చారిత్రక స్థలాలపై ప్రభుత్వానికే అవగాహన లేదా?

ఐక్యరాజ్యసమితికి పంపిన నివేదికను పరిశీలిస్తే పర్యాటక స్థలాలపై రాష్ట్రప్రభుత్వానికే అవగాహన లేనట్లు కనపడుతోంది. ఒక్క కుతుబ్‌షాహీ సమాథి, గోల్కొండకోట, చార్మినార్‌ మినహా ఇంకేమీ చారిత్రక స్థలాలుగా ప్రభుత్వకంటికి కనిపించలేదు. ఆ మూడిరటిని యునెస్కో చారిత్రకస్థలాల జాబితాలో ప్రపంచచారిత్రకస్థలాలుగా గుర్తించాలని కోరింది. వాస్తవానికి ఆదుర్రు బౌద్ద క్షేత్రం, నాగార్జునకొండ, చంద్రగిరికోట, కె.డి.పేట, కర్నూలు కొండారెడ్డి బురుజు, ఖమ్మం ఖిల్లా, వరంగల్‌ వేయిస్తంభాలగుడి వంటి పలు పర్యాటకస్థలాలు చారిత్రక ఆనవాళ్లుగా మిగిలాయి. వీటిని చూడటానికి కూడా పర్యాటకులు ఇష్టపడతారు. ప్రత్యేకించి ఆదుర్రు, నాగార్జునకొండ బౌద్ధం ఆవిర్భవించటానికి కారణమైన స్థలాలు అని, మంగళగిరిలో కూడా బౌద్ధం ఆనవాళ్లు మిగిలి ఉన్నాయని పరిశోథకులు తేల్చారు. కొన్ని వందల ఏళ్ల చరిత్ర వీటికి ఉన్నాయి. అలానే చంద్రగిరికోట విషయానికి వస్తే విజయనగర సామ్రాజ్యాథిపతి శ్రీకృష్ణదేవరాయలు తన రాణులతో ఇక్కడే సేదతీరేవారని చరిత్ర చాటుతోంది. ఆయన వాడిన 160కేజీల కత్తి, ఆభరణాలు కూడా అక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఒకే వేటుకు ఏనుగును సంహరించే ఆ కత్తి ప్రపంచవ్యాప్తంగా వింతే. అప్పటి ఉరికంబం, కొండల్లో నుంచి వచ్చే నీరు ఇప్పటికీ పలువురిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక వరంగల్‌వేయిస్తంభాల గుడి చూసేందుకు పర్యాటకులు భారీసంఖ్యలో వస్తుంటారు. అరుదైన ఏకశిలలు ఇక్కడ ఉన్నాయి. ఏకశిలపై శివలింగం మలిచిన చరిత్ర ఈ వేయిస్తంభాల గుడి సొంతం. అలానే కర్నూలు కొండారెడ్డిబురుజు అసలు కట్టడమే చారిత్రక పటుత్వానికి నిదర్శనం.ఇటువంటి అనేక ప్రాచీన చారిత్రాత్మక  ప్రాంతాలు రాష్ట్రంలో ఉంటే ఆంథ్రప్రదేశ్‌ ప్రభుత్వం వాటిని విస్మరించటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాకుండా ఎక్కువ చారిత్రకస్థలాలున్న రాష్ట్రంగా గుర్తింపునందుకుంటే పర్యాటకుల వరద ఖాయం. అసలు జాబితానే తయారు చేయటంలో మందకొడి విధానం అవలంబిస్తే ఆంథ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగినట్లే అని పర్యాటకప్రేమికులు ప్రభుత్వపోకడపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

వడ్డి కాసుల వాడికి ప్రైవేట్‌ వడ్డీ అవసరమా?

తిరుపతి ఏడుకొండల వాడి నిధులు ప్రభుత్వబాండ్లుగా మార్చేందుకు రంగం సిద్ధమైంది. అంటే ప్రభుత్వం ఆ నిధులను ఉపయోగించుకుంటుందన్న మాట. ఏదో ఒక పేరిట ఆ నిధులను వినియోగించుకోవాలన్న ప్రభుత్వపాచిక ఒకరకంగా పారిందనే చెప్పవచ్చు. దీనికి టిటిడి బోర్డు ఏకగ్రీవ ఆమోదాన్ని తెలిపింది. దీనికి తోడు ఇప్పటికే వందలాది కోట్ల రూపాయల స్వామివారి నిధులు జాతీయ బ్యాంకుల్లో ఉన్నాయి. వీరికన్నా కొన్ని ప్రభుత్వ బ్యాంకులు ఎక్కువ వడ్డీ ఇస్తాయని ఆశ చూపించడంతో టి.టి.డి.పాలక వర్గం ఆ బ్యాంకుల్లో కూడా కొంత డిపాజిట్లు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది.ప్రైవేటు బ్యాంకుల్లో డబ్బుదాచాలని కూడా టిటిడి తీసుకున్న నిర్ణయం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదెంత మాత్రం క్షేమకరం కాదని పాలకమండలి గుర్తించాలని ఆర్థికనిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వసెక్యూరిటీస్‌తో పాటు ట్రాన్స్‌కో, జెన్‌కో, ఆర్టీసీ వంటి సంస్థలు జారీ చేసే బాండ్లు కొనుగోలు చేయవచ్చని పాలకమండలి భావిస్తోంది. గత నెల 25న ఈ మేరకు ఓ (నెంబరు 76) తీర్మానం కూడా చేసింది. ఇప్పటి వరకూ టిటిడి తన ఆదాయాన్ని జాతీయబ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వసెక్యూరిటీలు కొనుగోళ్లకు తెరలేపింది. ఫలితంగా ఓ రెండుశాతం వడ్డీని టిటిడి నష్టపోతోంది. జాతీయబ్యాంకులు ఇచ్చే వడ్డీ కన్నా రెండుశాతం తక్కువవడ్డీ ప్రభుత్వ సెక్యూరిటీల్లో లభిస్తున్నది. ఈ విషయం తెలిసినా కూడా టిటిడి పాలకమండలి ప్రభుత్వానికి ఆ నిధులు పంపించేందుకు సిద్ధమైంది.   ఇప్పటి వరకూ వెంకన్న నిధుల్లో ఎక్కువ భాగం ఆంథ్రాబ్యాంకులోనే జమైంది. ఇండియన్‌ ఓవర్‌సీస్‌బ్యాంకులో 11.19శాతం, ఇండియన్‌బ్యాంకులో 9.83శాతం, విజయాబ్యాంకులో 8.88శాతం, సిండికేట్‌బ్యాంకులో 7.17శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 5.77శాతం, యూనియన్‌బ్యాంక్‌లో 4.93శాతం, ఇతరబ్యాంకులో 8.61శాతం డిపాజిట్లు చేసింది.

ఆగిన వెంకట్రామిరెడ్డి ప్రమాణస్వీకారం!

నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి శాసనమండలికి వెడితే హైకోర్టు ఇచ్చిన స్టే ఆ కార్యక్రమానికి బ్రేక్‌వేసింది. ఈ ఎన్నికపై తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల మధ్య వివాదం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపొందారని కోర్టు ధృవీకరించింది.దీంతో ప్రమాణస్వీకారానికి సోమవారం ముహుర్తం పెట్టుకుని మరీ ఆయన శాసనమండలికి చేరుకున్నారు. ఆయన తరువాత శాసనమండలిలో కాలుమోపిన ప్రత్యర్థి, గతంలో గెలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నర్సారెడ్డి హైకోర్టు ఇచ్చిన స్టేను శాసనమండలి ఛైర్మనుకు అందజేశారు.    హైకోర్టు స్టేను పరిశీలించిన అనంతరం వెంకట్రామిరెడ్డి శాసనమండలి సభ్యునిగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వటం వల్లే తాము ఈ ప్రమాణస్వీకారాన్ని ఆపుజేశామని మండలి ఛైర్మను స్పష్టం చేశారు. అట్టహాసంగా శాసనమండలికి చేరుకున్న వెంకట్రామిరెడ్డి ప్రమాణస్వీకారం ఆగిపోవటంతో చేసేదేమీ లేక తిరుగుముఖం పట్టారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై చెలరేగిన వివాదం కోర్టు పరిష్కారానికి వెళ్లటం వల్ల ఈ ప్రమాణస్వీకారం ఆగింది. తిరిగి హైకోర్టు మొత్తం కేసును పరిశీలించాక కానీ, నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కేసు ఒక కొలిక్కి రాదు. దీంతో తరువాత ఏమి చేయాలన్న విషయంపై వెంకట్రామిరెడ్డి, నర్సారెడ్డి తమ న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు.

