విపక్షాల ఐక్యతకు సంకేతం.. సిద్దరామయ్య ప్రమాణ స్వీకారోత్సవం

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య శనివారం (మే20)న   ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక విధంగా ఆయన ప్రమాణ స్వీకార  కార్యక్రమం . బీజేపీయేతర పక్షాల ఐక్యతకు వేదికగా మారింది. అంతే కాకుండా కాంగ్రెస్ లో మారిన సంస్కృతికి దర్పణంగా కనిపించింది. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా మరో ఎనిమిది మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున్ ఖర్గేకు ఇరువైపులా సిద్దరామయ్య, డీకే శివకుమార్ లు చేతులు పట్టకుని నిలుచున్నారు. వీరికి వెనుకగా కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్, ప్రియాంకలు నిలబడ్డారు. ఏ విధంగా చూసినా ఇది ఒక కొత్త దృశ్యం. కాంగ్రెస్ లో గాంధీ నెహ్రూ కుటుంబం స్వయంగా తమ ఆధిపత్యాన్ని తగ్గించుకుని పార్టీలో ప్రజాస్వామ్యానికి పెద్ద పీట వేసిన సందర్భంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదలా ఉంటే ఈ కార్యక్రమానికి  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్, రాజస్థాన్ సీఎం గెహ్లాట్, ఛత్తీస్‌గర్ సీఎం భూపేశ్ భగేల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా  తదితరులు హాజరయ్యారు. అలాగే రాజకీయవేత్తగా మారిన నటుడు కమల్ హసన్ కూడా హాజరయ్యారు. ఆహ్వానం అందినప్పటికీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కేసీఆర్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లు గైర్హాజరయ్యారు. అయితే కర్నాటకలో కాంగ్రెస్ విజయం, ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి పలు బీజేపీయేతర పార్టీల అధినేతల హాజరు జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి బలోపేతం అవుతోందనడానికి స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది గడువు ఉంది. ఈ లోగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో పార్టీలూ ఏకమౌతాయన్న అంచనాకు రావడానికి సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమం దోహదపడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అణగారిన వర్గాలకు పెద్ద పీట కర్ణాటక కేబినేట్ 

కర్ణాటక ప్రమాణ స్వీకారోత్సవంలో దళిత ముఖ్యమంత్రి పదవిని నిరాకరించిన కాంగ్రెస్ పార్టీ  పెద్ద పీట వేసింది. ప్రమాణ స్వీకారం రోజు ఎనిమిది మందికి మంత్రి వర్గంలో చోటు దక్కింది.  సింహభాగం అణగారిన వర్గాలేనని తేలిపోయింది. ఈ వర్గాలకు తొలి జాబితాలో నే చోటు దక్కడం విశేషం. వొకలిగ కులానికి ఒక్క స్థానం దక్కకపోవడం విశేషం. ఈ కులం చిత్రదుర్గ , షిమోగో జిల్లాల్లో మాత్రమే కనిపిస్తారు. లింగాయత్ లు బిజెపి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. బిజెపిని ఓడించిన ప్రజలు లింగాయత్లను కాంగ్రెస్ పార్టీకి కూడా దూరం చేశారు.లింగాయత్లు హిందూత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. వీళ్లు శివుడుని ఎక్కువగా పూజిస్తారు. హిందూ మతానికి చాలా దగ్గరగా ఉండటంతో బిజెపికి పెద్ద పీట వేశారు.  డికె శివకుమార్  డిప్యూటి చీఫ్ మినిస్టర్ పోస్ట్ రావడంతో దళిత కులాలకు డిప్యూటి ముఖ్యమంత్రి పదవి అన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగా మారాయి. ప్రముఖ దళిత నాయకుడు జి. పరమేశ్వరకు డిప్యూటి పదవి అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంది. తీరా క్యాబినేట్ భేటి రోజు మాత్రం ఆయన ఊసు లేకుండా పోయింది.  మొదటి జాబితాలోనే ఆయన పేరు లేకుండా పోయింది. మల్లి ఖార్జున ఖర్గే కుమారుడుకి కూడా కేబినేట్లో చోటు దక్కింది. దళిత కుటుంబానికి చెందిన ఖర్గే ఎ ఐ సిసి అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. తొలి గాంధీ యేతర కుటుంబానికి చెందిన వ్యక్తికి అధ్యక్ష పదవి దక్కడం గమనార్హం అయితే తొలిసారి శాసనసభ్యుడిగా గెలిచి ఐటి శాఖా మంత్రి రావడంతో వార్తల్లోకెక్కారు ఖర్గే  

అనినాష్ రెడ్డికి సీబీఐ మరో చాన్స్

అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ వేచి చూచే ధోరణి అవలంబిస్తోందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. దారులన్నీ మూసుకు పోయిన తరువాత కూడా ఆయన ఎంత కాలం దాగుడుమూతలట ఆడతారో చూద్దామన్నట్లుగా సీబీఐ తీరు ఉందని అంటున్నారు. సీబీఐ విచారణకు డుమ్మా కొట్టి తల్లి అనారోగ్యమంటూ శుక్రవారం (మే19) రోజంతా రోడ్లపై కాన్వాయ్ లో విపరీతంగా తిరిగిన వైఎస్ అవినాష్ రెడ్డి ఎట్టకేలకు కర్నూలులో హాల్ట్ అయ్యారు. అక్కడి ఆస్పత్రిలో తల్లిని చేర్చి తాను కూడా అడ్మిట్ అయ్యారు. గుండెపోటుతో తల్లి హస్పిటల్ లో చేరితే కడుపులో మంట లేదా నొప్పి అంటూ అవినాష్ అదే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. దాంతో నిన్న రోజంగా జరిగిన హైడ్రామాకు తెరపడింది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులను ధిక్కరించి పులివెందుల బయలు దేరిన అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు వెంబడించడంతో ఇక ఆయనను ఏక్షణంలోనైనా అరెస్టు చేస్తారనే అంతా భావించారు. ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం నుంచి హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి అవినాష్ ను అరెస్టు చేయాలంటూ ఆదేశాలు సైతం జారీ అయ్యాయని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే శనివారం అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయం అన్న నిర్ధారణకు పరిశీలకులు వచ్చేశారు. అయితే అనూహ్యంగా సీబీఐ ట్విస్టు ఇచ్చింది. కడుపు నొప్పికి చికిత్స చేయించుకుని సోమవారం ( మే20) విచారణకు హాజరు కావాల్సిందిగా తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది. దారులన్నీ మూసుకుపోయిన అవినాష్ ఇంకెంత దూరం వెడతారో చూద్దామన్నట్లుగా సీబీఐ తమాషా చూస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తుంటే.. అవినాష్ విషయంలో సీబీఐ తీరు అనుమానాస్పదంగా ఉందని కొందరంటున్నారు. అవినాష్ తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసిందనీ, ఆ సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారనీ అప్పటి వదిలేయలేదనీ, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించి మరీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిందని గుర్తు చేస్తున్నారు. మరి అవినాష్ విషయంలో సీబీఐ ఆ విధంగా ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఒకే కేసులో తండ్రి విషయంలో ఒకలా, తనయుడి విషయంలో ఒకలా సీబీఐ వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.  అదలా ఉంటే.. వివేహా హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.  వివేకా పి.ఏ కృష్ణారెడ్డి దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ లో డాక్టర్ సునీత ఇంప్లీడ్ అయ్యారు. వివేకా హత్య కేసులో నిజమైన బాధితురాలిని తానేననీ, ఈ కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని అంగీకరించడం, అంగీకరించకపోవడం తనకు సంబంధించిన విషయమనీ, కృష్ణారెడ్డికి ఏం సంబంధం కాదనీ పేర్కొన్నారు. ఈ మేరకు సునీత తరఫు న్యాయవాది.. తొలి నుంచీ ఈ కేసులో న్యాయం కోసం పోరాడుతున్నది తన క్లయింట్ సునీతేనని పేర్కొన్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని సుప్రీం ను ఆశ్రయించడం నుంచి, కేసు విచారణ ఏపీ నుంచి మార్చాలని కోరడం వరకూ అన్నీ సునీత అభ్యర్థన మేరకే జరిగాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిజమైన బాధితులు సునీతారెడ్డి, ఆమె తల్లి మాత్రమేననీ, కృష్ణారెడ్డికి సంబంధం లేదనీ ఆయన వాదించారు. సునీత ఇంప్లీడ్ పిటిషన్ ను అనుమతించి సుప్రీం కోర్టు వచ్చే నెల 3లేదా 4 తేదీలలో విచారించనున్నట్లు తెలిపింది.  

ష్.. గప్ చిప్.. కొడాలికి ఏమైంది?

కొడాలి నాని  తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు. జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగా పని చేసిన ఆయన తనకు మాత్రమే ప్రత్యేకమైన బూతుల మంత్రి అని బిరుదు కూడా పొందారు. మంత్రిగా ఆయన చేసే వ్యాఖ్యలు, విమర్శలు విలువలకు వలువలు ఒలిచేసినట్లుగా ఉండేవి. ముఖ్యంగా అవసరం ఉన్నా లేకపోయినా, సందర్భం ఉన్నా లేకపోయినా కొడాలి నాని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై అనుచిత విమర్శలు చేసి వార్తల్లో నిలిచేవారు. ఆయన మాట్లాడే భాష ఎంత మాత్రం ఆమోదయోగ్యంగా లేకపోయినా.. దానినే వాడుతూ ఒక విధంగా నెగటివ్ పాపులారిటీ విపరీతంగా పొందారు. అదే సమయంలో ఆయన అనుచిత వ్యాఖ్యలను సీఎం జగన్ ఏ మాత్రం ఖండించకపోవడం, పైపెచ్చు ముసిముసి నవ్వులతో ప్రోత్సహించడంతో నాని ఇంకా రెచ్చిపోయేవారు. నవ్విన నాప చేనే పండుతుంది అన్నట్లుగా.. బూతుల మంత్రిగా జగన్ తొలి కేబినెట్ లో ఓ వెలుగు వెలిగిన కొడాలి నానికి చిత్రంగా మలి కేబినెట్ లో స్థానం లేకుండా పోయింది. పునర్వ్యవస్థీకరణలో నాని మంత్రి పదవి ఊడింది. ఆ సమయంలో ఆయన ఒకింత అసంతృప్తికి లోనయ్యారు. నోటికి తాళం వేసుకుని  ఓ పశువుల పాకలో పడుకున్న ఫొటోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి కూడా. సరే కొంత కాలం మౌన మునిలా మారిపోయిన కొడాలి నాని ఆ తరువాత మళ్లీ తన నోటికి పని చెప్పడం ప్రారంభించారు. అది వేరే సంగతి. మధ్యలో సంక్రాంతి సందర్భంగా గుడివాడలో కాసినో నిర్వహించారంటూ పెద్ద ఎత్తున విమర్శలూ ఎదుర్కొన్నారు. ఇవన్నీ పక్కన పెడితే కొడాలి నాని మరోసారి నోటికి తాళం వేసుకున్నట్లుగా కనిపిస్తోంది.  బీజేపీ ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై ఎక్కడికక్కడ చార్జిషీట్లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే గుడివాడలో బీజేపీ చార్జ్ షీట్ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ సునీల్ దియోధర్ నానిపై, నాని భాషపై, ఆయన కాసినో వ్యవహారంపై విమర్శలు గుప్పించారు. అటువంటి వ్యక్తిని అసెంబ్లీలోకే అడుగు పెట్టనీయకూడదని  అన్నారు. అంతే కాకుండా ఇటువంటి నేతలను తమ పార్టీ  అధికారంలోకి వస్తే జైల్లో పెట్టిస్తామన్నారు. సరే.. సునీల్ దియోధర్ విమర్శించినది అలాంటిలాంటి నేతను కాదు.. నోరు విప్పితే బూతులు, దుర్భాషలు వినా మరొకటి రాని కొడాలి నానిని. మరి నాని ఊరుకుంటారా? తన నోటికి పదును పెట్టారు. సునీల్ దియోదర్ ని పకోడీగాడు అంటూ వ్యాఖ్యానించారు. ఆయన లాంటి నాయకుల వల్లే కర్నాటకలో బీజేపీ ఓడిపోయిందన్నారు. దీంతో బీజేపీ మండి పడింది. సాధారణంగా నానిని విమర్శించడానికి కానీ, ఆయన విమర్శలకు స్పందించడానికి కానీ ఎవరూ పెద్దగా ఇష్టపడరు. బురదలో రాయి వేయడం ఎందుకని మిన్నకుంటారు. కానీ బీజేపీ అలా ఊరుకోలేదు. తీవ్రంగా స్పందించింది. సవాళ్లు విసిరింది. నాని వాచాలతకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చినట్లుగా ఎదురుదాడికి దిగింది. గుడివాడలో అభివృద్ధి, వైసీపీ పాలనపై బహిరంగ చర్చకు సవాల్ విసిరింది. ఇందుకు గన్నవరం బస్టాండ్ ను వేదికగా నిర్ణయించింది. మామూలుగా అయినే నాని ఇలాంటి సవాళ్లకు వెంటనే స్పందిస్తారు, సై అంటారు. కానీ బీజేపీ సవాల్ కు మాత్రం నాని నుంచి ఎటువంటి స్పందనా లేదు. నోటికి తాళం వేసుకున్నట్లు కూర్చున్నారు. వైసీపీ అధిష్ఠానం నోరు నొక్కేసిందో.. లేక బీజేపీతో శతృత్వం పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందని భయపడ్డారో కానీ నాని మౌనమునిగా మారిపోయారు. అయితే బీజేపీ మాత్రం నానిని వదలడం లేదు. సవాళ్ల మీద సవాళ్లు విసురుతోంది. నోరెత్తితే ఊరుకోమన్నట్లుగా హెచ్చరికలు జారీ చేస్తోంది. అయిన దానికీ కాని దానికీ బూతులతో విరుచుకుపడే నాని మౌనం వెనుక జగన్ హెచ్చరిక, మందలింపు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీకి కోపం వస్తే.. జగన్ పుట్టి మునుగుతుందన్న భయంతోనే వైసీపీ అధిష్ఠానం నాని నోటికి తాళం వేసిందంటున్నారు. 

కొనుగోలు చేసిన భూములకే దిక్కూ దివాణం లేదు

ఖమ్మం జర్నలిస్తులకు 23 ఎకరాల భూమిని  బిఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది. రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ చేసిన వినతికి ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రభుత్వం హడావిడిగా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయించారు.  పువ్వాడ అజయ్ మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. దాదాపు 15 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన 70 ఎకరాల భూములకు ఇంత వరకు మోక్షం రాలేదు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో నిజాంపేటలో 32 ఎకరాలు, పేట బషీరాబాద్ లో 38 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వ్యవసాయ భూములు అయిన నిజాంపేటలో అప్పటి ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధరకు 1100మంది జర్నలిస్ట్ లు చెల్లించారు. అదే పేట్ బషీర్ బాద్ స్థలాలను చదరపు అడుగుల లెక్కన ప్రభుత్వానికి  ఈ జర్నలిస్ట్ లు చెల్లించారు. కోర్టులో 15 ఏళ్ల పాటు కేసులు నడిచాయి. ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన ఇట్టి భూములను జవహార్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ తీర్పు చెప్పారు. 9 నెలల క్రితం ఈ తీర్పు వెలువడినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. ఏడేళ్ల క్రితం మధ్యంతర ఉత్తర్వుల్లో ఈ భూములను జవహార్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పాలని తీర్పు చెప్పింది. అయితే ఇట్టి భూములను డెవలప్ చేసుకోవచ్చని,  ఇళ్ల నిర్మాణాలను మాత్రమే చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ముఖ్యమంత్రి కెసీఆర్ మధ్యంతర ఉత్తర్వులపై స్పందిస్తూ హైదరాబాద్ లో భూములు కరువయ్యాయా బొచ్చెడు భూములు సుప్రీం తుది తీర్పు వచ్చాక హైదరాబాద్ జర్నలిస్ట్ లను చూసి ఈర్శ్య పడేలా పెద్ద జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. యూ ట్యూబ్ చానళ్లలో కెసీఆర్ ఇచ్చిన హామీలు ఇప్పటికీ  దొరుకుతాయి. ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుకు ఇంతవరకు దిక్కు, దివాణం లేదు. కాగా  టియుడబ్ల్యుజె ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద గురువారం చేపట్టిన మహాధర్నాలో వైఎస్ రాజశేఖరెడ్డి తనయ వైఎస్ షర్మిల పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వానికి కమిషన్లు అందకపోవడం వల్లే 70 ఎకరాలను జర్నలిస్ట్ లకు ఇవ్వడం లేదని ఆరోపించారు. వైఎస్ఆర్ ప్రభుత్వం కేటాయించిన ఈ భూములను కమిషన్ల కోసం బిఆర్ ఎస్ ప్రభుత్వం విక్రయించాలని చూస్తోందన్నారు. కొనుగోలు చేసిన జర్నలిస్ట్ లకు దక్కేలా తమ పార్టీ పోరాడుతుందని షర్మిల హామీ ఇచ్చారు. ఎన్నికలకు కూత వేటు దూరంలో ఉన్న నేపథ్యంలో జర్నలిస్ట్ లు పోరాటస్పూర్తితో ఉద్యమిస్తే ఈ 70 ఎకరాలను సాధించుకోవడం పెద్ద కష్టమేమి కాదని న్యాయనిపుణులు అంటున్నారు. ప్రశ్నించడం తమ హక్కు అని జర్నలిస్ట్ లు మరచిపోవడం వల్లే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తోంది. కోర్టు దిక్కారణ కేసు వేస్తే వీలయినంత త్వరగా భూములు వచ్చే అవకాశముందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఒకరు అన్నారు. సంప్రదింపులు, లాబీయింగ్ చేసి ఈ భూములను పొందడం సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  మెజారిటీ జర్నలిస్ట్ లు కోర్టు దిక్కారణ కేసు బిఆర్ఎస్ ప్రభుత్వంపై వేయడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. 

హైద్రాబాద్ లో పెరుగుతున్న ఊష్ణోగ్రతలు

హైదరాబాద్ ఊష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పాదరస ముల్లు పై పైకి ఎగబాకుతుంది. శుక్రవారం రోజు 42.6 డిగ్రీల సెల్సియస్  పెరిగినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లో ఖైరతాబాద్ అత్యంత ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ(టిఎస్డి పిఎస్) తెలియజేసిన వివరాల ప్రకారం ఖైరతాబాద్ తో పాటు ఇతర ఎనిమిది ప్రాంతాల్లో ఊష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. 40 డిగ్రీలకంటే ఎక్కువగా  సెల్సియస్ నమోదవుతున్నాయి.  ఖైరతాబాద్ (42.5) డిగ్రీల సెల్సియస్), చార్మినార్(41.1 డిగ్రీల సెల్సియస్), నాంపల్లి (40.7 డిగ్రీల సెల్సియస్), బండ్ల గూడ (40.3 డిగ్రీల సెల్సియస్) హిమాయత్ నగర్ (40.3 డిగ్రీల సెల్సియస్),  ముషీరాబాద్(40.3 డిగ్రీల సెల్సియస్), షేక్ పేట(40.2 డిగ్రీల సెల్సియస్)గా నమోదైంది. ఉష్ణోగ్రతలు ఒక్క హైదరాబాద్ లోనే కాదు తెలంగాణా జిల్లాల్లో ఊష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి.   శుక్రవారం నల్గొండ జిల్లా దామరచర్ల , కరీంనగర్ వీర్నవంక 45.4 డిగ్రీల సెల్సియస్ ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి.   హైదరాబాద్ లో ఎండలు మరింత ముదరనున్నాయని వాతావారణ శాఖ హెచ్చరిస్తోంది. మే  22 వరకు ఇదే పరిస్థితి. 38 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని అంచనా.  మిగతా జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. 

జనంలో టీడీపీ.. భయంలో వైసీపీ

ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికా ప్రతిపక్షాలు వచ్చే ఎన్నికల కోసం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే వాటి ఎన్నికల సన్నాహకాలలోనే ఏ పార్టీ ఎక్కడ ఉందన్నది తేటతెల్లమౌతోంది. తెలుగుదేశం జనంలో ఉంటే.. వైసీపీ నాలుగు గోడలకే పరిమితమైంది.   అధికారం కోసం ప్రజా క్షేత్రంలో జరిగే  ఎన్నికల సమయంలో  తెలుగుదేశం ప్రజలతో మమేకమై దూసుకుపోతుంటే.. వైసీపీ నాలుగు గోడల మధ్యే పరిమితమై.. నోటికి పరిచెప్పడంతో పరిపెట్టుకుంటోంది. అదే సమయంలో  ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.. ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి వెళ్లిపోయింది.  జగన్ నాలుగేళ్ల  పాలనలో  అధికార వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు, ఇదే ఖర్మ మన రాష్ట్రానికి తదితర కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి చాలా బలంగా తీసుకు వెళ్లారు.   రాష్ట్ర వ్యాప్తంగా  సూడిగాలి పర్యటనలు  చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం జాతీయ  ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  పాదయాత్ర  చేస్తూ ననిత్యం ప్రజల మధ్యే ఉంటూ.. జగన్ అధికార పీఠం ఎక్కిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో  అడుగంటిన అభివృద్ధి, సంక్షేమం గురించి సోదాహరణంగా  వివరిస్తూ ముందుకు దూసుకెళ్తన్నారు.  అలాగే ఆ పార్టీ శ్రేణులు సైతం పార్టీ అధినేత, అగ్రనేత అడుగు జాడల్లో నడుస్తున్నారు.  అయితే అందుకు భిన్నంగా అధికార పార్టీ మాత్రం ప్రజలకు ముఖం చాటేస్తోంది.  వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కానీ.. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ..  జనంలోకి వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నారు.  తాను కాకుండా ఎమ్మెల్యేలను మంత్రులను జనంలోకి పంపేందుకు జగన్  ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతలకు అడుగడుగునా ప్రజా నిరసన ఎదురైంది. దీంతో వారు జనంలోకి వెళ్లడానికి జంకుతున్నారు. దీంతో జగన్ తనకు మరో సారి పదవీ యాగం కోసం జనం సొమ్ముతో యాగాలు చేసుకుంటూ అధికారం కోసం జపం చేస్తున్నారు. ఇక పార్టీలో పెల్లుబుకుతున్న అసమ్మతి, అసంతృప్తి, అంతర్గత కుమ్ములాటలను నిలువరించేందుకు కూడా జగన్ ఇసుమంతైనా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. వివేకా హత్య కేసు పరిణామాలు జగన్ కు వరుసకు సోదరుడు, కడప ఎంపీ అయిన అవినాష్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే.. మొదట్లో ఆయనను కాపాడడానికి హస్తిన కేగి మరీ ప్రయత్నాలు చేసిన జగన్ ఇప్పుడు ఆ మరక తనకు అంటకుండా ఉంటే చాలన్నట్లుగా వ్యవహరిస్తూ మౌనం పాటిస్తూ తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు. పార్టీ క్యాడర్, నాయకులు, ఎమ్మెల్యేలూ, మంత్రులూ అందరినీ పక్కన పెట్టి కాపాడండి మహప్రభో అంటూ వాలంటీర్లను వేడుకుని వాళ్లే గట్టెక్కిస్తారన్న ఆశతో, గట్టెక్కిస్తారా అన్న ఆందోళనతో కాలం గడుపుతున్నారు. మొత్తంగా ఏపీ లో  ఎన్నికల సంవత్సరంలో వైసీపీ వైఫల్యాలపైనే జనంలో ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఆ చర్చను సజీవంగా ఉంచడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా సఫలీకృతం అవుతోంది. 

అవినాష్ తీరుతో మంట కలుస్తున్న వైసీపీ ప్రతిష్ట

వైఎస్ అవినాష్ రెడ్డి కర్నూలు ఆసుపత్రిలో కడుపునొప్పితో  చేరారు. తల్లి గుండెపోటుతో, కొడుకు కడుపు నొప్పితో ఒకే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అవినాష్   ఆస్పత్రిలో చేరాల్సినంత ఆనారోగ్యానికి గురయ్యారంటే ఎవరిదాకానో ఎందుకు ఆయన అనుచరులే నమ్మడం లేదు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం కర్నూలు ఆస్పత్రికి చేరే వరకూ ఆయన ఎంత  యాక్టివ్ గా ఎంత వ్యూహాత్మకంగా హైదరాబాద్ టు పులివెందుల బాట పట్టారో.. సీబీఐ బృందాలు అనుసరిస్తున్నాయని గమనించి పులివెందుల ఆస్పత్రి నుంచి తల్లిని డిశ్చార్జ్ చేయించి ఆమెను అంబులెన్స్ లో తన కాన్వాయ్ కి ఎదురు వచ్చేలా చేసి.. మార్గ మధ్యంలో తాను తల్లి ఉన్న అంబులెన్స్ లోకి మారి కర్నాలు వరకూ వచ్చారు. ఏపీ బోర్డర్ దాటి తెలంగాణలోకి వస్తే అరెస్టు ఖాయం అనుకున్నారో ఏమో కర్నూలులోనే ఆగిపోయి అక్కడి ఆస్పత్రిలో తల్లిని చేర్చారు. అక్కడి వరకూ ఓకే కానీ కడపు నొప్పంటూ తాను కూడా అదే ఆస్పత్రిలో చేరడంతో అరెస్టు నుంచి తప్పించుకోవడానికే అవినాష్ అలా చేశాడన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి అవినాష్ లో అరెస్టు భయం గత జనవరిలో సీబీఐ తనను విచారణకు పిలిచినప్పటి నుంచీ మొదలైంది. అప్పటి నుంచీ ఆయన అరెస్టును తప్పించుకోవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించారో , ప్రయత్నిస్తున్నారో అందరూ గమనిస్తూనే ఉన్నారు. నిజానికి సింపుల్ లాజిక్ ప్రకారం చూస్తే వివేకా హత్య కేసులో సీబీఐ అవినాష్ రెడ్డిని ఇప్పటికే ఆరుసార్లు విచారించింది. కోర్టులో ఆయన విచారణకు సహకరించడం లేదు కనుక అరెస్టు చేయకతప్పదని విస్పష్టంగా చెప్పింది. అంటే అవినాష్ అరెస్టు అనివార్యం అని అప్పుడే తేలిపోయింది. కోర్టులు కూడా అరెస్టును అడ్డుకుని సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోజాలమంటూ విస్పష్టంగా తేల్చేశాయి. అంటే అవినాష్ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, సీబీఐ విచారణకు డుమ్మా కొట్టేందుకు సాకులెన్ని చెప్పినా నేడు కాకపోతే రేపు ఆయన అరెస్టు ఖాయం. ఈ విషయంలో రాజకీయ వర్గాలలోనే కాదు, ఆయన అనుచరులలోనూ, వైసీపీ నాయకులలోనూ కూడా ఎలాంటి అనుమానాలూ లేవు. అయినా అవినాష్ ఎందుకు సీబీఐకి అందకుండా పరుగులు తీస్తున్నారన్నది అంతు బట్టడం లేదని పరిశీలకులు అంటున్నారు.  కాగా ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, అవినాష్ కు వరుసకు సోదరుడు అయిన జగన్ ఎందుకు అవినాష్ పిల్ల చేష్టలను అడ్డుకోవడం లేదని కూడా పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అవినాష్ తీరు వల్ల ఆయన ప్రతిష్టే కాకుండా వైసీపీ ప్రతిష్ట కూడా మంటగలుస్తోందని అంతర్గత చర్చలలో చెప్పుకుంటున్నారు. విపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ సీబీఐ, సీఐడీ నమోదు చేసిన కేసుల్లో అరెస్టై 16 నెలలు జైలులో ఉండి వచ్చారు. పార్టీ అధినేతే ధైర్యంగా కేసులను ఎదుర్కొని అరెస్టై వచ్చినప్పుడు ఎంపీ అవినాష్ అరెస్టుకు ఎందుకు భయపడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ తాను అరెస్టయితే ఇక బయటకు వచ్చేందుకు వీల్లేనంతగా ఇరుక్కుపోతానని భయపడుతున్నారా అని కూడా కడప, పులివెందుల వాసులలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదలా ఉంచితే.. వివేకా హత్య కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ చాలా చాలా ఉదారంగా వ్యవహరించిందనే చెప్పాలి. ఎక్యూజ్డ్ గా ఉన్న అవినాష్ లేవనెత్తిన అంశాలన్నిటినీ కూడా పరిగణనలోనికి తీసుకుని వాటినై సైతం దర్యాప్తు చేసింది. ఆయన ఆరోపించిన వారందరినీ పిలిపించుకుని విచారించింది. ఆ తరువాత కూడా సీబీఐ అవినాష్ వెంట పడుతోందంటే ఈ కేసులో అవినాష్ ప్రమేయానికి సంబంధించి తిరుగులేని సాక్ష్యాలేవో  సీబీఐ సేకరించిందనే భావించాల్సి వస్తోంది. సాధారణంగా ఏ దర్యాప్తు సంస్థ అయినా ఎక్యూజ్డ్ ఆరోపణలను పట్టించుకోదు. కానీ హై ప్రొఫైల్ కేసు కావడంతో వివేకా హత్య కేసులో సీబీఐ అన్ని అంశాలలోనూ ఆచితూచి వ్యవహరించింది. అవినాష్ కు  ఆయన కోరినన్ని అవకాశాలిచ్చింది. చివరి నిముషంలో విచారణకు డుమ్మా కొట్టి మరో  రోజు వస్తామని చెప్పినా అంగీకరించింది. విచారణకు హాజరై సీబీఐ కార్యాలయం ఎదుటే సీబీఐపై నిందలు మోపినా సహించింది. ఇక అవినాష్ కు అన్ని దారులూ మూసుకుపోయాయి అని తేలిపోయిన తరువాత కూడా ఆయన ఆడుతున్న దాగుడు మూతలు  ఆయననే కాకుండా పార్టీనీ, పార్టీ అధినేత జగన్ నూ అపహాస్యం చేసేవిధంగా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ ప్రక్రియకు  ఫుల్ స్టాప్ పెట్టి అవినాష్ సీబీఐ విచారణకు హాజరైతే పార్టీ ప్రతిష్ట మరింత దిగజారకుండా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

వాలంటీర్లను శరణుజొచ్చిన జగన్.. మరి వారేం చేస్తారో?

త్వమేవ శరణం నాస్తి అన్నట్లుగా జగన్ మరో సారి తనను అధికార పీఠం మీద కూర్చో పెట్టే బాధ్యత వలంటీర్ల భుజస్కంథాలపై పెట్టారు.  పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు చివరాఖరికి మంత్రులూ కూడా  కాదు.. వాలంటీర్లు మాత్రమే తనను కాపాడగలరని జగన్ భావించడమే కాదు.. ఆవిషయాన్ని బహిరంగంగా వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ఇంటింటికీ వెళ్లి చెప్పాలనీ, వీలైనన్ని ఎక్కువ సార్లు వెళ్లాలనీ వారిని బతిమలాడుకున్నారు. పార్టీని గట్టెక్కించే బాధ్యత తీసుకోవాలని దాదాపు బతిమలాడుకున్నంత పని చేశారు. పార్టీ క్యాడర్, నాయకులు చేయాల్సిన పనిని వాలంటీర్ల భుజస్కంథాల మీద పెట్టేశారు.  వాలంటీర్ల వ్యవస్థ సీఎం జగన్ బ్రెయిన్ చైల్డే అయినా.. వాలంటీర్లకు ప్రభుత్వం జీతాలిస్తోందన్న విషయాన్ని విస్మరించి వారిని పార్టీ పని చేయాలని కోరడం ఒకింత విస్మయం కలిగించేదే అయినా.. జగన్ పార్టీకి , ప్రభుత్వానికి మధ్య ఉన్న గీతను ఎప్పుడో చెరిపేశారు. లబ్ధి దారుల అక్కౌంట్లలో సొమ్ములు వేయడానికి అంటూ.. బటన్ నొక్కే కార్యాక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలను పార్టీ సభగా మార్చేసి విపక్షాలపై తన అక్కసు తీర్చుకోవడానికి ఉపయోగించుకోవడం తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వ వేతనం తీసుకుంటున్న వాలంటీర్లను పార్టీ గెలుపు కోసం పని చేయమంటూ బహిరంగ వేదికల మీద నుంచే పిలుపునిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి తమ ప్రభుత్వ మంచిని చెప్పమని వేడుకుంటున్నారు. ఇంత కాలం ఇదే పనిని గడపగడపకూ, మా నమ్మకం నువ్వే జగన్, ఇంటింటికీ స్టిక్కర్లు అంటించడం వంటి పనుల ద్వారా పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలూ  చేశారు. వారి వల్ల పని జరగడం అటుంచి జనం ఎక్కడికక్కడ వారిని నిలదీసి కడిగి, ఏకి పారేస్తుండటంతో.. ఇక జగన్ పూర్తిగా వాలంటీర్ల మీదే ఆధారపడ్డారు.   చెప్పిన పని చెప్పినట్లు చేస్తే వారిని లీడర్లను చేస్తానని ఆశపెడుతున్నారు.   తమకు ఇసుమంతైనా ప్రాధాన్యత లేకుండా సర్వం వాలంటీర్లదే ఆధిపత్యంగా మారిపోయిందన్న సొంత పార్టీ పార్టీ నేతల అసంతృప్తిని జగన్ ఇసుమంతైనా ఖాతరు చేయడం లేదంటే ఆయన వాలంటీర్లపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో, వారిపై ఎంతగా ఆధారపడ్డారో అవగతమౌతోంది. ఆ విషయాన్ని గ్రహించిన వాలంటీర్లు వాలంటీర్లకు వందనం కార్యక్రమం వేదికగానే వేతనాల విషయంలో తమ అసంతృప్తిని కుండబద్దలు కొట్టారు.   మామూలుగానే వినతులు, డిమాండ్లు పట్టించుకోని జగన్ వాలంటీర్ల వేతనాల డిమాండ్ ను కూడా అలాగే పెడచెవిన పెట్టారు. తనకు టీవీలూ, అనుకూల మీడియా లేదని బీద అరుపులు అరుస్తూ తన ఆస్తి వాలంటీర్లు మాత్రమేనని, వారే తన బలం, బలగం అని చెప్పుకున్నారు. మరో సారి తాను అధికారంలోకి రాకపోతే వాలంటీర్ల ఉద్యోగాలు ఉండవనీ, చంద్రబాబు ఊడగొడతారనీ కూడా ఓ హెచ్చరిక చేశారు. మొత్తంగా  వాలంటీర్లే తన గెలుపు సారథులుగా జగన్ నమ్ముతున్నారు. వాలంటీర్లకు ప్రజాధనంతో  వేతనాలిస్తూ.. వారందరినీ పార్టీ సంక్షేమ పథకాల ప్రచార వారధులుగా వాడుకుంటూ..  నవ్విపోదురు గాక..నాకేటి సిగ్గు..అనే చందంలా ఉన్న జగన్ తీరుపై రాజకీయ పండితులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విపరీత ధోరణికి ప్రజలే వచ్చే ఎన్నికలలో అడ్డుకట్ట వేస్తారని విశ్లేషిస్తున్నారు. 

ఢిల్లీ ఎల్జీ మళ్లీ కిరికిరి

అధికారుల బదిలీ, పోస్టింగులు సహా సేవా వ్యవహారాల్లో ఢిల్లీ ప్రభుత్వానికి గత వారం సుప్రీంకోర్టు కార్యనిర్వాహక అధికారం ఇచ్చింది. అయితే.. ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా.. ఢిల్లీ ప్రభుత్వం అధికారాలను తగ్గించాలనే కుట్ర జరుగుతోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆరోపిస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ తో కలసి కేంద్రం కుట్ర చేస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ సర్వీసెస్ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భరద్వాజ్ కూడా కేంద్రంపై ఆరోపణలు చేశారు. సేవల కార్యదర్శి ఆశిష్ మోరే బదిలీకి సంబంధించిన ఫైల్ ను క్లియర్ చేయడానికి.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో సమావేశానికి హాజరు కావాలని తన క్యాబినెట్ సహచరులందరినీ కోరారు. కోర్టు ఆదేశాలను లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకు పాటించడం లేదు. రెండు రోజులుగా సేవా కార్యదర్శి ఫైల్స్ పై ఎందుకు సంతకం చేయలేదు? వచ్చేవారం ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా.. సుప్రీంకోర్టు తీర్పును కేంద్రం తిప్పికొట్టబోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్డినెన్స్ కోసం ఎదురు చూస్తున్నారా, అందుకే ఫైలుపై సంతకం చేయలేదా అనే అనుమానం వ్యక్తం చేస్తూ  కేజీవాల్ ట్వీట్ చేశారు. సర్వీసెస్ సెక్రటరీని మార్చే ఫైల్ను తొక్కిపెట్టడం ద్వారా ఎల్బీ సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా కోర్టు తీర్పును అమలు చేయకుండా ఉండే కుట్ర జరుగుతోందన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా పదవి చేపట్టినప్పటి నుంచి.. వీకే సక్సేనా.. కేజ్రివాల్ ప్రభుత్వాన్ని ఏదో వంకతో ముప్పు తిప్పలు పెడుతున్నారు. పాలనాపరమైన అధికం ఇక నుంచి ఢిల్లీ సర్కార్ దే అని గత వారం దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినా.. లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రం ఆ ఆదేశాలను బేఖతారు చేస్తూ.. ఢిల్లీ ఆప్ సర్కార్ కుమళ్లీ ఊపిరి ఆడకుండా చేయడం ఏమిటి,  ఇది పూర్తిగా కేంద్రం డైరెక్షన్ లోనే జరుగుతోందని కేజ్రివాల్ ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ఢిల్లీ రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరో వైపు ఢిల్లీ మంత్రి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారనీ, బెదరిస్తున్నారనీ ఎల్జీ సక్సేనా కేజ్రీవాల్ కు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

అందరి దేవుడిపై ఎందుకీ వివాదం?

కొందరుంటారు.. సరుకుండదు కానీ, చరిత్ర పుటల్లో ఎక్కి పోవాలని తెగ ఉబలాట పడిపోతుంటారు. సెలబ్రిటీలుగా చెలామణి కావాలని, పత్రికల్లో, మీడియాలో కనిపించి పైకేగిరిపోవాలని తెగ సందడి చేస్తుంటారు. సెలబ్రిటీ స్టేటస్ కోసం చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. సినీ నటి కరాటే కళ్యాణి ఆ కోవకు చెందిన నటి అవునో కాదో కానీ, ఆమె నటిగాకంటే వివాదాల ద్వారానే నలుగురు నోళ్ళలో నానుతున్నారు. మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు అనేది మాత్రం నిజం. అయితే ఆమె ప్రస్తావించే లేదా ప్రశ్నించే అంశాలు అన్నీ అలాంటివేనా, సెలబ్రిటీ స్టేటస్ కోసమేనా అంటే, అవునని అనలేము కానీ, అమె రచ్చ చేసిన వివాదాలు చాలా వరకు అనవసర వివాదాలుగానే మిగిలి పోవడం మాత్రం నిజమని అంటారు.  సరే, కరాటే కల్యాణి గతాన్ని కాసేపు పక్కన పెట్టి ప్రస్తుతానికి వస్తే, రాముడు, కృష్ణుడి వంటి పౌరాణిక పాత్రలు పోషించి తెలుగువారి గుండెల్లో నిజంగా దేవుడిగా కొలువుండిపోయిన మహా నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను ఆమె  వివాదంగా మార్చారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడి శత జయంతి ఉత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇదే క్రమంలో ఖమ్మంలో 54 అడుగుల ఎత్తయిన ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించారు. మే 28న ఆయన శత జయంతి సందర్భంగా ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ ఈ విగ్రహం కృష్ణుడి రూపంలో ఉండటం పట్ల కల్యాణి  అభ్యంతరం వ్యక్త చేశారు. కృష్ణుడికి రూపం లేదా.. మానవ రూపంలో కొలవాలా? అని ప్రశ్నించారు. మీడియాలో రచ్చ చేశారు.   ఈ విషయంలో ‘విశ్వ హిందూ పరిషత్, ఇస్కాన్’తదితర హిందూ ధార్మిక సంస్థలు సంస్థలు కరాటే కళ్యాణికి మద్దతుగా నిలిచాయి. కాగా ఈ వివాదంపై విచారించిన హైకోర్టు తాజాగా స్టే విధించింది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ హైకోర్టులో 14 రిట్ పిటిషన్‌లు దాఖలయ్యాయి. శ్రీ కృష్ణ జేఏసీ, అదిభట్ల కళాపీఠం, భారతీయ యాదవ సంఘం పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు వారి వాదనలను విన్నది. పిటిషనర్ల వాదనలను విన్న హైకోర్టు విగ్రహ ఏర్పాటుపై స్టే విధించింది. అయితే కృష్ణుడి విగ్రహమైనా లేదంటే ఎన్టీఆర్ విగ్రహమైనా పెట్టుకోవచ్చని.. కానీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి వీల్లేదని హైకోర్టు పేర్కొంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. ఇది ఒక విధంగా సముచిత నిర్ణయమే అనిపించుకుంటుంది.  అందుకే, కరాటే కళ్యాణి ఎందు కోసం ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు అనే విషయం పక్కన పెడితే, కృష్ణ పరమాత్మ రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటును తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామో వివరిస్తూ కళ్యాణి చేసిన వాదన కొంత ఆలోచింప చేసే విధంగా ఉందని ఎన్టీఆర్ అభిమానులు కూడా కొంతవరకు అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా ..‘మానవ రూపంలో కృష్ణుడిని పెడితే రేపు రాజకీయ కారణాలతో  కృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్‌ పోస్టర్‌ను దగ్ధం చేస్తే ఎవరిని దగ్ధం చేశారని అనుకోవాలి. ఈ విగ్రహం 400 ఏళ్లు ఉంటుందని అంటున్నారు. యాభై, ఆరేళ్ల తర్వాత ఫ్యూచర్ జనరేషన్.. తననే కృష్ణుడు అనుకోరా? ఆయనే భగవద్గీత చెప్పారంటే ఎవరు జవాబుదారీ? అంటూ ప్రశ్నించారు.  నిజమే, విశ్వహిందూ పరిషత్, అంతర్జాతీయ ఇస్కాన్ సంస్థ వంటి పలు ధార్మిక సంస్థలు సైతం కృష్ణ భగవానుని మానవ రూపంలో చూపడం కొందరి మనోభావాలను అయినా హర్ట్ చేస్తుంది. ఎన్టీఆర్ కేవలం కృష్ణుడు, రాముడు పాత్రలే కాదు, రావణ బ్రహ్మ పాత్రను అంతకంటే అద్భుతంగా పోషించారు. దుర్యోధన, దుశ్శాసన పాత్రలూ పోషించారు. సాంఘిక చిత్రాల విషయానికి వస్తే ఇక చెప్పనే అక్కరలేదు. అన్నిటినీ మించి రాజకీయ రంగు పులుముకున్న ఈ వివాదానికి..ఇక్కడితో చుక్క పెట్టడమే ఉత్తమం, అనే అభిప్రాయం కూడా లేకపోలేదు. నిజానికి ఎన్టీఆర్ అందరి వాడు. సినిమా నటుడిగానే కాదు, రాజకీయ నాయకునిగానూ ఆంధ్రుల ఆరాధ్య దైవంగా గుర్తింపు పొందిన మహా మనిషి. మహోన్నతుడు. ఆయన అభిమానులకే కాదు, కోట్లాదిమంది తెలుగు వారికి ఆయనే  ఓ దేవుడు. ఆయన్ని మరో దేవుని రూపంలో నిలపడం అవసరమా? ముఖ్యంగా అన్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా అంతటి మహా నటుడు, మహా నేతను వివాదాల వేదిక ఎక్కించడం అవసరమా?  సరే .. ఆ విషయంతో ప్రత్యక్షంగా సంబంధం లేకున్నా ... దేవుని రూపానికి సంబంధించి గతంలోనూ   కొంత ఆసక్తికర చర్చ జరిగింది. దేవుని రూపం ఏది? హిందూ దేవీ దేవతలు ఏ రూపంలో ఉంటారు? కృష్ణుడి రూపం ఇది, రాముడి రూపంఇది.. విష్ణువు ఇలా ఉంటారు.. వెంకన్న స్వామి రూపం ఇది ..శివన్న చిత్రమిది ..పార్వతమ్మ .రూపం ఇది ..విఘ్నేశ్వరుని ఆకారమిది..  ఇదిగో ఇలా ఉంటారు దేవుళ్ళు అని ఎవరు చెప్పారు ..ఎవరు నిర్దారించారు.. అంటే ..చిత్రకారుడు రవివర్మ గుర్తుకొస్తారు. అవును..ఒకప్పుడు, (ఇప్పుడు కూడా)  మనదేశంలో క్యాలెండర్ లేని ఇల్లు ఉండదు. అన్ని రంగాల్లోనూ అనూహ్య మార్పులు వస్తున్నప్పటికీ ఈ క్యాలెండర్ కళకు ఆదరణ తగ్గలేదు. అందుకే నేటికీ. కొత్త ఆంగ్ల సంవత్సరం రాగానే ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ గోడలపై కొత్త క్యాలెండర్లు దర్శనమిస్తాయి. వారి వారి అభిరుచిని బట్టి ప్రకృతి చిత్రాలు, పక్షులు, దేవుళ్ళు – దేవతలు, సినీతారలు ఇలా ఎన్నో రకాల క్యాలెండర్లు గోడలపై అలంకరించుకుంటారు.  ఈ క్యాలెండర్ కళకు ఆద్యుడిగా భారతీయ చిత్రకళా రత్నం రాజా రవివర్మను చెప్పుకోవచ్చు.  ప్రజల మనసులోని భావాలు, ఆసక్తిని గమనించిన రవివర్మ క్యాలెండర్ పై దేవుళ్ళ బొమ్మలు వేస్తే ప్రజలు ఆదరిస్తారని గ్రహించి, 1892లో నాటి బొంబాయిలో లిథో గ్రఫీ ప్రెస్స్ ను జర్మనీ నిపుణుల సహకారంతో నెలకొల్పాడు.  ఆ ప్రెస్ లో ఆయన చిత్రించిన ప్రఖ్యాత శ్రీరామ పట్టాభిషేకం, లక్ష్మీ సరస్వతి, వినాయకుడు, దుర్గాదేవి తదితర చిత్రాలు వేల సంఖ్యలో ముద్రించి దేశం నలుమూలలా అమ్మకాల జరిపించాడు. అణా  కే ఒక వర్ణచిత్రం దొరికేది ఆ రోజుల్లో.ఆ విధంగా ఆయన చిత్రాలన్నీ ప్రజల పూజా మందిరాల్లో కొలువైనాయి. ఇప్పటికీ ఇళ్లలోనే కాదు దేవాలయలోనూ రవివర్మ చిత్రించిన చిత్రాలే శిల్పాలుగా పూజలందుకుంటున్నాయి, అయితే రవివర్మ అదృష్టం ఏమంటే ఆ రోజుల్లో కరాటే వుందో లేదో కానీ, కరాటే కల్యాణి వంటి కళాకారులు మాత్రం లేరు. అలాగే, ఇప్పటికీ వినాయక చవితి పందిళ్ళలో వినాయకుడిని మానవ రూపంలోనే కాదు,అనేక రూపాల్లో చివరకు కరోనా ఆకృతిలోను పూజించారు. భక్తీ ముఖ్యం కానీ దేవుని రూపం, ఆకారం కాదు కదా ..

