కాంగ్రెస్ ఫలితాలపై మోడీ, కెటీఆర్ ట్వీట్స్

ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకశాసనసభ ఎన్నికలలో బిజెపి ఓటమి చెందిన తర్వాత ట్వీట్ చేశారు. గెలుపొందిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు.  దక్షిణాదిన  బిజెపి అధికారంలో వచ్చిన మొదటి రాష్ట్రం కర్ణాటక. కాంగ్రేస్ పార్టీ నుంచి అధికారం కైవసం చేసుకున్నబిజెపి ఈ ఎన్నికలలో  ఆ అధికారాన్ని  కాంగ్రెస్ కు తిరిగి అప్పగించింది.  కర్ణాటక ఫలితాల  ప్రభావం తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపబోదని  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి ఆర్ అన్నారు. ప్రస్తుతం పెట్టుబడుల కోసం యుకె వెళ్లిన మంత్రి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి నూతనంగా  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన పొరుగునే ఉన్న తెలంగాణలో ప్రభావం ఉంటుందని వస్తున్న వార్తలో నిజం లేదన్నారు.     

బ్రహ్మనందం ప్రచారంతొ మంత్రిగారు ఓటమి 

టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మనందం మద్దతు ఇచ్చి ప్రచారం చేసిన బీజేపీ నేత, కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుదాకర్ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ చేతిలో ఆయన ఓడిపోయారు. చిక్‌బళ్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగిన సుధాకర్‌కు బ్రహ్మనందం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ చేతిలో 11, 130 ఓట్ల తేడాతో సుధారక్ ఓటమ చవి చూడాల్సి వచ్చింది. సుధాకర్ గెలుపు కోసం బ్రహ్మనందం నాలుగు రోజుల పాటు.. చిక్‌బళ్లాపూర్‌లో ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. సదరు నియోజకవర్గంలో తెలుగు ప్రజల శాతం అత్యధికంగా ఉంటుంద విషయం విదితమే.  అయితే తన ప్రచారంలో బ్రహ్మనందం తాను నటించిన సినిమాల్లోని డైలాగ్‌లు పేల్చి.. ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. కానీ ఓటర్లు మాత్రం ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతో లేకుంటే కాంగ్రెస్ పార్టీపై ఉన్న మక్కువతోనో.. కానీ హస్తం పార్టీకి గంపగుత్తుగా ఓట్లు గుద్దిపడేశారు. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. ఇక 2019లో జరిగిన చిక్ బళ్లాపూర్ ఉప ఎన్నికల్లో సైతం సుధాకర్‌కు బ్రహ్మనందం ప్రచారం చేయడంతో.. నాడు ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అయిందన్న సంగతి తెలిసిందే.

ముఖ్యమంత్రి శివకుమార్? సిద్ద రామయ్య?

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో వాడి వేడి చర్చ జరుగుతోంది. 2013 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా పని చేసిన సిద్ద రామయ్యకి మళ్లీ అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం యోచిస్తోంది. గాంధీ ఫ్యామిలీకి విధేయుడుగా ఉన్న డికె శివకుమార్ పేరు కూడా ముఖ్యంత్రి అభ్యర్థి రేసులో ఉన్నారు.  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గే ,  రాహుల్ గాంధీ ఆలోచనను బట్టే ముఖ్యమంత్రి అభ్యర్థి డిసైడ్ కానున్నారు. 2024 లోకసభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా సిద్ద రామయ్యను ప్రకటించాలని రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి సీనియర్ కాంగ్రెస్ నేత సిద్దరామయ్యను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి శివకుమార్ పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా  ప్రకటించే అవకాశం  కనిపిస్తుంది. డికె శివకుమార్ అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న రాజకీయ నేత. అతన్ని ఎంపిక చేస్తే  వచ్చే లోకసభ ఎన్నికల్లో పార్టీకి ఆర్థిక సహకారం అందించవచ్చని పార్టీ భావిస్తోంది. ఒక వేళ శివకుమార్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే కేంద్రంలో ఉన్న బిజెపి సర్కారు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసులో నిందితుడు. ప్రస్తుతం అతను బెయిల్ మీద ఉన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివకుమార్ ను ప్రకటిస్తే బిజెపీ ప్రభుత్వం పాత కేసులను తోడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. శివకుమార్ పై సిబిఐ, ఈడీ, ఐటీ శాఖ లలో అనేక కేసులున్నాయి.  దర్యాప్తు సాగుతుంది. శివకుమార్ ఇప్పటకే 104 రోజులు తీహార్ జైలులో గడిపారు. 

సోనియాను అభినందించిన స్టాలిన్ 

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం బిజెపి వ్యతిరేక శక్తులకు ఊరట నిచ్చింది. తమిళనాడులో డిఎంకె నేత, ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ఫలితాల పట్ల తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఫోన్ చేసి మరీ అభినందించారు. యుపిఏ మిత్ర పక్షాలతో బాటు బిజెపిని వ్యతరేకించే పార్టీలు కాంగ్రెస్ నేతలకు అభినందనలు తెలుపుతునకర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖరారైంది. మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరగ్గా... కాంగ్రెస్ 97 స్థానాల్లో నెగ్గి, 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 113 కాగా, అందుకు మరో 16 స్థానాల దూరంలో ఉంది. అధికార బీజేపీ 48 స్థానాల్లో నెగ్గి, మరో 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జేడీ (ఎస్) 14 స్థానాల్లో గెలిచి, 7 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 4 స్థానాల్లో నెగ్గారు.  కాగా, కాంగ్రెస్ ఈ స్థాయిలో ఫలితాలు సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. గత కొన్నాళ్లుగా మోదీ ప్రాభవం ముందు కాంగ్రెస్ వెలవెలాపోతోంది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. కానీ, కర్ణాటక ఫలితాల నేపథ్యంలో బీజేపీని మట్టి కరిపించామన్న ఆనందం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. 

