ఎస్‌ఈసీ ఆఫీసుకు ద్వివేది, గిరిజా శంకర్ పరుగులు ! ఆన్ లైన్ నామినేషన్లపై నిమ్మగడ్డకు వివరణ 

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో దూకుడుగా ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఏపీ సర్కార్ కు చుక్కలు చూపిస్తున్నారు. తమ ఆదేశాలను అమలు చేయని అధికారులపై కఠిన చర్యలకు దిగుతున్నారు. దీంతో ఇంతకాలం ప్రభుత్వం కనుసన్నల్లో నిమ్మగడ్డ ఆదేశాలను లైట్ తీసుకున్న అధికారుల గుండెళ్లో ఇప్పుడు రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా మరో ఏపీ సర్కార్ కు మరో షాకిచ్చారు ఎస్ఈసీ నిమ్మగడ్డ.  గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్‌ పత్రాలను ఆన్‌లైన్‌ ద్వారా ఎందుకు స్వీకరించలేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పంచాయతీరాజ్ ‌శాఖను నిలదీశారు. ఈ వ్యవహారంపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌ ఈరోజు ఉదయం హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు  ఎస్‌ఈసీ కార్యాలయానికి హడావిడిగా చేరుకున్నారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్లను ఆన్ లైన్ లో స్వీకరించే విషయంపై ఎస్ఈసి ని కలిసి వివరణ ఇవ్వనున్నారు. గత మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కొందరు అభ్యర్థుల నామినేషన్ల పత్రాలు చించివేయడం, అలాగే నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను అడ్డుకోవడం వంటి ఘటనలు జరగడంతో పలు రాజకీయ పార్టీలు ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్లను స్వీకరించాలని అప్పట్లో ఎస్‌ఈసీని అభ్యర్థించాయి. దీంతో ఇక నుండి ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించాలని పంచాయతీరాజ్‌శాఖను ఎస్‌ఈసీ ఆదేశించారు. అయినా పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశ నామినేషన్లను మాత్రం ఆన్ లైన్ ద్వారా కాకుండా వ్యక్తిగతంగానే స్వీకరించారు. అయితే ఈ ప్రక్రియలో కూడా పలు గ్రామాల్లో అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయనివ్వకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్న వ్యవహారం పై మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. మరోపక్క పలు పొలిటికల్ పార్టీలు గతంలోనే తాము ఆన్‌లైన్‌ నామినేషన్ల ప్రక్రియ పై చేసిన అభ్యర్ధన గురించి ఎస్‌ఈసీకి మరోసారి గుర్తుచేశాయి. దీంతో ఎన్నికల సంఘం స్పందించి.. ఉన్నతాధికారులు ద్వివేది, గిరిజా శంకర్‌కు నోటీసులిచ్చింది. 

ఆరోగ్య రంగానికి బడ్జెట్ లో పెద్ద పీట! కరోనా విపత్తు పాఠాలు నేర్పిందన్న నిర్మల 

అందరూ ఊహించినట్లే బడ్జెట్‌లో ఈసారి కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేసింది. కొవిడ్‌ మహమ్మారి నేర్పిన పాఠాలతో  ఈ రంగానికి  కేటాయింపులను గతంలో కన్నా భారీగా పెంచింది. ఆత్మనిర్బర్‌ ఆరోగ్య పథకానికి మొత్తం రూ.2,23,846 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో  తెలిపారు. నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య విధానంలో ఈ పథకం రూపొందించినట్టు వివరించారు. 9 బీఎస్‌ఎల్‌-3 స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. దేశంలోని అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్థరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దేశంలో కొత్తగా నాలుగు ప్రాంతీయ వైరల్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.  కరోనా మహమ్మారి తీసుకొచ్చిన విపత్తును  బడ్జెట్ ప్రసంగంలో  ప్రస్తావించారు కేంద్ర మంత్రి. ఇలాంటి విపత్కర పరిస్థితులు వస్తాయని ఎవరూ ఊహించలేదన్నారు. కరోనా వల్ల కలిగిన కష్టాల నుంచి అన్ని రంగాలను రక్షించేందుకు ఇప్పటికే రెండు మూడు మినీ బడ్జెట్లను అమలు చేశామని గుర్తు చేశారు కరోనా వ్యాక్సినేషన్ల గురించి కూడా ఆమె వ్యాఖ్యానించారు. ప్రజల సంక్షేమం కోసం ’ఆత్మ నిర్భర్ యోజన‘ ను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఇందు కోసం  61,180 కోట్ల రూపాయల నిధిని కేటాయిస్తున్నామని తెలిపారు. ఆరేళ్ల ఇంత మొత్తాన్ని ఈ పథకం కోసం ఖర్చు పెడతామన్నారు.  భారత్ లో ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లను ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అందిస్తున్నామన్నారు నిర్మలా సీతారామన్.  మరో రెండు వ్యాక్సిన్లు కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పారు. మన శాస్త్రవేత్తలు రూపొందించిన వ్యాక్సిన్లు కేవలం మన కోసమే కాకుండా దాదాపు వంద దేశాలకు సరఫరా చేస్తున్నామన్నారు నిర్మలా. ఇది అంతర్జాతియంగా భారత్ ఖ్యాతిని పెంచుతోందని తెలిపారు. మొదటిసారిగా పేపర్ లెస్ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు నిర్మలా సీతారామన్.  

రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు ! తొలిసారి రూ. 1.20 లక్షల కోట్ల మార్క్

కరోనాతో కుదైలేన దేశ ఆర్థిక రంగం మళ్లీ గాడిలో పడుతోంది. జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. లాక్ డౌన్ తరువాత జనవరిలో వస్తువు సేవల పన్ను జీఎస్టీ (గూడ్స్ సర్వీస్ టాక్స్) వసూల్ రికార్డ్ స్థాయిలో పెరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం గత డిసెంబర్ లో వసూలైన 1.15 లక్షల కోట్ల రికార్డును అధిగమించి,  జనవరిలో 1.19 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూల్ దాటింది. దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత తొలిసారిగా పన్ను వసూలు దాదాపు 1.20 లక్షల కోట్ల మార్క్ ను తాకిందని ఆర్థిక శాఖ ప్రకటించింది.    జనవరి 31, సాయంత్రం 6 గంటల వరకూ స్థూల జీఎస్టీ ఆదాయం రూ. 1,19,847 కోట్లు కాగా. ఇందులో సీజీఎస్టీ రూ. 21,923 కోట్లు కాగా, ఎస్జీఎస్టీ రూ. 29,014 కోట్లు. ఇదే సమయంలో ఐజీఎస్టీ రూ. 60,288 కోట్లుగా ఉందని, ఇతర పన్నుల రూపంలో రూ. 8,622 కోట్లు వసూలైందని కేంద్రం వెల్లడించింది.   కరోనా  మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ రికవరీ శ్రీహరి కోట రాకెట్ లా దూసుకుపోతుందని , అందుకు పెరిగిన  పన్ను వసూళ్లే  నిదర్శనమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.       కరోనా లాక్ డౌన్ సడలింపు తరువాత అక్టోబర్ లో  లక్ష కోట్లను తాకిన జీఎస్టీ వసూళ్లు, నవంబర్, డిసెంబర్ లతో పాటు జనవరిలోనూ అదే ఊపును కొనసాగించింది . దీంతో వరుసగా నాలుగు నెలల పాటు లక్ష కోట్లకు పైగా పన్ను వసూళ్లు జరిగినట్లయింది. 

కృష్ణా జిల్లాలో  వైసీపీకి ఊహించని షాక్!  ముఖ్య నేత ఇంట్లో కస్టమ్స్ తనిఖీలు

పంచాయతీ ఎన్నికల వేళ కృష్ణా జిల్లాలో  అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి  ఊహించని షాక్ తగిలింది. బడా వ్యాపారిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంట్లో కస్టమ్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. వీరులపాడు మండలం వైసీపీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నాల్లో ఉన్న పూల రాంబాబు నివాసంలో.. తెలంగాణ కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తుండటం కృష్ణా జిల్లాలో కలకలం రేపుతోంది.  కృష్ణాజిల్లా వీరులపాడు మండలం, జుజ్జూరు గ్రామానికి చెందిన పూల రాంబాబు ఇంట్లో తెల్లవారుజాము నుంచి తెలంగాణ కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులుండటంతో పాటు ట్సాక్స్ ఎగవేత ఆరోపణలపై దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పూల రాంబాబుకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో పలు పరిశ్రమలున్నట్లు తెలుస్తోంది. ఆ పరిశ్రమలకు సంబంధించిన పన్నులు, ఆదాయానికి సంబంధించిన అవకతవకలను గుర్తించినట్లు సమాచారం. పూల రాంబాబుపై ఎప్పటి నుంచో నిఘా ఉంచిన కస్టమ్స్ అధికారులు.., వారం రోజులుగా జుజ్జూరు గ్రామంలో రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. రాంబాబుకు వివిధ రూపాల్లో నెలకు రూ.7కోట్ల వరకు వడ్డీ వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని కంపెనీల్లో షేర్లతో పాటు సొంతగా మరికొన్ని పరిశ్రమలకు శంకుస్థాపన చేసినట్లు సమాచారం.  వీరులపాడు మండలంలో పూల రాంబాబు అధికార వైసీపీకి కీలకనేతగా ఉన్నారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున మండల వ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల ఏకగ్రీవాలు, ఎలక్షన్ ఫండ్స్ విషయంలో ఈయనే కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పూల రాంబాబు ఇంట్లో కోట్ల రూపాయల నగదు ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులు టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.

భార్య భర్తను చంపినా..  ఆమెకు ఫించన్ ఇచ్చి తీరాల్సిందే..  హైకోర్టు సంచలన తీర్పు   

సాక్షాత్తు కట్టుకున్న భర్తను హత్య చేసినా.. లేక భర్త మరణానంతరం ఆమె రెండో వివాహం చేసుకున్నా.. ఆ భార్య ఫ్యామిలీ పెన్షన్‌కు అర్హురాలే అవుతుంది అని పంజాబ్‌, హరియాణా హైకోర్టు ఒక సంచలన తీర్పు చెప్పింది. హర్యానాలోని అంబాలా తర్సెమ్‌ సింగ్‌, బల్జీత్‌ కౌర్‌ దంపతులు సొంత ఊరు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన తర్సెమ్‌ సింగ్‌ 2008లో మృతిచెందారు. అయితే ఆయనను భార్య బల్జీత్ కౌర్ చంపారంటూ 2009లో ఆమెపై కేసు నమోదైంది. అంతేకాకుండా 2011లో కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. మరోపక్క భర్త మృతిచెందినప్పటి నుండి 2011 వరకు బల్జీత్‌ కౌర్‌ ఫ్యామిలీ పెన్షన్‌ను పొందారు. అయితే భర్తను హత్యచేసిందని కోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం వెంటనే ఆమెకు ఇస్తున్న పెన్షన్‌ను నిలిపివేసింది. దీంతో ఈ వ్యవహారంపై ఆమె పంజాబ్‌, హరియాణా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును జనవరి 25న విచారించిన ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. "భర్తను హత్యచేసిందనే కారణంతో ఫ్యామిలీ పెన్షన్‌కు భార్యను దూరం చేయరాదు. ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పుడు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా సాయం చేసేందుకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకమే ఫ్యామిలీ పెన్షన్‌. అందువల్ల భార్య క్రిమినల్‌ కేసులో దోషిగా తేలినా సరే ఫ్యామిలీ పెన్షన్‌కు ఆమె అర్హురాలే అవుతుంది" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాకుండా బల్జీత్ కౌర్ ‌కు ఫ్యామిలీ పెన్షన్‌ను నిలిపివేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వును కోర్టు కొట్టివేసింది. ఆమెకు 2011 నుండి రావాల్సిన బకాయిలను రెండు నెలల్లోగా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. భర్త మరణానంతరం ఫ్యామిలీ ఫించన్ కు భార్యే హక్కుదారంటూ 1972 నాటి ఫించన్ చట్టం ప్రకారం కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

ఏపీకి స్పెషల్ స్టేటస్ వచ్చేసింది! జగన్ రెడ్డికి ఛీర్స్ చెప్పాల్సిందే 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుకున్నది సాధించారు.. అవునండి బాబూ ఏపీకి ఆయన స్పెషల్ స్టేటస్ తెచ్చేశారు. గత ఏడేండ్లుగా ఏపీలో స్పెషల్ స్టేటస్ నినాదం మార్మోగుతుండగా.. నేనున్నాంటూ  ఆ స్పెషల్ స్టేటస్ ను ఆంధ్రాకు వచ్చేలా చేశారు జగన్ రెడ్డి. ఏపీకి స్పెషల్ స్టేటస్ వచ్చేలా చేసిన సీఎం జగన్ రెడ్డి.. ఇప్పుడు ఆంధ్రా జనమంతా ఛీర్స్ కొడుతున్నారు.   స్పెషల్ స్టేటస్ అనేది ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి. విభజనతో కుదైలేన ఏపీ నిలదొక్కుకోవాలంటే ఇదే ప్రధానమని సగటు అంధ్రుడి మాట. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఈ నినాదం వినిపిస్తూనే ఉంది.  ఏపీ రాజకీయాలన్ని కూడా స్పెషల్ స్టేటస్ చుట్టే తిరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ వైసీపీ ఉద్యమాలు చేసింది. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీని టార్గెట్ చేస్తూ ప్రకటనలు చేసింది. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో ప్రత్యేక హోదా నినాదాన్ని టీడీపీ ఎక్కువగా వినిపిస్తోంది. స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కేంద్రంతో పోరాడటం లేదని వైసీపీని విమర్శిస్తోంది.  అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు ఆ స్పెషల్ స్టేటస్ వచ్చేసింది. అవును మీరు విన్నది నిజమే. ఏపీకి స్పెషల్ స్టేటస్ లిక్కర్ బ్రాండ్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్ స్టేటస్  పేరుతో లిక్కర్ బాటిల్ విక్రయాలు జరుపుతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. Special Status పేరు ఉన్న క్వార్టర్ బాటిల్‌ ప్రస్తుతం అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌గా మారింది. ఈ క్వార్టర్ బాటిల్ విస్కీ ధర రూ.180 అని ఉంది. దానిపై తెలుగులో ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మద్యం సేవించి వాహనం నడపరాదు.’ అని రాసి ఉంది.  ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ శాఖ అధికారులు ఇస్తున్న సమాచారం ప్రకారం ఉత్తరాంధ్రలో స్పెషల్ స్టేటస్ బ్రాండ్ ను విక్రయిస్తున్నట్లు తెలిసింది.ఈ స్పెషల్ స్టేటస్ లిక్కర్ బాటిల్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. జగన్ ప్రభుత్వంపై కామెడీ చేస్తున్నారు నెటిజన్లు. జగన్ మోహన్ రెడ్డి ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానంటే ఏంటో అనుకున్నాం కానీ, ఇలా తీసుకొస్తారని అనుకోలేదంటూ కొందరు టీడీపీ అనుకూల నెటిజన్లు, సోషల్ మీడియా జనం ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫొటోను వాడుకుని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. ఏపీకి స్టెటస్ స్టేటస్ తీసుకొచ్చిన జగన్ రెడ్డికి ఛీర్స్ అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. గతంలో కూడా ఏపీలో ఇలాంటి ఘటన జరిగింది. ప్రెసిడెంట్ మెడల్ పేరుతో లిక్కర్ బాటిల్‌ను తీసుకొచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవడంతో వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు ఆబ్కారీ శాఖ ప్రకటించింది.  తమను గెలిపిస్తే  కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.  తాజాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఏపీకి స్పెషల్ స్టేటస్ అంశాన్ని ప్రస్తావించినట్టు చెప్పారు. ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఆయన స్పెషల్ స్టేటస్ అంశాన్ని లేవనెత్తిన తర్వాత రోజే స్పెషల్ స్టేటస్ పేరుతో లిక్కర్ బాటిల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీ నేతలు చెప్పినట్లు స్పెషల్ స్టేటస్ తెచ్చారంటూ టీడీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

గుండు కాదు మోడీ గుండెల మీద గుద్దుదాం! ఆర్మూర్ లో గర్జించిన రేవంత్ రెడ్డి 

సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ ఒడిలో కూర్చుని రైతులను దగా చేస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పసుపు బోర్డు పెడతానన్న బోడ గుండోడు ఏడికి పోయిండని ఎంపీ అర్వింద్‌ను ఉద్దేశించి ఎద్దేవాచేశారు.  నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పసుపు రైతులకు మద్దతుగా చేపట్టిన రాజీవ్ రైతు భరోసా దీక్లలో  రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ ను కడిగిపారేశారు. ఢిల్లీలో రైతుల చస్తున్నా.. పట్టించుకోకుండా రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకోవడానికి సిగ్గులేదని విమర్శించారు. పసుపు రైతులు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కాలని  రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.    ‘‘నీ పేరులోనే ధర్మం ఉంది కానీ చేసేదంతా అధర్మమే. అర్వింద్‌ను గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తానన్న బీజేపీ నేత రాంమాధవ్ హామీ ఏమైంది?. అర్వింద్ బాల్య వితంతువుగా మారుతావా?. రైతులతో ఇలాగే వ్యవహరిస్తే నీ రాజకీయ భవిష్యత్తును బొంద పెడతారని రేవంత్ రెడ్డి చెప్పారు. ‘‘ధర్మపురి నువ్వు గుండు కొట్టించుకన్నా పర్వాలేదు. ఎంపీ పదవికి రాజీనామా చేయకున్నా పర్వాలేదు. కానీ.. 20 నెలలైనా పసుపు బోర్డు ఎందుకు తేలేదో చెప్పాలి. పార్లమెంట్‌లో రైతుల పక్షాన ఎందుకు కొట్లాడటం లేదు.’’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పైనా విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. బండి సంజయ్.. తొండి సంజయ్ లా మారి అన్ని అబద్దాలే చెబుతున్నారని విమర్శించారు. బండి సంజయ్‌కు నిజామాబాద్ రైతుల గోస కనిపించడం లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మద్దతు ధర ఇస్తున్నందుకే నష్టం వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం సరికాదన్నారు రేవంత్ . తెలంగాణ వచ్చాక 6358 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు..రైతు బతికుండగా సాయం చేయని కేసీఆర్ చచ్చాక 6 లక్షలు ఇస్తాడట.. ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉంటారా అని ఆయన ప్రశ్నించారు.ఆర్మూర్ ఎమ్మెల్యే ఎత్తిపోతల్లో ముందుంటారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.   

