మహిళలు గర్బం దాల్చడంలో మరింత గొప్ప ఫలితాలు పొందాలంటే ఈ టెస్ట్ బెస్ట్..   గర్బం దాల్చడం, తల్లి కావడం ప్రతి ఆడపిల్ల కల. కానీ దురదృష్టవశాత్తూ  ప్రస్తుతకాలంలో 12నుండి 15శాతం జంటలు  పిల్లలను కనడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భార్యాభర్తల ఇద్దిరలోనూ పిల్లలు పుట్టడంలో తగినంత సామర్థ్యం లేకపోవడం వల్ల  చాలామంది పిల్లల కోసం వైద్యుల చుట్టూ ప్రదక్షణలు చేస్తుంటారు. లోపం ఎవరిలో ఉన్నా అది ప్రత్యక్షంగా మహిళల మీదే  కనిపిస్తుంది. కానీ చాలామంది మహిళలు గర్భం దాల్చడంలో  అవకాశాలు ఉన్నా కూడా విఫలమవుతుంటారు. దీనికి కారణం మహిళలకు గర్బం ధరించే సమయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో సరిగా అవగాహన లేకపోవడం. అయితే ఇప్పుడు దీన్ని కనుక్కోవడం సులభం. దీని వల్ల మహిళలు గర్బం ధరించే అవకాశాలు 20 నుండి 25శాతం ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎలా కనుక్కోవాలి? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. గర్భం దాల్చడానికి అద్బుతమార్గం.. మహిళలలో గర్బం దాల్చే అవకాశాలు  అండాలు విడుదల అయ్యే సమయంలో ఎక్కువగా ఉంటాయి. మూత్ర పరీక్ష ద్వారా అండోత్సర్గ పరీక్ష చేయించుకోవచ్చు.  ఈ అండోత్సర్గ పరీక్ష కిట్ సాధారణ మెడికల్ స్టోర్స్ లో దొరుకుతుంది. లేదా దీన్ని వైద్యుల పర్యవేక్షణలో కూడా చేసుకోవచ్చు.  సాధారణంగా మహిళలలో ఋతుచక్రం  28రోజులుగా ఉంటుంది. చివరిసారి ఋతుక్రమం ప్రారంభమైన 11వ రోజున ఈ పరీక్షను చేసుకోవాలి. అండాలు విడుదల కావడానికి మూడు నుండి ఐదు రోజుల ముందు ఈ పరీక్షను చేసుకోవాలి.  ఈ పరీక్షలో టెస్ట్ కిట్ రంగు మార్పు కనబడితే మరొక 24నుండి 36గంటలలో అండాలు విడుదల కావడం ప్రారంభమవుతుందని అర్థం. దీన్ని అర్థం చేసుకుని భార్యాభర్తలు సంభోగంలో పాల్గొంటే ఆ సమయంలో మహిళలు గర్బం ధరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండోత్సర్గానికి ఐదు రోజుల ముందు నుండి అండోత్సర్గము తర్వాత చాలా గంటల వరకు గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఈ కాలాన్ని ఫెర్టిలిటీ విండో అంటారు.  అండోత్సర్గము కాలం గురించి తెలుసుకోవడానికి  అల్ట్రాసౌండ్ కూడా  చేయవచ్చు లేదా ఋతు చక్రానికి సంబంధించిన హార్మోన్ల స్థాయిలను తెలుసుకోవడానికి మూత్ర పరీక్ష చేయించుకోవచ్చు.  ఇంకొక మార్గం ఏమిటంటే  గర్భాశయ శ్లేష్మం పర్యవేక్షణ సహాయంతో  అండోత్సర్గము కాలాన్ని కూడా తెలుసుకోవచ్చు. అండాలు పర్ఫెక్ట్ గా విడుదల అయ్యే సమయాన్ని తెలుసుకోవడానికి ఈ మార్గాలు  ఉన్నాయి. ఇవే కాకుండా  పీరియడ్ ట్రాకింగ్ యాప్ ద్వారా కూడా దీన్ని తెలుసుకోవచ్చు.  గర్భం దాల్చాలనుకుంటే లేదా చాలా కాలంగా గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్నట్లయితే,  వైద్యుని సలహా,  సహాయంతో ఈ మూత్రం అండోత్సర్గము పరీక్షను చేయవచ్చు. ఈ పరీక్ష సహాయంతో అండోత్సర్గము గురించి సమాచారాన్ని పూర్తీగా అర్థమవుతుంది కూడా.  తద్వారా  తొందరలోనే  గర్భం దాల్చవచ్చు.                                                             *నిశ్శబ్ద. 

మహిళలలో PCOS, PCOD సమస్యలు తగ్గించే మూలికలు ఇవి..!   ఈ రోజుల్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (PCOD లేదా PCOS) మహిళల్లో అత్యంత సాధారణ సమస్యగా మారింది. అనారోగ్యకరమైన ఆహారం,  జీవనశైలి కారణంగా PCOD,  PCOS సమస్యలు పెరగుతున్నాయి. ఇది కాకుండా మహిళల్లో అనేక హార్మోన్ల మార్పులు కూడా కారణమవుతాయి. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) సమస్య గర్భధారణ సమయంలో మహిళల్లో కనిపిస్తుంది. 16 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. చాలా సార్లు ఈ వ్యాధి గురించి మహిళలకు కూడా తెలియదు. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా అండాశయాలలో గడ్డలు ఏర్పడతాయి.  వీటిని  సిస్ట్ అని పిలుస్తాము. ఇవి ఉంటే  గర్భం నేరుగా ప్రభావితమవుతుంది. అయితే జీవనశైలిని మార్చుకోవడం,  కొన్ని మందుల ద్వారా దీనిని నియంత్రించవచ్చు.  అలాగే కొన్ని రకాల మూలికలు తీసుకోవడం వల్ల కూడా  ఈ సమస్యలు తగ్గుతాయి. తిప్పతీగ.. ఈ మధ్యకాలంలో  తిప్పతీగ  మొక్క చాలా వైరల్ అవుతోంది. ఆయుర్వేదంలో తిప్పతీగ  చాలా ప్రభావవంతమైన మూలికగా పరిగణించబడుతుంది. తిప్పతీగ  తీసుకోవడం   PCOSని నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలో ఎక్కువ ఆండ్రోజెన్ ఉత్పత్తి అయినప్పుడు మగ హార్మోన్లు పెరగడం ప్రారంభిస్తాయి. అలాంటి పరిస్థితిలో ఈ హార్మోన్లను సమతుల్యం చేయడంలో తిప్పతీగ  సహాయపడుతుంది. దాల్చినచెక్క..   శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగకుండా దాల్చిన చెక్క నిరోధిస్తుందని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీంతో బరువు తగ్గుతారు.  ఇది PCOS రోగులకు సహాయపడుతుంది. పుదీనా.. PCOSలో  పుదీనా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పుదీనా టీ తాగడం వల్ల శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి తగ్గుతుంది.  శరీరంలో అధిక జుట్టు పెరుగుదలను తగ్గిస్తుంది. అతిమధురం.. ఆయుర్వేదంలో అతిమధురం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అతిమధురం తీసుకోవడం వల్ల అండోత్సర్గ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది.                                                 *రూపశ్రీ.

