తెలుగు గంగ కార్యాలయం పై వివాదం ?

తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు తన కలల ప్రాజెక్టుగా ప్రారంభించిన తెలుగు గంగ నిర్వాహక కార్యాలయం గురించి వివాదం జరుగుతోంది. తిరుపతికి తెలుగుగంగ కార్యాలయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్న సమాచారంపై సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుగంగ ప్రాజెక్టు ప్రారంభం నుంచి శ్రీకాళహస్తిలో ఉన్న కార్యాలయం అందరికీ అలవాటైంది. అటువంటి కార్యాలయాన్ని ఒక్కసారిగా తిరుపతి మారుస్తున్నారన్న సమాచారం స్థానికంగా పెద్దకలకలాన్ని రేపింది. సాక్షాత్తూ సిఎం దృష్టికి ఈ విషయం చేరింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సిఎం కార్యాలయం మారుద్దామనుకుంటున్న విషయమై సిఎంతో పాటు ఎస్సీవీనాయుడు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. అథికారుల స్వార్థానికి పరాకాష్టగా ఈ కార్యాలయం మారుస్తున్నారని సిఎం కోప్పడ్డారు. అసలు కార్యాలయం మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందని అధికారులను నిలదీశారు. అంతటితో ఆగకుండా అధికారులు ఇబ్బంది పడాల్సి వస్తుందని ఎస్సీవీనాయుడు చేసిన హెచ్చరికల నేపథ్యంలో సిఎం పరిపాలనా సహాయకుడు రావత్‌ను వాస్తవపరిస్థితిపై నివేదిక ఇమ్మని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులను సహించబోమని హెచ్చరించారు. గంగ కార్యాలయాన్ని ఎక్కడికీ మార్చబోమని, రైతులు అందరూ శ్రీకాళహస్తిలోని గంగ కార్యాలయంతో ఉన్న అనుబంధాన్ని కొనసాగించవచ్చని సిఎం తరుపున ఎస్సీవీనాయుడు తెలిపారు.

చిత్తూరును వణికిస్తున్న డెంగ్యూ?

చిత్తూరు జిల్లాను డెంగ్యూ జ్వరం వణికిస్తోంది. సుమారు వందమంది వరకూ ఈ జిల్లాలో డెంగ్యూబారిన పడ్డారని అథికారిక లెక్కలు తేలుస్తున్నాయి. జిల్లాలోని పడమటి ప్రాంతంలోనే ఎక్కువగా ఈ జ్వరపీడితులున్నారని తెలుస్తోంది. తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలలో డెంగ్యూ గుర్తింపు పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. మదనపల్లె, గుర్రంకొండ, తంబెళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, బి.కొత్తకోట, పీటీఎం, కురబలకోట తదితర ప్రాంతాల్లో జ్వరపీడితులున్నారని అథికారులు గుర్తించారు. జిల్లా కలెక్టరు సాల్మన్‌ ఆరోగ్యరాజ్‌ ఆదేశాల మేరకు బృందాలుగా విడిపోయి మరీ డెంగ్యూ జ్వరపీడితులకు చికిత్స అందిస్తున్నారు. ఇదే కాకుండా జిల్లాలో 130 మలేరియా కేసులు నమోదయ్యాయి. వీటిలో పీవీ107కేసులు, పీఎఫ్‌23కేసులు నమోదయ్యాయని వైద్యనిపుణులు తేలుస్తున్నారు. ఈ జ్వరాలకు దోమలే కారణమని, పరిసరాల పరిశుభ్రత పాటించటం ద్వారా జ్వరాలకు దూరంగా ఉండొచ్చని వైద్యులు తెలిపారు. పెరిత్రయంలో కిరోసిన్‌ కలపటం వల్ల దోమలను నివారించవచ్చన్న నిపుణుల హెచ్చరికల మేరకు స్ప్రే చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. అయినా పరిసరాల పరిశుభ్రత పాటించేందుకు గ్రామీణులు సిద్ధం కావాలని జిల్లా వైద్య అధికారులు పిలుపు ఇచ్చారు.

వచ్చే నెల్లో పంచాయతీ ఎన్నికలు?

వచ్చే నెల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సమాయత్తమవుతోంది. సంస్థాగత ఎన్నికలను ఐదంచెల పద్దతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి గాను అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిఎంపై ఒత్తిడి పెరుగుతోంది. ఒకవైపు కేంద్రం నుంచి మరోవైపు రాష్ట్రంలోని కీలకమైన నేతల నుంచి ఈ ఒత్తిడి ఎదురవుతోంది. కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్‌ ఈ ఎన్నికలు నిర్వహించేంత వరకూ 10వ ఫైనాన్స్‌, 11వ ఫైనాన్స్‌ నిధులు అందబోవని స్పష్టం చేశారు.     గ్రామాల్లో అభివృద్థి కుంటుపడుతున్నందున రాష్ట్రప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన సూచించారు. దీనికి రాష్ట్రప్రభుత్వం స్పందించకపోవటంతో కేంద్రం గ్రామాలకు విడుదల చేయాల్సిన నిధులను ఆపేసింది. ఫలితంగా గ్రామాలు అభివృద్థికి దూరమయ్యాయి. పంచాయతీతో పాటు మండల పరిషత్తు, జిల్లాపరిషత్తు ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. ఈ రెండు అంచెల ఎన్నికలు జరిగితే స్థానిక సంస్థలకు ఎన్నికలు పూర్తయినట్లు అవుతుంది. రాష్ట్రముఖ్యమంత్రి ఎక్కడ పర్యటించినా ప్రతీ ప్రాంతంలోనూ ఈ పంచాయతీ ఎన్నికల గురించే కాంగ్రెస్‌నాయకులు నిలదీస్తున్నారు. దాదాపు ఇందిరమ్మ బాట కార్యక్రమమంతా ఈ తరహాలోనే నడిచింది. తాజాగా సిఎం చిత్తూరు జిల్లాలో విమానాశ్రయం వద్ద కూడా ఇదే విషయమై చర్చించాల్సి వచ్చింది. నెల్లూరు ఎమ్మెల్యే కూతూహలమ్మకు, చిత్తూరు జిల్లా నాయకులకు వచ్చే నెల్లో పంచాయతీ ఎన్నికలు జరిగేలా చూస్తానని సిఎం భరోసా ఇచ్చారు.