ఈడీ విచారణకు తలొంచిన జగన్‌?

మనీలాండ్రిరగ్‌, ఫెరా చట్టం కింద వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ అథ్యక్షుడు జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల వ్యవహారాన్ని ఈడీ విచారిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విచారణ జరుగుతున్నప్పుడు బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించటం తగదని న్యాయనిపుణుల సలహాలకు జగన్‌ తలొంచారు. ఈ బెయిల్‌ పిటీషను వెనక్కి తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇప్పటి దాకా జగన్‌ తన బెయిల్‌కోసం తీవ్రంగా ప్రయత్నిస్తునే ఉన్నారు. ఇటీవల హైకోర్టులో కూడా బెయిల్‌ కోసం ఆయన దాఖలు చేస్తే అక్కడ నిరాకరించారు. దీంతో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించాలని అప్పట్లో నిర్ణయించుకున్నారు.ఆ మేరకు పిటీషన్‌ను మూవ్‌ చేశారు.   అయితే ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌(ఈడీ) జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణను ప్రారంభించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు న్యాయవాదుల సమక్షంలో జగన్‌ను ఈడి విచారిస్తున్నది. ఈ విచారణ కోసం ఈడి బృందం చంచల్‌గూడా జైలుకు వస్తోంది. మనీలాండ్రిరగ్‌ వ్యవహారం గురించి జగన్‌కు ముందుగా ప్రశ్నావళి ఇచ్చి విచారించటం, న్యాయవాదుల సమక్షంలో విచారణ చేయటం వంటి ఈడి విధానాలు న్యాయపరంగా కనిపిస్తున్నాయి. దీంతో విచారణ జరుగుతుండగా బెయిల్‌కు ధరఖాస్తు చేసుకున్నట్లవుతుందని జగన్‌ను ఆయన న్యాయనిపుణులు హెచ్చరించారు. దీంతో సుప్రీంకోర్టు అనుమతి తీసుకుని పిటీషను వాపసు తీసుకోవాలని తన న్యాయవాదులను జగన్‌ కోరారు. ఓ రకంగా చెప్పాలంటే ఈడీ పద్దతి ప్రకారం విచారణ చేపట్టడంతో జగన్‌ తలొంచినట్లు అయింది.  

వాన్‌పిక్‌ తో తెలుగు దేశం లాభపడుతుందా?

తెలుగుదేశం పార్టీ తన బలాన్ని పెంచుకునే కసరత్తులకు శ్రీకారం చుట్టింది. ముందస్తుగా బిసీల బలాన్ని పెంచుకునేందుకు ఇటీవల కృషి చేసిన ఆ పార్టీ ఇప్పుడు సమస్యల వారీగా పరిశీలనలు ప్రారంభించింది. అందులో భాగంగానే  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అథ్యక్షుడు జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో కీలకమైన వాన్‌పిక్‌ భూముల సమస్యను తెలుగుదేశం పార్టీ భుజానికి ఎత్తుకుంటోంది. ఈ సమస్యపై పోరాడితే కనీసం ప్రకాశం జిల్లాలో రైతుల మనస్సు గెలుచుకోవచ్చని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అందుకే కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలను మినహాయించి అన్ని పార్టీలనూ కలుపుకునేందుకు టిడిపి రంగం సిద్ధం చేసుకుంది.    దానిలో భాగంగానే ఈ నెల 25న ఒంగోలులో రౌండ్‌టేబుల్‌ కాన్ఫరెన్సు ఏర్పాటు చేస్తోంది. ఈ సమావేశం తీసుకున్న నిర్ణయాల ప్రకారం వాన్‌పిక్‌భూముల విషయంలో తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి అంటున్నారు. తమ పార్టీ అథినేత చంద్రబాబు కూడా ఈ కార్యక్రమం గురించి ఉత్సుకత చూపుతున్నందున ఈ రౌండ్‌టేబుల్‌ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశామన్నారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల ముఖ్యనాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా అథ్యక్షుడు దామచర్ల జనార్దన్‌,మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు ఈ కార్యక్రమ ఏర్పాట్లలో ఉన్నారు.  

విజయలక్ష్మిని నిలదీసిన సుప్రీం కోర్ట్

అవినీతి నిరోథకశాఖ (ఎసిబి)ని వదిలేసి సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని ఆ కోర్టు న్యాయమూర్తులు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మిని నిలదీశారు. ఆమె తెలుగుదేశం పార్టీ అథినేత చంద్రబాబు, మరో 22మందిపై సుప్రీంకోర్టులో పిటీషను దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనిపై రెండుగంటల పాటు విచారణ నిర్వహించిన సుప్రీం ఇది రాజకీయదురుద్దేశ్యంతో కూడుకున్నదని ధృవీకరణకు వచ్చి పిటీషన్‌ను కొట్టేసింది.ఎసిబిని ఆశ్రయించాలని,అప్పటికీ న్యాయం జరగలేదంటే అప్పుడు పిటీషను వేసుకోవచ్చని సుప్రీం తేల్చింది.విజయలక్ష్మి తరుపున సీనియర్‌న్యాయవాదులు రాంజెత్మలానీ,ముకుల్‌ వాదించారు.   వీరి వాదనలో తొలుత ఇది రాజకీయ అంశంగా చూడొద్దన్నారు.అరెస్టులతో పని లేకుండానే జగన్‌ తరహాలో విచారిస్తే ప్రజాప్రయోజనకరంగా ఉంటుందని విశ్లేషించారు. దీనిలో అసలు ప్రజాప్రయోజనమేదీ లేదనీ,కోర్టు బయటే దీన్ని తేల్చుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలనకు తీసుకున్న సుప్రీం కిందకోర్టుల్లో విషయం ఎందుకు ప్రస్తావించలేదని విజయలక్ష్మిని ప్రశ్నించింది. ఆరోపణలు కూడా సరైన పద్దతుల్లో లేవని ఆగ్రహం వ్యక్తం చేసింది.చంద్రబాబు తరుపున అశోక్‌గంగూలీ,దివానీ వాదిస్తూ ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశ్యానికి సంబంధించిందని హైకోర్టు కూడా తేల్చిందని సుప్రీంకోర్టుకు వివరించారు. అవినీతికి సంబంధించిన అంశం కాబట్టి విజయలక్ష్మికి ఎసిబిని సంప్రదించాలని సుప్రీం కోర్టు సూచించింది.

ప్రత్యేకతెలంగాణా ఓ నెరవేరని కల?

