ఇలాంటి తీర్పులు కూడా ఉంటాయా? తలపట్టుకున్న సీజేఐ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పట్టికుదిపేస్తున్న వివేకా హత్య కేసులో రోజుకో ట్విస్టు బయటపడుతోంది.  అలాగే ప్రతి అంశమూ ఆసక్తిగా మారుతోంది.  చివరికి హైకోర్టు సుప్రీం కోర్టులను కూడా ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తన్న వివేకా హత్య కేసులో తాజాగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గత కొంత కాలంగా బెయిలుపై ఉన్న వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడు గంగిరెడ్డి బెయిలును రద్దు చేస్తూ  ఈ నెల 5వ తేదీలోగా లొంగిపోవాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఈ నెల 5న లొంగిపోయారు. అప్పటి నుంచీ జైలులోనే ఉన్నారు.  అయితే తాజాగా ఎర్రగంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టు  గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది.  గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన హైకోర్టు జులై 1న మళ్లీ విడుదల చేయాలని సిబిఐ కోర్టుకు ఉత్తరువులు ఇచ్చింది. వివేకా హత్య కేసులో జూన్ 30వ తేదీతో దర్యాప్తు ముగించాలని సుప్రీం ఆదేశించినందువల్ల జులై 1న గంగిరెడ్డిని బెయిల్ పై విడుదల చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సుప్రీం ను ఆశ్రయించారు. సునీత పిటిషన్ ను విచారించిన సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలాంటి తీర్పులు కూడా ఉంటాయా అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తల పట్టుకున్నారు.  ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి విచారణను వెకేషన్ బెంచ్ కు బదిలీ చేశారు. ఈ కేసు విచారణ వచ్చే వారం వెకేషన్ బెంచ్ చేపట్టనుంది.  

కుక్క రాజకీయాల విందు

రాజకీయ పార్టీలు ఒకరు మీద మరొకరు ఆరోపణలూ ఆక్షేపణలూ చేసుకోవడం మామూలే.! బిహార్ లోని బీజేపీ నేత విజయ్‌ కుమార్‌ సిన్హా జేడీయూ నేత లాలన్ సింగ్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. వ్యాపారంలో కాంపిటేషన్ వస్తున్న హోటల్ ను దెబ్బతీయాలన్న అక్కసుతో మరో కాంపిటేటర్ ఇలాగే కుక్క బిర్యానీ సప్లయ్ చేస్తున్నట్లు కొన్ని సంవత్సరాల క్రితం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. విషయం ఏంటంటే బిహార్ లోని జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడు లాలన్ సింగ్ ఈ నెల 14న ముంగేర్‌లో పార్టీ కార్యకర్తలకు మాంసంతో కూడిన విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.ఈ సందర్భంగా కొందరు కర్రలతో కొట్టుకున్నారు. ఈ సిచ్యుయేషన్ని అడ్వాంటేజ్ తీసుకుని తన అక్కసు వెళ్లగక్కారు బీజేపీ నేత విజయ్‌ కుమార్‌ సిన్హా. జేడీయూ మటన్‌ విందు పార్టీ తర్వాత వందలాది కుక్కలు మాయమయ్యాయంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.జేడీయూ కార్యకర్తలకు కుక్క మాంసంతో విందు ఇచ్చినట్లు పరోక్షంగా ఆయన ఆరోపించారు. అలాగే మద్యం కూడా సరఫరా చేసి ఉంటారని, దీనిపై దర్యాప్తు జరుపాలని డిమాండ్‌ చేశారు.కాగా, జేడీయూ కార్యకర్తలకు ఇచ్చిన ఈ విందుపై బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హా బుధవారం వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ విందు పార్టీ తర్వాత నగరంలో వందల సంఖ్యలో కుక్కలు మాయమైనట్లు చాలా మంది తనకు చెప్పారని అన్నారు.ఆ పార్టీ కార్యకర్తలకు వేలాది జంతువుల మాంసంతో విందు ఇచ్చారని ఆయన ఆరోపించారు. దీని వల్ల ఏ వ్యాధి వ్యాపిస్తుందో అని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే జేడీయూ కార్యకర్తలకు విందు సందర్భంగా మద్యం కూడా సరఫరా చేశారా లేదా అన్నదానిపై దర్యాప్తు జరుపాలని డిమాండ్‌ చేశారు.మరోవైపు బీజేపీ నేత విజయ్‌ కుమార్‌ సిన్హా చేసిన ఈ వ్యాఖ్యల వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.దీనిపై జేడీయూ స్పందించింది.మానసిక పరిస్థితి సరిగా లేక ఆయన ఇలా మాట్లాడుతున్నారని జేడీయూ అధికార ప్రతినిధి అభిషేక్ ఝా విమర్శించారు. తన ప్రజలకు ఇచ్చే విందులో ఏ జంతువు మాంసాన్ని వడ్డిస్తారో విజయ్ కుమార్ సిన్హా చెప్పాలని అన్నారు. ఈ వార్త చదివిన తర్వాత రాజకీయ పార్టీలు పెట్టే విందులు, వినోదాలకు ప్రత్యర్థి పార్టీలు భయంతో డుమ్మా కొడతాయేమో ...

దళిత వోట్లు చీలకుండా జాగ్రత్తలు

బిఆర్ఎస్ దళిత వోట్ల మీద ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇటీవలె బిఎస్పి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ముఖ్యఅతిథిగా రావడాన్ని బిఆర్ఎస్  వర్గాలకు నచ్చలేదు. ఎందుకంటే తెలంగాణ రాజధానిలో బిఎస్పి బహింరంగ సభ పెట్టడాన్ని బిఆర్ఎస్ మనసు మీద తీసుకుంది. ఎందుకంటే బిఎస్పి అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ మాజీ ఐపిఎస్ అధికారి. ఉద్యోగానికి రాజీనామా చేసి  రాజకీయాల్లో వచ్చిన ధీరుడాయన. తెలంగాణ జిల్లాల్లో ఆయన కలియ తిరుగుతూ కెసిఆర్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. పరుషంగా కూడా మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ దాడిని బిఆర్ఎస్ శ్రేణులు అంత బలంగా  తిప్పి కొట్టలేకపోతున్నాయి. ధర్మ సమాజ్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా దళిత పార్టీలే. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ దళిత పార్టీలు తమ అభ్యర్థులను రంగంలో దించుతున్నాయి. ఒకప్పుడు దళిత సంఘాలుగా ఉన్న ఈ సంఘాలు రాజకీయ పార్టీలుగా అవతరించాయి. దళిత హక్కుల కోసం ఉద్యమాలు చేసిన సంఘాలు రాజకీయ పార్టీలుగా అవతరించి వోటరు తీర్పును ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాయి.  దళిత బంధు వంటి పథకాన్ని పరిచయం చేసిన బిఆర్ ఎస్ కూడా ఇటీవలె విమర్శల పాలైంది. పార్టీ అధినేత కేసీఆర్ డైరెక్టుగా తన పార్టీ శాసనసభ్యులే కమీషన్లకు కక్కుర్త పడుతున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలు ప్రతి పక్షాలకు అస్త్రం దొరికినట్టయ్యింది. దళిత వర్గానికి చెందిన ఎంఎల్ఏ ప్రస్తుతం తెలంగాణ పిసిసి శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాంగ్రెస్ పార్టీలో పాపులర్ నేత అతను. ఆయన చేపట్టిన పాదయాత్ర రికార్డుల్లో కెక్కింది కూడా.    ప్రస్తుతం అస్తిత్వంలో ఉన్న రాజకీయ పార్టీలకు తోడు కొత్తగా వచ్చిన దళిత పార్టీలు బిఆర్ఎస్ ను ఏ మేరకు దెబ్బతీస్తాయో వేచి చూడాలి.

