తెలంగాణలో ఒకలా.. ఏపీలో మరోలా.. మోడీ నాలుకకు రెండు వైపులా పదునే!

తెలుగు రాష్ట్రాలలో రెండు రోజుల పాటు పర్యటించిన ప్రధాని మోడీ తన రాజకీయ చతురతను చాటుకున్నారు. ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా మాట్లాడి తన నాలుకకు రెండు వైపులా పదునేనని రుజువు చేసుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా బీజేపీ యేతర ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం విధానాలతో విభేదిస్తోంది. విభజన చట్టంలోని హామీలను ఇంకా పరిష్కరంచకపోవడంపై నిలదీస్తోంది. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గట్టిగా గళమెత్తడమే కాకుండా జాతీయ స్థాయి రాజకీయాలలో కూడా మోడీని ఢీ కొనేందుకు కసరత్తుతు చేస్తోంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే జాతీయ స్థాయి పార్టీ ఏర్పాటు చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఓటమే ధ్యేయంగా అడుగులు వేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపి మోడీకి నేరుగా సవాల్ విసిరేందుకు సిద్ధమౌతున్నారు. ఇక ఏపీలో జగన్ సర్కార్ విషయానికి వస్తే.. విభజన హామీలను ప్రస్తావించదు. అప్పులకు అనుమతులిస్తే చాలని వేడుకొంటోంది. అడుగులకు మడుగులొత్తుతోంది. ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలకు జనం  రాకపోయినా.. ప్రధాని మోడీ సభ కోసం శ్రమించి, బెదరించి మరీ జనసమీకరణ చేసింది. పోలవరం ప్రాజెక్టు గురించి నోరెత్తి అడిగిన సందర్భం లేదు. విశాఖ ప్రైవేటైజేషన్ కు అభ్యంతరం చెప్పదు. సరిగ్గా ఈ తేడాయే మోడీ తెలుగు రాష్ట్రాల పర్యటన సందర్బంగా ఆయన ప్రసంగంలో ప్రతిధ్వనించింది. తొలుత ఏపీలో పర్యటించిన ఆయన ఏపీ ప్రభుత్వంపై చిన్న పాటి విమర్శ కూడా చేయలేదు. అలాగని అంత సాగిలపడిన ప్రభుత్వంపై కూసింత జాలి చూపి రాష్ట్రానికి ఏమైనా వరాలు ప్రకటించారా? అంటే అదీ లేదు. ఆయన పర్యటన విశాఖ సెంట్రిక్ గా జరిగింది కనుక విశాఖ జనాలకు తెలిసిన విశాఖ చరిత్ర చెప్పి నగరాన్ని ప్రస్తుతించి.. ప్రస్తుతానికింతే అని చెప్పకనే చెప్పారు. మోడీ ప్రసంగానికి ముందు జగన్ తెలుగులోనే మాట్లాడినా బోలెడు వినతులు, విజ్ణప్తులు చేశారు. ఆయన భాష మోడీకి అర్ధం కాదు. ఆంగ్లంలో మాట్లాడితే అర్ధమై నొచ్చుకుంటారేమోనన్న భయమే జగన్ తన ప్రసంగం తెలుగులో చేయడానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ తన ప్రసంగంలో  మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. జగన్ సమక్షంలోనే తాను మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించానని చెప్పడానికే ఆ ప్రసంగం పనికొచ్చింది కానీ మోడీ నుంచి దానిపై ఎటువంటి స్పందనా రాలేదు. ఇదీ మోడీ పర్యటన ఏపీలో సాగిన తీరు.. రాష్ట్రానికి ఎటువంటి వరాలూ కురిపించలేదు, పన్నెత్తి మాట్లాడలేదు. వచ్చారు.. వెళ్లారు అంతే. ఇక అదే తెలంగాణ విషయానికి వచ్చే సరికి ఆయన ప్రసంగం పూర్తిగా రాజకీయ విమర్శలకు నెలవుగా మారింది. తనపై తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, తిట్లు తిని చాయ్ తాగండి అంటూ సెటైర్లు వేశారు. అవినీతికి, అవినీతి నాయకులకూ చరమగీతం తప్పదని హెచ్చరించారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాన్ని ప్రస్తావించి బీజేపీ కార్యకర్తలు తెలంగాణ ప్రభుత్వాన్ని వణికించారని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన ఫలితాలను సాధించడానికి ఇది నాంది పలికిందని పేర్కొన్నారు. తెలంగాణలో తెరాస ప్రభుత్వ  వైఖరికి ప్రజలు విసిగిపోయారని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల మధ్య కమలం వికసించడం ప్రారంభమవుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్యామిలీ ఫస్ట్ అనే సూత్రంతో పని చేస్తోందని మండిపడ్డారు. తాము మాత్రం పీపుల్స్ ఫస్ట్ అనే నినాదంతో పని చేస్తోన్నామని, ఈ రెండు పార్టీల మధ్య తేడాను ప్రజలు గమనించాలని కోరారు.   ఇక సింగరేణిని ప్రైవేటు పరం చేసే ప్రశక్తే లేదని విస్పష్టమైన హామీ ఇచ్చారు. అదే ఏపీలో జనం పోరాడి తెచ్చుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయవద్దని జనం కోరుతున్నా పట్టించులేదు. ఏపీలో రాజకీయ లబ్ధి లేదు కనుక రాష్ట్ర ప్రజల ఆకాంక్షలతో సంబంధం లేనట్లుగా వ్యవహరించిన మోడీ... తెలంగాణలో అధికార ఆకాంక్ష తో సింగరేణిపై హామీ ఇచ్చారు.  తెలుగు రాష్ట్రాలలో పర్యటించిన ఆయన ఏపీ పట్ల ఏమీ పట్టని వైఖరిని ప్రదర్శించి.. తెలంగాణలో రాజకీయ లబ్ధి ఆకాంక్షించి విమర్శలు గుప్పించారు. హామీలిచ్చారు. 

కాంగ్రెస్ మాజీ ఎంపీ టీ. సుబ్బరామిరెడ్డిపై దివాళా పిటిషన్లు

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ టి. సుబ్బరామిరెడ్డిపై దివాళా పిటిషన్లు దాఖలయ్యాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ మేరకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్ సిఎల్ టి) హైదరాబాద్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసింది.   గాయత్రి ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ పేరుమీద తీసుకున్న రుణానికి సంబంధించి హామీదారుగా టి.సుబ్బరామిరెడ్డి ఉన్నారు. దివాలా ప్రక్రియ ప్రారంభించి రుణాల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని  బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎమ్) ఈ పిటిషన్ ను దాఖలు చేసింది.  అలాగే సుబ్బరామిరెడ్డి భార్య ఇందిరా సుబ్బరామిరెడ్డి, బంధువులు, సన్నిహితులు టి.సరితారెడ్డి, టి.వి.సందీప్ రెడ్డి, జె.సుశీలారెడ్డి, జి.సులోచన, జి.శివకుమార్ రెడ్డి తదితరులపై వేర్వేరుగా పిటిషన్లు దాఖలయ్యాయి. గాయత్రి ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ రూ.600 కోట్లకుపైగా రుణాలు తీసుకుని చెల్లించడంలో విఫలమైంది.  రుణాలు ఇచ్చిన సంస్థలు, కంపెనీ నిర్వహణకు రుణమిచ్చిన సంస్థలు వాటి రికవరీ కోసం ఎన్ సీఎల్ టీని ఆశ్రయించాలి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.400 కోట్లకుపైగా, ఎస్‌బీఐ నుంచి రూ.240 కోట్లకుపైగా ఈ సంస్థలు రుణాలు తీసుకున్నాయి. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎస్‌బీఐలు దాఖలు చేసిన పిటిషన్లపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ జ్యుడిషియల్‌ సభ్యులు డాక్టర్‌ బి.ఎన్‌.వి.రామకృష్ణ, సాంకేతిక సభ్యులు సత్యరాజన్‌ ప్రసాద్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం తన తీర్పును వాయిదా వేసింది.  అగ్రశ్రేణి నిర్మాణ  సంస్థల్లో ఒకటైన గాయత్రి ప్రాజెక్ట్స్ ఇటీవలి కాలంలో ప్రభ కోల్పోయింది. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి. సుబ్బరామిరెడ్డి నిర్మాతగా సినీ రంగంలో కూడా ఓ వెలుగు వెలిగారు. అగ్ర కథా నాయకులతో, నాయికలతో పలు సినిమాలు నిర్మించారు. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా సినీ పరిశ్రమ మొత్తం కదిలి వచ్చేది. అయితే ఇదంతా గతం. ఇటీవలి కాలంలో గాయత్రి ప్రాజెక్ట్స్ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయి. అలాగే టీ. సుబ్బరామిరెడ్డి ఇటీవలి కాలంలో పెద్దగా బయట కనిపించడం లేదు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. తాజాగా ఆయనపై (ఎన్ సిఎల్ టి) లో దివాళా పిటిషన్లు దాఖలయ్యాయి.

పవన్ కళ్యాణ్ కు మోడీ రోడ్ మ్యాప్.. అదేనా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో రోడ్ మ్యాప్ అడుగుతున్నా మిత్ర పార్టీ బీజేపీ పెద్దల నుంచి పెద్దగా స్పందన కనిపించేది కాదు. ఇదే విషయాన్ని ఇటీవల జనసేన పార్టీ నేతలు, శ్రేణులతో మంగళగిరిలో నిర్వహించిన సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ కాస్త గట్టిగానే ప్రస్తావించారు. అయితే.. ఇటీవల ప్రధాని మోడీ విశాఖలో పర్యటించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ కు పీఎంఓ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. అలాగే.. బీజేపీ కోర్ కమిటీ కంటే ముందుగానే పవన్ కళ్యాణ్ కు కేవలం పది నిమిషాల సమయం ఇచ్చినప్పటికీ.. అరగంటకు పైగా ఆయనతో మోడీ చర్చలు జరపడం విశేషం. ఈ సందర్భంగానే పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోడీ రోడ్ మ్యాప్ ఇచ్చారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చేసేందుకు టీడీపీ-జనసేన-బీజేపీలతో కలిపి ఉమ్మడి విపక్షం ఏర్పాటు కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఉమ్మడి విపక్షానికి బదులు జనసేన-బీజేపీతో కూడిన పరిమిత విపక్షాన్ని బలోపేతం చేయాలని, తద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని మోడీ రోడ్ మ్యాప్ ఇచ్చారని అంటున్నారు. అందుకేనేమో మోడీతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ ఉమ్మడి విపక్షం విషయంలో మౌనం వహిస్తున్నట్లు కనిపిస్తోందని ఏపీలో తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది. మోడీ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో అరగంటకు పైగా చేసిన చర్చలే ప్రధాని విశాఖపట్నం పర్యటనలో కీలకంగా మారాయంటున్నారు. విశాఖలో తన తొలి రోజు పర్యటనలో పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. తర్వాతి రోజు మోడీ టూర్ లో గవర్నర్, సీఎం జగన్ కనిపించారు. విశాఖలో తొలిరోజు పర్యటనను మోడీ రాజకీయ చర్చలతో ప్రారంభించారు. తద్వారా తన ప్రాధాన్యతలు ఏమిటో మోడీ చెప్పకనే చెప్పారంటున్నారు. రెండో రోజు అభివృద్ధి కార్యక్రమాల్లో మోడీ గడిపారు. అంటే.. ఏపీలో మోడీ పర్యటనలో రాజకీయ పార్టీలకు ఇచ్చిన ప్రాధాన్యం ఏమిటన్నది స్పష్టం చేశారంటున్నారు. వైజాగ్ లో తన పర్యటనను పోలీసుల ద్వారా అడ్డుకున్న వైసీపీ సర్కార్ తీరుతో  పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రవేశాలకు గురయ్యారు. విశాఖ నుంచి మంగళగిరి వచ్చిన పవన్ కళ్యాణ్ వైసీపీ  నేతలు, మంత్రులకు చెప్పు చూపించి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఆవేశపూరితంగా చేసిన ప్రసంగం ఏపీలో తీవ్ర సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ సభ తరువాత విజయవాడలో బస చేసిన హొటల్ కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెళ్లి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచారు. వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ-జనసేన-బీజేపీలతో బలమైన ఉమ్మడి ప్రతిపక్షం ప్రతిపాదన చేస్తున్న పవన్ కళ్యాణ్ ఉత్సాహానికి ప్రధాని మోడీ తన రూట్ మ్యాప్ ద్వారా బ్రేక్ వేశారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. నిజానికి టీడీపీ-జనసేన-బీజేపీలతో ఏర్పడిన ఉమ్మడి విపక్షం అయితే.. అధికార వైసీపీని వచ్చే ఎన్నికల్లో మట్టి కరిపించవచ్చనే అభిప్రాయాలు  సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికి టీడీపీతో పొత్తు గురించి ఆలోచించవద్దని, బీజేపీ-జనసేన మాత్రమే కలిసి ముందుకు వెళ్లాలని, వచ్చే ఎన్నికల నాటికి అవసరం, అవకాశాన్ని బట్టి టీడీపీతో పొత్తు విషయం చూద్దామని పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోడీ చెప్పినట్లు తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందువల్లే పవన్ కళ్యాణ్ నిరుత్సాహం కలిగిందంటున్నారు. మోడీతో భేటీ తర్వాత బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ మాటల్లో ఆ నిరుత్సాహమే కనిపించిందంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ పొత్తుల విషయమై మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండానే  వెళ్లిపోయారంటున్నారు. అందుకే మోడీతో సమావేశం సందర్భంగా తమ మధ్య ప్రస్తావనకు వచ్చిన అంశాలు చెప్పకుండా పవన్ మౌనం వహించారంటున్నారు. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ తో మోడీ ప్రత్యేకంగా భేటీ అవడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. జనసేనను ఓ రాజకీయ పార్టీగా గుర్తించబోమని చెబుతున్న వైసీపీ సర్కార్ కు పవన్ కు అంత ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మోడీ గట్టి ఝలక్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