ప్రత్యేకతెలంగాణా రాష్ట్రం అనేది ఓ నెరవేరని కలగా మిగులుతుందని నేటి రాజకీయవాతావరణం తేటతెల్లం చేస్తోంది. దేశ తొలిపౌరునిగా, భారత రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ ఎన్నిక తెలంగాణావాదులకు ఓ పెద్దషాక్‌. భారీమెజార్టీతో ఆయన  గెలుపొందినందున(70శాతం) తెలంగాణా వచ్చే సమస్యే లేదని రాజకీయ మేథావులు స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా పొరబాటున తెలంగాణాకు అనుకూలంగా స్పందిస్తే మరో కాంగ్రెస్‌ నాయకుడు దాన్ని ఖండిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణా అవసరమా? అన్న విషయంపై కేంద్రంలోని ఎంపీలు అందరూ ఒక్కతాటిపై లేరనేది జగమెరిగిన సత్యం.     ప్రత్యేకించి కాంగ్రెస్‌ ఎంపీలందరూ కూడా కేంద్రపార్టీ నిర్ణయాలకు తలొంచాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ పార్టీ తరుపున పూర్తిస్థాయి అథికారాన్ని పొందేందుకు సిద్ధమవటం వల్ల కాంగ్రెస్‌ ఆ హడావుడిలో బిజీగా ఉండిపోతుందని సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలు ముగియకుండానే రాహుల్‌గాంథీ కాంగ్రెస్‌ ప్రధానకార్యదర్శిగా పూర్తిస్థాయిలో పని చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అంతేకాకుండా జాతీయస్థాయిలో ఇప్పటికే ఆయన నేతలతో అన్నిరాష్ట్రాల్లోని పరిస్థితులూ తెలుసుకుని తాను ప్రధాని అయితే ఎక్కడ ఇబ్బందులు వస్తాయో అన్న విషయం పరిశీలిస్తున్నారు. ప్రత్యేకించి రాహుల్‌ రాకతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే రాహుల్‌గాంధీ రాజకీయరంగ ప్రవేశం చేస్తే తాను మద్దతు ఇస్తానని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి బహిరంగంగా ప్రకటించారు. ఆ మాటకు ఇప్పటికీ తాము కట్టుబడి ఉంటామని వైకాపా గౌరవాథ్యక్షురాలు విజయమ్మ ఇటీవల ఢల్లీ పర్యటనలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో అన్నారట. సో! దీని వల్ల 2014 లోక్‌సభ ఎన్నికల్లో  ప్రధాని అభ్యర్థి రాహుల్‌గాంధీ అయితే వైకాపా మద్దతు ఇవ్వటం ఖాయమని తేలుతోంది. ఈ నేపథ్యంలో తెరాస కోరుకున్న ప్రత్యేకరాష్ట్రం అసలు సాధ్యమవదు. అంతేకాకుండా వైకాపాను తెలంగాణాప్రాంతంలో పట్టుపెంచుకోమని కాంగ్రెస్‌ ప్రోత్సహిస్తోంది. ఎందుకంటే ఒకవేళ జగన్‌ విడుదలయ్యాక పార్టీ కొనసాగించినా తెలంగాణా ప్రాంతం నుంచి వైకాపా మద్దతు కాంగ్రెస్‌ కోరుకుంటోంది. 2012 పరకాల ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిని కొండా సురేఖ ఇచ్చిన గట్టిపోటీ కాంగ్రెస్‌ పార్టీని ఆకట్టుకుంది. ప్రధాని కూడా ఇదే విషయాన్ని గమనించి తెరాసకు ప్రత్యామ్నాయంగా వైకాపా చాపకింద నీరులా విస్తరించాలని సూచించారట. అందుకే విజయమ్మ ఢల్లీ నుంచి వచ్చాక తన కుమారుడితో చర్చలు జరిపి కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో చేనేత కార్మికులకు మద్దతు నిరసనకార్యక్రమం రూపొందించింది. అలానే జగన్‌ కూడా మొన్నటి వరకూ టిఆర్‌ఎస్‌ అథినేత కెసీఆర్‌తో రహస్య మంతనాలు కొనసాగించి ఇప్పుడు అసలు ఆయనతో మాట్లాడేందుకూ ఇష్టపడటం లేదట.  తెలంగాణా గురించి చర్చలు నిర్వహించే పరిస్థితుల్లో కాంగ్రెస్‌ అథిష్టానం ఇప్పుడు లేదు. రాష్ట్రపతి ఎన్నికల తరువాత తెలంగాణా గురించి ప్రతిపాదిద్దామని కెసీఆర్‌ భావించారు. ఈలోపే రాహుల్‌ ప్రధాని అభ్యర్థిత్వం తెరపైకి రావటంతో కాంగ్రెస్‌ సీనియర్లు ఆ విషయంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. నాటి రాజీవ్‌గాంధీతో సమానంగా రాహుల్‌కు క్రేజ్‌ పెంచేపనిలో కాంగ్రెస్‌ నేతలు మునిగిపోవటంతో తెలంగాణా ఇప్పట్లో రానట్లే అని మేథావులు సైతం తేలుస్తున్నారు. అలా అని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కెసీఆర్‌ సంప్రదించకుండా తెలంగాణాలోనే కొత్తచిచ్చు రగులుతోంది.  వైకాపా, తెరాస తెలంగాణా ప్రాంతంలో నిరసనల ద్వారా బలప్రదర్శనకు సిద్ధమయ్యాయి. ఈ ప్రదర్శనల హోరు తరువాత కాంగ్రెస్‌ ప్రకటించే స్థానికఎన్నికలతో 2014 ఎన్నికల దాకా తెలంగాణా అంశం పోస్టుపోన్‌ అయింది. దీంతో ఆ ఎన్నికలే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రానికి రిఫరెండం అవుతాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక తెలంగాణా ప్రత్యేకరాష్ట్ర డిమాండు 2014 అజెండా అంశం కాక తప్పదంటున్నారు పరిశీలకులు. మరి కెసీఆర్‌ మరో జోస్యం సక్సెస్‌ అయిందా? లేక ఫెయిల్‌ను ఎలా కవర్‌ చేస్తారు? వంటి ప్రశ్నలు ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చాయి. కాలమే దీనికి సమాధానాలు ఇవ్వాలి మరి.     తెలుగువారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేంటని పిసీసీ అథ్యక్షుడు బొత్సా సత్యన్నారాయణ చేసిన వ్యాఖ్యలు తెలంగాణా వాదులకు ప్రత్యేకరాష్ట్ర ఆశలు పెంచాయి. అసలు ఈ వ్యాఖ్యలే యాథృచ్ఛికమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు అన్నారు. తెలంగాణా కలిసుండాలా? విడిపోవాలా? అన్నది కేంద్ర నిర్ణయంపై ఆధారపడి ఉందని, అది బొత్సాకు ఆపాదించొద్దని ఆయన కోరారు. ప్రభుత్వం ఎన్నో క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొంటున్న ఈ సమయంలో తెలంగాణా అంశం ఒక్కదానిపై చర్చించటం బాగోలేదన్నట్లు పాలడుగు వ్యాఖ్యలున్నాయి. ఇంకా కాంగ్రెస్‌ అథిష్టానం ప్రత్యేక తెలంగాణా అంశంపై ఒక అభిప్రాయానికి రాలేదని బొత్సా, పాలడుగు ప్రకటనలను బట్టి అర్థం చేసుకోవాలి. ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటే ఇలాంటి వైరుథ్య ప్రకటనలు వెలువడేది కాదు.

గుడివాడ అభ్యర్ధి వేటలో తెలుగుదేశం?

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయగల సమర్థులైన అభ్యర్థుల కోసం ఆ పార్టీ ఇక కసరత్తులు చేయకతప్పదు. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ అథిష్టానంతో పోరాటం జరిపిన ఎమ్మెల్యే కొడాలి నాని తన అంతరంగాన్ని బయటపెట్టాడు. తాను వైఎస్‌ఆర్‌సిపి తరుపున పోటీ చేస్తానని ప్రకటించారు. అంటే అవసరమైతే రాజీనామా చేసి ఎన్నికలకు తెరలేపటానికి నాని సిద్ధంగా ఉన్నారు. అందుకే తన నియోజకవర్గ అభివృద్థికి రూ.250కోట్ల ప్యాకేజీని నాని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన తనకు అవసరమైన కార్యకర్తలను సమకూర్చుకున్న తరువాతే తెలుగుదేశం వీడినట్లు ప్రకటించటం గమనార్హం.   సస్పెండ్‌ చేశామని చెప్పిన తెలుగుదేశం పార్టీని తప్పుబడుతూ నాని కొందరు తెలుగుదేశం కార్యకర్తలను తనకు మద్దతుదారులుగా మలుచుకున్నారు. అనుకున్నది అయ్యేంత వరకూ ఓర్పువహించిన నాని జగన్‌ సూచనల మేరకే నడుచుకుంటున్నారని సమాచారం. తనపై దుమారం లేపిన తెలుగుదేశం నేతలను నాని సమర్ధవంతంగా తిప్పికొట్టారు. పైగా, తెలుగుదేశం క్యాడర్‌ను నాని కొన్నాళ్లపాటు కార్యాలయం స్వాధీనం చేసుకుని ఒకరకంగా దెబ్బతీశారు. డబ్బులు తీసుకున్నారని నానిపై  ఆరోపణలు చేసిన వారందరినీ టార్గెట్‌ చేసిన నాని ఇప్పుడు ఫ్రీ అయ్యారు. సాక్షాత్తూ తమ పార్టీ అథినేత చంద్రబాబును తనకు తెలిసిన కోణంలో ప్రజల ముందుంచిన నాని ఇక వైకాపా అభ్యర్థిగా పోటీ చేయదలుచుకున్నారు.  తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు స్వస్థలం గుడివాడ. ఇక్కడ నందమూరి కుటుంబానికీ, ఆయన సామాజికవర్గానికీ మంచి ఆదరణ ఉంది. ఆయన తరువాత మనుమడు, హీరో ఎన్టీఆర్‌ స్వయంగా కొడాలి నాని గురించి చంద్రబాబుకు రికమండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ సిఫార్సు మేరకు తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన నాని ఇప్పుడు వైకాపాకు ఆదరణ ఉందంటున్నారు. అందుకే ఆ పార్టీ తరుపున ప్రజల ద్వారా ఎన్నికవుతానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల నందమూరి కుటుంబవారసుడు బాలకృష్ణ రాజకీయరంగ ప్రవేశానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన ఈ గుడివాడ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తే ఒక్క సామాజికవర్గానికి ప్రతినిధిగా మిగిలిపోతానని బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన హిందుపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అందువల్ల ఆయన్ని ఇప్పుడు తప్పనిసరిగా గుడివాడకు ఒప్పిస్తే 2014కు హిందుపురం అసెంబ్లీలో రెండోసారి పోటీకి నిలపవచ్చని తెలుగుదేశం సీనియర్లు భావిస్తున్నారు. కొడాలినానిని ఎదుర్కోవాలంటే బాలకృష్ణ మాత్రమే బలమైన ప్రత్యర్థి అని భావిస్తున్నారు. అయితే బాలకృష్ణ కుమార్తెను కూడా రాజకీయాల్లో దింపాలన్న ఆలోచన ఉన్న సీనియర్లు ఆమెను దింపి వెనుక నుంచి బాలకృష్ణ మద్దతు తీసుకున్నా పర్వాలేదంటున్నారు.  