మనకు బిజెపి ప్రధాన శత్రువు

యుపిఏ భాగస్వామ్య పార్టీలలో చేరే పార్టీలు, చేరబోయే పార్టీలు కర్ణాటక ఫలితాలను సమర్ధిస్తున్నాయి. బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్  కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  2021 హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కెసీఆర్ బిజెపిని టార్గెట్ గా పెట్టుకున్నారు. సిట్టింగ్ బిఆర్ఎస్ స్థానం బిజెపి చేతిలోకి వెళ్లడాన్నిఅప్పట్నుంచి  కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు.  తెలంగాణ భవన్ లో ఎంఎల్ఏ, ఎంఎల్సి, ఎంపీల సమావేశంలో కేసీఆర్ అన్న మాటల ప్రకారం మనకు బిజెపి ప్రధాన శత్రువు అని సంభోధించారు. కర్ణాటకలో బీజెపి పరాజయాన్ని బీఆర్ఎస్ విజయంగా భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బిగ్ విక్టరీ అయినప్పటికీ ఆయన పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. కాకపోతే తెలంగాణలో ఆ పార్టీ ప్రభావం లేకుండా ఉండాలన్నది కెసీఆర్ అభిమతం. కర్ణాటక ఎన్నికల ఫలితాల సమయంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యుకెలో ఉన్నారు. ఫలితాలు బిజెపికి అనుకూలంగా వచ్చిన్పటికీ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇస్తూ ట్విట్టర్ వేదికగా సందేశం ఇచ్చారు. కర్ణాటక ప్రభావం తెలంగాణలో ఉండదు అని కార్యకర్తలకు మనో ధైర్యాన్నిచ్చింది.  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సీట్లు ఎగరేసుకుపోతుంది అన్న భయం కావొచ్చు కెసీఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ ప్రజలకు ఏం చేయలేదు అని కెసీఆర్ సెలవిచ్చారు. కేంద్రంలో యుపిఏ ప్రఢుత్వం ఉన్న సమయాన ప్రత్యేక తెలంగా ణ రాష్ట్ర సాధ్యమయ్యింది. కాబట్టి యుపిఏ ప్రభుత్వాన్ని అంత ఘాటుగా కెసీఆర్ ఆరిపోసుకోవడం లేదు కెసిఆర్. 

జర..సబర్ కరో కాంగ్రెస్ కు పీకే హెచ్చరిక !

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. అయితే, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పెద్ద విషయం కాదు. విశేషం అసలే కాదు. కర్ణాటక ఓటర్లు గడచిన నాలుగు దశాబ్దాలుగా  ప్రతి ఎన్నికల్లోనూ  మార్పు  కు పట్టం కడుతున్నారు. మళ్ళీ మరో మారు అదే ఆనవాయితీ కొనసాగించారు.  మే 10 తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ(బీజేపీ)ని కాదని, ప్రతిపక్ష (కాంగ్రెస్) పార్టీకి పట్టం కట్టారు. సో కర్ణాటకలో కాంగ్రెస్ విజయం అనూహ్యం కాదని అనుకోవచ్చును.  కానీ కాదు. ఎందుకంటే, ఈ ఎన్నికల్లో కర్ణాటక ఓటర్లు కాంగ్రెస్ ను గెలిపించ లేదు.  బీజేపీని ఓడించారు. మోడీ షా జోడీ కి షాకిచ్చారు.  ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్ అంచనాలను తల్లకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేని ఆధిక్యత ఇచ్చారు. హంగ్ ఆశలనే కాదు, అత్తెసరు మార్కులతో కాంగ్రెస్ గట్టెక్కుతుందనే అంచనాలను కర్ణాటక ఓటర్లు వమ్ము చేశారు. అలాగే  2018  ఆపరేషన్ కమల్  రీప్లే  చేసే అవకాశం కమల దళానికి లేకుండా చేశారు.  కాంగ్రెస్ పార్టీని భారీ (135/224) మెజారిటీతో గెలిపించారు. బీజేపీ అందులో సగానికంటే తక్కువకు (66) సీట్లకు పరిమితం చేశారు. సుస్థిర పాలన అందించే చక్కని అవకాశం హస్తం పార్టీ  చేతి కిచ్చారు.  సరే ... ముఖ్యమంత్రి ఎంపిక విషయంలోనే మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీ  ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమేరకు నిలబెట్టుకుంటుంది. ప్రజలు పార్టీకి ఇచ్చిన చక్కని అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటుంది  అనే విషయాన్ని పక్కన పెడితే కర్ణాటక గెలుపు అక్కడితో ఆగుతుందా, ఇక్కడి నుంచి 2024లో జరగనునున్న లోక్ సభ ఎన్నికలవరకు జరిగే మరో ఎనిమిది తొమ్మిది రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల వరకూ కొనసాగుతుందా  అనే చర్చ ఇప్పుడు జాతీయ రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తోంది. నిజానికి ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరో రాష్ట్రంలో అదే విధంగా జాతీయ ఎన్నికల రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనేది అన్ని సందర్భాలలో ఒకేలా ఉండదు. అయితే జాతీయ స్థాయిలో అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక ఫలితాలు  ప్రాణ వాయువు (ఆక్సిజన్) అందించాయి అనడంలో సందేహం లేదు. అయితే  కర్ణాటక విజయంతో ఏకంగా ఢిల్లీ పీఠం చే జిక్కింది అనుకోవడం, అయితే అజ్ఞానం కాదంటే అమాయకత్వంతో కూడిన అహంకారం అనిపించుకుంటుందని  కాంగ్రెస్ శ్రేయోభిలాషులు సైతం అంటున్నారు.   అదలా ఉంటే ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్ కిశోర్  కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను ఒక విధంగా,  ‘సబర్ కరో’ అని హెచ్చరిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల గెలుపు 2024 లోక్ సభ ఎన్నికల విజయానికి ముందస్తు సంకేతం అనుకోవద్దని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన 2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినా  2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాదించిన నిజాన్ని కాంగ్రెస్ శ్రేణులు మరిచి పోరాదని ప్రశాంత కిశోర్  హెచ్చరించారు. అలాగే, 2019 లోక్ సభ ఎన్నికలకు సంవత్సరం ముందు మూడు కీలక రాష్త్రాలు మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ  లోక్ సభ ఎన్నికల్లో మరో మారు చతికిలపడిన వాస్తవాన్ని విస్మరించరాదని ప్రశాంత్ కిశోర్  పేర్కొన్నారు. అలాగే 2012లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది కానీ  ఆ తర్వాత రెండేళ్ళకు 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో  బీజేపీ 80 స్థానలకు 73 సీట్లు గెల్చుకున విషయాన్ని గుర్తు చేశారు. నిజానికి  ఒక ఎన్నిక ఫలితాలు మరో ఎన్నికల ఫలితాలను కొంత వరకు ప్రభావితం చేస్తే చేయవచ్చు కానీ, కర్ణాటకలో గెలిచాము కాబట్టి  తెలంగాణలో, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ చివరకు 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుందన్న నిర్ణయానికి రావడం అంత శ్రేయస్కరం కాదని  ప్రశాంత కిశోర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు.

