ఏపీలో అందరి నోటా ఇదే మాట..జగన్ కు నో సెకండ్ చాన్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైనాట్ 175 ధీమా సంగతి దేముడెరుగు కానీ.. రాష్ట్రం అంతటా మాత్రం ఒకే మాట వినిపిస్తోంది. నో సెకండ్ చాన్స్ టు జగన్ అన్నదే ఆ మాట.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సెకండ్ ఛాన్స్ కోసం, స్కెచ్ సిద్దం చేసుకుంటున్నారు. అది కూడా అలాగా ఇలాక్కాదు.. 175 కు 175 అనే మైండ్ గేమ్ తో దూసుకు పోతున్నారు. మరో సారి అధికారం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
అదే సమయంలో ప్రభుత్వ కా ర్యక్రమమా, పార్టీ కార్యక్రమమా అన్న తేడా కూడా తెలియని విధంగా అవకాశం ఉన్నా లేకున్నా కల్పించుకుని మరీ విపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒక వైపు అయితే మరో వైపు రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్దంగా లేమని జగన్ సభల నుంచే వాకౌట్లు చేయడం ద్వారా చెప్పకనే చెబుతున్నారు. పైగా తమ పార్టీకి మరో చాన్స్ అనుమానమేనని వైసీపీ నాయకులే అంతర్గత సంభాషణల్లో అంగీకరించేస్తున్నారు. జగన్ మైండ్ గేమ్ ఆడుతూ పోతే చివరకు బొక్కబోర్లా పాడడం ఖాయమని అంటున్నారు.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆశలన్నీ నవరత్నాల మీదనే ఉన్నాయి. అలాగే, సంక్షేమ పథకాల పేరిట ప్రజల ఖాతాల్లో . పైసలు వేస్తున్నాము కాబట్టి, ప్రజలు మళ్ళీ తమకే ఓటేస్తారని, తమనే గెలిపిస్తారని ఇప్పటికీ జగన్ పగటి కలలు కంటున్నారని అంటున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నగా ఉందని వైసీపీ నాయకులు చెబుతున్నారు.
ప్రజలు ఇచ్చిందేదో పుచ్చుకుంటున్నారు కానీ వారు సంతృప్తి చెందిన దాఖలాలు ఇసుమంతైనా లేవని వైసీపీ శ్రేణులు కూడా చెబుతున్నాయి. గడపగడపకూ మన ప్రభుత్వం, మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాల అట్టర్ ప్లాప్ నే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఆయా కార్యక్రమాలలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లి భంగపాటుకు గురైన వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, వైసీపీ జెండా మోసిన, మోస్తున్న కార్యకర్తలు కూడా కాడి వదిలేయడానికి సిద్ధమైపోతున్నారు. ప్రజల వద్దకు వెళ్లి వన్ మోర్ చాన్స్ అంటే జనం నో నో అంటున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. మాట తప్పను, మడమ తిప్పాను అంటే నిజమే అనుకుని, అయన వెంట నడిచిన జనాలే ఇప్పడు, జగన్ రెడ్డి మాట తప్పడం మడమ తిప్పడం మాత్రమే కాదు, ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారని అంటున్నారు.
రాష్ట్రంలో చిన్నా పెద్ద పనులు వేటికి టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ, ముందుకు రావడం లేదు. ఒకసారి కాదు, రెండు మూడుసార్లు, టెండర్ ప్రకటనలు ఇచ్చినా, పత్రికల ఆఫీసుల నుంచి అడ్వర్టైజ్మెంట్ బిల్లులు వస్తున్నాయే తప్ప టెండర్లు వేసేందుకు, కాంట్రాక్టర్లు మాత్రం ముందుకు రావడం లేదు. ప్రభుత్వం మీద కాంట్రాక్టర్లకు విశ్వాసం లేదనడానికి ఇదే నిదర్శనం అని పరిఇశీలకులు అంటున్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బకాయిలు, కొండలా పెరిగిపోతున్నాయి. అప్పులు, వడ్డీలు కట్టలేక, కాంట్రాక్టర్లు ఆందోళనలు చేయడమే కాదు, ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు జరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని వైసీపీ ఎమ్మెల్యేలే సొంత ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కాంట్రాక్టర్లు మాత్రమే కాదు, పార్టీ క్యాడర్ కు ఏదో మేలు చేసేందుకు అన్నట్లు నామినేషన్ పనులు కేటాయించినా క్షేత్ర స్థాయి నాయకులు, క్యాడర్ సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు రాక అప్పులు, వడ్డీలు కట్టలేక ఉన్న ఆస్తులు అమ్ముకున్న పార్టీ నాయకులు, నామినేషన్ పనులంటే వద్దు పొమ్మంటున్నారు.
