బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు జైలు శిక్ష.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు 

హైదరాబాద్ నగరానికి చెందిన బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు నాంపల్లి న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధించింది. బొల్లారం దాడి కేసులో ఆయనకు ఈ శిక్ష విధిస్తూ నాంపల్లి సెషన్స్ కోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. పోలీసులపై దాడి చేసి దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై 2015లో రాజాసింగ్ మీద ఈ కేసు నమోదైంది. అప్పట్లో రాజాసింగ్ బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయనను అరెస్టు కూడా చేశారు. ఈ సందర్భంగా జరిగిన వాగ్వివాదంలో సీఐని రాజాసింగ్ దూషించారంటూ అప్పట్లో కేసు నమోదైంది. ఇదే కాకుండా అంతకు ముందు కూడా రాజాసింగ్ మీద మరో కేసు నమోదైంది. విధి నిర్వహణలో ఉన్న ఒక కానిస్టేబుల్ మీద దాడి చేయడమే కాకుండా చంపేస్తానంటూ బెదిరించారని పేర్కొంటూ.. బాధిత కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై మరో కేసు నమోదైంది.  

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా.. రాష్ట్రపతి ప్రసంగాన్ని అడ్డుకున్న ఏకైక ఎంపీ.. 

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈరాజు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగిస్తుండగా రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు హనుమాన్ బెనివాల్ గట్టిగ నినాదాలు చేశారు. గ‌తంలో బీజేపీకి మిత్రపక్షంగా వ్య‌వ‌హ‌రించి.. వ్యవసాయ చట్టాలకు వ్య‌తిరేకంగా ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ లోక్ సభ స‌భ్యుడు ఈ హనుమాన్ బెనివాల్.. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకోవాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘‘మూడు నల్ల చట్టాలు వెంటనే ఉపసంహరించుకోవాలి’’ అని ఇంగ్లీషులో రాసిన ఫ్లకార్డులు చూపిస్తూ అయన పదే పదే నినాదాలు చేశారు. అయితే నినాదాలు చేస్తూ రాష్ట్రపతి ప్రసంగానికి అడ్డుపడుతున్న సదరు ఎంపీని పార్లమెంట్ మార్షల్స్ సభ నుంచి బయటకు తీసుకెళ్లారు.   ఇది ఇలా ఉండగా పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి చేసిన‌ ప్ర‌సంగాన్ని 18 ప్ర‌తిప‌క్ష పార్టీలు బ‌హిష్క‌రించిన సంగతి తెల్సిందే. సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఆయా పార్టీలు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించాయి. అయితే స‌భ‌కు హాజ‌రైన పార్టీల్లో కూడా ఎంపీ.. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకంగా నిర‌స‌న గళం వినిపించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగం పూర్తైన తరువాత హ‌నుమాన్ బెనివాల్ స‌భ‌లో ఆందోళ‌న‌కు దిగిన ఫోటోలు తాజాగా సోదాలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సీఎం పోస్టు కోసం కేటీఆర్ లొల్లి! భరించలేకే కాశీకి కేసీఆర్ ఫ్యామిలీ 

కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతోంది? గులాబీ లీడర్లు కేటీఆర్ కు ఎందుకు జై కొడుతున్నారు? కల్వకుంట్ల ఫ్యామిలీ కాశీకి ఎందుకు వెళ్లింది?  తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ లో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పుకుని కేటీఆర్ కు ఆ పదవి అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.  కొందరు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కేటీఆర్ ను సీఎం చేయాలంటూ ఓపెన్ గానే ప్రకటనలు చేస్తున్నారు. అయితే కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం దీనిపై స్పందించడం లేదు. అదే సమయంలో సీఎం మార్పుపై  ప్రకటనలు చేస్తున్న నేతలను వారించడం లేదు. తన ముందే సీఎం మార్పుపై పార్టీ నేతలు మాట్లాడుతున్నా... కేటీఆర్ ఖండించడం లేదు. ఇవే ఇప్పుడు అనేక సందేహాలకు కారణమవుతున్నాయి. కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.   కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు, ప్రగతి భవన్ లోని కీలక వర్గాల  విశ్వసనీయ సమాచారం ప్రకారం కేటీఆర్ ను సీఎం చేసే ఆలోచనే కేసీఆర్ లేనే లేదని తెలుస్తోంది. అందుకే ముఖ్యమంత్రి సీటుపై కల్వకుంట్ల కుటుంబంలో పెద్ద యుద్ధమే జరుగుతుందని చెబుతున్నారు. తనను ముఖ్యమంత్రిగా నియమించాలని కేసీఆర్ పై కేటీఆర్ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని.. ఈ విషయంలో కేటీఆర్ కు ఎంపీ సంతోష్ రావు, ఎమ్మెల్సీ కవిత సహకరిస్తున్నారని సమాచారం. మొదట సీఎం సీటు కోసం కవిత పోటీ పడినా.. కేటీఆర్, సంతోష్ లు ఆమెను కూల్ చేశారని గతంలో కేసీఆర్ కు కుడి భుజంగా మెలిగిన, టీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన గాదె ఇన్నయ్య చెబుతున్నారు. తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఇస్తానని కవితకు కేటీఆర్ హామీ ఇవ్వడం వల్లే ఆమె సైలెంట్ అయ్యారని ఆయన వెల్లడిస్తున్నారు. కేటీఆర్ హామీతో కవిత కూడా సీఎంగా తప్పుకోవాలని తండ్రిపై ప్రెషర్ పెడుతున్నారని ఇన్నయ్య చెబుతున్నారు.   కేటీఆర్, కేసీఆర్ గొడవలో మంత్రి హరీష్ రావు కూడా తలదూర్చారని తెలుస్తోంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా నియమించడానికి ఇదే సమయమని కేసీఆర్ కు నచ్చచెప్పటానికి హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే కేసీఆర్ మాత్రం అందుకు ఇష్టపడటం లేదట. ఇందుకు బలమైన కారణం కూడా ఉందని తెలుస్తోంది.  టీఆర్ఎస్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది.  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా రివర్స్ అయ్యాయి. తన నైజానికి భిన్నంగా కొన్ని పథకాలను క్యాన్సిల్ చేశారు కేసీఆర్. పీఆర్సీ ప్రకటించకపోవడంతో ఉద్యోగులు,  ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో యువత రగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తే... పాలన చేతకాక కేసీఆర్ పారిపోయారని విపక్షాలు ఆరోపణలు చేసే అవకాశం ఉంది. పోరాడి తెలంగాణ సాధించిన ఉద్యమ నేతగా , రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న కేసీఆర్ కు.. ఈ తరహా ప్రచారం ఇబ్బందే. తాను విఫలమయ్యానే ఆరోపణలను కేసీఆర్ లాంటి ఉద్యమ నేతలు ఎప్పటికి జీర్ణించుకోలేరు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కేటీఆర్ కు సీఎం పగ్గాలు ఇవ్వడానికి కేసీఆర్ సిద్దంగా లేరని గాదె ఇన్నయ్య చెబుతున్నారు.   కేసీఆర్ కలల ప్రాజెక్ట్ యాదాద్రి పునర్ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు.  యాదాద్రి ప్రారంభోత్సవాన్ని వైభవంగా జరపాలని, ఆ సందర్భంగా యాగం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యంగా కేసీఆర్ సొంత గడ్డలో నిర్మిస్తున్న .. కాళేశ్వరంలో అతి పెద్ద రిజర్వాయర్  అయిన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం ఇంకా జరుగుతూనే ఉంది. అది పూర్తయ్యాకా ముఖ్యమంత్రిగా తానే దాన్ని ప్రారంభించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. కేటీఆర్ విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గడానికి  నిఘా వర్గాల నివేదికలు కూడా  కారణమని తెలుస్తోంది.  కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే.. టీఆర్ఎస్ చీలిపోయే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయని చెబుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రెండు వర్గాలుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ ను సీఎం చేస్తే... ఉద్యమ నేతలంతా తమ దారి తాము చూసుకునే అవకాశం ఉందని  నిఘా సంస్థలు కేసీఆర్ కు నివేదిక ఇచ్చాయని తెలుస్తోంది.   ఇప్పటికే తెలంగాణలో దూకుడు పెంచింది బీజేపీ. ఇతర పార్టీల నేతలకు వల వేస్తోంది. .ఇలాంటి సమయంలో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి.. పార్టీలో అసమ్మతి పెరిగేలా చూసుకోవడం మంచిది కాదనే భావనకు టీఆర్ఎస్ అధినేత వచ్చారంటున్నారు.  అందుకే సీఎం మార్పు గురించి ఆయన ఆలోచన కూడా చేయడం లేదంటున్నారు. దీంతో  కేసీఆర్ తన మాట వినే పరిస్థితి లేదని గ్రహించిన కేటీఆర్ మరో దారిలో నరుక్కొస్తున్నారని.. అందులో భాగంగానే టీఆర్ఎస్ నేతలు వరుసగా ప్రకటనలు చేస్తున్నారని భావిస్తున్నారు. కేటీఆర్ సీఎం అవుతారంటూ ప్రకటనలు చేస్తున్న వారంతా ఆయనతో సన్నిహితంగా ఉంటున్నవారేనని గులాబీ లీడర్లే చెబుతున్నారు. పార్టీ నేతల ద్వారా కేసీఆర్ పై ఒత్తిడి తేవడం కోసం కేటీఆరే డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందంటున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఇంట్లో జరుగుతున్న గొడవలు భరించలేకే కవిత.. తన ఫ్యామిలీతో కాశీకి వెళ్లారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.  ఇదిలా ఉంటే, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆరే కొనసాగేలా ఆయన సతీమణి శోభా చొరవ తీసుకోవాలని ఒకప్పుడు కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న గాదె ఇన్నయ్య కోరుకుంటున్నారు. ఇందుకోసం కేసీఆర్ తో పాటు కుటుంబసభ్యులను శోభమ్మ ఒప్పించాలని ఇన్నయ్య విజ్ఞప్తి చేసుకుంటున్నారు. మరోవైపు  కేటీఆర్ ఎంతగా ప్రయత్నించినా.. ఏ రకమైన ఒత్తిడి తెచ్చినా కేసీఆర్ తలొగ్గే పరిస్థితులు ఉండవని.. ఆయనతో సన్నిహితంగా ఉండే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అంత త్వరగా మార్చుకోరని.. పార్టీ విషయంలో అసలే తీసుకోరని చెబుతున్నారు. దీంతో కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు ఎటు వైపు దారి తీస్తాయో చూడాలి మరీ..

రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందితోనే ఎన్నికలు జరుగుతాయి: నిమ్మగడ్డ 

అనంతపురం జిల్లాలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని తెలిపారు. కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడం సంతోషం అని పేర్కొన్న ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేలు నమోధైన పరిస్థితుల్లో ఈ రోజు 150, 200 దాటక పోవడం శుభపరిణామం అని అన్నారు.    స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే పంచాయతీలకు నిధులు వస్తాయని చెప్పారు. ఎన్నికలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందితోనే జరుగుతాయన్న ఆయన.. రాష్ట్ర ఉద్యోగులు, సిబ్బందిపై నాకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. కోవిడ్ పేషేంట్లకు ఓటు వేసేందుకు పీపీఏ కిట్లు అందిస్తామన్న ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ఏకగ్రీవాలు దురుద్దేశపూర్వకంగా జరుగుతున్నాయని, అనేక రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు. అలజడి సృష్టిస్తే షాడో టీమ్‌లతో పర్యవేక్షిస్తామని అన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని చెప్పారు. మీడియాది ఎన్నికల్లో గొప్ప పాత్ర. నిర్మాణాత్మకంగా వ్యవహరించండి అని నిమ్మగడ్డ కోరారు.

