కర్నాటక ఫలితాలపైనే కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ

కర్నాటక ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఒక లిట్మస్ టెస్టుగా  దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ భావిస్తున్నాయి. ఇందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ భావనలో కూడా మినహాయింపు లేదు. అందుకే కర్నాటకలో బీజేపీ సర్కార్ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకతను గుర్తించిన కమలం పార్టీ సున్నత అంశాలను హైలైట్ చేస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో  విజయం కోసం సర్వ శక్తులనూ ఓడ్డింది. పోలింగ్ పూర్తై ప్రజా తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. శనివారం (మే13) ఫలితాలు వెలువడుతాయి. ఈ నేపథ్యంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో ఏ మాత్రం సంబంధం లేని బీఆర్ఎస్ ఈ రాష్ట్ర ఫలితాలపై ఎనలేని ఆసక్తి చూపుతోంది. జాతీయ రాజకీయాలలో తన ప్రస్థానం ఎలా సాగించాలన్న దానికి ఈ ఫలితాలను గీటురాయిగా బీఆర్ఎస్ తీసుకుంటోంది. కర్నాటకలో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీగా పోరు జరిగిందన్న అంచనాల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న పార్టీ కొద్ది నెలలో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో మరింత ఉత్సాహంతో దూసుకు వెళుతుంది. అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ గట్టిగా ఎదుర్కొనవలసిన పార్టీ కూడా అదే అవుతుంది. ఆ ఉద్దేశంతోనే కర్నాటక ఫలితాలపై బీఆర్ఎస్ అధినేత అమిత ఆసక్తి చూపుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా ఒక వేళ కర్నాటకలో హంగ్ అంటూ ఏర్పడితే.. అప్పుడు ఆ రాష్ట్రంలో ఎన్నికలలో పాల్గొనకపోయినా చక్రం తిప్పే అవకాశం దొరుకుతుందని కేసీఆర్ భావిస్తున్నారనీ, జేడీఎస్ ద్వారా కర్నాటక రాజకీయాలలో తానే కింగ్ మేకర్ గా అవతరించే అవకాశం లభిస్తుందన్నది కేసీఆర్ భావన. అదే జరిగితే బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలలో మరింత ప్రభావమంతంగా వ్యవహరించేందుకు గట్టి పునాది ఏర్పడినట్లేనని కేసీఆర్ అంచనాగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జాతీయ రాజకీయాలు సహా తెలంగాణలో మరో మారు అధికారాన్ని చేజిక్కించుకునేలా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి కూడా కర్నాటక ఫలితాలు ఒక గ్రౌండ్ ను ప్రిపేర్ చేస్తాయని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు.  

పరాన్న జీవి -ఆర్జీవి

రాముడిని, గోపాలుడిని కలిపి ఒకడిగా అవతరించిన రూపం రామగోపాలవర్మ. ఈయనను అందరూ అర్జీవీ అని పిలుచుకుంటారు. బహుశా ప్రపంచంలో  యింత కన్ఫ్యూజన్ క్యారెక్టర్ మరోకటి ఉండదేమో అనినిస్తుంది అర్జీవీని చూస్తే. అసలే కన్ఫ్యూజన్ లో ఉండే ఈ పెద్ద మనిషి అందరినీ కన్ఫ్యూజన్ లో పెట్టడంలో బిజీగా ఉంటాడు. అప్పుడెప్పుడో మూడున్నర దశాబ్దాల క్రితం ఒక సినిమా తీసి పాపులర్ అయిన రామ్ గోపాల్ వర్మ తన కెరీర్ ని కొంత కాలం కొనసాగించారు. టాలీవుడ్, బాలీవుడ్ లలో కొన్ని గొప్ప సినిమాలు తీసిన ఆర్జీవీ తరువాత తన విపరీత మనస్తత్వానికి పదును పెట్టాడు. సినిమాలు తప్ప అన్ని విషయాలపై తన మేధస్సును ప్రపంచానికి పంచే పని మొదలు పెట్టాడు.  మొదట్లో జనాలకు ఆయన ధోరణి నచ్చింది కానీ క్రమంగా విద్యావంతులు, ఆలోచనాపరులు ఆర్జీవీ వాదలను వ్యతిరేకించడం మొదలైంది. తన సినిమాలను చూడండని తానెప్పుడూ ప్రేక్షకులను కోరలేదని బోల్డ్ స్టేట్ మెంట్స్ ఇచ్చే రామ్ గోపాల్ వర్మ, తన పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను కూడా పాపులారిటీగా  తీసుకున్నాడు. చిరంజీవి, శ్రీదేవి లాంటి పెద్ద స్టార్లతో సినిమా మొదలు పెట్టి ఆపేసిన ఆర్జీవీ  తాను తీసిన సినిమాల కంటే ఆపేసినవే ఎక్కువ అని చెబుతుంటారు.  సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఏ విషయాన్నీ ఆర్జీవీ వదిలి పెట్టడం జరగదు. అలాగే రాజకీయాలలో ఎవరు ఎలాంటి  ప్రకటన చేసినా రామ్ గోపాల్ వర్మ నోరు విప్పక మానడు. రాంగోపాల్ వర్మ అంటే ఎందరికో వినోదం. కొందరికి అసహ్యం. కొద్ది మందికి అవసరం అనేది అందరికీ తెలిసిన అక్షర సత్యం. 2019 ఎన్నికల ముందు లక్ష్మీ పార్వతి కథతో సినిమా తీసి చంద్రబాబును ఇరుకున పట్టాలన్నా, పవన్ కల్యాణ్ ఏమి మాట్లాడినా దానిపై సెటైర్లు వేయాలన్నా అది రాంగోపాల్ వర్మకే సాధ్యం. ఆర్జీవీ చేసేప్రతి పనికీ ఒక ప్యాకేజీ ఉంటుందని సినీ పరిశ్రమలో చెప్పుకుంటారు. అడవి దొంగ వీరప్పన్ తనకు ఆదర్శం అని బాహాటంగా చెప్పే అర్జీవీ నిజ  జీవితంలో కూడా అలాంటి వ్యక్తులనే సమర్ధిస్తుంటాడు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి. సహజంగా పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యలు చేసిన వారిని ఆయన అభిమానులు వదిలిపెట్టరు, కానీ తాజాగా పవన్ కల్యాణ్ పై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు ఆగ్రహించినట్లుగా ఎక్కడా కనిపించలేదు. కారణం ఆర్జీవీని పట్టించుకోకపోవడమే సరైన జవాబు అని జనసేన భావించడమే  ఆ పార్టీ శ్రేణులు చెప్పడం ఆర్జీవీ ప్రస్తుత స్థితిని అద్దం పడుతోంది. 

దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హంగామా

వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో వచ్చిన బిఆర్ ఎస్ హాట్రిక్ కొట్టాలని తీవ్రంగా యత్నిస్తోంది. ఈ రెండు పర్యాయాలు డెవలప్ మెంట్,  వెల్ఫేర్ కార్యక్రమాలతో ప్రజలను అలరించినట్లు తెలంగాణ ప్రభుత్వం చెప్పకనే చెప్పబోతుంది. పట్టుమని పదేళ్లు నిండిన ప్రభుత్వానికి తగిన ప్రచారం అవసరమైంది. పదేళ్ల విజయోత్సవాలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు  ఈ మేరకు ఉత్తర్వులు జారి చేసింది.   తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. పదో వసంతంలోకి తెలంగాణ అడుగుపెడుతుంది. ఈ శుభసందర్భాన్ని పుర స్కరించుకొని దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జూన్ 2 నుంచి పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రస్థానాన్ని పదేళ్ల పండుగ సందర్భంగా ఘనంగా చాటేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు, దశాబ్దాల పోరాట చరిత్రను స్మరించుకునేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. కేసీఆర్ సర్కార్ ప్రాధాన్యత పథకాలు, వాటి ద్వారా ప్రజలకు కల్గిన ప్రయోజనాలను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చాటి చెప్పనున్నారు. రాష్ట్రం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రగతిపై విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు సాధించి విజయాలు, అమలు చేస్తున్న అభివృద్థి, సంక్షేమ పథకాలు, వినూత్న విధానాలు, ఇతర రాష్ట్రాలు, ఇంకా దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా మారిన తీరును ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకొని వెళ్లడానికి కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, ఇతర సంబరాలు కూడా ప్రభుత్వం నిర్వహించాలని భావిస్తోంది. ఇక వీటితో పాటు రాష్ట్ర రాజధానిలో ఓ భారీ బహిరంగ సభను కూడా సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కళాశాల మైదానం, ఎల్బీ స్టేడియం లలో ఏదో ఒక చోట భారీ సభ నిర్వహించేందుకు ఆలోచన చేస్తోంది. ఇక తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవాన్ని కూడా దశాబ్ది ఉత్సవాల్లోనే చేపట్టనున్నారు. అయితే ఈ కార్యక్రమాలపై అధికారుల కసరత్తు తరువాత ఎన్ని రోజులు వేడుకలు నిర్వహించాలి, ఏయే కార్యక్రమాలు నిర్వహిచాలన్న దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.