 ప్రియాంక ప్రత్యేక పూజలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తన హవా చాటుకొంటోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆ క్రమంలో ఊరు వాడా.. నేతలు, కార్యకర్తలతో సంబరాలు మిన్నంటాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ.. హిమాచల్ ప్రదేశ రాజధాని సిమ్లాలో జఖూలోని హనుమాన్ ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.  దేశంతోపాటు కర్ణాటక రాష్ట్రంలో శాంతి, శ్రేయస్సుల కోసం ఆమె ప్రార్థనలు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో గంట వ్యవధిలోనే సగం స్థానాల మార్కును సునాయాసంగా హస్తం పార్టీ దాటేసింది. మరోవైపు మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 130 స్థానాలకు పైగా కైవసం చేసుకొంటుందని ప్రియాంక గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌కి రేవంత్ చురకలు

హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలిత్లాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర ఫలితంగానే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా దూసుకు వెళ్తోందన్నారు. కర్ణాటక ఎన్నికల్లో సత్తా చాట లేకపోయిన కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ ఎటువైపు ఉంటుందో తెలంగాణ సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలా చెబితే.. ఆయన స్నేహ బంధం ఏమిటనేది బయటపడుతొందన్నారు. బీజేపీతో జత కట్టమని చెబుతారా? అంటూ సీఎం కేసీఆర్‌కు ఈ సందర్బంగా రేవంత్ చురకలంటించారు.   మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం చేశారు. అయితే ఆయన ప్రచారం చేసిన స్థానాలు చింతామణి, ముల్బగల్, బాగేపల్లి గౌరీబిదనూర్, చిక్కబళ్లాపూర్ అసెంబ్లీ స్థానాల్లో  కాషాయం పార్టీ ఘోర పరాభవం చవిచూడల్సి వచ్చింది. దీంతో తెలంగాణ బీజేపీలో కొద్దిపాటి స్తబ్దత నెలకొంది.

కన్నీరుమున్నీరవుతోన్న సిద్దరామయ్య ఫ్యామిలీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. హస్తం పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి. ఆ క్రమంలో ఆ పార్టీ శ్రేణులు ఆనందడొలికల్లో మునిగి తేలుతోన్నాయి. అలాగే కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య కుటుంబం కూడా విజయనందంలో ఉంది. అలాంటి వేళ... సిద్దరామయ్య సోదరి శివమ్మ భర్త రామేగౌడ కొద్ది సేపటి క్రితం మరణించారు. దీంతో ఆయన ఇంట విషాద ఛాయలు అలముకొన్నాయి. ఈ రోజు ఉదయం రామేగౌడ తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని మైసూర్‌లోని ఓ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో.. సిద్దరామయ్య కుటుంబంలో విషాదం చాయలు అలుముకొన్నాయి. రామేగౌడ ఆరోగ్యం మెరుగు పడి క్షేమంగా ఇంటి వస్తారని.. కుటుంబ సభ్యులు భావిస్తున్న తరుణంలో ఇలా జరగడంపై సిద్దరామయ్య కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.  మరోవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకు వెళ్లడంపై సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య స్పందించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని అందుకొంటుందని.. ఈ నేపథ్యంలో తన తండ్రి సిద్దరామయ్య ముఖ్యమంత్రి అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రయోజనాల కోసం తన తండ్రి సిద్దరామయ్య ముఖ్యమంత్రి కావాలని... ఒక కుమారుడిగా తన తండ్రిని సీఎంగా చూడాలని అనుకుంటున్నానని చెప్పారు.

కీలక నేతలకు విజయాలు, అపజయాలు

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక నేతల పాత్ర ప్రధానం. అయితే కీలక నేతలు కూడా ఓడిపోయారు. బిజేపీలో కూడా అదే పరిస్థితి.  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. పలువురు కీలక నేతలు విజయం సాధించగా... మరికొందరు ఊహించని విధంగా పరాజయం పాలవుతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై షిగ్గావ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. వరుణ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపురి నియోజకవర్గం నుంచి జయకేతనం ఎగురవేశారు.  బళ్లారి రూరల్ స్థానం నుంచి బి.శ్రీరాములు ఓటమి పాలయ్యారు. హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్ స్థానం నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ సీఎం జగదీశ్ శెట్టార్ ఓడిపోయారు. మరోవైపు రేపు ఉదయం బెంగళూరులో సీఎల్పీ సమావేశం జరగనున్నట్టు సమాచారం. ఈ భేటీలో సీఎం అభ్యర్థి పేరును ఖరారు చేయనున్నారు. గెలుపొందిన అభ్యర్థులు వెంటనే బెంగళూరుకు రావాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది.

