లోక్‌సత్తాకున్న ధైర్యం ఇతరపార్టీలకు లేదా ?

ఒక దేవాలయానికి విరాళం ఇస్తే, అన్నదానం చేస్తే కూడా ఆదాయపన్ను రాయితీ లభిస్తుంది. సెక్షన్‌ 80జి కింద ఆదాయపన్ను శాఖకు చూపవచ్చు. కానీ, రాజకీయపార్టీలు ఎటువంటి విరాళం తీసుకున్నా రశీదులు ఇవ్వవు. 90శాతం విరాళాలన్నీ అలానే తీసుకుని ఎన్నికల సమయంలోనూ, ఇతర రహస్యకార్యక్రమాల్లోనూ వాటిని వాడుతుంటారు. 2012 లో జరిగిన దేశంలోనే అంత్యంత ఖరీదైన ఉప ఎన్నికల్లో కూడా ఇదే తరహా ఖర్చులు చేశారు. లెక్కల్లో చూపని ఈ నల్లధనాన్ని రెండొందల కోట్లకు పైగా ఖర్చు చేశారు. మొత్తం అసెంబ్లీస్థానాల్లోనూ ఇదే తరహా ఖర్చులు జరిగాయని తేలినా ప్రభుత్వమూ, అటు ఎన్నికల కమిషనూ బీరాలు పలికి సర్దుకుపోయాయి.   ఇంత జరగటానికీ ఒకటే కారణం లెక్కల్లో చూపని డబ్బునే రాజకీయపార్టీలు తీసుకుంటాయి. ఆ నల్లధనాన్నే వినియోగిస్తాయి. పైగా వీటికి హుండీ ఆదాయం అని కూడా పేరుపెట్టాయి. ఈ హుండీ ఆదాయాల బురిడీకి ప్రభుత్వం ఎప్పుడు మంగళం పాడుతుందన్నది మిలియన్‌డాలర్ల ప్రశ్న.. దీనిపై అసలు చర్యలు తీసుకోవాలన్న ఆలోచనే ప్రభుత్వాలకు కొరవడిరది. ఎందుకంటే ఓట్లు కొనుక్కుంటే కానీ, ఏ పార్టీ కూడా అథికారంలోకి రాలేని నేటి పరిస్థితులు. ఇలా ఇంకెన్నాళ్లు అని ఆలోచనతో వచ్చిన లోక్‌సత్తా రాజకీయపార్టీలన్నింటినీ ఒకటే ప్రశ్న అడుగుతోంది. అదేంటంటే తీసుకున్న ప్రతీ పైసాకు రశీదు ఇవ్వగల థైర్యం ఇతర రాజకీయ పార్టీలకు లేకుండా పోయిందని లోక్‌సత్తా విమర్శిస్తోంది. ఒక్కపైసాకు కూడా రశీదు ఇవ్వగలిగిన సత్తా తమ పార్టీకి మాత్రమే సొంతమని ఆ పార్టీ అథ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ అన్నారు. అలానే ఆదాయపన్ను నుంచి కూడా మినహాయింపు ఇప్పిస్తామన్నారు. మరి మిగతా జాతీయపార్టీలు ఈ తరహా ప్రకటన ఎందుకు చేయలేకపోయాయో ఒక్కసారి ఆలోచించాలి. ఆదాయపన్ను శాఖ కూడా జాతీయపార్టీల ఆదాయ,వ్యయాలను ఒక్కసారి తనిఖీ చేస్తే బాగుంటుందని, లెక్కల్లో లేని డబ్బులున్నట్లు తెలిస్తే ఆ డబ్బును స్వాధీనపరుచుకుంటే జాతిప్రయోజనాలకు అది ఉపయోగపడుతుందని పలువురు సూచిస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన చిన్నం రామకోటయ్య

రాష్ట్రపతి ఎన్నికలు గురువారం ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యాయి. పార్లమెంటులోని నెంబర్ 63వ గదిలో ప్రజాప్రతినిధులు తమ ఓటును వినియోగించుకుంటున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చిన్నం రామకోటయ్య, బాలనాగి రెడ్డిలు అసెంబ్లీలో ఓటు వేశారు. టిడిపి రాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ వారు ఓటు వేశారు. బాలనాగి రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేతగా ముద్ర పడగా, చిన్నం రామకోటయ్య కాంగ్రెసు వైపుకు వెళుతున్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇప్పటికే ఇచ్చేశారు.   చిన్నం మంత్రి పార్థసారధితో కలిసి తన ఓటును వేశారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ తొలి ఓటు వేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తదితరులు అసెంబ్లీలో తమ ఓటును వేశారు. ఓటు వేసేందుకు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు ఎమ్మెల్యేలు రాజేష్, బాలరాజులు కలిసి ఒకే కారులో రావడం గమనార్హం. ఓటు వేసేందుకు వైయస్ విజయమ్మ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు.  

