రోడ్డు ప్రమాదంలో 31మంది మృతి

షిల్లాంగ్:గౌహతి నుంచి అగర్తల వెళుతున్న బస్సు తూర్పు జైనిటా హిల్స్ జిల్లాలో లోయలో పడటంతో  31 మంది మరణించారు. 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. మేఘాలయ,అస్సాం సరిహద్దులోని తామ్సెంగ్ గ్రామం వద్ద ఉదయం 3  నుంచి 5 గంటల మధ్య 44వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. 80 అడుగుల లోతైన గోతిలో పడటంతో ప్రాణనష్టం భారీగా సంభవించింది. ఇప్పటివరకూ 31 మృత దేహాలను వెలికి తీశామని పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. బస్సులో చిక్కుపోయిన వారిని రక్షించేందుకు సహాయ చర్యలు ప్రారంభించారు.ప్రమాదంలో బస్సు డ్రై వర్ కూడా మరణించాడు. డ్రై వర్ మద్యం తాగి బస్సు నడపటం లేదా మట్టి కుంగిపోయి కొండచరియలు విరిగిపోవటం ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

వెంటిలేటర్ పైనే విలాస్ రావ్

మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖా మంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ పరిస్థితి మరింత విషమంగా మారింది. కాలేయం, రెండు మూత్రపిండాలు సహా పలు అవయవాలు పనిచేయడం లేదని డాక్టరు చెబుతున్నారు. ఇటీవలే ముంబై ఆస్పత్రినుంది మెరుగైన చికిత్స కోసం ఆయన్ను చెన్నైలోని గ్లోబల్ హాస్పిటల్ కు తరలించారు. ప్రసుతం ఆయనకు వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం కాస్త బాగుపడితే కాలేయ మార్పిడి చేస్తారని సమాచారం. సినీనటుడు మరియు విలాస్ రావ్ దేశ్ ముఖ్ కుమారుడు రితేష్ దేశ్ ముఖ్ తన తండ్రికి తన కాలేయంలోని కొంత భాగాన్ని ఇవ్వడానికీ సిద్ధంగా ఉన్నా విలాస్ రావ్ దేశ్ ముఖ్ కు కొడుకు కాలేయం సరిపోతుందా లేదా అన్నది వైద్యులు నిర్వహించే పరీక్షలలో తేలనుంది.

రికార్డ్ సృష్టించిన అన్సారీ ఎన్నిక

సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతిగా పదవిలో కొనసాగారు. ఇన్ని సంవత్సరాల తరువాత హమీద్ అన్సారీ వరుసగా రెండు సార్లు ఉపరాష్ట్రపతి పదవిని దక్కించుకుని రికార్డ్ సృష్టించారు. హమీద్ అన్సారీ కోలకతాలో 1937వ సంవత్సరం ఏప్రిల్ 1న జన్మించారు. వర్షాకాల సమావేశాలు బుధవారం నుండి ప్రారంభం కానుండగా మంగళవారం ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ప్రధాని మన్మోహన్, యోపేఎ చైర్ పర్సన్ సోనియా, రాహుల్ గాంధీ, యోపేఎ భాగస్వామ్య ఎంపీలు, ప్రతిపక్ష బీజేపీ పార్టీ అగ్రనేత అద్వానీ, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, ఎస్పీ అధినేత ములాయం సింగ్, బిఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్యసభకు కొత్తగా ఎంపికైన బాలీవుడ్ నటి రేఖ, క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.   లోక్ సభ, రాజ్యసభలతో కలిపి మొత్తం 787 ఓట్లు ఉండగా 736 ఓట్లు పోలయ్యాయి అందులో 8 చెల్లుబాటు కాలేదు. యూపిఎ అభ్యర్థిగా బరిలో నిలిచిన హమీద్ అన్సారీ కి 490 ఓట్లు రాగా ఎన్.డి.ఏ. అభ్యర్థిగా పోటీలో నిలిచినా జశ్వంత్ సింగ్ కు 238 ఓట్లు వచ్చాయి. పోలింగ్ కు దూరంగా బిజెడి ఎంపీలు 11 మంది, తెలుగుదేశం ఎంపీలు 11, ఆరేస్పీ ఎంపీలు 2, యూపిఏ మిత్రపక్షాలకు చెందిన 6 ఎంపీలు, ఇద్దరు నామినేటేడ్ సభ్యులు, టి.ఆర్.ఎస్, కు చెందిన 2 ఎంపీలు, బీజేపీ 2 ఎంపీలు, ఏజీపీ 2 ఎంపీలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరికొంతమంది ఉన్నారు. సాయంత్రం ఏడు గంటలకు ఫలితాలను వేలువరించగానే యూపిఏ సభ్యులు అన్సారీని అభినందించారు. అన్సారీ తనను ఎన్నుకున్న ఎంపీలందరికీ తన ధన్యవాదాలు తెలిపారు.

కేసిఆర్‌ను సైకోగా తేల్చేసిన సోమిరెడ్డి

టిఆర్‌ఎస్‌ అథినేత కేసిఆర్‌ ఒక సైకో అని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తేల్చేశారు. ఇప్పటి వరకూ ఒకరిని విమర్శించటానికి ప్రాధాన్యత ఇవ్వని సోమిరెడ్డికి తెలుగుతల్లి గురించి చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలు ఒళ్లు మండేలా చేశాయి. తెలుగుతల్లిని దెయ్యం అన్న కేసిఆర్‌ తోటి తెలుగువారిని గౌరవించటం నేర్చుకోవాలని సోమిరెడ్డి కోరారు. పిచ్చి ముదిరినట్లు తనకు తెలియని చరిత్ర గురించి కేసిఆర్‌ మాట్లాడారని, అది ఆంధ్రులను రెచ్చగొట్టడంలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నోరు ఉంది కదా అని పారేసుకునే బదులు ఒక్కసారి కేసిఆర్‌ గతాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కేసిఆర్‌ తెలుగుతల్లి పాటను ఆలకించి పులకరించారని సోమిరెడ్డి గుర్తు చేశారు. తాను ఎలా అర్థం చేసుకున్న కేసిఆర్‌లో సైకో లక్షణాలే ఎక్కువ కనిపిస్తున్నాయని విశదీకరించారు. ఈ లక్షణాలు ఉండటం వల్లే ఆయన్ని వదిలేసుకోవటానికి తెలంగాణా జెఎసి కూడా సిద్ధమవుతోందని అభిప్రాయపడ్డారు. సగటు భారతీయులను ధూషించటం ఎంత మాత్రం బాగోలేదని సోమిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సాహిత్యం గురించి పూర్తిగా పరిచయం లేని కేసిఆర్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం బాగోలేదని పలువురు సాహితీవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నన్నయ్యను విమర్శించేంత పాండిత్యం లేని కేసిఆర్‌ ఖబడ్దార్‌ అని వారు హెచ్చరిస్తున్నారు.

