హేయ్.. మళ్లీ సలహాదారును అప్పాయింట్ చేసేశారు!

ఏపీలో జగన్ సర్కార్ సలహాదారుల నియామకం విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా ముందుకు పోతున్నది. సలహాదారుల నియామకంపై హైకోర్టు గతంలోనే తప్పుపట్టింది. అయినా కోర్టులను జగన్ సర్కార్ ఎప్పుడు పట్టించుకుంది కనుక. సర్వత్రా విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. అయినా ఖాతరే లేనట్టుగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోంది. తాజాగా ఒక కొత్త సలహాదారును నియమించింది. అదీ అలాంటిలాంటి సలహాదారును కాదు. ఏకంగా జాబ్ మేళాల  సలహాదారట. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గతంలో ఒక సారి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ మూడు జాబ్  మేళాలు ఏర్పాటు చేశారు. అయితే అవి ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినవి కావు. తన సొంతంగా అంటే విజయసాయి ట్రస్ట్ అంటూ ఆ జాబ్ ఫెయిర్స్ ఏర్పాటు చేశారు. ఆ తరువాత అవి కూడా పీకల్లోతు వివాదాల్లో ఇరుక్కున్నాయనుకోండి అది వేరే సంగతి.. కానీ ఇప్పటి వరకూ ప్రభుత్వం ఆధ్వరంలో ఎక్కడా జాబ్ మేళాలు జరిగిన దాఖలాలు లేవు. అలాంటిది జగన్ ఏకంగా వీటి కోసం అంటూ  ఓ సలహాదారుడిని నియమించి పారేశారు.   గాడి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తిని ప్రభుత్వ జాబ్ మేలా సలహాదారుగా నియమిస్తూ జీవో విడుదలయ్యింది.  ఈ గాడి శ్రీధర్ రెడ్డికి సలహాదారు పదవి… విజయసాయిరెడ్డి కోటా. గాడి శ్రీధర్ రెడ్డి విశాఖపట్నంలో వైసీపీ ఐటీ వింగ్‌  ఇన్ చార్జి అంటున్నారు. తనను ప్రభుత్వ  సలహాదారుగా నియమించారనీ,  ఈ పదవిలో తాను శక్తివంచన లేకుండా.. యువతలో స్కిల్ డెవలప్ మెంట్ , ఉద్యోగ కల్పనకు పాటుపడతానంటూ సామాజిక మాధ్యమంలో ఓ రేంజ్ లో ప్రకటనలు గుప్పించేసుకుంటున్నారు.   తన పనితీరుతో ప్రజా మన్నననలు పొందుతానని చెప్పుకుంటున్నారు.  సలహాదారు పదవుల నియామకాలలో ఇటీవలి కాలంలో వైసీపీ సర్కార్ స్పీడ్ పెంచేసింది.    వారానికో సలహాదారుడ్ని నియమించేస్తోంది.  ప్రజాధనాన్ని సలహాదారులంటూ నియమిస్తున్న పార్టీ నేతలకు నెలవారీగా వేతనాలుగా పందేరం చేసేస్తోంది.  

వనభోజనాల్లో రికార్డింగ్ డ్యాన్స్.. అదీ ప్రభుత్వ పాఠశాలలో!

వన భోజనాల్లో రికార్డింగ్ డ్యాన్స్.. అదీ ఒక ప్రభుత్వ పాఠశాలలో.. చిన్నారుల చదువుల గుడిలో.. వారి ఆటపాటలు మాత్రమే కనిపించాలి. అలాంటిది ఓ  సామాజిక వర్గానికి చెందిన వారు వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు.   వనభోజనాలంటే అయిన వారంతా సరదాగా ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటారు. కలిసి భోజనం చేస్తారు అనుకుంటాం. కానీ వీరు అలా కాదు.. ఏకంగా అసభ్య నృత్యాలతో ఒక రికార్డింగ్ డ్యాన్స్ కార్యక్రమమే పెట్టేశారు. రికార్డింగ్ డ్యాన్స్ లో భామలు డ్యాన్సులు చేస్తుంటే.. వనభోజనాలకు వచ్చిన వారు వారితో కలిసి కాలు కదిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులోని ఒక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరిగిన తతంగమిది. అసలు ప్రభుత్వ పాఠశాలలో వనభోజనాలు నిర్వహించడానికి అధికారులు పర్మిషన్ ఇచ్చారా? ఒక వేళ ఇస్తే ఎలా ఇచ్చారు. సరస్వతి నిలయమైన పాఠశాలలో రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహిస్తుంటే జాల్లా యంత్రాంగం ఏం చేస్తోంది? అధికార గణం ఈ అశ్లీల నృత్యాలు.. అదీ ఒక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరుగుతుంటే.. అలా జరుగుతున్నాయని సమాచారం అందినా నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ఊరుకున్నారు? అధికార పార్టీ వారి ఆధ్వర్యంలో జరిగింది కనుక తమకెందుగొచ్చిన గొడవలే అని ఊరుకున్నారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.   అధికార పార్టీకి చెందిన వారైతే ఏం చేసినా చేసేయొచ్చా? అని నిలదీస్తున్నారు. ఇటీవల ఏపీలోనే అయ్యప్ప పడి పూజను అడ్డుకున్న పోలీసులకు రికార్డింగ్ డ్యాన్సులను అడ్డుకోవాలని అనిపించలేదా అని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా.. ఏకంగా  అశ్లీల నృత్యాలతో రికార్డింగ్ డ్యాన్సునే ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని  పాఠశాల విద్యార్థల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.  

ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణ.. వద్దు బాబోయ్ అన్న అమెరికా మాజీ అధ్యక్షుడు

