ఏవరా 19 మంది..ఏమా కథ!

తన పార్టీలో అసమర్ధ ఎమ్మెల్యేకు సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు చేశారు.. మీ పనితీరు మెరుగు పరుచుకోవాలి.. లేదంటే నా నిర్ణయం తీసుకుంటా. మీరందరూ మళ్ళీ గెలవాలి.. ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలనే నా భావన. కానీ, మీ పనితీరు బాగాలేకపోతే నేనేం చేయలేను.. ఆ మాటకొస్తే నా చేతిలో కూడా ఏమీ లేదు. మీ పనితీరు బాగుంటే సర్వేలలో మంచి మార్కులు వస్తాయి. ఆ మార్కులే మీకు టికెట్లు తెస్తాయి. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి నేను కార్యకర్తలకు అన్యాయం చేయలేను. కనుక మీ పనితీరు మెరుగు పరుచుకొని టికెట్లు తెచ్చుకోండి. ఇదీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గడపగడపకు కార్యక్రమం సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేకు చెప్పిన మాట. పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేల జాబితా ప్రకారం ఓ 19 మంది ఎమ్మెల్యేలకు జగన్ ఈ అల్టిమేటం ఇచ్చారు. అయితే, మీకు టికెట్లు ఇచ్చి కార్యకర్తలకు అన్యాయం చేయలేనని జగన్ చెప్పినా దాని అర్ధం మీరు ఓడిపోతే పార్టీకి, నాకు నష్టమనే. గడపగడపకు కార్యక్రమం సమీక్షా సమావేశం అనంతరం కొందరు ఎమ్మెల్యేలు బయటకి వచ్చి మీడియా ముందే జగన్ అల్టిమేటం గురించి చెప్పగా.. మరికొందరు నియోజకవర్గాలలో నేతలకు ఈ సమాచారాన్ని చేరవేశారు. ఈ సమావేశాన్ని ఒక్కసారి తేరిపార చూస్తే ఏపీలో ప్రశాంత్ కిషోర్ ఆపరేషన్ మొదలైందని అనిపించకమానదు. నా చేతిలో ఏమీ లేదు.. సర్వేల ఫలితాలే మీకు టికెట్లు తెస్తాయని చెప్పారంటే దాని అర్ధం తెలియనిదేమీ కాదు. ఆ మాటకొస్తే ఒక్క వైసీపీ మాత్రమే కాదు చాలా వరకు రాజకీయ పార్టీలు ఇప్పుడు ఈ సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తున్నాయి. తెలంగాణలో ఈ మధ్యనే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ మధ్యనే కర్ణాటకలో జరిగిన ఎన్నికలలో కూడా వ్యూహకర్త సునీల్ కనుగోలు చెప్పిన వారికే కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది. ఇప్పుడు ఏపీలో కూడా జగన్ మోహన్ రెడ్డి అదే చెప్పారు. ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ ఎవరికి చెప్తే వారికే టికెట్లు దక్కనున్నాయి. ఈ మధ్యనే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ తో సమావేశమైనట్లు ఆ పార్టీ ముఖ్యనేతలు సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు విషయం బయటకి వచ్చింది. పార్లమెంట్ భవనం ప్రారంభం సమయంలో కూడా ప్రశాంత్ కిషోర్ తో జగన్ భేటీ అయినట్లు కథనాలొచ్చాయి. రాష్ట్రంలో ఐ ప్యాక్ టీం ఇప్పటికే నాలుగు దఫాలుగా నియోజకవర్గాలలో సర్వేలు నిర్వహించింది. ఇప్పుడు కూడా మరో సర్వే జరుపుతోంది. వీటన్నిటి ఫలితాల ఆధారంగానే టికెట్ల జాబితాలు సిద్ధం కానున్నాయి. క్యాండిడేట్ల మీద యాంటీ ఇన్ కంబినెన్సీ పార్టీకి సోకకుండా జాగ్రత్తలు మొదలు పెట్టిన జగన్ త్వరలోనే తదుపరి పీకే మార్క్ ప్రణాళికలను అమలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తుంది.  మూడు రాజధానుల అంశం దగ్గర నుండి ఇంగ్లీష్ మీడియం చదువుల వరకు ఇకపై ఓటర్లను ఎమోషనలైజ్ చేసే దేన్నైనా వదిలే అవకాశం ఉండదు. ఇప్పటికే చంద్రబాబు కుప్పం సహా వై నాట్ 175 అంటూ నినాదం అందుకున్న వైసీపీ.. ఇప్పుడు ఆ టార్గెట్ గా వ్యూహాలు మొదలు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. అమరావతిని నాశనం చేయడం దగ్గర నుండి ఎక్కడ వరకు వచ్చిందో తెలియని పోలవరం నిర్మాణం.. నెల్లూరు పెద్దారెడ్లు పార్టీలో రగిల్చిన చిచ్చు, ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికలలో వేసిన వ్యతిరేక ఓటు వరకు.. నాలుగేళ్ళలో ఒక్కటంటే ఒక్కటి కూడా రాష్ట్రానికి రాని చెప్పుకోదగిన కంపెనీలు, వైజాగ్ నుండే పరిపాలన అని డజను సార్లు చెప్పినా జగన్ తాడేపల్లి నుండి కదలకపోవడం.. ఇలా చెప్పుకుంటూపోతే కోకొల్లుగా వ్యతిరేక అంశాలు ఉన్న నేపథ్యంలో వీటన్నిటినీ ఓవర్ కమ్ చేసేలా ఐ ప్యాక్ టీమ్ ఎలాంటి  ప్రణాళికలు రచిస్తుందో చూడాల్సి ఉంది.  అదలా ఉంచితే   జగన్ అల్టిమేటమ్ ఇచ్చిన ఆ 19 ఎమ్మెల్యేలు ఎవరన్న చర్చ జోరుగా సాగుతోంది. పార్టీ వర్గాలలో ఆ ఎమ్మెల్యేల పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి.  గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీ చరణ్, బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ  దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్,   భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చినఅప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పేర్లు వినిపిస్తున్నాయి.  వీరెవరి పేర్లూ జగన్ బయట పెట్టలేదు. కానీ పార్టీలో అంతర్గత సంభాషణల్లో ఈ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే మొత్తం 151 మంది ఎమ్మెల్యేలలో బహిష్కృత ఎమ్మెల్యేలను తీసివేయడా.. పని చేయని ఎమ్మెల్యేలు 19 మంది మాత్రమేనా అన్న మీమాంస అందరిలోనూ వ్యక్తమౌతోంది.     ఎందుకంటే గతంలో కూడా జగన్ పలుమార్లు గడపగడపకు వర్క్ షాప్ నిర్వహిం మ్మెల్యేలను పేరు పేరున పిలిచి పని తీరు బాగాలేదని హెచ్చరించారు.ఎమ్మెల్యేలనే కాదు. మంత్రులను హెచ్చరించారు. అయినా వారి పనితీరు మెరుగుపడిన దాఖలాలేం లేవు. ఎమ్మెల్సీ ఎన్నికల పరాభవం తరువాత జగన్ తీరు పూర్తిగా మారిపోయింది. వైసీపీ మానవసంబంధాలకు విలువ నిచ్చే పార్టీ అన్నారు. ఎవరినీ దూరం చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పారు. అందరం కష్టపడి పని చేసి మళ్లీ అధికారంలోకి వద్దామన్నారు. అంతేనా తనకు ఎవరి మీద ఆగ్రహం లేదనీ, ఎమ్మెల్యేలు, మంత్రులూ అంతా బాగా పని చేస్తున్నారనీ కూడా చెప్పారు. పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలనే తాను చెబుతున్నానన్నారు. అలా చెప్పిన  జగన్ మళ్లీ ఇప్పుడు మాట మార్చారు. ఓ 19 మంది పని తీరు అస్సలు బాగాలేదనీ, ఇలా చెప్పడమంటే మిగిలిన వారంతా బ్రహ్మాండంగా పని చేస్తున్నారని కాదనీ అన్నారు. దీంతో జగన్ ఓ సంఖ్య చెప్పి మొత్తం పార్టీ ఎమ్మెల్యేలందరిపైనా గన్ గురిపెట్టారా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనూరాధ విజయం సాధించిన సమయంలో జగన్ పార్టీలో 60 మందికి పైగా ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు వైసీపీ శ్రేణుల నుంచే వినవచ్చాయి. దాదాపుగా అదే సంఖ్యను జగన్ కూడా పలు సందర్భాలలో చెప్పారు. రోజులు గడిచే కొద్దీ అధికార పార్టీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలే కనిపిస్తున్నాయి.జగన్ ప్రభుత్వంపై రోజు రోజుకూ తీవ్రమౌతున్న ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు జనం వద్దకు వెళ్లడానికి జంకుతుంటే.. మరి కొందరు తాము పోటీకి సిద్దంగా లేమంటూ వారసులకు టికెట్టివ్వాలని జగన్ ను కోరుతున్నారు. మొత్తంగా జగన్ హెచ్చరికలను ఎమ్మెల్యేలు లెక్క చేసే పరిస్థితి లేదని, జగన్ గాంభీర్యం అంతా మేడిపండు చందమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కాంగ్రెస్సా.. బీజేపీనా.. బీఆర్ఎస్​కు పోటీ ఎవరు?

తెలంగాణలో ఎన్నికల కసరత్తులు మొదలయ్యాయి. ఎన్నికల కమిషన్ గురువారం రాష్ట్ర పర్యటనకు వచ్చింది.. కానీ  రాష్ట్రంలో రాజకీయ పార్టీలైతే ఎన్నికల హడావుడి ఎప్పుడో మొదలు పెట్టేశాయి. ఇప్పటికే పార్టీలు గెలుపు గుర్రాలెవరో లెక్కలేసుకొనే పనిలో పడితే.. తమకి టికెట్ వస్తుందా లేక మరో పార్టీని చూసుకోవాలా అని ఆశావహులు ఆలోచనలు చేస్తున్నారు. పార్టీల నుండి కాస్త క్లారిటీ వస్తే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు గోడ దూకే కార్యక్రమం మొదలైపోతుంది. ఇప్పటికే దాదాపుగా అన్ని పార్టీలూ మేనిఫెస్టోల తయారీపై కసరత్తులు మొదలు పెట్టగా సాధ్యమైనంత   త్వరలోనే ఈ వాటిని విడుదల చేయనున్నారు. అయితే, తెలంగాణ రాజకీయ పార్టీలు.. వాటి మధ్య పోటీ అనే అంశాన్ని పరిశీలిస్తే ముందుగా అందరికీ తట్టే ప్రశ్న అసలు బీఆర్ఎస్ కి పోటీ ఎవరు?. తెలంగాణలో ప్రస్తుతానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ హైపర్ యాక్టివ్ గా ఉండగా టీడీపీ, కమ్యూనిస్టులు, ఎంఐఎం, జనసేన, వైఎస్ఆర్టీపీ, కోందండరాం టీజెఎస్ తో పాటు బీఎస్పీ లాంటి పొరుగు రాష్ట్రాల పార్టీలు కూడా ఉన్నామా అంటే ఉన్నాం అన్నట్లున్నాయి. అవి కాకుండా కనీసం పేరు కూడా తెలియని పార్టీలు డజనుకు పైగా రిజిస్టర్ అయి ఉన్నాయి. అయితే, అవేవీ బీఆర్ఎస్ పార్టీకి పోటీ కి రావు.. రాలేవు కూడా. తెలంగాణలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం  సైతం ఇప్పుడు బీఆర్ఎస్ కు పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఏవో కొన్ని నియోజకవర్గాలలో టీడీపీ సానుభూతిపరులు గెలుపును ప్రభావితం చేసే అవకాశం ఉండగా.. మిగతా పార్టీలో ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇక మిగిలింది.. ఇప్పుడు పొలిటికల్ సినారియో ప్రకారం చెప్పుకోవాల్సింది బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ. అయితే, వీటిలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు అసలైన పోటీ దారుఎవరు?  ఇదే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ కు  తామే ప్రత్యామ్నాయం అన్నట్లు బీజేపీ గట్టిగా కలరింగ్ ఇచ్చింది. ఆ ప్రయత్నంలో కొంతవరకు ఆ ప్రయత్నంలో సక్సెస్ కూడా అయింది.  దుబ్బాక, హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఎన్నికల నుండి జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు ఫలితాలతో ఇక రాష్ట్రంలో రాజకీయ యుద్ధం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లే సాగుతుందని ఫిక్సయి పోయారు.  ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ను వెనక్కు నెట్టేసిన బీజేపీ బీఆర్ఎస్ తో తలపడి గెలవడం ఆ పార్టీకి ఎక్కడలేని జోష్ తెచ్చింది. కానీ, రాజకీయాలలో ఎప్పుడు ఏం జరగబోతుందో  చెప్పడం కష్టం. కర్ణాటక ఎన్నికల ఫలితాల రూపంలో తెలంగాణలో బీజేపీకి అనుకోని కష్టం వచ్చిపడింది.  అనూహ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో ఇక్కడ కూడా ఆ పార్టీలో కదలిక వచ్చింది. దీంతో ఇప్పుడు జాతీయ పార్టీలో కూడా తమ ఆట తామే ఆడుకోవాలని, హైకమాండ్ తమపై పరిమితి పెత్తనం మాత్రమే ఉండాలని భావించే వారు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి సీనియర్ నేతలు రేపో మాపో ఢిల్లీ సాక్షిగా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. వీరితో పాటు మరికొందరు మాజీలు కూడా టికెట్ల హామీతో జతకట్టనున్నారు. ఏ స్థాయికి కాంగ్రెస్ బలపడుతుందన్నది ఇప్పుడే చెప్పలేని అంశం కానీ.. ఎంతో కొంత బలపడుతుందన్నది మాత్రం వాస్తవంగా చెప్పుకోవచ్చు. మరోవైపు బీజేపీకి ఇప్పటికే బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ నుండి.. రఘునందన్, ధర్మపురి అర్వింద్ వరకు మహాముహులు అండదండగా ఉన్న సంగతి తెలిసిందే. వీరికి తోడు ఎన్నికల సమయానికి మరికొందరిని చేర్చే పనిలో జాతీయ అధిష్టానం కసరత్తులు చేస్తున్నది. దీనిని బట్టి చూస్తే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఎవరు బీఆర్ఎస్ కు అసలైన పోటీ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో రాబోయే ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో అధికారం ఎవరిదో తేల్చడం ఒక్కటే కాదు.. ప్రతిపక్షం ఎదో కూడా తేల్చనుండడం మరింత ఆసక్తి కలిగిస్తున్నది.

బీసీ ఓటు కోసం పార్టీల వ్యూహాలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఈరోజు నుంచి మూడు రోజులపాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చలు జరుపుతుంది. తెలంగాణతో పాటుగా మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘర్, మిజోరాం రాష్టల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరరగనున్న నేపధ్యంలో ఐదు రాష్ట్రాలకు ఈ సంవత్సరాంతంలోగా ఎన్నికలు జరగవలసి ఉన్న నేపధ్యంలో, ఐదు రాష్ట్రాలకు ఒకేసారి, నవంబర్, డిసెంబర్ మాసాలలో ఒకే సారి ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నట్లు తెలుస్తోంది.  అదలా ఉంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అన్నీ పార్టీలు వ్యూహారాచంలో తలమునకలై ఉన్నాయి. ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తు చేయడానికి ఎత్తులు, పై ఎత్తులు వేయడంలో నిమగ్నమైపోయి ఉన్నారు. అధికార పార్టీ తాము ఏమి చేసామో చెబుతూ నూతన పథకాలను ప్రవేశ పెట్టాలని యోచిస్తుంటే, అధికార పక్షం లోపాలను ఎండగడుతూ తాము ఏమి చేయదల్చుకున్నామో వివరించేందుకు ప్రతిపక్షాలు సన్నాహాలు చేస్తున్నాయి.  ఎలాగైనా ఈసారి కూడా గెలిచి మూడవసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని కేసీఆర్ చూస్తుంటే, కేంద్రంలో అధికారంలో ఉండడం, గత పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవడంతో కాషాయ దళం కూడా తెలంగాణలో కమలం వికసిస్తుందని ఆశిస్తుంది. మొన్నటి కర్ణాటక ఎన్నికల విజయం, వరుస చేరికలతో వచ్చిన నూతన జోష్ తో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను కూడా హస్తగతం చేసుకోవాలని ముమ్మరంగా ప్రణాళికలు రచిస్తోంది.  ఈ పరిస్థితుల్లో అన్ని ప్రధాన పార్టీల చూపు బీసీల వైపు మళ్లింది. అత్యధికంగా ఉన్న బీసీ ఓట్లను తమ వైపు తిప్పుకోగలిగితే విజయం తమనే వరిస్తుందని అన్ని పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీ లను ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నాయి. తెలంగాణాలో దాదాపుగా 52 శాతం మంది పైచిలుకు ఓటర్లు బీసీ కులాలకు చెందిన వారు. ఇంత గణనీయమైన ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు ఆయా రాజకీయ పార్టీలు సన్నాహాలు చేసుకుంటున్నాయి.  విభజనకు ముందు తెలంగాణలో టీడీపీ కి ఒకింత బీసీల మద్దతు ఉండేది. ఇది పసిగట్టిన కేసీఆర్ కులాల వారీగా ఆకర్షక పథకాలను ప్రవేశపెట్టాడు. గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపపిల్లల పంపిణీ, నేతన్నలకు చేయూత అంటూ ఇలా అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టి బీసీలను ఆకర్షించారు, అధికారం పీఠం దక్కించుకున్నారు. ఈ దఫా ఎన్నికల్లో ఎలాగైనా బీసీలను తమ వైపు తిప్పుకోవాలని ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు రెండూ పథకాలను రచిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పిస్తామని  కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో చేర్చేందుకు సన్నాహాలు చేస్తుంది. అంతే కాకుండా మొన్న ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్’ ల మాదిరిగా బీసీ డిక్లరేషన్ ని కూడా ప్రకటించాలని భావిస్తుంది. జాతీయ పార్టీగా పార్లమెంటులో బీసీ గణన పైన డిమాండ్ చేయాలని, తద్వారా జనాల్లో బీసీల కోసం పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీయే అనే నమ్మకాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రణాళికలు రచిస్తుంది.    తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ జాబితా నుండి తొలగించిన 26 కులాలను తిరిగి జాబితాలో చేర్చుతామని ఇప్పటికే పలుమార్లు పలువురు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. మరో అడుగు ముందుకు వేసి బీసీల ఆత్మగౌరవం అనే నినాదాన్ని కూడా భుజానికి ఎత్తుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. ఇందుకు గాను బీసీ డిక్లరేషన్ రూపొందించే  సన్నాహాలను చేస్తుంది.  తాజాగా తెలంగాణ ప్రభుత్వం కేవలం 14 బీసీ కులాలకు మాత్రమే ప్రకటించడం మిగిలిన బీసీ కులాలకు అన్యాయం చేయడమే అని వాదిస్తుంది. బీసీ జాబితాలోని 130 కులాలకు ఈ స్కీమ్ ను  అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక సోషల్ ఇంజనీరింగ్ కి సన్నాహాలు చేస్తుంది. కేవలం డిక్లరేషన్ తో మాత్రమే ఆగకుండా, 50 శాతం ఉన్న బీసీలకు 50 శాతం సీట్లు అనే నినాదంతో ముందుకు వెళ్లాలని యోచిస్తోంది.  ఇప్పటికే కేసీఆర్ సర్కార్ ని ప్రతిపక్షాలు దొరల పాలన అంటూ ఎద్దేవా చేస్తూ ఉండడాన్ని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ విషయాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లడానికి కాంగ్రెస్’తో పాటు బీజేపీ కూడా ఆలోచిస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే బండి సంజయ్, ఈటెల రాజేందర్ లాంటి బీసీ నాయకులకి ముఖ్య పెదవులని కట్టబెట్టింది. జాతీయ స్థాయిలో కూడా బీజేపీ ఓబీసీ ఓట్ల తో సోషల్ ఇంజనీరింగ్ చేయడాన్ని మనము చూసాము. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే ప్రయత్నాన్ని చేయాలని బీజేపీ యోచిస్తోంది. కానీ, తాజాగా బీజేపీలో అంతర్గత తగాదాలు, కర్ణాటక ఫలితాలు, చేరికలు లేకపోవడం వెరసి కాషాయదళం దూకుడు ఒకింత తగ్గింది.  మొత్తానికి ఏదేమైనా, తెలంగాణలో అధికంగా ఉన్న బీసీలను ప్రసన్నం చేసుకున్న పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం మాత్రం తథ్యం. ఏ పార్టీ బీసీల ఓట్లను గణనీయంగా సాధిస్తుందనే విషయం మాత్రం ఎన్నికల ఫలితాలే తేల్చాలి..!

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త వార్

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్తవార్ మొదలైంది. కర్నాటక ఫలితాల తరువాత నుంచీ పార్టీలో మొదలైన జోష్ పార్టీ నేతలంతా విభేదాలను విస్మరించి  ఐక్యంగా తెలంగాణలో కాంగ్రెస్ విజయం కోసం కలిసి పని చేస్తున్నారన్న వాతావరణం కనిపించింది. దీనికి తోడు కాంగ్రెస్ హై కమాండ్ కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పార్టీలో నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు నడుం బిగించడంతో ఒక్క సారిగా తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటి వరకూ ఎన్నడూ కనిపించని సానుకూలత కనిపించింది. అన్ని వర్గాలూ ఒక్కటై పార్టీ విజయం కోసం పని చేస్తున్నారన్న వాతావరణం ఏర్పడింది. సహజంగానే ఈ పరిస్థితి ఇతర పార్టీలోని అసమ్మతి, అసంతృప్తి వాదులను ఆకర్షించింది. దీంతో పార్టీలోకి చేరికలు పెద్ద ఎత్తున వస్తాయన్న వాతావరణం ఏర్పడింది. ఇందుకు తగ్గట్లుగానే బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు తమ మొగ్గు కాంగ్రెస్ వైపే అన్న సంకేతాలు ఇచ్చారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి  విక్రమార్క ముగ్గురూ కూడా నేతల చేరికల విషయంలో తన హస్తం ఉంది అనిపించుకోవడానికి శతధా ప్రయత్నిస్తున్నారు. చేరికల క్రెడిట్ కొట్టేసి  పార్టీలో తమ ప్రాధాన్యతను చాటుకోవాలని తాపత్రేయ పడుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఎమ్మెల్యేగా ఉంటూ పార్టీకి రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నికకు కారకుడైన తన సోదరుడిని మళ్లీ కాంగ్రెస్ గూటికి చేర్చి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకురావడం ద్వారా తన   సత్తా చాటాలని యత్నిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సోదరుడు ఇలా సైగ చేస్తే అలా వచ్చి హస్తం అందుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. అదే సమయంలో పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్ గూటికి చేరడంలో రేవంత్ కంటే తన కృషే ఎక్కువ అని చాటుకునేందుకు వెంకటరెడ్డి యత్నిస్తున్నట్లు కాంగ్రెస్ శ్రేణులే చెబుతున్నాయి. మరో వైపు ఇక పొంగులేటి సొంత జిల్లాకే చెందిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆయనతో తనకు ఉన్న పరిచయాన్ని పురస్కరించుకుని తరచూ సంప్రదింపులు జరపడం ద్వారా ఆ చేరిక క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు యత్నిస్తున్నారు. వడదెబ్బ తగిలి తాత్కాలిక క్యాంపు సైట్ లో విశ్రాంతి తీసుకుంటున్న భట్టిని పొంగులేటి కలవడాన్ని కూడా ఆయన కాంగ్రెస్ చేరిక వెనుక తన క్రెడిట్ ఉందని భట్టి చాటుకునే యత్నం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ లో ఇప్పుడు కనిపిస్తున్న సానుకూల వాతావరణం నివురుగప్పిన నిప్పేనా, తుపాను ముందటి ప్రశాంతతేనా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. పైకి కలిసే పని చేస్తున్నట్లుగా ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగా కనిపిస్తున్నా... లోలోన మాత్రం ఎవరికి వారు తమ ఆధిపత్యం నిరూపించుకునేందుకు, చాటుకునేందుకు తెరచాటు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారని అంటున్నారు.  దీంతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త వార్ ముమ్మరంగా జరుగుతోంది. ముగ్గురు అగ్రనేతల మధ్య చేరికల క్రెడిట్ కోసం సాగుతున్నయుద్ధంలో ఎవరు పై చేయి సాధిస్తారన్న ఆసక్తి ఆ పార్టీలోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ, పరిశీలకుల్లోనూ కూడా వ్యక్తమౌతోంది. 

ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేస్తేనే సౌకర్యాలు.. జగన్ సర్కార్ సైకో షరతులు!

జగన్ సర్కార్ లో సంక్షేమం అంద సుందరముదనష్టంగా అమలు అవుతోందో  రోజుకో తార్కానం బయటపడుతూ ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా అందరూ అభిమానించే నేత  ఎవరైనా ఉన్నారంటే ఆయన పెదవాడి అన్నంగిన్నెగా తెలుగువారందరూ ఎంతో అభిమానించే  ఎన్టీఆర్ గా అందరూ పిలుచుకునే నందమూరి తారకరామారావు. అటువంటి తారకరామారావు బొమ్మ ఉందని ఎన్టీఆర్ కాలనీలో గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు బిల్లులు ఇవ్వకుండా పనులు అర్ధంతరంగా నిలిపివేసింది జగన్ సర్కార్. ఎన్టీఆర్ ముందు చూపుతో ఏర్పాటైన వర్సిటీకి చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా నామకరణం చేస్తే ఆ పేరును కూడా మార్చేసింది జగన్ ప్రభుత్వం. ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేస్తే తప్ప ఇళ్లకు బిల్లులు ఇచ్చేది లేదనీ, పనులు ప్రారంభించేది లేదనీ స్పష్టం చేస్తోంది జగన్ సర్కార్. వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి ఎన్టీఆర్ కాలనీలో 2015-16 సంవత్సరంలో 60 మంది పేదలకు అప్పటి చంద్రబాబు సర్కార్ ఇళ్లు మంజూరు చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ ఇళ్ల పనులను నిలిపివేసింది. అయిన పనులకు బిల్లులు చెల్లించకుండా ఆపేసింది. బిల్లులు ఇచ్చి ఇళ్లకు నీళ్లు, కరెంటు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి లబ్ధిదారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. దానికి తోడు కాలనీలో ఉన్న ఎన్నటీఆర్ విగ్రహాన్ని కూల్చివేస్తే అన్నీ అవే వచ్చేస్తాయంటూ వైసీపీ నేతలు చెప్పడంతో లబ్ధిదారులు హతాశులయ్యారు. అభిమానంతో ప్రేమగా ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని కూల్చేదే లేదని ఖరాకండీగా చెప్పేశారు. దీంతో గత నాలుగేళ్లుగా ఎన్టీఆర్ కాలనీకి ఎటువంటి సౌకర్యాలూ కల్పించకుండా నానా ఇబ్బందులూ పెడుతున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా వెంకటగిరి చేరుకున్నప్పుడు డక్కిలి ఎన్టీఆర్ కాలనీ వాసులు తమను వైసీపీ సర్కార్ వేధిస్తున్న తీరును వివరించారు.    ఎన్టీఆర్ బొమ్మ కూల్చేస్తే సౌకర్యాలు కల్పిస్తామనడం శాడిస్టు లక్షణమని లోకేష్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన 22 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు తెలుగుదేశం ప్రభుత్వం అదనపు సాయం అందించి పూర్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా  లోకేష్ గుర్తు చేశారు.   పేదలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సైకో ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయనీ, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డక్కిలి ఎన్టీఆర్ కాలనీ ప్రజలకు సకల సౌకర్యాలతో ఇళ్లు పూర్తిచేసి అందిస్తుందనీ హామీ ఇచ్చారు. 

తాడేపల్లి వర్క్ షాప్‌లో జగన్ రిపేర్లు.. ఎమ్మెల్యేలలో గుబులు

ఏపీలో కూడా ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. నిండా ఏడాదిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగేళ్లు ఒక లెక్క.. ఈ ఏడాది ఇంకో లెక్క. అందుకే రాజకీయ పార్టీలు.. పార్టీల అధినేతలు బుర్రలకు పదును పెట్టడం మొదలు పెడుతున్నారు. తమ పార్టీలో ఏం జరుగుతుంది? రానున్న ఎన్నికలలో మళ్ళీ గెలవాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? గెలుపు గుర్రాలు ఎవరు? తమ పార్టీకి నష్టం తెచ్చిపెట్టే ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై ఫోకస్ మొదలు పెట్టారు. ఇప్పటికే ఎన్నోసారి ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాలలో పరిస్థితిపై సర్వేలు తెప్పించుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. అప్పుడే ఆ ఎమ్మెల్యేలకు క్లాసులు కూడా పీకారు. వారిలో కొందరు ఆ దెబ్బకు మారితే మరికొందరు మాత్రం షరామామూలే అన్నట్లు లైట్ తీసుకున్నారు. ఇప్పుడు అలాంటి వారందరికీ తాడేపల్లి ప్యాలెస్ లో సీఎం జగన్ వర్క్ షాప్ మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. తాజాగా తాడేపల్లిలోని సీఎం నివాసంలో గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ లు హజరైయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పని తీరుపై సమీక్షించిన సీఎం.. కొందరు ఎమ్మెల్యే తమ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి ప్రొగ్రెస్ రిపోర్టు వ్యక్తిగతంగా పంపుతాననీ, అప్పటికీ పని తీరు మార్చుకోకపోతే నా నిర్ణయం నేను తీసుకుంటానని జగన్ హెచ్చరించారట. 20 నుండి 25 మందితో తయారైన ఈ జాబితాలోని ఎమ్మెల్యేలు సాధ్యమైనంత త్వరగా పద్ధతి మార్చుకోకపోతే వారిని కొనసాగించడం పార్టీకి మరింత నష్టం వాటిల్లుతోందని నిర్ణయానికి వచ్చిన జగన్.. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేలకు రిపేర్లు మొదలు పెట్టగా.. వీలు కుదరకపోతే వారిని తప్పించేందుకు కూడా రెడీ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా.. ఇక నుంచి ఎమ్మెల్యేల గ్రాఫ్ పెర‌గాల్సిందేన‌ని, దాని కోసం ఎమ్మెల్యేలు ఏం చేస్తారో మీ ఇష్టం.. లేకపోతే అనర్ధాలు తప్పవని జ‌గ‌న్ తేల్చి చెప్పిన‌ట్టు తెలిసింది. అయితే, గతంలో కూడా ఇలానే పలుమార్లు హెచ్చరించిన సీఎం.. ఎమ్మెల్యేలను ప్రజలలోకి పంపేందుకు గడపగడపకు అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. కానీ, ఈ కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేలకు పలుచోట్ల వ్యతిరేకత కనిపించింది. ఎక్కడిక్కడ ప్రజలు నిలదీస్తుండడంతో ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు వెనక్కి తగ్గారు. మరికొందరు తూతూమంత్రంగా ముగించారు. ప్రజా వ్యతిరేకత వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుండడంతో అది మరింత నష్టం తెచ్చిపెట్టే ఛాన్స్ ఉందని కొందరు ఎమ్మెల్యేలు అధిష్టానానికి కూడా చెప్పే ప్రయత్నం చేసినా వారు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు సీఎం జగన్ మరోసారి ఇలా ప్రజల మధ్యకి వెళ్లాలని అల్టిమేటం జారీచేయడంతో ఎమ్మెల్యేలలో గుబులు మొదలైంది. వదలమంటే పాముకి కోపం కరవమంటే కప్పకి కోపం అనేలా తమ పరిస్థితి తయారైందని మదనపడిపోతున్నారు. తమ అధినేత చెప్పినట్లు ప్రజల మధ్యకి వెళ్తే నాలుగేళ్లు ఏం చేశారని నిలదీస్తున్నారని.. సంక్షేమం గురించి మేము ఎంత ప్రగల్భాలు పలికినా.. ఎక్కడికక్కడ ఆగిపోయిన అభివృద్ధి గురించి ప్రజలు ప్రశ్నిస్తున్నారని.. సంక్షేమ పథకాలు దక్కని వారి ఆగ్రహాన్ని పేస్ చేయడం కూడా కష్టంగా ఉందని సన్నిహితులతో చెప్పుకుంటున్నారట. ఇందులో కొందరైతే.. ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలకు దిగుతూ అధిష్టానానికి తమపై ఉన్న అభిప్రాయాన్ని కవర్ చేసుకొనే ప్రయత్నంలో ఉండగా.. వారు టికెట్ దక్కించుకోవడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.

ఇంత ఇగో లేకుండా చెప్పేస్తే ఎట్లా స్వామీ?!