ఏపీ మంత్రులు, సలహాదారులు ప్రభుత్వ వాహనాలు వాడడంపై ఎస్ఈసీ ఆంక్షలు.. 

ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య లేఖల యుద్ధం తార స్థాయికి చేరింది. తాజాగా అయన ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కి మరో లేఖ రాస్తూ.. మంత్రులు, సలహాదారులు ప్రభుత్వ వాహనాలు వినియోగంపై అయన ఆంక్షలు విధించారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం దీనిని మరో వివాదాస్పదమైన లేఖగా భావిస్తున్నాయి.   ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల సందర్భంగా.. ప్రవర్తనా నియమావళికి సంబంధించిన ఈ ఆదేశాలను పూర్తిగా అమలు చేయాలని అయన సీఎస్‌కు సూచించారు. రాష్ట్ర మంత్రులు, సలహాదారులు, ప్రభుత్వోద్యోగులు, ఎమ్మెల్యేలు కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి కిందకి వస్తారని నిమ్మగడ్డ తాజాగా రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల పర్యటనల్లో ఉద్యోగులు పాల్గొనరాదని నిమ్మగడ్డ సూచించారు.   మరోపక్క పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కుల ధృవీకరణ పత్రాలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా పంచాయతీ ఎన్నికల్లో పాత కుల ధృవీకరణ పత్రాలను అనుమతించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కొత్త ధృవీకరణ పత్రాలు కావాలని ఎవరిని ఒత్తిడి చేయకూడదని ఆ ఆదేశాలలో తెలిపింది. కొత్త సర్టిఫికెట్లు సమర్పించేందుకు నిర్ణీత సమయం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఎన్నికలలో పోటీ చేసే వారికి ఫాస్ట్ ట్రాక్ విధానంలో కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఎస్ఈసీ ప్రభుత్వానికి సూచించింది. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులు తమ బకాయిల చెల్లింపునకు వస్తే వెంటనే తీసుకోవాలని కూడా ఆదేశించింది.

ర్యాలీ తర్వాత వంద మంది రైతులు మిస్! పోలీసులు తీసుకెళ్లారనే అనుమానాలు

గణ తంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం కావడం కలకలం రేపింది. ర్యాలీలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయనే ఆరోపణలు వచ్చాయి. దేశ ప్రతిష్టకు భంగం కల్గిందనే ఆందోళన జనాల నుంచి వ్యక్తమవుతోంది. కేంద్ర సర్కార్ తీరుపైనా పలువురు మండిపడుతున్నారు.  ఈ నేపథ్యంలో  ఢిల్లీ అల్లర్లకు సంబంధించి మరో విషయం వెలుగులోనికి వచ్చింది. ట్రాక్టర్ ర్యాలీ తర్వాత వంద మంది రైతులు కనిపించకుండా పోయారని ఓ పంజాబ్ ఎన్జీఓ సంస్థ ఆరోపించింది. ఈ వంద మందీ పంజాబ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందినవారని ‘పంజాబ్ మానవ హక్కుల వేదిక’ తెలిపింది.  12 మంది పంజాబ్‌లో ‘టాటారివాలా’ ప్రాంతానికి చెందిన వారూ ఉన్నారని ఆ సంస్థ వెల్లడించింది.   హింసతో సంబంధమున్న 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. దీంతో మిస్సైన వంద మంది రైతులు ఎక్కడున్నారన్నది మిస్టరీగా మారింది. పోలీసులు తీసుకెళ్లి ఉంటారనే పంజాబ్ రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.   రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసపై ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ నిపుణుల బృందం  చారిత్రక కట్టడం ఎర్రకోటను సందర్శించింది. ఎర్రకోట వద్ద విధ్వంసానికి దిగడాన్నిదేశ వ్యతిరేక చర్యగా ఢిల్లీ పోలీసులు అభివర్ణించారు.  ట్రాక్టర్‌ ర్యాలీలో చోటుచేసుకున్న హింసపై ఏమైనా ఆధారాలుంటే తమతో షేర్ చేసుకోవాలని ప్రజలను కోరారు. ట్రాక్టర్ ర్యాలీకోసం నిర్దేశించిన మార్గాల్లో కాకుండా వేలాది మంది ఆందోళనకారులు వేరే మార్గాల ద్వారా ఎర్రకోటలోకి చొరబడేందుకు ప్రయత్నించడంతో పోలీసులు, రైతుల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల జరిగిన దాడుల్లో 50 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. కొందరు వ్యక్తులు ఏకంగా ఎర్రకొట్టలోకి ప్రవేశించి జెండా ఎగురవేశారు.  దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిరసనకారులపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు.  

పదవీకాలం పొడిగింపు కోసం నిమ్మగడ్డ వ్యూహం?