ఇమ్రాన్ ఖాన్ కు మరో ఊరట 

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో ఊరట లభించింది . నిన్న పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఇమ్రాన్ అరెస్ట్ పై సీరియస్ అయిన సంగతి తెలిసిందే . న్యాయస్థాన ప్రాంగణంలో  ఏకంగా 90 మందికి పైగా భధ్రతా సిబ్బంది జొరబడి అరెస్ట్ చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇవ్వాళ  తోషాఖానా కేసులో ఆయనకు ఇస్లామాబాద్ హైకోర్టు స్టే జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆయన శుక్రవారం కోర్టుకు హాజరు కాగా.. ఆయనపై చర్యలు తీసుకోకుండా కోర్టు ఇంజంక్షన్ ఉత్తర్వులను కూడా ప్రకటించింది. ఇమ్రాన్ పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేబట్టరాదని ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. ఈ కేసులో ఆయన దోషి అన్న ఉత్తర్వులు చెల్లవని కూడా పేర్కొంది. ఆయన అరెస్టు చట్టవిరుద్ధమని, ఆయనను తక్షణమే విడుదల చేయాలని పాక్ సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది.ఈ కేసులో ఆయన దోషి అన్న ఉత్తర్వులు చెల్లవని కూడా పేర్కొంది. ఆయన అరెస్టు చట్టవిరుద్ధమని, ఆయనను తక్షణమే విడుదల చేయాలని పాక్ సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. ఇస్లామాబాద్ హైకోర్టు బయట ఇమ్రాన్ ను పారామిలిటరీ బలగాలు అరెస్టు చేయడంపై మండిపడుతూనే.. ఆయన మద్దతుదారులు వెంటనే హింసాకాండకు స్వస్తి చెప్పాలని కూడా న్యాయమూర్తులు సూచించారు. తనను పోలీసులు టార్చర్ పెట్టారని, లాఠీలతో కొట్టారని ఇమ్రాన్ కోర్టులో వాపోయారు. రెండు కోర్టుల నుంచి కూడా తనకు ఊరట లభించడంతో 70 ఏళ్ళ ఇమ్రాన్ ఖాన్.. ఈ మధ్యాహ్నం తన పార్టీ నేతలను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్టు తెలుస్తోంది. పైగా ముందస్తు బెయిలు కోసం ఆయన ప్రయత్నించవచ్చునని వెల్లడయింది. కోర్టుల నుంచి తమ నేతకు ఉపశమనం లభించడంతో ఆయన మద్దతుదారులు హర్షం ప్రకటిస్తున్నారు.

ఆ జీవో ప్రాథమిక హక్కులకు భంగకరం

జగన్ సర్కార్ కు హైకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సభలూ, సమావేశాలూ నిర్వహించకుండా, రోడ్ షోలకు అవకాశం లేకుండా చేస్తూ తీసుకువచ్చిన జీవో నంబర్ వన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవో జారీ చేసినప్పుడే  ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమంటూ విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కడానికీ, విపక్ష పార్టీలను అణచివేయడానికే ఈ జీవో ను జగన్ సర్కార్ తీసుకువచ్చిందంటూ  అన్ని రాజకీయ పార్టీలూ, ప్రజాస్వామ్య వాదులూ ఈ జీవోను వ్యతిరేకించారు.   అప్పట్లో  చంద్రబాబు నిర్వహించిన రెండు వరుస సభల్లో తొక్కిసలాటలు జరిగాయి. ఆ తొక్కిసలాటలలో మరణాలు సంభవించాయి. అంతే ఆ రెండు సంఘటనలనూ సాకుగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద రాష్ట్రంలో సభలూ, సమావేశాలు, రోడ్డు షోలపై ఆంక్షలు విధిస్తూ జీవో నంబర్ 1 తీసుకు వచ్చేసింది. ఆ జీవోను అడ్డుపెట్టుకుని  అప్పట్లో చంద్రబాబు కుప్పం పర్యటనను సర్కార్ అడ్డుకుంది. తర్వాత ఆనపర్తిలోనూ చంద్రబాబు పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు కల్పించింది. యిదే జీవోను చూపుతూ  లోకేష్ పర్యటనపై ఆంక్షలు విధించింది. కాగా ఈ జీవోను కొట్టి వేస్తూ ఏపీ హైకోర్టు ఇది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు  విఘాతం కలిగించేదిగా ఉందని  పేర్కొంది.  జీవో నెం.1ను సవాల్ చేస్తూ  సీపీఐ నేత రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రోడ్ షోలను కట్టడి చేసేలా జీవో ఉందన్న పిటిషనర్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు జీవో ఇచ్చారని పోలీస్ యాక్ట్ 30కు భిన్నంగా జీవో నెం.1 జారీ చేశారని రామకృష్ణ తరపు న్యాయవాది వాదించారు. ప్రజల ప్రాథమిక హక్కును హరించేలా జీవో ఉందని తన పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. వీటితో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. ఈ జీవో జారీ చేసినప్పుడు హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ఆకారణంగా  ఈ పిటిషన్ ను అప్పుడు విచారించిన  వెకేషన్ బెంచ్ ఈ జీవోపై స్టే ఇచ్చింది.  తర్వాత విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ బెంచ్.. ఆ స్టేను పొడిగించడానికి నిరాకరిస్తూ,  తీర్పు రిజర్వ్ చేసింది.  చాలా కాలం పాటు తీర్పు ఇవ్వకపోవడంతో రామకృష్ణ సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు. త్వరగా తీర్పు ఇవ్వాలని హైకోర్టులోనే కోరాలని.. తీర్పు వచ్చే వరకూ స్టే ఇవ్వాలని హైకోర్టును కోరాలని పిటిషనర్ రామకృష్ణకు సుప్రీంకోర్టు సూచించింది.  ఇటీవల హోంశాఖపై సమీక్ష జరిపిన సీఎం జగన్ జీవో వన్ సమర్థంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ఇప్పుడు హైకోర్టు ఆ జీవోను కొట్టివేసింది. 

రక్షణ కల్పించండి మహప్రభో.. మోడీ షాలకు రాజాసింగ్ లేఖ

గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ కు ఉగ్ర ముప్పు పొంచి ఉందా అంటే ఔననే అంటున్నారు ఆయన. ఈ మేరకు   ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు లేఖలు రాశారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆ లేఖలో కోరారు. ఉగ్ర సంస్థల నుంచి తమకు ప్రాణముప్పు పొంచి ఉందని, భారీ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఇటీవల ఉగ్రవాద కార్యాకలాపాలకు పాల్పడుతున్నవారిని పోలీసులు పట్టుకున్న నేపథ్యంలో రాజా సింగ్  మోడీ,  షాలకు లేఖ రాయడం ప్రాధాన్యత  సంతరించుకుంది. హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించడంతో పాటు బాంబ్‌లతో తమపై దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్నారనే విషయం తనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని రాజాసింగ్ ఆ లేఖలో పేర్కొన్నారు.  ఇప్పటికే దేశ విదేశాల నుంచి తనను ఖతం చేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చిన విషయాన్ని ఆ లేఖలో రాజాసింగ్ ప్రస్తావించారు. తనకు భద్రత కల్పించాల్సిందిగా పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా  ఫలతం లేకపోయిందని పేర్కొన్నారు.  గతంలోనూ తన భద్రత విషయంపై మోదీ, అమిత్ షాలకు రాజాసింగ్ లేఖలు రాశారు.  ఇప్పుడు హైదరాబాద్‌లో ఉగ్రకదలికలు బయటపడిన నేపథ్యంలో రాజాసింగ్ మరోసారి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.  హైదరాబాద‌లో ఇటీవల ఉగ్రవావదుల కుట్ర కోణం బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తుండగా.. కీలక విషయాలు బయటపడుతున్నాయి. నగరంలో భారీగా ఉగ్ర దాడులకు నిందితులు ప్లాన్ చేసినట్లు తెలిసింది. నిందితులకు హిజబ్ ఉట్ తెహ్రిర్  (హెచ్ యుటి) సంస్థతో సంబంధాలున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో మరోసారి ఉగ్రవాద మూలాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లో ఐదుగురిని అరెస్ట్ చేసి భోపాల్‌కు తరలించారు. భోపాల్ ప్రత్యేక న్యాయస్థానం మే 19వ తేదీ వరకు నిందితులకు కస్టడీ విధించింది. ఉగ్ర దాడుల కోసం అడవుల్లో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఒకరితో మరొకరికి నేరుగా కాంటాక్టు లేకుండా డార్క్ వెబ్ ద్వారా సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది.