ఎలాన్ మస్క్  పగ్గాలు చేపట్టడంతోనే ట్విట్టర్ ప్రతిష్ట మంటగలవడం మొదలైంది. అయన తీసుకునే నిర్ణయాలు అటు ట్విట్టర్ ఉద్యోగులనూ, ఇటు ట్వీట్టర్ యూజర్లనూ కూడా ఆందోళనకు, గందరగోళానికీ గురి చేస్తున్నాయి. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ ట్విట్టర్ ట్రంప్ ఖాతాను బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడైనా ట్విట్టర్ ను తన వివాదాస్పద వ్యాఖ్యలకు వేదికగా చేసుకుంటానంటే అంగీకరించేది లేదంటూ అప్పట్లో ఆయన ఖాతాను బ్లాక్ చేసిన సంగతి తెలిసిదే. అయితే ఇప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తున్నట్లు ట్విట్టర్ ప్రస్తుత అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ట్రంప్ ఖాతా పునరుద్ధరణపై నిర్వహించిన పోల్ లో ట్రంప్ అక్కౌంట్ పునరుద్ధరణకు 51.8శాతం మంది మద్దతు ఇచ్చారని మస్క్ పేర్కొన్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. తన ఖాతాను పునరుద్ధరించవద్దు బాబోయ్ అని ట్రంప్ పేర్కోనడమే. తనకు ట్విట్టర్ లోకి వచ్చే ఆసక్తి ఏమాత్రం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. తనను బహిష్కరించిన ట్విట్టర్ లోకి మళ్లీ రావడానికి తనకు ఇసుమంతైనా ఇష్టం లేదని పేర్కొంటూరావడానికి  తన సొంత మీడియా అయిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (టీఎంటీజీ) స్టార్టప్ అభివృద్ధి చేసిన కొత్త ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‌తో తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. ట్విట్టర్ కంటే టీఎంటీజీ మెరుగ్గా పనిచేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.   2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గతేడాది జనవరిలో అమెరికాలో తీవ్రమైన హింసాకాండ చెలరేగింది. ఆందోళనకారులు క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లి.. విధ్వంసం సృష్టించారు. ఈ ఆందోళనలకు కారణం ట్రంప్ చేసిన ట్వీట్లు, పోస్టులేనని వార్తలు రావడంతో.. అప్పట్లో ఆయన ఖాతాలను తొలగిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ట్విట్టర్ పగ్గాలు చేజిక్కించుకున్న వెంటనే మస్క్.. ట్రంప్ ఖాతాను పునరుద్ధరించినా ట్రంప్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి

 అమెరికాలో మరో సారి కాల్పులు కలకలం సృష్టించాయి. కొలరాడోలోని ఓ నైట్ క్లబ్ లో దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటన క్లబ్ క్యూ అనే నైట్ క్లబ్ తో జరగింది.ఘటనకు పాల్పడిన వ్యక్తిని దుండగులు అదుపులోనికి తీసుకున్నారు. క్లబ్ క్యూలో ట్రాన్స్ జెండర్ డే ఆఫ్ రిమంబరెన్స్ సెలబ్రేషన్స్ జరుపుకుంటుండగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఇందుకు కారణమేమిటన్నది వెంటనే తెలియరాలేదు.

సూర్యకుమార్ యాదవ్ కొడితే రికార్డులు బద్దలైపోవాలంతే!

టి20 స్పెషలిస్ట్ ప్లేయర్ గా సూర్యకుమార్ యాదవ్ దుమ్ము దులుపుతున్నాడు. ఇప్పటి వరకూ కేవలం 41 టి20 మ్యాచ్ లు మాత్రమే ఆడిన సూర్యకుమార్ పలు అరుదైన రికార్డులు సృష్టించాడు. తాజాగా న్యూజిలాండ్ పై ఆదివారం జరిగిన టి20 మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ తనదైన ట్రేడ్ మార్క్ స్టైల్లో శతకబాదాడు. ఈ క్రమంలో పలు రికార్డులు అతడి ఖాతాలో జమయ్యాయి.  ఆదివారం (నవంబ‌ర్ 20) న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స‌ర్లుతో  111 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో అతడి ఖాతాలో రికార్డులు సృష్టించాడు. త‌న కెరీర్‌లో రెండో శ‌త‌కం బాదిన సూర్య‌కుమార్ యాద‌వ్ ఈ క్ర‌మంలో ప‌లు రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు.  న్యూజిలాండ్ గ‌డ్డ‌పై టీ20ల్లో సెంచ‌రీ చేసిన తొలి భార‌త ఆట‌గాడిగా నిలిచాడు. అలాగే ఒకే క్యాలెండర్ ఇయర్ లో టి20లలో రెండు శతకాలు కొట్టిన రెండో భార‌త ఆట‌గాడిగా రోహిత్ శ‌ర్మ రికార్డును స‌మం చేశాడు.  2018లో రోహిత్ ఈ ఘ‌న‌త సాధించాడు. ఇక అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో భార‌త్ త‌రుపున అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన కేఎల్ రాహుల్ రికార్డును స‌మ‌యం చేశాడు. రాహుల్ 72 మ్యాచుల్లో రెండు శ‌త‌కాలు చేయ‌గా సూర్య 41 మ్యాచుల్లోనే ఈ ఘ‌న‌త సాధించాడు. నాలుగు సెంచ‌రీల‌తో రోహిత్ శ‌ర్మ ఈ జాబితాలో అంద‌రి కంటే ముందు ఉన్నాడు. ఒక క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్య‌ధిక అర్థ‌శ‌త‌కాలు(11) చేసిన రెండో ఆట‌గాడిగా రికార్డుల‌కెక్కాడు. ఈ క్ర‌మంలో పాక్ కెప్టెన్ బాబ‌ర్ అజామ్‌(10) ను అధిగ‌మించాడు. పాక్ కే చెందిన మ‌హ్మ‌ద్ రిజ్వాన్(13) ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. ఇలా ఉండగా  సూర్య‌కుమార్ టి20 మ్యాచ్ లలో సాధించిన రెండు శ‌త‌కాలు కూడా విదేశాల్లో చేసిన‌వే. ఇలా రెండు సెంచ‌రీలు విదేశాల్లో చేయ‌డం కూడా ఓ రికార్డే. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో సూర్య‌కుమార్ నేటి మ్యాచ్‌తో క‌లిపి 41 మ్యాచులు ఆడాడు. 39 ఇన్నింగ్స్‌లో 181.64 స్ట్ర‌యిక్ రేట్‌తో 45 స‌గ‌టున‌ 1395 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు శ‌త‌కాలు, 12 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి.

