నయం చేయలేని ఈ వ్యాధి పిల్లలను వికలాంగులను చేస్తుంది..! పిల్లల తల లేదా మెడ సాధారణం కంటే చిన్నగా ఉందా? కండరాలు చాలా బలహీనంగా ఉన్నాయా? మాట్లాడటంలో లేదా అర్థం చేసుకోవడంలో ఇబ్బందిగా ఉందా? ఇలాంటి పిల్లలను నిర్లక్ష్యం చేయకండి. ఇలాంటి పిల్లలకు డౌన్ సిండ్రోమ్ ఉండే అవకాశం ఉంటుంది. అసలు డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? డౌన్ సిండ్రోమ్ అనేది ఒక తీవ్రమైన జన్యుపరమైన సమస్య. దీని కేసులు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. పిల్లలలో ఈ జన్యుపరమైన సమస్య వారి మొత్తం జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. డౌన్ సిండ్రోమ్ సమస్యలో అదనంగా ఒక క్రోమోజోమ్ తో జన్మిస్తారు. దీని అర్థం వారికి 46 క్రోమోజోమ్లకు బదులుగా మొత్తం 47 క్రోమోజోమ్లు ఉంటాయి. ఇది వారి మెదడు, శరీర అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా చాలా మందికి నడవడం లేదా లేవడం వంటి సాధారణ జీవిత కార్యకలాపాలను చేయడంలో సమస్యలు ఉంటాయి. డౌన్ సిండ్రోమ్ సమస్య గురించి అవగాహన పెంచడం, డౌన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులను సమాజాలలో వారు విలువైన వారిగా ఎలా పరిగణించాలో ప్రజలకు అవగాహన కల్పించడం అనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం మార్చి 21న ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశంలో డౌన్ సిండ్రోమ్ ఉన్నవారు.. భారతీయ జనాభాలో డౌన్ సిండ్రోమ్ కనిపిస్తోంది. ఈ సమస్య భారతదేశంలో 800 నుండి 850 జననాలలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. ప్రతి సంవత్సరం 30,000 నుండి 35,000 మంది పిల్లలు దీని బారిన పడుతున్నారని అంచనా. చాలా ఆందోళన చెందాల్సిన విషయం ఏమిటంటే ఈ డౌన్ సిండ్రోమ్ కు చికిత్స లేదు. పిల్లలో డౌన్ సిండ్రోమ్.. డౌన్ సిండ్రోమ్ శారీరక, అభిజ్ఞా, ప్రవర్తనా సమస్యలను కలిగిస్తుంది. డౌన్ సిండ్రోమ్, శారీరక సంకేతాలు సాధారణంగా పుట్టినప్పుడు కనిపిస్తాయి. బిడ్డ పెరిగేకొద్దీ మరింత స్పష్టంగా కనిపిస్తాయి. చదునైన ముక్కు, వాలుగా ఉన్న కళ్ళు, పొట్టి మెడ, చిన్న చెవులు, చేతులు, కాళ్ళు వంటి సమస్యలు ఉండవచ్చు. పుట్టినప్పుడు బలహీనమైన కండరాలు, సగటు ఎత్తు కంటే తక్కువ, వినికిడి, దృష్టి సమస్యలు, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు కూడా డౌన్ సిండ్రోమ్ లక్షణం కావచ్చు. పిల్లలో ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అసలు ఎందుకు ఇది సమస్య కలిగిస్తుంది. డౌన్ సిండ్రోమ్ అనేది క్రోమోజోమ్లకు సంబంధించిన సమస్య. దీనితో పాటు కొన్ని ప్రమాద కారకాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 35 ఏళ్లు పైబడిన మహిళలకు జన్మించిన పిల్లలకు ఈ రుగ్మత వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో ఇంతకు ముందు డౌన్ సిండ్రోమ్ కేసులు ఉంటే, ప్రమాదం పెరుగుతుంది. తల్లిదండ్రుల్లో ఎవరికైనా జన్యుపరమైన రుగ్మత ఉంటే పిల్లలకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఏం చేయాలి? డౌన్ సిండ్రోమ్ సాధారణంగా గర్భధారణ సమయంలో లేదా ప్రసవం తర్వాత నిర్ధారణ అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మొదటి, రెండవ త్రైమాసికంలో గర్భధారణ స్క్రీనింగ్ పరీక్షలు, అంటే రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ ద్వారా డౌన్ సిండ్రోమ్ ప్రమాదాన్ని గుర్తించవచ్చు. డౌన్ సిండ్రోమ్కు శాశ్వత నివారణ లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ సరైన సంరక్షణ ద్వారా జీవన నాణ్యతను మెరుగుపరచవచ్చు. పిల్లలకు మాట్లాడే, సంభాషించే సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి టాక్ థెరపీ ఇవ్వబడుతుంది. అదేవిధంగా కండరాల బలం, సమతుల్యతను మెరుగుపరచడంలో ఫిజియోథెరపీ ప్రయోజనకరంగా ఉంటుంది. డౌన్ సిండ్రోమ్ను నివారించడానికి ఖచ్చితమైన మార్గం లేదు. *రూపశ్రీ.
పిల్లల మనసుని మార్చే రంగులు! రంగుల ప్రభావం మన మనసుపై పడుతుందంటే నమ్మసక్యంగా లేదు కదూ, కాని ఇది అక్షరాల నిజమని చెప్తున్నారు శాస్త్రజ్ఞులు. మనం పిల్లల గదికి వేసే రంగుల ప్రభావం వారి మీద చాలా ఉంటుందిట. ముభావంగా ఉండే పిల్లల్లో హుషారుని నింపాలన్నా, హైపెరాక్టివ్ పిల్లల్ని కుదురుగా కూర్చోబెట్టాలన్నా ప్రత్యేకమైన రంగులు ఉపయోగిస్తే చాలట. వారి ప్రవర్తనా విధానంలో మెల్లిగా మార్పులు చేసుకుంటాయట. ఇది వింటే కాస్త కొత్తగా అనిపిస్తున్నా దీనికి సంబంధించి పిల్లలపై చేసిన పరిశోధనలు మంచి ఫలితాలని ఇచ్చాయని నొక్కి చెప్తున్నారు శాస్త్రజ్ఞులు. మరి మీ పిల్లల మనస్తత్వానికి ఎలాంటి రంగు ఎక్కువగా వాడాలో ఎంచుకోండి. ఇంటిలో వాళ్ళ రూమ్ కి వేసే కలర్, వాళ్ళ స్కూల్ బ్యాగ్ కలర్, వాళ్ళు వేసుకునే బట్టల కలర్ ఇలాంటి వాటికి ఏ సమయంలో ఎలాంటివి ఎంచుకోవాలో ఒక నిర్ణయానికి రావచ్చు. * రెడ్ కలర్ - ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడకుండా నలుగురిలో కలవటానికి ఇబ్బంది పడే పిల్లల రూం కి ఎరుపు రంగు వేస్తె వాళ్ళల్లో హుషారు పెరుగుతుందట ఎందుకంటే ఎరుపు మనిషి మెదడులో రక్త ప్రసరణ త్వరగా జరిగేలా చేస్తుందిట. అదే హైపెరాక్టివ్ పిల్లల రూంలో ఎరుపు రంగు వేస్తే గనక ఇక వాళ్ళని ఆపటం ఎవరితరము కాదు. వాళ్ళ హుషారు రెండింతలు పెరిగి చదువు మీద ధ్యాస తగ్గి ప్రవర్తనలో విపరీతధోరణులు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్తంత జాగ్రత్త సుమా. * ఆరంజ్ కలర్ - పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచగల శక్తి ఈ నారింజ రంగుకి ఉందట. ఎవరి మీదా ఆధారపడకుండా వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించటానికి దోహదపడుతుందట. అన్నివిషయాలలో పిల్లలు మీ మీద ఆధారపడుతుంటే మీరు ఈ రంగుని ఎంచుకోవచ్చు. * గ్రీన్ కలర్ - పిల్లల్లో కాన్సంట్రేషన్ పెరగడానికి ఈ రంగు బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. వారిలో చదువుపట్ల ఆసక్తిని కూడా పెంపొందిస్తుందట. వాళ్ళల్లో ఉన్న యంగ్జైటి తగ్గి వాళ్ళని ఎప్పుడూ కూల్ గా ఉంచుతుంది కూడా. * బ్లూ కలర్ - ఎరుపు రంగుకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది ఈ నీలం రంగు. అది మెదడులోని రక్త ప్రసరణని రెట్టింపు చేసి గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తే ఈ నీలం రంగు పిల్లల మెదడు చాలా ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని.నిద్రకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నా అవి కూడా దూరమయ్యి హాయిగా నిద్రపడుతుందట కూడా. హైపేరాక్టివ్నెస్ ఎక్కువగా ఉండే పిల్లల కోసం ఎక్కువగా ఈ రంగుని ఎంచుకున్నట్లయితే వారిలో దూకుడు స్వభావం తగ్గుతుందని చెప్తున్నారు. * ఎల్లో కలర్ - పిల్లల్లో ఏకాగ్రత పెరగటానికి పసుపు రంగు ఉపయోగపడుతుందట. వారు స్థిరంగా కూర్చుని చదవాలన్నా లేడిన ఏదైనా పని కుదురుగా చేయాలన్నా ఈ రంగుని ఎంచుకోవచ్చు అని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఇలా రంగులు మనిషి పైన వాటి ప్రభావాన్ని చూపిస్తాయని ఎన్నో అధ్యయనాలు రుజువు చేసాయి. రంగుల పట్ల కాస్తంత అవగాహన ఉంటే చాలు మన పిల్లల మనసుని మనం సునాయాసంగా మార్చుకుని హ్యాపీ గా ఉండచ్చు. కేవలం గదికి వేసే రంగులే కాదు వారి కోసం వాడే ప్రతి వస్తువుని సరిపడే రంగులలో మనం ఎంచుకున్నట్లయితే వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడరు మనని ఇబ్బంది పెట్టరు. - కళ్యాణి
కొల్లాజెన్ను పెంచి ముడతలు తగ్గించే ఈ డ్రింక్స్ తాగితే యంగ్గా ఉంటారు..! కొల్లాజెన్ శరీరానికి అవసరమైన ప్రోటీన్. ఇది చర్మం, జుట్టు, గోర్లు, కీళ్ళు, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా చర్మం వదులుగా మారుతుంది. ముడతలు వస్తాయి. అందుకే కొల్లాజెన్ స్థాయిలు మెరుగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొల్లాజెన్ పెంచడానికి 5 పానీయాలు బాగా సహాయపడతాయి. అవేంటంటే.. బెర్రీ స్మూతీ.. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి చాలా అవసరం, ఎందుకంటే ఇది అమైనో ఆమ్లాలను కొల్లాజెన్గా మార్చడంలో సహాయపడుతుంది. బెర్రీ స్మూతీని తయారు చేయడానికి, ఒక కప్పు బెర్రీలు, ఒక అరటిపండు, ఒక కప్పు పెరుగు లేదా బాదం పాలు, ఐస్ క్యూబ్లను బ్లెండర్లో వేసి బ్లెండ్ చేయాలి. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఆకుకూరల జ్యూస్.. పాలకూర, కాలే, ఇతర ఆకుకూరలలో క్లోరోఫిల్ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పదార్థాలు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆకుపచ్చ కూరగాయల జ్యూస్ తయారు చేయడానికి పాలకూర, దోసకాయ, సెలెరీ, ఆపిల్లను కలిపి జ్యూసర్లో గ్రైండ్ చేసుకోవాలి. దీనికి నిమ్మరసం జోడించడం ద్వారా విటమిన్ సి మొత్తాన్ని మరింత పెంచవచ్చు. బోన్ జ్యూస్ లేదా సూప్.. ఎముక రసం కొల్లాజెన్ కు సహజ మూలం. దీనిని చికెన్ లేదా మటన్ ఎముకలను ఉడకబెట్టడం ద్వారా తయారు చేస్తారు. ఇందులో అమైనో ఆమ్లాలు, గ్లైసిన్, ప్రోలిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి. బోన్ జ్యూస్ సూప్ లాగా లేదా నేరుగా తినవచ్చు. ఇది కొల్లాజెన్ను పెంచడమే కాకుండా జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది . కొబ్బరి నీళ్లు, కలబంద రసం.. కొబ్బరి నీళ్లు, కలబంద రసం రెండూ చర్మానికి చాలా మేలు చేస్తాయి. కొబ్బరి నీరు హైడ్రేషన్ను నిర్వహిస్తుంది. కలబంద రసంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ రెండింటినీ కలిపితే రిఫ్రెషింగ్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. రెండు టీస్పూన్ల కలబంద రసం ఒక గ్లాసు కొబ్బరి నీళ్లలో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి . నారింజ, క్యారెట్ జ్యూస్.. నారింజ, క్యారెట్లు రెండింటిలోనూ విటమిన్ సి, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది, బీటా కెరోటిన్ చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా చేస్తుంది. నారింజ, క్యారెట్ రసం తయారు చేయడానికి, జ్యూసర్లో రెండు నారింజ, ఒక క్యారెట్ను గ్రైండ్ చేసుకోవాలి. దానికి అల్లం ముక్కను జోడించడం ద్వారా రుచిని కొల్లాజెన్ కంటెంట్ పెరగడాన్ని మరింత పెంచుకోవచ్చు. *రూపశ్రీ.
పిల్లలకు తల్లిదండ్రులు నేర్పవలసిన పాఠాలు! పిల్లల ఎదుగుదలను చూసి సంతోషించని తల్లిదండ్రులు ఉండరు. అయితే ఈ క్రమంలో తెలియకుండానే వాళ్లకి కొన్ని విషయాలలో అతిగా స్వేచ్ఛను ఇస్తుంటారు. మరికొంతమంది .. పిల్లలకు అస్సలు స్వేచ్ఛ ఇవ్వకుండా ప్రతీ విషయంలో తల్లిదండ్రులు చెప్పినట్లే చేయాలని వాళ్ల మీద విపరీతమైన ఒత్తిడి తెస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు మన మాట లెక్కచేయకపోవడం లేదా అతి క్రమశిక్షణ వలన యాక్టివ్గా లేకపోవడం వంటి దుష్ప్రభవాలు కలిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల వలన పిల్లలు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల మాట లెక్కచేయడం మానేసి వారికి నచ్చినరీతిలో వారు ఉంటారు. అంతేకాకుండా వారికి ఉండే చిన్న చిన్న ఇబ్బందులను కూడా మనతో షేర్ చేసుకోవడం తగ్గించి వారికి వారే సొంత నిర్ణయాలు తీసుకొని పెడదారిన పడే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే పిల్లలను ఎలా పెంచాలో అనే విషయం గురించి తెలుసుకుందాం. 1. చదువులో గాని, ఆటల్లో గాని వారికి కావాల్సిన ప్రేరణను మనం అందించాలి. తద్వారా వారిలో ఏదైనా సాధించగలం అనే పాజిటివిటీ పెరుగుతుంది. ప్రతీ విషయానికి వాళ్ల మీద చిరాకు పడడం కూడా అంత మంచిది కాదు. ఇది వారు చెడు దారి వైపు వెళ్లేందుకు దోహదపడుతుంది. 2. పిల్లలకు చిన్నప్పటి నుండి సహాయపడే గుణాన్ని అలవాటు చేయాలి. చిన్నతనం నుండి వారిలో స్వార్ధాన్ని నూరిపోయకూడదు. ఇతరుల అవసరాలకి స్పందించేలా వారిని ప్రోత్సహించాలి. అందువలన వారు అందరితో కలివిడిగా ఉంటూ స్నేహపూరిత వాతావరణాన్ని అలవాటు చేసుకుంటారు. వారిలో ఏదో సాధించాలనే ఆశయంతో పాటు ఇతరులకు సహాయపడాలనే తపన కూడా ఉండేలా వారిని ప్రోత్సహించాలి. 3. కొన్ని సందర్భాల్లో తెలియకుండానే పిల్లలపై కోపాన్ని చూపిస్తాం . ఉదాహరణకు వారు మన కళ్ల ముందే ఏదైనా గోడ ఎక్కడం లేదా ప్రమాదకర వస్తువులతో ఆడుకోవడం వంటివి చేసినప్పుడు పట్టరాని కోపం వస్తుంది. అయితే ఇలాంటి సందర్భాలలో మనం కొంచెం నిగ్రహంగా ఉంటూ వారిని దగ్గరకు తీసుకొని అలా చేయకూడదని నెమ్మదిగా చెప్పాలి. దాని వలన జరిగే అనర్ధాలను వారికి వివరించాలి. మనం ఎంత ఎక్కువ వారి మీద కోపం పెంచుకుంటే వారు అంత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది. వారి అలవాటును మనం వ్యతిరేకించడం వారు సహించలేరు. అందుకే ముందుగా వారితో మంచిగా మాట్లాడి వారిని మచ్చిక చేసుకోవాలి. 4. చాలా మంది తల్లితండ్రులు తమ బాగా చదువుకోవాలని అనుకుంటారు . అందువల్ల వారికి ఏ పని చెప్పకుండా ఎప్పుడూ చదువుకోమని చెప్తూ ఉంటారు .. అది చాలా తప్పు అలా చేయడం వల్ల పిల్లలు చాలా వత్తిడికి గురవుతారు . దానివలన లేనిపోని ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉంది .. పిల్లలకి చదువు విలువ ఏంటో అర్దం అయ్యేలా చెప్పండి .. అలాగే ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం అలవాటు చేయండి .. 5. అలాగే తల్లులు తమ పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండాలి .. చాలామంది పిల్లలకి స్కూల్ లో జరిగిన ఇంట్లో వాళ్ళకి చెప్పడం అలవాటు . ఇంట్లో వారి మాటలు వినేవారు లేకపోతే వారు బయట స్నేహితులకి ఎక్కువ అలవాటు అయ్యే అవకాశం ఉంది . వారితో ఎక్కువగా మాట్లాడుతుండడం వల్ల వాళ్ళు కూడా ఏ విషయాలు దాచుకోకుండా అన్నీ మీతో షేర్ చేసుకునే అవకాశం ఉంది. అది పిల్లల భవిష్యత్తు కి ఎంతో మేలు చేస్తుంది.
పిల్లల్లో డిప్రెషన్.. గుర్తించటం ఎలా! 1. ‘డిప్రెషన్’ ఈ మధ్యకాలంలో తరచూ అందరిదగ్గర మనకి వినిపిస్తున్న మాట ఇది. ఈ డిప్రెషన్ మనసులోని భావాలను ఎవరితోనూ పంచుకోలేక, లోలోపలే కుమిలి పోయే, ఒకలాంటి అయోమయ స్థితికి తీసుకువెళుతుంది ఎవరినైనా. ఏ వయసువారినైనా ఈ డిప్రెషన్ చుట్టుముట్టచ్చు. కాస్త పెద్దవాళ్లకయితే తామున్న స్థితి గురించి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. దాని నుంచి బయట పడటానికి కనీసం ప్రయత్నమైనా చేయగలుగుతారు. కానీ పిల్లలు అలా కాదు. అసలు తమకి ఏమవుతుందో కూడా అర్థం చేసుకోలేని వయసు వారిది. కాబట్టి పిల్లల విషయంలో మనమే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 2. పిల్లలోని డిప్రెషన్ను సరైన సమయంలో గుర్తించకపోతే, పిల్లల వికాసాన్ని చేజేతులారా మనమే అడ్డుకున్న వాళ్ళమవుతాం అంటున్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డా॥ గౌరీదేవిగారు. డిప్రెషన్తో ఉండే పిల్లల లక్షణాలు ఇలా వుంటాయంటూ కొన్ని లక్షణాలని తెలియచేస్తున్నారు. అవి ఏంటంటే ఎప్పుడు చూసినా దిగులుగా ఉండటం, ప్రతీ విషయానికి పేచీ పెట్టి ఏడవటం, ఎక్కువగా భయపడటం, ఆటపాటల పట్ల కూడా ఉత్సాహం చూపకపోవటం, అమ్మ కొంగుపట్టుకునే తిరగటం, ఎప్పుడూ ఏదో ఒక నొప్పి ఉందంటూ చెబుతుండటం, ఆహారంపట్ల ఎక్కువ ఇష్టం ఇష్టం చూపించటం, లేదా అస్సలు ఇష్టపడకపోవటం ఇలా సాధారణ స్థితికి భిన్నంగా ఉండే లక్షణాలు కనిపిస్తాయట. 3. పిల్లలోని డిప్రెషన్ను గుర్తించటం ఎలాగో చెప్పుకుంటున్నాం కద.. అసలు ఈ డిప్రెషన్ ఎందుకు వస్తుందీ అన్న దానికీ పరిశోధకులు చెబుతున్న కారణం ‘మొదడులో డోపమిన్, సిరోటానిన్ అనే పదార్ధాల ప్రమాణం ఎక్కువ, తక్కువ అవడం వల్ల డిప్రెషన్కు లోనవుతారట.’ అలాగే చిన్నప్పుడు బాధాకర అనుభవాలు కూడా డిప్రెషన్ను కలుగచేస్తాయట. కుటుంబంలోని తల్లిదండ్రుల పోట్లాటలు, స్కూలు టీచర్లు, తోటివారి ప్రవర్తన వంటివి కూడా పిల్లల్లో డిప్రెషన్కు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. 4. పిల్లలో అసహజ లక్షణాలు అంటే కోపం, భయం, వంటివి కనిపిస్తే ‘ఎందుకు’! అంటూ తల్లిదండ్రులుపిల్లల్ని అరిచి, తిట్టి, హేళన చేస్తుంటారు. అది వారిని మరింత కృంగదీస్తుంది. కాబట్టి పిల్లల్లో అసహజ లక్షణాలు కనిపిస్తే కారణం ఏమైవుంటుంది అని ఆలోచించి, వారిని ఆ స్థితిలో నుంచి బయటకు తీసుకురావటానికి ప్రయత్నించాలి అంటున్నారు నిపుణులు. 5. మన ప్రయత్నాలేవి ఫలించనపుడు మానసిక వైద్యులను సంప్రదించటానికి సంకోచించకూడదు. డిప్రెషన్ అనేది ఒక మానసిక స్థితి అంటే.. తగిన సమయంలో గుర్తించి స్పందిస్తే పరిస్థితిని చక్కదిద్దుకోవచ్చు అంటున్న నిపుణుల సూచనలు పిల్లల చిన్న ప్రపంచాన్ని సంతోషంతో నింపటానికి సహాయపడతాయి. - రమ
వాళ్ళని ఆడనివ్వండి.. అలసిపోనివ్వండి... పిల్లలు దూకుడుగా ఉంటే తల్లులకు కాస్త కంగారుగా వుంటుంది. ఎక్కడ క్రింద పడతాడో దెబ్బలు తగిలించుకుంటాడోనని జాగ్రత్త... జాగ్రత్త అంటూ వెంట వెంటే తిరుగుతూనే వుంటుంది అమ్మ, కానీ అల్లరి బుడతలు ఓ చోట కూర్చుంటారా? కుర్చీలు ఎక్కి, సోఫాలెక్కి దూకటం, పరుగులు పెట్టడం మామూలే. కొంతమంది అమ్మమ్మలు, నాయనమ్మలు పసివాడు ఉదయం నుంచి చక్రంలా తిరుగుతూనే వున్నాడు కాళ్ళు నొప్పి వస్తాయో ఎమో అంటూ బాధపడతారు. కానీ అమెరికాలోని ఇండియానా వర్సిటీ శాస్త్రవేత్తలు మాత్రం అది ఎంతో మంచిది, పిల్లలని వారించద్దు, వీలయితే చిన్న వయస్సులో ఉండగా వారితో వ్యాయామాల వంటివి కూడా చేయించండి అంటున్నారు. చిన్నతనంలో చేసే వ్యాయామం వల్ల జీవితకాలం ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. చిన్నతనంలో బాగా శారీరక అలసట వచ్చేలా ఆటలు అడిన పిల్లలు, ఎముకల చలనం ఎక్కువగా ఉండేలా పరుగులు పెట్టి ఆడిన పిల్లలు, అలాగే చిన్నప్పటి నుంచి వ్యాయామాలు చేసిన పిల్లల్లో పెద్దయ్యాక వారి ఎముకలు పటిష్టంగా ఉండటం వీరు నిర్వహించిన ఓ పరిశోధనలో గుర్తించారుట. చిన్నతనంలో వ్యాయామాల వల్ల ఎముకల్లో అదనంగా బాహ్య పొరలు ఏర్పడటం గమనించారు వీరు. దీనివల్ల భవిష్యత్తులో ఎముకలు విరిగే ప్రమాదం వుండదని, కీళ్ళ నొప్పుల వంటివి త్వరగా రావని చెబుతున్నారు వీరు . పిల్లల ఆటలు వారి ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయనే విషయాన్ని నిర్ధారించు కోవటానికి శాస్త్రవేత్తలు కొంత మంది పిల్లలపై కొన్ని సంవత్సరాల పాటు పరిశోధనలు జరిపారు, కొంతమంది పిల్లలతో కొన్ని నెలల పాటు చిన్నపాటి వ్యాయామాలు చేయించారట. ఆ సమయంలో వారి ఎముకల ఎదుగుదలని నమోదు చేసినపుడు వ్యాయామం చేయకమునుపు కంటే, వ్యాయామం చేసిన తరువాత ఎముక పెరగటం గమనించారుట. ఎముక బలంగా ఉన్నప్పుడే అది ఎక్కువకాలం పాటు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ప్రత్యేకంగా పిల్లలతో వ్యాయామాల వంటివి చేయించలేం అనుకుంటే కనీసం పిల్లల్ని అడుకోనివ్వమని చెబుతున్నారు. వారి మానాన వారిని వదిలేస్తే వాళ్ళు అటు,ఇటు తిరుగుతూ ఆడుకుంటూ వుంటారు . ఏమాత్రం కదలికకి అవకాశం ఇవ్వకుండా పిల్లలు పడిపోతారనే భయంతో చంకన వేసుకు తిరగటం వంటివి చేయటం మంచిది కాదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎదిగే వయసులో ఎముక బలిష్టంగా ఉంటేనే ఆ తర్వాత కాలంలో ప్రయోజనం పొందవచ్చని, అదే అ సమయంలో కావల్సినంత కదలిక లేకుండా పిల్లల్ని ఒకేచోట కూర్చోబెట్టటం వంటివి చేస్తే ఫలితాలు భిన్నంగా ఉంటాయని హెచ్చరిస్తునారు. అంతే కాదు పౌష్టికాహారం కూడా పిల్లల్లో ఎముకలు ఆరోగ్యంగా ఎదగటానికి సహాయపడుతుందని, పిల్లలు తినరంటూ ఎదో ఒకటిలే అని పెట్టడం వంటివి చేసే తల్లులు ఒకసారి ఆలోచించటం అవసరమని కూడా చెబుతున్నారు ఆహారం, వ్యాయామం వంటివి పెద్దలకే కాదు పిల్లలకూ ముఖ్యమేనని గట్టిగా హెచ్చరిస్తున్నారు వీరు. ఒకప్పుడు పిల్లలు స్కూలు నుంచి వస్తే ఓ రెండు, మూడు గంటల పాటు ఆరుబయట ఆడుకొనేవారు. ఊర్లో ఎక్కడికి వెళ్ళాలన్నా ఎంచక్కా నడచి వెళ్ళేవారు. కానీ ఇప్పుడో... పిల్లలు ఇంటి నుంచి అడుగు బయట పెడితే స్కూల్ బస్సు, తిరిగి స్కూల్ బస్సు దిగి ఇల్లు. టి.వి., వీడియో గేమ్స్ వంటివి పిల్లలని కదలకుండా ఓ చోట కట్టిపడేస్తున్నాయి. దాంతో నడక నేర్చిన పిల్లల నుంచి స్కూల్ పిల్లల దాకా అందరూ ఉరుకులు, పరుగులు తగ్గించారు. ఆ ప్రభావం వారి ఎముకల ఎదుగుదలపై, వాటి ఆరోగ్యంఫై తప్పక ఉంటుందని నిపుణులు చెబుతున్న మాట తేలికగా తీసుకోటానికి లేదు. అందువల్ల పిల్లలని ఓ కంట కనిపెడుతూనే వారిని స్వేచ్చగా ఆడుకోనివ్వటం అవసరం. వీలయినంతలో పిల్లలు, పెద్దలు వ్యాయామాలు వంటివి చేయటం మంచిది అని సూచిస్తున్నారు నిపుణులు. మరి ఈ విషయాన్ని ఆలోచిస్తారు కదూ.. ఆలోచించడమే కాదు.. తప్పకుండా అచరణలో కూడా పెట్టాలి. ఎందుకంటే ఈ ఆలోచన, ఆచరణ మీరు ఎంతగానో ప్రేమించే మీ పిల్లల భవిష్యతుకు ఆరోగ్యకరమైన బాట పరుస్తాయి. -రమ
ఈ రోజుల్లో జుట్టు తెల్లబడటం అనే సమస్య చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు తెల్లజుట్టు కేవలం వయసు అయిపోయిన వారిలోనే కనిపిస్తుండేది. కానీ ఇప్పుడు యువతలో కూడా కనిపిస్తోంది. మరీ దారుణంగా చిన్నపిల్లలలో కూడా తెల్లజుట్టు కనిపించడం ఆందోళనకు గురిచేసే అంశం. చాలా మంది తెల్లజుట్టును చూసి గందరగోళానికి, ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఇలాంటి ఆందోళనలు సమస్యను ఎక్కువ చేస్తాయి. మరికొందరు కాంప్రమైజ్ అయిపోయి కలర్ డైలు వాడుతూ తెల్లజుట్టును కవర్ చేసుకుంటారు. అయితే వీటన్నింటికి బదులు తెల్ల జుట్టును నల్లగా మార్చే పరిష్కారాన్ని మాత్రమే కాకుండా.. అసలు తెల్ల జుట్టు సమస్యకు మూలం ఏంటనే విషయాన్ని తెలుసుకోవడం ముఖ్యం. తెల్ల జుట్టు సమస్యకు కారణాలు.. ఈ తెల్లజుట్టు సమస్య అస్సలు రాకూడదు అంటే పాటించాల్సిన చిట్కాల గురించి తెలుసుకుంటే.. ధూమపానం.. ధూమపానం క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు మాత్రమే కాకుండా జుట్టు బూడిద రంగులో మారడానికి కూడా కారణమవుతుంది. కేవలం నేరుగా సిగరెట్, బీడి, పొగాకు తీసుకునేవారే కాదు.. పరోక్షంగా ఈ పొగను పీల్చేవారు కూడా ఈ సమస్య బారిన పడే అవకాశాలు ఉన్నాయట. జుట్టు నెరయడం, ధూమపానం మధ్య సంబంధం ఉందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే ధూమపానం వల్ల రక్త ప్రసరణ తగ్గుతుంది. దీని వలన జుట్టుకు తగినంత పోషకాలు అందవు. బలహీనత కారణంగా జుట్టు బూడిద రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. యోగా.. యోగా చేయకపోవడం వల్ల శరీరం నీరసంగా మారడమే కాకుండా, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. యోగా లేదా మరే ఇతర శారీరక శ్రమలో పాల్గొననప్పుడు, వృద్ధాప్యం త్వరగా వస్తుంది. అది జుట్టును కూడా ప్రభావితం చేస్తుంది. జుట్టు బూడిద రంగులోకి మారడానికి ఇదే కారణం. యోగా చేయడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఇది జుట్టుకు ఎక్కువ పోషణను అందిస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. పోషణ.. జుట్టు తెల్లబడటానికి ఒక ప్రధాన కారణం పోషకాహార లోపం. తగినంత పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు తిననప్పుడు జుట్టుకు అవసరమైన పోషకాలు లభించవు. దీనివల్ల అది బలహీనంగా మారుతుంది. త్వరగా నెరిసిపోతుంది. అందువల్ల ఆహారంలో ఒమేగా 3, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని జోడించాలి. జంక్ ఫుడ్ మానేయాలి. శుభ్రత.. జుట్టు సరిగ్గా కడగకపోతే అది కూడా బూడిద రంగులోకి మారడానికి కారణమవుతుంది. ఎందుకంటే జుట్టును సరిగ్గా కడగకపోతే, తలపై మురికి పేరుకుపోతుంది, దీని వలన రంధ్రాలు మూసుకుపోతాయి, జుట్టు బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది. అలాగే, మరు ప్రతిరోజూ జుట్టును కడుక్కుంటే అది తలలోని సహజ నూనెను కూడా తొలగిస్తుంది. జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది. అందువల్ల జుట్టును వారానికి 2-3 సార్లు మాత్రమే కడగాలి. ఒత్తిడి.. ఒత్తిడి అన్ని విధాలుగా హానికరం. అది ఆరోగ్యం అయినా, చర్మం, జుట్టు అయినా, ఒత్తిడికి గురైనప్పుడు, మన శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయి పెరుగుతుంది, ఇది జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తుంది. జుట్టు తెల్లబడటం ప్రక్రియను వేగవంతం చేస్తుంది. కాబట్టి ధ్యానం చేసి ఒత్తిడిని తగ్గించుకోవాలి. *రూపశ్రీ.
అందమైన బుజ్జాయిల కోసం చిట్టి పాపాయి ఏం చేసినా, ఎలా వున్నా అందమే. అలా అని అమ్మ పాపాయిని తయారుచేయడంలో రాజీ పడగలదా! అందాల బొమ్మని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు తాపత్రయపడుతుంది. అసలే పాపాయిలతో ఫుల్ బిజీగా వుండే అమ్మలకి మార్కెట్లో పాపాయిల కోసం కొత్తగా వచ్చే ఫ్యాషనబుల్ ఐటమ్స్ గురించి తెలుసుకోవడం కొంచెం కష్టమే. అందుకే బుజ్జిపాపని ఒక్క క్షణంలో అందంగా సిద్ధం చేసే సరికొత్త హెయిర్ బాండ్స్ని పరిచయం చేస్తున్నాం. రకరకాల రంగుల్లో డిజైన్లలో ఇవి దొరుకుతాయి. బుజ్జి పాప తలపై అందంగా అమరిపోయే వన్నెలు చిందిస్తాయి. ఒక్క పువ్వు బ్యాండ్ పెట్టి చూడండి ఎంత అందంగా మెరిసిపోతుందో మీ చిట్టిపాపాయి. -రమ
చలికాలంలో పసిపిల్లల సెన్సిటివ్ హెయిర్ కోసం ఇలా కేర్ తీసుకోండి..! పిల్లల ఆరోగ్యం విషయానికి వస్తే చలికాలంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. పొడి, చల్లని గాలి నుండి పిల్లల చర్మాన్ని రక్షించడమే కాదు, వారి జుట్టును ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. చలికాలంలో పొడి గాలి తలలో తేమను తగ్గిస్తుంది. దీని వల్ల దురద సమస్య పెరగడమే కాకుండా జుట్టు కూడా పాడవుతుంది. పెద్దవాళ్లు బయటకు చెప్పుకున్నట్టు, సమస్యను గురించి ఆలోచించినట్టు పిల్లలు ఆలోచించలేరు. వ్యక్తం చేయలేరు. అందుకే చిన్న పిల్లల విషయంలో తల్లులే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు తమ తలను పదే పదే గోకడం, చిరాకుగా అనిపించడం లేదా పిల్లవాడు తన తలను పదేపదే తాకడం గమనించినట్లయితే, అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు వైద్యులు సూచించిన, పిల్లలకు రెకమెండ్ చేయబడిన షాంపూ ఉత్పత్తులను మాత్రమే వాడాలి. సాధారణంగా చలికాలంలో జుట్టు సమస్యలు పెరుగుతాయి. తక్కువ ఉష్ణోగ్రతలు, పొడి గాలితో పాటు ఇంట్లోని వేడి పిల్లల చర్మం, తలలో తేమను కోల్పోయేలా చేస్తుందని చిన్న పిల్లల నిపుణులు అంటున్నారు. ఇది చాలా దుష్ప్రభావాలను కలిగిస్తుంది. పిల్లల తల చర్మం పెద్దవారి కంటే చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే అది చాలా తొందరగా పొడిగా మారడం, పొరలుగా మారడం, దురద పెరగడం వంటి వాటికి దారి తీస్తుంది. చలికాలంలో పిల్లలకు ఎంత తరచుగా తల స్నానం చేయించాలి? చిన్న పిల్లల నిపుణుల ప్రకారం.. అవసరాన్ని బట్టి పిల్లలకు జుట్టును వారానికి ఒకటి లేదా రెండుసార్లు తలస్నానం చేయించడం సిఫార్సు చేశారు. పిల్లలకు స్నానం చేయడానికి గది ఉష్ణోగ్రత లేదా గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. ఇది కాకుండా, జుట్టు కడగడానికి ముందు లేదా తర్వాత, బేబీ సేఫ్ ఆయిల్తో తలపై తేలికగా మసాజ్ చేయాలి. ఇది స్కాల్ప్కు పోషణను అందిస్తుంది, సరైన రక్త ప్రసరణను నిర్వహిస్తుంది. *రూపశ్రీ.
పిల్లల జీవన నైపుణ్యం పెంచుదాం పిల్లలు బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించుకొని, బాగా డబ్బు సంపాదించి సుఖంగా బతకాలి అని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. అయితే సుఖంగా బతకటానికి చదువు, ఉద్యోగం, డబ్బు ఇవి మాత్రమే చాలా? జీవితాన్ని అందంగా, ఆనందంగా మార్చుకోవాలంటే డబ్బు మాత్రమే కాక మరికొన్ని కూడా కావాలి. జీవన నైపుణ్యాలనండి లేదా మరే పేరుతోనైనా పిలవండి. తప్పనిసరిగా ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలకి నేర్పించాల్సిన అంశాలు కొన్ని వున్నాయి. అవి పిల్లల వ్యక్తిత్వంలో భాగంగా మారాలంటే తప్పనిసరిగా ఆ పాఠాలు వారి బుడిబుడి అడుగులతోపాటు మొదలు కావాలి. నాలుగు గోడల మధ్య మొక్క పెరగదు: ఎప్పుడు గుర్తుచేసుకున్నా తియ్యటి అనుభూతులు చుట్టుముట్టేలా ఉండాలి వారి బాల్యం. ఆడటం, ఓడటం, ప్రకృతి నుంచి పాఠాలు నేర్చుకోవటం, పడటం, లేవటం, అన్నీ జీవననైపుణ్యాలే. వాటి నుంచి తప్పించి పిల్లలని నాలుగు గోడల మధ్య పెట్టి జీవితాన్ని జీవించటం ఎలాగో నేర్పించాలనుకోవటం హాస్యాస్పదం కాదంటారా? నాటిన విత్తనం మొలకెత్తి, ఆ మొలక మొక్కై, ఆ మొక్క చెట్టు అయ్యి, ఆ చెట్టు వృక్షంగా మారటం క్రమబద్ధమైన ఎదుగుదలకి, నిలువెత్తు నిదర్సనం. పిల్లలతో ఓ విత్తు నాటిస్తే చాలు ఎదగటమంటే ఎలా వుండాలో వారికి ప్రత్యకంగా నేర్పించక్కరలేదు. ప్రోత్సహించడం చాలా ముఖ్యం: ఉద్యోగాల బజార్లో మనల్ని మనం ఒక బ్రాండ్గా మార్కెట్ చేసుకోవటానికి మాటకారితనమే పెట్టుబడి. వ్యక్తిగత జీవితానికి మాటే పెట్టని కోట. ఎవర్ని వారు వ్యక్తం చేసుకోవటానికి మాటను మించిన మార్గం వేరే ఏముంది చెప్పండి! మాట్లాడితే నలుగురూ మంత్రం వేసినట్టు వినాలి. ఆ నైపుణ్యం, ఒక్క రోజులో రాదు, సాధన కావాలి. అది చిన్నప్పుడే మొదలు కావాలి. అది అమ్మానాన్నలే ప్రోత్సహించాలి. అందుకే అదుపు, ఆజ్ఞల పేరుతో పిల్లల నోటికి తాళం వేయద్దు. నీకేం తెలీదంటూ మాట్లాడనీకుండా చేయద్దు. వారి ఆత్మ విశ్వాసాన్ని మొగ్గలోనే తుంచేయద్దు. మాట్లాడనీయండి, మనసులోని మాటలు పెదాలు దాటేలా ప్రోత్సహించండి. అస్పష్టమైన భావాలు సృష్టంగా బయట పడటమెలాగో నేర్పించండి. పిల్లలు తమ బలమైన వాదనని వినిపిస్తుంటే ముచ్చటగా చూడండి. ఎందుకంటే ఆ లక్షణమే నలుగురి మధ్య ఉన్నవాడిని నలుగురిని నడిపించేవాడిగా మారుస్తుంది. సానుకూల దృక్పథం పెంచాలి: ఇది పిల్లలుగా ఉన్నప్పుడే వారి మనసుల్లో నాటితే వారితో పాటు పెరిగి, పెద్దదవుతుంది. పిల్లలకి గెలవటం ఎంత అవసరమో చెప్పినట్టే ఓడిపోవటం తప్పేంలేదని కూడా కూడా చెప్పాలి. ఆశ పడటం ఎంత బావుంటుందో, సర్దుకు పోవటం కూడా అంతే ముఖ్యమని చెప్పాలి. ఏ పరిస్థితుల్లోనైనా సానుకూలంగా ఆలోచించటం అలవాటు చేయాలి. ఆశావాద దృక్పథాన్ని విడకూడదని హెచ్చరించాలి, బుజ్జగించి చెప్పాలి. రోజువారి ఆటపాటల నుంచి పరీక్షల్లో ఫలితాల దాకా ఉదాహరణలని చూపించి చెప్పాలి. చిన్న మనసుల్లో గెలుపు ఓటములు ఏవీ శాశ్వతం కాదని నాటుకుంటే చాలు... సప్త సముదాల అవతల వున్నా ఆ బిడ్డ ఆత్మ స్థైర్యంతో ప్రపంచాన్ని ఎదుర్కోగలడు. -రమ