జగన్‌కు ఈ నెలాఖరు లోగా బెయిల్‌?

మూడు నెలల పాటు సిబిఐ విచారణను ఎదుర్కొన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డికి ఈ నెలలో సుప్రీం కోర్టు బెయిల్‌ ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ఎందుకంటే ఇప్పుడేమీ ఎన్నికలు లేవు. పైగా కేంద్రంలో కాంగ్రెస్‌కే మద్దతు ఇస్తానని జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందున ఈ బెయిల్‌ మంజూరయ్యే అవకాశాలున్నాయని రాజకీయపండితులు అంటున్నారు. హైకోర్టు జగన్‌ బెయిల్‌ పిటీషన్‌ నిరాకరించినందుకు సుప్రీంకోర్టులో దాన్ని సవాల్‌ చేస్తూ పిటీషను వేశారు. ఈ పిటీషనుపై విచారణ ఈ నెల 9న సుప్రీంకోర్టు చేపట్టింది. అయితే సిబిఐ చెప్పినట్లు సాక్ష్యులను తారుమారు చేసే అవకాశం జగన్‌కు లేదనటానికి మూడునెలల పాటు చంచల్‌గూడా జైలులో శిక్ష అనుభవించటమే నిదర్శనంగా చూపనున్నారు.     ఈ గ్రౌండ్‌పైనే కేసును ముందుకు నడిపితే మాత్రం సుప్రీం కోర్టు మూడునెలల పాటు నేరం రుజువుకాకుండానే శిక్ష అనుభవించినందుకు జగన్‌కు బెయిల్‌ ఇచ్చే అవకాశాలు ఎక్కువ అని న్యాయనిపుణులు అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందన్న నమ్మకంతో జగన్‌ తల్లి, వైకాపా గౌరవాథ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి రాజమండ్రిలో కార్యకర్తలకు జగన్‌ వచ్చి కలుస్తాడని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటిదాకా అందరూ ఊహించని విధంగా జైలులో గడిపిన జగన్‌ బయటకు వచ్చాక తిరిగి ప్రజల్లోకి వెళతారంటున్నారు. తనకు జరిగిన అన్యాయం గురించి సానుభూతిపరుల ద్వారా ప్రజలకు తెలియజేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని జగన్‌ భావిస్తున్నారని ప్రచారం ప్రారంభమైంది. అంటే జగన్‌ బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువనేది మరోసారి గుర్తుచేసుకోక తప్పదు.

జైల్లో పూజలు,ఉపవాస దీక్షలు చేస్తున్న శ్రీలక్షి

ఐఎఎస్‌ చదువుకున్నా, కలెక్టరుగా పని చేసినా తాను సాధారణగృహిణిని అని శ్రీలక్ష్మి నిరూపించుకుంటున్నారు. ఆరునెళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్న ఆమె విఐపి ఖైదీ అయినా ఇప్పుడు సాధారణఖైదీలతో నవ్వుతూ కాలం గడుపుతున్నారు. ఆమె దినచర్య కూడా ఒక పద్దతి ప్రకారం నడుస్తోంది. ఉదయం నిద్రలేచిన తరువాత స్నానం పూజ, ఆనక అల్పాహారం, మథ్యాహ్నభోజనం, సాయంత్రం తిరిగి పూజ, రాత్రికి అల్పాహారం ఆమె దైనందికచర్యలయ్యాయి. పర్వదినాల్లో ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఖాళీ సమయాల్లో కుట్లు, అల్లికలు నేర్చుకునేందుకు ఆమె ఉత్సాహాన్ని చూపుతున్నారు. దీనితో పాటు తోటి మహిళా ఖైదీలతో గడుపుతూ వారి బాధలు, ఇబ్బందులు కనుక్కుంటున్నారు. అలాగే తనను కలవాలని వచ్చేవారందరినీ ఆమె నిరాకరిస్తున్నారు. ప్రత్యేకించి తన భర్తతో మాత్రమే వారానికి రెండు రోజులు కలుస్తున్నారు. కాని తనను కలవటానికి వచ్చే న్యాయవాదితోనూ మాట్లాడటానికి శ్రీలక్ష్మి ఇష్టపడటం లేదు. అయితే రాత్రిపూట సాధారణఖైదీలతో కలిసే ఆమె నిద్రిస్తున్నారు. గత నవంబర్‌లో అరెస్టు అవటానికే ఇబ్బందిగా ఫీలైన ఆమె ఒక్కసారిగా మారిపోవటం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. అంతేకాకుండా తన దినచర్యను బిజీగా చేసుకుని అందరితోనూ కలిసిపోవటం శ్రీలక్ష్మిని ఓ సాదారణగృహిణి చూడాలన్న భావనకు ప్రేరణగా ఉందని పోలీసులూ అంటున్నారు. తోటి మహిళా ఖైదీలందరితోనూ శ్రీలక్ష్మి సంతోషంగా ఉండటమే దీనికి నిదర్శనమన్నారు.

జైపాల్‌రెడ్డిని లొంగదీసిన కిరణ్‌?

రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా మహారాష్ట్రకు సహకరించిన కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి జైపాల్‌రెడ్డిని సిఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రధాని సహాయంతో లొంగదీశారు. దీంతో కేజీబేసిన్‌ గ్యాస్‌లో మహారాష్ట్రకు కేంద్రం వేసిన వాటా ఆగిపోయింది. అంటే విద్యుత్తుఉత్పత్తికి కేజీ బేసిన్‌ నుంచి విడుదల చేసే 3.48ఎంఎంఎస్‌సిఎండి గ్యాస్‌ యథాతథంగా మన రాష్ట్ర అవసరాలకు వాడుకోవచ్చు. ఒకరకంగా ప్రధాని జోక్యం వల్లే ఈ గ్యాస్‌ సరఫరా విషయంలో జైపాల్‌రెడ్డికి చుక్కెదురైంది. ఈయన్ని కేవలం పీసిసి చీఫ్‌ బొత్సా సత్యన్నారాయణ మినహా ఇంకెవరూ సమర్థించలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట వినే ప్రసక్తే కేంద్ర నాయకత్వానికి ఉండదని బొత్సా భావించారు.     దీనికి భిన్నంగా కిరణ్‌ సమస్యను ఎత్తిచూపటంలో సఫల మయ్యారు. ఆయన ప్రధానితో పాటు వీరప్పమొయిలీ, ఎఐసిసి అథ్యక్షురాలు సోనియాగాంధీని కూడా కలిశారు. వీరిద్దరితోనూ తాను ఎందుకు ఢల్లీి రావాల్సి వచ్చిందో స్పష్టంగా చెబుతూ పెట్రోలియంశాఖ మంత్రి జైపాల్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరును వారికి అర్థమయ్యేలా విశదీకరించారు. ఒక కేంద్రమంత్రి హోదాలో ఉండికూడా జైపాల్‌రెడ్డి రాష్ట్రానికి చేసిన అన్యాయం వారిని కదిలించింది. దీంతో వారు కేంద్ర ప్రభుత్వం పరంగా ఎదురయ్యే సవాళ్లు తరువాత చూసుకోవచ్చు ముందు కిరణ్‌కుమార్‌రెడ్డి సమస్య పరిష్కరించాలని ఓ నిర్ణయానికి వచ్చి గ్యాస్‌సరఫరా యథాతథంగా ఉంచాలని ఆదేశించారు. దీంతో జైపాల్‌రెడ్డి హైకమాండ్‌ ఆదేశాల మేరకు కేజీబేసిన్‌గ్యాస్‌ యథాతథంగా రాష్ట్రానికి అందిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకూ జైపాల్‌రెడ్డికి కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఇస్తూ వచ్చిన గౌరవం ఒకరకంగా దెబ్బతిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకదశలో జైపాల్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేంత అర్హత ఉన్న వ్యక్తిగా భావించిన కాంగ్రెస్‌ అథిష్టానం ఆయనపై ఉంచిన నమ్మకం మార్చుకుంది. అలానే విద్యుత్తు సమస్యతో ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న ఇబ్బందిని ప్రధాని ముందుంచటంలో కిరణ్‌ కూడా ప్రత్యేకమైనశైలిని ప్రదర్శించారు. తనతో పాటు వచ్చిన మిగిలిన సభ్యులతోనూ సమస్య తీవ్రతను చెప్పించటంలోనూ ఆయన సక్సెస్‌ అయ్యారు.

ఎం.పి.మందాతో ఢీ అంటున్న మంత్రి డి.కె.

ఒకరిని ఒకరు గౌరవించుకోవటం సాంప్రదాయం. అది నేతలైనా సామాన్యులైనా ఒక్కటే. తమ గౌరవాన్ని తగ్గించేస్తున్నారని మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండేళ్ల నుంచి రాష్ట్ర మంత్రి డికే అరుణపై ఎంపి మందా జగన్నాథం మండిపడుతున్నారు. తనను చులకన చేస్తున్నారని ఆయన మంత్రి వైఖరిపై పీసిసికి, డిసీసీకి ఫిర్యాదు చేశారు. తన పేరు ముద్రించకుండా నియోజకవర్గంలో కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని ఎంపి మందా జగన్నాథం మంత్రిపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అటు పీసిసి కానీ, రాష్ట్రనేతలు కానీ, పట్టించుకోకపోవటంతో జిల్లాలో కాంగ్రెస్‌పార్టీకి తీరని నష్టం జరుగుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరిద్దరూ మాత్రం నిత్యం పచ్చగడ్డి భగ్గుమనేలా వ్యవహరిస్తూనే ఉన్నారు. పొలమూరులో కూర్చీలతో తనను మంత్రి డికే తన్నించారని ఎంపి జగన్నాథం పీసిసి అథ్యక్షుడు బొత్సాసత్యన్నారాయణకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు బుట్టదాఖలు అయింది.     ఇటీవల ఎంపి వచ్చేలోపే మంత్రి కార్యక్రమాలు పూర్తి చేసేస్తున్నారు. ఒకవేళ కొంత కార్యక్రమం మిగిలి ఉంటే దాన్ని ఎంపికి వదిలేసి వెళ్లిపోతున్నారు. జగన్నాథం తన రాక చూసి మంత్రి వెళ్లిపోవటం జీర్ణించుకోలేకపోతున్నారు. శిలాఫలకాలపైనా, కార్యక్రమాల్లోనూ ప్రొటోకాల్‌ పాటించలేదని ఎంపి తరుచుగా అధికారులతో గొడవపడుతున్నారు. దీన్ని గుర్తించి అయినా అథిష్టానం ఒకసారి స్పందించాలని మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలు కోరుతున్నారు. అసలే బలం తగ్గిందని ఆందోళన చెందుతుంటే ఈ వివాదం పార్టీని ఎటువైపు తీసుకువెళ్తుందో అని వారు వాపోతున్నారు.

త్వరలో జగన్‌ వచ్చి కలుస్తాడంటున్న విజయమ్మ!

