ముదిరి పాకాన పడ్డ గెహ్లాట్ పైలట్ వివాదం

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత  సచిన్ పైలట్  మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి.  పైలట్ ..బాహాటంగానే.. గెహ్లాట్ పై సంచలన విమర్శలు చేశారు. గత  బీజేపీ ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవినీతి, ప్రశ్నపత్రాల లీకేజీపై ఈ నెలాఖరులోపు చర్యలు తీసుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆయన చేపట్టిన అయిదు రోజుల జన్ సంఘర్ష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా జైపూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో పైలట్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. వారిలో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు.  తమ డిమాండ్లను ఈ నెలాఖరులోపు అంగీకరించకపోతే ప్రతి గ్రామంలోనూ ఆందోళన చేపడతామని, తాను దేనికీ భయపడనని, పదవిలో ఉన్నా, లేకున్నా రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాననీ చెప్పిన పైలట్ తననెవరూఅణచివేయలేరన్నారు. పార్టీలో విభేదాల గురించి మాట్లాడుతూ ఆయన గెహ్లాట్ వర్గంపై పరోక్ష విమర్శలు చేశారు. గెహ్లాట్ నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ తాము కూడా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నానన్నారు. 2020లో  ప్రభుత్వం సంక్షోభంలో పడినప్పుడు బీజేపీ నేత వసుంధర రాజే అండగా నిలిచారంటూ ఇటీవల గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపైనా పైలట్ పరోక్షంగా స్పందించారు.  గెహ్లాట్ తన సొంత పార్టీ నేతలను తూలనాడుతూ  ప్రత్యర్థి పార్టీల నేతలను ప్రశంసిస్తున్నారు.  అయినా ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశీస్సులు తప్ప ఇంకేవీ పనిచేయవని పైలట్ పేర్కొన్నారు. ఈ వివాదంపై కాంగ్రెస్ అధిష్టానంపెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. ఇరువురు నేతలతో చర్చించి వారి మధ్య మనస్పర్ధలు తొలిగించడంపై హై కమాండ్ దృష్టి సారించడం లేదు. వివాదాన్ని పరిష్కరించకుంటే.. ఇది మరో  మధ్యప్రదేశ్ అంటే కమలనాథ్, జ్యోతిరాదిత్య సింధియా ఎపిసోడ్ గా మారే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.

తెలుగుదేశం, జనసేన పొత్తు ప్రజాభీష్టం.. కన్నా

వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేనలు కలిసి పోటీ చేయాలన్నది జనాభీష్టమని మాజీ మంత్రి టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రజాభీష్టం మేరకే రెండు పార్టీలూ వచ్చే ఎన్నికలలో పొత్తు పెట్టుకుంటాయని చెప్పారు.   తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర వంద రోజులు సూర్తి చేసుకున్న సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ పొత్తులపై పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడతారన్నారు. దుర్మార్గంగా పాలన సాగిస్తున్న జగన్ పార్టీని గద్దె దించాలని ఏపీ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని కన్నా అన్నారు.  ముందస్తైనా కాకపోయినా  వచ్చే ఎన్నికలలో వైసీపీ గద్దె దిగడం ఖాయమన్నారు. పామూరు నుంచి గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేసిన దూబగుంట ట్రిపుల్ ఐటీ వరకూ ఏడు కిలోమీటర్లు పాదయాత్రలో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ పొత్తులపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలూ అన్నీ పీకే డైరెక్షన్ లోనేనని అన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి తెలగాణ వాదంతో ఉన్న టి.ఆర్.ఎస్ తో పోత్తు పెట్టుకున్నారని గుర్తు చేశారు.  ఈ పాదయాత్రలో ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జ్  డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, టీడీపీ నాయకులు పాల్గోన్నారు.మార్గమధ్యంలో గ్రామ, గ్రామాన వీరికి ఘన స్వాగతం లభించింది.  

కర్నాటక ఫలితం సమీకరణాలను మార్చేసింది!

కర్నాటక ఫలితాల తరువాత   జాతీయ రాజకీయ సమీకరణాలపై చర్చ కొత్తగా తెరపైకి వచ్చింది. కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయానికి ముందు వరకూ కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి అంటూ జరిగిన ఐక్యతా యత్నాలు ఇక నుంచి ఆ ఏతర జాబితా నుంచి అనివార్యంగా కాంగ్రెస్ ను తీసేస్తాయి. ఇకపై ఐక్యతా యత్నాలలో కాంగ్రెస్సేతర అన్న మాట వినిపించే అవకాశాలు చాలా స్వల్పంగా కనిపిస్తున్నాయి. 2004 నుంచి యూపీఏ భాగస్వామ్య పక్షాులుగా ఉన్న అనేక పార్టీలు ఆ తరువాత వివిధ రాజకీయ కారణాలతో దూరమయ్యాయి. అయినా కూడా యూపీఏ కూటమి మనుగడ సాగిస్తూనే ఉంది. కానీ గతంలోలా ఆ కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ బలంగా లేదు. దీంతో పలు ప్రాంతీయ పార్టీలు బీజేపీకీ, కాంగ్రెస్ కూ సమదూరం అంటూ కొత్త కూటమి ఏర్పాటు  దిశగా పావులు కదిపాయి.  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమ్ఆద్మీ అధినేత కేజ్రీవాల్  వంటి వారు ఎవరికి వారుగా జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెససేతర కూటమి యత్నాలు చేపట్టినా అవి పెద్దగా ముందుకు సాగలేదు. డీఎంకే అధినేత స్టాలిన్ వంటి వారు  కాంగ్రెస్ లేని విపక్ష కూటమికి తావే లేదని కుండబద్దలు కొట్టేశారు. కర్నాటక ఫలితాల తరువాత కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటిస్తామంటూ వస్తున్న నాయకుల స్వరం మారుతోంది. అందరి కంటే ముందుగా తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ కు మద్దతుగా గొంతు విప్పారు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. తొలి నుంచీ బీజేపీ, కాంగ్రెస్ లకు సమదూరం అంటూ రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కేజ్రీవాల్ స్వరంలో కూడా మార్పు వస్తోంది. బీజేపీ దర్యాప్తు సంస్థల ద్వారా ఆప్ అస్థిత్వాన్నే దెబ్బకొట్టే విధంగా చేస్తున్న ప్రయత్నాలు కేజ్రీవాల్ కు తత్వం బోధపడేలా చేస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇక యూపీలోని రెండు బలమైన పార్టీలు ప్రస్తుతం రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు కూడా బీజేపీయేతర కూటమికి మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాతీయ రాజకీయాలలో ఇటీవలి కాలంలో బీఎస్పీ (బహుజనసమాజ్ పార్టీ) జాతీయ రాజకీయ యవనికపై పెద్దగా కనిపించడం లేదు. ఆ పార్టీ అధినేత్రి మాయావతి గళంలో పదను తగ్గిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. అయితే యూపీ రాజకీయాలను సన్నిహితంగా పరిశీలించేవారికి మాత్రం ఈడీ, సీబీఐ కేసుల భయమే మాయావతి మౌనానికి కారణమని అంటున్నారు. ఇప్పుడు కర్నాటక ఫలితం తరువాత ఆమె రాజకీయంగా మరింత క్రియాశీలంగా వ్యవహరించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సమాజ్ వాదీ పార్టీ ఇప్పటికే మమత బెనర్జీతో కలిసి నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ యేతర కూటమి వైపే అఖిలేష్ యాదవ్ కూడా మొగ్గు చూపే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇక శరద్ పవార్, నితీష్ కుమార్, తేజస్వి ప్రసాద్ వంటి వారు ఇప్పటికే కాంగ్రెస్ తో కూడిన విపక్ష కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు ముందు ఆ ప్రయత్నాలు మరింత ముమ్మరం అవుతాయి. కూటమిలోకి వచ్చి చేరే పార్టీల సంఖ్యా పెరుగుతుందన్నది పరిశీలకుల విశ్లేషణ. ఇక అందరి కంటే ముందుగా కాంగ్రెస్సేత, బీజేపీయేతర కూటమి, నాలుగో ఫ్రంట్ అంటూ గళం విప్పిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనివార్యంగా ఇప్పుడు తన జాతీయ పార్టీని కూడా బీజేపీయేతర కూటమి పంచన చేర్చే అవకాశాలున్నాయని అంటున్నారు. బుధవారం (మే 17) ఆ పార్టీ లెజిస్లేచర్, పార్లమెంటరీ పార్టీ భేటీలో ఈ విషయంలో కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తం మీద ఒక్క విజయం.. ఔను ఒకే ఒక్క విజయం కాంగ్రెస్ గ్రాఫ్ ను అమాంతంగా పెంచేసింది. బీజేపీని దీటుగా ఎదుర్కొనాలంటే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మోడీ సర్కార్ ను గద్దె దింపాలంటే కాంగ్రెస్సేతర అన్న విధానాన్ని వదులుకోకతప్పదని బీజేపీని వ్యతిరేకించే పార్టీలకు స్పష్టంగా అర్ధమయ్యేలా చేసింది.  