బీజేపీ నేతల వల్లే ఢిల్లీలో హింస! కేసీఆర్ బీజేపీ దోస్త్ అన్న రేవంత్ 

కేంద్రంలోని నరేంద్ర మోడీ, తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాలను టార్గెట్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. ఎన్డీఏతో సీఎం కేసీఆర్‌ చీకటి భాగస్వామ్యం చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగాన్ని ప్రతిపక్షాలు బహిష్కరిస్తే టీఆర్‌ఎస్‌ హాజరైందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ తెచ్చిన చట్టాలకు టీఆర్‌ఎస్‌ ఆమోదం తెలిపిందని విమర్శించారు. వ్యవసాయ చట్టాలను టీఆర్ఎస్ వ్యతిరేకిస్తే .. అసెంబ్లీలో  వెంటనే తీర్మానం చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.  ఢిల్లీలో మీడియాతో మాట్లాడి రేవంత్ రెడ్డి... రైతు ఉద్యమాన్ని బీజేపీ నేతలు హింసాత్మకం చేశారని ఆరోపించారు. రైతు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కేంద్రం కుట్ర చేసిందన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. పసుపు బోర్డు విషయంలో నిజామాబాద్‌ రైతులను ఎంపీ అరవింద్ వంచించారని రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం ఆర్మూరులో రాజీవ్ రైతు భరోసా దీక్ష జరుగుతుందన్నారు.రాంమాధవ్‌ సమక్షంలో ఇచ్చిన పసుపు బోర్డు హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.

రైతుల ర్యాలీ, ఎర్రకోట ఘటనలతో  దేశానికి మచ్చ! ప్రధాని మోడీ మౌనం ప్రమాదకరమని చర్చ 

భారత ప్రధాన మంత్రి నరేంద్ర దాస్ మోడీ. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరు. రాజకీయ నేతల్లో టాప్ లో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నది కూడా నరేంద్ర మోడీకే. 2014 నుంచి భారత్ కు ప్రధానిగా ఉన్న మోడీ హవా .. గత ఏడేండ్లుగా పెరుగుతూనే ఉంది. 2019లో ఆయన రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టాకా ఆయన గ్రాఫ్ మరింత పెరిగింది. తిరుగులేని పాల‌న‌తో.. దూర‌దృష్టితో అంత‌ర్జాతీయంగా వెలిగిపోతున్నారని మోడీని కీర్తిస్తోంది కమలదళం. అయితే కొన్ని రోజులుగా ఆయన ప్రతిష్ట మసక బారుతుందనే ప్రచారం జరుగుతోంది. దేశంలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ప్రధాని మోడీకి మైనస్ గా మారాయని అంతర్జాతీయ, దేశియ  సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.   స్వ‌తంత్ర భార‌త దేశంలో గ‌తంలో ఎన్న‌డూ జ‌ర‌గ‌ని.. ఎప్పుడు క‌నీవినీ ఎరుగ‌ని సంఘ‌ట‌న‌లు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి. వీటి ప్రభావం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపైనే ఎక్కువ‌గానే ఉంది. రైతుల ఆందోళన, ఎర్రకోట అల్లర్ల ఘటనలు మోడీకి మచ్చ తెచ్చేవిగా మారిపోయాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలుగా రైతులు పోరాడుతున్నారు. ఢిల్లీ స‌రిహ‌ద్దులో మోహ‌రించి నెల‌ల త‌ర‌బ‌డి ఉద్య‌మం చేశారు. ఎముక‌లు కొరికే చ‌లిలోనూ వారు ఆందోళ‌న కొన‌సాగించారు. ఫ‌లితంగా మోడీ స‌ర్కారుకు ఇంటా బ‌య‌టా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. అంత‌ర్జాతీయ స‌మాజం నుంచి కూడా మోడీకి ఎదురీత ఎదురైంది. బ్రిట‌న్, కెనడా వంటి దేశాలతో పాటు  ఐక్య‌రాజ్య‌స‌మితి  కూడా రైతుల‌కు మ‌ద్ద‌తు ప‌లికింది. రైతుల‌పై బ‌ల ప్ర‌యోగం వ‌ద్దంటూ పలు సంస్థలు సూచనలు చేశాయి. ఇవన్ని ప్రధాని మోడీకి ఇబ్బందికర పరిస్థితులే.   రైతు ఉద్య‌మాన్ని నిలువ‌రించ‌డంలోను, వారిని శాంత ప‌ర‌చ‌డంలోనూ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌నే వాద‌న దేశంలోనేకాదు. అంత‌ర్జాతీయంగా కూడా వినిపిస్తోంది. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున  రైతులు నిర్వ‌హించిన ట్రాక్ట‌ర్ ర్యాలీ తీవ్ర వివాదానికి, చరిత్రాత్మక కట్టడం ఎర్ర‌కోట విధ్వంసానికి దారితీసింది. దీనిపై అంత‌ర్జాతీయ స‌మాజం నివ్వెర పోయింది. ఇది ప‌క్కా ప్లాన్ ప్ర‌కార‌మే జ‌రిగింద‌న్న వాద‌న బ‌లంగా వినిపించింది. ఇది కూడా ప్రధాని మోడీ వైఫల్యంగానే భావిస్తున్నారు. ఢిల్లీలో అల్లర్లను  నిలువ‌రించ‌లేక పోయార‌నే వ్యాఖ్య‌లు మోడీ సర్కార్ కు చుట్టుకుంటున్నాయి. కేంద్ర సర్కార్ వైఫల్యం వల్లే అత్యంత భద్రత ఉండే ఎర్రకోటలోకి సామాన్యులు వెళ్లారనే విమర్శలు వస్తున్నాయి.    ఢిల్లీ, ఎర్రకోట ఘటనల వేడిని కొనసాగిస్తూ విపక్షాలు కేంద్ర సర్కార్ దాడిని తీవ్రతరం చేశాయి. ఏకంగా 18 ప్ర‌తిప‌క్ష పార్టీలు పార్లమెంట్ లో  రాష్ట్రపతి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేశాయి.  రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించడం అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స్వ‌తంత్ర భార‌తంలో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించిన ప్ర‌తిప‌క్షాలు ఉన్నాయి. అయితే ఆయా పార్టీల‌కు న‌చ్చ‌జెప్పి లైన్‌లోకి తెచ్చుకున్న అధికార ప‌క్షాలు ఉన్నాయి. కానీ మోడీ స‌ర్కారు మాత్రం విప‌క్షాల‌ను పట్టించుకోవడం లేదనే వాదన బ‌లంగా వినిపిస్తోంది.ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ మౌనంగా ఉండటం అందరిని అశ్చర్యపరుస్తోంది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే అతి తక్కువ కాలంలో అంతర్జాతీయంగా పాపులర్ అయిన మోడీ.. అంతే వేగంగా తన ప్రతిష్టను కోల్పోయే ప్రమాదం ఉందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తోంది.    

చంద్రబాబు చంద్రముఖిలా మారి నిమ్మగడ్డను ఆవహించాడు

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కులపిచ్చితో నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని, ఎస్ఈసీ పదవికి ఆయన అనర్హుడని అన్నారు. ఎస్‌ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించడంలేదని, చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తూ, కుల రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. గతంలో కరోనా వ్యాప్తిని కారణంగా చూపి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఎన్నికలు నిలిపివేశారని అన్నారు. ఇప్పుడు కరోనా ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, మరి నిమ్మగడ్డ ఎందుకంత తొందరపడుతున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి చంద్రబాబుతో లాలూచీ పడి ఇలాంటి పనులకు పాల్పడడం దురదృష్టకరమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.   చంద్రబాబుకు అనుకూలంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని విజయసాయి ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలకు పార్టీ గుర్తులుండవని గుర్తుచేసిన ఆయన.. మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రతి ఒక్క అధికారిపైనా, ప్రభుత్వంపైనా చర్యలు తీసుకునేందుకు తహతహలాడే నిమ్మగడ్డ.. చంద్రబాబును ఎందుకు ఉపేక్షిస్తున్నారని అన్నారు. శరీరం మాత్రమే నిమ్మగడ్డదని, చంద్రబాబు చంద్రముఖిలా మారి నిమ్మగడ్డను ఆవహించాడని విమర్శించారు. నిమ్మగడ్డ మానసికంగా గాడి తప్పిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తిని ఎస్ఈసీ పదవిలో కూర్చోబెట్టడం ఏంటని అన్నారు. నిమ్మగడ్డ మానసిక ఆరోగ్యంపై మెడికల్ బోర్డుకు సిఫారసు చేయాలని విజయసాయి ఎద్దేవా చేశారు.    మరోవైపు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడానిమ్మగడ్డపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'తక్షణమే జగన్ ని ముఖ్యమంత్రిగా తొలగించి, ఆ స్థానంలో చంద్రబాబుని నియమించవలసిందిగా నిమ్మగడ్డ గవర్నర్ కి లెటర్ రాసినా ఆశ్చర్యపోకండి. పిచ్చిముదిరింది'  అని ఆయన ట్వీట్ చేశారు.   కాగా, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని టార్గెట్ చేస్తూ అధికారపార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఈసీ పై విమర్శలు చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని కూడా అంటున్నారు.

ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డికి చుక్కెదురు!

ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ ‌రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రాదంటూ రేవంత్ రెడ్డి ధాఖలు చేసిన పిటిషన్ ‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఓటుకు నోటు కేసు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆ పిటిషన్ ‌ను కొట్టివేసింది. ఈ కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. అభియోగాల నమోదు కోసం విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. ఫిబ్రవరి 8న నిందితులందరూ కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. కాగా, 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్ ను డబ్బుతో ప్రలోభపెట్టారన్న ఆరోపణలున్నాయి.

సీఎంవోనే టార్గెట్ చేసిన నిమ్మగడ్డ!  మగాడ్రా బుజ్జీ అంటున్న జనాలు  

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో తన పవర్ చూపిస్తున్న ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. జగన్ సర్కార్ మరో షాక్ ఇచ్చారు. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయాన్నే టార్గెట్ చేశారు నిమ్మగడ్డ.  సీఎంఓలో ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఆదేసిస్తూ.., సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ కు లేఖరాశారు నిమ్మగడ్డ. ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను తాను నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలను ఏపీ సర్కార్ తిరస్కరించిన కొద్దిసేపటికే ... నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. సాధారణ పరిపాలనా శాఖ అధిపతిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ తన విధులను సరిగా నిర్వర్తించలేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. కలెక్టర్లు,ఎస్ పి లు ఉన్నతాధికారులతో ప్రవీణ్ ప్రకాష్ సమీక్షలు జరపకుండా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు. పలువురు ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలన్న తన సిఫార్సు లేఖలు పట్టించుకోలేదని ఎస్ఈసీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఈనెల 23న కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ జరపకుండా చేశారని.. జీఏడీకి అధిపతిగా ఉన్న ఆయన తన ఆదేశాలను పట్టించుకోలేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికలసు సంబంధించిన అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో ప్రవీణ్ ప్రకాష్ విఫలమయ్యారని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా జారీ చేసే కులధ్రువీకరణ పత్రాలు, ఎన్ఏసీల జారీ అంశంపైనా నిమ్మగడ్డ రమేష్ కుమార్..., ఎస్ఈసీకి లేఖరేశారు. కుల ధ్రువీకరణ పత్రాలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు తొలగించాలని.. ఈ మేరకు తహసీల్దార్లకు ఆదేశాలివ్వాలని లేఖలో పేర్కొన్నారు. ధ్రువీకరణ పత్రాలపై సీఎం ఫొటో ఉండటం ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. అలాగే కుల ధ్రువీకరణ పత్రాలను జారీలో ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం లేకుండా చూడాలన్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.  ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. 12 జిల్లాల్లో 3,249 గ్రామ పంచాయతీలు, 32,504 వార్డులకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. తొలి దశకు సంబంధించి సర్పంచి, వార్డు స్థానాలకు పోటీ చేయాలనుకునేవారు జనవరి 31  ఆదివారం సాయంత్రం 5 గంటల్లోగా నామినేషన్లు వేసేందుకు ఎస్‌ఈసీ గడువు ఇచ్చిం ది. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఫిబ్రవరి 4న అధికారులు ప్రకటిస్తారు. 7వ తేదీ సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు. ఫిబ్రవరి 9న తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. తొలి దశలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలోని 454 పంచాయతీలు.. నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 163 పంచాయతీలకు ఎన్నిక జరగనుంది.   

మళ్లీ రెచ్చిపోయిన మంత్రి తలసాని! బీజేపీ, కాంగ్రెస్ నేతలపై బూతులు 

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి నోటికి పని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని  గాంధీ నగర్ ,శ్రీరామ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మరో మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తలసాని.  కాంగ్రెస్, బీజేపీ నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి తలసాని కామెంట్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించారో చెప్పాలని ఆయన సవాల్ చేశారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ మాట చెప్తే అది ఒక్క చట్టమని... ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతారని తలసాని స్పష్టం చేశారు.లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ నిర్మించారని అడుగుతున్న విపక్ష నేతలు.. తన వెంటే వస్తే వాటిని చూపిస్తానని చెప్పారు మంత్రి తలసాని.  భారత్ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల కోసం తెలంగాణ లో డబల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు మంత్రి తలసాని. ఒక్క రూపాయి పేద వారిమీద భారం వేయకుండా  గాంధీ నగర్,శ్రీరామ నగర్ లో  కోట్ల రూపాయలతో ఇళ్ళు నిర్మించామన్నారు. కంటోన్మెంట్ ను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించిన తలసాని... టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే కంటోన్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. వారంలో కంటోన్మెంట్ బోర్డు వాటర్ ఇవ్వాలని .. లేదంటే రాబోయే రోజుల్లో వేలాది మందితో మీ కంటోన్మెంట్ బోర్డ్   ఆఫీస్ ముట్టడిస్తామని తలసాని వార్నింగ్ ఇచ్చారు.