స్టార్ హీరోల్లో పవన్ కల్యాణ్ రూటే సపరేటు. స్టార్ పొలిటీషియన్లలోనూ జనసేనాని దారి రహదారి. అనేకమంది రాజకీయ నాయకుల మాదిరిగా ఆయనకు డొంకతిరుగుడు మాటలు రావు. మనసులో ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. దానివల్ల సొంత మనుషులు, అభిమానులు ఏమనుకుంటారనే ఆలోచన కూడా ఆయన చేయరు. వాళ్లు హర్టయినా సరే, దాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా నిజం చెప్పడానికి ఆయన వెనుకాడరు. ఇప్పుడు వారాహి యాత్రలో భాగంగా తోటి స్టార్ హీరోల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయా హీరోలకు, వాళ్ల ఫ్యాన్స్‌కు మహదానందాన్ని కలిగిస్తుంటే, పవన్ సొంత ఫ్యాన్స్‌లో గందరగోళాన్ని రేకెత్తిస్తున్నాయి. ప్రభాస్, మహేశ్ తనకంటే పెద్ద హీరోలని, వాళ్లు తనకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారనీ ఆయన తన స్పీచ్‌లో కుండబద్దలు కొట్టేశారు. అంతేకాదు.. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ గ్లోబల్ స్టార్స్ అయ్యారనీ, వాళ్లకున్న రీచ్ తనకు లేదనీ ఒప్పేసుకున్నారు. ఈ విషయం ఒప్పుకోవడానికి తనేమీ ఇగో ఫీలవట్లేదని కూడా పవన్ అన్నారు. సాధారణంగా పవన్ కల్యాణ్ స్థాయిలో ఉన్న స్టార్ హీరో ఎవరూ ఇలాంటి విషయాలు పబ్లిగ్గా చెప్పరు, ఇతర స్టార్లకంటే తను తక్కువ అని ఒప్పుకోరు. కానీ ఈయన పవన్ కల్యాణ్! మిగతా హీరోలతో ఆయనను వేరు చేసేది ఈ స్వభావమే. అయినా ఇప్పుడు పవన్ ఈ విషయాలు ఎందుకు మాట్లాడారు? ఎందుకంటే.. రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తనను, తన పార్టీ జనసేనను గెలిపించమని అడగడానికి. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని చెప్పిన పవన్.. సినిమాల వరకు మీ మీ హీరోలను అభిమానించండి, రాజకీయలకి వస్తే అందరూ తనకు అండగా నిలబడమని ఆయన పిలుపునిచ్చారు, విజ్ఞప్తి చేశారు. "మహేశ్ గారు, ప్రభాస్ గారు నాకంటే పెద్ద హీరోలు. ప్రభాస్ గారు ప్యాన్ ఇండియా హీరో. వారు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ గారు, రాంచరణ్ గారు ఇప్పుడు గ్లోబల్ స్టార్స్ అయ్యారు. నేను వేరే రాష్ట్రాల్లో, దేశాల్లో తెలియక పోవచ్చు, కానీ వారు తెలుసు. ఇది ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి ఇగో లేదు. రాష్ట్ర క్షేమం కోసం అందరు హీరోల అభిమానులు నాకు అండగా నిలబడండి, మీ హీరోలను అభిమానించండి." అని మాట్లాడటానికి ఎంత ధైర్యం కావాలి. దటీజ్ పవన్ కల్యాణ్!  ఆయన తన వారాహి వాహనంపై నిల్చొని ఈ మాటలు చెప్తుంటే ఆయన ఫ్యాన్స్ గగ్గోలు పెట్టారు. సోషల్ మీడియాలో ఆయన స్పీచ్ ఇప్పుడు వైరల్ అయ్యింది. అదే వేదికపై ఫ్యాన్స్ ఆ స్పీచ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "వెయ్యి, రెండు వేల రూపాయల కోసం ఓట్లు వేసే జనాల కోసం, చీప్‌గా క్యాస్ట్ చూసి ఓట్లు వేసేవాళ్ల కోసం నువ్వు తగ్గుతున్నావా అన్నా?" అని ఒకరు వాపోతే, ఇంకొకరు "ఇండియాలోనే ఇగో ఏమాత్రం లేని నటుడు పవన్" అనీ కామెంట్ చేశారు. ఇంకో అభిమాని, "ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు మా నాయకుడు" అంటూ 'అత్తారింటికి దారేది' డైలాగ్‌ను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభాస్, మహేశ్ ఫ్యాన్స్ కొంతమంది అయితే, తమ ఓటు, తమ మద్దతు జనసేనకే అని చెప్పేస్తున్నారు.   ఒక్కటి మాత్రం నిజం.. పవన్ కల్యాణ్ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ ఏదైతే ఉందో అది సంచలనం సృష్టించింది. అందరు స్టార్ హీరోల అభిమానుల్లో పెద్ద చలనాన్ని కలిగించింది. ఆ హీరోల ఫ్యాన్స్ పవన్‌తో తమ హీరో కలిసున్న ఫొటోలను షేర్ చేస్తూ, సంబరపడిపోతున్నారు. ఆయన కంటే తమ హీరోనే పెద్ద అని ఆయన ఒప్పుకున్నాడంటూ కామెంట్లు షేర్ చేస్తున్నారు.  కాగా దూరదృష్టితోనే పవన్ కల్యాణ్ ఆ స్టేట్‌మెంట్ ఇచ్చాడని రాజకీయ విశ్లేషకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇగో అంటూ కూర్చుంటే పని కాదనీ, అందుకే అందరు హీరోల ఫ్యాన్స్‌కు పిలుపునివ్వడం ద్వారా తనపై వ్యతిరేకత తగ్గించుకోవడమే కాకుండా, వారి సానుభూతినీ, మద్దతునూ పొందవచ్చుననీ ఆయన భావించాడని వారు అంటున్నారు. మొత్తానికి ఆయన ప్రకటన వల్ల జనసేనకు ఎంతో కొంత లాభమే ఉంటుంది తప్ప నష్టమైతే ఉండదని చెప్పాలి.

సంక్షిప్త వార్తలు

1.వైసీపీకి జగన్ శాశ్వత అధ్యక్షుడు కాదని ఎంపీ రఘురామకృష్ణరాజుకు రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. వైసీపీ రెబల్ ఎంపీ లేఖకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు సమాధానం ఇచ్చింది.   2.భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రముఖ హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత సంస్కృతీ సంప్రదాయాలకు మోదీ నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.   3.అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాధ్యక్షుడు  జో బైడెన్‌తో సమావేశమయ్యారు. వైట్‌ హౌస్‌లో మోడీకి బైడెన్ దంపతులు సాదర స్వాగతం పలికారు. ఆ తరువాత ఇరు నేతలూ పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.   4.  తెలంగాణలో  రైతుబంధు పథకం కింద కొత్త రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు  వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని క్షేత్రస్థాయి అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  5. చైనాలో ని ఇంచువాన్‌లో ఓ  రెస్టారెంట్‌లో  బుధవారం రాత్రి గ్యాస్‌ సిలిండర్‌ పేలి 31 మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.  6. 65 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజటన్ల  కర్నాటకలోని 400 ఆలయాల్లో  క్యూలో నిలబడనవసరం లేకుండా నేరుగా దర్శనం చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది. అయితే ఇందుకు ఆధార్ కార్డు లేదా ఏదో ఒక గుర్తింపు కార్డు చూపాల్సి ఉంటుంది.   7. గోసంరక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ హెచ్చరించారు. పశువుల అక్రమ  రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు కానీ, జీహెచ్​ఎంసీ, ఇతర  అధికారులకు తెలియజేయాలన్నారు.   8. ఏపీ సీఎం  జగన్మోహాన్‌ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించిన పెన్నా సిమెంట్స్‌ ఛార్జ్‌షీట్‌లో నిందితురాలిగా ఉన్న తన పేరును తొలగించాలని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్‌పై  విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.  ) 9. ప్రముఖ కవి ఆచార్య ఎన్‌.గోపికి ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ విశిష్ట సాహిత్య పురస్కారాన్ని  భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రదానం చేశారు. అవార్డు కింద రూ.1,01,116 నగదుతో పాటు స్వర్ణ కంకణాన్ని బహూకరించారు.   10.  అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు.  భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ వారిని ఆహ్వానించారు.  మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ సంజయ్ మెహ్రోత్రా, జనరల్ ఎలక్ట్రిక్ సీఈఓ లారెన్స్ కల్ప్ తదితరులతో మోడీ భేటీ అయ్యారు.  

సంక్షిప్తం 11 AM

1. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో  మంత్రులు , ఎమ్మెల్యేలు, రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్  నిన్న  సమీక్ష నిర్వహించారు.  పనితీరు లేని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికలలో టికెట్ ఇచ్చేది లేదని హెచ్చరించారు.   2. నకిలీ ఔషధాలపై కేంద్రం సీరియస్ అయ్యింది. కలుషిత దగ్గు మందు కారణంగా విదేశాలలో పిల్లలు ప్రాణాలు కోల్పోయారన్న నివేదికల నేపథ్యంలో  కేంద్ర మంత్రి మాండవీయ 18 కంపెనీల మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు.   3. తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శించారు.  తాంబరంలో  జరిగిన బీజేపీ పార్టీ బహిరంగ లో   మాట్టాడిన ఆయన ఒక సారి బీజేపీకి అధికారం ఇస్తే అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో చూపుతామని పేర్కొన్నారు.   4.   ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దాతల సహకారంతో రూ.4 కోట్లతో అన్నదాన భవనం నిర్మించేందుకు టిటిడి పాలకమండలి ఆమోదం తెలిపింది.   5. కడప నగరానికి బ్రహ్మంసాగర్ జలాశయం నుంచి మంచినీటిని తరలించడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్రహ్మంసాగర్-కడప నీటి  ప్రాజెక్టు రూ.462 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు.   6. కేరళలోని కొట్టాయం జిల్లాలో శబరిమల గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్ర పర్యావరణశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.3,411 కోట్ల వ్యయంతో ఎరుమలి ప్రాంతంలో 2,570 ఎకరాల్లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు.   7.మహబూబ్ నగర్ సమీపంలోని అప్పన్నపల్లి  వద్ద రెండో రైల్వే ఓవర్ బ్రిడ్జిని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ నిన్న ప్రారంభించారు.  30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రెండో రైల్వే ఓవర్ బ్రిడ్జిని కేవలం 12 నెలల్లోనే పూర్తి చేశామని మంత్రి చెప్పారు. 8. తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు.   జయశంకర్ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే గండ్ర పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.   9. విపక్షాల ఐక్యత కోసం  వివిధ రాష్ట్రాలకు చెందిన 15 మంది ప్రతిపక్షాల నేతలు రేపు పాట్నాలో భేటీ కానున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇంట్లో జరగనున్న ఈ సమావేశానికి కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎన్సీపీ, ఎస్పీ, ఎన్సీ తదితర పదిహేను పార్టీల అధినేతలు హాజరు కానున్నారు.   10. ఒడిశా రైలు ప్రమాదం సమయంలో స్వచ్ఛందంగా స్పందించిన గ్రామస్థులు  వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు.  ఇప్పుడు ఆ గ్రామాభివృద్ధికి  రైల్వే మంత్రి  అశ్వినీ వైష్ణవ్  రూ.2 కోట్ల నిధులు ప్రకటించారు.   

