కోర్టును తప్పుదోవ పట్టించారా? ..కోర్టులే తప్పుదోవ పడుతున్నాయా?

పదిమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కాని ఒక్క నిర్ధోషికి కూడా శిక్ష పడకూడదనే కాన్సెప్ట్‌తో పని చేస్తున్న ఇండియన్‌ కోర్టుల్లో లక్ష ల కొద్దీ పేరుకుపోయిన కేసులు జాతిని భయపెడుతున్నాయి. జడ్జిల కొరత ఈ సమస్యకు మూలకారణం. సివిల్‌కేసుల విషయంలో తీర్పుకోసం చూడాలంటే కనీసం రెండు తరాలు పడుతుంది. క్రిమినల్‌ కేసులయితే 20 నుండి 30 సంవత్సరాలు పడుతుంది. అతిపెద్ద క్రిమినల్‌ కేసయిన దివంగత ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ కేసులో నిందుతులకు శిక్ష ఖరారు కావడానికే పదేళ్ల సుదీర్ఘ కాలం వెచ్చించిన దేశం మనది. ఇలాంటి దౌర్బాగ్యం మరే దేశంలోనూ కనిపించదు. అందుకే సామాన్యమానవుడు కోర్టుకెళ్లాలంటేనే భయపడుతుంటారు.   ఇటువంటి పరిస్థితుల్లో దేశంలోనూ, రాష్ట్రంలోనూ గాలిజనార్దన్‌ రెడ్డి బెయిల్‌ కేసులో రోజుకొక న్యాయమూర్తి కటకటాలపాలవుతుంటే కోర్టులంటే సామాన్య ప్రజలకు ఏవగింపు కలుగతోంది.ఈ సంఘటన తర్వాత న్యాయమూర్తులంటే గౌరవం పోయింది. కాస్తో కూస్తో కోర్టుల మీద పాజిటివ్‌ థింకింగ్‌ ఉన్న వారంతా ప్రజాప్రయోజనాలకోసం ఎవరిమీదైనా కేసువేస్తే వచ్చే లేటెస్టు తీర్పు.... కోర్టును తప్పుదోవ పట్టించారని లేదా కోర్టు సమయాన్ని పాడుచేశారని ఫైన్‌ వేయటం లేటెస్ట్‌ ట్రెండ్‌ అయ్యింది. కోర్టుకు ఇప్పుడు న్యాయాన్యాయాలను బేరీజు వేసి సామాన్యుడికి నిజాలు చెప్పే టైమ్‌ లేకపోవడమే దీనికి కారణం. కోర్టులకు ఇష్టమయితే ఎవరిమీదయినా ఏదైనా విమర్శ చేసి , అత్యుత్సాహం ప్రదర్శించి సుమోటోగా తీసుకుంటుంది. ఇష్టం లేకపోతే ఒకే రకమైన కేసులపై పరస్పర నిర్ణయాలు తీసుకుంటుంది. ఇలా చేయడం వల్ల కోర్టు తీర్పులు వివాదాస్పదమవుతున్నాయి.

నాటా - ఆంధ్రభూమి కథల పోటీలో విజేతలకు బహుమతి ప్రదానం

ఉత్తర అమెరికా తెలుగుసమితి [NATA] - ఆంధ్రభూమి దిన పత్రిక సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ మొట్టమొదటి కథల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం సన్ షైన్ హాస్పిటల్ ఆడిటోరియం నందు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ. డి. శ్రీధర్ బాబు సివిల్ సప్ప్లైస్ అమాత్యులు విచ్చేశారు. ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు ఎమ్.విఆర్. శాస్త్రిగారు సభాధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీ.కె. యాదగిరి గారు, ఆంధ్రభూమి వారపత్రిక సహాయ సంపాదకులు శ్రీమతి ఎ.ఎస్.లక్ష్మిగారు పాల్గొన్నారు. నాటా అధ్యక్షులు ఎ.వి.ఎన్ రెడ్డి, కార్యదర్శి ప్రదీప్ సామల, ఇండియా ఓవర్ సీస్ కో ఆర్డినేటర్స్  ద్వారకానాథరెడ్డి, గోపీనాథ రెడ్డి సమన్వయం చేశారు. నాటా - ఆంధ్రభూమి నిర్వహించిన కథల పోటీలో విశేష స్పందన లభించిందనీ, అనేక ప్రాంతాల నుండి వచ్చిన కథలలో న్యాయ నిర్ణేతలు 5 (ఐదు ) కథలకు బహుమతి ప్రకటిస్తూ, మరికొన్ని కథలు సాధారణ ప్రచురణకు స్వీకరించినట్లు తెలియజేశారు. భాషను ప్రేమిస్తూ, ఓ తపస్సులా రచనలు చేస్తే అది వ్యక్తి వికాసానికి, సమాజాభివృద్ధికి తోడ్పడుతుందని పలువురు వక్తలు  తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సలీం (హైదరాబాద్ ) తను రాసిన 'నిర్ణయ' కథను ప్రథమ బహుమతి 20,000 వేల రూపాయలు గెలుపొందగా, ద్వితీయ బహుమతులు సింహప్రసాద్ (హైదరాబాద్) 'వంశవృక్షం' కథకి, చింతా జగన్నాథరావ్ (విశాఖపట్నం) 'తగువారము మేమే' కథకి గాను 10,000 వేల రూపాయలు గెలుపొందగా, వసుంధర (హైదరాబాద్) సృశాసని కథకి, బి.గీతిక (జిన్నూరు పశ్చిమగోదావరి ) 'మట్టి మనిషి' కథకి తృతీయ బహుమతిగా 5000 వేల రూపాయలు గెలుచుకున్నారు. వీరందరూ తమ తమ రివార్డును ఈ వేదికపై అందుకున్నారు. సభా కార్యక్రమానికి ముందు మాస్టర్ శరశ్చంద్రచే నిర్వహించబడిన సినీసంగీత విభావరి సంస్క్రృతిక కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది.

