మరో మారు మోడీ.. పవన్ బేటీ.. నేడూ విశాఖలోనే జనసేనాని?

ప్రధాని నరేంద్రమోడీతో జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖలో శుక్రవారం (నవంబర్ 11) భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఏపీకి మంచి రోజులు అని పవన్ మీడియాతో చెప్పారు. దీంతో ఇరువురి మధ్యా చర్చలు సహృద్భావ వాతావరణం జరిగాయని అంతా భావించారు. అయితే ఆ తదననంతర పరిణామాలను గమనిస్తే శుక్రవారం(నవంబర్ 11) ఇరువురి మధ్యా చర్చలు అసంపూర్తిగా ముగిశాయని అర్ధమౌతుంది. ఇరువురూ శనివారం(నవంబర్ 12) మరో సారి భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయనీ చెబుతున్నారు. అందుకే పవన్ కల్యాణ్ ఇంకా విశాఖలోనే ఉన్నారనీ మోడీతో ఆయన మరో సారి భేటీ అవుతారనీ అంటున్నారు. మొత్తం మీద పవన్ తో భేటీ, బీజేపీ రాష్ట్ర నాయకులతో భేటీ, రోడ్ షోలతో ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఆద్యంతం రాజకీయంగా ఆసక్తి, ఉత్కంఠ రేపుతోంది. మోడీ విశాఖ పర్యటన ఏర్పాట్లన్నీ ఏపీ సర్కార్ స్వయంగా దగ్గరుండి చూసుకోవడం, ప్రధాని సభకు జనసమీకరణ కూడా జగన్ సర్కారే ముందుండి ఏర్పాట్లు చేయడం సర్వత్రా ఆసక్తి రేకెత్తించింది. అదే సమయంలో చివరి నిముషంలో ప్రధాని మోడీ తో భేటీకి పీఎంవో నుంచి పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.   విశాఖలో   నిర్వహించిన రోడ్ షో, పవన్ కళ్యాణ్ తో ఐఎన్ఎస్ చోళలో భేటీ, అనంతరం బీజేపీ కోర్ కమిటీతో భేటీ.. ఆ తరువాత శుక్రవారం (నవంబర్ 12) సీఎం జగన్ తో భేటీ.. ఇవన్నీ కూడా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలే కావడంతో మోడీ ప్రధానిగా ఈ పర్యటనకు వచ్చారా లేక పార్టీ అగ్రనేతగా పర్యటిస్తున్నారా అన్నఅనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం అలా ఉంచితే.. శుక్రవారం రాత్రి పవన్ తో బేటీ తరువాత కూడా పవన్ విశాఖలోనే బస చేయడం రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నది. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రధాని మోడీయే స్వయంగా పవన్ కల్యాణ్ ను శుక్రవారం కూడా అందుబాటులో ఉండాలనీ, మరో సారి బేటీ అవుదామనీ చెప్పారు. శుక్రవారం ప్రధాని మోడీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హౌస్ లో భేటీ అయ్యారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం, అంటే మోడీ అప్పాయింట్ మెంట్ మేరకు  ఇరువురు నేతల మధ్య  భేటీ పావుగంటలో ముగియాల్సి ఉంది. అయితే అది అలా ఎక్సటెండ్ అవుతూ దాదాపు 35 నిముషాల పాటు సాగింది. అయితే అది కూడా అసంపూర్తిగానే ముగియడంతో.. మోడీ శనివారం (నవంబర్ 12) మరో సారి కలుద్దాం అందుబాటులో ఉండండి అని పవన్ కు చెప్పినట్లు తెలుస్తోంది.   అలాగే బీజేపీ నేతలతో బేటీ అనంతరం.. రాష్ట్రంలో పరిస్థితులపై మరింత అవగాహన ఏర్పరుచుకున్న మోడీ జనసేనాని పవన్ తో మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నారనీ, ఆ లోగా ముందుగా నిర్ణయించిన మేరకు శనివారం ఉదయం జగన్ తో బేటీ కూడా పూర్తయిన అనంతరం పవన్ తో భేటీ అయితే బెటర్ అని ఆయన భావిస్తున్నారని కమలం శ్రేణులే చెబుతున్నాయి.  

వర్సిటీలో చిరుత సంచారం.. భయాందోళనల్లో విద్యార్థులు.. పట్టించుకోని అధికారులు

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం విద్యార్థులను భయాందోళనలకు గురి చేస్తున్నది. వర్సిటీ ప్రాంగణంలో గత నెల రోజులుగా చిరుత సంచరిస్తోందన్న సమాచారం విశ్వవిద్యాలయ అధికారులకు తెలిపినప్పటికీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వర్సిటీలోని హెచ్ బ్లాక్, కామర్స్ డిపార్ట్ మెంట్ పరిసర ప్రాంతాలలో  చిరుత సంచారాన్ని విద్యార్థులు గమనించారు. అది సంచరిస్తున్న సమయంలో ఫొటోలు వీడియోలు తీసి వర్సిటీ అధికారులకు సమాచారం అందించారు. మూడు రోజుల కిందట ఐ బ్లాక్ వద్ద కుక్కను తరుముకుంటూ వచ్చిన చిరుతను చూసి విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ఐ బ్లాక్ తలుపులు మూసి గట్టిగా కేకలు వేయడంతో చిరుత సమీపంలోని ఖాళీ స్థలంలోకి వెళ్లి పోయింది. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులకు వర్సిటీ అధికారులు సమాచారం అందించి చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  

జగన్ సర్కార్ పై ఏపీ బీజేపీ ఒకలా.. కేంద్రం మరోనా.. జనం ఎందుకు నమ్ముతారు?

ఆంధ్రప్రదేశ్ లో విమర్శలు.. ఢిల్లీలో సంపూర్ణ సహకారాలు...ఇది ఏపీ సర్కార్ తో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు. ఏపీలో ఎంతగా విమర్శలు గుప్పించినా వైసీపీ నుంచి కనీస మాత్రంగా కూడా ప్రతి విమర్శలు రావడం లేదు. అదే సమయంలో జగన్ ప్రభుత్వానికి కాగల కార్యాలన్నీ కేంద్రంలోని మోడీ సర్కార్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరీ కానిచ్చేస్తోంది. అప్పుల విషయంలోనైతేనేమీ, కేసుల విషయంలోనైతేనేమీ జగన్ సర్కార్ ఇంత కాలం ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నెట్టుకొచ్చేయడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ తీరే కారణమని విపక్షాలు, విశ్లేషకులే కాదు.. సామాన్య జనం కూడా గట్టగా చెబుతున్నారు. నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే మోడీ వీశాఖ పర్యటనలో ఆయన రాష్ట్ర బీజేపీ నేతలతో దాదాపు గంటన్నర పాటు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీ పర్యటన ఏర్పాట్లు వైసీపీ ఎంపీ విజయసాయి పర్యవేక్షించిన విషయంపై ఏపీ బీజేపీ నేతలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అంతే కాకుండా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన బీజేపీ అధ్యక్షుడా లేక వైసీపీ ఏజెంటా అన్న స్థాయిలో వారి విమర్శలు ఉన్నాయి. కేవలం వారి విమర్శల కారణంగానే మోడీ పర్యటనలో హడావుడిగా ఏపీ బీజేపీ నేతలతో భేటీని జొప్పించారు. సరే ఈ బేటీలో  ప్రధానంగా జగన్ ప్రభుత్వ వైఫల్యాలపైనేచర్చ జరిగినట్లుగా చెబుతున్నా.. అంతకు మించి ఏదో జరిగిందని బీజేపీ శ్రేణులే అంటున్నాయి. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఏపీ బీజేపీ నాయకులు విఫలమయ్యారని మోడీ ఒకింత అసహనం వ్యక్తం చేశారనీ చెబుతున్నారు.    ఏపీలో బలోపేతమయ్యే అవకాశాలను రాష్ట్ర నాయకత్వం చేజేతులా జారవిడుచుకుందనీ మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారనీ చెబుతున్నారు. ఇక నుంచి అయినా జగన్ సర్కార్ వైఫల్యాలను జనంలోకి తీసుకుపోవాలనీ, గ్రమాగ్రామాన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై సమావేశాలు, సభలూ నిర్వహించి ప్రచారం చేయాలని సూచించారని అంటున్నారు. జగన్ సర్కార్ వైఫల్యాలపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ జరిగేలా చర్యలు చేపట్టాలని మోడీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జగన్ సర్కార్ పై రాష్ట్ర నాయకత్వాన్ని విమర్శించాలంటూ ఆదేశాలు జారీ చేసి.. కేంద్రం స్థాయిలో జగన్ తప్పిదాలు, వైఫల్యాలను కప్పిపుచ్చే పని చేయడం వల్ల ఎటువంటి ప్రయోజం ఉండదనీ.. ఏపీ బీజేపీ నాయకులు భావిస్తున్నారని అంటున్నారు. ఈ విషయాన్ని నేరుగా మోడీ ముందు ప్రస్తావించకపోయినా.. మోడీతో భేటీ తరువాత వారిలో నిరుత్సాహమే కనిపించిందని కూడా కమలం ఏపీ శ్రేణులు చెబుతున్నాయి.  ఇప్పటికే ఏపీలో జగన్ సర్కార్ పై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహ జ్వాల సెగలు బీజేపీకి కూడా తగులుతున్నాయనీ, రాష్ట్రంలో బీజేపీ అంటే జగన్ కు వంత పాడే పార్టీ అన్న ముద్ర బలంగా పడిపోయిందనీ పార్టీ శ్రేణులే అంటున్నాయి. రాజధాని అంశం నుంచి ఏ విషయం తీసుకున్నా.. ఏపీలో సీమటపాకాయల్లా అప్పడప్పుడూ బీజేపీ నాయకులు విమర్శల చప్పుడు చేయడమే తప్ప గట్టిగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం అయితే చేయలేదని చెబుతున్నారు.   నాలుగైదు నెలల కిందట అమిత్ షా ఏపీ పర్యటనకు వచ్చినప్పుడే వైసీపీ సర్కార్‌పై పోరాడాలని ఆదేశించినట్లు చేశారనీ, అలాగే ఏపీ బీజేపీ నాయకులు కూడా పోరాడినట్లే చేశారనీ.. అయితే ఆ ఆదేశం, ఆ పోరాటంలో ఎక్కడా సీరియస్ నెస్ అన్నదే కనిపించలేదనీ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. అందుకే బీజేపీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల బేటీలో రాష్ట్రంలో బీజేపీతో కలిసి పని చేయలేకపోతున్నామని అన్నారని కూడా విశ్లేషిస్తున్నారు. అసలు జరగాల్సింది ఏపీ బీజేపీ నేతలు వైసీపీ సర్కార్ పై పోరాడటం కాదనీ, కేంద్రమే వైసీపీ ఆర్థిక అరాచకత్వంపై శ్వేతపత్రం విడుదల చేయడం లాంటి తీవ్ర చర్యలకు పాల్పడితేనే రాష్ట్ర ప్రజలలో జగన్ విధానాలకు బీజేపీ అండగా నిలుస్తోందన్న భావన పోయే అవకాశం లేదని అంటున్నారు.  బజేపీ అగ్రనాయకత్వం నుంచి జగన్ అరాచక విధానాలన ఎండగడుతూ స్పష్టమైన చర్యలు కనిపిస్తే తప్ప ఏపీలో బీజేపీ నేతలు వాగాడంబరం ప్రదర్శించినంత మాత్రాన ఎవరూ పట్టించుకోరని అంటున్నారు. ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన అమరావతి యాత్ర,   నిరుద్యోగయాత్ర,  కార్నర్ మీటింగ్‌లను జనం పట్టించుకోకపోవడాన్ని పరిశీలకులు ఉదహరిస్తున్నారు. ఇందుకు కారణం జగన్ పట్ల కేంద్రం చూపుతున్న అపార ప్రేమాభిమానాలు, ఆదరణే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికీ వైసీపీని మిత్రపక్షంగానే బీజేపీ హై కమాండ్ మిత్రపక్షంగానే పరిగణిస్తోంది. అందుకే   తెలంగాణ, తమిళనాడుల్లోని ప్రభుత్వాలతో  వ్యవహరిస్తున్న విధానానికి భిన్నంగా  ఏపీలో జగన్ సర్కార్ తో వ్యవహరిస్తోంది. ఏపీలో గవర్నర్ జగన్ సర్కార్ తానా అంటే తందానా అన్నట్లు వ్యవహరిస్తారు.. కానీ తమిళనాడు, తెలంగాణలలో గవర్నర్లు మాత్రం మీడియా సమావేశాలు పెట్టి మరీ అక్కడి ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తుంటారు.ఏపీ అప్పులకు కేంద్రం పచ్చ జెండా ఊపడం నుంచి ప్రతి విషయంలోనూ జగన్ సర్కార్ కు కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందుతున్న తీరుపై జనంలో కూడా కేంద్రం, వైసీపీ సర్కార్ ల మధ్య రహస్య అవగాహన ఉందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  అందుకే ఏపీ బీజేపీ నేతలు వైసీపీపై, జగన్ విధానాలపై విమర్శలు చేస్తున్నా ఎవరూ నమ్మడం లేదు. పట్టించుకోవడం లేదు.   వైసీపీపై బీజేపీ అగ్రనాయకత్వం కన్నెర్ర చేసి చర్యలకు ఉపక్రమిస్తేనే ఏపీలో బీజేపీపై ప్రజలలో ఏదో ఒక మేరకు నమ్మకం కలిగే అవకాశం ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.   

తిరుపతి దారిదోపిడీ కేసు సూత్రధారి వైసీపీ కార్యకర్త!

క్రైమ్ కీ వైసీపీకి అవినాభావ సంబంధం ఉందా? దాదాపుగా సంచలనాత్మకమైన అన్ని క్రైమ్ లలోనూ వైసీపీ లింకులు బయటపడుతుండటమే ఈ అనుమానాలకు కారణం. మూడున్నరేళ్ల కిందట 2019 ఎన్నికలకు ముందు మాజీ మంత్రి, అప్పటి విపక్ష నేత, .ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ స్వంత బాబాయ్ పులివెందులలో తన సొంత ఇంటిలో దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించడానికి విఫలయత్నం చేసిన వారు ఆ తరువాత నారాసుర చరిత్ర అంటూ ప్రచారం చేసి ఎన్నికలలో లబ్ధి పొందారు. కానీ ఆ తరువాత సీబీఐ వివేకా హత్య కేసు చేపట్టిన తరువాత వివేకా హత్య వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులూ అందరూ వైసీపీకి చెందిన వారేనని దర్యాప్తులో వెలుగులోకి వస్తోంది. జగన్ కు స్వయానా సోదరి అయిన షర్మిల కూడా అవే అనుమానాలు వ్యక్తం చేశారు. అది పక్కన పెడితే తిరుపతిలో సంచలనం సృష్టించిన దారి దోపిడీ కేసులో వైసీపీ కార్యకర్త కృష్ణమూర్తి అరెస్టయ్యాడు. నిందితుడి నుంచి 32.5 లక్షల నగదు, రివాల్వర్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అరెస్టయిన ఏడుగురూ కూడా కుప్పానికి చెందిన వైసీపీ నాయకుడి ప్రధాన అనుచరులని కూడా పోలీసులు చెబుతున్నారు.ఇక ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. 35లక్షల రూపాయలకు 70లక్షల బ్లాక్ మనీ ఇస్తామంటూ హైదరాబాద్ కు చెందిన ఓ రియల్టర్ కు వైసీసీ కార్యకర్త కృష్ణమూర్తి ఆశ చూపారు. ఇందు కోసం దాదాపు హనీట్రాప్ చందంగా ముగ్గురు మహిళలనూ ఉపయోగించారు. ఈ ట్రాప్ లో పడిన రియల్టర్ ఈ నెల 3న 35లక్షల రూపాయలు తీసుకుని తిరుపతి చేరుకున్నాడు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం వైసీపీ కార్యకర్త కృష్ణమూర్తి   గ్యాంగ్ లోని ఏడుగురు వ్యక్తులు శంకర్ రెడ్డి కంట్లో కారం కొట్టి సొమ్ముతో పరారయ్యారు. ఈ మేరకు శంకర్ రెడ్డి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చంద్రగిరి మండలం గాదంకి టోల్ ప్లాజా సమీపంలో కారుతో పాటు ఏడుగురు యువకులను అరెస్టు చేశారు. అయితే అప్పటికే సొమ్మను వారు చేతులు మార్చేశారు. వారి నుంచి రాబట్టిన సమాచారంతో ఈ దోపిడీ సూత్రధారి కుప్పంకు చెందిన కృష్ణమూర్తి అని గుర్తించారు. కృష్ణమూర్తిని అరెస్టు చేసి సొమ్ము స్వాధీనం చేసుకున్నారు.  కాగా వైసీపీ కార్యకర్త కృష్ణమూర్తిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్నాటకలలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ దోపిడీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు మహిళలనూ కూడా పోలీసులు అరెస్టు చేశారు.   కాగా ఈ కేసులో అరెస్టయిన వారంతా కుప్పం కు చెందిన వైసీపీ నాయకుడి ప్రధాన అనుచరులని విశ్వసనీయంగా తెలిసింది.

ఏపీకి ఇక మంచి రోజులు.. మోడీతో భేటీ అనంతరం పవన్ వ్యాఖ్యల ఆంతర్యమిదేనా?

‘ఏపీకి ఇక మంచి రోజులు వస్తాయి’ ప్రధాని మోడీతో భేటీ అనంతరం మీడియాతో జనసేనాని పవన్ కల్యాణ్ అన్న మాట ఇది. చాలా కాలం తరువాత జనసేనాని ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. మోడీ విశాఖ పర్యటన సందర్భంగా ఆయన ఆహ్వానం మేరకు విశాఖ వచ్చి పవన్ మోడీతో భేటీ అయ్యారు. శుక్రవారం రాత్రి వీరిరువురి మధ్యా జరిగిన భేటీ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 35 నిముషాలు జరిగిన ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ ఏపీకి మంచి రోజులు రానున్నాయని చెప్పారు. ఆ మాటలే ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు తెరలేపాయి. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, రెండు పార్టీలు కలిసి పని చేయడంపై ఇరువురి మధ్య చర్చ జరిగిందని అంటున్నారు.దాదాపు ఎనిమిదేళ్ల తరువాత పవన్ కల్యాణ్ మోడీతో భేటీ అయ్యారు ఏపీలోని పరిస్థితులన్నీ ప్రధాని మోదీకి వివరించినట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. ఏపీ   ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన భేటీగా పవన్ అభవర్ణించారు. ప్రధానితో భేటీ అనంతరం ఏపీకి మంచి రోజులు రానున్నాయన్న విశ్వాసం పెరిగిందన్నారు. పవన్ కల్యాణ్ తో భేటీకి మోడీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారనడానికి తొలుత బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో జరగాల్సిన భేటీని వాయిదా వేసి మరీ ముందుగా పవన్ తో ఆయన భేటీ అవ్వడమే నిదర్శనమని చెబుతున్నారు. ఈ భేటీ తరువాత పవన్ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ వ్యాఖ్యలపై పరిశీలకులు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల మార్పునకు సంకేతమని విశ్లేషిస్తున్నారు. పొత్తుపొడుపులపై మరో మారు ఈ భేటీ చర్చలకు తెరలేపింది. తెలుగుదేశం, జనసేనల మధ్య ఇటీవలి కాలంలో కనిపిస్తున్న సఖ్యత, బీజేపీతో జనసేనకు ఇటీవల పెరిగన దూరం వీటన్నిటినీ వివరిస్తూ 2014 నాటి పరిస్థితులు మళ్లీ రాష్ట్రంలో ఏర్పడనున్నాయని అంటున్నారు. ఇప్పటికే మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీలు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశంతో కలిసి నడిచే అవకాశాలు మెరుగయ్యాయనడానికి మోడీతో జరిగిన భేటీ అనంతరం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంకేతంగా విశ్వేషణలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య  ముచ్చటగా మూడేళ్ళుగా సాగుతున్న హనీమూన్ ముగింపుకు చేరుకున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయని గతంలోనే విశ్లేషకులు పేర్కొన్నారు. మరో వంక రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పతాక స్థాయికి చేరుకుంటోంది. ఈ అన్నిటినీ మించి ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న అనుభవం అవసరమనే విషయాన్ని ప్రజలు గుర్తించారు.ఈ నేపధ్యంలో, రాష్ట్రంలో   రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని రాజకీయ పరిశీలకులు గతంలోనే విశ్లేషణలు చేశారు.అలాగే,  బీజేపీ జాతీయ నాయకత్వం కూడా రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా, చంద్రబాబు ‘విజన్’ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనే నిర్ణయానికి వచ్చిందని, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ మోడీ భేటీ తరువాత జనసేనాని ‘మంచి రోజుల’ వ్యాఖ్యలను పరిగణనలోనికి తీసుకోవాలంటున్నారు.  

ఏపీ కొత్త సీఎస్ శ్రీలక్ష్మి?!

ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ గా సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి నియమితులయ్యే అవకాశాలున్నాయి. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిని నిర్దోషిగా పరిగణించి తెలంగాణ హైకోర్టు క్లీన్ చిట్ ఇస్తూ ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఆమెపై ఉన్న అభియోగాలను ధర్మాసనం కొట్టివేసింది. ఓబుళాపరం కేసులో సీబీఐ ఆమెపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో   ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి జైలులో గడపాల్సి వచ్చిన సంగతి విదితమే. మైనింగ్ కు పాల్పడిన వారికి ఐఎఎస్ అధికారిగా శ్రీలక్ష్మి సహకరించారన్న ఆరోపణలతో పాటు భారీ ముడుపులు తీసుకున్నారనీ సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ ఆరోపణల్లో  సాక్ష్యాధారాలు లేనందున  ఆమెపై అభియోగాలన్నింటినీ కోర్టు కొట్టివేస్తూ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది.  1988 బ్యాచ్‌కు చెందిన శ్రీలక్ష్మి ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. గనుల కేటాయింపులో ఆయాచిత లబ్ధి కలిగించారన్న ఆరోపణలతో అరెస్టయి, దాదాపు ఏడాది పాటు జైల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత శ్రీలక్ష్మి తెలంగాణ కేడర్‌‌లో ఉన్నారు.‌  తెలంగాణ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లాలని దరఖాస్తు చేసుకోగా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ఏపీ కేడర్‌కు రాగానే ఆమెకు పురపాలకశాఖ కార్యదర్శిగా పోస్టింగ్‌ ఇచ్చారు. పురపాలకశాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మికి  లెవెల్‌ 15కి ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఆ శాఖలోనే ముఖ్య కార్యదర్శిగా నియమించింది. వాటిని రెగ్యులర్‌ ప్రమోషన్లుగానే పరిగణించారు. ఆమెపై పెండిం గ్‌లో ఉన్న కోర్టు కేసుల్లో వెలువడే నిర్ణయాన్ని బట్టి పదోన్నతి కొనసాగింపు ఉంటుందని అప్పటి ఉత్త ర్వుల్లో ప్రస్తావించారు.  దాన్ని అడ్‌హాక్‌ ప్రమోషన్‌గా పేర్కొన్నారు. తాజాగా హైకోర్టు తీర్పుతో ఆమె ఏపీ చీఫ్ సెక్రటరీగా నియమితులు అయ్యేందుకు అడ్డంకులు తొలగి పోయాయనే చర్చ జరుగుతోంది. కాగా...ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడంతో శ్రీలక్ష్మి ఏపీ చీఫ్ సెక్రటరీగా నియమితులు అయ్యేందుకు అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయని చెప్పుకోవచ్చు.   నిజానికి కేంద్ర కాబినెట్ సెక్రటరీ స్థాయికి ఎదగాల్సిన శ్రీలక్ష్మిపై, సీబీఐ కేసు వల్ల ఆమె కెరీర్ ఒకింత వెనుకబడిందనే చెప్పాలి. ఏపీ సీఎస్ రేసులో మరో సీనియర్ ఐఏఎస్ జవహర్‌రెడ్డి ఉన్నప్పటికీ,   సీఎం జగన్ శ్రీలక్ష్మి వైపే ఉంటుందని   అధికార వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుత ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్‌శర్మ పదవీకాలం ఈ నెలతో ముగియనుంది. ఇప్పటికే పొడిగింపుపై పనిచేస్తున్న సమీర్‌కు, ఇక పొడిగింపు అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. దానితో సీఎం జగన్ ఏరికోరి తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి తెచ్చుకున్న.. స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మికి, సీఎస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.    స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదా కూడా అడహక్ పద్ధతిలో ఇవ్వడాన్ని బట్టి చూస్తే ఏపీ సీఎస్ గా శ్రీలక్ష్మికే ఎక్కువ అవకాశాలున్నాయని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. శ్రీలక్ష్మిపై సీబీఐ పెట్టిన సెక్షన్లు చెల్లవంటూ, హైకోర్టు సింగిల్ జడ్జి ఆమెకు క్లీన్‌చిట్ ఇవ్వడంతో  ఆమెపై  ఎలాంటి కేసులు లేనట్లే లెక్క. నిబంధనల ప్రకారం సీబీఐ కేసులపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును, అదే కోర్టు ఫుల్‌బెంచ్‌లో సవాల్ చేయడానికి అవకాశాలు లేవు, సీబీఐ ఈ తీర్పును సవాల్ చేయాలనుకుంటే సుప్రీం కోర్టుకే వెళ్లాల్సి ఉంటుంది.  ఈ నేపథ్యంలో ఈ నెలలో రిటైరయ్యే సీఎస్ సమీర్‌శర్మ స్థానంలో, శ్రీలక్ష్మి సీఎస్ కావటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక సీబీఐ హైకోర్టు శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లినా కూడా,  హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును అనుసరించి, ఆమెను సీఎస్‌గా నియమించడానికి అది అవరోధం కాదని అంటున్నారు.   సీబీఐ ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళితే, ‘సుప్రీంకోర్టు తీర్పు మేరకు భవిష్యత్తు పరిణామాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామన్న’ నిబంధనలతో’ శ్రీలక్ష్మిని సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం జీఓ ఇచ్చే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు.

మోడీ నాడేం చెప్పారు.. నేడేం చేస్తున్నారు?