విమర్శలు ఇక చాలించండి 

ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా..జనసేన అధినేత పవన్ కల్యాణ్ ..వారాహిపై యాత్ర మొదలెట్టారు.  ఎన్నికలకు ముందు తమ పార్టీకి ఊపు తీసుకొచ్చే ప్రయత్నంలో శ్రమిస్తున్నారు. యువత అభిమానాన్ని బలంగా కలిగిన జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ యువతను తమ వైపు ఆకర్షించేందుగా ఈ యాత్రను ప్లాన్ చేసిన జనసేనా ని తమకు అనుకూల ఓటు బ్యాంక్ అయినా గోదావరి జిల్లాలను ఉత్తరాంధ్ర జిల్లాలను లక్ష్యంగా చేసుకొని యాత్ర చేస్తున్నారు.అయితే తన యాత్రలో ఆయన ఇస్తున్న స్పీచ్ ల పట్ల యువత బాగానే ఆసక్తి చూపుతున్నప్పటికీ, స్థానిక నాయకులు పై అధికార పార్టీ నాయకుల పై ఆయన చేస్తున్న విమర్శలు తట్టస్థ ఓటర్లలో మాత్రం కొంత విమర్శలపాలవుతుంది. అధికార పక్షానికి వార్నింగ్ ఇస్తూ ఆయన ఉపయోగిస్తున్నకొన్ని పదాలు యువతను ఉర్రూతలుగిస్తున్నాయి. అయితే.. ఎంతసేపు అధికార పార్టీ నేతలపై విమర్శలు తప్ప జనసేన అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ది..తీసుకు రాబోయే విధానాలను తేటతెల్లం చేయడంలో విఫలమవుతున్నారనే భావన అందరిలో కలుగుతుంది.  రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల జనసేన తీసుకున్న విధానాలేమిటి... ?ఆ సమస్యలను తీర్చడానికి జనసేన పాటించబోయే లేదా తీసుకురాకపోయే చట్టాలు ఏమిటి..? జనసేన సంక్షేమ పథకాలు ఏమిటి ? అన్న విషయాలపై ఎక్కువ సమయం కేటాయిస్తే అది తటస్థ ఓటర్లను ఆకట్టుకుంటుందని.. అపుడు  జనసేన ఓటు బ్యాంకు పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.పూర్తి సమయాన్ని ప్రత్యర్థులను విమర్శించడానికి పెడుతున్న జనసేన తటస్థ ఓటర్లు ను దూరం చేసుకుంటున్నారన్న విమర్శలను దృష్టిలో పెట్టుకొని యాత్ర తర్వాతి రోజులలో అయినా జనసేన తీసుకురాబోయే నూతన విధానాలను అందించబోయే సుపరిపాలన ప్రజలకు వివరిస్తే పార్టీకి మంచిదని వారు అంటున్నారు.   రాష్ట్రంలో 70 శాతం ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. సంక్షేమ పథకాల పేరుతో సీఎం జగన్  100 మంది కష్టాన్ని 30, 40 మందికి పంచుతున్నారని అన్నారు. తమ వాడని నమ్మి వైయస్ జగన్ కి ఓటు వేసిన రైతులకు జగన్ మొండి చేయి చూపిస్తున్నారు. ఇటీవల అకాల వర్షాల కారణంగా  నష్టపోయిన రైతులకు ప్రభుత్వం కేవలం డబ్బులు చెల్లించింది.అకాల వర్షాల కారణంగా కొద్ది రోజుల క్రితం పంట నష్టపోయిన రైతులను పలకరించడానికి జనసేన అధినేత పవన్ వస్తున్నానని తెలిసి ప్రభుత్వం హుటాహుటిన రైతుల ఎకౌంటు లోకి డబ్బులు వేసింది. చట్టసభలలో బలం లేకపోయినా గాని ప్రజల తరఫున పోరాడుతున్నాం.రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీకి అండగా ఉంటే.రైతులకు అనీ వర్గాల ప్రజలకు  చూసుకుంటానని పవన్ ఆశలు కలిగిస్తున్నారు.వైసీపీ నాయకుల్ని.. గూండాలు.. రౌడీలు..అని పవన్ తిడ్తున్నారు. బట్టలు ఊడదీసి.. వీధుల వెంట పరిగెత్తించి మరీ కొడ్తానని ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. విమర్శలు కాసేపు ఆపి.. జనసేన  అధికారంలో వస్తే ఏపీ ప్రజలకు చేస్తారనేది చెప్తే బాగుంటుందని రాజకీయ పండితులు..ప్రజలు కోరుతున్నారు.

బండి సంజయ్ హస్తినకు పిలిస్తేనే వెళ్ళారా?

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండు రోజులు ఢిల్లీలో పర్యటించారు. సోమవారం ఢిల్లీ వెళ్లిన సంజయ్ రెండు రోజులుగా అక్కడ పార్టీ అగ్ర నేతలతో వరుసగా భేటీ అయ్యారు.  దీంతో ఢిల్లీలో ఏం జరుగుతోంది? రాష్ట్రంలో ఏం జరగబోతుందన్నది ఆసక్తిగా మారింది. ఎన్నికలకు ఆరు నెలలే సమయం ఉండగా బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఈసారి భారీ ఆశలే పెట్టుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణ నేతలు ఏది అడిగినా కేంద్రం కాదనకుండా చేస్తుంది. సహజంగానే ఎన్నికలకు ముందు ఎలక్షన్ మేనేజ్మెంట్ పగడ్బందీగా రాసుకొనే బీజేపీ తెలంగాణలో ఏం చేయబోతుందన్నది ఆసక్తిగా ఉండగా.. ఈ లోగా బండి సంజయ్ మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేయడం మరింత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు చేతులు మారనున్నాయని.. బండి సంజయ్ ను పక్కకి తప్పించి ఈటల రాజేందర్ కు అధ్యక్ష పదవికి కట్టబెడతారన్న ప్రచారం జరుగుతుండగానే బండి సంజయ్ ఢిల్లీలో అగ్ర నేతలను కలిశారు. దీంతో సహజంగానే అందరి చూపు ఈ వ్యవహారంపైనే ఉంటుంది. సహజంగా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇలా ఢిల్లీ పర్యటనకు వెళ్తుంటే కనీసం రాష్ట్ర శాఖకి సమాచారం ఉంటుంది. కానీ  ఈసారి బండి రాష్ట్రంలో ఉన్న పార్టీ నాయకులకు క‌నీసం మాట మాత్రంగా కూడా   ఈ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ఏమీ చెప్ప‌కుండా వెళ్ల‌డం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  మొత్తంగా బండి   ఆకస్మిక ఢిల్లీ పర్యటన ఉత్కంఠగా మారింది. రెండు రోజులుగా బండి ఢిల్లీలో ఏం చేస్తున్నారు? ఇంకా ఎన్ని రోజులు అక్కడే ఉండనున్నారు? ఇప్పటి వరకు ఎవరెవరిని కలిశారు? ఇంకా ఎవరిని కలవనున్నారు? బండి సంజయ్ ను పార్టీ పెద్దలే హుటాహుటిన ఢిల్లీకి రమ్మన్నారా? లేక ఆయనే స్వయంగా వెళ్లి పెద్దలతో భేటీ అవుతున్నారా? గత నెల రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లు బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుండి తప్పిస్తారా? ఈటల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారా? రాష్ట్ర పార్టీలో ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ జరుగుతుంది.  నిజానికి రాష్ట్రంలో అధ్య‌క్ష మార్పు తప్పదని సంకేతాలు త‌ర‌చుగా వ‌స్తున్నాయి. మ‌రో ఆరు నెలల్లోనే ఎన్నిక‌లు ఉండ‌డంతో.. ఈ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అధిష్టానం ఇక్కడ నుండి కేసీఆర్‌ను ఢీ కొట్టాలంటే అంతే బ‌లంగా వ్య‌వ‌హ‌రించే నాయకుడి కోసం చూస్తున్నది. ప్రస్తుతం పార్టీలో ఉన్న వారిలో చూస్తే ఏ రకంగా చూసినా అధిష్టానం అంచనాలకు తగ్గట్లు కనిపిస్తున్నది ఒక్క ఈటల రాజేందర్ మాత్రమే. కేసీఆర్ కు మాజీ సన్నిహితుడిగా.. కేసీఆర్ వ్యూహ రచనను దగ్గర నుండి చూసిన వ్యక్తిగా కూడా ఈటల బెస్ట్ అప్షన్ గా కనిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ ఆక‌స్మిక ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిగా మారింది. మూడు రోజుల పర్యటన అనంతరం బండి సంజయ్ ఢిల్లీ నుండి తిరిగి కూడా వచ్చేశారు. మరి ఇక ప్రచారానికి తగ్గట్లే మార్పులు ఉంటాయా? లేక ఊరించి ఊరించి ఉసూరుమనిపిస్తారా అన్నది చూడాల్సి ఉంది.

షర్మిల పార్టీ ప్రయాణం ఎటు ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి.. వైఎస్ షర్మిల కారణాలు ఏవైనా, రెండేళ్ళ క్రితం తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ ( వైఎస్సార్ టీపీ) పేరిట పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణలో వైఎస్ పాలన అందిస్తామని ప్రజల్లోకి వెళుతున్నారు.  అయితే, అప్పటి నుంచీ... ఆమె ఏపీని వదిలి తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏమిటన్నది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో విభేదించి  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన సమయంలో షర్మిల అన్నకు అండగా ఉన్నారు. అక్రమాస్తుల కేసులో  జగన్ రెడ్డి జైలుకు వెళ్ళినప్పుడు... ఆమె ‘నేను జగనన్న వదిలిన బాణం’ అంటూ మూడు వేల కిలోమీటర్ల పాద యాత్ర చేశారు. వైసీపీని బతికించారు. అయితే, ఏపీలో  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న వదిలిన బాణాన్ని జగనన్న వదిలేశారో .. ఆమే జగనన్నను వదిలేశారో తెలియదు కానీ  పుట్టింటిని వదిలి మెట్టి నింటికి చేరుకున్నారు. తెలంగాణలో వైఎస్సార్ జెండా ఎగరేశారు. అప్పటి నుంచి ఆమె తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసేఆర్ కుటుంబ పాలనకు వ్యతిరకంగా ప్రత్యేక పంథాలో పోరాటం సాగిస్తున్నారు. పాదయాత్రలు చేశారు. అయితే, ఇప్పుడు షర్మిల త్వరలోనే వైఎస్సార్టీపీని  కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేస్తారనే  ప్రచారం జోరుగా సాగుతోంది.   అయితే ఇంత కష్టపడి   నడిపించిన  పార్టీని ఎందుకు కాంగ్రెస్ లో విలీనం చేస్తానంటూ షర్మిల  పేర్కొంటున్నారు. అలంటి ఆలోచనే లేదని విలీనం ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. అయినా ఇటు మీడియా అటు రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా పీసీసీ నేతల్లో షర్మిల పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.  కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన తర్వాత కొద్ది రోజులు సాగిన ఈ  ప్రచారం మధ్యలో కొంత బ్రేక్ తీసుకుంది. కానీ ఇప్పడు తాజాగా  నాలుగు రోజుల క్రితం ఆ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి చర్చించినట్లు వార్తలు బయటకు పొక్కడంతో  మళ్ళీ మరోమారు షర్మిల  తమ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. అంతేకాదు  విలీన ముహూర్తం కూడా ఖరారైందనే ప్రచారం జరుగుతోంది.   ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ దేశానికి తిరిగి వచ్చిన తర్వాత దీనిపై చర్చిస్తానని వేణుగోపాల్‌ చెప్పినట్లు సమాచారం. రాహుల్‌గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లక ముందే తెలంగాణకు చెందిన కొందరు ముఖ్యనాయకులతో చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు ఏఐసీసీ, ఇటు పీసీసీ నాయకుల మధ్య కూడా ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. కాంగ్రెస్‌లోకి రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని  ఏపీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే అక్కడ పార్టీ కొంతవరకు తేరుకోవడానికి ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని రేవంత్ వర్గానికి చెందిన తెలంగాణ నాయకులు వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే తాను తెలంగాణ కోసం పార్టీ పెట్టానని తెలంగాణ కోడలిగా ఈ ప్రాంతానికే చెందిన వ్యక్తినంటూ షర్మిల పలు సందర్భాల్లో ప్రస్తావించడాన్ని కూడా కాంగ్రెస్‌ నాయకులు గుర్తు చేస్తున్నారు.  ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుగా ఆమె అక్కడ పలు కార్యక్రమాలను చేపడుతున్నారు.అలాగే  ఖమ్మం రాజకీయాల్లో ప్రస్తుతం సంచలనంగా మారిన బీఆర్ఎస్ బహిష్కృత నేత  వైసీపీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కుటుంబ పరంగా ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఒక దశలో ఆయన షర్మిల పార్టీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. అలాగే  కాంగ్రెస్  పార్టీలో తమ ప్రాబల్యాన్ని పెంచుకుని రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు పావులు కడుతున్న.. భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డికి వైఎస్  ఫ్యామిలీపై ఉన్నగౌరవంతో షర్మిల కాంగ్రెస్ లోకి రావాలనే కోరుకుంటున్నారు.  సో ..పొంగులేటి కాంగ్రెస్ లో చేరడం ఖరారైతే, షర్మిల వైఎస్సార్ టీపీని  కాంగ్రెస్  పార్టీలో విలీనం చేయడం లేదంటే ఏదో ఒక అవగాహనకు రావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.  అయితే కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకొంటుంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు  ఎలా స్పందిస్తారు  అనేది తెలియ వలసి వుంది. అయితే  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  తాను పీసీసీ అధ్యక్షునిగా ఉన్నంత వరకు  షర్మిలను గాంధీ భవన్ మెట్లు ఎక్కనీయనని శపధం చేశారు. అయితే  షర్మిల పైకి ఏమి చెప్పినా, నాలుగు  దిక్కుల నుంచి గాంధీ భవన్ మెట్లు ఎక్కేందుకు చకచకా పావులు కదుపుతున్నారు. అంతే కాదు  ఒక విధంగా  రేవంత్ రెడ్డిని అష్ట దిగ్భంధనం చేసేందుకు వ్యూహాత్మకంగా  పావులు కదుపుతున్నారు. కర్ణాటక పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ మొదలు రాహుల్ గాంధీ వరకు, పొంగులేటి, కోమటి రెడ్డి మొదలు ఇతర సీనియర్ నాయకులు అందరితోనూ వైఎస్ కుటుంబ బంధాలను పునరుద్దరించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. గతంలో బెంగుళూరు వెళ్లి మరీ డీకేకు   అభినందనలు తెలిపిన షర్మిల  గతంలో ఎప్పుడూ లేని విధంగా రాహుల్‌గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ఈ పరిణామాలను గమనిస్తే  షర్మిల పాదయాత్ర  ఎటుగా సాగుతోందో చెప్పకనే చెపుతోందని, కాంగ్రెస్ నాయకులు చెపుతున్నారు.