విజయమ్మ దీక్ష ఓ ఎత్తుగడేనా?

వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి అలియాస్‌ విజయమ్మ బోధనాఫీజులపై ఏలూరులో చేపట్టిన నిరాహారదీక్ష వెనుక ఏమైనా ఎత్తుగడ ఉందా? ఈ ప్రశ్న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమవుతోంది. కేవలం ఎన్నికల సమయంలోనూ, అడపాదడపా ఆందోళనలు చేస్తున్న విజయమ్మ ఒక్కసారి విద్యార్థుల బోధనాఫీజుల గురించి ఆందోళన చేపట్టడం వెనుక బలీయమైన రాజకీయ కారణం ఉండే ఉంటుందని రాజకీయపరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.     పైగా రాష్ట్రప్రభుత్వం ఏకీకృత ఫీజుల విధానం గురించి తర్జనభర్జన పడుతున్న సమయంలో ఈ ఆందోళన చేపట్టడం పలువురి దృష్టిని ఆకర్షించటానికే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీలో విద్యార్థి విభాగం లేనందు వల్ల దాన్ని ఏర్పాటు చేసుకునేందుకు వైకాపా అథ్యక్షుడు జగన్మోహనరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీని గతంలో టార్గెట్‌ చేశారు. ఇప్పుడు విజయమ్మ అన్ని జిల్లాలకు మధ్యస్తప్రాంతమైన ఏలూరులో దీక్ష చేపడుతున్నారు. ఇక్కడ దీక్ష చేపడితే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలను ఏర్పాటు చేయటం పెద్దపని కాదని ఆమె నమ్ముతున్నారు. అందుకే ఈనెల 12,13తేదీల్లో దీక్ష చేస్తున్నామని ప్రకటించారు. వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన బోధనాఫీజుల పథకాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం నీరుకారుస్తోందని ఆమె విమర్శిస్తున్నారు. అర్హులైన పేదవిద్యార్థులకు ఫీజురీయంబర్స్‌మెంట్‌ వర్తింపజేయాలని డిమాండు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థుల మెస్‌ఛార్జీలు పెంచాలని డిమాండు చేశారు. ఈ డిమాండ్ల ఆధారంగా మైనార్టీ విద్యార్థులను, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులను ఆకర్షించేందుకు వైకాపా ఎత్తుగడ వేసిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

తిరుమలేశునికీ తప్పని న(క)ష్టాలు?

ప్రపంచంలో కుబేరులను సైతం మెప్పించగల భారతదేశ కలియుగ ప్రత్యక్షదైవం తిరుపతి వెంకటేశ్వరునికీ నష్టాలు తప్పటం లేదు. ఆయన మహిమాన్వితమైన ప్రసాదంగా పేరొందిన లడ్డు వల్ల ప్రతీఏటా రూ.130కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. అలానే ప్రతీ ఏటా భక్తుల ఉచిత ప్రసాదభారమూ టిటిడి మోస్తోంది. ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీతో పాటు అదనపు సెక్యూరిటీ భారమూ టిటిడిపై పడుతోందంటున్నారు. ఇదే కాకుండా కొన్నిరకాల సేవల్లో ఖర్చుపెరిగిపోయినా భక్తులపై భారం మోపటం ఇష్టం లేక టిటిడినే ఖర్చు భరిస్తోందంటున్నా రు. అలానే ప్రత్యేకపరిశోధనలు, యాత్రికుల కోసం ప్రత్యేక సేవలకు టిటిడి అదనపు వసతులకు కూడా కొంత ఖర్చు చేస్తోంది. ప్రతీఏటా నూతనభవనాలను నిర్మించటం ద్వారా కొంత వరకూ టిటిడి లాభాలను ఆర్జిస్తోంది. వసతుల ద్వారా లభించే ఆదాయం వల్ల టిటిడి కొన్ని అదనపు సేవలను పెంచుకుంది. వేదం నేర్పే పాఠశాలలకు ప్రోత్సాహకం, థార్మిక కార్యక్రమాల నిర్వహణ భారం కూడా టిటిడిపైనే పడుతోంది.     కొన్ని జిల్లాల్లో టిటిడి నిర్మించిన కళ్యాణమండపాలకు స్థానికంగా విలువను ఇవ్వటం లేదు. దీని వల్ల అక్కడి సిబ్బంది వేతనాలు కూడా టిటిడికి అదనపుభారమవుతోంది. భారీస్థాయిలో ముద్రణఖర్చును టిటిడి భరించి అతితక్కువ ధరకు పుస్తకాలు అమ్ముతున్నందున వచ్చే నష్టాలు గురించి ఎవరూ తెలుసుకోవటానికి ఇష్టపడటం లేదని ఇఓ ఎల్వీసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఒక్క లాభాలు, ఆదాయాల గురించే అందరూ మాట్లాడుకోవటం లోకసహజం. భక్తులందరూ ఈ వెంకన్నకు మొక్కితే ఆయన మోస్తున్న అదనపు భారం గురించి ఎవరికి చెప్పుకోవాలి?

‘దేశం’లో వర్గీకరణ ముసలం?