45 ఏళ్లు దాటినా యవ్వనంగా కనిపించాలంటే ఇవి ఫాలో కావాలి..!   ప్రతి మహిళను అడిగినా తన వయసు ఉన్నదాని కంటే 5 నుండి 10 ఏళ్లు తక్కువ గా చెప్తుంది.  అయితే ఇది కొందరికి బాగా సెట్ అవుతుంది. కానీ మరికొందరికి సెట్ కాదు. ఎందుకంటే శరీరాన్ని చూసి కొందరు వయసు తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా చెప్పేస్తుంటారు.  అయితే ఎంత వయసు వచ్చినా యవ్వనంగా కనిపించాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు.. కానీ దానికి తగిన జీవినశైలి,  ఆహారపు అలవాట్లు, యవ్వనంగా కనిపించేలా చేసే చిట్కాలు పాటించకపోవడమే తప్పు.  ఈ కింద ఉన్న టిప్స్ పాటిస్తే 45 ఏళ్లు దాటినా స్కూల్లకు, కాలేజీలకు వెళ్లే పిల్లలు ఉన్నా హ్యాపీగా యూత్ లాగా కనిపించవచ్చు.   మహిళలు ఇంట్లో ఆహారాన్ని వండినప్పుడు కొన్ని ఆహారాలు మిగిలిపోతాయి. దానిని పారేసే బదులు దానిని మరుసటి రోజు తినడం చాలామంది మహిళల అలవాటు. కానీ  ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని మరుసటిరోజు  తినడం     రోగనిరోధక శక్తికి,  పేగు ఆరోగ్యానికి చాలా హానికరం.  యవ్వనంగా కనిపించాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా ఉదయం నుండి రాత్రి వరకు తాజా ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. రోజుకు 4 లీటర్ల నీరు త్రాగితే బరువు తగ్గడానికి,  ఆరోగ్యకరమైన చర్మ సంరక్షణ కోసం అనువుగా ఉంటుంది.   నాలుగు లీటర్ల కంటే ఎక్కువ నీరు త్రాగవలసిన అవసరం లేదు. కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీరు త్రాగడం ద్వారా కూడా బరువు తగ్గవచ్చు.  చర్మాన్ని మెరిచేలా, యవ్వనంగా ఉంచుకోవచ్చు. ఆహారాన్ని తీసుకునే విధానాన్ని ఆయుర్వేదం మూడు ముక్కలలో చెప్పింది.  ఉదయం భోగి లాగా,  మధ్యాహ్నం యోగి లాగా,  రాత్రి రోగి లాగా ఆహారం తీసుకోమని చెబుతుంది.  అంటే ఉదయం బాగా తినవచ్చు. అది రోజంతా పనిచేయడానికి శక్తిని ఇస్తుంది. మధ్యాహ్నం బోజనం మితంగా తినాలి. భోజనంలో కార్బోహేడ్రేట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని నియంత్రణలో పెట్టాలి. ఇక రాత్రి సమయంలో చాలా తేలికగా తినాలి. రాత్రి నిద్రించే సమయం కాబట్టి బరువుగా ఉన్న ఆహారాలు తీసుకోకూడదు. రోజూ 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు వ్యాయామం చేయడం వల్ల  ఆరోగ్యంగా యవ్వనంగా ఉండవచ్చు. కానీ చాలామంది  వర్కవుట్ చేయడానికి సమయం ఉండదని చెబుతుంటారు. కానీ  ఈ అలవాటు భవిష్యత్తులో అనేక వ్యాధులకు దారి తీస్తుంది.  మహిళలు ఎంత బిజీగా ఉన్నా, 24 గంటలలో మీ కోసం అరగంట నుండి 45 నిమిషాల సమయం కేటాయించుకోవాలి.  తేలికపాటి వ్యాయామం చేయవచ్చు, వాకింగ్ చేయవచ్చు, యోగా చేయవచ్చు లేదా బరువులను ఎత్తవచ్చు. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.  ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండటానికి సహాయపడుతుంది.                                                *రూపశ్రీ.

మహిళలలో మెనోపాజ్ సమయంలో వచ్చే నిద్రలేమికి భలే పరిష్కారాలు.!   ఆడవారి జీవితంలో ప్రతి దశలోనూ చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. 10 నుండి 15 ఏళ్ల మద్య మొదలయ్యే ఋతుచక్రం 40ఏళ్లు వచ్చేవరకు ఉంటుంది. ఆ తరువాత ఋతుచక్రం ఆగిపోతుంది. అన్నేళ్లు శరీరంలో క్రమానుసారంగా సాగిన ఈ ప్రక్రియ ముగిసిపోవడం కారణంగా మహిళల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. ఈ సమస్యలలో నిద్రలేమి ప్రధానంగా ఉంటుంది. సరిగా నిద్రలేకపోవడం, కలత నిద్ర, తలనొప్పి, శరీరంలో అసౌకర్యంగా అనిపించడం, హార్మోన్ సమస్యల కారణంగా నిద్ర సమస్యలు వస్తాయి. దీన్ని పరిష్కరించడానికి ఈ కింది చిట్కాలు సహాయపడతాయి. మెగ్నీషియం.. శరీరంలో స్కిరాడియన్ సైకిల్ లేదా సహజ గడియారం నియంత్రణ కోల్పోయినప్పుడు కండరాల కదలిక ఎక్కువగా ఉంటుంది. దీన్ని పరిష్కరించడానికి మెగ్నీషియం సహాయపడుతుంది. మెగ్నీషీయం తీసుకోవడం ద్వారా కండరాలు సడలించబడతాయి, నిద్ర గడియారం కంట్రోల్ లోకి వస్తుంది. నిద్ర బాగా పడుతుంది. అల్లం, జీడిపప్పు, బాదం, నువ్వులలో మెగ్నీషియం బాగుంటుంది. విటమిన్-ఇ మెనోపాజ్ సమయంలో శరీరంలో వేడి ఆవిర్లు పుడుతుంటాయి. రాత్రి సమయంలో చెమటలు కూడా పడతాయి.  విటమిన్-ఇ  శరీరానికి లభించేలా చేస్తే ఈ సమస్య పరిష్కారమవుతుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం, కొబ్బరి, అవిసె గింజలు, పిస్తాపప్పులలో విటమిన్-ఎ సులభంగా దొరుకుతుంది. ఒమెగా-3 ఒమెగా-3 వంటి ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు మానసిక కల్లోలాన్ని, నిద్రలేమి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి.  చేపలు, సజ్జలు, బార్లీ, మొక్కజొన్న, రాగులు  మొదలైన వాటిలో ఒమెగా-3 లభ్యమవుతుంది. సోయా ఉత్పత్తులలో ఐసోప్లేవోన్ లు ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ ను అనుసరిస్తాయి. శరీరంలో వేడి ఆవిర్లు తగ్గించడం, ఋతుక్రమం ఆగిపోయినప్పుడు కనిపించే లక్షణాలను నియంత్రించడంలో సహాయపడతాయి. అందువల్ల సోయా ఉత్పత్తులు వాడితే నిద్ర నాణ్యత బాగుంటుంది.                                        *నిశ్శబ్ద.

షుగరింగ్, వ్యాక్సింగ్.. అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి  ఏ పద్దతి మంచిదంటే!   అవాంఛిత రోమాలు అమ్మాయిల అందాన్ని పాడుచేస్తాయని నమ్ముతారు. అందుకే ఏదో విధంగా అవాంఛిత రోమాలను తొలగించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఇలా అవాంఛిత రోమాలను తొలగించడానికి ఉపయోగించే పద్దతులలో షుగరింగ్, వ్యాక్సింగ్ కూడా ముఖ్యమైనవి. అయితే ఈ రెండింటిలో ఏది మంచిది? అమ్మాయిలకు ఏదైతే సేప్ గా ఉంటుంది? చర్మ సంరక్షణ నిపుణులు ఏం చెబుతున్నారో ఓ లుక్కేస్తే.. షుగరింగ్.. షుగరింగ్ అనేది మధ్యప్రాచ్యంలో ఉద్భవించిన పురాతన  పద్దతి. అవాంఛిత రోమాలను తొలగించడంలో  ఇది సహజమైన పద్దతి.  షుగరింగ్ పేస్ట్‌ను రూపొందించడానికి చక్కెర, నిమ్మరసం,  నీటిని  ఉపయోగిస్తారు. దీన్ని చిక్కని పాకంలా సిద్దం చేస్తారు. దీన్ని అవాంఛిత రోమాల మీద ఉంచి గట్టిగా వెంట వెంటనే  లాగడం వల్ల   అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. షుగరింగ్ ప్రయోజనాలు..  ఈ పేస్ట్ సాధారణంగా సహజ పదార్ధాలను కలిగి ఉంటుంది.  ఇది సున్నితమైన చర్మ రకాలకు అనుకూలంగా ఉంటుంది. షుగరింగ్ వాక్సింగ్ కంటే తక్కువ చికాకును కలిగిస్తుంది.  ఎందుకంటే ఇది జుట్టును మాత్రమే తొలగిస్తుంది, చర్మానికి అతుక్కుపోదు. ఈ పేస్ట్ చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. జుట్టు తొలగింపు ప్రక్రియ తర్వాత సున్నితంగా,  మృదువుగా ఉంటుంది. చాలా మందికి  వ్యాక్సింగ్ కంటే షుగరింగ్  తక్కువ నొప్పి కలిగిస్తుంది. షుగరింగ్ గురించి కొన్ని నిజాలు.. షుగరింగ్ చేయడం నైపుణ్యంతో కూడినది. ఇది చేయడం రాకపోతే ఫలితాలు వేరేగా ఉంటాయి.   వ్యాక్సింగ్ తో పోలిస్తే షుగరింగ్ ఖరీదైనది. వ్యాక్సింగ్.. వాక్సింగ్ అనేది చర్మంపై వేడిచేసిన మైనపు పొరను అప్లై చేయడం.   అది గట్టిపడిన తరువాత జుట్టు పెరుగుదలకు వ్యతిరేక దిశలో లాగుతారు.  దీనివల్ల చర్మం మీద అవాంఛిత రోమాలు తొలగించబడతాయి. వాక్సింగ్  ప్రయోజనాలు..  వాక్సింగ్ పెద్ద మొత్తంలో జుట్టును త్వరగా తొలగించగలదు.  ఇది జుట్టు తొలగింపును తొందరగా  తొలగించడంలో సమర్థవంతమైన ఎంపికగా మారుతుంది. వాక్సింగ్ షేవింగ్‌తో పోలిస్తే దీర్ఘకాలిక ఫలితాలను అందిస్తుంది. ఎందుకంటే ఇది రూట్ నుండి జుట్టును తొలగిస్తుంది. వాక్సింగ్ కిట్‌లు వాడుకోవడానికి సులభంగా అందుబాటులో ఉంటాయి. వ్యాక్సింగ్ గురించి కొన్ని నిజాలు.. వాక్సింగ్ అనేది షుగరింగ్  కంటే ఎక్కువ బాధాకరంగా ఉంటుంది. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారికి మంచిది కాదు. ఇది జుట్టుకు ,  చర్మానికి  రెండింటికీ అతుక్కుని ఉంటుంది. వ్యాక్సింగ్ వల్ల చర్మం ఎరుపుగా మారుతుంది. దీనివల్ల చికాకు పెట్టి ర్యాషెస్ కూడా వస్తాయి.  కొందరికి  వ్యాక్సింగ్ కు ఉపయోగించే  మైనపులోని పదార్ధాల కారణంగా  అలెర్జీ వస్తుంది.   ఇది చర్మం చికాకు,  అసౌకర్యానికి దారితీస్తుంది.                                             *నిశ్శబ్ద.