దేవుడి వద్దకు వెళ్తున్నానంటూ మిస్సింగ్! చిత్తూరు జిల్లాలోనే మరో కలకలం 

మనదేశంలో మాయ మాటలు చెప్పె బాబాలకు ఉన్న  క్రేజీ.. తమ పరిశోధనలతో కొత్త ఆవిష్కరణలు చేసే  శాస్త్రవేత్తలకు ఉండదు. మ్యాజిక్ ను నమ్మే జనం లాజిక్ ను అస్సలు పట్టించుకోరు. త్రివిక్రమ్ సినిమాల్లోని ఈ డైలాగులను కొందరు నిజం చేస్తున్నారు. ఇటీవలే మూఢనమ్మకాలతో కన్నబిడ్డలను చంపుకున్న తల్లిదండ్రుల ఉదంతం మరవకముందే.. అలాంటిదే మరో ఘటన జరిగింది. మదనపల్లెలో జంట హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. అదే చిత్తూరు జిల్లాలో మరో కలకలం రేగింది.  చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో  దేవుడి వద్దకు వెళ్తున్నానని చెప్పి ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. తాను దేవుడి వద్దకు వెళ్తున్నానని గణేష్ అనే యువకుడు రెండు పేజీల లేఖను రాశాడు. అనంతరం జనవరి 21 నుంచి అతడు ఇంటికి కాలేదు. ఫోన్ స్విచాఫ్ వస్తోంది. అప్పటి నుంచీ తల్లిదండ్రులు గణేష్ కోసం వెతుకుతూనే ఉన్నారు. గణేష్ తన వెంట బైక్, సెల్‌ఫోన్, పుస్తకాల బ్యాగ్‌ను తీసుకెళ్లాడు. వారం రోజులు గడస్తున్నా ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు.  మదనపల్లె ఘటన నేపథ్యంలో తమ కుమారుడికి ఏమీ కాకూడదని ప్రార్థనలు చేస్తున్నారు.  వారం రోజులుగా కనిపించకుండా పోయిన  గణేష్‌కు భక్తి భావం ఎక్కువని తెలుస్తోంది. ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనలోనే ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. అయితే భక్తి భావం ఉన్నప్పటికీ మూఢత్వం లేదంటున్నారు గణేష్ కుటుంబ సభ్యులు. గణేష్ మిస్సింగ్‌పై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గంగవరం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అతడి కాల్ డేటా వివరాలను సేకరించి.. పలువురిని విచారిస్తున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో  మదనపల్లెలో ఇటీవలే దారుణం జరిగింది. మూఢనమ్మకాలతో కన్నతల్లిదండ్రులే బిడ్డలను చంపుకున్నారు.  పోలీసులు అరెస్ట్ చేసినా ఇప్పటికీ వాళ్లు అదే పిచ్చిలో ఉన్నారు. పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు.. తమ కుమార్తెలు అలేఖ్య (27), సాయిదివ్య (22)ను చంపేశారు. పూర్తిగా దైవభక్తిలో లీనమైపోయిన నిందితులు.. తమ కూతుళ్లు మళ్లీ బతుకుతారనే మూఢ నమ్మకంతో చంపేశారు. సాయి దివ్యను అక్క అలేఖ్య త్రిశూలంతో పొడిచి చంపేసింది. ఆమెను బతికించేందుకు తనను కూడా చంపాలని తల్లిదండ్రులను కోరడంతో..వారు డంబెల్‌తో కొట్టి చంపారు. ఇలా ఇద్దరు యువతులు హత్యకు గురయ్యారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. 

నిమ్మగడ్డ, జగన్ సర్కార్ మధ్య కొత్త పంచాయితీ!

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ పోల్స్  హీట్ పెరిగింది. తొలి దశ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో పల్లెల్లో ఎన్నికల సందడి కనిపిస్తోంది. పంచాయతీలను గెలుచుకునేందుకు పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తుండగా.. ఎన్నికల నిర్వహణ విషయంలోనూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, జగన్ సర్కార్ మధ్య యుద్దం జరుగుతూనే ఉంది. ఎన్నికల నిర్వహణలో దూకుడుగా వెళుతున్న నిమ్మగడ్డకు బ్రేకులు వేసేందుకు అధికార వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఎస్ఈసీ, ఏపీ సర్కార్ మధ్య మరో వివాదం ముదురుతోంది.  ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన  ఆదేశాలను మరోసారి పక్కనబెట్టింది జగన్ సర్కార్. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ముద్దాడ రవిచంద్రను నియమిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ  గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపారు. కానీ నిమ్మగడ్డ ఆదేశాలను పక్కనబెట్టిన ప్రభుత్వం కాసేపటికే ఆయన్ను వైద్య ఆరోగ్య శాఖలో కార్యదర్శిగా నియమించి.. ఆయనకు కొవిడ్ వ్యాక్సినేషన్ బాధ్యతలు అప్పగించింది. ఇందుకోసం వైద్య, ఆరోగ్య శాఖలో ఎక్స్ కేడర్ కార్యదర్శి పోస్టును సృష్టించి మరీ ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది జగన్  ప్రభుత్వం. కొన్ని రోజుల క్రితం ఎస్ఈసీకి కార్యదర్శిగా ఉన్న వాణీమోహన్ ను నిమ్మగడ్డ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న తరుణంలో కార్యదర్శి అవసరం ఏర్పడింది.ప్రస్తుతం ముద్దాడ రవిచంద్రకు ఎలాంటి పోస్టింగ్ లేదు. గతంలో ప్రభుత్వం ఆయన్ను జీఏడీకి అటాచ్ చేయడంతో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగూ ఆయనకు పోస్టింగ్ లేదు కాబట్టి.. ఎన్నికల సంఘం కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు. కానీ ప్రభుత్వం ట్విస్ట్ ఇస్తూ  రవిచంద్రకు వేరే పోస్టింగ్ ఇచ్చింది.   సెక్రటరీ పోస్టును భర్తీ చేసేందుకు ముగ్గురు అధికారులతో కూడిన జాబితాను పంపాల్సిందిగా ప్రభుత్వానికి రెండుసార్లు లేఖరాసినా స్పందించకపోవడంతో ముద్దాడ రవిచంద్రను కార్యదర్శిగా నియమించినట్లు రమేష్ కుమార్ పేర్కొన్నారు.  అయితే ప్రభుత్వం మాత్రం హడావుడిగా ఆయన కోసం ఓ పోస్టును సృష్టించి మరీ అక్కడికి పంపడం వివాదాస్పదమైంది. అంతేకాదు  ఎన్నికల సంఘం కార్యదర్శి పోస్టుకు  ఐఏఎస్ అధికారులైన విజయ్ కుమార్, రాజబాబు, కన్నబాబుల పేర్లను ప్రభుత్వం పంపింది.  అధికారుల బదలీ వ్యవాహంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను.., ప్రభుత్వం తిప్పి పంపిస్తూనే ఉంది. గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీతో పాటు పలువురు అధికారుల బదిలీలను ఓకే చేసిన ప్రభుత్వం.., పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ, కమీషనర్ గిరిజా శంకర్ అభిశంసనను మాత్రం వెనక్కిపంపింది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ కార్యదర్శి పోస్టింగ్ వ్యవహారం మరో వివాదానికి తెరతీసింది.దీనిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. 

తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన  కరోనా! వైరస్ బలహీనంగా ఉందన్న సీసీఎంబీ 

రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తిస్తున్న కరోనా వైరస్ కు సంబంధించి కొత్త విషయాలు వెలుగు చూశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దేశంలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నమైన కరోనా వైరస్​ ఎక్కువగా కన్పిస్తోందని తెలుస్తోంది.  అయితే ఇది ఇతర రకాల కన్నా ఒకింత బలహీనంగా ఉందని సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కొత్త రకం మాత్రం కాదని... ఇప్పటికే ఉన్న వైరస్​ బలహీనపడటం వల్ల ఉత్పన్నమై ఉండొచ్చని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్‌ మిశ్రా చెప్పారు. ఈ రకం కొత్త వైరస్‌ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో నిర్ధరించేందుకు పరిశోధనను ముమ్మరం చేయనున్నారు శాస్త్రవేతలు.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దక్షిణ భారతదేశంలో భిన్నమైన కరోనా వైరస్‌ ఎక్కువగా కనిపిస్తోందని. దీనికి  ఎన్‌440కే అని పేరు పెట్టినట్లు డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా చెప్పారు.  పూర్తిగా కొత్త రకం కాదని..భిన్నమైనదే. కొంతకాలంగా వ్యాప్తిలో ఉందని ఆయన  తెలిపారు.  గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరులో స్వల్ప కేసుల్లో కనిపించిందని.. ఇప్పుడు ఎక్కువ మందికి ఇది వ్యాప్తి చెందుతోందని చెప్పారు.  ఎన్‌440కే రకం వల్ల వ్యాధి లక్షణాలు పెద్దగా ఉండటంలేదు. స్వల్ప స్థాయి లక్షణాలే కనిపిస్తున్నాయన్నారు రాకేష్ మిశ్రా.  మొదటగా విస్తరించిన  వైరస్‌ బలహీనపడటం వల్ల ఇది  ఉత్పన్నమై ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.  బ్రిటన్‌లో వెలుగు చూసిన కరోనా వైరస్‌ స్ట్రైయిన్  ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. శర వేగంగా విస్తరిస్తూ చాలా దేశాలను చుట్టేసింది.  ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భిన్న కరోనా వైరస్ ఆనవాళ్లు కన్పించడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతానికి ఈ రకంపై పెద్దగా డేటా అందుబాటులో లేదని..రానున్న రోజుల్లో భారీ స్థాయిలో వైరస్‌ జన్యుక్రమాలను ఆవిష్కరించి, మరిన్ని వివరాలు వెలుగులోకి తెస్తామని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్  మిశ్రా తెలిపారు. దేశంలో ఈ రకం వైరస్‌ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో నిర్ధారించేందుకు పరిశోధనను ముమ్మరం చేయనున్నట్లు వివరించాురు.  

బీజేపీ, జనసేన కూటమికి చిరు సపోర్ట్..  కన్ఫార్మ్ చేసిన సోము వీర్రాజు 

2024 లో జరిగే ఎన్నికలలో బీజేపీ, జనసేన కూటమికి చిరంజీవి మద్దతిస్తారని బీజేపీ అధ్యక్షుడు సోము వీరాజు ప్రకటించారు. ఆ ఎన్నికలలో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా తమకు ఇంకా ఎవరెవరు మద్దతిస్తారో ప్రతిపక్షాలు కూడా చూస్తాయని అయన అన్నారు. ఏపీలో బీజేపీ, జనసేన కూటమి బలపడుతోందని అయన తెలిపారు. తాము అధికారంలోకి రావాలని రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారని సోము వీర్రాజు చెప్పారు.   మరోపక్క జనసేనకు రాజకీయంగా సహకారం అందించడానికి చిరంజీవి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. ‘‘పవన్‌ కల్యాణ్‌, నేను చిరంజీవిగారితో కొద్దిరోజుల క్రితం సమావేశమయ్యాం. మళ్లీ సినిమాల్లో నటించాలని పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి అపుడు సూచించారు. అలాగే, పవన్‌ కల్యాణ్ ‌కు రాజకీయంగా తన అండదండలు అందజేస్తానని భరోసా ఇచ్చారు’’ అని తెలిపారు. నిన్న నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు... తాజాగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలతో జనసేన, బీజేపీ కూటమికి చిరంజీవి మద్దతు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో చిరంజీవి తిరుపతి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు తమ్ముడు పవన్‌కి చిరంజీవి పొలిటికల్ గా తోడుగా ఉండి.. జనసేన, బీజేపీ గెలుపునకు అయన కృషి చేస్తారని జనసైనికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అయోధ్యలో కట్టే మసీదుకు విరాళాలివ్వొద్దు.. ఎంపీ అసదుద్దీన్ సెన్సేషనల్ కామెంట్స్ 