పీఎస్ యూలను అమ్మేయ్.. ప్రైవేటును పెంచేయ్.. మోడీ విధానమిదేనా? అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రధానిగా ఎనిమిదేళ్ల కాలం పూర్తి చేసుకున్న తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంగా మోడీ రికార్డు అయితే సృష్టించారు కానీ, దేశ ప్రగతి, పురోగతి విషయంలో ఆయన పాలన, ఆయన విధానాలు తిరోగమనంలోనే ఉన్నాయన్నది విశ్లేషకుల మాట. పీఎస్ యూలను తెగ నమ్ముతూ పాలన అంటే ప్రైవేటీకరణే అన్నట్లుగా మోడీ తీరు ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వాలు కూడా అనివార్యమైన పరిస్థితులు తలెత్తిన సమయాల్లో ప్రభుత్వ రంగ సంస్థల లో ప్రభుత్వ వాటాలను విక్రయించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మోడీ చేస్తున్నట్లు గా మొత్తం ప్రభుత్వ వాటాలను విక్రయించేసి ఆయా సంస్థలపై ప్రభుత్వ ఆజమాయిషీ లేకుండా చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు. గత ప్రభుత్వాలు పీఎస్ యూలలో వాటాలు విక్రయించినా ఆయా సంస్థలపై ప్రభుత్వ ఆజమాయిషీ కొనసాగేలా అన్ని జాగ్రత్తలూ తీసుకునేవి. వాటాల విక్రయం కూడా పరిమితంగానే ఉండేది. అయితే మోడీ మాత్రం పీఎస్ యూలను వదిలించుకోవడమే ధ్యేయం అన్నట్లుగా ప్రభుత్వ రంగ సంస్థలను వేలానికి పెట్టేస్తున్నారు.   టీమ్ ఇండియా స్ఫూర్తితో దేశాన్ని ప్రగతి బాట పట్టిస్తానంటూ నాడు ప్రసంగాలూ వాగ్దానాలతో జనాన్ని మెస్మరైజ్ చేసి అధికారంలోకి వచ్చిన మోడీ.. ప్రధానిగా మాత్రం టీమ్ ఇండియా స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అన్ని రాష్ట్రాలకూ, అన్ని ప్రాంతాలకూ సమన్యాయం అన్న మోడీ ఆచరణలో మాత్రం గుజరాత్ కే ఎక్కువ సమన్యాయం అన్న తీరులో వ్యవహరిస్తున్నారు. భారత దేశం అంటే రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల సమాహారం అన్నది విస్మరించి.. గుజరాత్ మాత్రమే బారత్ లో ఉందా అని ఇతర రాష్ట్రాలు అనుకునే విధంగా ఆయన నిర్ణయాలు, విధానాలు, వ్యవహార శైలి ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానిగా మోడీ పాలన లక్ష్యం పీఎస్ యూలను తెగనమ్మడమేనా అనిపించేలా కనిపిస్తోంది. ఈ ఎనిమిదేళ్ల కాలంలో కేంద్రం తెగనమ్మిన పీఎస్ యూల సంఖ్య 28. ఇప్పటి వరకూ దేశంలో ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మేసిన రికార్డు మోడీ సర్కార్ దే అనడంలో సందేహం లేదు. పైగా ఈ అమ్మకాలన్నీ సంపన్నులకు అనుకూలంగానే జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి పారేసిన మోడీ ప్రభుత్వ రంగంలో ఒక్క సంస్థనైనా నెలకొల్పారా అంటే లేదనే సమాధానం వస్తుంది. మోడీకి ముందు ఉన్న ప్రధానులు దేశంలో ప్రభుత్వ రంగంలో సంస్థలను ఏర్పాటు చేసి వాటిని జాతికి అంకితం చేశారు. కానీ మోడీ మాత్రం తన ముందున్న ప్రధానులు జాతికి అంకితం చేసిన సంస్థలను తెగనమ్మి ఆయా సంస్థలలో పని చేస్తున్న కార్మికుల భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ దేశంలో దాదాపు 300 పీఎస్ యూలు ఏర్పాటయ్యాయి. వాటిలో నెహ్రూ హయాంలో  దేశంలో 32 ప్రభుత్వ రంగం సంస్థలు ఏర్పాటయ్యాయి. అదే ఇందిరాగాంధీ హయాంలో 66 పీఎస్ యూలు ఏర్పాటయ్యాయి. ఇక కేవలం రెండున్నరేళ్లు మాత్రమే అధికారంలో ఉన్న జనతా పార్టీ హయాంలో అంటే మురార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన 9 పీఎస్ యూలను జాతికి అంకితం చేశారు. దేశంలో ఆధునిక టెక్నాలజీకి ద్వారాలు తెరిచిన రాజీవ్ గాంధీ హయాంలో కూడా 16 పీఎస్ యూలు దేశంలో ఏర్పాటయ్యాయి. ఇక వీపీసింగ్ హయాంలో 2   పీఎస్ యూలు ఏర్పాటయ్యాయి.  సరళీకృత ఆర్థిక విధానాలకు అంకురార్పణ చేసిన పీవీ నరసింహరావు కూడా తన హయాంలో ఏకంగా 14 పీఎస్ యూలను జాతికి అంకితం చేశారు.  ఇక వాజ్ పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో కూడా 17 ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశారు. అయితే ప్రబుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం కూడా ఆయన హయాంలోనే ఆరంభమైనా... చాలా పరిమితంగా మాత్రమే వాటాలను విక్రయించి పీఎస్ యూలపై ప్రభుత్వ హయాం ఇసుమంతైనా తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో అంటే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో ఏడు ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయి. ఆయన హయాంలో మూడు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయించారు. అదీ పరిమితంగానే. అయితే మన్మోమన్ సింగ్ హయాంలో మూడు పీఎస్ యూలలో  వాటాల విక్రయంపై అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ విమర్శలతో విరుచుకుపడ్డారు. దేశాన్ని అమ్మేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. దేశాన్ని అమ్మేస్తుంటే తాను మౌనంగా ఎలా ఉంటాను, ఒట్టేసి చెబుతున్నా..దేశాన్ని అమ్మనివ్వనంటూ గర్జించారు. అయితే అప్పుడు ఆయన అన్నదేమిటి? ఇప్పుడు ప్రధానిగా మోడీ చేస్తున్నదేమిటి? అని ప్రశ్నించుకుంటే ఆయన మాటలకూ చేతలకూ నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా కనిపిస్తుంది. మూడు పీఎస్ యూలలో వాటాలను విక్రయించినందుకే వాళ్లు దేశాన్ని అమ్మేస్తున్నారంటూ మన్మోహన్ ప్రభుత్వంపై విరుచుకుపడిన మోడీ.. తాను పీఎంగా పగ్గాలు చేపట్టిన తరువాత ఇప్పటి వరకూ దేశంలో ఒక్క ప్రభుత్వ సంస్థ ఏర్పాటు కాలేదు సరికదా.. 23 ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మేశారు.  అది కూడా మన్మోహన్ సింగ్ హయాంలో విక్రయించినట్లుగా పరిమిత వాటాలు కాకుండా మొత్తంగా సంస్థలనే వాటి ఆస్తులతో సహా విక్రయించేశారు. వీటితో మోడీ అమ్మకాల పరంపర ఆగిపోయినట్లు కాదు... తన లక్ష్యం వంద పీఎస్ యూల ప్రైవేటీకరణ అంటూ ఆయనే స్వయంగా చెబుతున్నారు. ఇంత అడ్డగోలుగా పీఎస్ యూలను తెగనమ్మేస్తున్న మోడీ హయాంలో దేశం ఖాతాలోకి కొత్తగా ఒక్కటంటే ఒక్క పీఎస్ యూ కూడా  ఏర్పాటు కాలేదు. ఇంతకీ ఇంత అడ్డగోలుగా పీఎస్ యూలను ఎందకు అమ్మేస్తున్నారయ్యా అంటే ఆయన ప్రభుత్వం వ్యాపారం చేయదు.. అందుకే అమ్మేస్తున్నాం అంటారు. అదే సమయంలో ఆయన కేబినెట్ లో ఆర్దిక శాఖ నిర్వహిస్తున్న నిర్మలా సీతారామన్ మాత్రం ప్రభుత్వం ఉచిత సేవలు చేయదనీ, వ్యాపారమే చేస్తుందనీ చెబుతున్నారు. అందుకే లాభసాటిగా లేని పీఎస్ యూలను అమ్మేస్తున్నామంటున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో లక్షా 75 వేల కోట్ల రూపాయల రాబడి లక్ష్యంతో 28 ప్రభుత్వ రంగ సంస్థలను వేలం పెట్టినట్లు పెట్టి మరీ అమ్మేశారు. ప్రైవేటైజేషన్ పేరుతో మోడీ సర్కార్ బంగారు గుడ్లు పెట్టే బాతును అడ్డంగా కోసుకుని తినేస్తున్నారు. సరే ఈ విషయంలోనైనా సమన్యాయం పాటిస్తున్నారా అంటే... అస్సలు లేదు. గుజరాత్ లో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ  జీఎస్పీసీ( గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్)ని నష్టాల నుంచి కాపాడేందుకు లాభాల బాటలో ఉన్న ఓఎన్జీసీ వంటి సంస్థలను సంక్షోభంలోకి నెట్టేయడానికి ఇసుమంతైనా వెనుకాడటం లేదు. లాభాల బాటలో ఉన్న ఓఎన్జీసీ జీఎస్ పీసీలో 80శాతం వాటాలను 8 వేల కోట్లకు తీసుకునేలా మోడీ సర్కార్ చేసింది.  అంతే కాదు ఓఎన్ జీసీ ఆ జీఎస్పీసీకి 13 వేల కోట్ల రూపాయలు ఇచ్చింది. గుజరాత్ లో ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ సంస్థను కాపాడేందుకు లాభసాటిగా నడుస్తున్న పీఎస్ యూలను సంక్షోభంలోకి నెట్టడానికి కూడా వెనుకాడని మోడీ..మరి అదే విధానాన్ని మిగిలిన రాష్ట్రాలలో ఎందుకు అవలంబించడం లేదన్న ప్రశ్నలు ఎదురౌతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని  విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మోడీ సర్కార్ ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపుతోందని నిలదీస్తున్నారు. పార్లమెంటు సాక్షిగా ఇదే ప్రశ్నను తెలుగుదేవం ఎంపీ రామ్మోహననాయుడు ప్రభుత్వానికి సంధించారు. మోడీ దృష్టిలో సమన్యాయం అంటే గుజరాత్ కు మాత్రమే వర్తిస్తుందా అని నిలదీస్తున్నారు. ఒక దేశం ఒక ఎన్నిక, ఒక దేశం ఒక రేషన్ అంటున్న మోడీ సర్కార్ వన్ నేషన్ వన్ జస్టిస్ విధానాన్ని ఎందుకు అనుసరించదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకూ జీఎస్ పీసీపై మోడీకి అంత ప్రేమ ఎందుకంటే.. తాను ప్రధాని కావడానికి ఆ సంస్థ సోపానంగా ఉపయోగపడటమే. ఔను గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ రెండో సారి అధికారంలో ఉన్న సమయంలో ఆయన దేశం మొత్తం అచ్చెరవొందేలాంటి ప్రకటన ఒకటి చేశారు. దేశం చమురు దిగుమతుల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా తమ గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ గొప్ప ఇన్వెన్షన్ చేసిందనీ,  ఏపీలోని కృష్ణా గోదావరి బేసిన్ లో దాదాపు 2లక్షల 20 వేల కోట్ల రూపాయల విలువైన 20 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలను గుర్తించిందనీ,  వీటిని వెలికి తీయడం ద్వారా 2014 నాటికి భారత్ దిగుమతి చేసుకుంటున్న 80 వేల కోట్ల చమురు దిగుమతుల అవసరం లేకుండా చేస్తామనీ ఉద్ఘాటించారు. అలా మిగిల్చిన 80 వేల కోట్ల రూపాయలనూ దేశంలోని పేదలకు పంచుతామని మోడీ చెప్పారు.  ఔను అప్పట్లో మోడీ ఇదే విషయాన్ని చెప్పారు. ఇలాంటి మాటలే ఆరు సంవత్సరాల కిందట పెద్ద నోట్ల రద్దు సమయంలో మోడీ చెప్పారు కదా అనుకుంటున్నారా? ఔను నిజమే.. పెద్ద నోట్ల రద్దు తో దేశంలో నల్ల ధనం లేకుండా చేస్తామని అప్పట్లో గొప్పగా చెప్పారు.  ఆ మాటలు ఎంత డొల్లో ఈ ఆరేళ్లలో తేలిపోయింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కేవలం సంపన్నులకు మేలు చేయడానికేననీ, అదే సమయంలో చిన్న తరహా పరిశ్రమలన గుల్ల చేయడం, మధ్యతరగతి ఆర్థిక పరిస్థితిని చిన్నా భిన్నం చేయడానికే దోహదపడిందని తేలిపోయింది. సరిగ్గా అలాగే 17 ఏళ్ల కిందట 2015 జూన్ లో జీఎస్ పీసీ కృష్ణాబేసిన్ లో 20 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ను కనుగొందనీ, 2014 నాటికి దానికి వెలికి తీస్తామని మోడీ చెప్పిన మాటలు కూడా కేవలం గాలి కబుర్లేనని తేలిపోయింది. 2014 గడిచిపోయి ఎనిమిదేళ్లయ్యింది. కానీ ఇంత వరకూ జీఎస్ పీసీ కృష్ణాగోదావరి బేసిన్ నుంచి వెలికి తీసినది ఎన్ని క్యూబిక్ మీటర్ల గ్యాస్ అన్న ప్రశ్నకు వచ్చే సమాధానం జీరో అనే. అంటే గ్యాస్ నిల్వలే లేని చోట అపార గ్యాస్ నిల్వలున్నాయంటూ దేశాన్ని మోసం చేశారన్నమాట. అయితే ఇప్పుడు గ్యాస్ నిల్వల కోసం అన్వేషణ కొనసాగుతోందంటున్నారు. మోడీ మాటల గారడీకి కృష్ణాగోదావరి బేసిన్ లో గ్యాస్ నిల్వల ప్రకటన, పెద్ద నోట్ల రద్దు ప్రకటనలు మచ్చుకు మాత్రమే. మోడీ హయాంలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందంటూ చేస్తున్న ప్రకటనలన్నీ జనాన్ని మభ్య పెట్టడానికేనని తేలిపోయిందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు మోడీ విశాఖ పర్యటన సందర్భంగా మోడీ విశాఖ ఉక్కు  ప్రైవేటీకరణపై జనాలను సమాధానం చెప్పుకోవలసిన అవసరం ఉందంటున్నారు. జీఎస్ పీసీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా దానిని కాపాడటానికి తన అధికారాన్ని మొత్తం ఉపయోగించి.. ఆర్బీఐ నిబంధనలను కూడా తోసి రాజంటున్న మోడీ ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ  ఉక్కు కర్మాగారం విషయంలో సవతి తల్లిప్రేమ ఎందుకు చూపుతున్నారు. లాభాల్లో సాగుతున్న సంస్థను గనులు కేటాయించకుండా ఉద్దేశపూర్వకంగా నష్టాలలోకి నెట్టి మరీ ప్రైవేటు పరం చేస్తన్నతీరును ఆంధ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేటు ఉక్కు కర్మాగారాలకు కేటాయించినట్లుగా విశాఖఉక్కుకు కూడా గనులను కేటాయిస్తే.. కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లేకుండానే విశాఖ ఉక్కు కర్మాగారం మళ్లీ లాభాల బాట పడుతుందంటున్నారు.  

రాజీవ్ హంతకులు విడుదలకు సుప్రీం ఆదేశం

మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ  హత్య కేసులో దోషులందరినీ విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.  2022 మే 18న ఏజీ పెరరివలన్‌ను విడుదల చేస్తూ తీర్పు చెప్పడానికి అనుసరించిన విధానమే మిగిలిన దోషుల విడుదల విషయంలో కూడా  అమలు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం పేర్కొంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్న లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు  ఆదేశాలిచ్చింది. రాజీవ్ హత్య కేసులో ఆరుగురు దోషులు జీవిత ఖైదును అనుభవిస్తున్న సంగతి విదితమే సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఎస్ నళిని, జయకుమార్, ఆర్‌పీ రవిచంద్రన్, రాబర్ట్ పయస్, సుధేంద్ర రాజా, శ్రీధరన్‌లకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది.  వీరంతా జైలులో మంచి నడవడికతో ప్రవర్తించారని, అంతేకాకుండా వేర్వేరు డిగ్రీలు సాధించారని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది.  ఈ దోషులను జైలు నుంచి విడుదల చేయాలని 2018 సెప్టెంబరు 9న తమిళనాడు రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసిందని, తమకు శిక్ష తగ్గించాలని ఆ రాష్ట్ర గవర్నర్‌కు దోషులు విజ్ఞప్తి చేశారని సుప్రీంకోర్టు పేర్కొంది.  రాజీవ్ గాంధీహత్య కేసులోని దోషుల్లో ఒకరైన నళిని ప్రస్తుతం పెరోల్‌పై ఉన్నారు.  ఆమె పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. అనంతరం ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 30 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన ఏజీ పెరరివలన్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో నళిని ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

తెరాస నాయకులకు డబుల్ ఇంజిన్ థ్రెట్!?