అవినాష్ రెడ్డికి సీబీఐ పిలుపు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి సీబీఐ తాజాగా నోటీసులు జారీ చేసింది. మంగళవారం (మే 16) మధ్యాహ్నం కోఠీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ ఆ నోటీసులలో స్పష్టం చేసింది.  హైదరాబాద్ నుంచి కడపకు బయలుదేరిన అవినాష్ నోటీసులు అందుకుని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు.   అందరూ అనుకున్నట్లుగానే కర్నాటక ఎన్నికల ఫలితాల వరకూ ఎదురు చూసిన సీబీఐ వెంటనే రంగంలోకి దిగింది. వివేకా హత్య కేసులో ప్రస్తుతం కారాగారంలో ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి బెయిలు పిటిషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిలు ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారన్న సీబీఐ తరఫు న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. వివేకా హత్య కేసులో ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. ఏప్రిల్ 30వ తేదీతో విచారణ పూర్తి చేయాలన్న ఆదేశాలను మరో రెండు నెలల పాటు పొడిగించడంతో సీబీఐ తన విచారణను మరింత లోతుగా జరుపుతోంది.  మరో వైపు వివేకాకు న్యాయం జరగాలంటూ సునీత చేస్తున్న పోరాటం ఈ కేసులో మరికొన్ని కొత్త కోణాలను ఆవిష్కరిస్తోంది.  వివేకా హత్య ఆస్తి కోసమే జరిగిందంటూ అవినాష్ రెడ్డి వర్గం రంగంలోకి దించిన ఆయన రెండో భార్య షమీప్ ఎపిసోడ్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. మరోవైపు సునీత భర్త రాజశేఖరరెడ్డిని కూడా సీబీఐ విచారించింది. అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్న విధంగా వివేకా హత్య ఆస్తి కోసం జరగలేదని సిబీఐ నిర్థారణకు వచ్చింది.  దస్తగిరి అప్రూవర్ గా మారి వివేకా హత్య జరిగిన వైనాన్ని పూసగుచ్చినట్లు చెప్పడంతో సీబీఐతో పాటు సామాన్య ప్రజలకు కూడా జరిగినది ఏమిటో అర్దమైంది.  కడప జిల్లాలో మరీ ముఖ్యంగా పులివెందులలో వివేకా హత్యకు సంబంధించిన విషయాలు చర్చకు వస్తున్నాయి. గత రెండు వారాలుగా కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో మకాం వేసిన సబీఐ బృందం అనేక మందిని కలిసి సాక్ష్యాలను సేకరించింది. అలా సేకరించిన సాక్ష్యాలపై అవినాష్ రెడ్డిని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. వాచ్ మెన్ రంగన్న తో పాటు ఎర్రగంగిరెడ్డి, భాస్కరరెడ్డి, దస్తగిరి, ఉదయ్ కుమార్ రెడ్డిల నుండి సేకరించిన వివరాలు అవినాష్ రెడ్డి విచారణలో కీలకం కానున్నాయి. ఏది ఏమైనా అవినాష్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న వివేకా హత్య కేసు ఆయన అరెస్టుతోనే ఓ కొలిక్కి వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 

జాతీయ రాజకీయాలపై కెసీఆర్ ఫోకస్

భారత రాష్ట్ర సమితి నాయకత్వం ఇక జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టనుంది.కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో బిఆర్ఎస్ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలలో  పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి? అక్కడ ఉన్న స్థానిక రాజకీయాలు ,  ప్రధాన ప్రత్యర్థి బిజెపిని ఓడించడం, స్థానిక రాజకీయాల్లో పావులు కదపాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ భావిస్తున్నారు. కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం తర్వాత బిజెపి పాలిత రాష్ట్రాలలో ఏ విధంగా వ్యూహం ఉండబోతుంది అనే అంశం ప్రస్తుతం కెసీఆర్ ముందు ఉన్న సవాల్. కర్ణాటక ఫార్ములాను ప్రయోగించాలని ఆయన మదిలో బలంగా ఉంది.  కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ప్రభావం చూపబోదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావ్ ట్విట్టర్ వేదికగా చెప్పారు. కర్ణాటక ఫలితాలు వచ్చినప్పుడు రామారావ్ యుకెలో ఉన్నారు. తెలంగాణలో బిఆర్ఎస్ శ్రేణులు నిరుత్సాహపడకూడదన్నది ఆయన ఉద్దేశం కావొచ్చు. మంత్రి  కెటి రామారావు ట్విట్టర్ వేదికగా స్పందించే ముందే గాంధీభవన్ లో కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి చేరికలను అడ్డుకోవడానికే కెటిఆర్ ఆ విధంగా  స్టేట్ మెంట్ ఇచ్చి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన పొంగులేటి, జూపల్లి చూపులు కాంగ్రెస్ వైపే ఉన్నట్లు  వార్తలు వినిపిస్తున్నాయి. బిఆర్ఎస్  మూడోసారి అధికారంలో రావాలని చూస్తోంది.  మహరాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి వలసలు పెరిగే అవకాశముందని బిఆర్ఎస్ కు ఉప్పందింది. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మహారాష్ట్ర మీద ఫోకస్ పెట్టింది.   తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లో  బిఆర్ఎస్ కార్యకలాపాలు చురుకుగా కొనసాగుతున్నాయ. మెదక్, రంగా రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు కర్ణాటక బార్డర్ లో ఉన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత ఈ జిల్లాల్లో బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి కప్ప గంతులు వేసే ప్రమాదముందని అధి నాయకత్వం గుర్తించింది.  ఈ జిల్లా వాసులకు కర్ణాటకతో కనెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా వాళ్లు  ప్రతీరోజు కర్ణాటక రాష్ట్రానికి వెళుతుంటారు. కన్నడ వచ్చిన వారు ఈ జిల్లాల్లో ఎక్కువగానే ఉన్నారు. ఈ జిల్లాల్లో ఉన్న వోటర్ల మీద ఎటువంటి ప్రభావం ఉండకూడదన్న తలంపుతో బిఆర్ఎస్ చర్యలు తీసుకుంటోంది.  జూన్ రెండో తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవం. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో వచ్చిన బిఆర్ఎస్  దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటోంది. ఈ ఉత్సవాలల్లో స్థానికులను భాగస్వామ్యం చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశం మేరకు ఆయా రాష్ట్రాలలో దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నారు. తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి కారణమైన డెవలప్ మెంట్, వెల్ఫేర్ స్కీంలను అన్ని చోట్ల ప్రచారం చేయాలని ఇప్పటికే కేసీఆర్ పార్టీ క్యాడర్ ను ఆదేశించారు.   సర్పంచ్ నుంచి మొదలు ఎంఎల్ ఏ,  ఎంపీల వరకు తమ నియోజకవర్గాల్లో అమలవుతున్న ప్రభుత్వ స్కీములను ప్రచారం  చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. ఎందుకంటే వచ్చే డిసెంబర్ లోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. సమయం ఎక్కువ లేదు. ప్రచారమే మన ముందున్న లక్ష్యమని కేసీఆర్ క్యాడర్ కు ఇప్పటికే పిలుపునిచ్చారు. అన్ని సినిమా హాల్స్ లో స్లైడ్స్ వేయాలని, టీవీలు, పత్రికల్లో ప్రచారం చేసుకోవాలని కేసీఆర్ కార్యకర్తలకు ఆదేశించారు.    

టీడీపీ దారే ఇక బీజేపీ దారి!