బీజేపీ కోర్టులో బంతి!

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది నానుడి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఆ నానుడికి అద్దం పట్టేవిగానే ఉన్నాయి.  నాలుగేళ్ల కిందట మైత్రీ బంధాన్ని తెంచుకున్న తెలుగుదేశం, జనసేనలు మళ్లీ దగ్గరయ్యాయి? ఏపీలో తెలుగుదేశంతో  జనసేన మైత్రి విషయంలో నిన్న మొన్నటి దాకా ఉన్న అనుమానాలూ, సందేహాలను పవన్ కల్యాణ్ పటాపంచలు చేసేశారు. అంతే కాదు.. తన మిత్రపక్షమైన బీజేపీని కూడా తమతో  అడుగులు వేసేలా ఒప్పించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నానని కూడా చెప్పారు.   జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ పొత్తుల విషయంలో క్లారిటీ యిచ్చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వబోమన్నతన మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.  అలాగే ఈ విషయంలో తనతో కలిసి రావాలని బీజేపీని కోరేందుకే ఢిల్లీ వెళ్లానని కూడా స్పష్టం చేశారు. బీజేపీతో  జనసేన అధికారిక పొత్తులో  ఉన్న సంగతి తెలిసిందే.  తాము టీడీపీతో వెళ్తామని బీజేపీని కూడా కలిసి రావాలని కోరుతున్నానని కూడా పవన్ విస్పష్టంగా  చెప్పారు.   ఓ వైపు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి టీడీపీతో కలిసి పని చేయాలనే సంకేతాలు ఇవ్వడం.. మరో వైపు చంద్రబాబు కూడా రిపబ్లిక్ టీవీ చానల్‌తో మాట్లాడుతూ ..మోదీకి పూర్తి మద్దతు ప్రకటించడంతో  ఏపీలో బీజేపీని కూడా తమతో కలుపుకునేందుకు యిటు తెలుగుదేశం, అటు జనసేనా కూడా ప్రయత్నాలు చేస్తున్నాయని తేటతెల్లమైపోయింది.   నిజానికి చంద్రబాబు ఎన్డీఏలో చేరుతారని గత ఏడాది నుంచి ప్రచారం జరుగుతోంది. రెండు సార్లు ఢిల్లీలో చంద్రబాబు మోదీని కలిశారు.  ఇప్పుడు పవన్ ప్రకటనతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.  పవన్ కల్యాణ్.. కలిసి వస్తే రావాలి లేకపోతే వైసీపీ విముక్త ఏపీ కోసం టీడీపీతో వెళ్తామని తేల్చేయడంతో  యిక యిప్పుడు ఎటు వైపు వెళ్లాలన్న విషయంలో బంతి బీజేపీ కోర్టులోనే ఉంది. రాష్ట్రంలో కనీసంలో కనీసం ఒక్క శాతం ఓటు షేరు కూడా లేని బీజేపీ.. ఏం నిర్ణయించుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.  

కేసీఆర్ పై రాములమ్మ ఫైర్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు సీనియర్ బిజేపీ నేత విజయశాంతి. పూర్వాశ్రమంలో బీఆర్ఎస్ లో  కేసీఆర్ వెంటే ఉన్న విజయశాంతి అదే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తో విభేధించి బయటకొచ్చారు. తల్లి తెలంగాణా పార్టీ స్థాపించి అప్పట్లో  క్రియాశీల రాజకీయాల్లో చురుకు పాల్గొన్నారు. తర్వాత బిజేపీ సిద్దాంతాలకు ఆకర్షితులై  ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లో దూసుకొచ్చిన రాములమ్మ ఈ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ను ఓడించాలని కంకణం కట్టుకున్నట్టు కనబడుతోంది.  సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ మార్చ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ది అంతా దోపిడీ రాబడి అంటూ ఆరోపించారు. కేసీఆర్ మనసు క్రూరమైనదంటూ విమర్శించారు. కేసీఆర్ ఎగ్జామ్ పేపర్లన్నీ అమ్ముకుంటున్నారని.. కేసీఆర్ నీకు సిగ్గుందా.. నిరుద్యోగులు ఉసురు పోసుకున్నాడంటూ ఆరోపించారు. నీ కూతురు లిక్కర్ స్కామ్.. నీ కొడుకు పేపర్ లీక్ వీరుడు.. నువ్ దేశంలో ప్రతిపక్షాలకు డబ్బులు ఇస్తున్నావ్.. అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు విజయశాంతి. బండి సంజయ్ ని అక్రమంగా జైలులో పెట్టారన్నారు. మనుగోడులో డబ్బు, మద్యంతో గెలిచారని దుయ్యబట్టారు. ఒక్కో ఓటుకు రూ.5 వేలు ఇచ్చారని ఆరోపించారు. సచివాలయం ఆయన కోసమే కట్టారంటూ ఎద్దేవా చేశారు విజయశాంతి. ప్రతిపక్షాలకు అందులో అనుమతి లేదట అంటూ సెటైర్లు వేశారు. రూ.400 కోట్ల నుంచి రూ.1600 కోట్లకి సచివాలయం వ్యయం పెరిగిందన్నారు. 1200 కోట్లు ఎవరి ఇంట్లో నుంచి తెచ్చి కట్టారన్నారు. 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.. నిర్ణయం మీదే రాములక్క చెప్పిన నిజాలు గమనించాలన్నారు. ఆరు నెల్లోల కేసీఆర్ ని గద్దె దింపాలని సూచించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీలు తోడు దొంగలే అన్నారు. ఉమ్మడి మెదక్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాగా నొక్కుతున్నారని దుయ్యబట్టారు విజయశాంతి. ప్రస్తుతం విజయశాంతి లోకసభ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. మాజీ మెదక్ లోకసభ సభ్యురాలిగా పని చేసిన విజయశాంతికి  బిజెపి నుంచి టికెట్ కన్ఫమ్ అయినట్లేనని తెలుస్తోంది. ప్రస్తుతం బిఆర్ఎస్ ఎంపీ ఈ నియోజకవర్గం నుంచి కొత్త కోట ప్రకాశ్ రెడ్డి ఉన్నారు. ఆయన దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నేపథ్యంలో విజయశాంతికి పోటీ మీద బిఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. విజయశాంతిని ఓడించడానికి బలమైన అభ్యర్థి కోసం బీఆర్ఎస్  కేసీఆర్ వెతుకుతున్నారు. 

కర్నాటకలో కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు!