దేశానికి 14వ రాష్ట్రపతి ఎన్నిక నేడే

దేశానికి 14వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు బ్యాలెట్ పోరు మరికొన్ని గంటల్లో జరగనుంది. యూపీఏ అభ్యర్థి, అపార అనుభవజ్ఞుడు ప్రణబ్‌కుమార్ ముఖర్జీ ఒకవైపు.. లోక్‌సభకు స్పీకర్‌గా వ్యవహరించి, ఈశాన్య రాష్ట్రాలలో తిరుగులేని గిరిజన నాయకుడిగా పేరొందిన పూర్ణో అహితో సంగ్మా మరోవైపు ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. దేశవ్యాప్తంగా 4,896 మంది ప్రజాప్రతినిధులు.. వీరిలో 776 మంది ఎంపీలు, 4,120 మంది ఎమ్మెల్యేలు తమ ఓట్లతో దేశ ప్రథమపౌరుడిని ఎన్నుకుంటారు. పార్లమెంటులోని రూంనెం. 63లోను, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలలోను పోలింగ్ గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహనరెడ్డి, 2జీ స్కాంలో బెయిల్ మీద బయటకు వచ్చిన డీఎంకే నేతలు ఎ.రాజా, కనిమొళి సహా.. అందరూ ఓట్లు వేయనున్నారు. వీరందరి ఓట్ల విలువ కలిపి 10.98 లక్షలు. ఇందులో విజేత కావాలంటే కనీసం 5,49,442 ఓట్ల విలువ అవసరం అవుతుంది. అయితే, టీడీపీ లాంటి కొన్ని పార్టీలు ఈ ఎన్నికను బహిష్కరిస్తుండటంతో మొత్తం ఓట్ల విలువ, విజేతకు అవసరమైన ఓట్ల విలువ కూడా కొంతమేర తగ్గుతాయి. ఇప్పటికే సుమారు 7.5 లక్షల ఓట్ల విలువ ఉన్న ప్రణబ్‌ముఖర్జీ సునాయాసంగా గెలుస్తారని అంతా భావిస్తున్నారు. గురువారం పోలయ్యే ఓట్లను ఆదివారం లెక్కిస్తారు. అదేరోజు సాయంత్రానికి ఫలితం వెలువడే అవకాశం కనిపిస్తోంది. యూపీఏ భాగస్వామ్య పక్షాలన్నింటితో పాటు సమాజ్‌వాదీ, బీఎస్పీ, ఆర్జేడీ, జేడీ(ఎస్), ఎన్డీయే పక్షాలైన జేడీ(యూ), శివసేన.. ఇంకా సీపీఎం, ఫార్వర్డ్‌బ్లాక్ కూడా ప్రణబ్‌కు మద్దతు ప్రకటించాయి. లోక్‌సభ మాజీ స్పీకర్ అయిన సంగ్మా తొలుత బీజేడీ, అన్నా డీఎంకే మద్దతుతో, గిరిజన కార్డుతో బరిలోకి దిగారు. తర్వాత బీజేపీ, అకాలీదళ్ కూడా ఆయనకు మద్దతు ప్రకటించాయి. కాగా.. తృణమూల్ కాంగ్రెస్ తనకు మద్దతు ఇవ్వకపోవడం శరాఘాతమేనని సంగ్మా అంగీకరించారు. అయితే ఇప్పటికీ ఆయన 'ఆత్మప్రబోధ ఓటు'పైనే ఆశలు పెట్టుకున్నారు. ఏదో అద్భుతం జరుగుతుందని, తాను రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. ప్రణబ్ ముఖర్జీ తన ప్రచారాన్ని తమిళనాడుతో మొదలుపెట్టగా, సంగ్మా తన ప్రచారాన్ని తమిళనాడులో ముగించారు. కాగా పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని పార్టీలూ పాల్గొనాలని కాంగ్రెస్ రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకుంటే అది ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్లేనని ఆయన అన్నారు.  

