వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఇక దబిడి దిబిడే
ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయిందా? బీజేపీ కలిసినా కలవకపోయినా తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తు గ్యారంటీయేనా? అంటే ఈ రెండు పార్టీల నుంచీ కూడా ఔననే సమాధానం వస్తోంది. ఎన్నికలకు ఇంకా బోలెడు సమయం ఉన్నా.. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది. దీంతో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు, సీట్ల సర్దుబాటు వంటి అంశాల విషయంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చేశాయని ఆ పార్టీ వర్గాల నుంచే వినవస్తోంది. యిప్పటికే ఏవో రెండు మూడు జిల్లాలలో ఒకటి రెండు నియోజకవర్గాల విషయంలో తప్ప పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలు దాదాపు ఖరారైపోయాయని కూడా చెబుతున్నారు.
2019 ఎన్నికల నాటితో పోలిస్తే ప్రస్తుతం ఏపీలో జనసేన బలం పెరిగిందన్న అంచనాల నేపథ్యంలో పొత్తులో భాగంగా సీట్ల పంపకాలపై జరిగిన చర్చలలో తెలుగుదేశం, జనసేనల మధ్య రెండు పార్టీలకూ ఆమోదయోగ్యంగా ఒప్పందం దాదాపుగా కొలిక్కి వచ్చిందని అంటున్నారు. హీరోగా, పొలిటీషియన్ గా జనసేనాని పవన్ కల్యాణ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎక్కడికి వెళ్లినా పెద్ద సంఖ్యలోనే ప్రజలు ఆయన సభలకు హాజరౌతున్నారు. తెలుగు రాష్ట్రాలలో అత్యంత జనాకర్షణ ఉన్న నేతలలో పవన్ కల్యాణ్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటారు.
అయితే ఈ జనాకర్షణ ఎన్నికలలో విజయానికి దోహదపడుతుందా అంటే మాత్రం కచ్చితంగా ఔనన్న సమాధానం రాదు. గత ఎన్నికలలో 130కి పైగా స్థానాలలో పోటీ చేసిన జనసేన కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించింది. ప్రస్తుతం కూడా ఆ పార్టీకి జనాదరణ పెరిగినా ఒంటరిగా ఎన్నికల సమరాంగణంలో గెలిచేంత బలం లేదని పరిశీలకులు మాత్రమే కాదు.. జనసేన వర్గాలు సైతం అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే 2014 ఎన్నికలలో వలె తమ పార్టీ ఓట్ల చీలికకు అవకాశం లేని పాత్ర పోషించాలని జనసేనాని సైతం చెబుతున్నారు. అయితే అప్పటి మాదిరిగా పోటీకి దూరంగా ఉండి మద్దతు తెలపడం కాకుండా తమ పార్టీ బలానికి తగ్గట్టుగా ఎంపిక చేసిన నియోజకవర్గాలలో పోటీ చేయాలని నిర్ణయించారు. ఆ నేపథ్యంలోనే ఆయన గత కొంత కాలం నుంచీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనిచ్చేది లేదని చెబుతూ వస్తున్నారు. ఆయన అన్నఆ మాటతోనే ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల చర్చ తెరమీదకు వచ్చింది. యిక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీ ఆవిర్భవించి పుష్కర కాలం గడిచినా ఇప్పటికీ సంస్థాగత నిర్మాణం జగరలేదు. అలాగే జనసేన పార్టీకి సంబంధించినంత వరకూ పవన్ కల్యాణ్ వినా మరో నాయకుడు కనిపించరు. జనసేన అంటే పవన్ కళ్యాణ్ అంతే. రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నా.. ఆయన క్రౌడ్ పుల్లర్ కాదు. వీరిద్దరినీ మినహాయిస్తే మిగిలిన నాయకులకు పెద్దగా జనంలో గుర్తింపు ఉన్న దాఖలాలు లేవు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించినప్పుడు ఆయన మొదటి నుంచీ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారు. గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకూ పార్టీ నిర్మాణం చేశారు.
శిక్షణ శిబిరాలు నిర్వహించి, సభ్యత్వాల నమోదుపైనా దృష్టి సారించారు. ఆ తరువాత పార్టీలో చంద్రబాబు కార్యకర్తల వివరాలు, పార్టీ కార్యక్రమాలను కంప్యూటరైజ్ చేశారు. శిక్షణ శిబిరాలను కిందిస్థాయి వరకూ తీసుకువెళ్లారు. అందుకే నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంది. అందుకే తెలుగుదేశం అధికారంలో ఉన్నా, లేకపోయినా.. రాజకీయాల్లో తన గుర్తింపు బలంగా చాటుకుని, స్థిరంగా నిలిచింది.
ఏ రాజకీయ పార్టీ అయిన పదికాలాలు నిలవాలంటే, సంస్థాగత నిర్మాణం అవసరం. అది లేక పోవడమే జనసేన లోపం. ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీ వచ్చే ఎన్నికలలో ఒంటరిగా ఎన్నికల బరిలో దిగితే, 2019 ఫలితాలే పునరావృతం అవుతాయి. అంతే కాదు, జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, ఫలితంలో మార్పు ఉండదు. బీజేపీ దేశంలో బలమైన శక్తి కావచ్చును, కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం బీజేపీకి నిండా ఒక శాతం ఓటు బలం కూడా లేదు. అందుకే వైసీపీని ఓడించే శక్తి ఒక్క టీడీపీకి తప్ప మరో పార్టీకి లేదు. సో .. వైసీపీని ఓడించి, జగన్ రెడ్డి పాలనకు ముగింపు పలకడమే జనసేన లక్ష్యం అన్న పవన్ కళ్యాణ్ ముందున్న ఏకైక ఆప్షన్ తెలుగుదేశం పార్టీతో అవగాహన కుదుర్చుకోవడం ఒక్కటే. అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా వచ్చే ఎన్నికలలో ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీ గెలుపును అడ్డుకోవాలన్న లక్ష్యం నెరవేరాలంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న జనసేనను కలుపుకుని పోవడం ఆ పార్టీకీ అవసరమే. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల మధ్యా పొత్తు పొడుపుకు మార్గం సుగమమయ్యేలా చర్చల ప్రక్రియకు తెరలేచింది. అందులో భాగంగానే ఇప్పటికే చాలా వరకూ ఒక అవగాహన కుదిరింది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఇప్పటికే ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటు కూడా చాలా వరకూ ఖరారైందని చెబుతున్నారు.
పొత్తులో భాగంగా ఏడు జిల్లాలలో 20 స్థానాలలో జనసేన పోటీ చేస్తుందని చెబుతున్నారు. మిగిలిన జిల్లాలలో సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అవగాహన కుదిరిన స్థానాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో తెనాలి, సత్తెన పల్లి, కృష్ణా జిల్లాలో పెడన, కైకలూరు, విజయవాడ వెస్ట్, తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం, పి. గన్నవరం, రాజోలు, రాజానగరం, కాకినాడ రూరల్ నియోజకవర్గాలలోనూ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నరసాపురం, తాడేపల్ల్లిగూడెం, పాలకొల్లు నియోజకవర్గాలలోనూ జనసేన అభ్యర్థులు రంగంలో ఉంటారు. ఇక విశాఖ జిల్లాలో పెందుర్తి, భీమిలి, గాజువాక, చోడవరం నియోజకవర్గాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు లేదా తిరుపతిలో పొత్తలో భాగంగా జనసేన పోటీ చేస్తుంది. ప్రకాశం జిల్లా లోని దర్శి, గిద్దలూరు స్థానాలను తెలుగుదేశం జనసేనకు కేటాయించింది. నెల్లూరు, విజయనగరం, అనంతపురం జిల్లాలలో సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నాయి. మొత్తం మీద వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేనల పొత్తు ఖాయమని ఆ రెండు పార్టీలూ కూడా ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నాయి.
పొత్తు చర్చల్లో భాగంగా జనసేన 60 స్థానాల నుంచి బేరాలు మొదలు పెట్టిందని చెబుతున్నారు. అయితే హేతుబద్ధత ఆధారంగా రెండు మూడు చర్చల అనంతరం ఆ సంఖ్యను బాగా కుదించుకుని పాతిక స్థానాలకు ఆమోదం తెలిపిందని అంటున్నారు. కానీ గత ఐదు సంవత్సరాలుగా.. కష్టనష్టాలను తట్టుకుని, ప్రభుత్వ అణచివేత చర్యలను ఎదుర్కొని పార్టీ కోసం బలంగా నిలబడిన తెలుగుదేశం నాయకుల నుంచి ఆ సంఖ్యలో స్థానాలను వదులు కోవడం యిష్టం ఉండకపోవడంతో.. చర్చల సమయంలో జనసేన కోరుకున్నా యివ్వలేని స్థానాలపై మరో సారి చర్చించాలన్న అంగీకారానికి యిరు పార్టీలూ వచ్చాయని చెబుతున్నారు. మొత్తం మీద సీట్ల సర్దు బాటులో ఒకటి రెండు స్థానాల విషయంలో ప్రతిష్ఠంభన ఏర్పడినా పోత్తు విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి ముందే యిరు పార్టీల మధ్యా సీట్ల విషయంలో ఒక ఒప్పందం కుదిరిపోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంలో భాగస్వామ్యం, మంత్రివర్గంలో బెర్తులు వంటి అంశాలపై జనసైనికులెవరూ మాట్లాడవద్దని జనసేనానిని స్పష్టమైన ఆదేశాలిచ్చారనీ, అందుకే ఆ విషయాల జోలికి వెళ్ల కుండా క్షేత్ర స్థాయిలో తెలుగుదేశంతో కలిసి పని చేయడంపైనే పవన్ పార్టీ దృష్టి పెట్టిందనీ చెబుతున్నారు. లోకేష్ పాదయాత్రలో జనసేన జెండాల రెపరెపలు, స్థానిక సమస్యలపై ఐక్య పోరాటాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.