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం (మే 13)న వెలువడతాయి. పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు ఎడ్జి ఉంటుందని చెప్పినా.. వివిధ సంస్థలు వెలువరించిన వేర్వేరు ఎగ్జిట్ పోల్స్ లో  కాంగ్రస్ ఏకప విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని అయితే  యివ్వలేదు. ఒకటి రెండు సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ లో కర్నాటకలో హంగ్ తప్పదని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో  కర్నాటకలో  ప్రభుత్వ ఏర్పాటుపై ఎంతో విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ లో  ఖంగారు మొదలైనట్లు కనిపిస్తోంది.  దీంతో కర్నాటకలో కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది.   కర్నాటకలో ఈ నెల 10న ఎన్నికలు జరిగాయి. మొత్తం 224 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో సగానికి ఒకటి కలిపితే 113 సీట్లు వచ్చిన పార్టీదే అధికారం. కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ గా ఉంటుందని సర్వేలు అన్నీ స్పష్టంగా చెప్పాయి. అయితే మ్యాజిక్ ఫిగర్ కు చేరుతుందన్న అంచనాలకు భిన్నంగా కొన్నిసర్వేలు కాంగ్రెస్ ఆ 113 కొద్ది దూరంలో ఆగిపోతుందని పేర్కొనడంతో కాంగ్రెస్ ఒక వేళ అలా జరిగితే ఏం చేయాలి అన్న దానిపై యిప్పటి నుంచే కసరత్తు చేస్తోంది.  దీంతో  ఫలితాలు వెలువడటం మొదలు కాగానే గెలిచిన ఎమ్మెల్యేను గెలిచినట్లుగా క్యాంపునకు తరలించే యోచన చేస్తోందని పరిశీలకులు అంటున్నారు.  కర్నాటకలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో గోవాలో క్యాంపు పెట్టాలన్నది కాంగ్రెస్ భావనగా చెబుతున్నారు. యిందుకు తగ్గ ఏర్పాట్లు అప్పుడే మొదలయ్యాయని కూడా అంటున్నారు. యిక ఎంత నిర్వేదంలో  ఉన్నా ఎవో కొన్న స్థానాలలో గెలుస్తామన్న నమ్మకం ఉన్న జేడీఎస్ కూడా గెలిచిన తమ ఎమ్మెల్యేలు జారిపోకుండా అవసరమైన ఏర్పాట్లు చేసుకొంటోంది. సపోజ్ ఫర్ సపోజ్ కర్నాటకలో హంగ్ వస్తే.. కాంగ్రెస్, బీజేపీల చూపు కచ్చితంగా జేడీఎస్  ఎమ్మెల్యేల వైపే ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకే జేడీఎస్ కూడా తన జాగ్రత్తలో తాను ఉంటోంది. 

కుమారస్వామికి కేసీఆర్ హ్యాండిచ్చారా?

కర్నాటక ఎన్నికలలో కింగ్ మేకర్ గా కచ్చితంగా   ఉంటామనీ, కాలం కలసి వస్తే.. ముఖ్యమంత్రి పదవి కూడా దక్కేస్తుందనీ ఎన్నో ఆశలుపెట్టుకున్న జేడీఎస్.. తీరా ఎన్నికలు పూర్తయిన తరువాత తమకు అంత సీన్ లేదని అంగీకరించేసింది.  అయితే ప్రజా తీర్పు మేరకే తమకు ఆ  సీన్  లేకుండా పోయిందని మాత్రం అనడం లేదు. అవసరమైనంతగా సొమ్ములు ఖర్చు చేయలేకపోవడం వల్లే.. ఈ పరిస్థితి ఎదురైందని చెబుతోంది. అంతే  కాదు.. తాము అనుకున్నంతగా పోటీ యివ్వ లేకపోవడానికి నమ్ముకున్న ఒక మిత్రుడు హ్యాండ్ యివ్వడమే కారణమని చెబుతోంది. కచ్చితంగా యివే మాటలు కాకపోయినా.. జేడీఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి కర్నాటక ఎన్నికల పోలింగ్  పూర్తయిన తరువాత మీడియా సమావేశంలో చెప్పిన మాటలకు యిదే అర్ధం. ఆయన సహకరించలేదంటూ పేరెత్తకుండా చేస్తున్న విమర్శలన్నీ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైనేనని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. కర్నాటక ఎన్నికలు ముగిశాయి. శనివారం ( మే 13) ఫలితాలు వెలువడుతాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ లు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఎడ్జ్ కాంగ్రెస్ కు ఉందని చెబుతున్నాయి. జేడీఎస్ కీలక రోల్  ప్లే చేసే అవకాశం ఉందన్నది ఎగ్జిట్స్ పోల్స్ చెబుతున్న మాట. అయినా జేడీఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగా కీ  రోల్ ప్లే చేయడానికి అవసరమైన స్థానాలలో తాము విజయం సాధిస్తామన్ననమ్మకాన్ని వ్యక్తం చేయడం లేదు. ఎంత శ్రమపడినా ఆర్థిక ప్రతిబంధకం వల్ల మహా గెలుస్తే ఓ పాతిక స్థానాలలో గెలిచినా అదేమీ తాము కీ రోల్ ప్లే చేయడానికి సరిపోవన్నది ఆయన మాటల సారాంశం.  కాగా కుమారస్వామి ఆర్థిక వనరుల లేమి కారణంగానే తాము ఎన్నికలలో అనుకున్నంతగా పోటీ యివ్వలేకపోయామనడంపై కన్నడ రాజకీయ వర్గాలతో పాటు తెలంగాణ రాజకీయ వర్గాలలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కుమారస్వామి అసంతృప్తి అంతా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు అండగా నిలవలేదనేనని అంటున్నారు.  కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశం గురించి చెప్పిన క్షణం నుంచీ కుమారస్వామి ఆయన వెంటే ఉన్నారు. నడిచారు. కన్నడ ఎన్నికలలో బీఆర్ఎస్ తో పొత్తు గురించి కూడా తొలుత ఆయనే మాట్లాడారు. పొత్తులో భాగంగా లోక్ సభ స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తామనీ, అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ తమకు అన్ని విధాలుగా సహకరించాలన్న ప్రతిపాదనలు కూడా చేశారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలలో జేడీఎస్ కు బీఆర్ఎస్ ఆర్థికంగా అండదండగా ఉంటుందన్న ప్రచారం అప్పట్లో కర్నాటక , తెలంగాణ రాష్ట్రాలలో విస్తృతంగా జరిగింది.   కర్ణాటక ఎన్నికల్లో కలిసి పని చేద్దామని ఆర్థిక సాయం చేస్తామని కేసీఆర్ చెప్పారని కూడా అప్పట్లో చెప్పుకున్నారు. ఆ కారణంగానే కుమారస్వామి కేసీఆర్ కాకితో కబురెట్టినా హైదరాబాద్ వచ్చి వాలిపోయేవారని గుర్తు చేస్తున్నారు. కానీ తీరా సమయం వచ్చినప్పుడు కేసీఆర్ ముఖం చాటేశారన్నది కుమారస్వామి భావనగా ఆయన మాటలను బట్టి అవగతమౌతోంది. కారణం ఏమిటన్నది పక్కన పెడితే.. కర్ణాటక ఎన్నికల వైపు కేసీఆర్ కనీసం దృష్టి కూడా పెట్టలేదు. జేడీఎస్ కు ఎటువంటి  ఆర్థిక సాహం చేయలేదు. ఆ కారణంగానే కుమారస్వామి  కర్నాటక ఎన్నికలు ముగిసిన తరువాత బహిరంగంగానే  కేసీఆర్ పట్ల తన అసంతృప్తి వ్యక్తం చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

పొత్తు ఖాయం.. సీఎం ఆయనే.. కుండబద్దలు కొట్టిన పవన్

జనసేనాని గుప్పెట విప్పేశారు. పొత్తులు ఉంటాయని కుండ బద్దలు కొట్టేశారు. అదే సమయంలో తాను ముఖ్యమంత్రి పదవి రేసులో లేననీ, ఆ పోస్టు కోసం వెంపర్లాడబోననీ కూడా తేటతెల్లం చేసేశారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్  అవినీతి పాలన అంతమొందించడమే లక్ష్యమని మొదటి నుంచీ చెబుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల కండా ఉండేందుకు తన వంత ప్రయత్నం, కృషి చేస్తానని గతంలోనే ప్రకటించారు. ఏపీలో  బలం ఉన్న, బలంగా ఉన్న పార్టీలు మూడే మూడు. అవి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, అధికార పార్టీ వైసీపీ, జనసేన. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించిన రోజునే.. ఆయన తెలుగుదేశంతో పొత్తు ఉంటుందన్న సంకేతాలిచ్చారని అందరికీ తేటతెల్లమైపోయింది. బీజేపీని కూడా  ఒప్పిస్తాననీ, ఆ పార్టీకి యిప్పటికే మిత్రపక్షమైన జనసేన క్లియర్ గా చెప్పింది. దీంతో ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా 2014 ఎన్నికల నాటి పొత్తులు మళ్లీ పొడుస్తాయని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషించారు. అయితే నరం లేని నాలుక నానా విధాలుగా మాట్లాడుతుందన్నట్లు కొందరు సామాజికవర్గం పేరు చెప్పి సీఎం పదవి విషయంలో  చేసిన వ్యాఖ్యలో  కొంత గందరగోళాన్ని సృష్టించాయి. దానిని పునాదిగా చేసుకుని అధికార వైసీపీ కూడా సింహం సింగిల్ గా వస్తుంది వంటి పంచ్ డైలాగులతో పొత్తలపై విమర్శల వర్షం కురిపించింది. అన్నిటికీ మించి జనసేన పార్టీలో కొత్తగా కార్యదర్శి పదవి పొందిన జనసేనాని సోదరుడు తాజాగా చేసిన వ్యాఖ్యలతో సానుకూల వాతావరణం చెడుతుందా అన్న భావన సర్వత్రా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ పొత్తులు, ముఖ్యమంత్రి పదవి వంటి అంశాలపై స్పష్టతనిచ్చారు.  వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఖాయంగా పెట్టుకుంటున్నామని ప్రకటించారు. సీఎం పదవి విషయంలో జరుగుతున్న ప్రచారానికి కూడా తెర దించే శారు.    తాను సీఎం పదవిని అడగబోనని కుండబద్దలు కొట్టేశారు. ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని ఢీకొని కూలదోయడానికి జరిగే ప్రయత్నంలో షరతులు పెట్టే ప్రశక్తే లేదని తేల్చేశారు.  ప్రజలు కావాలని కోరుకుంటే సీఎం అవుతానన్నారు. గత ఎన్నికల్లో జనసేనకు జనం  30 స్థానాలు ఇచ్చి ఉంటే యిప్పుడు తాను సీఎం రేసులో ఉండేవాడినని చెప్పడం ద్వారా వచ్చే ఎన్నికలలో తాను సీఎం రేసులో లేనని విస్పష్టంగా తేల్చేశారు.  జనసేనకు పట్టు ఉన్న ప్రాంతాలలో 30శాతం ఓటింగ్ ఉందన్నరు. అందుకు అనుగుణంగానే జనసేనకు ఉన్న బలం మేరకే పొత్తులో భాగంగా సీట్లు కోరుతానని పవన్ కల్యాణ్ చెప్పేశారు.   పొత్తుల విషయంలో తన స్టాండ్ మారలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా పొత్తులతోనే బలపడ్డాయని గుర్తు చేశారు. ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో తాను వచ్చే నెల 3వ తేదీ నుంచీ ఏపీలోనే ఉంటానని చెప్పిన జనసేనాని..  పొత్తులకు ఒప్పుకోని వారు ఎవరైనా ఉంటే వారిని తాను ఒప్పిస్తానని చెప్పారు. ఇదే విషయం పవన్ కల్యాణ్ ఢిల్లీలో కూడా మాట్లాడారు.  బీజేపీ కూడా కలిసి రావాలని ఢిల్లీలో పవన్ చర్చలు జరిపినట్లుచెబుతున్నారు. ఒక వేళ బీజేపీ రాకపోతే.. టీడీపీతో కలిసి వెళ్లేందుకు పవన్ సిద్ధమయ్యారని ఆయన తాజా వ్యాఖ్యలతో నిర్ధారణ అయిపోయిందనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సీఎం పదవి విషయంలో తమ క్యాడర్ చేస్తున్న వ్యాఖ్యలతో పొత్తు అంశం ముందుకు సాగకుండా అడ్డం పడకుండా ఆదిలోనే చెక్ పెట్టేశారు. పవన్ తాజా వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్నది స్పష్టమైపోయిందని  పరిశీలకులు చెబుతున్నారు.  

బావ.. బావ మరిది.. ఓ ఆధిపత్య రాజకీయం!

బావ.. ఎక్కడైనా బావే కానీ వంగతోట కాడ కాదన్నట్లు.... బాలినేని తనకు బావే కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం కాదన్నట్లుగా ఆయన బావమరిది, టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యవహారశైలి ఉందనే ఓ చర్చ ఒంగోలు నగరంలో సూపర్ స్పీడ్‌తో సవారీ చేస్తోంది. జగన్ తొలి కేబినెట్‌లో మంత్రిగా ఉండగా.. ప్రకాశం జిల్లాలో బాలినేని మాటారాజకీయమే.. బాటా రాజకీయమే.. . చివరకి ఆయన బర్త్ డే ఫంక్షన్ కూడా రాజకీయమే అన్నట్లుగా నడిచింది. ఇంకా చెప్పాలంటే...  బాలినేని వాసన్న రాజకీయం అంతా స్మూత్‌గా.. సాఫ్ట్‌గా మూడో కంటికి తెలియకుండా నరుక్కోంటు వెళ్లిపోయేవారని.. అయితే బాలినేనికి మంత్రి పదవి హుళక్కి అయిన తర్వాత.. అప్పటి వరకు కొంగుచాటు కృష్ణుడిలాగా తెరచాటు రాజకీయం చేసిన ఆయన బావమరిది వైవీ సుబ్బారెడ్డి తెరమీదకు ఎంటర్‌ ది డ్రాగన్‌లాగా ఎంటరై... టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా దేవదేవుడి సన్నిధిలోనే సేవ చేసుకొంటూ కూడా... చిత్తం, చూపులు అన్నీ ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల  చుట్టూనే గిరా గిర్రా తిరుగుతోన్నాయని... ఆ క్రమంలో ఉన్నతాధికారుల పోస్టింగులు, బదిలీలు అన్నీ ఆయనగారి కనుసన్నల్లోనే జరుగుతోండడంతో.. బావగారి సున్నిత మనస్సు.. గట్టిగానే కందిపోయిందని... ఈ నేపథ్యంలో మూడు జల్లాల పార్టీ సమన్వయకర్త పోస్టింగ్‌కి బావగారు బాలినేని మంగళం పాడేశారని... దాంతో ఆ పంచాయతీ కాస్తా ముఖ్యమంత్రి  వైయస్ జగన్ వద్దకు చేరడం.. బాలినేనిని పిలిపించుకొని.. రాజీనామాకి దారి తీసిన పరిస్థితులు... ఆ క్రమంలో బావమరిదిగారు చేస్తున్న రాజకీయ చెదరంగంలో తనను ఓ చెద పురుగుని చేసేశారంటూ సాక్షాత్తూ పార్టీ అధినేత వైయస్ జగన్ ముందే బాలినేని తీవ్ర ఆవేదనకు లోనైనట్లు ఓ చర్చ సైతం ఒంగోలు జిల్లాలో కొనసాగుతోంది.  అయితే సీఎం జగన్‌తో జరిగిన భేటీలో మళ్లీ మూడు జిల్లాల పార్టీ సమన్వయకర్త బాధ్యతలు స్వీకరించాలంటూ పార్టీ అధినేత కోరినా బాలినేని సున్నితంగా తిరస్కరించినట్లుగా ఓ టాక్ వైరల్ అవుతోంది. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బామ్మర్థి వై వీ సుబ్బారెడ్డి రాజకీయానికి కత్తెర వేయాలని పార్టీ అధినేతను కోరినా అందుకు ముఖ్యమంత్రి  జగన్ మిన్నకుండిపోయినట్లు సమాచారం. దీంతో చేసిది లేక.. బాలినేని సైలెంట్‌గా తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయటకు వచ్చేశారని తెలుస్తోంది.   మరోవైపు వైవీ సుబ్బారెడ్డికి ఏ బాధ్యతలు అప్పగించినా.. అవి విఫలమవుతూనే వస్తున్నాయనే ఓ చర్చ సైతం ఫ్యాన్ పార్టీలో కొన.. సాగుతోంది. ఆయన ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్‌గా ఉండి కూడా పట్టబధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని... అలాగే టీటీడీ చైర్మన్‌గా ఆయన హాయాంలో తిరుమలలో వరుసగా చోటు చేసుకొంటున్న పరిణామాల పట్ల భక్తులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే ఓ చర్చ ఒంగోలులోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా గట్టిగానే సాగుతోన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా బావమరిది అంటే... బావా బతుకు కోరతాడంటారు... అంతే కానీ ఈ బామ్మర్ధి ఏంటీ.. బావగారి రాజకీయ భవిష్యత్తుకి గంట కొట్టి మంగళహరతులు ఇచ్చేసేలా వ్యవహరిస్తున్నారనే  చర్చ ఒంగోలు నగరంలో కొన.. సాగుతోంది.  ఏదీ ఏమైనా తమ్ముడు తమ్ముడే పేకాట పేకటే అన్నట్లుగా బామ్మర్థిగారి వ్యవహారం ఉందని అభిప్రాయం సైతం సదరు నగర ప్రజల్లో వ్యక్తమవుతోన్నట్లు తెలుస్తోంది.

ముందస్తు అయినా కాకున్నా మునక ఖాయం!

ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి .. ఎటూ పోలేని పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం…కొట్టుమిట్టాడు తోందా అంటే,పబ్లిక్  టాక్ అవుననే అంటోంది. మేథావులు అయితే, మహా కవి  శ్రీ శ్రీ సంధ్యా సమస్యలు గీతాన్ని గుర్తు చేస్తున్నారు.  ఏపీ ప్రభుత్వాన్ని కూడా అదిగో అలాంటి సంధ్యా సమస్యలే వెంటాడుతున్నాయి అంటున్నారు. అందుకే పరిస్థితి ఎటూ పాలుపోక గుడుగుడు గుంజం గుండేరాగం .. అన్నట్లు ముందస్తు ఎన్నికల చుట్టూ అక్కడక్కడే, గిరగిర తిరుగుతోందని, వైసీపీ నేతలు  పిల్లి మొగ్గలు వేస్తున్నారని అంటున్నారు. నిజానికి, ఓటమి భయం తోనే వైసీపీ నేతలు ఏమి  చేయడమో ... ఎటు పోవడమో పాలుపోని పరిస్థితిలో ఉన్నారని అంటున్నారు. ముందస్తు ఎన్నికలకు పోదామంటే,  ముందుగానే ఇంటికి పోతామని సొంత పార్టీ ఎమ్మెల్యేలే హెచ్చరిస్తున్నారు. అలాగని అందాక అగుదామంటే..అసలుకే మోసం వచ్చేలా వుందన్న అనుమానం పీడిస్తోంది. అందుకే అధికార పార్టీ నేతలు ముందస్తు ఎన్నికల అట్టును, ఒక రోజు ఇటు ఒక రోజు అటు తిరగేస్తున్నారు. నిజానికి, ముందస్తు ఎన్నికలను ముందుగా తెరపైకి తెచ్చిందే అధికార పార్టీ నాయకులు.. ఒకసారి కాదు ఒకటికి పదిసార్లు వైసీసీ పార్టీలో, జగన్ రెడ్డి ప్రభుత్వంలో ‘ఆల్ ఇన్ వన్’ గా చెలామణి అవుతున్న  సజ్జల రామకృష్ణా రెడ్డి ముందస్తు ఉందనో లేదనో వాక్రుచ్చి, ఎప్పటికప్పుడు ముందస్తు చర్చను సజీవంగా ఉంచుతున్నారు.  అలాగే ప్రజలు కూడా ముందస్తా వెనకస్తా అనేది పక్కన పెట్టి, ఎన్నికలు ఎప్పడు వచ్చినా, ఒక్క ఛాన్స్ మోసానికి గట్టిగా బుద్ధి చెప్పాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అయితే, వైసీపీ  నాయకులు మాత్రం ఇంకా తమను తాము మోసం చేసుకుంటూ, ప్రజలను మోసం చేసే విఫల ప్రయత్నం చేస్తున్నారు.  అయినా అసలు ముందస్తు విషయంలో జగన్ ఏ ధైర్యంతో ముందడుగేస్తారన్న ప్రశ్న పరిశీలకులు వేస్తున్నారు. ఆఖరు క్షణం వరకూ అధికారంలో ఉండేందుకే ఆయన చూస్తారని అంటున్నారు. అన్ని వైపుల నుంచీ వ్యతిరేక పవనాలు ప్రస్ఫుటంగా వీస్తున్న సంగతి తేటతెల్లంగా కనిపిస్తుంటే.. ముందస్తుడు అడుగు ముందుకేసే అవకాశమే లేదని అంటున్నారు. చివరి వరకూ అధికారంలో కొనసాగితే ప్రతిపక్షాన్ని దెబ్బతీయడానికి ఏదో ఒక అవకాశం దొరకదా అన్న దింపుడు కళ్లెం ఆశను సజీవంగా ఉంచుకోవడానికైనా జగన్ ముందస్తుకు అడుగు ముందుకు వేయరని చెబుతున్నారు. అయితే ముందస్తు ముచ్చటను పదేపదే తెరమీదకు తీసుకురావడం ద్వారా విపక్షాలను కన్ష్యూజ్ చేయడం, వారి వ్యూహాలకు చెక్ పెట్టడం అనే విధానాన్ని జగన్ ఫాలో అవుతున్నారంటున్నారు.  రాజకీయ పరిశీలకులు మాత్రం ఒకసారి ప్రజలు నిర్ణయానికి వచ్చిన తర్వాత, ముందస్తు  వెనకస్తు తేడాలుండవంటున్నారు.  అయినా జగన్ ముందస్తుకు వెళ్లాలంటే అందుకు ప్రజలకు కారణం చెప్పి తీరాలి. ఆర్థిక సంక్షోభమా, మూడు రాజధానులా, సంక్షేమానికి విపక్షాలు అడ్డుపడుతున్నాయనా, ఎందుకు ముందస్తుకు వెళుతున్నామన్న దానికి జగన్ జవాబు చెప్పాల్సి ఉందని అంటున్నారు. 

ఇమ్రాన్ అరెస్ట్ పై సుప్రీం సీరియస్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ను పాకిస్థాన్ సుప్రీంకోర్టు తప్పు పట్టింది. రిజిస్టార్ అనుమతి లేకుండా 90 మంది కోర్టు ప్రాంగణంలోకి వచ్చి అరెస్ట్ చేయడాన్ని సుప్రీం కోర్టు సహించలేకపోయింది. న్యాయస్థానాన్ని అగౌరవ పరిచే చర్య అని సుప్రీం వాఖ్యానించింది.  ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత పాకిస్థాన్ భగ్గుమంది. ఆయన అభిమానులు రోడ్ల మీద నిరసనలు చేపట్టారు.వందలాది ఇమ్రాన్ అభిమానులను  ప్రభుత్వం  అరెస్ట్ చేసింది. ఇమ్రాన్ ను మళ్లీ కోర్టులో గంటలోపు హాజరుపర్చాలని సుప్రీం ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ విషయంలో చాలాకాలంగా పాకిస్థాన్ లో చర్చనీయాంశంగా  ఉంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని కోర్టులో వచ్చి లొంగిపోతాను అని గతంలో స్టేట్ మెంట్ ఇచ్చారు. కానీ అతను లొంగిపోకపోవడంతో ఇస్లామాబాద్ పోలీసులు ఇమ్రాన్ ఇంటిని చుట్టుముట్టారు. దీంతో అభిమానులు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగి పాకిస్థాన్ అగ్ని గుండమైంది. ఇవ్వాళ ఇమ్రాన్ అరెస్ట్ తో మళ్లీ అగ్ని గుండమైంది. 

ఆలీ .. కాట్రవల్లి.. కల తీరేనా?