ఎంఐఎం అధినేత, ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసి తాజాగా కొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అయోధ్య‌లో బాబ్రీ మసీదు కూల్చిన చోట నిర్మిస్తున్న‌ మసీదుకు ఎవ‌రూ విరాళాలు ఇవ్వ‌వద్దని అయన పిలుపునిచ్చారు. ఇపుడు కట్టే మ‌సీదులో న‌మాజ్ చేయ‌డం పాపమని అయన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముస్లిం మ‌త పెద్ద‌ల‌తో మాట్లాడిన త‌ర్వాతే.. తాను ఈ విష‌యం చెబుతున్న‌ట్టు అయన వివ‌రించారు. అయోధ్య‌లో క‌డుతున్న ఆ నిర్మాణం మ‌సీదు కాద‌ని, అక్క‌డ ప్రార్థ‌న‌లు చేయ‌కూడ‌ద‌ని ఆలిండియా ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డుకు చెందిన ఉలేమాలే చెబుతున్నారంటూ ప్ర‌స్తావించారు. అంతేకాకుండా ముస్లింలు ఎవరూ ఎన్నికల్లో దళితులతో పోటీ పడవద్దని అయన సూచించారు. తాను అంబేద్కర్ అభిమానినని.. దళితులకు సహకరిస్తానని అయన స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో శాంతి కోరుకునే వారిని జైలుకు పంపిస్తున్నారని అయన వ్యాఖ్యానించారు.   మరోపక్క ఎంపీ అస‌దుద్దీన్‌ వ్యాఖ్య‌ల‌ను… అయోధ్య మ‌సీదు ట్రస్ట్ సెక్ర‌ట‌రీ అథ‌ర్ హుస్సేన్ తీవ్రంగా ఖండించారు. అసద్ వ్యాఖ్యలు అయన రాజ‌కీయ ఎజెండాలో భాగ‌మని విమ‌ర్శించారు. ఇస్లాంకు వ్య‌తిరేకమైన చిన్న ప్ర‌దేశం కూడా ఈ ప్ర‌పంచంలో లేద‌ని హుస్సేన్ అన్నారు. ఎంపీ అస‌దుద్దీన్‌కు భారతదేశ చరిత్ర తెలియ‌దని.. మొదటి స్వాతంత్ర్య సమర పోరాటంలో ప్రజలు ప‌డిన బాధ‌ల‌ను అసద్ కుటుంబం అనుభ‌వించ‌లేద‌ని అథ‌ర్ హుస్సేన్ విమ‌ర్శించారు. ఇది ఇలా ఉండగా.. అయోధ్య‌లో మ‌సీదు నిర్మాణానికి రిప‌బ్లిక్ డే రోజున శ్రీకారం చుట్టారు.

ఏం పీకుతారో పీకి మీ సత్తా చూపించండి.. మంత్రి అనిల్ అభ్యంతరకర వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విపక్షాలపై విమర్శలు చేసే క్రమంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 'ఎన్నికల్లో సత్తా చూపిస్తాం అంటూ ఉర్రూతలు ఊగారు.. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి.. ఏం పీకుతారో పీకి మీ సత్తా చూపించండి' అంటూ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధ్వర్యంలో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నివాసంలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.   ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి కనీసం 25 శాతం సీట్లు అయినా సాధించే సత్తా ఉందా? అని మంత్రి అనిల్ ప్రశ్నించారు. ఇక కొన్ని తోక పార్టీలకు 5 శాతం సీట్లు సాధించే సత్తా కూడా లేదని అన్నారు. కనీసం నామినేషన్ వేసే సత్తా, దమ్ము కూడా వారికి లేదని ఎద్దేవా చేశారు. నామినేషన్లు వేసేందుకు దమ్ము లేదు కానీ ఎన్నికల కమిషన్‌ ను అడ్డుపెట్టుకొని చంద్రబాబు చిల్లర రాజకీయం చేస్తున్నారని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల ద్వారా వైసీపీ సత్తా ఏమిటో చాటుతామని మంత్రి అన్నారు.   కాగా, ఏపీలో ఇప్పటికే మంత్రుల భాషపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీ అమ్మా మొగుడు అంటూ ఓ మంత్రి, రాయడానికి వీలులేని భాషలో మరి కొందరు మంత్రులు పదేపదే నోరు పారేసుకుంటున్నారు. మంత్రుల భాషపై ఎన్ని విమర్శలు వ్యక్తమైనా.. మంత్రుల భాషలో మాత్రం మార్పు రావడంలేదు. తాజాగా 'ఏం పీకుతారో పీకి మీ సత్తా చూపించండి' అంటూ మంత్రి అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలుపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఉపాసన

భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అక్కడక్కడ కొందరు అస్వస్థకు గురైన ఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ.. దాదాపు అన్ని ప్రాంతాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సాఫీగానే సాగుతుంది. అయితే కొందరు మాత్రం వ్యాక్సిన్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్టులు వచ్చే ప్రమాదముందన్న భయం కూడా ప్రజలలో నెలకొంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్లపై నెలకొన్న అపోహలను తొలగించేందుకు మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ముందుకొచ్చారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో గురువారం ఆమె కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. తద్వారా, వ్యాక్సిన్ పై ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరంలేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఎలాంటి భయాలు అవసరంలేదని, అందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఉపాసన సూచించారు.

కేటీఆర్ సీఎం కావడం కష్టమే! తెలుగు వన్ అంచనా నిజమే! 

తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలన్ని కేటీఆర్ చుట్టే తిరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో కీలక మార్పులు ఉంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేటీఆర్ సీఎం అవుతారంటూ  గులాబీ నేతలు పోటీపడి మరీ ప్రకటనలు చేస్తున్నారు.  అయితే కేసీఆర్, కేటీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులెవరు ఈ వార్తలపై స్పందించడం లేదు.  మెయిన్ స్ట్రీమ్ మీడియాలో  కేటీఆర్ పట్టాభిషేకానికి ముహుర్తం ఖరారైందని కథనాల మీద కథనాలు వస్తున్నాయి.  అయితే తెలుగు వన్ మాత్రం తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఇప్పట్లో ఉండదని తేల్చి చెప్పింది. అందుకు గల కారణాలు కూడా తన కథనంలో వివరించింది. ప్రస్తుతం టీఆర్ఎస్ లో తాజాగా జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. కేసీఆర్ అత్యంత సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం అసాధ్యమనే తెలుస్తోంది.   తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ గడ్డు పరిస్థితుల్లో ఉంది. సీఎం సొండ గడ్డలో జరిగిన ఉప ఎన్నికలో అది కూడా సిట్టింగ్ సీటును కారు పార్టీ కోల్పోయింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ కమలనాధులు అధికార పార్టీకి చుక్కలు చూపించారు. వరుస షాకులతో గులాబీ పార్టీలో గుబులు రేగింది. ఆ నేపథ్యంలో త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నోముల నర్సింహయ్య మరణంతో ఖాళీ అయిన నాగార్జున సాగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక రానుంది. ఈ ఎన్నికలు టీఆర్ఎస్ భవిష్యత్ కు అత్యంత కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మార్పు ఉండే అవకాశాలు లేవని తెలుస్తోంది. ముఖ్యంగా నాగార్జున సాగర్ ఎన్నిక అధికార పార్టీకి పెద్ద సవాల్. రాష్ట్రంలో దూకుడు మీదున్న బీజేపీని అడ్డుకోవడంతో పాటు బలమైన నేత జానారెడ్డిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. అందుకే ముందు నాగార్జున సాగర్ పై ఫోకస్ చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారంటున్నారు.  టీఆర్ఎస్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది.  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా రివర్స్ అయ్యాయి. తన నైజానికి భిన్నంగా కొన్ని పథకాలను క్యాన్సిల్ చేశారు కేసీఆర్. పీఆర్సీ ప్రకటించకపోవడంతో ఉద్యోగులు,  ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో యువత రగిలిపోతున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తే... పాలన చేతకాక కేసీఆర్ పారిపోయారని విపక్షాలు ఆరోపణలు చేసే అవకాశం ఉందన్న వాదన కూడా కొందరు గులాబీ నేతల నుంచి వస్తుందట. పోరాడి తెలంగాణ సాధించిన ఉద్యమ నేతగా , రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న కేసీఆర్ కు.. ఈ తరహా ప్రచారం ఇబ్బందిగా మారుతుందని వారు చెబుతున్నారట. అందుకే కేటీఆర్ ను సీఎం చేయాలన్న అంశంపై కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.  కేటీఆర్ విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గడానికి  నిఘా వర్గాల నివేదికలు కూడా  కారణమని తెలుస్తోంది.  కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే.. టీఆర్ఎస్ చీలిపోయే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయని చెబుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రెండు వర్గాలుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న నేతలంతా హరీష్ రావు కోటరిలో ఉండగా.. బంగారు తెలంగాణ బ్యాచ్ లీడర్లంతా కేటీఆర్ వెంట ఉన్నారనే చర్చ జరుగుతోంది. కేటీఆర్ ను సీఎం చేస్తే... ఉద్యమ నేతలంతా తమ దారి తాము  చూసుకునే అవకాశం ఉందని , హరీష్ రావు కూడా పార్టీ మారే అవకాశం ఉందని నిఘా సంస్థలు కేసీఆర్ కు నివేదిక ఇచ్చాయని తెలుస్తోంది.  ఇప్పటికే తెలంగాణలో దూకుడు పెంచింది బీజేపీ. ఇతర పార్టీల నేతలకు వల వేస్తోంది. కారు పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను గుర్తించి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు కమలం నేతలు. ఇలాంటి సమయంలో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి.. పార్టీలో అసమ్మతి పెరిగేలా చూసుకోవడం మంచిది కాదనే భావనకు టీఆర్ఎస్ అధినేత వచ్చారంటున్నారు.   

పంచాయతీలకు పంచ సూత్రాలు.. టీడీపీ మేనిఫెస్టో విడుదల

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు గురువారం మేనిఫెస్టో విడుదల చేశారు. పల్లె ప్రగతి-పంచ సూత్రాల పేరుతో టీడీపీ మేనిఫెస్టో ఉంది. 1) ఉచిత కుళాయిలతో సురక్షితమైన తాగునీరు, 2) భద్రత-ప్రశాంతతకు భరోసా, 3) ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం, 4) స్వయం సమృద్ధి, 5) ఆస్తిపన్ను తగ్గింపు-పౌర సేవల పేరుతో ఐదు అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు.   ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో మేనిఫెస్టో విడుదల చేసినట్లు చెప్పారు. గ్రామాల్లో సమర్ధవంతమైన పాలన కోసమే ఈ పంచ సూత్రాలని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు. గ్రామీణ ప్రజల స్వయం సమృద్ధి కోసం వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చడాన్ని అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామాల్లో ఆస్తి పన్ను తగ్గించి ప్రజలపై భారం తగ్గిస్తామన్నారు. పంచాయతీల పరిరక్షణకు టీడీపీ కట్టుబడి ఉందని వెల్లడించారు. భూ కబ్జాలను, రౌడీలను నియంత్రిస్తామని, పారిశుధ్యాన్ని మెరుగు పరుస్తామని పేర్కొన్నారు. తమ సర్పంచ్‌ లను గెలిపిస్తే స్వయం సమృద్ధిని సాధించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామన్నారు.   వైసీపీ చెబుతున్న ఏకగ్రీవాలు ప్రజల ఆమోదంతో జరిగేవి కాదని.. దౌర్జన్యాలు, దాడులతో భయపెట్టి చేసే బలవంతపు ఏకగ్రీవాలను ఒప్పుకునేది లేదని చంద్రబాబు స్పష్టంచేశారు. 20నెలలుగా ప్రభుత్వం ఏం చేసిందని ఓటేయాలన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని అనేక రంగాల్లో నెంబర్ వన్ గా నిలెబట్టామన్న చంద్రబాబు.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క అభివృద్ధి పనైనా చేపట్టారా? అని ప్రశ్నించారు. మేం 25 వేల కి.మీల రోడ్లేస్తే ఇప్పుడు మీరెన్ని కి.మీ రోడ్లేశారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో 125 దాడులు జరిగాయని, ఇదంతా ప్రభుత్వం అసమర్థతని చంద్రబాబు విమర్శించారు.