గుజరాత్ లో పుంజుకున్న కాంగ్రెస్.. బీజేపీకి గడ్డు కాలమేనా?

వరుసగా ఆరు దఫాలుగా గుజరాత్ లో అధికారాన్ని నిలుపుకుంటూ వస్తున్న బీజీపీకి ఈ సారి మాత్రం గడ్డు పరిస్థితులు ఎదురు కాక తప్పదని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్ లో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుందంటున్నాయి. రంగంలో ఆప్ ఉండటంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ అనివార్యమైన పరిస్థితుల్లో తాజాగా  శ్రీ ఆత్మసాక్షి (ఎస్ఎఎస్)  సర్వే ఫలితాలు పట్టణ ప్రాంతాలకే ఆప్ ప్రభావం పరిమితమైందని తేల్చింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల అంటే డిసెంబర్ 1,5 తేదీలలో రెండు ధఫాలుగా జరగనున్న సంగతి విదితమే. ఈ ఎన్నికలలో బీజేపీ- కాంగ్రెస్ ల మధ్య హోరా హోరీ పోరు జరగనుందని ఎస్ఎఎస్ సర్వే పేర్కొంది. అయితే పట్టణ ప్రాంతాలలో కాంగ్రెస్ అవకాశాలపై ఆమ్ఆద్మీ పార్టీ తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నప్పటికీ గ్రామీణప్రాంతాలలో మాత్రం కాంగ్రెస్ పై చేయి సాధించడం ఖాయమని సర్వే తేల్చింది. గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ కంటే కాంగ్రెస్ కు 4.5 నుంచి 5 శాతం ఓట్లు అధికంగా వస్తాయని పేర్కొంంది.  ప్రధానంగా సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ లలో బీజేపీ అభ్యర్థులు తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని ఎస్ఎఎస్ సర్వే పేర్కొంది.  నిరుద్యోగ యువత, రైతులు, మత్స్య కారులు,  ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీలలో బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని పేర్కొన్నారు. అయితే ఇప్పటికిప్పుడు గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే 94 నుంచి 98 స్థానాలలో  బీజేపీ విజయం సాధించే అవకాశాలున్నప్పటికీ.. ఎన్నికల ప్రక్రియ కొనసాగే క్రమంలో రాష్ట్రంలో బీజేపీ తన ఓట్ల శాతాన్ని గణనీయంగా కోల్పోయే అవకాశాలు ప్రస్ఫుటుంగా కనిపిస్తున్నాయని సర్వే పేర్కొంది. బీజేపీలో మరో సారి అధికారం చేపట్టాలన్న బీజేపీ ఆకాంక్షసులభ సాధ్యం అయితే కాదని సర్వే ఫలితం వెల్లడించింది. ఇప్పటికే ఆప్, కాంగ్రెస్ పార్టీల వాగ్దానాలు జనంలోకి వెళ్లిపోయాయనీ, అయితే ఇతర పార్టీలతో పోలిస్తే క్షేత్ర స్థాయిలో  బీజేపీ కేడర్ కు ప్రభావమంతమైన క్యాడర్ ఉండటం ఒక్కటే ఆ పార్టీకి కలిసి వచ్చే అంశమనిసర్వే పేర్కొంది. అయితే గ్యాస్, పెట్రోల్, డీజిల్ధరలపెరుగుదల, నిరుద్యోగం,  లోపభూయిష్టంగా విద్యా సంస్థల పని తీరు,  33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, 8 మంది మంత్రులకు టికెట్లు నిరాకరిండం వంటి అంశాలు బీజేపీకి వ్యతిరేకంగా ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయని సర్వే పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం బీజేపీకి దాదాపు 6.25 శాతం మందిని ఓట్లను దూరం చేసే అవకాశం  ఉందంటున్నారు. కాగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతంలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ల మధ్య త్రిముఖ పొరు హోరాహోరీగా జరిగే అవకాశం ఉండగా.. గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖీ పోరే జరుగుతుందని సర్వే వివరించింది.  48 అసెంబ్లీ స్థానాలున్న సౌరాష్ట్ర ప్రాంతంలో  బీజేపీ  కేవలం 11 నుంచి15స్థానాలలోనే విజయం సాధించే అవకాశాలున్నాయనీ, అదే కాంగ్రెస్22నుంచి23 స్థానాలలోనూ, ఆప్ మూడు నుంచి నాలుగు స్థానాలలోనూ గెలుపు అవకాశాలున్నాయనిఎస్ఎఎస్ సర్వే పేర్కొంది. మరో 6స్థానాలలో తీవ్రమైన పోటీ నెలకొని ఉన్నట్లు  సర్వే తేల్చింది.  

నెటిజన్ల ట్రోలింగ్ కు రోజా మరోసారి

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా... తాజా వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. పూర్తిగా కాషాయం బట్టలతో ఆర్కే రాజా పడవపై కూర్చొని.. నదీ విహారం చేస్తూ..  పక్షులకు గింజలు వేస్తూ.... తపస్సు చేస్తూ.. పడవపై కూర్చొని కాళ్లతో నదీలో నీళ్లతో ఆడుతోంది. మంత్రి ఆర్కే రోజా.. అయోధ్యలోని రామజన్మ భూమిలో పర్యటించారని..  అనంతరం ఆమె త్రివేణి సంగమం వద్ద నదీ విహారం చేస్తున్న సమయంలోనిదీ  వీడియో అంటూ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో కథనాలు   వెల్లువెత్తాయి.  రోజా వీడియోపై  నెటిజన్లు.. తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పర్యాటక శాఖ మంత్రిగారికి ఇంతకన్నా పనేముందని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రోజమ్మ గారు గుళ్లూ గోపురాలకు కీ ఇచ్చిన బొంగరంలా రింగ రింగా అంటూ తిరిగేస్తున్నారని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని గుళ్లూ గోపురాలన్నీ ఈ మంత్రి రోజా  తిరిగేశారని.. ఇప్పుడు దేశంలోని గుళ్లు గోపురాల చుట్టూ ప్రదక్షణ చేస్తున్నారని ఇంకో నెటిజన్లు పేర్కొన్నారు. మరోకరు అయితే ఏకంగా..  తీర్థయాత్ర.. తీర్థయాత్ర.. తీర్థయాత్ర అంటూ కామెంట్ పేట్టేశారు. జపం జపం జపం.. కొంగ జపం.. అంటూ మరో నెటిజన్ సెటైరికల్‌గా కామెంట్ పెట్టాడు.   రోజా... గతంలో సినిమాల్లో హీరోయిన్‌గా నటించారని.. ఆ రంగం నుంచి ఇంకా ఆమె బయటకు రాలేకపోతోందని మరి కొందరు అంటున్నారు. అయినా బాధ్యతగల ఓ మంత్రిగా రోజా ఆ బట్టలు? ఆ మెడలో దండ ఏమిటని ప్రశ్నిస్తున్నారు.  అయినా ఇటీవల విశాఖ ఎయిర్ పోర్టులో ఆర్కే రోజా వ్యవహారంపై ఇప్పటికే సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు మండిపడుతున్నారు. కీలక మంత్రి పదవిలో ఉండి.. ఇలా వ్యవహరించడం ఎంత వరకు సబబు అని నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల్లోకి అంతగా వచ్చిందేలేదని... అలాగే మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కనీసం సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించకుండా.. ప్రజా సమస్యలను పట్టకుండా రాష్ట్రంలో ఉండకుండా... బయట రాష్ట్రాల్లో పర్యటనలు ఏమిటని   ప్రశ్నిస్తున్నారు.  జగన్ తొలి కేబినెట్‌లోనే కాదు.. మలి కేబినెట్‌లో సైతం అలాంటి మంత్రులే ఉన్నారని నెటిజన్లు అంటున్నారు.  మరోవైపు  కొత్తా దేవుడండి.. కొంగొత్త దేవుడండీకి పేరడీగా.. కొత్త దేవతండి.. కొంగొత్త దేవతండి అంటూ మంత్రి రోజా వ్యవహార శైలిపై  ఉందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా మంత్రి రోజా నిత్యం వార్తల్లో ఉండేందుకే ఇలా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

జగన్ దారెటు..? గడప గడపకూ లక్ష్యం ఏమిటి?.. ఎమ్మెల్యేల ఆందోళనకు కారణం?