గుజరాత్ లో బీజేపీకి రెబల్స్ బెడద

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి రెబల్స్ బెడద పెద్ద తలనొప్పిగా  మారనుంది. గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెల మొదటి వారంలో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీకి గుజరాత్ లో ఆప్, కాంగ్రెస్ లు గట్టి పోటీని ఇస్తున్నాయి. గుజరాత్ లో ఎలాగైనా సరు వరుసగా ఏడో సారి అధికారంలోకి రావాలన్నపట్టుదలతో ఉన్న బీజేపీ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించింది. దీంతో ఆ పార్టీకి రెబల్స్ బెడద ఎక్కువైంది. బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించడం లేదు. తొలి విడత పోలింగ్ డిసెంబర్ 1న జరగనుండగా..ఆ ఎన్నికలకు 7 సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీ రెబల్ అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. వారిని బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.దీంతో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీకి వ్యతిరేకంగా స్వతంత్ర అబ్యర్థులుగా నిలబడిన ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరించింది. పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు, క్రమశిక్షణా రాహిత్యం కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు పాల్ప‌డినందుకు, క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యం కింద ఈ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సీఆర్ పాటిల్ చెప్పారు. పార్టీ నుంచి బహిష్కృతులైన వారిలో  హర్షద్ వాసవ, అరవింద్ లదాని, ఛత్రాసింగ్ గుంజారియా, కేతన్ భాయ్ పటేల్, భరత్ భాయ్ చావ్‌డా, ఉదయ్‌ భాయ్ షా, కరన్ భాయ్ బరైయా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ త‌రుపున పోటీ చేసే 160 మంది అభ్య‌ర్థుల జాబితాను ఇటీవ‌లే బీజేపీ ప్ర‌క‌టించింది. ఈ జాబితాలో 38 కొత్త ముఖాలు ఉన్నాయి. 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వ‌గా.. 42 మందికి మాత్రం నిరాక‌రించింది. మాజీ సీఎం విజ‌య్ రూపానీ, మాజీ డిప్యూటీ సీఎం నితిన్ ప‌టేల్‌ల‌కు కూడా టికెట్ ఇవ్వ‌లేదు. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు బీజేపీ టికెట్ ఇచ్చింది. గుజరాత్ జామ్‌నగర్ నార్త్ విధానసభ స్థానం ఆమె పోటీ చేయ‌నుంది.  గుజ‌రాత్ రాష్ట్రంలో రెండు విడ‌త‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం తెలిపింది. డిసెంబర్ 1న తొలి దశ ఎన్నికలు జ‌ర‌గ‌నుండ‌గా, డిసెంబర్ 5న రెండో విడత పోలింగ్ జ‌ర‌గ‌నుంది. డిసెంబ‌ర్ 8న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి.

కవలలకు తాత అయిన ముఖేష్ అంబానీ

వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ కవల పిల్లలకు తాతయ్యారు. ఆయన కుమార్తె ఈశా అంబానీ శనివారం (నవంబర్ 19)   కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అంబానీ కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది.   ఈశా అంబానీ – ఆనంద్ పిరమాల్ దంపతులకు కవలలు జన్మనిచ్చినట్టు పేర్కొంది. కవలలలో   పాపకు అదియా, బాబుకి కృష్ణ అని పేర్లు పెట్టినట్లు ఆ ప్రకటన తెలిపింది. ఆ దంపతులకు, పిల్లలకు మీ ఆశీస్సులు అందించాలని కోరుతున్నామని అంబానీ కుటుంబం ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా.. ఈశా-ఆనంద్ లు చిన్ననాటి స్నేహితులు. వారి స్నేహం ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పంచి 2018 డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈశా రిలయన్స్ రిటైల్ వ్యాపారాలను చూసుకుంటున్న సంగతి విదితమే.

బర్త్ డే పార్టీలో గెస్ట్ ల విషయంలో గొడవ.. ఐదుగురు విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం

హాస్టల్ లో ఓ విద్యార్థిని బర్త్ డే పార్టీకి వచ్చిన అతిథుల విషయంలో జరిగిన గొడవ ఐదుగురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడానికి దారి తీసింది. వరంగల్ జిల్లా ఆరేపల్లి రెసిడెన్షియల్ స్కూల్ లో  చదువుకుంటున్నటెన్త్ విద్యార్థిని బర్త్ డే పార్టీ జరిగింది. ఆ బర్త్ డే పార్టీకి హాస్టల్ విద్యార్థినుల కన్నా బయటి వారే ఎక్కువ మంది రావడంపై హాస్టల్ అధికారులు విద్యార్థినులను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ఐదుగురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హాస్టల్ లో ఉన్న ఫినాయిల్ తాగేశారు. తొటి విద్యార్థులు అధికారులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారు కోలుకుంటున్నారు. విద్యార్థినులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.  

సంజుశాంసన్ పట్ల వివక్ష ఎందుకు?

టీమ్ ఇండియాలో కొందరు వరుసగా విఫలమౌతున్నా అవకాశాలు వస్తూనే ఉంటాయి. మరి కొందరు అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని రాణించినా అవకాశాలు దక్కవు. ముఖ్యంగా సంజు సాంశన్ విషయం తీసుకుంటే.. అతడి పట్ల టీమ్ ఇండియా మేనేజ్ మెంట్ కు ఏదైనా ప్రత్యేకమైన కోపం ఉందా అనిపిస్తుంది. భార‌త క్రికెట్  ఒక్క సంజు కే అవ‌కాశాలు రావ‌డం లేదు. సీనియ‌ర్లు లేన‌ప్పుడు ఎంపిక చేయ‌డమే తప్ప టీమ్ లో ఆడే అవకాశం ఇవ్వడం లేదు. ఎప్పుడో ఓ సారి అవ‌కాశం ఇచ్చినట్టు ఇఛ్చి మళ్లీ పక్కన పెట్టేస్తారు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని రాణించినా పట్టించుకోరు. మరో అవకాశం ఇవ్వరు. అదే ప‌దే ప‌దే విఫ‌లం అవుతున్న ఆట‌గాళ్ల‌కు మాత్రం..   లెక్క‌కు మిక్కిలి అవ‌కాశాలు ఇస్తున్నారు.  ప్ర‌స్తుతం కివీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయిన తొలి టీ20లో చోటు ద‌క్కించుకోలేక పోయిన‌ సంజుకు  ఆదివారం(నవంబర్ 20) జ‌రిగిన రెండో టీ20లోనూ నిరాశే ఎదురైంది. సీనియర్లు లేని ఈ సిరీస్‌లో శాంసన్ తుది జట్టులో ఆడటం ఖాయమని అంతా భావించారు. అయితే సంజుకు అవకాశం ఇవ్వలేదు. పోనీ సంజు ప్లేస్‌లో జ‌ట్టులోకి వ‌చ్చిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌ , దీప‌క్ హుడాలు బ్యాట్‌తో రాణించారా..? అంటే అదీ లేదు. ఇక మిగిలిన ఆఖ‌రి టీ20 మ్యాచ్‌లోనైనా సంజును ఆడిస్తారా..? అంటే అది చెప్ప‌లేని ప‌రిస్థితి. రిష‌బ్ పంత్ ప‌దే ప‌దే విఫ‌లం అవుతున్నా అత‌డికి అండ‌గా నిలుస్తున్నారు అలాంటి మద్దతు సంజు శాంసన్‌కు ఎందుకు ఇవ్వడం లేదంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.  సంజూ విషయంలో టీమ్ ఇండియా మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు.   శాంస‌న్ అవకాశాలు ఇచ్చి ఆ తరువాత ఒక అంచనాకు రావాలే తప్ప.. ఒకటి రెండు మ్యాచ్ లు ఆడించి పక్కన పెట్టేయడం సరికాదంటున్నారు. 

సూర్య అదరహో..న్యూజిలాండ్ తో రెండో టి20 భారత్ ఘన విజయం

న్యూజిలాండ్ లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మౌంట్ మాంగ‌నుయ్ వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20లో టీమ్ఇండియా బోణీ కొట్టింది. భార‌త జ‌ట్టు 65 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. రెండో టి20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్.. సూర్య‌కుమార్ యాద‌వ్ సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 191 ప‌రుగులు చేసింది. అనంత‌రం 192 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కివీస్ 18.5 ఓవ‌ర్ల‌లో 126 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. భార‌త బౌల‌ర్ల‌లో హుడా నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, చాహ‌ల్, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. సుంద‌ర్, భువ‌నేశ్వ‌ర్ ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు. శ‌త‌కంతో చెల‌రేగిన సూర్య‌కుమార్ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఇరు జ‌ట్ల మ‌ధ్య మూడో వ‌న్డే మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నుంది.కాగా భారీ లక్ష్య ఛేదనలో  న్యూజిలాండ్‌కు శుభారంభం ద‌క్క‌లేదు. తొలి ఓవ‌ర్‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో ఓపెన‌ర్ ఫిన్ అలెన్‌(0) డ‌కౌట్ అయ్యాడు. దీంతో సున్నా ప‌రుగుల వ‌ద్దే కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన కెప్టెన్‌ కేన్ విలియమ్సన్(61; 52 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) మ‌రో ఓపెన‌ర్ కాన్వే(25; 22బంతుల్లో 3 ఫోర్లు) క‌లిసి ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశాడు. వీరిద్ద‌రు ఆచితూచి ఆడుతూ చెత్త బంతుల‌ను బౌండ‌రీల‌కు త‌ర‌లించారు. రెండో వికెట్‌కు 56 ప‌రుగులు జ‌త చేశారు. ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న ఈ జోడిని వాషింగ్ట‌న్ సుంద‌ర్ విడ‌దీశాడు. సుంద‌ర్ బౌలింగ్ లో అర్ష్‌దీప్‌కు క్యాచ్ ఇచ్చి కాన్వే ఔట్ అయ్యాడు. ఒక ఇక్క‌డి నుంచి భార‌త బౌల‌ర్ల జోరు మొద‌లైంది. ఓ వైపు కేన్ మామ క్రీజులో పాతుకుపోయి త‌న‌దైన శైలిలో ఆడుతుండ‌గా.. అత‌డికి స‌హ‌క‌రించే బ్యాట‌ర్లే క‌రువు అయ్యారు. ఫిలిప్స్‌(12), మిచెల్‌(10), నీష‌మ్‌(0) సాంట్న‌ర్‌(2) ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయారు. ఓ వైపు సాధించాల్సిన ర‌న్‌రేట్ పెరిగిపోతుండ‌డంతో కేన్ ధాటిగా ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. ఈ క్ర‌మంలో 18వ‌ ఓవ‌ర్‌లో సిరాజ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అప్ప‌టి కివీస్ స్కోర్ 125/ 7. మిగిలిన మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌డానికి భార‌త్ కు ఎంతో సమ‌యం ప‌ట్ట‌లేదు. దీపక్ హుడా వ‌రుస‌గా సోథీ(0), సౌథీ(0), మిల్నె(6)ను ఔట్ చేశాడు. తృటిలో హ్యాట్రిక్ వికెట్లు తీసే ఛాన్స్ మిస్ అయ్యాడు. త‌న కెరీర్‌లోనే అత్యుత్త‌మ గ‌ణాంకాల‌ను హుడా(4/10) న‌మోదు చేశాడు. ఈ మ్యాచ్ లో సూర్య‌కుమార్ యాదవ్ ఆటే హైలైట్ . సెంచ‌రీతో చెల‌రేగాడు. సిక్స‌ర్లు, ఫోర్లతో విరుచుప‌డ్డాడు.  సీనియ‌ర్ల గైర్హాజ‌రీలో ఇషాన్ కిష‌న్, పంత్‌లు ఓపెన‌ర్లు గా వ‌చ్చారు. త‌న పేల‌వ ఫామ్‌ను కొన‌సాగిస్తూ పంత్ 13 బంతుల్లో 6 ప‌రుగులు చేసి పెవిలియ‌న్‌కు చేరాడు. దీంతో 36 ప‌రుగ‌ల‌కే భార‌త్ తొలి వికెట్ కోల్పోయింది. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన సూర్య‌కుమార్ యాద‌వ్(111 నాటౌట్; 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) త‌న అద్భుత ఫామ్‌ను కొన‌సాగిస్తూ కివీస్ బౌల‌ర్ల‌ను ఓ ఆట ఆడుకున్నాడు. త‌న‌దైన ట్రేడ్ మార్క్ షాట్ల‌తో అల‌రించాడు. ఇషాన్ కిష‌న్‌(36; 31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స‌ర్‌), శ్రేయాస్ అయ్య‌ర్‌(13), హ‌ర్థిక్ పాండ్య‌(13) ల అండతో త‌న‌కే సాధ్య‌మైన షాట్ల‌తో మైదానం న‌లువైపులా బౌండ‌రీలు బాదిన సూర్యకుమార్ యాదవ్ 32 బంతుల్లో అర్థ‌శ‌త‌కం పూర్తి చేశాడు. ఆ త‌రువాత వేగం పెంచాడు. కేవ‌లం 49 బంతుల్లోనే శ‌త‌కం సాధించాడు. టీ20ల్లో ఇది సూర్య‌కు రెండో శ‌త‌కం. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో సౌథీ మూడు వికెట్లు తీయ‌గా, ఫెర్గూస‌న్ రెండు, ఇష్ సోథీ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. కివీస్ సీనియ‌ర్ బౌల‌ర్ టిమ్ సౌథీ ఆఖ‌రి ఓవ‌ర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. వ‌రుస‌గా హార్థిక్ పాండ్య‌, హుడా, సుంద‌ర్ వికెట్లు తీసి టీ20ల్లో రెండో సారి ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు.

పేరుకు ఖర్గే.. పెత్తనం అంతా గాంధీ కుటుంబానిదే!

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల క్రతువు పూర్తయ్యింది. కొత్త అధ్యక్షుడు పగ్గాలు చేపట్టి నెల రోజులు దాటిపోయింది. దాదాపు పాతికేళ్ళ తర్వాత  కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక జరిగింది. ఎన్నిక అన్నారు కనుక ఎన్నిక అంతే.. మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ లు ఇరువురు పోటీ చేశారు అని చెప్పుకోవడానికే. కానీ మల్లికార్జన్ కర్గే పేరు సోనియా ప్రతిపాదించిన క్షణంలోనే కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు ఆయనేనని ఎన్నిక అయ్యి, ఫలితం వచ్చే వరకూ ఆగకుండానే పార్టీ శ్రేణులూ, రాజకీయ వర్గాలూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేశాయి. ఫలితాల్లోనూ అదే తేలింది. గాంధీ నెహ్రూ కుటుంబం నుంచి బయటి వ్యక్త పార్టీ పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ లో ఏమైనా మార్పు కనిపించిందా అంటే ఏం లేదనే చెప్పాలి.   వాస్తవానికి సోనియా గాంధీ తొలుత పార్టీ అధ్యక్ష పదవికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ను ఎంపిక చేశారు.   అధిష్టానం అభ్యర్ధిగా ఆయన్ని బరిలో దించాలని ఆశించారు. ఆయన్ని ఒప్పించారు. కానీ ఆయన అంగీకరించినట్లే అంగీకరించి చివరిక్షణంలో చెయ్యిచ్చారు. ఆ తరువాత పలు ఆప్షన్లను పరిశీలించి చివరకు సోనియా మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేశారు.  ఎనిమిది పదుల ఖర్గేను  ఎంపిక చేశారు. ఇక అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసిన శశి థరూర్ గాంధీల నాయకత్వాన్ని సవాలు చేసిన జీ 23 సభ్యుడు. దీంతో సోనియా గాంధీ ఆశీస్సులు ఎవరికున్నాయో వేరే చెప్పనవసరం లేకుండానే తేలిపోయింది. ఆ విషయం అద్యక్ష ఎన్నికకు ముందే..  శశి థరూర్ కు విషయం అర్థమైపోయింది. అందుకే ఆయన తీరిగ్గా,అభ్యర్థులకు సమాన అవకాశాలు లేవని, అభ్యర్థుల మధ్య తారతమ్యాలు చూపుతున్నారని, అయిన వారికి ఆకుల్లో కానీ వారికీ కంచాల్లో అన్నట్లుగా పార్టీ నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని ఆరోపించేసి చేతులు దులుపుకున్నారు. అవును మరి నాడా దొరికిందని, గుర్రాన్ని కొంటే ఇలాగే ఉంటుందని అప్పట్లో భాష్యాలు కూడా చెప్పారు.   జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది  అన్నట్లుగానే అధిష్టానం అండదండలున్న మల్లిఖార్జున ఖర్గే సునాయసంగా అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. ఆయన పగ్గాలు చేపట్టి కూడా నెల రోజులు దాటిపోయింది.    శశి థరూర్ తాను అధ్యక్షుడినైతే పార్టీలో సమూల మార్పులు తెస్తానని ప్రచార సమయంలో చెప్పుకున్నారు.అయితే ఖర్గే మాత్రం  సోనియా గాంధీ, రాజమాతగా, రాహుల్ గాంధీ కాంగ్రెస్ రారాజుగా నే కొనసాగుతారని చెప్పకనే చెప్పారు. అంటే తాను అధ్యక్షుడినైనా గాంధీ కుటుంబం పెత్తనం ఇసుమంతైనా మారదని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతోంది.   కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా నిర్ణయాలు తీసుకునే అధికారం సోనియా కుటుంబానిదే అని అప్పట్లోనే పరిశీలకులు చెప్పారు. అందులో ఇసుమంతైనా మార్పు ఉండదని కొత్త అధ్యక్షుడి నెల రోజుల హయాంలో ప్రస్ఫుటంగా తేలిపోయింది. ఇక పోతే   శశి థరూర్ ను  స్టార్ క్యాంపెయినర్స్ జాబితా నుంచి తాజాగా తొలగించడం ద్వారా గాంధీ కుటుంబాన్ని ధిక్కరించిన వారికి కాంగ్రెస్ లో స్థానం ఏమిటో మరోసారి స్పష్టంగా చూపినట్లైంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసేందుకు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో శశి పేరు లేకపోవటం అందుకే పెద్దగా ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. థరూర్ ను తాము పక్కన పెట్టలేదని, శశి థరూర్ పేరు ఎన్నికల స్టార్ క్యాంపెయినర్  జాబితాలో గతంలో ఎప్పుడూ చేర్చలేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడమే ఆశ్చర్యంగా ఉంది. తిరువనంతపురం ఎంపీ అయిన థరూర్ 2011,2016 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా  బాధ్యతలు నిర్వహించారు. 2014, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ముంబై, కోల్ కతా, చెన్నై నగరాల్లో శశి థరూర్ విస్తృతంగా ప్రచారం చేశారు.  ఇటీవలే నోయిడా లో జరిగిన బై పోల్స్ లోనూ ఆయన పార్టీ ప్రచార కార్యక్రమాల్లో   పాల్గొన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఆయన్ను స్టార్ క్యాంపెయినర్ గా గుర్తించకపోవటమంటే పొమ్మనలేక పొగబెట్టడమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇదొక్కటే కాదు ధిక్కారాన్ని గాంధీ కుటుంబం సహించదనడానికి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే జీ-23లో ఒకరైన ఆనంద్ శర్మ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ హోదాను కోల్పోయారు. అలాగే మనీష్ తివారి, రణదీప్ సింగ్ సూర్జేవాలాకు కూడా అదే మర్యాద దక్కింది. తొలుత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బదులుగా రూపొందిన కొత్తగా వచ్చిన కమిటీలో ఆయనకు చోటు దక్కలేదు. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ గా కూడా ఆయన్ను దూరం పెట్టడంతో శశి థరూర్ రాజకీయ భవితవ్యంపై మబ్బులు కమ్ముకున్నాయి. తాజా విషయాలపై స్పందించిన ఆయన తాను కేవలం మేధావినేనని భారత వ్యతిరేకిని, మోడీ వ్యతిరేకిని కానేకాననటం విశేషం. హిమాచల్, గుజరాత్ అసెంబ్లీఎన్నికల్లో ప్రచారం చేయాలని తాను వ్యక్తిగతంగా భావించినప్పటికీ స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో తనకు చోటు లేకుండా చేశారని, బహుశా పార్టీకి తన సేవలు అక్కర్లేదేమోనని ఆయన వ్యాఖ్యానించటం విశేషం. 

మద్యం షాపుల్లో ఇక డిజిటల్ చెల్లింపులకూ ఓకే.. మర్మమేమి తిరుమలేశా?!

 ఇంత కాలం ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోని వైసీపీ సర్కార్ ఎట్టకేలకు మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులకు ఓకే చెప్పింది. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అంటూ హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాకా.. మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వ వ్యాపారంగా మార్చేశారు. ప్రజలలో మద్యం అలవాటు మాన్నించడానికే అంటూ మద్యం ధరలను విపరీతంగా పెంచేశారు. ఇక ప్రభుత్వ మద్యం దుకాణాల సంఖ్యను కూడా క్రమంగా తగ్గించుకుంటూ వస్తానంటూ కొత్త విధానాన్ని ప్రకటించారు. కొత్త కొత్త బ్రాండ్లను తీసుకువచ్చారు. దీంతో ధర ఎక్కువ, నాణ్యత తక్కువ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. మద్యం ఆదాయాన్ని పెంచుకోవడం కోసమే ధరలు పెంచేశారన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి. అన్నిటికీ మించి అన్ని చోట్ల చెల్లింపులు డిజిటల్ రూపంలో జరగడానికి లేని అభ్యంతరం ఒక్క మద్యం దుకాణాల్లోనే ఎందుకన్న ప్రశ్నలూ తలెత్తాయి. మద్యం దుకాణాల్లో డిజిటల్, ఆన్ లైన్ పేమెంట్లకు వీల్లేదన్న ఆంక్షలపై విమర్శలే కాదు అనుమానాలూ వ్యక్తమయ్యాయి.  నిత్యం కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగే మద్యం వ్యాపారంలో డిజిటల్ చెల్లింపుకు ఎందుకు అనుమతించడం లేదన్న ప్రశ్నలూ వెల్లువెత్తాయి. ఎందుకంటే    మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వానివే అయినా..సరఫరా.. తయారీ..   మొత్తం వైసీపీ నేతల గుప్పిట్లో ఉంది. దీంతో మద్యం దుకాణాల్లో నగదు లావాదేవాలకు మాత్రమే అనుమతి అంటూ ప్రభుత్వం చెబుతుండటంతో.. ఆ సొమ్మంతా ఎక్కడకు పోతోందన్న అనుమానాలు పొడసూపాయి. ఈ సొమ్మ బ్లాక్ మనీగా  తరలిపోతోందని విమర్శలూ ఉన్నాయి. ఇక బేగం పేట విమానాశ్రయం నుంచి  ప్రైవేట్ చార్టర్డ్ విమానాల్లో పెద్ద మొత్తంలో సొమ్ము తరలించారని ఢిల్లీ మద్యం స్కాం దర్యాప్తు చేస్తున్న ఈడీ దర్యాప్తులో తేలడంతో ఏపీలో మద్యం సొమ్మును కూడా అలాగే తరలిస్తున్నారంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. గన్నవరం ఎయిర్ పోర్ట్, విశాఖ పాత విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించిన చార్టర్ట్ ఫ్లైట్ల గుట్టు కూడా బయట పెట్టాలంటూ తెలుగుదేశం అధికార ప్రతినిథి పట్టాభి డిమాండ్ చేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి సొమ్ము తరలింపునకు ఉపయోగించిన చార్టర్డ్ విమానాలు ఢిల్లీ మద్యం స్కాంలో అరెస్టయిన అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి భార్య అనికా టేక్రీవాల్ రెడ్డికి చెందిన జెట్ సెట్ గో సంస్థకు చెందినవని ఈడీ అనుమానిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ పై విమర్శల దాడి జరిగింది. శరత్ చంద్రారెడ్డి వైసీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు.. వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి అల్లుడి అన్న కావడం.. అంతకంటే ముందే.. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు కావడంతో జగన్ సర్కార్ డిఫెన్స్ లో పడింది. దీంతో గత్యంతరం లేకనే మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ కు కూడా అనుమతి ఇస్తామని ప్రకటించింది. సోమవారం (నవంబర్ 21) నుంచే ఏపీలోని మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లను అనుమతిస్తామని ప్రకటించింది. ఇప్పటి దాకా అనుమతించని డిజిటల్ పేమెంట్లకు ఇప్పుడెందుకు అనుమతిస్తున్నారన్న ప్రశ్నకు షాపుల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తేలిందనీ, దానిని అరికట్టేందుకేననీ బదులిస్తోంది. ఇంత కాలం ఆ విషయాన్ని గుర్తించలేదా అన్న ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదు. పోనీ సిబ్బంది చేతివాటానికి అవకాశం లేకుండా మద్యం దుకాణాల్లో పూర్తిగా డిజిటల్ పేమెంట్పే అంటున్నారా అంటే అదీ లేదు. నగదు చెల్లింపులకూ చాన్స్ ఉంటుందంటున్నారు. అంటే సిబ్బంది చేతి వాటానికి భయపడే డిజిటల్ పేమెంట్స్ కు అనుమతి ఇస్తున్నామన్న మాట పూర్తిగా వాస్తవం కాదన్న మాట. విమర్శలకు తలొగ్గే ఆ నిర్ణయం తీసుకున్నారని అర్ధమౌతోంది. కానీ డిజిటల్ పేమెంట్స్ అని బయటకు చెప్పినా అది నామ్ కే వాస్తే అమలు చేస్తారనీ, సాంకేతిక సమస్య సహా పలు రకాల సాకులతో మద్యం దుకాణాల్లో నగదు చెల్లింపులకే పట్టుబట్టే అవకాశాలే మెండుగా ఉన్నాయనీ పరిశీలకులు అంటున్నారు.  

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా అరుణ్ గోయల్

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా అరుణ్‌ గోయల్‌ నియమితులయ్యారు. 1985 పంజాబ్‌ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి గోయల్ ను నియమిస్తూ కేంద్రం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్‌తో పాటు ఇద్దరు కమిషనర్లు ఉంటారు. మూడో పదవి ఖాళీగా ఉండడంతో అరుణ్‌ గోయల్‌ను కేంద్రం నియమించింది. ప్రస్తుతం ప్రధాన కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌, కమిషనర్‌గా అనూప్‌ చంద్ర పాండే ఉన్నారు.దాదాపు ఆరు నెలలుగా ఖాళీగా ఉన్న మూడో కమిషనర్ పదవిని కేంద్రం అరుణ్ గోయల్‌తో భర్తీ చేసింది. 1985 క్యాడర్‌కు చెందిన అరుణ్ గోయల్ సర్వీసులో ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. 34 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో సేవలందించిన అరుణ్ గోయెల్ జీఎస్‌టీ కౌన్సిల్‌ అడిష‌న‌ల్ సెక్రెట‌రీగా కూడా ప‌నిచేశారు. ఢిల్లీలో ఇంజినీరింగ్ చ‌దివిన అరుణ్ గోయ‌ల్ ఆ త‌ర్వాత అహ్మ‌దాబాద్‌లోని ఐఐఎంలో పీజీ పూర్తి చేశారు.  వచ్చే నెల మొదటి వారంలో గుజ‌రాత్ ఎన్నిక‌లు జరగనున్నాయి, అలాగే, ఇక వరుసగా మ‌రిన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ, ఆ తరువాత  2024లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దాంతో  గత ఆరునెలలుగా కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా మూడో ఎన్నిక‌ల అధికారి పోస్ట్‌ను కేంద్రం భర్తీ చేసింది.

ఆహా ఏం భోగం.. ఇంటి కన్నా జైలే నయం!

తాజాగా వెలుగు చూసిన ఓ వీడియో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసింది. ఆప్ మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్ కు జైళ్లో సకల మర్యాదలూ జరుగుతున్నాయని చాటే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చి ఆప్ పరువును గంగలో కలిపింది. వడ్డించే వాడు మనవాడైతే పంక్తిలో చివర కూర్చున్నా ఫరవాలేదు అన్న సామెతలా అధికారంలో మన పార్టీ ఉంటే జైళ్లో కూడా రాజభోగాలు అనుభవించవచ్చని ఆప్ మంత్రికి జైళ్లో అందుతున్న సౌకర్యాలను చూస్తే అర్ధమౌతుంది. కర్యాలను చూస్తే ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా దొరకవేమో అనిపిస్తుంటుంది. గతంలో జైలులో కూడా రాజభోగాలు అనుభవించిన కొందరు రాజకీయ నేతలను మనం చూడగా.. ఇప్పుడు అదే కోవలో ఢిల్లీ మంత్రి కూడా చేరారు. డిల్లీలో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీగా సామాన్యుల కోసమే పని చేస్తామనే ఆ పార్టీ మంత్రి   సత్యేంద్రకుమార్ జైన్ మనీలాండరింగ్ కేసులో మే 30న  అరెస్టైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న సత్యేంద్రకుమార్ కు అక్కడ సకల సేవలూ జరుగుతున్నాయని తెలియజేసే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.  ఈ వీడియోలో మంచం మీద దర్జాగా పడుకున్న మంత్రికి మరో వ్యక్తికి మసాజ్ చేస్తున్నాడు. మంత్రి పడుకున్న బెడ్ మీద టీవీ రిమోట్, తాగేందుకు మినరల్ వాటర్ బాటిల్ వంటివి కనిపిస్తుండడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు.. ఇది జైలా స్టార్ హోటలా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇది ఇప్పటి వీడియో కాదు సెప్టెంబర్ నెల నాటి వీడియో అని ఆప్ నేతల వివరణ ఇస్తున్నా.. ఆ తర్వాత కూడా అదే జైలులో ఉన్న ఈ మంత్రికి అవే మర్యాదలు దక్కుతున్నాయని విమర్శలు వినవస్తున్నాయి. మొత్తం మీద ఈ వీడియో దెబ్బకు పదిమంది జైలు అధికారుల మీద వేటు పడింది. ఆప్ పార్టీకి రాజకీయంగా నష్టం జరిగింది.  

పబ్లిసిటీ మోజు తెచ్చిన చేటు

పబ్లిసిటీ మోజు   పెచ్చుమీరితే ఏమౌతుందో ఆ ఐఏఎస్ అధికారికి బాగా తెలిసి వచ్చింది.  ఉత్తర్ ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ అభిషేక్ సింగ్ సోషల్ లైఫ్ పై ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే పబ్లిక్ సర్వెంట్, సోషల్ ఎంటర్ ప్రెన్యూర్, యాక్టర్ అంటూ తనకు తానే భుజకీర్తులు ఇచ్చుకుంటూ  తన వ్యక్తిగత సోషల్ మీడియా ప్రొఫైల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. అంతే కాదండోయ్ ఈయనను సామాజిక మాధ్యమంలో ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ఇన్ స్టా గ్రామ్ లో ఆయనకు 3 మిలియన్ల ఫాలోయర్స్ ఉండగా ,ట్విట్టర్ లో 31,000 మంది ఫాలోయర్స్ ఉన్నారు.వారందరి కోసం ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ పోస్టు చేస్తూ ఉంటారాయన. వ్యక్తిగత వివరాలు, తన టాలెంట్స్ గురించి, అభిరుచుల గురించి పోస్టు చేసి ఊరుకుంటే బాగుండేది. కానీ పబ్లిసిటీ పిచ్చి పీక్స్ కు వెళ్లడంతో.. తన స్పెషల్ డ్యూటీ గురించి ఫోటోతో సహా   సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.  ఎన్నికల విధుల్లో తలమునకలవ్వాల్సిన ఆ ఆఫీసర్  ఇన్స్టాలో రెండు పిక్స్ పోస్ట్ చేసి,  తాను గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నట్టు రైటప్స్ పెట్టారు.  సీన్ కట్ చేస్తే ఆయనపై ఎలక్షన్ కమిషన్ ఆయనపై చర్యలు తీసుకుని షాక్ ఇచ్చింది. అభిషేక్ సింగ్ ను ఎన్నికల విధుల నుంచి తప్పించింది.ఇదంతా పక్కన పెడితే తన ఎలక్షన్ డ్యూటీకి సంబంధించి అభిషేక్ సింగ్ చేసిన పోస్టుకు విశేషం ఏమిటంటే అభిషేక్ చేసిన  22 గంటల్లో 28, 597 లైక్స్ వచ్చాయి. ఫలం దక్కింది కానీ వ్రతమే చెడింది.  

ఇంజనీరింగ్ కాలేజీలో జై పాకిస్థాన్ నినాదాల కలకలం

బెంగళూరులోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో జై పాకిస్థాన్ నినాదాలు కలకలం రేపాయి. ఆ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో కొందరు విద్యార్థులు జై పాకిస్థాన్ నినాదాలు చేశారు. ఈ సంఘటనను మరో విద్యార్థి సెల్ ఫోన్ లో షూట్ చేసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడంతో ఇది వైరల్ అయ్యింది. నెటిజన్లు కాలేజీలో ఈ నినాదాలేంటంటూ ఫైర్ అవుతున్నారు. న్యూ హరిజన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ నెల 25 నుంచి రెండు రోజుల పాటు ఫెస్ట్ జరగనుంది.  అందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్సాయి. ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య ఐపీఎల్ ఫేవరెట్ జట్ల ప్రస్తావన వచ్చింది. ఐపీఎల్ లో పాకిస్థాన్ ఆటగాళ్లకు స్థానం లేకపోవడంపై చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగా ఇద్దరు విద్యార్థులు జై పాకిస్థాన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇతర విద్యార్థులు అభ్యంతరం తెలిపారు. జై పాకిస్థాన్ నినాదాలు చేసిన విద్యార్థుల చేత క్షమాపణ చెప్పించి వారి చేత జై భారత్, జై కర్నాటక అనిపించారు. అయితే ఈ మొత్తం సన్నివేశాన్ని కొందరు విద్యార్థులు వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. జై పాకిస్థాన్ నినాదాలు చేసిన విద్యార్థులపై కేసు నమోదు చేశారు. మొత్తం మీద ఇంజనీరింగ్ కాలేజీలో జై పాకిస్థాన్ నినాదాలు కలకలం సృష్టించాయి. 

బాబోయ్ మళ్లీ వర్షాలు!

ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ వర్షాలు ముంచెత్తనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుందన వాతావరణ శాఖ శనివారం పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో శనివారం (నవంబర్ 19)తమిళనాడు, పుదుచ్చేరిలలో వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలోనూ  చెదురుమదురు వర్షాలు కురిశాయి. అల్పపీడనం బలపడి ఆదివారం నాటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, తీరం వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయనీ పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు వేటకు వెళ్లరాదనీ హెచ్చరించింది. కాగా వాతావరణ తాజా హెచ్చరికతో రైతులలో ఆందోళన వ్యక్తం అవుతోంది. సాగు సమయంలో వర్షం పడితే చేతికి వచ్చే పంట నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులలో వరి కోతలు ప్రారంభం కానున్న తరుణంలో వాయుగుండం హెచ్చరికతో వారి గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి.  

కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి సస్పెన్షన్

మర్రి శశిధర్ రెడ్డిని పార్టీ నుంచి కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. మాజీ మంత్రి, కేంద్ర   విపత్తు నివారణ సంస్థ మాజీ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.   కొంత కాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు , మాజీ మంత్రిమర్రి శశిథర్ రెడ్డి హస్తినలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడంతో ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారం జోరందుకున్న సంగతి విదితమే.   బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణల తో కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మర్రిశశిధర్ రెడ్డి నేడో రేపో కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అప్రమత్తమైంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం ప్రకటించింది. అంతకు ముందు మర్రి శశిధర్ రెడ్డి తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను, జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.  కలిసి ప్రయాణం చేసినంత మాత్రాన, ఢిల్లీ వెళ్లినంత మాత్రానా హోంమంత్రిని కలిసినంత మాత్రానా పార్టీ మారుతున్నట్లేనా? అని ప్రశ్నించారు. అయితే జరుగుతున్న పరిణామాలను గమనించి ఆయన కమలం గూటికి చేరడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్.. ఆయన పార్టీకి రాజీనామా చేయడానికి ముందే సస్పెన్ష్ వేటు వేసింది. కాగా తెలంగాణ కాంగ్రెస్ లో ఈ పరిణామం దుమారాన్ని లేపింది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ పరిణామాలపై స్పందించారు. మర్రి శశిధర్ రెడ్డిపై వేటుకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ..  మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారితే అందుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  బాధ్యత వహించాలన్నారు.  మునుగోడు ఓటమిపై పీసీసీ ఒక్క సమీక్ష కూడా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. జూమ్ మీటింగ్ లు పెట్టి కులాసా కబుర్లు చేప్పుకోవడమేమిటని మండి పడ్డారు.  కాంగ్రెస్ పార్టీలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్న మాట వాస్తవమేనన్నారు.  అందుకే మర్రి శశిధర్ రెడ్డి ఇబ్బంది పడి ఉంటారని చెప్పారు. ఆయనతో పార్టీ నాయకత్వం మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

బీసీసీఐ ప్రక్షాళన.. సెలక్టర్లకు ఉద్వాసన.. ఆటగాళ్ల వంతెప్పుడు?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ సెమీఫైనల్ లో టీమ్ఇండియా ఘోర పరాజయం నేపథ్యంలో బీసీసీఐ ప్రక్షాళన మొదలెట్టింది. ముందుగా సెలక్టర్లపై వేటేసింది. టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో టీమ్ ఇండియా ఘోరంగా పరాజయం పాలైన సంగతి విదితమే. ఆ మ్యాచ్ లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో చేసిన పరుగులను ఇంగ్లాండ్ అలవోకగా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించేసింది. భారత్ నిర్దేశించిన 168 పరుగుల విజయ లక్ష్యాన్ని ఒక్కవికెట్ కూడా నష్టపోకుండానే  ఇంగ్లాండ్ ఉఫ్ మని ఊదేసింది.  ఈ ఓటమితో టీమ్ ఇండియా బలహీనతలపై మళ్లీ చర్చ మొదలైంది. ఆటగాళ్ల సెలక్షన్ అధ్వానంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ను జట్టులోకి తీసుకుని ఎవరినీ సరిగ్గా ఉపయోగించుకోని పరిస్థితిని క్రీడాభిమానులే కాదు.. మాజీలు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లకు వరుసగా అవకాశాలు ఇచ్చుకుంటూ పోవడంపై కూడా విరమ్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ మొదటిగా సెల‌క్ట‌ర్ల‌పై వేటు వేసింది. టి20 వరల్డ్ కప్ కు   జ‌ట్టును ఎంపిక చేసిన చేత‌న్ శ‌ర్మ నేతృత్వంలోని సెల‌క్ష‌న్ క‌మిటీనీ ఇంటికి పంపించింది. అంతేకాకుండా కొత్త సెల‌క్ష‌న్ కమిటీ ఎంపిక కోసం ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించింది. సీనియ‌ర్ పురుషుల క్రికెట్ జ‌ట్టును ఎంపిక చేసేందుకు ఐదుగురు సెల‌క్ట‌ర్లు కావాలంటూ భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ఓ ప్ర‌క‌ట‌న‌ను చేసింది. కనీసం ఏడు టెస్ట్ మ్యాచ్‌లు, 30 ఫస్ట్‌ క్లాస్ మ్యాచ్‌లు, లేదంటే 10 వన్డేలు, 20 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన వారు సెలక్టర్ పదవికి అర్హులనీ, అలాగే సెలక్షన్ బోర్డుకు ఎంపిక అవ్వాలంటే.. ఐదు సంవ‌త్స‌రాల క్రిత‌మే క్రికెట్ ఆట‌కు వీడ్కోలు ప‌లికి ఉండాల‌ని, అంతేకాకుండా ఐదేళ్ల పాటు ఏ క్రికెట్ క‌మిటీలోనూ స‌భ్యుడిగా లేని వాళ్లకు ప్రాధాన్యం ఇస్తామనీ ఆ ప్రకటనలో పేర్కొంది.   ఆస‌క్తి ఉన్న వారు ఈనెల 28వ తేదీలోగా దరఖాస్తులు పంపాలని ఆ ప్రకటనలో పేర్కొంది.  ఈ ప్రక్షాళనలో భాగంగా తరువాతి వంతు వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లదేనని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. గతమెంత ఘనకీర్తి ఉన్నా.. ప్రస్తుత పెర్ఫార్మెన్స్ ఆధారంగానే జట్టులో స్థానం ఉంటుందన్నది బీసీసీఐ స్పష్టంగా చెబుతోందంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్, దినేష్ కార్తిక్, పృధ్వీషా, భువనేశ్వర్ కుమార్ తదితర ఆటగాళ్ల భవిష్యత్ పై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. మొత్తం మీద టి20 వరల్డ్ కప్ సెమీస్ లో ఓటమితో టీమ్ ఇండియా లోటుపాట్లను సరిదిద్దే దిశగా బీసీసీఐ చర్యలు చేపట్టడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.