ఒకవైపు రాష్ట్రప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ తనయుడు జగన్మోహనరెడ్డి విషయంలో తన వైఖరిని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు సిబిఐ చేతులు కట్టేసినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అంటే జగన్‌ తన అనుయాయుల ద్వారా ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంథీకి పంపిన రాయబారం విజయవంతమైందని వార్తలు వస్తున్నాయి. ప్రధాని రేసులో ఉన్న రాహుల్‌గాంథీకి జగన్‌ మద్దతు ప్రకటించినందున దర్యాప్తు జోరు తగ్గించాల్సింగా సోనియా సిబిఐ, ఈడి అధికారలను ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్దగా కార్యక్రమాలు పెట్టుకోవటం లేదు. అయితే వైఎస్‌ఆర్‌ అనుచరుడు, దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహావిష్కరణకు వచ్చిన వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి తమ పార్టీ శ్రేణులతో త్వరలో జగన్‌ వచ్చి కలుస్తాడు అని అంటున్నారు. ఎవరూ ఎదురు ప్రశ్నించే అవకాశం లేకుండా ఆమె ఈ మాటను నొక్కిచెప్పారు. అభిమానులందరినీ ఉత్సాహపరిచేందుకు మాత్రమే ఆమె చెప్పినట్లు లేదు. ఖాయంగా జగన్‌ బయటికి వస్తారన్న సంకేతాలను ఇచ్చినట్లుంది. రెండోవైపు పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి పెరగకుండా జగన్‌ వీలైనంత తొందరగా వచ్చేస్తారని విజయమ్మ ఆనందంగా చెప్పటం దానికి ఏర్పాట్లు పూర్తయ్యాయన్న నమ్మకాన్ని కలిగించిందని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

స్వాతంత్య్ర సమరయోధుల భూములకు రెక్కలు?

ఇప్పటిదాకా స్వాతంత్య్రసమరయోధులకు ఇచ్చిన భూమిని అమ్ముకోవటానికి, ఆక్రమించుకోవటానికి వీలులేనంత పటిష్టమైన చట్టాన్ని ప్రభుత్వం అమలు చేసేది. అంటే స్వాతంత్య్ర సమరయోధుల భూములకు భద్రత ఎక్కువని అందరూ అనుకునేవారు. ఇక ఈ అభిప్రాయాన్ని రెవెన్యూశాఖ మార్చేసింది. స్వాతంత్య్ర సమరయోధులు సైతం తమ భూములను అమ్ముకోవటానికి వెసులుబాటు కల్పించింది. అయితే ఆంక్షలు మాత్రం పెట్టింది. భూమి విలువను బట్టి అనుమతి తీసుకుని అమ్ముకునే అవకాశం స్వాతంత్య్ర సమరయోధులకు కల్పించింది. అసలు విషయం ఏమిటంటే విశాఖ జిల్లాలో రెండు కొండలు రెవెన్యూభూమిని స్వాతంత్య్రసమరయోధులకు ప్రభుత్వం కేటాయించింది. అందరు స్వాతంత్య్ర సమరయోధులను ఏకతాటిపైకి తెచ్చి వారినుంచి దాన్ని కొనుగోలు చేయాలని హైదరాబాద్‌కు చెందిన కొందరు శేఠ్‌లు ప్రయత్నించారు.   ఉడా కూడా స్వాతంత్య్ర సమరయోథుల భూమి కాబట్టి అటువైపు కన్నేత్తి చూడలేదు. ఈ దశలో మూడేళ్ల క్రితమే అడ్వాన్సులు ఇచ్చేసి స్వాతంత్య్రసమరయోధులతో ఖాళీ చేయించి మరీ ఆ భూములను సొంతం చేసుకునేందుకు శేఠ్‌లు కష్టపడ్డారు. చట్టం పటిష్టంగా ఉండటం వల్ల అడ్వాన్సులు తీసుకున్నా యాజమాన్యహక్కు మారదని ఇప్పటిదాకా స్వాతంత్య్రసమరయోధులకే వదిలేసి ఎప్పటికైనా దాన్ని సంపాదించుకోవచ్చని శేఠ్‌లు వెనుదిరిగారు. అయితే తాజాగా ఈ భూములపై వచ్చిన వినతులు పరిష్కరించేందుకు మంత్రి రఘవీరారెడ్డి ఆధ్వర్యాన రెవెన్యూశాఖ సమావేశమై స్వాతంత్య్రసమరయోధుల భూముల విక్రయానికి అనుమతులు ఇచ్చే అవకాశం కల్పించింది. అంటే శేఠ్‌లు విశాఖజిల్లాలోని స్వాతంత్య్రసమరయోథుల భూములను సొంతం చేసుకునే అవకాశం ఏర్పడిరది. అయితే భూమి విలువ 50లక్షల లోపు ఉంటే జిల్లా కలెక్టరు, ఆపైన రెండు కోట్ల రూపాయల లోపు భూమి విలువ ఉంటే ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సుల్లో స్వాతంత్య్రసమరయోథులు ఎక్కువ మంది తమ భూముల అమ్మకం కోసం ధరఖాస్తు చేసుకున్నందున రెవెన్యూశాఖ ఈ విధంగా స్పందించిందని మంత్రి విశదీకరించారు.

గంజాయి మాఫియాకు అడ్డాగా మారిన ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర జిల్లాలను స్మగ్లర్లు అడ్డాగా చేసుకున్నారు. ఒకవైపు కలప, మరోవైపు గంజాయిస్మగ్లింగు చేస్తున్న ఈ జిల్లాల్లోని పేదల వెనుక మాఫియా ముఠాలున్నాయని అథికారిక సమాచారం. ముంబయ్‌ నుంచి కొంత మంది ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లి అక్కడ గంజాయి సాగుకు మాఫియానేతలే ఫైనాన్స్‌ చేస్తున్నారు. సక్రమంగా సరుకు ముంబయి చేరితే పేమెంటు 25శాతం పెంచి ఇస్తున్నారని సమాచారం. అందుకే ముందుగా అడ్వాన్సులు తీసుకుని సరుకుని ముంబయ్‌ పంపించాక మిగిలిన డబ్బు తీసుకుంటామని ఉత్తరాంధ్ర పేదలు పోలీసులకు పట్టుబడుతున్నారు. ఒకవేళ పట్టుబడితే మాఫియాలో ఉన్న తమ పేరు బయటకు చెప్పకుండా ఉండేందుకు కూడా కొంతసొమ్మును కేటాయిస్తున్నారట. అలానే తేడా వస్తే కుటుంబసభ్యులపై దాడికి కూడా వెనుకాడబోమని మాఫియా నేతలు చేసే హడావుడికి పేదగిరిజనులు బలవుతున్నారు.   ఇప్పటిదాకా గంజాయి రవాణాలో పోలీసులకు పట్టుబడినవారిలో ఎక్కువమంది గిరిజనులని అథికారులు వివరిస్తున్నారు. అసలు నిందితులు దొరకటం లేదని ఈ కేసులు దర్యాప్తు చేసే పోలీసులే స్పష్టం చేస్తున్నారు. తాజాగా మాడుగుల మండలం వీరవల్లి అగ్రహారం వద్ద వ్యానులో గంజాయి తరలిస్తునన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యానును స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేకించి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ఏజెన్సీలో గంజాయిసాగవుతోందని పోలీసులు ధృవీకరిస్తున్నారు. తాజాగా చర్లపల్లి జైలులో రిమాండు ఖైదీ వద్ద వందగ్రాముల గంజాయి ఉండటాన్ని పోలీసులు కనుగొన్నారు. నైజీరియాకు చెందిన బిస్బా అసలు గంజాయి అక్రమరవాణా కేసులోనే నిందితుడు. అతని వద్దకు ఈ గంజాయి ఎలా వచ్చిందనే విషయమై ఆసక్తి నెలకొంది.

కే.సి.ఆర్‌ కొత్త ప్రేలాపన ...తెలంగాణా తల్లికి 80 ఏళ్ళట ?

ఆరుకోట్ల ఆంధ్రుల అభిమాన భాష తెలుగు అని, తెలుగుభాష తీయదనం ఇతర భాషల్లోనే లేదని 1982లో నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో చెప్పారు. ఇప్పటికీ భాషాప్రయుక్తరాష్ట్రాలుగా విడిపోయినప్పటి నుంచి తెలుగుతల్లికి వందనం సమర్పించటం ఆంధ్రుల ఆత్మగౌరవంగా భావిస్తారు. కోస్తాజిల్లాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలతో అభివృద్థి చెందుతూ ఉన్న తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ తెలుగు భాషనే మాట్లాడుతున్నారు. అసలు ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులే రాకపోతే తెలంగాణాలో ఏముంది? కూలీనాళీ చేసుకునేందుకు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లటం మినహా తెలంగాణాలో అలవాటైన పనేమిటీ? వ్యవసాయం కూడా పూర్తిస్థాయిలో చేయలేని వాతావరణం తప్ప! కనీసం నీటికి కూడా కరువయ్యే ఈ జిల్లాల గురించి కేసిఆర్‌ మాత్రమే గొప్పగా చెప్పుకోవాలి. ఖమ్మం నుంచి విజయవాడ వరకూ వెళ్లే కూలీలను చూసి వారి బాధలను అర్థం చేసుకుని ఉంటే వేర్పాటు ఉద్యమం మానేసి ఆకలితీరే పని చేసి ఉండేవారని పలువురు ఆయన్ను విమర్శిస్తున్నారు.     తన స్వార్థం కోసం ఏర్పాటు చేసుకున్న పార్టీ ఎక్కడ కూలిపోతుందో అన్న భయంతోనే కేసిఆర్‌ అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆత్మవంచన మానేసి అసలు విషయాన్ని అవగతం చేసుకోలేని టిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ ఒక కొత్త విషయం కనిపెట్టారు. అదేమిటంటే 80 ఏళ్ల క్రితమే తెలంగాణా తల్లి పుట్టుకొచ్చిందని ఆయన గొప్పగా చెప్పుకుంటున్నారు. అసలు బిడ్డ తల్లిపాలు తాగి రొమ్మును పిసికేస్తాడని కేసిఆర్‌ను చూసిన వారు చెప్పుకునేలా వ్యవహరిస్తున్నారు. అసలు చరిత్రపై కొద్దిగా కూడా అవగాహన లేని కేసిఆర్‌ అప్పుడప్పుడు మేథావిలా ప్రేలాపనలు పేలుతుంటారని ఆయన పార్టీలోని వారే విమర్శిస్తున్నారు. 80ఏళ్ల క్రితం పుట్టుకొచ్చింది తెలంగాణా తల్లి అంటే అసలు ఉన్న తెలుగుతల్లి అని పరోక్షంగా అంగీకరించినట్లే అన్న విషయం కేసిఆర్‌ అర్థం చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. మతిభ్రమించినప్పుడే విశ్రాంతి అవసరమని, లేనిపోని ఉద్యమాల పేరు చెప్పి యువత ప్రాణాలు తీయరాదని రాజకీయ మేథావులు కోరుతున్నారు. అసలు తెలంగాణా తల్లి పేరు చెప్పి కేసిఆర్‌ కొమ్ము విసిరేది ఎందుకంటే ఆయన చెవులకు మాత్రమే కొన్ని సిగ్నల్స్‌ వినిపిస్తాయని తెలంగాణావాదులంటున్నారు. ఎవరికీ వినిపించని, కనిపించని సిగ్నల్స్‌ వినిపిస్తున్నాయంటే కేసిఆర్‌ తను బతికున్న రోజులు గుర్తు చేసుకోవాలంటున్నారు. స్పీకర్‌గా ఉన్నప్పుడు ఎన్నిసార్లు తెలుగుతల్లి విగ్రహానికి దండ వేశారో అప్పుడే మరిచిపోయి విక్రమార్కుని ప్రేతాత్మలా కేసిఆర్‌ విజృంభిస్తే ఘోరపరాభవం తప్పదని ఆంథ్రులు హెచ్చరిస్తున్నారు.

విజయ ‘శాంతి’పై కే.సి.ఆర్‌. గరం గరం

ఎంపి, సినీనటి విజయశాంతిని టిఆర్‌ఎస్‌ ఓ కరివేపాకులా తీసిపారేస్తుంది. ప్రత్యేకించి టిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ ఆమెను అస్సలు లెక్క చేయటం లేదు. పైపెచ్చు ఇంతకు ముందులా పార్టీ కార్యక్రమాలు ఆమెకు తెలియజేసేందుకూ కేసిఆర్‌ ఇష్టపడటం లేదని సమాచారం. తెలంగాణా జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌తో గతంలో విబేధించిన కేసిఆర్‌ ఇప్పుడు ఆయనకు కనీస గౌరవమైనా ఇస్తున్నారు. అయితే ఆ గౌరవమూ విజయశాంతికి లేకుండా పోయిందని ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.     తాజాగా తెలంగాణా ఉద్యమనేత జయశంకర్‌ వర్ధంతి కార్యక్రమానికి కేసిఆర్‌ అథ్యక్షత వహించి అందరినీ మాట్లాడనిచ్చి విజయశాంతికి మాత్రం అవకాశం ఇవ్వలేదు. వేదికపై ఆయనకు దగ్గరగానే ఉన్నా ఆమెను మాట్లాడమనకపోవటం వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయనటానికి సంకేతంగా భావిస్తున్నారు. ఇటీవల కొన్నాళ్లు కేసిఆర్‌ అజ్ఞాతవాసం చేసినప్పుడు అడగకుండానే విజయశాంతి టిఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్‌విజయమ్మ సిరిసిల్ల యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. యమాస్పీడుగా ఆందోళనలు నిర్వహించే విజయశాంతికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటం చూస్తే ఆమెపై కేసిఆర్‌ గంరంగరంగా ఉన్నాడని భావించాల్సి వస్తోందని టిఆర్‌ఎస్‌ శ్రేణులు చెబుతున్నాయి. ఇది ఎప్పుడైనా బయటపడవచ్చని వారు భావిస్తున్నారు. విజయశాంతి స్పీడుగా ఉన్నప్పుడు ఎవరినీ లెక్కచేయరని, ఆ స్పీడులో కేసిఆర్‌ను నిలదీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని టిఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు. ఏమో మొత్తానికి విజయశాంతికి సొంతగూటిలో అశాంతి తప్పలేదు.

విద్యార్థిని అంధున్ని చేసిన ఉపాద్యాయుడు?

ఓ విద్యార్థిని అంధున్ని చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఇది విశాఖ జిల్లాలో జరిగింది. నాలుగోతరగతి చదువుతున్న నాగేంద్రను పాఠం అప్పజెప్పలేదని ఉపాద్యాయుడు కొట్టాడు. బెత్తంతో ఇష్టం వచ్చినట్లు కొట్టడంలో నాగేంద్ర కంటిపై కూడా దెబ్బలు పడ్డాయి. చూసుకోకుండా బెత్తం కంటికి తగిలింది. వెంటనే రక్తస్రావం అయింది. ఈ విషయాన్ని కూడా ఉపాద్యాయుడు గమనించలేదు. దీంతో మళ్లీమళ్లీ కొట్టేందుకు ఉపాద్యాయుడు వెళ్లగా రక్తస్రావమైనట్లు తెలిసింది. దీంతో నాగేంద్రను ఉపాద్యాయుడు తప్పనిసరి పరిస్థితుల్లో వదిలేశాడు. తాను కొట్టిన విషయం బయటకు చెప్పొద్దని కోరాడు. అయితే తల్లిదండ్రులు రక్తస్రావంతో వచ్చిన కుమారుడుని ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం వైద్యులు నాగేంద్రకు చూపు తెప్పించటం కష్టమని తేల్చేశారు.   దీంతో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు అతనికి తామేమి చేయగలమో అని ఆలోచించారు. వైద్యానికి దారి లేకపోవటం వల్ల అంధునిగా మారిన నాగేంద్ర విషయంలో ఉపాద్యాయుడు తప్పు కూడా ఉందని తల్లిదండ్రులు నిర్ధారించుకున్నారు. దీంతో తమ కుమారుడు నాగేంద్రను తల్లిదండ్రులే ఉపాద్యాయునికి అప్పగించారు. ఇక నుంచి నాగేంద్రకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని ఉపాద్యాయుడిని తల్లిదండ్రులు కోరారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాద్యాయుడే నాగేంద్రబాధ్యతను చేపట్టాడు.

కొడుమూరు కొండలరాయునికి తేళ్ల నైవేద్యం!

వింత ఆచారాలకు నెలవు ఆంథ్రప్రదేశ్‌ అన్న మాటను కర్నూలు జిల్లా కొడుమూరు వాసులు నిజం చేస్తున్నారు. కొడుమూరు కొండపై కొండలరాయుడు వెలిశాడు. ప్రతీ ఏడాది శ్రావణమాసం మూడో సోమవారం నాడు ఆయనకు తేళ్ల నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించు కుంటారు. ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. బంధువులను పిలిచి వారి సాయంతో ఈ కొండలరాయుడుని కొలుస్తారు. ప్రతీ ఇళ్లూ బంధువులతో నిండిపోతుంది.     వచ్చిన వాళ్లు కూడా కొండలరాయుడుకు ఇష్టమైన తేళ్లు పట్టడంలో సహకరిస్తారు. ఈ ఉత్సవం కోసమే తేళ్లు పట్టుకునే పనిని కొందరు చేపట్టారు. డబ్బు పోసి మరీ తేళ్లు కొని తమ మొక్కులతో పాటు వాటిని కొండలరాయుడుకు నివేదిస్తారు. పట్టుకున్న తేళ్లను జాగ్రత్తగా తీసుకురావటం కొడుమూరు గ్రామస్తులకే కాదు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా అలవాటు చేసుకున్నారు. అందుకే కర్నూలు జిల్లాలో కొడుమూరు పేరు వినిపించగానే కొండలరాయుడు ఉత్సవం గుర్తు చేసుకుంటారు. భారీ సంఖ్యలో బంధువులతో కలిసి కొండలరాయుడును దర్శించు కుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా తమకు అవసరమైన సంపాదనకు కూడా కొండలరాయుడు దారి చూపుతాడని ఎక్కువ మంది పేదలు ఈ ఉత్సవానికి హాజరవుతుంటారు. వీరంతా ఖచ్చితంగా నైవేద్యాన్ని అంటే తేళ్లను తీసుకునే వస్తారు. విషజంతువుల బారి నుంచి కొండలరాయుడు కాపాడుతాడని భక్తులు అంటున్నారు.