మెనోపాజ్ తరువాత మహిళలలో దంతాలు ఊడిపోతుంటే ఈ వ్యాధి ఉండవచ్చు..! రక్తం నుండి వ్యర్థాలను తొలగించడం ద్వారా శరీరం  ఆరోగ్యంగా ఉండటంలో  మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని ప్రమాదకరమైన పదార్థాలను  సమర్థవంతంగా ఫిల్టర్ చేయడంలో వైఫల్యం అయితే అది  తీవ్రమైన,  ప్రాణాంతకమైన  పరిస్థితులకు దారి తీస్తుంది.  మహిళలలో మెనోపాజ్ తరువాత దంతాలు ఊడిపోవడం అనేది మహిళలలో మూత్రపిండాల సమస్యను కలిగి ఉండే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది నిజమేనా.. దీని వెనుక ఉన్న కారణాలేంటి? తెలుసుకుంటే.. మహిళలలో మెనోపాజ్ తరువాత మూత్రపిండాల పనితీరు క్రమంగా తగ్గుతుంది. మహిళలలో పునరుత్పత్తి హార్మోన్లు తగ్గడం వల్ల ఇది జరుగుతుంది. ఈ పునరుత్పత్తి హార్మోన్లు తగ్గడం వల్ల పొట్ట రావడం,  ఊబకాయం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ దీర్ఘకాల మూత్ర పిండ వ్యాధికి కారకాలుగా మారుతాయని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ సమస్యలు ఎముక,  గుండె సంబంధ సమస్యలతో పాటూ అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది. మెనోపాజ్ తరువాత మహిళలలో దంతాలు ఊడిపోవడం అనేది నోటి ఆరోగ్యానికి కూడా ప్రధాన సంకేతం. మధుమేహం,  థైరాయిడ్, బోలు ఎముకల వ్యాధి మొదలైన సమస్యలతో ఇవి ముడి పడి ఉంటాయి. ముఖ్యంగా 66 నుండి 79 సంవత్సరాల వయసు గల మహిళలలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు తెలుపుతున్నాయి. మహిళలలో ఖనిజాలు,  ఎముక జీవక్రియ రుగ్మతలను నివారించడం దంతాల నష్టాన్ని నివారించడంలో కీలకంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మెనోపాజ్ దాటిన మహిళలు నోటి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెబుతున్నారు.                                              *రూపశ్రీ.

ఈ లక్షణాలు కనిపిస్తే ఐరన్ లోపం ఉన్నట్టే..! శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే చాలా రకాల పోషకాలు అవసరం.  వీటిలో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు తప్పనిసరిగా ఉంటాయి.  భారతదేశంలో చాలామంది మహిళలు అనీమియా సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.  అనీమియా అనేది హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వల్ల వచ్చే వ్యాధి.  హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉండటానికి ఐరన్ లోపం ప్రధాన కారణం.  ఆడవారి శరీరంలో ఐరన్ లోపం ఉందా లేదా అనే విషయం వారికి నెలసరి సమస్యలు ఎదురైనప్పుడో లేదా జ్వరం లాంటి సమస్యలు వచ్చి రక్తపరీక్ష చేయించుకున్నప్పుడో బయటపడుతూ ఉంటుంది.  అలా కాకుండా ప్రతి మహిళ తనకు ఐరన్ లోపం ఉందా లేదా తెలుసుకోవాలంటే తమ శరీరంలో కొన్ని లక్షణాలు గమనించుకోవాలి.  ఐరన్ లోపం ఉంటే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే.. చాలామంది మహిళలు ఎప్పుడూ అలసటగా ఉందని కంప్లైంట్ చేస్తుంటారు. ఆహారం ఎంత తీసుకున్నా నీరసంగా ఉన్నట్టు,  బలహీనంగా ఉన్నట్టు ఫీల్ అవుతుంటారు.  దీనికి కారణం ఐరన్ లోపించడమే. ఐరన్ లోపిస్తే శరీరంలో కణజాలాలకు, కండరాలకు ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉంటుంది.  ఈ కారణంగా బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది. మహిళలు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి వైద్యులను కలిసినప్పుడు చాలామంది వైద్యులు చేసే మొదటి పని మహిళల కళ్లు గమనించడం. కనుగుడ్డు కింది భాగంలో కనిపించే చర్మం రంగును బట్టి మహిళలో ఐరన్ లోపాన్ని, హిమోగ్లోబిన్ శాతాన్ని అంచనా వేస్తారు. అంతేకాదు ఐరన్ లోపం ఉన్న మహిళల చర్మం పాలిపోయి, వడలిపోయినట్టు ఉంటుంది. ఏ చిన్న పని చేసినా ఎంతో శ్రమ చేసినట్టు ఫీలయ్యే మహిళలు ఉంటారు.  దీనికి కారణం ఐరన్ లోపించడమే.  ఐరన్ లోపించడం వల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉంటుంది. దీనివల్ల తొందరగా అలసిపతారు.  శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా ఎదుర్కుంటారు. గుండె సమర్థవంతంగా పని చేయాలంటే ఆక్సిజన్ సరఫరా బాగుండాలి. కానీ ఆక్సిజన్ సరఫరా బాగుండేందుకు కావలసిన ఐరన్ లోపించినప్పుడు ఆక్సిజన్ సరఫరా మందకొడిగా సాగుతుంది.  దీని కారణంగా గుండె సాధారణం కంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.  ఇది గుండె దడ,  గుండె పనిచేయడంలో ఆటంకాలు, కొన్ని సార్లు రక్తాన్ని పంప్ చేయడంలో అంతరాయం ఏర్పడి గుండె పోటు వంటి సమస్యలు కూడా వస్తాయి. మెదడు సమర్థవంతంగా పని చేయాలంటే మెదడుకు ఆక్సిజన్ సరఫరా బాగుండాలి. కానీ మెదడుకు ఆక్సిజన్ సరఫరా లోపిస్తే అప్పుడు మెదడు నరాల మీద ఒత్తిడి ఏర్పడుతుంది.  ఇది తలనొప్పికి కారణమవుతుంది.  ఐరన్ లోపించడం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడతాయి. కొన్ని సార్లు మైకం కూడా కలగవచ్చు. ఐరన్ లోపం ఉన్న మహిళలలో గోర్లు పెళుసుగా ఉంటాయి.  గోర్లు తెల్లగా కనిపించడం,  సున్నితంగా ఉండటం.  ఏమాత్రం తడి తగిలినా లేదా గోర్లను ఏవైనా తెరవడానికి ఉపయోగించినా గోర్లు చాలా సులభంగా విరిగిపోతుంటాయి. చాలామంది మహిళలకు తమ జుట్టు ఎందుకు రంగు మారుతోందో,  ఎందుకు పలుచగా అవుతోందో తెలియని గందరగోళంలో ఉంటారు. ఐరన్ లోపం వల్ల ఈ సమస్యలు వస్తాయి. అంతేకాదు జుట్టు బాగా రాలిపోవడం, రాగి రంగులో ఉండటం,  తొందరగా తెల్లబడటం కూడా జరుగుతుంది.                                                    *రూపశ్రీ.  

థైరాయిడ్ సమస్య ఉందా? ఈ ఆహారాలు అస్సలు తినకండి..! చాలామంది మహిళలు సరిగా తినకపోయినా సరే లావుగా కనిపిస్తుంటారు. డైటింగ్ ఫాలో అయినా బరువు విషయంలో మార్పు ఉండదు. ఇలాంటి వారిలో థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరు అసమతుల్యంగా మారడం, శరీరంలో హార్మోన్లు హెచ్చుతగ్గులు కావడం వల్ల బరువు పెరుగుతారు. థైరాయిడ్ ఉన్నవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. లేకపోతే థైరాయిడ్ సమస్య మరింత ఉదృతం అవుతుంది. థైరాయిడ్ ఉన్నవారు అస్సలు తినకూడని ఆహారాలేంటో.. ఆయుర్వేదం వీటిని ఎందుకు తినకూడదని చెప్పిందో తెలుసుకుంటే.. పీనట్ బటర్.. (వేరుశనగ వెన్న) పల్లీలు లేదా వేరుశనగలను గ్రైండ్ చేసి పీనట్ బటర్ తయారుచేస్తారు. వేరుశనగలలో ఉండే గాయిట్రేజెన్ కంటెంట్ కారంగా హైపోథైరాయిడిజం మరింత తీవ్రమవుతుంది. హైపోథైరాయిడ్ ఉన్నవారు వేరుశనగ, వేరుశనగలతో తయారుచేసే పీనట్ బటర్ తినకూడదు. రాగులు.. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ రాగులు థైరాయిడ్ ఉన్నవారికి సమస్య పెంచుతాయి. రాగులు సాధారణ వ్యక్తులకు ఎంతో శక్తివంతమైన ధాన్యం.  వీటిలో కాల్షియం, ఫైబర్ సమృద్దిగా ఉంటుంది. కానీ వీటిలో గోయిట్రోజెనిక్ ఉంటుంది. వీటిని తినాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. రాగులను బాగా నానబెట్టి, బాగా ఉడికించిన తరువాత నెలలో కెవలం రెండు మూడు సార్లు మాత్రమే తినవచ్చు. బాదం.. బాదంలో సెలీనియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ థైరాయిడ్ పనితీరుకు మంచివి. అయితే బాదం కూడా గోయిట్రోజెనిక్ ఆహారం. బాదంను ఎక్కువగా తీసుకుంటే  థైరాయిడ్ సమస్యను తీవ్రతరం చేస్తుంది. థైరాయిడ్ గ్రంధి ఎక్కువ పనిచేస్తే అయోడిన్ ను గ్రహించే సామర్థ్యంను తగ్గిస్తుంది. అందుకే థైరాయిడ్ ఉన్నవారు రోజుకు 3కు మించి బాదం పప్పులు తినకూడదు. సోయా.. సోయా ఆహారాలు కూడా థైరాయిడ్ లక్షణాలు ప్రభావితం చేస్తాయి.  థైరాయిడ్ గ్రందికి చికాకు కలిగించే గోయిట్రోజెన్లు సోయా ఉత్పత్తులలో ఉంటాయి. ఈ కారణంగా సోయా ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. గోధుమ.. థైరాయిడ్ ఉండి బాగా లావుగా ఉన్నవారు అన్నానికి బదులుగా చపాతీలు తినడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు.  కానీ థైరాయిడ్ ఉన్నవారు గోధుమలు తినకూడదు. గోధుమలలో ఉండే గ్లూటటెన్ గోయిట్రోజెనిక్ సమ్మేళనం. ఆటో ఇమ్యూన్ హైపోథైరాయిడ్ ఉన్నవారు గోధుమలు చాలా తక్కువగా తీసుకోవాలి. గ్లూటెన్ రహిత ఆహారం తీసుకునే వ్యక్తులు థైరాయిడ్ గ్రంధిపై దాడిచేసి యాంటీబాడీలను రక్తంలో తక్కువగా కలిగి ఉంటారు.                                              *నిశ్శబ్ద.  

మహిళలకు అసలు పొట్ట ఎందుకు వస్తుంది? ఇది తగ్గాలంటే ఏం చేయాలంటే!  అందరూ సాధారణంగా పిలుచుకునే బెల్లీ ఫ్యాట్ చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. కానీ ఇది మహిళలను చాలా ఇబ్బంది పెడుతుంది. పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడమే బెల్లీ ఫ్యాట్ గా పిలవబడుతుంది. అయితే ఈ పొట్ట భాగంలో కొవ్వు వచ్చినంత వేగంగా తగ్గదు. పొట్ట వచ్చిందంటే చాలామందిలో కామన్ గా అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి సమస్యలు కూడా సులువుగా వచ్చేస్తాయి. మగవాళ్లకు పొట్ట వస్తే సరదాగా నాలుగు జోకులు వేసుకుని ఎంజాయ్ చేస్తారు. కానీ మహిళలు  దీన్ని అంత సరదాగా తీసుకోలేరు. పైగా ఇంట్లోనే వారిమీద చాలా బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదురవుతాయి.  అసలు ఈ పొట్ట రావడానికి కారణం ఏంటి? దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి? తెలుసుకుంటే.. మహిళలో  పొట్ట కొవ్వు పేరుకుని పోవడానికి కారణం శరీరంలో హార్మోన్ల స్థితిలో మార్పు.  జీర్ణాశయ పనితీరు తగ్గడం, జీవక్రియ రేటు దారుణంగా పడిపోవడం వల్ల పొట్ట  భాగంలో కొవ్వు పేరుకుని పోతుంది. ఈిస్టోజెన్ స్థాయిలు పెరిగి పొత్తికడుపు భాగంలో కొవ్వు పేరుకుని పొట్ట ముందుకు చొచ్చుకుని వచ్చి  పొట్ట పడుతుంది. ఇది చాలా సాధారణమైన విషయమే అయినా దాన్ని  ఎలా తగ్గించుకోవాలో చాలామందికి తెలియదు. ఈ పొట్ట కొవ్వుకు కారణం ఏంటి? దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలంటే.. ఆహారం.. సరైన ఆహారం తీసుకోకపోతే పొట్ట కొవ్వు పెరుగుతుంది. తీసుకునే చాలా ఆహారాలలో కొవ్వులు ఉంటాయి. శారీరక శ్రమకు మించి కొవ్వు పదార్థాలు తీసుకుంటే అవి పొట్ట రావడానికి కారణం అవుతాయి. జంక్ ఫుడ్, కోక్, కూల్ డ్రింక్స్, మైదా, బేకరీ ఐటమ్స్, కృత్రిమ జ్యూసులు చాలా ఈజీగా పొట్టకు కారణం అవుతాయి. పొట్ట తగ్గించాలని అనుకుంటే మొదట వీటన్నింటిని  వదిలెయ్యాలి. గర్భం దాల్చడం.. గర్భం దాల్చిన  మహిళలలో చాలామందికి  బిడ్డను మోయడం వల్ల  పొట్ట సాగుతుంది. ప్రసవం తరువాత  ఈ పొట్ట సెట్ కావడానికి చాలా సమయం పడుతుంది. కొందరు మహిళలు వ్యాయామాలు, యోగా చేయడం ద్వారా తొందరలోనే దీన్ని సెట్ చేసుకుంటారు. కానీ  ప్రసవం తరువాత బిడ్డ సంరక్షణ, శరీరం చురుగ్గా లేకపోవడం వల్ల వ్యాయామం చేయకుండా ఉంటారు. దీని కారణంగా పొట్ట కొవ్వు పేరుకుపోతుంది. పిండి పదార్థాలు.. ప్రతి ఒక్కరూ బరువు పెరగడానికి ప్రధాన కారణం పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం. ఆహారంలో ఫైబర్, ప్రోటీన్ తక్కువగానూ, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగానూ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కేలరీలు పెరుగుతాయి. శరీరంలోకి వెళ్లే కేలరీల కంటే శరారీక శ్రమ ద్వారా ఖర్చు చేసే కేలరీలు తక్కువగా ఉంటే అవి కొవ్వుగా రూపాంతరం చెంది బరువు పెరుగుతారు.  ఈ కొవ్వు ఎక్కువగా శరీరంలో పొట్ట భాగంలోనే పేరుకుపోతుంది కాబట్టి ఇది బెల్లీ ఫ్యాట్ కు కారణం అవుతుంది. దీన్ని తగ్గించాలంటే కార్బోహై్డ్రేట్లు తక్కువ తీసుకోవాలి. శారీరక శ్రమ ద్వారా ఖర్చయ్యే కేలరీలకు సరిపడా కేలరీలు కలిగిన ఆహారం తీసుకోవాలి. పరిష్కారం.. పొట్ట తగ్గడానికి ముఖ్యంగా ఆహారం నియంత్రణతో పాటు వర్కౌట్లు కూడా చేయాలి. వాకింగ్, బ్రిస్క్ వాక్, యోగా, సూర్యనమస్కారాలు,  పొట్ట తగ్గడానికి నిర్దేశించిన వ్యాయామాలు చేయాలి.   ఆహారాన్ని ఒకే సారి ఎక్కువ మొత్తంలో తినకూడదు. ముఖ్యంగా సిట్టింగ్ వర్క్ చేసేవారు ఆహారాన్ని చాలా మితంగా తీసుకోవాలి. ఫైబర్, ప్రోటీన్ గల ఆహారాన్ని , నీటి శాతం ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. సిట్టింగ్ వర్క్ లో ఉన్నవారు ప్రతి గంటకు ఒకసారి ఓ 5 నిమిషాలు అటూ ఇటూ తిరుగుతూ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.                                                    *నిశ్శబ్ద.

