కందకు లేని దురద కత్తిపీటకా.. ఏపీకి లేని బెంగ కేసీఆర్ కా?
posted on Nov 18, 2022 @ 9:41AM
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ప్రస్తుతం గతంలో ఎన్నడూ ఎదుర్కొనటువంటి టెన్షన్ ను ఎదుర్కొంటున్నారు. ఒక వైపు.. జాతీయ రాజకీయాలలోకి అడుగు పెట్టేశారు. కొత్త పార్టీ బీఆర్ఎస్ ను ప్రకటించేశారు. టీఆర్ఎస్ స్థానంలో బీఆర్ఎస్ ఉంటుందనీ, జాతీయ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తుందనీ, కేంద్రంలో మోడీ సర్కార్ పతనానికి బీఆర్ఎస్ నాంది పలుకుతుందనీ గంభీర ప్రసంగాలు సైతం చేసేశారు. అయితే ఆ తరువాతే ఆయనకు అసలు పరీక్షలు వరుసగా ఎదురౌతున్నాయి. తెలంగాణ ఉద్యమ పునాదులపైన ఏర్పడిన పార్టీ ఇప్పుడు ఆ ఉద్యమ చిహ్నాలను అనివార్యంగా వదిలించుకోవాల్సిన పరిస్థితి. మోడీ వ్యతిరేకత తప్ప కేసీఆర్ తన కొత్త జాతీయ పార్టీ ఆవిర్బావ సభ సందర్బంగా కొత్తగా చెప్పినదేమీ లేదు. ఇప్పుడు ఆయనకు సొంత రాష్ట్రంలో బీఆర్ఎస్ సత్తాను చాటాల్సిన పరిస్థితి ఉంది. అయితే మునుగోడు ఉప ఎన్నికలో చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా సాధించిన విజయంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెరాసకు విజయం సిద్ధిస్తుందా? అన్న అనుమానాలు పార్టీలోనే వ్యక్త మౌతున్న పరిస్థితి. సరే ఇక్కడ గెలిచినా సార్వత్రిక ఎన్నికలలో కేసీఆర్ ఆశిస్తున్నట్లుగా వంద స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోగలిగే సత్తా బీఆర్ఎస్ కు ఉందా అంటే ఇప్పటికిప్పుడైతే ఔననే సమాధానం వచ్చే పరిస్థితి లేదు. సర్వేలను బట్టి చూస్తు హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో మరో సారి బీజేపీ అధికార పగ్గాలు అందుకోవడం ఖాయమన్న అంచనాలు వెలువడుతున్న సమయంలో.. ఆ తరువాత ఓ నాలుగైదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ విస్తరణ సాధ్యమౌతుందా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి.
అన్నిటికీ మించి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఆంధ్రప్రాంత ప్రజలపై, పాలకులపై చేసిన పరుష వ్యాఖ్యలు ఆయనక సాటి తెలుగు రాష్ట్రంలో కాలుపెట్టే పరిస్థితి లేకుండా చేశాయి. సాటి తెలుగు రాష్ట్రమే బీఆర్ఎస్ ను గుర్తించని పరిస్థితి ఉంటే.. ఇక దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఇది ఎలాంటి సందేశం ఇస్తుందన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు ఏపీ నుంచి మద్దతు అనివార్యంగా అవసరం అన్న పరిస్థితి ఏర్పడింది. ఏపీ సీఎం జగన్ తో ఆయనకు సత్సంబంధాలే ఉన్నా.. రాజకీయాలకు, ఇరు రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న జల వివాదాలకూ అతీతంగా ఇప్పటి వరకూ ఇరువురూ కూడా పరస్పర రాజకీయ సహకారం అందించుకుంటున్నారనే విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఒక సారి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపైనా, ప్రధాని మోడీపైనా యుద్ధం ప్రకటించేసిన తరువాత గతంలోలా ఈ సహకారం ఉంటుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. రాజకీయ పరిశీలకులైతే లోపాయికారీగా ఉన్నా బహిరంగంగా బీఆర్ఎస్ కు జగన్ మద్దతు ప్రకటించే అవకాశాలు ఇసుమంతైనా లేవనే చెబుతున్నారు. తెరాస అధినేత మొడీ విధానాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ యుద్ధ భేరి మోసిస్తుంటే.. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి మాత్రం మోడీ అడుగులకు మడుగులొత్తుతూ ఆయన ప్రాపకం కోసం పాకులాడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఏపీలో తనకు మద్దతు కూడగట్టుకోవాలంటే కేసీఆర్ కు జగన్ కు మోడీతో ఉన్న బంధాన్ని తెగ్గొట్టక తప్పదన్న అంచనాకు వచ్చారు. అందుకే ఎమ్మెల్యేక కొనుగోలు బేరసారాలు తెలంగాణతో ఆగవనీ, అవి ఏపీకీ విస్తరిస్తాయనీ జగన్ ను పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. బీజేపీ ఏపీలో జగన్ సర్కార్ ను కూలదోసేందుకు ప్రయత్నిస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో ప్రభుత్వాన్ని మోడీ సర్కార్.. పడగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటే ఆ విషయంలో స్పందించాల్సింది జగన్ కానీ, కేసీఆర్ కు ఎందుకు అని పరిశీలకులే కాదు, ఇరత పార్టీల వారూ, స్వయంగా తెరాస నేతలే ప్రశ్నిస్తున్నారు. పొరుగు రాష్ట్రం ఊసెందుకన్న భావన ఏపీలో కూడా వ్యక్తమౌతోంది. కందను కోసిన కత్తిపీటకు దురదంటే ఎవరు నమ్ముతారని నెటిజన్లు సైతం సెటైర్లు వేస్తున్నారు. బీజేపీ ఏపీ సర్కార్ ను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నదన్న కేసీఆర్ వ్యాఖ్యలు జగన్ ను బీఆర్ఎస్ కు మద్దతుగా కూడగట్టే వ్యూహంతోనే తప్ప ఆయన వ్యాఖ్యలలో, ఆరోపణల్లో వాస్తవాలున్నాయని ఎవరూ నమ్మడం లేదంటున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని అస్తిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణ చీప్ పబ్లిసిటీ అన్నారు. కట్టుకథలు, కాల్పనిక విషయాలు సృష్టించి రాజకీయ సంచలనం కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు. ఆయన పూర్తిగా అవాస్తవం, నిరాధారమైన కట్టు కథ అల్లుతున్నారని.. కేసీఆర్ను ఏమైనా వైసీపీ స్పోక్స్ పర్సన్గా నియమించారా అని ప్రశ్నించారు. వైసీపీకి లేని భయాలు కేసీఆర్కు ఎందుకు అని నిలదీశారు. కేసీఆర్ వైసీపీని నడిపిస్తున్నారా లేదా ఆ పార్టీకి ప్రతినిధిగా మాట్లాడుతున్నారా అని సూటి ప్రశ్న వేశారు.
తన పార్టీకి భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకున్నారు కాబట్టి అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడాలని కేసీఆర్ మీడియా కవరేజ్ కోసం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. అబద్ధాలు, అవాస్తవాలు ద్వారా ప్రచారం పొందాలని చూస్తే విశ్వసనీయతకు భంగం వాటిల్లడం ఖాయమన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ తప్పుడు వ్యాఖ్యలు, కథనాలు మానుకుంటే మంచిదని సూచించారు. తెలంగాణలో జరిగిందే అవాస్తవమని.. ఆ విషయాన్ని తమ నాయకత్వం గట్టిగా చెప్పిందన్నారు. 2024లో భారతీయ జనతాపార్టీ, జనసేనతో కలిసి ప్రత్యామ్నాయంగా మారతామన్నారు. ఎన్నికల ముందు తమ పార్టీలోకి విస్తృతంగా చేరికలు ఉంటాయన్నారు. తెలుగు రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు చేరికలను ప్రోత్సహిస్తామన్నారు. వైసీపీని అస్థిరపరుస్తున్నామనేది కేసీఆర్ కల్పించుకున్న కొత్త స్క్రిప్ట్ అని.. కథ, నిర్మాత అంతా కేసీఆరే అని జీవీఎల్ ఎద్దేవా చేశారు.
తెలుగు రాష్ట్రాలలో, ఆమాటకొస్తే దేశంలో రాజకీయాలే కాదు, రాజకీయ చర్చలు,విశ్లేషణలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. చిత్ర విచిత్రంగా వంపులు పోతున్నాయి. కొత్త కొత్త ఎత్తులు, వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే, రాజకీయాల దారిలోనే రాజకీయ విశ్లేషకులు సాగుతున్నారు. వాస్తవాల కంటే ఉహాలకు, వ్యూహహాగానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ తీసుకున్న, ‘జాతీయ’ నిర్ణయం సహజంగానే రాజకీయ, మీడియా వర్గాల్లో సంచలనంగా మారింది. చర్చోపచర్చలు సాగుతున్నాయి. నిజానికి, కేసీఆర్ తీసుకున్న,పార్టీ పేరు మార్పు నిర్ణయం, ఇప్పటికిప్పుడు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుందని,కేసీఆర్ సహా ఎవరు ఉహించడం లేదు.ఆశించడం లేదు.
నిజానికి ప్రాంతీయ వాదం పునాదిగా, రాజకీయంగా,(గిట్టని వాళ్ళు ఆర్థికంగా కూడా అంటారు) ఎదిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఆయన అవసరాల కోసం, కాలం చెల్లిన తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని, పక్కన పెట్టి జాతీయ నినాదాన్ని అందుకున్నారు. అందుకోసంగా, ఆయన దసరా పండగ రోజున తెలంగాణ భవన్ వేదికగా, తెరాస పార్టీ పేరును మార్చారు. భారతీయ రాష్ట్ర సమితిగా నామకరణం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే, జాతీయ రాజకీయాల్లో ఎంట్రీకి అడ్డుగా ఉన్న ‘తెలంగాణ’ అనే పదాన్ని తెసీసి ‘భారతీయ’ అనే పదాన్ని చేర్చారు. నిజానికి, ఆ క్రతువుకు ఏమి పేరు పెట్టినా, ప్రొఫెసర్ కోదండ రామ్’ చెప్పినట్లుగా ఈ మొత్తం క్రతువు వెనక ఉన్న మూల మంత్రం తెలంగాణలో అధికారాన్ని, కుటుంబ పాలనను నిలుపుకోవడం. ఇదొక్కటే ఇప్పుడు కేసీఅర్ ముందున్న లక్ష్యం. ఇదొక్కటే ఆయన ముందున్నసవాలు. తెలంగాణ సెంటిమెంట్’ను అడ్డుపీతుకుని, 1200 యువకుల బలిదానాల బాటలో అధికార పీఠాన్ని అందుకున్న కేసేఆర్, ఇప్పుడు కొత్త దారిని ఎంచుకున్నారు, అనే వాళ్ళున్నారు.
సరే, తెరాస పేరును కేసేఆర్ ఎందుకు బీఆర్ఎస్’గా మార్చారు,తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ ఎలా ప్రభావితం చేస్తుంది. జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని పక్కన పెడితే, దాయాది రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్’ రాజకీయాలపై బీఆర్ఎస్ ప్రభావం ఎలా ఉంటుంది? ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీలను బీఆర్ఎస్ ఎలా ప్రభావితం చేస్తుంది? ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే ఆసక్తికర చర్చ సాగుతోంది.
అయితే, ఇందుకు సంబంధించి ఎవరెన్ని విశ్లేషణలు చేసినా,తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాటలు లేకుండా ఓ చిన్న చిరునవ్వుతో చేసిన విశ్లేషణ ముందు అవ్వన్నీ దిగతుడుపే. బీఆర్ఎస్పై సాధికారిక వ్యాఖ్య ఎవరైనా చేశారంటే , అది చంద్రాబాబు ఒక్కరే, ఏపీ రాజకేయాలపై బీఆర్ఎస్ ప్రభావం గురించి మాత్రమే కాదు., అసలు బీఆర్ఎస్’ గురించి ఇంతవరకు వచ్చిన విశ్లేషణలు అన్నిట్లోకి చద్రబాబు ‘చిరునవ్వు’ ఒక్కటే సాధికారిక విశ్లేషణ, అనుకోవచ్చును. అవును, బీఆర్ఎస్ గురించి చంద్రబాబు చేయని విశ్లేషణ, ఆయన అనుభవానికి, విజ్ఞతకు అడ్డపడుతోంది.
ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయం అయితే చెప్పనే అక్కరలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నంత వరకు, మోడీ, షా సిట్టంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఆయన ముందు మరో ఆప్షన్ లేదు. మోడీ షా కూర్చోమంటే కూర్చోవాలి నుంచో మంటే నుంచోవాలి లేదంటే,ఏమిజరుగుతుందో వేరే చెప్పనక్కర లేదు.నిజానికి, జగన్ రెడ్డి, 2019 ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే, బీజేపీకి సరెండర్ అయిపోయారు. ప్రత్యేక హోదా విషయంలో మోడీ దయ మన ప్రాప్తం అని చేతులేత్తేసింది మొదలు ఇంతవరకు మళ్ళీ ఆయన ఎత్తిన చేతులు దించలేదు.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఎన్నికల విషయంలోనే కాదు, పార్లమెంట్’లో వివదాస్పద బిల్లుల ఆమోదం వరకు ఎక్కడా, కేంద్రానికి రుచించని నిర్ణయం ఏదీ తీసుకోలేదు. ఎక్కడి వరకో ఎందుకు, కొద్ది రోజుల క్రితం, వైసీపీ ఎంపీ, విజయసాయి రెడ్డి, ఉప రాష్ట్రపతి జగదేష్ ధన్కర్’కు వంగివంగి దండాలు పెడుతున్న దృశ్యం చూస్తేనే, వైసీపీ స్టాండ్ ఏమిటో అర్థమవుతుంది.
అయితే, బీఆర్ఎస్ ప్రభావం ఏపీ రాజకీయాలపై అసలే ఉండదా అంటే ఉంటుంది. నిజానికి, ఒక్కఎపీలోనే కాదు దేశంలో ఏ ఒక్క ఒక రాష్ట్రం నుంచి పేరున్న పార్టీలు ,వ్యక్తులు ఎవరు కూడా కేసేఆర్’తో చేతులు కలిపేందుకు, సిద్ధంగా లేరు. అయినా, ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. చిన్నా చితక పార్టీలు, ప్రజాసంఘాలను కూడగట్టి జాతీయ రాజకీయాల్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో.. బీఆర్ఎస్ ప్రభావం ఏపీ పై అసలే ఉందని చెప్పలేము, కానీ ఆ ప్రభావం ఎలా ఉంటుందనేది మాత్రం, ఇప్పుడే చెప్పే విషయం కాదు.
అదలా ఉంటే బీఆర్ఎస్ ఏపీలో ఎంటర్ కావడానికి ముందు చాలా హార్డిల్స్ దాట వలసి ఉంటుంది. కొవిడ్ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఈపీ కొవిడ్ రోగులను సరిహద్దుల వద్దే అడ్డుకున్న కేసేఆర్, అదే సరిహద్దు దాటి ఏపీలో ఎంటర్ అవుతానంటే, ఆరాష్ట్ర ప్రజలు అనుమతిస్తారా? తెలంగాణ ఉద్యమ సమయంలో కేసేఆర్ ఆంధ్రులను అవమానించిన తీరును మరిచి పోతారా? నిన్నగాక మొన్న తెలంగాణ శాసన సభలో ఏపీపై విషం చిమ్మిన కేసీఆర్’కు ఆ రాష్ట్ర ప్రజలు రెడ్ కార్పెట్’ వేసి స్వాగతం పలుకుతారా? కేసీఆర్, నేను మరిపోయానై అంటే, ఏపీ ప్రజలు నమ్ముతారా? కేసేఆర్ నమ్మించగలరా? అవును, ఆయనకు రాజకీయ టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు అన్నీ కొట్టిన పిండి, ఆయినా ఆయన ఏపీ ప్రజలను నమ్మించగల రని అనుకున్నా, అది పొరపాటే అవుతుంది.
నిజానికి, కేసేఆర్ ఏపీలో ఎంటర్ అవ్వాలంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఒక సారి కాదు, వెయ్యిసార్లు ముక్కు నేలకు రాసి, క్షమాపణలు చెప్పవలసి ఉంటుందిని అంటున్నారు. కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా? ఏపీ ప్రజలకు క్షమాపణలు చెపుతారా? అది జరగని పని,అ దే జరిగితే, తెలంగాణ నూకలు చెల్లినట్లే అవుతుంది. సో .. అది జరగదు. నిజానికి, ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెట్టినట్లు, ఏపీ రాజకీయాల్లో కేసేఆర్ వేలు పెట్టలేరు, అందుకే ఆయన ఇంతవరకు ఏపీ విషయంలో గుంభనంగా, మైదానాన్ని ఊహాగానాలకు వదిలేశారని అంటున్నారు.