తెలుగుదేశం పార్టీ బిసి అజెండాతో ప్రజల ముందుకు వెడుతోందని ఆ పార్టీ అథినేత చంద్రబాబునాయుడు చెప్పుకుంటూ ఉన్నారు. అలానే ఎస్సీలనూ తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షించేందుకు బాబు ఎస్సీవర్గీకరణ అంశంపై సామాజిక వర్గాల ఆధారంగా సమావేశపరిచారు. ముందురోజు మాదిగల తోనూ, తరువాత రోజు మాలలతోనూ సమావేశం నిర్వహించి ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చేందుకు వ్యక్తిగతమైన అభిప్రాయాలను సేకరించారు. ఈ అభిప్రాయాలన్నీ క్రోడీకరించి ఒక విధానం రూపొందించాలని బాబు కసరత్తులు చేస్తున్నారు.   అయితే మాలలు మాత్రం తాము తెలుగుదేశం పార్టీ వర్గీకరణ సమస్యను భుజంపై వేసుకోవటం వల్ల నష్టపోయామని, మళ్లీ అదే పోకడ అవలంబిస్తే కష్టమని, పార్టీ పరంగా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వర్గీకరణ సమస్యను ఎత్తుకోకపోవటమే సమంజసమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యానాలపై ఘాటుగా స్పందించిన చంద్రబాబు పార్టీ విధానం కాదంటే వెళ్లిపోయినా పర్వాలేదన్నారు. దీంతో హతాశులైన మాలసామాజికవర్గ నేతలు తమ అభిప్రాయాలను మాత్రమే ఆయన ముందుంచారు. ఈ సమస్య తెలుగుదేశం పార్టీలో పెద్ద ముసలాన్ని తెచ్చిపెట్టినట్లు అవుతుందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గతంలో వర్గీకరణ సమస్యను రాష్ట్రవ్యాప్తంగా పెంచినందుకు, మాదిగల తరుపున వ్యవహరించినందుకు బాబు ఇరకాటంలో పడ్డారు. ఆయన్ని మాల వ్యతిరేకిగా చూపి పివిరావు వంటి నాయకులు రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరు సంపాదించారు. వర్గీకరణకు తెలుగుదేశం మెడలు వంచామని మాదిగలు చంకలు గుద్దుకున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో వర్గీకరణ సమస్య పెద్ద చిచ్చును తెచ్చి పెట్టింది. ఇప్పుడు కూడా పార్టీ విధానంగా వర్గీకరణ సమస్యను తెరపైకి తెస్తే తెలుగుదేశం మనుగడకే ముప్పువాటిల్లుతుందని మాలమహానాడు కార్యకర్తలు హెచ్చరించారు.

చిరుకు సిఎం అయ్యే యోగం లేదా?

రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్‌ చిరంజీవికి సిఎం అవుతారన్న మాటే అచ్చిరానట్లుంది. ఇది ఒక్కరి వ్యాఖ్యానం కాదు ఆయన మౌనమే దీనికి అద్దం పడుతోంది. ఏదో సాధిద్దామని ప్రజారాజ్యంపార్టీ ద్వారా రాజకీయం తెరంగేట్రం చేసిన ఈ మెగాస్టార్‌ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న సీట్లు గెలవ లేకపోయారు. దీంతో నిరుత్సాహానికి గురైన చిరు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.     ఆ ఎన్నికల సమయంలోనూ చిరంజీవి ముఖ్యమంత్రి అయి కాపుసామాజికవర్గ నేతగా మరో పెద్ద గుర్తింపునందుకుంటారని పలువురు ఆశించారు. అందుకే పార్టీ ప్రారంభం నుంచి దాన్ని కాపు సామాజికవర్గ పార్టీగా దాన్ని తీసుకువచ్చారు. అలానే సెంటిమెంటుపరంగా భిన్నమైన ధోరణులతో చిరు వ్యవహరించారు. సాయంత్రం వేళ వికలాంగుని చేత పార్టీ జెండాను ఆవిష్కరింపజేయటమే ఆయన పతనానికి కారణమైందని జ్యోతిష్యపండితులు హెచ్చరించారు. ఈ ఒక్క పని వల్ల ఆయన సిఎం అయ్యే అవకాశాన్ని కోల్పోతారని జ్యోతిష్కులే తేల్చిచెప్పారు. దీంతో సిఎం పదవి ఎలాగూ రాదు కాబట్టి ఓ మంచి పొజిషన్‌ వస్తే చాలని పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలోనూ చిరంజీవి సిఎం అవుతారని ఆశలు పెంచుతున్నారు. జ్యోతిష్యుల హెచ్చరికల నేపథ్యంలోనే చిరంజీవి దీనిపై పెదవి విప్పటం లేదని, ఆయన ఆశించికుండా ఉన్నప్పుడే అవకాశాలు వస్తాయన్న జ్యోతిష్కుల సూచనలు పాటిస్తున్నారని చిరుసన్నిహితులు అంటున్నారు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండాలంటే మౌనానికి మించిన మార్గం లేదని చిరంజీవి భావిస్తున్నారు.

కిరణ్‌ను తొలిగించాలంటున్న కాపు నాయకులు?

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధినాయకత్వంలో కులసమీకరణలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని మార్చాలని కేంద్ర నాయకత్వంపై నానాటికీ ఒత్తిడి పెరుగుతోంది. అయితే సమర్థులు లేనందు వల్ల ఇది కుదరదనే అభిప్రాయంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఉంది. అయితే ఎవరో ఒకరిని చూపి ముందు సిఎం కిరణ్‌ స్థానంలో తమవారిని కూర్చోపెట్టాలని కాపునాయకులు గట్టిపట్టుదలతో ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనిలో భాగంగానే కాపుసామాజిక వర్గం ప్రతినిధులు పిసీసీ చీఫ్‌ బొత్సాసత్యన్నారాయణపై ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. తనకు అవకాశం ఇవ్వనందున తానేమీ చేయలేక పోతున్నానని బొత్సా వారికి వివరిస్తే కనీసం రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్‌ చిరంజీవికి అవకాశం ఇప్పించాలని వారు సూచించినట్లు భోగట్టా! దీంతో అంతకు ముందు చిరంజీవికి సిఎం అంటే ఇష్టపడని పిసీసీ చీఫ్‌ ఇప్పుడు తప్పేముందని మాట మార్చారు.     దీంతో తమ దౌత్యం ఫలిస్తోందని భావించిన కాపునాయకులు మరికొందరు కాంగ్రెస్‌ సీనియర్లతో ఇదే మాట అనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. సీనియర్లతో ఇలా వ్యాఖ్యానాలు చేయించిన తరువాత చిరంజీవికి మద్దతుగా కాంగ్రెస్‌ హైకమాండ్‌ను కలిసేందుకు కాపునాయకులు ప్లాన్‌ చేసుకుంటున్నారు. అయితే సోనియాగాంధీ తనను కలవటానికి చిరంజీవికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. దీంతో రాహుల్‌గాంధీ తరుపు నుంచి నరుక్కురావాలని కాపునాయకులు యోచిస్తున్నారట. ఆంధ్రా నుంచి వచ్చిన అందరితోనూ మాట్లాడుతున్న రాహుల్‌ మరి సిఎం పదవి విషయంలో ఏమి మాట్లాడతారో అన్న ఆసక్తి నెలకొంది. కాపునాయకుల ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో? కానీ, రాష్ట్ర అధినాయకత్వంలోనూ కులసమీకరణలకు వీరి ప్రయత్నాలు కారణమవుతున్నాయి. సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి గట్టి వాడు , సమర్ధుడు అనే భావనను హైకమాండ్‌ వద్ద కల్పించడానికి రెడ్డి సామాజిక నేతలు ప్రయత్నిస్తున్నారు. వీరి ప్రచారం కాపునాయకుల ప్రయత్నాలకు వ్యతిరేకంగా పని చేస్తుందని ఇప్పటికే సిఎం ఒక అభిప్రాయానికి వచ్చారు. అందుకే ఆయన ధీమాగా ఉన్నారు. విషయం ముందుగానే లీకైనందున కాంగ్రెస్‌ హైకమాండ్‌ జరుగుతున్న మొత్తం పరిణామాలపై దృష్టిసారించింది.