డిఫెన్స్‌లో పడ్డ చంద్రబాబు నాయుడు

దేశాధిపతిగా, సైనిక కమాండర్‌గా, రాజ్యాంగ అధిపతిగా భావించే రాష్ట్రపతి ఎన్నికకు జరుగుతున్న ఎన్నికల్లో పాల్గొన కూడదని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ విమర్శల పాలతోంది. ఒకప్పుడు అబ్దుల్‌ కలాం ను రాష్ట్రపతిగా తానే చేశానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ప్రస్తుతం డిఫెన్స్‌లో పడ్డారు. యుపిఎ బలపరచిన ప్రణబ్‌కు ఓటువేస్తే కాంగ్రెస్‌ తో మిలాఖత్‌ అయ్యారంటారని, ఎన్‌డిఎ సపోర్టుసిన సంగ్మాకు ఓటు వేస్తే మతతత్వపార్టీకి ఓటు వేశారంటారని చంద్రబాబు భావించడం హాస్యాస్పదమే అని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. అంతకుముందు ఎన్‌డిఎ ప్రభుత్వంతో పని చేశామని గుర్తుచేసుకోవాలంటున్నారు. రాష్ట్రముఖ్యమంత్రిగా తొమ్మిది ఏళ్లు పరిపాలించిన చంద్రబాబునాయుడు రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండటం ఆయన అవకాశవాద రాజకీయాలను ప్రతిభింబిస్తుందని రాజకీయవాదులు ఆరోపిస్తున్నారు. ఓటువినియోగించుకోకపోవడం అంటే బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడమే నని మేధావులు మండిపడుతున్నారు.తెలంగాణ టి.డి.పి. నాయకులు కూడా ప్రత్యేక తెలంగాణా పేరుతో రాష్ట్ర పతి ఎన్నికలను దూరంగా ఉండడం సరైన నిర్ణయం కాదనే వాదనలు వినవస్తున్నాయి. ఏదిఏమైనా రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండటం అనేది మన రాష్ట్రంనుండే మొదలవ్వటం రాష్ట్రరాజకీయాలు ఎంతగా భ్రష్టుపట్టాయో తెలుస్తుందని రాజకీయ పండితులు వాపోతున్నారు. ఇదే మోడల్‌గా తీసుకున్న ప్రజలు రాజకీయ పార్టీలకు ఓట్లు వేయకుండా ఉంటే రానున్నరోజుల్లో రాజకీయ పార్టీల భవిష్యత్‌ ఏమిటని వారు ప్రశ్నింస్తున్నారు..విన్నారా ప్రజలూ ....

‘హస్తం’ వదిలేస్తామంటున్న బిసీలు?

అసలే 2012 ఉప ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలను మింగలేక, కక్కలేక కాంగ్రెస్‌ పార్టీ సతమతమవుతుంటే బిసీలు చేసిన హెచ్చరిక ఆ పార్టీని కుదిపేస్తోంది. అసలు తెలుగుదేశం పార్టీ పూర్తి వైఫల్యానికి బిసీలను వదిలేయటమే కారణమని తేలటంతో ఆ పార్టీ తాయిలాలు ప్రకటించింది. వందకు పైగా సీట్లు ఇవ్వటానికీ, బిసీలకు ప్రత్యేక నిధులు ఇవ్వటానికీ టిడిపి అథినేత చంద్రబాబు సిద్ధమని ప్రకటించారు. ఈ ప్రకటనతో ఉత్సాహం చెందిన బిసీ సంఘాలు చంద్రబాబును సన్మానించాయి. ఆయన్ని చూసి మీరూ నేర్చుకోండన్నట్లు బిసీలు మిగతాపార్టీలపై దృష్టి సారించటం మొదలుపెట్టారు. అథికార కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్‌మెంటుల్లో కోత విధించటం, రిజర్వేషన్ల ప్రక్రియను సరిగ్గా పట్టించుకోకపోవటం వంటి అంశాలు బిసి సంఘాలను కలిచి వేశాయి. దీంతో రాజులే మట్టికొట్టుకుపోయారు...కాంగ్రెస్‌ పార్టీ ఎంత అన్నట్లు బిసి ఐక్యపోరాట సమితి రాష్ట్ర నాయకుడు కృష్ణయ్య ధ్వజమెత్తారు.   బిసీలకు అన్యాయం చేస్తే సిఎం, పిఎం ఎవరినైనా వదలబోమని ఆయన హెచ్చరించారు. అసలు ప్రభుత్వవైఖరిపై బిసీ మంత్రులెందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. అవసరమైతే తిరుగుబాటు చేయాలన్నారు. అలానే ఎంబిబిఎస్‌ రిజర్వేషనులో బి కేటగిరి కింద చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం సిఎం కనుక బిసీలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీకి అందరూ దూరమవుతారని హెచ్చరించారు.

నాడు ఎన్టీఆర్‌...నేడు కిరణ్‌ కుమార్‌ !

