కాంగ్రెస్ కు క్యూ కడుతున్న విజయశాంతి..?
posted on Jun 26, 2023 @ 1:51PM
దేశ రాజకీయాలలో కాంగ్రెస్ కర్ణాటక విజయం.. కొత్త ఉత్సాహం.. కొత్త సమీకరణాలకు శ్రీకారం చుట్టింది. ఇక తెలంగాణలో.. కాంగ్రెస్ కర్ణాటక కాంగ్రెస్ గెలుపుతో.. ఆ పార్టీ గ్రాఫ్ పైకి దూసుకెళ్లుతుంది. పార్టీలో చేరికలు ..భారీగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. బీజేపీని వదిలేసి తొందరలో కాంగ్రెస్ లో చేరబోయే నేతల పేర్లలో విజయశాంతి పేరు కూడా ప్రచారమవుతోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణల పేర్లు వినబడుతున్నాయి. ఒకపుడు విజయశాంతి కాంగ్రెస్ లో ఉన్నవారే. అయితే వివిధ కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో తనకు గుర్తింపు దక్కటం లేదనే తీవ్ర అసంతృప్తి ఈమెను పట్టి పీడిస్తోంది. తన సేవలను ఉపయోగించుకోవాల్సిన పార్టీ ఏమాత్రం పట్టించుకోవటంలేదని బాహాటంగానే తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. చాలాకాలంగా పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా యాక్టివ్ గా లేరు.అందుకనే తొందరలోనే కమలం పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రచారంలో నిజం కూడా లేకపోలేదనే అనుకుంటున్నారు. ఎందుకంటే అందుకు విజయశాంతి వైఖరే కారణం. ఆమె బీజేపీలో గుర్తింపు లేక..ఇబ్బంది పడుతున్నారు. ఏ పార్టీలో ఉన్నా తనకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం దక్కాలని కోరుకుంటారు. అయితే అందరు ప్రత్యేకంగా గుర్తించటానికి, గౌరవించటానికి ఆమెకున్న కెపాసిటి ఏమిటి అనే విషయాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిజానికి సినీ గ్లామర్ అన్న ఒక్క విషయాన్ని పక్కనపెట్టేస్తే విజయశాంతిలో మరే ప్రత్యేకతా లేదు. జనాలను ఆకర్షించేంత వాగ్దాటిలో కూడా జీరోనే. రాష్ట్రంలోని ఏ ఒక్క నియోజకవర్గంలో కానీ వర్గంలో కానీ ఆమెకు పట్టులేదు. సినిమాల్లో అయితే ఆమె బాగానే రాణించారు. అది గతం. అదే విధమైన గుర్తింపు రాజకీయాల్లో కూడా రావాలంటే దొరకదని ఆమె నమ్మి తీరాలి.
ఎటువంటి ప్రత్యేకత, పట్టులేని విజయశాంతిని ఏ పార్టీ అయినా ఎందుకు అంతగా ప్రాధాన్యతిస్తుంది ? పైగా తల్లి తెలంగాణా అనే పార్టీ పెట్టారు. దుకాణం సరిగా నడవకపోవటంతో దాన్ని టీఆర్ఎస్ లో కలిపేశారు. అక్కడినుండి ఒకసారి ఎంపీగా గెలిచారు. తాను ఎంపీగా గెలవగానే అంత తన గొప్పతనమే అనుకున్నారు. దాంతో కేసీయార్ తో వ్యక్తిగతంగా చెడింది. అందుకనే టీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరారు. మళ్ళీ బయటకు వచ్చేస్తారనే ప్రచారం పెరిగిపోతోంది. విషయ పరిజ్ఞానం లేదు... వాక్పటిమ లేదు.. జనాకర్షణ లేదు... ఇక రాజకీయ పరిణతి అసలే లేదు. అలాంటి నాయకురాలిని ఏ పార్టీ కూడా చేర్చుకునేందుకు ముందుకు రాదు. ఆమె ఏ పార్టీలో చేరినా.. మూడునాళ్ల ముచ్చటే. ప్రస్తుతం విజయశాంతి రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.