మంత్రుల గుండెల్లో గుబులు.. వెంటాడుతున్న అరెస్ట్ భయం

ఆట మొదలైంది.. కాదు.. కాదు.. ఆట క్లైమాక్స్ కు చేరింది.  అయితే, చివరకు ఏమి జరుగుతుంది? ఎండ్ రిజుల్ట్  ఏమిటి? ప్రధాని నరేంద్ర మోడీ పై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు విజయం సాధిస్తారా, లేక ఇటీవల  పునరుద్ధరించిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా ప్రధాని మోడీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబపాలన,అవినీతి పాలనను ఎండగడుతూ తెలంగాణలో   కమల వికాసం ఖాయమంటూ చేసిన హెచ్చరిక, అందుకు అనుబంధంగా  తెలంగాణ రాజకీయాలు ఇకపై రంజుగా ఉంటాయంటూ వినిపించిన భవిష్యవాణి నిజం అవుతుందా అనేది చూడవలసి వుంది. అయితే,అక్కడ కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెరాసల నడుమ జరుగతున్న రాజకీయ పోరాటానికి, ఉభయ పక్షాలూ  దర్యాప్తు సంస్థలను అస్త్రాలుగా చేసుకోవడంతో  ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే ఆందోళన ఉభయ పార్టీ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.ఓ వంక కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ లిక్కర్ స్కామ్, మరో వైపు తెరాస ఎమ్మెల్యేల ఎర కేసు పోటాపోటీగా ఉత్కంఠ రేకేతిస్తుంటే, మరో వంక తెరాస మంత్రులు, నాయకులు లక్ష్యంగా జరుగతున్న ఐటీ దాడులు మరింత రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. నిజానికి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నెలరోజులకు పైగానే తెరాస ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుట్ల కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయినా ఇంతవరకు ఈ కేసును విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యక్షంగా ఎక్కడా ఆమె పేరు ఎత్తలేదు. ఆమెకు నోటీసు అయినా యివ్వలేదు. కానీ, ఈ కుంభకోణంలో ఆమెదే కీలక పాత్ర అని నిరూపించే దిశగా పావులు కదులుతున్నాయనే, సంకేతాలు మాత్రం స్పష్టమవుతున్నాయి. అందుకే,అమెలోనే కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్  కుటుంబంలో, తెరాస నాయకుల్లో కలవరపాటు కనిపిస్తోంది.   అంతే కాదు, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత  వైపు వేలెత్తి చూపించే అవకాశాన్ని, తెరాస నాయకత్వమే కల్పిస్తోందా, అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కవితను తమ పార్టీలోకి రావాలని బీజేపీ నాయకత్వం ఆమెపై వత్తిడి తెచ్చిందని చేసిన ప్రకటన ఉద్దేశం ఏదైనా  పలు అనుమానాలకు ఆస్కారం కల్పించిందని అంటున్నారు. అంతకు ముందు కవితను వెంట పెట్టుకుని ముఖ్యమంత్రి పది రోజులు ఢిల్లీలో మకాం చేయడం, ఈ  పది రోజుల్లో ఆయన ఏమి చేశారు అనే విషయంగా వస్తున్న కథనాలు లిక్కర్ స్కాం కు సంబంధించి కవిత రియాక్షన్స్,  అలాగే ఆమె ఆకస్మిక ఢిల్లీ పర్యటనలు ఇంకా అనేక పరిణామాలు ఆమె  వైపు వేలెత్తి చూపించే అవకాశాన్ని, కల్పిస్తున్నాయని అంటున్నారు.  అలాగే, కవితను లిక్కర్ స్కాం నుంచి కాపాడేందుకే ముఖ్యమంత్రి, తెరాస ఎమ్మెల్యేల ఎర కేసును తెర మీదకు తెచ్చారనే అభిప్రాయం బలపడుతోంది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన, ‘సిట్’  సాగిస్తున్న దర్యాప్తు  బీజీపీ నాయకులని ఇరకాటంలోకి నెట్టింది. ఏకంగా, బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసు ఇవ్వడంతో, బీజేపీతో పాటుగా రాష్ట్రీయ స్వయం సీవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ను ఎమ్మెల్యేల ‘ఎర’ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని, బీజేపీ అగ్ర నాయకత్వం గుర్తించింది. అందుకు కౌంటర్ గా మంత్రులు టార్గెట్ గా ఐటీ దాడులకు తెర లేపింది. నిజమే, ఐటీ దాడులు కొత్త విషయం కాదు కానీ, మంత్రులే టార్గెట్ గా ఐటీ దాడులు జరగడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.  మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఐటీ దాడుల్లో చిక్కిన మంత్రులు చాలా వరకు జైలు పాలయ్యారు లేదా జైలుకు వెళ్లే దారిలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమత బెనర్జీకి అత్యంత సన్నిహితునిగా  పేర్కొనే, పార్థ చట్టేర్జీని, ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన  సత్యేంద్ర జైన్, మహారాష్ట్రలో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మంత్రివర్గంలో కీలక మంత్రి, కాంగ్రెస్ నాయకుడు నవాబ్ మాలిక్,  అలాగే, ఐటీ దాడులలో చిక్కుకున్న ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,  నాయకులు, అరెస్ట్ కావడంతో, ఇప్పడు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులోనూ గుబులు మొదలైంది. ముఖ్యంగా ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థల ఉచ్చులో చిక్కున్న మంత్రులు ఎప్పడు ఏమవుతుందో అని భయపడుతుంటే, రేపు ఏమవుతుందో అని మరికొందరు మంత్రులు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. కేసినో వ్యవహారంలో తలసాని కుటుంబంపై ఈడీ నజర్ పడింది.  గతంలో ఈ  వ్యవహారానికి సంబంధించి చీకోటి ప్రవీణ్ ను విచారించింది ఈడీ. అతను చెప్పిన వివరాల ఆధారంగా కొందరు టీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. అవన్నీ ఒకెత్తు అయితే  ఇప్పడు  మంత్రి తలసాని కుటుంబ సభ్యులు, ఆయన పీఏ ఇతర సన్నిహితులను ఈడీ విచారించింది. అలాగే  అక్రమంగా విదేశాలకు గ్రానైట్ తరలించారనే పాత కేసుకు సంబంధించి మంత్రి గంగుల కమలాకర్ కంపెనీలు, ఇల్లు, ఇతర అనుమానిత ప్రదేశాల్లో ఈడీ, ఐటీ, అధికారులు తనిఖీలు నిర్వహించారు. తాజాగా మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన సోదరులు, కుమారులు, అల్లుడి నివాసాల్లో, విద్యా సంస్థల్లో, లావాదేవీలకు సంబంధించిన బ్యాంకుల్లో ఐటీ సోదాలకు దిగింది. భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.  దీంతో, మంత్రులలో ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మంత్రి మల్లారెడ్డి బంధు, మిత్రుల ఇళ్లు, ఆయన కాలేజీలు, కార్యాలయాలపై దాడులు కొనసాగుతున్న సమయంలోనే  అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనాయకులతో  అత్యవసర సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఈడీ, ఐటీ దాడుల దృష్ట్యా నేతలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి సూచించారని అంటున్నారు. అయితే, పార్థ చట్టేర్జీ, సత్యేంద్ర జైన్, నవాబ్ మాలిక్ ఉదంతాలు కళ్ళముందు కదలాడుతున్న మంత్రులు ఇతర నాయకులు ఆందోళన చెందుతున్నారు. నిజానికి, 40కి పైగా తెరాస ఎమ్మెల్యేలపై ఇప్పటికే కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో తెరాస నాయకులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని అంటున్నారు.

రిట్రెంచ్ మెంట్ ఇక గూగుల్ వంతు

ఆర్థిక మాంద్యం ఐటీ ఉద్యోగుల ఉద్యోగాలకు ఎసరు తీసుకువస్తున్నట్లు కనిపిస్తోంది. సంస్థలు తమ నష్టాలను తగ్గించుకునేందుకు ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. ఇప్పటికే ఎలాన్ మస్క్ ఉద్యోగులకు ఉద్వాసన పలకడంలో ఇప్పటి వరకూ ఎ సంస్థా చేయని విధంగా దూకుడుగా వ్యవహరిస్తుంటే.. అమెజాన్, మెటా వంటి అగ్రశ్రేణి సంస్థలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలకడమే నష్టాలను పూడ్చుకునే మార్గంగా భావించి ఆ దారిలో నడుస్తున్నాయి. ఎలాన్ మస్క్ అయితే ఇప్పటి వరకూ సంస్థలో 50 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. వీరు కాకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ ఇంటిదారి చూపారు. అమెజాన్ సైతం తన సంస్థలో పది వేల మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఇక ఫేస్ బుక్ మాతృ సంస్థ అయిన మెటా సైతం ఉద్యోగుల కోతకే సై అంది. ఆ దారిలోనే నడుస్తోంది. మొత్తంగా ఐటీ ఇండస్ట్రీలోనే ఈ ఉద్వాసన ట్రెండ్ మొదలైంది. తాజాగా  గూగుల్ కూడా అదే బాట పట్టడంతో ఐటీ ఉద్యోగులలో టెన్షన్ ద్విగుణీకృతమైంది.   ఉన్నత స్థాయి ఉద్యోగుల నుంచి ఫ్రెషర్స్ వరకూ అందరిలోనూ ఆందోళన నెలకొంది.  వర్క్ ఫెర్ఫార్మెన్స్ నెపంతో కనీసం పది వేల మందిని దశల వారీగా తొలగించేందుకు గూగుల్ నిర్ణయించుకుంది.   ఐటీ రంగంలో ఉద్యోగులకు భారీగా వేతనాలు చెల్లించే కంపెనీల్లో గూగుల్ అందరి కంటే ముందుంది. ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ కంపెనీగా పేరున్న గూగుల్ సైతం లేఆఫ్స్ బాట‌ను ఎంచుకోవ‌టంతో మొత్తంగా ఐటీ ఉద్యోగులలో జాబ్ ఫియర్ మొదలైంది. ఉద్యోగ భద్రత కరవైందన్న భావన వారిలో నెలకొంది.