మూత పడుతున్న రాష్ట్ర పరిశ్రమలు

ఒకవైపు విద్యుత్తుకోత, మరోవైపు సాంకేతికలోపం రాష్ట్రంలోని పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయి. పరిశ్రమల కోసమే గతంలో విద్యుత్తుఛార్జీలు తగ్గించి వనరులు కల్పించిన రాష్ట్రప్రభుత్వం సీరియస్‌గా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయటం లేదు. దీని వల్ల కోట్లాది రూపాయల నష్టాలను పరిశ్రమలు భరించ వలసి వస్తోంది. ఇదే విషయాన్ని పరిశ్రమల ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికీ విన్నవించుకుంటున్నాయి. కేంద్రంలోనూ మంత్రి వర్గ మార్పులు ఇంకా పూర్తికాకపోవటంతో ఈ సమస్యను అక్కడ కూడా సీరియస్‌గా తీసుకోవటం లేదు.     ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్టుకు ఎగుమతులు చేసే 24 గంటల విద్యుత్తు ఆథారిత పరిశ్రమలను 3 నెలల క్రితమే మూసేశారు. కొన్ని పరిశ్రమల్లో ఉద్యోగాల్లో రేషనలైజేషన్‌ను అమలు చేయాలని యామాన్యాలు సిద్ధపడుతున్నాయి. ప్రత్యేకించి స్థానిక నిరుద్యోగం పెంచటానికి కూడా ఈ విద్యుత్తు సమస్య కారణమవుతోంది. కిందిస్థాయిలో పనిచేసే స్థానిక ఉద్యోగులను తొలగించి సాంకేతికరంగంలో నిపుణులైన స్థానికేతరులకు పరిశ్రమలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. రోజుకు కనీసం రాష్ట్రవ్యాప్తంగా రూ.80 కోట్ల ఉత్పాదనలు దెబ్బతిన్నాయని అంచనా. సాంకేతిక లోపం వల్ల సింగరేణి గనుల్లో విద్యుత్తు ఆగిపోవటంతో ఒక్కరోజుకు రూ.4.5కోట్లు నష్టం వచ్చింది. 30వేల టన్నుల బొగ్గు ఉత్పాదన ఆగిపోవటం వల్ల ఈ నష్టం వచ్చిందని సింగరేణి యాజమాన్యం ధృవీకరించింది. బెల్లంపల్లిలోని 132కిలోవాట్ల విద్యుత్తు సబ్‌స్టేషనులో సాంకేతికలోపం తలెత్తి విద్యుత్తుసరఫరా నిలిచింది. సింగరేణిలోని 19గనుల్లో అంథకారం అలుముకుంది. మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపురం, రమాకృష్ణాపురం, గోలేటి గనుల్లో చిమ్మచీకటి వల్ల బొగ్గు ఉత్పాదన ఆగిపోయింది. ఇలానే జీడిపిక్కల పరిశ్రమల్లోనూ విద్యుత్తులోపం ఇబ్బంది పెడుతోంది.

మరింత ముదిరిన విద్యుత్‌ సంక్షోభం

రానున్న రోజుల్లో విద్యుత్‌ కోతలు మరింత పెరగవచ్చు. ఎందుకంటే వర్షాల కారణంగా సింగరేణిలో బొగుతవ్వకం పనులు ఆపేశారు. జలాశయాలు నిండక జలవిద్యుత్‌ దాదాపుగా ఆగిపోయింది. మరోవైపు బొగ్గుదిగుమతులు నిలచిపోయాయి. దీంతో విద్యుత్‌ సమస్య మరింత జఠిలం కానుంది. పవర్‌ ప్రాజెక్టుల్లో పదిహేను రోజులకు సరిపడా నిల్వలుండాలనేది నియమం. అయితే ప్రస్తుతానికి పవర్‌ ప్రాజెక్టుల్లో కేవలం మూడు రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నట్లు తెలిసింది.   దీన్నుంచి తప్పించుకోవడానికి గానూ ఎపి జెన్‌కో తమ 22 యూనిట్ల మరమ్మత్తులకు గానూ షెడ్యూల్‌ను రూపొందించుకుంది. కేవలం బొగ్గు కారణంగా ఉత్పత్తి ఆగిపోయిన విషయాన్ని కప్పిపుచ్చి సాంకేతిక లోపాలు తలెత్తి ఉత్పత్తి ఆగిపోయినట్లు బిల్డప్‌లు ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వ రంగంలోని ఎంటీపీఎస్‌లోనూ బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. డిమాండ్‌ మేరకు పవర్‌ ప్రాజెక్టులకు సప్లై చేయవలసిన కోల్‌ ఇండియా చేతులెత్తేసింది. రామగుండంలో ఓపెన్‌ కాస్ట్‌ద్వారా బొగ్గు నేరుగా ఆటోమేటిక్‌ యంత్రాల ద్వారా అన్‌లోడిరగ్‌ జరుగుతుంది. అయితే ఈ పద్దతిలో రవాణా చేయవలసిన బొగ్గంతా తడిసి పోవడంతో ఇప్పుడది ఉపయోగంలోకి రాదు. ఎందుకంటె తడిసిన బొగ్గును వెంటనే వినియోగించుకునే అవకాశం ఉండదు. కేవలం మన రాష్ట్రానికే కాకుండా దేశం లోని అన్నీ ధర్మల్‌ స్టేషన్ల పరిస్థితి ఇలాగే వుండటం గమనార్హం.