జగమెరిగిన కమెడియన్ అలీ గురించి కొత్తగా పరిచయం అక్కరలేదు.  బాలా నటుడిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన  అలీ వటుడింతై అన్నట్లు ఎదుగుతూ.. వందల్లో కాదు, వేల సినిమాల్లో నటించారు. కమెడియన్ గానే కాకుండా ఒకటో రెండో (ఇంకా ఎక్కువో కూడా) సినిమాల్లో హీరోగా కూడా నటించి మెప్పించారు. అలాగే, అలీ ...తో సరదాగా .. కార్యక్రమంతో టీవీ యాంకర్  గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇన్ని మాటలు ఎందుకు గానీ,తెలుగు సినిమా చరిత్రలో అలీ తనకంటూ ఒక స్థానాన్ని, గౌరవాన్ని సంపాదించుకున్నారు. సందేహం లేదు. అంతవరకు అయితే, ఓకే కానీ, ఈలోగా ఆలీని రాజకీయ పురుగు కుట్టింది. సినిమా విజయాలతో సంతృప్తి చెందని ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు.  నిజానికి ఆలీ రాజకీయలకు కూడా కొత్తకాదు. ఎంతో కాలంగా ఆయన పొలిటీషియన్’ అయిపోవాలని కలలు కంటున్నారు.కాస్ట్యూమ్స్ గట్రా రెడీ చేసుకున్నారు. అప్పుడెప్పుడో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, లంచ్’కి పిలిచి త్వరలోనే గుడ్ న్యూస్ చేపుతానంటే, కొత్త బొత్తాలు కుట్టించుకుని మరీ రెడీ అయి పోయారు. అయితే  ఎంపీ, ఎమ్మెల్యే కాదంటే చివరకు ఏదో ఒక నామినేటెడ్ పదవి అయినా పట్టుకోవాలని, ఆలీ ఎప్పటి నుంచో కలలు కంటూనే ఉన్నారు. ఊరించి ఊరించి ఎట్టకేలకు ఒక నామినేటెడ్  కట్టబెట్టిన జగన్  అలీ అశలను నెరవేర్చారా? అంటే లేదు ఉసూరు మనిపించారనీ అలీ అభిమానులు అంటున్నారు. అలీ రాజకీయ ప్రవేశం ట్రయల్స్  తెలుగు దేశం టికెట్ కోసం ప్రయత్నించడంతో మొదలయ్యాయి.  అప్పట్లో టీడీపీ తరఫున రాజమండ్రి నుంచి టికెట్ ఖరారైపోయిందన్న స్థాయిలో ప్రచారం జరిగింది. అయితే  ఆ ప్రచారం అంతా ఉత్తుత్తిదే అని తరువాత తెలిసింది. యిక ఆ తరువాత అలీ సినిమా పరిశ్రమలో తనకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు అని చెప్పుకునే  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరి రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తలంచారు. అయితే అప్పట్లో టీడీపీ, జనసేన రెండూ పార్టీలకు బాగా దగ్గరగా ఉన్న అలీ.. కేవలం ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యే అయిపోవాలన్న ఆశతోనే.. ఆ రెండు పార్టీలలో టికెట్ రాదన్న కన్ఫర్మ్ చేసుకున్న తరువాత అనూహ్యంగా జగన్ పంచన చేరి వైసీపీ కండువా కప్పుకున్నారు.   వైసీపీ తరఫున పలు నియోజకవర్గాల్లో ప్రచారం కూడా నిర్వహించారు. అయితే  ఆయనకు ఆశించిన విధంగా ఎమ్మెల్యే టికెట్ మాత్రం రాలేదు.  పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తీరిగ్గా మూడేళ్లు గడిచిపోయిన తరువాత పార్టీకి అలీ చేసిన సేవలను గుర్తించిన జగన్  ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవితో సరి పెట్టారు. అప్పటికే అన్ని ఆశలూ వదిలేసుకున్న జగన్ సలహాదారు పదవితో సంబరపడిపోయి.. తన స్థాయికి మించిన ప్రకటనలు చేశారు.  సినీ పరిశ్రమలో అలీ తనకు అత్యంత ఆప్తుడిగా చెప్పుకునే పవన్ కల్యాణ్ పైనే పోటీకి సై అంటూ కామెడీ డైలాగులతో సవాళ్ళూ చేసేశారు.   అదలా ఉండే యిప్పుడు ఏపీలో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు యింకా ఏడాది సమయం ఉన్నా.. ముందస్తు ఉహాగానాల నేపథ్యంలో  ఆశావహులు తమతమ పార్టీల అధినేతలను ప్రసన్న చేసుకుని టికెట్ కన్ఫర్మ్ చేయించుకోవడానికి ప్రయత్నాలను షురూ చేసేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అలీకి వైసీపీ నుంచి పోటీ చేయడానికి టికెట్ లభిస్తుందా? అందుకోసం ఆయన ఏ ప్రయత్నాలు చేస్తున్నారు? అన్న సందేహాలు సహజంగానే అలీ అభిమానుల్లో వ్యక్తమౌతున్నాయి.  అలీ అయితే రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీకి ఫిక్స్ అయిపోవడమే కాకుండా  ఇప్పటికే నాలుగు నియోజకవర్గాలను సెలక్ట్ చేసుకుని సర్వేలు కూడా చేసి అధిష్టానానికి ఓ నివేదిక ఇచ్చారని అంటున్నారు. ఇందులో గుంటూరు ఈస్ట్, కర్నూలు సిటీ, కడప సిటీ, రాజమండ్రి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయనీ ఈ నాలుగు  నియోజకవర్గాల్లో ఏ చోట నుంచి పోటీ చేసినా సరే కచ్చితంగా గెలుస్తాననే ధీమా అలీకి ఉందట. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారట. అయితే అలీ చెప్పినదంతా విన్న జగన్.. ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదట.   తల్లినీ, చెల్లినే కాదు పొమ్మన్న వైసీపీ అధినేత జగన్   అలీకి పార్టీ టికెట్ ఇస్తారా?  రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రి తర్వాత తండ్రి అంతటి బాబాయ్ నే పక్కకు  తప్పించారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న జగన్ రెడ్డి అలీ  కి ఎన్నికలలో పోటీకి అవకాశం కల్పిస్తారా? అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే అలీ ఆశిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పటికే హేమాహేమీలు పోటీకి రెడీగా ఉన్నారు.  మరి వారిని కాదని  జగన్  అలీకి టికెట్ ఇస్తారా?  ఒక వేళ ఇస్తే  గన్  ప్రభుత్వం ఎదుర్కుంటున్న వ్యతిరేక సునామీలో  కొట్టుకుపోకుండా నిలబడగలరా? నిలబడి గెలవగలరా అన్న అనుమానాలు ఆయన అభిమానుల్లో వ్యక్తమౌతున్నాయి.  మొత్తం మీద అన్నం పెట్టిన సినీ పరిశ్రమలో అయిన వాళ్లని కాదనుకుని మరీ జగన్ పంచన చేరిన అలీ తన ఎన్నికల్లో పోటీ ఆశ ఈ సారైనా నెరవేరుతుందా? చూడాలి.

కామన్ సివిల్ కోడ్ కు హిమంత బిశ్వ ముందడుగు

మన చట్టాలు బహు భార్యత్వాన్ని నిషేదించాయి. ఒక్క ముస్లిం పర్సనల్ లా షరియత్ మాత్రమే బహు భార్యత్వాన్ని అంగీకరించాయి.  దేశమంతా కామన్ సివిల్ కోడ్ తీసుకురావాలని కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అసోంలో బిజెపి ప్రభుత్వం కామన్ సివిల్ కోడ్ తీసుకురావడానికి పావులు కదుపుతోంది. బహు భార్యత్వంపై 2024లోపు నిషేధం విధిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ  శర్మ గురువారం ప్రకటించారు.  రాష్ట్రంలో బహుభార్యత్వ నిషేధాన్ని అమలు చేయడంపై సమగ్ర అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు  కమిటీ ఏర్పాటు ప్రక్రియలో ఉన్నట్లు చెప్పారు.కమిటీ తన నివేదికను సమర్పించడానికి మూడు నెలల సమయం ఇవ్వబడుతుంది. ‘‘అసోంలో బహుభార్యత్వంపై ఈ సంవత్సరం చివరి నాటికి 2024లోపు మనం బహుభార్యాత్వాన్ని నిషేధించే చట్టాన్ని తీసుకురాగలమని నేను ఆశిస్తున్నాను’’  అని ముఖ్యమంత్రి వెల్లడించారు "రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నిషేధించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉందో లేదో పరిశీలించేందుకు అసోం ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది" అని ట్వీట్‌లో పేర్కొన్న మూడు రోజుల తర్వాత శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.  ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ బహుభార్యత్వాన్ని నిషేధించాలని శర్మ చేసిన ప్రకటనను వ్యతిరేకించారు.  రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని, అయితే ముఖ్యమంత్రి షరియత్ కు వ్యతిరేక కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారని ఆయన  ఎద్దేశా చేశారు. అజ్మల్ ప్రకటనపై హిమంత బిశ్వ శర్మ స్పందించారు. “అతను (బద్రుద్దీన్ అజ్మల్) మా ప్రతిపక్షం. ఆయన నాకు మద్దతిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆయనకు ఎలా ఓటు వేస్తారు? కాబట్టి, నేను అజ్మల్‌కి ప్రాముఖ్యత ఇవ్వదల్చుకోలేదు’’ అని హిమంత  అన్నారు. కామన్ సివిల్ కోడ్ తీసుకురావడానికి బిజెపి ప్రభుత్వం ముందడుగు వేసిందనే చెప్పుకోవచ్చు.   

రైతుకు బంధువేనా?

‘రైతు బంధుకు నేటితో ఐదేళ్లు.. సీఎం కేసీఆర్  ఆలోచనతో ప్రారంభించిన రైతు బంధు వివాదాస్పదమైంది. కౌలు రైతులకు రైతుబంధు వర్తించకపోవడం వివాదానికి కారణమైంది.  ఎకరాకు ఏడాదికి 10 వేల చొప్పున ఇప్పటి వరకు 10 విడతలలో 65 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసి, అద్భుతమైన రైతు సంక్షేమ పథకంగా దేశానికి రోల్ మోడల్ అయ్యిందని బీఆర్ ఎస్ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి.  అందుకే సీఎం కేసీఆర్  అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు, ఎత్తుకున్న జాతీయ నినాదం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసాయి అని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.  ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ అంటూ బీఆర్ఎస్ ను స్వాగతిస్తున్నాయి’… అంటూ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తోన్న పీఎం కిసాన్ పథకంతో సంబంధం లేకుండా రైతుబంధు పథకాన్ని రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తోంది. కాగా, రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి 5 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేస్తోంది. ఖరీఫ్,రబీ సీజన్ లకు ఎకరానికి 5 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి పదివేల రూపాయలను పెట్టుబడిగా ఇస్తోంది. ఈ మొత్తాన్ని రైతులకు చెక్కుల రూపంలో అందజేస్తున్నారు. రైతుబంధుకు వచ్చిన ఆదరణ చూసి జాతీయ స్థాయిలో ఈ స్కీం అమలు చేయడానికి బిజేపీ ప్రభుత్వం ఆలోచన చేసి పిఎం కిసాన్ స్కీం అమల్లోకి తెచ్చింది.  తెలంగాణ వ్యాప్తంగా 10 విడతలుగా చెల్లించిన రూ.65,000 కోట్లరూపాయలతో  70 లక్షల మంది రైతులు లబ్ది పొందారు.  రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా విముక్తి చేయడం ఈ పథక ముఖ్య ఉద్దేశ్యం.  ఫిబ్రవరి 25, 2018న ప్రొఫెసర్ జయశంకర్  అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతు సమన్వయ సమితి సదస్సులో ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ పథకాన్ని ప్రకటించారు. కరీంనగర్‌లోని ధర్మరాజ్‌పల్లి గ్రామంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించే ముందు అదే సంవత్సరం బడ్జెట్‌లో రూ.12,000 కోట్ల రూపాయలను రైతుబంధు కోసం  కేటాయించారు.  తెలంగాణా రాష్ట్రంలో రైతుబంధుకు  స్పందన బాగా ఉండటంతో ను  రైతు బంధు, జాతీయ స్థాయిలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే తరహాలో ఆలోచించేలా చేసింది.  కేంద్రం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ పిఎంకిసాన్ యోజన ప్రారంభించారు.   ఒడిశాలోని బిజెడి ప్రభుత్వం కాలియా పథకం  రైతు బంధు నుండి ప్రేరణ పొందినవే.  రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఈ పథకం కింద ఇప్పటివరకు 10 విడతలుగా సహాయం అందించింది. ఈ ఏడాది యాసంగిలో 63.97 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. 144.35 లక్షల ఎకరాలకు రూ.7,217.54 కోట్లు విడుదల చేసింది. అంతేకాకుండా ఈ పథకం దేశంలోని రైతు సంక్షేమం కోసం ప్రకటించిన టాప్ 20 పథకాలలో ఒకటిగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ చే ప్రశంసించబడింది. రైతుబంధు పథకం తెలంగాణ వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. వ్యవసాయరంగ రూపురేఖల్ని మార్చేసింది. రైతుబంధుతో రైతుల్లో భరోసా పెరిగింది. పెట్టుబడి నష్టమనే భావన లేకుండా రైతులు ధైర్యంగా వ్యవసాయం చేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా వంటి కార్యక్రమాలతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. తద్వారా 2014-15లో 1.31 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైతే, 2022-23లో ఇది 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది. ధాన్యం ఉత్పత్తిలో 15వ స్థానం రెండో స్థానానికి ఎగబాకింది.

మహా గవర్నర్ తీరును తప్పుపట్టిన సుప్రీం

శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం, శిందే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన  సుప్రీం కోర్టు ధర్మాసనం  గవర్నర్  తీరును తప్పుపట్టింది. అలాగే  షిండే జారీ చేసిన విప్ ను అప్పటి స్పీకర్ గుర్తించడాన్ని సైతం తప్పుపట్టింది. అయితే  సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనకుండానే అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేసినందున ఆయనను తిరిగి సీఎంగా నియమించలేమని పేర్కొంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఒక రాజకీయ పార్టీలో  చీలికను బలపరీక్ష ద్వారా నిర్ధారించడానికి వీల్లేదని పేర్కొంది. కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన పార్టీ చీలిపోయిందని కాదనీ,  పార్టీ శ్రేణులు, కార్యకర్తల స్థాయిలో చీలికను గుర్తించాలనీ పేర్కొంది.   సరిగ్గా ఈ కారణంగానే  తెలుగుదేశం పార్టీలో 1995 ఆగస్టులో  తెలుగుదేశం పార్టీలో సంభవించిన సంక్షోభ సమయంలో చంద్రబాబునాయుడి నాయకత్వంలోని గ్రూపునే అసలైన తెలుగుదేశం పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది.  తెలుగుదేశం చీలిక వర్గం నేతగా చంద్రబాబు అప్పట్లో   కేంద్ర ఎన్నికల సంఘానికి  1995 సెప్టెంబర్ 15,  అదే  నెల 29 అలాగే అక్టోబర్ 10, అక్టోబర్ 24 తేదీలలో వరుసగా లేఖలు రాశారు. అలాగే  మొత్తం 3694 మంది పార్టీ జనరల్ బాడీ సభ్యులలో 2679 మందిఎన్టీఆర్ స్థానంలో  తనను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. అలాగే ఎన్నికల సంఘం వద్ద చంద్రబాబుకు మద్దతుగా న్యాయ న్యాయ నిపుణులు కపిల్ సిబల్, రాజేంద్ర చౌదరి, రాకేష్ శర్మ, ఎన్వీ రమణ (ఈయన ఆ తరువాత సీజేఐ అయ్యారు)లు వాదించారు. అయితే  ఏక్ నాథ్ షిండే  శివసేనను  చీల్చిన సమయంలో ఈ ప్రక్రియ ఏమీ జరగలేదు.  అయినా కూడా కేంద్ర ఎన్నికల సంఘం షిండే ను శివసేన అధ్యక్షుడిగా గుర్తించి పార్టీ గుర్తును కూడా కేటాయించింది.  అయితే సుప్రీం కోర్టు  మాత్రం ఏకపక్షంగా షిండే వర్గాన్ని అసలు శివసేనగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఎటువంటి వ్యాఖ్యలూ లేయలేదు. అదలా ఉండగా షిండే వర్గం ఎమ్మెల్యేల అనర్హత విషయాన్ని తేల్చాల్సిన బాధ్యత మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ దేనని  సుప్రీం కోర్టు పేర్కొంది. దీంతో ప్రస్తుత స్పీకర్ ఆ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. అయితే ఆయన నిర్ణయం ఎలా ఉన్నా సుప్రీం కోర్టు తీర్పుతో మహారాష్ట్ర ప్రజలకు ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని అక్రమంగా పడగొట్టారన్న విషయం మాత్రం స్పష్టంగా తెలిసింది.