వైకాపా అంటే తెరాసకు భయమా?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటే తెలంగాణా రాష్ట్ర సమితి(తెరాస) భయపడుతోంది. అసలు తెలంగాణా ప్రాంతంలోనూ సమైక్యవాదాన్ని వినిపించి 2012 పరకాల ఉపఎన్నికల్లో దాదాపుగా విజయవంతమైన వైకాపా గురించి తక్కువ అంచనా వేయలేని స్థితిలో తెరాస ఉంది. చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలన్న చందాన్న తెరాస నిరసనకార్యక్రమాల ద్వారా వైకాపాపై తెలంగాణా ప్రాంతంలో వ్యతిరేకత పెంచేందుకు కృషి చేస్తోంది. ఎంత కృషి చేసినా పరకాల ఉపఎన్నికల్లో మెజార్టీ కేవలం 1500ఓట్లు వచ్చాయన్న విషయాన్ని తెరాస జీర్ణించుకోలేకపోతోంది. వైకాపా అన్న పేరు వినగానే తెరాస నాయకులు ఉలిక్కిపడుతున్నారు. వైకాపా అథినేత జగన్మోహనరెడ్డి చంచల్‌గూడా జైలులో ఉన్నప్పుడే రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే వైకాపా తరుచుగా ఆందోళనలు, కార్యక్రమాలు కొనసాగిస్తే తమ ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర డిమాండు దెబ్బతింటుందని తెరాస అభిప్రాయపడుతోంది. తెలంగాణా ప్రాంతంలో నిరసనకార్యక్రమాలకు భారీస్పందన ఉంటుందనే సూత్రాన్ని నమ్మిన తెరాస, వైకాపా రెండూ కూడా తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో చేనేతకార్మికుల సంఖ్య ఎక్కువ. వీరు ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉన్నారన్న విషయం తెలుసుకునే వైకాపా అక్కడ తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నిరసనకార్యక్రమాలు నిర్వహించటం ద్వారా బలాన్ని పెంచుకోవచ్చని భావిస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలు ఇప్పటికే చేనేత కార్మికులను ఆకట్టుకున్నాయి. అందుకే కొందరు పార్టీ సభ్యత్వాన్నీ కోరారన్న సంగతీ వైకాపా నేతలు విజయమ్మ ముందుంచారు. దీంతో అటు నిరసనకార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మంచి ఉద్యమం అన్న ఖ్యాతి, పార్టీ బలోపేతం జరుగుతాయని విజయమ్మ భావిస్తున్నారు. ఆమె రాకుండానే అడ్డుకోవాలని, ఒకవేళ నిరసనకార్యక్రమం ప్రారంభించాకనైనా ఆమెను నిలువరించాలని తెరాస భావిస్తోంది. ఎందుకంటే తమ కార్యకర్తల బలాన్ని ఆమె లాగేసుకుంటారన్న భయం తెరాసను వెంటాడుతోంది. అందుకే ముందస్తుగా కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో మహిళాకార్యకర్తలు తెరాస తరుపున భారీర్యాలీలు నిర్వహించారు. నల్గొండలోని క్లాక్‌టవర్‌ వద్ద విజయమ్మ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. అయినా విజయమ్మ కార్యక్రమం ఆగకుండా బహిరంగంగా అడ్డుకుంటామన్న తెరాస నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులు అన్యాయమని మాజీ ఎంపి వినోద్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా తమ నిరసన కార్యక్రమాలు కొనసాగించుకునే హక్కుంటుందని, విజయమ్మ కార్యక్రమాన్ని అడ్డుకోవటం కన్నా ఆమెనే కొన్ని ప్రశ్నల ద్వారా నిలదీయటం తప్పులేదని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ తరుపున ప్రజాస్వామ్యయుతంగా శాంతిపద్దతుల్లో ఆమెను ప్రశ్నించాలని కార్యకర్తలకు ఆయన పిలుపు ఇచ్చారు. విజయమ్మ చేపడుతున్న చేనేత దీక్షను విజయవంతం చేస్తే ఇప్పటి నుంచి 2014 ఎన్నికలకు కావాల్సిన బలాన్ని పుంజుకోవచ్చని పరకాల వైకాపా నాయకులు కొండా సురేఖ, ఇతర నాయకులు భావిస్తున్నారు. వీరి అభిప్రాయానికి తగ్గట్లు కాంగ్రెస్‌విప్‌ జగ్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో విజయమ్మ కాలుమోపటానికి తెరాస అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. ఇతర పార్టీలు వస్తే తమను మర్చిపోతారన్న భయంతోనే తెరాస, జెఎసి విజయమ్మ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఏమైనా అన్ని పార్టీలూ కూడా తెరాసకు విజయమ్మ రాక భయం పుట్టిస్తోందన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఉద్రిక్తవాతావరణాన్ని తీసుకువచ్చి అయినా వైకాపా నేతలను తెలంగాణాలో కాలు మోపకుండా చూడాలని తెరాస పన్నాగాలు బయటపడ్డాయి.

చినుకుకే వణుకుతున్న నగరం!