గాయపడ్డ నారా లోకేష్.. భుజానికి స్కానింగ్

నదీ నదాలూ, అడవులు, కొండలు, ఎడారులా మన కడ్డంకి? పదండి ముందుకు! అన్నట్లుగా లోకేష్ పాదయాత్ర సాగుతోంది. ప్రభుత్వ అవరోధాలనే కాదు, గయాలను కూడా లేక్క చేయకుండా.. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమే లక్ష్యంగా లోకేష్ ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే గత 50 రోజులుగా భుజం నొప్పి తీవ్రంగా వేధిస్తున్నా.. క్షణం కూడా విశ్రమించకుండా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ముఖంలో బాధ, అలసట కూడా కనిపించనీయకుండా ప్రజలతో మమేకమౌతూ, కొరిన వారందరితో సెల్ఫీలు దిగుతూ, వారు చెబుతున్న సమస్యలను సావధానంగా వింటూ విరామం లేకుండా నడుస్తూనే ఉన్నారు.  భుజం నొప్పి నుంచి ఉపశమనం కోసం ఫిజియో థెరపీ చేయించుకున్నా, వైద్యులు సూచనలు పాటించినా ఫలితం లేకపోయింది. దీంతో  వైద్యుల సూచన మేరకు ఆయన ఈ రోజు నంద్యాలలోని మాగ్న ఎంఆర్ఐ సెంటర్ లో స్కానింగ్ చేయించుకున్నారు.  లోకేష్ పాదయాత్ర అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో ప్రవేశించిన సమయంలో భారీగా జనం తరలి రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఆయన భుజానికి గాయమైంది. అప్పటి నుంచీ ఈ 50 రోజులుగా లోకేష్ భుజం నొప్పితోనూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఫిజియో థెరపీ, నొప్పి ఉపశమనం కోసం వైద్యుల సూచనలూ పాటిస్తూ వస్తున్నారు. అయితే నొప్పి తగ్గక పోవడంతో వైద్యులు ఎంఆర్ఐ స్కానింగ్ అవసరమని చెప్పడంతో ఈ రోజు నంద్యాలలో ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నారు. నారా లోకేష్ పాదయాత్ర ఈ రోజు 103వ రోజుకు చేరుకుంది.  లోకేష్ పాదయాత్ర సందర్భంగా  నంద్యాల జనసంద్రంగా మారింది.  భుజం నొప్పి తీవ్రంగా ఉన్నా ఆయన సంకల్పం సడలలేదు. భుజానికి ఎంఆర్ఐ స్కానింగ్ కారణంగా ఈ రోజు పాదయాత్రలో రైతులతో ముఖాముఖీ కార్యక్రమాన్ని మధ్యాహ్నం రెండు గంటలకు చేపట్టాలని లోకేష్ నిర్ణయించారు. ఆ తరువాత నంద్యాల యాతం ఫంక్షన్ హాలు వద్ద తన పాదయాత్ర 1300 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా మైలురాయిని ఆవిష్కరిస్తారు. అక్కడ నుంచి ఆయన కానాల జాతీయ రహదారి విస్తరణ బాధితులతో సమావేశమౌతారు. సాయంత్రానికి హెచ్ఎస్ కొట్టాల చేరుకుని అక్కడ స్థానికులతో సమావేశమౌతారు. అనంతరం ఎం చిన్న కొట్టాలలో కూడా స్థానికులతో భేటీ అవుతారు. అక్కడ నుంచి జూలపల్లి చేరుకుని వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారితే భేటీ అవుతారు. అక్కడ నుంచి పసరుపాడు మీదుగా తెల్లాపురి చేరుకుంటారు. తెల్లాపురి నుంచి రాయపాడు చేరుకుని అక్కడ స్థానికులతో సమావేశమౌతారు. రాత్రికి రాయపాడు శివారు విడిది కేంద్రంలో బస చేస్తారు. ఉదయం స్కానింగ్ కారణంగా పాదయాత్ర ఆలస్యం కావడంతో ఆమేర ఆయన షెడ్యూల్ లో మార్పు చేసుకుని రాత్రి పదిన్నర వరకూ పాదయాత్రను కొనసాగించాలని నిర్ణయించారు. 

యాజమాన్య హక్కులు లేని పట్టాలతో పేదలకు ఒరిగేదేంటి?

ఆర్5 జోన్ లో  పేదలకు పట్టాల పంపిణీకి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అక్కడ పేదలకు సెంటు భూమి చొప్పున పట్టాల పంపిణీకి మార్గం సుగమైంది. ఇందుకు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. పేదలకు ప్రభుత్వం భూములు పంపిణీ చేయకుండా నిలుపుదల చేయలేమని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు కూడా నిరాకరించింది. అదే సమయంలో హై కోర్టు తీర్పులో కొన్ని సవరణలు చేసింది. ప్రభుత్వం భూ పందేరం చేయవచ్చు కానీ, లబ్ధి దారులకు భూ యాజమాన్య హక్కులు దఖలు పడవని పేర్కొంది. అమరావతి పిటిషన్ల విచారణ పూర్తయ్యి తుది తీర్పు వెలువడిన తరువాత ఆ తీర్పునకు లోబడి మాత్రమే ఆ హక్కుల ఉంటాయని విస్పష్టంగా పేర్కొంది.  అంటే ప్రభుత్వం పట్టాలిస్తుంది.. ఆ భూములపై లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు ఉండవు. క్రయ విక్రయాలు జరపడానికి వీలు లేదు. అమరావతి పిటిషన్లపై జూలైలో విచారణ జరగాల్సి ఉంది.  ఒక వేళ అమరావతి రైతులకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు వస్తే పేదలు బలైపోతారు. నిజానికి ప్రభుత్వం ఇవ్వదల్చుకుంటే బయట ఎక్కడైనా ఇవ్వొచ్చు. కానీ ఇతర ప్రాంతాల వారికి అమరావతిలోనే .. రైతులు ఇచ్చిన భూములనే ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం రాజధాని అమరావతి కోసం ఉద్యమం చేసిన రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలో భాగమే అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇది అయ్యే పనేనా సజ్జలా?

రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా తయారౌతోంది. ఇప్పటికే వైసీసీ నేతలెవరూ  ముఖ్యమంత్రి జగన్ సహా ప్రజలలోకి వెళ్లేందుకు ధైర్యం చేయడం లేదు. తమ వాచాలతను ప్రదర్శించడానికి  మీడియా సమావేశాలను ఉపయోగించుకుంటున్నారు. చివరాఖరికి ముఖ్యమంత్రి కూడా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి సొమ్ములు జమ చేయడానికి అంటే ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభల నుంచి జనం పారిపోతున్నా.. పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ మిగిలిన జనానికే తన ఫ్రస్ట్రేషన్ అంతా ప్రదర్శిస్తూ విపక్షాలను తిట్టిపోస్తున్నారు. పార్టీ పరంగా సభలూ, సమావేశాలూ నిర్వహించే ధైర్యం సన్నగిల్ల ప్రభుత్వ కార్యక్రమాలనే పార్టీ కార్యక్రమాలుగా మార్చేసుకుని విపక్ష నేతలపై విమర్శలు గుప్పించి తమ జబ్బలు తామే చరుచుకుంటున్నారు. వైనాట్ 175 నుంచి మీ బిడ్డను నేను.. విపక్షాని ఓటు వేయకండని బతిమలాడుకుంటున్నారు. సింహం సింగిల్ గా వస్తుంది.. దమ్ముంటే తెలుగుదేశం, జనసేనలు విడివిడిగా ఎన్నికల రణరంగంలో పోటీ చేయండి అంటూ సవాళ్లు విసిరిన జగన్ ఇప్పుడు.. బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతూ హస్తినలో  కమలం పార్టీ అగ్రనేతల అప్పాయింట్ మెంట్ కోసం చకోరపక్షిలా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికార వైసీపీపై వాడవాడలా చార్జిషీట్లు విడుదల చేస్తూ ఎక్కడికక్కడ వైసీపీ నేతల దుర్మార్గాలను ఎండగడుతుంటే.. వైసీపీ అధినేత జగన్ మాత్రం బీజేపీ పెద్దల ప్రాపకం కోసం తహతహలాడుతున్నారు. అదలా ఉంచితే.. తాము జనంలోకి వెళ్లే అవకాశం లేకపోవడాన్ని వైసీపీ పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ.. విపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ జనంలో తిరగడం, వారికి ప్రజలు బ్రహ్మరథం పట్టడం భరించ లేకపోతున్నారు. విపక్ష నేతల సభలను రోడ్ షోలను అడ్డుకోవడానికి తీసుకువచ్చిన జీవో నంబర్ 1ను కోర్టు     కొట్టివేయడంతో  వైసీపీలో అసహనం అవధులు దాటింది. జీవో నంబర్ 1 చెల్లదని చెప్పినది న్యాయస్థానం అన్న విషయాన్ని మరచిపోయి.. చంద్రబాబు సభలకు, రోడ్ షోలకు అనుమతులిచ్చి ఇంకా ఎంత మంది ప్రాణాలు తీయమంటారు? అని ప్రశ్నిస్తోంది. రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన హక్కులను కాదనడం సాధ్యం కాదని గూబ గుయ్యిమనేలా న్యాయస్తానం విస్పష్ట తీర్పు ఇచ్చినా తత్వం బోధపడలేదు. సకల శాఖల మంత్రి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోర్టు తీర్పు తరువాత  విపక్షాల సభలు, సమావేశాలను అడ్డుకోవడానికి చట్టం తీసుకువస్తామని సెలవిచ్చారు. ఇందు కోసం న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామన్నారు. అసలు చంద్రబాబు పాల్గొన్న రెండు కార్యక్రమాలలో అవాంఛనీయ సంఘటనలు జరగడం , ఆ వెంటనే ఆఘమేఘాల మీద జీవో రావడం వెనుక కుట్ర ఉందా అన్న అనుమానాలను పరిశీలకులు అప్పట్లోనే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగానే.. సజ్జల సభలను, రోడ్ షోలను అడ్డుకోవడానికి చట్టం తీసుకువస్తామనడం ఉందని విశ్లేషిస్తున్నారు.  

గెలిచి ఓడిన కాంగ్రెస్.. ఓడి గెలిచిన డీకే

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు స్పష్టమైన మెజార్టీ ఇచ్చినా.. ఎవరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెట్టాలన్న విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ పడిన మల్లగుల్లాలు ఆ పార్టీ సంస్కృతికి తగినట్లుగానే ఉన్నాయి.  మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌  రాజీ కుదర్చడానికి కాంగ్రెస్ హై కమాండ్ కు  ఐదు రోజులు పట్టింది. సుదీర్ఘ మంతనాలు, డీకే, సిద్ధరామయ్యలతో ముఖాముఖి చర్చల అనంతరం ఎట్టకేలకు సిద్ధరామయ్యను కాంగ్రెస్ హై కమాండ్ ముఖ్యమంత్రిగా నిర్ణయించింది.  కాంగ్రెస్  అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ,  ఆ తరువాత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ సిద్దరామయ్య, శివకుమార్‌లతో వేర్వేరుగా భేటీ  ఒకటికి రెండు సార్లు భేటీ అయ్యారు. సుధీర్ఘంగా మంతనాలు జరిపారు. అలాగే పార్టీ సీనియర్‌ నేతలు, కర్ణాటక నాయకులతో సైతం  సమాలోచనలు జరిపారు.  సిద్దరామయ్య మంగళవారమే (మే 16) ఢిల్లీకి చేరుకోగా.. డీకే మాత్రం బుధవారం (మే 17) ఢిల్లీ చేరుకున్నారు.  డీకే కర్నాటక కాంగ్రెస్ విజయం క్రెడిట్ మొత్తం తనదే అని క్లెయిమ్ చేసుకోవడమే కాకుండా.. ఒక వేళ సీఎం పదవికి సిద్దరామయ్య అనే అధిష్ఠానం నిర్ణయిస్తే తనకు పదవులు వద్దనీ, సాధారణ ఎమ్మెల్యేగానే కొనసాగిస్తానని నిష్కర్షగా చెప్పేశారని కూడా ఒక సమయంలో వార్తలు వినవచ్చాయి.   సిద్దరామయ్యకు  ఇప్పటికే ఒకసారి అవకాశమిచ్చారని.. ఐదేళ్లు ఆయన సీఎంగా అధికారం లో ఉండి సాగించి4న దుష్పరిపాలన కారణంగానే కాంగ్రెస్ కర్నాటకలో విపక్షానికి పరిమితం కావాల్సి వచ్చిందని డీకే శివకుమార్ ఈ సందర్భంగా అధిష్టానం వద్ద ప్రస్తావించారని కూడా ప్రచారం జరిగింది.   2019లో కాంగ్రెస్, జేడీఎస్‌ సంకీర్ణం కుప్పకూలాక రాష్ట్రంలో పార్టీని తానే పునర్నిర్మించానని డీకే స్పష్టం చేశారనీ చెబుతున్నారు.   అయితే ఆ తరువాత రాహుల్ రంగంలోకి దిగి స్వయంగా డీకేతో సుదీర్ఘంగా చర్చించిన తరువాత డీకే మెత్తపడ్డారని  కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.   డీకేపై బోలెడన్ని కేసులు, మనీలాండరింగ్‌ కేసుల్లో ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపథ్యం కూడా డీకే రేసులో వెనుకబడేటట్లు చేసిందని కూడా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద బుధవారం రాత్రి పొద్దుపోయిన తరువాత మల్లికార్జున్ ఖర్గే సిద్దరామయ్య, డీకే శివకుమార్ లతో సుదీర్ఘంగా చర్చించి వారిరువురి మధ్యా ఏకాభిప్రాయం వచ్చేలా చేశారు. దీంతో గత ఆరు రోజులుగా కర్నాటక సీఎం ఎవరన్న విషయంలో ఏర్పడిన ప్రతిష్ఠంభన తొలగిపోయింది. సిద్దరామయ్య శనివారం (మే 20)న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం మీద కర్నాటకానికి కాంగ్రెస్ తెర దించింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో అసెంబ్లీ ఎన్నికలలో తిరుగులేని విజయం సాధించిన కాంగ్రెస్ గెలిచి ఓడితే.. సీఎం రేసులో పోటీపడిన డీకే శివకుమార్ ఓడి గెలిచారు.  హై కమాండ్ నిర్ణయాన్ని ఔదాల్చి డిప్యూటీ పోస్టుకు అంగీకరించడం ద్వారా భవిష్యత్ లో కర్నాటకలో బలమైన   నేతగా నిలిచేలా పునాదిని మరింత పటిష్టం చేసుకున్నారు. 

కాపుల ఐక్యతను చెడగొడుతున్న సోము

కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అటు కేంద్ర రాజకీయనేతలకు, ఇటు కర్నాటక రాష్ట్ర నేతలకు కొత్త పాఠాలు నేర్పించాయి. పనిలో పనిగా తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు కూడా పాఠాలు నేర్చుకోక తప్పలేదు.  రెండు తెలుగు రాస్ట్రాలలోని రాజకీయ నాయకులు తమ పార్టీలను గెలిపించుకునేందుకు గత నెల రోజులుగా కర్నాటకలోనే మకాం వేశారు. అందునా అప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ తెలుగువారు అధికంగా ఉన్న  నియోజకవర్గాలలో తెలుగు నాయకుల చేత ప్రచారం చేయించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, హస్యనటుడు బ్రహ్మానందం అక్కడక్కడా ప్రచారం చేశారు. దాదాపు అన్ని చోట్లా బీజేపీ దుకాణం బంద్ అయ్యింది.   ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుల వారిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  కర్నాటకలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ప్రాంతాలలో  ప్రచారానికి చేసి అక్కడ పార్టీని గెలిపిస్తానని మీసాలు తిప్పి రంగంలోకి దిగిన సోము వీర్రాజు తీరా ఫలితాలు వచ్చాక ఎవరికీ కనబడకుండా ముఖం చాటేశారు. కర్నాటకలో బలిజసామాజిక వర్గానికి నచ్చచెప్పడంతో పాటు తెలుగువారు, అందులో తన స్వంత సామాజిక వర్గానికి చెుందిన ఓటర్లను ఆకర్షించడంలో సోమువీర్రాజు అట్టర్ ప్లాప్ అయ్యారు. సోము వీర్రాజు ప్రచారం చేసిన సిద్దగట్లలో జేడీఎస్ అభ్యర్థి రవికుమార్ విజయం సాధించగా చింతామణి, చిక్ బల్లాపూర్, కోలార్, మలూరు, బంగారు పేటలల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మ్రోగించింది. కాపులు అధికంగా ఉండే గౌరిబిదనూర్ లో కూడా సోము వీర్రాజును ఎవరూ నమ్మలేదు. అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి పుట్ట స్వామిగౌడ్ గెలుపొందగా, బీజేపీ ఐదవ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.  కాపు సామాజిక వర్గానికి నాయకులం అని చెప్పుకున్న సోము వీర్రాజు వంటి వారి మాటలను కర్నాటక కాపులు నమ్మలేదు. కర్నాటకలో కన్నడ మాట్లాడే వారు 66శాతం మంది ఉండగా, 11శాతం మంది ఉర్దూ మాట్లాడతారు. మూడవ స్థానంలో తెలుగువారు 7శాతం మంది ఉన్నారు. మరాఠీలు మూడు శాతం, హింది 2.5 శాతం, కొంకణి 1.5శాతం మంది ఉన్నారు. ఇంకా మళయాళం, కొండవ భాషలు మాట్లాడే వారు కూడా ఉన్నారు. 7శాతం తెలుగు వారు ఉన్న కర్నాటకలో దాదాపు 30 అసెంబ్లీ సీట్లలో గెలుపును ప్రభావితం చేసే సత్తా ఉంది. అలాంటి ప్రాంతాలలో కూడా సోెము వీర్రాజు ఏమీ చేయలేకపోయారు.  కాపు సామాజిక వర్గాన్ని ఏకం చేసే నాయకత్వం లేదన్న కొందరు పరిశీలకుల మాటలు ఇక్కడ గుర్తుకు రాక మానవు. బీజేపీ వంటి జాతీయ పార్టీకి రాష్ట్ర నాయకుడిగా వ్యవహరిస్తున్న సోము వీర్రాజు తన స్వంత సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయలేకపోవడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో 20 శాతం ఉన్న కాపులను సోము వీర్రాజు ఇసుమంతైనా ప్రభావితం చేయలేరనీ, రాష్ట్రంలో .99 శాతం ఉన్న బీజేపీ ఓటింగ్ ను కనీసం ఒక శాతానికైనా తీసుకురాగరా అని పరిశీలకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర రాజకీయాల్లో గుణాత్మక పాత్ర పోషిస్తానని చెబుతున్న జనసేన ఈ అనుభవాలను పరిగణనలోనికి తీసుకోవాలని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది నేతలు ఉన్ని కర్నాటక ప్రచారానికి  వారందరూ దురంగా ఉండడాన్ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

సీబీఐకి అజయ్ కల్లాం వాంగ్మూలంలో అంత: పుర రహస్యం?!

ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ.. తన దూకుడును పెంచింది. ఆ క్రమంలో ఈ హత్య జరిగిన సమయంలో వెళ్లిన ఫోన్ కాల్స్.. జరిగిన సంభాషణలు.. అదే సమయంలో ఫోన్ కాల్స్ మాట్లాడిన వారి నివాసాల్లోని అప్పటి పరిస్థితులు.. ఆ సమయంలో అక్కడ ఉన్న వ్యక్తులపై సీబీఐ ప్రదానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులోభాగంగా ఒక్కొక్కరిని పిలిచి వారి వాంగ్మూలాన్ని సైతం తీసుకొంటున్నట్లు సమాచారం.  అందులో భాగంగా తొలుత జగన్ ప్రభుత్వ సలహాదారు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ్ కల్లాంను సీబీఐ అధికారులు పిలిపించి..  వాంగ్మూలం నమోదు చేసినట్లు, ఆ  సందర్భంగా అజయ్ కల్లాం వివేకా గుండెపోటుతో మరణించారని జగన్ స్వయంగా చెప్పినట్లు సీబీఐకి తెలిపారని అంటున్నారు.  మార్చి 15వ తేదీ తెల్లవారుజామున  తమ చిన్నాన్న  వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని వైయస్ జగనే స్వయంగా తమకు తెలిపారని.. అయితే ఆయన చెప్పిన సమయం మాత్రం ఖచ్చితంగా గుర్తు లేదు కానీ.. తెల్లవారు జామునే ఆయన తమకు ఈ విషయాన్ని చెప్పారని అజేయ్ కల్లాం సీబీఐ ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.   వివేకా హత్య జరిగిన రోజు అంటే 2019, మార్చి 14 అర్ధరాత్రి.. పులివెందుల్లో వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అదే రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు లోటస్ పాండ్‌లో  జగన్ ఎన్నికల ప్రణాళికపై సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ కల్లాం, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దువ్వూరి కృష్ణ పాల్గొన్నారు.   ఈ సమావేశం జరుగుతుండగానే... మేడ మీద నుంచి ఫోన్ రావడంతో..   జగన్‌పైకి వెళ్లి రావడం.. ఆ తర్వాత ఆయన కిందకి వచ్చి..  చిన్నాన్న వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని చెప్పినట్లు ఓ మీడియాలో కథనాలు వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో   జగన్‌తో ఆ సమయంలో భేటీ అయిన వారి నుంచి వివరాలు రాబట్టేందుకు సీబీఐ తన వంతు ప్రయత్నాలను ప్రారంభించింది. మరోవైపు ఇప్పటికే  జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సీబీఐ విచారించింది.  అలాగే దువ్వూరి కృష్ణతోపాటు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లను సైతం మరికొద్ది రోజుల్లో సీబీఐ పిలిచి విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.  అదలా ఉంటే  వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించే పన్నాగం ఎవరు చేశారు? సొంత చిన్నాన్న గుండెపోటుతో మరణిస్తే.. నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ హుటాహుటిన ఎందుకు పులివెందులకు వెళ్లలేదు?. అయిన దానికీ కాని దానికీ ప్రత్యేక విమానాలలో ప్రయాణించే జగన్.. తాపీగా అదీ రోడ్డు మార్గంలో.. కారులో  ఎందుకు వెళ్లారు, మార్చి 15వ తేదీ సాయంత్రం మీడియా ఎదుట ఆయన చేసిన వ్యాఖ్యలు..  ఆ తర్వాత వైయస్ జగన్  ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం.. అనంతరం వైయస్ వివేకా హత్య కేసులో ఆయన వ్యవహరించిన తీరు తెన్నులు.. అలాగే  వైసీపీ   కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా వివేకా గుండెపోటుతో మరణించారని తొలుత మీడియాకు చెప్పడం... ఆ తర్వాత చోటు చేసుకొన్న వరుస పరిణామాలను సైతం సీబీఐ నిశీతంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  అలాగే ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల్లో నివసిస్తున్న వైఎస్ ఫ్యామిలీని బయట వారు టచ్ చేయాలంటే అది సాధ్యమయ్యే పని కాదనీ,   దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీ అక్కడ తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తూ ఉందనీ,  అలాంటిదివివేకాను ఆయన ఇంట్లోనే అత్యంత పాశవికంగా హత్య చేస్తే.. ఇది బయటవారి పని అని ఎవరైనా ఎలా అనుకొంటారనే ఓ సందేహం సైతం వ్యక్తమవుతోంది. ఓ వేళ ఇది బయటవారి పని అయితే..  జగన్ అండ్ కో సాధారణంగా ఉరుకొంటుందా? అదీ కాక అధికారంలో ఉన్న  జగన్ ప్రభుత్వం.. ఈ పాటికే... వారిని కటకటాల వెనుకకు నెట్టేది కదా అంటున్నారు.  ఈ నేపథ్యంలో వివేకాను గొడ్డలి పోటుతో అత్యంత దారుణంగా హత్య చేసి.. గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది ఎవరు అనే ఓ చర్చ అయితే ఉమ్మడి కడప జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తం  జోరుగా వాడి వేడిగా సాగుతోంది. మరోవైపు  వివేకా హత్యకసులో మరిన్ని పెద్ద తలకాయలు  సీబీఐ ముందు విచారణకు హాజరయ్యే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయనే ఓ చర్చ సైతం ఉమ్మడి కడప జిల్లాలో ఊపందుకొంది. 

త్వరలో బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితా

బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు త్వరలోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఆయన బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే వామపక్ష పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. బిఆర్ఎస్ ఎంఎల్ఏ, ఎంఎల్సి, ఎంపీలతో పాటు పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, స్టేట్ కార్పోరేషన్ చైర్ పర్సన్స్ తో   ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థులను త్వరలో ప్రకటించే అవకాశం ఉందని విస్పష్టంగా చెప్పారు.  కాంగ్రెస్ పార్టీకి బిజెపి ప్రధాన ప్రత్యర్థి అయినప్పటికీ బిజెపికి అభ్యర్థుల కొరత ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఆ సమస్య లేదు. ఈ ఎన్నికల్లో బిజెపిని ఓడించే పార్టీలతో కెసీఆర్ ఆపన్న హస్తం అందించే అవకాశం ఉంది. వచ్చే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కెసిఆర్ మూడు నెలల ముందు అంటే సెప్టెంబర్ లో బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.  కర్ణాటక ఎన్నికల  ఫలితాలు బిఆర్ఎస్ మీద చూపే ప్రభావం మీద కూడా  కెసిఆర్ చర్చించారు.  2018 అసెంబ్లీ ఎన్నికలలో అనుసరించిన వ్యూహాన్నే అమలు చేయాలని కెసీఆర్ చూస్తున్నారు. వాస్తవానికి 2019 ఏప్రిల్, మే లో ఎన్నికలు నిర్వహించాలి. కానీ జరుగలేదు. 2018 సెప్టెంబర్ 6న కెసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు.  2018 డిసెంబర్ లో ఎన్నికల్లో వెళ్లారు కెసిఆర్. ఇది వర్కవుట్ అయ్యింది కాబట్టి అప్పట్లో మొత్తం 119 సీట్లకు గానూ  88 సీట్లతో మళ్లీ అధికారంలో రాగలిగింది బిఆర్ఎస్.   

ఆర్5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

అమరావతిలో పేదల ఇళ్ల స్థలాల కేటాయింపునకు  సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు పేదలకు ఉందని  సుప్రీం పేర్కొంది. చట్ట ప్రకారమే 5 శాతం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కు చెందిన వారికి ఇళ్ల స్థలాలివ్వాలని సుప్రీం కోర్టు పేర్కొంది.  సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్ 53.1డీ ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని తన ఉత్తర్వులలో  పేర్కొంది.   అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీంకోర్టులో  జస్టిస్ కె ఎం. జోసెఫ్ , జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం (మే 17) విచారించింది. 

కోట్లు కుమ్మరిస్తున్న కేసీఆర్..!

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం  ఇండియా. అలాంటి దేశంలో ఎంతగా ప్రచారం చేసుకోంటే.. అంతగా ఎన్నికల్లో గెలుస్తామనే ఓ విధమైన భావన రాజకీయ పార్టీల్లో  బలంగా ఉంది. తాజాగా అటువంటి ప్రయత్నానికి  తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ తెర తీసింది. జూన్ 2వ తేదీ అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి  21 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించేందుకు భారీ ప్రణాళికలు సిద్దం చేసింది. అదీకాక ఎన్నికలు సమీపిస్తున్నాయి... ఆపై తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను  ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.  ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. కార్యక్రమాలు ప్రజలందరికీ తెలిసేలా..  ప్రచారం చేసేందుకు దేశంలోని మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయిలు వెచ్చించనుంది.  అందుకోసం దాదాపు 200 కోట్ల రూపాయిలను ప్రభుత్వం కేటాయించింది.. అందులో 70 కోట్ల రూపాయిలు ప్రచారానికి వినియోగించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసీఆర్ ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ఠయాన్ని విపక్షాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. అంతే కాదు ప్రజల సొమ్ముతో   ప్రభుత్వం పండగ చేసుకొంటోందని విమర్శలు సంధిస్తున్నాయి.  మరోవైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలి రెండేళ్లలో ఆవిర్భావ ఉత్సవాల పేరిట కేసీఆర్ సర్కార్ చేసిన హడావుడి కనిపించినప్పటికీ ఆ తర్వాత ఆ వేడుకలను నామ్ కే వాస్తే అన్నట్లుగా నిర్వహించారు.. అయితే తొలి రెండేళ్లలో 5 రోజులు, ఆ తర్వాత వాటిని మూడు రోజులకు కుదించారని.. అనంతరం ఆ వేడుకలను ఒక రోజుకు  పరిమితం చేసి..   మమ అనిపించిందని  విపక్షాలు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నాయి.  అయితే ఈ ఏడాది ఎన్నికల ఏడాది కావడంతో..  21 రోజులు పాటు రాష్ట్ర ఆవతరణ ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది..  ఈ నిర్ణయం పై రాజకీయ పార్టీలలోనే కాదు.. సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.  రాష్ట్ర అవతరణ దితోత్సవ వేడుకల కోసం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్..మొత్తం 33 జిల్లాలకు రెండు నుంచి మూడు కోట్ల రూపాయిల నిధులు కేటాయించారనే వార్త సైతం హల్ చల్ చేస్తోంది. ఇక ఈ వేడుకలను పురస్కరించుకొని.. భారీగా డాక్యుమెంటరీలు సైతం నిర్మిస్తున్నారని తెలుస్తోంది.  అయితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతోపాటు ముచ్చటగా మూడోసారి ఎన్నికల్లో గెలవడం కోసం కేసీఆర్ ప్రచారార్భాటాన్ని పీక్స్ కు తీసుకెడుతున్నారన్న విమర్శలూ, వ్యాఖ్యలూ వినవస్తున్నాయి. మరోవైపు పక్కనే ఉన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీకి అక్కడి ఓటర్లు గట్టిగానే షాక్ ఇచ్చారు. అలాగే తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తోంది. ఇంకోవైపు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ , కాసాని జ్జానేశ్వర్ నేతృత్వంలోని టీటీడీపీ సైతం ప్రజల్లోకి చాలా బలంగా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ మరో  సారి అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే ఏటికి ఎదురీదక తప్పని పరిస్థితులు ఉన్నాయి. 

మమత, అఖిలేష్ స్వరం మారింది.. ఆదే దారిలో మరింత మంది!

తెలుగువన్ చెప్పినట్లే జరుగుతోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం జాతీయ స్థాయిలో సమీకరణాలు మార్చేస్తుందని తెలుగువన్ సరిగ్గా అంచనా వేసింది. కర్నాటకలో కాంగ్రెస్ విజయం బీజేపీయేతర పార్టీలన్నీ కాంగ్రెస్ గొడుకు కింద ఐక్యతారాగం ఆలపించేందుకు ప్రేరేపిస్తుందని తెలుగువన్ ముందుగానే చెప్పింది. ఆ విధంగానే కర్నాటక ఫలితం వచ్చిన రెండో రోజు నుంచే  విపక్షాల ఐక్యతారాగంలో మార్పు కనిపించింది. క ర్నాటక ఫలితానికి ముందు వరకూ కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి అంటూ వచ్చిన పార్టీలు.. కాంగ్రెస్సేతర అనే మాటను వెనక్కు తీసుకున్నాయి. బీజేపీయేతర కూటమి అంటూ తమ గొంతు సవరించుకున్నాయి. ముందుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్ల తాము ఆ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించింది. అంతకు ముందు వరకూ కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి అంటూ చెవినిల్లు కట్లుకుని ప్రచారం చేసిన మమతా బెనర్జీ కర్నాటక ఫలితంతో స్వరం మార్చారు. కేంద్రంలో కాంగ్రెస్ ను గద్దె దించాలంటే కాంగ్రెస్ సహకారం తప్పని సరి అని గుర్తించారు. ఇప్పటికే యూపీయే కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ వెనుక చేరడానికి మమతా బెనర్జీ ఒక అడుగు ముందుకు వేశారు. ఆ తరువాత ఒక రోజు వ్యవధిలోనే సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ కు మద్దతుగా గొంతు కలిపారు. మమతా బెనర్జీ అభిప్రాయంతో తాను వంద శాతం ఏకీభవిస్తున్నానని ప్రకటించారు.  2024 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేయాల్సి ఉందని, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉంటే అక్కడే పోటీ చేయాలని అభిప్రాయపడ్డారు. బిహార్, తెలంగాణ ముఖ్యమంత్రులు నీతీశ్ కుమార్, కేసీఆర్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ఉన్నచోట ఆ పార్టీకే మద్దతిస్తామని మమత సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో కాంగ్రెస్ సంతృప్తికర విజయంతో అధికారాన్ని చేజిక్కించుకున్న నేపథ్యంలో ఆ పార్టీ అటు ప్రజలతో పాటు..ఇటు తోటి ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఓ ప్రత్యేక ఇమేజ్ సంతరించుకుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సక్సెస్ ఫలితంగానే ఇది సాధ్యపడిందని పార్టీ శ్రేణులు సంబర పడుతున్నాయి. 2024  సార్వత్రిక ఎన్నికలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేందుకు పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలకు పెరుగుతున్న  గ్రాఫ్ ఓ మంచి టానిక్కులా పని చేస్తుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ దినోత్సవం మే 17

పురాణాల్లో సమాచారం చేరవేతకు మేఘ సందేశాలు, హనుమంతుడు, నారదుడు, హంస, పావురాళ్లు...  ఆ తర్వాత  ఉత్తరాలు.. టెలిగ్రాములు, నెక్ట్స్ ల్యాండ్ లైన్లు.. ఇటీవల ఇంటర్నెట్ కనెక్షన్లు.. తాజాగా సెల్ ఫోన్లు..  4జీలు, 5 జీలు అంతా సమాచార యుగం.  గతంలో సమాచారం ఒకరి నుంచి మరొకరికి చేరాలంటే.. . ఏళ్లూ పూళ్లూ పట్టేది. ఆ తరువాత క్రమంగా  నెలలు, పక్షాలు, వారాలు, రోజులు నుంచి గంటలు, నిమిషాలు.. చివరకు సెకన్లకు చేరుకొంది.  దీంతో ప్రపంచంలోని సమాచారమంతా ఆ మూల నుంచి ఈ మూల వరకూ ఇప్పుడు సెకన్లలో చేరిపోతోంది. దీంతో సమాచార యుగంలో సమాచార ప్రసారం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఇట్టే అర్థమైపోతోంది. మే 17వ తేదీ.. ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం.  2005 నుండి ప్రతి సంవత్సరం మే 17ను ప్రపంచ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డేగా పాటిస్తు వస్తున్నారు.  తొలుత అంతర్జాతీయ టెలిగ్రాఫ్‌ కన్వెన్షన్‌పై 1865 మే 17న పారిస్‌లో సంతకం చేశారు. 1969, మే 17న ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవాన్ని తొలిసారిగా జరుపుకున్నారు. ఆ క్రమంలో తొలిసారి సంతకం చేసిన మే 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్‌ దినోత్సవంగా జరుపుకొంటున్నారు.  అయితే దీన్ని ప్రాముఖ్యతను యావత్‌ ప్రపంచ దేశాలు గుర్తించాలని 2005లో ట్యూనిస్‌లోని ఇన్ఫర్మేషన్‌ సొసైటీ శిఖరాగ్ర సమావేశంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య తీర్మానాన్ని ప్రకటించింది. ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ప్రపంచంలో టెలి కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ ఉన్న దేశాల్లో భారత్ రెండవ అతి పెద్ద దేశంగా అవతరించింది.  మరోవైపు.. ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకుపోతోంది. దేశా ఆర్థిక పరిపుష్టికి   సమాచార రంగం కీలక పాత్ర పోషిస్తోంది. సెల్ ఫోన్ తయారీ నుంచి వాటి విడి భాగాలు ఇతర దేశాలకు ఎగుమతి వరకు చైనాతో పోటీ పడుతోంది. అలాగే నగదు లావాదేవిలు, అన్‌లైన్ సేవలు, వగైరా వగైరా అన్ని సెల్ ఫోన్ కేంద్రంగానే సాగుతోన్నాయి. అంతేకాదు.. సెల్ ఫోన్ రీచార్జ్‌ల పేరుతో అటు పలు నెట్ వర్క్ కంపెనీలకు ఇటు ప్రభుత్వానికి సైతం భారీగా ఆదాయం సమకూరుతోంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు ఈ టెలికమ్యూనికేషన్స్ రంగం వెన్నుదన్నుగా నిలుస్తోందనడంలో  ఎటువంటి సందేహం లేదు.       మరోవైపు ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్‌పై ప్రభుత్వం అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు సైతం చేపడుతోంది. నవంబర్ 2006లో టర్కీలోని అంటాల్యాలో జరిగిన ITU ప్లీనిపోటెన్షియరీ కాన్ఫరెన్స్ మే 17ను ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. అలాగే ప్రపంచ కమ్యూనికేషన్ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత, ఇంటర్నెట్ గురించి సానుకూలతను వ్యాప్తి చేయడం. అదే విధంగా ప్రపంచ టెలికమ్యూనికేషన్ డే అనేది మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సమాచారం అందుబాటులోకి తీసుకురావడమే.

కర్నాటక సీఎం సిద్దరామయ్యే!

కర్నాటక ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటారన్న విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభనకు ఎట్టకేలకు తెరపడింది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యనే కాంగ్రెస్ అధిషఠానం కర్నాటక ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్యంగా సంపూర్ణ మెజారిటీ సాధించిన అనంతరం.. ముఖ్యమంత్రి ఎవరన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు సిద్దరామయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. రాష్ట్రంలో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అన్ని విధాలుగా పార్టీని పటిష్టం చేసేందుకు ఎంతో కష్టపడటమే కాకుండా.. బీజేపీ సర్కార్ కేసులతో వేధించినా, అరెస్టు చేసినా తట్టుకుని నిలబడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేశారు. సోనియాగాంధీకి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని గిఫ్ట్ గా ఇస్తానన్న మాట నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ విజయానికి ఒంటి చేత్తో స్క్రిప్ట్ చేశారని చెప్పవచ్చనే విధంగా ఆయన పని చేశారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలు కావడంలోనూ.. అంచనాలకు సైతం అందనంతగా కాంగ్రెస్ ఘన విజయం సాధించడంలోనూ డీకే శివకుమార్ ది కీలక పాత్ర.  అయినా ఆయనకు సీఎం పదవి అందని ద్రాక్షగా మిగలడానికి ప్రధాన కారణం  బీజేపీ వ్యూహాత్మకంగా గతంలో ఆయనపై పెట్టిన కేసులు, జరుగుతున్న సీబీఐ దర్యాప్తే కారణమని అంటున్నారు. కర్నాటక ఎన్నికలలో బీజేపీ పరాజయానికి ప్రధాన కారకుడైన డీకే శివకుమార్ ను ఇరుకున పెట్టే విధంగా క మలం పార్టీ అధిష్ఠానం పావులు కదిపింది.   సీబీఐ కొత్త బాస్ గా ప్రణీత్ సూద్ ను కేంద్రం నియమించింది. కేంద్రం ఈ మూవ్ డీకే శివకుమార్ ను ఇరుకున పెట్టడానికేనని అంటున్నారు. కర్నాటక డీజీపీగా ఉన్న ప్రవీణ్ సూద్ ను సీబీఐ చీఫ్ గా నియమించడంతో డీకే శివకుమార్ పై బీజేపీ బనాయించిన అవినీతి కేసుల దర్యాప్తును మళ్లీ తెరపైకి తీసుకురావడంతో.. ఆయనపై అరెస్టు కత్తి వేలాడుతున్నట్లైంది. దీంతో  కాంగ్రెస్ అధిష్ఠానం డీకేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపిక చేసేందుకు ముందు వెనుకలాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీఎంగా ఎంపిక చేసి పదవి కట్టబెట్టినా.. కేసుల కారణంగా ఆయన పదవి నుంచి తప్పుకునే పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్న భావనతో సీఎంగా కాంగ్రెస్ అధిష్ఠానం సిద్దరామయ్య వైపే మొగ్గు చూపింది.   

