నివాస ప్రాంతంలో కుప్పకూలిన విమానం.. ఎనిమిది మంది మృతి

కొలంబియాలో ఓ హెలికాప్టర్ నివాస ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్నఎనిమిది మందీ దుర్మరణం పాలయ్యారు. కొలంబియాలోని అతి పెద్ద నగరాలలో ఒకటైన మెడెలిన్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. బెలెన్ రోసేల్స్ సెక్టార్‌లో ఈ విమాన ప్రమాదం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టారు.  ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. విమానం టేకాఫ్‌లో ఇంజిన్ వైఫల్యంతో ఒలాయా హెర్రెరా విమానాశ్రయానికి తిరిగి వెళ్లే సమయంలో కూలిపోయిందని చెబుతున్నారు.  సామాజిక మాధ్యమంలో ఈ ప్రమాదానికి సంబంధించిన చిత్రాలను ఎమర్జెన్సీ సర్వీసెస్ షేర్ చేసింది.  అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే పనిలో ఉన్నారు.   ఇళ్ళ పైన నల్లటి పొగ దట్టంగా కమ్ముకున్నట్లు చిత్రాలలో స్పష్టంగా కనిపిస్తోంది.

నేపాల్ తెల్ల రాబందును రక్షించిన భారత్

నేపాల్ కు చెందిన అత్యంత అరుదైన రాబందును భారత్ అధికారులు రక్షించి సంరక్షించారు. పర్యావరణ మార్పుల కారణంగా రాబందుల సంతతి అంతరిస్తున్నది. అందులోనూ అత్యంత అరుదైన తెల్ల రాబందుల మనుగడ ప్రమాదంలో పడింది.   దాదాపు అంతరించిపోయిందనుకున్న ఈ సంతతి రాబందు ఒకటి నేపాల్ లో   కనిపించింది. తిండి కరవై చిక్కి శల్యమైన స్థితిలో కనిపించిన ఈ తెల్ల రాబందును నేపాల్ అటవీ శాఖ అధికారులు సపర్యలు చేసి రక్షించారు. దాని సంరక్షణ బాధ్యతను అత్యంత శ్రద్ధగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాని కదలికలు తెలుసుకునేందుకు  డియో ట్యాగింగ్ కూడా చేశారు. అయితే  గత కొన్ని రోజులుగా  ఈ రాబందు రాడార్ దృష్టికి కూడా అందలేదు. దీని ఆచూకీ తెలియక నేపాల్ అధికారులు కంగారు పడుతుండగా దీని ఆచూకీ  బీహార్‌లో  పక్షుల సంరక్షణ కేంద్రం అధికారులు కనుగొన్నారు.  ప్రస్తుతం బీహార్‌లో కనుగొన్న రాబందును భగల్పూరులోని పక్షుల పర్యవేక్షణ కేంద్రం నిపుణుల పర్యవేక్షణలో ఉంచారు. దీనికి వైద్య పరీక్షలు జరిపారు. కొద్దిరోజుల తరువాత దీనిని విడిచిపెడతామని  అధికారులు తెలిపారు.   తమ దేశంలో తప్పిపోయిన రాబందు జాడ పట్టేసినందుకు నేపాల్ వన్యపరిరక్షణ అధికారులు భారత   అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.  

ఏనుగును పెంచుకుంటున్నారా అంటూ బీజేపీ ఎమ్మెల్యేపై దాడి

కర్నాటకలో జనం బీజేపీ ఎమ్మెల్యేపై దాడి చేశారు. దుస్తులు చిరిగిపోయి ఆయన అవమానభారంతో కుప్పకూలిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది   ఎమ్మెల్యేను జనం బారి నుంచి కాపాడి తీసుకువెళ్లారు. ఈ ఘటన చిక్కమగుళూరులో జరిగింది. కారణమేమిటంటే పొలంలో పనులు చేసుకోవడానికి వెళ్లిన ఒక మహిళ ఏనుగు దాడిలో చనిపోయింది. ఎన్ని సార్లు, ఎంత కాలంగా చెబుతున్నా ఏనుగుల బెడద నుంచి తమను కాపాడే విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ జనం మృతదేహంలో  నిరసనకు దిగారు. ఆ సమయంలోనే ఎమ్మెల్యే కుమారస్వామి అక్కడకు వచ్చారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించబోయారు. అయితే జనం ఆయనను అడ్డుకున్నారు. మీరేమైనా ఏనుగును పెంచుకుంటున్నారా? ఎన్ని సార్లు అడిగినా ఏనుగుల బెడద నుంచి మాకు రక్షణ కల్పించడం లేదంటూ వాగ్వాదానికి దిగారు. ఆ దశలో ఆగ్రహంతో ఆయనపై దాడికి దిగారు. ఈ దాడిలో ఎమ్మెల్యే గాయపడ్డారు. ఆయన దుస్తులు చిరిగిపోయాయి. జనం బారి నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఆయన పరుగులు పెట్టారు. ఆ దశలో పోలీసులు అతి కష్టం మీద జనం బారి నుంచి ఎమ్మెల్యేను కాపాడి అక్కడి నుంచి తీసుకుపోయారు.  కర్నాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు చుట్టుపక్కల గ్రామాల్లో ఏనుగుల స్వైర విహారం చేస్తున్నాయి. ఈ గజరాజులు జనవాస కేంద్రాలపై చేస్తున్న దాడుల్లో పలువురు గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయారు.   ఎనుగుల దాడుల నుంచి తమను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నో సార్లు  విజ్ఞప్తి చేశారు. అటు ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఏనుగు దాడిలో మరో మహిళ మరణించడంతో గ్రామస్తులు ఆగ్రహం పట్టలేక ఎమ్మెల్యేపై దాడికి దిగారు.

రస్నా ఫౌండర్ కన్నుమూత

ఐలవ్యూ రస్నా.. ఈ ప్రకటన ఎంత ప్రాచుర్యం పొదిందంటే.. అప్పట్లో చిన్నారులందరి నోటా ఇదే వినిపించేది. మండు వేసవిలో చల్లటి పానియం అంటే అప్పట్లో ఏకైక ఆప్షన్ రస్నానే. అప్పట్లో రస్నా సాఫ్ట్ డ్రింక్ కి ఉన్నడిమాండ్, ఫేమే వేరప్పా అన్నట్లుండేది. అలాంటి రస్నాఫౌండర్ అరీజ్ ఫిరోజ్ షా శనివారం (నవంబర్ 19) కన్నుమూశారు. రస్నా కంపెనీ ఈ విషయాన్ని ఆదివారం (నవంబర్ 20) ఒక ప్రకటనలో పేర్కొంది.  మండు వేసవిలో చల్లని పానియాన్ని తాగాలనుకునే మధ్య తరగతి జీవులకు రస్నా ఏకైక ఆప్షన్ గా మారింది. తక్కువ ధరకే మంచి మంచి ఫ్లేవర్లతో ఇంటిల్లిపాదీ చల్లని సాఫ్ట్ డ్రింక్ తాగేందుకు అవకాశం కల్పించింది రస్నా. అప్పట్లో ఇళ్లల్లో కాఫీ టీలు మానేసి రస్నా వైపే మొగ్గు చూపేవారంటే అతి శయోక్తి కాదు. తొలుత ఆరెంజ్ ఫ్లేవర్ తో మార్కెట్లోకి వచ్చిన ఈ సాఫ్ట్ డ్రింక్.. క్రమంగా రకరకాల ఫ్లేవర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తరువాత తరువాత సాఫ్ట్ డ్రింక్స్ లో ఎన్నిరకాల కంపెనీలు వచ్చినా రస్నా మాత్రం తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. అరీజ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.

జారుడు బండపై కాంగ్రెస్.. రేవంత్ గట్టెక్కించగలరా?

తెలంగాణలో కాంగ్రెస్ పతనం నుంచి పతనానికి దిగజారుతోందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకోవాలి కానీ.. అదే రాష్ట్ర ఆవిర్బావం నుంచీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగం భోట్లు అన్నట్లుగా తయారంది.  తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయని పైకి కనిపిస్తున్నా, ఇప్పటికిప్పుడు తెరాసకు వచ్చిన ఇబ్బందేమీ లేని పరిస్ధితే ఉంది. రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవాలని   ప్రయత్నాలు చేస్తున్నా అధికారం దక్కించుకునే స్థాయికి ఇప్పట్లో వచ్చే పరిస్థితి అయితే లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఆ పార్టీకి సరైన అభ్యర్థి దొరకడమే గగనమన్న పరిస్థితే ఇప్పటికీ ఉంది. పట్టణ ప్రాంతాల్లో బాగానే పుంజుకున్నా.. అధి వచ్చే ఎన్నికలలో అధికారాంలోకి తీసుకువస్తుందా అన్న ప్రశ్నకు లేదనే జవాబే వస్తుందని కమలం వర్గాలే అంతర్గత చర్చల్లో చెప్పుకుంటున్నాయి. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో విజయం సాధించినా, మునుగోడు ఉప ఎన్నికలో తెరాసకు దీటుగా పోటీ ఇచ్చినా అది బీజేపీ బలం అని ఆ పార్టీ నాయకత్వమే ధీమాగా చెప్పలేని పరిస్థితి. అయితే రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అంటే బీజేపీయే అనే పరిస్థితి అయతే వచ్చింది. అందుకు కాంగ్రెస్ బలహీనతలు, వైఫల్యాలే కారణం. క్షేత్ర స్థాయిలో కార్యకర్తల బలం, బలగం ఉండి కూడా ఎన్నికలలో చతికిల బడుతున్న కాంగ్రెస్ రాష్ట్రంలో సమీప భవిష్యత్ లో పుంజుకుంటుందా అంటే కష్టమేనని పరిశీలకులు విశ్లేషిస్తు్నారు. అన్నిటికీ మించి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ నాయకత్వ లోపం కాంగ్రెస్ ను ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ కుదేలును చేసేస్తోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్  పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ కార్యకర్తలలో జోష్ పెరిగిందనడంలో సందేహం లేదు. అయితే దానిని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుని.. ప్రజలకు చేరవ కావడానికి మార్గదర్శనం చేయాల్సిన నాయకత్వం విఫలమౌతోంది. నిజానికి రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు తెలంగాణలో పుంజుకోవడానికి ఉన్న అవకాశాలను వినియోగించుకుని బలోపేతం కావడంలో ఆ పార్టీ వైఫల్యానికి ప్రధాన కారణం ఆ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే.  కాంగ్రెస్ గురించి తరచూ పెద్దలు చెప్పే మాట ఒకటి ఉంది. ఆ పార్టీని ఎవరూ ఓడించలేరు.. కానీ ఆ పార్టీయే తనను తాను ఓడించుకుంటుంది అని. రాష్ట్రంలో సరిగ్గా అదే జరుగుతోంది.    ఆ గొడవలే తెలంగాణలో ప్రజలకు పార్టీని దూరం చేస్తుంది. రేవంత్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పార్టీ క్యాడర్ లో కాస్త జోష్ కనిపించినా, సీనియర్ నేతలు తమ వైఖరితో ఆ జోష్ ను బలవంతంగా అణిచేస్తున్నారు.  దానికి ఉదాహరణే తాజాగా జరిగిన మునుగోడు ఉపఎన్నికలలో ఘోర ఓటమి. ఇప్పటికే పలుమార్లు యాత్రలు, పోరులు తలపెట్టిన అధ్యక్షుడు రేవంత్ కొంతవరకు ప్రజలలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా.. ఆ పార్టీ నేతలు సహాయ నిరాకరణతో ఫలితం ఉండటం లేదు.  ప్రజా సమస్యలపై పోరాటాల ద్వారా ప్రజలలోకి వెళ్లాలని రేవంత్ చేస్తున్న ప్రతి ప్రయత్నాన్నీ విఫలం చేయడానికే అన్నట్లుగా సీనియర్లు వ్యవహరిస్తున్నారు. వీహెచ్, జగ్గారెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే.. కాంగ్రెస్ లోని ప్రతి సీనియర్ పేరూ చెప్పాల్సి ఉంటుంది. సీనియర్లు సహకరించకున్నా  రేవంత్ ఇప్పుడు మరో పోరుకు రెడీ అయ్యారు. ఈసారి రైతు సమస్యలపై   ఫోకస్ పెట్టారు. ధరణి పోర్టల్, ధాన్యం కొనుగోలు, పోడు భూముల సమస్యలపైన కార్యాచరణ సిద్ధం చేస్తూ పార్టీ నేతలను కలుపుకుపోవాలని సంకల్పించారు.  ముందుగా ఇందిరాపార్కు వద్ద రెండు రోజులపాటు నిరసన దీక్ష చేపట్టి, రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాలలో ప్రజల సమస్యలపైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి తర్వాత గవర్నర్ కు వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు. కార్యాచరణ ఓకే కానీ.. ఇది ఎంతవరకు సక్సస్ అవుతుంది? సీనియర్లు ఏ మేరకు సహకరిస్తారు అన్న సందేహాలు పార్టీ క్యాడర్ లోనే వ్యక్తమౌతున్నాయంటే పరిస్థితి ఏమిటో వేరే చెప్పకోనవరం లేదు. రైతు సమస్యలపై కార్యాచరణపై చర్చించేందుకు గాంధీ భవన్ లో సమావేశం కోసం  రేవంత్ పార్టీలో సీనియర్ నేతలకు ఆహ్వానాలు పంపిస్తేనే.. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు  మాత్రమే హాజరయ్యారు. జగ్గారెడ్డి డుమ్మా కొట్టారు. ఈ సమన్వయ లోపమే కాంగ్రెస్ పార్టీకి పుంజుకోవడానికి అవరోధంగా మారింది. దీనిని అధిగమించి వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని ఏకతాటిపైకి రేవంత్ తీసుకురాగలరా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. విభేదాలు పక్కన పెట్టి అందరూ కలిసి నడిస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్ ఇప్పటికిప్పుడైతే కాంగ్రెస్ జారుడు బండపై ఉంది. రేవంత్ గట్టెక్కించగలరా అన్నది చూడాలి.

తుమ్మల దారెటు?