రాష్ట్రక్యాబినెట్‌లో జగన్‌కోవర్టులు?

రాష్ట్రక్యాబినెట్‌లో జగన్‌కు సానుభూతిదారులైన ఏడుగురుమంత్రులు ఉన్నారని, వారు జగన్‌కు కోవర్టుల్లా వ్యవహరిస్తున్నారని పీసిసి అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి అయిన బొత్స సత్యన్నారాయణ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ మంత్రుల వల్ల అధికార రహప్యాలు, క్యాబినెట్‌లో జరిగే చర్చలు ఎప్పటికప్పుడు జగన్‌కు తెలుస్తున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ మాజీ అద్యక్షుడు పీజెఆర్‌ సుథాకరబాబు కూడా ఇటువంటి ఆరోపణలే బహిరంగంగా చేయటం విశేషం.     ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఏ మంత్రి అనుకూలమో, ఏ మంత్రి వ్యతిరేకమో కూడా తెలుసుకోని పరిస్థితి నెలకొని ఉందని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. పలువురు మంత్రులు తమ కొడుకులను ముందు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి పంపించాలనుకుంటున్న అంశం బహిరంగ రహస్యంగా మారింది. కాంగ్రెస్‌ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని అయోమయ స్థితిలో చాలా మంది నేతలున్నారు. అలాంటి భయంతోనే కొంత మంది మంత్రులు జగన్‌పార్టీతో టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. జగన్‌కు కోవర్టులుగా ఉన్న మంత్రులెవరో అధిష్టానానికి కూడా తెలిసినప్పటికి ప్రస్తుతం వారిని వివరణ అడిగితే లేనిపోని వివాదాలు చెలరేగుతాయని భయపడుతోంది. అందుకే ఈ విషయమై ఎటువంటి బహిరంగ ప్రకటనలు చేయెద్దని అధిష్టానం బొత్సకు సలహా ఇచ్చినట్లు తెలిసింది.

కిరణ్‌ను ఇరుకున పెడుతున్న బొత్స!

పీసిసి అధ్యక్షుడు, రాష్ట్ర క్యాబినెట్‌ మంత్రి అయిన బొత్స సత్యన్నారాయణ అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఇరుకున పెడుతున్నారు. తాజాగా రాష్ట్రంలో కరెంటుకోతలు, గ్యాస్‌ సరఫరాపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఇబ్బందికలిగించేలా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరెంటు కష్టాలకు ఆయన ప్రజలను క్షమాపణ కోరటమే కాకుండా ప్రస్తుత పరిస్థితికి, గ్యాస్‌ రాకపోవటానికి కారణం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యమే అన్నట్లుగా మాట్లాడారు. అంతేకాకుండా కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డికి మద్దతుగా మాట్లాడి మరోచర్చకు తెరలేపారు. జైపాల్‌రెడ్డి అసమర్థత వల్లే రాష్ట్రానికి రావలసిన గ్యాస్‌ మహారాష్ట్రకు తరలిపోయిందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో బొత్సా సత్యన్నారాయణ ఆయన్ను వెనుకేసుకురావటం విశేషం.     ఒకవైపు కేంద్ర మంత్రిని వెనుకేసుకువస్తూ మరోవైపు ముఖ్యమంత్రికి ఇబ్బందులు కలిగేలా వ్యాఖ్యానించటంతో బొత్సా వ్యూహం ఏమై ఉంటుందా అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. నిజానికి వీరిద్దరి మద్య మొదటి నుంచి సఖ్యతకానీ, సయోధ్యకానీ లేదు. మద్యం సిండికేటుపై ఎసిబి దాడుల తరువాత వీరి మద్యా అగాథం మరింత పెరిగింది. అంతకు ముందు ముఖ్యమంత్రి కిరణ్‌ తనకు పనికిమాలిన శాఖ కేటాయించారంటూ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజీవ్‌ యువకిరణాల పథకాన్ని క్యాబినెట్‌లో చర్చించకుండానే కిరణ్‌కుమార్‌రెడ్డి ఏకపక్షంగా ప్రకటించారని కూడా బొత్స ఆరోపించారు. కిరణ్‌కువ్యతిరేకంగా కొందరు మంత్రులను బొత్సా సత్యన్నారాయణ రెచ్చగొడుతున్నారని బోలెడు ఆరోపణలు వచ్చాయి. బొత్సా వైఖరితో తాను విసిగిపోయి ఉన్నానని కిరణ్‌కుమార్‌రెడ్డి తన సన్నిహితుల వద్ద అంటున్నట్లు తెలిసింది. అయితే బొత్సాను మాత్రం ప్రస్తుతం ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.