సెక్స్ వర్కర్లు, ట్రాన్స్‌జెండర్లు ఓటు నమోదు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాం

సెక్స్ వర్కర్లు మరియు ట్రాన్స్‌జెండర్లు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి మరియు మారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రోత్సహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ వికాస్ రాజ్ మంగళవారం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సెక్స్ వర్కర్ల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న 52 ఎన్జీవోలు హాజరైన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఈవో ప్రసంగించారు. స్పెషల్ సమ్మరీ రివిజన్(SSR) కార్యక్రమంలో భాగంగా ఇంకా నమోదు చేసుకోని సెక్స్ వర్కర్ల చేత ఓటు నమోదు చేయించాలని ఎన్జీవోలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మహిళా సెక్స్ వర్కర్లు, ట్రాన్స్‌జెండర్లు వంటి అత్యున్నత గ్రూపులతో హెచ్‌ఐవీ నివారణపై పనిచేస్తున్న ఎన్జీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నివాస స్థలానికి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంటరీ రుజువు లేని సెక్స్ వర్కర్లను డాక్యుమెంటరీ రుజువు కోసం పట్టుబట్టకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిందని  తెలిపారు. అలాంటి పక్షంలో బూత్ లెవల్ అధికారి, ఫారమ్‌-6 లో పేర్కొన్న చిరునామాను సందర్శించి ఆ స్థలంలో నివసిస్తున్నారో లేదో నిర్ధారించుకొని, నివేదికను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్/అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కి సమర్పిస్తారని పేర్కొన్నారు.  అనంతరం ట్రాన్స్‌జెండర్ల సంఘంతో జరిగిన సమావేశంలో, అర్హులైన ట్రాన్స్‌జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా వారు ఓటు నమోదు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డు సభ్యులతో పాటు ట్రాన్స్‌జెండర్లతో కలిసి పనిచేస్తున్న ఎన్జీవోల నుండి సీఈవో సూచనలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఓటు నమోదు చేసుకోని ట్రాన్స్‌జెండర్లను నమోదు చేసుకునేలా ప్రోత్సహించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. మంగళవారం జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ట్రాన్స్‌జెండర్ బోర్డు సభ్యులతో పాటు శిశు మరియు మహిళా సంక్షేమ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

నిజమేనా.. పెట్రోల్ ధరలు తగ్గుతాయా?

నిత్యం పెరుగుతూ ప్రజలను బెంబేలెత్తించేస్తున్న పెట్రో ధరలు తగ్గు ముఖం పట్టనున్నాయట.  పెట్రో ధరలు భారీగా తగ్గే అవకాశాలున్నాయన్న సమాచారంతో ప్రజలు ఊరట చెందుతున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ భారీ ధరలతో బేజారైపోయిన సామాన్య ప్రజలకు భారీ ఊరట లభించే అవకాశం ఉందన్న వార్తలు ప్రభుత్వ వర్గాల నుంచే వినవస్తున్నాయి. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు స్థిరంగాఇంధన ధరలు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తుంది. గతంలో భారీగా పెరిగిన ఈ ధరలు ఆ మధ్య కొద్దిగా తగ్గి ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి.  అందుకు కారణం గత పదినెలలుగా అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు దిగిరావడమే కారణం.   రానున్న రోజులలో అంతర్జాతీయ విఫణిలో ముడి చమురు ధరలు మరింత తగ్గనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తతుం అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర   87.81 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. అంటే గత మార్చితో పోలిస్తే దీని ధర దాదాపు 35శాతం తగ్గింది. వచ్చే కొద్ది రోజులలో ఇది 82 డాలర్లకు పడిపోయాయని అంటున్నారు. అదే జరిగితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. చమురు కోసం డ్రిల్లింగ్‌ పెంచుతామని యూకే ప్రధాని రిషి సునక్ ప్రకటన, యూరప్‌లోని ఇతర దేశాలు  డ్రిల్లింగ్‌ పెంచినకూడా డ్రిల్లింగ్ పెంచడంతో ముడి చమురు ధరలు తగ్గి పెట్రో ధరలు నేలకు దిగి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 

నా కుమారుడిని ఐటీ అధికారులు కొట్టారు.. మల్లారెడ్డి ఆరోపణ

మంత్రి మల్లారెడ్డి నివాసాలు కార్యాలయాలు సహా ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి నివాసం, కార్యాలయం అలాగే బంధువులు సన్నిహితుల నివాసాలలో ఐటీ దాడులు జరుగుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు సురారంలోని ఒక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుమారులు, కుమార్తె, అల్లుడు, వియ్యంకుడి ఇళ్లలో నిన్న ఉదయం నుంచీ ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి విదితమే. సోదాల నేపథ్యంలో  మహేందర్ రెడ్డి నిన్నటి నుంచీ తన నివాసంలోనే ఉన్నారు. ఇంతలో ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. మంగళవారం అర్ధరాత్రి వరకు సోదాలు చేసిన  ఐటీ అధికారులు ఎక్కడ సోదాలు నిర్వహిస్తున్నారో అక్కడే ఆ రాత్రి పడుకున్నారు. కాగా ఈ సోదాలలో భారీ ఎత్తున నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.  ఇలా ఉండగా అస్వస్థతకు గురైర మహేందర్ రెడ్డి మల్లారెడ్డి కాలేజీలకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. ఇలా ఉండగా మంత్రి మల్లారెడ్డి సోమవారం ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. తెలంగాణలో మోడీ ఆటలు సాగవని పేర్కొన్నారు. మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఐటీ దాడులు ప్రారంభం కావడం విశేషం. అదలా ఉంచితే తన కుమారుడిని ఐటీ అధికారులు ఐటీ రెయిడ్స్ పేరుతో వేధించడమే కాకుండా కొట్టారని మంత్రి ఆరోపించారు. తన కుమారుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్దకు వచ్చిన మల్లారెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. వారు భౌతిక దాడికి పాల్పడటం వల్లనే తన కుమారుడు ఆసుపత్రి పాలయ్యారన్నారు. రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు చేస్తున్నారని విమర్శించారు. రు.

సాకర్ లో సంచలనం.. అర్జెంటీనా పై సౌదీ అరేబియా విజయం

ఖ‌తార్ వేదిక‌గా జ‌రుగుతున్న‌ ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో పెను సంచలనం నమోదైంది. మంగళవారం అర్జంటీనా, సౌదీ అరేబియాల మధ్య జరిగిన మ్యాచ్ లో పసి కూడా సౌదీ అర్జెంటీనాకు షాక్ ఇచ్చింది. సౌదీ అరేబియా 2-1 తేడాతో అర్జెంటీనాను ఓడించింది. వరల్డ్ ర్యాంకింగ్ లో 51వ స్థానంలో  ఉన్న సౌదీ అరేబియా టైటిల్ ఫేవరెట్ జట్టు అర్జంటీనాను ఓడించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుట్ బాల్ అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వరల్డ్ ర్యాంకింగ్స్ లో అర్జంటీనాది మూడో స్థానం. అటువంటి జట్టను 51స్థానంలో  ఉన్న సౌదీ అరేబియా  ఓడించడంతో అర్జెంటీనా అభిమానులు క‌న్నీరుమున్నీరయ్యారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అర్జెంటీనా త‌రుపున మెస్సీ మాత్ర‌మే గోల్ కొట్టాడు. ఆట ప్రారంభ‌మైన ప‌ద‌వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను స‌ద్వినియోగం చేసుకున్న మెస్సీ దాన్ని గోల్‌గా మ‌లిచాడు. తొలి హాఫ్ మొత్తం అర్జెంటీనా ఆధిక్యంలో కొనసాగింది. అయితే.. రెండో అర్థ‌భాగంలో సౌదీ అరేబియా ఆట‌గాళ్లు అనూహ్యంగా పుంజుకున్నారు. ప్ర‌త్య‌ర్థి గోల్ పోస్టుపై పదే పదే దాడుల‌ు   చేశారు. ఈ క్ర‌మంలో 48వ నిమిషంలో సౌదీ అరేబియా ఫార్వ‌ర్డ్ ప్లేయ‌ర్ స‌లేహ్ అల్ షెహ్రీ తన జట్టుకు తొలి గోల్‌  అందించి స్కోరును 1-1తో స‌మం చేశాడు. మ‌రికొద్దిసేప‌టికే మిడ్‌ఫీల్డ‌ర్ స‌లీం అల్ ద‌వ్సారీ 53వ నిమిషంలో గోల్ చేయ‌డంతో సౌదీ అరేబియా ఆధిక్యంలోకి వెళ్లింది. అక్కడి నుంచి ఆట చివ‌రి వ‌ర‌కు ఆ ఆధిక్యాన్ని నిల‌బెట్టుకుంటూ వ‌చ్చింది సౌదీ అరేబియా . ఈ మ్యాచ్‌కు ముందు వ‌ర‌కు వ‌రుస‌గా 36 మ్యాచుల్లో ఓట‌మి ఎరుగ‌ని జ‌ట్టుగా ఉన్న అర్జంటీనా కీలక మ్యాచ్ లో లయ కోల్పోయి పరాజయం పాలైంది. 

కర్మకాండలు నిర్వహించే కంపెనీ వెలిసింది!

సంపాదన కోసం చట్ట విరుద్ధం కాని ఏ పనైనా చేయడానికి సిద్ధపడటాన్ని ఎవరూ తప్పు పట్టరు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని మనవాళ్లు ఎప్పుడో చెప్పేశారు. కానీ... విలువల వలువలు ఊడ్చిసి.. బంధాలు, బంధుత్వాలను తెంచేసి.. డబ్బులు పారేస్తే ఏ సేవలైనా మీ కాళ్ల వద్దకు వచ్చేస్తాయనే లాంటి వ్యాపారాలు చట్ట చట్ట విరుద్ధం కాకపోయినా.. నైతిక కోణంలో అంగీకరించలేం. అలా నైతికంగా ఆమోదయోగ్యం కాని ఓ స్టార్టప్ పుట్టుకొచ్చింది.అదే కర్మ కాండలు చేసే ఓ కంపెనీ. ‘సుఖాంత్ ఫ్యునరల్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో వెలిసిన ఈ కంపెనీ.. కర్మకాండలతోపాటు అంబులెన్స్ సర్వీస్, మరణ ధ్రువీకరణ పత్రం పొందేందుకు సాయం చేయడం వంటి సేవలు అందిస్తామంటోంది. కర్మకాండలు నిర్వహించేందుకు ఈ స్టార్టప్ రూ. 35 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తుందట. ఇప్పటికే మనిషిని రోబోగా మార్చేసి డబ్బులు పారేసే ఈ సేవ అయినా కాళ్ల దగ్గరకు చేర్చేలా వ్యాపారాలు, వ్యాపార సంస్థలూ పుట్టుకొచ్చేశాయి.  సంపాదనే ధ్యేయంగా నీరు, గాలి, తిండి ఇలా ప్రతీదీ వ్యాపారానికి కాదేదీ అనర్హం అన్న పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు కొత్తగా కర్మ కాండలు చేయడానికీ ఓ కంపెనీ ముంబైలో వెలిసింది. ముంబైలో ప్రారంభమైన ఈ స్టార్టప్  వ్యాపారం ఏడాదిలో ఐదు కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే డబ్బులు కట్టి తల్లిదండ్రులను ఓల్డేజ్ హోంలకు తరలించేస్తున్న వారెందరో ఉన్నారు. ఇప్పుడు ఇక మరణానంతర క్రతువులను కూడా ఇలా తమ ప్రమేయం లేకుండా.. లాస్ట్ రెస్పెక్ట్ కు కూడా తిలోదకాలిచ్చేయడాన్ని ప్రోత్సహించేలా ఓ కంపెనీ వెలిసింది. దీనిపై సామాజిక మాధ్యమంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి కంపెనీలు మనకు అవసరమా అంటున్నారు. మనిషి అంతిమ యాత్ర అయిన వారి కన్నీటి వీడ్కోలుతో జరగాలి తప్ప ఇలా కాదని అంటున్నారు. డబ్బు సంపాదన కోసం మానవ సంబంధాలను, అనుబంధాలను విచ్ఛిన్నం చేసే ఇలాంటి వ్యాపారాలు తగవని హితవు చెబుతున్నారు.  

మూడో మ్యాచ్ టై.. న్యూజిలాండ్ తో టి20 సిరీస్ భారత్ దే

నేపియ‌ర్‌లోని మెక్‌లీన్ పార్క్ వేదిక‌గా భార‌త్‌, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో టీమ్ ఇండియా సిరీస్ ను 1-0 తేడాతో కేవశం చేసుకుంది.  ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.4 ఓవ‌ర్ల‌లో 160 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 161 పరుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ 9 ఓవ‌ర్లు ముగిసేస‌రికి నాలుగు వికెట్లు కోల్పోయి 75 ప‌రుగులు చేసింది. ఈ ద‌శ‌లో వ‌రుణుడు ఆటంకం క‌లిగించాడు. భారీ వ‌ర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో తదుపరి ఆట సాధ్యం కాలేదు.  ఔట్ ఫీల్డ్ చిత్త‌గా మారింది. మైదానాన్ని ప‌రీక్షించిన అంఫైర్లు ఆట కొససాగించడం సాధ్యం కాదని తేల్చేశారు. దీంతో డ‌క్త్‌వ‌ర్త్ లూయిస్ ప్ర‌కారం మ్యాచ్  టై అయ్యింది. డీఎల్ఎస్ ప్రకారం మ్యాచ్ టైగా ముగియడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే .. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 9  ఓవర్లలో విజయానికి భారత్   76 ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా.. సరిగ్గా అందుకు ఒక్క పరుగు వెనుక బడింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది.  దీంతో మూడు టీ20ల సిరీస్‌లో భార‌త్ 1-0 ఆధిక్యంతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.  తొలి టీ20 మ్యాచ్ వ‌ర్షార్పణం కాగా. . రెండో టీ20లో భార‌త్ ఘన విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. టైగా ముగిసిన ఈ మ్యాచ్ లో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా సిరాజ్‌ నిలిచాడు. కాగా  ప్లేయర్ ఆఫ్ ది సిరీస్  సూర్య‌కుమార్ యాదవ్ కు దక్కింది.   161 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేధించేందుకు బ‌రిలోకి దిగిన భార‌త్‌కు శుభారంభం ద‌క్క‌లేదు. ఇషాన్ కిష‌న్‌(10), పంత్‌(5), సూర్య‌కుమార్ యాద‌వ్(13) లు స్వ‌ల్ప స్కోర్ల‌కే వెనుదిర‌గ‌డంతో భార‌త్ 21 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య‌(30 నాటౌట్‌; 18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) దంచికొట్టాడు. అత‌డికి దీప‌క్ హుడా (9 బంతుల్లో 9 నాటౌట్ ) చ‌క్క‌ని స‌హ‌కారం అందించాడు. అయితే.. తొమ్మిదో ఓవ‌ర్ పూర్తి కాగానే వ‌రుణుడు త‌న ఆట మొదలెట్టేశాడు. అంతకు ముందు న్యూజిలాండ్ 19.4 ఓవ‌ర్ల‌లో 160 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కివీస్ బ్యాట‌ర్ల‌లో కాన్వే(59; 49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ఫిలిప్స్‌(54; 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కాల‌తో రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్‌లు చెరో నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, హర్ష‌ల్ ప‌టేల్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. ఒక బ్యాటర్ రనౌట్ అయ్యాడు.

మెగా దన్ను కోసం కమల నాథుల ఫీట్లు

మెగా ఫ్యామిలీ దన్ను కోసం కమనాథులు తహతహలాడిపోతున్నారు. మొన్నామధ్యన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శివారులో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని కేంద్రం పెద్దలు ప్రత్యేకంగా ఆహ్వానించారు. కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి చిరంజీవికి ప్రత్యేకంగా ఆహ్వానం అందించారు. ఆ వేదికపై చిరంజీవి పట్ల మోడీ కనబర్చిన ప్రేమ, ఆప్యాయత అందరి కళ్లకూ స్పష్టంగా కనిపించింది. ఇటీవలే.. ప్రధాని మోడీ విశాఖపట్నంలో పర్యటించారు. ఆ సందర్భంగా జనసేన అధినేత, చిరంజీవి సోదరుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా పిలిపించుకున్న ప్రధాని మోడీ అరగంటకు పైగా ఆయనతో చర్చలు జరిపారు. తాజాగా ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్- 2022’కి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవిని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా ప్రశంసలతో ముంచెత్తడం విశేషం. మోడీయే స్వయంగా అభినందించడంతో మురిసిపోయిన చిరంజీవి కూడా ప్రధానికి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకు ముందు చాలా నెలల క్రితం చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ కావడం కూడా గమనార్హం. వారి భేటీ సందర్భంగా పలు విషయాలు చర్చించినట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. తెలంగాణలో అధికార పీఠంతో పాటు ఏపీలో ఎలాగైనా తన ఉనికిని చాటుకోవాలనే వ్యూహంతో భారతీయ జనతాపార్టీ పెద్దలు పెద్ద వ్యూహమే రచించినట్లు కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన మెగాస్టార్ కుటుంబాన్ని ఇప్పుడు తన రాజకీయ వ్యూహంలో భాగంగా వాడుకోవాలనేది కమలం నేతల ప్లాన్ గా ఉందని అంటున్నారు. అందుకే సందర్భం వచ్చినప్పుల్లా మెగా ఫ్యామిలీని ప్రసన్నం చేసుకోవడానికి ఓ రేంజ్ లో ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవికి ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువే. ఆయన ఒక్క మాట చెబితే.. కోట్ల ఓట్ల దండలు తన మెడలో పడతాయని బీజేపీ పెద్దలు మైండ్ లో ఫిక్స్ అయినట్లున్నారు. అందుకే మెగాస్టార్ ఫ్యామిలీకి బీజేపీ అగ్రనేతలు ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. ఇక పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఎలాగూ తమ మిత్రపక్షమే కాబట్టి.. పవర్ స్టార్ కు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్యలో ఉన్న అభిమానులంతా ఆయన ఏది చెబితే అది చేస్తారనేది బీజేపీ నమ్మకం. అందుకే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను మరికాస్త మచ్చిక చేసుకోవడానికే మొన్న విశాఖలో ప్రధాని మోడీ టూర్ లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చి మరీ భేటీ అవడం విశేషం. అప్పుడు ఎప్పుడో 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ప్రధాని మోడీ వేదికలు పంచుకున్నారు. ఆ తర్వాత మిత్రపక్షం అధినేత అయినా అప్పటి నుంచి మళ్లీ ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ తో మోడీ భేటీ అయింది లేదు. ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ పవర్ ఎలా ఉండబోతోందో ముందే పసిగట్టిన బీజేపీ పెద్దలు మళ్లీ ఆయనను భుజాన మోసేందుకు సిద్ధమైనట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చేస్తానని గట్టిగా చెప్పిన పవన్ కళ్యాణ్ స్వరం మోడీతో భేటీ అయిన తర్వాత మారిన వైనాన్ని జనం స్పష్టంగా గుర్తించారు. పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో బీజేపీని అడుగుతున్న ‘రోడ్ మ్యాప్’ విశాఖ భేటీలో మోడీ ఇచ్చి ఉంటారనే అంచనాలు బయటికి వచ్చాయి. అందుకే అప్పటిదాకా టీడీపీ- బీజేపీ, లెఫ్ట్ పార్టీలతో కలిసి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ మాట ఎత్తని వైనాన్ని గమనిస్తున్నారు. బీజేపీతో కలిసి వెళ్లే మార్గంలో పవన్ నడుస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసుకునేందుకు బీజేపీ డబుల్ ఇంజిన్ మోదీ-షా జోడీ మెగాస్టార్ ఫ్యామిలీపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నట్లు అవగతమవుతోందంటున్నారు. 2014 ఎన్నికల్లో జనసేనాని తోడ్పాటు తీసుకోవడంతో మెగాస్టార్ ఫ్యామిలీకి దగ్గరవడం మొదలైన బీజేపీ ప్రయాణం చిరంజీవి కోడలు ఉపాసన మోడీతో భేటీ అయిన తర్వాత మరింత సన్నిహితం అవుతోందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ మద్దతు కోసం కమలం పెద్దలు యత్నాలు చేస్తున్నారంటున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీలో ‘రాజకీయాలకు నేను దూరమైనా.. రాజకీయాలు నాకు దూరం కావడం లేదు’ అనే డైలాగ్ వచ్చిందంటున్నారు. దాంతో పాటు చిరంజీవి చదువుకున్న నర్సాపురంలోని వైఎన్ఎం కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి నోట ‘రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం. రాజకీయాల్లో సెన్సిటివ్ గా ఉండకూడదు. బాగా మొరటు తేలాలి. రాటు తేలాలి. మాటలు అనాలి.. అనిపించుకోవాలి. రాజకీయాలకు తమ్ముడు పవన్ కళ్యాణ్ తగినవాడు. అంటాడు.. అనిపించుకుంటాడు. మీ అందరి సహాయ సహకారాలు, ఆశీస్సులతో కచ్చితంగా ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ ను అత్యున్నత స్థానం మనం చూస్తాం’ అనడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. చిరంజీవి చేసిన ఈ రాజకీయ వ్యాఖ్యలు కాకతాళీయం కావనేది కొసమెరుపు.

గోల్డ్ ఫిష్.. అమ్మ బాబోయ్ ఎంత బరువో?

బంగారు వర్ణంతో మెరిసిపోయే గోల్డ్ ఫిష్ అంటే ఇష్టపడని వారెవరూ ఉండరు. ఇంట్లో ఆక్వేరియం ఉందంటే అందులో గోల్డ్ ఫిష్ ఉండి తీరాల్సిందే. అక్వేరియంలో బుల్లి బుల్లి గోల్డ్ ఫిష్ లు అలా అలా కదులుతూ ఉంటే.. ప్రపంచాన్ని మరచిపోయి అలా చూస్తుండి పోతారెవరైనా. ఇళ్లల్లో ఆక్వేరియంలో ఉండే గోల్డ్ ఫిష్ లను ఎంత  పౌష్టికాహారం ఇచ్చి పెంచినా వాటి బరువు మహా ఉంటే ఓ కేజీ కేజిన్నర వరకూ పెరుగుతుందేమో. అలా కాకుండా చెరువుల్లోనూ గోల్డ్ ఫిష్ లు పెంచుతుంటారు వాటి బరువు మహా పెరిగితే ఓ మూడు కేజీల బరువు పెరుగుతాయంతే. కానీ బ్రిటన్ లో మాత్రం ఓ వ్యక్తికి ఏకంగా 31కిలోల బరువున్న గోల్డ్ ఫిష్ దొరికింది.  ఫ్రాన్స్‌లోని చాంపేన్‌లో ఉన్న బ్లూవాట‌ర్ స‌ర‌స్సులో ఆండీ వ‌ల‌కు ఈ చేప చిక్కింది. లెద‌ర్ కార్ప్‌, కోయి కార్ప్ కు చెందిన  హైబ్రిడ్ ర‌క‌మే ఈ భారీ చేప. బ్రిటీష్ మ‌త్స్య‌కారుడు ఆండీ హాకెట్ వలకు చిక్కిన ఈ గోల్డ్ ఫిష్ ప్రపంచంతోనే అత్యంత బ‌రువైన గోల్డ్‌ఫిష్ గా రికార్డైంది. గతంలో అమెరికాలోని మిన్నసొట్టాలో దొరికిన గోల్డ్ ఫిష్ రికార్డును ఈ చేప చెరిపేసింది.   ద క్యారెట్ అని ఈ గోల్డ్ ఫిష్ కుపేరు పెట్టారు.  

ప్రతికూలతలెన్నున్నా గుజరాత్ లో మళ్లీ బీజేపీదే అధికారం

ప్రస్తుతం దేశం దృష్టి గుజరాత్ పై కేంద్రీకృతమై ఉంది. గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెల మొదటి వారంలో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ వరుసగా ఆరు సార్లు విజయం సాధించి ఏడో సారి కూడా గుజరాత్ లో అధికార పీఠం దక్కించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ ఉండగా.. రాష్ట్రంలో కాంగ్రెస్, ఆప్ పార్టీలు గట్టి పోటీనిస్తూ బీజేపీ విజయ పరంపరకు చెక్ పెట్టాలన్న దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గుజరాత్ ఎన్నికలపై పలు సంస్థలు సర్వేలు చేసి ఫలితాలు వెలువరించాయి. అయితే విశేషం ఏమిటంటే ఒక్కో సర్వేఒక్కో లాంటి ఫలితాన్ని వెలువరించింది. దీంతో గుజరాత్ లో పీఠం ఎవరిది? అన్న ఉత్కంఠ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆత్మసాక్షి సంస్థ  మూడ్ ఆఫ్ గుజరాత్ పేర తన తాజా సర్వే ఫలితాన్ని వెలువరించింది. సోమవారం (నవంబర్ 21)త ఆత్మసాక్షి సర్వే సంస్థ తన సర్వే ఫలితాలన ప్రకటించింది. ఈ సర్వే మేరకు బీజేపీ 101 నుంచి 106 స్థానాలలో, కాంగ్రెస్  65  నుంచి 68 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. ఇక ఎన్నో అంచనాలతో గుజరాత్ బరిలో దిగిన ఆప్ కేవలం  9 నుంచి 10 స్థానాలకే పరిమితమౌతుంది. ఇతరులు 3 నుంచి 4 స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయి. ఇక ఓట్ల పరంగా చూసుకుంటే బీజేపీకి 42శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ 38, ఆప్ 16 నుంచి 17 శాతం ఓట్లు దక్కించుకుంటాయి. ఇతరులకు 3 నుంచి 4 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది.  182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో అధికారం దక్కించు కోవాలంటే కనీసం 92 స్థానాలలో విజయం సాధించాల్సి ఉంటుంది. ఆత్మసాక్షి సర్వే ప్రకారం బీజేపీ సునాయాసంగా ఆ మ్యాజిక్ ఫిగర్ ను దాటేస్తుంది. అయితే  గత  ఆరు దఫాలుగా గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి తీవ్రమైన యాంటీ ఇన్ కంబెన్సీ ఎదుర్కొంటోంది. అలాగే బీజేపీకి తిరుగుబాటు అభ్యర్థుల బెడద కూడా అధికంగా ఉంది. వీటికి తోడు నిరుద్యోగం, అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలు, స్కూళ్ల మూత, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, మరీ ముఖ్యంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అధికార పార్టీ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం మెండుగా ఉంది. అలాగే గుజరాత్ లో లిక్కర్ మాఫియా ప్రభావం కూడా బీజేపీకి నష్టం చేస్తుందని సర్వే పేర్కొంది. రాష్ట్రంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బీజేపీలో విద్యుత్ చార్జీలు అధికం, అలాగే గత నాలుగేళ్లుగా ప్రభుత్వ రంగంలో ఎటువంటి నియామకాలూ లేకపోవడం కూడా ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకతకు కారణంగా ఉంది. అలాగే బీజేపీకి దన్నుగా ఉండే పటేదార్ సామాజిక వర్గ ఓట్లు ఈ సారి కాంగ్రెస్, బీజేపీల మధ్య చీలిపోనుండటం కూడా అధికార పార్టీకి ఏదో ఒక మేర నష్టం చేకూరుస్తుందని సర్వే పేర్కొంది. అలాగే ఎస్సీఎస్టీల మద్దతు బీజేపీ కంటే కాంగ్రెస్ కే ఎక్కవగా ఉండటం కూడా అధికార పార్టీకి కొంత మేర నష్టం చేకూరుస్తుంది.  ఇక బీజేపీకి కలిసి వచ్చే అంశాలకు వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)  పోటీలో ఉండటం వల్ల బీజేపీకి ఒకింత ప్రయోజనం చేకూరుతుందని సర్వే విశ్లేషించింది. ఆప్ బీజేపీ ఓట్ల కంటే కాంగ్రెస్ ఓట్లను ఎక్కువగా చీలుస్తుందని సర్వే పేర్కొంది. దీంతో కాంగ్రెస్ ఎంతగా పుంజుకున్నా ఆప్ పోటీ కారణంగా భారీగా నష్టపోతుందని సర్వే పేర్కొంది. అహ్మద్ పటేల్ మరణం తరువాత కాంగ్రెస్ నాయకత్వ లోపంతో ఇబ్బంది పడుతోందని, క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ పెద్దగా చురుకుగా పని చేయడం లేదని ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. అదే బీజేపీ వద్దకు వచ్చే సరికి బూత్  స్థాయిలో ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. రాష్ట్రంలో ఆప్ పోటీలో ఉండటం వలనే బీజేపీ మరో సారి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగయ్యాయని సర్వే పేర్కొంది. 

అండర్ గ్రౌండ్ కు ఎంపీ సంతోష్? కేసీఆర్ సూచన మేరకేనా?

ఢిల్లీ లిక్కర్ స్కాం తెరాసలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్పుడు ఎవరిని ఈడీ విచారణకు పిలుస్తుందా అన్న గుబులు తెరాస ముఖ్య నేతలలో మొదలైంది. ఈ స్కాం బయట పడినప్పటి నుంచీ పెద్దగా ఎక్కడా బయట కనిపంచకుండా తిరుగుతున్న తెరాస ఎంపీ సంతోష్ ఇప్పుడు పూర్తిగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ నజర్ సంతోష్ మీద ఉందని విశ్వసనీయంగా తెలిసిన సమాచారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సలహా మేరకే సంతోష్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. ఈ కుంభకోణంలో తెరాస అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి విదితమే. ఢిల్లీ మద్యం కుంభకోణం బయటపడగానే దాని మూలాలు తెలంగాణలోనే ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలకు అనుగుణంగానే ఆ కుంభకోణం కేసు తీగ లాగితే మూలాలు తెలంగాణలో బయటపడ్డాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత, ఆయన సమీప బంధువు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ సహా తెరాస అధినాయకత్వానికి సన్నిహితులకు ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసు విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)   హైదరాబాద్’లో పలుచోట్ల తనిఖీలు జరిపింది. కొందరికి నోటీసులు జారీ చేసింది. కొందరిని అరెస్టు చేసింది. కవిత, సంతోష్ సహా మరి కొందరు ముఖ్యులకు సన్నిహితులైన వారికి కూడా అరెస్టు చేసింది.  కాగా ఈ స్కాం కు సంబంధించి తెలంగాణలొ   తెరాస అగ్రనేతలకు సన్నిహితుడైన బోయనపల్లి అభిషేక్  అరెస్టు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ అరెస్టుతో కవిత, సంతోష్ రావులకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో లింకులున్నాయన్న ఆరోపణలకు బలం చేకూరినట్లైంది. ఈ నేపథ్యంలోనే  నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ కు, ఇటీవలి కేసీఆర్ పది రోజుల హస్తిన పర్యటనకు లింకు ఉందా? ఈ రెండింటి వెనుకా ఉన్నది ఢిల్లీ లిక్కర్ స్కామేనా? ఆ స్కామ్ నుంచి తన బిడ్డ కవితను, సమీప బంధువు సంతోష్ ను బయటపడేయాలన్న కేసీఆర్ ప్రయత్నాలు విఫలం కావడమే కొనుగోలు డ్రామాకు కారణమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కేసీఆర్ ఇటీవల హఠాత్తుగా చెప్పాపెట్టకుండా హస్తిన వెళ్లి అక్కడ పది రోజుల బస చేసి అక్కడ చేసిందేమిటన్న విషయంపై సస్పెన్స్ విడిపోయిందంటున్నారు. ఆయన హస్తిన పర్యటన తిమ్మిని బిమ్మిని చేసైనా సరే ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి తన బిడ్డ కవితను, సంతోష్ ను బయటపడేయడాని ఆయన చేయని ప్రయత్నం లేదని అంటున్నారు.  తన హస్తిన పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలవడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదనీ, కేసీఆర్ కు అప్పాయింట్ మెంట్ ఇచ్చేందుకు కూడా అమిత్ షా ఇష్టపడలేదని అంటున్నారు. దీంతో దిక్కు తోచని కేసీఆర్  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి గవర్నర్ నరసింహన్ ను తన దూతగా అమిత్ షా వద్దకు పంపారని,   అయితే నరసింహన్ ప్రతిపాదన వినగానే అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారనీ,  ఆల్ మోస్ట్ గెటౌట్ అంటూ అవమానించారనీ చెబుతున్నారు.  అదంతా పక్కన పెడితే ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో సంతోష్ కు సమన్లు జారీ అయ్యే అవకాశాలున్నాయని, ఈడీ నెక్స్ట్ టార్గెట్ సంతోషేనని కేసీఆర్ కు విశ్వసనీయంగా తెలియడంతోనే కేసీఆర్ సంతోష్ ను కొద్ది రోజుల పాటు అజ్ణాతంలోకి వెళ్లాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. ఆయన సూచన మేరకే సంతోష్ అండర్ గ్రౌండ్ కు వెళ్లారంటున్నారు. ప్రస్తుతం సంతోష్ తన సెల్ ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసేసి ఎవరికీ అందుబాటులో లేకుండా అండర్ గ్రౌండ్ కు వెళ్లి పోయారంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన వారి కస్టడీని పొడగించడంతోనే కేసీఆర్ సంతోష్ ను అజ్ణాతంలోకి వెళ్లాల్సిందిగా సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు.అలాగే తన కుమార్తె కవితను కూడా బీఆర్ఎస్ నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా సలహాదారు పేరు చెప్పి హస్తినకే పరిమితం చేశారని అంటున్నారు. 

మంత్రి తలసాని సన్నిహితుల చుట్టూ ఈడీ ఉచ్చు

చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసు దర్యాప్తు మొత్తం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ నోటీసులు జారీ చేస్తున్న వారు, విచారణకు పిలుస్తున్న వారిలో అత్యధికులు తలసాని సంబంధీకులే కావడంతో ఈ అనుమానాలు వ్యక్త మౌతున్నాయి. ఇప్పటి వరకూ చీకోటి ప్రవీణ్ కేసుకు సంబంధించి తెలంగాణలో ఈడీ నోటీసులు అందుకున్న వారు కానీ, విచారణకు హాజరైన వారు కానీ చాలా వరకూ తలసాని సంబధీకులు, ఆయన ఆర్థిక వ్యవహారాలుచూసే వారే కావడం గమనార్హం. ఈడీ ఇప్పటి వరకూ ఆయనకు నోటీసులు ఇవ్వలేదన్నమాటే కానీ ఆయన ఇద్దరు సోదరులు, వ్యక్తిగత కార్యదర్శిలను ఈడీ నోటీసులు జారీ చేసి పిలిపించుకుని మరీ ప్రశ్నించింది. ఒక దశలో తలసాని కుమారుడికీ ఈడీ నోటీసులు జారీ చేసినట్లు విస్తృతంగా ప్రచారమైంది. అయితే.. అది వాస్తవం కాదనీ, ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులూ రాలేదనీ తలసాని కుమారుడు స్పష్ట చేశారు. ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్న తనను బదనాం చేసే ప్రయత్నాలు చేయవద్దని ఆయన ట్వీట్ చేశారు. ఆయనకు నోటీసులు వచ్చాయా? లేదా అన్నసంగతి పక్కన పెడితే.. చీకోటి ప్రవీణ్ తో తలసానికి సన్నిహిత సంబంధాలున్నాయని ఈడీ గట్టిగా నమ్ముతోంది. అంతెందుకు చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసులో మంత్రి తలసాని చుట్టూ ఉచ్చు బిగుస్తోందని తెరాస వర్గాలలోనే చర్చ జరుగుతోంది. అయితే తలసానికి నేరుగా ఈ కేసులో సంబధాలు ఉన్నట్లు రుజువు అయ్యే అవకాశాలు లేవన్న చర్చా సాగుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తలసాని ఆర్థిక వ్యవహారాలన్నీ తన సన్నిహితుల పేరు మీదే ఉంటాయనీ అంటున్నారు. ఆ కారణంగానే ఇప్పటి వరకూ తలసానికి ఈడీ నోటీసులు జారీ చేయలేదని చెబుతున్నారు. కానీ క్యాసినో కేసులో తలసాని సన్నిహితులకు ఉచ్చు బిగిసిందనే పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేసి విచారణ సాగిస్తున్న వారంద గురించీ చీకోటి ప్రవీణ్ విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగానే ఈడీ ప్రశ్నిస్తోందని అంటున్నారు. చీకోటి ప్రవీణ్   కస్టమర్ల ఖాతాలను బయటకు తీసి.. వారి ఆర్థిక లావాదేవీలపైనే విచారణ కేంద్రీకృతమై ఉండటంతో ఈడీ నోటీసులు అందుకున్న వారంతా ఆందోళనలో ఉన్నారంటున్నారు.

చిరుకు పురస్కారం.. బీజేపీ వ్యూహమేనా?

మెగాస్టార్ చిరంజీవి.. నటుడిగా ఆయనకు పురస్కారాలు దక్కడం ఎవరూ అభ్యంతర పెట్టరు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఆయనను వరించడం ఆయన నటనా కిరిటంలో మరో కలికితురాయి అనడంలో సందేహం లేదు. కానీ ఆ తరువాత మోడీ ఇత్యాదుల అభినందనలతోనే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈ పురస్కారం విషయంలో కూడా రాజకీయ లెక్కలు వేసుకుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే ప్రతి ఏటా ఇచ్చే ఒక అవార్డు చిరంజీవికి దక్కడం వల్ల ఆయనకు కొత్తగా ఒరిగేదేమీ ఉండదు. ఆయన నటనా వైదుష్యానికి ఇలాంటి పురస్కారాలతో మెరుగులు అద్దినట్లు కావు. పద్మ విభూషన్ చిరంజీవి నటుడిగా తన ప్రతిభ, ఘనత ఏమిటన్నది ఇప్పటికే రుజువు చేసుకున్నారు. అయితే చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం తరువాత బీజేపీ నేతలు చేస్తున్న హంగామా, హడావుడే.. దీని వెనుక ఆ పార్టీ ఏదైనా రాజకీయ ప్రయోజనం ఆశిస్తోందా అన్న అనుమానాలకు తావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా చిరంజీవిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఏపీ బీజేపీ కూడా అభినందనలు తెలిపింది. ఈ పురస్కారం ద్వారా చిరంజీవిని ‘తమ’ వాడు చేసేసుకున్నామని బీజేపీ బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోందా అనిపించక మానదు. ఇక ఒక్క సారి వెనక్కు వెళ్లి చూస్తే.. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు మోడీ భీమవరం వచ్చినప్పుడు ప్రత్యేకంగా చిరంజీవిని ఆహ్వానించి.. ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇక చిరంజీవి సోదరుడు, జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటికే బీజేపీ తో  మైత్రిలో ఉన్నారు.   ఈ నేపథ్యంలోనే చిరంజీవిని బీజేపీ ప్రత్యేక ప్రాముఖ్యతతో చూస్తోందని అంటున్నారు. చిరంజీవి కూడా ఇటీవలి కాలంలో తాను రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లుగా చెప్పకపోయినా.. రాజకీయ ఆసక్తి మాత్రం కనబరుస్తున్నారు. తన కంటే రాజకీయాలలో తన సోదరుడు మెరుగ్గా రాణిస్తారనీ, ఆయన గొప్ప స్థానానికి వెళతారనీ ఇటీవలే చెప్పారు.  భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో మోడీ చిరంజీవికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రత్యేకంగా ఉంది. చిరంజీవి తనకు ఎంతో ఆప్తమిత్రుడన్నట్లుగా మీడీ తీరు ప్రస్ఫుటమైంది. తర్వాత కూడా ఈ పాజిటివ్ ఫీలింగ్ ఉండేలా బీజేపీ వ్యవహరిస్తోంది.   చిరంజీవి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినా రాకపోయినా ఆయన కరిష్మాను బీజేపీ పూర్తిగా ఉపయోగించుకునేందకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేనతో పొత్తులో ఉండి కూడా.. సినీ గ్లామర్ మరింత ఎక్కువగా వచ్చే ఎన్నికలలో తమకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అందరివాడు చిరంజీవిని తమ వాడుగా ప్రొజెక్ట్ చేసుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద ఏపీ రాజకీయాలలో పవన్ కల్యాణ్ ఒక్కడే కాకుండా చిరంజీవిని కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని చెబుతున్నారు. మరి ఆ వ్యూహాలు ఫలిస్తాయా? లేదా అన్నది రానున్న రోజులలో తేలుతుంది. ప్రస్తుతానికైతే రాజకీయాలకు దూరంగా ఉన్నానంటూనే చిరంజీవి పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్ భేషుగ్గా ఉంటుందంటూ జోస్యాలు చెబుతున్నారు. 

సిరీస్ పై టీమ్ ఇండియా కన్ను.. న్యూజిలాండ్ తో చివరి టి20 నేడే

న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు టి20ల సిరీస్ లో ఇప్పటికే భారత్ 1-0 ఆధిక్యతతో ఉంది. చివరిదైన మూడో వన్డే మంగళవారం (నవంబర్ 21)న జరగనుంది. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చిన ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షార్పణం అయిన సంగతి విదితమే. రెండో మ్యాచ్ లో టీమ్ ఇండియా న్యూజిలాండ్ పై సునాయాస విజయం సాధించింది. సూర్యకుమార్ ఆకాసమే హద్దుగా చెలరేగి అజేయ శతకం చేయడంతో టీమ్ ఇండియా 65 ప‌రుగుల భారీ ఆధిక్యతతో విజయం సాధించింది. ఇక చివరిదైన మూడో టి20 మ్యాచ్ లో కూడా విజయం సాధించి 2-0తో సిరీస్ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. మరో వైపు న్యూజిలాండ్ ఎలాగైనా సిరీస్‌ను స‌మం చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉంది. అయితే.. ఆ జ‌ట్టు.. కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్   వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండటంలేదు. దీంతో  సౌథీ సారథ్యంతో న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతోంది. భారత్ విజయం సాధించిన మ్యాచ్ లో న్యూజిలాండ్ కు, భారత్ కు ఉన్న ఒకే ఒక తేడా సూర్య కుమార్ యాదవ్. సూర్యకుమార్ యదవ్ విజృంభణే మ్యాచ్ ఫలితం టీమ్ ఇండియాకు అనుకూలంగా వచ్చేలా చేసింది.  సూర్యకుమార్ యాదవ్ ను మినహాయిస్తే మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. మంగళవారం (నవంబర్ 21) జరిగే మ్యాచ్ లో కూడా సూర్య కుమార్ యాదవ్   మ్యాజిక్ రిపీట్ చేస్తే టీమ్ ఇండియాకు తిరుగే ఉండదు. అయితే మిగిలిన బ్యాటర్లు కూడా ఫామ్ అందిపుచ్చుకోవాలని టీమ్ ఇండియా ఆశిస్తోంది. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పామ్ అందిపుచ్చుకుని రాణించాల్సి ఉంది. రెండో మ్యాచ్‌లో ఆడిన జ‌ట్టుతోనే ఈ మ్యాచ్‌లోనూ భార‌త్ బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది.  అదే జ‌రిగితే మ‌రోసారి సంజు శాంస‌న్‌, ఉమ్రాన్ మాలిక్‌, శుభ్‌మ‌న్ గిల్‌లు బెంచీకే ప‌రిమితం కాక‌త‌ప్ప‌దు. మార్పులు చేయాల‌ని భావిస్తే శ్రేయాస్ స్థానంలో సంజుకు అవ‌కాశం ఇవ్వొచ్చు. కెప్టెన్‌గా త‌న‌దైన ముద్ర వేయాల‌ని భావిస్తున్న హార్ధిక్ తుది జ‌ట్టులో ఎవ‌రికి చోటు ఇస్తాడో చూడాల్సిందే. 

మంగ్లికీ ఓ సలహాదారు పదవి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సలహాదారుల పదవుల నియామక మేళా జరుగుతోంది. వారానికి ఇద్దరు చొప్పున సలహాదారు పదవులలో నియమితులౌతున్నారు. ఎవరేమనుకుంటే నాకేం.. అంతా నా యిష్టం అన్న రీతిలో విమర్శలను పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వ సలహాదారుల నియామకాల జోరు పెంచేస్తున్నారు.  తాజాగా ప్రముఖ గాయని మంగ్లీని ఏపీ ప్రభుత్వం ఓ సలహాదారు పదలో నియమించింది. ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురికి పదవులిస్తూ ప్రోత్సహిస్తున్నారు సీఎం జగన్. అలీ, పోసాని మురళిలక సలహాదారు పదవులు ఇచ్చిన జగన్ తాజాగా   మంగ్లీకి కూడా అలాంటి అవకాశమే ఇచ్చారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డ్ అడ్వైజర్ గా మంగ్లీని నియమించారు. వాస్తవానికి ఈ ఏడాది మార్చిలోనే మంగ్లిని సలహాదారుగా నియమిస్తూ ఎస్వీబీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్వీబీసీ అనగానే ధర్టీ ఇండస్ట్రీస్ పృధ్వికి జరిగిన మర్యాద గుర్తొచ్చిందో ఏమో ఉత్తర్వులు వెలువడినా మంగ్లీ మాత్రం ఇంత వరకూ బాధ్యతలు చేపట్ట లేదు. చివరకు సమాధానపడి, నాలుగు రోజుల క్రితమే ఆమె ఎస్వీబీసీ బోర్డు సలహాదారులగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో మంగ్లీకి లక్ష రూపాయల జీతం ఫిక్స్ చేసింది జగన్ సర్కార్. ఇవి కాకుండా ఇతర ఫెసిలిటీస్ అదనం. ఎస్వీబీసీ బోర్డ్ సలహాదారు పదవిలో మంగ్లీ రెండేళ్లపాటు  కొనసాగుతారు. ఆమె తిరుపతికి వచ్చే సమయంలో వాహన సౌకర్యం, వసతి సౌకర్యం కల్పిస్తారు. అయితే ఈ నియామకంపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. అటు మంగ్లీ కూడా తనకు పదవి వచ్చిన విషయంపై కానీ, పదవీ బాధ్యతలు చేపట్టిన విషయంపై కానీ స్పందించలేదు. ఈనెల 17న తిరుమలకు వచ్చి రెండురోజులపాటు అక్కడే ఉండి శ్రీవారిని దర్శించుకున్నారు గాయని మంగ్లీ. అదే సమయంలో ఆమె ఎస్వీబీసీ బోర్డ్ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా అలీని ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణ మురళిని నియమించిన సంగతి విదితమే. కాగా ఎస్వీబీసీ బోర్డు సలహాదారులగా మంగ్లి నియామకం పట్ల మంత్రి రోజా హర్షం వ్యక్తం చేశారు. ఆమెను అభినందిస్తూ రోజా తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. తనదైన ప్రత్యేకత చాటుకుంటూ గాయనిగా అశేష అభిమానులను సొంతం చేసుకున్న గాయని మంగ్లిని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ )కి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారుగా(ఎస్వీబీసీ) ఏపీ ప్రభుత్వం నియమించడం చాలా ఆనందంగా ఉంది. మంగ్లి తన సాంగ్స్ తో  స్వామిని స్మరిస్తూ మరిన్ని పాటలు పాడాలని కోరుకుంటున్నా.. ఆల్ ది బెస్ట్ మంగ్లీ అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు.

రాహుల్ వెడ్స్ అతియా షెట్టి వెరీ సూన్

టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. తన ప్రేయసి, బాలీవుడ్ హీరోయిన్ అతియా షెట్టిని త్వరలో మనువాడ బోతున్నాడు. ఈ విషయాన్ని రాహుల్, అతియా జంట స్వయంగా చెప్పారు. దీనినే అతియా షెట్టి తండ్రి, నటుడు సునీల్ షెట్టి ధృవీకరించాడు.   అయితే వివాహ తేదీ ఇంకా ఖరారు కాలేదని చెప్పాడు. తరచుగా క్రికెట్ సిరీస్ లతో రాహుల్ ఎక్కవగా విదేశీ పర్యటనల్లో ఉన్నందున, అతడికి ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు పెళ్లి చేసుకుంటారని సునీల్ షెట్టి  క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం హేరా ఫేరీ 3తో బిజీగా ఉన్న సునీల్ షెట్టీ అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నాడు కానీ అతియా షెట్టి మాత్రం 2019 తరువాత ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ప్రస్తుతం అతియా షెట్టి, కేఎల్ రాహుల్ లు లివిన్ రిలేషన్ లో ఉన్నారు. గత మూడేళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఆ విషయాన్ని వీరు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ రిలేషన్ ను వివాహ బంధంతో మరింత పటిష్టం చేసుకోనున్నారు.  

తెలుగు కెనడా 2022 మెగా వేడుకలు

టొరంటో: తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో (TCAGT) దీపావళి వేడుకలను కెనడా దేశం లోని అంటారియో రాష్ట్రం లోగల ఎటోబికో నగరంలోని డాంటే అలిగిరీ అకాడమీ పాఠశాలలో విజయవంతంగా నిర్వహించింది. మిసిసాగా, బ్రాంప్టన్, స్కార్బరో, కిచెనర్, వాటర్లూ, కేంబ్రిడ్జ్, హామిల్టన్, మిల్టన్, మార్కమ్, రిచ్మండ్ హిల్, లండన్, నయాగరా ఫాల్స్ మరియు ఇతర గ్రేటర్ టొరంటో ప్రాంతాల నుండి అనేక వందల మంది తెలుగు ప్రవాసులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు తమను తాము అభినందించుకోవడం మరియు మొదటిసారిగా చేరిన కొత్త వ్యక్తులను స్వాగతించడంతో ఈవెంట్ ప్రారంభమైంది. ఈ ఈవెంట్లో పాల్గొనడం వల్ల అందరి నుండి సంతోషం మరియు ఆనందం యొక్క మెరుపులతో విశేషమైన స్పందనలు వచ్చాయి. దీపావళి స్పెషల్ తెలుగు ఫుడ్ డిలైట్స్ యొక్క గొప్ప వెరైటీలను అందరూ ఆస్వాదించారు.   తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో (TCAGT) అతిథులు, స్పాన్సర్లు, సభ్యులు, కుటుంబాలు మరియు స్నేహితులకు స్వాగతం పలికే రంగురంగుల పూల డిజైన్లతో వేదికను పద్మిని కంటాబత్తిన వాలంటీర్ల సహాయంతో అలంకరించారు. డైరెక్టర్ మైత్రి కల్లూరి మరియు కిరణ్మయి బృందం హాజరైన వారికి గులాబీలు మరియు పన్నీరు చల్లుతూ స్వాగతం పలికారు. అనేక కుటుంబాలు TCAGT ఫోటో బూత్లో సాంప్రదాయకంగా మరియు రంగురంగులలో అధిక నాణ్యత గల వస్తువులతో అలంకరించబడిన మరియు అనుకూలీకరించిన చిత్రాలను తీసుకున్నారు.  దీపావళి పండుగ వేడుకలు "దీపారాధన" మరియు కెనడియన్, భారత జాతీయ గీతాలతో ప్రారంభమయ్యాయి. కార్యవర్గ సభ్యులు, ట్రస్టీలు భారతీయ సంప్రదాయ జ్యోతిప్రజ్వలన చేశారు.   TCAGT సెక్రటరీ శివప్రసాద్ యెల్లాల ప్రారంభోపన్యాసం చేసి కార్యక్రమాన్ని హైలైట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మాస్టర్ ఆఫ్ సెర్మనీస్గా టాలీవుడ్ సినీ నటి శ్రీమతి జయలక్ష్మి హరిదాసు, విశాల్ బెజవాడలను ఆయన ఆహ్వానించారు. ట్రస్టీ జగన్ పైడిపర్తి, మాజీ కార్యదర్శి శైలజ శుభాకాంక్షలు అందించారు. జగన్ మరియు శైలజ గారు రాజేశ్వరరావు వీరల్లా (బంజారా ఇండియన్ రెస్టారెంట్ యజమాని) ని పూల బొకేతో సత్కరించారు. కెనడాలో వందలాది కొత్త కుటుంబాలు మరియు వారి విజయవంతమైన కెరీర్లను చూడటం పట్ల రాజేశ్వరరావు గారు తన సందేశంలో సంతోషాన్ని వ్యక్తం చేశారు. TCAGT ప్రెసిడెంట్ శ్రీమతి దేవి చౌదరి తన శుభాకాంక్షలు అందించారు. ఆమె స్వాగత ప్రసంగంలో అసోసియేషన్లో తన ప్రమేయం మరియు భాగస్వామ్యాన్ని గుర్తు చేసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె అద్భుతమైన వృద్ధిని మరియు భారతీయ సంస్కృతి మరియు సాహిత్యం యొక్క గొప్పతనాన్ని చూసింది. గత 34 సంవత్సరాలుగా, TCAGT తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని కలుసుకోవడానికి, నెట్వర్క్ చేయడానికి మరియు వాటిని తరువాతి తరాలకు అందించడానికి వేదికను అందించింది. ఈవెంట్లో భాగమైనందుకు ఎగ్జిక్యూటివ్ కమిటీ, ట్రస్టీలు, సలహాదారులు, స్పాన్సర్లు మరియు స్నేహితులను ఆమె గుర్తించి, ఈవెంట్ను గ్రాండ్గా విజయవంతం చేయడం కోసం బృందంగా సహకరించిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు నాట్యం గ్రూప్ డ్యాన్స్ వర్క్షాప్ సహాయంతో ప్రొఫెషనల్ టాలీవుడ్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ మరియు కూచిపూడి క్లాసికల్ డ్యాన్సర్ జయలక్ష్మి గారు కొరియోగ్రాఫ్ చేసిన అద్భుతమైన నృత్య ప్రదర్శనలు కూడా ఉన్నాయి. కపుల్స్ ఫ్యాషన్ షో పోటీలు, జుగల్బంధీ గ్రూప్ టాలీవుడ్ డ్యాన్స్ అంశాలు మరియు ఇతర డ్యాన్స్ మెలోడీలు కమ్యూనిటీ సభ్యులందరినీ ఉర్రూతలూగించాయి.  ఈ కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్ మరియు TCAGT మాజీ చైర్మన్ అయిన సూర్య బెజవాడ శుభాకాంక్షలు తెలిపారు. తన సందేశంలో, TCAGT అన్ని తెలుగు కుటుంబాలకు వారి పిల్లల ప్రతిభను, యువశక్తిని మరియు తల్లిదండ్రుల కనెక్షన్లను, నెట్వర్క్ను మెరుగుపరచడానికి మరియు వివిధ రంగాలలో ఆసక్తిని కలిగించే అవకాశాలను అన్వేషించడానికి ఒక వేదికగా ఉందని హైలైట్ చేశారు. TCAGT అవసరమైన కుటుంబాలకు గొప్ప సహాయాన్ని అందించింది, కేవలం రెండు వారాల వ్యవధిలో జీవించి ఉన్న యువ జీవిత భాగస్వామికి సహాయం చేయడానికి సంస్థ అరవై-ఐదు వేల డాలర్లకు పైగా సేకరించిన సంఘటనలను పేర్కొంది. రాబోయే అన్ని TCAGT ఈవెంట్లు మరియు కార్యకలాపాల్లో చేరాలని మరియు పాల్గొనాలని కొత్త సభ్యులను ఆయన ఆహ్వానించారు. సూర్య బెజవాడ TCAGT నాయకత్వాన్ని తనతో కలిసి గౌరవ కాన్సుల్ జనరల్ శ్రీమతి అపూర్వ శ్రీవాస్తవ గారిని సన్మానించవలసిందిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ భారత కాన్సులేట్ జనరల్ శ్రీమతి అపూర్వ శ్రీవాస్తవ గారిని ఆయన పరిచయం చేశారు. తన శుభాకాంక్షలలో, ఆమె తెలుగు కమ్యూనిటీ యొక్క శక్తిని ప్రస్తావించింది మరియు ఈ ఈవెంట్ వేడుకలలో ఇండో-కెనడియన్ యువత పాల్గొనడం ద్వారా తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని మరియు భారతీయ సంప్రదాయాలను కాపాడుతున్నందుకు TCAGT కమిటీని ప్రశంసించారు. ఆమె స్పాన్సర్ వ్యాపార స్టాల్స్ను సందర్శించి, కెనడాలో దిగుమతి చేసుకున్న మరియు పంపిణీ చేయబడిన భారతీయ ఉత్పత్తుల మూలాన్ని అడిగి తెలుసుకున్నారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)కి ప్రత్యేక అతిథిగా భారతీయ చలనచిత్ర దిగ్గజాలను ఆహ్వానించడానికి అనేక ఎంపికలు ఉన్నప్పుడు, చివరికి అది విజయవంతమైన తెలుగు చలనచిత్ర పాన్ ఇండియా అత్యధిక పారితోషికం పొందిన దర్శకుడు, RRR మరియు బాహుబలి ఆర్కిటెక్ట్ S. S. రాజమౌళికి వెళ్లిందని ఆమె గుర్తుచేసుకుంది. ప్రత్యేక అతిథిగా అతని హాజరు TIFFలో చరిత్ర సృష్టించింది. గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ అంతా టాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్స్ను ఆదరించడం గర్వించదగ్గ క్షణం. ఎవర్ ఎనర్జిటిక్ సింగర్స్ శ్రీకాంత్ సండుగు, శృతి నండూరి లచే నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ తో మెగా మ్యూజికల్ నైట్ జరిగింది. టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ జయలక్ష్మి హరిదాసు మరియు మాధవ్ బెజవాడ అందించిన కూచిపూడి డ్యాన్స్ బ్యాలెట్ వరూధిని ప్రవరాఖ్య ప్రదర్శన సాయంత్రం హైలైట్లలో ఒకటి మరియు అన్ని వయసుల వారు బాగా ఆస్వాదించారు మరియు ఇది తెలుగు వైభవాన్ని వేదికపైకి తీసుకువచ్చింది. భారతదేశానికి చెందిన కూచిపూడి క్లాసికల్ మాస్ట్రో కళారత్న డా.కె.వి.సత్యనారాయణ గారు ఈ ప్రత్యేక నృత్యానికి కొరియోగ్రఫీ, సంగీతం, శిక్షణ మరియు కంటెంట్ అందించారు. యష్ మరియు టీమ్ అందించిన ప్రత్యేక టాలీవుడ్ కలర్ఫుల్ ఎలక్ట్రిఫైయింగ్ మెడ్లీ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఆడిటోరియం మొత్తాన్ని సూపర్ఛార్జ్ చేసింది మరియు ప్రతి ఒక్కరికి కాలు కదపడానికి మరియు సరిపోయేలా కొన్ని క్రేజీ డ్యాన్స్ మూవ్లను చూపించింది. కపుల్స్ ఫ్యాషన్ షో పోటీలకు అధ్యక్షురాలు దేవి చౌదరి నగదు పురస్కారాలను అందజేశారు. మొదటి బహుమతిని సింహకృష్ణ మరియు తేజస్విని దంపతులు, రెండవ బహుమతిని కోటి అవారి మరియు హేమ అవారి గెలుచుకున్నారు. ట్రస్టీ చైర్మన్ కోటేశ్వరరావు, ప్రియా పోలవరపు, రావు వఝా, విజయలక్ష్మి, మాజీ అధ్యక్షుడు రాజేష్ విస్సా, శ్రీవాణితో పాటు పలువురు ముఖ్య నాయకులు అబ్బురపరిచే వేడుకల్లో పాల్గొన్నారు. రాజేష్ విస్సా ధన్యవాదాలు తెలిపారు. నిజానికి, ఈవెంట్ అన్ని రంగాలలో వినోదం, ఉత్సాహం మరియు శక్తిని తీసుకువచ్చింది. శైలజ పైడిపార్టీ, శ్రీవాణి, పద్మిని మరియు అనిత బెజవాడ ఇతర వాలంటీర్లతో కలిసి తాజాగా తయారు చేసిన ఆహారపు ప్రామాణికమైన రుచుల కోసం ఆయన ఫుడ్ టీమ్ను అభినందించారు. నోరూరించే పండుగ ఆహారాన్ని ప్రజలు ఆస్వాదించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్, కూచిపూడి క్లాసికల్ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, యాంకర్ జయలక్ష్మి హరిదాసు మరియు స్టైలిష్ TCAGT యూత్ మెంబర్ విశాల్ బెజవాడ వారి అద్భుతమైన, ఇంటరాక్టివ్, ప్రేమగల, ఆకర్షణీయమైన ప్రతిభ మెగా ఈవెంట్కు హాజరైన ప్రేక్షకులను మరింత మంత్రముగ్ధులను చేసి చిరస్మరణీయంగా మార్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అన్నింటికంటే మించి, శ్రీకాంత్ మరియు శ్రుతి గాన ద్వయం వారి ఉత్తమ టాలీవుడ్ పాటలతో సాయంత్రాన్ని కదిలించారు. మెగా ఈవెంట్ను నిర్వహించడంలో విశేష కృషి చేసినందుకు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ట్రస్టీలు, స్పాన్సర్లు మరియు వాలంటీర్లను ఆయన అభినందించారు. సభ్యత్వాలు మరియు స్పాన్సర్ల సహాయం లేకుండా, TCAGT ఈ సంఘం ద్వారా తెలుగు కమ్యూనిటీకి అసాధారణమైన సేవను అందించలేదు. సంస్థాగత వృద్ధి, స్వయంసేవకంగా మరియు సంఖ్యాపరంగా మరింత మెరుగుపరచడానికి TCAGT బృందంలో చేరాలని అతను ప్రేక్షకులను ఆహ్వానించాడు. వీడియో, ఫోటోగ్రఫీ, డిజిటల్ కంటెంట్, సౌండ్, లైటింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ మరియు ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ బెజ్ప్రొడక్షన్స్ మీడియా, కెనడా చేత బాగా నిర్వహించబడ్డాయి. మరిన్ని వివరాలు మరియు నవీకరణల కోసం మా వెబ్సైట్ www.telugutoronto.com ని సందర్శించండి. ఈవెంట్ చిత్రాల కోసం క్రింది లింక్పై క్లిక్ చేయండి: Toronto Telugu Celebrations - Telugu Canada 2022 Mega Celebrations

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు !

తెలంగాణలో తెరాస నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలేలక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలుదూకుడె పెంచాయి. ఒక వైపు మద్యం కుంభకోణంలో ఈడీ వేగంపెంచగా, మరో వైపు చీకోటి ప్రవీణ్ కేసీనో కేసులో కూడా ఈడీ దర్యాప్తులో దూకుడు చూపుతోంది. మరో వైపు ఐటీ కూడా వేగం పెంచింది. తాజాగా తెలంగాణ  మంత్రి మల్లారెడ్డి నివాసంపై ఐటీ దాడులు చేసింది. మంగళవారం ఉదయం నుంచే మల్లారెడ్డి  నివాసం, కార్యాలయాలపై దాడులు ప్రారంభమయ్యాయి. అంతే కాకుండా మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి నివాసాలూ, కార్యాలయాల్లో కూడా ఐటీ శాఖ దాడులు చేస్తోంది. కుమారుడికి చెందిన సికింద్రాబాద్ లోని గేటెడ్ కమ్యూనిటీలో ఐటీ సోదాలు చేస్తోంది. మంత్రి మల్లారెడ్డి అల్లుడి ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఇంకా హైదరాబాద్‌లో మల్లారెడ్డికి చెందిన బంధువుల ఇళ్లు, ఆఫీసుల్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. మొత్తం 50 బృందాలుగా వచ్చిన ఐటీశాఖ అధికారులు  ఏక కాలంలో ఈ దాడులు జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డి కుటుంబంపైనే కాకుండా నగరంలోని పలువురి ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కొంపల్లిలోని పాం మెడోస్ విల్లా, గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు తెరాసలో కలకలం రేపుతున్నాయి.  ఇటీవలె కరీంనగర్‌లో మంత్రి గంగుల కమాలకర్  నివాసం, కార్యాలయాల్లో ఈడీ, ఐటీ అధికారులు ఉమ్మడి సోదాలు నిర్వహించగా.. ఆ తర్వాత హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజ్ రవిచంద్ర ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. ఇప్పుడు ఇలా మల్లారెడ్డి ఇంటిపై కూడా అటాక్ చేయడం తెరాసలో కలకలం రేపుతోంది. మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి కుమార్తె, కుమారుడు, అల్లుడి నివాసాలలో కూడా దాడులు జరుగుతున్నాయి.   ఇటీవల తెరాస విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఆ సందర్భంగా తెరాస నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాలపై కూడా ఐటీ, ఈడీ దాడులు జరిగే అవకాశం ఉన్నాయి. అయినా  ఎవరూ భయపడొద్దు అని చెప్పిన సంగతి తెలిసిందే. తెరాస నేతల్లో నైతిక స్థైర్యం దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే బీజేపీ కక్షసాధింపునకు పాల్పడుతోందని కేసీఆర్ ఆ సందర్భంగా అన్నారు. ఇప్పుడు వరుసగా తెరాస నేతలు లక్ష్యంగా దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచడంతో కేసీఆర్ చెప్పిందే జరుగుతోందేని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.