కొండా కుటుంబానికి పవర్‌ పోయిందా?

పరకాల అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కొండాసురేఖ ఓటమి పాలయ్యారు. తాజాగా ఆమె భర్త కొండా మురళి ఎమ్మెల్సీ పదవిపై అనర్హతా వేటు పడిరది. దీంతో ఒక్కసారిగా కొండా కుటుంబానికి పవర్‌పోయిందని తెలంగాణాప్రాంతంలో  చర్చిస్తున్నారు. ఓడిపోయినా నిన్ను వదులుకోమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి, సురేఖకు హామీ ఇచ్చారు. కనీసం భర్తకు ఎమ్మెల్సీ ఉంది కాబట్టి నెట్టుకురావచ్చని అనుకుంటుంటే కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఎమ్మెల్సీగా కొనసాగేందుకు ఎటువంటి అర్హత లేదని మండలి ఛైర్మన్‌ చక్రపాణి ప్రకటించారు. దీంతో పాటు అనర్హతావేటును అమలు చేశారు.  మొదటి నుంచి వైఎస్‌ కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన కొండా కుటుంబం వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకుంది. కొండా సురేఖ పరకాల అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఎప్పటికైనా ఈ అనర్హతా వేటు ఖాయమని ముందుగానే అవగాహన ఉన్నందున మురళి దానిపై ఎటువంటి స్పందన వ్యక్తం చేయలేదు. భవిష్యత్తులో వైకాపాను బలోపేతం చేసుకుంటూ పోవచ్చనే లెక్కలో ఈ ఇద్దరు ఉన్నారు. అందుకే పవర్‌ను వదిలేసి ప్రజల బాట పట్టేందుకు కార్యక్రమాలు రూపొందించుకోవాలని చూస్తున్నారు. వాస్తవానికి సురేఖ అథికారం కూడా కాంగ్రెస్‌ను వదిలిరావటం వల్లే పోయిందనే అందరికీ తెలిసిన విషయమే. మొత్తానికి పవర్‌ వదులుకుని వైకాపానేతలుగా ఈ కుటుంబం స్థిరపడేందుకు కృషి ప్రారంభిస్తోంది.

స్ధానిక సమరానికి సిద్దమవుతున్న మంత్రి గంటా

ఇటీవల ఒక్కసారిగా అనకాపల్లి కాంగ్రెస్‌ పార్టీ ఐక్యతారాగం ఆలపిస్తున్నది. అయితే ఇందులో తేల్చాల్సిన సమస్య నూకాంబికా ఆలయకమిటీ నియామకం ఒక్కటే. దీనిపై మాత్రం భిన్నాభిప్రాయాలున్నాయి. అందువల్ల ఈ ఆలయకమిటీ నియామకం ఎలా జరుగుతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మంత్రి గంటా శ్రీనివాసరావు,  కాంగ్రెస్‌పార్టీ నాయకుడు కొణతాల రఘనాథ్‌ మథ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఇటీవల వీరిద్దరి మథ్య సయోథ్య కుదిరింది. వీరిద్దరూ కలిసి ఒకచోట సమావేశమయ్యారు. అలానే మంత్రి గంటా ఇంటికి రఘనాథ్‌ వెళ్లి పలకరించారు. అంతేకాకుండా రఘనాథ్‌ చెప్పిన మాటలు మంత్రి శ్రీనివాస్‌ వింటున్నారు. ఇప్పటి వరకూ వీరిద్దరూ దూరంగా ఉన్నప్పుడు చాలా నష్టపోయామని, ఇప్పుడు బాగా కలిసివస్తుందని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే నాలుగైదు రోజుల్లో బహిరంగసభ ద్వారా వీరిద్దరి ఐక్యతా ప్రకటించనున్నారు. తెలుగుదేశం, వైకాపాలకు హెచ్చరికగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా ప్రకటించనున్న స్థానిక ఎన్నికల్లో విజయభేరి మోగించాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అయితే దాని పరిథిలోకి వచ్చే నూకాంబికా ఆలయకమిటీ ఛైర్మను పదవి గురించి మంత్రి గంటాశ్రీనివాసరావు, రఘనాథ్‌ల మథ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఇప్పటి వరకూ మంత్రి శ్రీనివాసరావు ఆ ఛైర్మను పదవిని యువజన నాయకుడు బేశెట్టి సుథాకర్‌కు కట్టబెట్టాలని ప్రయత్నించారు. రఘనాథ్‌ కూడా ఆ కమిటీ ఛైర్మను పదవి మాజీ కౌన్సిలర్‌ బిఎస్‌ఎంకె జోగినాయుడుకు ఇవ్వాలని సిఫార్సు చేస్తూ అథిష్టానానికి లేఖ రాశారు. ఈ ఛైర్మను పదవి వీరిద్దరి మథ్య తిరిగి పాతపరిస్థితి తెస్తుందా? లేక వీరిద్దరూ కలిసే ఉంటారా? అన్న భవిష్యత్తులోనే తేలాలి. ఈ అంశంపై వీరిద్దరి రియాక్షన్‌ ఎలా ఉంటుందని విశాఖజిల్లాలోని కాంగ్రెస్‌నేతలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆ ఇద్దరు మంత్రులు ఏ పనీ చేయరా ?

విద్యాశాఖను పర్యవేక్షించే ఇద్దరు మంత్రులూ ఏమీ చేయట్లేదని విమర్శలు గుప్పుమంటున్నాయి. పాఠశాలలు, కాలేజీలు సమస్యలతో సతమతమవుతుంటే మంత్రులిద్దరూ మౌనంగా ఉన్నారు. ఈ మౌళికసమస్యలతో పాటు ఉద్యోగ సమస్యలూ శాఖాపరంగా పరిష్కారానికి నోచుకోవటం లేదని ఆరోపణలు ఎక్కువయ్యాయి. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థసారధి రాజీనామా చేయాలని డిమాండు వినిపిస్తోంది. ఈ డిమాండును రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోవటం లేదని విమర్శలు వస్తున్నాయి. మంత్రి పార్థసారధి ఇటీవల ఫెరా చట్టం ఉల్లంఘన కింద నేరారోపణకు గురైనా ఎందుకు రాజీనామా చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంటే తన సొంతవ్యాపారం కోసం చట్టాన్ని ఉల్లంఘించిన మంత్రి అవసరమా అని ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు.  పైగా పాఠశాలల్లో పేరుకుపోయిన సమస్యలపై మంత్రి పార్థసారధి దృష్టి సారించలేదని, వాటికి అవసరమైన నిధులు మంజూరు చేయలేదని ఐక్య ఉపాథ్యాయఫెడరేషన్‌ అధ్యక్షుడు నారాయణ ఆరోపిస్తున్నారు. ప్రత్యేకించి మంత్రి రాజీనామా చేయాల్సిందేనని ఆయన డిమాండు చేస్తున్నారు. రెండు సార్లు విద్యాపక్షోత్సవాలు జరిపినా ప్రభుత్వం నుంచి అనుకున్నంత స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేశారు. డిప్యూటీ,ఈవో, గెజిటెడ్‌ ప్రధానోపాథ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. సాక్షాత్తూ ఉపాథ్యాయులే రోడ్డుపైకి వచ్చి మంత్రుల పనితీరును చాటుతుంటే మరి వారేం పని చేస్తున్నారో ఆ మంత్రులకే తెలియాలి. ఎయిడెడ్‌పాఠశాలలకు పుస్తకాలను అందజేయలేదంటే మంత్రులు కనీసకర్తవ్యం, బాధ్యత ఫీలవ్వట్లేదని వేరేగా చెప్పాలా? మరి సిఎం నేరుగా ఈ సమస్యలను పరిష్కరించాలని ఉపాథ్యాయులు కోరుతున్నారు.

ధర్మాన సిఫార్శులతో రాష్ట్రం దివాళా ఖాయం

 రాష్ట్రంలో ఉపాధి, ఉత్పాధక శక్తి పెంచాల్సిన అవసరం ఎంతైన ఉందని ఆర్థిక శాస్త్రవేత్తలు  అంటున్నారు. కాని మంత్రి ధర్మాన కమిటీ చేసిన సిఫార్సులన్నీ రాష్ట్రాన్ని దివాళా తీయించేవిగా ఉన్నాయని  వారు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పధకాలకు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే ఖజానా డబ్బులు చాలడంలేదు. దీనికి తోడు అదనంగా ఓటు బ్యాంకు రాజకీయాలకు ,తాళిబొట్టు పధకాలకు డబ్బు వెచ్చించడం మంచిది కాదని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాధాన్యతా రంగాలకు తక్షణమే గాడిలో పెట్టటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  సామాన్య ప్రజలకు ఊరట కలిగించే విధంగా ధరలను, నల్లబజారును వెంటనే అరికట్టాలని ఆర్ధిక నిపుణులు అన్నారు. అన్ని రంగాల్లోనూ సిండికేట్ల వ్యవహారాన్ని వెంటనే అడ్డుకట్టవేసి ప్రజలను దోపిడీనుండి బయటపడవేయవల్సిన అవసంరం ఎంతైనా ఉందని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక స్తబ్దత తొలగించి మరిన్ని పెట్టుబడులకు అవకాశం ఇచ్చే మెరుగైన పరిస్థితులను నెలకొల్పాలని వారు సూచించారు. రాష్ట్రంలో సెజ్‌లు, పరిశ్రమలు, పార్కుల పేరుతో వేల ఎకరాల్లో బడా సంస్థలు పొందిన వేల ఎకరాలపై సమీక్షలు జరిపి భూనిర్వాసితులకు వెంటనే ప్రత్యామ్యాయాలను రాష్ట్ర ప్రభుత్వం చూపాలని వారు కోరుతున్నారు. దీనివల్ల పారిశ్రామిక వేత్తలకు, స్థానిక ప్రజలకు మేలు కలుగుతుందని  ఆర్దిక నిపుణులు చెబుతున్నారు.  రాష్ట్రం సర్వతోముఖాభి వృద్ది జరగాలంటే నిర్ధిష్టమైన పద్దతులు పాటించాలని అలా కాకుండా పైపైన పూతలాంటి కార్యక్రమాలకు ప్రజాధనాన్ని వెచ్చిస్తే రాష్ట్రం  దివాళాతీయటం తప్పదని తెలిపారు. రాష్ట్రం పురోభివృద్దికి చర్యలు చేపట్టే ఎటువంటి విషయాలు ధర్మాన కమిటి చేపట్టలేదని, దీనివల్ల ప్రభుత్వానికి ప్రజలపట్ల చిత్తశుద్దిలేదని తెలుస్తుందన్నారు. మౌలిక సమస్యలను పరిష్కరించకుండా ఇతరత్రా ఎజెండాలతో ఎంతకాలం ప్రజలను మభ్యపెడతారని రాష్ట్రంలోని మేధావులు, సీనియర్‌ ఐఏఎస్‌లు ప్రశ్నిస్తున్నారు. ఇకనైన ముందుచూపుతో వ్యవహరించాలని, గుజరాత్‌, బీహార్‌ రాష్ట్రాలను చూసైనా బుద్ది తెచ్చుకోవాలని వారు కోరుతున్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో కూడిన అభివృద్ది పధకాలకే పెద్దపీటవేయాలని అలాకాకుండా ధర్మాన కమిటీకి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే రాష్ట్రం దివాళాతీయడం తథ్యమని ఆర్ధిక నిపుణులు, మేధావులు రాష్ట్రప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

ఉద్యమానికి సిద్దమవుతున్న ఎయిడెడ్‌ టీచర్ల

రాష్ట్రంలోని ఎయిడెడ్‌ టీచర్లు తమ సమస్యల పరిష్కారానికై పెద్ద ఎత్తున ఉద్యమించాలని నిర్ణయించారు. విద్యా శాఖకు ఇద్దరు మంత్రులున్నా  ఎయిడెడ్‌, మున్సిపల్‌ టీచర్ల సమస్యల పరిష్కారానికి వారు చొరవ చూపడంలేదని రాష్ట్ర ఉపాద్యాయ సంఘం ఆరోపించింది. యస్‌టియు ఆధ్వర్యంలో  తమ న్యాయమైన డిమాండ్లకోసం ఎయిడెడ్‌ టీచర్లు  వియవాడ సబ్‌కలెక్టర్‌ ఆఫీసు దగ్గర  ధర్నా నిర్వహించారు. పేద, మధ్యతరగతి ప్రజలెక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎయిడడ్‌, మున్సిపాలిటీ టీచర్లకు ప్రభుత్వ ఉపాద్యాయులకు ఇచ్చే సౌలబ్యాలను  వర్తింపచేయాలని వారు కోరుతున్నారు.   మేనేజ్‌మెంట్‌  ఉపాద్యాయులకు ఇచ్చే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, జిఎఎఫ్‌ , హెల్త్‌కార్డులు తమకు కూడా కల్పించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం 37/2005,1/2005 యాక్టుద్వారా నష్టపోయిన వారికి పైకం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఒక్కో పురపాలక సంఘంలో ఒక్కో జిఓ అమలు చేస్తున్నారని అన్ని చోట్లా ఒకే జీవో అమలు చేయాలన్నారు. కొన్ని చోట్ల 38, మరికొన్నిచోట్ల 146 నిబంధనలు వర్తింప చేయడాన్ని వారు గర్హించారు. ఎంతో ఆందోళన చేసి సాధించుకున్న ప్రీ ఆడిట్‌  ఉత్తర్యుల్లోనూ కొర్రీలు పెడుతుండటం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయవాణి చీఫ్‌ఎడిటర్‌ మూకల అప్పారావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎంవియస్‌ఎన్‌ ప్రసాద్‌ ఎయిడెడ్‌, మున్సిపల్‌ టీచర్లు పాల్గొన్నారు.

కరీంనగర్‌ జిల్లా సరిహద్దుల్లో పోలీస్‌ కూంబింగ్‌

నెల్లూరులో జరిగిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద స్థలానికి రైల్వే ఫోరెన్సిక్ నిపుణుల బృందం మంగళవారం ఉదయం నెల్లూరు చేరుకుంది. అగ్ని ప్రమాదానికి గురియైన ఎస్-11 బోగీని రైల్వే నిపుణుల బృందం పరిశీలించింది. బోగి నుంచి కొన్ని నమూనాలను సేకరించింది. కాలిన మృతు దేహాలను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచారు. వీటిలో 13 మృతదేహాలను గుర్తించి వాటిని వారి బంధువులకు అప్పగించారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 వేల పరిహారాన్ని ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే భద్రతా కమిషనర్ డీకె సింగ్ విచారణ జరిపి ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోనున్నారు.         

ప్రాణాలు తీస్తున్న రైలు ప్రమాదాలు

దేశంలో రైలు ప్రమాదాలు యేటేటా పెరుగుతున్నాయి. రైల్వే భద్రతకు అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నామని రౖెెల్వే మంత్రి ఎప్పటి కప్పుడు చెబుతున్నా ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. డిల్లీనుండి బయలు దేరిన  తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో  నెల్లూరు దగ్గర జరిగిన దారుణ అగ్నిప్రమాదంలోని మృతుల సంఖ్య  పెరుగుతూనే ఉంది. ఈ హృదయ విదారక సంఘటన నాలుగేళ్లక్రితం జరిగిన గౌతమీ ఎక్స్‌ప్రస్‌ ఘటనను గుర్తుకు తెచ్చింది. అప్పుడు కూడా అర్ధరాత్రి ప్రయాణీకులంతా నిద్రలో ఉన్న సమయంలోనే అనంతలోకాలకు ప్రయాణం కావాల్సివచ్చింది. ఆ సంఘటనలో 32 మంది చనిపోయారు. చనిపోయిన ప్రయాణీకులకు సంబంధించిన పూర్తిగా  కాలిపోయిన మృతదేహాల  ఎముకల పోగులై ట్రైను డోర్లు దగ్గర పడివుండటం చూపరులను కలచి వేసింది. కళ్ల ముందే కాలిపోతున్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి పోయామని అదే ట్రయిన్‌లో ప్రయాణిస్తున్న అప్పటి మంత్రి సూర్యారావు చెప్పిన విషయం తెలిసిందే. గౌతమీ ఎక్స్‌ప్రెస్‌ సంఘటనకు  కారణంగాని, సంస్థలు,వ్యక్తుల్ని గురించి గాని  ప్రభుత్వం  ఇంతవరకు ఏ ప్రకటనాచేయలేదు. దీనివల్ల ప్రభుత్వం  గౌతమీ ఎక్స్‌ప్రెస్‌ దారుణ సంఘటనకు సంబంధించి ఎటువంటి దర్యాప్తు చేయించలేదని తెలుస్తోంది. ఆ సంఘటనతోనే రైల్వే అధికారులు,కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు స్పందించి సంఘటనకు బాధ్యులెవరో తెలుసుకుని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకొని వుంటే  తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌కు ఈ ప్రమాదం వచ్చి ఉండేది కాదు. ఇప్పటికైనా రైల్వే శాఖ విచారణ జరిపించి బాధ్యులను శిక్షించి  సురక్షకమైన ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలని, రైల్వే లాభాలనే ఆర్జించేదే  కాకుండా  భద్రత కూడా కల్పించాలని ప్రయాణీకులు, ప్రజలు  కోరుతున్నారు.  

చీకటిలో ఏడు రాష్ట్రాలు

ఇప్పటిదాకా ఆంథ్రప్రదేశ్‌ ఒక్కటే అంథేరాప్రదేశ్‌ అయిందని బాధపడేవారు. కొత్తగా ఉత్తరాదిలోని మరో ఏడు రాష్ట్రాలూ అంథకారాన్ని ఎదుర్కొంటున్నాయి. ఢల్లీ, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రాల్లో అంథకారం తప్పలేదు. అకస్మాత్తుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో ఢల్లీతో పాటు పలు రేల్వేస్టేషన్లలో విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. దాదాపు రైల్వేవ్యవస్థ స్తంభించిందని చెప్పవచ్చు. దీంతో పలు రైల్వేస్టేషన్లలో సమాచారం అందక, విద్యుత్తు లేక సుమారు 200 ఎక్స్‌ప్రెస్‌లు ఆగిపోయాయి. విద్యుత్తు వ్యవస్థలో వచ్చిన లోపం కారణంగానే ఈ రైళ్లు ఆగిపోయాయని అథికార్లు ధృవీకరించారు. వేలాది మంది రైల్వే ప్రయాణీకులు దీని వల్ల ఇబ్బందుల పాలయ్యారు.  దక్షిణాది నుంచి బయలుదేరిన ఎక్స్‌ప్రెస్‌లు ఇప్పుడు ఆలస్యంగా నడుస్తున్నాయని తాజాసమాచారం. ఉత్తరాదిలోని గమ్యస్థానం చేరటానికి అవకాశం లేక రైలు వేళలు మారిపోయాయంటున్నారు. ప్రత్యేకించి ఉత్తరాదిలోని యాత్రాస్థలాలకు బయలుదేరిన పర్యాటకుల ఇబ్బంది మాటల్లో చెప్పటం సాధ్యం కావటం లేదు. ఏ స్టేషనులో ఎంతసేపు రైలును ఆపుతారో అథికారులే చెప్పలేకపోతున్నారు. పైగా, అంథకారంలో స్టేషన్లు ఉండటంతో సమాచారం తెలుసుకోవటం కూడా కష్టమవుతోంది. ఒకేసారి ఏడురాష్ట్రాల విద్యుత్తు ఆగిపోవటం దేశచరిత్రలోనే తొలిసారి కావచ్చని అథికారులు అంటున్నారు. ఆంథ్రప్రదేశ్‌లో విద్యుత్తు పరిస్థితి త్వరలో చక్కబడుతుందని సిఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి హామీ ఇస్తున్నారు. ఎప్పుడో అన్నది మాత్రం ఆయన ఖచ్చితంగా చెప్పలేకపోయారు.  

న్యూజిలాండ్‌పై 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపు

ఆంటిగ్వా:మొదటి టెస్ట్‌లో వెస్టిండీస్ న్యూజిలాండ్‌పై  9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ 46 ఓవర్లలో నిర్దేశించిన 102 పరుగుల లక్ష్యాన్ని విండీస్ వికెట్ నష్టపోయి 19.3 ఓవర్లలోనే ఛేదించింది. గేల్ అజేయ అర్థ సెంచరీతో రెచ్చిపోవడంతో విండీస్ సునాయాసంగా విజయం సాధించింది. గేల్ 49 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. పావెల్ 30 పరుగులు చేసి బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఫుడాదిన్ 7 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు.         తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 351, విండీస్ 522 పరుగుల స్కోరు సాధించాయి. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 272 పరుగులకు ఆలౌటయింది. మొత్తం 8 వికెట్లు పడగొట్టిన విండీస్ బౌలర్ సునీల్ నరైన్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో విండీస్ 1-0 ఆధిక్యం సాధించింది.

జగన్‌కు దూరమవుతున్న ఎస్సీ,ఎస్టీలు

ఒకవైపు అన్నిపార్టీల నుండి  వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌లోకి నాయకులు వలసలు పోతున్నారు. మరో వైపు ఇలా వస్తున్న నాటకుల వల్ల వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీకి కొత్త సమస్యలు ఎదుకవుతున్నాయి. కొత్తగా వస్తున్న నాయకలతో తమకు గుర్తింపు క్రమంగా తగ్గుతోందని  ఈ పార్టీకి చెందిన పాత నాయకులు వాపోతున్నారు. ఇతర పార్టీలనుండి వచ్చే అగ్రకులాలవారికి ప్రాధాన్యత ఇస్తున్నారని మొదటనుండి పార్టీలోవుండి పార్టీని బలోపేతం చేసిన వారిని పట్టించుకోవడంలేదదంటున్నారు. నిన్న మొన్న వచ్చిన వారికి పార్టీలో పదవులు ఇస్తూ యస్‌సి, యస్‌టి వారికి తొలగిస్తున్నారని వాపోతున్నారు.  ప్రధానంగా పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లో ఇదే జరిగిందని గుర్తుచేస్తున్నారు.గిరిజనులు ఎక్కువ కలిగిన ఈ నియోజక వర్గాల్లో ఖమ్మంజిల్లా కన్వీనర్‌గా పనిచేస్తున్నచందా లింగస్వామిని మార్చి ఆయన స్ధానంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ ని నియమించారు. ఖమ్మంజిల్లాలో పది నియోజక వర్గాలుండగా అందులో 5 ఎస్టీ, 2 ఎస్సీ నియోజక వర్గాలని అక్కడనుండి గిరిజన వర్గాలకు చెందిన లింగస్వామిని తొలగించడం వల్ల ప్రజల్లో  ఈ పార్టీలో కూడా బలహీన వర్గాలకు తావులేకుండా పోయిందనే తప్పుడు సంకేతాలు ప్రజల్లో కి వెళతాయని కార్యకర్తలు చెబుతున్నారు. అలాగే పశ్చిమగోదావరిలో జిల్లా కన్వీనర్‌గా పని చేస్తున్న మోషేన్‌రాజుని తొలగించి తోట గోపిని కన్వీనర్‌గా చేయటంవల్ల వైసిపి పార్టీలో కమ్మ, కాపు లాంటిఅగ్రకులాలకే పట్టంకట్టడం జరుగుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇదే పద్దతికి కొనసాగితే రానున్న రోజుల్లో పార్టీ జెండా పట్టుకునేవారే కరువవు తారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వాళ్లకు అనుకూలమైన వారిని నియమిస్తూ ప్రచారంలో మాత్రం దళితులకు పెద్దపదవులు ఇస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారని చెబుతున్నారు. యూత్‌కాంగ్రెస్‌లో కూడా అదే పద్దతి నెలకొందని బాధితులు వాపోతున్నారు. కేంద్రకమిటీలో కూడా ఇదే పరిస్థితులు పరిణమించాయని జంబో కమిటీలను నియమిస్తున్నారని ఇందులోకూడా పెత్తనం పెద్దకులాలవారిదే అని కనీసం మర్యాదపూర్వకంగా కూడా ఏ విషయాలు చర్చించరని పాత నాయకులు వాపోతున్నారు. ఇతే పద్దతి కొనసాగితే 2014 కు దళిత, మైనార్టీలు పార్టీకి దూరమవుతారని వైసిపి పార్టీలోని పాత నాయకులు చెబుతున్నారు.  

