ప్రభుత్వాల అప్పుల తిప్పలు
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రభుత్వాలు విచ్చలవిడిగా అప్పులు చేస్తూ.. ప్రభుత్వ భూములు అమ్ముతూ జనాకర్షక పథకాలు, ఉచితాలు అమలు చేస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలో తప్పు లేదు. కానీ అప్పులు చేసి, భూములు తెగ నమ్మి సంక్షేమ పథకాల పేరిట డబ్బులు పంచడం అంటే రాష్టాన్ని మరంతగా అప్పుుల ఊబిలోకి తీసుకుపోవడమే అవుతుంది.
మితివిూరిన అప్పులు భవిష్యత్ తరాల వారికి గుదిబండగా తయారయ్యే ప్రమాదముంది. తెలుగు రాష్టాల్లో ఇప్పుడు అప్పులపైనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. రానురాను ఇవి విపరీతంగా పెరుగుతున్నా పాలకులు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రజా ప్రాతినిథ్య చట్టాన్ని సవరించి, ఆయా ప్రభుత్వాలు ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్రవేశపెట్టే ఉచితాలకు క్లళెం వేయాల్సిన అవసరం ఉంది. సంక్షేమ పథకాలు రెండు రకాలు. మొదటి దాంట్లో ప్రభుత్వం విద్య, వైద్యం, రోడ్లు వంటి వాటిని అభివృద్ధి చేస్తుంది. దాంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పేదలు చదువు అంది అభివృద్ధి చెందుతారు. ఉచిత వైద్యం పొంది ఆరోగ్యంగా ఉంటారు. ఇక రెండవ దాంట్లో వ్యక్తి(ఓటరు)ని దృష్టిలో పెట్టుకొని అమలు చేసే సంక్షేమ పథకాలు. ప్రస్తుతం తెలంగాణలో అమలు చేస్తున్నట్లు కల్యాణలక్ష్మి, డబుల్బెడ్రూమ్ఇండ్లు, గొర్రెల పంపిణీ, బతుకమ్మ చీరెలు, రైతు బంధు, పింఛన్లు తదితరాలు.
రెండవ రకంలో సమాజంతో సంబంధం లేకుండా లబ్దిదారులకు నేరుగా లాభం చేకూరుతోంది. కొన్ని దేశాలు మితివిూరిన సంక్షేమ పథకాలు, ఉచితాలు ప్రవేశపెట్టి కొద్దికాలంలోనే దివాలా తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా చమురు నిల్వలు ఉన్న వెనిజులా దేశం సంక్షేమ పథకాల పేరిట లెక్కకు మించి ఖర్చు చేసింది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోవడంతో దివాల తీసి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దాంతో ప్రభుత్వాలు పడిపోయి దేశంలో అస్థిరత, అరాచకం చోటు చేసుకున్నాయి. గ్రీసు దేశం ప్రపంచానికి ప్రజాస్వామ్య జీవన విధానం, తత్వశాస్త్రం, రంగస్థలం, ఒలింపిక్ క్రీడలు వంటివి అందించిన ఒక అభివృద్ధి చెందిన రాజ్యం. మితివిూరిన సంక్షేమ పథకాలు అమలు చేసి ఈ దేశం కూడా దివాలా తీసింది. శాంతి భద్రతల సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.
మన పొరుగు దేశమైన శ్రీలంక పరిస్థితి వేరుగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ రాష్ట్రం రెండు రకాలుగా అప్పులు చేస్తోంది. ఒకటి నేరుగా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటోంది. ఇలా తీసుకున్న అప్పు రాష్ట్ర బడ్జెట్ పద్దుల్లో చూపిస్తోంది. ఎఫ్ఆర్బీఎమ్(ద్రవ్య వినిమయ చట్టం) ప్రకారం రాష్టాలు అప్పులు చేయడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అలాగే కేంద్రం అనుమతి కూడా అవసరం. ఇక రెండవ రకం ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా. వీటి ద్వారా తీసుకుంటున్న అప్పులకు ప్రభుత్వం ప్రత్యక్షంగా పూచీ ఉండదు. పూచికత్తు మాత్రమే ఇస్తుంది. కార్పొరేషన్లు పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నా అవి ప్రభుత్వ లెక్కలోకి రావు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా కార్పొరేషన్ల ద్వారా చేస్తున్న అప్పు ఎంత అన్నది ప్రజలకు తెలియడం లేదు. పాలనలో వివిధ కార్యక్రమాలకు అప్పులు తీసుకోవడంలో తప్పు లేదు. అయితే అటువంటి అప్పు పెట్టుబడుల కింద ఖర్చు చేస్తే ఆదాయం వస్తుంది.
తిరిగి కట్టే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ప్రజాకర్షణ పథకాలకు అప్పులు చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయి. ప్రభుత్వాలు పథకాల పేరిట ఖర్చులు తగ్గించి నాణ్యమైన విద్య, ఆరోగ్యం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఉత్పాదక రంగం పైన ఖర్చు చేస్తే.. ఉపాధి అవకాశాలు పెరిగి పేదలకు మేలు జరుగుతుంది. ఎన్నికల్లో గెలుపు కోసం విచక్షణారహితంగా ఉచితాలు ప్రకటించడం, ఉద్యోగస్తుల జీతభత్యాలు పెద్ద ఎత్తున పెంచటం, మద్యం అమ్మకాలతో ఆదాయాన్ని సమకూర్చుకోవడం ఎన్నటికైనా ముప్పే. అలాంటి ముప్పును ప్రస్తుతం ఏపీ ఎదుర్కొంటోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీదనే పూర్తిగా ఆధారపడిన పరిస్థితి. ఉత్పాదక రంగాలను నిర్వీర్యం చేసి ఆదాయ మార్గాలను పూర్తిగా విస్మరించి పూర్తిగా అప్పుల మీదనే ఆధారపడి రోజులు గడిపేస్తోంది. ఆ అప్పులతో సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ.. వాటిని వచ్చే ఎన్నికలలో మళ్లీ అధికారం కోసం పెట్టుబడులుగా పరిగణిస్తున్నది. దీని వల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఉద్యోగులు జీతాలు అందక ఉద్యమ బాట పడుతున్నారు. అన్ని వర్గాల వారీ అసంతృప్తితో రగిలిపోతున్నారు. అభివృద్ధి అడుగంటింది. పారిశ్రామిక ప్రగతి ఆనవాలే లేకుండా పోయింది.