ఖాకీల కండకావరం.. సామాన్యుడిలో కలవరం

ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. అధికార జగన్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని.. ఆ పార్టీ నేతల అడుగులకు పోలీసులు మడుగులోతుత్తోన్నారని.. ఇంకా చెప్పాలంటే  రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ.. ఫ్యాన్ పార్టీ నేతల చేతుల్లో కీలుబొమ్మగా మారిందంటూ గత నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్షాలు గగ్గొలు పెడుతోన్నాయి. అయితే జగన్ పాలనలో పోలీసులు వ్యవహరిస్తున్న శైలిని చూసి.. యావత్ భారతావని ఔరా అంటు ముక్కున వేలేసుకొనే పరిస్థితి అయితే దాపురించిందని ఇప్పటికే ప్రజాస్వామిక వాదులు స్పష్టం చేస్తున్నారు.   ఆ క్రమంలో తాజాగా నెల్లూరు జిల్లా కావలిలో చోటు చేసుకొన్న సంఘటన చూసి.. జాతీయ మానవ హక్కుల సంఘం సైతం నోరెళ్లబెట్టే పరిస్థితికి వచ్చేస్తోందని సంకేతాలు సైతం వినిపిస్తున్నాయి. మే 12వ తేదీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని  కావలి వేదికగా రైతులకు చుక్కల భూముల హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ విచ్చేశారు. ఆ క్రమంలో పట్టణంలో నిరసనకారులు.. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో వారిని పోలీసులు అడ్డుకొవడంలో భాగంగా.. ఓ పోలీస్.. తన కాళ్ల మధ్య ఆ కార్యకర్త తల ఉంచి.. గట్టిగా నొక్కుతోన్న వీడియో దృశ్యాలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు సైతం వెల్లువెత్తుతోన్నాయి.   ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన... అమెరికాలో చోటు చేసుకొన్న అప్రో అమెరికన్ జార్జి ప్లాయిడ్ ఘటనను గుర్తు చేసే విధంగా ఉందనే అభిప్రాయం సైతం ప్రజాస్వామిక వాదుల్లో వ్యక్తమవుతోంది. 2020, మే 25వ తేదీన అమెరికాలోని మినిపోలీస్ నగరంలో కర్కశత్వానికి మారు పేరుగా నిలిచిన పోలీస్ అధికారి డెరెక్ షావిన్ మోకాళ్ల కింద జార్జి ప్లాయిడ్ నలిగి పోతూ కూడా... తనకు ఊపిరి అందడం లేదని చెబుతున్నా వినకుండా.. తుది శ్వాస విడిచే వరకు అతడిని గట్టిగా తన కాళ్లతో అదిమి పెట్టి ఉంచడంతో.. జార్జీ ప్లాయిడ్ మృత్యు ఒడిలోకి జారుకొన్నాడు... అందుకు సంబంధించిన వీడియోతోపాటు ఫొటోలు సైతం వైరల్ కావడంతో అగ్రరాజ్యం అమెరికా అట్టుడికిపోయింది. చివరకు ట్రంప్ ప్రభుత్వంపై ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతోపాటు.. ఆయన తన అధ్యక్ష పదవి పోగొట్టుకోవడంలో జరిగిన అతి ముఖ్య  సంఘటనల్లో ఇది ఒకటిగా నిలవడం గమనార్హం. చివరకు అంత కూర్రత్వంతో వ్యవహరించిన పోలీస్ అధికారి డెరెక్ షావిన్‌కి 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ.. కోర్టు తీర్పు సైతం వెలువరించడం.. అదీ కూడా అతడి హత్య జరిగిన జస్ట్ 36 రోజుల్లోనే ఈ తీర్పు వెలువడం నిజంగా శుభ పరిణామమేనని చెప్పాలి.  ఎందుకంటే.. ఇటువంటి ఘటనలు.. సంఘటనలు మన రాష్ట్రంలో చోటు చేసుకొన్నా.. ఈ చర్యలకు పాల్పడిన పోలీసులపై చర్యలు అయితే ఉండవు. ఓ వేళ చర్యలు తీసుకొన్నా.. అవి కంటితుడుపు చర్యలే ఉంటాయన్నది మాత్రం పక్కా వాస్తవం. అదీకాక  బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్లిన వేళ అంటూ మనం ఘనంగా అమృతోత్సవాలు జరుపుకొంటున్నాం కానీ.. మనం.. మన ఎన్నుకొన్న నాయకాగణం మాత్రం.. ఆ నాటి బ్రిటిష్ వారి రాసిన.. చేసిన  చట్టాలనే ఏళ్లకు ఏళ్లు పట్టుకొని వేలాడుతోన్నారు. అంతేకానీ.. కాలానుగుణంగా వచ్చిన మార్పులకు అనువుగా పోలీసు చట్టాలను మార్చాలనే  చిత్త శుద్ది మన పాలకల్లో కొరవడింది. దీంతో పోలీసు వ్యవస్థ అంటే.. బలవంతులు, అధికారంలో ఉన్నవారి రక్షణకే రక్షక భట వర్గం అనే ఓ రాజముద్ర  దేశంలోని ప్రతీ సామాన్యడి మదిలో బలంగా ముద్ర పడిపోయింది. అయితే తాజాగా కావలిలో చోటు చేసుకోన్న ఈ ఘటన.. రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలను దారి తీస్తుందోనని ప్రజాస్వామిక వాదుల్లో ఓ కలవరం అయితే మొదలైందనేది మాత్రం  పక్కా వాస్తవం.  