కర్నాటక ఫలితాలు ఏపీలో బీజేపీకి అన్ని దారులూ మూసేశాయి.  ఇక ఆ పార్టీ జనసేనాని పవన్ కల్యాణ్ ప్రతిపాదనలకు తలూపడం తప్ప మరో మార్గం లేకుండా చేశాయి. కాదని ఇంకా రాష్ట్రంలో అధికార పార్టీతో అంటకాగితే.. ఆ పార్టీతో పాటుగా మునక తప్పదన్న విషయం బీజేపీకి కర్నాటక ఫలితాలు వెలువడిన వెంటనే అవగతమైంది. అందుకే ఏపీలో ఆ పార్టీ నేతల టోన్ మారింది. ఏపీ బీజేపీలో వైసీపీ వ్యతిరేక వర్గం నోరు నొక్కి మరీ ఏక ఛత్రాధిపత్యం చెలాయించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జేవీఎల్ ల గళం వెంటనే మారింది. ఏపీలో జనసేన, బీజేపీ ఇప్పటికే పొత్తులో ఉన్నాయని జేవీఎల్ కు కర్నాటక ఫలితాల తరువాతే గుర్తుకు వచ్చింది. మిత్రుడి ప్రతిపాదనను.. అంటే జనసేనాని తెలుగుదేశంతో కలిసి వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలన్న ప్రతిపాదనను తమ పార్టీ అధిష్ఠానం చాలా సీరియస్ గా పరిశీలిస్తోందని ఆయన మీడియా ముందు చెప్పారు. గతంలో  అయితే తెలుగుదేశంకు వ్యతిరేకంగా చాలా గట్టిగా గళమెత్తిన జేవీఎల్ ఒక్క సారిగా ఇలా మెత్తపడిపోవడం వెనుక బీజేపీ అగ్రనాయకత్వం మందలింపు ఉందని అంటున్నారు. ఏపీ బీజేపీలో గతంలో చాలా మార్లు సోము, జేవీఎల్ ల తీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లాయి. అయితే అధిష్ఠానం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఏపీలో ఏవో కొన్ని స్థానాలను ఒప్పందంలో భాగంగా వైసీపీ నుంచి పొందే యోచనలోనే ఇప్పటి వరకూ ఉంది. ఆ కారణంగానే  వైసీపీ అవినీతిపై ఎవరెంత మొత్తుకున్నా, ఆర్థిక అరాచకత్వంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా చూసీ చూడనట్టుగానే వ్యవహరించింది. నిబంధనలకు తిలోదకాలిచ్చి మరీ అడ్డగోలు అప్పులకు పచ్చజెండా ఊపుతూ వచ్చింది. కర్నాటక ఫలితాలకు రెండు రోజుల ముందు కూడా ఏపీ సర్కార్ కు ఆర్థిక వెసులుబాటు దక్కే విధంగా భూరీ రుణాన్ని బాండ్ ల వేలం ద్వారా ఆర్బీఐ నుంచి తెచ్చుకునే వెసులు బాటు కల్పించింది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు ఇటువంటి వెసులు బాటు దక్కకుండా చేసిన కేంద్రంలోని బీజేపీ.. ఏపీ విషయంలో మాత్రం అపారమైన ఉదారతను చూపింది. అయితే కర్నాటక ఫలితంతో ఇక ఆ వెసులుబాట్లు, ఆ ప్రత్యేక అభిమానాన్ని బహిరంగంగా చాటే ధైర్యం ఇక బీజేపీ హైకమాండ్ చేసే అవకాశం ఇసుమంతైనా లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ అవినీతిపై విమర్శలు గుప్పించిన బీజేపీ.. స్వయంగా తమ ప్రభుత్వంపై 40శాతం కమిషన్ ఆరోపణను పూర్తిగా విస్మరించి దెబ్బతింది. ఏపీలో కూడా ఇంత వరకూ బీజేపీ అదే పంథాను అనుసరిస్తూ వస్తోంది. గత తెలుగుదేశం హయాంలో అవినీతిపై జగన్ అండ్ కో చేస్తున్న ఆరోపణలకు వత్తాసు పలుకుతూ.. వైసీపీపై వచ్చిన అవినీతి ఆరోపణలను మాత్రం పూర్తిగా విస్మరించింది. స్వయంగా ప్రధాని మోడీ జగన్ సర్కార్ అక్రమాలపై చార్జ్ షీట్లు రూపొందించలని మౌఖికంగా ఇచ్చిన ఆదేశాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విస్మరించిందంటేనే.. మోడీ ఆదేశాలలోని సీరియస్ నెస్ అర్థమౌతుంది. ఈ నేపథ్యంలోనే కర్నాటక ఫలితంతో ఏపీ ప్రభుత్వ అవినీతిని పట్టించుకోకుండా ఆ పార్టీతో అంటకాగితే ఉన్న ఒక శాతం ఓటు బ్యాంకు కూడా చేజారిపోతుందన్న వాస్తవాన్ని బీజేపీ గ్రహించడంతోనే.. ఆ పార్టీ రాష్ట్ర శాఖలోని జగన్ అనుకూల వర్గం స్వరం మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే ఇంత కాలం పట్టించుకోని జనసేన అధినేతను తమ  మిత్రుడంటూ భుజాన ఎక్కించుకుంటోందని అంటున్నారు. ఇక జనసేన అధినేత పవన్ విషయానికి వస్తే ఆయన  రాష్ట్రంలోని జగన్ సర్కార్ పతనమే ద్యేయం అని విస్పష్టంగా ప్రకటించేశారు. అంతే కాకుండా మిత్రపక్షమైన బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని పూర్తిగా విస్మరించి హస్తిన వెళ్లి మరీ.. తాను తెలుగుదేశంతో కలిసి నడుస్తాననీ, బీజేపీ కూడా కలిస్తే మంచిది.. లేకుంటే మీదారి మీది.. నాదారి నాది అని కుండ బద్దలు కొట్టేశారు. ఆ తరువాతే బీజేపీ హైకమాండ్ నుంచి జగన్ అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలకు రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. ఇక ఇప్పుడు కర్నాటక ఫలితం తరువాత  స్పష్టంగా రాష్ట్రంలోని అధికార పార్టీకి  తాము దూరం అన్న విషయాన్ని ప్రజలకు అర్దం అయ్యేలా చెప్పేందుకు ఉపక్రమించింది. ఆ విషయాన్ని రాష్ట్రనాయకత్వానికి అర్దమవ్వడంతోనే జేవీఎల్ స్వరం మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలోలా జగన్ అడ్డగోలు అప్పులకు, ఆర్థిక అరాచకత్వానికి ఇక నుంచి కేంద్రం నుంచి సపోర్టు దక్కే అవకాశాలు మృగ్యమని అంటున్నారు. జేవీల్ ప్రకటనతో వచ్చే ఎన్నికలలో బీజేపీ తెలుగుదుశం, జన సేన కూటమితోనే కలిసి నడుస్తుందనడానికి ఇది స్పష్టమైన సంకేతంగా అభివర్ణిస్తున్నారు. 

ఫలితాల తర్వాత వామ పక్షాల వైఖరిలో మార్పు

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో విపక్షాలు బీజేపీతో పాటు మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.  ఇన్నాళ్లు కాంగ్రెస్, బిజెపిలను  సమదూరంలో ఉంచిన వామ పక్షాలు ప్రస్తుతం కర్ణాటక ఫలితాల తర్వాత కేవలం బిజెపిని మాత్రమే టార్గెట్ గా ఎంచుకున్నాయి.  పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై కాకుండా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని సిపిఐ, సిపిఎంలు యోచిస్తున్నాయి.  ఈ క్రమంలో సీపీఐ నారాయణ కర్ణాటక ఎన్నికల్లో మోడీకి అవమానం జరిగిందన్నారు. ఇంతలా దిగజారిన ప్రధానిని చూడలేదన్న ఆయన రానున్న ఎన్నికల్లో మోడీ ఎట్టి పరిస్థితుల్లో రారని వ్యాఖ్యానించారు మత విద్వేషాలు రెచ్చగొట్టారని, లౌకిక దేశానికి మోడీ ప్రధానిగా అనర్హుడని నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.కర్ణాటక ప్రజలు బీజేపీని చితక్కొడడంతో సౌత్ లో ఆ పార్టీకి గేట్లు మూసుకుపోయాయన్నారు నారాయణ. కర్ణాటక ఫలితాలు దేశానికే దిక్సూచి అని అన్నారు. ఇక తెలంగాణలో మాకో ఆప్షన్ వచ్చిందని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీకి సీన్ లేదని.. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యే పోటీ అని కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. కర్ణాటక ఎన్నికల ప్రభావం తప్పని సరిగా తెలంగాణ పై ఉంటుందన్నారు. అయితే కేసీఆర్ జాయింట్ యాక్షన్ లోకి రావడం లేదని.. కొన్ని రోజుల పాటు చూసి ఆ తరువాత మా రూట్ మేము చూసుకుంటామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ పొత్తులపై చర్చ చేసి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.ఇక మాక్కూడా సీట్లు కావాలని, మేమేం రాజకీయ సన్యాసం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. దీన్ని బట్టి త్వరలోనే కామ్రెడ్లు కాంగ్రెస్ తో దోస్తీ చేయనున్నట్టు తెలుస్తోంది.

కర్నాటక సీఎం పదవి.. ఎవరిని వరించేనో?

డీకే శివకుమార్ కర్నాటక కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలు కావడంలోనూ.. అంచనాలకు సైతం అందనంతగా కాంగ్రెస్ ఘన విజయం సాధించడంలోనూ డీకే శివకుమార్ ది కీలక పాత్ర. కర్నాటక పీసీసీ చీఫ్ కూడా.  పార్టీ విజయానికి ప్రధాన కారకుడు, పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కాడె  మోసి కాంగ్రెస్ రాష్ట్రంలో నిలబడటంలో కీలక భూమిక పోషించిన డీకే శివకుమార్ కు మాత్రం ఆయన పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యమంత్రి రేసులో ఆయన ముందువరుసలో ఉన్నప్పటికీ ఆ పదవి ఆయనకు దక్కే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇందుకు ఆయనకు ప్రధానంగా అడ్డంకులు సృష్టిస్తున్నది కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ  ముఖ్యమంత్రి సిద్దరామయ్య అని అంటున్నప్పటికీ.. బీజేపీ వ్యూహాత్మకంగా గతంలో ఆయనపై పెట్టిన కేసులు, సీబీఐ దర్యాప్తే కారణమని అంటున్నారు. కర్నాటకలో బీజేపీ ఇలా పరాజయం పాలైందో లేదో.. ఆ పరాజయానికి ప్రధాన కారకుడైన డీకే శివకుమార్ ను ఇరుకున పెట్టే విధంగా బీజేపీ అధిష్ఠానం పావులు కదిపిందంటున్నారు. బీజేపీ ఎత్తుగడలో భాగమే.. సీబీఐ కత్త బాస్ గా ప్రణీత్ సూద్ ను కేంద్రం నియమించింది. కేంద్రం ఈ మూవ్ సిద్దరామయ్యను ఇరుకున పెట్టడానికేనని అంటున్నారు. కర్నాటక డీజీపీగా ఉన్న ప్రవీణ్ సూద్ ను సీబీఐ చీఫ్ గా నియమించడంతో డీకే శివకుమార్ పై బీజేపీ బనాయించిన అవినీతి కేసుల దర్యాప్తును మళ్లీ తెరపైకి తీసుకురావడం ద్వారా ఆయన సీఎం రేసులో వెనుకబడేలా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించందని అంటున్నారు. శివకుమార్ ను ఒక వేళ పార్టీ అధిష్ఠానం సీఎంగా ఎంపిక చేసి పదవి కట్టబెట్టినా.. కేసుల కారణంగా ఆయన పదవి నుంచి తప్పుకునే పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్న అనుమానాలున్నాయి. దీంతో కర్నాటక సీఎంగా కాంగ్రెస్ అధిష్ఠానం సిద్దరామయ్యనే ఎంపిక చేసే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. డీకే కూడా అదే అభిప్రాయంతో హస్తిన వెళ్లకుండా బెంగళూరులోనే ఉండిపోయారనీ, తన అసంతృప్తిని మాత్రం తన మాటల ద్వారా గట్టిగా వ్యక్తం చేస్తున్నారనీ అంటున్నారు. తాను కాంగ్రెస్ కోసం చేయగలిగినంత చేశాననీ, ఎన్నో త్యాగాలు చేశాననీ అంటున్నారు. సిద్దరామయ్యతో విభేదాలున్నాయన్న వార్తలు కేవలం వదంతులేనని స్పష్టం చేసిన డీకే శివకుమార్ గతంలో ఎన్నో మార్లు ఆయనకు మద్దతుగా నిలబడ్డానని గుర్తు చేస్తున్నారు. కర్నాటక సీఎం ఎపింక కసరత్తు జరుగుతున్న తరుణంలో డీకే మాటలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేసులు, అరెస్టు ముప్పు పొంచి ఉన్న డీకే శివకుమార్ కు చాన్సెస్ తక్కువ ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా అదే భావంతో కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఉందని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలో సిద్దరామయ్య, డీకే శివకుమార్ అభిమానులు, అనుచరులు ఫెక్సీ వార్ కు తెరతీశారు. ఈ నేపథ్యంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో తిరుగులేని విజయాన్ని అందుకున్న కాంగ్రెస్ అంతర్గత కలహాల కారణంగా ఆ విజయ ఫలాలను చేజార్చుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని  మరోసారి అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆచితూచి అడుగులు వేస్తున్నది. అయితే రాష్ట్రంలో వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే ఇప్పటికే సిద్ధరామయ్యకు ముఖ్యమత్రి పదవి విషయంలో అధిష్ఠానం ఒక నిర్ణయానికి వచ్చేసిందంటున్నారు. అందుకే ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుని పరిశీలకులు హస్తిన వెళ్లినా, వారి వెంట సిద్దరామయ్య కూడా హస్తిన బాట పట్టినా డీకే శివకుమార్ మాత్రం బెంగళూరు దాట లేదు. తాను చేయాల్సిందంతా చేశాననీ, బీజేపీ కుట్రపూరితంగా తనను జైలు పాలు చేసినప్పుడు సోనియా గాంధీ తనను జైలుకు వచ్చి మరీ పరామర్శించిన సంగతినీ గుర్తు చేస్తూ.. కాంగ్రెస్ విజయంతో తన పాత్రను అధిష్ఠానం విస్మరించదన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి డీకే, సిద్ధరామయ్యల మధ్య పంచాయతీని కాంగ్రెస్ అధిష్ఠానం ఎటువంటి నష్టం లేకుండా ఎలా పరిష్కరిస్తుందో. 

వీకెండ్ విరామం లేదు.. లోకేష్ పాదయాత్ర నిరాటంకం!

పాదయాత్ర మొదలు.. మధ్య మధ్యలో విరామం ఇచ్చి.. ప్రతీ గురువారం రాత్రి విమానంలో హైదరాబాద్‌కు వచ్చేసి.. మళ్లీ ఆ మరునాడే అంటే శుక్రవారం సాయంత్రం విమానం ఎక్కి అటు విజయవాడ ఎయిర్‌పోర్టో లేదా రాజమండ్రి ఎయిర్ పోర్టో అదీకాకుంటే కోడి కత్తితో అదృష్టాన్ని తెచ్చి పెట్టిన విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌లోనో దిగి పాదయాత్ర ఎక్కడ వరకు ఆపారో.. అక్కడికి చేరుకొని.. మళ్లీ పాదయాత్ర కొన... సాగించడాలు లేవు. అలాగే నేను ఉన్నాను.. నేను విన్నాను లాంటి కాకమ్మ కబుర్లు లేవు... ఇక తెచ్చి పెట్టుకొన్న షిక్కటి  చిరునవ్వులు అయితే అసలు లేవు కాక లేవు.. ఉన్నది ఒక్కటే.. దృఢ సంకల్పం.. స్థిర చిత్తం.. వీటినే ఆయుధంగా మలుచుకొని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం  పాదయాత్ర నిర్విరామంగా ముందుకు దూసుకు పోతోంది. ఓ వేళ ఆయన.... తన పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చినా, అది నందమూరి తారకరత్న మరణించిన సమయంలో హైదరాబాద్ చేరుకొని.. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి.. మళ్లీ  వెంటనే తిరిగి వచ్చి తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు లోకేష్. అలాగే హైదరాబాద్ మహానగరంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించినా...  ఏప్రిల్ 28వ తేదీన విజయవాడలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల ప్రారంభ వేడుక ఘనంగా జరిగినా నారా లోకేష్  తన పాదయాత్రకు  తాత్కాలిక  విరామం ఇచ్చి.. వాటిలో పాల్గొన లేదు. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే జగన్ ప్రభుత్వం మేమే నెంబర్ వన్ అంటూ.. జీవో నెంబర్ వన్ తీసుకు వచ్చినా.. అలాగే యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్న నారా లోకేష్‌కు పోలీసులు పలు రకాల అడ్డంకులు సృష్టించినా.. ఎక్కడ ఆయన పాదం అగిందీ లేదు.. మరెక్కడా ఆయన వెనకడుగు వేసింది లేదు.   అలా జనవరి 27వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర విరామం లేకుండా.. ప్రతి రోజూ..   గ్రామాలు, పట్టణాల ప్రజలతో ఆయన మమేకమవుతూ ముందుకు సాగిపోతున్నారు. అలాగే  రైతులు, మహిళలు, యువత... ఇలా అందరిని కలుసుకొంటూ.. వారి సమస్యలను అడిగి.. వాటిని సావధానంగా వినడం.. తమ పార్టీ అధికారంలోకి రాగానే.. తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటూ  స్పష్టమైన భరోసా సైతం కల్పిస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు.  అయితే నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర మే 15వ తేదీ అంటే సోమవారం వంద రోజుల మైలు రాయిని చేరుకుంది. ఇంకా చెప్పాలంటే.. ఆయన చేపట్టిన పాదయాత్ర శతదినోత్సవాన్ని పూర్తి చేసుకొని..  అశేష ప్రజాభిమానంతో దిగ్విజయంగా ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికి రాయలసీమలోని మూడు జిల్లాల్లోని 39 నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర కొనసాగింది. అదీ రాయలసీమ... ఆ పైన ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇలాకా కడప జిల్లాలో సైతం నారా లోకేశ్‌కు ప్రజలు బ్రహ్మరథం సైతం పట్టారు. ఇక ఆయన పాదయాత్ర కోస్తా జిల్లాల.. మీదగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి ప్రవేశిస్తే..  ఇక జనం ప్రభంజమే అని పరిశీలకులు అంటున్నారు. మరోవైపు నారా లోకేశ్ 100వ రోజు మైలురాయిని పూర్తి చేసుకొంటున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. అందులోభాగంగా నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా 175 నియోజవర్గాల్లోని పార్టీ శ్రేణులు పాదయాత్రలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో మూడు వేల మంది పార్టీ శ్రేణులతో 7 కిలోమీటర్ల మేర పాదయాత్రను నిర్వహించనున్నాయి.      ఇక మే రెండో ఆదివారం మదర్స్ డే ఈ నేపథ్యంలో నారా లోకేష్‌కు ఆయన తల్లి నారా భువనేశ్వరి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. 99వ రోజు అంటే మే 14వ తేదీ ఆదివారం తన పాదయాత్ర ముగించుకొని శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేవుల క్యాంప్ వద్దకు ఆయన చేరుకొగానే.. ఎదురుగా తల్లి భువనేశ్వరి కనిపించడంతో నారా లోకేశ్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  ఈ 100వ రోజు లోకేశ్ పాదయాత్రలో తల్లి భువనేశ్వరితోపాటు నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఇక భర్త చంద్రబాబు సుదీర్ఘ రాజకీయం జీవితంలో ఏనాడు రాజకీయ వేదికపైకి రానీ నారా భువనేశ్వరి తొలిసారి బిడ్డతో కలిసి అడుగు వేయడం.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యువగళం పేరుతో నారా లోకేశ్ 2023, జనవరి 27న ప్రారంభించిన పాదయాత్ర.. 400 రోజుల పాటు.. 4 వేల కిలోమీటర్ల మేర సాగనుంది.

మల్లి ఖార్జున్ ఖర్గే పై పరువు నష్టం దావా

కర్ణాటకలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుపొందింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి గొంతులో పచ్చివెలక్కాయపడ్డట్టయ్యింది. ఎన్నికల ప్రచారంలో మల్లి ఖార్జున ఖర్గే చేసిన వాఖ్యలు ప్రస్తుతం ఆయన మెడకు చుట్టుకున్నాయి. ఎన్నికల ప్రసంగాల్లో  భజరంగ్ దళ్ పై మల్లి ఖార్జున ఖర్గే వాడిన పదాలు ఒక మతాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని హిందూ సురక్షా పరిషత్ పేర్కొంది.  కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. హిందూ సురక్షా పరిషత్ భజరంగ్ దళ్ హింద్ వ్యవస్థాపకుడు, సంగ్రూర్ వాసి అయిన హితేష్ భరద్వాజ్ ఖర్గేకి వ్యతిరేకంగా రూ.100 కోట్లకు పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా భజరంగ్ దళ్ పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలను ఖర్గే చేసినట్టు ఆరోపణ.  జాతి వ్యతిరేక సంస్థలతో సమానంగా భజరంగ్ దళ్ ను కాంగ్రెస్ పార్టీ పోల్చినట్టు హితేష్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని చేసిన ప్రకటనను కూడా ప్రస్తావించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పదో పేజీలో భజరంగ్ దళ్ ను జాతి వ్యతిరేక సంస్థలతో పోల్చారు. తాము ఎన్నికల్లో గెలిస్తే నిషేధిస్తామని కూడా హామీ ఇచ్చారు’’ అని హితేష్ భరద్వాజ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

ఎమ్మెల్యేల చూపు సిద్ద రామయ్యవైపే

 కర్ణాటకలో కాంగ్రెస్ విజయ భేరి మోగించిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అనే విషయం వాడి వేడిగా చర్చ జరుగుతోంది. సిద్ద రామయ్య పూర్వాశ్రమంలో ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది కాబట్టి మళ్లీ ముఖ్యమంత్రి చాన్స్ దొరకవచ్చని తెలుస్తోంది.  గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న డి. శివకుమార్ కు అవకాశం ఇవ్వాలని కేంద్ర నాయకత్వం యోచిస్తుండగా ఎమ్మెల్యేల చూపు సిద్దరామయ్య వైపే ఉన్నట్లు తెలుస్తోంది.  కర్ణాటకలో కాంగ్రెస్ విజయ భేరి మోగించిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం ఉత్కంఠగా మారింది.  సిద్ద రామయ్య పూర్వాశ్రమంలో ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది కాబట్టి అతనినే మళ్లీ సీఎం చేయాలని కాంగ్రెస్ నాయకత్వం యోచిస్తుంది. ఇక పోతే డీకే శివకుమార్ పై ఇప్పటికే సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి అతన్ని బలపరిస్తే కేంద్ర ప్రభుత్వం మరిన్ని కేసులు నమోదుచేసి దర్యాప్తు వేగవంతం చేయవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యేనా? అంటే ఆ పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. గతంలో ముఖ్యమంత్రిగా సేవలు అందించిన సిద్ధరామయ్యవైపే ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. సీఎం సీటు రేసులో సిద్ధరామయ్యే ముందంజలో ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు 80 మంది ఆయనకే మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవి కోసం డీకే శివకుమార్, సిద్ధరామయ్య పోటీ పడుతున్న విషయం తెలిసిందే! ఈ నేతలు ఇద్దరిలో ఎమ్మెల్యేల మద్దతు ఉన్నవారికే సీఎం పదవి కట్టబెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎమ్మెల్యేలకు ఓటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఓటింగ్ లో మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్ధరామయ్యే ముందుండగా.. ట్రబుల్ షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్ వెనకబడ్డట్లు సమాచారం. దీంతో కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యేనని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ లోకి జూపల్లి, పొంగులేటి ?

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. అక్కడి విజయంతో ఇక్కడి కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నిండుకుంది. దీంతో మరో ఆరు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ ఉత్సాహంతో ఆ పార్టీ పుంజుకునే అవకాశాలున్నాయి. అయితే ఇతర పార్టీల్లోని అసంతృప్తవాదులకు ఓ ఆప్షన్ గా కాంగ్రెస్ మారింది. దీంతో భారీ స్థాయిలో ఆ పార్టీకి సభ్యత్వం నమోదు కావడంతో పాటు కొంత మంది కీలక నేతలు గాంధీభవన్ మెట్లెక్కే ఛాన్స్ కూడా ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంకా మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావ్ లు కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. అయితే కొన్నాళ్ల నుంచి వీరిద్దరు ఏ పార్టీలో చేరాలనే దానిపై సందిగ్దంలో ఉన్నారు. బిజెపిలో చేరనున్నట్లు ప్రచారం బాగా జరిగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై వీరిద్దరూ బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. బిఆర్ఎస్ కి  ప్రధాన శత్రువు బిజెపి కాబట్టి వీరిరువురు చేరికలపై రకరకాల రూమర్లు వచ్చాయి.  అయితే కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్ లోనే చేరడం బెటర్ అని ఇద్దరు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం కైవసం చేసుకోవడం పైగా ఖమ్మంలో కూడా కాంగ్రెస్ కు బలం ఉండడంతో.. వారిద్దరు కూడా బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ లో చేరడానికే నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీంతో వారు సేవ్ వనపర్తి ఆత్మీయ సమ్మేళనంలో ఈ విషయాన్ని ప్రకటించే అవకాశముంది. అదే విధంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వాస్తవానికి  పొంగులేటి బీజేపీలోకి చేరాలని భావించారు. దీంతో ఆయన బీజేపీ చేరికల కమిటీతో రెండు మూడు సార్లు భేటీ కూడా అయ్యారు. ఆయన ఇంటికి ఈటల బృందం వెళ్లింది కూడా. అయితే ఆయన అనుచరులు మాత్రం కాంగ్రెస్ లోకే ఆయన్ని చేరాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత  నిర్ణయం తీసుకుంటానని పొంగులేటి అప్పుడు ప్రకటించారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ విజయాన్ని సాధించడంతో ఆయన కాంగ్రెస్ లోకే వెళ్లడానికి సిద్ధమయ్యారు. కాగా, ఆయనతో పాటు జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ లోకే వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలవడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.  

కర్ణాటక బాటలో తెలంగాణా కాంగ్రెస్

కర్ణాటక ఎన్నికల ఫలితాలు టీకాంగ్రెస్ కు ఊపునిస్తున్నాయి. అంతే కాదు దిశానిర్ధేశం కూడా చేస్తున్నాయి. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీనే గద్దెదింపిన అధిష్టానం రూట్లోనే టీపీసీసీ సీనియర్లు అడుగులు వేయడానికి స్కెచ్ వేస్తున్నారు. దక్షిణాదిలో  ఒక్క కర్ణాటకలో మాత్రమే బిజెపి అధికారంలో ఉంది. మొన్నటి ఫలితాలు బిజెపిని మట్టి కరిపించి కాంగ్రెస్ ను అందలం ఎక్కించింది.    కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. అధికారంలో ఉన్న మంత్రులు,నేతలు, పార్టీ పై ఉన్న వ్యతిరేకతే అనే నిర్థారణకు వచ్చారు. ఇక నిరుద్యోగం, నిత్యావసర ధరల పెంపు, అవినీతి,కమిషన్లు ఇలా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను మేనిఫెస్టోలో చేర్చడంతో పాటు వాటి పై విస్తృత ప్రచారం చేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎన్నికలకు చాలా  రోజుల ముందే ప్రకటించింది. కర్ణాటకలో కాంగ్రెస్ మొదటి జాబితా మార్చిలోనే ఖరారైంది.ఇలా అభ్యర్థులను ముందే ప్రకటించడం వల్ల కాంగ్రెస్ విజయానికి దారి తీసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కూడా కర్ణాటక బాటలోనే ముందుగానే ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.  దీనికి ఆకర్షితులై కన్నడిగులు కాంగ్రెస్ కు పట్టంకట్టారని.. కాబట్టి ఇదే ఫార్ములాను తెలంగాణలో అప్లై చేస్తే మంచి ఫలితాలు ఇక్కడ కూడా వస్తాయని ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఓపినీయన్ కు వచ్చారు. రాష్ట్ర ప్రజల్లో వివిధ అంశాల్లో ప్రభుత్వంపైనా ఉన్న వ్యతిరేకతను ఎజెండాగా తీసుకోవాలనుకుంటుంది టీపీసీసీ.  అయితే కర్నాటకలో బీజేపీ సత్తా ఏంటో తెలిసిపోయిందని, ఇక తెలంగాణలో ఆ పార్టీని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని, ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ను మాత్రమే లెక్కలోకి తీసుకొని ఆ పార్టీలోని అసమ్మతి, అసంతృప్తి, వైపల్యాలు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతలనే ప్రధానంగా చేసుకొని కార్యాచరణను రూపొందించుకోవాలని టి కాంగ్రెస్ భావిస్తోంది. ఇక హైదరాబాద్ కర్ణాటక రీజియన్ లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని సరిహద్దు నియోజకవర్గాల్లో మరింత దృష్టి పెట్టి, అవసరాన్ని బట్టి కర్ణాటక నేతలను సైతం రప్పించే అవకాశమున్నది. ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకొని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి విరుద్ధంగా వైఫల్యాలను తెరపైకి తెచ్చి ఉద్యోగులు, ఉపాధ్యాయలు, నిరుద్యోగులు , విద్యార్థులు, యూత్ కు చేరువ కావాలన్నాది కాంగ్రెస్ స్కెచ్. అయితే ఇప్పటికే రాహుల్ గాంధీ సమక్షంలో వరంగల్ లో ప్రకటించిన డిక్లరేషన్ రైతులు, వ్యవసాయం పైన ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్. అదే విధంగా ప్రియాంక గాంధీ సమక్షంలో రిలీజ్ చేసిన డిక్లరేషన్ యూత్ పైన ఫోకస్ పెట్టింది. ఈ రెండు ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అనుగుణంగా డిక్లరేషన్ లలో హామీలు ఇచ్చాయి. ఇంకా ఏడు డిక్లరేషన్ లను ప్రకటించడానికి ప్రణాళిక వేసుకున్నది. కర్ణాటక లో వచ్చిన తాజా విజయంతో ప్రభుత్వ వ్యతిరేకతను మరింత బలంగా జనంలోకి తీసుకొని వెళ్లాలనుకుంటున్నారు. కర్ణాటకలో పనిచేసిన ఫార్ములా ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుందనే ధీమాతో కాంగ్రెస్ నేతలున్నారు. మరో వైపు ప్రభుత్వ తొమ్మిది వైఫల్యాలు ఇంకా నెరవేర్చని హామీల లిస్ట్ ను టీ కాంగ్రెస్ వెతికే పనిలో పడింది. ఇక రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఎఫెక్ట్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టొచ్చినట్టుగా కనిపించడంతో.. దాన్ని కూడా తెలంగాణలో అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. సోనియా గాంధీతో పాటు పార్టీ అగ్ర నాయకత్వం మొత్తం కర్ణాటకలో విస్తతంగా ప్రచారం చేసినట్లుగానే తెలంగాణలోనూ జాతీయ నాయకులను దింపడం ద్వారా మంచి రిజల్ట్స్ ఉంటాయని అనుకుంటున్నారు. అయితే అధిష్టానం ఫుల్ ఫోకస్ కర్ణాటకపై కేటాయించడంతోనే అలా ఫలితాలొచ్చాయని.. అదే విధంగా తెలంగాణపై దృష్టి సారించాలని టీ కాంగ్రెస్ నేతలు అధిష్టానాన్ని కోరనున్నారు. కాకపోతే తెలంగాణలో ఎన్నికలున్నప్పుడే ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికలు రానున్నాయి. దీంతో తెలంగాణలో విజయానికి విస్తృతమైన అవకాశాలున్నందున రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఇక్కడి నేతలు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీని తెలుగువారు నమ్మడం లేదు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ మోసపూరితంగా వ్యవహరించిందన్న భావన తెలుగువారిలో మరీ ముఖ్యంగా ఆంధ్రులలో చాలా బలంగా ఉంది. గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యవహరించిన తీరు.. ఉద్దేశపూర్వకంగా ఏపీకి, ఏపీ ప్రయోజనాలకూ భంగం వాటిల్లే విధంగానే ఉందన్నది ఆంధ్రుల నిశ్చితాభిప్రాయంగా కనిపిస్తున్నది. 2019 ఎన్నికలలో ఏపీలో ఒక్కటంటే ఒక్క సీటులో కూడా బీజేపీ విజయం సాధించకపోవడమే కాకుండా, పోటీ చేసిన ఏ స్థానంలోనూ కనీసం డిపాజిట్ కూడా దిక్కించుకోలేకపోయింది. ఆ తరువాత ఏపీలో జరిగిన రెండు ఉప ఎన్నికలలో పోటీ చేసిన బీజేపీకి అప్పుడు కూడా కనీసం డిపాజిట్ దక్కలేదు. ఇక ఇప్పుడు తాజాగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కూడా బీజేపీకి తెలుగువారి ఆగ్రహ జ్వాల సెగ గట్టిగానే తాకింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో తెలుగువారు అధికంగా ఉన్న ఏ నియోజకవర్గంలోనూ బీజేపీ గెలవలేదు. బీజేపీకి ఓటు వేయవద్దంటూ తెలుగువారు స్వచ్ఛందంగా ప్రచారం చేసినట్లు అక్కడి పరిశీలకులు చెబుతున్నారు. 2018లో జరిగిన కర్నాటక ఎన్నికల సమయంలో బీజేపీకి ఓటు వేయవద్దంటూ తెలుగుదేశం పార్టీ ఆ రాష్ట్రంలో గట్టిగా ప్రచారం చేసింది. అయితే తాజా ఎన్నికలలో మాత్రం తెలుగుదేశ పార్టీయే కాదు.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ ప్రాంతీయ  పార్టీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయలేదు. చివరాఖరికి బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్న బీఆర్ఎస్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేయలేదు. ఆ రాష్ట్రంలో బీడీఎస్ కు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ ఎక్కడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయలేదు. ఆ విషయాన్ని జేడీఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్వయంగా చెప్పి బీఆర్ఎస్ అధినేతపై తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. ఇక కర్నాటకలో తెలుగు ప్రజలు అధికంగా ఉంటే ఎనిమిది జిల్లాల్లోని 49 స్థానాలలో బీజేపీ కేవలం ఆరు అంటే ఆరు స్థానాలలోనే విజయం సాధించడమే తెలుగు ప్రజలు బీజేపీని నిర్ద్వంద్వంగా తిరస్కరించారనడానికి తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏపీ, తెలంగాణ  సరిహద్దు జిల్లాలు సహా దాదాపుగా ఎనిమిది జిల్లాల్లో తెలుగువారు ఎక్కువగా ఉంటారు. వీరిలో ఏపీ, తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. దీనిని బట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు బీజేపీ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారని తేలుతోంది.   సరిహద్దు జిల్లాలైన కోలార్ , యాద్గిర్, చిక్ బళ్లాపూర్ బళ్లారి జిల్లాలో బీజేపీకి కనీసం ఒక్కటంటే ఒక్క నియోజకవర్గం కూడా దక్కలేదు.  ఇక మొత్తంగా తెలుగు వారి ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న జిల్లాలు కర్నాటకలో రమారమి 10 వరకూ ఉంటాయి. ఆ పది  జిల్లాలలోనూ కలిపి బీజేపీ గులుచుకున్నవి 9 స్థానాలు మాత్రమే. 

సీబీఐకి కొత్త బాస్.. నిష్పాక్షికంగా వ్యవహరిస్తారా?

సీబీఐకి కొత్త బాస్ వచ్చారు. కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ (59) ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కొత్త డైరెక్టర్ గా కేంద్రం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారని పేర్కొంది. సీబీఐ ప్రస్తుత డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ స్థానంలో ప్రవీణ్ సూద్ ను నియమించింది. మే 25న జైశ్వాల్ పదవీ కాలం ముగుస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సీబీఐ డైరెక్టర్ ను ఎంపిక చేసే ప్యానల్.. ప్రవీణ్ సూద్ నియామకానికి ఆమోదం తెలిపినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ప్యానల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సభ్యులుగా ఉన్నారు. ఈ ప్యానల్ సమావేశంలో సూద్ ఎంపికపై.. అధిర్ రంజన్ చౌదరి అసమ్మతి నోట్ ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు.  1986 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ప్రవీణ్ సూద్ గత మూడేళ్లుగా కర్ణాటక డీజీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. దిల్లీ ఐఐటీలో, ఐఐఎం బెంగళూరులో చదువుకున్నారు. దాంతో పాటు న్యూయార్క్ లోని సిరక్యూస్ విశ్వవిద్యాలయంలోనూ విద్యాభ్యాసం చేశారు.  ప్రవీణ్ సూద్ కర్ణాటకలోని బళ్లారి, రాయచూర్ జిల్లాలకు సూపరింటెండెంట్ గా పనిచేశారు. బెంగళూరు నగరానికి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) గానూ సేవలు అందించారు. అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్), మైసూర్ సిటీ పోలీసు కమిషనర్ గానూ  బాధ్యతలు నిర్వహించారు. మారిషస్ ప్రభుత్వానికి పోలీసు సలహాదారుగా కూడా ప్రవీణ్ సూద్ పనిచేశారు. మెరుగైన ట్రాఫిక్ నిర్వహణకు సాంకేతికతను ఉపయోగించడం, పౌరులకు సమర్థమైన సేవలను అందించడం వంటి కార్యక్రమాలతో.. ప్రవీణ్ సూద్ కు 2011లో నేషనల్ ఈ-గవర్నెన్స్ గోల్డ్ అవార్డు వచ్చింది.  2006లో ప్రిన్స్ మైఖేల్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ అవార్డు సైతం ఆయన అందుకున్నారు.  చాలా కాలంగా స్వతంత్ర సంస్థ సీబీఐ...  నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం లేదనే వాదన వినవస్తుంది. కేంద్ర కనుసన్నలలో పని చేస్తున్నదనే అపవాదు మూటగట్టుకుంది. దేశ అత్యుత్తమ న్యాయస్థానం ఒకానొకప్పుడు..  సీబీఐ.. పంజరంలో చిలుక అంటూ వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతిపక్షాలు సైతం.. సీబీఐ పనితీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. నూతన సారధి సారధ్యంలో సీబీఐ పని తీరు ఎలా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.

జనం..ప్రభం‘జనం’..లోకేష్ పాదయాత్ర@100 డేస్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌  యువగళం  పాదయాత్ర సోమవారం నాటికరి ( మే 15)కి వంద రోజుల ల్యాండ్ మార్క్ కు చేరుకుంది.  కుప్పం నుంచి ప్రారంభించిన ఆయన పాదయాత్ర  ఒకటి రెండు రోజులు కాదు, వందో ..రెండొందల కిలోమీటర్లో కాదు. ఏకంగా  4 వేల కిలోమీటర్ల,400 రోజులు..అంటే 15 నెలలకు పైగా సాగే సుదీర్ఘ పాద యాత్రకు వంద రోజులకు చేరుకుంది. మరో మూడోందల రోజులు కూడా సాగుతుంది. వాస్తవానికి  ఆయన ఇంత  కఠిన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? అధికారం కోసమా? అంటే, కాదనలేము. కానీ, అది పాక్షిక సత్యం మాత్రమే. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు పట్టభిషిక్తుదయ్యాడు, కానీ, రావణ సంహారం జరిగింది మాత్రం రామచంద్రుని పట్టాభిషేకం కోసం కాదు, రాక్షస పాలన అంతమొందించేందుకే. ఇక ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నకు ప్రత్యేకించి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు కదా.   రావణాసురుడు మాయలేడి వేషంలో సీతమ్మోరిని అపహరిస్తే, ఆధునిక (మోడరన్) రావణుడు  ఒక్క ఛాన్స్ పేరు చెప్పి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారు. అందుకే మోడరన్ రావణాసుల పాలన అంతమొందించాలన్న సంకల్పంతో  లోకేష్,  యువగళం  పాదయాత్ర చేస్తున్నారని చెప్పవచ్చు.  ఇక లోకేష్ పాదయాత్ర ఏ విధంగా జరుగుతోంది. ఆయన యాత్ర పొడుగునా ఎన్నెని అవరోధాలను ఎదుర్కొంటున్నారు.  అనేది ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. జగన్ రెడ్డి ప్రభుత్వం లోకేష్ పాదయాత్ర అడ్డుకునేందుకు జీవో ..01 తెచ్చింది. పాదయాత్రకు అనుమతి నిరాకరించింది. అయినా, కోర్టు అనుమతితో లోకేష్ ముందడుగు వేశారు. ఆయన మైక్ లాగేసుకున్నారు. జనాలను ఆయన పాదయాత్రలో అడుగు కలపకుండా ఎన్ని చేయాలో అన్నీ చేసింది జగన్ ప్రభుత్వం.అన్నిటినీ అధిగమించి ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా ముందడుగు వేశారు. పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రభుత్వం తన శక్తియుక్తులన్నీ ఒడ్డి ఆయన యాత్రకు అవరోధాలు కల్పిస్తునే ఉంది. అయితే పులి కడుపున పుట్టిన పులి బిడ్డ లోకేష్ మొక్కవోని ధైర్యంతో ముందుకే సాగుతున్నారు..  లోకేష్ కు తన ముందుంది సీదాసాదా మార్గం కాదని పాదయాత్ర ప్రారంభించడానికి ముందే తెలుసు.   ఒక్క లోకేష్ కు మాత్రమే కాదు, గత  మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన చూసి,అనుభవిస్తున్న అందరికీ  లోకేష్ మహాసాహసం చేస్తున్నారన్న విషయం తెలుసు.  అయినా, ఆనాడు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం తాత నందమూరి తారక రామా రావు, తెలుగునాట ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తండ్రి నారా చంద్రబాబు నాయుడు సాగించిన చైతన్య యాత్రల స్పూర్తితో ..   లోకేష్ తన పాదయాత్ర సాగిస్తున్నారు. ఆయన పాదయాత్ర సాగుతున్న కొద్దీ ప్రజాభిమానం చెలియలకట్ట తెంచుకుని మరీ ఉప్పెనలా ఉప్పొంగుతోంది.  ప్రజల దీవెనలతో దిగ్విజయంగా సాగుతోంది.  లోకేష్ విజయయాత్ర పై ఎవరికీ ఎలాంటి అనుమనాలు లేవు. ధర్మో రక్షిత రక్షితః .. ధర్మకోసం చేసే ధర్మ పోరాటం ఆదిలో అవరోధాలు ఎదుర్కున్నా అంతిమ విజయం సాధించి తీరుతుంది.  అడుగడునా కష్టాలు తప్పవని తెలిసీ కన్నకొడుకును యుద్ద భూమికి పపండం ఏ తల్లికైనా ఎంత కష్టమో, ఏ తండ్రికైనా ఎంత బాధాకరమో వేరే చెప్పనకరలేదు. అందునా పాదయాత్ర కష్ట సుఖాలు స్వయంగా అనుభవించిన చంద్రబాబు నాయుడికి, ఆయన కష్టాలు చూసి మానసిక వ్యధను అనుభవించిన లోకేష్  మాతృ మూర్తి భువనేశ్వరికి కన్న కొడుకును పాదయాత్రకు ఆశ్వీదరించి సాగనంపడం ఎంతగా బాధించి ఉంటుందో వేర్తే చెప్పనక్కర లేదు. అయినా, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆ దుఃఖాన్ని దిగమింగుకుని, లోకేష్ ఆశ్వీదరించి అక్షింతలు వేసి సాగనంపారు. చంద్రబాబు దంపతులు.  అలాగే, లోకేష్ శ్రీమతి బ్రాహ్మణి, నిండా పట్టుమని పదేళ్ళు అయినా లేని కుమారుడు దేవాన్ష్‌ను, కుటుంబాన్ని వదిలి  400 రోజులు   దూరంగా ఉండడం లోకేష్ కు ఎంత కష్టమో బ్రాహ్మణి, దేవాన్ష్ కు అంతకు మించిన బాధ. అయినా రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం లోకేష్ సుదీర్గ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.   ధర్మ రక్షణ కోసం కష్టాలను లెక్క చేయకుండా కదిలిన  లోకేష్ కు ప్రజా దీవేనలే శ్రీరామ రక్ష. ప్రజాభిమానమే కొండంత అండ. ఇక ఆయన అకుంఠిత దీక్షతో పాదయాత్ర కొనసాగిస్తున్న తీరు చూస్తే.. ఔరా అనిపించకమానదు. ప్రతి రోజూ.. తెల్లవారు జామున మొదలు పెట్టి  రాత్రి పదకొండు గంటల వరకూ అలుపెరుగని శ్రమ. గంట పాటు సెల్ఫీలు, ప్రతీ చోటా సమస్యలు తెలుసుకోవడం. భరోసా ఇవ్వడం. పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎక్కడికక్కడ నాయకులతో సమాలోచనలు . వంద రోజులుగా  లోకేష్ దినచర్య ఇదే.    ఆయన పాదయాత్రలో జనాల్లేరని చెప్పడానికి వైసీపీ పడిన తాపత్రేయం అపహాస్యం పాలైంది.   ఆయన ప్రసంగంలో  ఎక్కడైనా మాట తడబడితే దాన్ని ఆధారం చేసుకుని ట్రోల్ చేసేందుకు అలా వైసీపీ సోషల్ మీడియాడేగ కన్నుతో ఎదురు చూస్తూనే ఉంది.    లోకేష్ రాజకీయాల్లోకి రాక ముందు నుంచి ఆయన వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో, ఎన్ని అవసవ్య మాటలు మాట్లాడిందో అందరికీ తెలుసు.  చివరికి బాడీ షేమింగ్ కు సైతం పాల్పడ్డారు.  అలా రాజకీయాల్లోకి అసలు ఎంట్రీ ఇవ్వకుండానే టార్గెట్ అయిన నేత లోకేష్ ఒక్కరే.  అన్నిటినీ అధిగమించి ఇంతింతై వటుడింతై అన్నట్లు ప్రతి అడుగులోనూ ఆయన ప్రజాభిమానాన్ని సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.  అడుగడుగునా ప్రజలతో మమేమౌతూ అడుగులేస్తున్నారు.  ఈ వంద రోజుల నడకలో లోకేష్ ముఖంలో అలసట, విసుగు అన్నవే కనిపించలేదు. ప్రజలు చెప్పుకుంటున్న సమస్యలను శ్రద్ధగా వినడం, పరిష్కార మార్గాలు చెప్పడం, అడిగిన వారందరితో సెల్ఫీలు తీసుకుంటూ, జనమే లోకేష్.. లోకేషే జనం అన్నట్లుగా యువగళం పాదయాత్ర సాగుతోంది.  వంద రోజుల్లో లోకేష్ మూడు జిల్లాల్లో  పాదయాత్ర చేశారు.  39 నియోజకవర్గాలను కవర్ చేశారు.ఆయన కవర్ చేసిన జిల్లాలన్నీ రాయలసీమ ప్రాంతానివే. మరో మూడు వందల రోజుల పాటు  శ్రీకాకుళం జిల్లా వరకూ పాదయాత్ర సాగుతుంది.  రాయలసీమలోనే ఇంత జన ప్రభంజనం ఉంటే ఇక కోస్తాకు వచ్చే సరికి ఎలాంటి పరిస్థితి ఉంటుందో సులభంగా ఊహించుకోవచ్చు.    లోకేష్ పాదయాత్ర వందో రోజుకు చేరుకున్న సందర్భంగా కుమారుడిని ఆశీర్వదించేందుకు తల్లి భువనేశ్వరి రావడం కొసమెరుపు. మదర్స్ డే రోజున అంటే ఆదివారం భువనేశ్వరి నారా లోకేష్ క్యాంపు సైట్ వద్దకు వచ్చి ఆశీర్వదించారు. వందో రోజు పాదయాత్రలో తనయుడితో అడుగు కలిపి నడిచారు. 

జన్ ధన్ ఖాతాలు ఇక కనుమరుగేనా?!

దాదాపు తొమ్మిదేళ్ళ కిందట ఆర్భాటంగా.. ఒక అద్భుత  ప్రాయోజిత పథకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పి.ఎంజేడీవై) పథకం క్రమంగా నిర్వీర్యమవుతోంది. 2014 ఆగస్టులో తన మాసన పుత్రికగా మోడీ ఆవిష్కరించిన ఈ ప్రతిష్టాత్మక పథకం ఇప్పుడు జనాదరణ కోల్పోతోంది. ఏడాది కాలంగా ఆర్ధిక లావాదేవీలు స్తంభించడంతో జనధన్ ఖాతాలన్నిటినీ మూసివేయడానికి  బ్యాంకులు సిద్ధపడుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 2,23,218 పీఎంజేడీవై ఖాతాలున్నాయి.  ఆంధ్రప్రదేశ్ లో 1,18,55,126 ఖాతాదారులున్నారు. వీటిలో 80 శాతానికి పైగా ఖాతాల్లో ఆర్ధిక లావాదేవీలు నిలిచి పోయి చాలా కాలమైంది. బ్యాంకులు పలు సార్లు మెసేజ్ రూపంలో అల్టిమేటం ఇచ్చినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. దీంతో మెజారిటీ ఖాతాలను బ్లాక్ లిస్టులో పెట్టేశారు. 2023 మార్చి నెల వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, దేశంలో ప్రధానమంత్రి జన్ ధన్ యోజనా కింద బ్యాంకులలో ఉన్న  ఖాతాల సంఖ్య 48.85 కోట్లు. ప్రస్తుతం ఈ బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.1,98,844.34 కోట్లు జమ అయ్యాయి. దాదాపు 4.08 కోట్ల ప్రధానమంత్రి జన్ ధన్ యోజన బ్యాంకు ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేదు. నో క్యాష్.. నో ట్రాన్సాక్షన్స్ సాకుతో వివిధ జాతీయ, షెడ్యూల్ ఇప్పటికే శాలను బ్లాక్ లిస్టులో పెట్టేశాయి. ఆర్ధిక లావాదేవీలే ఆధారంగా ఖాతాల కొనసాగింపునకు బ్యాంకులు అల్టిమేటంతో సంప్రదించిన వారందరికీ సేవింగ్ ఖాతాలుగా మార్చుకోవాలని అధికారులు సెలవిస్తున్నారు. ఇది ప్రభుత్వాదేశాలు ఏమాత్రం కావని, స్తంభించిన ఖాతాలను సేవింగ్ కోసం మార్చుకోవాలని మౌలిక సూచనలు మాత్రమేనని చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రుణ ఖాతాలు కావడంతో డబ్బులు జమ చేసేందుకు ఆసక్తి. చూపని ఖాతాదారులు ఆశించిన ప్రయోజనాలేమీ కనిపించకపోవడంతో ఇక మాకొద్దులే.. అని వదిలేస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ ప్రతిష్టాత్మక పథకానికి రెండు కోణాల్లో ముప్పు వాటిల్లుతోంది. కేంద్రం ఆదరణ తగ్గిపోవడం ఒకటైతే.. ఖాతాదారుల్లో అవగాహన లోపం మరొకటిగా పీఎంజేడీవై పథకం నిర్వీర్యానికి గురవుతోంది. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం.. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద 647 బీమా క్లెయిమ్ లు కేంద్రానికి అందాయి. వాటిలో 928 క్లెయిమ్లను మాత్రమే పరిష్కరించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 941 క్లెయిమ్ లు వచ్చాయి. వాటిలో 182 క్లెయిమ్స్ సెటిల్ చేయగా, 48 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన 111 బ్లెయిమ్లు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాయో ప్రభుత్వానికి కూడా తెలియదు. సెటిల్ చేసిన క్లెయిమ్ ల కోసం రూ.2.27 కోట్లు చెల్లించారు. అదేవిధంగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 306 17 యిమ్ లను పరిష్కరించారు. 10. క్లెయిమ్లు తిరస్కరించారు. మిగిలిన 149 దరఖాస్తులు ప్రస్తుత పరిస్థితి ఏంటో గవర్నమెంట్ వారికి సైతం తెలియదు. గత ఆర్థిక సంవత్సరంలో సెటిల్ అయిన కేసుల రూ.1.88 కోట్లు చెల్లించారు. పథకం కింద ఖాతాదార్లకు ప్రమాద బీమా రక్షణ లభిస్తుంది. గతంలో ఈ కవరేజీ రూ.1 లక్షగా ఉండగా, ఇప్పుడు రూ.2 లక్షలకు పెంచారు. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాదార్లు బ్యాంక్ ఖాతాతో పాటు రూపే కెవిట్ కార్డును పొందుతారు. ప్రమాద బీమా పరంగా ఇది చాలా ముఖ్యమైనది. ప్రమాదం జరిగిన రోజుకు ముందు 90 రోజుల లోపు, ద ఖాతాదారు తన రూపే కార్డును ఉపయోగించి ఏదైనా లావాదేవీ జరిపినట్లయితే, అతను ||మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి అర్హుడు అన్న షరతు ఉంది. చాలా సందర్భాలలో క్లెయిమ్ తిరస్కరణకు ఈ షరతే కారణం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించి.. ప్రజలకు ఏదో చేసెద్దామని రూపకలగపన చేసిన పథకం.. నేడు సొంత ఆదరణ కరవై.. నిర్వీర్యం అవుతున్న తరుణంలో.. ఖాతాలను సేవింగ్ అకౌంట్ గా మార్చుకోమని బ్యాంకులు..గగ్గోలు పెడుతున్న తరుణంలో... ప్రధాని గాని, ప్రధాన మంత్రి కార్యాలయం గాని దీనిపై తగిన వివరణ ఇవ్వకపోవడం.. గమనార్హం.

బీజేపీ ముక్త దక్షిణ భారత్!

కాంగ్రెస్ ముక్త భారత్.. ఇది గత తొమ్మిదేళ్లుగా బీజేపీ నినాదం. కాంగ్రెస్ బలహీనతల కారణంగా అత్యథిక రాష్ట్రాలలో ఆ పార్టీ అధికారంలో లేకపోయి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పుంజుకుంటుందన్న భావన ఆ పార్టీలోనే కాదు.. జనంలోనూ ఉంది. ఇతర రాజకీయ పార్టీలలోనూ ఉంది. అందుకే బీజేపీ వ్యతిరేక కూటమి ప్రస్తానవ గత నాలుగేళ్లలో ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ కేంద్రంగానే చర్చలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తరువాత దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో జనం ఒకింత నిరాశ చెందుతున్నారన్న మాట కూడా వాస్తవమే. కానీ కాంగ్రెస్ కొట్టింది. కొడితే ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టాలన్నట్లుగా సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు.. అలాగే అంతకంటే ముందు మరికొన్ని కీలక రాష్ట్రాలలో ఎన్నికలు జరగడానికి ముందు, ఆ ఎన్నికలన్నిటికీ లిట్మస్ టెస్ట్ లా పరిశీలకులే కాదు.. పార్టీలూ బలంగా విశ్వసిస్తున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని అందుకుని బీజేపీని కంగు తినిపించింది. కాంగ్రెస్ ముక్త భారత్ సంగతి ఏమిటో కానీ, బీజేపీ ముక్త దక్షిణ భారత్ అని కాంగ్రెస్ డంకా భజాయించి మరీ చెప్పింది.  సర్వేలే హంగ్ అన్నాయి, స్వల్ప అధిక్యత అన్నాయి. జనం నాడిని పట్టుకున్నా.. ఆది ఉన్నదున్నట్లు వెల్లడించలేని బలహీనత కారణంగా కొన్ని మీడియా సంస్థలు బీజేపీదే కర్నాటకలో మరోసారి అధికారం అనీ చెప్పేశాయి. ఫలితాలు బీజేపీకి దిమ్మతిరిగేలా వచ్చాయి. స్వల్ప ఆధిక్యత కాదు. మ్యాజిక్ ఫిగర్ కంటే 22 స్థానాలు అధికంగా వచ్చాయి. సీఎం ఎవరన్న విషయంలో కాంగ్రెస్ మల్లగుల్లాలు పడితే పడుతూ ఉండొచ్చు. విజయం తరువాత కూడా విభేదాలు మరచి ఆ పార్టీ కర్నాటక నేతలంతా ఏకతాటిపై నిలబడి ఇచ్చిన ప్రకటనలు కాంగ్రెస్ లో కొత్త సంప్రదాయానికి తెరతీసినట్లే కనిపిస్తోంది. సరే అది పక్కన పెడితే.. బీజేపీకి ఈ పరాజయం కేవలం పరాజయం కాదు. మసకబారిన  మోడీ ప్రతిష్టకు, ఆ పార్టీ ఇంతకాలం నమ్ముకున్న హిందుత్వ అజెండాను ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారనడానికీ కూడా నిదర్శనం. తన హోదా, పదవి, పరిధి కూడా మరచి మోడీ ప్రచారంలో జై బజరంగ్ బలి నినాదం చేయడం, సున్నిత అంశాలను ప్రస్తావించి ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం, చివరాఖరికి ది కేరళ స్టోరీ సినిమాను ప్రమోట్ చేసి ప్రజల దృష్టిని సమస్యల నుంచి మళ్లించడానికి ప్రయత్నించడం ఇవేమీ కూడా బీజేపీ పట్ల వ్యతిరేకతను ఇసుమంతైనా తగ్గించలేకపోయాయి.  ఇక కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరాజయం.. తేలికగా కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే.. ఆ రాష్ట్రం బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు మార్గదర్శిగా అందరూ చెప్పుకునే బీఎల్ సంతోష్ జీ సొంత రాష్ట్రం. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని వాస్తవం చేయడానికి దేశంలోని రాష్ట్రాలలో బీజేపీ విజయానికి రూట్ మ్యాప్ లిఖించారని చెప్పబడుతున్న బీఎల్ సంతోష్ జీ సొంత రాష్ట్రం, అలాగే ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం పార్టీ తన చతురంగ బలాలనూ దించింది. బీజేపీ జాతీయ నాయత్వమంతా కర్నాటకలో మోహరించి ఊరూ వాడా ఏకమయ్యేలా ప్రచారం చేసింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఒక రోజు తక్కువ వారం రోజులు ఆ రాష్ట్రంలో సుడి గాలి పర్యటనలు చేశారు. రెండు పదులకు పైగా సభలలో ప్రసంగించారు. తన వాక్చాతుర్యమంతా ప్రదర్శించి మరీ కాంగ్రెస్ అవినీతిని ఎత్తి చూపారు.   ఫలితం లేకపోయింది. చివరకు ఆఖరి క్షణంలో వారు నమ్ముకున్న భజరంగ్ దళ్ వివాదం కూడా వారికి ఓటమి నుంచి బయటపడేయలేకపోయింది.  బీజేపీ పాలనలోని 40 శాతం అవినీతిని నిలువెత్తు లోతులో పారేసి గురివింద సామెతను బీజేపీకి గుర్తు చేశారు.  ఎప్పుడూ సొంతగా గెలవకుండా.. రెండుసార్లు కాంగ్రెస్‌-జెడీఎస్‌ పార్టీల నుంచి తెచ్చుకున్న ఎమ్మెల్యేలతో, నిలబెట్టుకున్న బీజేపీ అధికార సామ్రాజ్యం, ప్రజావ్యతిరేక పవనాలకు ఎగిరిపోయింది.