రెబల్‌కు పోటీగా రెబల్ స్టార్ భార్య..!

టాలీవుడ్ ప్రముఖ నటుడు, రెబల్ స్టార్ దివంగత కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి రాజకీయాల్లోకి రానున్నారనే ఓ చర్చ   పోలిటికల్ సర్కిల్‌లో తెగ వైరల్ అవుతోంది. రానున్న ఎన్నికల్లో ఆమెను ఎన్నికల బరిలో దింపేందుకు అధికార జగన్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో అందుకు సంబంధించిన బాధ్యతలు పార్టీలోని కీలక నేత, ఓ ఎంపీ భుజస్కందాలపై సీఎం జగన్ పెట్టినట్లు సమాచారం.  అయితే ఇప్పటికే శ్యామలా దేవితో సదరు ఎంపీ భేటీ అయి... ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దింపితే.. ఆమె గెలుపు నల్లేరు మీద నడక అవుతోందనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం.  ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు గతేడాది అంటే 2022 సెప్టెంబర్‌ 11న మరణించారు. దీంతో ఆయన మరణించి.. ఇంకా ఏడాది పూర్తి కాలేదు. అలాగే సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది మొదటి మూడు మాసాల్లో జరగనున్నాయి కనుక శ్యామలాదేవి ఎన్నికల బరిలో దిగేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయనే చర్చ   పోలిటికల్ సర్కిల్‌లో వాయువేగంతో సాగుతోంది.   అదీకాక శ్యామలాదేవి భర్త కృష్ణంరాజు,.. పలుమార్లు లోక్‌సభకు ఎన్నిక కావడమే కాదు.. వాజ్‌పాయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. అటు నరసాపురం నుంచి.. ఇటు కాకినాడ నుంచి  ఆయన లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందారు. అలాగే ఆయన మంచి నటుడుగా ప్రేక్షకుల ఆదరాభిమానాలనే కాకుండా.. తనదైన శైలిలో ఆయన ప్రజాసేవ చేసి మంచి రాజకీయ నాయకుడిగా ప్రజల మనన్నలు   అందుకొన్నారు.  అదీకాక నరసాపురంలో కృష్ణంరాజు సామాజికవర్గం ఓట్లు.. అక్కడ బరిలో నిలిచిన అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో అంటే 2019లో ఆదే సామాజిక వర్గానికి చెందిన రఘురామకృష్ణం రాజు అలియాస్ ట్రిపుల్ ఆర్ వైసీపీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత... పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ. రెబల్‌గా మారిపోయారు. ప్రతీరోజు ఆయన ప్రెస్‌మీట్ పెట్టి రచ్చబండ కార్యక్రమం ద్వారా సొంత పార్టీ అధినేత  జగన్‌తోపాటు ఆయన ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ.. రచ్చ రచ్చ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.  అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన నరసాపురం నుంచి మరో పార్టీ తరఫున పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నట్లు ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో రెబల్ క్యాండెట్‌పై రెబల్ స్టార్ భార్య శ్యామలా దేవిని బరిలోకి దింపితే.. అసలు సిసలు రాజకీయం నరసాపురం వేదికగా జరుగుతోందనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది.

బీజేపీపై పవన్ సుత్తి మెత్తని విమర్శల మర్మమేంటో?!

జనసేన  అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ఎన్నికల ప్రచార రథం వారాహీలో విజయయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఈ యాత్ర కోనసీమ జిల్లా ముమ్ముడివరంలో కొనసాగుతుండగా అక్కడ బుధవారం(జూన్ 21) భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. యధావిధిగా ఈ సభ నుండి వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తనకి మద్దతు తెలిపి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించమని జన సైనికులను, ప్రజలను కోరారు. అధికార వైసీపీపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం సహజమే కాగా.. ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీపై కూడా పవన్ సుతిమెత్తని విమర్శలు చేసేస్తున్నారు. ఈ వారాహీ విజయయాత్ర మొదలైనప్పటి నుండి అప్పుడప్పుడు బీజేపీకి పవన్ చురకలంటిస్తూనే ఉన్నారు.  తాజాగా కాకినాడలో   జనసేన సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ బీజేపీ మీద కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. తాను బీజేపీని ఏ విషయంలోనూ గుడ్డిగా సపోర్ట్ చేయడం లేదని అన్నారు. వైసీపీకి పాతికకు 22 లోక్ సభ సీట్లు ఇచ్చి పార్లమెంటుకి పంపిస్తే.. ఆ పార్టీ వెళ్లి బీజేపీకి ప్రతీ విషయంలో మద్దతు తెలియ చేస్తోందని.. దీన్ని ముస్లిం సోదరులు గుర్తించాలన్న పవన్.. ముస్లిం ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ బీజేపీకి లొంగిపోయిందని సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఏదో రాజకీయ విమర్శల మాదిరే ఉన్నా లోతుగా వెళ్లి చూస్తే ఈ వ్యాఖ్యలు బీజేపీకి విమర్శలే అవుతాయి. ప్రజలు నమ్మి వైసీపీకి ఓటేస్తే.. వాళ్ళు వెళ్లి బీజేపీకి కొమ్ముకాస్తున్నారన్న పవన్.. ఇది ముస్లిం సోదరులు గమనించాలని నొక్కి చెప్పారు. ఎంత కాదనుకున్నా ముస్లిం ప్రజానీకం మత పార్టీగా చూస్తున్న బీజేపీని అంత సులభంగా నమ్మరన్న విషయం తెలిసిందే. అయితే, వైసీపీ కూడా ఆ మత పార్టీలకే వత్తాసు పలుకుతోందని పవన్ విమర్శల అర్ధం. ఇక్కడ వైసీపీనే పవన్ విమర్శించినా అందులో బీజేపీని కలపడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, బీజేపీని నేను గుడ్డిగా నమ్మనని చెప్పడం మరికాస్త ఆసక్తి కలిగించింది. బీజేపీకి జనసేన మిత్రపక్షం. ఎన్నిసార్లు ఈ దోస్తీ తెగదెంపులు అవుతుందని ప్రచారం జరిగినా పవన్ మాత్రం బీజేపీని వదులుకోలేదు. ఎన్నికలకు ఈ రెండు పార్టీలు కలిసే వెళ్లనున్నాయి. ఆ విషయంలో రెండు పార్టీలూ మీడియా ముందుకు వచ్చి అదే చెబుతూంటాయి.ఇప్పుడు ఈ రెండు పార్టీలూ కలిసి తెలుగుదేం పార్టీకి చేరువయ్యే అవకాశాలూ కనిపిస్తున్నాయి. అయితే పవన్ తాజా పవన్ వ్యాఖ్యలను చూస్తే మాత్రం ఆ మిత్ర బంధం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో బీజేపీ రూట్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నా అని ప్రకటించిన పవన్ ఇప్పుడు ఆ రూట్ మ్యాప్ వచ్చిందో రాలేదో కానీ వారాహి యాత్ర మొదలు పెట్టి తెగ చుట్టేస్తున్నారు. పైగా బీజేపీ మీద ఇలా సుతిమెత్తని విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీంతో పవన్ ఆంతర్యం ఏమిటో విశ్లేషకులకు సైతం అంతుచిక్కడం లేదు.  అయితే నిజానికి పవన్ రాజకీయంగా రాటుదేలుతున్నారు. ఒకవైపు ఢిల్లీ పెద్దలు నాకు జిగిరీ దోస్తులు అంటూనే.. అంత గుడ్డిగా వాళ్ళని నమ్మలేనని రాష్ట్రంలో ప్రజలకు చెప్తున్నారు.  జగన్ మోహన్ రెడ్డిని నమ్మి ముస్లిం సోదరులు ఓటేస్తే.. ఆయన మంచీ చెడు అనేది లేకుండా కేంద్రం తీసుకొనే అన్ని నిర్ణయాలకు జై కొడుతున్నారని.. కానీ, తాను అలా నమ్మను.. మంచీ చెడు అలోచించి ప్రజలకు పనికొచ్చే వాటికే మద్దతు ఇస్తానని చెప్పారు. ఒకవిధంగా చెప్పాలంటే బీజేపీతో మితృత్వం ఉన్నా అది మీ కోసమే అన్నట్లు పవన్ ప్రజల వద్ద చెప్పకనే చెప్తున్నారు. అదే సమయంలో ఏపీ సర్కార్ విషయంలో బీజేపీ తన వైఖరిని తేల్చేయాలన్న ఒత్తిడీ తీసుకు వచ్చారు.   దీనిని బట్టి చూస్తే  జనసేనుడికి సైతం ఆంధ్రా రాజకీయాలు అంతు బట్టాయనిపిస్తుంది.

గోదావరి ‘కుల’ పాలిటిక్స్.. ఇది ఆరంభం మాత్రమే!