హైదరాబాద్‌లో ఒక గంట వర్షం పడినా దాని ప్రభావం ప్రజల మీద, ట్రాఫిక్‌ మీద వుంటుందనటంలో సందేహం లేదు.రోడ్లన్నీ జల మయం అయి మురుగు కాలువలను తలపింప చేస్తాయి. అలాంటిది గత రెండు రోజులనుండి ఎడతెరిపి లేకుండా పడిన వర్షాలకు 9మంది చనిపోగా లోతట్ టుప్రాంతాలన్నీ మునిగి ఇళ్ళలోకి నీరు ప్రవేశించి బాధితులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. 60 ఏళ్ళ క్రింద వుండే హైదరాబాదుకి ఈ దుస్థితి లేదు. వర్షపునీరంతా పోవడానికి సరిపడే డ్రైనేజి వ్యవస్థ వుంది. హైదరాబాద్‌ జనాభా అప్పుడు కేవలం లక్షమాత్రమే. మరో విషయం ఏమంటే మనం ఇప్పటికీ ఉపయోగిస్తున్న డ్రైనేజి, వాటర్‌ పైపు లైన్లు అప్పటివే. ఇప్పటికీ వీటిని ఉపయోగించటం వల్ల తుప్పుపట్టిన డ్రైనేజి, వాటర్‌పైపు లైన్లు సమాంతరంగా ఉండటం వల్ల ఒక దానిలో నీరు మరో దానిలోకి ప్రవేశిస్తుంది. వీటిని నివారించడానికి గ్రెటరు హైదరాబాదు పాలకులు వాటరు పైపులనుండి నీటిని 24 గంటలూ పంపవలసి ఉంది. అప్పుడు మాత్రమే డ్రైనేజి నీరు నీటి గొట్టాలలోకి ప్రవేశించకుండా ఉంటుంది. నీటి గొట్టాలు ఖాళీగా వుంటే వాటిలోకి డ్రైనేజి నీరు వెళుతుంది.   నిజాం నవాబు కాలంలో పట్టణం పద్దతి ప్రకారం నిర్మించడం జరిగింది. దక్షిణ హైదరాబాదులోని వర్షపు నీరు ఓల్డుసిటి మీదుగా మూసీ నదిలోకి ప్రవేశించేటట్లు, ఉత్తర హైదరాబాద్‌ లోని వర్షపునీరు మంజీరా మీదుగా కృష్ణా నదిలోకి కలిసే ఏర్పాట్లు చేశారు. నగరంలోని చెరువులన్నీ రాజకీయనాయకు ల ద్వారా రియల్‌ఎస్టేట్‌ చేతుల్లోకి వెళ్ళటం, ఆక్రమణలకు గురవడంతో ప్రస్తుత పరిస్థితి నెలకొందని తెలుస్తుంది. దీనికి గాను పక్కా ప్రణాళికను అమలు చేయవలసిన అవసరం ఉందని స్వంచ్చంధ సంస్థలు కోరుతున్నాయి. ఇంతే కాకుండా ప్రతి సంవత్సరం ఎండా కాలంలో డ్రైనేజీని తరలించవలసి ఉండగా ఏమాత్రం అధికారులు పట్టించుకోవడం జరగడం లేదు. ప్రతి కార్పొరేటర్‌కు సంవత్సరానికి కోటి రూపాయలు ఇస్తుంటే గుడుల నిర్మాణాలకు, శ్మశానాలకు మాత్రమే ఖర్చుపెట్టి రోడ్లను మురుగు కాలువలుగా తయారు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.   మంచినీటి సరఫరాకు 1200 కోట్లు, డ్రైనేజీకి గాను 80 కోట్లు కావల్సి ఉండగా ప్రభుత్వం వాటిమీద శ్రద్దచూపక పోవడం కూడా ఒక కారణం. మున్సిపాలిటీ మంత్రి మహిధర్‌రెడ్డి దీనికి ఏ మాత్రం శ్రద్ద చూపకపోవడం కూడా కారణంగా చెప్పుకోవచ్చు. నగరాన్ని సుందరీకరణ పేరుతో ఖర్చుపెట్టేదానికన్నా ఇది చాలా తక్కువ అని కూడా మర్చిపోకూడదు. ఇదే మంత్రి జాతీయ విపత్తు సంఘంలో కూడా ఉన్నందున హైదరాబాద్‌ నగరానికి వర్షం పడినప్పుడల్లా నరకాన్ని చవి చూస్తున్న ప్రజలకు సరైన రోడ్లు, డ్రైనేజి అందించటం పెద్ద సమస్య కాదు. అయితే రాజకీయ అలసత్యం, అధికారగణంలోని ధన దాహం హైదరాబాద్‌నగర వాసులకు శాపంగా పరిణమించింది. వరల్డ్‌క్లాస్‌ నగరం, నాలెడ్జిసిటీ, క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీ అని చెప్పుకుంటూ సెప్టెంబరులో జరిగే ఇంటర్నేషనల్‌ కార్యక్రమానికి పైపై మెరుగులు దిద్దటానికి 500 కోట్లు విడుదల చేశారు. అంతేకాకుండా సిటీ లుక్‌ మారుస్తామని ప్లైఓవర్లు, మెట్రోరైలు నిర్మాణాల చేపడుతున్నారు. వీటన్నిటికంటే కూడా ముందు మురుగునీరు రోడ్లపైకి రాకుండా చూడటం ప్రజలకు త్రాగునీరు అందించటంలో అలసత్వాన్ని ప్రదర్శించరాదని నగర పౌరులు కోరుతున్నారు.

టి.ఆర్‌.ఎస్‌. సిరిసిల్ల లొల్లి

వైఎస్సార్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈ నెల 23న చేనేత కార్మికుల కొరకు జరపతలపెట్టిన సిరిసిల్ల పర్యటనపై టిఆర్‌ఎస్‌ కండిషన్లు పెట్టింది. వైఎస్సార్ సిపి పార్టీ తెలంగాణాకు అనుకూలంగా ఉంటామని, రాసి సంతకం పెట్టి రాష్ట్రపతికి ఇవ్వాలని లేకపోతే ఆమె పర్యటనను అడ్డు కంటామని టిఆర్‌యస్‌ నాయకులు, తెలంగాణా జెఎసి కోదండరామ్‌ హెచ్చరిస్తున్నారు. అయితే దీనిపై వైఎస్సార్ సిపి నాయకత్వం హైకోర్టుకు వెళ్ళి అనుమతిని పొందింది. దీనివల్ల వైఎస్సార్ సిపి కార్యక్రమాలను సిరిసిల్లలో ఉదయం 9 గంటలనుండి సాయంత్రం 5 గంటలవరకు అంబేద్కర్‌ సెంటర్లో నిర్వహించుకోవచ్చు. హైకోర్టు తీర్పుతో ఖంగుతిన్న టిఆర్‌ యస్‌ నాయకులు, టి జాక్‌ నేతలు అదే రోజు బంద్‌ ప్రకటించారు. ఆరు నెలల క్రితం వైఎస్సార్ సిపి నేత జగన్‌ తెలంగాణలోని రైతులకు మద్దతు తెలుపుతూ ధర్నా చేస్తే పట్టించుకోని టి ఆర్‌యస్‌ ఇప్పడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలియటం లేదని తెలంగాణ వైఎస్సార్ సిపి నేతలు ఆరోపిస్తున్నారు.   పరకాలలో కొండ సురేఖ గట్టిపోటీ ఇవ్వడంతో తెలంగాణలో వైఎస్సార్ సిపి నాయకులను తిరగతివ్వడం శ్రేయస్కరం కాదని తెలుసుకున్న తెలంగాణ నాయకులు వీరిని అడ్డుకుంటున్నారని తెలుస్తుంది. ప్రస్తుత పరిస్దితుల్లో సిరిసిల్ల ప్రాంతంలో గంటగంటకు రాజకీయ సమీకరణాలు మారుతూ టెన్షెన్‌ టెన్షన్‌గా ఉంది. కార్యక్రమాన్ని భగ్నం చేయాలని టిఆర్‌ఎస్‌, దర్నాని సక్సెస్‌ చేయాలని వైఎస్సార్ సిపి నాయకత్వం, ఇలా ఈ రెండు పార్టీలకు సిరిసిల్ల ప్రిస్టేజ్‌ ఇష్యూగా మారింది. ప్రాంతీయ విభేధాలను సృష్టించి పబ్బం గడుపుకుంటున్న టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రాంతీయతత్వ భావోద్వేగాలను రెచ్చగొట్టటం మినహా ఆప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి చేసింది శూన్యం. ఇంగ్లాండు రాణికి అగ్గిపెట్టెలో పట్టే పల్చటి చీరను బహుమతిగా ఇచ్చి ఈ దేశపు వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన చేనేత కార్మికులను సొంత రాష్ట్రంలో పట్టించుకునే నాయకులులేక, పరిస్థితులు అనుకూలించక, ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో పార్టీలకతీతంగా ఆపన్న హస్తాన్ని అందించవలసిన రాజకీయ పార్టీలు గందరగోళం చేయడం అమానుషం.   ఇది కేవలం తెలంగాణ రాష్ట్రనేతలు తమ ఉనికిని కోల్పోతామన్న భయంతో చేస్తున్న బంద్‌ మాత్రమేనని తెలుస్తుంది. చేనేత కార్మికుల కులంగా చెప్పుకునే పద్మశాలీలకు ప్రస్తుత ప్రభుత్వం చేసిందేమీ లేదనే చెప్పవచ్చు. పద్మశాలీలకు వైయస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్‌ సబ్సిడీ, పావలావడ్డీకి రుణాలు, ఆత్మహత్యలు చేసుకున్నకుటుంబాలకు లక్ష రూపాయల ఎక్సెగ్రేషియా, నేతన్నకుటుంబానికి ఇచ్చిన 50 వేల రూపాయల రుణం( అందుకోసం అప్పుడు దాదాపు 100 కోట్లు కెటాయించడం జరిగింది.)అమలు చేశారు. అయితే ప్రస్తుత పాలనలో ఇవేమీ అమలు జరగక పోవడంతో చేనేత కుటుంబాలు వీధిన పడ్డాయి. ఈ సమయంలో వైఎస్సార్ సిపి గౌరవాద్యక్షురాలైన విజయమ్మ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.   సిరిసిల్ల విషయమై తెలుగుదేశం పార్టీ అడ్డుచెప్పబోమని తెలిపింది. చేనేత కార్మిక కుటుంబాలు విజయమ్మ పర్యటనను స్వాగతిస్తుండగా తెలంగాణ జెఎసి దీనిపై దూమారం లేపుతుంది. నిజానికి ఏ పద్మశాలి కుటుంబం నుండి టిఆర్‌యస్‌ కు మద్దతు లేదనే తెలుస్తుంది. ఇంతవరకు ఒక్క నేత కూడా ఈ సామాజిక వర్గంనుండి టిఆర్‌ఎస్‌కు నాయకుడిగా ఎన్నిక కాలేదు సరి కదా ఈ వర్గానికి చెందిన నాయకులను మూడు చోట్ల అసెంబ్లీకి వెళ్ళకుండా టిఆర్‌ఎస్‌ ఓడించడం జరిగింది. దీంతో నేతకుటుంబాలు సహజంగానే మిగతా పార్టీలకు మద్దతు తెలుపుతున్నారు.

మెట్ట పంటలకు మేలు చేస్తున్న వర్షాలు ?

గత వారం రోజులనుండి కురుస్తున్న వర్షాలతో మెట్టరైతులు ఉత్సాహంగా పొలంపనులు చేసుకుంటున్నారు. ఈ వర్షంతో దుక్కిదున్ని విత్తనాలు వేయవచ్చని అంటున్నారు. కాలం దాటిపోతుందనుకున్న సమయంలో వర్షం పడటం రైతులకు ఆనందం ఇచ్చింది. జూన్‌ ప్రారంభం నుండి ఈ నెలవరకు సాధారణ వర్షపాతం 213 మిల్లీలీటర్లు కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 195 మిల్లీలీటర్లు వచ్చింది. వారం రోజుల క్రితం వరకు రాష్ట్రంలో 13 జిల్లాలు వర్షాభావ పరిస్థితుల్లో వుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 6 తగ్గిందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.   దీంతో కడప, నెల్లూరు, కర్నూలు, ఖమ్మం, వరంగల్‌, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కరువుకోరల నుండి బయట పడగలిగాయి. కాగా కరీంనగర్‌, అనంతపురం, విశాఖపట్నం, నిజామాబాద్‌, మెహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలలో మాత్రం రైతులు ఇంకా వర్షం కోసం చూస్తున్నారు. అయితే ఇంకా మూడు రోజుల పాటు ఇదే వర్షాలు కురిస్తే అక్కడ కూడా మెట్టపంటలకు ఢోకా వుండదని తెలుస్తుంది .రాష్ట్రం మొత్తం మీద 33 లక్షల హెక్టార్ల భూమిలో పంటలు సాగు చేయవలసి వుండగా ప్రస్తుతానికి 23 లక్షల హెక్టార్ల భూమి ఇప్పటికే సాగులోకి వచ్చింది. వేరుశనగ 2.40 లక్షల హెక్టార్లు, మొక్కజోన్న 3.10 లక్షల హెక్టార్లలో ఉంది. పత్తి13.70, కంది 2.05, పెసర 1.70, ఆముదం 0.80 లక్షల హెక్టార్లలో సాగయ్యాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.1.60 లక్షల హెక్టార్లలో చెరకుతో పాటు, 2.20లక్షల ఎకరాల్లో వరి నాట్లు పెరిగాయని, అయితే మెట్టసాగుకు మాత్రం మెరుగైన అవకాశాలున్నాయంటున్నారు

లండన్‌ బ్యాంకుల్లో మూలుగుతున్న నిజాం నిధులు

నిజాం నగలను ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న వారసులు 1995 లో అత్యంత విలువైన 173 ఆభరణాలను లండన్‌ వేలంలో అమ్ముతుండగా భారత ప్రభుత్వం వాటిని తీసుకువచ్చి వారికి 216 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఆమొత్తానికి కట్టవలసిన పన్నుని నైజాం వారసులు భారత ప్రభుత్వానికి బకాయిపడి ఉన్నారు. ప్రభుత్వం రెండు నెలల క్రిందట టాక్స్ మొత్తాన్ని చెల్లించవలసిందిగా ఒత్తిడి తెచ్చిన సందర్బంలో వారు తమ దగ్గర అంత డబ్బులేదని కట్టలేమని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఆర్ధిక పరిస్థితులను తాళలేని నిజాం నవాబు వారసుడు నవాబ్‌ నజాఫ్‌ అలీఖాన్‌ ఆరు శతాబ్ధాలుగా లండన్‌ బ్యాంకులో ఉన్న తమ నిధులను ముస్లిం చట్ట ప్రకారం తమకు అప్పగించాలని భారత్‌, పాకిస్థాన్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఇస్లామాబాద్‌లో సెప్టెంబరులో జరిగే ఇరుదేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో నిజాం నిధుల విషయంలో ఒక అవగాహనకు రావాలని కోరారు. ఈ నిధుల విలువ 30 మిలియన్‌ పౌండ్లని తెలిపారు. భారత్‌, పాకిస్థాన్ విడిపోయిన తర్వాత నిజాం మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ సంస్థానంలోని ఆర్ధిక మంత్రి మొయీన్‌ నవాజ్‌ నిధులను నాటి లండన్‌ లోని పాకిస్థాన్ హైకమీషనర్‌ రహ్మతుల్లా పేరు మీద బదిలీచేశారని తెలిపారు.   లండన్‌లోని నేషనల్‌ వెస్ట్‌ మినిస్టర్‌ బ్యాంకులో ఈ నిధులను భద్రపరిచారు. ఇప్పుడు ఈ బ్యాంకును రాయల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్కాట్‌లాండ్‌గా పిలుస్తున్నారు. నిజాం నిధులను తరలించడాన్ని భారత్‌ అప్పట్లోనే వ్యతిరేకించింది. నిజాం సంస్ధానం భారత్‌లో భాగం కాదని స్వతంత్య్ర సంస్థానంగా వ్యవహరించి ఇంగ్లాండుకు తరలించింది. భారత్‌తో వాదనతో ఏకీభవించిన ఇంగ్లాండు ప్రభుత్వం ఈ ఖాతాను స్థంభింప చేసింది. 2008 లో భారత్‌ ప్రభుత్వం నిజాం వారసులతోనూ, పాకిస్తాన్‌ ప్రభుత్వం తోనూ చర్చించి తుది పరిష్కారానికి రావాలని నిర్ణయించింది. నిజాం వారసులు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తోనూ ఆర్ధిక మంత్రి ప్రణబ్‌తోనూ చర్చించారు. నిజానికి ఈ నిధులు ఏ ట్రస్టుకు చెందవని ముస్లిం చట్టప్రకారం తమకే చెందుతాయని వారసులు వాదిస్తున్నారు. అయితే నిజాం ట్రస్టు సాంస్కృతిక సలహాదారు మహ్మద్‌ సాపుల్లా మాత్రం నిజాం వారసులకు 20 శాతం వాటా మాత్రమే లభిస్తుందని మిగతా భాగం భారతదేశానికి చెందుతుందని చెబుతున్నారు. నైజాం వంశానికి చెందిన అత్యంత ధనరాసులు గల మూడు పెద్ద ఇనుప పెట్టెలను నేలమాళిగలో ఉంచగా గత సంవత్సరం అవి తస్కరించబడినవి. కేవలం ఖాళీ పెట్టెలను మాత్రమే పురాతత్వ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

జగన్‌పై ఢిల్లీ నేతల వైఖరిలో మార్పు ?

జగన్‌ ఉప ఎన్నికల్లో పదిహేను సీట్లు గెలుచుకున్నాక కేంద్రం వైఖరి మారడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ శ్రేణులకు ఏం చెయ్యాలో తోచడం లేదు. జాతీయ నాయకత్వ నిర్ణయాలకు రాష్ట్రనాయకత్వానికిచ్చే ఆదేశాలకు పొంతన కుదరటంలేదు. దీంతో రాష్ట్రనాయకత్వానికి ఎటూ పాలుపోవడం లేదు. పార్టీ కేడర్‌ అంతా అయోమయంలో ఉంది. వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలైన అభివృద్ది పథకాలన్నీ కాంగ్రెస్‌వి కాగా, అవి వైయస్‌ పథకాలుగా నమ్మిన ప్రజలు వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌కు ఓట్లు వేసారని రాష్ట్రనాయకత్వం అధిష్టానికి వివరించింది. ఇప్పుడు వాటిని సరిదిద్దుకునేందుకు ఇందిరమ్మ బాటను పట్టి అవి సర్కారు వారి స్కీములుగా చెప్పుకుంటున్నారు.   ఈ తరుణంలో రాష్ట్రపతి ఎన్నికలు జరగటం, జగన్‌ వర్గం కాంగ్రెస్‌ బలపరచిన ప్రణబ్‌కు ఓటు వేయటంతో రాష్ట్రంలో పరిస్దితులు మారాయి. ప్రస్తుత పరిస్దితిని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక రాష్ట్ర నాయకత్వం తికమక పడుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరుడిని ఒక రకంగా ఆయన కొడుకును మరో విధంగా చూడటం, గతంలో వై.ఎస్‌. వల్ల లబ్ధిపొందిన మంత్రులు కూడా జగన్‌పై కక్ష గట్టినట్లు మాట్లాడడం వల్ల కూడా ఎన్నికల్లో కాంగ్రెస్‌ నష్టపోయినట్లు పిసిసి సమన్యయకమిటి అభిప్రాయపడినట్లు తెలుస్తుంది. వైయస్‌ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా పని చేస్తూ మరణించారు కనుక ఆయన్ను కాంగ్రెస్‌నాయకుడిగా చూడటమే సరైన పద్దతిగా ఈ సమావేశంలో పిసిసి అద్యక్షుడు బొత్స సత్యన్నారాయణ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది. వైయస్‌ ఫోటో లేకుండా ప్రజల్లోకి వెళితే తమకే నష్టమని రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ అడ్రస్‌ లేకుండా పోతుందని కూడా కొందరు నేతలు ప్రకటిస్తున్నారు.   ఈవిషయంలో నాయకులంతా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో మీడియాను ఫేస్‌ చేయడం రాష్ట్రనాయకత్వానికి పెద్ద ప్రాబ్లమ్‌గా వుందని వాపోతున్నారు. అధిష్టానం తమతో మాత్రం జగన్‌ విషయంలో కఠినంగా వ్యవహరించమని చెప్పి ఇప్పుడు వారు మాత్రం మెతకవైఖరి ప్రదర్శించడంతో రాష్ట్రనాయకత్వం ఖంగుతింటుందని తెలుస్తుంది.

చెక్‌పోస్టుల అవినీతికి చెక్‌పెట్టేదెప్పుడో?

రాష్ట్రంలోని పలు ఆర్‌టిఎ చెక్‌పోస్టులు అవినీతికి అడ్డాలుగా మారుతున్నాయి. దీనిపై ఎన్ని ఆరోపణలున్నా పూర్తిస్థాయిలో వీటిని సరిదిద్దలేకపోతున్నారు. కారణాలు పరిశీలిస్తే ఆర్‌టిఎ కార్యాలయాల్లో ప్రతీ ధరఖాస్తు కూడా ఆన్‌లైన్‌లో చేస్తున్నందున వచ్చే మామూళ్లు తగ్గిపోవటంతో చెక్‌పోస్టుల ఆదాయంపైనే సిబ్బంది దృష్టిసారిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ చెక్‌పోస్టులను పరిశీలించి మామూళ్లు వసూలు చేసుకునేందుకు ఆర్‌టిఎ కార్యాలయం నుంచి తరుచుగా రాకపోకలుంటున్నాయి. ఏమైనా ఇబ్బంది ఉంటే చెక్‌పోస్టులో ఉన్న సిబ్బందిని కార్యాలయానికి మార్చేస్తామని పరిశీలనకు వచ్చే వారు బెదిరిస్తుండటంతో ఆర్‌టిఎచెక్‌పోస్టు సిబ్బంది ఒక్క వాహానాన్ని కూడా తనిఖీ చేయకుండా వదలటం లేదు. మామూళ్లు కోసం రికార్డుల్లో గట్టిగా తప్పులు వెదుకుతున్నారు. కలెక్షన్‌ పెంచుకోకపోతే ఆర్‌టిఎ అధికారులను సంతృప్తిపరచలేమని చెక్‌పోస్టు సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి అభిప్రాయంతోనే ఉన్న చిత్తూరు జిల్లా ఆర్‌టిఎ చెక్‌పోస్టులో సిబ్బంది అవినీతి సొమ్ముతో ఎసిబికి దొరికిపోయారు. సుమారు లక్షా  35వేల రూపాయలతో వీరు పట్టుబడ్డారు. ఇద్దరు ఎఎంఐలు, ఇద్దరు కానిస్టేబుల్స్‌, నలుగురు ఏజెంట్లు ఎసిబి దాడిలో దొరికిపోయారు. వీరిని అదుపులోకి తీసుకుని ఎసిబి కేసు పెట్టింది. ఇదే విధంగా తూర్పుగోదావరి జిల్లాలోని పలుచెక్‌పోస్టులు రోజుకు మూడు లక్షల రూపాయలు తక్కువ కాకుండా ఆర్జిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఒకసారి చెక్‌పోస్టులో ఐదులక్షల రూపాయలు ఎసిబి అధికారులకు దొరికాయి. ఎసిబి అన్ని జిల్లాల్లోనూ ఈ తరహాదాడులు చేస్తే బాగుంటుందని సూచనలు వస్తున్నాయి.

మరో ఏడాది విదేశీపర్యటనలకు బ్రేక్

రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరిస్థితి మెరుగుపడేంత వరకూ అనవసర విదేశీపర్యటనల జోలికి వెళ్లొద్దని నియంత్రిస్తూ పెట్టిన ఆంక్షలు మరో ఏడాది పొడిగించారు. ప్రత్యేకించి మంత్రులు, ఉన్నతాథికారులు, సాధారణ అథికారులు విదేశీపర్యటనలపై పొడిగింపు కొనసాగుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సిన వారికి మాత్రం అనుమతి ఇస్తున్నారు. ఈ అనుమతి కోసం ముందస్తుగా ధరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఆర్థికశాఖ కోరింది. దీని పరిశీలనకు ఒక కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ అసలు విదేశీపర్యటన అవసరమా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించి అవసరాన్ని బట్టి చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఈ కమిటీకి ఛైర్మన్‌ హోదాలో పని చేస్తున్నారు. ఆయనకు మాత్రమే రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై అవగాహన ఉంటుందని ప్రభుత్వం ఈ నియామకం ఖరారు చేసింది. సభ్యులుగా అటవీశాఖ ప్రత్యేకప్రధానకార్యదర్శి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి, భూపరిపాలన ప్రధానకమిషనరు,  సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి నియమితులయ్యారు. ఈ కమిటీ మొత్తం ఒక్కసారిే సమావేశమై అర్హతల వారీగా, అవసరాల వారీగా ధరఖాస్తులను పరిశీలిస్తుంది. వచ్చే జూన్‌ నెల 15వ తేదీ వరకూ ఈ ధరఖాస్తులను అందజేయవచ్చని కమిటీ ఛైర్మన్‌ ప్రకటించారు. తుదిగడువులోపు తమకు ధరఖాస్తులు అందజేయాలని ఆయన కోరారు.  

