బాబు దెబ్బకు దిగొచ్చిన జగన్

నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ అన్నీ తెలిసినట్లు ఆర్భాటం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ గత నాలుగేళ్లుగా రాజధాని మార్పు, కోర్టు కేసులు, అప్పుల కోసం ఎదురు చూపులతో గడిపేశారు. తీరా స్పందించాల్సిన సమయంలో జగన్ సర్కార్ చేతులెత్తేసింది. ిటీవల రాష్ట్రంలో అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో  జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందని తూర్పుగోదావరి జిల్లా వాసులు అంటున్నారు.  రైతులకుఅండగా నిలబడేందుకు రాజమండ్రిలో మకాం వేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి 72 గంటల అల్టిమేటం యిచ్చారు. అప్పటి లోగా రైతుల కష్టార్జితాన్ని రైతు భరోసా కేంద్రాలకు తరలించి న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  తొలుత పట్టించుకోనట్లు వ్యవహరించిన అధికారులు రైతుల నుండి వస్తున్న ప్రతి స్పందనతో కదలాల్సి వచ్చింది.  వెంటనే ధాన్యం రైతు భరోసా కేంద్రాలకు తరలించే పని మొదలైంది. దీంతో ఊపిరి పీల్చుకున్న రైతులు అండగా నిలబడిన చంద్రబాబుకు కృతజ్ణతలు తెలపారు.   కష్టంలో ఉన్న రైతాంగం కోసం జిల్లాలో బస చేసి ప్రభుత్వం మెడలు వంచిన చంద్రబాబు అక్కడి తెలుగుదేశం నేతలలో కొత్త ఆశలు నింపారు. యింత కాలం రైతు ప్రభుత్వం మాదే అని చెప్పుకున్న వైసీపీ నేతలకు రైతుల ముందుకు వెళ్లేందుకు ధైర్యం రావడం లేదు.  ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు తీసుకున్నసాహసోపేత నిర్ణయం రైతు లోకాన్ని ఆకట్టుకుంది.  72 గంటల లోగా ధాన్యంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోకపోతే, ధాన్యం మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్ ముంగిట కుప్పలుగా పోస్తామని చంద్రబాబు చేసిన హెచ్చరిక రైతులలో ఆయన గౌరవాన్ని పెంచింది.  ఎమ్మెల్సీ ఎన్నికలలో సాధించిన విజయం తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. రైతుల విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించడం గ్రామీణ ప్రాంతాలలో తెలుగుదేశంప్రతిష్ట మరింత పెరిగింది.  యింత వరకూ హైకెట్ బాబు అంటూ, వ్యవసాయం దండగ అన్నారంటూ లేనిపోని ఆరోపణలు చేసిన వైసీపీ నోళ్లు ఈ దెబ్బతో మూతపడ్డాయి.  తెలుగుదేశం అధికారంలోకి వస్తే గ్రామీణ పరిశ్రమలపై దృష్టి పెడతామని చంద్రబాబు ముందే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడీపీలో 36శాతం వ్యవసాయ రంగం ఆక్రమించింది. కాగా పరశ్రమలశాతం 23శాతంగా ఉంది. సర్వీస్ సెక్టార్ వేల్యూ 41శాతంగాఉంది. అంటే రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయని చంద్రబాబు చెబుతున్నారు. ఆయన మాటలను బట్టి చూస్తే తెలుగుదేశం అజెండాలో రైతుల సంక్షేమం, వ్యవసాయక అభివృద్ధి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు పెద్ద పీట వేస్తారని రైతులు ఆశిస్తున్నారు.  వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే బాబు పాలన రావాలని రైతులు అంటున్నారు. 

శ్రీవారి సన్నిధిలో సెల్ హల్‌చల్

 తిరుమల శ్రీవారి ఆలయం ఆనంద నిలయం. ఆ ఆలయంలోకి ప్రవేశించాలంటే... కట్టుదిట్టమైన భద్రత నడుమ, అడుగు అడుగునా నిఘా నేత్రాల మధ్య వీవీఐపీ నుంచి సాధారణ భక్తులు వరకు అందరూ ప్రవేశించాల్సి ఉంటుంది. అంతటి భద్రత నడుమ... అలాంటి ఆలయంలోకి ఓ వ్యక్తి సెల్‌ ఫోన్ తీసుకు వెళ్లడమే కాకుండా.. ఆ సెల్ ఫోన్‌.. కెమెరాతో ఆలయ విమాన గోపురాన్ని సైతం చాలా చక్కగా చీత్రికరించాడు. అందుకు సంబంధించిన వీడియో.. అటు సోషల్ మీడియలో ఇటు మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.  అయితే ఆ వీడియో వైరల్ కావడంపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆందోళన చెందడంతోపాటు ఆగ్రహం సైతం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల స్వామి వారి ఆలయం వద్ద నిఘా వ్యవస్థ వైఫల్యానికి ఇది ఓ నిదర్శనమని ఆరోపణలు సైతం వెల్లువెత్తుతోన్నాయి. తిరుమలలోనే కాదు... తిరుమల దేవాలయ పరిసర ప్రాంతాల్లో సైతం భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. అలాగే తిరుమల కొండపైకి ప్రవేశించిప్పటి నుంచి అడుగడుగునా నిఘా కెమెరాలు.. నిత్యం భక్తులు, స్థానికుల కదలికలను ప్రతీక్షణం గమనిస్తూ ఉంటాయి.  అంటువంటిది.. ఆలయంలోకి ఓ వ్యక్తి నిఘా నేత్రాల కళ్లుగప్పి సెల్ ఫోన్ తీసుకు వెళ్లాడంటే.. అతగాడి చాకచక్యమని మురిసిపోవాలా లేకుంటే.. భద్రత దళాల చేతగానితనానికి నిలువెత్తు నిదర్శనమనాలా? నేడు సెల్ ఫోన్ తీసుకు వెళ్లిన వ్యక్తి.. రేపు మరణాయుధాలు తీసుకు వెళ్లితే పరిస్థితి ఏమిటీ.. ఆ తర్వాత చోటు చేసుకొనే పరిస్థితులకు బాధ్యులు ఎవరూ? అంతా జరిగిపోయాక.. మృతులకు, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానూభుతి తెలపడం... అలాగే ప్రధాని, ముఖ్యమంత్రి అత్యవసర సహాయక నిధి నుంచి నిధులు విడుదల చేయడం.. బాధ్యతారాహిత్యంగా, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై వేటు వేసి.. .ఆ బాధిత కుటుంబాలకు ఎంతో కొంత నష్టపరిహారం అందజేయడంతో.. తమ క్రతువు ముగిసిందని రాజకీయ నాయకాగణంతోపాటు ఏలికలు సైతం భావిస్తూ ఉంటాయి.    కానీ హిందూ దేవాలయాలు.. భగవంతునికి, భక్తునికి అనుసంధాన సంపదకు ప్రతీకగా వర్ధిల్లుతోన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ దేవాలయ నిర్మాణాలు, సాంస్కృతిక కట్టడాలు, ఆ విగ్రహాలు... ఆ ఆగమ శాస్త్రాలు.. ఆ ఆచారాలు, ఆ ఆలయాల పవిత్రత అన్ని హిందూ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ప్రపంచవ్యాప్తంగా వేనోళ్లు కొనియాడబడుతోన్నాయి..     అదీకాక ఉగ్రవాదం, తీవ్రవాదం అనే సమస్యలు ఓ ప్రాంతానికో.. ఓ దేశానికి సంబంధించిన సమస్యగా కాకుండా ప్రపంచ మానవాళిని ముప్పుగా పరిణమించిన వేళ... తిరుమలలో ఉగ్రవాదుల సంచారిస్తున్నారంటూ ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులకు ఇటీవల ఓ ఈమెయిల్ రావడం.. దాంతో భద్రత సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి.. జల్లెడ పట్టడం.. ఆ తర్వాత తిరుమలలో ఉగ్రవాదులు లేరంటూ.. ఈ మెయిల్ శుద్ద అబద్దమంటూ వారి కొట్టిపారేయం జరిగింది. అయితే తొలుత ఈ వార్త విన్న... ప్రపంచంలోని శ్రీవారి భక్తులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అలాంటి వేళ.. ప్రపంచంలోనే అత్యధిక భక్తులతో కొలవబడుతోన్న కొంగు బంగారు స్వామి శ్రీ ఏడుకొండల స్వామి వారిని ఏ మూల నుంచి, ఏ వైపు నుంచి ఎటువంటి ముప్పు వాటిల్లనుందో తెలియని నేపథ్యంలో ఆలయ అధికారులు, భద్రత సిబ్బందే కాదు.. భక్తులు సైతం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నది మాత్రం సుస్పష్టం. ఓ వేళ.. ఎటువంటి ముప్పు అయినా వాటిల్లితే.. ఆ దేవదేవుడే కాదు.. భవిష్యత్తు తరాలు.. సైతం మనలను క్షమించవు కాక క్షమించవు.