 అసలే వాళ్లు డబుల్ ఇంజిన్..! ఎలాంటి ఇష్యూనైనా డబుల్ ఇంజిన్ పవర్ తో బుల్ డోజ్ చేసేస్తుంటారు. వారు ఏదైనా ఓ స్కెచ్ వేశారంటే.. రాజకీయ ప్రత్యర్థులు మట్టి కరవాల్సిందే. తాము చెప్పేది వింటే సరేసరి.. లేదంటే ప్రత్యర్థుల్ని తమ దారిలోకి తెచ్చుకోవడానికి ఉహకు అందని వ్యూహాలు పన్నుతుంటారు. అలాంటి డబుల్ ఇంజిన్ ను ఢీకొనాలనే ఎత్తుగడతో తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయ్యాక తొలి ప్రభుత్వంగా టీఆర్ఎస్ అధికార పీఠం ఎక్కిన తర్వాత కొంతకాలం పాటు ప్రధాని మోడీతో కేసీఆర్ సఖ్యతగానే మెలిగారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పైలాన్ను 2016 ఆగస్టు 7న గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండలో ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఆ కార్యక్రమంలో మోడీ- కేసీఆర్ ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. మిషన్ భగీరథ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసిస్తూ.. తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ కు 2017లో ప్రధాని మోడీ లేఖ రాశారు. అంతకు ముందు 2015లో చండీయాగం నిర్వహించిన కేసీఆర్ ను ప్రశంసిస్తూ ప్రధాని మోడీ లేఖ రాశారు. అలాగే.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏ కార్యక్రమం తలపెట్టిన కేసీఆర్ బేషరతుగా మద్దతు ఇచ్చేవారు. అంతలా పాలు- నీళ్లలా మెలిగిన మోడీ- కేసీఆర్ మద్య ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. కేంద్రంతో కేసీఆర్ ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తున్నారు.. పంతంలో ఫస్ట్ న నిలిచే డబుల్ ఇంజిన్.. ఇంతలా తిరుగుబాటు చేస్తున్న కేసీఆర్ ను చూస్తూ.. ఉపేక్షిస్తుందా? ఎన్డీయేతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను తమ దారికి తెచ్చుకునేలా చేసిన, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ముగింపు పలికి తమ పార్టీ అందలం ఎక్కేలా చేయగలిగింది ఈ డబుల్ ఇంజిన్. దక్షిణాదిలో ఒక్క కర్ణాటక తప్ప మరే రాష్ట్రంలోనూ తన ఉనికి అంతగా లేదనే వ్యధలో ఉన్న డబుల్ ఇంజిన్ ముఖ్యంగా తెలంగాణపై దృష్టిపెట్టింది. అందుకు తెలంగాణలో కొన్ని ఎంపీ స్థానాల్లోను, కొన్ని ఉప ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లలోనూ, జీహెచ్ఎంసీలో అనేక చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయాలు సాధించడమే కారణం. కాస్త కష్టపడితే తెలంగాణలో పాగా వేయొచ్చని బీజేపీ అగ్రనేతలు పథకాల మీద పథకాలు రచిస్తున్నారు. ఆ పార్టీలోని టాప్ లీడర్లు తరచూ తెలంగాణలో పర్యటించి, కేసీఆర్ పాలన మీద, ఆయన కుటుంబం మీద విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఇంతటితో ఆగని డబుల్ ఇంజిన్ ఇప్పుడు టీఆర్ఎస్ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్, ఆదాయపు పన్ను శాఖల్ని ఉసిగొల్పుతోందంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతో కేసీఆర్ కుమార్తె కవితకు లింక్ ఉందంటూ సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఆమె బంధువు బోయిన్ పల్లి అభిషేక్ రావును అరెస్ట్ చేసింది. గ్రానైట్ ఎగుమతి వ్యాపారం చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ ఇంటిని ఆయన లేకపోయినా తాళాలు పగలగొట్టి మరీ సోదాలు చేసింది. ఇటీవలే టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన గాయత్రి రవి సంస్థల మీద దాడులు చేపట్టింది. గాయత్రి రవి ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో అనుచరులను ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. గాయత్రి రవి చేస్తున్న ఖర్చుల్సి చూసి, అంత డబ్బు ఎలా? ఎక్కడి నుంచి వస్తోందని, ఎక్కడికి వెళ్లోందని ఆరా తీసే పనిలో దర్యాప్తు సంస్థలు బిజీగా ఉన్నాయంటున్నారు. దర్యాప్తు సంస్థల దాడులు వీరితోనే ఆగవని, ఇంకా పలువురి పేర్లతో పెద్ద హిట్ లిస్టు ఉండి ఉండొచ్చనే భయం ఆ పార్టీ నేతల్లో ఉందంటున్నారు. ఇలా కేంద్ర దర్యాప్తు సంస్థల వరుస దాడులు కేసీఆర్ కు చెక్ పెట్టే క్రమంలోనే జరుగుతున్నాయని భావిస్తున్నారు. భౌగోళికంగా అయినా.. ఎంపీల లెక్క ప్రకారం చూసుకున్నా పదో స్థానంలో ఉండే చిన్న రాష్ట్రం తెలంగాణ. ఈ చిన్న రాష్ట్రమే బలమైన బీజేపీని, డబుల్ ఇంజిన్ ని ఛాలెంజ్ చేస్తే.. అగ్రస్థానంలో ఉండే పెద్ద రాష్ట్రాలు కూడా చెలరేగితే.. అనే ఆలోచనే టీఆర్ఎస్ లెక్కల్ని తేల్చేయాలనే వ్యూహంతో డబుల్ ఇంజిన్ వ్యూహాలు అమలు చేస్తున్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రజా క్షేత్రంలో లోకేష్ నడక.. పాదయాత్రకు ముహూర్తం ఖరారు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న పాదయాత్రకు ముహూర్తం ఖరారు అయింది. 2023, జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఈ పాదయాత్రను ఆయన చేపట్టనున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ఈ పాదయాత్ర పూర్తి కానుంది. ఈ పాదయాత్ర ద్వారా దాదాపు 450 రోజుల పాటు లోకేశ్.... ప్రజల మధ్య ఉండే విధంగా రూట్ మ్యాప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ పాదయాత్రలో లోకేశ్.. ఓ వైపు ప్రజల సమస్యలు తెలుసుకొంటూ.. మరోవైపు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ముందుకు సాగనున్నారని సమాచారం. ఆ క్రమంలో యువత, మహిళలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై లోకేశ్ తనదైన శైలిలో గళం విప్పనున్నారని తెలుస్తోంది. అయితే లోకేశ్ పాదయాత్రకు సంబంధించిన విధివిధానాలన్నింటిని నవంబర్ నెలాఖరులోగా ఫైనల్ అయ్యే అవకాశం ఉందని సైకిల్ పార్టీలో ఓ చర్చ అయితే జరుగుతోంది. అయితే ఈ పాదయాత్రలో యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు సాగేందుకు లోకేశ్.. తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే లోకేశ్ పాదయాత్ర విజయవంతం అయ్యేందుకు.. చంద్రబాబు ఇప్పటికే రంగంలోకి దిగి.. తనదైన చాణక్యానికి పదును పెడుతున్నట్లు సమాచారం. మరోవైపు లోకేశ్.. తాను చేపట్టే ఈ పాదయాత్రలో ఎక్కడా విరామం అనేది లేకుండా... వారంలో ఏడు రోజులు కొనసాగిస్తారని తెలుస్తోంది. అలాగే 175కి 175 నియోజకవర్గాలను టచ్ చేసుకొంటూ ఆయన.. తన పాదయాత్రను సాగించేందుకు లోకేశ్.. తన కార్యాచరణ సిద్ధం చేసుకొంటారని తెలుస్తోంది. 2024 ఫిబ్రవరి చివర వారం లేదా మార్చి మొదటి రెండు వారాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ప్రజల మధ్య ఉండేందుకు నారా లోకేశ్.. కృత నిశ్చయంతో ఉన్నట్లు సమాచారం. అలాగే ఈ పాదయత్ర వల్ల లోకేశ్ ఓ వైపు పార్టీపై పట్టు పెంచుకొవడమే కాకుండా.. మరోవైపు ప్రజలతో మమేకమయ్యేందుకు దోహదం చేస్తుందనే ఓ భావన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబులో బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీలోని క్షేత్రస్థాయి పరిస్థితులనే కాదు.... ప్రజల సమస్యలను సైతం నేరుగా తెలుసుకొనే అవకాశం నారా లోకేశ్‌కు దక్కుతోందని సమాచారం. అదేవిధంగా జగన్ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకొని నారా లోకేశ్.. ఈ పాదయాత్రలో ప్రసంగించనున్నారని తెలుస్తోంది.  అలాగే రోడ్ షోలు, బహిరంగ సభలకు సైతం లోకేశ్.. ప్రణాళికలు సిద్ధం చేస్తుకొంటున్నారు. టీడీపీకి కంచుకోటు లాంటి నియోజకవర్గాల్లో మరింత బలంగా చొచ్చుకెళ్లేందుకు లోకేశ్ సమయత్తమైనట్లు తెలుస్తోంది. అలాగే వైసీపీకి బలమైన నియోజకవర్గాల్లో సైతం రోడ్డు షోలు, బాదుడే బాదడు తదితర కార్యక్రమాలతోపాటు బహిరంగ సభలు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