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల రచ్చ ఒకవైపు కొనసాగుతుండగానే.. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలంపై చర్చ మొదలైంది. రాష్ట్రంలో అన్ని రకాల లోకల్ పోల్స్‌ని పూర్తి చేసే దాకా పదవిలో వుండేందుకు.. కనీసం రెండు నెలల పాటు తన పదవీ కాలాన్ని పొడిగించుకునేలా నిమ్మగడ్డ ప్రయత్నాలు షురూ చేసినట్లు తెలుస్తోంది.   ఈ ఏడాది మార్చితో ఎస్ఈసీగా నిమ్మగడ్డ పదవీకాలం ముగియబోతోంది. అయితే, పదవీకాలం పొడిగింపు కోసం నిమ్మగడ్డ వరుసగా ఎన్నికలు నిర్వహించేందుకు వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. ఫిబ్రవరి 21వ తేదీతో పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి. వెంటనే 22న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడానికి నిమ్మగడ్డ రెడీ అయినట్లు సమాచారం. అది ముగిసేలోగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక వాటి కొనసాగింపు కోసం తనకు అవకాశం ఇవ్వాలని నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించే అవకాశముంది అంటున్నారు.   పదవీకాలం పొడిగింపు కోసం నిమ్మగడ్డ మరో కొత్త అంశాన్ని కూడా తెరపైకి తెస్తున్నారు అంటున్నారు. గతంలో వైసీపీ సర్కారు చర్యల కారణంగా తాను రెండు నెలల పదవీకాలం కోల్పోయానని, ఆ పదవీకాలాన్ని తిరిగి ఇప్పించాలని కోరుతూ నిమ్మగడ్డ గవర్నర్‌ ను ఆశ్రయించే అవకాశముందని తెలుస్తోంది. 2016 ఏప్రిల్‌ ఒకటో తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరించారు. నిబంధనల ప్రకారం ఆయన ఈ ఏడాదిమార్చి 31న రిటైర్‌ అవ్వాల్సి వుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మధ్యలోనే ఆయన్ను తొలగించి కనకరాజ్‌ ను ఎస్‌ఈసీగా నియమించింది. కనగరాజ్‌ రెండు నెలల పాటు పదవిలో ఉన్నారు. ఆ తర్వాత న్యాయస్థానాల జోక్యంతో నిమ్మగడ్డ తిరిగి ఎస్‌ఈసీగా నియమితులయ్యారు. దీంతో తాను కోల్పోయిన ఆ రెండు నెలల పదవీకాలాన్ని తిరిగి ఇప్పించాలని నిమ్మగడ్డ కోరబోతున్నారని సమాచారం. అయితే జగన్ సర్కార్ మాత్రం మార్చి 31 తర్వాత ఒక్కరోజు కూడా నిమ్మగడ్డను పదవిలో కొనసాగకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయనుందని తెలుస్తోంది. 

భూమా అఖిలప్రియ సోదరుడుకి షాకిచ్చిన కోర్టు

హైదరాబాద్ బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డికి సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది. జగత్ విఖ్యాత్ రెడ్డి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులో ఇంకొంత మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని.. ఈ నేపథ్యంలో జగత్ విఖ్యాత్ రెడ్డికి బెయిల్ ఇస్తే ఆయన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసుల తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదలను విన్న కోర్టు.. ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు కొట్టేసింది. సెషన్స్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా అక్కడా నిరాశే ఎదురైంది. ప్రస్తుతం భార్గవ్ రామ్ పరారీలో ఉన్నాడు.    కాగా, హఫీజ్ పేటలో ఉన్న భూమికి సంబంధించి వివాదంలో ప్రవీణ్ రావును, ఆయన సోదరులను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అఖిలప్రియను ఏ1గా, సుబ్బారెడ్డిని ఏ2గా, భార్గవ్ రామ్ ను ఏ3గా పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఈ కేసులో అరెస్టైన అఖిలప్రియ ఇటీవలే షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు.

నిమ్మగడ్డపై మంత్రుల సభా హక్కుల నోటీస్ 

ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు కొనసాగుతున్నాయి. శనివారం రెండవ రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. పంచాయతీ పోరులో గెలుపు కోసం పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే పార్టీల మధ్య  సమరం  కంటే ఏపీ సర్కార్, ఎస్ఈసీ మధ్య పోరాటమే ఇప్పుడు హీటెక్కిస్తోంది.  ఎన్నికల ప్రక్రియ మొదలైనా.. వార్ ఇంకా ముదురుతోంది. తాజాగా ఎన్నికల కమిషనర్‌పై ఏపీ ప్రభుత్వం సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ శాసన సభ స్పీకర్‌ కార్యాలయంలో నోటీసులు ఇచ్చారు. ఎన్నికల కమిషనర్ తన పరిధి దాటి తమపై వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు. ఆయన వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉందంటూ నోటీసుల్లో ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్ఈసీ  నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి  పార్లమెంట్‌లో సభా హక్కుల నోటీసు ఇచ్చే అవకాశం ఉందని ఆ చర్చ జరుగుతోంది. మరోవైపు పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. శనివారం సీఎం జగన్ సొంత గడ్డ కడప జిల్లాలో పర్యటించారు. కలెక్టరేట్ లో ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు. పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అసాధారణ ఏకగ్రీవాల ప్రక్రియ సరికాదన్నారు నిమ్మగడ్డ. ఇలాంటి ప్రక్రియపై  దృష్టి పెడతాయని,  బెదిరింపులకు పాల్పడే వారిపై షాడో టీమ్‌లతో నిఘా ఉంటుందని హెచ్చరించారు. వైఎస్సార్ హయాంలో 2006లో 36 శాతమే ఏకగ్రీవమయ్యాయని చెప్పారు నిమ్మగడ్డ. అందరికీ సమాన న్యాయం కల్పించాలన్నదే లక్ష్యమన్నారు. ఏ పరిస్థితుల్లోనూ భయపడే ప్రసక్తేలేదని తాను స్పష్టం చేశానని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సరైన సమయంలో ఎన్నికలను నిర్వహించడమనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని స్పష్టం చేశారు.  

అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ! రహస్యంగా పోలీసుల విచారణ 

అధికార పార్టీ  ఎమ్మెల్యే నివాసంలో భారీ చోరీ జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉండే ప్రాంతంలో ఈ చోరీ జరగడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడిన దుండగులు..  లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు డబ్బును ఎత్తుకెళ్లారు. ఎమ్మెల్యే బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు రహాస్యంగా దర్యాప్తు చేస్తున్నారు.  హైదరాబాద్‌ హైదర్‌గూడలోని ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో  ఈ చోరీ జరిగింది. ఇటీవలే కొత్తగా నిర్మించిన ఈ క్వార్టర్ట్స్ లో  మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు 305 ఫ్లాట్‌ కేటాయించారు. అయితే ఆ ఫ్లాట్‌లో ఎమ్మెల్యే బంధువు అమర్‌నాథ్ బాబు కుటుంబం  నివసిస్తోంది. శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లాట్‌లో దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లోకి వెళ్లిన దొంగలు 14.6 తులాల బంగారం, రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లారు.  పోలీసులు పదుల సంఖ్యలో ఉండే క్వార్టర్ట్స్‌లో చోరీ కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమర్‌నాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వేసిన తాళాలు వేసినట్లు ఉండడం, లోపలికి ఎవరూ రాకపోవడంతో ఇంటిదొంగ పనే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  గతంలో తమ డ్రైవర్ ఇంట్లో కూడా దొంగతనం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు అమర్ నాథ్. ప్రస్తుతం డ్రైవర్ ఫోన్ స్విచ్ఛాఫ్ ఉండడంతో పోలీసులు అతనిపై అనుమానిస్తున్నారు.  అయితే ఈ విషయంపై ఆబిడ్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, నారాయణగూడ సీఐ రమేశ్‌కుమార్ వివరాలు వెల్లడించడం లేదు. 

పంచాయతీ ఎన్నికల వేళ షాక్ ! టీడీపీకి సీనియర్ నేత  గుడ్ బై

పంచాయతీ ఎన్నికల వేళ ఉత్తరాంధ్రలో టీడీపీకి షాక్ తగిలింది.  సీనియర్ నేత, మాజీ మంత్రి పడాల అరుణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.  రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఆమె పంపించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పడాల అరుణ పనిచేశారు. దశాబ్దాలుగా విజయనగరం జిల్లా టీడీపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు పడాల అరుణ.  పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి అరుణ రాజీనామా చేయడంతో .. విజయనగరం జిల్లాలో టీడీపీకి కష్టాలు పెరుగుతాయని చెబుతున్నారు.  గత ఆదివారం విజయనగరంలో మీడియాతో మాట్లాడిన పడాల అరుణ టీడీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 33 ఏళ్లుగా టీడీపీలో పనిచేసినా, పావుగా వాడుకున్నారే తప్ప.. సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం,  జిల్లా పార్టీ పెద్దలు తనకు కనీసం ప్రాధాన్యత ఇవ్వడలం లేదని మాజీ మంత్రి కంటతడి పెట్టారు.  గౌరవం లేని చోట ఉండటం కష్టమని అరుణ వాపోయారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన తన పట్ల పార్టీ ఇలా వ్యవహరిస్తుందని ఊహించలేదన్నారు. ఇలాంటి పరిస్థితులే టీడీపీలో కొనసాగడంపై పునరాలోచనలో పడేసిందని చెప్పారు పడాల అరుణ. టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి పడాల అరుణ బీజేపీలో చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఏపీ బీజేపీ ముఖ్య నేతలు ఆమెతో సంప్రదింపులు చేసినట్లు చెబుతున్నారు. సోము వీర్రాజు కూడా పడాలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లాకు చెందిన టీడీపీ నేత గద్దె బాబూరావు ఇటీవల బీజేపీలో చేరారు. దీంతో పడాల అరుణ కమలం గూటికి చేరడం ఖాయమంటున్నారు. 

దివంగత నేత వైఎస్ ను మెచ్చుకుంటూ.. సీఎం జగన్ కు చురకలంటించిన ఎస్ఈసీ 

ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా సీఎం సొంత జిల్లా అయిన కడప పర్యటనలో ఉన్న ఆయన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. తాను వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశాన‌ని, ఆయ‌న‌లో లౌకిక దృక్ప‌థం ఉండేద‌ని చెప్పారు. తాను ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నానంటే దానికి దివంగత వైఎస్సే కారణమన్న నిమ్మగడ్డ.. నిజాలను నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ వైఎస్ అప్పట్లో అధికారులకు ఇచ్చారన్నారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల వైఎస్‌కు ఎంతో గౌరవం ఉండేదని అయన ఈ సందర్భంగా అన్నారు. రాజ్యాంగం ప్రకారమే తాము ఎన్నికలు నిర్వహిస్తున్నామని.. ఏకగ్రీవాల కోసం ఒత్తిడి చేసేవారిని ఇంటికే పరిమితం చేస్తామని అయన స్పష్టం చేసారు. బలవంతంగా ఏకగ్రీవాలు చేయడం సమర్థనీయం కాదని.. వెనుకబడిన వారిని ప్రోత్సహించడమే సమన్యాయమన్నారు. బెదిరింపులకు పాల్పడే వారిపై షాడో టీమ్స్ ఏర్పాటు చేయనున్నట్టు అయన తెలిపారు.   అంతేకాకుండా కొంతకాలంగా కొంతమంది వ్య‌వ‌స్థ‌ల‌ను గౌర‌వించ‌కుండా మావాళ్లు, మీవాళ్లు అంటూ వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, ఆ తీరు స‌రికాద‌ని అయన అన్నారు. అయితే ఎటువంటి ప‌రిస్థితుల్లోనూ తానూ భ‌య‌పడే ప్ర‌స‌క్తేలేద‌ని ఇప్పటికే స్ప‌ష్టం చేశాన‌ని అయన అన్నారు. అసలు మీడియాను మించిన నిఘా మ‌రొక‌టి ఉండ‌బోద‌ని, స‌మాజ హితం కోసం చురుకైన బాధ్య‌త‌ను మీడియా తీసుకోవ‌డం నిజంగా అభినంద‌నీయ‌మ‌ని ఆయన చెప్పారు. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా పర్యటనలో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ.. ఒక వైపు వైఎస్ ను పొగుడుతూ.. మ‌రోవైపు సీఎం జ‌గ‌న్ తీరును ప‌రోక్షంగా త‌ప్పుప‌ట్ట‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోపక్క ఎస్ఈసీ క‌డ‌ప‌లో చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

చీ ఛీ.. ఇదేం పాడు పని! అడ్డంగా బుక్కైన ఎమ్మెల్సీ

రాజకీయ నేతలు దిగజారిపోతున్నారు. ఏం చేస్తున్నామనే స్పృహ కూడా లేకుండా ప్రవర్తిస్తూ అడ్డంగా బుక్కవుతున్నారు. తమ పరువు తీసుకోవడంతో పాటు చట్ట సభల గౌరవానికి భంగం కల్గిస్తున్నారు. ఇలాంటి ఘటనే కర్ణాటక విధాన పరిషత్‌లో వెలుగుచూసింది.  విధాన పరిషత్ సమావేశంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తన ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా దొరికిపోయారు. శుక్రవారం విధాన పరిషత్ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాశ్ రాథోడ్ పాల్గొన్నారు. అయితే ఆయన సమావేశాలను పట్టించుకోకుండా సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూడడంలో మునిగిపోయారు. ఓ టీవీ చానల్ కెమెరా దానిని చిత్రీకరించడంతో ఆ ఎమ్మెల్సీ బాగోతం  వెలుగు చూసింది. విషయం బయటకు రావడంతో దుమారం రేగింది. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.  అశ్లీల దృశ్యాలను చూస్తున్న ఎమ్మెల్సీ వీడియో మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో తనకేం తెలియదంటూ బుకాయించారు ఆ ఎమ్మెల్సీ. తాను స్మార్ట్‌ఫోన్‌ను సభకు తీసుకెళ్లనని, తన ఫోన్ మెమొరీ ఫుల్ అయిందని, అందువల్ల తన ఫోన్‌లో ఉన్న కొంత పనికిరాని సమాచారాన్ని తొలగించానని చెప్పారు. క్వచ్ఛన్ అవర్‌లో చర్చించేందుకు అవసరమైన సమాచారం కోసం ఫోన్‌ను చూశానని, చాలా సందేశాలు, వీడియోలు ఉండటంతో వాటిని తొలగించానని తెలిపారు. మీడియాలో ఏం చూపించారో తనకు తెలియదని ఎమ్మెల్సీ రాథోడ్ సమాధానమిచ్చారు.  చట్టసభల్లో ఇలా అభ్యంతరకర వీడియోలు చూస్తూ సభ్యులు దొరికిపోవడం ఇదే మొదటిసారి కాదు. 2012లో ముగ్గురు బీజేపీ మంత్రులు  లక్ష్మణ సావాడి, సీసీపాటిల్, కృష్ణ పాలేమర్ ఇలానే అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోయారు. స్థానిక మీడియా ఆ వీడియోలను విస్తృతంగా ప్రచారం చేయడంతో సదరు మంత్రులు తమ పదవులకూ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో  కర్ణాటక  బీజేపీకి ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఘటన తర్వాత అసెంబ్లీలోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడాన్ని నిషేధించారు.చట్ట సభలను దేవాలయాలుగా భావించాల్సిన పదవిలో ఉండి నీచ పనులు చేస్తున్న ప్రజా ప్రతినిధుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.   

13 రోజుల్లో 30 లక్షల టీకాలు! కోవిడ్ వ్యాక్సినేషన్ లో భారత్ టాప్ 

కోవిడ్ వ్యాక్సినేషన్ లో భారత్ దూసుకుపోతోంది.  వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను పక్కాగా, వేగంగా నిర్వహిస్తూ రికార్డులు స్పష్టిస్తోంది.  అమెరికా, బ్రిటన్ సహా చాలా దేశాలు మన కంటే ముందుగానే  టీకాల పంపిణి ప్రారంభించాయి. అయితే వాటన్నింటి రికార్డులను బ్రేక్ చేస్తూ... ఇండియా సరికొత్త రికార్డు నెలకొల్పింది.  కేవలం  13 రోజుల్లో... 30 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చిన దేశంగా రికార్డు సృష్టించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. 30 లక్షల వ్యాక్సినేషన్ మార్క్ చేరుకోవడానికి అమెరికాకు 18 రోజులు పట్టగా... ఇజ్రాయెల్‌కు 33 రోజులు పట్టింది. బ్రిటన్‌కు 36 రోజులు పట్టింది.   భారత్ లో వేగంగా వ్యాక్సినేషన్ జరగడానికి ప్రధాన కారణం ర్యాపిడ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉండటమే. మన దేశంలో మొదటి నుంచి రకరకాల వ్యాధులకు టీకాలు వేసే అలవాటు ఉంది.  గ్రామస్థాయి నుంచి పైస్థాయి వరకూ ఇలాంటి సదుపాయాలు బాగా ఉన్నాయి. ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేయడంలో ట్రైనింగ్ ఉంటుంది. అందుకే  కరోనా వైరస్‌కి  వ్యాక్సిన్లు రాగానే... అంతా రెడీ అయిపోయారు. వేగంగా టీకాలు వేసేస్తున్నారు. రోజూ సగటున 5 లక్షల మందికి టీకాలు వేస్తున్నారు. జనవరి 16న ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు రోజుకు 2 లక్షలే వేయగలిగారు. ఇప్పటికే ఇండియా వేగంగా 10 లక్షల వ్యాక్సిన్లు, వేగంగా 20 లక్షల వ్యాక్సిన్ల రికార్డులను సొంతం చేసుకుంది.   కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను పక్కాగా, వేగంగా నిర్వహిస్తున్నాయి.  అందుకే అన్ని రాష్ట్రాల్లోనూ ఇది సమర్థవంతంగా సాగుతోంది. జనవరి 29 వరకే  2 లక్షల 86 వేల 89 మందికి టీకా వేసి కర్ణాటక రాష్ట్రం దేశంలో ముందు ఉంది. , మహారాష్ట్ర (2,20,587), రాజస్థాన్ (2,57,833), ఉత్తరప్రదేశ్ (2,94,959) సహా కొన్ని రాష్ట్రాల్లో 2 లక్షల మందికి పైగా టీకా పొందారు. ఫిబ్రవరి నుంచి హెల్త్ వర్కర్లతోపాటూ... ఫ్రంట్ లైన్ వర్కర్లకు కూడా వ్యాక్సిన్ వేయబోతున్నారు. ఇందుకు అన్ని రాష్ట్రాలూ రెడీ అవుతున్నాయి. దీంతో దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ మరింత వేగం కానుంది. 

ఏపీలో ఏకమైన వైసీపీ, టీడీపీ ! పంచాయతీ పోరులో వైచిత్రి 

పంచాయతీ సమరంతో  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. తొలి దశ ఎన్నికలకు నామినేషన్లు కొనసాగుతుండటంతో పల్లెల్లో  కోలాహలం కనిపిస్తోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీతో పాటు బీజేపీ-జనసేన కూటమి పంచాయతీ ఎన్నికల కోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య  సై అంటై సై అనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏకగ్రీవాల విషయంలోనూ ఆ రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అనూహ్యాంగా వైసీపీ, టీడీపీ నేతలు ఏకమవుతున్నారు. పదవులను పంచుకుంటూ రాజీ చేసుకుంటున్నారు. పరస్పర అంగీకారాలతో వైసీపీ, టీడీపీ నేతలు పదవులను ఏకగ్రీవాలు చేసుకుంటున్నారు.  తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని మిర్తిపాడు పంచాయతీలో రెండు పార్టీల మధ్య రాజీ కుదిరింది. సర్పంచ్ పదవిని టీడీపీకి ఏకగ్రీవంగా ఇవ్వడానికి వైసీపీ అంగీకరించింది.  దీనికి బదులుగా వచ్చే మండల పరిషత్ ఎన్నికల్లో మిర్తిపాడు ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీకి ఇచ్చేందుకు టీడీపీ ఓకే చెప్పింది. దీంతో సర్పంచ్ పదవిని టీడీపీ తరపున బరిలో నిలిచిన బండారు సత్యవతికి ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీటీసీగా నాకిరెడ్డి దేవుడమ్మను ఏకగ్రీవం చేసినట్లు సమాచారం. రెండు పార్టీల ముఖ్య నేతలు కత్తులు దూస్తుండగా.. గ్రామాల్లో మాత్రం స్థానిక నేతలు కలిసిపోతుండటం ఆసక్తిగా మారింది. అయితే టీడీపీ, వైసీపీ  రాజీ కుదుర్చుకోగా.. జనసేన పార్టీ మాత్రం అక్కడ పోటీకి సై అంటోంది. దీంతో మిర్తిపాడులో టీడీపీ, వైసీపీ రాజీ కొనసాగుతుందా లేదా అన్నది అనుమానంగానే ఉంది.   పంచాయతీ ఎన్నికలకు తొలి రోజు 3 వేల 515 నామినేషన్లు దాఖలయ్యాయి. 1,315 సర్పంచ్, 2,200 వార్డు స్థానాలకు నామినేషన్లు వేశారు. సర్పంచ్ స్థానాలకు తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 248 నామినేషన్లు దాఖలు కాగా, నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 27 నామినేషన్లు దాఖలయ్యాయి. కడప జిల్లాలో రెండు, నెల్లూరులో రెండు మండలాల్లో సర్పంచ్ స్థానాలకు ఎవరూ నామినేషన్లు వేయలేదు.  నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతలు దాడిచేసి అడ్డుకుంటున్నారని గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని రాంబొట్ల పాలేనికి చెందిన కొందరు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అదే గ్రామానికి చెందిన అక్కల నాగమణి అనే మహిళ గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీకి స్థానిక పోలీసులపై ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యదర్శి తనకు నామినేషన్ పత్రాలు ఇవ్వలేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు తిరిగి తనపైనే తప్పుడు కేసు పెట్టారని ఎస్పీ ఎదుట ఆమె వాపోయారు.

ఎస్‌ఈసీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ లో ప్రతివాదిగా సీఎస్.. 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం నిత్యం కోర్టులలో నలుగుతూ ఉన్న సంగతి తెలిసిందే. స్థానిక ఎన్నికల వ్యవహారంలో ఎస్‌ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలంటూ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, అప్పటి సీఎస్‌ నీలం సాహ్ని పై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ గత నవంబరు 3న కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసారు. శుక్రవారం ఈ పిటిషన్ పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ విచారణ జరిపారు. ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ఎస్‌ఈసీకి సహకారం అందించాలంటూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ప్రస్తుతం అమలు జరగడం లేదని.. ఈ నేపథ్యంలో తాజాగా బాధ్యతలు చేపట్టిన సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ను ఈ పిటిషన్ లో ప్రతివాదిగా చేర్చేందుకు అనుమతివ్వాలని కోరారు. దీంతో హైకోర్టు కొత్త సీఎస్‌ ‌ను ప్రతివాదిగా చేర్చేందుకు అంగీకరించింది. కాగా ఈ పిటిషన్ ఫై వాదనలు విన్న హైకోర్టు, దీనిపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.