త్వరలో మోపిదేవి, నిమ్మగడ్డలకు బెయిల్‌ ?

గత సంవత్సరం నవంబరు 3న కోనేరు ప్రసాద్‌తో జగన్‌ అక్రమాస్తులకు సంబందించిన అరెస్టులు ప్రారంభం అయ్యాయి. ఎమ్మార్‌ ప్రోపర్టీస్‌కు సంబందించిన కేసులో స్టయిలిష్‌ హోమ్‌ రియల్‌ ఎస్టేట్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌లో ప్రమోటర్‌గా ఉన్న కోనేరు ప్రసాద్‌ మార్కెట్‌ రేటుకంటే ఎక్కువగా అమ్మి దుబాయ్‌లో ఉన్న కుమారుడి ఖాతాలోకి కోట్లాది రూపాయలు పంపారని సిబిఐ నేరారోపణ చేసింది. దీని వల్ల ప్రభుత్వానికి సుమారు 91 కోట్లు నష్టం తెచ్చారన్న ఆరోపణలపై సిబిఐ విచారణ జరుపుతుంది.     రోజురోజుకూ పెరిగిపోతున్న విఐపిల అరెస్టులతో చెంచల్‌గూడ జైలు నిండిపోతూ వుంది. ఎంత మంది ఎన్ని సార్లు బెయిలు పిటీషన్లు పెట్టుకున్నా కోర్టుకు ఏదో ఒక సాకు చెప్పి సిబిఐ న్యాయవాదులు ఏ ఒక్కరికీ బెయిలు రాకుండా ఆపుతున్నారు. ఎట్టకేలకు 8 నెలల తర్వాత వారిలో ఒకరికి బెయిలు రావడంతో మిగతావారికి కూడా బెయిలు వచ్చే అవకాశం ఉందన్న ఆశ వచ్చింది. ఇప్పటివరకు కోనేరు ప్రసాద్‌ 5 సార్లు బెయిలు పిటిషన్‌ పెట్టుకున్నారు. ఇప్పుడు విఐపిలంతా ఒకొరొకరుగా బయటకు వచ్చే అవకాశం కోసం, రోజు ఎదురు చూస్తున్నారు. ఈ వరుస క్రమంలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్‌లు ఉన్నారు. వీరికి ఒక వారంరోజుల్లో బెయిలు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది.

జగన్‌పై దూకుడు తగ్గించిన లక్ష్మీనారాయణ?

సి.బి.ఐ. జాయింట్‌ డైరక్టర్‌ లక్ష్మీనారాయణ దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత వైయస్‌ జగన్‌ పట్ల దూకుడు తగ్గించుకున్నట్లు తెలుస్తుంది. వెనుక హైకోర్టు ఆదేశాలున్నాయో, కేంద్రప్రభుత్వం ఉందో, లేక సిబిఐ ఉన్నతాధికార ఆదేశాలు ఉన్నాయో తెలియడం లేదు. గతంలో జగన్‌ను ఇరుకున పెట్టడానికి శతవిధాలా ప్రయత్నించిన లక్ష్మీనారాయణ ఇప్పుడు ఆ కేసుపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని తెలిసింది. తీదనికి తోడు పదిహేనురోజుల దక్షిణాప్రికా పర్యటన ముగించుకొని తిరిగి ఉద్యోగ బాద్యతలు చేపట్టిన సిబిఐ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ మీడియాకు చాలా దురంగా ఉంటున్నారు. వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి అక్రమాస్తులపై దర్వాప్తు చేస్తూ ఒక వర్గానికి చెందిన మీడియాకే సమాచారాన్ని లీకు చేస్తున్నారంటూ ప్రింట్‌ మీడియాలోనూ, ఎలక్ట్రానిక్‌ మీడియాలోనూ జరిగిన రాంద్దాంతాన్ని తలంచుకొని ఇకపై తన పని తాను చేసుకోవడమే బెస్టు అనుకున్నట్లు ఉన్నారు. గతంలో లక్ష్మీనారాయణ, తన అఫీషియల్‌ సెల్‌ నెంబరు కాల్‌ లిస్టును అనధికారికంగా పొందారని కంప్లయింట్‌ ఇసే,్త ముందే ప్రత్యర్థి మీడియాకు సమాచారం లీకు చేస్తున్నారని వైయస్‌ వర్గీయులు లక్ష్మీనారాయణపై కోర్టుకు వెళ్లి విచారణ జరిపించాలని కోరటం జరిగింది. దీంతో వివాదాస్పదంగా మారిన సిబిఐ ఆఫీసరుగా ముద్ర వేసుకోవలసి వచ్చింది.ఈ మద్య విశాఖ అర్బన్‌ డవలప్‌మెంట్‌ అధారిటీలో జరిగిన అవక తవకలపై విచారణ జరిపి వివరాలు మీడియాతో మాట్లాడటం మినహాయించి లక్ష్మీనారయణ మీడియాకు ఎటువంటి ప్రకటనలు చేయకపోవడం విశేషం.

రూటు మార్చిన మంద కృష్ణ మాదిగ

మాదిగల హక్కులకోసం పోరాడే మందా కృష్ట మాదిగ రూటు మార్చారు ఆయన ఇక వికలాంగుల కోసం పోరాటం చేయనున్నారు. ఎన్నికలప్పుడు ఓట్లకోసం రాజకీయ పార్టీల నేతలకు వికలాంగులకు గుర్తుకు వస్తారుకాని అధికారం హస్తగతం చేసుకున్న తరువాత ఏ ప్రజాప్రతినిధికీ వికలాంగులు గుర్తుకురారని వికలాంగుల హక్కుల పోరాటం సంఘం వ్యవస్ధాపకులు మందకృష్ట మాదిగ అన్నారు. ప్రతి వర్గానికి, కులానికి సంబందించిన సమస్యలను మాట్లాడటానికి ఆయా వర్గాల నాయకులున్నారని అయితే వికలాంగులకు మాత్రం ఒక్క ప్రతినిధి కూడా లేరన్నారు. అంగవైకల్యంతో పుట్టిన వారికి పేదరికం కూడా తోడవ్వటంతో జీవన పరిస్థితులు అగమ్య గోచరంగా వుంటాయని ఆయన తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి పదవిలో ఉండగా పేద పిల్లల గుండెజబ్బులకు ఉచితంగా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు జరిపించాలని కోరితే 70 వేల మందికి 2004 సంవత్సరంలో ఆరోగ్య శ్రీ పధకం క్రింద ఆపరేషన్లు చేసారని తెలిపారు.     అన్ని రేట్లూ పెరుగుతుండటం వల్ల వికలాంగులకు ప్రస్తుతం ఇస్తున్న 500 రూపాయల పెన్షన్‌ను పదిహేను వందలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. వికలాంగుల పెన్షన్‌ను పెంచాటానికి వైయస్సార్‌ అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఇద్దరు ముఖ్యమంత్రులు మారినా ఏ ఒక్కరూ స్పందించటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగులకు పంచాయితీ నుండి పార్లమెంటువరకు 3 శాతం రిజర్వేషన్‌ కల్పిండాలన్న డిమండ్‌కు మంచి స్పందన వస్తుందన్నారు. 1985 లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు వికలాంగులకు భూపంపిణీ లో ప్రాధాన్యత కల్పించాలని జివో నెంబరు 1095 ను విడుదల చేశారని అయితే ఆతరువాత ముఖ్యమం త్రులు దానిని అటక ఎక్కించారని చెప్పారు. ఏదిఏమైనా రానున్న రోజుల్లో వికలాంగుల కోసం రాష్ట్రవ్యాప్తంగా రాజీలేని పోరాటం

మళ్ళీ ఉద్యమానికి సిద్దమవుతున్న కేసిఆర్‌

అప్పుడప్పుడు పత్రికా ప్రకటనలు తప్ప ఈమద్యకాలంలో మరే కార్యక్రమాలు చేపట్టని జాక్‌, టిఆర్‌యస్‌ పార్టీలు మళ్ళీ పోరాటబాట పట్టాలని నిర్ణయించుకున్నాయి. ప్రసిడెంట్‌ ఎన్నికల ముందు తనకు సంకేతం అందిందని, సెప్టెంబరు నాటికి తెలంగాణ రాష్ట్రం వస్తుందని అందువల్ల మరే ఉద్యమాలు చేయనక్కర్లేదని చెప్పిన కెసిఆర్‌కి తెలంగాణ ప్రస్తావన కేంద్రం ఏ మాత్రం తీసుకు రావకపోవడంతో తప్పనిసరై ఉద్యమ బాట పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో జాక్‌ ముందు నుండి పోరాటం తప్పదని చెబుతూ స్వంత ఎజెండాతో ముందుకు పోతుండటంతో టిఆర్‌యస్‌కు తన ఉనికికి ప్రమాదం వాటిల్లుతుందనే భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో జాక్‌తో జతకట్టింది.     ఈ నెల 20,21,22 తేదీల్లో సమావేశమై ఉద్యమానికి కార్యరూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. సెప్టెంబరు 30న జాక్‌ పిలుపు ఆధారంగా తెలంగాణ మార్చ్‌ను జరపాలని ప్రతిపాదించారు. ఆ తరువాతి రోజు ప్రపంచ వైవిద్య సదస్సుకు ప్రపంచంలోని నలుమూలల నుండి ప్రతినిధులు వస్తుండగా ఈ కార్యక్రమం జరుప తలపెట్టటం గమనార్హం. ప్రపంచ ప్రతినిధుల భద్రతకు తెలంగాణ మార్చ్‌ ఇబ్బంది కలిగి స్తుందని ఆందోళనలు తలెత్తుతున్నాయి. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయమని జాక్‌ నేతలు తేల్చిచెప్పారు. అంతకు ముందు సంవత్సరంలో జరిగిన మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా తీవ్రమైన ఉద్రిక్తత చోటు చేసుకోవడం, ఉద్యమ కారులు ట్యాంకు బండ్‌పై ఉన్న తెలుగు ప్రముఖుల విగ్రహాలను ద్వంసం చేయటం, పోలీసులు విరుచుకు పడటం తెలిసిందే. ఇదే పరిస్థితి పునారావృతమవుతుందేమోనని ప్రభుత్వం మధన పడుతుంది. అయితే ప్రభుత్వం సంయమనం పాటిస్తే తెలంగాణ మార్చ్‌ శాంతియుతంగా సాగుతుందని జాక్‌ నాయకులు చెబుతున్నారు.

కృష్ణమ్మకు జలకళ

నిన్న మొన్నటి వరకు ఇసుకమేటలు వేసి ఎడారిని గుర్తుకు తెచ్చిన కృష్ణానది ఇప్పుడు నీళ్లతో కళకళ లాడుతుంది. కర్ణాటకలోని ఆలమట్టి డ్యాంలోకి వరదనీరు పెరుగుతుండ టంతో కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా నీటితో నిండితూ వస్తుంది. ఆలమట్టిలో వచ్చిచేరుతున్న వరదనీటి ఇన్‌ప్లో లక్ష క్యూసెక్కులు చేరింది. ఎగువన ఉన్న ఆల్మట్టి డ్యాంలో పూర్తిస్దాయిలో నిండితే గాని మన రాష్ణ్రానికి నీరందే అవకాశం లేదు. కృష్ణానీటి కోసం ఆయకట్టు రైతులంతా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆలమట్టి పూర్తి నీటినిలువ సామర్ధ్యం 129.721 టి.ఎం.సి.లు కాగా ఉండగా గత ఏడాది ఇదే సమయానికి 110.5 టీఎంసిల నీరుంది.   ప్రస్తుతానికి 78.77 టియంసిల నీరు ఉంది. రోజుకు 10 టియంసిల నీరు చేరుతుందని, ఇలాజరిగితే కేవలం ఐదారురోజుల్లో జలాశయం పూర్తిగా నిండుతుందనిఅధికారులు చెబుతున్నారు.జలాశయం నుండి ఔట్‌ప్లో 1000 క్యూసెక్కులు ఉండగా గురువారం 14వేల క్యూసెక్కుల నీటికి పెంచారు. శ్రీశైలంలోకి మాత్రం ఇన్‌ప్లో ఏమీ లేకపోయినా ఔట్‌ప్లో మాత్రం 42 క్యూసెక్కులుంది. నాగార్జున సాగర్‌లో కూడా ఇన్‌ప్లో లేకపోగా ఔట్‌ప్లో 250 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతానికి కృష్టా డెల్టాకు ప్రకాశం బ్యారేజినుండి 2347 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇదిలా వుండగా గోదావరి ఎగువప్రాంతాల్లో వర్షాభావం వుండగా దిగువప్రాంతాల్లో వరదనీరు వచ్చిచేరుతూ వుంది.

నలిగిపోతున్న ఎంసెట్‌ విద్యార్ధులు

దేశంలోని అన్ని ఇంజనీరింగ్‌, ఫార్మసి, మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తయి సిలబస్‌ను కవర్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో మాత్రం మెడికల్‌ సీట్లు విద్యార్ధిసంఘాల ఆందోళన కోర్టు తీర్పులమద్య ఎలాగో కానిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్‌ ఫార్మసీ కౌన్సిలింగ్‌ కొచ్చేసరికి చతికిల పడిరది. దీనికి కారణం రాష్ట్రం ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడమేనని తెలుస్తోంది. గత సంవత్సరమే అన్ని కాలేజీలకు ఒకే రకమైన ఫీజలుండవలసిందేనని హైకోర్టు తీర్పునిస్తే కాలేజీలను గ్రేడ్లుగా మార్చి ఫీజుల్లో తేడాలండవలసిందే అంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పుకు వేచిచూచింది.     సుప్రీం కోర్టు ధర్మాసనం మాత్రం అందరికీ విద్యాబుద్దులు ఒకేలా కల్పించాలని అంటూ ఈ కాలేజీల గ్రేడ్లేమిటంటూ నిలదీసింది. దీంతో ప్రభుత్వ న్యాయవాది రీ ఇంబర్స్‌మెంటు గురించి వివరిచడం జరిగింది. రీ ఎంబర్స్‌ మెంట్‌ను ఏ చట్ట పరిధిలో ఇస్తున్నారంటూ కోర్టు వేసిన ప్రశ్నకు సరైన సమాదానం ఇవ్వలేకపోయారు. కాలేజీ యాజమాన్యాలు పెంచిన ఫీజులు గురించి ప్రభుత్వం ఇప్పుడు గుండెలు బాదుకుంటుంది. కన్వీనర్‌కోటా, మేనేజ్‌మెంట్‌కోటా లంటూ ఫీజుల గురించి ముందు జాగ్రత్తలు పాటించకుండా ఇప్పుడు బాధపడుతుంది. ఇవన్నీ ముందుగానే చర్చించి ఎకడమిక్‌ ఇయర్‌ స్టార్‌ అయ్యేటప్పటికి సన్నధంగా ఉండవలసిన ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిద్రలో జోగింది.   ఇద్దరు విద్యాశాఖ మంత్రులు ఉన్నప్పటికి ఆ శాఖ పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉందో ఈ ఉధంతంతో అర్ధం చేసుకోవచ్చు. ఎంత వరకూ పదవులు కాపాడుకుంటానికే ప్రాధాన్యత నివ్వడమే కాని, ప్రజల సమస్యలుగాని, విద్యార్ధుల సమస్యలు గాని పట్టించుకున్న సందర్బం ఏ ఒక్క మంత్రికీ లేదని దీన్ని బట్టి తేటతెల్లం అయ్యింది. ఇప్పటికైనా అన్ని ఫార్మాలిటీస్‌ పూర్తిచేసుకొని కౌన్సిలింగ్‌ ప్రక్రియను త్వరగా ముగించాలని విద్యార్దులూ తల్లిదండ్రులూ కోరుతున్నారు.

