కండరాల నొప్పి, జ్వరం, తలనొప్పా! కోవిడ్ టీకా పని చేస్తున్నట్టే?
posted on Feb 2, 2021 @ 11:56AM
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతోంది. కొన్ని దేశాలు వేగంగా తమ ప్రజలకు టీకా పంపిణి చేస్తున్నాయి. అయితే కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతుండగానే.. ఆ వ్యాక్సిన్ సమర్ధతపై అనుమానాలు వస్తూనే ఉన్నాయి. కోవిడ్ టీకా తీసుకున్న వారిలో కొందరికి సైడ్ ఎఫెక్టులు రావడం మరింత ఇబ్బందిగా మారింది. కొంతమంది టీకా తీసుకున్న తరువాత చనిపోయారని వార్తలు వచ్చినా.. వారి మరణానికి టీకాకు సంబంధం లేదని వైద్య ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. కోవిడ్ టీకాపై వస్తున్న వివిధ వార్తలతో గందరగోళ పడుతున్న కొందరు.. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. కోవిడ్ టీకాపై భిన్నాభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలో యూఎస్ సీడీసీ చీఫ్ డాక్టర్ ఆంటోనీ ఫౌసీ కీలక ప్రకటన చేశారు.
టీకా తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్ లు వస్తేనే టీకా సమర్ధవంతంగా పనిచేసినట్టుగా భావించవచ్చని ఆంటోనీ ఫౌసీ చెప్పారు. ఏవైనా ప్రభావాలు కనిపిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అన్ని రకాల సైడ్ ఎఫెక్ట్ లూ ప్రాణాంతకమేమీ కాదని, అది వ్యాక్సిన్ శరీరంలో పని చేస్తోందనడానికి సంకేతమని ఆయన స్పష్టం చేశారు. ఏ వ్యాధికి టీకాను తీసుకున్నా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్ లు సర్వసాధారణమని చెప్పిన డాక్టర్ ఆంటోనీ ఫౌసీ.. ఇవి ఎలాంటివైనా రెండు నుంచి మూడు రోజుల్లోనే నయమయిపోతాయని వివరించారు.
కరోనా టీకాను తీసుకున్న తరువాత శరీరంలో ఉండే సాధారణ రోగ నిరోధక శక్తి స్పందిస్తుందని, దీని ప్రభావంతో శరీరానికి నొప్పులు, స్వల్పంగా జ్వరం, జలుబు వంటివి రావచ్చని ఆయన అన్నారు. ముఖ్యంగా కండరాల నొప్పులు, తలనొప్పి రావడం, నీరసంగా అనిపిస్తే.. వ్యాక్సిన్ ప్రభావం శరీరంపై చూపిస్తున్నట్టుగానే భావించాలని చెప్పారు. ప్రజలకు ఇప్పటివరకూ అందుబాటులోకి వచ్చిన అన్ని టీకాలూ కరోనా వైరస్ పై పని చేస్తున్నాయని, వీటిల్లో అత్యంత సమర్థవంతంగా పనిచేసే టీకా ఏంటన్న విషయం తేలాలంటే సమయం పడుతుందని డాక్టర్ ఆంటోనీ ఫౌసీ వ్యాఖ్యానించారు.
కోవిడ్ టీకాపై సందేహాలు వద్దంటూనే కొన్ని జాగ్రత్తలు చెప్పారు డాక్టర్ ఆంటోనీ ఫౌసీ. వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
టీకా తీసుకున్న తరువాత జ్వరం వచ్చి, ఐదు రోజులైనా తగ్గకపోయినా, జీర్ణ సమస్యలు రోజుల తరబడి కొనసాగుతున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని యూఎస్ సీడీసీ చీఫ్ సూచించారు.