అవినాష్ చివరి ఆశ

అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న సామెతను గుర్తు చేస్తున్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. గత నాలుగు నెలలుగా  సీబీఐని ముప్పుతిప్పలు పెడుతూ.. తన ఇష్టం వచ్చినప్పుడు విచారించాలని హుకుం జారీ చేస్తూ వచ్చిన అవినాష్ రెడ్డి ఇప్పుడు దారులన్నీ ముగిసిపోయి బంతి సీబీఐ కోర్టులో ఉండటంతో కాళ్ల బేరానికి వచ్చారు. చివరి ఆశగా ముందస్తు బెయిలు కోసం సుప్రీం వెకేషన్ బెంచ్ లో వేసిన పిటిషన్ ను విచారించడానికి సర్వోన్నత న్యాయ స్థానం నిరాకరించింది. అవినాష్ ను కాపాడేందుకు కర్నూలు పోలీసులు శాంతి భద్రతల సాకు చూపితే సీబీఐ కేంద్ర బలగాలను రప్పించింది. దీంతో ఇక సీబీఐని అడ్డుకోవడం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చిన అవినాష్ రెడ్డి కేంద్ర దర్యాప్తు సంస్థతో కాళ్ల బేరానికి వచ్చారు. కనీసం ఈ నెల 27 వరకూ తనకు గడువు ఇవ్వాలనీ, ఆ తరువాత విచారణకు హాజరౌతాననీ పేర్కొంటూ తాజాగా మరో లేఖ రాశారు. ఆ లేఖలో తన తల్లి అనారోగ్యం గురించి ప్రస్తావించారు. తన తల్లి కోలుకోగానే విచారణకు రెక్కలు కట్టుకుని మరీ హాజరౌతానని పేర్కొన్నారు. అయితే అవినాష్ తాజా లేఖపై సీబీఐ నుంచి ఇంత వరకూ స్పందన రాలేదు. మరో వైపు హైదరాబాద్ నుంచి బయలు దేరిన కేంద్ర బలగాలు కర్నూలు చేరుకున్నాయి. సీబీఐ అధికారులు ఆదేశించగానే విశ్వభారతి ఆస్పత్రికి చేరడానికి సర్వ సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవినాష్ లేఖపై సీబీఐ ఏ విధంగా స్పందిస్తుందన్న ఆసక్తి నెలకొంది. మరో వైపు పరిశీలకులు మాత్రం అవినాష్ తాజా లేఖలో 27 వరకూ గడువు కోరడానికీ.. జగన్ హస్తిన పర్యటనకూ లింకు ఉందని విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా అవినాష్ లేఖను సీబీఐ పరిగణనలోనికి తీసుకుంటుందా? లేదా అన్నది మరి కొద్ది సేపటిలో తేలిపోనుంది. దారులన్నీ మూసుకుపోక ముందు వరకూ సీబీఐపై కనీస మర్యాద చూపని అవినాష్ ఇప్పడు బేలగా రాసిన లేఖకు సీబీఐ సానుకూలంగా స్పందించే అవకాశాలూ దాదాపు మృగ్యమనే పరిశీలకులు అంటున్నారు. అన్నిటికీ మించి స్థానిక పోలీసులు సీబీఐ అధికారులకు సహకరించకపోవడం, సీబీఐని వాహనాలు కానీ, అధికారులు కానీ ఆస్పత్రిలోకి అడుగుపెట్టే అవకాశం లేకుండా ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద అవినాష్ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు బైఠాయించడం.. దీంతో గంటల తరబడి దర్యాప్తు సంస్థ అధికారులు కర్నూలులో నిస్సహాయంగా నిలబడిపోయే పరిస్థితి ఏర్పడటం ఇవన్నీ సీబీఐ ప్రతిష్టను దారుణంగా దెబ్బ తీసిన నేపథ్యంలో ఇంత వరకూ వచ్చాకా ఇక వెనకడుగు వేయవద్దని కేంద్ర దర్యాప్తు సంస్థ హెడ్ క్వార్టర్స్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని చెబుతున్న నేపథ్యంలో సీబీఐ అవినాష్ తాజా లేఖపై సానుకూలంగా స్పందించే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీలో బీఆర్ఎస్ ఎక్కడ? అసలుందా?

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆంధ్రప్రదేశ్ మీద చాలా హోప్స్ పెట్టుకుంది. తెలంగాణలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయకముందే ఏపీ శాఖకు అధ్యక్షుడిని ఎంపిక చేసింది. అక్కడి నుంచి బీఆర్ఎస్ లో చేరికలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడమే కాకుండా..అలా చేరేవారికి వాహనాలు ఏర్పాటు చేసి మరీ హైదరాబాద్ కు తోలుకు వచ్చింది. నగరమంతటా వారికి స్వాగతం చెబుతూ ఫ్లెక్సీలూ ఏర్పాటు చేసింది. అంతే కాదు ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. విశాఖ స్టీల్‌ ప్రైవేటుపరం కాకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటుంది.. బిడ్ వేసి అవసరమైతే ఫ్యాక్టరీని సొంతం చేసుకుంటుందంటూ చాలా చాలా కబుర్లు చెప్పింది. అంతే ఆ తరువాత ఏపీలోని బీఆర్ఎస్ శాఖ అసలు ఉందో  లేదో తెలియనంతగా సైలెంట్ అయిపోయింది. ఎంతా ఆర్భాటంగా విశాఖ స్టీల్ బిడ్ లో పాల్గొంటామంటూ సింగరేణి అధికారులను పంపి పరిశీలించిన తరువాత ఏమైందో ఏమో మిన్నకుండిపోయింది. దాంతో ఏపీలో బీఆర్ఎస్ పట్ల భ్రమలు.. ఏమైనా ఉంటే అవి పూర్తిగా అడుగంటిపోయాయి. అలాగే ఏపీ సీఎం జగన్‌ది అప్పుల ప్రభుత్వం. కేసీఆర్‌ సంక్షేమ-అభివృద్ధి ప్రభుత్వాన్ని చూసి జగన్‌ చాలా నేర్చుకోవాలి  అంటూ ఏపీ బీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌, అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు. ఇక తెలంగాణ మంత్రులు కూడా అవకాశం ఉన్నా లేకపోయినా.. సందర్భం ఉన్నా లేకపోయినా ఏపీ అభివృద్ధి లేమి గురిచి విమర్శలూ వ్యాఖ్యలూ చేశారు.  అవన్నీ పక్కన పెడితే ఇంతని అంతని గుంటూరులో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి కేసీఆర్ వస్తున్నారంటూ బిల్డప్ ఇచ్చారు. హడావుడీ, హంగామా చేశారు. చివరకు ఆ కార్యాలయ ప్రారంభ కార్యక్రమం ఎవరికీ పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తోంది అన్న చందంగా ఎవరికీ పట్టని ఒకె ప్రైవేటు కార్యక్రమంగా  చప్పగా సాగిపోయింది. కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చేసిన ప్రచారమూ ఉత్తుత్తిదేనని తేలిపోయింది.   

అంతా అవినాష్ స్వయం కృతం!

వైయస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి.. తన తల్లీ శ్రీలక్ష్మీకి  తీవ్ర అనారోగ్యమంటూ... మే 19వ తేదీన కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అదే ఆసుపత్రిలో తల్లితో పాటే వైయస్ అవినాష్ రెడ్డి కూడా ఉండడంతో.. సదరు ఆసుపత్రి చుట్టు రాజకీయం వేడిక్కెంది. ఇక మే 22వ తేదీ..  తమ విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేసినా... ప్రస్తుతం తన తల్లీ తీవ్ర అనారోగ్యం దృష్ట్యా ... ప్రస్తుతం తాను విచారణకు రాలేనని.. కొద్ది రోజుల తర్వాత హాజరవుతానంటూ సీబీఐకి ఆయన సందేశం పంపించడం.. అందుకు సీబీఐ ససేమీరా అనడమే కాదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ మే 22వ తేదీ అంటే సోమవారం విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. కానీ ఈ హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పట్ల సందేహం వ్యక్తం చేస్తున్న సీబీఐ.. సోమవారం తెల్లవారుజామున.. కర్నూలు జిల్లా ఎస్పీని కలిసి.. వైయస్ అవినాష్ రెడ్డి లొంగిపోయేలా చూడమని కోరింది. అయితే శాంతి భద్రతల పరిస్థితి అదుపుచేయలేమంటూ ఎస్పీ చేతులెత్తేయడంతో కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలని నిర్ణయించుకుంది. ఇంకోవైపు.. విశ్వభారతి ఆసుపత్రి వద్దే కాదు.. ఆ పరిసర ప్రాంతాలంతా  వైసీపీ శ్రేణులతో నిండిపోయింది. ఇంకాచెప్పాలంటే... ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వారి వారి వర్గాలు ఇప్పటికే అక్కడ భారీగా మోహరించి ఉన్నారు.  ఆదివారం రాత్రి ఆ ఆస్పత్రి  సమీపంలో ఉన్న మీడియా ప్రతినిధుల అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేశారు.   అలాగే మే 19వ తేదీన హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయలుదేరిన   అవినాష్ రెడ్డి.. ఆ తర్వాత సీబీఐ కార్యాలయానికి కాకుండా.. పులివెందులకు పయనమయ్యారు. దీంతో ఆయన వాహనాలను అనుసరించిన కొన్ని మీడియా ఛానెళ్ల వాహనాలతో పాటు జర్నలిస్ట్‌లపై  అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేసిన విషయం విదితమే.  ఇక ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసిన.. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డితోపాటు  అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డిలను విచారించి.. కీలక విషయాలను రాబట్టిన సీబీఐ  ఆ క్రమంలో  అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేసుకోవడాన్ని  గమనించిన అవినాష్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ‌సరిహద్దులు దాటితే.. ప్రమాదంలో పడే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయనే భావనతో  విశ్వభారతి ఆసుపత్రిలో తల్లిని చేర్చారనిన్న చర్చ  సాగుతోంది. అదీకాక.. వైయస్ వివేక దారుణ హత్యను గుండెపోటుగా చిత్రీకరించిన నాటి నుంచి  అవినాష్ రెడ్డి తల్లి గుండెపోటు వరకు వరుస సంఘటనలలో అవినాష్ పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటే అందుకు కారణం ఈ అన్ని సందర్భాలలోనూ అవినాష్ వ్యవహరించిన తీరే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రాయలసీమ ఖ్యాతిని చాటిన ధీశాలి

కేతు విశ్వనాథ రెడ్డి (1939 జూలై 10 - 2023 మే 22) ప్రసిద్ధ సాహితీవేత్త, విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయితగా ప్రసిద్ధులు. కేతు విశ్వనాథ రెడ్డి కథలు అనే కథా సంపుటిలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. రాయల సీమకు చెందిన కేతు విశ్వనాథ్ రెడ్డి సోమవారం తెల్లవారు జామున ఒంగోలు పట్టణంలో పరమ పదించారు. రాయలసీమ కల్చర్, యాసను తన నవలలు, కథలు, నవలా సంపుటిల  ద్వారా  ప్రపంచానికి చాటిన వ్యక్తి కేతు విశ్వనాథ్ రెడ్డి. ఆయన వయసు 84.  తన కూతురు ఇంట్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా అనారోగ్యం వాటిల్లి చనిపోయారు.  తెలుగు భాష, సాహిత్యానికి ఆయన విశేష సేవలందించారు. అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించిన కేతు విశ్వనాథ్ రెడ్డి వైఎస్ ఆర్ జిల్లాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వ విద్యాలయ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు. ఆయన హైదరాబాద్, కడప, తిరుపతి ఇతర అనేక ప్రాంతాల్లో టీచర్ గా చేసిన అనుభవం ఉంది.  ఈయన తొలి కథ అనాదివాళ్ళు 1963లో సవ్యసాచిలో ప్రచురితమైంది. కొడవటిగంటి సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించారు. విశాలాంధ్ర తెలుగు కథ సంపాదక మండలికి అధ్యక్షుడుగా ఉన్నారు. కొన్నేళ్ళు అరసం (అభ్యుదయ రచయితల సంఘం) అధ్యక్షుడుగా ఉన్నారు. ఈయన రాసిన సాహితీవ్యాసాలు "దృష్టి" అనే పేరుతో పుస్తక రూపంలో వచ్చాయి. ఆధునిక తెలుగు కథారచయితల్లో టార్చ్ బేరర్స్  అనదగ్గ ప్రసిద్ధుల గురించి ఈయన రాసిన మరో పుస్తకం దీపధారులు. ప్రస్తుతం "ఈభూమి" పత్రికకు సంపాదకుడుగా పనిచేస్తున్నారు. జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003) కథా సంపుటులు కూడా వెలువరించారు. ఈయన కథలు అనేకం హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్ భాష ల్లోకి అనువాదితమయ్యాయి. వేర్లు, బోధి ఈయన రాసిన నవలలు. వేర్లు రిజర్వేషన్లకు సంబంధించి క్రీమీ లేయర్ మీద వెలువడిన మొట్టమొదటి నవల. విశ్వనాధరెడ్డి, పోలు సత్యనారాయణ ఇద్దరూ కలసి చదువుకథలు[1] అనే కథల సంపుటిని సంకలనం చేశారు.

అవినాష్ అరెస్టు.. రంగంలోకి కేంద్ర బలగాలు?

అవినాష్ ఇక అరెస్టు నుంచి తప్పించుకోలేరా? ఆఖరి ఆశగా ఆయన దాఖలు చేసుకున్నముందస్తు బెయిలు పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించడంతో ఇక సీబీఐ కూడా మరింత దూకుడుగా వ్యవహరిస్తుందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.   ఇప్పటికే కర్నూలు ఎస్పీకి అవినాష్ ను అరెస్టు చేస్తాం శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయమని సీబీఐ కోరింది. అయితే అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయడం  సాధ్యం కాదని ఆయన చెప్పడంతో సీబీఐ కేంద్ర బలగాలను రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయాన్ని సీబీఐ అధికారులే చెబుతున్నారు. మరో వైపు అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి కూడా సీబీఐ అధికారులు ఆరాతీస్తున్నట్లు సమాచారం. కర్నూలులోని అవినాష్ రెడ్డి స్నేహితుడి ఆస్పత్రి అయిన విశ్వభారతి ఆస్పత్రి వైద్యులపై అంతగా విశ్వాసం ఉంచని సీబీఐ ఆమెను వేరే వైద్యుల ఒపీనియన్ తీసుకునే దిశగా కూడా సీబీఐ యోచన చేస్తున్నది. ఇలా ఉండగా ఇప్పటికీ  విశ్వభారతి ఆస్పత్రి పూర్తిగా అవినాష్ అనుచరుల అధీనంలోనే ఉండటంతో అవినాష్ తల్లి శ్రీలక్ష్మి భద్రతపై కూడా ఆందోళన వ్యక్తమౌతోందని పరిశీలకులు అంటున్నారు. ఇలా ఉండగా అవినాష్ ను అరెస్టు చేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటూ కర్నూలు ఎస్పీ చెప్పడాన్ని సీరియస్ గా తీసుకున్న సీబీఐ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు  ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయానికి వివరించి సూచనలు తీసుకుంటున్నారు. అవినాష్ తీరుపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న సీబీఐ హెడ్ క్వార్టర్స్ ఆయనను అరెస్టు చేయమని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందంటున్నారు. ఇప్పుడు ఇక అవసరమైతే కేంద్ర బలగాలను రంగంలోనికి దించైనా అదుపులోనికి తీసుకోవాలని చెప్పినట్లు ప్రచారం అవుతోంది.   ఇక అవినాష్ రెడ్డి వ్యవహారంలో సీబీఐ తాత్సారంపై సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ‘అవినాష్ రెడ్డిగారూ పిచ్చి చూపులు చూస్తున్న సీబీఐ మీద దయ చూపించడండి.. సర్జికల్ స్ట్రైక్స్ తో ప్రపంచానికే హీరోగా నిలబడిన ప్రధాని మోడీ చేతిలో చేతకాని సీబీఐ ఉందన్న చెడ్డ పేరు తీసుకురాకండి.. దయచేసి లొంగిపోండి’ అంటూ ఓ రేంజ్ లో నెటిజన్లు సీబీఐని ట్రోల్ చేస్తున్నారు. మరో వైపు అవినాష్ అరెస్టుకు రంగం సిద్ధం చేసిన సీబీఐ ఒక్కటొక్కటిగా అడ్డంకులను తొలగించుకుంటూ.. ముందుకు అడుగులు వేస్తున్న సీబీఐని నిలువరించడానికా అన్నట్లు అవినాష్ రెడ్డికి ర క్షణ కవచంగా  పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలిసి వైసీపీ ఎమ్మెల్యేలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద  వైసీపీ మూకలు, అవినాష్ అనుచరులు ఎవరూ లోపలికి వెళ్లకుండా బైఠాయించారు.  వారితో పాటు   హాస్పిటల్ ముందే కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి , పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ ఉన్నారు.  దీంతో ఆస్పత్రిలో ఉన్న ఇతర రోగులు, వారి బంధువులూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని సీబీఐ బృందాలు ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి నివేదించాయి. దీంతో కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలన్న నిర్ణయానికి వచ్చిన సీబీఐ హెడ్ క్వార్టర్స్ ఆమేరకు చర్యలు చేపట్టింది. ఈ మధ్యాహ్నానికి కేంద్ర బృందాలు కర్నూలు చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఆ తరువాత ఏ క్షణంలోనైనా అవినాష్ ను సీబీఐ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 

ప్రసిద్ధ రచయత కేతు విశ్వనాథరెడ్డి ఇక లేరు

ప్రముఖ కవి, రచయత కేతు విశ్వనాథ్ రెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు.  ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో ఆయన సోమవారం (మే22) ఉదయం తుది శ్వాస విడిచారు.   అభ్యుదయ రచయలత సంఘం అధ్యక్షుడిగా కొంత కాలం పని చేసిన కేతు విశ్వనాథ్ రెడ్డి  జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు  కథా సంపుటులు  వెలువరించారు. ఈయన కథలు హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్‌ భాష ల్లోకి అనువాదమయ్యాయి. వేర్లు, బోధి అనే రెండు నవలలు కూడా రాశారు.  అంతే కాకుండా   ఆయన రాసిన సాహితీ వ్యాసాలు దృష్టి పేర పుస్తక రూపంలో వచ్చాయి. ఆయనను కేంద్ర సాహిత్య అకాడమీ సహా పలు పురస్కారాలు వరించాయి. కడప జిల్లా గ్రామ నామాలుపై చేసిన పరిశోధనకు డాక్టరేట్ పొందారు. ఆయన మృతి పట్ల పలువురు సాహితీ వేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

మళ్లీ సుప్రీంకు అవినాష్?

సీబీఐ తనను అరెస్టు చేయకుండా ఆదేశించాలని కోరుతూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. వెకేషన్ బెంచ్ ముందు తన బెయిల్ పిటిషన్ న మెన్షన్ చేయనున్నారు. గతంలోనే హైకోర్టు వెకేషన్ బెంచ్ తన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారించేలా ఆదేశించాలని సుప్రీంలో అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. అయితే ఆ పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు తేదీ ఖరారు చేయలేదు. జూన్ రెండో వారంలో విచారణకు అనుమతిస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే  సోమవారం (మే22) సీబీఐ అవినాష్ ను దాదాపుగా చుట్టుముట్టి అరెస్టు చేయడానికి సిద్ధం అయిన నేపథ్యంలో అవినాష్ మరో సారి సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు తన బెయిల్ పిటిషన్ మెన్షన్ చేయాలని నిర్ణయించుకున్నారు.  హై కోర్టు వెకేషన్ బెంచ్ ముందు తన బెయిలు పిటిషన్ దాఖలు చేసేంత వరకూ తనను అరెస్టు చేయవద్దని సుప్రీంను అవినాష్ అభ్యర్థించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.    అరెస్టు అనివార్యం అని తేలిపోయినా, సుప్రీం కోర్టు పదే పదే సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని చెబుతున్నా అవినాష్ ఎందుకు పరుగులు తీస్తున్నారు. మళ్లీ మళ్లీ కోర్టు మెట్లెక్కుతున్నారు? అన్న ప్రశ్నకు ఆయన ఆశలన్నీ ఈ నెల 26న ఏపీ ముఖ్యమంత్రి జగన్ హస్తిన పర్యటన మీదే ఉన్నాయని అంటున్నారు. జగన్ హస్తన వెళ్లే వరకూ తన అరెస్టును నిలువరించుకోగలిగితే అక్కడ ఆయన ఎలాగోలా చక్రం తిప్పి సీబీఐ అరెస్టు నుంచి తనను కాపాడగలరని అవినాష్ హోప్ ఫుల్ గా ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. గతంలో అవినాష్ అరెస్టునకు సీబీఐ రంగం చేసిన సందర్భంలో జగర్ హస్తిన వెళ్లి రాగానే  అరెస్టు విషయం వెనక్కు వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరో సారి అటువంటిదే ఏదో ఒకటి జగన్ చేయగలర్న నమ్మకంతోనే ఎలగైనా ఈ నెల 26 వరకూ సీబీఐకి చిక్కకుండా తప్పించుకోవాలని అవినాష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే ఇంత వరకూ వచ్చిన తరువాత సీబీఐ కూడా అవినాష్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుందనీ, అందుకే ఢిల్లీలోని సీబీఐ కేంద్ర  కార్యాలయం స్వయంగా అవినాష్ వ్యవహారాన్ని పరిశీలిస్తూ, పర్యవేక్షిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంలో  అవినాష్ పిటిషన్ వేస్తే దానిని సీబీఐ కూడా గట్టిగా వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

అవినాష్ తల్లి హెల్త్ బులిటెన్లో ఏముంది? ఏం జరుగుతుంది?

అవినాష్ రెడ్డి సీబీఐకి చుక్కులు చూపిస్తున్నారు. దేశంలో సర్వోన్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ అవినాష్ ముందు చిట్టులుకలా మారిపోతోంది. విచారణకు డుమ్మా కొట్టినా, పదే పదే ఏవో సాకులు చెప్పి గైర్హాజరైనా చర్యలు తీసుకునే చొరవ చేయలేకపోతోంది. సీబీఐ తీరు చూస్తుంటే.. ఆసలది దర్యాప్తు సంస్థఏనా? అన్న అనుమానం సామాన్యులకు సైతం కలిగేలా ఉంది. అటువంటి సీబీఐ ఎట్టకేలకు ధైర్యం చేసి కర్నూలు చేరుకుని అక్కడి ఎస్పీకి తాము అవినాష్ రెడ్డిని అరెస్టు చేయనున్నట్లు లిఖిత పూర్వక సమాచారం ఇచ్చారు. లొంగిపొమ్మనండి లేదా అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. అయినా కర్నూలులో పోలీసుల సహకారం కరవైందా?  లేక సీబీఐకే ధైర్యం తక్కువైందా తెలియదు కానీ ఈ తెల్లవారు జామునుంచీ ఆస్పత్రి వద్ద హైడ్రామా నడుస్తోంది. ఇహనో ఇప్పుడో సీబీఐ అవినాష్ ను అరెస్టు చేయనున్నారని అంతా భావిస్తున్న వేళ ఇప్పటి వరకూ హెల్త్ బులిటిన్  విడుదల చేయడం సాధ్యం కాదు అంటూ చెబుతూ వచ్చిన కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వర్గాలు అవినాష్ తల్లి హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ఆ బులిటిన్ లో ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని పేర్కొన్నారు.  ఆమె గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని, ఏమీ తినలేకపోతున్నారని చెప్పారు. వాంతులు అవుతున్నాయని తెలిపారు. లోబీపీ ఉందని వెల్లడించారు. ఆమె మెదడుకు, పొత్తికడుపుకు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాల్సి ఉందని తెలిపారు. మరి కొన్ని రోజులు ఆమె ఆసుపత్రిలోనే ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. రెండు రోజులుగా విడుదల కాని హెల్త్ బులిటెన్ ఇప్పుడే విడుదల కావడంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ఆసుపత్రి అవినాష్ స్నేహితుడికి చెందినది కావడం, పులివెందులకు దగ్గరగా ఉన్న బెంగళూరును కాదని, అలాగే అత్యాధునిక వైద్య సౌకర్యాలు లభ్యమయ్యే హైదరాబాద్ నూ కాదని కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలోనే అవినాష్ తన తల్లిని చేర్చించడంపై నాలుగు రోజుల కిందటే అనుమానాలు వ్యక్తమయ్యాయి. బెంగళూరు, హైదరాబాద్ లలో కంటే కర్నూలులో మెరుగైన వైద్యం లభిస్తుందని కాకుండా సీబీఐ నుంచి తనకు ర క్షణ ఏపీలో అయితేనే ఎక్కవ అన్న భావన ఆయనలో ఉందని కూడా పరిశీలకులు అప్పట్లో విశ్లేషించారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైందని అంతా భావిస్తున్న వేళ.. అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటిన్ విడుదల కావడం అనుమానాలకు తావిస్తున్నది.   నిజంగానే అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంటే ఆమెకు మెరుగైన వైద్య చికిత్స అందించి తీరాల్సిందే. అందులో రెండో అభిప్రాయానికి తావే లేదు. అయితే ఇప్పుడు విషయం అది కాదు.. అవినాష్ రెడ్డి వ్యవహార శైలిపైనే అనుమానాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి. ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థ విషయంలో ఆయన వ్యవహరించిన తీరు.. ఆ సంస్థ నోటీసులను ధిక్కరించిన తీరు కారణంగానే ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఏం చేసినా, ఏం మాట్లాడినా అనుమానించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇది పూర్తిగా  ఆయన స్వయం కృతం. విశ్వభారతి ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్ అవినాష్ ను అరెస్టు నుంచి కాపాడటానికా అన్న అనుమానాలు వ్యక్తం కావడానికి కూడా అవినాష్ సీబీఐ విచారణను తప్పించుకోవడానికి చేసిన విన్యాసాలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సోమవారం (మే 22) ఉదయం నుంచీ కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వద్ద జరిగిన, జరుగుతున్న పరిణామాలను గమినిస్తే.. ఏపీలో లా అండ్ ఆర్డర్ ఉందా అన్న అనుమానాలు వ్యక్తం కాకమానవు. అసలు ఏపీలో పోలీసు వ్యవస్థ ఉందా? ఉంటే స్వతంత్రంగా పని చేస్తోందా అన్న అనుమానాలూ వ్యక్తం కాక మానవు. కర్నూలులో అవినాష్ రెడ్డి ఉన్న విశ్వ భారతి ఆసుపత్రి మొత్తం వైసీపీ, అవినాష్ అనుచరుల  అధీనంలోనే ఉందని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సీబీఐ వాహనాలు ఆ ఆసుపత్రి ఆవరణలోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం లేకుండా అడ్డంకులు సృష్టించిన అవినాష్ రెడ్డి అనుచరులు ఆ తరువాత ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. పోలీసులు వారిని అక్కడ నుంచి తొలగించడానికి నానా అగచాట్లూ పడ్డుతున్నారు. వారిని బ్రతిమలాడుకుంటున్నారు. అంతకు మందు ఆదివారం రాత్రి విశ్వభారతి ఆసుపత్రి ఉన్న ప్రాంతంలో అవినాష్ అనుచరులు సృష్టించిన వీరంగాన్ని పోలీసలు ప్రేక్షకుల్లా తిలకించారు. వైసీపీ ఎమ్మెల్యే తరువాత తీరిగ్గా రంగప్రవేశం చేసి పొరపాటు జరిగింది, క్షమించండి అంటూ విలేకరులకు చెప్పారు. అనినాష్ అనుచరుల స్వైర విహారంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు కూడా విలేకరులకు అవకాశం లేకుండా అవినాష్ అనుచరులు వారికి వెంబడించారంటే పరిస్థితి ఏమిటన్నది ఊహించుకోవచ్చు.  నిన్న అర్ధరాత్రి నుంచీ కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్ద  పదుల సంఖ్యలో ఉన్న అవినాష్ అనుచరుల వీరంగం సృష్టిస్తే.. మీడియా ప్రతినిథులపై దాడులు చేస్తే.. ఇప్పటి వరకూ ఒక్క కేసు నమోదు కాలేదు.  సీబీఐ అధికారులను ఆసుపత్రి వద్ద అడ్డుకుంటుంటే ఆపడానికి పోలీసులకు అడుగు ముందుకు పడటం లేదు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, లేదా అన్న అనుమానాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 

కడప ఎంపీ అవినాష్ అరెస్ట్?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వివినాష్ రెడ్డిని సీబీఐ అదుపులోనికి తీసుకుంది. సీబీఐ విచారణకు హాజరు కాకుండా పదే పదే గడువు కోరుతూ తప్పించుకు తిరుగుతున్న అవినాష్ రెడ్డిని ఎట్టకేలకు సీబీఐ అరెస్టు చేసింది. సోమవారం(మే 22) ఆయన హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆదివారం(మే21) సీబీఐకి పంపిన లేఖలో తన తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేననీ, పది రోజుల తరువాత వస్తాననీ పేర్కొన్నారు. దీంతో సీబీఐ అప్రమత్తమైంది. సోమవారం(మే22) తెల్లవారు జాముకే కర్నూలుని విశ్వ భారతి ఆస్పత్రికి చేరుకుంది. స్థానిక ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో కర్నూలు ఆస్పత్రి వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అవినాష్ అనుచరులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. అయితే వారందరినీ చెదరగొట్టి సీబీఐ అవినాష్ రెడ్డిని అదుపులోనికి తీసుకున్నట్లు చెబుతున్నారు.  ఇప్పటికే అవినాష్ రెడ్డి  రిమాండ్ రిపోర్ట్ ను సీబీఐ అధికారులు సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. కర్నూలు ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించి అవినాష్ అనుచరులను అక్కడి నుంచి పంపించి వేశారు. ఆస్పత్రి వద్ద విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాగా గత నాలుగు రోజులుగా అవినాష్ విశ్వభారతి ఆస్పత్రిలోనే ఉంటున్నారు. కాగా తల్లి శ్రీలక్షిని అదే ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా ఆదివారం రాత్రి విశ్వభారతి ఆస్పత్రి వద్ద అవినాష్ అనుచరులు వీరంగం సృష్టించారు. ఆస్పత్రి వద్ద ఉన్న మీడియా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. వారి కెమేరాలను ధ్వంసం చేశారు.   సీబీఐ అధికారులు కర్నూలు వస్తున్నారన్న సమాచారంతోనే  వైసీపీ కార్యకర్తలు ఆస్పత్రివద్ద ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారని అంటున్నారు. సీబీఐ అధికారుల వాహనాలు ఆస్పత్రి వద్దకు వెళ్లకుండా అవరోధాలు సృష్టించారు. అయితే స్థానిక పోలీసుల సహకారంతో ఆ అవరోధాలను అధిగమించి పోలీసులు విశ్వభారతి ఆస్పత్రికి చేరుకున్నారు. 

విలువల గురించి బే ఫికర్.. రాపాక రాజకీయం!

ఎన్నికలు మళ్లీ వచ్చేస్తున్నాయి. ఎమ్మెల్యేగా మళ్లీ గెలుపొందాలంటే.. పార్టీ అండ దండ కావాలి. అలా అయితేనే.. మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టి అధ్యక్షా.. అధ్యక్షా అనొచ్చు. కానీ గత ఎన్నికల్లో ఓ పార్టీ నుంచి గెలిచి.. ఆ తర్వాత మరో పార్టీలోకి జంప్ జిలానీ రాగం ఆలపించడంతో.. ఇప్పటి వరకు పరిస్థితులు బాగానే ఉన్నా.. ఎన్నికల నాటికి సీన్.. సితారా అయ్యే అవకాశాలు ఉన్నట్లు రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌కు గట్టిగానే అర్థమైన్నట్లుందనే ఓ టాక్   సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.  ఆ క్రమంలో ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్‌కు ఆయన ఫ్యామిలీకి రాపాక వారు గట్టిగానే సోప్ వేస్తున్నట్లు ఆయన చర్యలు చూస్తే ఇట్టే అర్థమవుతోందనే చర్చ సైతం సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం తన కుమారుడు వివాహ వేడుకను రాపాక వాడుకొంటున్నట్లుగా ఉందని తెలుస్తోంది. ఆ క్రమంలో తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రంపై మాకు దైవ సమానులైన మా ప్రియతమ నాయకులు, ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, భారతమ్మ గార్ల ఆశీస్సులతో.. అంటూ వారి పొటోలను ముద్రించిన శుభలేఖ అటు మీడియాను ఇటు సోషల్ మీడియాను చూట్టేస్తోంది. అయితే ఈ పోటోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు..ఫ్యాన్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. జనసేన శ్రేణులు మాత్రం వ్యంగ్య బాణాలు సంధిస్తోంది.   ఎందుకంటే.. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి గెలుపొందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజోల్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఘన విజయం సాధించారు. అయితే ఇవే ఎన్నికల్లో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. రెండు చోట్ల పోటీ చేసి.. ఓటమి పాలైయ్యారు. దీంతో ఆ పార్టీ తరఫున గెలిచిన ఒకే ఒక్కడు రాపాక.. దాంతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. తాను జనసేన సభ్యుడిగానే ఉంటానని.. అలా అయితే తన నెంబర్ 1 గా ఉంటుందని.. అదే జగన్ పార్టీలోకి వెళ్లితే.. తన నెంబర్ 152గా ఉంటానని అసెంబ్లీ సాక్షిగా రాపాక ప్రకటించారు. అలా చెప్పిన కొద్ది రోజులకే రాపాక.. పార్టీ కండువా మార్చే చేశారు. ఆయన కుమారుడిని ముందుగా పార్టీ అధినేత వైయస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పారు. అలాగే పి.గన్నవరంలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో సైతం ఆయన జగన్ పార్టీ కండువా కప్పుకొని.. వేదిక మీద ఆశీసునులు అయిన సంగతి తెలిసిందే.  మరోవైపు వచ్చే ఎన్నికల్లో రాజోలు నుంచి అధికార ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రాపాక సన్నాహాలు చేసుకొంటున్నట్లు తెలుస్తోంది. ఓ వేళ పార్టీ టికెట్ సీఎం జగన్ వలదన్నా... తన వంతు ప్రయత్నంగా ముందు చూపుతో రాపాక వ్యవహరిస్తున్నారనే ఓ చర్చ సైతం జిల్లా ఫ్యాన్ పార్టీలో జోరందుకొంది.

అవినాష్.. సీబీఐ.. ఓ అంతులేని కథ

తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు, మాజీ మంత్రి నారాయణ, తెలుగుదేశం నాయకుడు అయ్యన్న పాత్రుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏసీబీ, ఏపీ సీఐడీ అరెస్టు చేసిన వారి జాబితా కొండవీటి చాంతాడంత ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ.. సీనియర్ జర్నలిస్టు అంకబాబు వంటి వారిని అర్ధరాత్రి అరెస్టు  చేసిన సంఘటనలూ పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వీళ్లెవరూ ఉగ్రవాదులు కాదు... రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేసి పరారైపోతారన్న అనుమానాలూ లేవు. అయినా కూడా ఏపీ సీఐడి, పోలీసులు వీళ్లను అరెస్టు చేశారు. అర్థరాత్రి ఇళ్లల్లోకి చొరబడి, ఒక్కో చోట తలుపులు బద్దలుకొట్టి, కాంపౌండ్ వాల్ దూకి మరీ అరెస్టు చేశారు.  టీడీపీ అధికారం లో ఉన్నపుడు జరిగినట్లుగా చెప్పబడుతున్న ఇఎస్ఐ స్కామ్ పై జగన్ ప్రభుత్వం ఎసిబి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. గతం లో కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్ల వ్యవహారం లో అవకతవకలు జరిగినట్లుగా ప్రభుత్వం భావించింది. ఈ స్కామ్ జరిగిన సమయం లో అచ్చం నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నఉన్నారంటూ 2020 జనవరిలో  అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ లో ఉన్న  మంత్రి అచ్చం నాయుడు ను ఎసిబి అదుపులోకి తీసుకుని రోడ్డు మార్గంలో విజయవాడ కు తరలించింది. శస్త్ర చికిత్స చేయించుకుని కదలలేని స్థితిలో ఉన్న ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. ఇందు కోసం  దాదాపుగా 100 మంది పొలిసు బలగం తో అర్ధరాత్రి ఆయన ఇంటిపై దాదాపు దాడి చేసినంత పని చేశారు. అలాగే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు విషయంలో ఏపీ సీఐడీ వ్యవహరించిన తీరు కూడా వివాదా స్పదంగానే ఉంది. ఆయన జన్మదినం రోజున అర్దరాత్రి హైదరాబాద్ లో అరెస్టు చేసిన ఏపీ సీఐడీ రోడ్డు మార్గాన ఏపీకి తీసుకువచ్చింది. దారి పొడవునా చిత్రహింసలు పెట్టిందని ఆయన ఆరోపించిన సంగతి విదితమే. అలాగే ఏపీలో విపక్ష నేతలు, ప్రభుత్వాన్ని విమర్శించే వారి పట్ల ఏపీ సీఐడీ ఇలాగే వ్యవహరించింది. నోటీసులు, పద్ధతులు, నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టారీతిగా అరెస్టులు చేసింది. అదే వివేకాహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ విషయానికి వచ్చే సరికి అన్ని అనుమతులూ ఉన్నా, అరెస్టే తరువాయి అని స్వయంగా కోర్టులకు చెప్పిన సీబీఐ ఆయన నీడను కూడా ముట్టుకోవడానికి జంకుతోంది. కేంద్ర దర్యాస్తు సంస్థ అయిన సీబీఐ తీరు నవ్వుల పాలౌతోంది. జనంలో ఆ దర్యాప్తు సంస్థ చులకన అవుతోంది. అయినా పట్టించుకోవడం లేదు. విచారణకు రండి సార్ అని నోటీసుల మీద నోటీసులు ఇచ్చి బతిమలాడుకుంటోంది. అయినా కూడా అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కాను కాక కాను అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పనులంటూ ఓసారి, తల్లి అనారోగ్యం అంటూ మరోసారి, ఇంకోసారి కడుపునొప్పి అంటూ స్వయంగా తానే ఆసుపత్రిలో చేరారు. ఇక తాజాగా తన తల్లి ఆనారోగ్యంతో ఉన్నందున ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే వరకూ విచారణకు హాజరు కావడానికి కుదరదని మరోసారి సీబీఐకి లేఖ రాశారు.  సోమవారం( మే10) విచారణకు రావాలంటూ సీబీఐ అవినాష్ కు నోటీసులు జారీ చేసినప్పటి నుంచి మొదలైన హై డ్రామా కొనసాగుతూనే ఉంది. ఆ రోజు విచారణకు బయలుదేరిన అవినాష్ తల్లి ఆనోరోగ్యం సమాచారం అందిందంటూ  డుమ్మా కొట్టారు.   హైదరాబాద్ కు కానీ.. ఇటు బెంగళూరుకు కానీ తీసుకెళ్లకుండా మధ్యలో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యుడు, అవినాష్ రెడ్డి స్నేహితుడు.  సరే సీబీఐ సోమవారం(మే 22)  విచారణకు రండి అంటూ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులకు కూడా ఆయన కుదరదనే సమాధానం ఇచ్చారు.  ఆయన తీరును చూస్తే.. ఇప్పట్లో ఆయన విచారణకు హాజరు కాను అని చెప్పినట్లే ఉంది.  సీబీఐ విచారణకు డుమ్మా కొట్టడానికి చాలా పకడ్బందీగా అవినాష్ రెడ్డి ఆడుతున్న గేమ్ లో సీబీఐ చిత్తవుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అవినాష్ తీరు పట్ల సీబీఐ సీరియస్ గా ఉందనీ, సీబీఐ కేంద్ర కార్యాలయం ఆయనను అరెస్టు చేయమని ఆదేశాలు జారీ చేసిందనీ వార్తలు వస్తున్నా.. సీబీఐ మాత్రం గడువు మీద గడువు ఇచ్చుకుంటూ వెళుతోంది. సీబీఐ దర్యాప్తు చేస్తోందా.. లేక అవినాష్ చెప్పినట్లు చేస్తోందా అని పరిశీలకులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ అవినాష్ విచారణ తెలుగు టీవీ సీరియల్ లా అంతులేకుండా సాగుతోందని అంటున్నారు. 

డిసెంబర్ లేదా జనవరిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు?

నిజం కావచ్చును  ..కాకపోనూ వచ్చును, కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మళ్ళీ మరోమారు ముందస్తు ఎన్నికల చర్చ జోరుగా సాగుతోంది. నిజానికి, తెలుగు దేశం పార్టీ అధినేత  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఎప్పటి నుంచో  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ముందస్తు ఎన్నికలు పోవడం ఖాయమని చెపుతూనే ఉన్నారు. అయితే  ముందస్తు ఎన్నికలు వస్తాయా  రావా అనే విషయాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీని చిత్తుగా ఓడించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కార్యకర్తలలో జోష్ పెంచేందుకు విభిన్న కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్నారు. ఓ వంక యువనేత నారా లోకేష్, యువ గళం పాద యాత్ర తో జన ప్రభంజనం సృష్టిస్తున్నారు. మరో వంక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎక్కడికక్కడ స్థానిక నేతలు, కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా అధికార వైసీపీతో ఢీ అంటే ఢీ అనేందుకు నియోజక వర్గాల స్థాయిలో క్యాడర్ కు దిశా నిర్దేశం చేస్తున్నారు.  అయితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే సాహసం చేయక పోవచ్చనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్త పరుస్తున్నా, చంద్రబాబు నాయుడుతో పాటుగా, ఇప్పటికే టీడీపీతో పొత్తుకు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల ముందస్తు ముచ్చట తెచ్చారు.ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నెల నుండి పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.  అలాగే వైసీపీ అసమ్మతి నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కూడా అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నారని చెప్పారు. కొన్ని కొన్ని సందర్భాలలో ఆయన ముహూర్తాలు కూడా ఖరారు చేశారు. గతంలో కర్ణాటక ఎన్నికలతో పాటుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగుతాయని జోస్యం చెప్పిన రఘురామకృష్ణం రాజు  , తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు.   ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన మనసు మారకపోతే, డిసెంబర్ లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఐక్యం కాకముందే ఎన్నికలకు వెళ్లాలన్నది ముఖ్యమంత్రి జగన్ ప్లాన్ గా కనిపిస్తోందన్నారు. అయితే ఓట్లున్న ప్రతిపక్షాలు కలవడం ఖాయమని అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా వారితో కలిసే అవకాశాలు ఉన్నాయని రఘురామకృష్ణ రాజు అన్నారు.  అదలా ఉంటే  ఇప్పడు తాజాగా, ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం (2023)డిసెంబర్ లేదా వచ్చే సంవత్సరం (2024)జనవరిలో ఎన్నికలువస్తాయని స్పష్టం చేశారు. దీంతో ఏపీ డిప్యూటీ సీఎం రాజన్నదొర చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అదెలా ఉన్నా ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలు కోరుకొవడానికి అనేక కారణాలున్నాయని విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. ముఖ్యంగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. కారణాలు ఏవైనా కేంద్ర ప్రభుత్వం  అండదండలు అడుగంటిపోతున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మరోవంక అక్రమాస్తుల కేసులు, బాబాయి మర్డర్ కేసుకు సంబందించిన చిక్కు ముళ్ళు తొలిగి పోతున్నాయి. ఈ నేపధ్యంలో ఏ నిముషానికి ఏమి జరుగుతుందో అనే భయం వెంటాడుతోంది. ఈ నేపధ్యంలో గుడ్డిదో ఎడ్డిడో దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది.

నోటు వాపస్ ఓటు వాపస్?

అనుకున్నదే జరిగింది.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించిన నేపధ్యంలో, విపక్షాలను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో అస్త్రాన్ని బయటకు తీసింది.రూ.2000 నోట్లను చెలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ పెద్ద నోట్లను సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. అంటే ఆ తర్వాత 2 వేల రూపాయల నోటు ఉన్నా.. అది చెల్లని కాగితంతో సమానంగా విలువను కోల్పోతుంది. అయితే, రూ.2000 నోట్లను చెలామణి నుంచి వెనక్కి తీసుకోవడం వల సామాన్యులపై అంతగా ప్రభావం ఉండదు, నిజానికి సామాన్యులు రూ. 2000 నిటు చూసి చాలా కాలం అయింది. 2016 లో పెద్ద నోట్ల రద్దు సమయంలో అవసరార్ధం రూ.2000 నోట్లను చెలామణి లోకి తెచ్చిన రిజర్వు బ్యాంకు, అవసరం తీరిన తర్వాత 2018 నుంచే రూ.2000 నోట్ల ముద్రణను నిలుపు చేసింది. అంతే కాకుండా, చాలా కాలంగా బ్యాంకుల ఏటీఎంలలో రెండువేల రూపాయల నోట్ల అంతగా ఉంచడం లేదు. ఇక ఇప్పుడు కస్టమర్లకు ఈ నోట్లను ఇవ్వవద్దని బ్యాంకులకు సూచించిన ఆర్‌బీఐ.. తమ వద్ద ఉన్న నోట్లను సెప్టెంబర్‌ 30లోగా మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. అంటే, స్పెషల్ పర్పస్ కోసం కోట్లలో నోట్ల కట్టలను పేర్చుకున్న వారికి  తప్పించి , రూ.2000 నోట్ల ఉపసంహరణ ప్రభావం సామాన్యుల పై ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు.  అయితే, రూ.2000 నోట్ల చెలామణిని నిలిపివేస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం సంపన్నులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా.. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, రాజకీయ రంగంలో ఉన్నవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ నాయకులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.  ఐటీ లెక్కల్లో చూపకుండా ఎక్కువ నగదును నిల్వ చేసుకునే వారు సాధారణంగా పెద్ద నోట్లనే ఎంచుకుంటారు. అంటే, కోట్ల రూపాయల సొమ్మను రూ.2000 నోట్ల కరెన్సీలో నిల్వ చేసుకునే వారు లెక్కలేనంత మంది ఉంటారు. పెద్ద మొత్తంలో అవసరం వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు ఖర్చు చేయొచ్చు అనుకుంటారు. ఇప్పుడు అలాంటి వారు చిక్కుల్లో పడ్డట్లే. బ్యాంక్ ఖాతాల్లో రూ.2000 నోట్లను ఎంత మొత్తమైనా డిపాజిట్ చేసుకునేందుకు అవకాశం ఉందని ఆర్బీఐ చెప్పింది. అయితే, రూ. 50 వేలు మొదలు అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేయాల్సి వస్తే.. పాన్ కార్డ్ కావాల్సిందే. కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాల్సి వస్తే.. అందుకు తగిన లెక్కలు చూపించి, ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఇప్పటిదాకా దాచుకున్న డబ్బును ఒకేసారి డిపాజిట్ చేస్తే.. కచ్చితంగా ఐటీ అధికారుల దృష్టిలో పడతారు. అంటే, ఎన్నికల ముందర రాజకీయ నాయకులకు ఇది గట్టి దెబ్బగానే చెప్పవచ్చు.అందుకే రిజర్వు బ్యాంకు తీకున్న నోటు వాపస్ నిర్ణయం.. ఓటు వాపస్  నిర్నయంగానూ భావిస్తునారు.

అవినాష్ సీబీఐ..టామ్ అండ్ జెర్రీ తీరు!

వివేకా హత్య కేసు దర్యాప్తు తీరు ప్రతిష్ఠాత్మక కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రతిష్టను మంటగలుపుతోంది. అవినాష్, సీబీఐల మధ్య గత నాలుగు నెలలుగా సాగుతున్న వ్యవహారం టామ్ అండ్ జెర్రీని గుర్తుకు తెస్తోంది. ఒక సారి నువ్వు పై చేయి సాధించు.. మరో సారి ఆ చాన్స్ నాకివ్వు అని ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా అవినాష్, సీబీఐ తీరు ఉంది. అనివాష్ పార్టీ పనులున్నాయంటూ విచారణకు డుమ్మా కొడితే.. సరే సార్ మీ పనులన్నీ అయ్యాకే తీరిగ్గా విచారణకు రండి అంటూ సీబీఐ గడువులు పెంచుకుంటూ పోవడం చూసి జనం నవ్వుకుంటున్నారు.   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు వరుసకు సోదరుడనేనా అవినాష్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆయన పట్ల ఇంత ఉదారంగా వ్యవహరిస్తోంది. లేదా అవినాష్ రౌడీయిజానికి అంత పెద్ద దర్యాప్తు సంస్థా బెదరిపోయి జీ హుజూర్ అంటోందా? అన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తమౌతున్నాయి. అవినాష్ వ్యవహారంలో సీబీఐ తీరుతో తెలుగు రాష్ట్రాలలో సీబీఐ విశ్వసనీయత పూర్తిగా కోల్పోయిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఐపీఎల్ లో బెట్టింగ్ లు చేస్తున్నట్లుగా జనం అవినాష్ ను సీబీఐ అరెస్టు చేయదంటూ కోట్లలో బెట్టింగులు చేస్తున్నారంటే.. సీబీఐ సత్తా, సామర్థ్యంపై విశ్వాసం, విశ్వసనీయతా జనంలో ఏ స్థాయికి దిగజారిపోయాయో అర్ధమౌతుందంటున్నారు. కాగా కొంచం అటూ ఇటూగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా ఇవే సందేహాలను, ఇవే అనుమానాలనూ వ్యక్తం చేశారు. ఏపీ సీఐడీకి ఉన్న పాటి సత్తా, ధైర్యం కూడా కేంద్ర దర్యాప్తు సంస్థకు లేదా అని నిలదీశారు. లేదా ఏపీ సీఎం తమ్ముడికి సీబీఐ దృష్టిలో ఏమైనా ప్రత్యేక అర్హతలు ఉన్నాయా అని సందేహం వ్యక్తం చేశారు. ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఒక రూలు, ఎంపీ, వైఎస్ అవినాష్ రెడ్డికి మరో రూలూ ఉంటుందా అని ప్రశ్నించారు. తలా  తోకా లేని నోటీసులతోనే రాత్రికి రాత్రి ఏపీ సీఐడీ అరెస్టులు చేసి పట్టుకు పోతుంటే.. కోర్టుల నుంచి క్లియరెన్స్ వచ్చిన తరువాత కూడా సీబీఐ అవినాష్ దరిదాపుల్లోకి కూడా ఎందుకు వెళ్లలేకపోతోందని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఇక నుంచి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చినా ఎవరూ విచారణకు హాజరు కావద్దని  పిలుపు నిచ్చారు. ఏపీలో అయితే సీబీఐ అడుగు పెట్టలేదన్న ధైర్యంతోనే అవినాష్ కర్నూలు ఆస్పత్రిలో తలదాచుకున్నారని ఆయన ఆరోపించారు.  

దేవుడిని తలుచుకుంటే గుర్తకు వచ్చేది ఎన్టీఆరే!

ఎన్టీఆర్ ఆయన కుటుంబానికే సొంతం కాదనీ, ఆయన తెలుగువారి ఆస్తి అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. కూకట్ పల్లి కైతలాపూర్ మైదానంలో శనివారం (మే20) జరిగిన ఆయన శత జయంతి సభలో ప్రసంగించిన చంద్రబాబు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారందరికీ ఎన్టీఆర్ ఆరాధ్యుడన్నారు. అమెరికాలో ఎన్టీఆర్ జయంతిని తెలుగు హెరిటేజ్ డేగా జరుపుకుంటారనీ, తెలుగు జాతికి ఎన్టీఆర్ తెచ్చిన ఖ్యాతికి, గుర్తింపునకు ఇంకేం నిదర్శనం కావాలన్నారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, సాధారణ జీవితం గడిపారనీ, ప్రతి రోజు తల్లి పాలు పితికి ఇస్తే వాటిని టీ దుకాణాలకు పోసి వచ్చేవారు. ఆ తర్వాత విజయవాడ నుంచి గుంటూరు వెళ్లి చదువుకుని సాయంత్రానికి తిరిగి వచ్చి మళ్లీ పనులు చేసుకునేవారు. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో ఆయనకు రిజిస్ట్రార్ ఉద్యోగం వచ్చింది. అయితే లంచాలు తీసుకోవడం నచ్చక ఆ ఉద్యోగం వదిలేసి సినిమాల్లో నటించేందుకు మద్రాస్ వెళ్లారు. ఒక శ్రీకృష్ణుడిగా, ఒక వెంకటేశ్వరస్వామిగా ఇలా ఆయన పోషించిన ప్రతి పాత్రా కూడా భవిష్యత్తులో మరెవ్వరూ చేయలేనంత ప్రతిభామంతంగా నటించారని చంద్రబాబు చెప్పారు.   మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పిన చంద్రబాబు రాయలసీమలో కరవు వస్తే జోలె పట్టి విరాళాలు సేకరించారు. చైనా యుద్ధం, దివి సీమ ఉప్పెన సమయంలోనూ రాష్ట్రమంతా తిరిగి జోలెపట్టి విరాళాలు సేకరించారు. తనను 40 ఏళ్ల పాటు ఆదరించిన ప్రజల కోసం రాజకీయ పార్టీ పెట్టారు. ఇవాళ దేశంలో అమలవుతున్న అనేక సంస్కరణలకు ఎన్టీఆరే ఆద్యుడని చెప్పారు. ఎన్టీఆర్ జీవితచరిత్రను ఐదు నిమిషాల పాటు మనసులో స్మరించి మీరు ఏ సంకల్పం అయినా చేయండి... ఆ సంకల్పం జయప్రదం అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ అనేవి కేవలం మూడు అక్షరాలు మాత్రమే కాదని, ఓ మహాశక్తి అని చంద్రబాబు అభివర్ణించారు. కాగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు సినీ, రాజకీయ రంగాలతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా బ్రాహ్మణి, వసుంధర, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి. రాజా,తెలంగాణ తెలుగుదేశం కాసాని జ్ఞానేశ్వర్,  నటులు మురళీమోహన్, జయప్రద, జయసుధ, ప్రభ, అల్లు అరవింద్, అశ్వినీదత్, విజయేంద్రప్రసాద్, వెంకటేశ్,  కర్ణాటక అగ్రహీరో శివరాజ్ కుమార్, రామ్ చరణ్, నాగచైతన్య, శ్రీలీల, సుమంత్, అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ  ఈ వేడుకల ప్రారంభం వేళ వేదికపై ఉన్న ఎన్టీఆర్ ప్రతిమకు ప్రముఖులు నివాళులు అర్పించారు. కాగా ఈ సందర్భంగా ఎన్టీఆర్ శకపురుషుడు పుస్తకాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించి ప్రసంగించారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ శత జయంతి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నీతి నిజాయతీ, క్రమశిక్షణకు నిలువెత్తు రూపం ఎన్టీఆర్ అన్నారు.రాజకీయాలలోకి క్రమశిక్షణ తెచ్చిన మహోన్నతుడు, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జనం మనిషి ఎన్టీఆర్ అని దత్తాత్రేయ అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా మాట్లాడుతూ జాతీయ రాజకీయాలలో కూడా ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారన్నారు. పేదల కష్టాలు తెలిసిన నేత, సామాజిక న్యాయం కోసం పాటుపడిన వ్యక్తి అని కొనియాడారు. దేవుడిని ఎప్పుడు తలచుకున్నా గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్ మాత్రమేనని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు ఎన్టీఆర్ చివరి వరకూ కృషి చేశారన్నారు.  ఈ కార్యక్రమంలో ఇంకా పలువురు ఎన్టీఆర్ గోప్పతనం గురించి, ఆయనతో తమకు ఉన్న అనుబంధం గురించి వివరించారు. 

ఆ చిత్రంలో నటించడం తప్పా? 

ది కేరళ స్టోరిలో ఆసిఫా పాత్ర ధారి అయిన సొనాలీకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.  మొదట్నుంచి వివాదంలో ఉన్న ఈ చిత్రాన్ని  పశ్చిమ బెంగాల్ లో నిషేధించారు. సుప్రీం జోక్యంతో నిషేధం ఎత్తివేసారు. చాలా రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించకూడదని హిందుత్వ వాదులు హెచ్చరించారు. అయితే ఎగ్జిబిటర్లే స్వయంగా  చిత్రాన్నిఎత్తివేస్తున్నారు.వేశారు కూడా. ఈ చిత్రంలో అసిఫా క్యారెక్టర్లో ఉన్న సొనాలికి బెదిరింపు కాల్స్ రావడంతో ఆమె కుటుంబం మీడియా ముందుకు వచ్చింది. సొనాలి ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని నటీమణి కుటుంబం అంటోంది. సొనాలికి మోడలింగ్ చేసిన అనుభవం ఉంది. మూడు నాలుగు చిత్రాల్లో నటించింది.  ది కేరళ స్టోరీని మహరాష్ట్ర , తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ప్రదర్శించాలని బిజెపి నిర్ణయించింది. వోటు బ్యాంకు రాజకీయాలను ఈ ఎన్నికల్లో నడపాలంటే చిత్రాన్ని ఉచితంగా  చూయించాలని బిజెపి పన్నాగం. కేరళలో తప్పిపోయిన అమ్మాయిలు ఐసిస్ లో చేరి టెర్రరిస్ట్ లుగా మారతారు. ఇది స్టోరీ సారాంశం.వివాదానికి ఇదే కారణమైంది. చిత్రాన్ని నిషేధించడం వ్యవస్థను ప్రశ్నించడం అవుతుంది. ఇష్టమున్న వాళ్లు చిత్రాన్ని చూస్తారు. నచ్చని వాళ్లు చూడరు. సమాజానికి నష్టం వాటిల్లుతుంది అనుకుంటే కోర్టులు జోక్యం చేసుకుని నిషేధిస్తాయి. కానీ ఇవేవి జరగకుండా  అందులో నటించిన తారలకు అసభ్య మెసేజ్ లు, బెదిరింపుకాల్స్ చేయడం శోచనీయం. చట్టాలను చేతుల్లో తీసుకున్న వారిని చట్ట పరిధిలో శిక్షలు వేయాలని ప్రజాస్వామిక వాదులు డిమాండ్ చేస్తున్నారు. ది కేరళ స్టోరి చిత్రంలో నటించడం తప్పా అని లౌకికవాదులు ప్రశ్నిస్తున్నారు.