రెండిటికి చెడ్డరేవడి కెవిపి రామచంద్ర

గాంధీభవన్‌లో యూత్‌ కాంగ్రెస్‌నాయకుడు పదవీ ప్రమాణం జరుగుతున్న సందర్బంగా మఖ్య మంత్రి, మంత్రులు పార్టీ కార్యకర్తల సమక్షంలో ఆవేశంగా దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటం ఎందుకు లేదంటూ కెవిపి ప్రశ్నించి దూమారం లేపారు. ధర్మాన కమిటీలో వైయస్‌ ముద్ర వుండకూడదని నిర్ణయం తీసుకున్న తర్వాత కే.వి.పి. ఇటువంటి దుమారం లేపడం విశేషం.ఇది ఇంతటితో ఆగేటట్టు లేదు. పోనీ కెవిపి దీని వల్ల సానుభూతిగాని, ప్రజాదరణకాని పొందిన దాఖలు ఏమీ లేదు. వి. హనుమంతరావు ఈ విషయంలో స్పందిస్తూ విజయలక్ష్మి సోనియాను, రాహుల్‌ని తిట్టినప్పుడు రాని నోరు ఇప్పుడు వైయస్సార్‌ ఫోటో కోసం వచ్చిందా అంటూ కడిగి పారేశారు. అలా అని వైయస్సార్‌ పార్టీ ఏమన్నా అభిమానించిందా అంటే అదీ లేదు. ఎన్నికల సమయంలో వైయస్‌ జగన్‌, విజయమ్మతో పాటు రాజశేఖర రెడ్డిని కూడా తిట్టి, నిందలు మోపి నప్పుడు మాట్లాడని కెవిపి ఇప్పుడు ఎందుకు ఈ అంశం లేవనెత్తారని వైసిపి నాయకురాలు కొండా సురేఖ ప్రశ్నించారు.     తర్వాతి రోజు వైయస్‌ కాంగ్రెస్‌ గౌరవాద్యక్షురాలు విజయమ్మ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ వైయస్‌ బ్రతికి ఉన్నప్పుడు ఇంటికి తిరిగిన వారంతా ఆయన చనిపోయాక మొఖం చూపించలేదని ఎద్దేవా చేశారు. అయితే రాజకీయ ప్రత్యర్థులు, కాంగ్రెస్‌లోని నాయకులు ఒప్పుకునేందేమంటే ఇప్పుడు రాజకీయంగా ఉన్నత పదవులను అధిష్టించిన వారంతా రాజశేఖరరెడ్డి పైకి తీసుకు వచ్చిన వారే అని. పరిస్థితులు, అవకాశవాదం వారిని మాట్లాడనీయక పోయి వుండవచ్చుకాని వారి మనసుకు తెలుసు వైయస్‌ వారికి ఎంత లిఫ్టు ఇచ్చారో. కాబట్టే అప్పుడప్పుడు ఇలా మనసులో మాట నాయకులకు బయటకు వచ్చేస్తూ వుంటుంది. ప్రజాసమస్యల పై దృష్టి సారించని నాయక గణం కే.వి.పి. వ్యాఖ్యలపై నానా రాద్దాంతం చేసింది. దీంతో మీడియాకు బోలెడంత పని. దీని మీద డిల్లీకి గుట్టలు గుట్టలుగా రిపోర్టులు వెళుతూనే ఉన్నాయి.ఇక్కడి వర్షాభావ పరిస్ధితి గాని, ఇంజనీరింగ్‌ విద్యార్దులు కౌన్సిలింగ్‌ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును గాని, కరెంటు సమస్యవల్ల దివాళా తీస్తున్న పరిశ్రమల గురించిగాని అధిష్టానం దృష్టికి తీసుకురాని నాయకులు కే.వి.పి. వ్యాఖ్యలను మాత్రం వారి దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిసింది.

కరెంటుకష్టాలకు చెక్‌ పెట్టేదెప్పుడు

ఈరోజు గడిస్తే చాలు అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ ధోరణి ఉంది. ఒక భాద్యతాయుతమైన పరిపాలన అందించాలన్న అవగాహన లేకుండా ప్రవర్తించడం వల్లే నేటి కరెంటు సమస్య ఉత్పన్న మైంది. ఇదే పరిస్థితి కొన సాగితే రానున్న రోజుల్లో రాష్ట్రం అంధకారం లోకి వెళుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. దశాబ్దాలుగా ప్రభుత్వ రంగంలోని పొరపాట్లు, ముందు జాగ్రత్త లేకపోవడం వల్లే ఇలాంటి వైఫల్యాలను ఎదుర్కొవలసి వస్తుంది. దేశంలో 300 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నా రాష్ట్రంలో అంధకారం అలుముకుంటోంది.వృధాను అరికట్టి , పంపిణీ వ్యవస్తను మెరుగుపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఉన్న ధర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లన్నీ బూడిదతో నిండి పోయాయి.చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కాలుష్య మయం అయ్యాయి. దీనివల్ల చుట్టుప్రక్కల నివాసముండే ప్రజలంతా అనారోగ్యం పాలయ్యారు.అందుకే పరిశ్రమలన్నా, విద్యుత్‌ ప్లాంట్లన్నా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మొదటినుండి శుద్దికార్యక్రమాలున్నట్లయితే ఇప్పుడు ఈ పరిస్థితివచ్చి వుండేది కాదు. ఇదే పరిస్థితి కొన సాగితే రానున్న రోజుల్లో వెంట ఆక్సిజన్‌ సిలిండర్‌ తో ప్రజలు ప్రయాణించ వలసి వస్తుంది.

తల్లీ బిడ్డల ఆరోగ్యానికి కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక కృషి

సమతుల్య ఆహారం అందక హాస్పటల్‌ పాలవుతున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. దాంతోప్రభుత్వం వారికి ప్రత్యేక సదుపాయాలతో ఆసుపత్రులలో చేర్చుకొని మెరుగైన వైద్యసేవలు అందించాలనుకుంటోంది. వారితోపాటు తల్లులు కూడా తప్పనిసరిగా ఉండాల్సిరావడంతో వారి రోజువారి కుటుంబపోషణకు భారం అవుతుంది. దీనిని నివారించడం కోసం పిల్లలతోపాటు ఆసుపత్రిలో ఉండే తల్లులకు కూడా ప్రభుత్వం సాయం చేయాలనుకుంటుంది. ఇలా ఆసుపత్రులలో ఉండే తల్లులకు రోజుకు 150 రూపాయల చొప్పున నెలరోజుల పాటు జీవన భృత్యం చెల్లించాలని కుటుంబ సంక్షేమ అధికారులు తెలిపారు. గర్బిణీలకు ప్రత్యేక వైద్య సదుపాయాలు కలిగించాలనుకుంటున్నారు.గిరిజన ప్రాంతాలలో రోగులను సమీప ఆసుపత్రులకు తరలించడానికి గాను బరువులేని డోలీలు, పల్లకీలు తయారు చేయిస్తున్నట్లు కుటుంబ సంక్షేమ అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా ఉన్న పోస్టులను ఆగస్టు 20 కల్లా భర్తీ చేయనున్నామని తెలియ చేశారు. అలాగే తల్లీ బిడ్డల ఆరోగ్యంకోసం తల్లిపాల ప్రాధాన్యత గురించి వివరిస్తారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల మహిళలలో రొమ్ము, అండాశయ కేన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువని వైద్యులు తెలిపారు.