కాంగ్రెస్‌లో ఎవడిగోల వాడిదే

 రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకులంతా అంతా ఒకటిగా ఉండాల్సిన సమయంలో ఎవరి దారి వారిది అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శ్రీకాకుళం ఇందిరమ్మబాటలో ఉన్నారు. దేవాదాయ శాఖమంత్రి రామచంద్రయ్య కాపు సంఘంలో మాట్లాడుతూ కాబోయే సిఎం మన చిరంజీవే త్వరలో ప్రజాభీష్టం నెరవేరుతుందంటారు. ఈలోపు గాంధీ భవన్‌లో  వి. హనుమంతరావు మౌనదీక్షను ప్రారంభించి మేధోమధనం జరగాలని కోరారు.   ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ మొన్న తూర్పుగోదావరి సక్సెస్‌ఫుల్‌గా  ఇందిరమ్మ బాట పూర్తి చేసి ప్రస్తుతం శ్రీకాకుళంలో పర్యటన చేస్తున్నారు. దానిలో భాగంగానే రోజూ సెక్రటేరియట్‌లోబోరు కొడుతుందని సభాలలో మీద మేకలను పట్టుకొని ఫోటోలు తీయించుకొని పోలాలకెళ్లి నాట్లువేసే ట్రాక్టరు ఎక్కి కాసేపు స్టీరింగు తిప్పి సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో పడుకొని, సహపంక్తి భోజనాలు చేస్తూ పిల్లలతో క్రికెట్‌ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. అసలు చేయవలసిన నిత్యావసర ధరల కళ్లేనికి ఏంచేస్తున్నారో ఇప్పటికీ ఏం తేల్చలేదు.  అయినా అఫీసులో కూర్చుని ప్రజారంజకంగా పాలన చేయమని అధికారం ఇస్తే మందిమార్బలం వెంటేసుకొని ఊళ్లూళ్లూ తిరుగుతూ కబుర్లుచెబుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారు.అంతేకాకుండా అధికార పార్టీకి  ప్రతిపక్షానికి తేడా లేకుండా చేస్తున్నారు మన ముఖ్యమంత్రి. ఈలోపు దేవాదాయశాఖమంత్రి రామచంద్రయ్య త్వరలో మనకు చిరంజీవి ముఖ్యమంత్రికాబోతున్నారు అని మరొక అసమ్మదీయ ప్రయత్నానికి తెరలేపారు. మేధోమధనం జరపాల్సిందే అంటూ విహనుమంతరావు  తన నిరసనను మౌనదీక్షద్వారా గాంధీభవన్‌లో సంచలనం చేశారు. కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపాలంటే వారితో మీటింగులు జరపాల్సిందే అని దీని ద్వారా కాంగ్రెస్‌పార్టీలో ఉన్న జగన్‌ కోవర్టులను తొలగించాలని ఆయన డిమాండ్‌చేశారు.  సీనియర్లు కె కేశవరావు, డియల్‌ రవీంద్ర వంటి వారు ఆయనకు మద్దతు తెలిపారు. విహెచ్‌ మౌనదీక్ష పార్టీకి కీడు చేస్తుందని ముఖ్యమంత్రి అనునాయులు అధిష్టానికి ఆఘమేఘాల మీద లేఖలు పంపారు.అధిష్టానం ఆదేశంతో ఉపముఖ్యమంత్రి రాజనర్శింహ  విహెచ్చ్‌నుబుజ్జగించి మౌనదీక్షనుండి విరమింప చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు ఒక సినిమా పేరు గుర్తుకొస్తుంది కదా అదే ఎవడి గోల వాడిది కదా

సిఎం సీటుపై కాపుల కోరిక తీరేదెన్నడు?

రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో తమ వాళ్లు కూర్చోవాలని పదేళ్ల నుంచి కాపుసామాజికవర్గం కలలు కంటోంది. దీనికి ప్రాతిపదిక పాతికేళ్ల క్రితమే పడినా అప్పటి రాజకీయవాతావరణానికి, ప్రస్తుత పరిస్థితులకూ పొంతన లేదు. అయితే గతంలో జరిగిన ఉద్యమాల తీవ్రతను బట్టి ఆ కోరిక మిగుల్చుకున్న ఈ సామాజికవర్గ నేతలు ఇప్పుడు మళ్లీ నానాటికీ మారుతున్న రాజకీయం తమకు అనుకూలమన్న నమ్మకంతో కాలం గడిపేస్తున్నారు.  అయితే ఈ సామాజికవర్గంలో ఉండే తొందరపాటు ఇంకెక్కడా కనిపించదు. అందుకే ఈ కోరికను దాచుకుని ఆ వాతావరణం వచ్చినప్పుడు చెప్పకుండా ముందే బయటపడిపోతున్నారు. దీంతో ఇతరకులస్తులు వీరిని అణిచివేయటానికి ఆ ఒక్కటి చాలు. ఆంథ్రరాష్ట్ర రాజకీయవాతావరణానికి దిక్సూచి తూర్పుగోదావరి జిల్లా. అటువంటి ఈ జిల్లా ఎవరి వైపు మొగ్గుతుందో రాష్ట్రంలో ఆ పార్టీ అథికారంలో ఉంటుంది. దీనికి తాజా ఉదాహరణ ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నింటిలోనూ ఓటమి పాలైనా కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ ఒక్కసీటును గెలుపొందింది. అది చాలు ఆ పార్టీ ముందుకు వెళ్లటానికి అని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు.  గతంలో ఉత్తరకంచి ఉద్యమం ద్వారా తూర్పుగోదావరి జిల్లా నుంచి ముద్రగడపద్మనాభం రాష్ట్రంలో తమ కాపులే అథికారంలో ఉండాలని కృషి చేశారు. అయితే ఈయన చేసిన సామాజిక ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా మద్దతు లభించింది. అయినా ఆయన కోరుకున్నట్లు కాపుసామాజికవర్గ నేతలు సిఎం కాలేకపోయారు. తాజాగా మూడేళ్ల క్రితం మెగాస్టార్‌ చిరంజీవి పీఆర్పీ పార్టీని పెట్టి దాదాపు సిఎం అయిపోయినంత హడావుడి చేశారు. దీన్ని రాష్ట్రప్రజలు అందరూ వ్యతిరేకించటం వల్ల ఆయన పరిమితస్థానాలు సాధించుకుని చివరికి కాంగ్రెస్‌ పార్టీలో తన పార్టీని విలీనం చేశారు. ఈయన సిఎం అయ్యే అవకాశాలున్నప్పుడు  మిగతా సామాజికవర్గాలను వదులుకున్నారు.   దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే సిఎం కావాలని కలలు కంటున్నారు. ఇప్పుడు ఈయన సిఎం అయితే బాగుండుననబోయి అయిపోతారని ప్రకటించి మంత్రి సి.రామచంద్రయ్య ఇరకాటంలో పడ్డారు. అంతేకాకుండా మంత్రికి ఉన్న సామాజిక కుల అభిలాష బయటపడిరదని విమర్శలు చెలరేగుతున్నాయి. ఏదేమైనా ఈ మిగిలిన కల భవిష్యత్తులోనైనా తీరుతుందని ఈ సామాజికవర్గం ఆశతోనే బతుకుతోంది.

రెవెన్యూ అవినీతి అంతమయ్యేదెప్పుడు?

అంతులేని కథ అన్న సినిమా టైటిల్‌కు తగ్గ కథాంశం ద్వారా రచయిత సినీప్రేక్షకులను మెప్పించాడు. అలానే రెవెన్యూశాఖ అవినీతిలో అందవేసిన చేయి అనిపించుకుంటోంది. ఈ శాఖలో అంతర్భాగమైన జిల్లాస్థాయి నుంచి మండలస్థాయి వరకూ అవినీతి కథలు అంతులేకుండా వినిపిస్తున్నాయి. విడివిడిగా ప్రతీజిల్లాలోనూ ఈ శాఖను మామూళ్లతో ప్రజలు ముంచెస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. అయినా అథికారం కేంద్రీకృతమయ్యే శాఖ కాబట్టి దీనికి ఉండే వెయిటేజీ యథాతథంగా కొనసాగుతోంది. ఓ టైటిల్‌డీడ్‌ కావాలన్నా, రేషన్‌కార్డులో పేరు మార్పు, చిరునామామార్పు, ఇంకా కులధృవీకరణ, నేటివిటీ సర్టిఫికేట్లు వంటి పలురకాల సేవలకు నిర్ధారిత ధరలు లేకుండా జారీ కావటం లేదు. ఎంత ఆన్‌లైన్‌ చేసినా తొందరంగా సేవ కావాలనుకునే వారందరూ మండల తహశిల్దార్‌ కార్యాలయానికి వెడుతూనే ఉన్నారు.  అందువల్ల అవసరానికి సరిపడే సొమ్ము వెచ్చించి మరీ సర్టిఫికేట్లు తీసుకువెడుతున్నారు. ప్రభుత్వానికి కీలకమైన ఈ శాఖలోని ప్రతీ ఉద్యోగి పదవీవిరమణ చేసేటప్పటికి మంచి హోదాతో కూడిన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఎసిబి కనుక ప్రతీజిల్లాలోనూ దాడులు చేస్తే తహశిల్దార్‌ స్థాయి అథికారుల నుంచి కనీసం కోటిరూపాయలు లెక్కల్లో లేని సొమ్ము గుర్తించవచ్చని తెలుస్తోంది. దీనికి తాజా ఉదాహరణ కర్నూలు జిల్లా కల్లూరు తహశిల్దార్‌ అంజనాదేవి. ఈమె ఆస్తుల సోదా ఎసిబి చేపడితే కోటిరూపాయల వరకూ విలువ తేలింది. ఈమెకు చెందిన గుంటూరులోని శ్రీనగర్‌, ఆర్టీసీకాలనీ, ఆటోనగర్‌ల్లో కూడా ఎసిబి ఏకకాలంలో దాడులు జరిపింది. ఈ దాడుల్లో హైదరాబాద్‌, గుంటూరు, కర్నూలు ఎసిబి అథికారుల బృందాలు పాల్గొన్నాయి.

అటవీసిబ్బందిపై స్మగ్లర్లదాడులు?

తమ స్మగ్లింగ్‌కార్యాకలాపాలను అడ్డుకుంటున్నారని అటవీసిబ్బందిపై స్మగ్లర్లు నేరుగా దాడులకు దిగుతున్నారు. రాజకీయనాయకుల అండదండలు చూసుకుని స్మగ్లర్లు నేరుగా అటవీశాఖ సిబ్బందిని టార్గెట్‌ చేస్తున్నారని సమాచారం. ఏమైనా న్యాయపరమైన సమస్యలు వస్తే కాచుకునేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్న తరువాత స్మగ్లర్లు తెగిస్తున్నారని తెలుస్తోంది. పార్టీలకు ఫండ్‌ ఇచ్చే ఎవరినీ వదులుకోలేని నేతలు ఇచ్చే భరోసా తమ ప్రాణాల మీదకు తెస్తోందని, ఇటీవల తుపాకులతో స్మగ్లర్లు తిరగటానికి కారణం కూడా రాజకీయ నాయకులే అని అటవీసిబ్బంది వాపోతున్నారు.   కొత్తకొత్త వాహనాలలో తిరుగుతున్న స్మగ్లర్లు అటవీ సిబ్బంది వాడే జీపులకు అసలు దొరకటమే కష్టమవుతోంది. తమ వాహనాన్ని అటవీసిబ్బంది ఛేజింగ్‌ చేసేందుకు ప్రయత్నిస్తే స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఖమ్మంజిల్లా భద్రాచలం మండలం నెల్లిపాక అటవీప్రాంతంలో అటవీసిబ్బంది జీపును స్మగ్లర్ల కారు ఢీకొంది. దీంతో జీపు తిరగబడిరది. అందులో ప్రయాణిస్తున్న అటవీసిబ్బంది తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు అటవీసిబ్బందికి గాయాలయ్యాయి. అసలు అటవీసిబ్బందిపై కక్ష కట్టినట్లు స్మగ్లర్లు వ్యవహరిస్తున్నారు. క్షతగాత్రులను భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను చూసైనా అటవీసిబ్బంది జీపుల స్థానంలో కొత్తకార్లు, కొత్త ఆయుథాలు వినియోగించాలని పరిశీలకులు సూచిస్తున్నానరు.

రీజెన్సీ పవర్‌టెక్‌పై కార్మికుల ఆగ్రహం

ఒక ఉద్యోగిని అన్యాయంగా పనిలో నుంచి తీసేశారని ఆగ్రహించిన 300మంది తమ ఐక్యతను నిరసనకార్యక్రమం ద్వారా చాటుకున్నారు. ఈ అరుదైన ఘటనకు నెల్లూరు జిల్లా మాంబట్టు పారిశ్రామికవాడలోని రీజెన్సీపవర్‌టెక్‌ పరిశ్రమ వేదికైంది. ఈ పరిశ్రమలో కార్మిక సంఘం ఏర్పాటు చేశావంటూ శివతేజ అనే కార్మికుడిని యాజమాన్యం పని నుంచి తొలగించింది. అసలు కార్మిక సంఘం ఏర్పాటు చేస్తే తాము సహించబోమని హెచ్చరికగా యాజమాన్యం ఈ తొలగింపు చేపట్టింది. దీన్ని గమనించిన పరిశ్రమలోని 300మంది కార్మికులు అతనితో పాటు చేతులు కలిపి యాజమాన్యవైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. 360రోజులూ పని చేయాలన్నట్లు యాజమాన్యం వ్యవహరిస్తోందని ఇప్పటికే ఈ పరిశ్రమపై ఫిర్యాదులు ఉన్నాయి. కార్మికులు ఎంత అత్యవసరం వచ్చినా సెలవుపెట్టడానికి వీలులేదని యాజమాన్యం మౌఖికంగా హుకుం జారీ చేస్తోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక్కడ కార్మికులు పని చేస్తున్నారని, యాజమాన్యం నిరంకుశవైఖరి వల్ల ఏనాడో మానేయాల్సి ఉన్నా తమ కుటుంబాల కోసం నెట్టుకువస్తున్నామని కార్మికులు బహిరంగంగానే చెబుతున్నారు. సెలవుల గురించి ఇబ్బందిపెడుతున్న ఈ పరిశ్రమపై లేబర్‌శాఖ ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం వెనుక యాజమాన్యం తనకు ఉన్న పలుకుబడిని చాటుకుందని కార్మికులు అంటున్నారు.  

కిరణ్‌పై కృపారాణి కినుక ?

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై శ్రీకాకుళం ఎంపి కిల్లి కృపారాణి కినుక వహించారు. ఆమె అలక తీర్చాలంటే సిఎం స్వయంగా వెనక్కి వచ్చి ఇందిరమ్మబాటలో పాల్గొనమని కోరాలంటున్నారు. సిఎం కాన్వాయ్‌లోకి ఆహ్వానించలేదని అలిగిన ఆమె కారులోనే భర్తతోపాటు ఉండిపోయారు. తాను అసలు ఎక్కడికి కదలనని, సిఎం తనను చూసి కూడా వెళ్లిపోయారని, స్థానిక ఎంపి అంటే అంత చులకనగా చూస్తే ఎలా అని కృపారాణి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనను సిఎం ఆహ్వానించలేదు సరికదా! అసలు మాట్లాడలేదని కృపారాణి ఈ నిరసన చేపట్టారు.     దీనికి ముందు సిఎం కాన్వాయ్‌లోకి వెడుతుంటే ఈమెకు అనుమతి ఇవ్వలేదు. తనకు కాన్వాయ్‌లోకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఆమె ఎస్పీని నిలదీశారు. ఆయన కూడా ఎంపికి నచ్చచెప్పేందుకు చూసినా ఆమె ససేమిరా అన్నారు. దీంతో చాలాసేపు మాట్లాడిన ఎస్పీ తిరిగివెళ్లిపోయారు. ఎంపి తన భర్తతో కారులోనే నిరసన తెలియజేస్తూ రోడ్డు మీదే ఉండిపోయారు. సి.ఎం. ఇందిరమ్మబాట కార్యక్రమం ముగిసిందని తెలిసిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయినట్లు తెలిసింది.