లక్ష్మినారాయణకు అడ్డంకులు కల్పిస్తున్న రాష్ట్రప్రభుత్వం

జగన్‌ అక్రమాస్తుల కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ జాయింట్‌  డైరెక్టర్‌ లక్ష్మినారాయణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రప్రభుత్వం కానీ, ప్రభుతాధికారులు కానీ, ఆయనకు ఏ విషయంలో సహకరించటం లేదు. వివాదస్పద జీఓల జారీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర మంత్రులకు న్యాయసహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటి నుంచి జెడి లక్ష్మినారాయణకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి.  దీనికి తోడు బిపి ఆచార్య, శ్రీలక్ష్మి, రాజగోపాల్‌ వంటి అథికారులను సిబిఐ అరెస్టు చేయటంతో ఆగ్రహంతో ఉన్న ఐఎఎస్‌లు కూడా సిబిఐ విచారణకు అడ్డంకులు కల్పిస్తున్నారు. దర్యాప్తు ముందుకు సాగాలంటే అవసరమైన సమాచారాన్ని అధికారులే సిబిఐకు అప్పగించాల్సి ఉంటుంది. కానీ, గత నెలరోజులుగా సిబిఐ కోరిన సమాచారం ఏదీ వీరు సమకూర్చలేదని తెలిసింది.   సిబిఐ అధికారికంగా, రాతపూర్వకంగా సమాచారం కోరినప్పటికీ ఏదో సాకు చెప్పి ఆ సమాచారాన్ని ఇవ్వటానికి నిరాకరిస్తున్నారు. ఆ సమాచారం ఇవ్వవలసిన ఉద్యోగులు అందుబాటులో లేరని, లేదా ఆ ఉద్యోగులు శెలవుపై ఉన్నారన్న సాకులు చెబుతున్నారు. కొన్ని కీలకమైన ఫైళ్ల వివరాలు, ఇవ్వకుండా ఉండేందుకు కొందరు ఉద్యోగులను బలవంతంగా అధికారులు శెలవుపై పంపినట్లు తెలిసింది. దీంతో అక్రమాస్తులు, అక్రమ జీఓల వ్యవహారంలో జెడి లక్ష్మినారాయణకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీనికి తోడు సిబిఐ కేంద్ర కార్యాలయం నుంచి కూడా లక్ష్మినారాయణకు సరైన సహకారం లభించటం లేదని తెలిసింది.   ఈ కేసుల దర్యాప్తునకు తనకు మరో 25 మంది సిబ్బంది కావాలని ఆయన కోరి రెండునెలలవుతున్నా ఇప్పటివరకూ వారిని కేటాయించలేదు. అంతేకాక క్లరికల్‌ స్థాయి సిబ్బంది కావాలంటే రాష్ట్రప్రభుత్వ సహాయం తీసుకోవాలని సిబిఐ ఉన్నతాధికారులు లక్ష్మినారాయణకు ఒక ఉచితసలహా పడేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సిబ్బందిని ఇవ్వవలసినదిగా రాష్ట్రప్రభుత్వ అధికారులను కోరినప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించలేదు. ఒకవైపు సిబ్బంది లేక, మరోవైపు తగిన సమాచారం లేక లక్ష్మినారాయణ తీవ్ర అసంతృప్తికి, అసహనానికి గురవుతున్నట్లు తెలిసింది. తనకు అడుగడుగునా అడ్డంకులు కల్పించే బదులు ఈ కేసు దర్యాప్తు నుంచి తనను బదిలీ చేయాలని ఆయన ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది. రాష్ట్రప్రభుత్వ అధికారులు తనకు ఎటువంటి సహాయసహకారాలు అందించటం లేదని, దీంతో తాను తన మిత్రుల ద్వారా సమచార హక్కు చట్టం కింద ధరఖాస్తులు చేయించి సమాచారం తెప్పించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిరదని ఆయన ఉన్నతాథికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

క్రానికల్స్‌ కొంపముంచిన డక్కన్‌ ఛార్జర్స్‌ ?

గొలుసు పత్రికలైన డక్కన్‌ క్రానికల్‌, ఆంద్రభూమి ఆంగ్ల, తెలుగు,వార పత్రికలకు లిక్విడ్‌ క్రైసిస్‌ వచ్చిందని, మీడియాల కధనం. ఎప్పుడూ నష్టాలను చవిచూసే ఆంద్రభూమి దినపత్రిక ఇంకా నడుపుతున్నారంటే కారణం డక్కన్‌ క్రానికల్‌ లాభాలేనని చెబుతుంటారు. ఆంద్రప్రదేశ్‌లో ఆంగ్లపత్రికలన్నింటికంటే డిసి  సర్యులేషన్‌ అధికం. ఆంగ్లపత్రిక లాభాలతోనే మేనేజ్‌ మెంట్‌ ఆంద్రభూమిని నడుపుతున్నారని టాక్‌. అలాంటి డక్కన్‌ క్రానికల్‌ ఇప్పుడు చిక్కుల్లో పడిరదని రూమర్లు వస్తున్నాయి. అయితే కొందమంది యల్లో జర్నలిస్టులు కావాలనే ఈ రూమర్లు తెచ్చారని అంటున్న వారు కూడా లేకపోలేదు. 1,500 కోట్ల రూపాయలు నికర లాభం గల ఈ పత్రిక తన లాభాలన్నింటిని ఎక్కడ పెట్టిందనే ప్రశ్న ఉత్పన్నమైంది. సంస్ధ ఛైర్మన్‌ టి.వెంకట్రామరెడ్డి  తన గుర్రాల మీద, ఆడంబరాలమీద  ఇంకా ప్రిమియర్‌లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో డెక్కన్‌ చార్జర్స్‌ మీద ఖర్చు పెట్టారని చెబుతున్నారు. డక్కన్‌ చార్జర్స్‌  ఓడిపోవడంతో వచ్చిన నష్టాల ప్రభావం పేపర్‌పై పడిరదని తెలిసింది. అయితే ఈ విషయాన్ని సెబి (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా)నిర్ధారించ వలసి ఉంది. డక్కన్‌ క్రానికల్‌ మౌనం అనేక ఊహాగానలుకు తావిస్తుంది. అయితే డక్కన్‌ క్రానికల్‌ తన నష్టాలను పూడ్చుకునేందుకు గానూ, రెలిగేర్‌ క్యాపిటల్‌నుండి తన వాటాలను అమ్మటం ద్వారా 1000 కోట్ల రూపాయలు తీసుకోవాలని ప్రయత్నింస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులలో 100 కోట్ల రూపాయలు రావడం కూడా కష్టమేనని మార్కెట్‌ వర్గాలు ఉటంకిస్తున్నాయి. త్వరలోఉత్తరాదికి చెందిన ఆంగ్ల దిన పత్రిక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా డక్కన్‌ క్రానికల్‌ను కొనుగోలు చేస్తుందని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో డిసి ఉద్యోగులంతా భయాందోళనకు గురి అవుతున్నారు. ఏది ఏమైనా డిసి ఆంగ్ల పత్రికకు ఏమైది అనేది కచ్చితంగా తెలియాలంటే వారం పది రోజులు ఆగవలసి ఉంది.