జగన్ పై పార్టీ క్యాడర్, నేతలే విశ్వాసం కోల్పోయారనడానికి ఇదే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక వైసీపీ సర్పంచ్ లు కూడా, పదవులు వదిలి పెట్టి పారి పోతున్నారు. గ్రామాల్లో చేసిన అభివృద్ది పనులకు బిల్లులు రాకపోవడంతో అప్పులు పాలైన సర్పంచ్ లు మీరిచ్చిన పదవికో దండం, వైసీపీకి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి రెండు దండాలు అని చెప్పి, పొరుగు రాష్ట్రాలకు పోయి, కూలి పనులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు.
ఇవన్నీ ఒకెత్తు అయితే ప్రభుత్వ భూములు ప్లాట్స్ వేసి అమ్ముదామంటే కొనే నాధుడే కనిపించడం లేదంటే ప్రభుత్వం జనాలలో ఎంతగా నమ్మకం కోల్పోయిందో ఇట్లే అవగతమౌతుంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి డ్రీమ్ కాపిటల్ వైజాగ్ మహానగరంలో ప్రభుత్వ ప్లాట్లు కొనేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. వైజాగ్ నగరంలో జగన్ రెడ్డి ప్రభుత్వం, జగనన్నస్మార్ట్ టౌన్ షిప్ లో సుమారు 2000 ప్లాట్లను ఇటీవల వేలం ద్వారా అమ్మకానికి పెట్టింది. ఆయినా, స్పందన లేదు. చివరకు చేసేది లేక దరఖాస్తు గదువును రెండు సార్లు పొడిగించింది, పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయినా ఫలితం లేదు.నో రెస్పాన్స్.. ముఖ్యమత్రి తన గ్రాఫ్ బ్రహ్మాండంగా వుందని .. మురిసి పొతున్నారు.. ఆయన గ్రాఫ్ ఎంత బ్రహ్మాండగా వుందో, అయన మీద ప్రజల విశ్వసం ఎ స్థాయిలో వుందో జగనన్నస్మార్ట్ టౌన్ షిప్ ప్లాట్స్ కథే చెప్పేసిందని పార్టీ నేతలే చెప్పుకుంటున్న పరిస్థితి.
రెండు వేల ప్లాట్లకు కనీసం రెండు వందల మంది కూడా ఆన్లైన్లో అప్లయ్ చేయలేదు.చివరికి తొలి విడతగా కట్టాల్సిన సొమ్మును కట్టిన వారు కేవలం 70 మంది మాత్రమే. నిజానికి ప్రభుత్వం నేరుగా అమ్ముతోందంటే దానికో క్రేజ్ ఉంటుంది. భవిష్యత్లో ఎలాంటి సమస్యలు రావు. క్లియర్ టైటిల్ ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని ఎవరైనా భావిస్తారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్ట్ చేపడితే గంటల్లో బిజినెస్ క్లోజ్ అయింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఏం చేసినా కనీస స్పందన రావడం లేదు. నిజానికి, రేపో మాపో రాజదాని అయ్యే నగరంలో స్థలం అంటే, ప్రజలు క్యూ కట్టి ఎగరేసుకు పోతారు.. కానీ వైజాగ లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నగా వుంది.. అంటే.. జగన్ రెడ్డి మీద విశ్వాసం లేకపోవడమే కారణమని అంటున్నారు. జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రారు, వైజాగ్ ఎప్పటికీ రాజధాని కాదు అందుకే జనం జగన్ ను జనం నమ్మడం లేదని వైసీపీ నాయకులే అంటున్నారు.
ఇలా ఒకరని కాదు, అన్ని వర్గాల ప్రజలు, చివరకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందుతున్న సామాన్య జనం కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్దంగా లేరని అంటున్నారు. మీటలు నొక్కి నోట్లు వేశాం.. ఓట్లేందుకు వేయరు అంటూ జగన్ రెడ్డి తమను కట్ట బానిసల కంటే హీనంగా చూపుతున్నారని, పేదరికాన్ని పరిహాసం చేస్తున్నారని. అందుకే జగన్ రెడ్డికి సెకండ్ ఛాన్స్ ఇచ్చేదే లేదని అంటున్నారని వైసేపీ క్యాడర్ అంటున్నారు. అందుకే, జగన్ రెడ్డికి సెకండ్ ఛాన్స్ .. అంటే ఇచ్చేదే లే.. అనే సమాధానమే ఏపీ అంతటా వినిపిస్తోంది.