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇటీవల తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో బస చేయటంతో గిరిజనులు మళ్లీ ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకున్నారు. తమతో పాటు ఒకరాత్రి గడిపిన నందమూరి తారక రామారావును మరిచిపోవటం సాధ్యం కాదని ఈ సందర్భంగా గిరిజనులు అన్నారు. గత 20ఏళ్లుగా ఏ నాయకుడు ఏజెన్సీ లోతట్టు గ్రామాలకు వచ్చినా గిరిజనులు మాత్రం ఎన్టీఆర్‌ ఆరోగ్యం బాగుందా? అని ప్రశ్నిస్తునే ఉన్నారు. వారు ఎన్టీఆర్‌ మరణించారంటే ఇప్పటికీ లోతట్టు గ్రామాల గిరిజనులు నమ్మటం లేదు. తాజాగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన గురించి అధికారులు చెప్పినప్పుడు కూడా వారు ఎన్టీఆర్‌ తరువాత సిఎంగా మాత్రమే భావిస్తున్నారు. అంటే ఇంకా వారి దృష్టిలో ఎన్టీఆర్‌ బతికే ఉన్నారన్నమాట. ఎన్టీఆర్‌ తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఏజెన్సీ వచ్చారు. అంతేకాకుండా ఎన్టీఆర్‌ వచ్చినప్పుడు భూపతిపాలెం ప్రతిపాదనలు పంపించమన్నారని గుర్తు చేసుకున్నారు.     అదీ అప్పటి ఎమ్మెల్యే జగ్గారావు విజ్ఞప్తి మేరకు భూపతిపాలెం ప్రతిపాదనలు ఎన్టీఆర్‌ కోరారు. ఆ ప్రాజెక్టుకు కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రంపచోడవరంలో ఎన్టీఆర్‌ పర్యటించిన తరువాత మారేడుమిల్లి గిరిజన తండాల సమీపంలో ఒకగుడారం వేయించుకున్నారు. గిరిజనులను ఎన్టీఆర్‌ పలకరించిన తీరు ఆకట్టుకుంది. ఇది లోతట్టు ప్రాంతాల నుంచి ఎన్టీఆర్‌ను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారు. అప్పట్లో ఆయన్ని చూడటమే గొప్పగా గిరిజనులు భావించారు. గొప్పవాడైనందునే ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారని విశ్వసించారు. ఆ తరువాత వచ్చిన చంద్రబాబును కానీ, వైఎస్‌ఆర్‌ కానీ లోతట్టు ప్రాంత గిరిజనులకు ఇంకా తెలియదు. వీరిద్దరి పరిపాలనా కాలం కూడా ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా కొనసాగారని భావించారు.   తాజాగా భూపతిపాలెం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ముసురుమిల్లి ఆశ్రమ పాఠశాలలోని ఓ గదిలో విశ్రాంతి తీసుకున్నారు. దీనికి ముందు గిరిజన విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలానే వారితో పాటు క్రికెట్‌ కూడా ఆడారు. గతంలో తాను క్రికెట్‌ ఆడిన అనుభవాలను గిరిజన విద్యార్థులతో పంచుకున్నారు. తాను ఉన్న ఒక్కరోజు అనుభవాలు మరిచిపోలేనని సిఎం శెలవు తీసుకుంటుంటే గిరిజనులకు మాత్రం కళ్ల ముందు ఎన్టీఆర్‌ మెదిలారు.

నిమ్మగడ్డకు త్వరలో బెయిల్‌ ?

జగన్‌ అక్రమాస్తుల కేసులో చంచల్‌గూడాజైలులో ఉన్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ త్వరలో బెయిల్‌పై బయటకు రానున్నారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో ఎ`2 ముద్దాయిగా ఉన్న జగతిపబ్లికేషన్స్‌ వైస్‌ఛైర్మన్‌, ఆడిటర్‌ విజయసాయిరెడ్డికి బెయిల్‌ దొరికినట్లే ప్రసాద్‌కూ బెయిల్‌ వస్తుందని ఆయన న్యాయవాది ఆశిస్తున్నారు. దీనికి అవసరమైన వాదన డిఫెన్స్‌ లాయర్‌ ఉమామహేశ్వరరావు సిబిఐ కోర్టులో పూర్తి చేశారు. ఎ`2ను వదిలేసి ఎ`12గా ఉన్న నిమ్మగడ్డను సిబిఐ జైలులో ఉంచిన తీరును ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఏ విషయమూ తేల్చకుండా అలా జైలులో ఉంచితే కోర్టు విధించిన శిక్ష కన్నా ఎక్కువ సమయం జైలుజీవితం గడిపినట్లుంటుందని విశదీకరించారు. అసలు జగతిపబ్లికేషన్స్‌ కేసులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నిందితుడవుతారని, ఆయన చనిపోయినందున నిందితుడు కాదంటే సిబిఐ చెబుతున్న కుట్రకు అర్థమే లేదని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌ లేనప్పుడు అసలు కుట్రే జరగలేదనుకుంటే నిమ్మగడ్డ కుట్రదారుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. బెయిల్‌ పొందేందుకు విజయసాయిరెడ్డి అర్హుడైతే నిమ్మగడ్డ కూడా అర్హుడేనని వివరించారు. భారతీసిమ్మెంట్సులో తమ క్లయింట్‌ పెట్టిన పెట్టుబడులు తిరిగి వచ్చేశాయని, ఆ వ్యవహారంలోనే రూ.62 కోట్లకు ఆదాయపన్ను కూడా చెల్లించారని స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌ కంపెనీ భారతీ సిమ్మెంట్సు కొన్నందున నిమ్మగడ్డ పెట్టుబడి తిరిగి ఇచ్చేశారని తెలిపారు. వాన్‌పిక్‌ ప్రాజెక్టు గురించి రాష్ట్రప్రభుత్వమూ, రస్‌`అల్‌`ఖైమాకు లేని అభ్యంతరాలు సిబిఐకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. భూకేటాయింపులన్నీ కేబినెట్‌ అనుమతితోనే జరిగాయని, అసలు అన్ని ఆథారాలు సిబిఐ వద్ద ఉంటే నిమ్మగడ్డ వాటిని ఇక తారుమారు చేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఇలా నిమ్మగడ్డ తరుపున పటిష్టమైన వాదనను సిబిఐ కోర్టు ముందుంచినందున ఆయన త్వరలో బయటికి వస్తారని ప్రసాద్‌ కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.

జగన్‌ వోటు ప్రణబ్‌కే

కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీకి ఓటు వేసేందుకు వై.కా.పా. అథినేత జగన్మోహనరెడ్డి సిద్ధమయ్యారని సమాచారం. అత్యంత విశ్వసనీయమైన ఈ సమాచారం అందరికీ ఆసక్తిని పెంచింది. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగ్మాకు బిజెపి మద్దతు ఇచ్చినా జగన్‌ మాత్రం ప్రణబ్‌ముఖర్జీకి మద్దతు తెలుపుతున్నారు. అలానే ఈయన తరుపు ఎమ్మెల్యేలు కూడా ప్రణబ్‌కే మద్దతు ఇస్తున్నారు. దీని వెనుక కారణాలు పరిశీలిస్తే అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న జగన్‌ను కాపాడుకునేందుకు ఆయన తల్లి, వై.కా.పా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రధానిని కలిశారు. జగన్‌పై ఇడి ప్రభావం కనుక తగ్గిస్తే తాము రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని ఆమె భరోసా ఇచ్చారట. అదీ జగన్‌ సూచన ఆథారంగానే ప్రధానితో బేటీ జరిగిందని తెలుస్తోంది.   రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటువేసేందుకు సిబిఐ కోర్టు జగన్‌కు, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణకు అనుమతి ఇచ్చింది. అయితే పోలింగ్‌ పేరిట బయటివారితో జగన్‌ సంప్రదించకుండా ఓటుకు మాత్రమే అనుమతి ఇవ్వాలన్న సిబిఐ సూచనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఓటు వేయటానికి అనుమతి ఇవ్వటంతో జగన్‌ ఎవరికి ఓటు వేస్తారన్న ఆసక్తి ఎక్కువైంది. అయితే విజయమ్మ ఢల్లీ పర్యటన సమయంలో ప్రధానికి ఇచ్చిన హామీ మేరకు ఓటు ప్రణబ్‌కే అన్న విషయం తేలిపోయింది. అంతేకాకుండా చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌పై ఇడి ఒత్తిడి చేయకపోవటమూ విజయమ్మ ఢల్లీ పర్యటన ఫలితమని తెలుస్తోంది. ఏదేమైనా జగన్‌ సీనియర్‌ నాయకుడు, రాష్ట్రపతి పదవికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి ప్రణబ్‌ అని పార్టీశ్రేణులకు వివరించారట. దీని ప్రకారం పరిశీలించినా జగన్‌ ఓటు ప్రణబ్‌కే అన్న విషయం అర్థమవుతోందని పరిశీలకులు అంటున్నారు. అలానే కాంగ్రెస్‌ పార్టీ తరుపున విజయం సాధించి మంత్రి పదవిని అనుభవించినందుకు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా ప్రణబ్‌కే ఓటేస్తారని భావిస్తున్నారు.

అధికారులను వణికిస్తున్న సమాచార హక్కు చట్టం!

సమాచార హక్కు చట్టం పదునెక్కింది. నిబంధనలు ఉల్లంఘించిన ఏడుగురికి రాష్ట్ర సమాచార కమిషన్‌ జరిమానా విధించింది. రాష్ట్ర సమాచార కమిషనర్‌ మధుకర్‌రాజ్‌ 2009`10లో సమాచారం ఇవ్వలేదని ఏడుగురు పిఐఓలపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపారు. ఏడుగురు పిఐఓలూ నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా విధించారు. ఈ జరిమానా కూడా తమ జీతాల్లోంచి కట్టాలని వారికి ఆదేశాలు ఇచ్చారు. 2009లో దేవాదాయశాఖ విజయనగరం జిల్లా అసిస్టెంట్‌ కమిషనరుగా పని చేసిన అథికారికి 25వేల రూపాయలు జరిమానా విధించారు. నెల్లూరు ఐదోటౌన్‌, గూడూరు వన్‌టౌన్‌, గూడూరు ఎస్‌ఐ, హైదరాబాద్‌ వైద్యవిధానపరిషత్తు జాయింట్‌డైరెక్టర్‌ తదితరులకు పదివేల రూపాయల జరిమానా విధించారు.  రాజమండ్రి నగరపాలక సంస్థ డిప్యూటీకమిషనరుకు వెయ్యిరుపాయల జరిమానా విధించారు. ఇలా మొత్తం ఏడుగురికి ఒక్కసారే పెనాల్టీలు విధించటం రాష్ట్రంలో సంచలనమైంది. సకాలంలో సమాచారం ఇవ్వకుండా జాప్యం చేస్తే చర్యలుంటాయని చెప్పేందుకు హెచ్చరికగా కమిషనరు పెనాల్టీలు విధించారు. జరిమానా చెల్లించాల్సిన వారిలో నలుగురు పిఐఓలు నెల్లూరు జిల్లావారు కావటం గమనార్హం. అందుకే ఆ జిల్లాలో ఈ వార్త పోలీసుశాఖను కదిలించింది. సమాచారం కోరే కేసులను అజాగ్రత్తగా చూడొద్దని ఎస్‌ఐలు తమ కింది సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎవరు సమాచారం కోరినా ముందుగా తన దృష్టికి తీసుకురావాలని ఎస్‌ఐలు తమ సిబ్బందిని కోరుతున్నారు.  అవసరమైతే దీనికి ప్రత్యేకంగా స్టేషనులో ఒకరికి బాధ్యత అప్పగిద్దామని కూడా వారు నిర్ణయం తీసుకున్నారట. అలానే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరపాలక సంస్థ డిప్యూటీకమిషనరుకు వెయ్యిరూపాయలు పెనాల్టీ విధించటం కార్పొరేషనులో పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై జిల్లా కేంద్రమైన కాకినాడలోనూ నగరపాలక అధికారులు చర్చించారు. పైగా, ఇప్పటి దాకా పెండిరగ్‌లో ఉన్న సమాచారహక్కు కేసుల గురించి తమ సిబ్బందిని పిలిచి కాకినాడ నగరపాలక సంస్థ కమిషనరు వి.రవికుమార్‌ ప్రశ్నించారట. మొత్తం మీద నగరపాలక సంస్థల్లోనూ, పోలీసుశాఖలోనూ ఈ ఉత్తర్వులు స్పందన తీసుకువచ్చాయి. సమాచార హక్కు చట్టం పదును తెలుసుకునేందుకు కూడా ఈ ఉత్తర్వులు దోహదపడ్డాయని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.  