కర్ణాటకలో కాయ్ రాజా కాయ్

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడే క్రమంలో కర్ణాటకలో జోరుగా బెట్టింగుల పర్వం కొనసాగుతోంది. ఓ వ్యక్తి అయితే తనకున్న రెండు ఎకరాలను పందానికి పెట్టాడు. తనతో పందెం కాసేవారు ఉంటే రావాలని డప్పు కొట్టి మరీ చాటింపు వేయించాడు. ఈ ఘటన హొన్నాళ్లి నియోజకవర్గంలో చోటు చేసుకొంది. సదరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శాంతనగౌడ, బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ రేణుకాచార్య బరిలో నిలవగా.. వీరిద్దరిపై జోరుగా పందాలు కొనసాగుతోండగా.., నాగణ్ణ అనే వ్యక్తి మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శాంతనగౌడ విజయం సాదిస్తారని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. అందుకోసం తను రెండెకరాల పొలాన్ని పందెం కాస్తున్నానని, తనపై పందెం కాసేవారు ఉంటే ముందుకు రావాలంటూ గ్రామంలో డప్పు కొట్టి మరీ చాటింపు వేయించాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.  మరోవైపు కొండసీమల చామరాజనగర జిల్లాలోనూ బెట్టింగులు జోరుగా జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక్కడ సోమణ్ణ  గెలుస్తారంటూ కోటి రూపాయల వరకు పందం కాసినట్లు తెలుస్తోంది. ఇక గుండ్లుపేట తాలూకా మల్లయ్యైనపుర గ్రామానికి చెందిన కిరణ్.. తన చేతిలో రూ. 3 లక్షలు పట్టుకుని కాంగ్రెస్ గెలుస్తుందని పందెం కాయడం.. అందుకు సంబంధించిన వీడియో బహిర్గతం కావడంతో..  పోలీసులు ఆయన నివాసంపై దాడులు నిర్వహించి.. విచారణ చేపట్టారు. మరోవైపు తాను ప్రకటించిన అభ్యర్థులు తప్పక గెలుస్తారని.. అలా కాదన్న వారు కోటి రూపాయల పందెం కాయవచ్చు అంటూ ప్రకటించిన ఓ వ్యక్తి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

నాన్న ముఖ్యమంత్రి కావాలి 

మైసూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఫలితాల సరళిని బట్టి చూస్తే.. కాంగ్రెస్ ముందంజలో ఉంది. దీంతో తమ పార్టీ విజయం సాధిస్తుందని హస్తం పార్టీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆ క్రమంలో కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య తనదైనశైలిలో స్పందించారు. బీజేపీకి అధికారం దూరం చేసేందుకు తాము చేయాల్సిందంతా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి స్థాయి మెజార్టీ సాధిస్తుందని.. ఇతర పార్టీల మద్దతు లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక ప్రయోజనాల కోసం తన తండ్రి సిద్దరామయ్య ముఖ్యమంత్రి కావాలని... ఒక కుమారుడిగా తన తండ్రిని సీఎంగా చూడాలని అనుకుంటున్నానని ఆయన తన మనస్సులోని మాటను ఈ సందర్భంగా వెల్లడించారు.  గతంలో తన తండ్రి సిద్దరామయ్య నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలన అందించిందని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. ఇంతకాలం బీజేపీ పాలనలో కొనసాగిన అవినీతి, విధానపరమైన లోపాలను ఆయన సరిచేస్తారని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సిద్దరామయ్య ముఖ్యమంత్రి కావాలన్నారు. తన తండ్రి... వరుణ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారని.. భారీ ఆధిక్యంతో ఆయన విజయం సాధిస్తారని చెప్పారు.  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10వ తేదీన జరగగా..  మే 13వ తేదీన శనివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుత ఫలితాల సరళిని బట్టి చూస్తే... మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను 100కి పైగా స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యంలో ఉండగా 70 పై చిలుకు స్థానాలో బీజేపీ లీడ్‌లో ఉంది. జేడీ(ఎస్‌) 30 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవికి గట్టి పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే సీఎంగా పని చేసిన సిద్ధూ మరోసారి ఆ పదవిని దక్కించుకోవాలని తన వంతు ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ సైతం పోటీపడుతోన్నట్లు సమాచారం. అదీకాక.. పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంతో ఆయన సఫలీకృతులయ్యారనే ప్రచారం సైతం పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై తనకు ఆసక్తి ఉందని పలుమార్లు పరోక్షంగా ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయ ఢంకా మోగిస్తే.. సీఎం అభ్యర్థిని పార్టీ అధిష్టానమే ఎంపిక చేస్తుందనే ప్రచారం ఇప్పటికే జోరందుకొంది.