అనుబంధంతో అల్లుకోండి పిల్లలతో మంచి అనుబంధం పెంచుకోవాలంటే ఏం చేయాలి..? అమ్మలందరి ప్రశ్న అదే... ఎందుకంటే వాళ్ళని బెదిరించి, బయపెట్టి మాట వినేలా చేసే రోజులు పోయాయి. చిన్నతనంలో అమ్మ ఏం చెబితే అదే వేదం. అమ్మ చెంగుపట్టుకు తిరుగుతూ, అమ్మ చెప్పే కథలు వింటూ.. అమ్మే లోకంగా వుంటారు పిల్లలు. ఆ సమయంలో నయాన్నో, భయాన్నో వాళ్ళు చెప్పినట్టు వినేలా చేయచ్చు. కాని కాస్త పెరిగి ప్రిటీన్స్ లోకి వచ్చాకా, ఎదురుతిర గటాలు, అలకలు, అబ్బో అమ్మకి బోల్డంత ఓపిక కావాలి. కానీ ఆ పేచీలు లేకుండా చేయటానికి కొన్ని చిట్కాలు వున్నాయి. వాటితో పిల్లలతో అనుబంధం కూడా పెరుగుతుంది.. దాంతో పేచీలు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు.. నిజానికి అమ్మలందరికి ఈ చిట్కా తెలిసే వుంటుంది. కాని పని కుదరదనో, ఇంకేదో కారణాలు చెప్పి తప్పించుకుంటారు. అలా కాకుండా... అది చాలా ముఖ్యమైనది అని గుర్తించి పాటిస్తే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి... అని భరోసా ఇస్తున్నారు నిపుణులు. మరి వారు సూచిస్తున్న ఆ సూత్రాలు ఏంటో చెప్పనా ... పిల్లలతో సమయం గడపటం : ఈ మాట చెప్పగానే... రోజు చేసేది అదే కదా అంటారని తెలుసు...కాని సమయం గడపటం అంటే... రోజూ వారి పనుల మద్య వాళ్ళతో మాట్లాడటం కాదు.. అచ్చంగా వాళ్ళతో మాత్రమే గడపటం. దానికి అమ్మ కొన్ని సమయాలని ఫిక్స్ చేసుకోవాలి. సాధారణంగా ఉదయాన్నే నిద్రలేపేటప్పుడు.. హడావుడిగా టైం అయిపోయింది అంటూ పిల్లలని లేపుతుంటారు.. అలా కాకుండా, ఓ పది నిమిషాల ముందు పిల్లలని లేపండి. పక్కన కూర్చుని ఓ నాలుగు మాటలు సరదాగా మాట్లాడండి, అప్పుడు చూడండి చక, చకా ఎలా రెడీ అవుతారో... అలాగే ఉదయం వాళ్ళు వెళ్ళేదాకా వాళ్ళతో అవి, ఇవి మాట్లాడుతూ వుండాలి. అవి చాలా సాధారణ విషయాలు.. పేపర్ లో న్యూస్ గురించో, ఇంట్లో మొక్కల గురించో, వాళ్ళ ఫ్రెండ్స్ గురించో చాలా, చాలా క్యాజ్యువల్ టాక్ జరగాలి. ఇక వీలైతే కాకుండా, వీలు చేసుకుని మరీ పిల్లలతో ఆడిపాడాలి. ఆటలు పిల్లలతోనా? అనద్దు.. క్రికెట్ నుంచి షటిల్ దాకా, అలాగే కారమ్స్, యూనో ఇలా ఎన్నో గేమ్స్ వున్నాయి .. వాటిలో ఏదో ఒకటి ఆడండి. మ్యూజిక్ వినటం ఇష్టంగా వుంటుంది పిల్లలకి. వాళ్ళతో కలసి పాటలు వినటం, వాళ్ళు డాన్స్ చేస్తుంటే చేయలేకపోయినా చూడటం అన్నా చేయాలి. ఇక రంగులంటే పిల్లలతో పాటు మనకి ఇష్టమేగా.. డ్రాయింగ్, కలరింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇలా పిల్లలతో కలసి ఏమేం చేయచ్చో అన్నీ చేయటమే. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళకి ఓ ఫ్రెండ్ లా వాళ్ళ అల్లరిలో భాగం కావాలి. దీని వల్ల లాభం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఒక్కసారి చేసి చూడండి.. పిల్లలు ఎలా అమ్మా, అమ్మా అంటూ చుట్టూ తిరుగుతారో చూడండి. వాళ్ళకి కావాల్సింది ఓ ఫ్రెండ్ లాంటి అమ్మ. ఎప్పుడూ ప్రశ్నలు వేస్తూ, జాగ్రత్తలు చెబుతూ, అప్పుడప్పుడు కోప్పడుతూ, అమ్మ వాళ్ళకి పరాయిగా కనిపిస్తుంది. అర్ధం చేసుకోదు అనుకుంటారు. కాదు బంగారం నీతోనే నేనూ.. నీలా ఆడిపాడి అల్లరి చేస్తాను.. అని వాళ్ళకి తెలిసేలా చేస్తే చాలు... పసివాళ్ళుగా మారిపోయి గారాబాలు పోతారు. ఎంతయినా, ఎన్ని వున్నా వాళ్ళకి కావాల్సింది అమ్మే. ఆ అమ్మ పెద్దయ్యారు అంటూ మీ పనులు మీరు చేసుకోండి, మీ ఆటలు మీరు ఆడుకోండి అంటుంటే, అమ్మ కావాలి అని బయటకి చెప్పటం ఎలాగో తెలియక మొండికేస్తుంటారు. అది పోవాలంటే మళ్ళీ చిన్న పిల్లలప్పుడు పిల్లలతో ఎలా ఎలా ఆడిపాడారో అలా చేయటమే. -రమ
బొమ్మలతో పౌష్టికాహారం పట్ల అవగాహన ప్రముఖ బాల సాహితీవేత్త, వైద్య ఆరోగ్య సైన్స్ రచయిత్రి డాక్టర్ కందేపి రాణీప్రసాద్ నూతనంగా ఒక కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పండ్లు ఫలాలను తింటే ఆరోగ్యం లభిస్తుందని అందరికీ తెలుసు. అయితే పిల్లలు అన్ని ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడరు. ఆ విషయం మాతృమూర్తులందరికీ విదితమే. పండ్లతో, డ్రై ఫ్రూట్స్.తో అనేక రకాల బొమ్మలను చేసి పిల్లలకు చూపించడం వలన ఆయా ఆహార పదార్థాల పట్ల ఆసక్తి కలుగుతుందని ఆలోచించిన రాణీప్రసాద్ డ్రైఫ్రూట్స్.తో అనేక బొమ్మల్ని సృష్టిస్తున్నారు. ఆయా బొమ్మల్ని పిల్లలకు చూపించి అందులోని పోషక పదార్థాల విలువల్ని వివరిస్తూ తల్లీ పిల్లలను చైతన్య పరుస్తున్నారు. అంజీర్లు, బెర్రీ పండ్లు, చెర్రీ పండ్లు, బాదంపప్పు జీడి పప్పు, పిస్తా, పప్పు, కిస్మిస్లు, చియా సీడ్స్, వంటి అనేక రకాల డ్రైఫ్రూట్స్.తోనూ, యాపిల్, అరటి, బత్తాయి, కమలా, అవకాడో, జుకినీ, కివీ, డ్రాగన్ వంటి పండ్లతోనూ అనేక బొమ్మలు తయరుచేసి తమ ఆసుపత్రికి వచ్చే పిల్లలకు ఎగ్జిబిషన్ల ద్వారా చూపిస్తున్నారు. వాటిని ఎలా తయారు చేసుకోవచ్చో, వాటిలోని పోషకాలు ఏమిటో కూడా వివరిస్తున్నారు. అంతే కాక వాటిని వ్యాసాలుగా రాసి పత్రికల్లో ప్రచురిస్తున్నారు. పిల్లలకు డ్రైఫ్రూట్స్ తినడం పట్ల ఆసక్తిని కలగజేయడం లక్ష్యంగా బొమ్మలు తయారు చేస్తున్నానని రాణీప్రసాద్ చెప్పారు పిల్లలు పౌష్టికాహారం తీసుకోకపోవడం అనేది చాలా పెద్ద సమస్య. ఈ సమస్యకు రాణీప్రసాద్ తన కళల ద్వారా పరిష్కారం చూపుతున్నారు. పిల్లలకు నోటితో చెప్పడం కన్నా చిత్రాల ద్వారా కథల ద్వారా చెప్పటం వల్ల ఎంతో ఉపయోగముంటుంది. తమ ఆసుపత్రికి వచ్చే చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే డ్రైఫ్రూట్స్ విలువనూ, ఉపయోగాన్నీ చక్కగా వివరించి చెపుతున్నారు. రాణీప్రసాద్ ఇంతకు ముందే పొడుపు కథల ద్వారా పిల్లలకు మానవ శరీర ఆవయవాల్ని పరిచయం చేశారు. అలాగే పిల్లల తల్లుల కోసం ‘మెడికల్ రంగోలీ’ తయారు చేసి వైద్య శాస్త్రాన్ని ముగ్గుల్లోకి రప్పించారు. పోలియో చుక్కలు, టీకాలు వేయించే వాటిని కవితలుగా మలిచి తమ ఆసుపత్రి ప్రిస్కిప్షన్ ప్యాడ్ మీద ప్రింటు చేస్తూ ప్రజల్ని చైతన్యవంతంగా మలుస్తున్నారు. ఇప్పుడు పిల్లలకు బలవర్ధకమైన ఆహారం మీద ఇష్టాన్నీ ప్రేమనూ పెంచడానికి తన కళల ద్వారా ప్రయత్నిస్తున్నారు. కళ అనేది తమ మానసిక ఆనందం కోసమే కాకుండా పదుగురినీ జాగృతం చేసేది అని రాణీ ప్రసాద్ నిరూపిస్తున్నారు.
చలికాలంలో చిన్న పిల్లలకు స్నానం చేయించేటప్పుడు ఈ తప్పులు చేయకండి..! వాతావరణం అనేది శరీరానికి ఎప్పుడూ పరీక్ష పెడుతూ ఉంటుంది. వేసవిలో విలవిలలాడేలా చేస్తుంది. చలికాలంలో శరీరాన్ని వణికిస్తుంది. చలికాలంలో వస్త్రధారణ మొత్తం మారిపోవాల్సిందే.. లేకపోతే చర్మానికి తీరని నష్టం చేకూరుతుంది. అయితే చిన్న పిల్లల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా వారి చర్మం చాలా లేతగా ఉంటుంది. చలికాలం ఎఫెక్ట్ తో పాటు వారికి రోజులో రెండు సార్లు స్నానం చేయించడం, చర్మ సంరక్షణ ఉత్పత్తులు వాడటం, శరీరానికి నూనెతో మసాజ్ చేయడం వంటివి చేస్తుంటారు. కానీ చలికాలంలో పిల్లలకు స్నానం చేయించేటప్పుడు కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే పిల్లలు చాలా ఇబ్బందులు పడతారు. గందరగోళం వద్దు.. పిల్లలను స్నానానికి తీసుకెళ్లాలి అనుకున్న తరువాత వారిని మొదట బాత్రూమ్ లోకి తీసుకెళ్లి నీరు పోసిన తరువాత అవి మర్చిపోయాం, ఇవి మర్చిపోయాం అని గందరగోళ పడకూడదు. మొదట పిల్లలకు స్నానానికి అవసరమైన వస్తువులన్నీ బాత్రూమ్ లో సమకూర్చుకున్న తరువాతే పిల్లలను బాత్రూమ్ లోకి తీసుకువెళ్లాలి. పిల్లలు బట్టలు లేకుండా లేదా శరీరం మీద కొన్ని నీళ్లు పడిన తరువాత అలాగే ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. అసలే ఈ చలికాలంలో బాత్రూమ్ లు మరింత చల్లగా ఉంటాయి. అందులోనూ బాత్రూమ్ లకు కిటికీలు ఉంటే అవి మరింత ఇబ్బందిని కలిగిస్తాయి. పిల్లలకు స్నానం చేయించేటప్పుడు కూడా బాత్రూమ్ లు మూసివేయడం మంచిది. నీరు.. పిల్లల స్నానానికి ఉపయోగించే నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చలిగా ఉంది కదా అని ఎక్కువ వేడిగా ఉన్న నీటిని వాడకూడదు. అలాగే పిల్లలకు బాత్ టబ్ లో స్నానం చేయించేటట్టు అయితే ఛాతీ కంటే ఎక్కువ ఎత్తులో నీటిని ఉంచకూడదు. దీనికంటే పిల్లలకు నీటిని మగ్ తో లేదా చెంబు సహాయంతో నీరు పోయడం మేలు. అయితే స్నానం చేయించే ప్రక్రియ వేగంగా చేయాలి. అలాగే పిల్లల శరీరానికి హాని కలగకుండా చేయించాలి. శరీరం మీద నీరు పడిన తరువాత గాలి తగిలితే పిల్లలకు చలి వేస్తుంది. సబ్బు... పిల్లలకు స్నానం చేయించేటప్పుడు బ్రష్షులు, లోఫా,క్లాత్ వంటివి వాడకూడదు. నేరుగా శుభ్రంగా ఉన్న చేతులతో పిల్లలకు సబ్బు రాయడం వల్ల స్నానం తొందరగా పూర్తీ చేయవచ్చు. తరువాత మెత్తగా ఉన్న టవల్ తో శరీరాన్ని శుభ్రంగా తుడవాలి. తడి.. పిల్లలకు నీటిలో ఆడటం అంటే సరదా.. ముఖ్యంగా వేడి నీరే కదా అని పిల్లలకు స్నానం చేయించేటప్పుడు లైట్ తీసుకోకూడదు. పిల్లలను ఎక్కువ సేపు తడిలో ఉంచకూడదు. ఎక్కువసేపు తడిలో ఉంటే పిల్లల చర్మం మీద ఉండే రక్షణ పొర దెబ్బతింటుంది. *రూపశ్రీ.
మనం ఆచరిద్దాం.. పిల్లలు అనుసరిస్తారు... పిల్లలకి ఏది నేర్పించాలన్నా కేవలం చెప్పటం కాకుండా, మనం ఆచరించి చూపించాలి అంటారు నిపుణులు. ఎందుకంటే సహజంగా పిల్లలు పెద్దవాళ్ళని అనుసరిస్తుంటారు. ఒకవేళ మనం చెప్పే విషయానికి, ఆచరించే విధానానికి తేడా వుంటే అది వారిని సందేహంలో పడేస్తుంది. ఆ సందేహం అయోమయానికి కారణమయ్యి, చివరికి వాళ్ళు మనం చెప్పేది వినని స్థితికి వచ్చేస్తారు. అదుగో అప్పుడు మనం వాళ్ళని మాట వినని మొండి ఘటాలని ముద్రవేసేస్తాం. ఇక అప్పటి నుంచి పిల్లలకి, పెద్దలకి మధ్య కనిపించని యుద్ధం మొదలవుతుంది. ఇదంతా వద్దు అనుకుంటే పిల్లలతో మనం వ్యవహరించే తీరుతెన్నులను కాస్త మార్చుకోవాలి. మనం వారికి ఆదర్శం కావాలి... పిల్ల ప్రవర్తన, వారి వ్యక్తిత్వంపై తల్లిదండ్రుల ప్రభావం అధికంగా ఉంటుంది. ఆ తరువాత కుటుంబంలోని ఇతర సభ్యులు, స్నేహితులు ఇలా....! అయితే మిగతా వారి ప్రవర్తన, వారి తీరుతెన్నులపై మనకి పట్టు వుండదు. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ వరకు వారి ప్రవర్తన పిల్లలకి ఆదర్శంగా ఉండేలా చూసుకోవాలిట. పిల్లలు సమయపాలన నేర్చుకోవాలంటే ఊరికే వారికి ఆ విషయంపై ఉపన్యాసాలు ఇవ్వకుండా ఆచరణలో చూపించాలి. మనం ఆచరించి చూపించే ఏ విషయాన్నీ పిల్లలకు ప్రత్యేకంగా నేర్పించటానికి ప్రయత్నించక్కరలేదు. సహజంగానే పిల్లలు అనుసరించే స్వభావం కలవారు కాబట్టి అనుసరిస్తారు. అలవాటుగా మార్చుకుంటారు. మన మాటే పిల్లలకు మంత్రం... మాటే మంత్రం అంటారు పిల్లల విషయంలో అది నిజం. మన మాటే వారిని మనకి దగ్గర చేస్తుంది, లేదా దూరం చేస్తుంది. ఉదాహరణకి పిల్లలంటే ప్రతీ తల్లికీ ప్రేమ వుంటుంది. కానీ కొంతమంది పెద్దలు తమ పిల్లలు ఏ చిన్న అల్లరి చేసినా, తప్పు చేసినా దానిని తీవ్రంగా పరిగణిస్తారు. ఇక పిల్లలని అదే పనిగా తిడతారు. నువ్వెప్పుడూ అంతే అల్లరి ఎక్కువ అందుకే నాకు నచ్చవు ఇలా కోపంలో ఏవేవో అనేస్తారు. కోపం తగ్గాక ఏ చాక్లెట్ ఇచ్చో పిల్లల అలక తీర్చి ఆ విషయం గురించి మర్చిపోతారు. కానీ అమ్మ, తనపై వెలిబుచ్చిన అభిప్రాయాలని పిల్లలు మనసుకి తీసుకుంటారు. నేనేం చేసినా అమ్మకి నచ్చదు. నేనంటే అమ్మకి ఇష్టం లేదు అన్న అభిప్రాయానికి వస్తారు. ఇది పిల్లలతో అమ్మ అనుబంధంపై ప్రభావం చూపిస్తుంది. అలా కాక పిల్లల చిన్న చిన్న అల్లరిని, పొరపాటుని చూసీ చూడనట్లు వదిలెయ్యాలిట. ప్రతీ విషయానికి రియాక్ట్ కాకుండా ఉండాలి అంటున్నారు నిపుణులు. ప్రేమను ప్రదర్శించాలి... పిల్లల పై ప్రేమ చూపించటమంటే కేవలం మాటలలో దానిని చూపించటంకంటే మన చేతలలో దానిని వ్యక్తం చేస్తే పిల్లలు త్వరగా అర్థం చేసుకుంటారు. ఉదాహరణకి నువ్వంటే నాన్నకి, నాకు ప్రాణం. అని మాటలలో చెప్పేకంటే వారిని ప్రేమగా దగ్గరకు తీసుకోవటం గట్టిగా పట్టుకోవటం, ముద్దు పెట్టుకోవటం వంటివి వారిని ఎక్కువ సంతోషపెడతాయి అంటున్నారు నిపుణులు. పిల్లల చిన్నచిన్న ఇష్టాలని గమనించి వాటిని తీర్చటం, రాత్రి నిద్రపోయే సమయంలో కథలు, కబుర్లు, ఆటపాటలు వంటివి పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య మంచి అనుబంధాన్ని పెంచుతాయిట. వ్యక్తిత్వ పునాదులు గట్టిగా వుండాలి.... పునాదులు గట్టిగా వుంటే ఆ పునాదులపై ఎంతటి భవనాన్ని అయినా కట్టచ్చు. ఇదే సూత్రం పిల్లలకి వర్తిస్తుంది. చిన్నతనంలోనే మంచి అలవాట్లు ప్రవర్తన అలవడిన పిల్లల వ్యక్తిత్వం పెరిగి పెద్ద అయ్యాక ఎంతో చక్కగా ఉంటుంది. అలాగే అమ్మనాన్న ప్రేమని పొందే పిల్లల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి. అలాగే వారితో అనుబంధం కూడా ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటుంది. పిల్లలపై మనకుండే ప్రేమ వారికి అర్థమయ్యేలా చూసుకోవాలి. ఇక అప్పుడు పెరిగి పెద్దయ్యి పరిపూర్ణ వ్యక్తిత్వంతో మన ముందు నిలిచే మన బంగారుకొండలని చూసి మనం గర్వపడవచ్చు. ఏమంటారు? -రమ ఇరగవరపు
ప్రేమతో కథలు చెపుదామా కథలు వినటం వల్ల పిల్లల్లో ఊహాశక్తి పెరుగుతుందంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాలి. ఎందుకంటే అదే నిజమని తేల్చి చెప్పాయి ఎన్నో రకాల పరిశోధనలు. అనగనగా... అని మనం కథ చెప్పటం మొదలుపెట్టగానే నోరు వెళ్లబుచ్చుకుని వినటం మొదలుపెడతారు పిల్లలు. వాళ్ళకి నచ్చిన కథ అయితే మనం మద్యలో ఆపినా ఊరుకోరు. ఇలా వినే కథల వల్ల వాళ్ళ ఆలోచనా పరిధి పెరుగుతుందట. మనం చెప్పే కథకి అనుగుణంగా వాళ్ళు వాళ్ళ బుర్రలో దానికి తగ్గ వాతావరణాన్ని ఊహించుకుంటారట. ఇలా వినేటప్పుడు మనకి కనిపించే ఆ అమాయకపు కళ్ళ వెనక ఎన్నో అద్భుత చిత్రాలు కదులుతూ ఉండేసరికి వాళ్ళ మెదడు చురుకుగా పనిచెయ్యటం మొదలుపెడుతుంది. మధ్యమధ్యలో వాళ్ళు అడిగే ప్రశ్నలు ఒకొక్కసారి మనకే అంతు చిక్కనివిగా ఉంటాయి. వాటికి సమాదానం ఇచ్చే ముందు దానికి తగ్గ సొల్యూషన్ ఎలా ఉంటె బాగుంటుంది అని మీరు మరో ప్రశ్న వాళ్ళకి తిరిగి వేస్తె చాలు వాళ్ళ చిన్న బుర్రలో ఎన్నెన్ని ఆలోచనలు పరుగులు తీస్తాయో చెప్పలేం. అలాంటి ఆలోచనలే వాళ్ళ మెదడుకి ఓ హేల్తి ఫుడ్ లా పనిచేస్తాయి. ఒక కథ విని దాని గురించి ఆలోచనలో పడటం వల్ల మెదడులో నరాలు బాగా పని చేసి మైండ్ షార్ప్ అవుతుందని చెపుతున్నారు పిల్లల మానసిక నిపుణులు. ఇటీవల జపాన్ లో జరిపిన ఒక సర్వే లో ఇంట్లో ఖాళీ సమయంలో టీవీ చూస్తూ లేదా వీడియో గేమ్స్ ఆడే పిల్లల మెదడు కన్నా,కథలు చెప్పించుకుని వినే పిల్లల మెదడు చురుకుగా పనిచేస్తోందని తేల్చి చెప్పారు. కాల్పనిక కథలు,జానపద కథలు ఇలా ఎన్నో రకాల కథలు పిలల్ని ఎంతో ఆలోచింపచేస్తాయి. పిల్లలకి గిఫ్ట్స్ రూపంలో కథల పుస్తకాలు కొని ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కి అలా పుస్తకాలు కొనివ్వటం అలవాటు చేసుకుంటారు. కథల పుస్తకాలు చదవటం వల్ల గ్రహింపుశక్తి పెరగటమే కాదు కళ్ళకి కూడా ఒక ఎక్సర్సైజ్ లా పనిచేస్తుందిట. రాత్రిళ్ళు పడుకునే ముందు పిల్లలు అడిగి చెప్పించుకునే కథల ప్రభావం వాళ్ళ నిద్ర మీద పడుతుందిట. అందుకేనేమో అమ్మమ్మలు తాతయ్యలు దేముడి కథలు,రాజకుమారుడి కథలు చెప్పి నిద్రపుచ్చుతూ ఉంటారు. పిల్లలకు దగ్గరగా కూర్చుని కథలు చెప్పటం వల్ల ఇంకో లాభం కూడా ఉందిట. పిల్లల్లో అభద్రతాభావం దూరమయి వాళ్ళల్లో మానసిక బలం పెరుగుతుందిట. అమ్మ ఒడిలో పడుకుని హాయిగా కథలు వింటుంటే భయం మన పిల్లల దరిదాపులకి రావటానికి కూడా భయపడుతుంది కదా. అందుకే ప్రేమతో కథలు చెప్పటం మొదలుపెట్టెదాం. ...కళ్యాణి
పిల్లల మెను పిల్లలకి పోషకాహారం ఇస్తున్నామా లేదా.. క్యాలరీలు, ప్రొటీన్లు సరిగ్గా అందుతున్నాయా లేదా.. అమ్మకి అన్నీ సందేహాలే! అందుకే మూడేళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ పిల్లలకు రోజుకెన్ని క్యాలరీలు తప్పనిసరిగా అందాలి. ఎంత ప్రొటీన్ ఆహారంలో వుండేలా చూసుకోవాలి... వంటి వివరాలు వివరంగా ‘అమ్మకోసం’. * 3 సంవత్సరాల చిన్నారులకు రోజుకు 1200 క్యాలరీల ఆహారం అందులో 22 గ్రాముల ప్రొటీన్లు వుండాలి. * ఇక 4 నుంచి 6 ఏళ్ళ వయసు వారికి రోజూ 1700 క్యాలరీలు, అందులో 40 గ్రాముల ప్రొటీన్లు తప్పనిసరి. * ఇక ఏడేళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ వయసు చిన్నారులకు రోజూ 1950 క్యాలరీలు అందులో 41 గ్రాముల ప్రొటీన్లు వుండాలి. కేవలం ప్రొటీన్లనే కాకుండా కాల్షియం, ఐరన్... తదితర పోషకాలూ పిల్లలకి సమానంగా అందినప్పుడే వారి శారీరక, మానసిక ఎదుగుదల సంపూర్ణంగా వుంటుంది. ఈ లెక్కలన్నీ ఎలా సరిచూసుకోవటం అంటే నిపుణులు కొన్ని ఆహార పదార్ధాలని సూచిస్తున్నారు. వీటిని పిల్లలకి తయారుచేసి పెట్టడం ద్వారా పిల్లలకు తగినన్ని క్యాలరీలు, ప్రొటీన్లు అందించవచ్చు. ఉదయాన్నే... పాలు తాగించాలి. ఆ తర్వాత ఈ క్రిందివాటిల్లో రోజుకు ఓ రకం వారికి తినిపించాలి. ఉడకబట్టిన కోడిగుడ్డు బ్రెడ్ ఆమ్లెట్ గుడ్డు పొరటు పాలక్ రోటీ ఆలూ రోటీ ఇడ్లీ క్యారట్ ఇడ్లీ మేతీ రోటీ సోయా జావ సోయా, గోధుమపిండి కలిపిన చపాతీ. పై వాటిల్లోంచి ప్రొటీన్లతోపాటు విటమిన్-ఎ పుష్కలంగా లభించి పిల్లలు చురుకుగా వుంటారు. కంటి చూపు బావుంటుంది. బ్రేక్ టైమ్లో... ఇక స్కూలు విరామ సమయంలో పిల్లలకు స్నాక్స్ ఇవ్వాల్సినప్పుడు... 1. టమాటో సూప్ 2. వెజ్ సూప్ 3. పండ్ల రసాలు 4. కస్టర్డ్ 5. బాదం పాలు 6. రాగిజావ వీటిల్లో రోజుకు ఒకటి ఇవ్వగలిగితే చాలు. అలానే వీటిని తయారు చేసేప్పుడు పంచదార బదులు బెల్లం వాడితే పిల్లలకి తగినంత ఐరన్ కూడా అంది శక్తి లభిస్తుంది. మధ్యాహ్నం లంచ్ బాక్స్లో.... లంచ్ బాక్స్లో వీలయినంత వరకు రోజుకు ఒక వెరైటీ అందించడానికి ప్రయత్నించాలిట. రంగు, రుచి ఈ రెండూ పిల్లలని ఆకర్షించే అంశాలు కాబట్టి బాక్స్లో పెట్టే భోజనం రుచిగానే కాక ఆకర్షణీయంగా కూడా వుండేలా చూసుకుంటే పిల్లలకి లంచ్ బాక్స్లో భోజనం వదిలేయడం వంటివి చేయరు. లంచ్ బాక్స్లో తప్పనిసరిగా ఆకుకూర, కూరగాయలు, పప్పు వుండాలి. ఆకుకూర పప్పు, కూరలతో బాక్స్ కట్టవచ్చు. లేదంటే.... 1. కిచిడి 2. వెజ్ రైస్ 3. ఆకు కూరలతో రైస్ ఐటమ్స్. ఉదాహరణకి పాలక్ రైస్, మేతీ రైస్... 4. టమాటా రైస్ లాంటివి ఇలా రైస్ ఐటమ్స్ పెట్టినప్పుడు తప్పనిసరిగా క్యారట్, టమాట వంటి కూరగాయలతో చేసిన రైతాను ఇవ్వాలి. మొత్తానికి ఆకుకూరలు, కూరగాయలు పిల్లలకు రోజు అందేలా చూసుకుంటే చాలు వాళ్ళ ఎదుగుదలకి కావలసిన పోషకాలు అందినట్టే. సాయంత్రం ఏం పెట్టొచ్చు అంటే... పాలతోపాటు కార్న్ ఫ్లేక్స్ ఇవ్వచ్చు. లేదా అటుకులు, పాలు, బెల్లంతో తయారుచేసే కీర్ వంటివి పిల్లల ఆకలిని తీర్చడంతోపాటు వారికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. రాత్రి భోజనానికి... పప్పులతో చేసే కిచిడీ, పన్నీర్తో చేసిన రోటీ, కూరగాయలతో భోజనం ఇస్తూ తప్పనిసరిగా ఓ కప్పు పెరుగు తినిపించాలి. రాత్రిపూట భోజనం పడుకునే ముందు కాక రాత్రి ఏడు గంటలకల్లా పెట్టి పడుకునే ముందు ఓ గ్లాసు పాలు తాగిస్తే ఆ రోజుకి పిల్లలకి అందాల్సిన పోషకాలన్నీ అందినట్టే. ఇటీవలి కాలంలో పిల్లల్లో పోషక లోపం ఎక్కువైనట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకు కారణం అవగాహన వున్నా పాటించకపోవటం అంటున్నారు నిపుణులు. ఏదో ఒకటి పిల్లలు పేచీ పెట్టకుండా తింటే చాలని కాకుండా ఎదుగుదలకి అవసరమైన పోషకాలన్నీ వారికి అందేట్టు రోజువారీ ఆహారాన్ని ముందే ప్లాన్ చేసుకుని అందిస్తే పిల్లలు ఉత్సాహంగా, ఆరోగ్యంగా వుంటారు. ఆట పాటల్లో, చదువులో రాణిస్తారు అని సూచిస్తున్నారు నిపుణులు. మరి ‘అమ్మలూ’ ఆలోచించండి. - రమ
బోసినవ్వులే బలం 1) పసిపిల్లలు ఉన్న ఇంట్లో ఒకటే సందడిగా ఉంటుంది. పిల్లల అల్లరి సరే దానితో సమానంగా పెద్దలు పిల్లలతో అడే అటలు, పాటలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఈ సందడి పిల్లలని ఉత్సాహపరచటమే కాదు వారి శారీరక, మానసిక అరోగ్యానికి ఎంతో అవసరమట కూడా. లల్లాయి పాటలు పాడుతూ పసిబిడ్డను కొద్దిగా అటు, ఇటు ఊపి చూడండి. వెంటనే అ పసి ముఖం మీద బోసినవ్వు మెరుస్తుంది. ఒకోసారి మన ఆటలకి నోరారా నవ్వుతారు. పక పకమని నవ్వేవారి నవ్వు చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుందట. అందుకే వీలయినంత ఎక్కువగా పిల్లల్ని ఆటపాటలతో మురిపించటం ఎంతో మంచిది అంటున్నారు, ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ పరిశోధకులు. 2) పసి పిల్లల్ని ఎత్తుకుని పైకి ఎగరేస్తూ ఆడటం, అలాగే ఒళ్లో కూర్చో పెట్టుకుని తారంగం తారంగం అంటూ ముందుకీ వెనక్కి ఊపుతూ ఆడించటం, వంటి వన్నీ పిల్లలకి కేవలం ఆటలగా సరదాగా అనిపిస్తాయి. కానీ, నిజానికి బిడ్డల్ని అలా అటూ, ఇటూ ఊపుతుండటం వాళ్ళ ఎంతో లాభం ఉందని గుర్తించారు పరిశోధకులు. వీటివల్ల వారి మెదడులో గణనీయమైన పెరుగుదల ఉంటుందని గుర్తించారు కూడా. బిడ్డలకు సంగీతాన్ని వినిపిస్తూ ఇలా లయబద్ధంగా ఊపటం వల్ల వారి మెదడులో" సెన్సరీ వ్యవస్థ" చక్కగా బలపడుతోందని, దీనివల్ల నాడీకణాల మధ్య అనుసంధాయక సంబంధాలు అంటే న్యూరాల్ నెట్వర్క్స్ మెరుగై, మెదడు మరింత చురుగ్గా అభివృద్ధి చెందుతోందని పరిశోధకులు గుర్తించారు. 3) పసిపిల్లల్ని అడించేటప్పుడు అల్లి బిల్లి పాటలు పాడటం, అందుకు తగ్గట్టు లయాత్మకంగా ఊపటం అన్ని సమాజాలల్లోనూ, అన్ని సంస్కృతుల్లోనూ ఉంది. అలాగే లాలి పాటలు పాడుతూ ఒళ్లో వేసి ఊపుతూ జో కొట్టటం కూడా. వీటి ప్రభావం పిల్లల ఎదుగుదలపై ఎలా ఉంటుందన్న దాని మీద " ఫ్లోరిడా అట్లాంటిక్ యునివర్సిటీ " పరిశోధకులు ఇటీవల విస్తృతంగా పరిశోధనలు చేసారు, అ పరిశోధనల్లో తెలిసీ, తెలియక మనం ఆడించే ఈ ఆటల వల్ల పిల్లల మెదడుకి ఎంతో మేలు కులుగుతోందని తేలింది. 4) చిట్టి పొట్టి గీతాలు, పాటలు పిల్లలకి చిన్నితనం నుంచే వినిపిస్తుండటం వల్ల వారిలో రకరకాల సామర్ధ్యాలు చురుకుగా అభివృద్ధి చెందటం గమనించారు. భాషాపరిజ్ఞానం, జ్ఞాపక శక్తీ వంటివే కాదు పంచేంద్రియాలు అంటే సెన్సస్ చురుకుగా తయారై మెదడు మరింత చురుకుగా వృద్ధి చెందుతుందని వీరు చెబుతున్నారు. మనం ఏదైనా అనుభూతి పొందుతున్నామంటే, దాని వెనుక ఏకకాలంలో రకరకాల జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయని అర్ధం. ఎదుగుదలలో భాగంగా పిల్లలకు ఈ భిన్నత్వం అలవాటు అయ్యేందుకు మన అటా- పాటా బాగా ఉపకరిస్తాయి అంటున్నారు ఈ పరిశోధన చేసిన " లుకోవిట్జ్". 5) పిల్లల్ని ఒకచోట ఉంచి, రకరకాల బొమ్మల్ని చూపిస్తూ అడించిన దాని కన్నా, పిల్లల్ని ఒక బొమ్మగా ఆడించి , ఊపుతూ కదపటం, వారు కిలకిల నవ్వేలా చేయటం వంటివి తప్పకుండా వారి మెదడులోని నాడీకణాల మధ్య అనుసంధాయక సంబంధాలు మెరుగు పడటానికి ఉపయోగపడుతుందట. కాబట్టి తారంగం , తారంగం వంటి అటపాటలతో, లాలి పాటలతో లయబద్ధంగా పిల్లల్ని ఊపుతూ అడించటం ఎంతో మంచిది అంటున్నారు పరిశోధకులు. -రమ
ఇలా నేర్పించండి ప్రతి పేరెంట్ కల ఒక్కటే తమ పిల్లలు చక్కగా హ్యాపీగా ఏదగాలని మంచి పొసిషన్ లో వుండాలని వాళ్ళు అందరితో శబాష్ అనిపించుకోవాలని ప్రతి పేరెంట్ కల అదే. మనం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు అయితే మనం పిల్లలతో వ్యవహరించే తీరును బట్టి వుంటుంది అని అంటున్నారు చిట్టి విషు ప్రియ గారు. పిల్లలని అర్ధం చేసుకుంటూ వారికీ అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మనం పేరెంట్ మరియు అడల్ట్స్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. పసి పిల్లలు కాబట్టి వారికీ కొన్ని నేర్పించాల్సి వస్తుంది ఒకసారి కొంచెం బుజ్జగించాల్సి వస్తుంది. ఇంకోసారి కటినంగా మాట్లాడాల్సి వస్తుంది. దీనిని ఒక పేరెంట్ గా బాలన్స్ చెయ్యాలి. ములితంగా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. సడన్ గా ఒక్కసారి కన్ను ఎర్ర చేసి వాళ్ళు వినగానే హక్కున చేర్చుకోవడం లాంటిది ములితం అంటే. వారికి నీడలాగ పక్కన వుండాలి. పిల్లల ఇష్టాలు తెలుసుకోవాలి ఎందుకు మాటి మాటికి ఈ డ్రెస్ వేసుకుంటున్నావ్ అని అడగ కుండ అసలు ఎందుకు ఆ డ్రెస్ నే ఇష్టపడుతుందో తెలుసుకోవాలి. 2 సంవత్సరాల వయస్సు నుండే వారికీ ప్రతిది నేర్పించాలి ఆడుకున్న తరువాత తన వస్తువులు తమ బాగ్స్ లో పెట్టుకోవటం, ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టడం లాంటివి నేర్పించాలి ఆలాగే తిన్న తరువాత తమ ప్లేట్ మీరు తీసుకోకుండా తమతో ఆ ప్లేట్ పక్కన పెట్టించాలి ఇలా చిన్న చిన్న పనులుకి అలవాటు పడి ఒక హబిట్ గా మారిపోతుంది. మరి కొంత మంది పిల్లలు మొండిగా ఉంటారు ఏ పని చెప్పిన చెయ్యరు . అటువంటి పరిస్థితిలో ఏం చెయ్యాలంటే 'ఛాలెంజ్' అనే మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అటువంటి పిల్లలో నేను సాధించాలి అనే తపన వారిలో క్రియేట్ అవుతుంది అమ్మ కన్నా ముందు నేను చెయ్యాలి అనే తాపాత్త్రయం వాళ్ళలో మొదలవుతుంది. టైం మేనేజ్మెంట్ అనేది కూడా పిల్లలకి నేర్పించాలి ఇది 4th or 5th క్లాసు నుండి ప్రారంబించాలి అప్పుడైతే పిల్లలకి అర్ధం అవుతుంది. వాళ్ళ ని ఎక్కువ ఒత్తిడికి గురి చేయకుండా నెమ్మదిగా వర్క్ చేయడం నేర్పించాలి. ఇది ఒక అలవాటు గా మారిపోతుంది మీరు చెప్పకుండానే వాళ్ళ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటారు. ఇది ఒక పెద్ద భారంగా కూడా అనిపించదు ఎంజాయ్ చేస్తూ పనిని ముగిస్తారు అని మంచి మాట అనే కార్యక్రమంలో చిట్టి విష్ణు ప్రియ గారు చెబుతున్నారు.