 తెరాసలో ఇప్పుడు ఎవరికీ పట్టని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రమే. తుమ్మల అంటే ఆషామాషీ వ్యక్తేం కాదు. సీఎం కేసీఆర్ తనంత తానుగా స్వయంగా టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. గత ఎన్నికల నాటి వరకూ తుమ్మల మాటే ఖమ్మం వ్యాప్తంగా చెల్లుబాటు అయ్యేది. అయితే 2018 ఎన్నికలలో తుమ్మల పాలేరు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దాంతో ఆయన హవా పార్టీలో బాగా తగ్గింది.  కందాల ఉపేంద‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుపై గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. అనంత‌రం ఆయన కేసీఆర్ స‌మ‌క్షంలో అధికార పార్టీలో చేరారు. అప్ప‌టి నుంచి పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో తుమ్మ‌ల వ‌ర్సెస్ కందాల అన్న‌ట్లుగా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి.  కందాలకు ఉమ్మ‌డి జిల్లాలోని మిగిలిన అధికార పార్టీ నాయ‌కుల మ‌ద్ద‌తు ఉండ‌టంతో తుమ్మ‌ల‌ ఏకాకిగా మిగిలిపోయారు. ఖ‌మ్మం జిల్లా నుంచి మంత్రి హోదాలో పువ్వాడ‌, పార్ల‌మెంట‌రీ నేత‌గా నామా, ఎమ్మెల్యేలు రేగా, సండ్ర‌ల‌తో పాటు అంద‌రికీ ట‌చ్‌లో ఉంటున్న కేసీఆర్‌.. తుమ్మ‌ల‌ను దూరం పెట్టారు. రెండేళ్ల క్రితం వ‌ర‌కు జిల్లా రాజ‌కీయాల్లో చ‌క్రంతిప్పిన తుమ్మల ప్ర‌స్తుతం పార్టీలో ఎవరికీ పట్టని వ్యక్తిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి. ఉమ్మడి ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్నేళ్లుగా జిల్లా రాజ‌కీయాల‌ను కంటిచూపుతో శాసించిన మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ప్ర‌స్తుతం గ‌డ్డుకాలం ఎదుర్కొంటున్నారు. టీఆర్ ఎస్‌లో ఉన్న తుమ్మ‌లను జిల్లాలో ఏకాకిని చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు నిద‌ర్శనం ఇటీవ‌ల స‌త్తుప‌ల్లిలో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు చెందిన టీఆర్ ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యుల స‌న్మాన స‌భ జ‌రిగింది. ఈ స‌న్మాన స‌భ‌కు తుమ్మ‌ల మిన‌హా అధికార పార్టీలోని అన్ని ప్రాంతాల నేత‌లు పాల్గొన్నారు. తుమ్మ‌ల‌కు క‌నీసం ఆహ్వానం కూడా అంద‌లేద‌ని తెలుస్తోంది. ఇందుకు కార‌ణం పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేంద‌ర్ రెడ్డేన‌న్న చ‌ర్చ జిల్లాలో జోరుగా సాగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇటీవల తుమ్మల ఆత్మీయ సమ్మేళనం అంటూ హడావుడి చేసినా మళ్లీ ఎందుకో సైలంట్ అయిపోయారు. అయితే తుమ్మల త్వరలో కారు దిగిపోవడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. కమలం గూటికి చేరుతారా.. సైకిలెక్కుతారా అన్న చర్చ అయితే నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.

వచ్చే ఏడాది డిసెంబర్ లోనే ఏపీ ఎన్నికలు!?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలు కొంతకాలంగా వస్తున్నాయి. ఆ ఊహాగానాలకు బలం చేకూరుస్తు వచ్చే ఏడాది  డిసెంబర్ లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.  తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగే  2023 డిసెంబర్ లోనే ఏపీలోనూ ఎన్నికలు నిర్వహించాలని జగన్ భావిస్తున్నారంటూ, అందుకు పలు అంశాలు తెరమీదకు తెస్తున్నారు. రెండోసారి కూడా ఏపీ అధికారపీఠంపై తానే కూర్చోవాలని సీఎం జగన్ గట్టిగానే వ్యూహాలు రచిస్తున్నారు. అంతే కాకుండా పార్టీ నేతలు, బాధ్యులు, జిల్లాల ఇన్ చార్జులతో నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల్లో వారికి జగన్ నేరుగానే ఆదేశాలు జారీచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ‘175 అవుటాఫ్ 175 వైనాట్?’ అంటూ వారిని ఊదరగొడుతున్నారు. అంటే.. ఆ ఎన్నికల తర్వాత ఏపీలో ప్రతిపక్షం అనే మాటే లేకుండా చేయాలని, ఏకపక్షంగా రాష్ట్రాన్ని ఏలాలనే గట్టి పట్టుదలతో జగన్ ఉన్నారంటున్నారు. అంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఉనికే లేకుండా చేయాలనేది జగన్ మిషన్ అంటున్నారు. పరిపాలనలో అనుభవ రాహిత్యంతో ఏపీని ‘అప్పుల ఆంధ్ర’గా మార్చేసిన జగన్, అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలకు అనుభవంలోకి రాకుండా చేసిన జగన్, విధ్వంసంతో ఏలుబడి ప్రారంభించి, ఈ మూడున్నరేళ్లుగా అదే పంథాలో కొనసాగుతున్న జగన్ పట్ల, వైసీపీ నేతల తీరుపట్ల విపక్షాల్లో, రాష్ట్ర ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీని పూర్తికాలం కొనసాగాక ఎన్నికలకు వెళ్లే.. వ్యతిరేకత మరింత పెరిగిపోయి, కొంప కొల్లేరవుతుందని, పార్టీకి పుట్టగతులు ఉండవని, రాష్ట్రాన్ని ముప్పై ఏళ్లు తానే ఏలాలనే ఆశ ఆడియాస అయిపోతుందనే భయం జగన్ లో గూడుకట్టుకుందంటున్నారు. అందుకే  ముందస్తు ఎన్నికలకు వెళ్లి లబ్ధి పొందాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు  సంకేతాలు వస్తున్నాయంటున్నారు. ఏపీలో ఇప్పటికే జనసేన- బీజేపీ పొత్తులో ఉన్నాయి. మరో పక్కన వైసీపీ సర్కార్ వైఫల్యాలు, జగన్ రెడ్డి ప్రజా వ్యతిరేక తీరుతెన్నులపై తెలుగుదేశం అధినేత,   నాయకులు నిత్యం విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వైజాగ్ సంఘటన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్ పై నేరుగా యుద్ధం ప్రకటించి, రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించారు. రోజులు గడిచే కొద్దీ జనసేన- బీజేపీ కూటమికి బలమైన క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా తోడయ్యే సూచనలు కనిపిస్తున్నాయనే రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి. ఏపీ అసెంబ్లీకి కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటే పోలింగ్ నిర్వహిస్తే.. అది జగన్ కోరికకు, ఆశకు గండి పడే ప్రమాదం ఉందంటున్నారు. అడగకుండా ప్రతిసారీ తనకు మద్దతు ఇస్తున్న వైసీపీ పట్ల బీజేపీ అగ్రనేతలు మోడీ-షా జోడీకి ఎక్కడో ఏదో ఆగ్రహం ఉన్న ఛాయలే కనిపిన్నాయి. అందుకే విశాఖలో ఇటీవలి మోడీ పర్యటన, బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు వైసీపీ అధినేత, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎంతగా పాటుబడినా పెద్దగా గుర్తించలేదంటారు. పైగా వైసీపీపై యుద్ధం ప్రకటించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా పిలిపించుకుని అరగంటకు పైగా మోడీ చర్చలు జరిపిన విషయం తెలిసిందే.  దీంతో వైసీపీ పెద్దల కన్నా జనసేనానికే మోడీ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో స్పష్టం అయిందంటున్నారు. 2024 మేనెలలో సాధారణ ఎన్నికల సమయంలోనే ఏపీ ఎన్నికలు కూడా జరిగితే.. అప్పుడు మోడీ ఫీవర్ గట్టిగా ఉంటే.. తనకు ఇబ్బంది తప్పదని జగన్ లెక్కలు వేసుకుంటున్నారని చెబుతున్నారు. సాధారణ ఎన్నికలతో పాటు ఏపీ ఎన్నికలు కూడా జరిగితే.. మోడీ- షా ద్వయం రాష్ట్రంలో ఉధృతంగా పర్యటిస్తే.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాలుగు దిక్కులా విపరీతంగా ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉంటుందంటున్నారు.  అందుకే.. 2023 డిసెంబర్ లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే సమయంలో ఏపీలో ముందస్తుకు వెళ్తే.. ప్రయోజనం ఉండొచ్చనే నిర్ణయానికి జగన్ వచ్చారని తెలుస్తోంది. అలా ఎన్నికలు జరిపితే.. తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ నేతలు, అధినేతలు అక్కడే ఎక్కువగా ఫోకస్ పెడతారని, తద్వారా ఏపీపై అంతగా వారి ప్రభావం ఉండదని జగన్ బేరీజు వేసుకుంటున్నారంటున్నారు. తెలంగాణలో టీడీపీ మద్దతును బీజేపీ కచ్చితంగా తీసుకుంటుందనే ఊహాగానాలు వస్తున్నాయి. అందుకు ప్రతిగా ఏపీలో టీడీపీకి బీజేపీ పొత్తు కుదురుతుందన్న అంచనాలు ఉన్నాయి. దాంతో టీడీపీ, బీజేపీ, జనసేనల నుంచి గట్టి పోటీనే వైసీపీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే జరిగితే తన ముప్పై ఏళ్ల అధికారం కల కలగానే మిగిలిపోతుందనే భయం జగన్ లో నెలకొందని  అంటున్నారు. ఏపీలో ముందే ఎన్నికలు నిర్వహించి, అధికారం మళ్లీ చేజిక్కించుకుంటే.. పార్లమెంట్ ఎన్నికలపై ఆ ఫలితాల ప్రభావం ఉంటుందనేది వైసీపీ అధినేత అభిప్రాయం అంటున్నారు. అప్పుడు మరిన్ని ఎక్కువ లోక్ సభా స్థానాలు తాము గెలుచుకోవచ్చనేది జగన్ వ్యూహం అని చెబుతున్నారు. ఇలాంటి కారణాలతోనే జగన్ ముందస్తు ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

చిరంజీవికి ప్రధాని మోడీ ప్రశంసలు

సినీ రంగానికి చేసిన సేవలకు గాను మెగాస్టార్ చిరంజీవిని అరుదైన ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్- 2022’ అవార్డు వరించింది. గోవాలో జరుగుతున్న 53వ ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ వేడుకల్లో 2022కి   చిరంజీవికి ఈ అవార్డును కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ ప్రకటించారు. దీంతో ప్రధాని మోడీ సహా పలువురు చిరంజీవిని ప్రశంసలతో ముంచెత్తుతూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ మేరకు తాజాగా తెలుగులో ట్వీట్ చేసిన మోడీ.. చిరంజీవి వ్యక్తిత్వాన్ని, నటనా సామర్ధ్యాలను అభినందించారు. ‘చిరంజీవి   విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్ని, ఆదరణనూ చూరగొన్నారు. గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఆయనకు అభినందనలు’ అంటూ చిరంజీవిని ట్యాగ్ చేస్తూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మోడీ ట్వీట్ చేసిన కాసేపటికే చిరంజీవి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇలాంటి మంచి మాటలు చెప్పిన గౌరవనీయులైన ప్రధాన మంత్రి   నరేంద్ర మోడీ   కృతజ్ఞతలు’అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇంతకు ముందే ఈ అవార్డు విషయం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్కి ధన్యవాదాలు చెబుతూ చిరంజీవి మరో ట్వీట్చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ట్విట్టర్ వేదికగా చిరంజీవికి అభినందనలు తెలిపారు. ఇక చిరంజీవి సోదరుడు, పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవికి అవార్డు పట్ల స్పందించారు. ‘నాలుగు దశాబ్దాలు పైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలుచుకొని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం  తనతో సహా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ‘53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో భాగంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తికిరీటంలో చేరిన మరొక వజ్రం. ఈ ఆనంద సమయంలో నా మార్గదర్శి అన్నయ్య చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’ అని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా చిరంజీవిపై తన భక్తిని చాటుకున్నారు. ‘ధర్మం తెలిసిన ధర్మాత్ముడు, న్యాయం తెలిసిన న్యాయకోవిదుడు, మంచితనానికి మారుపేరు, మానవత్వం ఇంటిపేరు, అందరికీ నేనున్నా అనే మా అన్న మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు’ అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. తండ్రి చిరంజీవికి దక్కిన ఈ అరుదైన గౌరవానికి ఆయన తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే.. మరింతగా మురిసిపోయారు. ‘53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’గా నిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉంది. అప్పా- నిజంగా ఎంతో గర్వంగా ఉంది. మీరు ఎప్పటికీ అందరికీ స్ఫూర్తిదాయకమే’ అంటూ రామ్ చరణ్ ఆనందంతో సంబరపడిపోయారు. ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టిన చిరంజీవి అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు టాలీవుడ్ కు గాడ్ ఫాదర్ గా గౌరవం పొందుతున్నారు. సుమారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో 150కి పైగా సినిమాల్లో నటించిన చిరంజీవి ఇప్పటికి ఇంకా వెండితెరపై తన హవా కొనసాగిస్తున్నారు. గతంలో ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని చిత్రరంగం నుంచి అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, ఇళయరాజా, బాలసుబ్రహ్మణ్యం, వహీదా రెహమాన్, సలీమ్ ఖాన్, బిశ్వజిత్ ఛటర్జీ, హేమమాలిని, ప్రసూన్ జోషి లాంటి ప్రముఖులు అందుకున్నారు.

భూకంపం.. ఇండోనేసియాలో పాతిక మంది మృతి

ఇండోనేసియాను భూకంపం వణికించింది. సోమవారం (నవంబర్ 21) మధ్యాహ్నం 5.6 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రతకు పలు ఇళ్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో కనీసం పాతిక మంది మరణించారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. వెస్ట్ జావాలో సంభవించిన ఈ భూ కంప తీవ్రత దృష్ట్యా మరణాల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశాలున్నాయన్న ఆందోళన వ్యక్త మౌతోంది. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐదు రోజుల క్రిత  ఇండోనేషియా  సుమత్రా దీవుల్లో నైరుతి దిశలో  భూమి కంపించిన సంగతి విదితమే. రిక్టర్ స్కేల్ మీద ఆ భూకంప తీవ్రత 6గా నమోదయ్యింది. అప్పుడు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే  సోమవారం సంభవించిన భూకంపం నివాస ప్రాంతాలలో సంభవించడంతో .   ప్రాణ, ఆస్థి నష్టం సంభవించింది.

కడప గడపలో మసకబారుతున్న వైఎస్ కుటుంబ ప్రతిష్ఠ

కడప జిల్లా అనగానే చటుక్కున గుర్తుకు వచ్చేది వైయస్ ఫ్యామిలీ.. అలాంటి జిల్లాలో ఆ కుటుంబం తన ఉనికిని కోల్పోయే పరిస్థితులు వచ్చేశాయా? అంటే సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు అవునని స్పష్టం చేస్తున్నారు. కడప లోక్‌సభ సభ్యుడు వైయస్ ఆవినాశ్ రెడ్డి.. పర్యటన సందర్బంగా ఓ మహిళ చేసిన వ్యాఖ్యల తాలూకూ  ఓ వీడియో.. అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైయస్ ఫ్యామిలీకి కొత్త చిక్కులు మొదలైనాయంటూ సామాజిక మాధ్యమం వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి 2019 ఎన్నికలు అయిన కొంత కాలం వరకు ఉమ్మడి కడప జిల్లా... వైయస్ ఫ్యామిలీకి కంచుకోటగానే ఉండేది.. అయితే  వైఎస్ తనయుడు,  జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత..   జిల్లాలో వైఎస్ కుటుంబంపై వ్యతిరేకత ప్రబలుతోందని నెటిజన్లు అంటున్నారు.     ఎన్నికలకు జస్ట్ కొద్ది రోజుల ముందు.. వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య...  అంతకు కొద్ది రోజుల ముందు విశాఖ ఎయిర్ పోర్ట్‌లో  అప్పటి విపక్ష నేత జగన్‌పై కొడి కత్తి దాడి.. అలాగే  జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లి  విజయమ్మ..  సోదరి షర్మిలలు.. పక్క రాష్ట్రానికి పరుగులు తీయడం.. అదే విధంగా వివేకా కుమార్తె సునీత  తన సోదరుడు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా  తన తండ్రి  హత్య కేసులో తనకు న్యాయం జరగడం లేదు, ప్రభుత్వమే ఈ హత్య కేసు దర్యాప్తును అడుగడుగునా అడ్డుకుంటోందంటూ సుప్రీంకోర్టు మెట్లక్కడం.. వంటి సంఘటనలతో పులివెందులలో వైఎస్ ఫ్యామిలీ ప్రభ మసకబారుతోందని అంటున్నారు.  వివేకా హత్య కేసులో ఆయన మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి.. ఈ అత్యంత కిరాతక హత్య ఇంటి దొంగల పనేనంటూ సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడంతో జిల్లాలో వైఎస్ కుటుంబ అభిమానులు ఒక్క సారిగా ఆ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. ఇక  జిల్లాల విభజనలో భాగంగా.. అన్నమయ్య జిల్లా ముఖ్య కేంద్రం రాజంపేట కాకుండా  రాయచోటిని ఎంపిక చేయడంపై కూడా జగన్ పై ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  అలాగే సొంత బాబాయి వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకే కాదు.. కోడికత్తి కేసును విచారిస్తున్న ఎన్ఐఏకు సైతం..   జగన్ ప్రభుత్వం సహకరించకపోవడంతో వీటి వెనుక ఉన్నది ఎవరో చూచాయిగానైనా అర్ధం చేసుకున్న కడప జిల్లా వాసులు జగన్ విశ్వసనీయత పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.    అదీకాక.. ఉమ్మడి కడప జిల్లాలోని పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై కూడా ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉందని ఇప్పటికే ఓ నివేదిక జగన్ కు అందిందని చెబుతున్నారు.  ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల్లో 175కి 175  అసెంబ్లీ స్థానాలను కైవశం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న జగన్ కు సొంత జిల్లా లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని నెటిజన్లు అంటున్నారు.

మైండ్ గేమ్ రాజకీయాలు... నాయకులను మించి ఓటర్లు!

తెలంగాణలో మైండ్ గేమ్ రాజకీయాలు జోరందుకున్నాయి. అయితే ఈ గేమ్ లో రాజకీయ నాయకులను మించి ఓటర్లు రాటుదేలిపోయారు. అంతే కాదు.. రాష్ట్రంలో నిత్యం రాజకీయ హీట్ కొనసాగాలని భావిస్తున్నారు.  రోగీ వైద్యుడూ ఒకటే కోరారన్న సామెతలా.. తెలంగాణలో ఏదో ఒక అంశంతో  రాజకీయాల వేడిని తగ్గకుండా రాజకీయ పార్టీలు రగిలిస్తూనే ఉన్నాయి. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఆసక్తి, బీఆర్ఎస్ పార్టీ ప్రకటన,ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలు, నేతల మధ్య మాటల తూటాలు, ఇప్పుడు ఏకంగా భౌతిక దాడులు... నిరసనలు... ఆరోపణలు, ప్రత్యారోపణలు.. ఇలా రాష్ట్రంలో రాజకీయ హీట్ ను పెంచే సంఘటనలు ఒకదాని తరువాత ఒకటిగా వచ్చి పడుతూనే ఉన్నాయి.  ఇది   వచ్చే  అసెంబ్లీ ఎన్నికల వరకు  నిరంతరాయంగా కొనసాగే వాతావరణమే కనపడుతోంది. దీని వల్ల పాలన కుంటుపడటం తప్ప  రాష్ట్రానికి కానీ, ప్రజలకు కానీ ఇసుమంతైనా ప్రయోజనం ఉండదు.   పోనీ.. రాజకీయ పార్టీలకైనా ప్రయోజనం ఉందా అంటే అదీ శూన్యమే. ఎందుకంటే రాజకీయ  హీట్ కాదు ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన, రాష్ట్రాభిభివృద్దితోనే  మేలు జరుగుతుంది. రాజకీయాల్లో ఏ పార్టీ గెలిస్తే.. ఏముంది... షరా మామూలే. మాకేం జరుగుతుంది....? ఈ పార్టీ కాకపోతే.. ఆ పార్టీ..? ఆ పార్టీ కాకపోతే మరో పార్టీ...? ఏ పార్టీ గెలిచినా..   సమస్యలు తీరుతాయా..?   కష్టాలు గట్టెక్కుతాయా..? ఇన్నేండ్ల నుంచి చూస్తూనే ఉన్నాం... నాయకులు మారారే తప్ప... సమస్యలు పరిష్కారమైన సందర్భం లేదు.. సంపన్నులున్న ప్రాంతాల్లో రోడ్లు, పార్కులు అందంగా వస్తాయి.. కానీ బస్తీల్లో.. మాటలు ప్రకటనలు తప్ప పురోగతి ఉండదు. అన్న నిర్ణయానికి  జనం వచ్చేశారు. అందుకే అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకుల మధ్య రాజకీయాలు రుగులుతూ ఉంటేనే ప్రయోజనం అన్న భావనకు వచ్చేశారు. పోటీ ఎంత ఎక్కువగా ఉంటే.. ఎన్నికలు అంత ఖరీదుగా   మారుతాయని జనం అంటున్నారు. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలే జనం ఈ మైండ్ సెట్ లోకి వచ్చినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పార్టీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు ఓ పార్టీ నుంచి మరో పార్టీకి మారడం, ఆ నియోజకవర్గంలో ఉపఎన్నిక రావడం.. ప్రధానంగా రెండు రాజకీయ పార్టీల నేతలకు అక్కడ గెలుపు ప్రతిష్టాత్మకం కావడం. ఫలితంగా ఉప ఎన్నిక అత్యంత ఖరీదుగా మారడంతో... ఈ నియోజకవర్గాల ఉపఎన్నికను గమనిస్తూ వస్తోన్న రాష్ట్ర ప్రజలు ప్రతినియోజకవర్గంలోనూ అలాగే జరగాలనే యోచన చేస్తున్నారని అంటున్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి నియోజకవర్గం ఒక మునుగోడులా మారినా ఆశ్చర్యం లేదంటున్నారు.

లెఫ్ట్, కారు బంధం ఇలాగే కొనసాగేనా? సీట్ల సర్దుబాటు సజావుగా ముగిసేనా?

 మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా  తెలంగాణ రాష్ట్ర సమితి, లెఫ్ట్ పార్టీల మధ్య చిగురించిన స్నేహం ఇలాగే కొనసాగనుందా? అంటే ఇరు పార్టీల నేతలూ కూడా ఔను ఇలాగే కొనసాగుతుందంటున్నారు.  ఇరు పక్షాల మధ్య పొత్తు ఇప్పుడు ఆ రెండు పార్టీలకూ కూడా అవసరం అని పరిశీలకులు అంటున్నారు. పైగా ఒక ఉప ఎన్నికలో విజయం కోసం కేసీఆర్ తన అవసరం కొద్దీ వామపక్షాలకు స్నేహహస్తం అందిస్తే.. అంతకంటే ఆత్రంగా వామపక్షాలు గతంలో తెరాస అధినేత తమను ఉద్దేశించి గతంలో చేసిన అవమానకర వ్యాఖ్యలను కూడా విస్మరించి అందుకున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో వామపక్షాలు మరో అడుగు ముందుకేసి వచ్చే ఏడాది జరుగనున్న శాసన సభ ఎన్నికల్లో పొత్తులో భాగంగా తాము పోటీచేసే సీట్లపై ఇప్పటికే దృష్టి సారించి.. ఆ దిశగా టీఆర్ఎస్ తో చర్చలకు సమాయత్తమౌతున్నట్లు చెబుతున్నారు.  అయితే, మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా గులాబీ దళానికి,  ఎర్ర సైన్యానికి మధ్య చిగురించిన స్నేహం..  పొత్తుగా మార్చుకునేందుకు వామపక్ష నేతలే కాకుండా, తెరాస అధినేత కూడా ఆసక్తి కనబరుస్తున్నారని అంటున్నారు. ఒంటరి పోరుకు దిగితే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించే పాటి బలం లేని పార్టీలు వామపక్షాలైతే... తమ కొత్త పార్టీ బీఆర్ఎస్ కు జాతీయ స్థాయిలో ఇంతో కొంతో ఇమేజ్ ఉన్న (ఓట్లూ, సీట్లూ లేకపోయినా) వామపక్షాల అవసరం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే వామపక్షాలతో లైన్ క్లియర్ చేసుకునే పనిలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం సాగుతోంది. ఒక పొత్తులో భాగంగా సీపీఐ రాష్ట్రంలో కొన్ని అసెంబ్లీ సీట్లపై గురి పట్టినట్లు తెలుస్తోంది. ఆ సీట్లు తమకు ఇస్తేనే టీఆర్ఎస్‌తో  పార్టీతో వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందని ఇప్పటికే కేసీఆర్ కు సూచన ప్రాయంగా తెలియజేసిందని లెప్ట్ పార్టీల కార్యకర్తలే చర్చించు కుంటున్నారు. ముఖ్యంగా హుస్నాబాద్ సీటును తమకే కేటాయించాలని తెలంగాణ సీపీఐ గట్టిగా కోరుతోందని అందుకు కారణం అది సీపీఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి సొంత నియోజకవర్గం కావడమేనని అంటున్నారు. అయితే అంత తేలికగా టీఆర్ఎస్ కూడా ఆ సీటును మిత్రపక్షానికి ఒదులుకోవడానికి అంగీకరించదని అంటున్నారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా తెరాస హుస్నాబాద్ నియోజకవర్గంలో ఘన విజయం సాధించింది. ఆ కారణంగానే ఇప్పుడు కూడా హుస్నాబాద్ లో  తెరాస అభ్యర్థినే రంగంలోకి దించాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. హుస్నాబాద్ కు ప్రత్యామ్నాయంగా సీపీఐ సీనియర్ నేత చాడకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ ఆఫర్ చేస్తున్నట్లు తెరాస వర్గాలలో వినిపిస్తోంది. చాడ వెంకటరెడ్డికి ఎమ్మెల్సీ కేటాయిస్తే..   ఆయన హుస్నాబాద్‌ సీటును టీఆర్ఎస్‌కి వదలిపెడతారని గులాబీ వర్గాలు భావిస్తున్నాయి.   తెలంగాణలో వచ్చే ఏడాది ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. మార్చిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో పాటు మేలో రెండు  గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో మూడు స్థానాలు మే 29న ఖాళీ అవుతాయి.  వీటిలో ఒక స్థానాన్నిసీపీఐకి కేటాయించే అవకాశముందని తెరాస వర్గాల్లో ప్రచారం అవుతోంది.  2004 ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గంలో సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి బరిలోకి దిగి విజయం సాధించారు. 2018లో మళ్లీ పోటీ చేసినా.. గెలవలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి ఒడితెల సతీష్ చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే అక్కడ సీపీఐకి బలమైన కేడర్ ఉందని.. టీఆర్ఎస్-సీపీఐ పొత్తులో భాగంగా.. ఈసారి చాడ వెంకటరెడ్డిని బరిలోకి దింపాలని సీపీఐ భావిస్తోంది. కానీ సీఎం కేసీఆర్ మాత్రం సీపీఐకి ఎమ్మెల్సీ ఇచ్చి.. హుస్నాబాద్ నుంచి తామే బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 25 స్థానాలపై సీపీఐ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది.  ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో  పొత్తు కుదరకపోతే.. ఆయా స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని భావిస్తోంది.  ఇరు పార్టీల మధ్య పొత్తు బలపడితే... సాధ్యమైనంత ఎక్కువ సీట్లు అడగాలనే యోచనలో వామపక్షాల నాయకులు ఉన్నారనేది ప్రచారంలోకి వచ్చింది. ఇదే జరిగితే... టిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాలను కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. మరి ఏ సీట్లను సిపిఐ కోరుతుందో...? ఏ సీట్లను టిఆర్ఎస్ వదులుకుంటుందో వేచి చూడాలి. 

క్యాసినో కేసులో తలసాని కుమారుడికి ఈడీ నోటీసులు

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుమారుడు తలసాని కుమారుడు సాయికిరణ్ యాదవ్ కు ఈడీ సోమవారం (నవంబర్ 21) నోటీసులు జారీ చేసింది. చీకోటి ప్రవీణ్ కేసినో కేసు దర్యాప్తులో భాగంగా తలసాని సాయి కిరణ్ యాదవ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే తలసాని సోదరులు తలసాని మహేష్, తలసాని ధర్మేంద్ర యాదవ్ లను ఇప్పటికే ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. బిగ్ డాడీ పేరుతో చీకోటి ప్రవీణ్ నేపాల్ లో నిర్వహించిన కేసీనోకు వెళ్లినట్లుగా భావిస్తున్న వారందరికీ ఈడీ నోటీసులు పంపి విచారణకు పిలుస్తోంది. అందులో భాగంగానే మంత్రి తలసాని కుమారుడికీ నోటీసులు పంపింది. మొత్తంగా ఈ కేసులో తలసాని సన్నిహితులకు ఈడీ వరుసగా నోటీసులు పంపిస్తుండటం... విచారిస్తుండటం సంచలనం   సృష్టిస్తోంది. కాగా ఇదే కేసులో తలసాని వ్యక్తిగత కార్యదర్శి హరీష్ ను ఈడీ సోమవారం (నవంబర్ 21) విచారించింది. ఈ విచారణకు హరీష్ బ్యాంక్ స్టేట్ మెంట్లతో సహా హాజరైనట్లు చెబుతున్నారు.   ఇదే కేసులో ఈడీ ఇప్పటికే   టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిలను ప్రశ్నించింది. చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఇంకా పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులకు కూడా ఈడీ ఈడీ సమన్లు జారీ చేసే అవకాశం ఉందంటున్నారు. విచారణలో భాగంగా చీకోటి ప్రవీణ్ వెల్లడించిన వివరాల ఆధారంగా ఈడీ నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతోందని భావిస్తున్నారు. ఇలా ఉండగా విచారణ సమయంలో ఎల్.రమణ అస్వస్థతకు గురి కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.

జనసేన బంధిత పార్టీయా.. బీజేపీ చెప్పినట్లే నడుచుకుంటుందా?

జనసేన ఇప్పుడు ఒక బంధిత పార్టీగా మారిపోయిందా? బీజేపీ బంధనాలలో చిక్కుకు పోయిందా? ప్రధాని మోడీతో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అనంతరం రాష్ట్ర బీజేపీ నాయకులు మరీ ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు, మాటలు చూస్తుంటే ఔననక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో ఎన్నికలకు మరో ఏడాదిన్నరకు పైగా గడువు ఉంది. అయినా ఇప్పుడో, అప్పుడో ఎన్నికలు వచ్చేస్తున్నాయన్నంతగా రాష్ట్రంలో రాజకీయ హీట్ పీక్స్ కు చేరిపోయింది. ఇటువంటి వాతావరణంలో  సహజంగానే  అధికార, విపక్షాల మధ్య విమర్శలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. అయితే ఏపీలో మాత్రం అధికారపక్షంపై తెలుగుదేశం మాత్రమే కాకుండా, జనసేన, బీజేపీలు కూడా ఘాటు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పొత్తు పొడుపులపై విశ్లేషణలు, వ్యాఖ్యలు, ఊగాహనాలు జోరుగా సాగుతున్నాయి. విశాఖలో జనవాణి కార్యక్రమం సందర్భంగా జరిగిన సంఘటనల అనంతర పరిణామాలు ఏపీలో జనసేన, టీడీపీల మధ్య పొత్తు కుదిరిపోయినట్లేనన్నంతగా వార్తలు వచ్చాయి. విశ్లేషణలు సైతం అదే దారిలో సాగాయి. అంత కంటే చాలా ముందే జనసేనాని ఏపీలో వైసీసీని గద్దె దంచడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేలాగే తమ నిర్ణయాలు, విధానాలు ఉంటాయని జనసేనాని ప్రకటించి రాష్ట్రంలో పొత్తుపొడుపులపై చర్చకు తెరతీశారు. పవన్ కల్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసేందుకు అవసరమైతే తానో మెట్టు దిగేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఆయన ప్రకటన తరువాత రాష్ట్రంలో జనసేన, టీడీపీ మధ్య పొత్తు పొడిచేసినట్లేనని అంతా భావించారు. అందుకు అనుగుణంగానే క్షేత్ర స్థాయిలో జనసేన,టీడీపీ శ్రేణులు కలిసి కార్యక్రమాలు నిర్వహించారు. అయితే అప్పటికే జనసేన బీజేపీతో పొత్తులో ఉంది. మరి దాని సంగతేమిటన్న ప్రశ్రకు విశ్లేషకులు 2014 ఎన్నికలలోలా మూడు పార్టీల మధ్యా పొత్తు ఉండే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అయితే బీజేపీ మాత్రం టీడీపీతో పొత్తా అలాంటిదేమీ లేదని చెప్పుకుంటూ వస్తోంది. టీడీపీ, వైసీపీలకు సమదూరం పాటిస్తామని పదే పదే ఉద్ఘాటిస్తోంది. ఆ పార్టీ నేతలు ఆ దిశగా పదే పదే ప్రకటనలు గుప్పిస్తున్నా తెలుగుదేశం స్పందించడం లేదు. అలాగని జనసేనానితో అవగాహన విషయంలో మాత్రం సానుకూల సంకేతాలే ఇస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే  విశాఖ ఘటనల తరువాత తెలుగుదేశం అధినేత స్వయంగా వెళ్లి పవన్ కల్యాణ్ ను కలిశారు. పరామర్శించారు. అండగా ఉంటామని ధీమా సైతం ఇచ్చారు. ఆ సదర్బంగా ఇరువురూ కలిసి విలేకరులతో మాట్లాడారు.  ఆ సందర్భంగా పొత్తుల గురించి ఇరువురూ ప్రస్తావించలేదు. కానీ అదే సమయంలో  బీజేపీపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీతో ఆయన దూరం జరుగుతున్నారన్న సంకేతాలు ఇచ్చాయి. అందుకే బీజేపీ ముందుకు రాకపోతే ఆ పార్టీతో తెగతెంపులు చేసుకునైనా సరే తెలుగుదేశం, జనసేనలు కలిసే ఎన్నికలకు వెళతాయన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి. కానీ ఆ తరువాత ఎప్పుడైతే మోడీ, పవన్ కల్యాణ్ ల భేటీ జరిగిందో అప్పటి నుంచీ పరిస్థితి మారిపోయింది. పవన్ కల్యాణ్, మోడీల భేటీ తరువాత జనసేన, బీజేపీల మధ్య పొత్తు కొనసాగుతుందన్న సంకేతాలు బీజేపీ నేతల నుంచి స్పష్టంగా కనిపించాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదివారం (నవంబర్ 20)న చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. బీజేపీ తెలుగుదేశంతో కలిసి నడిచే ప్రశక్తే లేదని చెప్పడమే కాకుండా, జనసేన, తెలుగుదేశం పొత్తు కూడా ఉండదని విస్పష్టంగా చెప్పారు. అంతే కాదు.. బీజేపీ అధిష్ఠానం ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ కు కూడా చెప్పిందని ఆయన అంటున్నారు. అంటే మోడీ, పవన్ భేటీ సారాంశమిదేనా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. పవన్ కల్యాణ్ ఢిల్లీ పెద్దలు చెప్పినట్లే నడుచుకోవాలనీ, ఆయన తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యే ప్రశ్నే లేదని సోము వీర్రాజు అన్నారు. అందుకే తాను తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తానని పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ ఎక్కడా స్పష్టంగా చెప్పలేదని వివరించారు. దీంతొ ఏపీ రాజకీయాలలో మళ్లీ పొత్తలు చర్చ మొదలైంది. అయితే ఈ సారి ఏ పార్టీ ఏపార్టీ కలుస్తాయి.. అనే చర్చ కాకుండా.. అసలు జనసేన పార్టీకి స్వతంత్రం లేదా? హస్తినలో బీజేపీ పెద్దలు ఏం చేబితే అది ఫాలో కావాల్సిందేనా? అన్న దారిలో చర్చలు జోరందుకున్నాయి. నెటిజన్లైతే జనసేన పార్టీని బీజేపీ బంధిత పార్టీగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో అందరి కంటే ముందు పొత్తు చర్చలకు తెరతీసి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీల నివ్వనని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడమే ధ్యేయమన్నుట్లుగా వ్యవహరిస్తున్నారని జనసేన శ్రేణులే అంటున్నాయి. ఇటీవల తరచుగా ఆయన ఒంటరి పోరు అంటుండటంతో ఈ అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.   బీజేపీ చేతుల్లో బందీగా మారి పవన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  పవన్ ఏ పార్టీతో వెళ్ళాలో.. ఎవరిని కలవాలో కూడా బీజేపీ ఢిల్లీ పెద్దలే చెప్తారా? అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలవరనీ, ఎందుకుంటే బీజేపీ పెద్దలు ఆయనకు ఆమెరకు దిశానిర్దేశం చేయడమేనని అంటున్నారు. పవన్ బీజేపీని పదే పదే కోరిన రోడ్ మ్యాప్ ఇదేనా? అని రాజకీయ వర్గాలలో సందేహాలు వ్యక్తమౌతున్నాయి.  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ చెప్తుంటే.. ప్రతిపక్ష పార్టీ టీడీపీకి జనసేనను దూరం చేసి వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చేలా బీజేపీ ప్రయత్నిస్తుందా? అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. సోము వీర్రాజు మాటల వెనుక అర్ధం, అంతరార్ధం ఇదేనా అని సందేహాలూ వ్యక్తమౌతున్నాయి.   పొత్తుల కోసం తాము ఒక మెట్టు తగ్గేందుకు కూడా సిద్ధమని పవన్.. టీడీపీకి ఆఫర్లు ఇస్తుంటే.. పవన్ మాతోనే ఉండాలని.. మేము ఏం చెబితే అదే పవన్ చేయాలన్న అర్ధం వచ్చేలా సోము మాట్లాడటం వెనుక ఉన్న వ్యూహమేమిటని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా సోము వీర్రాజు వ్యాఖ్యలపై తెలుగుదేశం, జనసేనలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

యూపీలో మరో శ్రద్ధా వాకర్

సహజీవనం చేస్తున్న యువతిని దారుణంగా హత్య చేసి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసిన ఉదంతం మరువక ముందే అటువంటిదే మరో సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఢిల్లీలో శ్రద్ధా వాకర్  అఫ్తాబ్ అనే లివ్ ఇన్ పార్టనర్ అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే ఉత్తర ప్రదేశ్ లో ఓవ్యక్తి తన ప్రేయసిని దారుణంగా హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికేసి బావిలో పడేశారు. తలను మాత్రంవిడిగా మరో చెరువులో ఈ ఘటన యూపీలోని అజంగఢ్ జిల్లా పశ్చిమిగ్రామంలో జరిగింది. అదే గ్రామానికి చెందిన ప్రిన్స్ యాదవ్ తనను ప్రేమించి దగ్గరైన యువతి మరో పెళ్లి చేసుకోవడంతో పగ పెంచుకున్నాడు. సమయం కోసం ఎదురు చూసి తన తమ్ముడితో కలిసి ఈ దారుణానికి ఒడి గట్టాడు. ప్రిన్స్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ప్రశ్నించే క్రమంలో పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఫైరింగ్ చేశారు. ఈ క్రమంలో అతడి కాలికి గాయమైంది.  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్య తరహాలోనే ఈ దారుణం జరగడం గమనార్హం. ఢిల్లీలో శ్రద్ధ వాకర్ ను ఆమె పార్టనర్ అఫ్తాబ్ దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని 35 భాగాలు చేసిన విషయం తెలిసిందే!

టీమ్ ఇండియా అండర్ 19 మహిళల జట్టులో తెలంగాణ బిడ్డ

టీమ్ ఇండియా అండర్ 19 మహిళల జట్టులో తెలంగాణ అమ్మాయికి చోటు లభించింది. స్వదేశంలో న్యూజిలాండ్ తో జరగనున్న మహిళల టి20 సిరీస్ కు సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. ఈ సిరిస్ లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. ఈ జట్లులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గొంగడి త్రిషకు స్థానం దక్కింది. ఈ నెల 27న జరగనున్న తొలి మ్యాచ్ లో టి20 సిరీస్ ప్రారంభం కానుంది. మొత్తం 5 మ్యాచ్ లూ ముంబై వేదికగానే జరగనున్నాయి. కాగా అండర్ 19 మహిళల జట్టులో స్థానం సంపాదించిన త్రిష ఎనిమిదేళ్లకే జిల్లా స్థాయిలో రాణించింది. అలాగే  బీసీసీఐ నిర్వహించిన అండర్-19, సీనియర్ ఇండియా బ్లూ తరఫున త్రిష ప్రాతినిథ్యం వహించింది.   జైపుర్ వేదికగా జరిగిన అండర్-19 మహిళల వన్డే ఛాలెంజర్‌ ట్రోఫీ-2021లోను త్రిష ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకుంది. టీమ్ ఇండియా అండర్ 19 మహిళల జట్టుకు త్రిష ఎంపిక కావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.

భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు..బీహార్ లో12 మంది దుర్మరణం

బీహార్ లో ఘోర ప్రమాదం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా ఓ ఆలయం బయట  పూజలు చేస్తున్న భక్తులపైకి ట్రక్కు దూసుకెళ్లిన సంఘటనలో 12 మంది అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వైశాలీ జిల్లాలోని హాజీపూర్ ప్రధాన రహదారి పక్కనున్న ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఆలయంలో స్థలం సరిపోకపోవడంతో కొందరు ఆలయం బయట ఉన్న రావి చెట్టు వద్ద పూజలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఒక ట్రక్కు అదుపు తప్పి వారిపైకి దూసుకొచ్చింది. ఈ దుర్ఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఈ దుర్ఘటనలో మరణించిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ దుర్ఘటన పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఈ దుర్ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతేల కుటుంబాలకు ప్రగాఘ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 

చంపేస్తున్న చలి పులి... వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాలు వణుకుతున్నాయి. చలి పులి పంజా విసరడంతో తెలుగు రాష్ట్రాలు విలవిల లాడుతున్నాయి. గత ఏడెనిమిది రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. వీటికి తోడు చిరు జల్లులు. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రత సగటున 20 డిగ్రీల కంటే దిగువన నమోదౌతోంది. దీనికి తోడు ఈశాన్య రుతుపవనాల రాక,  తూర్పు దిశగా   బలమైన గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత తీవ్రంగా ఉందని  వాతావరణ నిపుణులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటగున్నారు.  కొమరంభీం జిల్లాలో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవగా.. మంచిర్యాల 12, ఆదిలాబాద్ 13, నిర్మల్ లో 13.5 డిగ్రీలు నమోదయ్యాయి.  ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు చలికి వణుకుతున్నారు.  మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో అత్యల్ప   ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కురుస్తూ.. మధ్యాహ్నం వరకు సూర్యుడు కనిపించడం లేదు. ఏపీలోని అల్లూరి జిల్లాలో 10, పాడేరులో 12, అరకులోయలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

గుజరాత్ లో రెండో స్థానం కోసమేనా కేజ్రీవాల్ పోరాటం?

గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెల 1,5 తేదీలలో రెండు విడతలలో ఎన్నికలు జరగనున్నాయి. గత ఆరు దఫాలుగా గుజరాత్ లో బీజేపీ తిరుగులేని విజయాలు సాధిస్తూ వస్తోంది. వరుసగా ఏడో సారి కూడా విజయం ఖాయమన్న ధీమానూ వ్యక్తం చేస్తోంది. అయితే ఈ సారి గుజరాత్ లో బీజేపీకి విజయం నల్లేరు మీద బండి నడక ఎంతమాత్రం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ సారి గుజరాత్ లో బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఏదైనా ఉందంటే.. అది రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పోటీలో ఉండటమేనంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలలో ఆప్, గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ చాలా చాలా బలంగా పుంజుకున్నాయి. గుజరాత్ ఎన్నికలపై సర్వేలన్నీ.. ఇదే విషయాన్ని ప్రస్ఫుటంగా తేల్చేశాయి.  లోక్ నీతి -సి.ఎస్.డి.ఎస్. సర్వే మాత్రం  ఆప్ గట్టి పోటీ ఇస్తుండటంతో కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లన్నీ ఆ పార్టీ వైపు మళ్లిపోతాయని పేర్కొంది. గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ కు ఎంత గట్టి పట్టు ఉన్నా.. దానిని ఓట్ల రూపంలో మరచుకునే వ్యూహాలూ, ప్రచారంలో కాంగ్రెస్ బాగా వెనుకబడిందంటున్నారు.  రాహుల్ జోడో యాత్రలో ఎన్నికలు జరుగుతున్న గుజరాత్ కు స్థానం లేకపోవడంపై పార్టీలో పెల్లుబికిన అసంతృప్తి కారణంగా చివరి నిముషంలో ఆయన పాదయాత్ర రూట్ మ్యాప్ లో గుజరాత్ ను చేర్చినప్పటికీ, అప్పటికే ఆలస్యమైపోయిందంటున్నారు.   2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 41.4 శాతం ఓట్లు దక్కాయి.  77 స్థానాలలో విజయం సాధించి, ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. కానీ ఈ సారి ఆ సీన్ లేదంటోంది లోక్ నీతి సర్వే. ఆ సర్వే ప్రకారం గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ   ప్రభావం కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారిందంటోంది. ఆ పార్టీకి రానున్న ఎన్నికలలో వచ్చే ఓట్లలో ఎక్కువ భాగం కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లేనని చెబుతోంది. గతంలో పరిశీలకులు సైతం ఇదే రీతిలో విశ్లేషణలు చేసిన సంగతి విదితమే. అంటే కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లలో కనీపం 20 శాతం ఆప్ కు మరలి పోయినా ఆశ్చర్యంలేదని సర్వే అంటోంది. అంటే ఈ సారి కాంగ్రెస్ కు గతంలో  వచ్చిన ఓట్ల శాతం గణనీయంగా తగ్గిపోతుందని లోక్ నీతి సర్వే పేర్కొంటోంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా కాంగ్రెస్ ఖాతాలో కాకుండా ఆప్ ఖాతాలో పడే అవకాశాలే ఎక్కవ ఉన్నాయంటోంది. అంటే ఆప్ ప్రభావం వల్ల బారీగా నష్టపోయేది కాంగ్రెస్సేనన్నది సర్వే సారాంశం. దీంతో ఈ సారి ఎన్నికలలో గుజరాత్ లో కాంగ్రెస్ కు కనీసం రెండో స్థానం కూడా దక్కే అవకాశం లేదన్నది లోక్ నీతి సర్వే సారాంశం. గుజరాత్ లో ఆప్ అంతగా పుంజుకున్నా.. అధికారాన్ని చేపట్టే పరిస్థితి అయితే లేదని.. కానీ కాంగ్రెస్ అవకాశాలను మాత్రం భారీగా గండి కొడుతుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  వాస్తవానికి కేజ్రీవాల్   వ్యూహం కూడా అదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ మరో సారి అధికారంలోకి వచ్చినా సరే కానీ రాష్ట్రంలో రెండో స్థానంలో ఆప్ ఉండాలన్న వ్యూహంతో కేజ్రీవాల్ ఉన్నారని అంటున్నారు.