్ధమై పోతున్నది. మరో ఏడాదిన్న పాటు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడపడం అంటే మరింత ప్రజా వ్యతిరేకతను ప్రోది చేసుకోవడమేనన్న నిర్ణయానికి సీఎం జగన్ వచ్చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ముందస్తు ప్రణాళికలు రచించడమే కాకుండా అమలులో పెట్టేస్తున్నారు. నియోజకవర్గ సమీక్షలంటూ హడావుడి చేస్తున్నారు. వర్క్ షాపులంటూ ఎమ్మెల్యేలలో ఈ సారి పార్టీ టికెట్ అనుమానమేనని మానసికంగా సిద్ధం చేస్తున్నారు. అన్నిటికీ మించి ఎన్నికల బదలీలకు శ్రీకారం చుట్టేసింది. ముఖ్యంగా పోలీసు శాఖలో బదలీల స్పీడ్ చూస్తుంటే ఈ విషయం క్లయర్ గా అర్ధమౌతుంది. కీలక స్థానాలలో అనుకూలమైన పోలీసు అధికారాల నియామకం దాదాపు పూర్తి చేసేసిందనే చెప్పాలి.సాధారణంగా ఇలాంటి బదలీలన్నీ ఎన్నికలకు ముందు జరుగుతాయి. అయితే రాష్ట్రప్రభుత్వం మాత్రం ఎన్నికలకు ఇంకా ఏణ్ణర్ధం ఉండగానే చేసేస్తోంది.  షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వెళితే పరిస్థితి ఇప్పటి కంటే దారుణంగా ఉంటుందని అంచనా వేస్తోంది. అందుకే ముందస్తు ఎన్నికలకు రెడీ అయిపోతున్నది. అయితే ఎన్నికలు ఎప్పుడు జరగొచ్చు అనే విషయంలో మాత్రం రెండు మూడు ఆప్షన్ ను పరిశీలిస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ  ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లినా లేకున్నా మరో ఏడాదిలో   జరగాల్సి ఉంది. అందుకే ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి.. ఏపీ ప్రభుత్వం తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం మీద వచ్చే ఆరు నెలలలో జగన్ సర్కార్ ఎప్పుడైనా ముందస్తు ప్రకటన చేసే అవకాశం అయితే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆలస్యం చేసే కొద్దీ  ప్రభుత్వ వ్యతిరేకత మరంత పెరగడమే కాకుండా.. ఇప్పటికే బలంగా పుంజుకున్న తెలుగుదేశం మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని కూడా జగన్ భావిస్తున్నారు. తెలుగుదేశం సభలకు వస్తున్న ప్రజాదరణ, అదే సమయంలో ప్రభుత్వ కార్యక్రమాల పట్ల ప్రజా నిరాసక్తత ఎన్నికలు జాప్యం అయ్యే కొద్దీ మరింత పెరుగుతాయని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

కమలం తీర్థం కోసం గులాబి నేతల క్యూ

ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇకపై ఒక లెక్కా అంటున్నాయి కమలం శ్రేణులు. బీజేపీపై విమర్శలు గుప్పించే జోరులో తెలంగాణ సీఎం, తెరాస అధినేత కేసీఆర్ చేసిన ఒక ప్రకటన తమకు కొత్త బలాన్ని తీసుకువస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇంతకీ కేసీఆర్ చేసిన ప్రకటన ఏమిటి? అది బీజేపీకి ఎందుకు బలం అవుతుంది? కేసీఆర్ ఇటీవల టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ సిట్టింగులెవరూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ టికెట్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, సిట్టింగులందరికీ టికెట్లు గ్యారంటీ అని ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రకటనే తమ నెత్తిన పాలు పోసిందంటున్నాయి కమల నాథుల. ఔను నిజంగానే సిట్టింగులకే మళ్లీ సీట్లిస్తామన్న తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విస్పష్టమైన హామీ బీజేపీకి వరంలా పరిణమించనుంది. సిట్టింగులపై అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యే స్థాయి నేతలు ‘కారు’ దిగి కమలం గూటికి వరస కడతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కారెక్కించుకోవడం వల్ల టీఆర్ఎస్ పూర్తిగా నిండిపోయింది. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ఇప్పటికే తీవ్ర స్థాయిలో వర్గ పోరు నడుస్తోంది. ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత సిట్టింగులందరికీ టికెట్లు అని ప్రకటించడంతో ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రస్తుత సిట్టింగ్ చేతిలో పరాజయం పాలైన వారందిరలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. కచ్చితంగా వారందరి చూపు బీజేపీ వైపే మళ్లుతుందని పరిశీలకులు అంటున్నారు. బీజేపీ వచ్చే ఎన్నికలలో విజయం మాదేనని ఎంత ధీమాగా చెబుతున్నా.. రాష్ట్రంలోని 119 స్థానాలలోనే నిలబెట్టేందుకు ఆ పార్టీకి గెలుపు ధీమ ఉన్న అభ్యర్థుల కొరత ఉందన్నది కాదనలేని వాస్తవం. అర్బన్ ప్రాంతాలలో ఒకింత ఫరవాలేదనుకున్న గ్రామీణ ప్రాంతాలలో మాత్రం బీజేపీని అభ్యర్థుల కొరత వేధిస్తోందన్నది సత్యం. ఇప్పుడు కేసీఆర్ సిట్టింగులందరికీ టికెట్లు అన్న ప్రకటన బీజేపీ నుంచి పెద్ద ఎత్తున బీజేపీలోకి వలసలు ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలా వచ్చే వారికి కమల పుష్పాలతో స్వాగతం పలకడానికి చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల సిద్ధంగా ఉన్నారంటున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ లో పలువురు నేతలతో ఇప్పటికీ ఈటలకు సత్సంబంధాలున్నాయి. అక్కడ అసంతృప్తితో ఉన్న నాయకులంతా ఇప్పటికే ఈటల టచ్ లోకి వచ్చారనీ అంటున్నారు. అయితే ఇప్పటి వరకూ పార్టీ మారకుండా టీఆర్ఎస్ నే వారు అంటిపెట్టుకుని ఉండటం పార్టీ టికెట్ వస్తుందన్న ఆశేనంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ స్వయంగా సిట్టింగులకు టికెట్ గ్యారంటీ అని చెప్పడంతో ఆశావహులలో అత్యధికులు ఇక కారులో ప్రయాణం అనవసరం అన్న నిర్ణయానికి వచ్చేశారంటున్నారు. అందుకే కేసీఆర్ సిట్టింగులకే టికెట్టన్న ప్రకటన బీజేపీకి నెత్తిన పాలు పోసినట్లుగా అయ్యిందంటున్నారు.  వచ్చే ఎన్నికల్లో సీట్లు ఆశిస్తున్న ఆశావహులకు టీఆర్ఎస్ ప్రకటన తీవ్ర నిరాశను మిగిల్చింది.  ఇప్పటికే టీడీపీ- కాంగ్రెస్‌ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల వల్ల, తమ అవకాశాలు దెబ్బతిన్నాయని  అసంతృప్తితో రగిలిపోతున్నవారంతా.. ఇక తమ దారి తాము చూసుకోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. ఈ పరిస్థితినే బీజేపీ రాజకీయంగా సద్వినియోగం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతోంది. సిట్టింగులకే సీటు అంటూ కేసీఆర్ ఇలా ప్రకటించారో లేదో.. అలా రాష్ట్ర సీనియర్ నాయకులకు హస్తిన నుంచి పిలుపు వచ్చింది. టీఆర్ఎస్ లో అసంతృప్త నేతలను గుర్తించాల్సిందిగా పార్టీ హైకమాండ్ రాష్ట్ర నాయకులను ఆదేశించిందంటున్నారు. సిట్టింగులను మారిస్తే తప్ప గెలుపు అవకాశాలు లేవంటూ పీకే చెప్పిన  దాదాపు 67 నియేజకవర్గాలలోని క్రియాశల నాయకులు, మాజీ ఎమ్మెల్యేలను గుర్తించి వారిని కమలం పార్టీలోకి ఆహ్వానించాలని కూడా హై కమాండ్ ఆదేశించినట్లు చెబుతున్నారు. అలాగే పార్టీలోకి ఎవరిని చేర్చుకోవాలి అన్న విషయంలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈటలకు చెప్పినట్లు తెలుస్తోంది.టికెట్లపై ఆశలు పెట్టుకుని, కేసీఆర్‌ ప్రకటనతో నిరాశకు గురయిన టీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలతో మాట్లాడే బాధ్యతను మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కి బీజేపీ హై కమాండ్ అప్పగించినట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీలో చేరే వారికి ఎమ్మెల్యే సీట్ల హామీ ఇవ్వడం ద్వారా, వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని తిరుగులేనిశక్తిగా మార్చాలన్నదే బీజేపీ వ్యూహంగా పరిశీలకులు తాజా పరిణామాలను విశ్లేషిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లోని అన్ని నియోజకవర్గ నాయకులతో సత్సంబంధాలున్న ఈటల ద్వారా, వారిని బీజేపీలోకి తీసుకురావాలన్నలక్ష్యంతో బీజేపీ అడుగులు కదుపుతోందంటున్నారు.

రాజీవ్ హంతకుల విడుదలపై సుప్రీంలో కేంద్రం సవాల్

 రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులు ఆరుగురినీ విడుదల చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్రం సవాల్ చేసింది.  ఈ మేరకు దోషుల విడుదలకు ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులను విడుదల చేస్తూ తగిన వాదనలు వినిపించే అవకాశం లేకుండా ఆదేశాలు ఇవ్వడం సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘనే అవుతుందని కేంద్రం తన పిటిషన్ లో పేర్కొంది. రాజీవ్ హత్య కేసులో జీవితకాల శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులు- నళిని, మురుగన్, సంథాను, రాబర్డ్ పయాస్, జయకుమార్‌లకు జైలు నుంచి విముక్తి కల్పిస్తూ   సుప్రీంకోర్ట్ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఏ ఇతర   కేసులూ లేకుంటే దోషులందరినీ విడుదల చేయవచ్చునని పేర్కొంది.ఈ తీర్పుతో దాదాపు మూడు దశాబ్దాల  తర్వాత దోషులంతా జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. 