హైదరాబాద్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి, శక పురుషుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు శనివారం (మే 30) హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరగనున్నాయి. అన్నగారి శత జయంతి వేడుకలకు హైదరాబాద్ కూకట్‌పల్లిలోని కైతలాపూర్ మైదానం వేదిక కానుంది. ఈ వేడుకలకు టాలీవుడ్ అగ్రహీరోలు జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, వెంకటేష్, ప్రభాస్, అల్లు అర్జున్, కల్యాణ్ రామ్, సుమన్, మురళీ మోహన్, జయప్రద, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాతలు జి. ఆదిశేషగిరిరావు, సి. అశ్వనీదత్‌ తదితరులు పాల్గొనున్నారు.  అలాగే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీపీఎం కార్యదర్శి సీతారామ్ ఏచూరి, దగ్గుబాటి పురందీశ్వరి తదితరులు హాజరుకానున్నారు. ఇక వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఈ సభకు తరలి రానున్నారు. ఇప్పటికే నిర్వహాణ కమిటీ పేరు పేరునా అందరినీ ఆహ్వానించింది. ఇక ఈ వేడుకలకు అటు నందమూరి ఫ్యామిలీ, ఇటు నారా ఫ్యామిలీ సైతం హాజరుకానుందని తెలుస్తోంది.  ఈ వేడుకల్లో ఎన్టీఆర్ సమగ్ర సినీ, రాజకీయ జీవితంపై ప్రత్యేకంగా రాసిన వ్యాసాల సంకలనం.. శక పురుషుడు ప్రత్యేక సావనీర్‌తోపాటు ఎన్టీఆర్ సమగ్ర జీవితానికి సంబంధించిన విశేషాలు, సినిమా పాటలు, సినిమాలు.. అలాగే ఆయన ఉపన్యాసాలతో కూడిన సమగ్ర సమాచారంతో రూపొందించిన జై ఎన్టీఆర్ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించనున్నారు.  ఎన్టీఆర్ శత జయంతి తొలి సభను విజయవాడ నగరంలో నిర్వహించారు. ఈ సభకు ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండో సభను హైదరాబాద్‌ మహానగరంలో నిర్వహిస్తున్నారు.  ఇక మే 28వ తేదీ కథనాయకుడు పస్ల్ మహానాయకుడి జయంతి. ఆ రోజుతో ఆ యుగ పురుషుడి శతజయంతి వేడుకలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో మే 27వ తేదీన రాజమహేంద్రవరంలో పసుపు పార్టీ పండుగ మహానాడు ప్రారంభం కానుంది. ఆ మరునాడు ఆ శక పురుషుడి శత జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించనుంది. అందుకు సంబంధించిన పనులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో మహానాడు నిర్వహాణ పనులు వాయువేగంగా సాగుతోన్నాయి. ఈ సభకు లక్షలాది మంది ఎన్టీఆర్ అభిమానులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విధేశాల నుంచి తరలిరానున్నారు. అందుకు తగ్గట్లుగా తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లను ఘనంగా చేస్తోంది.

అవినాష్ అరెస్ట్‌.. ఢిల్లీ నుంచి ఆదేశాలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ   అవినాష్ రెడ్డి అరెస్ట్‌కు ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందనీ, ఆ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న  అవినాష్ రెడ్డి.. గురువారం సీబీఐ విచారణకు డుమ్మా కొట్టారని.. ఆ క్రమంలో ఆయన తల్లికి గుండెపోటు వచ్చిందని.. పులివెందుల ఆసుపత్రిలో ఆమె చేరారంటూ.. సీబీఐకి ఆయన లేఖ పంపడం.. ఆ లేఖను సీబీఐ తోసిపుచ్చి.. అవినాష్ కోసం సీబీఐ పయనం కావడం చూస్తుంటే.. అవినాష్ రెడ్డి అరెస్ట్‌ పక్కా అని స్పష్టమవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అదీకాక  అవినాష్ రెడ్డి.. సీబీఐ విచారణకు హాజరైన తొలిసారి నుంచి అంటే 2023, జనవరి 28వ తేదీ నుంచి.. ఆయయను అరెస్టు భయం వెంటాడుతూనే ఉందని అంటున్నారు.  తొలిసారి సీబీఐ విచారణకు హాజరైన వైయస్ అవినాష్ రెడ్డి వెంట.. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు   శ్రీకాంత్ రెడ్డి, కె. శ్రీనివాసులతోపాటు భారీగా ఆయన  అనుచరగణం కూడా హైదరాబాద్‌ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తరలి  రావడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. మరోవైపు అదే రోజు... సీబీఐ విచారణకు హాజరయ్యే కొన్ని గంటల ముందు  అవినాష్ రెడ్డి.. లోటస్ పాండ్‌లోని  వైసీపీ మాజీ గౌరవ అధ్యక్షురాలు, సీఎం  జగన్ రెడ్డి  తల్లి   విజయమ్మతో  భేటీ అయ్యారు.  ఆమె ఆశీర్వాదం తీసుకొనేందుకు వెళ్లానని  అవినాష్ రెడ్డి పైకి చెబుతున్నప్పటికీ..ఈ వీరిద్దరి భేటీలో బలమైన చర్చ జరిగిందనే ఓ టాక్ సైతం ఉమ్మడి కడప జిల్లాలో నేటికి వాడి వేడిగా సాగుతోంది. అంతే కాదు సీబీఐ విచారణ విడతల వారీగా జరుగుతోండగా... తనను సీబీఐ అరెస్ట్ చేయకుండా.. ముందస్తు బెయిల్ కోసం వైయస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం పట్ల జిల్లా వాసులు నేటికీ విస్మయం వ్యక్తం  చేస్తున్నారు. ఇంకోవైపు వైయస్ వివేకా చనిపోతూ రాసిన లేఖగా చెప్పబడుతోన్నలేఖ విషయంలో తన ఆరోపణలను పట్టించుకోకుండా సీబీఐ విచారణ జరపడాన్ని అవినాష్ మీడియా ఎదుట చెప్పడం,  అలాగే   వివేకా.. రెండో వివాహం.. ఆయన రెండో భార్య కుమారుడికి రాజకీయ వారసత్వం అంటూ మీడియా ముందుకు వచ్చి.. మరణించిన వివేకా క్యారెక్టర్‌ను అసాసినేట్ చేసేలా మాట్లాడడం,  అదే విధంగా  అవినాష్ తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి సైతం  వివేకా పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలతో కోర్టులో పిటిషన్ వేయడం పట్ల కడప జిల్లాలో సందేహాలే కాకుండా ఆగ్రహం కూడా వ్యక్తమైందని చెబుతున్నారు. ఇక మే 16వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు పంపగా.. తనకు  పార్టీ కార్యక్రమాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో తనకు నాలుగు రోజుల గడువు కావాలని కోరడం పట్ల జిల్లా ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏపీ సీఎం జగన్ మరికొద్ది రోజుల్లో  నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు దేశ రాజదాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ క్రమంలో ఆయన ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని.. అందుకు సంబంధించిన వార్తలు ఇప్పటికే మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే నీతి ఆయోగ్ సమావేశానికి ప్రతీసారి.. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరవుతోన్న విషయం విధితమే. అలాంటింది ఈసారి ముఖ్యమంత్రి వైయస్ జగన్ .. హాజరుకానుండడం పట్ల... ఉమ్మడి కడప జిల్లా వాసులు అనుమానం   వ్యక్తం చేస్తున్నారు.   గతంలో   అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ ప్రచారం సాగుతోన్న వేళ.. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి.. ప్రధాని, హోం శాఖ మంత్రితో భేటీ కావడం... ఆ తర్వాత అవినాష్ రెడ్డి అరెస్ట్ ఆగిపోవడం.. వంటి ఘటనలు చోటు చేసుకొన్నాయని.. అలాంటి పరిణామాలు మళ్లీ వైయస్ జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత పునారవృతమ్యే అవకాశాలు లేక పోలేదనే ఓ చర్చ సైతం ఉమ్మడి కడప జిల్లాలో నడుస్తోంది. ఏదీ ఏమైనా.. ఒక తప్పును కప్పి పుచ్చుకునేందుకు వంద తప్పులు చేస్తున్నట్లుగా  అవినాష్ రెడ్డి వ్యవహారశైలి ఉందనే చర్చ సైతం వాడి వేడిగా కొన...సాగుతోంది. ఏది ఏమైనా నేడో రేపో లేకపోతే ఆ మరునాడో అవినాష్ అరెస్ట్ తధ్యమన్న భావన అయితే అందరిలో వ్యక్తమౌతోంది.

రెండు వేల రూపాయల నోటు రద్దు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్నదే జరిగింది. రెండు వేల రూపాయల నోట్ల చెలామణిని ఉపసంహరిస్తూ ఆర్బీఐ శుక్రవారం (మే 19)న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొంది. వాస్తవానికి డిమానిటైజేషన్ పేరిట వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేసిన సమయంలోనే ఆర్బీఐ అప్పట్లో కొత్తగా వినియోగంలోనికి తీసుకు వచ్చిన రెండు వేల రూపాయల నోట్ల చెలామణి ఎక్కువ కాలం కొనసాగదన్న వార్తలు వెలువడ్డాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు వంటి నాయకులు అప్పట్లోనే రెండు వేల రూపాయల నోట్ల ను చెలామణిలోకి తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పట్లో పెద్ద నోట్ల రద్దును హర్షిస్తూనే వెయ్యి రూపాయల కంటే పెద్ద నోటును తీసుకురావడం సరికాదని పేర్కొన్నారు.  అప్పటి నుంచీ రెండు వేల రూపాయల నోటు చెలామణిపై సందేహాలు వ్యక్తమౌతూనే ఉన్నాయి. వాటన్నిటికీ తాజా ఉత్తర్వులతో ఆర్బీఐ చెక్ పెట్టింది. వాస్తవానికి ఐదేళ్ల కిందటే అంటే 2018 నుంచే ఆర్బీఐ రెండు వేల రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేసింది. ఇప్పుడు వాటి చెలామణిని విత్ డ్రా చేసుకుంది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ రెండు వేల రూపాయల నోట్లను బ్యాంకులలో మార్చుకోవచ్చు. బ్యాంకులు రెండు వేల రూపాయల నోట్లను ఇవ్వవద్దనీ, అలాగే ఏటీఎమ్ లలో ఉంచొద్దనీ కూడా ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.  

కటకటాలా.. పరారీయా.. అవినాష్ కు మిగిలిన దారులివే!?

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి అరెస్టు నుంచి తప్పించుకోవడానికి దారులన్నీ మూసుకుపోయాయి. ఇక అరెస్టు తప్పించుకోవాలంటే ఆయనకు ఉన్న ఒకే ఒక్క దారి అజ్ణాతంలోకి వెళ్లడమే.   హైదరాబాద్ టు పులివెందుల, పులివెందుల టు హైదరాబాద్ భారీ కాన్వాయ్ తో ఆయన పెడుతున్న పరుగుతు చూస్తుంటే అవినాష్ ఆవినాష్ పరారీ ప్రణాళికల్లోనే ఉన్నారని అనిపిస్తోందంటూ పరిశీలకులు విశ్లేషణలు సైతం  భావిస్తున్నారు. అంతే కాదు మధ్యలో ఒక సారి తల్లిని హైదరాబాద్ కు తరలిస్తుంటే ఆయన బెంగళూరు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఎవరిని డైవర్ట్ చేయడానికి, ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ లీకులు ఇస్తున్నారో అర్ధం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు. తల్లి గుండెపోటుతో బాధపడుతుంటే.. మెరుగైన వైద్య చికిత్స అందించాలని నిజంగా భావిస్తే ఆమెను పులివెందుల నుంచి బెంగళూరు తరలించాలి. ఎందుకంటే పులివెందుల నుంచి హైదరాబాద్  418 కిలోమీటర్లు అయితే, అదే పులివెందుల నుంచి బెంగళూరు 211 కిలోమీటర్లు. కనీసమైన ఇంగిత జ్ణానం ఉన్నవారెవరైనా తీవ్ర అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలంటే పులివెందుల నుంచి హైదరాబాద్ కు అదీ రోడ్డు మార్గంలో తరలించరు. కచ్చితంగా బెంగళూరుకే తీసుకు వెడతారు. కానీ ఘనత వహించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం గుండెపోటుకు గురైన తన తల్లికి మెరుగైన వైద్యం కోసం అంబులెన్సులో రోడ్డు మార్గంలో పులివెందుల నుంచి హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు. ఆ అంబులెన్స్ వెంటే తాను కాన్వాయ్ లో హైదరాబాద్ కు వస్తున్నారు. ఆ కాన్వాయ్ ని తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులూ అనుసరిస్తున్నారు. ఉదయం నుంచీ ఒకదాని వెంట ఒకటిగా వేగంగా చోటు చేసుకుంటున్న సంఘటనలు క్రైం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించేవిగా ఉన్నాయి. అసలు తల్లిక అనారోగ్యం అంటూ ఆయన పులివెందులకు బయలు దేరిన క్షణం నుంచే ఆయనలోనూ ఆయన అనుచరులలోనూ అరెస్టు ఆందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అందుకే అవినాష్ పులివెందుల ప్రయాణాన్ని రిపోర్ట్ చేస్తున్న మీడియా ప్రతినిథులపై దాడి చేశారు. పులివెందుల మార్గ మధ్యంలో అవినాష్ కాన్వాయ్ ను అనుసరిస్తున్న సీబీఐ వాహనాలపై దాడికి సైతం సమాయత్తమయ్యారు.  సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలంటే స్థానిక పోలీసుల సహకారం అవసరం. ఏపీలో ఆ సహకారం అందదని వివేకా హత్య కేసు దర్యాప్తు ఏపీలో సాగుతున్న సమయంలోనే తేటతెల్లమైంది. కడపలో, పులివెందులలో సీబీఐ అధికారులకే రక్షణ లేని పరిస్థితి అప్పట్లో కళ్లకు కట్టినట్లు కనిపించింది. సీబీఐ వాహనాలపై దాడి, అధికారులకు బెదరింపులు, వారిపైనే ప్రైవేటు కేసులు ఇలా కేసు దర్యాప్తు అడుగు ముందుకు కదలకుండా నిలువరించిన పరిస్థితి. కేసు విచారణ ఏపీ నుంచి తెలంగాణకు మారిన తరువాతే స్పీడందుకుంది. సూత్రధారులు, పాత్ర ధారుల నిగ్గు తేల్చే దిశగా వేగంగా కదిలింది. దాంతో ఇక బెదరింపులకు అవకాశం లేదని గ్రహించిన  అవినాష్ అండ్ కో.. కేసు దర్యాప్తు వేగం తగ్గించేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అక్కడ తాత్కాలికంగానే ఊరట లభించింది. సిబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోజాలమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పడమే కాకుండా.. అవినాష్ అరెస్టుకు ప్రతిబంధకాలేమీ లేవని సీబీఐకి రూట్ క్లియర్ చేసింది.  దీంతో  దారులన్నీ మూసుకుపోయిన అవినాష్ ఇప్పుడు రోడ్ల మీద పరుగులు తీస్తున్నారు. ఆగితే అరెస్ట్ తప్పదన్న నిర్ణయానికి వచ్చారు. ఎంత ప్రయత్నించినా ఏం చేసినా ఆయనకు  సీబీఐ ఎదుట హాజరై అరెస్టు కావడం.. లేదా అజ్ణాతంలోకి వెళ్లి దాక్కోవడం అన్న రెండు దారులే మిగిలాయని అంటున్నారు. ఏపీలో అరెస్టు చేయడానికి అవసరమైన బందోబస్తు అక్కడి పోలీసుల నుంచి దక్కే అవకాశం లేకపోవడంతో ఆయనను హైదరాబాద్ చేరనిచ్చి అక్కడ సీబీఐ అరెస్టు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఒక వేళ అక్కడ కూడా సరైన భద్రతా చర్యలు లేవని భావిస్తే కేంద్ర బలగాలను రప్పించైనా అరెస్టు చేయాలన్న పట్టుదలతో సీబీఐ ఉందని, అందుకు సీబీఐ ప్రధాన కార్యాలయం నుంచి అవినాష్ ను అరెస్టు చేయాలన్న ఆదేశాలు రావడమే నిదర్శమని పరిశీలకులు చెబుతున్నారు. అవినీష్ గత నాలుగు నెలలుగా ఆడుతున్న దోబూచులాట కారణంగా దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ  సీబీఐ  తెలుగు రాష్ట్రాల ప్రజల ముందు ఒక జోకర్ గా నిలబడే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అవినాష్ ను ఎలాగైనా అరెస్టు చేసి తమ ప్రతిష్ట కాపాడుకోవాలని సీబీఐ భావిస్తోంది. 

ఎప్పుడు కుదిరితే అప్పుడొస్తారు.. ఎందుకింత రాద్ధాంతం.. సజ్జల

ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రి  సజ్జల మరో సారి బోధివృక్షం కింద కూర్చున్నారు.  అవినాష్ విషయంలో సీబీఐ, మీడియా, విపక్షాలు అనవసర  రాద్ధాంతం చేస్తున్నాయంటూ జనానికి జ్ణానబోధ చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జలకు అవినాష్ వ్యవహారంలో మాట్లాడాల్సిన అవసరం ఏమిటన్నది పక్కన పెడితే ఆయనేం మాట్లాడుతున్నారంటే.. అవినాష్ ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే మరో రోజు విచారణకు హాజరౌతారు? ఇప్పటికిప్పుడే విచారించాలన్న తొందర సీబీఐకి ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. మరి ఇదే జగన్ సర్కార్ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారంటూ సీనియర్ మోస్ట్ జర్నలిస్టు అంకబాబును రాత్రికి రాత్రి ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో  సజ్జల చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్క అంక బాబు అనే కాదు తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయనను అరెస్టు చేసి వందల కిలోమీటర్లు రోడ్డు మార్గంలో తీసుకు వచ్చిన సంఘటనపైనా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయినా వివేకా హత్య కేసు దర్యాప్తు విషయంలో  ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఆయన మాట్లాడటమేమిటి? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ తమ చెప్పుచేతలలో ఉండాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల వారు భావిస్తున్నారా అని సెటైర్లు వేస్తున్నారు. అవినాష్ తల్లి అనారోగ్యం కారణంగా విచారణ వాయిదా వేయాలని కోరాలంటే ముందు ఆయన సీబీఐ కార్యాలయానికి వెళ్లి తన తల్లి అనారోగ్యానికి సంబంధించి ఆధారాలు చూపి కోరితే వేరేలా ఉండేది. అందుకు భిన్నంగా ఆయన వ్యవహరించడంతో సీన్ సితారైందని అంటున్నారు. అవినాష్ ను అరెస్టు చేసి విచారించాలని సీబీఐ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆ దర్యాప్తు సంస్థ హైదరాబాద్ కార్యాలయానికి ఆదేశాలు వచ్చాయని అంటున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా అవినాష్ ను అరెస్టు చేయాలన్న పట్టుదలతో సీబీఐ ఉందని అంటున్నారు. అందుకే ఆయనను నీడలా వెంటాడుతోందని అంటున్నారు. అవినాష్ కాన్వాయ్ ను అనుసరిస్తున్న సీబీఐ వాహనాలను అడ్డుకునేందుకు అవినాష్ అనుచరులు ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో హింస రేగుతుందా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ సలహాదారు వచ్చి అవినాష్ కు ఎప్పుడు కుదిరితే అప్పుడు విచారణకు వస్తారు, దీనిపై ఎందుకు రాద్ధాంతం అంటూ మాట్లడడం చూస్తుంటే ఆయన ప్రభుత్వం తరఫున ఏం సందేశమిస్తున్నట్లు అని పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక క్రిమినల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి వత్తాసుగా ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థను నిలువరిస్తోందా అనిపించేలా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు.  సజ్జల మాటలు సీబీఐని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.   

తల్లి హైదరాబాద్ కు అవినాష్ బెంగళూరుకు? మర్మమేంటి?

చిన్నప్పుడు మీరు దొంగాపోలీస్ ఆట ఆడే ఉంటారు. ఒక వేళ ఆడకపోయి ఉంటే.. ఆ ఆట ఎలా ఉంటుందో తెలియకపోతే.. ప్రస్తుతం జరుగుతున్న కడప ఎంపీ అవినాష్.. సీబీఐ ఎపిసోడ్ గమనిస్తే సరిపోతుంది. సరిగ్గా దొంగా పోలీస్ ఆటలాగే అవినాష్ సీబీఐ ఎపిసోడ్ సాగుతోంది. నిరాటంకంగా గత నాలుగు నెలల నుంచీ ఈ ఆట సాగుతూనే ఉంది. తొలుత సీబీఐ అవినాష్ కు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని నోటీసులు ఇస్తే.. అవినాష్ కోర్టులను ఆశ్రయించి, విచారణకు డుమ్మా కొట్టి.. కొన్ని సార్లు హాజరై  ఇలా సీబీఐకి అందకుండా తిరిగారు. ఆ తరువాత కోర్టులు అవినాష్ ను అరెస్టు చేసుకుని విచారించవచ్చని తేల్చిసిన తరువాత సీబీఐ పరుగులు మొదలు పెట్టింది. ఆ పరుగులు అవినాష్ ను అరెస్టు చేయడానికి కాకుండా చేయకుండా ఉండేందుకా అనిపించేలా సాగాయి. సరే చివరాఖరికి శుక్రవారం (మే19)న సీబీఐ అవినాష్ కు విచారణకు రావాలని నోటీసులు జారీ చేస్తే ఇదిగో వస్తున్నానంటూ చివరి క్షణంలో తల్లి అనారోగ్యం అంటూ డుమ్మా కొట్టారు. ఇక అక్కడ నుంచి ఛేజ్ మొదలైంది. అవినాష్ తల్లి పులివెందుల ఆస్పత్రిలో ఉన్నారంటూ అక్కడికి బయలుదేరిన అవినాష్ ను సీబీఐ వెంటాడింది. రెండు కార్లలో అవినాష్ వాహనాన్ని వెంబడించింది. దారిలో అడుగడుగునా అవినాష్ అనుచరులు సీబీఐని నిలువరించేందుకు మోహరించారు. ఇదిలా ఉండగా పులివేందుల ఆస్పత్రిలో ఉన్న అవినాష్ తల్లిని మెరుగైన వైద్య చికిత్స కోసం అంటూ హైదరాబాద్ కు తరలిస్తుంటే తల్లితో పాటు అవినాష్ కూడా హైదరాబాద్ కు వస్తారని అంతా అనుకున్నారు. అయితే అందుకు భిన్నంగా ఆయన బెంగళూరు వెళ్లారంటూ వార్తలు వస్తున్నాయి. అనారోగ్యంతో ఉన్న తల్లి కోసం విచారణకు డుమ్మా కొట్టానని చెబుతున్న అవినాష్ తల్లితో పాటు హైదరాబాద్ కు రాకుండా బెంగళూరు ఎందుకు వెళుతున్నారన్నది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అరెస్టును తప్పించుకోవడానికి, సీబీఐ కళ్లు గప్పి అజ్ణాతంలోకి వెళ్లడానికి అవినాష్ ఎత్తులు వేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ దొంగా పోలీస్ క్రీడను పోలిన సీబీఐ, అవినాష్ క్రీడ చివరకు ఎలా ముగుస్తుందో? నని సర్వత్రా ఆసక్తిగా గమనిస్తున్నారు. 

ఇక అరెస్టే.. సీబీఐ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు?

అవినాష్ రెడ్డి ఏదో ఒక కారణం చూపి సీబీఐ విచారణకు డుమ్మా కొడుతుండడాన్ని సీబీఐ కేంద్ర కార్యాలయం సీరియస్ గా తీసుకుంది. అలాగే అవినాష్ అనుచరులు మీడియాపై దాడి చేయడాన్ని తేలికగా తీసుకోరాదనీ నిర్ణయించింది. తల్లి అనారోగ్యమంటూ ఒ లేఖ పంపి దానిపై స్పందన కోసం ఎదురు చూడకుండా అవినాష్ పులివెందులకు బయలుదేరి వెళ్లడంతో ఇక ఈ విషయాన్ని తేలికగా తీసుకోరాదని నిర్ణయించిన సీబీఐ ప్రధాన కార్యాలయం ఆయనను అదుపులోనికి తీసుకుని విచారించమని హైదరాబాద్ సీబీఐ కార్యాలయాన్ని ఆదేశించిందని తెలుస్తోంది. అందుకే సీబీఐ అధికారులు రెండు వాహనాలలో అవినాష్ ను ఛేజ్ చేస్తున్నారని అంటున్నారు. అదే విధంగా సీబీఐ తనను ఎటూ అరెస్టు చేస్తుందన్న నిర్ణయానికి వచ్చిన అవినాష్ అరెస్టును తప్పించుకునేందుకే తనకు గట్టి పట్టున్న పులివెందులలో తలదాచుకునేందుకు వెళుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఒక సారి అక్కడకు చేరుకుంటే అజ్ణాతంలోకి వెళ్లడం తేలిక అవుతుందన్నది ఆయన అభిప్రాయంగా చెబుతున్నారు. అందుకే తాడిపత్రి మీదుగా పులివెందుల రూటును ఎన్నుకున్నారనీ, దారిలో తన అనుచరుల ద్వారా సీబీఐని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశాలున్నాయనీ అంటున్నారు.