రక్షణ కల్పించండి మహప్రభో.. మోడీ షాలకు రాజాసింగ్ లేఖ
posted on May 12, 2023 @ 12:20PM
గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ కు ఉగ్ర ముప్పు పొంచి ఉందా అంటే ఔననే అంటున్నారు ఆయన. ఈ మేరకు ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు లేఖలు రాశారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆ లేఖలో కోరారు. ఉగ్ర సంస్థల నుంచి తమకు ప్రాణముప్పు పొంచి ఉందని, భారీ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్లో ఇటీవల ఉగ్రవాద కార్యాకలాపాలకు పాల్పడుతున్నవారిని పోలీసులు పట్టుకున్న నేపథ్యంలో రాజా సింగ్ మోడీ, షాలకు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్లో అల్లర్లు సృష్టించడంతో పాటు బాంబ్లతో తమపై దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్నారనే విషయం తనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని రాజాసింగ్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే దేశ విదేశాల నుంచి తనను ఖతం చేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చిన విషయాన్ని ఆ లేఖలో రాజాసింగ్ ప్రస్తావించారు. తనకు భద్రత కల్పించాల్సిందిగా పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా ఫలతం లేకపోయిందని పేర్కొన్నారు. గతంలోనూ తన భద్రత విషయంపై మోదీ, అమిత్ షాలకు రాజాసింగ్ లేఖలు రాశారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉగ్రకదలికలు బయటపడిన నేపథ్యంలో రాజాసింగ్ మరోసారి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాదలో ఇటీవల ఉగ్రవావదుల కుట్ర కోణం బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తుండగా.. కీలక విషయాలు బయటపడుతున్నాయి. నగరంలో భారీగా ఉగ్ర దాడులకు నిందితులు ప్లాన్ చేసినట్లు తెలిసింది. నిందితులకు హిజబ్ ఉట్ తెహ్రిర్ (హెచ్ యుటి) సంస్థతో సంబంధాలున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో మరోసారి ఉగ్రవాద మూలాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్లో ఐదుగురిని అరెస్ట్ చేసి భోపాల్కు తరలించారు. భోపాల్ ప్రత్యేక న్యాయస్థానం మే 19వ తేదీ వరకు నిందితులకు కస్టడీ విధించింది. ఉగ్ర దాడుల కోసం అడవుల్లో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఒకరితో మరొకరికి నేరుగా కాంటాక్టు లేకుండా డార్క్ వెబ్ ద్వారా సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది.