మీడియాపై అవినాష్ బ్యాచ్ దాడి.. ఖండించిన జర్నలిస్ట్ యూనియన్లు

కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి అనుచరులు మీడియాపై చేసిన దాడిని ఏపీయూడబ్ల్యూజే, ఏపీఈఎంజేఏ ఖండించాయి. ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిని అరెస్ట్ చేసి.. వారిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని.. డిమాండ్ చేశాయి.  ఒక సంచలన కేసులో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు చెప్పడం మీడియా బాధ్యత అని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు ఈ రకంగా బరి తెగించడం మంచి పద్దతి కాదన్నారు. ఇలా దాడుల ద్వారా మీడియాను అణిచివేయాలను కోవడం అవివేకమని ఆ జర్నలిస్ట్ యూనియన్లు పేర్కొన్నాయి. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఐవి సుబ్బారావు, చంద్ జనార్థన్.. అలాగే ఎపి ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు ఏచూరి శివ, డాక్టర్ మురళీ మోహన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.  వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది... అయితే తన తల్లి శ్రీలక్ష్మీ అనారోగ్య కారణంగాచూపుతూ.. ఆయన హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరారు. అయితే ఆ వాహనాన్ని అనసరిస్తూ.. కొన్ని మీడియా ఛానెళ్లకు చెందిన వాహనాలు వెంబడించాయి. ఈ నేపథ్యంలో సదరు వాహనాలపైనే కాకుండా.. సదరు చానెళ్లకు చెందిన జర్నలిస్టులపై అవినాష్ రెడ్డి అనుచరులు దాడికి దిగారు. అందుకు సంబంధించిన దృశ్యాలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి.. అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దాడిని జర్నలిస్ట్‌ల యూనియన్ సంఘాలు ముక్త కంఠంతో ఖండించాయి.   మరోవైపు  మే 16న విచారణకు హాజరుకావాలంటూ వైయస్ అవినాష్ రెడ్డికి సీబీఐ వాట్సప్‌లో నోటీసులు జారీ చేసింది. కానీ తనకు నాలుగు రోజుల పాటు పార్టీ కార్యక్రమాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల తర్వాత వస్తానని చెప్పగా.. మే 19వ తేదీ విచారణకు హజరుకావాలంటూ.. అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడమే కాకుండా.. పులివెందులకు వెళ్లి.. ఆయన నివాసం వద్ద ఉన్న ఆయన కారు డ్రైవర్‌కు నోటీసులు అందజేశారు సీబీఐ అధికారులు. దీంతో మే 19వ తేదీన ఆయన సీబీబీ విచారణకు  అవినాష్ హాజరు కావాల్సి ఉంది. అయితే  చివరి నిమిషంలో ఆయన కారు.. పులివెందులకు పయనం కావడంతో.. మీడియా వాహనాలు.. ఆయన వాహనాన్ని అనుసరించడంతో.. ఆయన.. సీబీఐ విచారణకు డుమ్మా కొట్టారనే ప్రచారం ఊపందుకొంది. అలాంటి వేళ.. మీడియా వాళ్లపై అవినాష్ అనుచరులు దాడులకు తెగబడ్డారు.

కొనుగోలు చేసిన భూములకే దిక్కూ దివాణం లేదు

ఖమ్మం జర్నలిస్తులకు 23 ఎకరాల భూమిని  బిఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది. రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ చేసిన వినతికి ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రభుత్వం హడావిడిగా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయించారు.  పువ్వాడ అజయ్ మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. దాదాపు 15 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన 70 ఎకరాల భూములకు ఇంత వరకు మోక్షం రాలేదు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో నిజాంపేటలో 32 ఎకరాలు, పేట బషీరాబాద్ లో 38 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వ్యవసాయ భూములు అయిన నిజాంపేటలో అప్పటి ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధరకు 1100మంది జర్నలిస్ట్ లు చెల్లించారు. అదే పేట్ బషీర్ బాద్ స్థలాలను చదరపు అడుగుల లెక్కన ప్రభుత్వానికి  ఈ జర్నలిస్ట్ లు చెల్లించారు. కోర్టులో 15 ఏళ్ల పాటు కేసులు నడిచాయి. ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన ఇట్టి భూములను జవహార్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ తీర్పు చెప్పారు. 9 నెలల క్రితం ఈ తీర్పు వెలువడినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. ఏడేళ్ల క్రితం మధ్యంతర ఉత్తర్వుల్లో ఈ భూములను జవహార్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పాలని తీర్పు చెప్పింది. అయితే ఇట్టి భూములను డెవలప్ చేసుకోవచ్చని,  ఇళ్ల నిర్మాణాలను మాత్రమే చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ముఖ్యమంత్రి కెసీఆర్ మధ్యంతర ఉత్తర్వులపై స్పందిస్తూ హైదరాబాద్ లో భూములు కరువయ్యాయా బొచ్చెడు భూములు సుప్రీం తుది తీర్పు వచ్చాక హైదరాబాద్ జర్నలిస్ట్ లను చూసి ఈర్శ్య పడేలా పెద్ద జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. యూ ట్యూబ్ చానళ్లలో కెసీఆర్ ఇచ్చిన హామీలు ఇప్పటికీ  దొరుకుతాయి. ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుకు ఇంతవరకు దిక్కు, దివాణం లేదు. కాగా  టియుడబ్ల్యుజె ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద గురువారం చేపట్టిన మహాధర్నాలో వైఎస్ రాజశేఖరెడ్డి తనయ వైఎస్ షర్మిల పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వానికి కమిషన్లు అందకపోవడం వల్లే 70 ఎకరాలను జర్నలిస్ట్ లకు ఇవ్వడం లేదని ఆరోపించారు. వైఎస్ఆర్ ప్రభుత్వం కేటాయించిన ఈ భూములను కమిషన్ల కోసం బిఆర్ ఎస్ ప్రభుత్వం విక్రయించాలని చూస్తోందన్నారు. కొనుగోలు చేసిన జర్నలిస్ట్ లకు దక్కేలా తమ పార్టీ పోరాడుతుందని షర్మిల హామీ ఇచ్చారు. ఎన్నికలకు కూత వేటు దూరంలో ఉన్న నేపథ్యంలో జర్నలిస్ట్ లు పోరాటస్పూర్తితో ఉద్యమిస్తే ఈ 70 ఎకరాలను సాధించుకోవడం పెద్ద కష్టమేమి కాదని న్యాయనిపుణులు అంటున్నారు. ప్రశ్నించడం తమ హక్కు అని జర్నలిస్ట్ లు మరచిపోవడం వల్లే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తోంది. కోర్టు దిక్కారణ కేసు వేస్తే వీలయినంత త్వరగా భూములు వచ్చే అవకాశముందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఒకరు అన్నారు. సంప్రదింపులు, లాబీయింగ్ చేసి ఈ భూములను పొందడం సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  మెజారిటీ జర్నలిస్ట్ లు కోర్టు దిక్కారణ కేసు బిఆర్ఎస్ ప్రభుత్వంపై వేయడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి శాంతకుమారి, మేడ్చెల్ కలెక్టర్ ను జవాబుదారి చేస్తూ కంటెప్ట్ వేస్తామని జర్నలిస్ట్ నాయకుడొకరు వెల్లడించారు.  

వీధికుక్కల దాడులు పెరుగుతున్నాయ్

వీధికుక్కల దాడిలో తెలంగాణలో మరో బాలుడు మరణించాడు. ఖాజీ పేటలో ఆద మరచి నిద్రపోతున్న 8 ఏళ్ల బాలుడిని వీధికుక్కలు అతిదారుణంగా దాడి చేసి చంపి వేసాయి. వీధికుక్కల దాడిలో బాధితుడు అక్కడికక్కడే చనిపోయాడు. మండే ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఈ బాలుడు చెట్టు క్రింద ఆదమరచి నిద్రపోతున్న సమయంలో ఈ దాడి జరిగింది.  హన్మకొండ జిల్లా ఖాజీపేట రైల్వే క్వార్టర్స్ లో శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది.   పొట్ట చేత పట్టుకుని వచ్చిన ఉత్తర ప్రదేశ్ నుంచి నగరానికి వచ్చిన కూలీ కొడుకు చోటు కుక్కల దాడిలో అనంత లోకాలకు వెళ్లిపోయాడు. గత నెల తుర్కపల్లిలో దాదాపు 100 వీధికుక్కలు దాడి చేసి  ఒక వ్యక్తిని చంపేసాయి. హైదరాబాద్ లో కూడా వీధికుక్కల దాడిలో బాలుడు చనిపోయిన సంఘటన ఇంకా మరవక ముందే ఖాజీ పేటలో ఈ దాడి జరగడం కలచివేసింది. ఫిబ్రవరి 19న  జరిగిన ఈ సంఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది.  నాలుగేళ్ల బాలుడిని మూడు వీధి కుక్కలు దాడి చేసి చంపేసాయి. మార్చి నెలలో దేశ రాజధాని ఢిల్లీలో వీధికుక్కల దాడిలో 70 మంది చనిపోయారు.  భారత్ లో వీధికుక్కల దాడిలో చనిపోయిన వారి సంఖ్య తీవ్రవాదుల చేతిలో చనిపోతున్న వారికంటే ఎక్కువేనని అంర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ ఒక అధ్యయనంలో వెల్లడించింది.  కుక్క కాటు వల్ల రేబిస్ వ్యాధి వస్తుంది. ఇది అంటు వ్యాది. ఒక వేళ కుక్క కాటు వేస్తే రేబిస్ ను అరికట్టడానికి ప్రభుత్వ యంత్రాంగం వద్ద నివారణా చర్యలు లేకపోవడం శోచనీయం. 

సీబీఐతో అవినాష్.. దాగుడుమూతా దండాకోర్

సీబీఐతో అవినాష్ మద్య దాగుడుమూతలాట ఆడుతున్నారా అన్నట్లుగా జరుగుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి.  వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఆరు సార్లు అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ.. ఆయనను అరెస్టు చేసి విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు కూడా తెలియజేసింది.  కోర్టుల నుంచి ఆయనకు రక్షణ లేని పరిస్థితి ఎదురైన తరువాత కూడా అరెస్టు చేయకుండా తాత్సారం చేయడంతో సీబీఐ పైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. టీవీ టాక్ షోలలో, సామాజిక మాధ్యమంలో అవినాష్  విషయంలో సీబీఐ ప్రత్యేక అభిమానం చూపుతోందన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి. అవినాష్ తండ్రి భాస్కరరెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ అవినాష్ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తోంది? ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తన ముందస్తు బెయిలు పిటిషన్ విచారణ వేగంగా చేపట్టేలా తెలంగాణ హైకోర్టును ఆదేశించాలంటూ.. సుప్రీంను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం (మే 19)సీబీఐ విచారణకు ఆయన హాజరు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  అవినాష్ అరెస్టు ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లోనే కాకుండా జనబాహుల్యంలో కూడా వ్యక్తమైంది. అన్నిటికీ మించి కడప, పులివెందులలో కూడా అవినాష్ రెడ్డి అరెస్టే తరువాయి అన్న భావన వ్యక్తమౌతోంది. అందుకే శుక్రవారం (మే 19) ఉదయానికే  పెద్ద సంఖ్యలో అవినాష్ మద్దతుదారులు, అనుచరులు, వైసీపీ శ్రేణులు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. మరో వైపు  సీబీఐ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో.. అవినాష్ అరెస్టయ్యే అవకాశాలు ఉన్నందునే భద్రత కోసం బందోబస్తు ఏర్పుట్లు చేశారన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇంతలోనే  తల్లి ఆస్పత్రిపాలయ్యారంటూ అవినాష్ సీబీఐ విచారణకు డుమ్మా కొట్టి పులివెందులకు బయలు దేరి వెళ్లారు. ఈ సమాచారాన్ని ఓ లేఖ ద్వారా సీబీఐకి పంపారు. అయితే అవినాష్ విజ్ణప్తిని సీబీఐ అంగీకరించలేదు. ఇక పరిశీలకులు కూడా ఒక వేళ నిజంగా అవినాష్ రెడ్డి తల్లికి ఆరోగ్యం బాగాలేకపోయి ఉంటే.. ఆమెను హుటాహుటిన హైదరాబాద్ కో, బెంగళూరుకో తరలిస్తారు కానీ పులివెందుల ఆస్పత్రిలో  ఎందుకు చేరుస్తారని పరిశీలకులు అంటున్నారు.   పులివెందులలో అవినాష్ రెడ్డి తల్లిని చేర్చారని చెబుతున్న దినేష్ ఆస్పత్రి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సతీమణి భారత తండ్రికి చెందిన ఆస్పత్రి అనీ, అది కేవలం పిల్లలు, గర్భిణులకు చెందిన ఆస్పత్రి అని చెబుతున్నారు. ఏది ఏమైనా అవినాష్ రెడ్డి మాత్రం వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలక దశకు వచ్చిన నేపథ్యంలో విచారణను తప్పించుకునేందుకు సీబీఐతో దాగుడుమూతలు ఆడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వివేకా తీరు.. సీబీఐ ఇంటిగ్రిటీనే ప్రశ్నార్థకం చేసేదిలా ఉందని అంటున్నారు.  దినేష్ హాస్పిటల్ అనేది భారతి  తండ్రి హాస్పిటల్ దీనిలో చిన్న పిల్లలకు,గర్భిణీ మహిళలలకు తప్ప పులివెందుల లో కార్డియాలజస్ట్ సంబంధించిన హాస్పిటల్స్ లేవు ఇది డ్రామా

సీబీఐ విచారణకు అవినాష్ మళ్లీ డుమ్మా.. ఈ సారి అమ్మ అనారోగ్యం సాకు

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వివేకానందరెడ్డి సీబీఐ విచారణకు మళ్లీ డుమ్మా కొట్టారు. ఈ సారి తన తల్లి ఆరోగ్యం బాలేదంటూ సీబీఐ విచారణకు హాజరు కాలేదు. విచారణకు హాజరు కవాల్సిన సమయంలో ఆయన హైదరాబాద్ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్లారు. అంతకు మందు ఈ రోజు సీబీఐ అవినాష్ ను అరెస్టు చేయడం ఖాయమన్న వార్తల నేపథ్యంలో అటు సీబీఐ కార్యాలయం వద్ద, ఇటు హైదరాబాద్ లోని అవినాష్ ఇంటి వద్ద కూడా హై డ్రామా నడిచింది. సీబీఐ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించగా, అవినాష్ నివాసం వద్దకు ఆయన అనుచరులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. సీబీఐ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో అవినాష్ అరెస్టు ఖాయమనీ అందుకే భద్రత కట్టుదిట్టం చేశారనీ అంతా భావించారు. మరో వైపు అవినాష్ నివాసం వద్ద ఆయన అనుచరులు పెద్ద ఎత్తున మోహరించారు. నివాసంలో అవినాష్ న్యాయనిపుణులతో చర్చించి తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేనన్న సమాచారాన్ని తన న్యాయవాది ద్వారా సీబీఐకి పంపించారని సమాచారం. కాగా అవినాష్ హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలు దేరుతున్న సమయంలో ఆయన అనుచరులు అక్కడ ఉన్న మీడియా ప్రతినిథులపై దాడికి పాల్పడ్డారు.  కాగా ఈ నెల 16న  కూడా సీబీఐ విచారణకు హాజరు కాకుండా తన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉందని సమాచారం ఇచ్చారు.  దీంతో సీబీఐ శుక్రవారం (మే 19)న విచారణకు రావాల్సిందిగా మరో నోటీసు ఇచ్చింది. వాట్సాప్ ద్వారా నోటీసు ఇవ్వడమే కాకుండా అదే నోటీసును పులివెందులలోని ఆయన నివాసంలో డ్రైవర్ కు అందజేసింది. దీంతో అవినాష్ ఏదో సాకు చెప్పి విచారణకు రాకుండా తప్పించుకోవడాన్ని సీబీఐ సీరియస్ గా తీసుకుందని అందరూ భావించారు. దాంతో 19న అవినాష్ అరెస్టు ఖాయమన్న భావన సర్వత్రా వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా తన తల్లి అనారోగ్యం కారణం చెప్పి అవినాష్ సీబీఐ విచారణకు డుమ్మా కొట్టడంతో ఇప్పుడు సీబీఐ ఏం చేస్తుందన్న ఆసక్తి, ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

111 జీవో రద్దు వెనక రహస్యం ఏమిటి ?

తెలంగాణ రాష్ట్రం  దశాబ్ది ఉత్సవాలకు సిద్దమవుతోంది.   రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలను  అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో 21 రోజులపాటు  నిర్వహించాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. నూతనంగా నిర్మించిన బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన  జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజల భాగస్వామ్యంతో.. ప్రజల మధ్య చేపట్టే ఈ ఉత్సవాల్లో గ్రామ, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఏయే రోజుల్లో ఏయే కార్యక్రమాలు చేపట్టాలన్నదీ మంత్రి వర్గ సమావేశంలో చర్చించి ఖరారు చేశామని మంత్రి హరీష్ రావు మీడియాకు తెలిపారు.   ఈ సమావేశంలో, మరి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు.  అయితే  నూతన సచివాలయంలో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలు అన్నీ ఒకెత్తు అయితే, జీవో 111 పూర్తిగా రద్దు చేస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఒక్కటీ ఒకెత్తుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే  ప్రతిపక్ష పార్టీలు జీవో 111 రద్దు వెనక కుట్ర ఉందని ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యంత్రి కుటుంబ సభ్యుల ప్రయోజనాలను కాపాడేందుకే రాష్ట్ర ప్రభుత్వం జీవో 111 రద్దు నిర్ణయం తీసుకుందని  కాంగ్రెస్, బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.  ఆప్రాంతంలో ముఖ్యమంత్రి కుటుంబానికి ఉన్న వేలాది ఎకరాల  పంట భూములను రియల్ ఎస్టేట్ భూములుగా మార్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సీఎల్పీ నేత  భట్టివిక్రమార్క ఆరోపించారు. అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధం, సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని  పేర్కొన్నారు. హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వంటి సహజ జలవనరులపై ప్రాభవం చూపే ఏ నిర్ణయం తీసుకోరాదని సుప్రీం కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను నిర్దేశించిందని భట్టి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రస్తావించిన ప్రత్యామ్నాయ జలవనరులు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులని అంటూ సహజ జలవనరులను కాపాడవలసిన ప్రభుత్వమే కంచే చేను మేసిన చందంగా  111 జీవో రద్దు చేసిందని భట్టి ఆరోపించారు. మరోవంక బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ లక్షలాది ఎకరాల భూములపై ప్రభుత్వం కన్ను పడిందని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ఫార్మ్ హౌస్ తో పాటుగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, అధికార పార్టీ  నాయకులు, మంత్రుల భూములను రియల్ ఎస్టేట్ గా మార్చేందుకే ప్రభుత్వం 111జీవో రద్దు చేసిందని ప్రభాకర్ ఆరోపించారు. కాగా,  84 గ్రామాల ప్రజల అభ్యర్థన మేరకు.. ఆ జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నమని ప్రభుత్వం చెప్పడం పచ్చిఅబద్ధమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఆ ప్రాంతంలో లక్షల ఎకరాల భూములు అసలు యజమానుల స్వాధీనంలో లేవని ఎప్పుడోనే చేతులు మారాయని దయాకర్ అన్నారు.  అదలా ఉంటే జంట జలాశయాల వెంబడి 111 జీవో ఎత్తివేత ద్వారా రూ.5-6 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని, అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 111 జీవో పరిధిలో ఉన్న వ్యవసాయ భూములను నివాస, నివాసేతర భూములుగా మార్చడం ద్వారా ఈ ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 111 జీవో పరిధిలో ఉన్న 84 గ్రామాల్లో ప్రభుత్వ భూములు పోను సుమారు లక్ష ఎకరాల ప్రైవేటు భూములు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. అన్నీ వ్యవసాయ భూములుగానే రికార్డుల్లో ఉన్నాయి. ఇక్కడ ఒక ఎకరం వ్యవసాయ భూమిని రికార్డుల్లో ఇతర అవసరాలకు ఉద్దేశించిన భూమిగా మార్చాలంటే ప్రభుత్వానికి రూ.12 లక్షలు కట్టాలి. 50 వేల ఎకరాలు కన్వర్షన్‌కు వచ్చినా ఏకరాకు రూ.12 లక్షల చొప్పున మొత్తం ప్రభుత్వానికి రూ.6 వేల కోట్లు వస్తాయని గురువారం కేబినెట్‌ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. అయితే అదే సమయంలో ఈ జీవో రద్దు న్యాయ సమీక్షకు నిలుస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.  111 జీవోను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం తరువాత వచ్చే న్యాయపరమైన చిక్కులపై సరైన కసరత్తు చేసినట్లుగా కనిపించడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశానుసారంగానే జంట జలాశయాల పరిధిలో 111 జీవో అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవోను రాష్ట్రమంత్రివర్గం పూర్తిగా రద్దు చేయడంతో భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 111 జీవోకు సంబంధించి ఎన్జీటీతో పాటు పలు కోర్టుల్లో వివాదాలు నడుస్తున్నాయి. జీవో సవరించాలంటూ కొందరు గ్రీన్‌ ట్రిబ్యూనల్‌, హైకోర్టులో వేసిన కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు జీవో సవరణకు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ కూడా వేశారు. దాని నివేదిక రాలేదు. దానిపై హైకోర్టు కూడా ఆరా తీసింది. జీవోకు తూట్లు పొడుస్తున్నారంటూ 2000లో కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందులో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. మరింత పకడ్భందీగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ నేపద్యంలో  111 జీవో  రద్దు న్యాయసమీక్షకు ఎంతవరకు నిలుస్తుంది అనేది చెప్పలేంని అంటున్నారు.