ఊరట నిచ్చిన కేజ్రీవాల్ ప్రకటన

ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన స్టేట్ మెంట్ బీఆర్ఎస్ కు ఊరటనిచ్చింది. ఎందుకంటే  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవిత ఈ ఉచ్చులో చిక్కుకుపోవడమే ప్రధాన కారణం. ఆమె ఇప్పటికే సుప్రీం గడపదొక్కిన సంగతి తెలిసిందే. కవిత అరెస్ట్ కానుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో న్యాయస్థానం లిక్కర్ స్కాం ఓ బూటకం అని కేజ్రీవాల్ ప్రకటన బీఆర్ఎస్ ను ఓదార్చినట్టయ్యింది.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం ఒక బూటకమని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇప్పుడు కోర్టులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని అన్నారు. ఈ కేసులో అరెస్టు అయిన రాజేశ్‌ జోషి, గౌతమ్ మల్హోత్రాలకు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. లంచం కింద డబ్బు చెల్లించినట్లు కానీ, తీసుకున్నట్లు కానీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎలాంటి సాక్ష్యాధారాలు చూపలేకపోయిందని జడ్జి వ్యాఖ్యానించారు.ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా ఈరోజు స్పందించారు. ‘‘లిక్కర్‌ స్కామ్ మొత్తం ఒక బూటకం. మేం ముందు నుంచి ఈ విషయం చెబుతూనే ఉన్నాం. ఇప్పుడు కోర్టులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఆప్ లాంటి నిజాయతీ గల పార్టీని అపఖ్యాతి పాలు చేసేందుకు బీజేపీ చేస్తున్న కుట్ర ఇది’’ అని విమర్శించారు. ‘‘లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్‌కు సంబంధించిన సాక్ష్యం లేదని ఇప్పుడు కోర్టు కూడా చెప్పింది. మద్యం కుంభకోణం అంతా బూటకమని, కేవలం ఆప్‌ని కించపరిచేందుకేనని మేము మొదటి నుంచి చెబుతున్నాం’’ అని అంతకుముందు ఓ ట్వీట్ చేశారు.

అవినాష్ అరెస్ట్ కు కర్నాటక అడ్డు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత   జగన్ సొంత చిన్నాన్న వైయస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో  భాస్కరరెడ్డిని సీబీఐ ఇప్పటికే అరెస్ట్ చేసి.. 14 రోజుల రిమాండ్ నేపథ్యంలో చంచల్‌గూడ జైలుకు తరలించింది. అయితే వైయస్ అవినాష్ రెడ్డి రేపో మాపో అరెస్ట్ అయిపోతారంటూ నిన్న మొన్నటి  వరకూ జోరుగా సాగిన ప్రచారం యిప్పుడు జగరడం లేదు.  అవినాష్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి.. ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే ముందస్తు బెయిల్ ఆదేశాలు ఇవ్వలేమని   విస్పష్టంగా చెప్పేసి,  కోర్టుకు వేసవి సెలవులు నేపథ్యంలో ఈ కేసు విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. దీంతో వైయస్ అవినాష్ రెడ్డి అరెస్ట్‌కు సీబీఐకి ఎలాంటి అవరోధాలూ లేకుండా పోయాయి. అయినా అవినాష్ అరెస్టు విషయంలో సీబీఐ అడుగు ముందుకు వేయడం లేదు. అవినాష్ మాత్రం పులివెందులలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రారంభోత్సవాలు, ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా గడిపేస్తున్నారు. ఈ విధంగా అవినాష్ గతంలో ఎన్నడూ ప్రజలలో కలిసి తిరిగిన దాఖలాలు లేవు. ఆఖరికి చిన్న చిన్న దుకాణాల ప్రారంభోత్సవాలకు కూడా అవినాష్ హాజరౌతున్నారు. ఒక విధంగా కోర్టులు ఆయన అరెస్టు చేయడానికి సీబీఐకి ఎటువంటి అడ్డంకులూ లేవని విస్ఫష్టంగా చెప్పేసినా ఆయన అలా యథేచ్ఛగా తిరుగుతున్నా సీబీఐ ఆయనను అదుపులోనికి తీసుకోవడం లేదంటే.. ఆయనకు కోర్టుల రక్షణ లేకపోయినా సీబీఐ అరెస్టు చేయలేదన్న ధైర్యం మెండుగా ఉందనీ, దీని వెనుక ఏదో మతలబు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన అరెస్టుకూ, కర్నాటక ఎన్నికలకూ లింకు పెడుతూ పలు విశ్లేషణలు చేస్తున్నారు.   అవేమంటే.. కర్నాటకలో అధికారం నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ  ఆ రాష్ట్రంలో విజయం కోసం ఎదురీదుతోంది. యిప్పటి వరకూ వెలువడిన అన్ని సర్వేలూ కాంగ్రెస్ దే గెలుపని ఢంకా బజాయించి మరీ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్నాటకలో అంతో యింతో పట్టున్న జగన్ కు కర్నాటకలో తమ పార్టీని గెలిపించే కీలక బాధ్యత బీజేపీ అగ్రనాయకత్వం ఆయనకు అప్పగించింది. అందుకు జగన్ సై  అన్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు కర్నాటకలో బీజేపీ విజయం కోసం జగన్ రమారమి ఐదు వందల కోట్లు వ్యయం చేయడానికి సైతం రెడీ అయ్యారు. అన్నిటికీ మించి  ఆ రాష్ట్రంలో బీజేపీని దూరం జరిగి సొంత కుంపటి పెట్టుకున్న మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి జగన్ కు సన్నిహితుడన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే ఆ బీజేపీ మాజీ నేత గాలి జనార్ధన్ రెడ్డి కారణంగా బీజేపీ ఓట్లు చీలకుండా, ఆయన కమలం పార్టీలో స్నేహపూర్వక పోటీలో మాత్రమే ఉండేలా ఆయనను ఒప్పించేందుకు బీజేపీ జగన్ తో ఒప్పందం కుదుర్చుకుందని పరిశీలకులు అంటున్నారు. యిందు కోసం జగన్ అవినాష్ రెడ్డికి  అరెస్టు నుంచి రక్షణ కల్పించాల్సిందిగా కోరారనీ, అందుకు బీజేపీ హై కమాండ్ అంగీకరించిందనీ ఓ చర్చ అయితే జోరుగా సాగుతోంది. అందుకే కళ్ల ముందే సవాల్ చేస్తున్నట్లుగా అవినాష్ పులివెందులలో తిరుగుతున్నా.. అరెస్టు చేయడానికి సీబీఐ యిసుమంతైనా ప్రయత్నించడం లేదనీ  అంటున్నారు. పరిస్థితులను గమనిస్తున్న ఎవరికైనా అవినాష్ అరెస్టు కాకపోవడానికి పై నుంచి సీబీఐపై తీవ్ర ఒత్తిడి ఉందని అనిపించకమానదు. ఆ ఒత్తిడి ఎక్కడ నుంచి, ఎవరి నుంచి అన్న విషయంలో ఎవరికీ అనుమానాలూ, సందేహాలూ ఉండవు. ఈ నేపథ్యంలోనే కర్నాటక ఎన్నికలు పూర్తై, ఫలితాలు వచ్చే వరకూ అవినాష్ కు అరెస్టు భయం లేదని పరిశీలకుల విశ్లేషణలు హేతుబద్ధంగానే ఉన్నయని సామాన్యులు సైతం అంటున్నారు.  

ఏపీ పోలీసులు జ్యుడీషియల్ అధికారులనూ వదలరా?

ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఏ నిబంధనలూ వర్తించవా.. ప్రభుత్వానికీ, తమకూ వ్యతిరేకంగా  ఎవరైనా మాట్లాడితే సహించరు. అలా యిష్టారీతిగా వ్యవహరించడానికి  ప్రభుత్వం వారికి లైసెన్స్ యిచ్చేసిందా? ఏమైనా తేడా జరిగితే కోర్టుల్లో చూసుకుందాం అన్న బరోసా యిచ్చేసిందా? అంటే రాష్ట్రంలో జరగుతున్న సంఘటనలూ, నెలకొన్న వాతావరణం చూస్తే ఔననే అనాల్సి వస్తోంది. తాజాగా ఏకంగా  ఒక సీఐ కోర్టు నియమించిన అడ్వొకేట్ కమిషన్ గా నియమించిన లాయర్ ను చితక బాదారు. వివరాలిలా ఉన్నాయి.  ఒక వ్యక్తి అక్రమ నిర్బంధం విషయంలో ఏపీ హైకోర్టు నియమించిన అడ్వొకేట్ కమిషన్  అడ్వకేట్ ఉదయ సింహారెడ్డి,  తన కోర్టు సిబ్బందితో వెళ్లారు. అక్రమ నిర్బంధంలో ఉన్న వ్యక్తి పీఎస్ లో  చిత్రహింసలకు గురయ్యాడని గుర్తించిన జ్యుడీషిల్ అధికారి ఉదయ సింహ అతడిని మరుసటి రోజు కోర్టులో హాజరు పర్చాల్సిందిగా అక్కడి  పోలీసులకు చెప్పారు. అలాగే అందుకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ దశలో పోలీసు స్టేషన్ లో ఉన్న సీఐ యిస్మాయిల్ పోలీసు సిబ్బంది లాయర్ ఉదయ సింహారెడ్డి, ఆయనతో వెళ్లిన యిద్దరు కోర్టు సిబ్బంది దాడి చేసి కొట్టారు. ఈ విషయంపై ఆయన కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఏపీ హైకోర్టు సుమో పిల్ నమోదు చేసింది. ఆ కేసు సోమవారం (మే 8) విచారణకు వచ్చింది. ఈ కేసు విచారణ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్  కుమార్ మిశ్రా హిందూపురం సీఐ యిస్తాయిల్ పై పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు నియమించిన కమిషన్ పై చేయి చేసుకోవడానికి సీఐకి  ఎంత ధైర్యం అని  వ్యాఖ్యానించింది.  కోర్టు పాలనా విధులకు ఆటంకం కలిగించడమేనని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. తక్షణమే సిఐ యిస్మాయిల్ పై కోర్టు ధిక్కరణ కింద అభియోగాలు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. కాగా ఏపీలో ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడడాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోని పరిస్థితి కనిపిస్తోంది. అందుకే పెద్ద సంఖ్యలో అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. యిటీవలే కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ యిద్దరు ఆర్టీసీ అధికారులకు కోర్టు జైలు శిక్ష , జరిమానా కూడా విధించింది. యిప్పుడు సీఐ ఏకంగా కోర్టు నియమించిన జ్యుడీషియల్ అధికారిపైనే చేయి చేసుకోవడం సంచలనంగా మారింది.   యిప్పటికే న్యాయమూర్తుల్ని బూతుల్ని తిట్టిన కేసు సీబీఐ దర్యాప్తులో నత్తనడకన సాగుతోంది.   మొత్తం మీద ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందన్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా జ్యుడీషియల్ అధికారిపై సీఐ చేయిచేసుకున్నసంఘటనలో హై కోర్టు సీరియస్ అయ్యింది.  

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. జమిలి అనుమానాలు!

తెలంగాణ ఎన్నికల విషయంలో ముందస్తు ముచ్చట వెనక్కు పోయి.. జమిలి అవకాశాలపై చర్చకు తెరలేచింది. రాష్ట్రంలో ఎలాగైనా సరే అధికారాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ.. పొరుగున ఉన్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కర్నాటక ఫలితాల ప్రభావం పడి గెలుపు వాకిట బోల్తా పడే అవకాశాలున్నాయని ఆందోళన చెందుతోంది.  దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కూడా సార్వత్రిక ఎన్నికలతో  పాటు వచ్చే ఏడాది లో నిర్వహించాలని భావిస్తోంది. అందు కోసం చట్టపరంగా, న్యాయపరంగా ఉన్న అవకాశాలను తీవ్రంగా పరిశీలిస్తోంది. జమిలి కోసం పార్లమెంటులో ఆర్డినెన్స్ తీసుకువచ్చైనా సరే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల వరకూ వాయిదా వేయడమే మంచిదన్న భావన బీజేపీ అధిష్ఠానంలో బలంగా వ్యక్తమౌతోందని కేంద్రంలో బీజేపీకి సన్నిహితంగా మెలిగా వర్గాలు విశ్వసనీయంగా చెబుతున్నాయి. దీంతో తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగేదెప్పుడన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటే జరిగితే..  అది కచ్చితంగా బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తుందని తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గట్టిగా నమ్ముతోంది.  ఒక వేళ అదే జరిగితే న్యాయపోరాటానికి రెడీ అవుతామంటోది.  ఒక్క తెలంగాణలోనే కాదు ఈ ఏడాది డిసెంబర్, నవంబర్ లో ఛత్తీస్ గఢ్,  మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాలన్నిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నది అందరూ భావిస్తున్నారు.    అందుకే పలు దశల్లో ఎన్నికలు జరిపే కేంద్ర ఎన్నికల కమిషన్..  షెడ్యూలును దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో  నవంబరు చివర్లో  ఎన్నికలు నిర్వహించే అవకాశాలే మెండుగా ఉన్నాయని, కనుక అక్టోబరులోనే షెడ్యూలు విడుదల కావచ్చనీ బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే సెప్టెంబర్ నెలాఖరునాటికి రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన క్యాలెండర్‌ను సిద్ధం చేస్తోంది. అయితే ఈ రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తరువాత ఆరు నెలల లోగానే .. సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున, ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసి జమిలిగా వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది.  ఈ విషయంలో రాజ్యాంగ పరమైన చిక్కులు ఎదురు కాకుండా  ఆర్డినెన్సు రూపంలో  వీటి అసెంబ్లీ కాలపరిమితిని మే నెల వరకూ పొడిగించే అవకాశాలు లేకపోలేదన్నది పరిశీలకుల విశ్లేషణ. అయితే బీఆర్ఎస్ మాత్రం యిందుకు ససేమిరా అంగీకరించే అవకాశాలు లేవు.  ఒక వేళ  కేంద్రం జమిలి కోసం ఆర్డినెన్స్ తీసుకువస్తే ఎదుర్కొనడం ఎలా అననదానిపై యిప్పటికే బీఆర్ఎస్ కసరత్తులు మొదలు పెట్టినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో యిప్పటికే రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాలను తీసుకునే పనిలో ఆ పార్టీ అగ్రనాయకత్వం ఉందని చెబుతున్నారు.   

మణిపూర్ మండిపోతోంది

సెవెన్ సిస్టర్స్ అని భారతీయులు ప్రేమగా పిలుచుకునే ఈశాన్య రాష్ట్రాలలో పరిస్థితులు అదుపుతప్పుతున్నాయి. నేపాల్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ వంటి దేశాల సరిహద్దులుగా భారతదేశ పటానికి మరింత అందాన్ని అద్దే ఈశాన్య రాష్ట్రాలలో మణిపూర్ ఒక అద్భుతమైన రాష్ట్రం.  ప్రకృతి అందాలతో ఈ ఏడు రాష్ట్రాలూ ఒకదానితో ఒకటి పోటీ పడుతూనే ఉంటాయి. దశాబ్ద కాలంగా మణిపూర్ రాష్ట్రంలో జాతల మధ్య పోరు సాగుతున్నా.. ప్రస్తుతం అది తీవ్రంగా మారింది.   యిక్కడ మొయితీ, కుకూ, నాగా జాతుల ప్రజలు ఎక్కువగా జీవిస్తుంటారు.  వీరిలో కుకూ, నాగా జాతులు షెడ్యూల్ తెగలుగా గుర్తింపు పొందాయి.  అయితే తమను కూడా ఎస్పీ జాబితాలో చేర్చాలంటూ మోయితీ తెగ ప్రజలు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోలేకపోయాయి.దీంతో అక్కడ పరిస్థితులుఅదుపు తప్పి దారుణ పరిస్థితులకు దారి తీశాయి.  గత వారం రోజులుగా  జరగుతున్న ఆందోనల్లో దాదాపు 60 మంది ప్రజలుచనిపోయారనీ, వంద మందికి పైగా గాయపడ్డారని, పాతిక వేల మందికి పునరావాసం కల్పించామని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. కానీ అనధకారిక  లెక్కల ప్రకారం ఈ అంకెలు యింకా ఎక్కువగానే అంటాయని విశ్లేషకులు అంటున్నారు.  మణిఫూర్ రాష్ట్రంలో మొయితీ తెగ ప్రజలు 54 శాతం మంది ఉండగా.. వారు అధికంగా  మైదాన ప్రాంతాలలో నివశిస్తుంటారు.  మే 29వ లోగా మోయితీ తెగ ప్రజలను ఎస్టీలుగా గుర్తించాల్సిందిగా మణిపూర్ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.  దీంతో కుకూ, నాగా తెగ యువత ఆందోళనకు దిగింది. ఆందోళనలో  భాగంగా భారీ ర్యాలీలు జరిగాయి.  పరిస్థితులను అదుపు చేసేందుకు అక్కడి బీజేపీ ప్రభుత్వం కుకూ, నాగా జాతి ప్రజలను పర్వత ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు బలవంతంగా తీసుకుకవస్తున్నారు.  అడవి బిడ్డలమైన తమను అడవి నుంచి దూరం చేయడంతో కుకూ, నాగాలు తిరగబడుతున్నారు. వీరు క్రైస్తవాన్ని అనుసరిస్తుండగా, మొయితీలు హిందూ జీవన విధానాన్ని అనుసరిస్తుంటారు. ఈ కారణాలతో సహజంగానే పోరు మతం వైపు సాగింది.  యింత వరకూ పాతిక చర్చీలు, 500కు పైగా ిళ్లుఅగ్నికి ఆహుతయ్యాయి. మణిపూర్ రాష్ట్రంలో అనేక విద్యాసంస్థలలో దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన విద్యార్థులుచ దువుతున్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో మిగిలిన రాష్ట్రాలు వారి వారి రాష్ట్రాల విద్యార్థులను తిరిగి రప్పించే పనిలో పడ్డాయి. యిదిలా ఉండగా..  మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలకు కేంద్రంలో , రాష్ట్రంలో ఉన్న బీజేపీ కారణమని  మణిపూర్ ట్రైబల్ ఫోరం సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మణిపూర్ ఛాయలకు కూడా వెళ్లకపోగా.. ప్రధాని, హోం శాఖ మంత్రి యిద్దరూ కర్నాటక ఎన్నికలలో బిజీగా ఉండడం కొసమెరుపు. 

ఆధార్ ఎక్కడ అవసరం? 

ఆధార్ అనివార్యత విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు   మార్గదర్శక సూత్రాలను  జారీ చేసింది. ఆధార్ విలువ ఏ మాత్రం తగ్గలేదని సుప్రీం స్పష్టం చేసింది. ఆధార్ కార్డుఎక్కడ అవసరం? ఎక్కడ అవసరం లేదు? అనే విషయాలను సుప్రీం వెల్లడించింది. సుప్రీం తీర్పు ప్రకారం స్కూళ్లలో ఆధార్ కార్డు అవసరం  లేదని చెప్పేసింది. అడ్మిషన్ తీసుకునే సమయంలో ఆధార్ కార్డు ఉండాలన్న నిబంధనను సుప్రీం కోర్టు కొట్టేసింది. స్కూళ్లలో సర్వశిక్షా అభియాన్ కోసం ఆధార్ కంపల్సరీ ఉండేది. ఇప్పుడు ఆ అవసరం లేదు.  ఆధార్ ఉంటేనే సర్వశిక్ష అలవుతుందన్న నిబంధనను సుప్రీం కొట్టివేసింది. ఇప్పటివరకు 6 నుంచి14 ఏళ్లలోపు ఆధార్ ఉంటేనే సర్వశిక్షా అభియాన్ కు అర్హత పొందేవారు. ప్రస్తుతం అటువంటి నిబంధనను సడలించారు.  ఆధార్ తో మొబైల్ లికింగ్ అవసరం లేదని  సు ప్రీం తేల్చేసింది. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇప్పటి వరకు ఆధార్ అవసరమయ్యేది. ప్రస్తుతానికి సుప్రీం ఈ నిబంధనను మినహాయించింది.  ప్రస్తుతం ఉన్న  బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింక్ అవసరం లేదని సుప్రీం స్పష్టీకరించింది. యుజీసీ,  ఎన్ఇఇటీ, సీబీఈసీ తదితర సంస్ధలలో ఆధార్ అవసరం లేదు. ప్రయివేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగ, సిబ్బంది నుంచి యాజమాన్యాలు ఇక నుంచి ఆధార్ కార్డులు అడగకూడదు. వ్యక్తి గత గోప్యతలో భాగంగా ఆధార్ అవసరం లేదని సుప్రీం స్పష్టీకరించింది. 