దేశమంతా మిన్నంటిన కాంగ్రెస్ సంబరాలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (113) కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ 118 స్థానాల్లో లీడ్ లో ఉండగా... బీజేపీ 75, జేడీఎస్ 24, ఇతరులు 7 సీట్లలో లీడ్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతుండటం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ ను నింపింది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్ పార్టీ విజయాన్ని  సూచించడంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సంబరాలు అంబరాన్నంటాయి. గాంధీభవన్ వద్ద పార్టీ సీనియర్ నేతల సమక్షంలో వేడుకలు జరుపుకుంటున్నారు. తెలంగాణాలో వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు ఈ ఫలితాలు నిరాశపర్చాయి. తెలంగాణలో తమకు  ప్రధానప్రతి పక్షం రాబోదని జోస్యం చెప్పే బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ విజయంతో రానున్న ఎన్నికల్లో తమ పార్టీపై పడనుందని అనుమానించే పరిస్థితి నెలకొంది. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ విజయంతో దేశమంతా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. 

తెలంగాణలో కుల రాజకీయాలు భగ్గుమంటున్నాయ్ 

తెలంగాణలో కుల రాజకీయాలు మొదలయ్యాయి. తెలంగాణ  పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ వివాదానికి కేంద్ర బిందువయ్యారు. యాదవకులాన్ని కించపరిచే వాఖ్యలు చేసిన రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేసే కార్యక్రమాలు తెలంగాణా అంతటా జరుగుతున్నాయి. యాదవ కులానికి రేవంత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులతో బాటు యాదవ కులస్తులు డిమాండ్ చేస్తున్నారు.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్.  బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఎంపీ బడుగుల రియాక్ట్ అయ్యారు. తలసాని శ్రీనివాస్ కు వెంటనే రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గొల్ల కురుమ జాతులను రేవంత్ రెడ్డి అవమాన పరిచారని ధ్వజమెత్తారు. మా జాతులు నీతి నిజాయితీగా బతుకుతాయని.. అందరి తలలో నాలుకలా ఉండే జాతులు మావి అని రేవంత్ కుల దురహంకారంతో మాట్లాడారని దుయ్యబట్టారు. రేవంత్ తన నీచ రాజకీయాల గురించి కులాలను కించపరచడం తగదని అన్నారు. ఓటకు నోటు కేసులో దొంగ రేవంత్ రెడ్డి అని విమర్శించారు.  బడుగు బలహీన వర్గాలకు కేసీఆర్ చేయూతనందిస్తే.. రేవంత్ రెడ్డి వారిని కించపరుస్తున్నాడన్నారు. జైల్లో చిప్పకూడు తిన్న రేవంత్ మా జాతులను విమర్శించడమేంటని ప్రశ్నించారు. గొల్ల కురుమలకు రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఓ పెద్ద బ్లాక్ మెయిలర్ అని ఎద్దేవా చేశారు. శ్రీనివాస్ యాదవ్ రాజకీయాల్లో సీనియర్ అని కూడా చూడకుండా రేవంత్ కులం పేరుతో దూషించారని మండిపడ్డారు. రేవంత్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ కు సంస్కారం లేదని.. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడ పోటీ చేసినా గొల్ల కురుమలు కంకణం కట్టుకుని ఓడిస్తారని వ్యాఖ్యానించారు యెగ్గే మల్లేశం.  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై యాదవులు భగ్గుమన్నారు. యాదవులను కించపర్చడం, కులాన్ని చులకన చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. యాదవుల ఆందోళనకు గొల్ల కురుమలు కూడా గొంతు కలిపారు. రేవంత్‌.. ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. యాదవులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో గాంధీభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో రేవంత్‌ ఎక్కడ తిరిగినా దున్నపోతులు, గొర్రె పొట్టేళ్లతో నిరసన తెలుపుతామని తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కులం పేరుతో కించపరిచేలా రేవంత్‌రెడ్డి బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘తలసానికి చిన్నప్పటి నుంచి పేడ పిసికే అలవాటుంది. చాలాకాలం దున్నపోతులను కాసిండు’ అంటూ మంత్రి తలసానిని, యాదవ కులాన్ని కించపరిచేలా రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను యాదవులు తీవ్రంగా ఖండించారు. రేవంత్‌రెడ్డి తన అగ్రకుల అహంకారాన్ని బయటపెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అగ్ర కులస్థుడనే పొగరుతో బీసీ కులస్థులను అవమానపరుస్తున్నాడని మండిపడ్డారు.  

నాకు అంత  సీన్ లేదు

 కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత జెడిఎస్ పార్టీ కింగ్ మేకర్ కాబోతుందని వచ్చిన వార్తలను అదే పార్టీ ఖండిస్తుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బెంగళూరులోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒకవేళ కర్ణాటకలో హంగ్ వస్తే జేడీఎస్ కింగ్ మేకర్ పాత్రను పోషిస్తుందనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ ఉదయం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీతోనూ టచ్ లో లేనని... ఏ పార్టీ కూడా తనను సంప్రదించలేదని ఆయన అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు తమ పార్టీని నిరాశ పర్చాయన్నారు. కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని వచ్చిన వార్తలను ఆయన కొట్టివేశారు. రెండు, మూడు గంటలు గడిస్తే క్లియర్ పిక్ఛర్ వస్తుందని కుమారస్వామి చెప్పారు. రెండు జాతీయ పార్టీలకు ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయని... తమ జేడీఎస్ కు 30 నుంచి 32 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పాయని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం తమ పార్టీ అవసరం ఇతర పార్టీలకు రాకపోవచ్చని చెప్పారు. తమది ఒక చిన్న పార్టీ అని... తనకు అంత డిమాండ్ లేదని వ్యాఖ్యానించారు.