సుప్రీంలో అవినాష్ కు ఎదురుదెబ్బ

వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు చుట్టూ గుడుగుడు గుంచం గుండే రాగం అన్నట్లుగా తిరుగుతోంది. సీబీఐ అవినాష్ రెడ్డి విచారణ అరెస్టు వ్యవహారంలో ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా వ్యవహరిస్తోంది.  తాజాగా   తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉన్న ముందస్తు బెయిల్ పై సుప్రీంను ఆశ్రయించారు. అయితే అవినాష్ కు సుప్రీం కోర్టులో ఊరట దక్కలేదు. విచారణ తేదీని సీజేఐ ధర్మాసనం ఖరారు చేయలేదు. విచారణ అత్యవసరమని భావిస్తే లిఖిత పూర్వకంగా  అభ్యర్థించాలని, దానిని బట్టి తాము విచారణ తేదీని ఖరారు చేస్తామనీ సుప్రీం స్పష్టం చేసింది.   అదలా ఉంటే మంగళవారం విచారణకు హాజరు కావాల్సిన వివేకా పార్టీ కార్యక్రమాలు ఉన్నందున నాలుగు రోజులు వ్యవధి కావాలని కోరితే.. సీబీఐ రెండో ఆలోచన లేకుండా మూడు రోజులు గడువు ఇచ్చింది.  ఆ వెంటనే ఆయన బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉన్న ముందస్తు బెయిల్ పై సుప్రీంను ఆశ్రయించారు. తన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు వెంటనే తేల్చేలా ఆదేశాలివ్వాని కోరుతూ సుప్రీం ను ఆశ్రయించారు.   తన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ సుప్రీం పరిశీలనలో ఉండడం వల్ల త్వరగా విచారణ జరగడం లేదని ఆ పిటిషన్ లో పేర్కొన్న అవినాష్ రెడ్డి వెకేషన్ కోర్టులో  తన ముందస్తు బెయిల్ విచారణ ముగించేలా ఆదేశాలు ఇవ్వాలని.. అప్పటివరకు సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలనీ కోరారు. అదే సమయంలో  19న విచారణకు రావాలన్న సీబీఐ నోటీసుకు సమాధానమిస్తూ హాజరౌతానని పేర్కొన్నారు.   ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి పి  సుప్రీంను ఆదేశించడం ఆసక్తికరంగా మారింది. అవినాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు ఏ నిర్ణయం వెలువరిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.  అదలా ఉంచితే.. వివేకా హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకున్న ప్రతిసారీ.. జగన్ రియాక్షన్ ఏలా ఉంటోందన్న విషయంలో సామాన్య జనమే కాదు పరిశీలకులు కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. మంగళవారం అవినాష్ రెడ్డి  సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆయన వ్యవధి కోరారు. దాదాపుగా అదే సమయంలో జగన్ హస్తిన షెడ్యూల్ ఖరారైంది. నీతి ఆయోగ్ సమావేశానికి ఆయన ఢిల్లీ వెడుతున్నారు. ఆ సమావేశం ఈ నెల 27న కాగా జగన్ మాత్రం ఒక రోజు ముందు అంటే 26వ తేదీ నాటికే ఢిల్లీ చేరుకుంటారు. ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోడీతో భేటీ అవుతారని చెబుతున్నారు. సాధారణంగా ఈ నాలుగేళ్లలో జగన్ నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన సందర్భాలు లే వు. విత్త మంత్రి బుగ్గనే జగన్ తరఫున ఆ సమావేశాల్లో పాల్గొన్నారు. అలాంటిది ఈ సారి బుగ్గనను వద్దని జగన్ స్వయంగా వెళుతున్నారు. ఆయన పర్యటన లక్ష్యం నీతి ఆయోగ్ సమావేశం కాదనీ, తన బాబాయ్ హత్య కేసులో తమ పార్టీ ఎంపీని చిక్కుల నుంచి తప్పించడానికేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ హస్తిన పర్యటన పూర్తయ్యే వరకూ తన అరెస్టును నిలువరించుకునేందుకే అవినాష్.. మరోసారి సుప్రీంను ఆశ్రయించారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. ఇప్పటికే ఇదే ముందంస్తు బెయిలు పిటిషన్ పై సుప్రీం కోర్టు, తెలంగాణ హైకోర్టు కూడా తమ అభిప్రాయాలను చెప్పేశాయి. ముందస్తు బెయిలు పిటిషన్ విచారణను వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు.. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సీబీఐకి ఎటువంటి ప్రతిబంధకాలూ లేవని విస్పష్టంగా చెప్పేసింది. అంతకు ముందు ముందస్తు బెయిలుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టి వేయడమే కాకుండా ఇలాంటి ఆదేశాలు కూడా ఇస్తారా అంటూ అసహనం వ్యక్తం చేసింది. దీంతో అవినాష్ ఇప్పుడు తాజాగా సుప్రీంను తన ముందస్తు బెయిలు పిటిషన్ ను త్వరగా విచారించేలా హైకోర్టును ఆదేశించాలంటూ సుప్రీం ను ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  అయితే సుప్రీంలో ఆయనకు ఊరట లభించకుండటంతో ఇక అరెస్టు అనివార్యం అన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. 

దశలవారీ మద్య నిషేధం దిశగా తొలి అడుగు!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని 2019 ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేశారు. అయితే అధికారం చేపట్టి నాలుగేళ్లయినా.. రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేధం ఎంత సుందర ముదనష్టంగా అమలు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. మద్య నిషేధం మాట అటుంచి దిక్కుమాలిన జే బ్రాండ్ ల పేరుతో ప్రజారోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. అంతే కాకుండా పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చుకున్నారు. అంటే జగన్ గత ఎన్నికల ముందు చేసిన దశల వారీ మద్య నిషేధం అన్నది ఒక బూటకపు హామీ అన్నది తేటతెల్లమైపోతుంది. పైపెచ్చు మద్యం ధరలను ఇష్టారీతిగా పెంచేయడం ద్వారా ప్రజలలో మద్యం అలవాటును మాన్పించేందుకు ప్రయత్నిస్తున్నామంటూ.. కొత్త కొత్త భాష్యాలు కూడా చెప్పారు. కాగా పొరుగున ఉన్న తమిళనాడులో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ఆయన ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిథి శత జయంతి వేడుకలను పురస్కరించుకుని స్టాలిన్ సర్కార్ రాష్ట్రంలో 500 మద్యం దుకాణాలను మూసేయాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా చర్యలకు కూడా ఉపక్రమించింది.  ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు జూన్‌ 3న కరుణానిథి శత జయంతి వేడుకలు ప్రారంభమవుతున్న సందర్భంగా మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ నిర్ణయించారు. తొలివిడతగా 500  దుకాణాలను మూసివేయనున్నారు. ఆ మేరకు  ఉన్నతాధికారులు మూసివేయాల్సిన దుకాణాల వివరాలను సేకరిస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, ఆలయాలకు చేరువగా ఉన్న మద్యం దుకాణాలు మూత పడతాయని తెలుస్తోంది. అదే విధంగా 500 మీటర్ల దూరంలో రెండు మద్యం దుకాణాలున్న ప్రాంతాల్లో ఒకే మద్యం దుకాణం కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో ఏపీలో మాత్రం వాగ్దానం చేసి నాలుగేళ్లయినా మద్యం వినియోగం పెంచడమెలా అన్న ప్రణాళికలతో జగన్ సర్కార్ ముందుకు వెళుతోంది. ఆదాయం కోసం ప్రజారోగ్యాన్ని కూడా ఫణంగా పెడుతోంది.