అభివృద్ధి, సంక్షేమం గురించి పట్టించుకోకండి.. ప్రజా విమర్శలను లెక్క చేయకండి.. నిరసన సెగలు మాడ్చేస్తున్నా గడపగడపకూ తిరగండి అంటూ పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ హుకుం దేనికి సంకేతం. రోగం ఒకటైతే జగన్ మందు మరొకటి వేస్తున్నారంటూ పార్టీ నాయకులు, విపక్షాలే కాదు.. విమర్శకులు, విశ్లేషకులు కూడా పదే పదే చెబుతున్నా అయిన ఎందుకు పట్టించుకోవడం లేదు?   చెప్పేవాడికి  వినేవాడు లోకువ అన్నట్లు, ఆయన తన ఎదుట నోరెత్తలేరన్న నమ్మకంతో ఎమ్మెల్యేలకు పాఠాలు బానే చెపుతున్నారు. గడప గడపకు వెళ్ళక పోతే గండం తప్పదని, టికెట్ రాదని  హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీటింగుల్లో, వర్క్ షాపుల్లో పేరు పెట్టి మరీ క్లాసులు పీకుతున్నారు.   ఈ తంతు ఒక విధంగా గుడ్డొచ్చి పిల్లను ఎక్కిరించింది అన్నట్లు  ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. రాజకీయాలలో డక్కీమొక్కీలు తిన్న సీనియర్ మంత్రులు,ఎమ్మెల్యేలకు జగన్ గెలుపు పాఠాలు వినిపిస్తున్నారు. రాజకీయాల్లో షార్ట్కట్స్ ఉండవని చెప్పు కొస్తున్నారు. నిజానికి, ఆయన క్లాస్ పీకుతున్న వైసీపీ  ఎమ్మెల్యేల విషయం  పక్కన పెడితే  జగన్ రెడ్డి  ముఖ్యమంత్రి అయినది మాత్రం అడ్డదారిలోనే. వైఎస్సార్ ఆకస్మిక,  మరణాన్ని జగన్ రెడ్డి సానుభూతిగా మలచుకుని అడ్డదారుల్లో రాజకీయ నిచ్చెనలు ఎక్కారు. అంతే కానీ, కష్టపడి కింది నుంచి పైకొచ్చిన నాయకుడు కాదు. ఆయన ఆస్తులు ఎలా సంపాదించారో, అధికారాన్ని అదే దారిలో అందుకున్నారు.   అయినా, ఆయన ఇప్పుడు రాజకీయాల్లో నిలబడాలంటే కష్టపడవలసిందే, జనంలో ఉండవలసిందే అంటూ,గడప గడప గడపకు వెళ్లి, జనం, ‘దీవెనలు’ అందుకోవాలని చెపుతున్నారు. నిజానికి, ముఖాన నెత్తురు చుక్కలేకుండా అయన ఎదురుగా కుర్చుని పాఠాలు వింటున్నవారిలో చాలా మందికి జగన్ రెడ్డి కంటే చాలా చాలా అనుభవమే వుంది. రాజకీయాల్లో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి గెలుపు ఓటముముల పోరాటంలో ఎదిగొచ్చిన వారే. అలాంటి సీనియర్ ఎమ్మెల్యేలకు జగన్ రెడ్డి పాఠాలు చెప్పడం, అయితే ఆయన గడుసు తనం అవుతుంది, కాదంటే అజ్ఞానం అనిపించుకుంటుంది. అదీ కాదంటే ఆ ఎమ్మెల్యేల ఖర్మ అవుతుంది తప్ప మరొకటి కాదని పరిశీలకులు అంటున్నారు. అసలింతకీ, జగన్ రెడ్డి ఎందుకు, గడప గడపకు కార్యక్రమం ఒక్కటే గెలుపు మంత్రం అని ఎందుకు అనుకుంటున్నారు.   సమీక్షలు పెట్టి మనీ మంత్రులు, ఎమ్మెల్యేల ముఖాన, ఓటమి ముద్ర వేసి కించపరుస్తున్నారు. అంత్య నిష్టూరం, కంటే ఆది నిష్టూరం మేలని భావించి ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారా?  వాస్తవానికి ముఖ్యమంత్రి జగనే గత  మూడేళ్ళుగా ప్యాలెస్ గడప  దాటకుండా, దాటినా పోలీసు బందోబస్తు మధ్య జనానికి  ముఖం చూడకుండా పరదాలు కప్పించుకుని మరీ తిరుగుతున్నారు. అలాంటి సీఎం  గడప గడపకు మంత్రులు, ఎమ్మెల్యేలను బలవంతంగా ఎందుకు తరుముతున్నారు? ప్రజా వ్యతిరేకతను అధిగమించి.. మరో సారి అధికారంలోకి రావాలంటే.. తన నిష్క్రియాపరత్వంతో ప్రజలలో డమ్మీలుగా మారిన ఎమ్మెల్యేలను వదిలించుకుని కొత్త వారితో మరోసారి అధికారం కోసం ప్రయత్నించాన్న వ్యూహమే ఇందుకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏం చేసినా ఎంతమందిని మార్చినా ఓటమి తప్పదంటూ సర్వేలు ఘోషిస్తున్న నేపథ్యంలో  సిట్టింగ్ ఎమ్మెల్యేలలో మూడొంతుల మందిని పక్కన పెట్టి కొత్త వారిని రంగంలోకి దింపే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. విజయంపై జగన్ కు మిగిలిన దింపుడు కళ్లెం ఆశ అది ఒక్కటే అని అంటున్నారు. అందుకే వర్క్ షాపులు, సమీక్షల పేరిట ఎమ్మెల్యేలకు పొమ్మనలేక పొగపెట్టే చర్యలకు ఉపక్రమిస్తున్నారని చెబుతున్నారు.  జగన్ పాచిక పారుతున్నట్లే కనిపిస్తోందని అంటున్నారు.  ఇప్పటికే  సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలా మంది పోటీకి విముఖత చూపుతున్నారన్న సంకేతాలు కనిపించడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. జగన్ చెబుతున్నట్లు గడప గడపకూ మన ప్రభుత్వం నిజంగానే గెలుపు మత్రం అయి ఉంటే జగన్ హెచ్చరికలను ఎమ్మెల్యేలు లైట్ గా తీసుకునే అవకాశం ఇసుమంతైనా ఉండేది కాదనీ, కానీ జగన్ చెప్పినా, హెచ్చరించినా, టికెట్ ఉండదని చెబుతున్నా ఎమ్మెల్యేలు పెద్దగా పట్టించుకోకుండా ఎందుకు ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ ప్రజా విశ్వసనీయత సంగతి పెడితే సొంత పార్టీలు, ఎమ్మెల్యేల విశ్వాసమే కోల్లోయారని, అందుకు నిదర్శనమే చాలా మంది సీనియర్ నేతలకు కూడా వచ్చే ఎన్నికలలో పోటీకి పెద్దగా సుముఖత లేకపోవడమే నిదర్శనమని అంటున్నారు. బుగ్గన, పేర్ని నాని వంటి నేతలే అధినేత స్వయంగా చెప్పినా పోటీకి ససేమిరా అంటున్న పరిస్థితి. ఇస్తే వారసులకు టికెట్ ఇవ్వండి.. లేకుంటే లేదు.. మేం మాత్రం ఎన్నికల బరిలో పోటీకి తీరేది లేదని కుండబద్దలు కొడుతున్నట్లు చెప్పడానికి వెనుక కారణం ఓటమి భయమేనని అంటున్నారు. అలాగే సీనియర్ నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ కూడా మాకే గెలిచే అవకాశాలు అంతంత మాత్రం అనుకుంటుంటే... ఇక వారసులను దింపి ఉపయోగమేమిటనీ, వారిని గెలిపించుకునే పరిస్థితి లేదని అన్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వైసీపీ నాయకులు వచ్చే ఎన్నికలలో గెలిచేది ఎలాగూ లేదన్న నిర్ణయానికి వచ్చేశారా అంటే.. ఇటీవల ఒక సందర్భంలో మంత్రి బొత్స సత్యనారాయణ అన్న మాటలను బట్టి ఔననే అనుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల బొత్స ఓ సందర్భంలో  ప్రతి విషయం ప్రజలకు చెప్పి, వారి ఆమోదం పొంది చేయడం మా వల్ల కాదు అని ఊరుకోకుండా.. మహా అయితే ఏమౌతుంది ఓడిపోతాం అంతేగా అంటూ వ్యాఖ్యానించారు. ఆ మాటల ద్వారా ప్రజా శ్రేయస్సు, ప్రజాభీష్టం, ప్రజల ఆకాంక్షలు తమ సర్కార్ కు ఏ మాత్రం పట్టవని తాము తలచిందే చేస్తాం,  మా ప్రభుత్వం మొండి కేసేసిందని చెప్పకనే చెప్పారు. వాస్తవానికి సీఎం జగన్ కు కూడా ఓటమి విషయంలో ఒక స్పష్టత వచ్చేసిందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యమంత్రి  ఇటీవల నిర్వహించిన వర్క్ షాపులో  27 మంది ఎమ్మెల్యేల పేర్లను   మాత్రమే ఓటమి జాబితాలో చేర్చినా, వాస్తవానికి  మొత్తం 151 మంది ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేలలో కనీసం 27 మంది కూడా విజయం సాధించే అవకాశాలు లేవన్నది జగన్ కు అందిన నివేదికలు, ఇటీవలి సర్వేల సారాంశమని వారు విశ్లేషిస్తున్నారు. అయితే పార్టీ ప్రస్తుత పరిస్థితి ఎమ్మెల్యేలు ఒక కారణమైతే.. ఆ ఓటమికి ప్రధాన బాధ్యత మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అనుభవ రాహిత్యంతో  తీసుకున్న తప్పుడు నిర్ణయాలు. ఎమ్మెల్యేలను ఉత్సవ విగ్రహాలు చేసి వారికి విధులు, నిధులు లేకుండా చేసి, వాలంటీర్లతో పనులు కానీయడంతో ఎమ్మెల్యేలకు ప్రజలతో సంబంధాలు తెగిపోయేలా చేసిన విధానాలు ప్రధాన కారణమని అంటున్నారు. అలాగే గత మూడేళ్ళుగా నియోజక వర్గం అభివృద్ధి నిధులు విడుదల కాకపోవడంతో ప్రజలు అడిగే ఏ చిన్నపని చేయలన్నా, చేతులు ఆడని పరిస్థితిలో ఎమ్మెల్యేలు దిక్కులు చూస్తున్నారు. మరోవంక మీట నొక్కితే ఓట్లు రాలతాయని ఆయన వేసుకున్నతప్పుడు లెక్కలూ ఇవన్నీ కలిసి వైసీపీ ప్రస్తుత పరిస్థితికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ప్రజా వ్యతిరేకత అంతా ఎమ్మెల్యేల మీదే అని నిర్ధారించి, వారిని వదిలించుకునేందుకే జగన్  గడప గడప అంటూ జపం చేస్తున్నారంటున్నారని చెబుతున్నారు. మీట నొక్కి డబ్బులు లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు వేస్తున్నా జనం వ్యతిరేకత ఎందుకు అని జగన్ ఆశ్చర్యపోతున్నారంటున్నారు. నిజానికి ప్రజలు సంక్షేమ పథకాలు అందితే చాలని అనుకోవడం లేదు. అభివృద్ధి కూడా కావాలని కోరుకుంటున్నారు. మౌలిక సదుపాయాల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు  ఎక్కడని ప్రశ్నిస్తున్నారు.సంక్షేమ పథకాలు ప్రయోజనాలు అందుకుంటున్న ప్రజలు కూడా, గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు.   విద్యా వైద్య సదుపాయాల గురించి అడుగుతున్నారు? మూడేళ్ళలో విద్యుత్ చార్జీలు ఏడు సార్లు, ఆర్టీసీ చార్జీలు నాలుగు సార్లు  ఎందుకు పెంచారని ప్రశ్నిస్తున్నారు. నిత్యావసర సరకుల ధరలను అదుపు చేయడం చేతకాదా? అని దుయ్యబడుతున్నారు. అంచల వారీ మధ్య నిషేధం ఏమైందంటున్నారు. సంక్షేమ పథకాల పేరున చేస్తున్న అప్పులు, వసూలు చేస్తున్న పన్నులు ఏమవుతున్నాయని అడుగుతున్నారు. ఈ చేత్తో ఇస్తూ ఆ చేత్తో అంతకు పదిరెట్లు గుంజుకుంటున్న సర్కార్ దగాకోరు విధానాలను ప్రశ్నిస్తున్నారు. అందుకే, ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లేందుకు గజగజలాడుతున్నారు. నిజానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి కాలు కదపకుండా నిర్ణయాలు తీసుకుని జగన్, బటన్లు నొక్కి, రాష్ట్రంలో 85 శాతం మందికి ప్రభుత్వ సహాయం అందుతోందని లెక్కలు చెబుతున్నదీ ఆయనే ,  అయినా పేరుకు మాత్రమే పదవులలో ఉన్న ఎమ్మెల్యేలపై నెపం నెట్టి చేతులు దులిపేసుకునేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారు.