కర్ణాటకలో కాంగ్రేస్ ఆధిక్యం

ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించిన ఫలితాలు కర్ణాటక రాష్ట్ర కౌంటిగ్  ఫలితాలు దాదాపు దగ్గరగానే ఉన్నాయి.  దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యతను కనబరుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకే ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటి స్పష్టమైన మెజార్టీ దిశగా ముందుకు సాగుతోంది. మొత్తం 224 స్థానాలకు గాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 113 స్థానాల మ్యాజిక్ ఫిగర్ సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 117 స్థానాల్లో లీడ్ లో ఉంది. బీజేపీ 77 స్థానాల్లో, జేడీఎస్ 25 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

కక్ష కట్టిన ఆడబిడ్డ.. రంగంలోకి బ్రదర్ అనిల్!

ఇంటిగుట్టు లంకకి చేటు అన్నట్లు.. ఇంటి గుట్టు పార్టీకి.. అదీ అధికార ఫ్యాన్ పార్టీకి చేటు అన్నట్లుగా ఉందనే ఓ చర్చ అయితే అంధ్రప్రదేశ్ పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది. మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసులో ప్రదానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డిలు చేసిన తీవ్ర ఆరోపణలపై వైయస్ ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరు స్పందించిందీ లేదు.. ఖండించిందీ లేదని.. కానీ వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మాత్రం వైయస్ అవినాష్ రెడ్డి అండ్ కో చేసిన ప్రతీ ఆరోపణను అటు ఢిల్లీలో... ఇటు హైదరాబాద్‌లో.. ఎక్కడైనా సరే మీడియా ముందకు వచ్చి.. ఎన్నీ ప్రెస్ మీట్ సింగిల్ హ్యాండ్ అన్నట్లు.. ఏ మాత్రం అదురు బెదురు లేకుండా వైయస్ వివేకాపై వచ్చిన ఆరోపణలను ఖండించడమే కాదు.. తమ చిన్నాన్న ఎలాంటి వ్యక్తి.. ఆయన వ్యక్తిత్వం ఏమిటి... అలాగే కడప జిల్లా ప్రజల్లో ఆయనకు ఉన్న గుడ్ వీల్ ఎలాంటిదో కూడా సోదాహరణగా వివరించింది.. వివరిస్తోంది కూడా. దీంతో వైయస్ షర్మిల వ్యాఖ్యలను తెలుగు ప్రజానికం నమ్మక తప్పని పరిస్థితి నెలకొందనే ఓ చర్చ అయితే సదరు సర్కిల్‌లో కొన... సాగుతోంది.  మరోవైపు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తన చిన్నన్న వైయస్ వివేకా హత్య చోటు చేసుకొందని.. అందులో సీఎం చంద్రబాబు పాత్ర ఉందని.. దీనిపై సీబీఐతో విచారణ జరిపిస్తేనే కానీ.. ఈ హత్య కేసులో పాత్రదారులు, సూత్రధారులు బయటకు వస్తారంటూ పులివెందుల్లోని వైయస్ వివేకా మృతదేహం సాక్షిగా నాటి ప్రతిపక్షనేత వైయస్ జగన్ డిమాండ్ చేశారని.. ఆ క్రమంలో ఆయన కోర్టులో సైతం ఈ హత్య కేసు సీబీఐ విచారణ చేపట్టాలంటూ పిటిషన్ కూడా దాఖలు చేశారని... ఆ తర్వాత ఎన్నికలు జరగడం.. ఆ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి బంపర్ మెజార్టీ రావడం.. జగన్ ముఖ్యమంత్రి కావడం... నాటి నుంచి సీఎం వైయస్ జగన్ .. నేటి వరకు ఈ వివేకా హత్య కేసులో అనుసరించిన వ్యవహారశైలిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో వాడి వేడిగా నడుస్తోంది.    ఇంకోవైపు వైయస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ సైతం ప్రస్తుతం రంగంలోకి దిగి.. వైయస్ జగన్‌ను గద్దె దింపేందుకు ఎంత చేయాలో అంత చేసేందుకు తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు.. అందులోభాగంగా వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీకి కొన్ని వర్గాల వారి నుంచి ఓట్లు పడకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికలు సైతం ఆయన సిద్దం చేసి.. వాటిని ఎన్నికల నాటికి స్లిపర్ సెల్స్‌లాగా జనాల్లోకి పంపేందుకు వ్యూహరచన సైతం సిద్దం చేసినట్లు సదరు సర్కిల్‌లో ఓ టాక్ అయితే హల్‌చల్ చేస్తోంది.    అయితే ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత స్థానం నుంచి వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారంటే.. ఆ అందులో ఆయన తల్లి వైయస్ విజయమ్మ, చెల్లి వైయస్ షర్మిల, బావ బ్రదర్ అనిల్ కుమార్ పాత్ర ఖచ్చితంగా ఉందని.. ఇది ఎవరు కాదనలేని సత్యమని స్పష్టం చేసే వారు ఉన్నారని... అయితే వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల.. జగనన్న వదిలిన బాణం అంటూ తన పాదయాత్రలో బాణంలాగా దూసుకుపోతే.. ఆమె భర్త బ్రదర్ అనిల్ మాత్రం.. 2019 ఎన్నికల వేళ.. జగన్ గెలుపు కోసం చాలా పకడ్బందీ వ్యూహాంతో ముందుకు వెళ్లారని... దీంతో క్రిస్టియానిటీ ఓటింగ్ అంతా గంపగుత్తగా ఫ్యాన్ పార్టీకి పడడంలో కీలకంగా మారిందని.... ఆ క్రమంలో రాష్ట్రంలోని మొత్తం 24 ఎస్సీ నియోజకవర్గాల్లో 23 జగన్ పార్టీ ఖాతాలోకి వచ్చి పడ్డాయంటే అదంతా బ్రదర్ అనిల్ కుమార్ వ్యూహా రచన అనే వారు సైతం ఫ్యాన్ పార్టీలో ఉన్నారనే టాక్ సైతం వైరల్ అవుతోంది.   అదీకాక వచ్చే ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవాలని.. ఆ క్రమంలో  వై నాట్ 175 అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్.. పార్టీ శ్రేణులతో నిర్వహిస్తున్న వివిధ సమీక్షా సమావేశాల్లో మాట్లాడడమే  కాకుండా.. ఆ దిశగా ఆయన ప్రణాళికలు సైతం వేసుకొని.. ముందుకు సాగుతోన్నారని... అయితే ఇప్పటికే వైయస్ జగన్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఓ క్లారిటీ అయితే వచ్చేసిందని.. అలాగే  గత ఎన్నికల వేళ.. వైయస్ జగన్ వెంట నడిచిన వారు.. ఈ ఎన్నికల వేళ నడుస్తారా? అంటే అదీ సందేహమేనని.. ఐ ప్యాక్ తప్ప.. వైయస్ ఫ్యామిలీలోని  వారు సైతం ఆయన వెంటనే నడిచే పరిస్థితులు అయితే లేవనే వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయని... మరి జగనన్న వదిలిన బాణం అంటూ నాడు వైయస్ జగన్‌ను అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఎంత చేయాలో అంత చేసిన వైయస్ షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్.. అదే జగనన్నను గద్దె దింపేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ దంపతులు సఫలీకృతులవుతారా? లేదా? అనేది మాత్రం వచ్చే ఎన్నికల ద్వారా సుస్పష్టమవుతోందని చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది.

పవన్ కల్యాణ్ మాటలలో ముందస్తు ఎన్నికల సంకేతం?

ఏపీలో ముందస్తు ఎన్నికల ముచ్చట గతంలో కంటే గట్టిగా వినిపిస్తోంది.  విపక్షాలలో అయోమయాన్ని సృష్టించి ఆ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మరల్చుకునేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా ముందస్తు ముచ్చటను తెరమీదకు తెచ్చిందన్న వాదన వినవస్తున్నా..  విశ్వసనీయ సమాచారం మేరకు వైసీపీ యిప్పటికే పార్టీ జెండాలు, ఇతర ఎన్నికల సరంజామాకు పెద్ద ఎత్తున ఆర్డర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. కారణాలేమైనా జగన్  అసెంబ్లీని గడువుకు ముందే రద్దు చేసి  ప్రజా తీర్పును కోరుతారన్న భావన రాజకీయ వర్గాలు, పరిశీలకుల్లోనే కాదు.. సామాన్య ప్రజానీకంలో కూడా వెల్లువెత్తుతోంది. పార్టీలో అసంతృప్తి, అంతర్గత కలహాలు, కోర్టు కేసులు, ఆర్థిక సంక్షోభం.. అన్ని వర్గాలలోనూ వెల్లువెత్తుతున్న ప్రభుత్వ వ్యతిరేకత కలిపి ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ఫ్రెష్ మేండెట్ కోరడం ద్వారానే ఒకింత ఊరట పొంందావచ్చని జగన్ భావిస్తున్నట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా గురువారం (మే 11)  మంగళగిరిలో విలేకరులతో మాట్లాడుతూ  జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున తాను ఇక ఏపీలోనే ఉంటానని ప్రకటించారు. ఆయన పొత్తల గురించి ఎలాంటి శశబిషలూ లేకుండా క్లరిటీ ఇవ్వడం.. పొత్తులకు సీఎం పదవి అనేది ఎంత మాత్రం అవరోధం కాదనీ, తాను ఆ పదవి కోసం వెంపర్లాడటం లేదనీ రేసులో లేదనీ కూడా స్పష్టంగా చెప్పేసి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఐక్యంగా ముందుకు సాగడమే మిగిలిందని కుండబద్దలు కొట్టేశారు. పార్టీలో  పొత్తును ఇష్టపడని వారినీ, ఇతర వైసీపీ వ్యతిరేక పార్టీలలో ఏ పార్టీ అయినా పొత్తును వ్యతిరేకిస్తుంటే వారినీ ఒప్పించే బాధ్యత తానే తీసుకుంటున్నాననీ కూడా జనసేనాని విస్పష్టంగా చెప్పేశారు. దీంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల జరగడం ఖాయమన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా సన్నాహాలు ప్రారంభించేసినట్లు వార్తలు వినవస్తున్నాయి. ఇక జనసేనాని తన ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన వివరాలను కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. వచ్చే నెల 3 నుంచి తాను ఏపీలో నే ఉంటానని తేటతెల్లం చేయడం ద్వారా సినిమాలకు విరామం ఇచ్చేసినట్లేనన్న సంకేతాలిచ్చారు. దీంతో ముందస్తు ఎన్నికలకు సంబంధించిన స్పష్టమైన సమాచారం పవన్ కల్యాణ్ వద్ద ఉందని పరిశీలకులు అంటున్నారు.   మొత్తంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల  సెంట్రిక్ గానే పవన్  పొత్తులు, ముఖ్యమంత్రి పదవి గురించి తమ పార్టీ శ్రేణులకే కాకుండా అభిమానులకు కూడా ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వడం ద్వారా  పొత్తులపై అధికారిక ప్రకటన వచ్చే సమయానికి ఎటువంటి ఇబ్బందులూ, అసమ్మతులూ వెల్లువెత్తకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడ్డారన్న భావన రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నది. మొత్తం మీద పవన్ కల్యాణ్  పొత్తులు, పదవులు, సీట్ల పంపకం తదితర అంశాలపై ఇచ్చిన క్లారిటీ కారణంగా రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేనల పొత్తుకు ఒక సానుకూల వాతావరణాన్నీ, ఆ పొత్తుకు ఇరు పార్టీలే కాకుండా జనం సమ్మతిని ముందుగానే పొందే అవకాశం ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు. 

లెప్టినెంట్ గవర్నర్ పాలనా? ఢిల్లీ ప్రభుత్వ పాలనా?

  దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీ వంటి పాక్షిక రాష్ట్రానికి పరిపాలనలో తేడా ఉంటుంది. పార్లమెంటు ఆమోదంతో తయారైన చట్టాలు ఢిల్లీకి వర్తిస్తాయి. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల వలె ఢిల్లీ ముఖ్యమంత్రి పరిపాలన ఉండదు. దీనికి ప్రధాన కారణం ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం. చట్ట సభ ద్వారా అధికారంలో వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల వలె అధికారుల మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. అయితే ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్నికేంద్రం అణచి వేస్తుందా? మోదీ ప్రభుత్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కంటి నిండా నిద్ర లేకుండా చేస్తున్నారా? వంటి ప్రశ్నలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తమ రాష్ట్ర పరి పాలనా వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఆరోపిస్తూ ఇవ్వాళ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ ప్రభుత్వానికి తగిన న్యాయం చేయాలని ఆయన అభ్యర్థించారు.  కేంద్ర పాలనలో ఉండే చిన్న ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం అంటారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ప్రాంత పాలన ఉంటుంది. ఇప్పటి వరకు దేశంలో ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. దిల్లీ, పుదుచ్చేరి, అండమాన్-నికోబర్ దీవులు, దాద్రా-నగర్ హవేలీ, చంఢీగర్, డామన్-డయ్యూ, లక్షదీవులు. కొత్తగా నిర్ణయించిన జమ్మూ కశ్మీర్, లద్ధాఖ్‌ యూటీలు కూడా ఏర్పడితే కేంద్ర పాలిత ప్రాంతాలు తొమ్మిది అవుతాయి. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కలిగి ఉన్న పరిపాలనా విభాగంగా రాష్ట్రాలను నిర్వచిస్తారు. ఇవి సొంతంగా చట్టాలను రూపొందించుకోవచ్చు. పారిపాలన కోసం ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఉంటుంది. చట్ట సభ ఉంటుంది. రాజ్యసభకు ప్రాతినిధ్యం ఉంటుంది. కానీ, కేంద్ర పాలిత ప్రాంతం పాలన నేరుగా కేంద్ర చేపడుతుంది. శాసన సభ ఉన్న, లేని కేంద్రపాలిత ప్రాంతాలకు బేధం ఉంది.  దిల్లీ, పుదిచ్చేరి మాదిరిగా ఉన్న యూటీలకు శాసన సభ ఉంటుంది. ఎన్నుకున్న ఎమ్మేల్యేలు ఉంటారు. అయితే, ఎగువ సభ(విధాన సభ) ఉండదు. తుది నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటుంది. ఈయనను కేంద్రం నియమిస్తుంది. చట్టసభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఒక విధంగా పాక్షిక రాష్ట్రం అని చెప్పొచ్చు. లెఫ్టినెంట్ గవర్నర్ తమ ప్రభుత్వాన్ని వేధింపులకు గురి చేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రధాన ఆరోపణ. చాలా కాలంగా ఈ వివాదం ఉంది. ఇవ్వాళ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సుప్రీం కోర్టు ను ఆశ్రయించే ఒక రోజు ముందు సుప్రీం ఆయనకు ఊరట కలిగించే ఆదేశాలు జారి చేసింది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి విశేష అధికారాలు ఉంటాయని ఈ ఆదేశాల ముఖ్య ఉద్దేశ్యం.   అధికారుల బదిలీలు, పోస్టింగ్ ల విషయంలో లెప్టినెంట్ గవర్నర్ జోక్యం బాగా పెరిగిపోయిందని కే జ్రీవాల్ మరొకసారి సుప్రీంను ఆశ్రయించారు. కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించడంతో కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఉండే అధికారాలు  ఎంతవరకు  అనే అంశంపై ప్రత్యేక చర్చకు అంకురార్పణ జరిగినట్టయ్యింది.