విజయసాయికి అండగా సకల శాఖల మంత్రి సజ్జల

వైసీపీలో ఎవరి ప్రభ ఎప్పుడు వెలుగుతుందో.. ఎవరికి ఎప్పుడు అవమానాలు ఎదురౌతాయో ఎవరికీ అర్ధం కాదు. నిన్న అందలం ఎక్కించిన నాయకుడినే.. నేడు పార్టీలో పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టేసిన నాయకుడినే మళ్లీ పిలిచి పల్లకీ ఎక్కిస్తారు. అందుకు సరైన ఉదాహరణ చెప్పాలంటే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.  ఆయనకు పార్టీలో ఎప్పుడు బ్రహ్మరథం పడతారో.. ఎప్పుడు విసిరి అవతల పడేస్తోరో ఎవరికీ తెలియదు. పార్టీ ఆవిర్బావం నుంచి జగన్ సీఎం అయ్యే వరకూ పార్టీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన ఆయనను ఇప్పటి వరకూ కనీసం రెండు సార్లు పక్కన పెట్టారు. తాజాగా ఆయన వద్ద ఉన్న సామాజిక మాధ్యమ బాధ్యతలను కూడా తీసివేసిన తరువాత ఆయన ఇక పార్టీలో నిలదొక్కుకోవడం సాధ్యం కాదని పార్టీ శ్రేణులే ఒక నిర్ణయానికి వచ్చేశారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరబిందో ఎండీ శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో అనివార్యంగా మళ్లీ పార్టీ ఆయనను భుజాన మోయాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. శరత్ చంద్రారెడ్డి సోదరుడు రోహిత్ రెడ్డి విజయసాయి రెడ్డ అల్లుడు కావడంతో.. ఈ లిక్కర్ స్కాంతో వైసీపీకి సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు శరత్ చంద్రారెడ్డి అరెస్టుకు చాలా ముందే విజయసాయిరెడ్డికి, జగన్ సతీమణి భారతి కూడా కూడా ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు ఆ ఆరోపణల కారణంగానే జగన్ విజయసాయిరెడ్డిని పక్కన పెట్టేశారన్న వార్తలూ వినవచ్చాయి. కానీ శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో ఒక్కసారిగా వైసీపీ అగ్రనాయకత్వంలో కలవరం మొదలైంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డిని వెనకేసుకురాకపోతే పార్టీ నిండా మునగడం ఖాయమన్న భయం మొదలైంది. అందుకే లిక్కర్ స్కాం తో విజయసాయికి, వైసీపీకి ఏం సంబంధం అంటూ పార్టీ నాయకులు ఒక్కరొక్కరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అందులో మరీ ముఖ్యంగా సకల శాఖల మంత్రి, పార్టీలో విజయసాయి నంబర్ టూ స్థానంలో ప్రస్తతుం ఉన్నట్లు చెబుతున్న సజ్జల మీడియా ముందుకు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. విజయసాయి, సజ్జలల మధ్య సఖ్యత లేదనీ, సజ్జల కారణంగానే విజయసాయిరెడ్డికి పార్టీలో ప్రాధాన్యత తగ్గిందనీ పార్టీ శ్రేణుల్లో ఓ టాక్ ఉంది. ఇప్పుడు విజయసాయికి అండగా సజ్జన మీడియా ముందుకు రావడంతో పార్టీలో ఏదో జరుగుతోంది.. లిక్కర్ స్కాం ప్రకంపనలు తాడేపల్లి ప్యాలస్ ను తాకుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ గురువారం మీడియా ముందుకు వచ్చి సజ్జల ఏం చెప్పారంటే.. లిక్కర్ స్కాంలో వైసీపీకి ఏం సంబంధం లేదన్నారు. అక్కడితో ఆగితే విజయసాయికి అండగా సజ్జల నిలబడ్డారన్న చర్చే రాకపోను. కానీ  ఢిల్లీలో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు కాదన్నారు. విజయసాయిరెడ్డికి ఒక్కతే కూమార్తె అనీ, ఆ కుమార్తె భర్త పేరు రోహిత్ రెడ్డి అనీ వరసలు చెప్పారు. అంటే విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డే తప్ప, శరత్ చంద్రారెడ్డి ఎలా అవుతారని ప్రశ్నించారు.    అరబిందో అనేది అతి పెద్ద అంతర్జాతీయ వ్యాపార సంస్థ అని.. విజయసాయి విజయసాయిరెడ్డి వాళ్ళకి బంధువే కానీ.. వాళ్ళ వ్యాపార సంస్థ ఈయన కు సంబంధం ఏంటని ప్రశ్నించారు.  ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఢిల్లీ, కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య చాలా కాలంగా పొలిటికల్ వార్ జరుగుతుంోదని.. దానికి ఏపీ ప్రభుత్వానికీ , వైసీపీ కి, విజయసాయిరెడ్డి, జగన్ లకు  ఎటువంటి సంబంధం లేదని, తమ పార్టీ ఎంపీ విజయసాయి పులి కడిగిన ముత్యమని వెనకేసుకొచ్చారు. అయితే శరత్ చంద్రారెడ్డి అరెస్టు వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోందన్నది నిర్వివాదాంశమని పరిశీలకలుు అంటున్నారు. ఎందుకంటే ఏపీలో మద్యం వ్యాపారం మొత్తం ప్రభుత్వమే చేస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన బ్రాండ్ల అమ్మకాలే జరుగుతున్నాయి. పైగా మొత్తం లావాదేవీలన్నీ నగదు రూపంలోనే జరుగుతున్నాయి. ఈ కారణాలతో రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం మాఫియా పాత్ర పోషిస్తోందన్నది విమర్శగా మాత్రమే మిగిలిపోకుండా.. ఏదో భారీ స్కాం ఉందన్న భావన జనబాహుల్యంలో కూడా నెలకొని ఉంది.  ఇక అరబిందో ఎండీ శరద్ చంద్రారెడ్డికి లిక్కర్ బిజినెస్ ఉందన్నది ఆయన అరెస్టుతోనే లోకానికి తెలిసింది. ఈ నేపథ్యంలో రోహిత్ రెడ్డితో ఆయనకు ఉన్న బంధం, రోహిత్ రెడ్డి విజయసాయికి స్వయానా అల్లుడు కావడం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో మొదటిగా ఏపీ నుంచి రోహిత్ రెడ్డిపైనే ఆరోపణలు రావడంతో.. ఢిల్లీ మద్యం కుంభకోణం తీగలకు ఏపీలో డొంకలను కదిపే శక్తి ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయసాయికి పార్టీ మద్దతుగా నిలవకపోతే మొదటికే మోసం వస్తుందన్న భయంతోనే సజ్జల విజయసాయికి అండగా మీడియా ముందుకు వచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మోడీ మెప్పు కోసం జగన్ వెంపర్లాట

ప్రధాని మోడీ పట్ల ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల తీరులో ఎంత తేడా.. ఎంత తేడా..!? ఒకరేమో మోడీ ముఖాన్ని చూసేందుకు కూడా  ఇష్టపడకుండా  కేసీఆర్ ప్రోటోకాల్ ను కూడా పక్కన పెట్టేస్తున్నారు. ప్రధాని మోడీ తెలంగాణ వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం సీఎం స్వాగతం పలకాలి. అయితే.. అలా స్వాగతం పలకకుండా కేసీఆర్ గైర్హాజరవుతున్నారు. కానీ.. ఏపీ సీఎం వైఎస్ జగన్  మాత్రం మోడీ మెప్పు కోసం తాను సాగిలపడడమే కాకుండా మొత్తం ప్రభుత్వాన్నే మోడీ కాళ్ల ముందు మోహరిస్తున్నారు. లక్షలాది మందితో ఘనంగా స్వాగతాలు పలుకుతున్నారు. ఇద్దరు సీఎం వ్యవహరిస్తున్న తీరు అరచేతిలో  అద్దం మాదిరిగా అంతా స్పష్టంగా తెలిసిపోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ శుక్ర, శనివారాల్లో ఇరు తెలుగు రాష్ట్రాల సందర్శన సందర్భం ఇది. తొలి రోజు విశాఖపట్నంలో.. తరువాతి రోజు రామగుండంలో మోడి పర్యటన ఉంది. అయితే.. రెండు రాష్ట్రాల్లో జరిగే మోడీ పర్యటనల్లో పూర్తి విరుద్ధ వాతావరణం ఉండడం విచిత్రం. ప్రధాని మోడీ మీద, కేంద్రంలో అధికార బీజేపీ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు తెలంగాణా సీఎం కేసీఆర్. కొంత కాలంగా మోడీ- కేసీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నదనే చెప్పాలి. కొద్ది నెలల క్రితం ప్రధాని మోడీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వస్తున్న సందర్భంగా.. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కేసీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరలు, కరెంట్ మీటర్లు, ధాన్యం కొనుగోలు వంటి పలు అంశాల మీద కేసీఆర్ ప్రశ్నలు సంధించారు. అయితే.. మోడీ హైదరాబాద్ వచ్చారు కానీ, కేసీఆర్ ప్రశ్నలేవీ తనకు వినబడనట్లే వ్యవహరించి తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు. అప్పటికీ ఇప్పటికీ వేడి మరింత పెరిగింది. ‘మా మీదకు ఈడీ, సీబీఐ వేటకుక్కల్ని ఉసికొల్పుతారా..? మీ సంగతేంటో చూస్తా’ అంటూ ఫైరయిపోతున్నారు కేసీఆర్. కేసులు పెట్టినప్పుడు చూసుకుందాం అని గంభీరంగా ఉంటున్నారు. మునుగోడు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో బీజేపీని తన వ్యూహాలతో ఢీకొని విజయం సాధించారు. ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్- బీజేపీల మధ్య మాటలు చాలాదూరం వెళ్లాయి. మొత్తానికి మోడీ విషయంలో తనది పోరుబాటే అని కేసీఆర్ శపథం చేస్తున్నారు. మోడీ ముఖం చూసేందుకు కూడా ఇష్టపడడం లేదు. అందుకే ప్రోటోకాల్ నిబంధనను ఉల్లంఘించి, మోడీకి స్వాగతించకుండా గైర్హాజర్ అవుతున్నారు. కానీ.. మోడీ పట్ల ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరు భిన్నంగా ఉంటోంది. మోడీ కోసం సాగిలపడడానికి, మోకరిల్లి మొక్కడానికి కూడా ఏ మాత్రం ఆలోచించడం లేదని పరిశీలకులు అంటున్నారు. మోడీ విశాఖపట్నం రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం కోసం మొత్తం ప్రభుత్వాన్ని మోహరించడం గమనార్హం. ఏ అధికారికీ వారం రోజులుగా వేరే పని లేదు. విజయసాయిరెడ్డి కూడా విశాఖలోనే తిష్టవేయడం విశేషం. మోడీ సభకు భారీగా జనాన్ని సమీకరించేందుకు చేయని ప్రయత్నంలేదు. విశాఖలో మోడీ పర్యటన మొత్తం జగన్ ఆయన పక్కనే ఉండేలా కార్యక్రమం రూపొందించుకోవడం గమనార్హం. ఇక్కడే ఒక విషయం ప్రస్తావించుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మోడీని ఒక్క క్షణం కూడా విడిచి పెట్టేందుకు సిద్ధంగా జగన్ లేకపోవడానికి కారణం కేసీఆర్ కు లేని కేసుల సమస్య  అంటున్నారు. సుప్రీంకోర్టు ఒత్తిడి మేరకు జగన్ మీద ఉన్న కేసుల విచారణ త్వరగా ముగిసిపోయే సూచనలు కన్పిస్తున్నాయంటున్నారు. ఈ సమయంలో ప్రధాని మోడీ ఆశీర్వాదం ఉంటే తప్ప ఆ చిక్కుల నుంచి బయటపడడం కష్టమనే భావనలో జగన్ ఉన్నారంటున్నారు. సీబీఐ, ఈడీ తరఫున జగన్ కేసులు వాదిస్తున్న న్యాయవాదులు తమ వాదనలో కొంత మెతక వైఖరి అవలంబిస్తే తప్ప తనపై కేసుల ఉచ్చు విడిపోవడం కష్టమే ఆందోళన వల్లే మోడీకి జగన్ ఇంతలా అడుగులకు మడుగులు వత్తుతున్నారనే ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి. ఈడీ, సీబీఐ అధికారులను ప్రభావితం చేయగలిగినవారు కేవలం మోడీ ఒక్కరే. అందుకే మోడీకి జీ హుజూర్ అనేందుకు జగన్ ఏమాత్రం ముహమాటం పడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రధాని పర్యటనకు వచ్చినప్పుడు ఆయా రాష్ట్రాల సీఎంలు పార్టీలకు అతీతంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం పలుకుతారు. ప్రధాని, సీఎం ఒకే పార్టీకి చెందిన వారైనప్పుడు మాత్రమే సభలు కూడా నిర్వహిస్తారు. ఇద్దరు వేర్వేరు పార్టీల వారైతే.. ప్రధాని పార్టీకి చెందిన స్థానిక నేతలు సభల సంగతి చూసుకుంటారు. ముఖ్యమంత్రి మాత్రం ప్రధాని అధికారిక కార్యక్రమాలకే పరిమితం అవుతారు. మోడీ బీజేపీ అగ్రనేత. బీజేపీతో జగన్ వైసీపీకి ఎలాంటి పొత్తు కూడా లేదు. కానీ మోడీ విషయంలో మాత్రం తాను, బీజేపీ వేరు కాదనేట్లు జగన్ వ్యవహరిస్తుండడం గమనించదగ్గ అంశం. బీజేపీ నేతలు నిర్వహించాల్సిన సభ నిర్వహణ బాధ్యతను జగన్ తన భుజాల మీద వేసుకోవడం వెనుక వేరే లాజిక్కు ఉందంటున్నారు. ప్రధాని సభను బ్రహ్మాండంగా నిర్వహిస్తే, మోడీ తనను మెచ్చుకుని, కేసుల నుంచి బయటికి లాగుతారనే ఆశ జగన్ లో ఉండి ఉండొచ్చంటున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోయిన క్రమంలో ప్రధాని విషయంలో భిన్న వైఖరులు ప్రదర్శిస్తుండడం ఆలోచించదగ్గ విషమే అంటున్నారు రాజకీయ పండితులు.

గుజరాత్ ఎన్నికల్లో బీఆర్ఎస్.. బీజేపీకి దెబ్బేనా?

మునుగోడు ఉప ఎన్నికలో విజయం తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి జాతీయ పార్టీ బీఆర్ఎస్ విస్తరణపై దృష్టి సారించారు. బీఆర్ఎస్ ను పాన్ ఇండియా పార్టీగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అదీ ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో సత్తా చాటడం ద్వారా దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే వచ్చె నెల రెండు విడతలుగా జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పోటీ చేయనుంది. గుజరాత్ లో తెలుగువారు అధికంగా ఉండే సూరత్ ప్రాంతంపై కేసీఆర్ దృష్టి పెట్టారు. గుజరాత్ లో ఇప్పటికే పట్టు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగాలని కేసీఆర్ భావించినా ఆ దిశగా ఎటువంటి ముందడుగూ పడలేదు. ఆప్ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ తో పొత్తుకు పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదని చెబుతున్నారు. అయితే గుజరాత్ లో ఒక బలమైన నేతను బీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి కేసీఆర్ ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింఘ్ వఘేలాతో కేసీఆర్ చర్చలు ఫలప్రదమయ్యాయనీ, ఆయన నేడో రేపో బీఆర్ఎస్ గూటికి చేరనున్నారనీ చెబుతున్నారు.  గత సెప్టెంబర్ లో శంకర్ సింఘ వఘేలా హైదరాబాద్ ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ తో బేటీ అయిన సంగతి విదితమే. ఆ భేటీలోనే బీఆర్ఎస్ గుజరాత్ రాష్ట్రంలో పోటీకి దిగితే సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా, తాను జాతీయ పార్టీ ఏర్పాటును విరమించుకుని బీఆర్ఎస్ లో చేరేందుకు కూడా శంకర్ సింగ్ వఘేలా కేసీఆర్ తో చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు అదే జరగబోతున్నదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఆ దిశగా తన తొలి అడుగుతోనే ఏను కుంభ స్థలాన్ని ఢీ కొనాలని కృత నిశ్చయానికి వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందులో భాగంగానే వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను పోటీకి నిలపాలని నిర్ణయించారు. ఇందు కోసం ఆయన గుజరాత్ లో బీఆర్ఎస్ నాయకుడిగా శంకర్ సింగ్ వఘేలాను ప్రొజెక్టు చేయనున్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర, గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న శంకర్ సింగ్ వఘేలా బీఆర్ఎస్ లో చేరడం వల్ల ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ లాంఛింగ్ కు పెద్ద ప్లస్ అవుతుందని పరిశీలకులు కూడా చెబుతున్నారు. ఇక గుజరాత్ లో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు వారి మద్దతుతో కొన్ని స్థానాలలో విజయం సాధించడం పెద్ద కష్టం కాదని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ కారణంగానే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో కనీసంలో కనీసం పది స్థానాలలోనైనా బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపాలని కేసీఆర్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారంటున్నారు.  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో కనీసం పది స్థానాలలో పోటీ చేసి, వాటిలో ఎంత లేదన్నా నాలుగు స్థానాలలో విజయం సాధించగలమన్న ధీమాతో కేసీఆర్ ఉన్నారంటున్నారు. గుజరాత్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ను కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి దిగి.. కొన్ని స్థానాలలో విజయం సాధించడం ద్వారా ప్రధాని మోడీకి గట్టి గుణపాఠం చెప్పాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఇప్పటికిప్పుడు తనతో చేతులు కలపడానికి ఒకింత సంకోచిస్తున్న బీజేపీయేతర పార్టీలు, ప్రాంతీయ పార్టీలూ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల లో  బీఆర్ఎస్ కొన్ని స్థానాలలో విజయంతో సత్తా చాటితే.. వాటంతట అవే ముందుకు వచ్చి తనతో జట్టు కడతారన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తున్నది. ఏది ఏమైనా బీఆర్ఎస్ ఆవిర్బావం సందర్భంగా కేసీఆర్ ప్రకటించిన ప్రణాళికలో గుజరాత్ లో పోటీ అంశం లేదు. ఆ తరువాత సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జాతీయ రాజకీయాలలో తన తొలి అడుగు మోడీని ఢీకొట్టడంతోనే వేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుజరాత్ లో బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ రాష్ట్రలో ఆప్ బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్నదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో మనీష్ సిసోడియాపై కేసు అంశాన్ని ప్రధాన ఎన్నికల అంశంగా తెరమీదకు తీసుకురావడంతో బీజేపీ డిఫెన్స్ లో పడిందంటున్నారు. అందుకే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకూ ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో దర్యాప్తు సంస్థలు పెద్దగా దూకుడు ప్రదర్శించే అవకాశం లేదన్న కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితకు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమీ లేదని తెరాస శ్రేణులు కూడా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోనికి దింపి కొన్ని స్థానాలను గెలుచుకోవడం ద్వారా మోడీకి గట్టి సవాల్ విసిరినట్లౌతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. గుజరాత్ ఫలితాల తరువాత బీఆర్ఎస్ విషయంలో కేసీఆర్ తన దూకుడును మరింత పెంచే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ మోడల్ గా దేశ ప్రగతి అంటూ దేశ వ్యాప్తంగా కేసీఆర్ నాయకత్వ పటిమను ప్రచారం చేస్తూ జారీ చేసిన ప్రకటనల ప్రభావం గుజరాత్ మీద కూడా గణనీయంగానే ఉందని పరిశీలకులు అంటున్నారు. సో.. గుజరాత్ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ సభ్యులు రంగంలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. 

ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేధం.. గుజరాత్, హిమాచల్ ఎన్నికల ముందు సంచలనం

కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్, గెలుపు అంచనాల ప్రచురణ, ప్రసారాలను నిషేధించింది. ఈ మేరకు గురువారం (నవంబర్ 10) ఉత్తర్వులు జారీ చేసింది.  హిమాచల్ ప్రదేశ్ లో ఒకే విడతలో జరగనున్న పోలింగ్ కు ఇప్పటికే ప్రచార గడువు ముగిసింది. ఇక ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ లో వచ్చే నెల మొదటి వారంలో రెండు విడతలలో ఆ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం(నవంబర్ 12) నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకూ మీడియాలో ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రచురణ, ప్రసారాలను  నిషేధిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజాప్రాతినిథ్య చట్టం ప్రకారం ఈ నిషేధాన్ని విధిస్తున్నట్లు ఈసీ ఆ ఉత్తర్వ్యులలో పేర్కొంది. ఆ ఉత్తర్వుల మేరకు శనివారం (నవంబర్ 12)  ఉదయం ఎనిమిది గంటల నుంచి డిసెంబర్ 5 సాయంత్రం ఐదున్నర గంటల వరకూ ఏ విధమైన ఎగ్జిట్ పోల్స్, గెలుపు అంచనాలను ప్రసారం చేయడం కానీ, ప్రచురించడంపై కానీ పూర్తి నిషేధం అమలులో ఉంటుందని పేర్కొంది. 

దివ్యాంగురాలికి అంగరంగ వైభవంగా వివాహం ఎరితోనో తెలుసా?