బాలీవుడ్ లో మొదటి సూపర్‌స్టార్‌ రాజేష్ ఖన్నా

అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టిన రొమాంటిక్ హీరోగానే కాకుండా హిందీ చిత్రపరిశ్రమలో మొట్టమొదటి సూపర్‌స్టార్‌గా నీరాజనాలు అందుకున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై ఆయన ప్రదర్శించిన హావభావాలు, స్టైల్స్, డాన్సులు, డైలాగులు అభిమానులను గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. ఎంతగా అంటే ఆయనను పదేపదే అనుకరించేలా. ఆయనెవరో కాదు బాలీవుడ్ మొట్టమొదటి సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా. 69 ఏళ్ల ఖన్నా బుధవారం మధ్యాహ్నం తన నివాసంలో శాశ్వతనిద్రలోకి జారుకున్నారు. సినిమా జీవితం ఉచ్ఛ దశలో ఉన్నప్పుడు అభిమానులతో ‘కాకా’ అని ముద్దుగా పిలుపించుకున్నారు. ఆయనెక్కడకు వెళితే అక్కడ అభిమాన తరంగం సునామీలా పొంగుకొచ్చేది. ఆయన కనబడితే చాలు ఫ్యాన్స్ వరుస కట్టేవారు. ఆయన పేరును నిత్యాపారాయణంలా జపించేవారు. అభిమానులుఆయన కారును ముద్దుల్లో ముంచెత్తిన సంఘటనలు ఉన్నాయి. ఇక మహిళా అభిమానులు నుంచి రక్తంతో రాసిన ప్రేమలేఖలు లెక్కలేనన్ని అందుకున్నారు. ఆయన కంటే ముందు రాజ్‌కపూర్, దిలీప్ కుమార్ కూడా అభిమానులను అలరించినప్పటికీ ఖన్నా ఏకంగా వారి హృదయాల్లోనే పాగా వేశారు. 1942, డిసెంబర్ 29న జన్మించిన రాజేష్ ఖన్నా దత్తత తీసుకున్న తల్లిదండ్రుల దగ్గర పెరిగారు. ఆయన అసలు పేరు జతిన్ ఖన్నా. చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాలంటే పిచ్చి. స్కూల్లో ఎన్నో నాటకాల్లో నటించారు. సినిమాల్లో చేరాలనుకుని నిర్ణయించుకున్నాక 1965లో తన పేరును రాజేష్‌గా మార్చుకున్నారు. అదే ఏడాది యునెటైడ్ ప్రొడ్యూసర్స్, ఫిల్మ్‌ఫేర్ నిర్వహించిన ఆల్ ఇండియా టాలెంట్ పోటీలో విజేతగా నిలిచి సినిమా అవకాశం దక్కించుకున్నారు. చేతన్ ఆనంద్ దర్శకత్వంలో ‘ఆఖరి కథ్’ చిత్రం ద్వారా ఖన్నా వెండితెరపై అడుగుపెట్టారు. 1969లో వచ్చిన ‘ఆరాధన’ చిత్రం ఆయన స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో గాయకుడు కిషోర్‌కుమార్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడమే కాకుండా రాజేష్ ఖన్నా ఆస్థాన గాయకుడిగా మారిపోయాడు. అక్కడి వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్‌హిట్ పాటలు వచ్చాయి. ఆర్‌డీ బర్మన్, ఖన్నా, కిషోర్‌కుమార్ కలిసి 30పైగా సినిమాలు చేశారు.   CLICK HERE FOR RAJESH KHANNA PHOTOS ఆరాధన సినిమా తర్వాత ఖన్నా శకం ప్రారంభమైంది. 1969-1972 మధ్య కాలంలో ఏకబిగిన 15 సోలో సూపర్ హిట్‌లిచ్చి భారతీయ చిత్ర పరిశ్రమలో తిరగరాయలేని రికార్డును తన పేరిట లఖించుకున్నారు. మొత్తం 163 సినిమాల్లో నటించిన ఆయన 106 చిత్రాల్లో సోలో హీరోగా చేశారు. 14సార్లు ఫిల్మ్‌ఫేర్కు నామినేటయి మూడుసార్లు బెస్ట్ హీరోగా అవార్డు అందుకున్నారు. 2005లో ఫిల్మ్‌ఫేర్ లఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం స్వీకరించారు. 80వ దశకం చివరివరకు తన నటనతో అభిమానులను అలరించిన ఆయన 1992-96 వరకు కాంగ్రెస్ తరపున లోక్‌సభ సభ్యుడిగా సేవలందించారు. 70వ దశకం ఆరంభంలో అంజు మహేంద్రుతో ప్రేమాయణం సాగించిన రాజేష్ ఖన్నా 1973లో తన కంటే 15 ఏళ్లు చిన్నదయిన డింపుల్ కంపాడియాను పెళ్లిచేసుకున్నారు. 1984లో వీరు విడిపోయారు. వీరికి ట్వింకిల్, రింకిల్ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. డింపుల్‌కు దూరమయిన తర్వాత టీనా మునియమ్ (ఇప్పుడు అంబానీ)కి దగ్గరయ్యారు. వీరిద్దరూ ఫిఫ్టీ-ఫిఫ్టీ, అధికార్, బెవఫాయ్, సురాగ్ తదితర సినిమాల్లో నటించారు. విభిన్న పాత్రలు పోషించినా ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ హీరోగానే ఖన్నా ఖ్యాతికెక్కారు. ఆయన మరణంతో బాలీవుడ్‌లో ఒక శకం ముగిసిందని చెప్పొచ్చు.   CLICK HERE FOR RAJESH KHANNA PHOTOS