కమలంలో కర్ణాటక గుబులు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారిపోతాయా? ఇంతవరకు ఒక లెక్క ఇకపై మరో లెక్కన రాజకీయ ముఖ చిత్రమే మారి పోతుందా? అంటే  పరిశీలకులు ఇలాంటి ప్రశ్నలకు ఇప్పిటికిప్పుడు సమాధానం చెప్పడం కొంత సాహసమే  అంటున్నారు.  అయితే  బీఆర్ఎస్ మొదలు బీజేపీ వరకు ప్రధాన రాజకీయ పార్టీలలో కర్ణాటక ఎన్నికల ఫలితాలపై విభిన్న కోణాల్లో చర్చ అయితే జరుగుతోంది. కర్ణాటకలో అనూహ్య విజయం సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తెలంగాణలోనూ హస్తం పార్టీదే గెలుపని ధీమా వ్యక్తపరుస్తున్నాయి. మరో వంక అధికార బీఆర్ఎస్  నాయకులు,కర్ణాటక కర్ణాటకే తెలంగాణ తెలంగాణే  అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. ముచ్చటగా మూడవ సారి మళ్ళీ తమదే విజయమని   ధీమా  వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సర్వేలనీ తమకే అనుకూలంగా ఉన్నాయని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 100 నుంచి 105 నియోజక వర్గాల్లో కారు జోరుకు తిరుగుండదని పార్టీ వేదిక నుంచి ప్రకటించారు.  అలాగే కర్ణాటకలో అధికారం కోల్పోయిన బీజేపీ నాయకులు కూడా తెలంగాణలో మాత్రం అధికారం తమదేనని అంటున్నారు. అయితే ఆరేడు నెలల తర్వాత జరిగే ఎన్నికల ఫలితాల సంగతి ఎలా ఉన్నా, కర్ణాటక ఓటమి తర్వాత తెలంగాణ బీజేపీలో అసమ్మతి రాగాలు అధికమయ్యాయి. నిజానికి బీజేపీలో అంతర్గత కలహాలు కొత్తకాదు. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహార సరళి విషయంలో పార్టీ నాయకులలో చాలా కాలంగా అసమ్మతి వ్యక్తమవుతూనే వుంది.అవును, ఇతర పార్టీల నుంచి వచ్చిన (బయటి) నాయకులే  కాదు, ఒరిజినల్ బీజేపీ నేతల్లోనూ బండి నాయకత్వాన్ని వ్యతిరకించే నేతలు లేక పోలేదు. అయితే ఇంతకాలం అసంతృప్తి గరళాన్ని గొంతులో దాచుకుని గుంభనంగా ఉన్న నాయకులు, ఇప్పుడు కర్ణాటక ఫలితాల తరువాత అసమ్మతి గళం విప్పుతున్నారు.   ముఖ్యంగా మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట రెడ్డి మరొ కొందరు  ‘బయటి’ నాయకులు బీజేపీలో కొనసాగే విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. నిజానికి బీజేపీలో ‘బయటి’ నేతలకు ప్రాధాన్యత ఉండదని, అందుకే బీజేపీలో ‘బయటి’ నేతలు అట్టే కాలం నిలవ లేరని అంటారు. అందుకే ఈటల, కోమటిరెడ్డితో పాటుగా మరికొందరు ముఖ్యనేతలు కాంగ్రెస్ వైపు చుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.  నిజానికి బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురిలో ఏ ఒక్కరూ ఒరిజినల్  బీజేపీ నాయకులు కాదు. గోషామహల్ ఎమ్మెల్యే టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చారు, అయన మళ్ళీ టీడీపీలోకి వెళుతున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, ఆయన బీజేపీ తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినా, వేయక పోయినా, టికెట్ ఇచ్చినా ఇవ్వక పోయినా కాషాయా ధ్వజం వదిలేది లేదని స్పష్తం చేశారు.  దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు బీఆర్ఎస్ నుంచి బీజేపీ లోకి వచ్చారు, ఆయన కూడా పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగినా, ఆయన ఆ వార్తలను ఖండించడమే కాకుండా, పార్టీ ఆదేశిస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు..ఎవరిపై   పోటీ చేసందుకు సిద్దమని ప్రకటించారు. తాజాగా  ఈటల రాజేందర్ విషయంలోనూ అలాంటి వదంతులే షికారు చేస్తున్నాయి. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన రాజేందర్ ఆ వదంతులను ఖండించారు. అయినా ఆ ప్రచారం అయితే అలానే సాగుతోంది.   ఏది ఏమైనా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రభావం అరు నెలల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడే ఉహించడం కొంచెం చాలా కష్టమనే రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

కేసీఆర్ కు కాంగ్రెస్ ఆహ్వానం.. వెడతారా?

కర్ణాటక ముఖ్యమంత్రిగా శనివారం (మే20)న సిద్దరామయ్య ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం అందింది. ఆయనకే కాకుండా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ, బీహార్‌ సీఎం నితీష్ కుమార్ సహా.. బావసారూప్యత కలిగిన, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బీజేపీయేతర పార్టీల నేతలకు అందరికీ కాంగ్రెస్ ఆహ్వానం పంపింది.  ఇతర నేతల సంగతి అలా ఉంచితే కాంగ్రెస్ ఆహ్వానాన్ని మన్నించి కేసీఆర్  బెంగళూరు వెడతారా? వెళ్లరా? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి వ్యక్తమౌతోంది. సిద్ద రామయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్, మమతాబెనర్జీ, నితీష్ కుమార్ లకే కాకుండా, బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్,  హేమంత్ సోరెన్, సీతారాం ఏచూరి, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌లతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలకు కూడా ఆహ్వానం అందింది.  శనివారం (మే 20) మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులో సీఎంగా సిద్దరామయ్య ప్రమాణ స్వీకారోత్సవం జరుగనుంది. కర్ణాటకలో బీజేపీకి జరిగిన పరాభవాన్ని  సెలబ్రేట్ చేసుకోడానికి కేసీఆర్ .. ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరవుతారా.. లేక అక్కడి   విజయంతో ఇక్కడ ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ అవతరించిన నేపథ్యంలో డుమ్మా కొడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో కేసీఆర్ ఏం చేస్తారన్నదానిపై అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. 

మోడీపై పరకాల విమర్శలు.. ఇరకాటంలో కేంద్ర విత్త మంత్రి

కేంద్రంలో  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ఇరకాటంలో పడ్డారు. ఆమె భర్త పరకాల ప్రభాకర్  ఒక టీవీ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ టార్గెట్ గా విమర్శలు గుప్పించడంతో.. భార్యా భర్తలిరువురూ  చెరోదారిలో నడుస్తున్నారా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పరకాల ప్రభాకర్ గతంలో మోడీ సర్కార్ పై విమర్శలు  చేసినా.. తాజాగా ఆయన నేరుగా మోడీ లక్ష్యంగానే తన విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.  దీంతో   ప్రధాని మోడీ సీరియస్ అయినట్టు సమాచారం. కేంద్రం, మోడీ తీరుపై  తాజాగా పరకాల రాసిన పుస్తకంలో.. గత 9 ఏళ్లలో భారత్ ఎలా నాశనం అయిందో వివరించారు. ఈ  క్రమంలో మోడీ విధానాలపై పరకాల తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 2024 ఎన్నికల్లో మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన   ప్రజల్లో  ద్వేష భావాన్ని, విభజనను  భావాలను ప్రేరేపించడానికే పరిమితమైందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే  ఆర్థిక వ్యవస్థ, ఇతర విషయాల్లో మోడీ విధానాలు అస్తవ్యవస్థంగా ఉన్నాయని పరకాల ప్రభాకర్ తాజా పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సేస్ ఆన్ ఎ రిపబ్లిక్ ఇన్ క్రైసిస్' ను ఈ నెల 14న బెంగళూరులో ఆవిష్కరించారు. దీనిపై నిర్వహించిన టీవి ఇంటర్వ్యూలో పరకాల మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.   పరకాల నూతన  పుస్తకంలో దేశ ఆర్థిక వ్యవస్థ రాజకీయాలు ఇతర సమస్యలపై మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వరస వ్యాసాలు ఉన్నాయి.  2014 ఎన్నికల్లో అభివృద్ధిపై విజయం సాధించినా,  తరువాత నుంచి బీజేపీ హిందుత్వవాదాన్ని అనుసరిస్తోందని లౌకికవాదాన్ని పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు.  2024 లో మోడీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే...కేవలం దేశ ఆర్థిక వ్యవస్థకే కాకుండా.. యావత్తు దేశానికే విపత్తు అని   ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల మధ్య విభజనతో లాభం పొందాలని మోడీ ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. తన పోరాటం హిందువులు, ముస్లింల మధ్య కాదని పేదరికం నిరుద్యోగానికి వ్యతిరేకంగా హిందువులు ముస్లింలు కలిసి చేసే పోరాటమని ప్రభాకర్ తెలిపారు. బీజేపీ మోడీలు హిందుత్వం కోసం పాకులాడుతుంటే వారిని ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని ప్రభాకర్ పిలుపునిచ్చారు.   పెద్ద నోట్ల రద్దు విషయంలో మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అర్థిక శాస్త్రంలో ప్రాథమిక శిక్షణ పొందిన ఏ ఆర్థిక వేత్తయినా.. ఇంత పెద్ద స్థాయిలో ఇంత తక్కువ వ్యవధిలో పెద్ద నోట్ల రద్దుకు సిఫార్సు చేసి ఉండరని  విమర్శించారు. నోట్ల రద్దు పెద్ద తప్పిదమని.. తదనంతరం తీసుకున్న తప్పుడు విధానాలు ఈ తప్పిదాన్ని మరింతగా పెంచి సంక్షోభాన్ని   తీవ్రతరం చేశాయని ప్రభాకర్ వివరించారు. అయితే.. మరోవైపు కర్ణాటక ఎన్నికల సందర్భంగా సీతారామన్.. మోడీని ఆకాశానికి ఎత్తేశారు. మొత్తంగా భార్య ఒకవైపు.. భర్త మరోవైపు.. అన్నట్లుగా పరకాల ప్రభాకర్, నిర్మలాసీతారామన్ తీరు ఉందని, దీనిపైనే  మోడీ సీరియస్ అయ్యారనీ, అసలు ఏం జరుగుతోందో  ఆరాతీస్తున్నారనీ ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. సాక్షాత్తు  బినెట్ లో  అత్యంత కీలకమైన   ఆర్థిక మంత్రి భర్త.. ప్రధాని మోడీపై ఆర్థిక విధానాలపైనే తీవ్ర విమర్శలు గుప్పించడం పట్ల కేంద్రం నిర్మలా సీతారామన్ పై గుర్రుగా ఉంది. మోడీ కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. దీంతో కిరణ్ రిజుజులాగే నిర్మలా సీతారామన్ కు కూడా మంత్రి పదవి తప్పదేమో అన్న చర్చ అయితే బీజేపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 

ఈ సారి అరెస్టు తప్పదా?

ఏపీ సీఎం జగన్ సొంత బాబాయ్, మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి శుక్రవారం (మే 19) సీబీఐ ఎదుట విచారణకు హాజరు కానున్నారు.  నేడు సీబీఐ హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని మే  16న సీబీఐ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందు అదే రోజు విచారణకు హాజరు కావాల్సిన అవినాష్ రెడ్డి పార్టీ కార్యక్రమాలున్నాయంటూ హాజరు కాలేననడంతో సీబీఐ ఆయనకు మూడు రోజుల వ్యవధి ఇచ్చి శుక్రవారం (మే19) హాజరు కావాలని మరో నోటీసు ఇచ్చింది. ఆ నోటీసుకు అవినాష్ హాజరౌతానని బదులిచ్చి.. హైకోర్టులో తన ముందస్తు బెయిలు పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకూ సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంను ఆశ్రయించారు. అయితే ఆ విషయంలో సుప్రీం అవినాష్ కు ఎటువంటి ఊరటా ఇవ్వలేదు. దీంతో ఈ సారి సీబీఐ విచారణ అనంతరం అవినాష్ ను అరెస్టు చేయడం ఖాయమంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చాలా కాలంగా అంటే గత నాలుగు నెలలుగా సీబీఐ అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచిన ప్రతి సందర్శంగాలో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆయన కోర్టుకు వెళ్లి ఆ అరెస్టును ఆపుకుంటూ వస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి మే 16న సీబీఐ విచారణకు హాజరు కాలేనంటూ.. సమాచారం ఇవ్వగానే సీబీఐ అలర్ట్ అయ్యింది. ఆయన నాలుగు రోజుల వ్యవధి అడిగితే మూడు రోజులు ఇచ్చి శుక్రవారం (మే19)న హాజరు కావాలని వాట్సాప్ ద్వారా అవినాష్ కు నోటీసు ఇవ్వడమే కాకుండా పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులు అక్కడ ఆయన లేకపోతే డ్రైవర్ కు నోటీసులు అందించారు. దీంతో ఈ సారి అవినాష్ విచారణకు హాజరు కాకుండా సాకులు చెప్పే అవకాశం ఇవ్వకూడదని, ఒక వేళ చెప్పినా సీబీఐ అందుకు అంగీకరించే పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అంతే కాకుండా అవినాష్ రెడ్డి సీబీఐ దర్యాప్తు సందర్భంగా లేవనెత్తిన వివేకా రాసిన లేఖ అంశంపై కూడా దృష్టి సారించిన సీబీఐ గతంలో వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ లను విచారించినా, మరో మారు ఈ నెల 16న వారిరువురినీ హైదరాబాద్ లోని తన కార్యాలయానికి పిలిపించుకుని విశ్లేషించింది. అంతే కాకుండా వివేకా రాసినట్లుగా చెబుతున్న లేఖపై  వేలిముద్రలు ఎవరెవరివన్న దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నది. అందేరూ ఆ వేలి ముద్రలు ఎవరివో గుర్తించేందుకు నిన్ హైడ్రేట్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం (మే19) నాటి విచారణ అనంతరం సీబీఐ అవినాష్ ను అరెస్టు చేయడం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి  భాస్కరరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆ వెంటనే  అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్  అవుతారని అంతా భావించారు. స్వయంగా అవినాష్ కూడా తన అరెస్టు తప్పదని గ్రహించారు. అందుకే  ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఇక ఇప్పుడు కోర్టుల నుంచి అరెస్టు కాకుండా ఎలాంటి రక్షణా లేని పరిస్థితుల్లో.. చివరి ఆశగా సుప్రీంను ఆశ్రయించినా అక్కడా చుక్కెుదురవ్వడంతో ఇక అవినాష్ అరెస్టే తరువాయి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై స్టే!

ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఆర్ జయంతి మే 28వ తేదీ. ఈ నేపథ్యంలో ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ వద్ద 54 అడుగుల శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్ నాయకుడు, మంత్రి పువ్వాడ అజేయ్ కుమార్‌తోపాటు పలు సంస్థలు సంకల్పించాయి. ఆ క్రమంలో ఈ విగ్రాహాన్ని ఆవిష్కరించేందుకు జూనియర్ ఎన్టీఆర్‌ ఖమ్మం రానున్నారు. అలాంటి వేళ.. శ్రీకృష్ణ జాక్, ఆదిభట్ల కళాపీఠం, భారతీయ యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో 14 పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను స్వీకరించిన హైకోర్టు..  విగ్రహా ఏర్పాటుపై స్టే విధించింది. ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయడంపై యాదవ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని.. కానీ శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయడంపైన మాత్రమే తమ అభ్యంతరం అని అవి స్పష్టం చేస్తున్నాయి. అదీ కూడా ఎందుకంటే.. ఎన్టీఆర్ జయంతి, వర్థంతి సందర్భంగా శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించడం జరుగుతుందని.. ఇది ఓ విధంగా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అపవిత్రం చేయడమే అవుతుందని పిటిషన్‌ దారులు పేర్కొన్నారు. శ్రీకృష్ణుడి రూపం మినహా ఏ రూపంలో అయినా... ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని సదరు పిటిషన్ దారులు అంటున్నారు.  మరోవైపు ఈ విగ్రహా ఏర్పాటుకు వ్యతిరేకంగా యాదవ హక్కుల పోరాట సమితి అద్యక్షురాలు, ప్రముఖ సినీ నటి కరాటే కళ్యాణి పోరాటం చేస్తున్నారు. అయితే ఆమె పోరాటంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ క్రమంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు.. కరాటే కల్యాణికి నోటీసులు జారీ చేసి.. మూడు రోజుల్లో ఈ అంశంపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు.

అభివృద్ధికి ఆమడ దూరంలో ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇరుగు పొరుగు రాష్ట్రాలే కాదు. ఒకప్పుడు కలసి ఉన్న ఒకే రాష్ట్రం. అలాంటి సమైక్య రాష్ట్రం ప్రత్యేక పరిస్థితుల్లో విడిపోయినపుడు అభివృద్థి పథంలో సాగేందుకు పోటీ పడాలి. 1960లో విడిపోయిన మహారాష్ట్ర, గుజరాత్ లు,  1966లో విడిపోయిన పంజాబ్, హర్యానాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. అయితే 2014లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 2019 వరకూ పోటీతత్వం కనిపించినా 2019 నుండి అభివృద్ధి కోసం పోటీ పడటం కాదు కదా కనీసం అభివృద్ధి కోసం మాట్లాడే సాహసం కూడా ఏపీ చేయడం లేదు.  2014 నుండి 2019 వరకూ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమల స్థాపనకు పెద్ద పీట వేసింది.  2019 నుండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చీకటి యుగం ప్రారంభం అయ్యింది. మరో వైపు తెలంగాణలో పెట్టుబడుల వరద పెరిగింది. 2019 వరకూ  విదేశీ పెట్టుబడులు ఎఫ్ డీఐలలో మొదటి ఐదు స్థానాలలో కనిపించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు 14వ స్థానానికి దిగజారింది.  మొదటి పదిస్థానాలలో కనిపించని తెలంగాణ ఇప్పుడు 7వ స్థానంలో వెలిగిపోతోంది.  ఇందుకు కారణంగా తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అని చెప్పక తప్పదు.  ఎప్పుడు ఎక్కడ పెట్టుబడుల కోసం వెళ్లాలన్నా ఓపిగ్గా వెళ్లి ప్రజంటేషన్ ఇచ్చి తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో కేటీఆర్ చూపుతున్న చొరవను చూసైనా  ఆంధ్ర మంత్రి అమర్నాథ్ కళ్లు తెరవాలి. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు తీసుకురావడం అన్న మాట పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లిపోతున్న పరిశ్రమలను కూడా ఆపలేకపోవడం అమర్నాథ్ పనితనానికి ఉదాహరణ. ఒక వైపు ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ తెలంగాణ భారత దేశానికి ముఖద్వారం అంటూ బ్రాండ్ హైదరాబాద్ ను, బ్రాండ్ తెలంగాణను కేటీఆర్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే.. దావోస్ లో చలి ఎక్కువగా ఉంటుందని, ప్రపంచ పెట్టుబడి దారుల్ని ఆంధ్రప్రదేశ్ కే రప్పిస్తానని వ్యర్థ ప్రేలాపనలు వల్లిస్తూ అమర్నాథ్ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి మంత్రిని మందలించి మిగిలిన రాష్ట్రాల మంత్రులు చేస్తున్న ప్రయత్నాలను అనుసరించమని కూడా జగన్ చెప్పకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.  పోనీ విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్ వెస్ట్ మెంట్ సమ్మిట్ ఫలితాలు ప్రజలకు అందాయా అంటే అదీ లేదు. ఈ సమ్మిట్ లో 12లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన జగన్ ఇంత వరకూ ఆ విషయంపై మళ్లీ నోరెత్తలేదు.  అద్దె డ్రస్సులతో, సైడ్ ఆర్టిస్టులతో  నడిచిన ఈ సమ్మిట్ పెద్ద బోగస్ అని తేలిపోయింది. 12 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి వచ్చిన కంపెనీల ప్రతినిథుల మధ్య అన్నం కోసం తొక్కిసలాట జరగడంతో అది ఎంత మోసమో ప్రపంచానికి తెలిసిపోయింది. తెలంగాణలో ప్రగతి పరుగులు తీయడం గురించి మాట్లాడుతూ ఏపీలో ఆ పరిస్థితి ఎప్పుడొస్తుందన్న మీడియా ప్రశ్నకు అమర్నాథ్ కోడి గుడ్డు పెట్టగలదు కానీ కోడిని పెట్టలేదుగా, గుడ్డు పెట్టాలి, పొదగాలి, పిల్లలు రావాలి పెరిగి పెద్దవవ్వాలి అంటూ చిత్రవిచిత్ర సమాధానం ఇచ్చి తాను స్వయంగా నవ్వుల పాలు కావడమే కాకుండా ఏపీ ప్రతిష్టను సైతం అపహాస్యం పాలు చేశారు. అదే విధంగా కాలుష్య కారక పరిశ్రమ అంటూ రాజకీయ కక్షతో వేధించి అమరరాజా బ్యాటరీస్ ను వేధించి రాష్ట్రం నుంచి తరిమేవరకూ నిద్ర పోలేదు. ఇక్కడ కాలుష్య కారక పరిశ్రమ అంటూ తరిమేస్తే.. తెలంగాణ రెండు చేతులతో ఆహ్వానించింది. ఏపీలో దశాబ్దాలుగా కాలుష్య ఆరోపణలు లేకుండా దివ్యంగా నడిచిన అమరరాజా బ్యాటరీస్ జగన్ సర్కార్ రాగానే కాలుష్య కారక పరిశ్రమ అయిపోయింది. అదే సమయంలో తెలంగాణలో ఆ సంస్థ 9500 కోట్ల పెట్టుబడితో బ్రహ్మాండంగా విస్తరిస్తోంది.    తాజాగా లండన్, అమెరికా పర్యటనలతో బిజీగా ఉన్న కేటీఆర్ వార్నర్ బ్రదర్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని తెలంగాణ ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేశారు. ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి అమర్నాథ్ మాత్రం తన విలువైన సమయాన్ని జగన్ ను పొగడడానికి, ప్రతిపక్షాలను తిట్టడానికి మాత్రమే వినియోగిస్తూ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా మరచిపోయారు. 

తెలంగాణా దశాబ్ది ఉత్సవాలకు సారథ్యం ఎపి కేడర్ అధికారిణి

తెలంగాణా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి బిఆర్ఎస్ ప్రభుత్వం వేసిన కమిటీకి తెలంగాణ ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి శాంతకుమారి సారథ్యం వహించనున్నారు. సోమేష్ కుమార్ తర్వాత మన రాష్ట్రానికి ఎవరు ప్రధాన కార్యదర్శి అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐఏఎస్ అధికారుల జాబితా తెప్పించుకుని మీడియా పుంఖాను పుంఖలుగా వార్తలు రాసింది. శాంతకుమారి పేరును ఎవరూ ఊహించలేదు. దీనికి కారణం కూడా లేక పోలేదు. ఆమెకు మచిలీ పట్నం మూలాలు ఉండటంతో ఎవరూ ఊహించి వార్తలు రాయలేదు. బిఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టిన తర్వాత బిఆర్ఎస్ వైఖరిలో మార్పు వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ వోటర్లను ఆకర్షించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ సడెన్ గా శాంతకుమారి పేరును అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణా కమిటీకి శాంతకుమారి సారథ్యం వహించనున్నారు. శాంతకుమారి కెసిఆర్ కు నమ్మిన బంటు అనే పేరు ఉంది. జూన్ 2 నుంచి వరుసగా 21 రోజుల పాటు జరగనున్న వేడుకలు ఈమె కనుసన్నల్లోనే జరగనున్నాయి. అర్వింద్ కుమార్, దేశ పతి , ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులకు ఈ కమిటీలో చోటు దక్కింది

లకారం ట్యాంక్ బండ్ కు చేరిన ఎన్టీఆర్ విగ్రహం

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శతజయంతి సంవత్సరం నేపథ్యంలో  ఖమ్మంలో లకారం ట్యాంక్‌బండ్‌ వద్ద శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న అన్నగారి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయతలపెట్టారు. ఈ విగ్రహాన్ని మే 28.. అయన జయంతి సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరించనున్నారు. బేస్‌మెంట్‌తో కలిసి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహం తల భాగం అయిదు అడుగులు, కాళ్ల భాగం అయిదు అడుగులు, ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు 45 అడుగులు ఉండనుంది.  తానా అసోసియేషన్‌తోపాటు పలువురు ప్రముఖుల సహకారంతో దాదాపు 4 కోట్ల రూపాయిల వ్యయంతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్‌లో బుద్దుడి విగ్రహాం వలే.. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నది సంకల్పం. ఈ విగ్రహ ఏర్పాట్లపై ఇప్పటికే మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్.. జూనియర్ ఎన్టీఆర్‌తో  చర్చించారు. మంత్రి అజయ్ కుమార్.. విగ్రహావిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పెద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం కోసం.. చిన్న ఎన్టీఆర్ వస్తుండడం పట్ల ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.   కాగా ఈ రోజు శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని లకారం ట్యాంక్ బండ్ కు చేర్చారు.   ఈ నెల 28 వ తేదీన సినీ హీరో  జూనియర్  ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరుగుతుంది.

సొంత లాభం కోసం జనం సొమ్ముతో జగన్ యాగం

సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడవోయ్ అన్నారు గురజాడ. అయితే మన ఏపీ ముఖ్యమంత్రి మాత్రం సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగినా పట్టించుకోవడం లేదు. సొంత  ప్రయోజనాల కోసం  అంటూ ప్రజలను నమ్మింది.. ప్రజాధనాన్ని ఇష్టా రాజ్యంగా ఖర్చు చేసేస్తున్నారు. తాజాగా రాష్ట్ర శ్రేయస్సు కోసం అంటూ ఏపీ సీఎం జగన్ చేపట్టిన రాజశ్యామల యాగం కోసం ప్రజాధనం పది కోట్లు ఖర్చు చేశారు. వాస్తవంగా ఈ యాగ నిర్వహణకు మహా అయితే పది లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అలాంటిది జగన్ సర్కార్ పది కోట్లు ఖర్చు చేసేసింది. తీరా చూస్తే ఆ యాగం లక్ష్యం ఉద్దేశం అంతా రాష్ట్ర శ్రేయస్సు కాదు. మరేమిటంటారా జగన్ కోసం. తన మీద ఉన్న కోర్టు కేసుల నుంచి బయటపడాలనీ, శత్రు భయం పోవాలనీ, వచ్చే ఎన్నికలలో విజయం సాధించాలనీ..మాత్రమే. యాగ సంకల్పం కూడా అదే. తన మత విశ్వాసానికి యాగాలు చేయడం విరుద్ధం అయినా సొంత లాభం కోసం ప్రజా ధనాన్ని కర్చు పెట్టి మరీ యాగం చేశారు జగన్. ఆ యాగ సంకల్పం ఏమిటో మీరే వినండి.. మమ సమస్త శతృూణ, ధూర్తహ ఫలాయన సిద్ధి ద్వారా  సర్వత్రా న్యాస్థానేషు సర్వత్ర వ్యవహారేషు సర్వత్రా సానుకూల్యత సిద్ధి ద్వారా సమస్త మంగళ వాక్యర్థం, శ్రీ రాజశ్యామల మాతంగేశ్వర దేవత అనుగ్రహ సిద్ద్యర్థం శ్రీ చండీ పరాంబిక సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ చండీ  పరాంబిక పంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ సుదర్శన సహిత మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్ధం మదీయ సర్వత్రా పురుషార్దేషు యేయే ప్రతికూల కారణాహ ద్వేషాం ప్రాతికేల్యత కార సానుకూలపర్యర్వేనా పరాయంత్ర, పరమంత్ర పరకీయ, సర్వదృష్ట గృహ సర్వా  మమ నిర్యుర్తిపూర్వక స్వకృత్య బలవృద్ధి అర్ధం చండీ, రుద్రపూర్వక రాజశ్యామల మంత్ర దేవతా సుదర్శన స్వరూపి సహిత శ్రీ మహా విష్ణు సహిత శ్రీ మహా లక్ష్మి మహాయాగ అక్ష, కర్మణే, స్వర్ణ మహాలక్ష్మీ దేవ్యాహ అనుగ్రహ ప్రసాదేనా అవాహనాది షోడచ ఉపచార పూజం కరిష్యే ఇంత స్పష్టంగా తన కోసం తాను సంకల్పం చెప్పుకుని ప్రజాధనంతో యాగం నిర్వహించి రాష్ట్రం కోసమేనని జగన్ ఎంత పచ్చిగా అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారో..

ఆంధ్రలో అటకెక్కిన ఆరోగ్యశ్రీ

ఆంధ్రప్రదేశ్ లో అన్ని సేవలు  ఒక ఎత్తైతే ఆరోగ్య శ్రీ ఒక్కటే ఒక ఎత్తు. వైసీపీ ప్రభుత్వం ఫ్లాగ్ షిప్ గా చెప్పుకునే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించలేదంటూ ఆరోగ్య శ్రీ ఆస్పత్రులు రోడ్డెక్కాయి. మే 19వ తేదీ నుంచి అన్ని సేవలూ నిలిపివేస్తున్నట్లు  ఆరోగ్య శ్రీ ఆస్పత్రల నెట్ వర్క్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల నెట్ వర్క్  అసోసియేషన్ లెక్కల ప్రకారం ప్రభుత్వ బకాయిలు 2000 కోట్లకు పైమాటే.  ఇలాంటి సందర్భంలో ఆరోగ్య సేవలు అందించడం తమ వల్ల కాదని అసోసియేషన్ తేల్చి చెప్పింది.  మొత్త 30 విభాగాలలో 2059 వ్యాధులు ఆరోగ్య శ్రీ పరిధిలోకి రావడంతో దాదాపు  అందరూ ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ ఏడాదికి 5లక్షల రూపాయలు మించకుండా  ఆరోగ్యశ్రీ సేవలను ప్రభుత్వం అందిస్తోంది. అన్ని ఆస్పత్రులలో ఆరోగ్య శ్రీ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరగడంతో  బిల్లులు కూడా గణనీయంగా పెరిగిపోయాయి.   గతంలో సమ్మె నోటీసు ఇచ్చిన నెట్ వర్క్ హాస్పటల్స్ అసోసియేషన్ ప్రభుత్వ హామీతో వెనక్కు తగ్గింది. కానీ కేవలం 20 కోట్ల రూపాయలే ప్రభుత్వం విడుదల చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సేవలు బంద్ చేస్తున్నామని నెట వర్క్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకు నోటీసులు అందజేశారు. 

మాయావతి చక్రం తిప్పేనా?

 బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి గురువారం పార్టీ అభ్యర్థులు యుపీలోని అన్ని లోక సభ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. యుపిలో మొత్తం 80 స్థానాలు ఉన్నాయి. యూపీలో సమాజ్ వాది పార్టీ బలమైన పార్టీ. కాన్షీ రాం బతికున్నప్పుడు యూపీ రాజకీయాలను మలుపు తిప్పారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉండే రాజకీయాలు కాన్షీ రాం దెబ్బకు పలాయనం చిత్తగించాయి. ప్రస్తుతం ఆమె వారసురాలు కుమారి మాయావతి ఇక్కడ చక్రం తిప్పుతున్నారు.  వోట్ హమారా రాజ్ తుమారా నహీ చలేగా అనేది మాయావతి ప్రస్తుతం ఇచ్చిన స్లోగన్. అంటే రాజ్యం మాది. అధికారం మీది అనేది నడవదు అని ఆమె పిలుపునిస్తున్నారు.  ఇటీవలె జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి అక్రమాలకు పాల్పడిందని ఈ ఎన్నికల్లో ప్రజలు బిఎస్పీకి వోటు వేస్తారని మాయావేస్తారని మాయావతి ధీమా వ్యక్తం చేస్తున్నారు.  గత లోకసభ ఎన్నికల్లో బిఎస్పీ యుపీలో బిఎస్పీ మొత్తం 80 స్థానాలకు గాను 10 స్థానాలను కైవసం చేసుకుని రెండో స్థానంలో నిలిచింది. బిజెపి 62 స్థానాలను కైవసం చేసుకుంని మొదటి స్థానంలో నిలిచింది. సమాజ్ వాది పార్టీ 5 స్థానాలు కైవసం చేసుకుని మూడో స్థానంలో ఉంది. కాంగ్రెస్ ఒక్క స్థానం చేజిక్కించుకోగా మిగతా స్థానాలను  ఇతర పార్టీలు కైవసం చేసుకున్నాయి. 

ఒడిశా సీఎం.. ‘నవీన’ రాజకీయం!

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రాజకీయ చాణక్యుడు అన్న పదానికి సరిగ్గా అతికినట్లు సరిపోతారు.  ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి యన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ! అన్నట్లు.. వివాదాలకు దూరంగా ఉంటారు. రాష్ట్రంలో అత్యధిక కాగం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన విజయ రహస్యం ఆయన వ్యవహార శైలే. రాష్ట్రంలో బీజేపీతో కయ్యం, జాతీయ స్థాయిలో నెయ్యం ఆయన తీరు. అదే ఆయనను ఇతర బీజేపీయేతర ముఖ్యమంత్రులలా కేంద్రం నుంచి చిక్కులు ఎదుర్కొనే అవకాశం లేకుండా తప్పిస్తోందన్నది పరిశీలకుల విశ్లేషణ.  తన పార్టీ సిద్ధాంతాలు,  ఆశయాలతో  ఏ మాత్రం రాజీపడకుండా ఆయన నెరపే రాజకీయ సంబంధాలు పరిశీలకులను సైతం అచ్చెరువునకు గురి చేస్తాయనడం అతిశయోక్తి కాదు.    ఒడిశా జర్సుగూడ ఉప ఎన్నికల్లో బీజేపీపై తమ పార్టీ అభ్యర్థి విజయం సాధించిన గంటల వ్యవధిలో ఆయన బీజేపీపై నిప్పులు చెరిగారు. కమలం పార్టీ డబుల్‌ ఇంజన్‌ తో  ప్రజలకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ప్రజారంజక పాలనే అన్నిటికంటే ముఖ్యమన్నారు. ఈ మాటలు మాట్లాడడానికి కొద్ది రోజుల ముందే ఆయన హస్తినలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.  అక్కడ ఆయన బీజేపీ వ్యతిరేక కూటమిలో తాను భాగస్వామిని అయ్యే ప్రశక్తే లేదన్న విస్పష్ట ప్రకటన చేశారు. దీంతో ఆయన  బీజేపీకి సన్నిహితం అవుతున్నారన్న ఊహాగానాలు కూడా చెలరేగాయి. అంత కంటే ముందు  నవీన్ పట్నాయక్ తో   బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, పశ్చిమ బెంగాల్‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  వేర్వేరుగా కలిశారు ఈ రెండు సందర్భాలలోనూ ఆయన  తమ భేటీకీ రాజకీయాలకూ సంబంధం లేదనే అన్నారు.  వాస్తవానికి నితీష్, మమత ఇరువురూ కూడా  2024 ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడి పోరాటానికి నవీన్‌ను ఆహ్వానించడానికే వచ్చారు. అది బహిరంగ రహస్యం. అయినా వారితో తన భేటీలలో రాజకీయాలు లేవని నవీన్‌  ప్రకటించేశారు. ఇలా ప్రతి సందర్భంలోనూ తామరాకు మీద నీటిబొట్టులా వ్యవహరించే నవీన్ పట్నాయక్ స్వరాష్ట్రమైన ఒడిశా ప్రయోజనాలు, ప్రగతి విషయంలో మాత్రం రాజీపడరు. అందుకే దేశంలో సుదీర్ఘ కాలం సీఎంగా పని చేసిన ముఖ్యమంత్రులలో ముందు వరుసలో నిలిచారు.