భయపెట్టిన జగన్.. భయపడుతున్నారా?

ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికల  ఊహాగానాలతో పాటు పొత్తుపడుపుల అంచనాలూ జోరందుకున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో  ఎన్నికల కోసం తొందరపడుతున్నదీ, ఎన్నికలంటే భయపడుతున్నదీ  ఒక్క అధికార పార్టీ వైసీపీ మాత్రమే. గత నాలుగు సంవత్సరాల పాలనలో అన్ని వర్గాల నుంచీ అసమ్మతి మూటగట్టుకోవడమే కాకుండా సొంత పార్టీలో కూడా అసమ్మతి కుంపట్లు రగిల్చిన వైసీపీ యిప్పుడు ముందస్తు ఎన్నికలకు తొందరపడుతోంది. అదే సమయంలో ఎన్నికలంటే ఓటమేనా అన్న భయంలోనూ ఉంది. ఈ అభిప్రాయం రాజకీయవర్గాలలో కలగడానికి ఆ పార్టీ అధినేత జగన్ సహా, సీనియర్ నేతలు చేస్తున్న ప్రకటనలే కారణం. పార్టీలో అసమ్మతి గళాలు పదునెక్కుతున్నాయి.. నేరుగా అధినేత విధానాలనే విమర్శిస్తున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది.  అదే సమయంలో  జగన్  ను కూడా వరుసగా చిక్కులు చుట్టుముట్టాయి. వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ, వైఎస్ సమీప బంధువు అవినాష్ రెడ్డి బయటపడలేనంతగా యిరుక్కుపోవడం, ఆయన అరెస్టునకు యిన్నాళ్ళుగా రక్షణ కవచాలుగా నిలిచిన కోర్టులు.. అరెస్టునకు లైన్ క్లియర్ చేయడం..  అదే సమయంలో హత్య జరిగిన సమయంలో వివేకా రాసినట్లుగా చెబుతున్న లేఖ విషయంలో గతంలో జగన్ చెప్పిన దానికి పూర్తి భిన్నంగా యిప్పుడు అవినాష్ మీడియా సమావేశాలలలోనూ, సెల్ఫీ వీడియోలలూనూ మాట్లాడుతుండటంతో జగన్  చిక్కుల్లో పడ్డారనీ, ఆ కేసు విషయంలో జగన్ తీరు పట్ల పొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోందనీ పరిశీలకులుఅంటున్నారు. అదే సమయంలో  మాట తప్పను మడమ తిప్పను  అంటూ బీరాలు పోయిన ముఖ్యమంత్రి   యిప్పుడు తనను ధిక్కరించే వారిని బుజ్జగించడానికి నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తుండటం చూస్తుంటే.. పార్టీపై ఆయనకు ఉన్న పట్టు సడలందన్న విశ్లేషణలు పరిశీలకుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.  నిజానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, 2024 ఎన్నికలకు రూట్ మ్యాప్ సిద్దం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల గాయాలకు, మంత్రుల ఉద్వాసనతో చికిత్స చేయాలనే నిర్ణయానికీ వచ్చారు. ఈ నేపధ్యంలోనే ఐదారుగు,మంత్రులకు ఉద్వాసన చెప్పే ఆలోచన కూడా చేశారు. మంత్రివర్గాన్ని మరోసారి పునర్వ్యవస్థీకరించాలనీ భావించారు. అయితే వివేకా హత్య కేసు విషయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యం కావడం, దానిని ఆపేందుకు ఆయన హస్తిన వెళ్లి మరీ చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో  ఆయన టోన్ మారడం... హస్తినలో ఆయనకు సీన్ రివర్స్ అవ్వడమే కావడం కారణమని పరిశీలకులు అంటున్నారు. అందుకే మంత్రులకు ఉద్వాసన, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఆలోచనను విరమించుకున్నారనీ విశ్లేషిస్తున్నారు.  అందుకే గడపగడపకూ టెస్ట్ లో ఫెయిలైన మంత్రులు, ఎమ్మెల్యేల (వీరి సంఖ్య దాదాపు 40 వరకూ ఉంటుందని అంచనా) పై వేటు కాదు సరికదా కనీసం మందలింపు కూడా చేయలేని పరిస్థితుల్లో  ప్రస్తుతం జగన్ ఉన్నారని అంటున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే, టిక్కెట్ విషయం ధృవీకరించురకునేందుకు జగన్ ను కలిసిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ఆయన మళ్ళీ టికెట్ ఇచ్చేది లేదని  చెప్పడంతో...  ఆ ఇద్దరూ.. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో .. మా ఇంటికి మీ ఇల్లూ అంతే దూరమన్న చందంగా ఆత్మ ప్రభోధం మేరకు ఓటు వేశారు.  యిలాంటి  తక్షణ తిరుగుబాటును ఊహించని జగన్  కంగుతిన్నారు.  అప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడుకు మూడు స్థానాలనూ తెలుగుదేశం కైవశం చేసుకోవడంతో  జగన్ రెడ్డి  షాక్’కు గురయ్యారు. అదే సమయంలో ఢిల్లీ పెద్దలకు, ఇంటెల్జెన్సీ వర్గాల నుంచి ఎలాంటి నివేదికలు వచ్చాయో ఏమో కానీ, ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపించి పెట్టవలసిన నాలుగు పెట్టి పంపారని అంటున్నారు. నిజానికి, కేవలం 15 రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి ఢిల్లీ ఎందుకు వెళ్ళారనే విషయంలో  అప్పట్లో అనేక ఊహాగానాలు వినిపించినా, నిజానికి ముఖ్యమంత్రి తనంతట తానుగా ఢిల్లీ వెళ్ళలేదని, ఢిల్లీ పెద్దల ‘ఆదేశం’ మేరకే ఆయన హస్తిన వెళ్ళారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఇంటెల్జెన్సీ వర్గాలు అందించిన సమాచారం మేరకే, ఢిల్లీ పెద్దలు జగన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి పరిస్థితిని వివరించారని అంటున్నారు. అందుకే విషయ తీవ్రతను దృష్టిలో ఉంచుకునే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బాగా పొద్దుపోయిన తర్వాత, అర్థ రాత్రికి అరగంట ముందు జగన్ రెడ్డికి  అప్పాయింట్మెంట్ ఇచ్చారనీ, అంతే కాకుండా ఆ  సందర్భంగా ముఖ్యమంత్రి తమ ధోరణి మార్చుకోకపోతే, చాలా పెద్ద సంఖ్యలో,  ఇంచు మించుగా హాఫ్ సెంచరీ వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా అమిత్ షా  జగన్ ను హెచ్చరించినట్లు చెబుతున్నారు.  అందేకే హస్తిన నుంచి తిరిగి వచ్చిన తరువాత  జగన్ అసమ్మతి ఎమ్మెల్యేల విషయంలో.. అలాగే గడపగడపకు కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోని ఎమ్మెల్యేల విషయంలో పూర్తిగా యూటర్న్ తీసుకుని బుజ్జగింపుల పర్వంలోకి దిగారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. 

కమలం ఫోకస్ ఇక తెలంగాణాపై

కర్ణాటకలో ఎన్నికల సమరానికి తెర  పడుతున్న నేపథ్యంలో ఇక కాంగ్రెస్, బీజేపీ ఫుల్ ఫోకస్ తెలంగాణ పైనే ఉంది. దక్షిణాదిలో కీలకమైన కర్ణాటక, తెలంగాణ మీద కమలం ఫోకస్ పెట్టింది. కర్ణాటకలో ఈ నెల 10న పోలింగ్ ఉంది. 13న ఫలితాలు విడుదల కానున్నాయి. కాబట్టి ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో  కర్ణాటక పొరుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం  చేయాలని బిజేపీ నిర్ణయించుకుంది. కర్ణాటక బార్డర్ లో ఎన్నికల సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది.     దీంతో ఆయా పార్టీల హేమాహేమీలు తెలంగాణను వరుసగా పర్యటించడానికి షెడ్యూల్ ను సిద్ధం చేసుకుంటున్నారు. ఇంతకుమునుపు ప్రియాంక గాంధీ యువ సంఘర్షణ సభకు వస్తున్నారు. మరో వైపు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది.సోమవారంతో కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి తెరపడుతుండడంతో మర్నాడే తెలంగాణకు మోడీ వస్తున్నట్టు సమాచారం. వరంగల్ లో ఏర్పాటు చేసిన టెక్స్ టైల్ పార్కును ఆయన ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే అటు కాంగ్రెస్ ఇంకా బీజేపీ రెండు పార్టీలు కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడ్డాయి. కర్ణాటకలో ఎన్నికల సమరానికి తెర పడుతున్న నేపథ్యంలో ఇక కాంగ్రెస్, బీజేపీ ఫుల్ ఫోకస్ తెలంగాణ పైనే ఉంది. దీంతో ఆయా పార్టీల హేమాహేమీలు తెలంగాణను వరుసగా పర్యటించడానికి షెడ్యూల్ ను సిద్ధం చేసుకుంటున్నారు. ఇంతకు మునుపే ప్రియాంక గాంధీ యువ సంఘర్షణ సభకు రానున్నారు. మరో వైపు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సోమవారంతో కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి తెరపడుతుండడంతో మర్నాడే తెలంగాణకు మోడీ వస్తున్నట్టు సమాచారం. వరంగల్ లో ఏర్పాటు చేసిన టెక్స్ టైల్ పార్కును ఆయన ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే అటు కాంగ్రెస్ ఇంకా బీజేపీ రెండు పార్టీలు కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడ్డాయి. ఇక దక్షిణాదిలో ఖాతా ఓపెన్ చేయడానికి చాలా కాలం నుంచి ఉవ్విలూరుతున్న కమలం పార్టీ కర్ణాటకలో ఎలాగైనా పాగా వేయాలని శత ప్రయత్నాలు చేస్తోంది. అది కాని సాధ్య పడితే..దాని ప్రభావం తప్పని సరిగా తెలంగాణపై ఉంటుందని భావిస్తోంది. దీని కోసం ఏ అవకాశాన్ని వదులుకోవద్దన్న వ్యూహంతో సరిహద్దుల్లో సభ నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.ఈ క్రమంలో కర్ణాటక ఎన్నికల కోడ్ సమస్య లేకుండా జహీరాబాద్, నారాయణ పేట లేదా మరెక్కడైనా సభను నిర్వహించే అవకాశముందని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరో వైపు తెలంగాణలో పార్టీని ప్రజలకు చేరువ చేయడానికి అనేక వ్యూహాలతో బీజేపీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం పై ఎటాక్ చేయడంతో పాటు కేంద్రమంత్రులు, ముఖ్యనేతల పర్యటనల ద్వారా పార్టీ క్యాడర్ లో కొత్త జోష్ ను నింపాలని స్కెచ్ వేసింది. దాంతో పాటు రాష్ట్రానికి వివిధ రంగాల అభివృద్ధి కోసం కేంద్రం ఇస్తున్న పథకాల గురించి కూడా ప్రజల్లోకి క్షేత్ర స్థాయిలో తీసుకొని వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. 