    మహిళలకు నెలలో 5 నుంచి 7 రోజులు పీరియడ్స్ రావడం అనేది సహజ ప్రక్రియ. పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి, వెన్నునొప్పి, కడుపులో కండరాల  తిమ్మిరి గురించి మహిళలు ఫిర్యాదు చేస్తుంటారు. దీనితో పాటు, కొన్నిసార్లు అధిక రక్తస్రావం సమస్య కూడా మహిళలను వేధిస్తూ ఉంటుంది.  మరికొన్ని రక్తస్రావం సరిగా కాకపోవడం కూడా ఎదురవుతూ ఉంటుంది. ఇలా రక్తస్రావం అధికంగా అయినా, అసలు రక్తస్రావం సరిగా కాకపోయినా కూడా మహిళలకు సమస్యే..   ఇవన్నీ ఒక ఎత్తైతే కొన్ని సార్లు మహిళలకు పీరియడ్స్ స్కిప్ అవుతూ ఉంటాయి. నెలసరి సక్రమంగా రాదు.  ఇలాంటి సమస్యలతో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యల నుండి బయట పడటానికి  వైద్యులు చెప్పిన సలహాలేంటో తెలుసుకుంటే.. పీరియడ్స్ సక్రమంగా లేకుంటే మహిళలు తమ  జీవనశైలి, తీసుకునే  ఆహారం విషయంలో  కొన్ని ప్రత్యేక మార్పులు చేసుకోవాలి. అస్తవ్యస్తం అయిన  పీరియడ్స్‌ను క్రమబద్ధీకరించడానికి మొట్టమొదట చేయాల్సిన పని కెఫిన్‌కు దూరంగా ఉండటం. ఇందుకోసం టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. టీ, కాఫీలు మానేయడంతో  పాటు మార్కెట్ లో లభ్యమయ్యే  ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం మానేయాలి.  మార్కెట్‌లో లభించే ప్యాక్‌డ్ ఫుడ్‌కి నిర్మొహమాటం లేకుండా నో చెప్పడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు స్నేహితులు, కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా కూడా ప్యాక్డ్ ఫుడ్ తినాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితిలో సున్నితంగా ప్యాక్డ్ ఫుడ్ ను దాటవేయాలి. అలాగే వంటల్లో మైదా, ఇంకా రిఫైండ్ షుగర్  అయిన పంచదార వంటివి అధికంగా వాడుతుంటే వాటిని మానేయడం మంచిది.  ఆహారంలో అధిక కారం, అధిక నూనె, అధిక పులుపు,అధిక ఉప్పు వంటివి  తగ్గించాలి. ఇవన్నీ పాటిస్తూ ఉంటే శరీరంలో హార్మోన్లు నియంత్రణలోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. పీరియడ్స్ ఎప్పుడూ క్రమబద్ధంగా రావాలి అంటే మంచి ఆహారపు అలవాట్లు ఫాలో అవ్వడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఆహారంలో తృణ ధాన్యాలు, మిల్లెట్లు భాగం చేసుకోవాలి. మిల్లెట్లు తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది.  ఆహారంలో పచ్చి పండ్లు,  పచ్చి కూరగాయలను చేర్చడానికి ప్రయత్నించాలి. కూరగాయల జ్యూస్ తో  పాటు ఆహారంలో మజ్జిగను చేర్చాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.  రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. మజ్జిగలో లభించే ప్రోబయోటిక్స్ హార్మోన్ల అసమతుల్యతను తొలగిస్తాయి.  ఇవన్నీ హార్మోన్లను సకాలంలో వచ్చేలా చేస్తాయి.                                                               *రూపశ్రీ  

  ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.  చాలా స్పష్టంగా పెళ్లికి ముందు పెళ్ళి తర్వాత అని చెబుతుంటారు కొందరు. ఇది కేవలం జీవనశైలి గురించి మాత్రమే కాదు..ఆరోగ్యం, శరీరాకృతి గురించి కూడా. ముఖ్యంగా అమ్మాయిలను గమనిస్తే పెళ్ళికి ముందు సన్నగా, నాజూగ్గా ఉన్నవారు కాస్తా పెళ్లి తర్వాత లావుగా బొద్దుగా మారిపోతుంటారు. నిజానికి దీని వల్ల చాలామంది కామెంట్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే పెళ్లి తర్వాత అమ్మాయిలు లావు కావడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. పెళ్ళి నిశ్చయం అయినప్పటి నుండి పెళ్లి తంతు ముగిసిన భర్తతో కొత్త జీవితం మొదలు పెట్టడం వరకు అమ్మాయిల ఆహార  విధానాలు మొత్తం మారిపోతాయి. ఇక కొత్తగా పెళ్లైన జంట బయటకు వెళ్లడం. ఇద్దరూ కలసి సరదా కోసం ఆహారం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణంగా అమ్మాయిల ఆహారంలో కేలరీలు బాగా పెరుగుతాయి. ఇదే వారు లావు అవ్వడానికి కారణం అవుతుంది. ఆహార విధానం మారినా కొందరు బరువు పెరుగుతారు. పెళ్లయి అత్తవారింటికి వెళ్ళిన అమ్మాయిలు అక్కడి ఆహారపు అలవాట్లు. వంట విధానం, తినే వేళలు ఇలా ప్రతి విషయంలో మార్పులు ఎదుర్కుంటారు. ఈ కారణంగా  జీర్ణక్రియ కూడా మార్పులు చోటు చేసుకుంటుంది. కొత్త పద్దతికి జీర్ణ క్రియకు అలవాటు పడేవరకు బరువు పెరగడం కామన్. భార్యాభర్తలు కలిసి భోజనం చేయడం అనేది కొత్తజంటకు కామన్. ఒకరికొకరు ప్రేమగా తినిపించుకోవడం,  కొత్త కొత్త వంటకాలు ట్రై చేయడం, భోజనంలో కాస్త ప్రత్యేక వంటకాలు ఉండేలా చూసుకోవడం వంటి కారణాల వల్ల సాధారణం కంటే ఎక్కువ తింటూంటారు. ఇది కూడా అమ్మాయిలు బరువు పెరగడానికి కారణం అవుతుంది.                                             *నిశ్శబ్ద.

ఆడవాళ్లు 30 ఏళ్లు దాటాక ఈ టెస్టులు ఖచ్చితంగా చేయుంచుకోవాలి! మహిళ ఆరోగ్యం ఎప్పుడూ మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఒక్కోక్కో దశ దాటేకొద్దీ వారి ఆరోగ్య పరంగా సవాళ్లు కూడా ఎదురవుతూ ఉంటాయి. అయితే వీటిని అధిగమించి సక్సెస్ గా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే మాత్రం కాస్త క్లిష్టమైన విషయమే.. కానీ  మహిళల ఆరోగ్య దృష్ట్యా ఇలా చేయడం తప్పనిసరి. అయితే మహిళలు 30ఏళ్లు దాటిన తరువాత కొన్ని టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలి. దీనివల్ల వారి భవిష్యత్తులో కొన్ని సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇంతకీ ఆ టెస్టులేంటంటే.. లివర్ టెస్ట్.. 30ఏళ్ల తరువాత నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఫ్యాటీ లివర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా హైపటైటిస్ సి, హైపటైటిస్ బి వంటి లివర్ టెస్టులు తప్పకుండా చేయించుకోవాలి. కంటి పరీక్ష.. చాలామంది దృష్టిలోపం, కళ్లజోడు వాడటం లేదా కంటికి సంబంధించిన ఏవైనా ఇతర సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే కంటి పరీక్ష చేయించుకుంటారు. కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవాలి. ఆప్టిక్ నరాలకు ప్రమాదం ఉన్నట్టు తెలిస్తే మాత్రం రెగ్యులర్ గా పరీక్ష చేయించుకోవాలి. థైరాయిడ్.. 30ఏళ్ళు దాటాకా మహిళలకు థైరాయిడ్ ప్రమాదం ఎక్కువ. దీని కారణంగానే చాలామంది బరువు పెరగడం, బరువు తగ్గడం, చర్మం పొడిబారిపోవడం, గోళ్లు పెళుసుగా మారడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇవి మాత్రమే కాకుండా నిద్రలేమి, గుండె దడ, బరువులో ఊహించని మార్పులు కూడా ఉంటాయి. బోన్ టెస్ట్.. మగవారితో పోలిస్తే మహిళలలో ఎముకల సాంద్రత తక్కువగా ఉంటుంది. మహిళలలో ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువ వస్తాయి.   పైపెచ్చు బోలు ఎముకల వ్యాధి కూడా మహిళలలోనే ఎక్కువ. ఇక మహిళలలో గర్భం దాల్చడం ప్రసవం వంటి సమస్యల కారణంగా ఎముకలు బలహీనం ఉంటాయి.  అందుకే బోన్ టెస్ట్ చేయించుకోవాలి. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడంలో సహాయపడుతుంది. ఈసీజీ.. ఈసీజీ ని ఎలక్ట్రో కార్డియోగ్రామ్ టెస్ట్ అని అంటారు. కుటుంబంలో ఎవరికి గుండెజబ్బు లేనప్పుడు 35 ఏళ్ల తరువాత ఈ టెస్ట్ చేయించుకోమని సజెస్ట్ చేస్తారు.  దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని ముందే తెలుసుకోవచ్చు.  దీన్ని సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే మంచిది. ఇవి మాత్రమే కాకుండా.. కంప్లీట్ బ్లడ్ కౌంట్... ఎలివేటెడ్ సీరమ్ క్రియాటినిన్ పరీక్ష పెల్విక్ టెస్ట్ బ్రెస్ట్ టెస్ట్ STI వంటి టెస్టులు కూడా చేయించుకోవడం ద్వారా మహిళలు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు.                                    *నిశ్శబ్ద.

మెనోపాజ్ దశలో మహిళలకు గుండెజబ్బుల ముప్పు ఎక్కువా? వైద్యులు చెప్పిన అసలు విషయాలు ఇవీ! మహిళల జీవితంలో  ఆరోగ్య పరంగా అనేక సవాళ్లు ఉంటాయి. ప్రతి దశలో విభిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. నెలసరి, గర్భం, ప్రసవం, తదుపరి ఎదురయ్యే దశ మెనోపాజ్.  ఈ మెనోపాజ్ తోనే మహిళల నెలసరి చక్రం ముగుస్తుంది. అయితే మెనోపాజ్ వల్ల మహిళలలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుందా? అంటే అవునంటున్నారు వైద్యులు. సాధారణంగా చాలా మంది మహిళల్లో 40ల మధ్య నుండి 50ల మధ్య వరకు మెనోపాజ్  సంభవిస్తుంది. ఈ దశలో, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఉత్పత్తిలో తగ్గుదలతో స్త్రీ శరీరంలో ప్రధాన హార్మోన్ల మార్పులు జరుగుతాయి. గుండె జబ్బుల నుండి స్త్రీలను రక్షించడంలో ఈస్ట్రోజెన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది రక్తనాళాలలో ఎర్రబడిన కణాలను తొలగించడంలో శరీరానికి సహాయం చేయడం ద్వారా అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  ఈ సమస్యలో ఫలకాలు ఏర్పడి అడ్డంకిని కలిగిస్తుంది. ఇంకా ఈస్ట్రోజెన్ ధమనులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది చెడు కొలెస్ట్రాల్ (LDL)ని తగ్గించడం ద్వారా రక్తపు లిపిడ్ స్థాయిలపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది. మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలు పెంచుతుంది. తత్ఫలితంగా, రుతువిరతి తర్వాత ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వలన అనేక గుండె జబ్బులలో కీలకమైన అథెరోస్క్లెరోసిస్ అభివృద్ధి చెంది  గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే మెనోపాజ్ అనేది మహిళలలో గుండె జబ్బులకు ఎక్కువ ఆస్కారం ఇచ్చే దశగా వైద్యులు పేర్కొంటున్నారు. ఈ దశలో మహిళలు 7 జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండె జబ్బుల నుండి జాగ్రత్త పడవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం..  పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన ఆహారం గుండెకు మంచిది. సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ (క్రీమ్, వెన్న, రెడ్ మీట్), సోడియం (ఉప్పు జోడించడం, ప్రాసెస్ చేసిన ఆహారాలు), జోడించిన చక్కెరలను తీసుకోవడం పరిమితం చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ..  వ్యాయామం బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.  మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెద్దలు శారీరక శ్రమ కోసం ప్రతి వారం కనీసం 150 నిమిషాల  తక్కువ నుండి ఎక్కువ తీవ్రత కలిగిన ఏరోబిక్ వ్యాయామం లేదా 75 నిమిషాల  కఠిన వ్యాయామాల నుండి ఏరోబిక్ వ్యాయామంలో పాల్గొనవచ్చు.  వీటిలో వారంలో రెండు రోజులైనా శరీర కండరాలను బలపరిచే వ్యాయామాలు తప్పనిసరిగా ఉండాలి. బరువు.. మెనోపాజ్ తర్వాత నెమ్మదిగా జీవక్రియ తగ్గుతుంది. శరీర కూర్పులో మార్పుల కారణంగా బరువు పెరగడం సాధారణం. ఆహారం, వ్యాయామం ద్వారా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఒత్తిడి.. దీర్ఘకాలిక ఒత్తిడి గుండె జబ్బులకు దోహదం చేస్తుంది. ధ్యానం, యోగా ఒత్తిడి స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. ధూమపానం.. ధూమపానం గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం. ధూమపానం మానేయడం మీ ప్రస్తుత వయస్సుతో సంబంధం లేకుండా  గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. రెగ్యులర్ హెల్త్ చెకప్ లు.. రెగ్యులర్ చెక్-అప్‌లు ఆరోగ్య సమస్యలను డీల్ చేయడం సులభతరం చేస్తాయి.  ప్రాథమిక దశలోనే సమస్యలను గుర్తించడంలో సహాయపడతాయి. గుండె జబ్బులకు దారితీసే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు, మధుమేహం వంటి పరిస్థితులను పర్యవేక్షించడంలో కూడా ఇవి సహాయపడతాయి. హార్మోన్ థెరపీ.. హార్మోన్ థెరపీ అనేది మహిళ దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే రుతుక్రమం ఆగిన లక్షణాలను డీల్ చేయడంలో సహాయపడుతుంది. గుండె ప్రమాదం విషయంలో కొంతమంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుంది.  వైద్యులను  సంప్రదించి హార్మోన్ థెరపీపై నిర్ణయం తీసుకోవాలి.                            *నిశ్శబ్ద.  

మహిళల్లో ఐరన్ లోపం తగ్గాలంటే.. తినాల్సిన ఫుడ్స్ తినాల్సిందే! ఐరన్ శరీరానికి అవసరమైన పోషకాలలో ఒకటి. ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోని  స్త్రీలు  ఆరోగ్య పరంగా ప్రమాదానికి గురవుతారు. ముఖ్యంగా నెలసరి విషయాల్లోనూ, అధిక రక్తస్రావం వంటి కారణాల వల్లా ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే  మహిళలు తమ ఆహారంలో ఖచ్చితంగా ఐరన్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. మహిళలు ఆహారంలో  చేర్చుకోవాల్సిన కొన్ని ఐరన్ రిచ్ ఫుడ్స్ గురించి తెలుసుకుంటే.. షెల్పిష్..  షెల్ఫిష్ మాంసాహారానికి చెందినవి. ఇవి రుచికరమైనవి  మాత్రమే కాదు పోషకమైనవి కూడా. వీటిలో  ఐరన్  అధికంగా ఉంటుంది.  ఇవి మాత్రమే కాకుండా క్లామ్స్, గుల్లలు,  మస్సెల్స్  వంటి సముద్రపు ఆహారాలలో ఐరన్ పుష్కలంగా   ఉంటుంది. బచ్చలికూర.. బచ్చలికూర తక్కువ కేలరీలు,  విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం. దీన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని విటమిన్ సి శరీరంలోని ఐరన్‌ను గ్రహించడంలో సహాయపడుతుంది. బచ్చలికూరలో కెరోటినాయిడ్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.  ఇది వాపును తగ్గిస్తుంది.  కంటి ఆరోగ్యానికి మంచిది. మాంసం.. మాంసం శరీరంలో ఐరన్ లోపాన్ని కూడా తీర్చగలదు. ఇందులో ప్రొటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి.  విటమిన్ బి, కాపర్,  సెలీనియం  పుష్కలంగా ఉంటాయి. చిక్కుళ్ళు, బీన్స్, కాయధాన్యాలు, శనగలు, బఠానీలు,  సోయాబీన్ వంటివి పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. గుమ్మడికాయ గింజలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. 28 గ్రాముల గుమ్మడి గింజల్లో 2.5 మి.గ్రా ఇనుము ఉంటుంది. ఇవి మాత్రమే కాదు గుమ్మడికాయ గింజలలో  విటమిన్ కె, జింక్,  మాంగనీస్ కూడా పుష్కలంగా ఉంటాయి.                                            *నిశ్శబ్ద.

గర్భిణులలో రుమటాయిడ్ ఆర్థరైటిస్..ఇదెలా ప్రభావం చూపిస్తుందంటే!   రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్య. సాధారణంగా మహిళలలో ఈ సమస్య గర్భవతులలో వస్తుంది.  ఇది ఒకరకమైన ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. అంటే  ఈ సమస్య చేతులు, మణికట్టు, మోచేతులు, మోకాళ్లు వంటి కీళ్ల భాగాల్లోనే కాకుండా శరీరంలో ఇతర కీళ్ల భాగాలలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది నయం చేయలేని జబ్బు అని అంటుంటారు. అయితే మధుమేహం, హైపోథైరాయిడిజం వంటి సమస్యల మాదిరిగానే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కూడా  నియంత్రణ ద్వారా సాధ్యమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది  గర్భవతులలో ఎలా ప్రభావం చూపిస్తుందో తెలుసుకుంటే.. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కీళ్ల భాగంలో వచ్చే సమస్య. ఇది కీళ్ల భాగంలో వాపు, నొప్పి కలిగిస్తుంది.  ముఖ్యంగా మహిళలు గర్భం దాల్చినప్పుడు శరీరంలో హార్మోన్స్ వాతావరణ శోథ నిరోధక స్థితికి దారితీస్తుంది. అయితే  రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న స్త్రీలు గర్భం దాల్చినప్పుడు మాత్రం దాన్నుంచి  రిలీఫ్ ఫీలవుతారు.  ఎందుకంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు కారణమయ్యే కణాలు, శరీరంలో విడుదల  అయ్యే సైటోకిన్ లు గర్భాధారణ సమయంలో అణిచివేయబడతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య ఉన్నప్పుడు గర్భధారణ సమయం ఆరోగ్యంగా గడవాలంటే  మావి పనితీరు సమర్థవంతంగా ఉండాలి. ఈ సందర్భంలో తల్లి గర్భంలో ప్లాసెంటా అనే అవరోధం ఏర్పడుతుంది. ఇది తల్లిలో ఉన్న రక్తప్రసరణను కడుపులో పెరుగుతున్న బిడ్డకు కలుపుతుంది.   దీనివల్ల తల్లి, బిడ్డలో కణాలు, అణువులు పరస్పరం మార్పిడి జరగడం, సంకర్షణ చెందడం జరుగుతుంది. దీనివల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డ పెరుగుదలకు అవసరమైన పోషణ లభిస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న తల్లి రక్తంలో వివిధ రకాల ప్రతిరోధకాలు ఉంటాయి. ఇవి కేవలం తల్లి కీళ్ళను మాత్రమే కాకుండా రక్త నాళాలలో కూడా సమస్యలకు దారితీస్తాయి.  అందువల్ల ప్లాసెంటల్ రక్తనాళాలలో కణాలు, అణువులలో మార్పుల కారణంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారు,   రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేని వారితో పోలిస్తే ఆరోగ్య పరంగా  తేడాలు ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న మహగిళలలో ప్రీఎంక్లంప్పియా, రక్తపోటు, ఆకస్మికంగా అబార్షన్ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.  రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలావరకు జన్యు కారకాలతో ముడిపడి ఉంటుంది.  అయితే  ఇది తల్లి నుండి బిడ్డకు మాత్రం రాదు. ఈ సమస్య ఉన్న తల్లులు  రుమటాలజిస్ట్ సహాయంతో  సమస్యను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉంటే ఈ సమస్య ప్రభావం తక్కువగా ఉంటుంది.                                           *నిశ్శబ్ద.  

  హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే!   ఎక్కువశాతం ఆడవాళ్ళు ఎదుర్కొనే సమస్య ఈ రక్తహీనత. సాధారణంగా 12 శాతం ఉండాల్సిన రక్తం ఒకొక్కరికి 6 లేదా 5కి కూడా పడిపోయినపుడు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు చెప్పటానికి వీలులేనట్టుగా ఉంటాయి. ఎప్పుడయితే హిమోగ్లోబిన్ తగ్గుతుందో ఒంట్లో రక్తం ఉండాల్సిన ప్లేస్ ని నీరు ఆక్యుపై చేసి ఒళ్ళు బరువెక్కటం, కాళ్ళు తిమ్మెరలు, కూర్చుని లేచేటప్పుడు కళ్ళు తిరిగినట్టు ఉండటం, అధిక రక్తస్రావం ఇలాంటి సమస్యలు మొదలవుతాయి. హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే కొన్ని పద్దతులు పాటిస్తే మంచిది. మన శరీరంలో ఐరన్, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ సి, విటమిన్ బి12 ఇలాంటివాటిలో దేని పరిమాణం తగ్గినా అది రక్తహీనతకు దారి తీస్తుంది. వీటి లెవెల్స్ తగ్గకుండా చూసుకుంటే  చాలు, ఎలాంటి సమస్య ఉండదు. రక్తహీనతతో బాధపడే వాళ్ళు డాక్టర్ దగ్గరకి వెళితే ఐరన్ లేదా విటమిన్లతో కూడిన టాబ్లెట్స్ ఇస్తారు. అవి వాడితే సమస్య తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది కాని టాబ్లెట్స్ వాడటం ఆపగానే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. అందుకే టాబ్లెట్ల ద్వారా హిమోగ్లోబిన్ ను పెంచుకోవటం కన్నా మనం తీసుకునే ఆహారం విషయంలో  కాస్తంత జాగ్రత్త పాటింఛి దానిని పెంచుకోవటం  మంచిది  కదా. ఒంట్లో ఐరన్ శాతం తక్కువగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ తగ్గుముఖం పడితే అలాంటివాళ్ళు ఎక్కువగా పాలకూర, మెంతికూర, పెసరపప్పు, రాజ్మా, బీన్స్ మొదలయినవి తినాలి. నువ్వులు,బార్లి, బాదం పప్పు  తినటం కూడా మంచిది. మాంసాహారులు ఎర్ర మాంసం, చేపలు తింటే మంచిది.   అదేగనక ఒంట్లో విటమిన్ సి తక్కువగా ఉండి దానివల్ల హిమోగ్లోబిన్ శాతం తగ్గుతున్నట్లయితే అలాంటి వాళ్ళు జామకాయలు, బొప్పాయి, కివి పండు, కమలాపండు, ద్రాక్ష తీసుకోవాలి. అదే కూరగాయల్లో అయితే కాప్సికమ్, క్యాబేజ్, టమాటా  ఇలాంటివి ఎక్కువగా తినాలి. బాదం పప్పు రక్తాన్ని పెంచటంలో ఎక్కువ దోహదపడుతుంది. రక్తహీనత ఉన్నవాళ్లు రోజుకి 10 లేక 12 బాదం పప్పులు నానబెట్టుకుని తినాలి. బీట్రూట్ రక్తహీనతకు తిరుగులేని మందు. ఉదయం పూట ఒక గ్లాస్ పచ్చి బీట్రూట్ జ్యూస్ , 20 రోజుల పాటు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే బ్రౌన్ బ్రెడ్, పాస్తా, కార్న్ ఫ్లాక్స్ కూడా రక్తాన్ని వృద్ధి చేస్తాయి. మనం తీసుకునే ఆహారంలో ఇవన్ని ఉండేటట్లు చూసుకుంటే చాలు హిమోగ్లోబిన్ పెరగటానికి టాబ్లెట్స్ మీద ఆధారపడాల్సిన పని ఉండదు.   ..కళ్యాణి

పిల్లలు పుట్టడంలో ఇబ్బందులా? ఈ ఆహారాలు తీసుకుంటే సెట్..! ఒకప్పటితో పోలిస్తే ఇప్పట్లో పిల్లలు పుట్టడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మహిళలలో ఈ సమస్య ఎక్కువగా బయటపడుతూ ఉంటుంది. మగవారిలో కూడా ఈ లోపం ఉన్నప్పటికీ ఎక్కువశాతం ఆడవారిలో కనిపిస్తుంది. మహిళలల్లో గర్భాశయ సమస్యలు, నెలసరి సరిగా రాకపోవడం, హార్మోన్ సమస్యలు మొదలైనవి పిల్లలు పుట్టడంలో ఇబ్బందులకు కారణం అవుతాయి. అయితే పోషకాహారం తీసుకోకపోవడం కూడా ఈ సమస్యకు ఒక ప్రధాన కారణం అని ఆహార నిపుణులు అంటున్నారు.  పిల్లలు పుట్టడంలో  లోపాలను, హార్మోన్ సమస్యలను అధిగమించడానికి  కొన్ని ఆహారాలు బాగా సహకరిస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. ఫ్యాటీ ఫిష్.. చేపలలో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయి. ఇవి హార్మోన్ల ఉత్పత్తికి చాలా అవసరం. రుతుచక్రాన్ని నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి. ఆకుకూరలు.. పాలకూర, బచ్చలికూర, కాలే, తోటకూర మొదలైన ఆకుకూరలలో ఫోలెట్ అధికంగా ఉంటుంది. ఇది పిండం డవలప్ కావడానికి ఎంతో ముఖ్యమైనది. సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. బెర్రీస్.. బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నిరోధిస్తాయి. ఈ ఫ్రీరాడికల్స్ బారి నుండి అండాలను, స్పెర్మ్ ను రక్షించడంలో సహాయపడతాయి. అవకాడో.. అవకాడో ఖరీదైన పండే అయినప్పటికీ వీటిలో మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అదే విధంగా విటమిన్-ఇ, ఫోలేట్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి  సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. సీడ్స్, నట్స్.. బాదం, వాల్నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్ మొదలైన వాటిలో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ వీటిని తీసుకోవడం ఎంతో ముఖ్యం. తృణధాన్యాలు.. క్వినోవా, బ్రౌన్ రైస్, గోధుమలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, అవసరమైన పోషకాలు అన్నీ తృణధాన్యాలలో లబిస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. లీన్ ప్రోటీన్లు.. లీన్ మాంసాలు, పాలు పాల ఉత్పత్తులు, చికెన్, చేపలు, చిక్కుళ్లు వంటివి తీసుకోవాలి. ఇవి హార్మోన్ల ఉత్పత్తికి, మొత్తం పునర్ఫత్తి ఆరోగ్యానకి కూడా చాలా మంచి ప్రోటీన్ ను అందిస్తాయి. డైరీ ఆహారాలు.. పాలు, పాల ఉత్పత్తులలో విటమిన్-డి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. సంతానోత్పత్తి ఆరోగ్యంలో సానుకూల ఫలితాలు ఇస్తాయి. రంగురంగుల కూరగాయలు.. కేవలం సంతానోత్పత్తికే కాదు.. సాధారణంగా కూడా ఆరోగ్యం బాగుండాలంటే రంగు రంగుల కూరగాయలు తీసుకోవడం చాలా ముఖ్యం. బెల్ పెప్పర్స్, క్యారెట్లు, చిలగడదుంపలలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది అండాలు, స్పెర్మ్ నాణ్యతను పెంచుతుంది. దీని వల్ల సంతానోత్పత్తిలో మెరుగైన ఫలితాలు ఇవ్వడంలో సహాయపడతాయి.                                       *నిశ్శబ్ద.  

మహిళలు సిజేరియన్ తరువాత ఇవి తింటే తొందరగా కోలుకుంటారు! గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం ప్రతి మహిళ జీవితంలో చాలా అపురూపమైన విషయం. ఒకప్పుడు పూర్తీగా నార్మలో డెలివరీలు ఉండేవి. కానీ  నార్మల్ డెలివరీ ద్వారా బిడ్డను కనడానికి కష్టమైనప్పుడు వైద్యులు సిజేరియన్ చేసేవారు. ఇప్పుడైతే అసలు నార్మల్ డెలివరీలు తక్కువైపోయి సిజేరియన్  ఎక్కువైంది. నార్మల్ డెలివరీలో నొప్పులు భరించలేక కొందరు సిజేరియన్ చేయించుకుంటే.. అరుదైన తేదీలు, మంచి ముహూర్తాలు చూసి మరికొందరు సిజేరియన్ ద్వారా బిడ్డను కంటున్నారు. ఏది ఏమైనా సిజేరియన్ లు ఎక్కువైన ఈ కాలంలో మహిళలు సిజేరియన్ కుట్లు, శరీరంలో కలిగే ఇబ్బందుల నుండి తొందరగా కోలుకోవడానికి కొన్ని ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. బాలింతలు తప్పక తినాల్సిన ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాలు తప్పకుండా తీసుకోవాలి. ప్రసవం తరువాత, కుట్ల కారణంగా బలహీనంగానూ, నొప్పులకు లోనైన కండరాలు త్వరగా కోలుకోవడానికి ప్రోటీన్ బాగా సహాయపడుతుంది.  బీన్స్, నట్స్, గుడ్లు ప్రోటన్ కోసం కొన్ని ఉదాహరణలు. గర్భం మోయడమనే కారణంగా మహిళలలో ఎముకలు ఒత్తిడికి లోనై  ఉంటాయి. అందుకే కాల్షియం మెండుగా ఉన్న ఆహారాలు తీసుకుంటే ఎముకలు బలంగా మారతాయి. కాల్షియం బాగా అందడానికి కాల్షియం, పాలు, బాదం, గుడ్లు, పనీర్ తీసుకోవాలి. సి సెక్షన్ అయినా, సాధారణ ప్రసవం అయినా బాలింతలు నీరు పుష్కలంగా తాగడం ఎంతో అవసరం. ఎందుకంటే తల్లిపాలు తగినంత ఉత్పత్తి కావాలంటే శరీరంలో తగినంత నీరు కూడా అవసరం. నీరు పుష్కలంగా తీసుకుంటే సి సెక్షన్ చేయించుకున్నవారు తొందరగా కోలుకునే అవకాశం ఉంది. శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో నీరు సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. గర్బం మోసిన సమయంలోనూ, ప్రసవం తరువాత వచ్చే మలబద్దకం సమస్యను చెక్ పెట్టడానికి ఫైబర్ సహాయపడుతుంది. ప్రసవం కారణంగా శరీరం కోల్పోయిన రక్తం తిరిగి ఉత్పత్తి కావడానికి ఐరన్ రిచ్ ఫుడ్స్ బాగా తీసుకోవాలి. ఖర్జూరం, బీట్రూట్, అంజీర్, ఆకుకూరలు, మునగ ఆకు వంటి వాటిలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది. ప్రసవం తరువాత పెద్దలు బాలింతలకు వెల్లుల్లి, సొంపు, దనియాలు వంటి వంటింటి  దినుసులను ఆహారంలో భాగం చేసేవారు. ఇవి పాల ఉత్పత్తిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా శరీరం తొందరగా రికవరీ కావడానికి కూడా సహాయపడతాయి. తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేస్తాయి. విటమిన్-ఎ శరీరంలో కణాలను రిపేరీ చేయడంలో సహాయపడుతుంది. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. క్యారెట్, పాలు, ఆకుకూరలలో విటమిన్-ఎ పొందవచ్చు. సిజేరియన్ చేయించుకున్న మహిళలలు తొందరగా కోలుకోవడానికి కాపర్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.  చేపలు, గింజలు, ఎర్ర కందిపప్పు, గోధుమలు, వాల్నట్స్, వేరుశనగలు  మొదలైనవాటిలో  కాపర్ సంపూర్ణంగా ఉంటుంది.                                     *నిశ్శబ్ద