చేతులు కలిపన నామా,తుమ్మల

రోజూ గొడవపడే వారైనా ఒక్కోసారి మనస్సు మార్చుకుని దగ్గరవుతారు. ఇది ప్రేమికులే కాదు నాయకులూ చేయగలరని తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా నేతలు నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు నిరూపించారు. మొన్నటిదాకా తొడకొట్టి ఒకరిపై ఒకరు వీరంగం చేసిన ఈ ఇద్దరూ ఒక్కసారిగా మైత్రీబంధాన్ని పెంచుకున్నారు. దీనికి కారణం తెలిసిన వారందరూ ఆశ్చర్యపోక తప్పటం లేదు. ఒకే పార్టీలో ఉన్నా బద్ధశత్రువుల్లా మెలిగిన వీరిద్దరూ స్నేహానికి పునాది తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికల్లో ఓటమి కారణమైంది. ఆ ఓటమి తమ పార్టీ ఎంతలా నష్టపోతోందో వీరిద్దరికీ తెలిసేలా చేసింది.   దీంతో ఇక ఈ గొడవలకు పుల్‌స్టాప్‌ పెట్టాయాలని ఇద్దరూ నిశ్చయించుకుని విద్యుత్తు సరఫరాపై ఏర్పాటు చేసిన నిరసనకార్యక్రమంలో ఇద్దరూ ఒకే ఎద్దుల బండి ఎక్కేలా చేసింది. తాను ఎంపిగా ఎన్నికైన చాన్నాళ్లకు తుమ్మలతో కలిసి ఎడ్లబండెక్కానని నామానాగేశ్వరరావు కార్యకర్తలతో చెప్పారు. ఇక నుంచి కలిసే పని చేస్తామని తెలుగుదేశం పార్టీని జిల్లాలో బలోపేతం చేస్తామని వారిద్దరూ ముక్తకంఠంతో ప్రకటించారు. ఈ ప్రకటనపై ఖమ్మం జిల్లా తెలుగుతమ్ముళ్లు ఆనందం వ్యక్తంచేశారు.     ఇది ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీ అథినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులతో ఉన్న విభేదాలను చాటుకుంటూనే ఉన్నారు. ఎన్టీఆర్‌ వారసులైన బాలకృష్ణ,హరికృష్ణ పార్టీలోనే ఉన్నా ప్రకటనలో వైరుధ్యం నారా కుటుంబంతో ఉన్న విబేధాలను చాటుతోంది. ఈ విషయం రెండు కుటుంబాలు గమనించినా, బంధుత్వమున్నా కూడా సర్దుకోలేకపోయాయి. ఏ బంధుత్వమూ లేని నామా, తుమ్మల ఏకమై పార్టీ కోసం పని చేస్తామని ప్రకటిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు, బాలకృష్ణ కూడా మైత్రీ బంధాలను ప్రకటించాలని తెలుగుతమ్ముళ్లు కోరుకుంటున్నారు. కలిసి పని చేస్తే 2014లో అథికారం ఏమంత కష్టం కాదని గుర్తించాలని వారు కోరుతున్నారు.

దేశంపై అలకలు, తెలంగాణావాదంలో లుకలుకలు?

తెలుగుదేశం పార్టీపై అలిగేవారి సంఖ్య పెరుగుతోంది. అలానే తెలంగాణా కోసమే రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగుదేశం పాల్గొనలేదన్న కొత్తవాదనలూ వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకూ కాంగ్రెస్‌ను మట్టికరిపిస్తామన్న తెలుగుదేశం అథినేత చంద్రబాబు ఆ మట్టిలోనే కూరుకుపోయారని ఇతర పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో అసలు పాల్గొనరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. పార్టీ సిద్ధాంతానికి భిన్నంగా కాంగ్రెస్‌కు ఓటేసే పరిస్థితే రాకూడదని ఆ పార్టీ సీనియర్లు అభిప్రాయపడ్డారు. దీంతో తాము రాష్ట్రపతి ఎన్నికలకు హాజరుకాబోమని చంద్రబాబు ప్రకటించారు.   ఆయన ప్రకటన వెలువడిన 24గంటల్లోపే రాష్ట్రపతి ఎన్నికలకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఐదుగురు ముందుగానే సిద్ధమయ్యారు. వీరు అనుకున్నది అనుకున్నట్లుగా తమ ఓటుహక్కును కూడా వినియోగించుకున్నారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, నూజివీడు ఎమ్మెల్యే చిన్నంరామకోటయ్య, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, తెలంగాణా ఎమ్మెల్యేలు హరీశ్వర్‌రెడ్డి, వేణుగోపాలాచారి రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నారు. కొడాలినానిని తెలుగుదేశం పార్టీ సస్పెండ్‌ చేసింది.  నూజివీడు ఎమ్మెల్యే చ్నిం రామకోటయ్యకు మంత్రి పార్థసారధి కాంగ్రెస్‌ కండువాకప్పి ఎన్నికలకు తీసుకువెళ్లారు. ఆయన కూడా ఉత్సాహంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసిపోయారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే వేణుగోపాలరెడ్డి కాంగ్రెస్‌ నేత పాలడుగు వెంకట్రావుతో కలిసి వెళ్లి రాష్ట్రపతి ఎన్నికల ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ఇలా ఉంటే టిఆర్‌ఎస్‌ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ ఒక్కసారిగా విలేకరుల ముందు తెలుగుదేశం పార్టీని అభినందనలతో ముంచెత్తారు. ఆయన ఆనందానికి కారణం తెలంగాణా వ్యతిరేకి అయిన కాంగ్రెస్‌ నేత ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున ఆ ఎన్నికల్లో పాల్గొనటం లేదని తెలుగుదేశం పార్టీ ప్రకటించిందని ఆయన అంటున్నారు. అలా తెలంగాణా గురించి తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పాల్గొనకపోవటం సంతోషదాయకమని ఆయన కొనియాడారు. వాస్తవానికి ఇప్పటికీ తెలంగాణాపై తెలుగుదేశం పార్టీ ఒక కొలిక్కి రాలేకపోయింది. అందుకే తెలంగాణా ఇవ్వాలని కూడా డిమాండు చేయలేదన్న విషయం డాక్టర్‌ చంద్రశేఖర్‌ గమనిస్తే మంచింది. లేకపోతే అసలు తెలంగాణా సిద్దాంతం కోసమే పని చేసే టిఆర్‌ఎస్‌కు ఆయన దూరం కావాల్సి వస్తుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరోలో సగం కన్నా తక్కువ తెలంగాణావాదులుంటే మిగిలిన మొత్తం సమైక్యవాదులన్న విషయాన్ని చంద్రశేఖర్‌ అర్థం చేసుకోవాలి.  ఇలా తనకు తోచినట్లు ప్రకటనలు చేస్తే తరువాత నాలికకరుచుకోవటం మినహా ఏమీ చేయలేరని గుర్తుంచుకోవాలని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.

కోస్తాంద్రరాయలసీమలో కూల్‌, తెలంగాణాలో హాట్‌

రాష్ట్రంలో ఎండలు తగ్గాయి. వాతావరణం చల్లబడిరది. వర్షాలు పడుతున్నాయి. కోస్తాంద్రలో పొలిటికల్‌ గా కూడా అదే వాతావరణం నెలకొంది. నిన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న వైయస్సార్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల సందర్బంగా అసెంబ్లీ హాలులో కలసినప్పుడు మామూలుగానే మాట్లాడుకున్నారు. కుశల ప్రశ్నలు కులాసా కబుర్లతో వాతావరణాన్ని శాంత పరిచారు. మీడియావారికి గ్రూప్‌ ఫొటోలు ఇచ్చారు. ఇప్పుడు మాటల యుద్దాలు ఆగిపోయాయి.   ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి వేరేగా ఉంది. అక్కడ వైసిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేనేత కార్మికుల కోసం తలపెట్టిన ధర్నాను టిఆర్‌యస్‌ పార్టీ అడ్డుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతుంది. కొండసురేఖ తెలంగాణా ఉప ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన నేపధ్యంలో జగన్‌ పార్టీకి తెలంగాణాలో బలపడే చాన్సు ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకుందని తెలుస్తుంది. ఒకవేళ తెలంగాణాలో వైయస్‌ఆర్‌ పార్టీ బలపడితే టిఆర్‌యస్‌కు ఎదురుదెబ్బ పడుతుందని భయపడుతుంది. అందుకే తెలంగాణ మీద వైసిపి ప్రకటన చేసేవరకు తెలంగాణలో అడుగుపెట్టనీయమని కెటిఆర్‌ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆపార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ తెలంగాణ ప్రకటన వస్తుందని తనకు స్పష్టమైన సంకేతం అందిందని చెప్పుకొచ్చి ఆతరువాత ప్రణబ్‌ తమకు హామీ ఇవ్వనందువల్లే రాష్ట్రపతి ఎన్నికలు బహిష్కరించామని చెబుతుండటం తెలిసిందే.  ఈ అయోమయం, గందరగోళం మద్య  వైసిపి ఎక్కడ బలపడుతుందోనని  ఆ పార్టీశ్రేణులు వైసిపిని నిలువురిస్తున్నాయి.  దీనివల్ల కోస్తాంద్రరాయలసీమల్లో వైసిపి కూల్‌గా ఉందను కుంటే తెలంగాణలో రాజకీయాలు హాట్‌గా ఉంటుంన్నాయని  భావించాల్సివస్తుంది.