దివ్యాంగురాలైన తన కుమార్తెకు తండ్రి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు. అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేశాడు. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగూ అని వివాహ వైభవం గురించి చెప్పుకుంటూ ఉంటాము. కానీ గ్వాలియర్ కు చెందిన శివపాల్ అనే వ్యాపార వేత్త మాత్రం తన కుమార్తె వివాహానికి అంతకు మించి అన్నట్లుగా ఏర్పాట్లు చేశారు. ఒక వివాహం గురించి ఇంత ఉపోద్ఘాతమెందు కంటారా? ఇలాంటి వివాహం ఇలలో ఎవరికీ జరిగి ఉండదు. జరిగి ఉండదు కాదు. జరగలేదు. ఇంతకీ ఈ దివ్యాంగురాలికి ఎవరితో వివాహం జరిగిందో తెలుసుకుంటే... ఈ ఉపోద్ఘాతం చాలదని అందరూ అంగీకరించి తీరుతారు. గ్వాలియర్ కు చెందిన శివపాల్ ఒక వ్యాపార వేత్త. ఆయన కుమార్తె వయస్సు 26 ఏళ్లు. ఆమె దివ్యాంగురాలు. వినలేదు, మాట్లాడలేదు. అంతే కాదు గత 21ఏళ్లుగా ఆమె చక్రాల కుర్చీకే పరిమితమై ఉంది. కుమార్తెను అత్యంత ఆప్యాయంగా, ప్రేమగా పెంచుకునే శివలాల్ తన కుమార్తె వివాహం చేయలేనేమోనని బెంగపడ్డారు. అయితే ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉన్న ఆయనకు కుబ్జ కథ గుర్తుకు వచ్చింద. అంతే తన కుమార్తెకు శ్రీకృష్ణుడే తగిన వరుడని నిర్ణయించుకున్నాడు. అంతే ఆఘ మేఘాల మీద శ్రీ కృష్ణ భగవానుడితో తన కుమార్తె వివాహానికి ఏర్పాట్లు చేసేశాడు. ఓ అమ్మాయికి శ్రీకృష్ణుడి వేష ధారణతో అలంకరణ చేశాడు. మొత్తం మీద అనుకున్న విధంగా తన కుమార్తెను కృష్ణ భగవానుడికి ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేశాడు. ఈ వివాహానికి సంబంధించిన వార్తలు, ఫొటోలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి. వికలాంగురాలైన తన కుమార్తెపై శివపాల్ కు ఉన్న ప్రేమానురాగల పట్ల నెటిజన్లు ముగ్ధులౌతున్నారు. 

బార్ లో కాల్పుల కలకలం.. మెక్సికోలో 9మంది దుర్మరణం

మెక్సికోలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఒక బార్ లో సాయుధులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో కనీసం 9 మంది మరణించారు. మరి కొందరు గాయపడ్డారు. ఈ ఘటన గ్వానాజువాటోలోని ఓక బారులో జరిగింది. మారో గ్యాంగ్ సభ్యులు ఈ కాల్పులకు తెగబడ్డారని చెబుతున్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో బార్ లోకి చొరబడ్డ సాయుధులు అక్కడి సిబ్బందిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మహిళా వెయిటర్లు సహా తొమ్మిది మంది బార్ సిబ్బంది మరణించారు. ఈ కాల్పులకు గ్యాంగ్ ల మధ్యా విభేదాలే కారణమని పోలీసులు తెలుపుతున్నారు. మారో గ్యాంగ్ కు ప్రత్యర్థి గ్యాంగ్ కు బార్ యాజమాన్యం మద్దతు ఇస్తుండటమే ఈ దాడికి వెనుక ఉన్న కారణంగా భావిస్తున్నారు. అయితే దాడికి పాల్పడిన సాయుధులను ఇంకా గుర్తించలేదని చెప్పారు. మెక్సికోలో గ్యాంగ్ వార్ ల కారణంగా అమాయకులు చనిపోవడం ఇదే మొదటి సారి కాదు. గత నెలలో కూడా ఇలాగే బార్ పై సాయుధులు జరిపిన దాడిలో 12 మంది మరణించారు. అంతకు ముందు నెలలో కూడా ఇలాంటి కాల్పుల ఘటనలో 10 మంది చనిపోయారు. 

టీ కప్పులో తుపానేనా?

విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ కోసం ఏర్పాటు చేసిన ఉమ్మడి నియామకాల బోర్డు విషయంలో తెలంగాణ సర్కార్, రాజ్ భవన్ ల మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణం టీ కప్పులో తుపానులా తేలిపోయిందా? ఉమ్మిడి నియామక బోర్డు విషయంలో గవర్నర్ సందేహాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివృత్తి చేసినట్లు చేస్తే.. తన సందేహాలన్నీ దూది పింజెల్లా తేలిపోయాయని గవర్నర్ తమిళి సై వివాదానికి ముగింపు పలికేశారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వర్సిటీల్లో ఖాళీల భర్తీ సజావుగా పూర్తి చేసేందుకు మాత్రమే బోర్డు ఏర్పాటు చేశామని గవర్నర్ తమిళిసైకు మంత్రి సబితా వివరించారు. ఈ విషయంలో గవర్నర్ సందేహాలను నివృత్తి చేసేందుకు మంత్రి సబిత గురువారం సాయంత్రం రాజ్ భవన్ కు వెళ్లారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తనకు ప్రొటోకాల్ ఇవ్వడం లేదనీ, వర్సిటీల నియామకం బిల్లుపై తన సందేహాలను నివృత్తి చేయాలని, రాజ్ భవన్ కు వచ్చి చర్చించాల్సిందిగా సందేశం పంపినా స్పందన లేదనీ తమిళిసై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాజ్ భవన్ ప్రగతి భవన్ కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్ ను ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో ఇరికించాలని చూశారనీ, తన ఫోన్ ట్యాప్ అవుతోందన్న అనుమానాలు ఉన్నాయనీ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో గవర్నర్ లతో  ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విభేదాలు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా ప్రభుత్వం, గవర్నర్ ల మధ్య గత కొంత కాలం నుంచీ కొనసాగుతున్న ఘర్షణ వాతావరణం ముదిరి పాకాన పడిందా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే గత కొద్ది కాలంగా గవర్నర్, కేసీఆర్ మధ్య అగాధం రోజురోజుకూ పెరుగుతోందన్న అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను వెనక్కు పంపకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా గవర్నర్ తన వద్దే పెండింగ్ లో ఉంచుకోవడంతో ప్రభుత్వంలో అసహనం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తమిళిసై మీడియా సమావేశంలో చేసిన తీవ్ర వ్యాఖ్యలతో ఇక ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య విభేదాలు తెగేదాకా వెళ్లిపోయాయా? ఇక అమీ తుమీకే రాజ్ భవన్, ప్రగతి భవన్ లు సిద్ధమైపోయాయా అన్న అనుమానాలు వ్యక్త మయ్యాయి. అయితే ఈ హడావుడీ, ఉద్రిక్త వాతావరణం అంతా ఒక సారి సబిత రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ సందేహాలు నివృత్తి చేస్తామని చేసిన ప్రకటనతో చప్పున చల్లారిపోయింది. సుదీర్ఘ అధ్యయనం అనంతరమే, అన్ని అంశాలనూ పరిగణనలోనికి తీసుకుని యూజీసీ నిబంధనలకు అధిగమించకుండా, న్యాయపరమైన చిక్కుల తలెత్తకుండా అన్ని విధాలుగా పరిశీలించిన అనంతరమే ఉమ్మడి రిక్రూట్ మెంట్ బోర్డును ఏర్పాటు చేశామని సబితా ఇంద్రారెడ్డి గవర్నర్ కు రాజ్ భవన్ కు వెళ్లి మరీ వివరించారు. ఆమె వివరణలో సంతృప్తి చెందిన గవర్నర్ తమిళిసై సంతృప్తి చెందారు. వర్సిటీల్లో ఖాళీల ప్రక్రియను వీలైనంత సత్వరంగా నష్పాక్షికంగా, పాదర్శకంగా భర్తీ చేయాలని సూచించారు. గవర్నర్ భేటీలో సబితా ఇంద్రారెడ్డితో పాటు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్యాకమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి కూడా పాల్గొన్నారు.  తెలంగాణలో ఇప్పటికే  వైద్యఆరోగ్య శాఖ, పోలీసు తదితర శాఖలు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసి నియామకాలు చేపట్టాయన్నారు. ఆ నియమకాలన్నీ పాదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగాయని వారు గవర్నర్ వివరించారు.  ఈ వివరణతో సంతృప్తి చెందినట్లు గవర్నర్ తెలిపారు. దీంతో పెండింగ్ లో ఉన్న బిల్లులకు ఆమెదం తెలపాల్సిందిగా మంత్రి సబిత గవర్నర్ ను కోరారు. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపడతామన్నారు.  

లాలూకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్.. దాత కుమార్తే!

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) వ్యవస్థాపకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి జరగనుంది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ కు రెండు కిడ్నీలూ ఫెయిలయ్యాయి. దీంతో ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో కిడ్నీ దాతల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ స్థితిలో ఆయన రెండో కుమార్తె రోహిణీ ఆచార్య తన తండ్రికి కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆమె సింగపూర్ లో నివసిస్తున్నారు. చాలా కాలం నుంచీ మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి అవసరం లేదని ఎయిమ్స్ వైద్యులు చెప్పినప్పటికీ సెకండ్ ఒపీనియన్ కోసం అన్నట్లుగా ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య తన తండ్రిని సింగపూర్ లోని ఓ ఆసుపత్రిలో చూపించి పరీక్షలు చేయించారు. అక్కడి వైద్యులు  కిడ్నీ మార్పిడి చేయించుకుంటే ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించేందుకే ఆయన కుటుంబ సభ్యలు నిర్ణయించారు. కిడ్నీ దానం చేయడానికి ఆయన రెండో కుమార్తె రోహిణీ ఆచార్య ముందుకు వచ్చారు. తన తండ్రికి తన  ఇవ్వగలుగుతున్నందుకు తనకెంతో గర్వంగా ఉందని ఆమె అన్నారు. బహుశా ఈ నెలాఖరులోగా లాలూప్రసాద్ యాదవ్ కు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరుగుతుంది.  పశుగ్రాస కుంభకోణం కేసులో జైలు పాలైన లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చిన సంగతి విదితమే. 

సామూహిక అత్యాచారం కేసులో ప్రభుత్వ మాజీ సీఎస్ అరెస్టు

మృగళ్ల మగ దాష్టీకం సమాజంలో అంతకంతకూ పెరిగిపోతున్నది. మహిళలపై అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిలో ఉన్నత విద్యావంతులూ, ప్రభుత్వంలో అత్యంత కీలక పదవుల్లో ఉన్నవారూ కూడా ఉండటం విద్య వారికి నేర్పిన సంస్కారం ఏమిటన్న అనుమానాలకు తావిస్తోంది. అండమాన్ నికోబార్ మాజీ సీఎస్ జితేంద్ర నారాయణ్ సామూహిక అత్యాచారం కేసులో అరెస్టు కావడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో వెంటనే పోలీసులు ఆయనను అరెస్టు చేసి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ప్రలోభ పెట్టి తనను ఇంటికి పిలిపించుకున్న నారాయణ్, మరి కొందరు ఉన్నతాధికారులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారన్న బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)కు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ మూడు సార్లు మాజీ సీఎష్ నారాయణ్ ను ప్రశ్నించింది. అరెస్టు అనివార్యమని తెలుసుకున్న నారాయణ్ ముందస్తు బెయిలు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయతే సర్వోన్నత న్యాయస్థానం ట్రయల్ కోర్టులోనే బెయిలు పిటిషన్ వేయాలని సూచించింది. దీంతో ట్రయల్ కోర్టును బెయిల్ కోసం ఆశ్రయించిన నారాయణ్ కు అక్కడ చుక్కెదురైంది.