టెక్సాస్ లో కాల్పులు.. తెలుగమ్మాయి మృతి

అమెరికాలో మరో సారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన తాటికొండ ఐశ్యర్య అనే యువతి మరణించింది. టెక్సాస్ లోని ఓ మాల్ లో దుండగులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో  ఎనిమిది మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. మృతులలో తెలంగాణకు చెందిన ఐశ్వర్య అనే విద్యార్థిని కూడా ఉంది. రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ తాటికొండ నర్సిరెడ్డి కుమార్తె తాటికొండ ఐశ్వర్య. ఐశ్వర్య మృదేహాన్ని హైదరాబాద్ కు రప్పించేందుకు కుటుంబ సభ్యులతో పాటు అమెరికా తెలుగు సంఘాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. మూడేళ్ల కిందట ఉన్నత చదువుల కోసం ఐశ్వర్య టెక్సాస్ వెళ్లారు.  

ధర్టీ యియర్స్ యిండస్ట్రీ ఫృధ్వీ.. ఎందుకూ కాకుండా పోయినట్టేనా?

వైసీపీలో విశ్వాసంగా పని చేసిన వారిని పార్టీకి దూరం చేయడం జగన్ నైజంగా కనిపిస్తోంది. థర్టీ యియర్స్ యిండస్ట్రీ నటుడు పృధ్వీరాజ్ నుంచి తాజాగా మాజీ మంత్రి బాలినేనికి పార్టీలో ఎదురౌతున్న పరిస్థితి వరకూ ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. అంతేనా దశాబ్దాల పాటు కాపాడుకున్న నిజాయితీని తాకట్టు పెట్టి మరీ జగన్ కోసం పని చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం వంటి సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఆయన యిచ్చిన మర్యాదను కూడా ఉదాహరణగా చూపవచ్చు.   ముందుగా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి గురించి చెప్పుకుంటే..  2019 ఎన్నికలకు ముందు  వైసీపీలో  చేరిన ఆయన, కొద్ది కాలం పాటు ఆ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. అ ఎన్నికలలో  పార్టీ గెలుపు కోసం, తన స్థాయిని మించి కష్ట పడ్డారు. కష్టపడటం అంటే జగన్మోహన్ రెడ్డిని వేనోళ్ళ పొగుడుతూ, ఆయన ప్రత్యర్థులను  యిష్టారీతిగా తిడుతూ ఉండటమే. ఆయన అదే పని చేస్తూ అప్పట్లో ఉరూరా తిరిగారు. పార్టీ ప్రచారంలో  తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. అదే ప్రచారమనుకున్నారు. నోరున్నది ఎందుకు అంటే రాజకీయ ప్రత్యర్ధులను విమర్శించడానికే  అన్నట్లు విరుచుకు పడ్డారు. ఆయన ప్రచారం పని చేసిందో, రాష్ట్ర ప్రజల దురదృష్టమో కానీ, ఆ ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. జగన్మోహన్  రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.   సహజంగానే, పార్టీ కోసం అంతగా కష్టపడిన పృధ్విని జగనన్న తనను అందలం ఎక్కిస్తారని ఆశపడ్డారు. అయితే ఆయన ఏమి ఆశ పడ్డారో, ఏమి ఆశించారో ఏమో కానీ, జగన్ రెడ్డి ఆయనకు మరీ మొండి చేయి చూపించకుండా, ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవి యిచ్చి చేతులు దులిపేసుకున్నారు. అయితే.. కోతికి కొబ్బరికాయ దొరికించే చాలన్నట్లుగా పృద్వీ మరింతగా రెచ్చిపోయారు. ప్రతి పక్ష పార్టీల నాయకులను ఎంత గా తిడితే, అంతగా జగన్ దృష్టిలో పడొచ్చని భావించారు.  (అలా భావించి యిప్పటికీ ప్రత్యర్థులపై తిట్లపురాణంతో చెలరేగిపోతున్నవారు వైసీపీలో ఉన్నారు. అలా చెలరేగిపోయి యిప్పుడు పార్టీలో ఎవరికీ పట్టనట్టుగా మిగిలిపోయిన వారూ ఉన్నారు.)  మరో మెట్టు ఎక్కచ్చని అనుకున్నారో ఏమో కానీ, ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవిని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకు పడ్డారు. చివరకు  అమరావతి రైతుల ఆందోళలోనూ వేలు పెట్టారు. సినిమా కూతలు కూశారు. అమరావతి రైతుల ఉద్యమంపై థర్టీ  యియర్స్ పృథ్వీ చేసిన డర్టీ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైయ్యాయి.అయినా అయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రతిపక్షాలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అయితే, పృధ్వీ ఎస్వీబీసే వైభోగం మూడు నాళ్ళ ముచ్చటగా ముగిసి పోయింది.  ఒక మహిళకు ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన వాయిస్ రికార్డులు బయటకు రావటంతో ఎస్వీబీసీ ఛైర్మన్‌ బాధ్యతల నుండి తప్పించారు. ఇక అంతే, అక్కడి నుంచి థర్టీ ఇయర్స్ ఫృధ్వీ కి కష్టాలు మొదలయ్యాయి.  ఎస్వీబీసీ నుంచి  గెంటేసిన తర్వాత, వైసీపీలో ఆయన్ని పట్టించుకున్నవారు లేరు. మరో వంక నడమంత్రపు సిరి శాశ్వతం నుకుని రెచ్చి పోయి వెనకా ముందు చూసుకోకుండా, చిందులేసిన పాపానికి ఆయన్ని ఇండస్ట్రీ కూడా వదిలేసింది.  కానీ  దాదాపుగా ఫృధ్వి ఎదుర్కొన్న లాంటి విమర్శలే ఎదుర్కొన్న అంబటి రాంబాబు మంత్రిగా పదోన్నతి పొంది కొనసాగుతున్నారు. కాగా కొంచెం ఆలస్యంగానే అయినా, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి తత్త్వం బోధపడినట్లుంది. అప్పట్లోనే తనపై సొంత పార్టీ వాళ్లే కుట్రపన్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు,    పక్క చూపులు  చూశారు. పవన్ కళ్యాణ్ పంచన చేరేందుకు ప్రయత్నించారు. 2024 ఎన్నికలలో జనసేన 40 స్థానాలలో విజయం సాధిస్తుందని జోస్యం కూడా చెప్పారు. కానీ అదేమీ ఆయనకు జనసేనలోకి ఎంట్రీ పాస్ గా ఉపయోగపడిన దాఖలాలు కనిపించడం లేదు.  గతంలో ఇదే థర్టీ యిండస్ట్రీస్ పృద్వీ అందరి కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ పైనే వ్యక్తిగత విమర్శలు గుప్పించారని గుర్తు చేస్తూ జనసైనికులు ఆయనపై విమర్శలు గుప్పించారు.  రాజకీయాలలో విమర్శలూ, ఆ తరువాత పొగడ్తలూ చేయడం నాయకులకు సాధారణమేననీ, గతంలో అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రోజా చేసిందీ అదే కదా అంటున్న వారు లేకపోలేదు. అయితే, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫృధ్వీ మాత్రం కొంచం చాలా అతి చేశారనీ, అందుకే ఆయనను దగ్గరకు రానీయడానికి జనసేనే కాదు, యిండస్ట్రీ కూడా యిష్టపడటం లేదనీ అంటున్నారు. ప్రస్తుతానికి అయితే పృధ్వీ పరిస్థితి ఎవరికీ పట్టని వాడు ఎక్కెక్కి ఏడుస్తున్నట్లుగానే ఉందని పరిశీలకులు అంటున్నారు. 

వైసీపీలో అసమ్మతికి జగనే కారణమా?

యిటీవల విడుదలైన సినిమాలలో బలగం ప్రజలను విశేషంగా ఆకర్షించింది. ఆ సినిమా గొప్పతాన్ని యిక్కడ మనమేమీ చర్చించుకోవడం లేదు. కానీ ఒక కుటుంబాన్ని ముందుండి నడిపించాల్సిన వ్యక్తి ఆ పని చేయకపోతే.. ఏం జరుగుతుందో ఈ సినీమా అర్ధమయ్యేలా చెప్పింది. కుటుంబం చీలిపోతుంది. ఒకరికి ఒకరు వ్యతిరేకులౌతారు. శత్రువులౌతారు. ఒక రాజకీయ పార్టీ విషయమేనా అంతే.. పార్టీ నేత పార్టీని ఒక కుటుంబంగా.. అందులో సభ్యులందరినీ తనవారుగా భావించకపోతే పార్టీ చీలిపోతుంది. చీలికలు పేలికలు అవుతుంది. యిందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా మాత్రం జగన్ అధినేతగా ఉన్న వైసీపీని చెప్పుకుంటే సరిపోతుంది. జగన్  తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఏపీలో కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై నడిపారు. ఆయన జీవించి ఉన్నంత వరకూ పార్టీలో అసమ్మతి, అసంతృప్తి ఉన్నప్పటికీ.. అదంతా ఏదో ఒకరిద్దరికి సంబంధించిన వ్యవహారంగానే ఉండింది. ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత కూడా పార్టీలో మెజారిటీ భాగం ఆయన కుమారుడి జగన్ కు మద్దతుగా నిలిచారు. వైఎస్ వారసుడిగా జగన్ నే ముఖ్యమంత్రిని చేయాలంటూ.. ఆయన మృతదేహం సాక్షిగా సంతకాల సేకరణ కూడా జరిగింది. అయితే జగన్ వ్యవహార శైలి కారణంగా అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా అందుకు అంగీకరించలేదు. దీంతో జగన్ సొంత కుంపటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) పెట్టుకున్నారు. అప్పుడు కూడా వైఎస్ అభిమానులు జగన్ వెంటే నడిచారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మరీ జగన్ పార్టీలో చేరారు. ఒక ఎన్నికలలో ఓడిపోయినా జగన్ ను వారు వీడలేదు. సరే 2019 ఎన్నికలలో జగన్ సొంత పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. వైఎస్ కుమారుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అక్కడ నుంచే జగన్  పెద్దరికం డొల్లతనం బయటపడింది.  నేను అని తప్ప మనం అన్న పదానికి అర్ధం తెలియని విధంగా వ్యవహరించడంతో తొలుత ఆయన సొంత కుటుంబీకులే దూరమయ్యారు.  పార్టీ కుటుంబం సరే.. అదే పార్టీలో సొంత తల్లి, తోడబుట్టిన చెల్లి కూడా ఉన్నారు. వారిరువురినీ ఆయన దూరం పెట్టారు. కారణాల జోలికి వెళ్లడం లేదు. వారిరువురినే దూరం పెట్టిన జగన్ పార్టీలో కూడా ఎవరికీ అందుబాటులోకి రాని రాజరికాన్ని ప్రదర్శించారు.  ఫలితంగా యిప్పుడు వైసీపీలో అసమ్మతి జ్వాలలు భగ్గుమంటున్నాయి. ఏ క్షణంలో ఎవరు పార్టీని వీడుతారు.. ఎవరు పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తారు అన్నది పార్టీ అధినేతకే అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో జగన్  అవినాష్ రెడ్డి కి మద్దతుగా నిలిచిన తీరు.. అందుకోసం అందరూ అజాత శత్రువుగా భావించే వివేకానందరెడ్డి వ్యక్తిత్వంపై వేస్తున్న నిందలు, ఆమె కుమార్తె తన తండ్రి హంతకుల ను చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలంటూ చేస్తున్న న్యాయపోరాటం.. వైఎస్ పై ఉన్న అభిమానాన్ని కూడా బద్దలు కొట్టి జగన్ కు వ్యతిరేకతను పెంచేలా ఉందని పరిశీలకులు చెబుతున్నారు.  తాను జైలులో ఉన్నంత కాలం పార్టీని పదిలంగా కాపాడిన తల్లి విజయమ్మ, ఆయన తల్లి విజయలక్ష్మి  చేత వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయించడం, జగనన్న వదిలిన బాణాన్ని అంటూ కలికి బలపం కట్టుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసిన షర్మిలను పార్టీకి దూరం చేయడం వంటివన్నీ జగన్ వ్యక్తిత్వాన్ని పార్టీ శ్రేణుల ముందు బ్లాక్ అండ్ వైట్ లో నిలబెట్టాయి. దీంతో  ప్రజలలో ఆయన పాలనా తీరు పట్ల వ్యతిరేకత వ్యక్తమౌతుంటే.. పార్టీలో ఆయన నిరంకుశ శైలి పట్ల వ్యతిరేకత ప్రబలుతోంది.  ముందు ముందు ఈ వ్యతిరేకత మరింత పెచ్చరిల్లే ప్రమాదం ఉందంటున్నారు. బలగం సినిమాలో కుటుంబ పెద్ద అల్లుడిని కొడుకులు అవమానిస్తుంటే అడ్డుకోలేక కుటుంబ చీలికకు కారణమైతే.. వైసీపీలో జగన్ తానే స్వయంగా అయిన వారిని అవమానాల పాలు చేస్తూ పార్టీలో ముసలానికి కారణమౌతున్నారని పరిశీలకులు విమర్శిస్తున్నారు. 

జగన్ న్నాథ రథచక్రాల కిందనలిగిపోతున్న ఏపీ

వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రధ చక్రాలు వస్తున్నాయి.. రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలంటే... ప్రతిపక్ష నేత  జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాల్సిందే.. అలా అయితేనే.. ప్రజలకు శాంతి, సౌఖ్యం, సంక్షేమం అంటూ వేల కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో వైసీపీ అధ్యక్షుడు  జగన్ నుంచి ఆ పార్టీ కార్యకర్త వరకు అందరూ చెప్పుకొంటూ పోవడంతో..  ఓటర్లు అమాయకంగా జగన్ పార్టీకి గంపగుత్తగా ఓట్లు గుద్దిపారేశారు. ఆ గుద్దుడికి అప్పటి ప్రతిపక్ష పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి కూర్చిలోకి వచ్చి పడ్డారు. అలా వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. 2019, మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంటే 2023, మే 30వ తేదీకి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి  అవుతుంది.   ఈ నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా జగనన్న.. పాలనా వైభోగాన్ని ఒక సారి అవలోకనం చేసుకుంటే..  గతంలో చెప్పినట్లు రాజన్న రాజ్యం తీసుకువచ్చారా?  రాష్ట్రాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానానికి తీసుకెళ్లారా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు..  మోదీ ప్రభుత్వంతో పోరాడి మరీ సాధించుకొచ్చారా? ఆంధ్రప్రదేశ్  జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారా?  అభివృద్దిలో  ఆంధ్రప్రదేశ్.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడి దూసుకుపోతోందా?  రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయా?  ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు.. వస్తున్నాయని   వైసీపీ నేతలు చెప్పినట్లు ఆ జగన్నాథ రథచక్రాలు వచ్చాయా వచ్చేశాయా అంటే పరిశీలకులు వచ్చేశాయంటున్నారు. కానీ అవి జనాన్ని తొక్కుకుంటూ సాగుతున్నాయనీ.. ఆ ‘జగన్’ న్నాథ రథచక్రాల కింద పడి జనం నలిగిపోతున్నారనీ విశ్లేషిస్తున్నారు.   గన్ గద్దెనెక్కిన నాటి నుంచి నేటి వరకు ఈ నాలుగేళ్ల పాలనలో.. ప్రజా వేదిక కుప్పకూల్చడంతో ప్రారంభమైన  విధ్వంసం.. అప్రతిహాతంగా అలా కొనసాగుతూనే ఉేందని అంటున్నారు.  ఆ తర్వాత ఇసుక సరఫరా  నిలిపివేతతో భవన నిర్మాణదారులు పెట్టిన ఆర్తనాదాలు,   జగనన్న తీసుకొచ్చిన కొత్త మద్యం బ్రాండ్లతో.. మందుబాబులకు కిక్క్ ఎక్కడం దేవుడేరుగు.. కిక్క్ డ్ ది బెక్కెట్ అన్నట్లుగా.. ప్రాణాలు హరించిపోతున్నాయి. ప్రతిపక్షనేతగా రాజధాని అమరావతికి మద్దతు ప్రకటించి..  . అధికారంలోకి మూడు రాజధానులు ఉండాలని.. అలా అయితేనే పాలన, పరిపాలన వికేంద్రీకరణ జరుగుతోందని ప్రకటించడం.. ఆ దిశగా అడుగులు తడబడుతూ వేయడం.. దాంతో తాము నిండిమునిగిపోయామంటూ... ఆందోళనలకు దిగినా.. ధర్నాలు చేసినా... ఆక్రందనలతో పెడబొబ్బలు పెట్టినా రాజధానికి భూములిచ్చిన రైతుల గోడు పట్టించుకునే నాథుడు లేకపోవడంతో.. తమ బాధలు, తమ గాధలు అటు ఆ కలియుగదైవం శ్రీవెంకటేశ్వరుడికి.. ఇటు ప్రత్యక్ష నారాయణుడు అరసవిల్లిలోని శ్రీసూర్య భగవానుడి చెప్పుకొనేందుకు పాదయాత్రకు శ్రీకారం చుట్టిన ఫలితం మాత్రం లేకపాయే.  ఇక జగన్ అధికారంలోకి రాగానే అమలు చేస్తున్న నవరత్న పథకాలు.. కాలం గడిచే కొద్ది... రంగు వెలిసిపోతూ.. నవరత్నాల ఉంగరంలోని నకిలీ రాళ్లు.. రాలినట్లుగా ఒక్కొ పథకం ఒక్కో రాయి లాగా జారి పడిపోతున్నాయి. ఇక తాము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేసి.. ఆ స్థానంలో పాత ఫించన్ విధానాన్ని అమలు చేస్తామంటూ ప్రభుత్వ ఉద్యోగులకు స్పష్టమైన హామీ ఇచ్చి .. అధికారంలోకి రాగానే.. ఆ హామీని తుంగలోకి తొక్కి.. తాము మాట తప్పం.. మడమ తిప్పం అంటూ చెప్పుకున్న గొప్పలన్నీ డొల్లేనని రుజువు చేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర విభజనతో ప్రభుత్వానికి రాబడి నిల్.. అప్పులు మాత్రం ఫుల్‌గా ఉండడంతో.. రాష్ట్రంలో ఆర్థిక శాఖ కాస్తా.. అప్పుల శాఖగా మారిపోయింది.  ఇలా చెప్పుకొంటూ పోతే.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలోని చోటు చేసుకొన్న వైఫల్యాలు లెక్కకు అందనన్ని ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఇక ఎగత న్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నేత   జగన్ సొంత బాబాయి,  వివేకా దారుణ హత్యకు గురైతే... సొంత ఇంటి మనిషి ప్రభుత్వాధినేతగా ఉండి కూడా న్యాయం జరగకపోవడం... పట్ల ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నారు.  ఇలా ఈ నాలుగేళ్లల్లో జగనన్న పాలనను బేరిజు వేసుకొంటూ వెళ్లితే.. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చూసుకుంటే.. భూమీ ఆకాశాలు కలిసే చోటే అది ఆవిష్క్రృతమవుతోందని  రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అందుకే వచ్చేశాయి.. వచ్చేశాయి... తొక్కేశాయి.. తొక్కేశాయి.. జగన్నాథ రధచక్రాలు.. రథ చక్రాల కిందపడి.. టోకుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ఆనవాలు లేకుండా.. ఆంధకారంలో పడి కొట్టుమిట్టాడుతోంది.