కేసినో కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డిని విచారించిన ఈడీ

కేసీనో వ్యవహారంలో ఈడీ వైసీపీ నేతలపైకి తన దృష్టి సారించింది. చీకోటి ప్రవీణ్ కేసినో వ్యవహారం కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు ఉన్నారన్న ఆరోపణలు అప్పట్లోనే వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇదే కేసుకు సంబంధించి ఈడీ అధికారులు బుధవారం తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సోదరులు ఇద్దరిని సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ ఎల్ రమణకు కూడా నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. అదలా ఉంటే.. ఇదే కేసినో కేసులో ఏపీ రాజకీయ నేతలనూ ఈడీ విచారించనుంది. తాజాగా ఈ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే   గుర్నాథ్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయన గురువారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.కేసినో కేసుకు సంబంధించి ఏపీకి చెందిన పలువురు రాజకీయ నాయకులకు కూడా ఈడీ విచారణకు రావలసిందిగా నోటీసులు పంపే అవకాశం ఉందని చెబుతున్నారు.  నగదు ఇక్కడ ఇచ్చి వాటిని కాయిన్లుగా మార్చుకుని విదేశాలలో క్యాసినోల్లో మార్చుకుని ఆడతారు. ఇలా వందల మంది ఆడారని అంటున్నారు.   చీకోటి ప్రవీణ్‌ను విచారించినప్పుడు ఈడీ సేకరించిన సమాచారం ఆధారంగా ఈడీ కేసినో కేసులో పలువురికి వరుసగా నోటీసులు జారీ చేసి విచారిస్తోంది.  గురువారం ఈ కేసులో విచారణకు గుర్నాథరెడ్డితో పాటు  వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు యుగంధర్ కూడా హాజరయ్యారు వీరిద్దరూ చీకోటి ప్రవీణ్ నిర్వహించిన కేసినోల్లో పాల్గొనడానికి ఇతర దేశాలకు వెళ్లేందుకు హవాలా మార్గం ద్వారా డబ్బులు చెల్లించారన్న ఆరోపణలపై ఈడీ ప్రశ్నిస్తోందంటున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకూ వంద మందికి ఈడీ నోటీసులు జారీ నట్టు చెబుతున్నారు. 

డేవిడ్ వార్నర్ మళ్లీ చేసేశాడు

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్..సామాజిక మాధ్యమంలో చాలా చాలా యాక్టివ్ గా ఉంటారు. అంతకు మించి తెలుగు రాష్ట్రాల క్రీడాభిమానులు, సినీ అభిమానులకు డేవిడ్ వార్నర్ చాలా చాలా దగ్గరైపోయాడు. ఐపీఎల్ లో గతంలో హైదరాబాద్ జట్టుకు కేప్టెన్ అయినందుకే కాదు.. వార్నర్ తెలుగు సినీ నటుల పాపులర్ పాటలు, డైలాగ్స్  స్కూఫ్ చేసి వాటిని సామాజిక మాధ్యమంలో ఉంచడం ద్వారా కూడా తెలుగు ప్రజలలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా డేవిడ్ వార్నర్ మరో స్కూఫ్ చేసి సామాజిక మాధ్యమంలో పెట్టాడు. వెంటనే అది తెగ వైరల్ అయిపోయింది. నెటిజన్లు అద్భుతం అంటూ కామెంట్లు కూడా పెట్టేస్తున్నారు. అయితే ఈ సారి షేన్ వార్న్ నటి రష్మికకు సారీ చెప్పి మరీ స్కూఫ్ చేశాడు. ఇంతకీ సారీ ఎందుకంటే షేర్ వార్న్ స్కూఫ్ చేసిన పాట బీష్మ చిత్రంలో రష్మిక చేసినది. అందుకే అలా స్కూఫ్ చేసినందుకు క్షమించాలంటూ డేవిడ్ వార్న్ ముందుగా రష్మికకు క్షమాపణలు చెప్పారు. అయితే డేవిడ్ వార్న్ యాక్ట్ రష్మిని కించపరిచేదిగా ఎంత మాత్రం లేదని నెటిజన్లు అంటున్నారు. విపరీతంగా లైకులు కొడుతున్నారు. ఇలా ఉంటే.. క్రికెట్ తెలిసిన వారికి వార్న్ పరిచయం అక్కర్లేని పేరే. అలాగే ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సుదీర్ఘ కాలం కెప్టెన్ గా కూడా వ్యవహరించడంతో టాలీవుడ్ సినిమాలూ, హీరోలపై చక్కటి అవగాహన సైతం ఉందనడానికి గతంలో ఆయన తెలుగు హీరోలను నటులను అనుకరిస్తూ చేసిన స్కూపులే నిదర్శనం. బాహుబలిలో ప్రభాస్ డైలాగ్ నుంచి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్టెప్‌ల వరకు డేవిడ్ వార్నర్ చేసిన స్కూపులన్నీ నెటిజన్ల మన్ననలు పొందాయి. ఇన్నాళ్లు హీరోల ముఖాలని మార్ఫింగ్ చేసి నెటిజన్లని అలరిస్తూ వచ్చిన డేవిడ్ వార్నర్.. తాజాగా తొలిసారిగా హీరోయిన్ రష్మిక   స్ఫూఫ్ చేశాడు.   

ఈడీ విచారణకు పూరి జగన్నాథ్, ఛార్మి

ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాథ్ ను, నటి, నిర్మాత చార్మిని వివాదాల్లోకి లాగింది. సినిమా చిత్రీకరణ నుంచి ప్రచారం, విడుదల, ఆ తరువాత ఫలితం, ఆ తరువాత డిస్ట్రిబ్యూటర్స్ ఇలా ఆ చిత్రానికి సంబంధించిన ప్రతీ విషయమూ, ప్రతి అంశమూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాయి. తాజాగా ఇప్పుడా చిత్రానికి పెట్టుబడులు ఎలా వచ్చాయన్న విషయంపై ఈడీ కూపీలాగుతోంది. ఇందు కోసం పూరీ జగన్నాథ్ ను, నటి ఛార్మీని విచారణకు పిలిచింది. ఈడీ పిలుపు మేరకు పూరి జగన్నాథ్, ఛార్మీలు గురువారం హైదరాబాద్ లోకి ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మిలు గతంలో డ్రగ్స్ వ్యవహారంలో ఒక సారి ఎక్సైజ్ అధికారుల విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఇరువురికీ కూడా క్లీన్ చిట్ లభించింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు లైగర్ సినిమాలో పెట్టుబడులు ఎక్కడ నుంచి  వీరిద్దరు కలిసి ఇటీవల విజయ్ దేవర కొండ హీరోగా  ‘లైగర్’ మూవీ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకత్వం పూరి జగన్నాథే.   పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినీమా విడుదలైన తరువాత ఘోరంగా ఫ్లాప్ అయ్యింది.  అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నగదు లావాదేవీలపై ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సినిమా కోసం జరిగిన నగదు లావాదేవీలపై ఆరా తీసిన ఈడీ అధికారులు, ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఆధారాలు సేకరించారని చెబుతున్నారు. అంతే కాకుండా  ఈ సినిమాలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు పెట్టుబడులు పెట్టినట్లు చెబుతున్నారు.   మొత్తంగా ఈడీ పూరి జగన్నాథ్, ఛార్మీలను విచారించడం సంచలనం సృష్టించింది. ఈ విషయంపై సినీ రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

హిమాచల్ లో కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా

హిమాచల్​ ప్రదేశ్​లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలో ఒకే విడతలో పోలింగ్ శనివారం ముగిసిన సంగతి తెలిసిందే. గుజరాత్ అసెంబ్లీకి  డిసెంబర్ మొదటి వారంలో రెండు విడతలుగా  పోలింగ్ జరగనుంది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అయితే డిసెంబర్ 5న వెలువడతాయి. కాగా హిమాచాల్ ప్రదేశ్ లోని 68 నియోజకవర్గాలలోనూ ఓకే విడతలో పోలింగ్ పూర్తయ్యింది. రంగంలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది.  రాష్ట్రంలో ఇంత కాలం కాంగ్రెస్, బీజేపీల మధ్య ద్విముఖ పోరే ఉండేది. అయితే అందుకు భిన్నంగా ఈ సారి ఆప్ కూడా పోటీలో ఉండటంతో త్రిముఖ పోరు జరిగిందని పరిశీలకులు అంటున్నారు. అదలా ఉంచితే ఎన్నికలకు ముందు హిమాచల్ ప్రదేశ్ లో సర్వేలన్నీ ఆప్ ది నామమాత్రపు పోటీయే అని పేర్కొన్నాయి. అదే సమయంలో ఈ సారి బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని తేల్చాయి. హిమాచల్ ప్రదేశ్ లో   ఏ పార్టీ ఇంత వరకూ వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన సందర్భం లేదు. ఆ ఆనవాయితీ ప్రకారం ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ విపక్షానికి పరిమితమవ్వక తప్పదనీ, కాంగ్రెస్ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టడం తధ్యమని పరిశీలకులు అంటున్నారు. అయితే బీజేపీ మాత్రం ఈ సారి ఆ ఆనవాయితీని బద్దలు కొట్టి తాము రెండో సారి అధికారాన్ని చేపడతామన్న ధీమాను బీజేపీ వ్యక్తం చేస్తున్నది.   2017 హిమాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 43 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్​ 22 చోట్ల గెలిచింది. ఒక స్వతంత్ర అభ్యర్థి, ఒక సీపీఎం ఎమ్మెల్యే  విజయం సాధించారు. కాగా గత ఎన్నికలలో కనీసం 20స్థానాల్లో గెలుపోటముల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. ఆయా స్థానాల్లో సుమారు 3వేల ఓట్ల తేడాతో అభ్యర్థుల తలరాతలు మారిపోయాయి. ఈ 20 స్థానాల్లోని 6 సీట్లలో మెజారిటీ 1000, అంతకన్నా తక్కువగానే ఉండటం గమనార్హం. ఇక 34 నియోజకవర్గాల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల మధ్య ఓట్ల వ్యత్యాసం 5000, అంతకన్నా తక్కువగా ఉంది. దీని బట్టి.. హిమాచల్​ ప్రదేశ్​లో ఎన్నికల వేడి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.అయితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీలో ఉండటంతో ఆప్ వల్ల ఏ పార్టీకి ఎక్కువ నష్టం వాటిల్లుతుందన్న విషయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆప్ ఉనికి వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి బీజేపీ లాభపడుతుందని కొందరు చెబుతుంటే.. ప్రభుత్వ అనుకూల ఓటునే ఆప్ చీలుస్తుందని మరి కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే   శ్రీ ఆత్మసాక్షి ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో చేసిన సర్వే మేరకు బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ పోరు అనివార్యమని తేలింది. సర్వే అంచనా ప్రకారం బీజేపీ రాష్ట్రంలో 31 నుంచి 35 స్థానాలలోనూ, కాంగ్రెస్ 33 నంచి 36 స్థానాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆప్ ఒక స్థానం, ఇతరులు ఒక స్థానం గెలుచుకునే అవకాశాలున్నాయి, ముఖ్యంగా కంగ్రా ప్రాంతంలో కాంగ్రెస్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. ఇక్కడ యాపిల్ రైతులు ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి పనితీరుపై కూడా అసంతృప్తి వ్యక్తమౌతోంది.నిరుద్యోగయువత, ప్రభుత్వోద్యోగులు కూడా ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఇక మహిళల ఓట్లు బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీలిపోనున్నాయని సర్వే తేల్చింది. ఇక పోతే ఆప్ పోటీ కారణంగా కనీసం పది స్థానాలలో బీజేపీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని సర్వే తేల్చింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కూడా బీజేపీపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉంది. 

ఆదోనిలో బాబుకు బ్రహ్మరథం.. జన సంద్రంగా మారిన పట్టణం

చంద్రబాబు కర్నూలు పర్యటనకు జనం బ్రహ్మరథం పట్టారు. మూడు రోజుల పర్యటలో చంద్రబాబు మాటల పదును పెరిగింది. సుత్తి లేకుండా సూటిగా విషయాన్ని జనం హృదయాలకు హత్తుకునేలా చెప్పారు. జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూనే.. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానన్నది స్పష్టంగా చెబుతూ జనాన్ని ఆకట్టుకుంటున్నారు. గతంలోలో జగన్ సర్కార్ పై విమర్శలకే పరిమితం కాకుండా...జగన్ పాలన వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. జగన్ పాలనా వైఫల్యాలతో రాష్ట్రానికి జరిగిన నష్టాలను చంద్రబాబు ఏకరవు పెడుతుంటే జనంలో మంచి స్పందన కనిపించింది. చంద్రబాబు పర్యటనకు జనం నుంచి వచ్చిన స్పందన తెలుగుదేశం శ్రేణుల్లో జోష్ నింపింది. జగన్ ను సాగనంపితే తప్ప రాష్ట్రానికి మోక్షం లేదు. ప్రజలకు సంతోషం లేదు అంటూ నిప్పులు చెరిగారు. గడపగడపకూ వస్తున్న వైసీపీ దొంగల్ని ఎక్కడికక్కడ నిలదీయండి అంటూ పిలుపు నిచ్చారు. నాలుగు సార్లు తిరిగితే అన్ని మర్చిపోయి ఓట్లేస్తారన్నది వారి ఆశ.. కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మనం మరచిపోతామా? లక్షల రేషన్ కార్డులు తొలగించారు, పేదల పొట్టగొట్టిన ఘనడు జగన్.. పేదల ఆకలి మంటలే శాపంగా మారతాయి అవునా కాదా అంటూ జనాలను ప్రశ్నించి వారిలో ఆవేశాన్ని రగిలించారు. తెలుగుదేశం అధికారంలోకివ వస్తే సంక్షేమం ఉండదంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నదుష్ప్రచారాన్ని ఖండించారు. గతంలోనే తెలుగుదేశం సంక్షేమానికి పెద్ద పీట వేసిందని గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఇప్పటి కంటే మెరుగైన సంక్షేమంఅందించి చూపుతానని వాగ్దానం చేశారు. సంక్షేమ పథకాలు ప్రజలకు ఆర్థిక దన్నుగా నిలిచి వారు ధనవంతులు కావడానికి ఉపయోగపడాలన్నారు. తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంగా జగన్ వంటి అసమర్ధ సీఎంను చూడలేదన్నారు. జగన్ రాయలసీమ ద్రోహిగా అభివర్ణించిన చంద్రబాబు.. సీమను అభివృద్ధి చేసింది తెలుగుదేశమే అని ఉద్ఘాటించారు.   కడపలో స్టీల్ ప్లాంటు నిర్మించలేని ఈ పెద్ద మనిషి మూడు రాజధానులు నిర్మిస్తారంటే నమ్మాలా? అని ప్రశ్నించారు. కర్నూలులో హైకోర్టుకు నేను అడ్డుపడుతున్నానని ప్రచారం చేస్తున్నారు. నేను అడ్డుపడడం లేదు. మీకు 151 సీట్లు ఇచ్చారు. ఎంపీలను ఇచ్చారు.  నువ్వు చేసిందేమిటి?అని ప్రశ్నించారు. తన వయస్సుపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కూడా చంద్రబాబు దీటుగా సమాధానం చెప్పారు. తనదీ ప్రధాని మోడీదీ ఒకటే వయస్సని గుర్తు చేశారు.   70 ఏళ్లకు బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యారు. నేను శారీరకంగా చాలా ఫిట్ గా ఉన్నా. మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేసి భవిష్యత్తును వేరే వాళ్లకుఅప్పగిస్తాను తప్ప..   మీ పేటీఎం బ్యాచ్ కు వదిలిపెట్టనని స్పష్టంగా చెప్పారు. రాష్ట్రం భవిష్యత్ కోసం, మీ పిల్లల భవిష్యత్ కోసం ప్రజలారా నన్ను ఆశీర్వదించండి అని చంద్రబాబు విజ్ణప్తి చేశారు. గతంలో వ్యవసాయ కూలీల పిలలు తాను అమలు చేసిన విద్యావిధానం వల్ల  ఐటీ ఉద్యోగాలు సాధించారుచ అదే జగన్‌రెడ్డి అధ్వాన విధానాల కారణంగా  మటన్ కొట్టులో ఉద్యోగాలకు పరిమితమై పోయారని విమర్శించారు.  రాష్ట్ర సంపద పెంచే మార్గం నాకు తెలుసు.. ఆస్తులు తాకట్టు పెట్టడం మాత్రమే జగన్ కు తెలుసు అంటూ విమర్శలు గుప్పించారు.   జగన్ ఓ పిల్ల కుంక. తెలివిగా ఆలోచిస్తే ప్రపంచాన్ని జయించవచ్చు. పేదవాడు పేదవాడుగా ఉండటానికి వీల్లేదు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా టీడీపీ సిద్ధం. నిండు మనసుతో ఆశీర్వాదించి అసెంబ్లీకి పంపండి. మీ రుణం తీర్చుకుంటాను’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆదోని పట్టణం పసుపువనంగా మారిపోయింది. చంద్రబాబు పర్యటనకు వచ్చిన జనసందోహాన్ని కంట్రోల్ చేయడం పోలీసుల వశం కాలేదు. ఆదోని పట్టణంలో చంద్రబాబు రోడ్ షోకు జనం పోటెత్తారు. రోడ్లన్నీ కిక్కిరిసి పోయాయి. రోడ్డుకిరువైపులా జనం నిలబడి చంద్రబాబుకు అభివాదం చేశారు. భవనాలపై నుంచి పూలవర్షం కురిపించారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు రోడ్ షో చాలా నెమ్మదిగా సాగింది. చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదలడమే కష్టంగా మారిన పరిస్థితి కనిపించింది. జనం స్పందనతో చంద్రబాబులో కూడా ఉత్సాహం కనిపించింది. జగన్ పాలనపై జనం ఎంతగా విసుగెత్తి ఉన్నారో చెప్పడానికి ఈ జనసందోహమే నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

విపక్షాల మోడీ టార్గెట్ గురి తప్పుతోందా?

 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలి, మోడీని గద్దె దించాలి అన్నదే బీజేపీయేతర పార్టీల లక్ష్యం.  గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ నుంచి మొదలు ఇప్పుడిప్పుడే జాతీయ రాజకీయాలలో తొలి అడుగు వేస్తున్న   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు, బీజేపీ ప్రత్యర్ధి పార్టీల నాయకులందరిదీ అదే మాట. అదే లక్ష్యం. ఆ లక్ష్యంతోనే  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ,  భారత్ జోడో  యాత్ర చేస్తున్నారు. అందుకోసమే  కమ్యూనిస్టులు ముందు వెనుకలు చూసుకోకుండా పొత్తులకు సిద్ధమౌతున్నారు. కమ్యూనిస్టులా వారెక్కడున్నారు అన్న కేసీఆర్ పంచన చేరడానికి  కూడా వారు ఒక్క క్షణం వెనుకాడలేదు. ఇక మరాఠా యోధుడు శరద్ పవార్, బెంగాల్ బెబ్బులి మమతా బెనర్జీ, ఆప్ అరవింద్ కేజ్రివాల్ ఎవరి శక్తి మేరకు వారు వారి వారి దారిలో నడుస్తూ మోడీ పరాజయమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఇందుకోసం ఎవరి వ్యూహాలు వారు పన్నుతున్నారు. మరోవంక, బీజీపే వ్యతిరేక పార్టీల నేతలు అందరికీ తానే తలలోని నాలుక అంటూ హడావుడి చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్  ఇప్పుడు  అదే లక్ష్యంతో సొంత కుంపటి పెట్టుకుని బీహార్ లో పాద యాత్ర చేస్తున్నారు.   ఇక విషయానికి వస్తే  2024 సార్వత్రిక ఎన్నికలకు ఎంత లేదన్నా ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఆ సార్వత్రిక ఎన్నికలకు ముందు  గుజరాత్, హిమాచల్, తెలంగాణ సహా  ఐదారు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలున్నాయి, ఈ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గానో లేదా సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు లిట్మస్ టెస్టుగానూ అంతా భావిస్తున్నారు.  అందులోనూ ఇప్పుడు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ముందు వరసలో ఉన్నాయి.  ఈ రెండు రాష్ట్రాలలోనూ కూడా అధికారంలో ఉన్నది బీజేపీయే. ఈ రెండు రాష్ట్ర్రాలలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాకుండా, అడ్డుకోగలిగితే అప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలలోమోడీ టార్గెట్ రీచ్ కావడంపై విపక్షాలు ఆశలు పెట్టుకోవచ్చని  రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  అయితే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీని ఓడించే స్థితిలో ప్రతిపక్ష పార్టీలున్నాయా? అంటే, పరిశీలకులు, సర్వేలూ కూడా పెదవి విరుస్తున్నాయి. గుజరాత్,  హిమాచల్ ప్రదేశ్‌లలో మరో సారి బీజేపీ విజయం సునాయాసమేనని సర్వేలు ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా గుజరాత్ లో వరుసగా ఆరుసార్లు అధికారాన్ని నిలబెటగ్టుకున్న బీజేపీపై తీవ్ర మైన ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటగికీ.. బీజేపీని నిలువరించి అక్కడ అధికారం దక్కించుకునే విషయంలో విపక్షాల అనైక్యతే అడ్డుగా నిలుస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. అందుకే అక్కడ వరుసా ఏడో సారి కూడా కమలమే అధికార పగ్గాలను అందుకుంటుందని చెబుతున్నాయి.   ఒక సర్వే అయితే గుజరాత్‌ అసెంబ్లీలో ఎన్నికలలో బీజేపే అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాదు, గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. గత ఎన్నికలలో బీజేపీ, అతికష్టం మీద, మొత్తం  182 స్థానాలకు గానూ 99 స్థానాలు గెలుచుకుని పరవు నిలుపుకుంది. అయితే, ఈసారి 135 నుంచి 143 వరకు స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉందని ఆ ఒపీనియన్  పోల్‌ పేర్కొంది. కాంగ్రెస్‌కు 36 నుంచి 44 వరకు సీట్లు దక్కవచ్చని  సర్వే అంచనా వేసింది. గుజరాత్ లో గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ బలంగా పుంజుకున్నప్పటికీ గెలుపునకు దూరంగా నిలిచిపోవడానికి కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆ రాష్ట్రంలో పోటీ చేస్తున్న ఆప్ చీల్చడమేనని ఆత్మసాక్షి తాజా సర్వే పేర్కొంది.   అలాగే 68 స్థానాలున్న హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ 37-45 సీట్లలో విజయం సాధించి మరో సారి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని దాదాపు అన్ని సర్వేలు ఘంటాపథంగా చెప్పాయి.  ముఖ్యంగా గుజరాత్ విషయాన్ని తీసుకుంటే అక్కడి పరిణామాలను విశ్లేషిస్తే ఆ రాష్ట్రంలో మరో సారి బీజేపీకి అధికారపగ్గాలు అందడానికి విపక్షాల అనైక్యతే కారణమని స్పష్టంగా అర్ధమౌతుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. అయితే ఆ తరువాత గడచిన ఈ ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ స్వయం తప్పిదాలతో వెనుకబడింది.   పటేదార్ ఆందోళనతో పాపులర్ అయిన యువనేత,  హార్ధిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై  చెప్పి, బీజేపీలో చేరారు. అలాగే పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ లోనూ కాంగ్రెస్ ఓటుకు భారీగా గండి కొడుతుందని పరిశీలకులు అంటున్నారు.  వరసగా ఆరు పర్యాయాలు అధికారంలో ఉన్న, బీజేపీకి సహజంగానే రాష్ట్రంలో వ్యతిరేకత ఉంది, అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు, కాంగ్రెస్,  ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య చీలిపోయి బీజేపీ లబ్ధి పొందుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గుజరాత్ లో సాగితే కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రయోజనం ఉంటుందని స్థానిక నాయలు ఆశించారు. అయితే, రాహుల్ యాత్ర రూట్ మ్యాప్ లో  గుజరాత్’, హిమాచల ప్రదేశ్ రాష్ట్రాలను చేర్చలేదు. ఇది గుజరాత్,హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఆశలు వదులుకుందనే సంకేతాన్ని ఇచ్చింది. దీంతో, రాహుల్ యాత్ర వలన అంతో ఇంతో వస్తుందనుకున్న మైలేజి రాకపోగా, నెగటివ్ ప్రచారానికి అవకాశం ఇచ్చింది. పోటీకి ముందే పరాజయాన్ని అంగీకరించేసిదన్న చర్చకు తావిచ్చింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్‌లో ఆదరణ పెరుగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినాయకుడు, అరవింద్ కేజ్రీవాల్ వారంలో రెండు సార్లు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మూడో స్థానానికి పరిమితమైనా  ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోనూ అదే పరిస్థితి, కని పిస్తోంది. అందుకే, బీజేపీ వ్యతిరేక పార్టీలు వేటికి అవిగా మోడీ టార్గెట్ నిర్దేశించుకుని 2024 ఎన్నిక సమరంలో దిగితే ఆ టార్గెట్ రీచ్ కావడం సాధ్యం కాదనే పరిశీలకులు అంటున్నారు. అనైక్యత వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి ముచ్చటగా మూడో సారి కూడా కేంద్రంలో మోడీ సర్కార్ కొలువుతీరే పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. అందుకే విపక్షాల మోడీ టార్గెట్ గురి తప్పిందని ఇప్పటి నుంచే విశ్లేషణలు వస్తున్నాయి.

ఔనంటే కాదనిలే.. కాదంటే ఔననిలే!..కేసీఆర్ తీరే వేరులే

ఏదో సినిమాలో ఇలాంటి పాట ఒకటి ఉంది. అది ఆ సినిమాలో ఏ సందర్భానికి సంబంధించిన పాట అన్నది పక్కన పెడితే.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీరు మాత్రం చెప్పింది చేయం.. చేసేది చెప్పం అన్నట్లుగానే ఉందన్నది రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కూడా ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయినా అప్పుడే తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి రగులుతోంది. ఇందుకు కారణం ప్రతిపక్షాలు కాదు.. అధికారంలో ఉన్న పార్టీలే. కారణం ఏదైనా తెలంగాణలో అధకారంలో ఉన్న తెరాసలోనూ, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలోనూ కూడా ఇహనో, ఇప్పుడో ఎన్నికల ప్రకటన వెలువడనుందా అన్నంత హడావుడి కనిపిస్తోంది. తెరాస సీఎం ఇప్పటి నుంచే ఎన్నికలలో ఎలా పని చేయాలన్న దిశానిర్దేశాన్ని పార్టీ శ్రేణులకు నిర్దేశిస్తున్నారు. ఫిరాయింపులపై అప్రమత్తం  చేస్తున్నారు. పార్టీ నుంచి పక్క చూపులు చూస్తున్నవారెవరో తనకు తెలుసనీ, ఎవరేం చేస్తున్నారో, ఎవరెవరు ఎవరెవరి టచ్ లోకి వెళుతున్నారో సమాచార మంతా తన దగ్గరు ఉదని హెచ్చరిస్తున్నారు. ప్రలోభాలకు లొంగి రాజకీయ భవిష్యత్ పాడు చేసుకోవద్దని హితవూ చెబుతున్నారు. సిట్టింగులందరికీ టికెట్లిస్తానని హామీ ఇచ్చేసి నియోజకవర్గాలలో పని చేసుకోవాలని సూచిస్తున్నారు. అదే సమయంలో ముందస్తు ముచ్చటే లేదు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలని చెబుతున్నారు. ఆయన చెబుతున్న మాటలకూ, చేస్తున్న పనులకూ సంబంధమే లేదు. ముందస్తు లేదంటూనే.. ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించేశారు. ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలన్నదానిపై కార్యాచరణ మొదలెట్టేశారు. గతంలో అంటే 2018లో ముందస్తుకు వెళ్లినప్పుడు కూడా ఆయన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు వెళదాం అంటూ క్యాడర్ కు చెబుతూనే ఉరుము లేని పిడుగులా ఆరు నెలలకు ముందే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల శంఖారావం పూరించేశారు. ఇప్పుడూ అదే చేస్తారని, అందుకే ముందస్తు ముచ్చట లేదంటూనే.. ఎన్నికల సన్నాహాలు చేసేస్తున్నారని పార్టీ శ్రేణులే భావిస్తున్నపరిస్థితి. అయితే రాజకీయ వర్గాలలో మాత్రం కేసీఆర్ ముందస్తు లేదంటే ఉందనే అర్ధమని ఇందుకు 2018 ముందస్తు ఎన్నికలే నిదర్శనమనీ అంటున్నారు. సంటిమెంట్లను విపరీతంగా ఫాలో అయ్యే కేసీఆర్ కలిసి వచ్చిన ముందస్తును కాదని షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లే చాన్సే లేదంటున్నారు విశ్లేషకులు. 2018 లో కూడా ముందస్తుగానే ఎన్నికల నగారా మోగించిన కేసీఆర్ అప్పట్లో ఆరు నెలలు ముందుగా ఎన్నికలు జరిగితే అవి ముందస్తు ఎందుకౌతాయని ప్రశ్నించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ గడువుకు ఆరు నెలలు ముందు ఎన్నికలు నిర్వహించవచ్చని కేంద్ర ఎన్నికల సంఘమే చెబుతుంటే.. అందుకే షెడ్యూల్ కంటే ఆరు నెలలు ముందుగా ప్రభుత్వం ప్రజాతీర్పు కోరాలనుకోవడం ముందస్తుకు వెళ్లడం అవ్వదని ఆయన అప్పట్లో చెప్పారు. ఇప్పుడూ అదే చెప్పే అవకాశం ఉందంటున్నారు.  షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు అని ఇటీవలి కార్యవర్గ సమావేశంలో ఆయన ఘంటా పదంగా చెప్పినా అదే ప్రసంగంలో ముందస్తు సంకేతాలు కూడా ఇచ్చారని వివరిస్తున్నారు. ఆయన ఎన్నికలకు పది నెలల సమయం మాత్రమే ఉంది అంటూ కార్యవర్గ సమావేశంలో కేడర్ ను అప్రమత్తం చేశారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు అంటే వచ్చే ఏడాది డిసెంబర్ లో జరగాల్సి ఉంది. అంటే తక్కువలో తక్కువ పదమూడు నెలల సమయం ఉంది. కానీ కేసీఆర్ పది నెలలలోనే ఎన్నికలు అంటున్నారు. అంటే ఆయన ముందస్తుకు ప్రిపేర్ అయిపోవడమే కాకుండా క్యాడర్ ను కూడా అందుకు సంసిద్ధం చేసేందుకు కార్యాచరణ ప్రారంభించేశారనే అర్ధమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక వచ్చే నెల నుంచీ కేసీఆర్ బీఆర్ఎస్ అధినేతగా ఆయన రాజకీయ పరిధి పెరిగిపోతుంది. జాతీయ పార్టీ అధినేతగా కేసీఆర్ ఒక్క తెలంగాణే కాకుండా దేశంలో తక్కువలో తక్కువ మరో ఐదారు రాష్ట్రాలపై కేంద్రీకృతం చేయాల్సి ఉంటుంది. అన్నిటికీ మించి వచ్చే నెల మొదటి వారంలో రెండు విడతలుగా జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో తన ప్రభావం చూపాలని ఆయన బలంగా నిర్ణయించుకున్నట్లు తెరాస వర్గాలే చెబుతున్నాయి. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి వాఘేలా వంటి వారి సహకారంతో అక్కడ కనీసం కొన్ని స్థానాలలోనైనా బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని భావిస్తున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలోగా బీఆర్ఎస్ కు ఎన్నికల సంఘం అనుమతి రాకుంటే గుజరాత్ లో తెలుగువారు అధికంగా ఉండే సూరత్ ప్రాంతంలోని అన్ని స్థానాలలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టి అయినా సత్తా చాటాలని కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని చెబుతున్నారు. ఇక ఆ తరువాత సార్వత్రిక  ఎన్నికలలో బీఆర్ఎస్ సత్తా చాటాలంటే అంతకంటే ముందుగా ఆయన ఇంట గెలవాల్సి ఉంటుంది. తెలంగాణలో తెరాస  ను ముచ్చటగా మూడో సారి అధికారంలోకి తీసుకువచ్చి అప్పడు రచ్చ గెలవాలని ఆయన భావిస్తున్నారు. వచ్చే నెలలో బీఆర్ఎస్ కు గుర్తింపు వస్తే ఇక టీఆర్ఎస్ ఉండదు, బీఆర్ఎస్ మాత్రమే ఉనికిలో ఉంటుంది. అప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకువచ్చి..జాతీయ స్థాయిలో తన ఆగమనాన్ని ఘనంగా చాటాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే ముందస్తు లేదని ఆయన నోటితో చెబుతున్నా.. చేతలన్నీ మాత్రం నిర్ణీత గడువు కంటే ముందుగానే రాష్ట్రంలో ఎన్నికల కోసమే అన్నట్లు ఉంటున్నాయి. అందుకే నిర్ణీత గడువు కంటే ఆరు నెలలు ముందు కాకపోయినా కనీసం మూడు నాలుగు నెలల ముందుగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగడం తథ్యమని రాజకీయవర్గాలు అంటున్నాయి. తెరాస శ్రేణులూ అలాగే భావిస్తున్నాయి.