ఆరు నెలల్లో కిరణ్‌ ప్రభుత్వం కూలడం ఖాయమా?

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండబోదని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ తెలంగాణా ఇచ్చే అంశాన్ని పక్కనబెట్టేయాలని గతంలోనే నిర్ణయించుకున్నట్లు సమాచారం. కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో జగన్‌ పార్టీ ప్రభంజనం కొనసాగుతూనే ఉన్నది. దీనిని అధిగమించడం కాంగ్రెస్‌కు సాధ్యమయ్యే పనిలా లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని నిమ్మకు నీరెత్తినట్లు నడుపుతున్నారు. మరో ముఖ్యమంత్రిని మార్చినందువల్ల ప్రయోజనం లేదని, ఎలాగోలా ఇలాగే నడిపించే ప్రయత్నంలో కాంగ్రెస్‌ ఉన్నది.     జగన్‌కు బెయిల్‌ ఇవ్వని పక్షంలో సెప్టెంబర్‌లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నించవచ్చని, డిసెంబర్‌లో మధ్యంతర ఎన్నికలు జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాన్ని అడ్డుకోవద్దని, మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. మధ్యంతర ఎన్నికల్లో జరగబోయే నష్టాన్ని కర్ణాటక ద్వారా భర్తీ చేసుకోవాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వంపై ప్రజలకు వెగటు కలిగిందని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పడిపోతే కాంగ్రెస్‌ కర్ణాటక ప్రభుత్వాన్ని కూలదోసి రెండు రాష్ట్రాల్లో ఒకేసారి మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది.

ఐ.ఎ.ఎస్‌.లలో అవినీతి పరులు లేరా?

రాష్ట్రమంత్రి టి.జి.వెంకటేష్‌ ఐ.ఎ.ఎస్‌.ల పనితీరుపై విసుగుచెంది పని చేయని అధికారులను నడిరోడ్డుపై కాల్చి వేయాలని బహిరంగంగా ప్రకటించడంతో ఐ.ఎ.ఎస్‌. వర్గాల్లో కలకలం ప్రారంభమైంది. మంత్రి ప్రకటన తమ మనోధైర్యాన్ని దెబ్బతీసేదిగా ఉందని  రాష్ట్ర ఐ.ఎ.ఎస్‌. అధికారుల సంఘం ప్రతినిధి రేమాండ్‌ పీటర్‌ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఐ.ఎ.ఎస్‌. ఆవేదన సరైందే. కాని వారిలో కూడా అత్యంత అవినీతి  పరులు, బద్దకస్తులు, అహంభావులు ఉన్నారు వారి మాటేమిటి? నిజానికి ఐ.ఎ.ఎస్‌.లను ఘాటుగా విమర్శించిన వారిలో టి.జి.వెంకటేష్‌ మొదటి వారు కాదు. పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా వారి పనితీరుపై తీవ్ర అసంతృప్తిని గతంలో వ్యక్తం చేశారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అయితే వారిని మంచి సేవకులే గాని మంచి పాలకులు కాదని అభిర్ణించగా సుబోధ్‌ కాంత్‌ సహాయ్‌ వారిని జోకర్ల సమూహంగా తేల్చిపారేశారు. కేంద్రమంత్రి జైరాం రమేష్‌ మరో ముందడుగువేసి బ్యూరోక్రాట్లను ఆటో క్రాట్లన్నారు. ప్రభుత్వ విధానాలను రూపొందించాల్సిన బాధ్యత ప్రజానాయకులపై ఉందని బ్యూరో క్రాట్లు ప్రభుత్వ విధానాలను రూపొందించడానికి సహäయ పడే కన్సల్టెంట్స్‌ మాత్రమే కాని విధాన రూపకల్పనకు కర్తలు కాదని స్పష్టం చేశారు. నిజానికి ఐ.ఎ.ఎస్‌.లోని కొందరు చడీ చప్పుడు లేకుండా కోట్లాది రూపాయలు అక్రమ మార్గంలో ఆర్జిస్తున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌, జూబ్లి హిల్స్‌లో కొందరు ఐ.ఎ.ఎస్‌. అధికారులకు కోట్లాదిరూపాయల విలువ చేసే బంగ్లాలు ఉన్నాయి. వీరికొచ్చే నెలవారి జీతాలు , అలవెన్స్‌లతో ఇటువంటి బంగ్లాలను నిర్మించడం సాధ్యం కాదు. రాష్ట్ర సచివాలయంలో కొందరు ఐ.ఎ.ఎస్‌.లకు ఏజెట్లు ఉన్నారు. వీరి పని ఐ.ఎ.ఎస్‌.ల తరఫున లంచాలు వసూలు చేయడం. ఇలా చేయడం వల్లనే ఇప్పటికే శ్రీలక్ష్మీ, బి.పి. ఆచార్య జైళ్ళలో మగ్గుతున్నారు. ప్రస్తుత ఐ.ఎ.ఎస్‌.ల  పని తీరుచూస్తుంటే  ఆ వ్యవస్ధను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పిస్తోంది.

సీమాంధ్రుల వోటు హక్కును కాలరాచిన బాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల వోటు హక్కును కాలరాచారన్న అపవాదును ఎదుర్కోంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ అభ్యర్దికి వోటు వేయకూడన్న పార్టీ నిర్ణయం పట్ల సీమాంధ్రకు చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం  చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధుల వత్తిడికి లొంగి పోలింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని అయితే ఈ నిర్ణయం వల్ల తమ వోటు హక్కుకు భగం కలిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.     రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీలో ఉన్న ప్రణబ్‌ ముఖర్జీ తెలంగాణా వ్యతిరేకి అని , సంగ్మాకు మతతత్వ బి.జె.పి. మద్దతు ఇస్తున్నందువల్ల ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. నిజానికి  ప్రణబ్‌ ఎప్పడూ తెలంగాణాకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. అలాగే గతంలో తమ పార్టీ బి.జె.పి.తో చెట్టాపట్టాల్‌ వేసుకుతిరిగిన విషయం అందరికి తెలిసిందేనని, బి.జె.పి. మద్దతు ఇచ్చినంత మాత్రాన సంగ్మా మతతత్వవాది అయిపోతారా ? వారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెబుతున్నవన్నీ కుంటి సాకులేలని , తెలంగాణా ప్రజా ప్రతినిధుల వత్తిడికి ఆయన లొంగిపోయాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా వాదులను సంతృప్తి పర్చడానికి తమ వోటు హక్కును కాలరాయడం ఎంత వరకూ సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.

బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా మృతి

బాలీవుడ్ లో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న అలనాటి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా బుధవారం ఉదయం తమ స్వగృహంలోనే కన్ను మూశారు. ముంబైలోని బాంద్రాలో సొంత ఇంటిలో జీవిస్తున్న ఖన్నా కొంతకాలంగా అస్వస్థతకు గురవుతున్నారు. ముంబైలోని లీలావతీ ఆస్పత్రిలో చేర్పించారు. తర్వాత మళ్లీ స్వస్థత చేకూరడంతో ఆయనను ఇంటికి తిరిగివచ్చారు. తిరిగి మంగళవారం నాడు ఆయన మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు ఇంటికే వచ్చి ఆయనకు చికిత్స చేశారు. కాని చివరికి బుధవారం మధ్యాహ్నం అంతిమ శ్వాస విడిచారు. రాజేశ్ ఖన్నా 1966లో హిందీ సినిమా రంగంలో ప్రవేశించారు. రాజేశ్ ఖన్నా 1991లో రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి కాంగ్రెస్ ఎం.పి.గా ఎన్నికయ్యారు