ఎవరు ఔనన్నా కాదన్నా రాజకీయాల నుండి కులాలను విడదీసి చూడలేం. కులం చూడం.. మతం చూడం అని మన నేతలు ఎన్ని చెప్పినా ఓట్లు పడాలంటే కులాల సమీకరణాలు, కులాల బేరీజు తప్పదని వాళ్ళకి కూడా తెలుసు. అందునా మన తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా ఏపీలో కులమే రాజకీయాలను శాసిస్తుంది.  ఒకరిని అందలం ఎక్కిచాలన్నా.. ఒకరిని గద్దె దింపాలన్నా సొంత కులం నుండి మద్దతు ఉంటేనే సాధ్యం. ఏపీ విషయానికి వస్తే ఆ మధ్య అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసేందుకు కమ్మ కులాన్ని హైలెట్ చేసిన సంగతి అందరూ చూశారు. అలాంటిది ఇప్పుడు ఎన్నికల ఏడాది మొదలైంది కనుక   ఈ కుల రాజకీయాలు మరింతగా పుంజుకుంటున్నాయి.  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ మధ్య తనకు కులం లేదని ప్రకటించి తాను అందరి వాడినని చాటి చెప్పుకొనే ప్రయత్నం చేశారు. అయితే, ఈ మధ్య కాలంలో ఈ టోన్ చాలా మారింది. ఈ మధ్య పవన్ కళ్యాణ్ ప్రసంగాలలో మళ్ళీ ఇలాంటి ప్రస్తావన లేనే లేదు. పైగా ఓ ఆరు నెలల క్రితం కాపు నేతలు, కుల సంఘాలు, చివరికి ప్రజలతో కూడా తానే స్వయంగా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలలో ఏం జరిగిందో పబ్లిక్ లో చెప్పలేదు కానీ.. తాను మీ వాడినేనని.. నాకు మీ సంపూర్ణ మద్దతు కావాలని పవన్ కళ్యాణ్ కాపు పెద్దలను కోరినట్లు సమాచారం బయటికొచ్చింది.    ఏపీలో కాపులు జనసేనకు ఎంతవరకు మద్దతు ఇస్తారు? ఎంతవరకు పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తారన్నది ఇప్పుడే మనం తేల్చే అంశం కాదు. కానీ.. పవన్ ఎప్పుడైతే కాపులను తన వైపుకు తిప్పుకొనేందుకు ప్రయత్నం మొదలైందో.. అధికార పక్షమైన వైసీపీ దాన్ని అడ్డుకొనే ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే వైసీపీలోని కాపు నేతలను మీడియా ముందుకు పంపించి తిట్టించడం మొదలు పెట్టారు. కాపులకు ఐకానిక్ గా తనకి తానుగా చెప్పుకొనే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళని ఉసిగొల్పి కౌంటర్లు మొదలు పెట్టారు. నిజానికి ఈసారి ఎన్నికలలో కాపు సామజిక వర్గ ఓట్ బ్యాంక్ పై పవన్ కళ్యాణ్ భారీ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. దీంతో దానిని ఎలాగైనా నిలువరించేందుకు వైసీపీ రకరకాల ఎత్తులు వేస్తోంది. మొత్తంగా ఇప్పుడు కాపు రాజకీయం తారాస్థాయికి చేరుకుంటుంది.  అయితే, ఏపీలో మొదలైన ఈ కాపు రాజకీయం  ఆరంభం మాత్రమే.. కాగా ముందు ముందు పెద్ద సినిమానే చూడాల్సి ఉంటుంది ఏపీ ప్రజలు. ఇప్పటికే కాపులలో చీలిక తెచ్చేందుకు వైసీపీ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కాపు సామజిక వర్గం అధికంగా ఉండే ఉమ్మడి గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ జిల్లాల నుండి ప్రజలను పార్టీలకు మద్దతు ఇచ్చే శాతంతో లెక్కేస్తే 40 నుండి 60 ఏళ్ల వయసు మధ్య వారిలో కొంత భాగం వైసీపీకి మద్దతు ఉంటుంది. ఆ తర్వాత 20 నుండి 40 ఏళ్ల వారిలో ఎక్కువ శాతం తెలుగుదేశం అనుకూల వర్గమై ఉంటుంది. వీరిలో యువత ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ అభిమానులై ఉండడం సహజం. ఈ యువతను రాజకీయాలు పెద్దగా ప్రభావితం చేయలేవు. అయితే, ఇప్పుడు పవన్ వృద్ధులు, నడి వయసు ఓటర్లను కూడా తన వైపుకు తిప్పుకొనే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే పవన్ ప్రయత్నాన్ని అడ్డుకొనేలా వైసీపీ కాపుల ఆత్మగౌరవం అంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అధికారం కట్టబెట్టడం కోసమే పనిచేస్తున్నాడు తప్ప కాపులకు అధికారం కోసమే కాదనే ఆరోపణలని ప్రజలలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అందుకే ప్రతిసారి పవన్ దమ్ముంటే 175 స్థానాలలో పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. ప్రతిసారి కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెడుతున్నారనే విమర్శలతో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాలలో ఎవరు ఎంత సక్సెస్ అవుతారన్నది తెలియదు కానీ.. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఈ కాపు పాలిటిక్స్ మరింత రసకందాయంగా మారతాయన్నది మాత్రం వాస్తవం.

జగన్ అసహనం పీక్స్.. కారణం అదేనా?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరిందా? ఆయన నడకలో తడబాటు , మాటల్లో తొట్రుపాటు అందుకేనా? అంటే, వైసీపీ నాయకులే అవునని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా, గడపగడపకు మన ప్రభుత్వం  కార్యక్రమం పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ, పార్టీ ఎమ్మెల్యేలలో మాత్రం ఆ విశ్వాసం ఉన్నట్లుగా లేదు. అందుకే, మెజారిటీ ఎమ్మెల్యేలు ఏదో ఒక వంకన గడపగడపకు దండం పెట్టి తప్పుకుంటున్నారు   అందుకే ఆయన ప్రతి మూడు నాలుగు నెలకు ఒకసారి,  గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్‌ నిర్వహిస్తున్నారు, ప్రతి వర్క్ షాప్ లో ఎమ్మెల్యేలను పేరు పేరునా పిలిచి పని తీరు బాగాలేదని హెచ్చరిస్తున్నారు.ఎమ్మెల్యేలనే కాదు. మంత్రులను హెచ్చరిస్తున్నారు. అయినా  చాలా వరకు ఎమ్మెల్యేలు జగన్ రెడ్డి హేచ్చరికలను అంతగా పట్టించుకోవడం లేదు. అందుకు వారి కుండే కారణాలు వారికున్నాయి. మీటలు నొక్కడం తప్ప ప్రజలకు ఏమి మంచి చేశామని, గడపగడపకు వెళ్లి తలుపు కొడతామని ప్రశ్నిస్తున్నారు.  కాగా  తాజాగా  బుధవారం(జూన్ 21) నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్‌లో జగన్మోహన్ రెడ్డి  ఓ 20 మంది ఎమ్మెల్యేల పని తీరుపై పెదవి విరిచారు. అలాగని మిగిలిన ఎమ్మెల్యేల పని తేరు అద్భుతంగా ఉందని కాదని కూడా ఆయనే వివరణ ఇచ్చారు. నిజానికి , గడపగడప మన ప్రభుత్వం  పరీక్షలో  సగం మంది ఎమ్మెల్యేలకు పాస్  మార్కులు రాలేదని అన్నారు. అలాగే మిగిలిన సగం మందిలో సగం మందికి పైగానే, అత్తెసరు మార్కులతో పాసయ్యారని... అన్నారని సమాచారం.   అంతేకాదు.  ఇలా అయితే లాభం లేదు. పరీక్ష తప్పిన 20 మందికి ప్రత్యేక తరగతులుంటాయి,  వీరందరినీ త్వరలోనే వ్యక్తిగతంగా పిలిచి చెబుతాను. అప్పటికీ పనితీరు మార్చుకోపోతే నా నిర్ణయం నేను తీసుకుంటాను. మిగతా వాళ్లలో కూడా దాదాపుగా సగం మంది పనితీరు మెరుగుపరుచుకోవాల్సిందే. పని తీరు బాగుంటేనే ఎమ్మెల్యేలను కొనసాగిస్తాం. పనితీరు బాగోలేకపోతే కొనసాగించడం పార్టీకి నష్టమవుతుంది. ఇప్పటి వరకూ చేసిన సర్వేల వివరాలన్నీ నా వద్ద ఉన్నాయి. ఇక్కడి నుంచి చేసే సర్వేలో మీ గ్రాఫ్‌లు పెరగాల్సిందే. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మీరు గ్రాఫ్‌ పెరిగేందుకు ఉపయోగించుకోండి. మీరు ప్రతి ఇంటికీ వెళితే గ్రాఫ్‌ పెరుగుతుంది.... లేకపోతే మీ గ్రాఫ్‌ పెరగదు. మీరు బాగా పనిచేస్తే పార్టీకి ఉపయోగం ఉంటుంది. అలా జరగకపోతే మిమ్మల్ని మార్చడం మినహా నాకు వేరే ప్రత్యామ్నాయం ఉండదు. మీ పనితీరు బాగోలేని పక్షంలో టిక్కెట్లు ఇవ్వను.... చివరిలో మీరు నన్ను బాధ్యుడిని చేయవద్దు  అని గతంలో లానే మరోమారు, నేరం నాది కాదు  మీదే అన్నట్లు ‘ఛీ’..వాట్లు పెట్టినట్లు చెపుతున్నారు.   ఇక మిగిలుంది తొమ్మిది నెలలే .. ఈ తొమ్మిది నెలలు జగనన్న సుర్క్షలో భాగంగా ఇంటింటికి వెళ్ళాలని , ఈకార్యక్రమాన్ని ప్రతి ఎమ్మెల్యే ఛాలెంజ్  గా తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ తోమ్మిది నెలలు అత్యంత కీలకం, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాని పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని పిలుపు నిచ్చారు.  అయితే, ముఖ్యమంత్రి ఉపన్యాసాన్ని ‘శ్రద్ద’ గా విన్న ఎమ్మెల్యేలు  బయటకు వచ్చి ఇంకా ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ముఖ్యమంత్రికి అర్థం కావడం లేదని పెదవి విరవడం..విశేషంగా పరిశీలకులు పేర్కొంటున్నారు. ఓ వంక   విద్యుత్ చార్జీల మోత మరో వంక విద్యుత్ కోతలతో సతమతమవుతున్న ప్రజలు అడిగే ప్రశ్నలకు  సమాధానం చెప్పలేక పోతున్నామని అంటున్నారు. ఒక విద్యుత్ చార్జీలు మాత్రమే కాదు, అన్ని చార్జీలు మంట పుట్టిస్తున్నాయి. నిత్యావసరాల ధరలు మండి పోతున్నాయి. ఇక ప్రజలు ఏకరువు పెడుతున్న తాగు నీరు, సాగు నీరు సమస్యలు , రోడ్ల అధ్వాన స్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అంటున్నారు. ఈ సమస్యలు ఏవీ పరిష్కరించకుండా ప్రజల్లోకి వెళితే ప్రజాగ్రహం చవి చుడడం మినహా మరో ప్రయోజనం ఉండదని అంటున్నారు. అందుకే ప్రజల్లోకి వెళ్ళలేక పోతున్నామని అంటున్నారు. అందుకే  ముఖ్యమంత్రిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని, అంటున్నారు. అంతే కాదు, ముఖ్యంత్రి వాస్తవాలు తెలుసుకుని, విధానాలను మార్చుకోకుండా ఎన్ని సార్లు ఎన్ని గడపలు తొక్కినా ఫలితం ఉందని  కొందరు ఎమ్మెల్యేలు అంటున్నారు. అలాగే, ముఖ్యమంత్రి మారకుండా మరో సారి అధికారాన్ని ఆశించలేమని అధికార పార్టీఎమ్మెల్యేలే గుసగుసలు పోతున్నారంటే ..పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అలా  ముఖ్యమంత్రి ఏ ధీమాతో  175 కు 175 అంటున్నారో కానీ, అందులో సగం, ఆ సగంలో సగం సీట్లు వచ్చిన వైసీపీ పండగ చేసుకోవచ్చునని రాజకీయ పండితులు పరిస్థితిని  విశ్లేషిస్తున్నారు.