కాలం కలిసి రావడం లేదా?

కాలం... ఓ మాయల మరాఠి.  అది చేసే జిమ్మిక్కుల ముందు.. ప్రతి ఒక్కరు తైతక్కలాడాల్సిందే. కాలం కొట్టే దెబ్బకు ఎవరూ అతీతులు కారు. చిట్ట చివరకు సృష్టి, స్థితి, లయ కారకులైనా సరే. ఇంకా చెప్పాలంటే... పాలమ్మినోడిని ఓ రాష్ట్రంలో మంత్రిని చేస్తే.. టీ అమ్మినోడిని ఓ దేశానికి ప్రధాన మంత్రిని చేస్తోంది. పార్టీ అధినేతలుగా, ముఖ్యమంత్రిగా పీఠాలెక్కి రాజ్యాలు ఏలిన వాళ్లు నానా గడ్డి తిన్నారంటూ.. చివరకు శ్రీకృష్ణజన్మస్థానంలోకి తోసి.... ఊచలు లెక్కించేలా చేస్తుందీ. అదీ కాలం. అదీ కాల మహిమంటే. పాలమ్మిన చోటే కట్టెలమ్మాల్సిన పరిస్థితి వస్తుంది కాలం కలసిరాకపోతే. అలా కాలం ఈడ్చీ కొట్టిన దెబ్బకి ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మే 5వ తేదీ ఒంగోలులో ప్రెస్ మీట్ పెట్టి..  మీడియా ముందు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాదు.. తనపై సొంత పార్టీ వారే.. ఇంకాచెప్పాలంటే..  తాను ఎమ్మెల్యే సీట్లు ఇప్పించిన వారే..  తనపై విమర్శలు చేస్తున్నారంటూ ఒకానొక దశలో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.  అయితే అయిదుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన ఓ సారి మహానేత, డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా... మరోసారి వైయస్ జగన్ తొలి కేబినెట్‌లో అడవులు, పర్యావరణం, ఇంధన శాఖ మంత్రిగా పని చేశారని.. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలను శాసించి.. ఓ ఊపు ఊపిన తమ ఎమ్మెల్యే బాలినేని.. ఇలా.. ఇలాగా మాట్లాడతారని తాము కలలో కూడా అసలు ఊహించలేదని ఒంగోలు నగర వాసులు ఈ సందర్బంగా పేర్కొంటున్నారు.  గతంలో బాలినేని వాసన్న హవాను ఈ సందర్బంగా జిల్లా వాసులు గుర్తు చేసుకొంటున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు అత్యంత సమీప బంధువన్న సంగతి అందరికి తెలిసిందేనని. ఆ క్రమంలో ఆయనకు పార్టీలోనే కాదు.. బంధు వర్గంలో కూడా ఆయనకు మంచి ఆదరాభిమానాలు ఉన్నాయని.. ఓ నాడు అలా ఓ వెలుగు వెలిగిన నాయకుడు నేడు ఇలా మాట్లాడడం చూస్తేంటే తమకే బాధేస్తోందని ఒంగోలు నగర వాసులు ఓ విధమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా బాలినేని పవర్‌లో ఉండగా చేసిన పనులే ఆయనను ఈ స్థితికి తీసుకు వచ్చాయనే అభిప్రాయం సైతం వారి నుంచి వ్యక్తమవుతోంది. అంతేకాదు.. నాటి సంఘటనలను వారు సోదాహరణగా వివరిస్తోంది.  బాలినేని శ్రీనివాసరెడి జన్మదినం డిసెంబర్ 12వ తేదీ. అయితే 2021 ఏడాదిలో బాలినేని వాసన్న జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఒంగోలులో ఊరు వాడల ఘనంగా నిర్వహించాయి. ఆ సందర్భంగా బాలినేని వీరాభిమాని, పార్టీ కార్యకర్త సుబ్బారావు గుప్తా.. ఫ్యాన్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత.. వరుసగా చోటు చేసుకోంటున్న పరిస్థితులు... అలాగే భవిష్యత్తులో మరో పార్టీ అధికారంలోకి వస్తే.. మన పార్టీ శ్రేణులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందంటూ.. ప్రస్తుత పరిస్థితులను అకళింపు చేసుకొని మరీ సుబ్బారావు గుప్తా మాట్లాడారని... అయితే అతడేదో పెద్ద నేరం చేసినట్లు.. ఆయనకు బాలినేని వాసన్న వర్గం నుంచి బెదింపులు రావడంతో ప్రాణ భయంతో బిక్కు బిక్కు మంటూ భయపడి గుంటూరు పారిపోయి.. ఓ లాడ్జిలో తల దాచుకొన్నారు. ఆ క్రమంలో గుప్తా కుటుంబం ఎంత వేదన పడిందో అందరికీ తెలిసిందే.  కానీ బాలినేని ప్రధాన అనుచరుడు సుభానీ.. సుబ్బారావు గుప్తా ఆచూకీ కనుగొని.. అతడిపై దాడి చేస్తూ.. బండబూతులు తిడుతూ... మంత్రి బాలినేనికి క్షమాపణలు చెప్పించారు. అందుకు సంబంధించిన వీడియో నాడే కాదు.. నేడు సైతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే సుబ్బారావు గుప్తాపై దాడి అంశంలో మంత్రి బాలినేని అనుచరులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆ క్రమంలో పలు సంఘాలు సైతం ఆందోళన బాట పట్టడంతో.. బాలినేనిపై తీవ్ర ఒత్తిళ్లు రావడంతో..  తన అనుచరుడు సుభానీపై పోలీసులు కేసులు నమోదు చేయక తప్పలేదు. ఆ తర్వాత అతడిని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఈ వ్యవహారం ఒంగోలు నియోజకవర్గంలో తీవ్ర వివాదాస్పదమైందని నగర ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  దేవుడుకి, కాలానీకి అందరూ సమానులే. అందుకే సమయం వచ్చినప్పుడు ఎవరికి ఏదీ ఇవ్వాలో అది ఇచ్చేసే వెళ్తోంది... అలాగే ఎవరి నుంచి ఏమీ తీసుకోవాలో అదీ ఖచ్చితంగా తీసుకోనే వెళ్లుందో.. అదీ బలవంతంగా అయినా సరే. అయినా కాలానికి లేనోళ్లు, గొప్పొళ్లు అనే బేధభావం ఉండదు. ఎందుకంటే అది కాలం కదా అని నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు.

మంత్రి రోజా కొత్త అవతారం!

ఆర్కే రోజా..  తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. గతంలో వెండితెర మీద హీరోయిన్‌గా వెలుగు వెలిగినా.. నిన్న మొన్నటి వరకు బుల్లితెర మీద క్యామెడీ షోల్లో న్యాయ నిర్ణేతగా మార్కులేసినా..  అలాగే రియాల్టీ షోల్లో జడ్డిలాగా లేడీ పెదరాయుడిలా తీర్పులు చెప్పినా.. మంత్రి పదవి రావడంతో..  వాటన్నింటికి ఆమె ఫుల్ స్టాప్ పెట్టేశారు.  అయితే ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో పర్యాటక శాఖ మంత్రిగా ఆమె కొనసాగుతున్నారు. ఆ క్రమంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి   జగనపై కానీ,  పార్టీపై కానీ  ప్రతిపక్ష  పార్టీలకు చెందిన ఎవరు... ఏమైనా చిన్న పాటి విమర్శ చేసినా  రోజా  ఇలా రంగంలోకి దిగి.. అలా రంగు పడుద్ది అన్నట్లుగా వార్నింగ్‌లు ఇచ్చేస్తున్నారు. ఆ విషయంలో ఎవరినైనా.. ఎవరికైనా సరే... నో మినహాయింపు అన్నట్లుగా  రెచ్చిపోతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో టీడీపీ అధినేత  చంద్రబాబును ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ పొగడ్తలతో ముంచెత్తారు. అంతే జగన్ కేబినెట్‌లోని మంత్రులు, మాజీలు  రంగంలోకి దిగేశారు. వారిలో రోజా కూడా  ఉన్నారు. అలా రజినీ కాంత్‌పై విమర్శలు గుప్పించారు.  అయితే జగన్ ప్రభుత్వం ఇటీవల మా నమ్మకం నువ్వే జగన్ అన్న స్టిక్కర్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ క్రమంలో పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు అంతా  పాల్గొంటున్నారు.  మంత్రి రోజా సైతం.. భుజానికి సంచి తగిలించుకొని వెళ్తున్న ఓ వీడియో.. ఆ వీడియోలో వస్తున్న  వ్యాఖ్యానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వారు రోజా స్టైల్ పై సెటైర్లు వేస్తున్నారు. యిది ఆమె కొత్త అవతారమా అని జోకులు పేలుస్తున్నారు.   ముచ్చటగా మూడోసారి   ఎమ్మెల్యేగా గెలువడం అంత వీజీ కాదు కానీ.. భుజాన సంచితో కొత్త వ్యాపారం చాలా బాగుందమ్మా  అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. ఎంతైనా ఎక్స్ పీరియన్స్ .. ఆ మాత్రం విక్రయాలు చేయాలంటే.. జనంలోకి వెళ్లాల్సిందే.. తప్పదంటూ మరో  నెటిజన్  వ్యాఖ్యానించారు. వెండితెరమీద, బుల్లితెర మీద వచ్చిన పారితోషకం, మంత్రిగా వచ్చిన జీత భత్యాల సంగతేమో కానీ.. ఇలా ప్రజల్లోకి వెళ్లడం ఏదైతే ఉందో.. అది మాత్రం అదిరిపోయిందంటూ సామాజిక మాధ్యమంలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో   రోజా గెలుపు నల్లేరు మీద నడక  ఎంతమాత్రమూ కాదనీ,  ఇప్పటికే నియోజకవర్గంలో ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. అలాంటి సమయంలో ప్రముఖ నటుడు రజినీ కాంత్‌పై   రోజా ఆరోపణలు గుప్పించడంతో.. తమిళ ఓటర్లు సైతం  రోజాకు బాగా దూరం జరిగారని.. ఈ నేపథ్యంలో ఆమెకు విజయావకాశాలు లేవని నెటిజన్లు పేర్కొంటున్నారు.   అయినా పర్యాటక శాఖ మంత్రిగా రాష్ట్రానికి ఏమైనా కొత్త ప్రాజెక్ట్‌లు ఏమైనా తీసుకొచ్చారా?  మంత్రిగా దేవాలయాల సందర్శనతోపాటు.. విపక్షాలపై నోరు పారేసుకోవడం మీనహా మీరు చేసిందేముందంటూ నెటిజన్లు  కామెంట్లు చేస్తున్నారు. ఇంకొకరు అయితే కొత్త బ్యాగ్,  కొత్త స్టిక్కర్... అంటూనే అంతా కొత్తదనం అంటూ కామెంట్ చేస్తున్నారు.

కర్ణాటక బిజేపీ బాటలో ..

కర్ణాటకలో కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోను అక్కడి బిజేపీ నేతలు  తీవ్రంగా విమర్శించారు. తాము అధికారంలో వస్తే భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని మేనిఫెస్టో పేర్కొనడం బీజేపీ నేతలకు మింగుడు పడడం లేదు. హిందువుల వోట్లను పొందడానికి భజరంగ్ దళ్ బిజేపీకి తన వంతు సహకారం అందిస్తోంది. కాబట్టి కర్ణాటక బిజేపీ నేతలు    ప్రెస్ మీట్ పెట్టి  కాంగ్రేస్ మేనిఫెస్టోను చించేస్తే తెలంగాణా బిజేపీ చీఫ్ బండి సంజయ్ భజరంగ్ దళ్ బాటలో ముందుకెళుతున్నారు.  ఈ నెల 14 న కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్రను నిర్వహించనున్నట్లు టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. అయితే హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ యాత్రలో లక్షలాది మంది పాల్గొంటారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులతో పాటు ఆ పార్టీకి చెందిన కీలక నేతలు కూడా ఈ యాత్రలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు. ఈ యాత్ర హిందువుల ఐక్యతను చాటి చెబుతుందన్న ఆయన హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వారందరూ హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా ఈ యాత్రలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తో పాటు తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఇంకా ప్రముఖ నేతలు పాల్గొననున్నారని సమాచారం. అయితే ఈ యాత్రపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ కావాలనే మత ప్రాతిపదికన ఓట్లను చీల్చేందుకు చేస్తున్న మరో ప్రయత్నమే ఈ యాత్ర అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడానికేనని భావిస్తున్నారు. మరో వైపు రాజకీయంగా క్యాష్ చేసుకునేందుకే ఆ పార్టీ వివాదాస్పద అంశాలను లేవనెత్తుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే చేవెళ్ల సభలో అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లపై అలా మాట్లాడారని.. ఇప్పుడు కర్ణాటకలో బజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తామని ప్రకటిస్తే.. ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. బీజేపీ మాత్రం రాష్ట్రంలో అధికారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతుంది. ప్రతి నెలా పలువురు కేంద్ర బీజేపీ నేతలను, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను బహిరంగ సభలు, ఇతర కార్యక్రమాలకు తీసుకొని రావాలని తెలంగాణా బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. 

పిలిచిన పేరంటానికే రానివ్వలేదు

బీఆర్ఎస్ ప్రభుత్వం సచివాలయంలో తమకు నచ్చని వారికి  ఎంట్రీ ఇవ్వదల్చుకోలేదా? మొన్న ప్రారంభోత్సవంలో   తెలుగు మీడియాను గేట్ బయటకు గెంటేసిన కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో మరో పిల్లర్ ను అవమానించింది. బీఆర్ఎస్ మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న తలసాని ఆహ్వానం మేరకు సచివాలయానికి వచ్చిన  ఎమ్మెల్యే రాజాసింగ్ ను గేట్ బయటే ఆపేసి అవమానించింది  బీఆర్ఎస్ ప్రభుత్వం.  తెలంగాణ ప్రభుత్వం భారీ ఖర్చుతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయంలో సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులకు కూడా ఎంట్రీ లేదన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. కొన్ని రోజుల కిందట ఎంపీ రేవంత్ రెడ్డిని సచివాలయంలోకి వెళ్లకుండా పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. తాజాగా బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు అలాంటి చేదు అనుభవమే ఎదురైంది.  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సచివాలయంలో గ్రేటర్ ప్రజాప్రతినిధులతో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కూడా ఆహ్వానం పంపారు. బుల్లెట్ పై వచ్చిన రాజా సింగ్ ను భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు. మీటింగ్‌ అని చెప్పి తనను ఆహ్వానించి, లోపలికి అనుమతించకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఎమ్మెల్యేలు కూడా సచివాలయంలోనికి రాకూడదా అంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు అక్కడే వేచి ఉండి, రాజాసింగ్ తిరిగొచ్చేశారు. అయితే, తాము ఆహ్వానం పంపినప్పటికీ రాజాసింగ్ గేటు వరకు వచ్చి వెళ్లిపోయారని మంత్రి తలసాని పేషీ ప్రకటించినట్టు తెలుస్తోంది.విద్వేష ప్రసంగ ఆరోపణపై ఎమ్మెల్యే రాజాసింగ్ ను బీజేపీ బహిష్కరించింది. ఇటీవలె తెలంగాణా బిజేపీ చీఫ్ బండి సంజయ్  ఇటీవలె రాజాసింగ్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. అసెంబ్లీ పట్టుమని ఆరు నెలలు కూడా లేవు. రాజాసింగ్ కు బిజేపీ టికెట్ ఇస్తుందో ఇవ్వదో తెలియదు. బిజేపీ నుంచి  సస్పెండ్ అయిన రాజాసింగ్ ను పార్టీ ఆహ్వానించలేదు. రాజాసింగ్ అయోమయంలో పడిపోయారు. తన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వేసుకుని పార్టీ టికెట్ కోసం టిడిపి తెలంగాణా చీఫ్ కాసాని ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. గోషామహల్ టికెట్ రాజాసింగ్ కే దక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే కన్ ఫమ్ కాలేదు.  ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. బీఆర్ఎస్ గోషామహల్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ పేరు బలంగా వినిపిస్తోంది.  ఇంతలో మంత్రి తలసాని  మీటింగ్ అంటే రాజాసింగ్ అదే బుల్లెట్ మీద సచివాలయానికి వచ్చేశారు. ఏ శక్తులు అడ్డుకున్నాయో రాజాసింగ్ ను సెక్యురిటీ సిబ్బంది ఆపేశారు. రాజాసింగ్  అంటే ఆషామాషీ వ్యక్తి కాదు.  నరేంద్రమోడీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. మరి రాజాసింగ్ పిలిచిన పేరంటానికి వచ్చినప్పటికీ అడ్డుకుని అవమానించారు. ఢిల్లీలో బీఆర్ఎస్  కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన మీడియాను బీఆర్ ఎస్ అడ్డుకుంది. అసలు వారిని గేట్ లోనికి కూడా రాకుండా అవమానించారు.  నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. ఆహ్వానాన్నిమన్నించి వచ్చిన ప్రజాప్రతినిధికి వెల్ కమ్ చెప్పడం కూడా సంస్కారం. జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టిన బీఆర్ఎస్ కు సంస్కార క్లాసులు అవసరమేమో మరి.