కేటీఆర్ కు పగ్గాలు... హరీష్ కు జాతీయ బాధ్యతలు.. కేసీఆర్ వ్యూహమిదేనా?

ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాల్లో మునిగి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రకటన తరువాత నుంచే కేసీఆర్, రాష్ట్రంలో కంటే ఢిల్లీలో, కాదంటే ఇతర రాష్ట్రాల పర్యటనలలోనే ఎక్కువగా ఉంటారనే సంకేతాలు విస్పష్టంగా కనిపించాయి. ఆ పర్యటనల కోసమే ‘ఛార్టర్డ్ ఫ్లైట్’ ను కూడా కొనుగోలు చేసి సిద్ధం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో, రాష్ట్ర రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా అధికార పార్టీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకునే అవకాశాలపై తెరాస శ్రేణుల్లోనే కాదు పరిశీలకుల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వాస్తవానికి దసరా రోజున కేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావ ప్రకటన రోజునే ఈ సంకేతాలు ఇచ్చారు. పార్టీ ముఖ్య నేతలకు బీఆర్ఎస్ లో కీలక బాధ్యతలను అప్పగిస్తాననీ చెప్పారు.  ఈ నేపద్యంలో, కొందరు ‘ముఖ్య’ నేతలను ఇక్కడి బాధ్యతల నుంచి  తప్పించి, జాతీయ బాధ్యతలు అప్పగించడమో, లేక రాష్ట్ర బాధ్యతలకు అనుగుణంగా జాతీయ బరువును అదనంగా వారి మీద మోపడమో అనివార్యమన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక కారణంగా జాతీయ కార్యాచరణ వేగం ఒకింత తగ్గిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఇప్పుడిక మునుగోడు ఉప ఎన్నిక ఫలితం అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలలో దూకుడు పెంచే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే  మంగళవారం (నవంబర్ 15) పార్టీ లెజిస్లేచర్ పార్టీ, పార్లమెంటు సభ్యులు, కార్యవర్గ సభ్యుల సమావేశం ఏర్పాటు చేశారని కూడా అంటున్నారు. ఈ సమావేశంలోనే పార్టీ, ప్రభుత్వ బాధ్యతల బదలీపై ప్రకటన కూడా జరిగే అవకాశం ఉందంటున్నారు. అన్నిటికీ మించి   ముఖ్యమంత్రి కేసీఆర్, ఒక మాట మాట్లాడారంటే, ఆ మాటకు టీకా తాత్పర్యం, నానార్దాలు చాలానే ఉంటాయని తెరాస శ్రేణులే అంటున్నాయి. అలాగే, ఇప్పడు, ముఖ్యమంత్రి పార్టీ నేతలు జాతీయ బాధ్యతలకు సిద్ధం కావాలని సంకేత మాత్రంగా చేసిన వ్యాఖ్యల వెనక ప్రత్యేక  లక్ష్యం ఏదో ఉండే ఉంటుందంటున్నారు. ఆ అక్ష్యం ఏమిటన్నదానిపై పలు రకార ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ ఏ ఉద్దేశంతో సీనియర్ నేతలకు జాతీయ బాధ్యతలు అన్నారన్న విషయం మంగళవారం (నవంబర్ 15) జరిగే కీలక సమావేశంలో తేలిపోనుంది.  అయినా ముఖ్యమంత్రి ‘జాతీయ బాధ్యతలు’ అన్న మాటలో అలాంటి అర్థాలు ఉన్నా, లేకున్నా నిజంగా సీరియస్ గా జాతీయ రాజకీయాల్లో ముందుకు పోవాలంటే,అది కేవలం కేసీఆర్ వల్ల అయ్యే పని కాదు, ఒకరిద్దరు కాదు.. చాలా మంది చాలా త్యాగాలు చేయవలసి ఉంటుందని, ముఖ్యంగా తెరాస  నిర్మాణం నుంచీ కీలకంగా వ్యవహరించిన హరీష్ రావు వంటి ముఖ్య నేతలు ముందుగా త్యాగాలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. అందుకే కేసీఆర్ రాష్ట్ర నాయకులకు జాతీయ బాధ్యతలు అనగానే పార్టీలో, పరిశీలకుల్లో ఎన్నో రకాల సందేహాలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి. త్యాగాలకు సిద్ధం కావాల్సిన నేత లెవరన్న చర్చలూ సాగాయి. ఇప్పటికే ఢిల్లీ రాజకీయలలో సంబంధాలున్న  వినోద్ కుమార్, ప్రస్తుత మాజీ ఎంపీలతో పాటుగా సంస్థాగత నిర్మాణంలో,. సంస్థాగత వ్యవహారాలను చక్క పెట్డంలో ప్రతిభ చాటిన  హరీష్ రావు  వంటి వారి అవసరం జాతీయ పార్టీకి మరింత ఎక్కువ ఉంటుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అన్ని విధాల నమ్మిన బంటుగా ఉండే మేనల్లుడు హరీష్ రావుకే బీఆర్ఎస్ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి.   ముఖ్యమంత్రి కేసీఆర్, జాతీయ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే, ఆటోమేటిక్’గా ప్రస్తుతం సెకండ్ ఇన్ కమాండ్ గా ఉన్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు,  కేటీఆర్ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేపడతారు. అలాగే, ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాలో బిజీ అయిన తర్వాత, అవసరాన్ని బట్టి, ముఖ్యమంత్రి పదవి కూడా కేటీఆర్ కే దఖలు పడతాయి. అదే జరిగితే, జాతీయ స్థాయిలో కేసీఆర్ నాయకత్వంలో, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఎన్నికలకు వెళితే, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే, ప్రశ్న రాకుండా, ముందుకుసాగి పోయే అవకాశం ఉంటుందన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు.  అదే సమయంలో పార్టీకి కొంతలో కొంత కేటీఆర్ కు పోటీగా ఉంటారని భావించే హరీష్ రావును దూరం పెట్టడంలో భాగంగానే హరీష్ రావుకు జాతీయ బాధ్యతలు అప్పగించడమే మేలన్నది కూసీఆర్ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ముందస్తుకే కేసీఆర్ కసరత్తు

మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో మళ్లీ ముందస్తు తెరమీదకు వచ్చింది. ఈ విజయంతో తెరా శ్రేణుల్లో ఉత్సాహం వెల్లి విరుస్తోంది. పార్టీ శ్రేణుల్లో ఆ ఉత్సాహం అలా ఉండగానే ముందస్తుకు వెళ్లి లబ్ధి పొందాలని కేసీఆర్ యోచిస్తున్నారా అంటే పార్టీ శ్రేణులే కాదు పరిశీలకులు కూడా ఔననే అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల విజయం ఇచ్చిన ఉత్సాహంతో  తెలంగాణ‌లో ముందస్తు ఎన్నిక‌ల కోసం ముఖ్య‌మంత్రి కేసీఆర్  కసరత్తులు ప్రారంభించేశారనని అంటున్నారు.  గ‌తంలో కూడా ముందస్తు పార్టీకీ, కేసీఆర్ కు లబ్ధి చేకూర్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. మరో సారి కేసీఆర్ అదే బాటలో పయనించేందుకు ప్రయత్నాలు ప్రారంభించేశారని చెబుతున్నారు.  మంగళవారం  (నవంబర్ 15) కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న టీఆర్ఎస్ లెజిస్లేటివ్, అలాగే పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం  జరగనున్న నేపథ్యంలో ముందస్తు చర్చ పార్టీ శ్రేణుల్లో మరింత ముమ్మరంగా జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక‌లో విజయం సాధించడం, మ‌రోవైపు ప్ర‌ధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం క‌య్యానికి కాలు దువ్వుతుండ‌డంతో ఇక అమీతుమీ తేల్చుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో కేసీఆర్ ముందస్తు నిర్ణయం తీసేసుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లెజిస్లేటివ్‌, పార్ల‌మెంట‌రీ స‌భ్యుల‌తో పాటు పార్టీ రాష్ట్ర కార్య‌వ‌ర్గంతో మంగళవారం (నవంబర్ 15)సంయుక్త స‌మావేశం నిర్వ‌హించి ముందస్తుపై ఒక నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా మార్చిన నేపథ్యంలో మొద‌ట తెలంగాణ‌లో బ‌లాన్ని నిరూపించుకుని.. ఆపై జాతీయ స్థాయిలో జెండా ఎగురవేయాలన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు.   ఆ ఉద్దేశమే లేకుండా ఇప్ప‌టిక‌ప్పుడు పార్టీ లెజిస్లేచర్ భేటీ, పార్లమెంట్ సభ్యులు, కార్యవర్గ సభ్యులతో  కీల‌క స‌మావేశం నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం లేదని అంటున్నారు. అత్యంత కీల‌క‌మైన అంశంపై చ‌ర్చించేందుకే ఈ సమావేశాన్ని ఇంత హఠాత్తుగా కేసీఆర్ ఏర్పాటు చేశారని అంటున్నారు. ఆ కీలకమైన అంశం ముందస్తు ఎన్నికలేనని కూడా సూత్రీకరణలు చేస్తున్నారు. పరిశీలకులు విశ్లేషణలు సైతం ఆ దిశగానే ఉన్నాయి. అలాగే క్షేత్ర‌స్థాయిలోఎప్ప‌టిక‌ప్పుడు కేసీఆర్  ప‌లు స‌ర్వేలు చేయించుకుంటూ , వాటి ఫ‌లితాల‌కు అనుగుణంగా  వ్యూహాత్మకంగా ముందుకు నడుస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి   టీఆర్ఎస్ కీల‌క స‌మావేశంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది. ఈ కీలక సమావేశం వేదికగానే తన వారసుడిగా పార్టీ పగ్గాలు, ప్రభుత్వ పాలనా బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు,

పార్టీ, పాలనా బాధ్యతలు కేటీఆర్ కు.. కేసీఆర్ కార్యక్షేత్రం ఇక ఢిల్లీయే!?

మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తరువాత తెలంగాణలో రాజకీయ కాక పెరిగింది. ఉప ఎన్నికలో విజయంతో తెరాసలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. అదే సమయంలో గట్టి పోటీ ఇచ్చిన ఆనందం బీజేపీలో కనిపిస్తోంది. అయితే సిట్టింగ్ సీటు కోల్పోయిన కాంగ్రెస్ లో మాత్రం నిస్తేజం తాండ విస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు మరింత ఎక్కువయ్యాయి. ఇక మోడీ పర్యటనతో బీజేపీలో దూకుడు పెరిగింది. అవన్నీ పక్కన పెడితే.. తెరాస మాత్రం భవిష్యత్ కార్యాచరణతో ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. బీఆర్ఎస్ ను జాతీయ స్థాయలో బలేపేతం చేసేందుకు ఇక నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తినను కార్యక్షేత్రంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు.  ఢిల్లీలో భారీ బహిరంగ సభతో బీఆర్ఎస్ ఆగమనాన్ని ఘనంగా చాటాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు, కార్యాచరణ ఇప్పటికే మొదలెట్టేశారంటున్నారు. ఆ సభ వేదికగానే బీఆర్ఎస్ జెండా, అజెండా ప్రకటించే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలోనే  కేసీఆర్  మంగళవారం (నవంబర్ 15)న పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యవర్గ సమావేశంతో భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ పార్టీకి దిశా నిర్దేశం చేయనున్నారు.   కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలంటే.. ముందుగా రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వ బాధ్యతలను కేటీఆర్ కు పూర్తి స్థాయిలో అప్పగించాల్సి ఉంది. అందుకే నవంబర్ 15న జరగనున్న కార్యవర్గ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఏడాదిలో జరగాల్సిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కూడా కేసీఆర్ పార్టీ నాయకులు, కేడర్ కు దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది. అలాగే ముందస్తు ఎన్నికల ప్రతిపాదన కూడా సీఎం చేసే అవకాశం ఉందని తెరాస వర్గాలు చెబుతున్నాయి.  అన్నిటి కంటే ముఖ్యంగా   సీఎం బాధ్యతలు కేటీఆర్‌కు అప్పగించే విషయమై ఈ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ప్రకటేన చేసే అవకాశం ఉందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు కూడా కేసీఆర్ అనంతరం కేటీఆర్ ముఖ్యమంత్రి అని బహిరంగంగానే చెబుతున్నారు.   దానిపై ఈ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించేందుకు నిర్ణయించుకున్న కేసీఆర్ ఇక రాష్ట్ర పాలనా వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించడానికి అవకాశాలు తక్కువేననీ, అందుకే మొత్తం బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించి తన కార్యక్షేత్రాన్ని డిల్లీకి మార్చే నిర్ణయానికి వచ్చేసిన కేసీఆర్ కార్యవర్గ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. వచ్చే నెలలో గుజరాత్ మొత్తంగా కేసీఆర్ వచ్చే ఆరు నెలలు తెలంగాణలోనే తీరిక లేని రాజకీయ కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతారని అంటున్నారు. ఇప్పటికైతే ముందస్తు ఎన్నికల ఆలోచన లేదని.. బీజేపీ కూడా ముందుకు రాకపోవచ్చని అంటున్నారు. మంగళవారం కేసీఆర్ నిర్వహించనున్న విస్తృత కార్యవర్గ సమావేశంలో టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అందులోనే… ముందస్తుకు వెళ్తారా లేదా కేటీఆర్‌ను సీఎంను చేస్తారా అన్న విషయాలపై చూచాయగా అయినా కేసీఆర్ క్లారిటీ ఇచ్చే చాన్స్ ఉందని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. అన్నిటికీ మించి వచ్చే నెలలో గుజరాత్ కు అసెంబ్లీ కి రెండు విడతలుగా  ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్ లో బీఆర్ఎస్ పోటీపై ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చేసిన కేసీఆర్... ఆ రాష్ట్రంలో కనీసం ఆరేడు స్థానాలలోనైనా విజయం సాధించి మోడీకి సవాల్ విసరాలన్న అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ గుజరాత్ ఇన్ చార్జిగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శంకర్ శింగ్ వఘేలాను నియమించాలని ఆయన నిర్ణయించారనీ, శంకర్ సింగ్ వఘేలా కూడా ఒకటి రెండు రోజుల్లో తాను కేసీఆర్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ అంటున్నారు. అలాగే తెలుగు వారి సంఖ్య అధికంగా ఉండే సూరప్ ప్రాంతంలో మొదటిగా బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారు. అలాగే శంకర్ సింగ్ వఘేలా తోడ్పాటుతో గుజరాత్ లో మరి కొన్ని స్థానాలలో కూడా బీఆర్ఎస్ పాగా వేయగలదని ఆశిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మంగళవారం (నవంబర్ 15)న జరగనున్న టీఆర్ఎస్ కార్యవర్గ సమాశం ఎనలేని రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

మోడీ ప్రసంగంతో జగన్ డీలా... అశలన్నీ వమ్ము? కింకర్తవ్యం?

జగన్ మూడు రాజధానుల పల్లవిని ప్రధాని మోడీ అసలు వినడానికే ఆసక్తి చూపలేదా? మోడీ సమక్షంలో వికేంద్రీకరణ లక్ష్యం అంటూ జగన్ తన ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన తీసుకువచ్చినా మోడీ పట్టించుకోలేదా అంటే విశాఖ సభ వేదికగా మోడీ ప్రసంగం విన్నవారంతా ఔననే అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడటానికి ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో హీటెస్ట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశమే కారణమని చెప్పక తప్పదు. విశాఖలో మోడీ సమక్షంలో ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల ప్రస్తావన తీసుకువస్తారా?  తీసుకువస్తే మోడీ ఎలా రియాక్ట్ అవుతారు? మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఏపీ బీజేపీ నేతలకు గట్టిగా గళం వినిపించినప్పటికీ కేంద్రం నుంచి మాత్రం ఇప్పటి వరకూ ఎటువంటి స్పందనా లేదు. పైపెచ్చు రాజధాని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అన్నట్లుగానే కేంద్రం వ్యవహరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ విశాఖ సభ వేదికపై నుంచి మోడీ సమక్షంలో మూడు రాజధానుల ప్రస్తావన తీసుకురావడం అందుకు మోడీ అనుమతిని కోరినట్లుగానే అంతా భావించారు. దీనికి మోడీ ఏం చెబుతారా  అన్న అసక్తి అందరిలోనూ వ్యక్తమైంది. అయితే మోడీ తన  ప్రసంగంలో అసలు జగన్ ప్రస్తావించిన ఏ అంశాన్నీ కూడా స్పృశించలేదు. అసలు జగన్ ప్రసంగాన్నీపట్టించుకున్నట్లే కనిపించలేదు. జగన్ వినతులు, విజ్ణప్తులకు తన ప్రసంగంలో చోటివ్వలేదు.  దీంతో జగన్ మోడీని పొగడ్తల్లో ముంచెత్తి, ఆయన ప్రాపకం కోసం పడిన తాపత్రేయమంతా బూడిదలో పోసిన పన్నీరు చందమైంది.   మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని.. ఆ దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం జగన్, ఇతర కేబినెట్ మంత్రులు పదే పదే ఇదే మాట చెబుతున్న నేపథ్యంలో, అందులోనూ విశాఖ పాలనా కేంద్రంగా, అక్కడి నంచే త్వరలో జగన్ పాలన సాగిస్తారనీ  స్పష్టం చేస్తున్న తరుణంలో  విశాఖలో ప్రధాని మోడీ పర్యటనపై జగన్ సర్కార్ పలు ఆశలు పెట్టుకుంది. అందుకే మోడీ సభ ఏర్పాట్లను జగన్ సర్కార్ స్వయంగా భుజానికెత్తుకుంది. ప్రధాని మోడీ సభకు జనసమీకరణకు చెమటోడ్చింది. సభా ఏర్పాట్లతో మోడీని మెప్పించి, ఆయన సమక్షంలో మూడు రాజధానుల అంశం ప్రస్తావిస్తే ఆయన అభ్యంతరం చెప్పరని ఆశలు పెంచుకుంది. కేంద్రం మద్దతుతోనే మూడు రాజధానుల విధానాన్ని చేపట్టామని జనానికి చెప్పుకునే అవకాశం ఉంటుందనీ భావించింది. అయితే మోడీ తనదైన శైలిలో అసలా విషయం తన చెవిన పడలేదన్నట్లుగా వ్యవహరించడంతో జగన్ ఆశలు, వ్యూహాలు దెబ్బతిన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ప్రధాని ప్రసంగం విశాఖను ప్రస్తుతించడానికే పరిమితం?

మోడీ విశాఖ పర్యటనపై కనీవినీ ఎరుగని రీతిలో జగన్ సర్కార్ ఆర్బాటం చేసింది. రాజును మించిన రాజభక్తి ప్రదర్శించి మరీ జన సమీకరణ చేసింది. మోడీని మెప్పించి  రాష్ట్రాలనికి మేలు చేసేలా ఒకటి రెండు వరాలనైనా పొందాలని తాపత్రేయ పడింది. అయితే మోడీ ప్రసంగం అందుకు పూర్తి భిన్నంగా సాగింది. జగన్ ఆర్బాటం, తాపత్రేయం అంతా బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా మిగిలిపోయింది. అసలు మోడీ విశాఖ పర్యటన షెడ్యూల్ ఖరారైన నాటి నుంచీ ఏపీ వాసుల్లో ఎన్నో ఆశలు చిగురించాయి. గత ఎనిమిదేళ్లుగా అమలుకు నోచుకోని విభజన హామీలలో కొన్నిటి విషయంలోనైనా మోడీ సానుకూల ప్రకటన విశాఖ వేదిక మీద నుంచి చేస్తారని ఆశించారు. అయితే మోడీ అసలా విషయాలనే పట్టించుకోలేదు. దేశంలో విశాఖపట్నం వినా మరో అద్భుత నగరం లేదన్నట్లుగా కేవలం విశాఖను ప్రస్తుతించేసి తన ప్రసంగాన్ని ముగించేశారు. దేశ ప్రధాని ఒక రాష్ట్ర పర్యటనలో తన ప్రసంగంలో కేవలం ఒక్క నగరం గురించి ప్రస్తావించడానికే పరిమితం కావడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమౌతోంది.  ఏయూ   మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక నుంచి రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. అయితే ఆ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం మాత్రం రాష్ట్ర ప్రజలకు నిరాశనే మిగిల్చింది.  మోడీ ప్రసంగం ఆద్యంతం చప్పగా సాగింది.  హామీలు, వాగ్దానాలు లేవు. పెండింగ్ హామీల ప్రస్తావన లేదు.  దక్షిణ కోస్తా రైల్వేజోన్ పై  ప్రకటన లేదు. విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటుకు రైల్వే బోర్డుకు  గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు మోడీ ప్రకటన చేస్తారనీ,  106కోట్లతో వైర్ లెస్ కాలనీ దగ్గర జోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణంకు అనుమతి ఇస్తున్నట్లు విశాఖ వేదికగా చెబుతారనీ అంతా భావించారు. అదేమీ లేదు. అఖరికి వాల్తేర్ డివిజన్ భవిష్యత్ పై క్లారిటీ సైతం ఇవ్వలేదు.  యధా ప్రకారం ప్రజలను రంజింపచేయడానికి ఆయన తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ఇటీవల అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల సందర్భంగా ఏపీకి   రావడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. ఇప్పుడు మరో సారి రాష్ట్ర పర్యటన రావడం మరెంతో ఆనందంగా ఉందన్నారు. దేశంలోని ప్రముఖ నగరాలలో విశాఖ ఒకటన్న మోడీ...  ఆ నగర ప్రాశస్థ్యాన్ని వివరించడానికే పరిమితమయ్యారు. విశాఖ చరిత్రను వివరిస్తూ చెప్పింది వినండి అన్నట్లుగా వ్యవహరించారు.  

నాడు అందరి వాడు.. నేడు ఏకాకి.. మరో చాన్స్ దక్కేనా?

గత ఎన్నికల్లో 151 స్థానాలు కైవసం చేసుకుంటే.. రానున్న ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాలు ఫ్యాన్  పార్టీ ఖాతాలో గంపగుత్తగా పడిపోవాలి... ఇది ప్రస్తుత వైసీపీ అధిరుత, సీఎం  జగన్ టార్గెట్. ఆ క్రమంలో ఆయన టార్గెట్ 2024 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఈ అంశంపై ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గంలో భిన్నమైన వాదన వినిపిస్తోంది.  గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేశారు. ఆ సమయంలో.... రాజన్న రాజ్యం తీసుకు రావడం కోసం.. తన కుమారుడుకి ఒక్క చాన్స్ ఇవ్వండంటూ ఆయన తల్లివిజయమ్మ ప్రజల్లోకి వెళ్లీ మరీ విజ్జప్తి చేశారు. అలాగే  జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం జగనన్న వదిలిన బాణమంటూ  షర్మిల పాదయాత్రే కాదు.. బై బై బాబు అంటూ బస్సు యాత్ర సైతం చేశారు. అలాగే   జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ.. టాలీవుడ్‌లోని పలువురు నటీనటులు జోరుగా ప్రచారం సైతం నిర్వహించారు.   ఇక ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ చెందిన ఐ ప్యాక్... కథ స్క్రీన్ ప్లే దర్శకత్వంలో ఏం చెబితే అది  జగన్ తు.చ తప్పకుండా పాటించి.. పాదయాత్ర సైతం చేశారు. ఆ క్రమంలో జగన్ పార్టీ 151 సీట్లలతో బంపర్ మెజార్టీతో గెలుపొందింది. మరి వచ్చే ఎన్నికల్లో పార్టీ అధినేత   జగన్ పెట్టుకొన్న టార్గెట్‌ను రీచ్ అవుతారా? అంటే సదరు వర్గం పెదవి విరుస్తోందని తెలుస్తోంది. అంతేకాదు అందుకు కారణాలు సైతం సదరు వర్గం సోదాహరణగా వివరిస్తుండడం మహా విశేషం.  గతంలో అంటే 2019 ఎన్నికల వేళ.. జగన్ వెంటే అందరు అంటే తల్లి, చెల్లి, పులివెందుల్లోని ఫ్యామిలీ సభ్యులు, టాలీవుడ్‌లోని పలువురు నటీనటులు ఉన్నారని.. కానీ నేడు ఆ పరిస్థితి లేదని ఆ వర్గం  గుర్తు చేస్తోంది. అలాగే గత ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విశాఖ ఎయిర్ పోర్ట్ సాక్షిగా కోడి కత్తి దాడి కేసు అయితేనేమీ.. సీఎం వైయస్ జగన్ సొంత బాబాయి వైయస్ వివేకా దారుణ హత్య కేసు అయితేనేమీ.. నాడు జగన్ పై సానుభూతికి దోహదం చేశాయి. అయితే నేటికీ వాటి దర్యాప్తు ఎంత వరకు వచ్చిందంటే.... ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందని.. ఈ సంగతి తెలుగు ప్రజలకే కాదు... ఆయా కేసులు దర్యాప్తు చేస్తున్న సంస్థలకు సైతం తెలుసునని ఆ వర్గం  పేర్కొంటోంది. అంతేకాదు.. సదరు కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని.. ఈ నేపథ్యంలో  ప్రజల కళ్లని సీఎం వైయస్ జగన్‌పైనే ఉన్నాయని చెబుతోంది.    అదీకాక.. ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ చెప్పిన దానికి.. ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత చేస్తున్న వాటికి ఎక్కడ పొంతన అనేది లేకుండా ఉందని... సదరు వర్గం సోదాహరణగా వివరిస్తుంది. జగన్ పరిపాలన విధానాలతో.. టాలీవుడ్‌లో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా.. దాదాపుగా దూరమయ్యారు. మరోవైపు వైఎస్ ఫ్యామిలీలోని  అవినాష్ రెడ్డి కుటుంబం తప్ప.. మిగిలిన వారంతా వైయస్ జగన్‌తో సాధ్యమైనంత మేర దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. చివరకు తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కూడా జగన్ కు దూరం జరిగారు. పక్క రాష్ట్రం తెలంగాణకు తరలిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్ తరఫున ప్రచారం చేసే వారు.. ఎవరు అంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందని.. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల వేళ.. జగన్ అండ్ కోకు తీవ్ర ఇబ్బందులు తప్పవని వైసీపీలోని  ఓ వర్గంలో  చర్చ వాడి వేడిగా నడుస్తోంది. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత..   జగన్ అందరినీ దూరం చేసుకుని.. ఒకే ఒక్కడుగా మిగిలిపోయారని సదరు వర్గం అభిప్రాయపడుతోంది. మరి వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి ఎత్తులు, ఎత్తుగడలు వేస్తారోనని... ఇటు ప్రజలే కాదు.. అటు ఉమ్మడి కడప జిల్లా పులివెందుల్లోని  ఫ్యామిలీ సైతం.. టెన్షన్‌గా ఉందని ఆ వర్గం పేర్కొంటోంది. మరి వచ్చే ఎన్నికల వేళ.. వైయస్ జగన్ వెంట ఎవరు  వస్తారు.. ఎవరు నడుస్తారు అనే అంశం ప్రస్తుతం ఫ్యాన్ పార్టీలో ఓ చర్చ అయితే రచ్చ రచ్చగా సాగుతోన్నట్లు తెలుస్తోంది.  

మోడీ ‘ఛార్జ్’తో జగన్ కు తిప్పలే..?

ప్రధాని మోడీ ఒక పక్కన వైఎస్ జగన్ ను కొడుకు మాదిరిగా ట్రీట్ చేస్తున్నట్లు కనిపిస్తారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ జగన్ కు అడిగిందే తడవు అన్నట్లు అపాయింట్ మెంట్లూ ఇచ్చేస్తుంటారు. ఏపీకి ఏమీ చేయకపోయినా ఏదో మాయమాటలు చెప్పి, వట్టి చేతులతో వెనక్కి పంపించేస్తుంటారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పట్ల ప్రధాని మోడీ అనురిస్తున్న వైఖరిలో ఇది ఒక పార్శ్వం. తాజాగా విశాఖపట్నం పర్యటనకు వచ్చి.. జగన్ లెక్కలేంటో, తప్పిదాలేంటో వెలికి తీయాలని బీజేపీ స్థానిక నేతలను పురమాయించారు. జగన్ సర్కార్ తప్పిదాలపై ఎప్పటికప్పుడు ఛార్జ్ షీట్ వేయాలని చెప్పారు. ఆ చార్జి షీట్లను పల్లె నుంచి పట్టణం దాకా, పంచాయతీ నుంచి మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు జనంలోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. జగన్ అవినీతి, అరాచకాలను ఉపేక్షించవద్దని వారికి చెప్పారు. ఏపీ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని జగన్ పాడుచేసుకుంటున్నారని, ఆ అవకాశాన్ని మనం రాజకీయంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. మీ పని మీరు చేయండి.. మీకు అధిష్టానం అండగా ఉంటుంది అని బీజేపీ కోర్ కమిటీ భేటీలో పార్టీ ఏపీ నేతలను ఆదేశించారు. అంతటితో ఆగకుండా వైసీపీ సర్కార్ పై నేరుగా యుద్ధానికి దిగాలని బీజేపీ నేతలకు సంకేతాలు ఇస్తారు. సమాఖ్య స్ఫూర్తికి మాత్రమే తాను కట్టుబడి ఉంటానని, ఎవరిపైనా తనకు ప్రత్యేక ప్రేమ ఉండదని, ప్రభుత్వం ప్రభుత్వమే.. రాజకీయం రాజకీయమే అని బీజేపీ నేతలకు స్పష్టంగా చెబుతారు. అవినీతి విషయంలో ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించేది లేదంటారు. అవినీతి, అరాచకాలు, భూకబ్జాలు, అప్పులు గురించి ఎప్పటికప్పుడు బయటపెట్టాలని చెబుతారు. ఏపీలో బీజేపీ బలం పెంచడంపై మరింతగా దృష్టిపెట్టాలని పార్టీ నేతలకు హితబోధ చేస్తారు. మనకు మన పార్టీయే ముఖ్యం అని స్పష్టంగా బీజేపీ నేతలకు చెబుతారు. అంటే.. వైసీపీ నేతల అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు తదితర విషయాలపై జగన్ ను ఇరకాటంలో పెట్టాలనేది ప్రధాని మోడీ మాటల్లోని అంతరార్థం అని విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని జనంలోకి తీసుకెళ్లడంతో పాటు.. ఏపీకి కేంద్రం చేసిన వాటి గురించి జనానికి స్పష్టంగా వివరించాలని తమ పార్టీ నేతలకు పురమాయించడం గమనార్హం. రాజకీయాల్లో నిదానం పనికిరాదని, ఎప్పుడూ వేగంగానే ఉండాలని, సమస్య చిన్నదా? పెద్దదా? అని చూడకుండా స్థానిక సమస్యలు, పరిష్కారం కోసం గళమెత్తుతూనే ఉండాలని బీజేపీ నేతలకు నూరిపోస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లోపాలను ఎండగట్టడంలో సందేహం వద్దని నిర్దేశించారు. అంటే.. జగన్ విషయంలో బీజేపీది ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అనే చందంగా మోడీ స్పష్టం చేసినట్లు అంచనా వేస్తున్నారు. ఏపీలో జగన్ అసమర్థ పాలనను ఇక ఉపేక్షించేది లేదనే సంకేతాన్ని మోడీ ఇస్తున్నారంటున్నారు. తాము తీసుకునే ఏ నిర్ణయానికైనా బేషరతుగా మద్దతు ఇస్తూ వస్తున్న జగన్ విషయంలో మోడీకి ఇప్పుడెందుకు చిర్రెత్తుకొచ్చిందనే ప్రశ్న వస్తోంది. విశాఖలో తన సభను విజయవంతం చేయడానికి జగన్ అండ్ కో ఎంతగా శ్రమించినా.. మోడీలో జగన్ పట్ల ఎక్కడో ఒక మూల అసంతృప్తో లేక అసహనమో ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధాని మోడీ ఆదేశాలతో ఏపీ బీజేపీ నేతలు వైసీపీ సర్కార్ పై ఇక నుంచి చార్జ్ షీట్లు వేస్తే.. ఊరూరా తిరిగి ప్రజలకు రాష్ట్ర సర్కార్ తప్పిదాల గురించి ఏకరువు పెడుతుంటే.. జగన్ కు ముందు ముందు గడ్డుకాలం తప్పదేమో అంటున్నారు.

ఏపీలో బీజేపీ డబుల్ గేమ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ డబుల్ గేమ్ వ్యూహం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక పక్కన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొడుకు మాదిరిగా ట్రీట్ చేస్తున్నట్లే కనిపిస్తుంది. జగన్ పట్ల మోడీ ఎప్పుడూ సానుకూలంగా ఉంటారని పలువురు కేంద్ర మంత్రులు కూడా సమయం చిక్కిన ప్రతీసారీ చెబుతుంటారు. దాంతో పాటుగా ఏపీలోని వైసీపీ ప్రభుత్వం అవినీతి, వైఫల్యాలపై మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఛార్జిషీట్లు సిద్ధం చేసి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని తన పార్టీ కోర్ కమిటీ నేతలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేస్తారు. దాంతో పాటుగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సంతకాల సేకరణ కూడా చేయాలని ఆదేశిస్తారు. మోడీ ఏపీ పర్యటనకు రెండు రోజుల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తనను కలవాలని పేర్కొంటూ పీఎంఓ నుంచి సమాచారం పంపించడం ఆసక్తికరంగా ఉంటుంది. అంటే.. మోడీ విశాఖలో పర్యటన కోసం వస్తున్న క్రమంలో ప్రోటోకాల్ ప్రకారం సీఎం జగన్ ఆహ్వానించాలి. అలాగే ఆహ్వానించారు. అలాగే చేశారు. మోడీ సభను సక్సెస్ చేయడం కోసం లక్షలాది మందిని తరలించారు. అయినప్పటికీ.. సభా వేదికపై ఉండేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి జగన్ ఒక్కరికే అవకాశం ఇవ్వడం గమనార్హం. మరో పక్కన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలరింగ్ ఇస్తుంది. విశాఖ పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ అరగంటకు పైగా ఆయనతో మోడీ భేటీ అయ్యారు. విశాఖలో పవన్ కంటే ముందుగా బీజేపీ కోర్ కమిటీ నేతలతో మోడీ సమావేశం షెడ్యూల్ ఉన్నా.. ముందుగా పవన్ తోనే మోదీ భేటీ అయ్యారు. పది నిమిషాలే పవన్ కు ముందుగా సమావేశం ఇచ్చిన మోడీ 35 నిమిషాలు చర్చలు జరిపారు. కానీ.. బీజేపీకి ఎప్పటి నుంచో మిత్రుడిగా ఉన్న పవన్ కళ్యాణ్  అడుగుతున్న రోడ్ మ్యాప్ మాత్రం ఇచ్చారో లేదో తెలియదు. మోడీతో భేటీ సందర్భంగా స్థానిక బీజేపీ నేతలతో జనసేనకు ఉన్న సమస్యల్ని పవన్ కళ్యాణ్ లేవనెత్తినట్లు సమాచారం. అయితే.. ఆ సమస్యల పరిష్కారం గురించి పవన్ వద్ద మోడీ ఏమైనా పెదవి విప్పారా? అనేది మాత్రం బయటకు రావడం లేదు. ఇటీవలి తాజా పరిణామాలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్- టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దగ్గర అవుతున్న నేపథ్యంలో మోదీ ఏం మాట్లాడారనేది తెలియాలంటే వారిద్దరిలో ఎవరో ఒకరైనా బయటకు చెప్పాల్సి ఉంది. సరే.. మిత్రుడు పవన్ ను చాలా ఏళ్ల తర్వాత కలుసుకునేందుకు ప్రధాని మోడీ అవకాశం అయితే.. ఇచ్చారు.. కానీ భేటీ సందర్భంగా పవన్ చెప్పిన విషయాలపై ఆయన అంతగా స్పందించలేదనే అనుమానాలు వస్తున్నాయి. మోడీతో భేటీ తర్వాత బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ మీడియాతో తాను చెప్పదలచుకున్న ‘ఎనిమిదేళ్ల తర్వాత మోడీతో భేటీ అయ్యాను. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన మీటింగ్. ఏపీలోని అన్ని విషయాలు మోడీ అడిగి తెలుసుకున్నారు. ఏపీకి మంచి రోజులు రానున్నాయనే విశ్వాసం పెరిగింది.’ అని చెప్పారు. అయితే.. మీడియా ప్రతినిధులు అడగబోయిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండానే పవన్ అక్కడి నుంచి వెళ్లిపోవడం ఈసారి విశేషం. మీడియా ప్రతినిధులు ఎప్పుడు ఏ ప్రశ్నలు వేసినా ఓపిగ్గా విని సమాధానాలు చెప్పే పవన్ కళ్యాణ్ ఈ సారి అందుకు విరుద్ధంగా వ్యవహరించడం కొట్టొచ్చినట్లు కనిపింది. పైగా మీడియా సమావేశం సందర్భంగా పవన్ కళ్యాణ్ ముభావంగా ఉన్నారని చెబుతున్నారు. ఇటీవల విశాఖలో జరిగిన పరిణామాలపై ప్రధానికి వివరించారా? అన్న ప్రశ్నకు సమాధానం దాటవేయడమే కాకుండా.. ఇవన్నీ త్వరలో తెలియజేస్తానని మీడియా సమావేశాన్ని ముగించుకుని పవన్ కళ్యాణ్వెళ్లిపోయిన తీరుచూస్తే పవన్ కళ్యాణ్ విషయంలో మోడీ ఏవిధంగా వ్యవహరించారో అనే అనుమానాలు వస్తున్నాయంటున్నారు. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఏకం చేసేందుకు కృషిచేస్తానంటూ పవన్ కళ్యాణ్ చాలా రోజులుగా బహిరంగంగానే చెబుతున్నారు. ఆ క్రమంలో ఆయన టీడీపీకి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖ ఘటన తర్వాత, మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగా వైసీపీ నేతలపై వ్యాఖ్యలు చేసిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లి పవన్ కు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో చంద్రబాబుకు పవన్ దగ్గర కాకుండా చేయాలనే వ్యూహంతోనే ఇన్నేళ్ల తర్వాత జనసేనానితో మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారనే అనుమానాలు వస్తున్నాయి. ఒక పక్కన తమ మిత్రుడు అని చెప్పుకుంటూనే.. పవన్ అడిగిన రోడ్ మ్యాప్ ఇవ్వకుండా తాత్సారం చేస్తారు. మరో పక్కన వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ప్రయత్నాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ను ఆ దారిలో ముందుకు వెళ్లకుండా బంధం వేయాలనే వ్యూహం ఏదో బీజేపీ చేస్తోందని అపిస్తోందంటున్నారు. ఇక.. వైసీపీ వ్యతిరేక ఓటు టీడీపీ వెళ్లకుండా చేయడమే తమ కార్యక్రమం అని బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి మాటలు ప్రస్తావించుకోవచ్చు. అంటే.. వచ్చే ఎన్నికల్లో జనసేన- టీడీపీ కలిసి పోటీకి వెళ్లకుండా చేయాలనేది ఆ పార్టీ వ్యూహం అని అర్థం అవుతోందంటున్నారు. మొత్తానికి ఏపీలో బీజేపీ రాజకీయంగా డబుల్ గేమ్ ఆడుతోందనే సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అక్కడ ప్రధానితో పవన్ భేటీ.. ఇక్కడ జనసేన ఇన్ చార్జ్ అరెస్టు

ఏపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. వైసీపీ చూపు ఎవరిపై పడుతుందో.. ఎవరిని ఎందుకు అరెస్టు చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులను ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు అరెస్టు చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు జనసేన నాయకులు, కార్యకర్తల విషయంలో కూడా అదే పరిస్థితి తలెత్తిందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ విశాఖపట్నం పర్యటనలో ఉన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ ఆయనతో బేటీ అయ్యారు. సరిగ్గా పవన్ మోడీ విశాఖలో భేటీ అయిన సమయంలోనే నగరిలో జనసేన ఇన్ చార్జ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టును నిరసిస్తూ జనసేన ఇన్ చార్జి కిరణ్ రాయల్ కుటుంబ సభ్యులు నగరి పోలీసు స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. కిరణ్ కు నగరి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తీసుకువెళ్లారు. కోర్టు వద్ద ఆయనకు మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇటీవలి కాలంలో జనసేనాని వైసీపీ సర్కార్,జగన్ పై విమర్శల తీవ్రత పెంచిన నేపథ్యంలోనే ఈ అరెస్టు జరిగిందని భావిస్తున్నారు. కాగా కిరణ్ అరెస్టును జనసేనాని, ఆ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ ఖండించారు. కాగా ఈ అరెస్టుకు నిరసనగా పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నగరికి చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మంత్రి రోజా నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేశారు.  

మరో మారు మోడీ.. పవన్ బేటీ.. నేడూ విశాఖలోనే జనసేనాని?

ప్రధాని నరేంద్రమోడీతో జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖలో శుక్రవారం (నవంబర్ 11) భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఏపీకి మంచి రోజులు అని పవన్ మీడియాతో చెప్పారు. దీంతో ఇరువురి మధ్యా చర్చలు సహృద్భావ వాతావరణం జరిగాయని అంతా భావించారు. అయితే ఆ తదననంతర పరిణామాలను గమనిస్తే శుక్రవారం(నవంబర్ 11) ఇరువురి మధ్యా చర్చలు అసంపూర్తిగా ముగిశాయని అర్ధమౌతుంది. ఇరువురూ శనివారం(నవంబర్ 12) మరో సారి భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయనీ చెబుతున్నారు. అందుకే పవన్ కల్యాణ్ ఇంకా విశాఖలోనే ఉన్నారనీ మోడీతో ఆయన మరో సారి భేటీ అవుతారనీ అంటున్నారు. మొత్తం మీద పవన్ తో భేటీ, బీజేపీ రాష్ట్ర నాయకులతో భేటీ, రోడ్ షోలతో ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఆద్యంతం రాజకీయంగా ఆసక్తి, ఉత్కంఠ రేపుతోంది. మోడీ విశాఖ పర్యటన ఏర్పాట్లన్నీ ఏపీ సర్కార్ స్వయంగా దగ్గరుండి చూసుకోవడం, ప్రధాని సభకు జనసమీకరణ కూడా జగన్ సర్కారే ముందుండి ఏర్పాట్లు చేయడం సర్వత్రా ఆసక్తి రేకెత్తించింది. అదే సమయంలో చివరి నిముషంలో ప్రధాని మోడీ తో భేటీకి పీఎంవో నుంచి పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.   విశాఖలో   నిర్వహించిన రోడ్ షో, పవన్ కళ్యాణ్ తో ఐఎన్ఎస్ చోళలో భేటీ, అనంతరం బీజేపీ కోర్ కమిటీతో భేటీ.. ఆ తరువాత శుక్రవారం (నవంబర్ 12) సీఎం జగన్ తో భేటీ.. ఇవన్నీ కూడా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలే కావడంతో మోడీ ప్రధానిగా ఈ పర్యటనకు వచ్చారా లేక పార్టీ అగ్రనేతగా పర్యటిస్తున్నారా అన్నఅనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం అలా ఉంచితే.. శుక్రవారం రాత్రి పవన్ తో బేటీ తరువాత కూడా పవన్ విశాఖలోనే బస చేయడం రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నది. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రధాని మోడీయే స్వయంగా పవన్ కల్యాణ్ ను శుక్రవారం కూడా అందుబాటులో ఉండాలనీ, మరో సారి బేటీ అవుదామనీ చెప్పారు. శుక్రవారం ప్రధాని మోడీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హౌస్ లో భేటీ అయ్యారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం, అంటే మోడీ అప్పాయింట్ మెంట్ మేరకు  ఇరువురు నేతల మధ్య  భేటీ పావుగంటలో ముగియాల్సి ఉంది. అయితే అది అలా ఎక్సటెండ్ అవుతూ దాదాపు 35 నిముషాల పాటు సాగింది. అయితే అది కూడా అసంపూర్తిగానే ముగియడంతో.. మోడీ శనివారం (నవంబర్ 12) మరో సారి కలుద్దాం అందుబాటులో ఉండండి అని పవన్ కు చెప్పినట్లు తెలుస్తోంది.   అలాగే బీజేపీ నేతలతో బేటీ అనంతరం.. రాష్ట్రంలో పరిస్థితులపై మరింత అవగాహన ఏర్పరుచుకున్న మోడీ జనసేనాని పవన్ తో మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నారనీ, ఆ లోగా ముందుగా నిర్ణయించిన మేరకు శనివారం ఉదయం జగన్ తో బేటీ కూడా పూర్తయిన అనంతరం పవన్ తో భేటీ అయితే బెటర్ అని ఆయన భావిస్తున్నారని కమలం శ్రేణులే చెబుతున్నాయి.  

వర్సిటీలో చిరుత సంచారం.. భయాందోళనల్లో విద్యార్థులు.. పట్టించుకోని అధికారులు

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం విద్యార్థులను భయాందోళనలకు గురి చేస్తున్నది. వర్సిటీ ప్రాంగణంలో గత నెల రోజులుగా చిరుత సంచరిస్తోందన్న సమాచారం విశ్వవిద్యాలయ అధికారులకు తెలిపినప్పటికీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వర్సిటీలోని హెచ్ బ్లాక్, కామర్స్ డిపార్ట్ మెంట్ పరిసర ప్రాంతాలలో  చిరుత సంచారాన్ని విద్యార్థులు గమనించారు. అది సంచరిస్తున్న సమయంలో ఫొటోలు వీడియోలు తీసి వర్సిటీ అధికారులకు సమాచారం అందించారు. మూడు రోజుల కిందట ఐ బ్లాక్ వద్ద కుక్కను తరుముకుంటూ వచ్చిన చిరుతను చూసి విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ఐ బ్లాక్ తలుపులు మూసి గట్టిగా కేకలు వేయడంతో చిరుత సమీపంలోని ఖాళీ స్థలంలోకి వెళ్లి పోయింది. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులకు వర్సిటీ అధికారులు సమాచారం అందించి చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  

జగన్ సర్కార్ పై ఏపీ బీజేపీ ఒకలా.. కేంద్రం మరోనా.. జనం ఎందుకు నమ్ముతారు?

ఆంధ్రప్రదేశ్ లో విమర్శలు.. ఢిల్లీలో సంపూర్ణ సహకారాలు...ఇది ఏపీ సర్కార్ తో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు. ఏపీలో ఎంతగా విమర్శలు గుప్పించినా వైసీపీ నుంచి కనీస మాత్రంగా కూడా ప్రతి విమర్శలు రావడం లేదు. అదే సమయంలో జగన్ ప్రభుత్వానికి కాగల కార్యాలన్నీ కేంద్రంలోని మోడీ సర్కార్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరీ కానిచ్చేస్తోంది. అప్పుల విషయంలోనైతేనేమీ, కేసుల విషయంలోనైతేనేమీ జగన్ సర్కార్ ఇంత కాలం ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నెట్టుకొచ్చేయడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ తీరే కారణమని విపక్షాలు, విశ్లేషకులే కాదు.. సామాన్య జనం కూడా గట్టగా చెబుతున్నారు. నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే మోడీ వీశాఖ పర్యటనలో ఆయన రాష్ట్ర బీజేపీ నేతలతో దాదాపు గంటన్నర పాటు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీ పర్యటన ఏర్పాట్లు వైసీపీ ఎంపీ విజయసాయి పర్యవేక్షించిన విషయంపై ఏపీ బీజేపీ నేతలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అంతే కాకుండా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన బీజేపీ అధ్యక్షుడా లేక వైసీపీ ఏజెంటా అన్న స్థాయిలో వారి విమర్శలు ఉన్నాయి. కేవలం వారి విమర్శల కారణంగానే మోడీ పర్యటనలో హడావుడిగా ఏపీ బీజేపీ నేతలతో భేటీని జొప్పించారు. సరే ఈ బేటీలో  ప్రధానంగా జగన్ ప్రభుత్వ వైఫల్యాలపైనేచర్చ జరిగినట్లుగా చెబుతున్నా.. అంతకు మించి ఏదో జరిగిందని బీజేపీ శ్రేణులే అంటున్నాయి. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఏపీ బీజేపీ నాయకులు విఫలమయ్యారని మోడీ ఒకింత అసహనం వ్యక్తం చేశారనీ చెబుతున్నారు.    ఏపీలో బలోపేతమయ్యే అవకాశాలను రాష్ట్ర నాయకత్వం చేజేతులా జారవిడుచుకుందనీ మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారనీ చెబుతున్నారు. ఇక నుంచి అయినా జగన్ సర్కార్ వైఫల్యాలను జనంలోకి తీసుకుపోవాలనీ, గ్రమాగ్రామాన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై సమావేశాలు, సభలూ నిర్వహించి ప్రచారం చేయాలని సూచించారని అంటున్నారు. జగన్ సర్కార్ వైఫల్యాలపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ జరిగేలా చర్యలు చేపట్టాలని మోడీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జగన్ సర్కార్ పై రాష్ట్ర నాయకత్వాన్ని విమర్శించాలంటూ ఆదేశాలు జారీ చేసి.. కేంద్రం స్థాయిలో జగన్ తప్పిదాలు, వైఫల్యాలను కప్పిపుచ్చే పని చేయడం వల్ల ఎటువంటి ప్రయోజం ఉండదనీ.. ఏపీ బీజేపీ నాయకులు భావిస్తున్నారని అంటున్నారు. ఈ విషయాన్ని నేరుగా మోడీ ముందు ప్రస్తావించకపోయినా.. మోడీతో భేటీ తరువాత వారిలో నిరుత్సాహమే కనిపించిందని కూడా కమలం ఏపీ శ్రేణులు చెబుతున్నాయి.  ఇప్పటికే ఏపీలో జగన్ సర్కార్ పై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహ జ్వాల సెగలు బీజేపీకి కూడా తగులుతున్నాయనీ, రాష్ట్రంలో బీజేపీ అంటే జగన్ కు వంత పాడే పార్టీ అన్న ముద్ర బలంగా పడిపోయిందనీ పార్టీ శ్రేణులే అంటున్నాయి. రాజధాని అంశం నుంచి ఏ విషయం తీసుకున్నా.. ఏపీలో సీమటపాకాయల్లా అప్పడప్పుడూ బీజేపీ నాయకులు విమర్శల చప్పుడు చేయడమే తప్ప గట్టిగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం అయితే చేయలేదని చెబుతున్నారు.   నాలుగైదు నెలల కిందట అమిత్ షా ఏపీ పర్యటనకు వచ్చినప్పుడే వైసీపీ సర్కార్‌పై పోరాడాలని ఆదేశించినట్లు చేశారనీ, అలాగే ఏపీ బీజేపీ నాయకులు కూడా పోరాడినట్లే చేశారనీ.. అయితే ఆ ఆదేశం, ఆ పోరాటంలో ఎక్కడా సీరియస్ నెస్ అన్నదే కనిపించలేదనీ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. అందుకే బీజేపీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల బేటీలో రాష్ట్రంలో బీజేపీతో కలిసి పని చేయలేకపోతున్నామని అన్నారని కూడా విశ్లేషిస్తున్నారు. అసలు జరగాల్సింది ఏపీ బీజేపీ నేతలు వైసీపీ సర్కార్ పై పోరాడటం కాదనీ, కేంద్రమే వైసీపీ ఆర్థిక అరాచకత్వంపై శ్వేతపత్రం విడుదల చేయడం లాంటి తీవ్ర చర్యలకు పాల్పడితేనే రాష్ట్ర ప్రజలలో జగన్ విధానాలకు బీజేపీ అండగా నిలుస్తోందన్న భావన పోయే అవకాశం లేదని అంటున్నారు.  బజేపీ అగ్రనాయకత్వం నుంచి జగన్ అరాచక విధానాలన ఎండగడుతూ స్పష్టమైన చర్యలు కనిపిస్తే తప్ప ఏపీలో బీజేపీ నేతలు వాగాడంబరం ప్రదర్శించినంత మాత్రాన ఎవరూ పట్టించుకోరని అంటున్నారు. ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన అమరావతి యాత్ర,   నిరుద్యోగయాత్ర,  కార్నర్ మీటింగ్‌లను జనం పట్టించుకోకపోవడాన్ని పరిశీలకులు ఉదహరిస్తున్నారు. ఇందుకు కారణం జగన్ పట్ల కేంద్రం చూపుతున్న అపార ప్రేమాభిమానాలు, ఆదరణే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికీ వైసీపీని మిత్రపక్షంగానే బీజేపీ హై కమాండ్ మిత్రపక్షంగానే పరిగణిస్తోంది. అందుకే   తెలంగాణ, తమిళనాడుల్లోని ప్రభుత్వాలతో  వ్యవహరిస్తున్న విధానానికి భిన్నంగా  ఏపీలో జగన్ సర్కార్ తో వ్యవహరిస్తోంది. ఏపీలో గవర్నర్ జగన్ సర్కార్ తానా అంటే తందానా అన్నట్లు వ్యవహరిస్తారు.. కానీ తమిళనాడు, తెలంగాణలలో గవర్నర్లు మాత్రం మీడియా సమావేశాలు పెట్టి మరీ అక్కడి ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తుంటారు.ఏపీ అప్పులకు కేంద్రం పచ్చ జెండా ఊపడం నుంచి ప్రతి విషయంలోనూ జగన్ సర్కార్ కు కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందుతున్న తీరుపై జనంలో కూడా కేంద్రం, వైసీపీ సర్కార్ ల మధ్య రహస్య అవగాహన ఉందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  అందుకే ఏపీ బీజేపీ నేతలు వైసీపీపై, జగన్ విధానాలపై విమర్శలు చేస్తున్నా ఎవరూ నమ్మడం లేదు. పట్టించుకోవడం లేదు.   వైసీపీపై బీజేపీ అగ్రనాయకత్వం కన్నెర్ర చేసి చర్యలకు ఉపక్రమిస్తేనే ఏపీలో బీజేపీపై ప్రజలలో ఏదో ఒక మేరకు నమ్మకం కలిగే అవకాశం ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.   

తిరుపతి దారిదోపిడీ కేసు సూత్రధారి వైసీపీ కార్యకర్త!

క్రైమ్ కీ వైసీపీకి అవినాభావ సంబంధం ఉందా? దాదాపుగా సంచలనాత్మకమైన అన్ని క్రైమ్ లలోనూ వైసీపీ లింకులు బయటపడుతుండటమే ఈ అనుమానాలకు కారణం. మూడున్నరేళ్ల కిందట 2019 ఎన్నికలకు ముందు మాజీ మంత్రి, అప్పటి విపక్ష నేత, .ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ స్వంత బాబాయ్ పులివెందులలో తన సొంత ఇంటిలో దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించడానికి విఫలయత్నం చేసిన వారు ఆ తరువాత నారాసుర చరిత్ర అంటూ ప్రచారం చేసి ఎన్నికలలో లబ్ధి పొందారు. కానీ ఆ తరువాత సీబీఐ వివేకా హత్య కేసు చేపట్టిన తరువాత వివేకా హత్య వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులూ అందరూ వైసీపీకి చెందిన వారేనని దర్యాప్తులో వెలుగులోకి వస్తోంది. జగన్ కు స్వయానా సోదరి అయిన షర్మిల కూడా అవే అనుమానాలు వ్యక్తం చేశారు. అది పక్కన పెడితే తిరుపతిలో సంచలనం సృష్టించిన దారి దోపిడీ కేసులో వైసీపీ కార్యకర్త కృష్ణమూర్తి అరెస్టయ్యాడు. నిందితుడి నుంచి 32.5 లక్షల నగదు, రివాల్వర్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అరెస్టయిన ఏడుగురూ కూడా కుప్పానికి చెందిన వైసీపీ నాయకుడి ప్రధాన అనుచరులని కూడా పోలీసులు చెబుతున్నారు.ఇక ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. 35లక్షల రూపాయలకు 70లక్షల బ్లాక్ మనీ ఇస్తామంటూ హైదరాబాద్ కు చెందిన ఓ రియల్టర్ కు వైసీసీ కార్యకర్త కృష్ణమూర్తి ఆశ చూపారు. ఇందు కోసం దాదాపు హనీట్రాప్ చందంగా ముగ్గురు మహిళలనూ ఉపయోగించారు. ఈ ట్రాప్ లో పడిన రియల్టర్ ఈ నెల 3న 35లక్షల రూపాయలు తీసుకుని తిరుపతి చేరుకున్నాడు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం వైసీపీ కార్యకర్త కృష్ణమూర్తి   గ్యాంగ్ లోని ఏడుగురు వ్యక్తులు శంకర్ రెడ్డి కంట్లో కారం కొట్టి సొమ్ముతో పరారయ్యారు. ఈ మేరకు శంకర్ రెడ్డి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చంద్రగిరి మండలం గాదంకి టోల్ ప్లాజా సమీపంలో కారుతో పాటు ఏడుగురు యువకులను అరెస్టు చేశారు. అయితే అప్పటికే సొమ్మను వారు చేతులు మార్చేశారు. వారి నుంచి రాబట్టిన సమాచారంతో ఈ దోపిడీ సూత్రధారి కుప్పంకు చెందిన కృష్ణమూర్తి అని గుర్తించారు. కృష్ణమూర్తిని అరెస్టు చేసి సొమ్ము స్వాధీనం చేసుకున్నారు.  కాగా వైసీపీ కార్యకర్త కృష్ణమూర్తిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్నాటకలలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ దోపిడీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు మహిళలనూ కూడా పోలీసులు అరెస్టు చేశారు.   కాగా ఈ కేసులో అరెస్టయిన వారంతా కుప్పం కు చెందిన వైసీపీ నాయకుడి ప్రధాన అనుచరులని విశ్వసనీయంగా తెలిసింది.