సంక్షిప్తం morning

1.బీఆర్ఎస్ నేత, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ మీడియా ముందుకొచ్చిన ధర్మసాగర్‌ మండలం జానకీపురం సర్పంచ్‌ నవ్య తాజాగా రాజయ్యపై ఆరోపణలు చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారన్నారు. 2.హోండురస్ లోని ఓ మహిళా జైలులో చెలరేగిన అల్లర్లలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. 26 మంది మహిళలు అగ్నికి ఆహుతికాగా, మిగతా వారిలో కొందరిని కాల్చి, కత్తితో పొడిచి చంపేశారు.  3. దేశంలో జూన్ మూడో వారంలోనూ ఎండలు మండిపోతున్న వేళ వడగాల్పుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ  రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో ఈ రోజు వర్చువల్ భేటీ నిర్వహించారు. ఎండలలో ప్రజారోగ్యం కాపాడే విషయంపై చర్చించారు.  4. జగన్ పాలనలో అన్ని రంగాల వారు బాధితులేనని లోకేష్ అన్నారు. జగన్ ఏ వర్గానికి న్యాయం చెయ్యలేదని, జగన్ పాలనలో సమాజంలో భయం ఏర్పడిందని తెలిపారు. పాదయాత్రలో భాగంగా ఆయన వెంకటగిరి లో నిన్న మాట్లాడుతూ ఏపీ బ్రాండ్ ను జగన్ దెబ్బతీశారని విమర్శించారు. ( 5. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సర్కార్ కు సుప్రీం షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. జూలై 8న బెంగాల్ లో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి.   6.ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న ఇల్లు జప్తుకు సంబంధించి లింగమనేని రమేశ్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను  ఈ నెల 28కి వాయిదా వేసింది.  7. మెగా ప్రిన్సెస్ కు జనసేనాని పవన్ కల్యాణ్ ఆశీస్సులు అందించారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు నిన్న ఆడపిల్ల జన్మించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా వారికి   శుభాకాంక్షలు  పాపకు ఆశీస్సులు అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  8. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ము కాసేలా ఉండటం సరికాదని సోము వీర్రాజు అన్నారు. ప్రజలను రక్షించాల్సిన అధికార పార్టీ నేతలు పోలీసులు అడ్డుపెట్టుకొని రెచ్చిపోతున్నారన్నారు. బాపట్ల జిల్లా ఉప్పాలవారిపాలెంలో అమర్నాథ్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.  9.బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  నేటి మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారిని పార్టీలోకి ఆహ్వానించారు. 10. ఆదిపురుష్ సినిమాపై రామాయణాన్ని వక్రీకరించారంటూ విమర్శలు  కొనసాగుతున్నాయి.  తాజాగా గతంలో దేశాన్ని ఉర్రూతలూగించిన  మహాభారత్ సీరియల్ లో భీష్ముడి పాత్రను పోషించిన ముఖేశ్ ఖన్నా ఆదిపురుష్ మేకర్స్ ను  తగలబెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.  11.   ప్రధాని  మోడీపై  ట్విట్టర్, టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ ప్రశంసలు కురిపించారు. బుధవారం (జూన్ 21)న మోడీతో భేటీ అయిన  మస్క్  వచ్చే ఏడాది తాను భారత్ లో పర్యటించనున్నట్లు చెప్పారు. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీస్ లను భారత్ లోకి తెస్తామన్నారు.  12. తెరాస బహిష్కృత నేతలు పొంగులేటి, జూపల్లిలు  వచ్చే నెల రెండో తేదీన ఖమ్మంలో జరగనున్న బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో  వీరు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. అంతకు ముందు ఈ నెల 25న వారు ఢిల్లీలో రాహుల్ తో భేటీ అవుతారు.  13. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ లో కొంత భాగం కూలి పది మంది గాయపడ్డారు. రెడీ మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.  రెండు పిల్లర్లకు మధ్య నిర్మిస్తున్న ఓ స్లాబ్ కూలిపోయింది.  14.  వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడనివ్వకూడదనేదే తన ఉద్దేశమనీ, అది నెరవేరాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలవాలని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వస్తుందని చెప్పారు.  15. అంతర్జాతీయ యోగా దినోత్సవం  సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన యోగా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.యోగా అనేది మన నాగరికత సాధించిన గొప్ప విజయాల్లో ఒకటని చెప్పారు.  16. పేదల ఇళ్లు కూల్చేస్తారా అంటూ మహారాష్ట్ర  మీరా భయందర్  నియోజకవర్గం ఎమ్మెల్యే గీతా భరత్ జైన్  ప్రజల ముందే జూనియర్ సివిల్ ఇంజినీర్‌ కాలర్ పట్టుకుని చెంప ఛెళ్లుమనిపించారు.  నిర్మాణాలను ఎలా ధ్వంసం చేస్తారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 17.  కరీంనగర్ లో మానేరు నదిపై రూ.224 కోట్లతో  పూర్తి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రారంభించారు. హైదరాబాద్ లోని  దుర్గం చెరువు తర్వాత రాష్ట్రంలో నిర్మించిన రెండో కేబుల్ బ్రిడ్జి ఇదే కావడం గమనార్హం. 18. దేశ రాజధానిలో తెలంగాణ బోనాల సంబరాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి ఇండియా గేట్ వరకు తెలంగాణ బోనాలతో మహిళలతో ఊరేగింపు జరిగింది. 19.   ఏపీలో  అధికార పార్టీ అండతో భారీగా దొంగ ఓట్లు నమోదౌతున్నాయంటూ ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.   20. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో  రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన కబాలీ తెలుగు నిర్మాత కేపీ చౌదరిని  పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు ఆయనను విచారించనున్నారు.   

బీఆర్ఎస్‌లో ఆ 40 మంది.. కేసీఆర్ కు సెగ!

చూస్తూ ఉండగానే నాలుగేళ్లు గిర్రున తిరిగిపోయాయి. నిన్నకాక మొన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లినట్లుగా ఉన్నా.. అప్పుడే నాలుగున్నరేళ్ళు గడిచి మళ్ళీ ఎన్నికల సమయం వచ్చేసింది. మళ్ళీ ఈసారి కూడా ఎలాగైనా తానే అధికారం దక్కించుకోవాలని ఆరాటపడుతున్న సీఎం కేసీఆర్.. అందుకు తగ్గ అన్ని అవకాశాలను వినియోగించేసుకుంటున్నారు. నిండా ఆరు నెలలే ఎన్నికలకు సమయం ఉండడంతో బీఆర్ఎస్ పార్టీలో క్యాండిట్ల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు. ఈసారి కూడా సిట్టింగులకే అవకాశం ఇస్తానని గులాబీ బాస్ ఎమ్మెల్యేకు హామీ ఇచ్చినా.. బీఫామ్ చేతిలో పడే వరకు నమ్మలేమంటూ చాలా మంది టెన్షన్ పడుతున్నారు. సిట్టింగులకే టికెట్లు అని చెప్పినా కొందరిపై మాత్రం అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టి గమనిస్తున్నట్లు పార్టీలో అంతర్గత సమాచారం. ఇప్పుడున్న రాజకీయాలలో ఎన్నికలంటే ముందుగా గుర్తొచ్చేది సర్వేలు. ఏ పార్టీకి ఆ పార్టీ అవకాశాలను అంచనా వేసేందుకు ఈ సర్వేలు చేయిస్తుండగా, బీఆర్ఎస్ మాత్రం రెండేళ్ల ముందు నుండే ఈ సర్వేల పని మొదలు పెట్టింది. ఇప్పటికే రెండు మూడు సార్లు ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై సర్వేలు చేయించిన కేసీఆర్.. వర్కింగ్ స్కోర్ తక్కువగా ఉన్న ఎమ్మెల్యేలకు హెచ్చరికలు కూడా చేశారు. ఎన్నికలకు ఏడాది ముందే కేసీఆర్.. నెగటివ్ మార్క్ ఎమ్మెల్యేలకు డెడ్లీ వార్నింగ్ కూడా ఇచ్చారట. పనితీరు మెరుగు పరుచుకోలేకపోతే మీ స్థానంలో వేరేవాళ్లని దింపాల్సి వస్తుందని గట్టి హెచ్చరికలే చేశారని పార్టీ వర్గాలే చెప్పుకున్నాయి. వారిలో కొందరు బాస్ చెప్పినట్లే నిత్యం ప్రజల మధ్య ఉండేలా ప్లాన్ చేసుకుంటే మరికొందరు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయారు. అలా పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలు, పథకాల అమలును పట్టించుకోని ఎమ్మెల్యేలు, ప్రజలలో వ్యతిరేకత మూటగట్టుకున్న ఎమ్మెల్యేల ప్రభావం ఇప్పుడు ఏకంగా అధిష్టానాన్ని తాకుతుందా అనిపిస్తుంది. ఎమ్మెల్యే తీరు నచ్చక ప్రజలు తిరుగుబాటు చేసినా అది బీఆర్ఎస్ పార్టీపైనే చూపిస్తుంది కదా. ఇప్పుడు అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు అందని ప్రజలు నిరసనలు చేస్తూ సూటిగా అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ ఉత్సవాలలో పలుచోట్ల ప్రజలు రకరకాల అంశాలపై నిరసనలు వ్యక్తం చేయగా.. నిన్నటికి నిన్న తాగునీటి ఉత్సవాలు జరుగుతుంటే.. కొన్ని చోట్ల ఖాళీ బిందెలతో రోడ్డెక్కి మాకు మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు రావంటూ ధర్నాలకు దిగారు. ధరణి పోర్టల్ నుండి దళిత బంధు వరకు పలు చోట్ల ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రజలను గాలి కొదిలేసినట్లే అధిష్టానం భావిస్తోంది. ఇలాంటి వారిలో ఇప్పటికే 40 మందితో ఒక జాబితా కూడా సిద్దమైనట్లు తెలుస్తుంది. ఇలా అసమర్ధ ఎమ్మెల్యేలుగా గుర్తించిన ఈ 40 మంది వలన ఇప్పుడు అధిష్టానానికి కూడా తలనొప్పులు కాగా.. ఈసారి ఈ 40 మందికి సీట్లు కేటాయించే పరిస్థితి ఉండదని రాజకీయ వర్గాల భావన. అందుకోసమే ఇప్పటికే కేసీఆర్ వాళ్ళపైన ప్రత్యేక నిఘా పెట్టించారట. వాళ్ళ కదలికల నుండి సమావేశాల వరకు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న అధిష్టానం.. వీరు టికెట్ దక్కకపోతే ఏ పార్టీలోకి జంప్ అయ్యే ఛాన్స్ ఉందో కూడా అంచనాలు సిద్ధం చేసి అటాక్ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. జూలై లేదా ఆగస్టులో మొదటి విడత జాబితాను విడుదలచేయాలని కూడా డిసైడ్ అయిన గులాబీ బాస్.. సుమారు 60-70 మంది అభ్యర్ధులతో మొదటి జాబితాను విడుదల చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. తొలి జాబితా ప్రకటనతో పాటు ఈ 40 మంది అసమర్ధ ఎమ్మెల్యేల స్థానంలో ఇంచార్జిలకు అనధికారికంగానే హామీలు ఇచ్చే అవకాశం ఉండగా.. ఆయా స్థానాలలో ఆశావహుల జాబితా కూడా భారీగానే ఉండనుంది. వీలైనంత త్వరగా ఈ 40 మంది ప్రభావాన్ని తగ్గించేందుకు సిద్ధపడిన కేసీఆర్.. వీరు రేపు రెబల్స్ గా మారితే ఎలా ఎదుర్కోవాలనే దానిపై కూడా ముమ్మర కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది.