పంచాయతీలకు పంచ సూత్రాలు.. టీడీపీ మేనిఫెస్టో విడుదల

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు గురువారం మేనిఫెస్టో విడుదల చేశారు. పల్లె ప్రగతి-పంచ సూత్రాల పేరుతో టీడీపీ మేనిఫెస్టో ఉంది. 1) ఉచిత కుళాయిలతో సురక్షితమైన తాగునీరు, 2) భద్రత-ప్రశాంతతకు భరోసా, 3) ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం, 4) స్వయం సమృద్ధి, 5) ఆస్తిపన్ను తగ్గింపు-పౌర సేవల పేరుతో ఐదు అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు.   ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో మేనిఫెస్టో విడుదల చేసినట్లు చెప్పారు. గ్రామాల్లో సమర్ధవంతమైన పాలన కోసమే ఈ పంచ సూత్రాలని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు. గ్రామీణ ప్రజల స్వయం సమృద్ధి కోసం వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చడాన్ని అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామాల్లో ఆస్తి పన్ను తగ్గించి ప్రజలపై భారం తగ్గిస్తామన్నారు. పంచాయతీల పరిరక్షణకు టీడీపీ కట్టుబడి ఉందని వెల్లడించారు. భూ కబ్జాలను, రౌడీలను నియంత్రిస్తామని, పారిశుధ్యాన్ని మెరుగు పరుస్తామని పేర్కొన్నారు. తమ సర్పంచ్‌ లను గెలిపిస్తే స్వయం సమృద్ధిని సాధించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామన్నారు.   వైసీపీ చెబుతున్న ఏకగ్రీవాలు ప్రజల ఆమోదంతో జరిగేవి కాదని.. దౌర్జన్యాలు, దాడులతో భయపెట్టి చేసే బలవంతపు ఏకగ్రీవాలను ఒప్పుకునేది లేదని చంద్రబాబు స్పష్టంచేశారు. 20నెలలుగా ప్రభుత్వం ఏం చేసిందని ఓటేయాలన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని అనేక రంగాల్లో నెంబర్ వన్ గా నిలెబట్టామన్న చంద్రబాబు.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క అభివృద్ధి పనైనా చేపట్టారా? అని ప్రశ్నించారు. మేం 25 వేల కి.మీల రోడ్లేస్తే ఇప్పుడు మీరెన్ని కి.మీ రోడ్లేశారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో 125 దాడులు జరిగాయని, ఇదంతా ప్రభుత్వం అసమర్థతని చంద్రబాబు విమర్శించారు. 

బలవంతపు ఏకగ్రీవాలు చేస్తే ఖబర్దార్! జగన్ కు చంద్రబాబు వార్నింగ్ 

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో  కొత్త వివాదం నెలకొంది. ఏకగ్రీవ ఎన్నికలపై అధికార , విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఏకగ్రీవాల కోసం వైసీపీ ప్రయత్నిస్తుండగా.. అధికార పార్టీ ఎత్తులను తిప్పికొట్టేందుకు టీడీపీ, బీజేపీ ప్రణాళికలు రచిస్తున్నాయి. ఏకగ్రీవాలు నివారించాలని గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు ఎస్ఈసీపైనా ఒత్తిడి పెంచుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల పేరుతో జగన్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ చెప్తున్న ఏకగ్రీవాలు ప్రజామోదంతో జరిగినవి కాదన్నారు. దౌర్జన్యాలు, దాడులతో బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారని విమర్శించారు. ఇందుకు ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ విధ్వంసాలే ఉదాహరణగా చెప్పుకొచ్చారు.    గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఏకగ్రీవాలు జరగలేదన్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా వివిధ ఘటనలకు సంబంధించిన వీడియోలను మీడియా సమావేశంలో టీడీపీ అధినేత ప్రదర్శించారు. 2014లో 2.6శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవమైతే... 2020లో 20శాతం పైగా ఎలా చేయగలిగారని చంద్రబాబు ప్రశ్నించారు. 2014లో ఒక్క జడ్పీటీసీనే ఏకగ్రీవమైతే  ఇప్పుడు పదుల సంఖ్యలో ఎలా చేయగలిగారని నిలదీశారు. మొత్తం 2700పైగా దౌర్జన్యాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. 20నెలల్లో ఏం చేసారని ఓటేయాలని ప్రశ్నించారు.  అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆమోదం లేని ఈ తరహా ఏకగ్రీవాలు ఉపేక్షించేది లేదు ఖబడ్దార్ అంటూ చంద్రబాబు హెచ్చరించారు. .   టీడీపీ హయాంలో అనేక రంగాల్లో నెంబర్ వన్ గా రాష్ట్రాన్ని నిలిపామని చెప్పారు చంద్రబాబు. 25వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు వేస్తే 20నెలల్లో ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్డు వేశారని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కుంటు పడిందని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా ఉందా? అని ప్రశ్నించారు. ఏపీ ఫైబర్‌ నెట్‌లో చానెళ్లను నిలిపివేసే అధికారం ఎవరిచ్చారని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు.  

నేతాజీ సభలో  జై శ్రీరామ్ నినాదాలు తప్పే! బీజేపీకి బెంగాల్ ఆరెస్సెస్ లీడర్ షాక్  

కోల్ కతాలో నిర్వహించిన  నేతాజి జయంతి వేడుకల్లో జై శ్రీరామ్ నినాదాలు చేయడంపై రాజకీయ రగడ ముదురుతోంది. ఈ ఘటనను బీజేపీ నేతలు సమర్థించుకోగా.. విపక్షాలు మాత్రం తీవ్రంగా తప్పుపట్టాయి. అయితే అనూహ్యంగా ఆరెస్సెస్ నేతల నుంచి కూడా జై శ్రీరామ్ నినాదాలపై వ్యతిరేకత వస్తోంది. కోల్ కతా ఘటనపై స్పందించిన ఆరెస్సెస్ బెంగాల్ విభాగం...  ప్రభుత్వ కార్యక్రమంలో జై శ్రీరామ్ నినాదాలను తాము సమర్థించబోమని చెప్పింది. నేతాజీని గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం నిర్వహించిన  వేడుకల్లో జై శ్రీరామ్ నినాదాలను చేయాల్సింది కాదని ఆరెస్సెస్ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జిష్ణు బసు అన్నారు.  ఆరోజు జరిగిన దానికి చాలా చింతిస్తున్నామన్నారు.   జై శ్రీరామ్ నినాదాలు చేసిన వారు అటు నేతాజీకి, ఇటు రాముడికి గౌరవం ఇవ్వలేదన్నారు జిష్ణు బసు. నేతాజీకి నివాళులర్పించేందుకు ఆ కార్యక్రమం పెట్టారని, అక్కడ అలాంటి నినాదాలు చేయడమేంటని ప్రశ్నించారు. ఆ నినాదాలు చేసిన వారిని బీజేపీ గుర్తించాలని, ఆ కార్యక్రమాన్ని చెడగొట్టడానికే ఎవరైనా కావాలనే ఆ నినాదాలు చేశారా? అనే విషయాలను గుర్తించాల్సిందిగా బెంగాల్ ఆరెస్సెస్ నేత సూచించారు.  ఆ నినాదాలు చేసిన వారు వేరే రాష్ట్రానికి చెందిన నేతలకు సన్నిహితులని బీజేపీ బెంగాల్ నేతలు చెబుతున్నారు.  మమతా బెనర్జీ కూడా ఆ నినాదాలను వివాదాలుగా మార్చి తన రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని ఆరోపించారు.     పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రాజకీయమంతా జై శ్రీరాం, నేతాజి నినాదాల చుట్టే తిరుగుతోంది. ఇటీవల ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకల్లో కొందరు వ్యక్తులు జై శ్రీరామ్ నినాదాలు చేయడం కలకలం రేపింది.  పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతుండగా.. కొందరు  ‘జై శ్రీరామ్’ అని నినాదాలు చేయడంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానించి అవమానిస్తారా అంటూ ఆమె మాట్లాడకుండానే  వేదిక దిగి కోపంగా వెళ్లిపోయారు. 

మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య ఘటన.. వారికి తాయత్తులు కట్టింది నేనే!!

మదనపల్లె జంట హత్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మూఢనమ్మకాల మాయలో పడి కన్నవారే తమ ఇద్దరు కూతుళ్ళ మరణానికి కారణమయ్యారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్యల గురించే చర్చించుకుంటున్నారు. విద్యావంతులైన మూర్ఖులు చేసిన పని ఇదంటూ ఆ తల్లిదండ్రుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా.. మరోవైపు కోట్ల ఆస్తి కోసం ఎవరో ఆ కుటుంబాన్ని హిప్నటైజ్ చేసుంటారని కొందరు అనుమానిస్తున్నారు. ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి.    అయితే తాజాగా అసలు ఆ ఇంట్లో హత్యలకు ముందు ఏం జరిగిందన్న విషయాన్ని ఓ మంత్రగాడు మీడియాకు తెలిపారు. ప్రతిరోజూ ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి గుడికి వెళ్లే అలవాటున్న ఆయన వద్దకు.. పురుషోత్తమ నాయుడు స్నేహితులు వచ్చి.. తెలిసిన వాళ్ళ అమ్మాయికి బాలేదు వచ్చి చూడాలని కోరారు. దీంతో ఆయన పురుషోత్తమ నాయుడు ఇంటికి వెళ్లారు. గేటు దగ్గరకు రాగానే ఇంటి లోపల నుండి బయటకు పెద్దపెద్దగా అమ్మాయి అరుపులు వినిపించాయి. లోపలికెళ్లి చూడగా.. చిన్న కూతురు సాయి దివ్య వింతవింతగా ప్రవర్తిస్తూ కనిపించింది. గట్టిగట్టిగా కేకలు వేస్తూ, అక్కకి ముందు పెడుతూ వింతగా ప్రవర్తించింది. ఇక పెద్దమ్మాయి అలేఖ్య అయితే అసలు స్పృహలో లేదు. ఆమెని లే అమ్మా అంటూ తట్టి లేపితే కాసేపటికి స్పృహలోకి వచ్చింది. అలా కాసేపు వారితో మాట్లాడి, ధైర్యం చెప్పి.. పూజారి బయలుదేరుతుండగా.. అమ్మాయిలు ఎందుకో బాగా భయపడ్డారు, వారికి తాయత్తులు కట్టమని పురుషోత్తమ నాయుడు స్నేహితులు కోరారు. దీంతో ఆయన తన ఇంటికెళ్లి తాయత్తులు సిద్ధం చేసి, అలాగే గుడి దగ్గర నుండి పూజాసామాగ్రి తీసుకొని మళ్ళీ పురుషోత్తమ నాయుడు ఇంటికొచ్చారు. ఇద్దరు యువతులకు తాయత్తులు కట్టి, దేవుడి ముందు కొబ్బరికాయ కొట్టి, పూజ చేసి వచ్చేశారు. మళ్లీ మరుసటి కూడా రావాలని ఆయనను కోరగా.. తాను బిజీగా ఉన్నానని, తర్వాత వస్తానని చెప్పారు. కానీ ఆ తరువాత ఆయనకి పిలుపు రాలేదు. ఇంతలోనే యువతుల హత్య ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇండియాలో సెంచరీ కొట్టిన పెట్రోల్ ధర!

భారత దేశ చరిత్రలో  పెట్రోలు ధర తొలిసారిగా  సెంచరీ  మార్క్ ను తాకింది.  గురువారం రాజస్థాన్ లో బ్రాండెడ్ పెట్రోల్ ధర వంద రూపాయలను క్రాస్ చేసింది.  చమురు సంస్థలు పెట్రోలు ధరను గురువారం  25 పైసల మేరకు పెంచడంతో.. ఆ మేరకు దేశవ్యాప్తంగా ధరలు పెరిగాయి. దీంతో రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో బ్రాండెడ్ పెట్రోలు ధర సరిగ్గా రూ. 101.15ను తాకింది. ప్రస్తుతం శ్రీగంగానగర్ లో సాధారణ పెట్రోలు ధర రూ. 98.40గా ఉంది.  సాధారణ పెట్రోలు ధర దేశవ్యాప్తంగా రూ. 95 నుంచి రూ. 89 మధ్య కొనసాగుతున్నాయి. ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 86.30గా ఉండగా, ముంబైలో రూ. 92.86కు చేరుకుంది. ముంబైలో బ్రాండెడ్ పెట్రోల్ ధర 96 రూపాయలకు దగ్గరలో ఉంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రేటు రూ. 89.77 గా ఉంది. హైదరాబాద్ లో బ్రాండెడ్ పెట్రోల్ రేట్ రూ. 92.65 పైసలుగా ఉంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సాధారణ పెట్రోల్ రేట్ 91 రూపాయలు క్రాస్ అయింది .  జనవరి 9 నుంచి పెట్రోల్ రేట్లు పెరుగుతూనే పోతున్నాయి. ఇదే పద్దతి కొనసాగితే... మరికొన్ని రోజుల్లో దేశ వ్యాప్తంగా పెట్రోల్ రేట్ సెంచరీ క్రాస్ చేయబోతోంది. పెట్రోలు ధరలు రోజురోజుకు పెరిగిపోతుండటంపై వినియోగదారులు ఆందోళన పడుతున్నారు. పెట్రోలు పై విధిస్తున్న విలువ ఆధారిత పన్నులను వెంటనే తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రీమియం పెట్రోల్ లో కాలుష్య కారకమైన ఆక్టేన్ పరిమాణం తక్కువగా ఉంటుంది. 

ఆ ఇద్దరు అధికారులకు గండమే! పంజా విసరబోతున్న నిమ్మగడ్డ? 

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మరోసారి పంజా విసరబోతున్నారా?  ఏపీ సర్కార్ కు తన పవర్ ఏంటో  చూపించబోతున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. రాజ్యాంగ సంస్థ అయిన ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను పాటించని జగన్ రెడ్డి ప్రభుత్వంపై నిమ్మగడ్డ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.  ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, సీనియర్ అధికారి గిరిజా శంకర్ ల పై ఎన్నికల కమిషనర్ సెన్సుర్ ఆర్డర్ ఇచ్చారు. అయితే ఎన్నికల కమిషనర్ ఇచ్చిన సెన్సుర్ ఆర్డర్ ని తిరస్కరిస్తూ సీఎస్ ఆధిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇవ్వడమే తాజా వివాదానికి కారణమైంది.      పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం 2021 జనవరి నాటికి నమోదైన ఓటర్లతో జాబితా తయారు చేసి పంపాలని పంచాయతీ రాజ్‌శాఖకు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు గోపాల కృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్‌లను గతంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కోరారు. అయితే  ఎస్ఈసీ ఆదేశాలను  వారు పట్టించుకోలేదు. ఓటర్ల జాబితాను సిద్ధం చేయలేదు.  దీన్ని సీరియస్ గా తీసుకున్న  నిమ్మగడ్డ రమేష్ కుమార్.. వీరిద్దరిపై అభిశంసన కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి ఆదేశాలు పంపారు. అభిశంసనతో పాటు వారిపై బదిలీ వేటు వేయాలని కూడా ఎస్‌ఈసీ కోరింది.   అయితే ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను జగన్ సర్కార్ పట్టించుకోలేదు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు గోపాల కృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్‌లపై జారీ చేసిన అభిశంసన చర్యలను ప్రభుత్వం.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు తిప్పిపంపింది. ఎన్నికల కమిషనర్ ఆదేశాలను తిరస్కరిస్తూ రెండు వేరువేరు ఉత్తర్వులు జారీ చేశారు  సిఎస్ ఆదిత్యనాథ్ దాస్. ఆల్ ఇండియా  సర్వీస్ రూల్స్ 1969 కి విరుద్ధంగా చర్యలు తీసుకునే అధికారం లేదని చెప్పారు. ఎన్నికల కమిషన్ కు కేవలం సిఫార్సు చేసే అధికారం మాత్రమే ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సీఎస్. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను అతిక్రమించేలా ఎన్నికల కమిషన్ నిర్ణయం ఉందని తిరస్కరిస్తున్నట్లు ఆ జీవోల్లో తెలిపారు.  అఖిల భారత సర్వీసు అధికారులపై అభిశంసన చర్యలు తీసుకునే అధికారం ఎస్‌ఈసీకి లేదంటూ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ లేఖ రాసినట్లు తెలుస్తోంది. అధికారుల నుంచి వివరణ కోరకుండా, నోటీసులు జారీ చేయకుండా అభిశంసన చర్యలను జారీ చేయలేరని  చెప్పినట్లు సమాచారం. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు.  తన శాఖకు చెందిన ఇద్దరు అధికారులపై అభిశంసన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ పంపిన ఉత్తర్వులను వెనక్కి పంపుతున్నట్లు చెప్పారు.  ఎస్‌ఈసీ రాసిన 9 పేజీల లేఖను తిప్పిపంపామని, ఐఏఎస్ అధికారులు ద్వివేదీ, గిరిజా శంకర్‌ యథాతథంగా తమ స్ధానాల్లో కొనసాగుతారని మంత్రి స్పష్టం చేశారు.  ఏపీ సీఎస్ తాజా ఉత్తర్వులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారు చేసి పంపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ద్వివేదీ, గిరిజా శంకర్‌పై ఏపీ సర్కారుతో పాటు కేంద్రానికి కూడా ప్రతిపాదనలు పంపారు నిమ్మగడ్డ. ఏపీ సర్కార్ తన ఆదేశాలను పాటించకపోవడంతో .. వారిపై అభిశంసనను సమర్ధించాలని కేంద్రాన్ని మరోసారి కోరనున్నారు నిమ్మగడ్డ.  కేంద్రం అభిశంసనను సమర్ధిస్తే మాత్రం ఈ ఇద్దరు ఐఏఎస్‌లతో పాటు జగన్  ప్రభుత్వానికి ఇబ్బందులే.  ఇద్దరు సీనియర్ ఐఏఎస్ ల విషయంలో కేంద్రం నిర్ణయం తర్వాత ఎస్ఈసీ నిమ్మగడ్డ మరింత దూకుడు పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏపీ సర్కార్ కు నిమ్మగడ్డ చుక్కలు చూపించడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  

ఆ రైతు నేతలను ఉరి తీయాలి.. బీజేపీ నేత సంచలన లేఖ 

దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజున జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా హింసాకాండకు పాల్పడిన రైతు నాయకులను ఉరి తీయాలని ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై అయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఒక లేఖ కూడా రాశారు. హింసాకాండకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి వారిని పోలీసులతో కాల్చి చంపాలని గుర్జర్ ఆ లేఖలో కోరారు. హింసాకాండలో పాల్గొన్న రైతు నాయకులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి ఉరి తీయాలని నంద్ కిషోర్ అమిత్ షాను కోరారు. ఇది ఇలా ఉండగా ట్రాక్టరు ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాకాండలో కొంత మంది రైతు నాయకులు కూడా పాల్గొన్నారని ఢిల్లీ పోలీసు కమిషనర్ శ్రీవాస్తవ చెప్పారు. రైతు నాయకులు ర్యాలీ సందర్భంగా తాము విధించిన షరతులను పాటించలేదని, మధ్యాహ్నం 12 నుంచి 5 గంటల మధ్య నిరసనకు అనుమతినివ్వగా దానిని వారు ఉల్లంఘించారని, దీంతో 19 మంది నేతలను అరెస్టు చేశామని, మరో 50మందిని కూడా అదుపులోకి తీసుకున్నామని ఢిల్లీ పోలీసు చీఫ్ తెలిపారు.

వేలంలో రూ. 33 లక్షలకు సర్పంచ్ పదవి !

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల హీట్ పెరిగింది. గ్రామాల్లో రాజకీయాలు రంజుగా మారాయి. అయితే కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవిని వేలానికి ఉంచడం ద్వారా వచ్చిన సొమ్మును గ్రామాభివృద్దికి ఖర్చు చేయాలని ప్రజలు నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో ... గతం నుంచి కొనసాగుతున్న వేలం ఆచారం ఈసారి తెరపైకి వచ్చింది. ఇక్కడి సర్పంచ్ పదవిని బీసీలకు కేటాయించగా గతరాత్రి వేలం నిర్వహించారు. మొత్తం నలుగురు సభ్యులు పాల్గొనగా ఓ వ్యక్తి రూ. 33 లక్షలకు పదవిని దక్కించుకున్నాడు. ఈ మొత్తాన్ని గ్రామంలోని శివాలయ నిర్మాణ పనులకు వినియోగించాలని పెద్దలు నిర్ణయించారు. వేలంలో  పదవిని దక్కించుకున్న అభ్యర్థి కాకుండా ఇంకెవరైనా ఎన్నికల బరిలోకి దిగితే, వేలం పాడిన వ్యక్తినే గెలిపించాలని తీర్మానించారు.  వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. 15 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన వ్యక్తి రూ. 5 లక్షలకు సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. అయితే కమిటీ నిర్ణయించిన వ్యక్తి కాకుండా మరో అభ్యర్థి కూడా పోటీ చేయడంతో వేలంలో పదవి దక్కించుకున్న వ్యక్తిని దేవుడి అభ్యర్థిగా ప్రచారం చేసి గెలిపించుకున్నారు. దీంతో ఇప్పుడు కూడా ఎన్నికల్లో మరో వ్యక్తి పోటీ చేస్తే అదే పద్ధతిని అవలంబించాలని పెద్దలు నిర్ణయించారు. గ్రామాభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాంటున్నారు గ్రామస్తులు. పార్టీలకతీతంగా గ్రామాన్ని బాగు చేసుకుంటామని చెబుతున్నారు.  

వైసీపీ ఎమ్మెల్యేలలో పెరిగిపోతున్న అసంతృప్తి.. ఆనం ఆగమాగం!

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేల మనోభావాలు దెబ్బతింటున్నాయి. తమని ఎవరూ పట్టించుకోవట్లేదని, తమకి గౌరవం ఇవ్వట్లేదని ఎమ్మెల్యేలు తెగ ఫీలైపోతున్నారు. మొన్న ఎమ్మెల్యే రోజా.. నిన్న ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి. అందరిదీ ఒకటే బాధ.. అధికార పార్టీ ఎమ్మెల్యేలమైన మమ్మల్ని అధికారులు పట్టించుకోవట్లేదని హర్ట్ అయిపోతున్నారు.   నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డికి అవమానం జరిగింది. జిల్లాలో జరిగిన గణతంత్ర వేడుకలకు తనను ఆహ్వానించలేదంటూ.. జిల్లా అధికారులపై ఆనం రాంనారాయణరెడ్డికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి, అధికార పార్టీకి చెందిన నేత అయిన తనకు కూడా గణతంత్ర వేడుకలకు ఆహ్వానం రాకపోవడం ఏంటంటూ మండిపడ్డారు. నన్ను ఎందుకు ఆహ్వానించలేదు? అధికారుల నిర్లక్ష్యమా? లేక అహంకారమా?. దీన్ని వదిలి పెట్టను. దీనిపై రాష్ట్ర ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా అంటూ ఆనం హెచ్చరించారు.   ఆనం రాంనారాయణరెడ్డి గతంలో కూడా అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నియోజకవర్గానికి తాను ఏమీ చేయలేకపోయానని, జిల్లా అధికారులు వెంకటగిరి నియోజకవర్గాన్ని మర్చిపోయారని అన్నారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా ప్రజలకు అందేవి తప్ప.. మిగతా ఏ కార్యక్రమాలు తాను చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అధ్వాన్నపు అధికార యంత్రాంగాన్ని ఎప్పుడూ చూడలేదని విమర్శలు చేశారు. మంత్రులకు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం డీపీఆర్‌ లు ఇస్తే.. అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియడం లేదని ఆనం అసంతృప్తి వ్యక్తం చేశారు.   సీనియర్ నేత, మంత్రిగా పనిచేసిన అనుభవమున్న ఆనం పరిస్థితే ఇలా ఉంటే మిగతా ఎమ్మెల్యేల పరిస్థితితి ఏంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుంది అన్నట్టుగా.. అధికార పార్టీలో ప్రజాప్రతినిధులు ఎక్కువ ఉండటంతో వారికి దక్కాల్సిన ప్రాధాన్యత తగ్గిపోతుంది. దీంతో ఎమ్మెల్యేలలో అసంతృప్తి, అసహనం పెరిగిపోయి.. ఆవేదన, ఆగ్రహంగా మారుతుంది. ఎక్కువమంది ఉండటంతో అధికారులకు ఎవర్ని ఆహ్వానించాలో ఎవర్ని అహ్వాహించకూడదో అర్థంకావట్లేదు. దీంతో ఎమ్మెల్యేలు హర్ట్ అవుతున్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎమ్మెల్యే పదవి అలంకారం అయిందని ఫీలవుతున్నారు. ఇలా ఎమ్మెల్యేలలో రోజురోజుకి అసంతృప్తి పెరిగిపోతే భవిష్యత్ లో పార్టీకి, ప్రభుత్వానికి ప్రమాదమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మోడీ, షాలు ఇక బలవంతులు కాదు.. బీజేపీ ఎంపీ సంచలన కామెంట్స్ 

ఢిల్లీలో రైతులు, పోలీసుల మధ్య నిన్న తలెత్తిన ఘర్షణలపై బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తనదైన శైలిలో స్పందించారు. బీజేపీ జాతీయ నేతలు ఇకనైనా మేలుకోవాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఈరోజు ట్విటర్‌లో వరుసగా పోస్టులు పెట్టారు. నిన్న ఢిల్లీలో జరిగిన ట్రాక్టర్ పరేడ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై ఉన్న ‘‘బలవంతులు’’ అనే ముద్రకు నష్టం వాటిల్లిందని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. "ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆందోళన కారణంగా ప్రధానంగా ఇద్దరు భాగస్వాముల గౌరవం దెబ్బతిన్నది. ఒకటి, పంజాబ్ కాంగ్రెస్, అకాలీదళ్ నేతలు, వారి మధ్యవర్తులు కాగా... రెండోది, మోదీ- షా ‘‘బలవంతులు’’ అనే ముద్ర. అయితే ఈ ఘటనతో భయపడింది ఎవరు అంటే.. నక్సలైట్లు, డ్రగ్స్ ముఠాలు, ఐఎస్ఐ, ఖలిస్తానీలు. దయచేసి ఇకనైనా బీజేపీ మేలుకోవాలి..’’ అని స్వామి ఆ ట్వీట్ లో వ్యాఖ్యానించారు.   అంతేకాకుండా ఢిల్లీలో శాంతి భద్రతల "వైఫల్యం" పైనా స్వామి విమర్శలు సంధించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను నిలిపివేయాలని తాను ముందుగానే కేంద్రాన్ని అనేక మార్లు కోరానని ఆయన గుర్తుచేశారు. "భారత్‌ను మరింత బలహీనం చేసేందుకు ఈ మార్చి- మేలో చైనా భారీ దాడి చేయవచ్చు. హిందువులను ముట్టడి వేశారు జాగ్రత్త.. ఇకనైనా మేలుకొండి.." అని ఆయన హెచ్చరించారు. రైతుల ఆందోళన కారణంగా ఈ ఏడాది గణతంత్ర వేడుకలు రసాభాసగా మారిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు... ట్రాక్టర్ పరేడ్ పేరుతో తాజాగా ఢిల్లీ నగర వీధుల్లోకి దూసుకెళ్లడంతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మదనపల్లె అక్కాచెల్లెళ్ల డెత్ మిస్టరీ.. కుక్కపై అలేఖ్య పునర్జన్మ ప్రయోగాలు!!

చిత్తూరు జిల్లా మదనపల్లెలో అక్కాచెల్లెళ్ల హత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మూఢ నమ్మకాల మాయలో పడి కన్న తల్లిదండ్రులే వారి ఇద్దరి కూతుళ్ళని కడతేర్చారన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే, అక్కాచెల్లెళ్ల హత్య వెనుక కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో తమ కూతుళ్లు మరణించలేదని, మళ్ళీ తిరిగి వస్తారని తల్లి పద్మజ విచిత్ర వాదన చేయగా.. తండ్రి పురుషోత్తమ నాయుడు మాత్రం హత్యలకు దారితీసిన కారణాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. పెద్ద కూతురు అలేఖ్య చెప్పిన మాటలు నమ్మి, పునర్జన్మలను విశ్వసించి ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం.   మదనపల్లెలో అక్కాచెల్లెళ్ల హత్యకు ప్రధాన కారణం పెద్ద కుమార్తె అలేఖ్యనే అని తెలుస్తోంది. అలేఖ్యకు పునర్జన్మలపై నమ్మకం ఉంది. పునర్జన్మల గురించి వివిధ పుస్తకాలు, వివిధ వీడియోలు చూసి చాలా విషయాలు తెలుసుకుంది. పునర్జన్మ సాధ్యమనే నమ్మకం ఆమెలో కలిగింది. ఆ నమ్మకాన్నే ఆమె తన తల్లిదండ్రుల్లో కలిగేలా చేసింది. తాను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కపై పునర్జన్మ ప్రయోగం చేసానని.. కుక్కని చంపి మళ్ళీ బ్రతికించానని చెప్పింది. ఆమె మాటలను తల్లిదండ్రులు విశ్వసించారు. అంతేకాదు, చిన్నకుమార్తె సాయి దివ్యపై పునర్జన్మ ప్రయోగాలు చేయడానికి అంగీకరించారు. అదే వాళ్ళు చేసిన పెద్ద తప్పు. పునర్జన్మ పేరుతో సాయి దివ్యను చంపేశారు. అయితే ఆమె తిరిగి బ్రతకకపోవడంతో.. అలేఖ్య తనని చంపమని కోరింది. ఇద్దరం కలిసి మళ్ళీ జన్మిస్తామని చెప్పింది. పునర్జన్మ మాయలో పడిపోయిన తల్లి.. అలేఖ్యను కూడా చంపేసింది. ఇలా పునర్జన్మ ప్రయోగాల పేరుతో కన్న తల్లే ఇద్దరు కూతుళ్ళని పొట్టన పెట్టుకుంది. ఈ విషయాన్ని తండ్రి పురుషోత్తమ నాయుడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది.

జనసేనకు అండగా చిరంజీవి!!

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో జనసేనకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఉండనుందని తెలిపారు. బుధవారం పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంలో చిరంజీవి తోడు ఉంటారని అన్నారు. పవన్ మళ్లీ సినిమాలు చేయడానికి చిరంజీవి కారణమని తెలిపారు. ఓ రెండు మూడేళ్లు సినిమాలు చేయాలని, ఆ తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాలు చేసుకోవాలని పవన్ ‌కు చిరంజీవి సూచించారని.. ఆయన సూచన మేరకే పవన్ సినిమాలు చేస్తున్నారన్నారు. పవన్ తో కలిసి నడిచేందుకు తాను సిద్ధమేనన్న సానుకూల సంకేతాలను చిరంజీవి ఇచ్చారని తెలిపారు. పవన్ రాజకీయ ప్రస్థానంలో తాను కూడా అండగా నిలుస్తానని చిరంజీవి హామీ ఇచ్చారన్నారు.    నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలతో జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ ఖాయమని జనసేన కార్యకర్తలు అంటున్నారు. కాగా, గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవి.. కేంద్రమంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాతర్వాత క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు. అయితే తాజాగా నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీని బలపరిచేవిగా ఉన్నాయి.

మరోసారి ఆసుపత్రిలో చేరిన సౌరవ్‌ గంగూలీ

టీమిండియా మాజీ క్రికెటర్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మరోసారి ఆసుపత్రిలో చేరారు. ఛాతీ నొప్పి రావడంతో ఆయన్ని కుటుంబీకులు కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రి అనారోగ్యానికి గురైన గంగూలీ.. బుధవారం మధ్యాహ్నం మరోసారి ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు.    కాగా, ఇటీవల గంగూలీకి గుండెపోటు రావడంతో డాక్టర్లు యాంజియోప్లాస్టీ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 2న జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి స్వల్ప గుండెపోటు రావడంతో కోల్‌కతాలోని వుడ్ ల్యాండ్ ఆసుపత్రికి తరలించారు. అదే రోజున ఆయనకు యాంజియోప్లాస్టీ సర్జరీ చేశారు. ఐదు రోజుల అనంతరం జనవరి 7న గంగూలీ వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన మూడు వారాల్లోనే మరోసారి ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఈ వార్త వినగానే క్రికెట్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

ఎన్నికల విధుల నుంచి వాలంటీర్లు అవుట్  

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. పంచాయతి ఎన్నికల విధులను ఎట్టిపరిస్థితుల్లోనూ వాలంటీర్లకు అప్పగించొద్దని  స్పష్టం చేశారు. ఎన్నికల సన్నాహకంలో భాగంగా బుధవారం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సినేషన్ ఆగకూడదని స్పష్టం చేశారు. ఎన్నికలకు రాష్ట్ర యంత్రాంగం సహకరించకపోతే కేంద్ర బలగాలు వస్తాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఓ ప్రత్యేక యాప్ తీసుకొచ్చిందని.. గొడవలు, అసాంఘీక చర్యల సమాచారాన్ని పౌరులు ఈ యాప్ ద్వారా పంపొచ్చని వెల్లడించారు.        గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను స్వాగతించాలని నిమ్మగడ్డ రమేస్ కుమార్ స్పష్టం చేశారు. ప్రత్యేక అధికారి సంజయ్ అదే బాధ్యతలు చూస్తారన్నారు. ఏకగ్రీవాలు బలవంతంగా అవుతున్నాయా? లేదా అన్నదే పర్యవేక్షిస్తారని చెప్పారు. అయితే మొదటి ప్రాధాన్యంగా ఎన్నికలు తీసుకోవాలని సూచించారు. తరువాత స్థానాల్లో సంక్షేమం కూడా తీసుకోవాలని, కాల్‌ సెంటర్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించాలని నిమ్మగడ్డ సూచించారు. వెబ్‌కాస్టింగ్‌తో ఉపయోగం లేదని, పోలింగ్‌ కేంద్రం చుట్టూ కొంత ప్రాంతాన్నే అది కవర్‌ చేస్తుందని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు. వెబ్‌కాస్టింగ్‌ కోసం కొత్త యాప్‌‌ను తీసుకువచ్చామని, ఆ యాప్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రాల దగ్గర జరిగేదంతా తెలుసుకోవచ్చునని అన్నారు. యాప్‌ ద్వారా వీడియోలతో పాటు ఎస్ఎంఎస్ కూడా పంపవచ్చునని రమేష్ కుమార్ పేర్కొన్నారు. 

విస్కీలో సోడా కలిపే వాళ్లే మంత్రులు!  

తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పని తీరుపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు   కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి. తెలంగాణ వచ్చాకా  దోపిడికి అంతే లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు పోటీ పడి మరీ అవినీతికి పాల్పడుతూ ప్రజా ధనం కాజేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో విస్కీలో సోడా కలిపే వాళ్లలే  మంత్రి పదవులొచ్చాయన్నారు జగ్గారెడ్డి. ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నపుడు హరీష్ రావు ఐదారు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆ బ్లాక్ మనీ తోనే కేసీఆర్ సర్కార్ ను పడేసే ప్రయత్నం చేశారంటూ హాట్ కామెంట్స్ చేశారు జగ్గారెడ్డి.పాస్ పోర్ట్ దందాలో తెలంగాణ  రాష్ట్రానికి కేసీఆరే గురువుని విమర్శించారు. టీఆరెస్ పాలనలో ఐఏఎస్ లు , ఐపీఎస్ లు,అధికారులు, ఉద్యోగ సంఘాలు డమ్మీగా మారిపోయారన్నారు.   తెలంగాణ ఏర్పాటుపైనా  సంచలన  వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ తప్పు పనిచేసిందన్నారు. అయితే ఇది  తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. తెలంగాణ వచ్చాక అవినీతి పెరిగిపోయిందన్నారు. కేసీఆర్  సర్కార్ మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి..  మెగా కృష్ణారెడ్డికి  దారపోసిందని జగ్గారెడ్డి ఆరోపించారు. మారుతీ కారులో తిరిగిన మెగా కృష్ణా రెడ్డికి  ఆరు ఏండ్లలోనే 30 వేల కోట్ల రూపాయల డబ్బు ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాల్లో కృష్ణా రెడ్డి కి కేసీఆర్ దోచిపెట్టారని చెప్పారు జగ్గారెడ్డి.  కాంగ్రెస్ పై ఆరోపణలు చేసిన మంత్రి జగదీశ్ రెడ్డిపై విరుచుకుపడ్డారు జగ్గారెడ్డి. నెహ్రు గురించి మాట్లాడే అర్హత మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి లేదన్నారు. క్యారెక్టర్ లేని జగదీశ్  సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగదీశ్వర్ రెడ్డి కరెంట్ మినిస్టర్ ఐనా.. ఆయన బాడీలో కరెంట్ లేదన్నారు జగ్గారెడ్డి. కేసీఆర్ కు విస్కీలో సోడా కలిపినందుకే ఆయనకు మంత్రి పదవి వచ్చిందన్నారు. తాగిన తర్వాత  ఎక్కడ సంతకం పెడతాడో కూడా జగదీశ్ రెడ్డికి తెలియదని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కేసీఆర్ అవినీతి మొత్తం బయటపెడతామని జగ్గారెడ్డి హెచ్చరించారు. నాగార్జున సాగర్ నిర్మాణంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా తాము సిద్దమేనన్నారు జగ్గారెడ్డి.  అంతకుముందు మాట్లాడిన మంత్రి జగదీశ్ రెడ్డి.. తెలంగాణ ప్రజల ఊసురుతోనే కాంగ్రెస్ పార్టీ నాశనం అయిందని అన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నాయకుల ఆరోపణలను మానుకోవాలని హితవు పలికారు. అవినీతికి ప్రత్యేక మ్యాప్ వేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రాజక్టుల డిజైన్ చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపైన తెలంగాణ ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. భవిష్యత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాదని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్క చుక్క మంచి నీరు కూడా ఇవ్వలేదన్నారు. జైలుకు వెళ్ళిన చరిత్ర కాంగ్రెస్ మంత్రులకు, నాయకులకు ఉందన్నారు. ప్రజల కోసం కట్టే ప్రాజక్టులను అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.   

పక్కా ఎన్నికల కోడ్ తో జగన్ సర్కార్ కు నిమ్మగడ్డ షాక్..  

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వ్యవహారాలు చకచకా జరిగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య కొనసాగుతున్న ఘర్షణ వాతావరణాన్ని తగ్గించేందుకు గవర్నర్ బిశ్వభూషన్ ప్రయత్నాలను ప్రారంభించారు. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తోనూ, ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తోనూ గవర్నర్ రాజ్ భవన్ లో విడివిడిగా సమావేశమై చర్చించారు. ఎన్నికల నిర్వహణ అంశంలో ఇద్దరూ పరస్పరం సహకరించుకోవాలని అయన కొన్ని సూచలను చేశారు.   ఇది ఇలా ఉండగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇచ్చే కుల ధృవీకరణ పత్రాలను జారీ చేయడం నిలిపివేయాల్సిందిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తహసీల్దార్లకు ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నవరత్నాలు పథకంలో భాగంగా ప్రభుత్వం వాడుతున్న లోగోకు బదులుగా, వేరే లోగోను వాడాలని అయన సూచించారు. మరోపక్క గ్రామాలలో సర్వం తామే అయి హవా నడిపిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్ల వద్ద ఉన్న ఫోన్లు, ఐడీ కార్డులను స్వాధీనం చేసుకోవాలని నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాలంటీర్లకు ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు.   గొడవలు, అసాంఘిక చర్యలకు సంబంధించిన సమాచారాన్ని పౌరులు కూడ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావొచ్చని ఆయన పేర్కొన్నారు. దీనికోసం ఎన్నికల సంఘం ప్రత్యేక యాప్ తీసుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ప్రక్రియకు అవసరమైతే ప్లాన్ బీ ని కూడ అమలు చేస్తామన్నారు. ఎన్నికల బందోబస్తుకు కేంద్ర బలగాలను ఉపయోగించడమే ప్లాన్ బీ అని ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించారు. కాల్ సెంటర్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎలాంటి ఉపయోగం లేదన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కొద్ది ప్రాంతాన్నే రికార్డు చేస్తోందని ఆయన చెప్పారు. వెబ్ కాస్టింగ్ లో పూర్తిస్థాయి నాణ్యత లేదన్నారు. వెబ్ కాస్టింగ్ పరిధి అవతల జరిగే సంఘటనల మాటేంటని ఆయన ప్రశ్నించారు.

జైలు నుండి విడుదలైన శశికళ... ఆమెకు షాకిచ్చిన పళని సర్కార్ 

అక్రమాస్తుల కేసులో బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ఈరోజు (బుధవారం) ఉదయం విడుదల అయ్యారు. కర్నాటక జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న శశికళకు విడుదలకు సంబంధించిన అధికారిక పత్రాలను సమర్పించారు. అనారోగ్యం కారణంగా శశికళ ప్రస్తుతం బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క ఆమెకు చికిత్స చేస్తున్న సమయంలోనే ఆమె కరోనా బారిన పడినట్టుగా వైద్యులు తేల్చారు. శశికళ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు ప్రకటించారు. అయితే మరో 10 రోజుల పాటు శశికళకు విశ్రాంతి అవవసరమని వైద్యులు సూచించారు. దీంతో మరికొద్ది రోజులపాటు ఆ నగరంలోనే ఆమె బస చేయనున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో ఆమె చెన్నై నగరానికి రానున్నట్టు విశ్వసనీయ సమాచారం. తమిళనాడు అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న సమయంలో శశికళ జైలు నుండి విడుదల కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. ఇది ఇలా ఉండగా శశికళ జైలు నుండి విడుదలైన రోజునే జయలలిత స్మారక భవనాన్ని తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రారంభించారు. దివంగత తమిళనాడు సీఎం జయలలిత నివాసం ఉన్న పోయేస్ గార్డెన్ ను జయలలిత స్మారక భవనంగా ప్రభుత్వం మార్చింది.

ఏపీ ఎన్నికల పంచాయతీ ద్వివేది మెడకు చుట్టుకోనుందా...! 

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాల మధ్య నడిచిన వివాదం మధ్యలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మెడకు చుట్టుకోనుందా.. అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. గతంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా పని చేసిన ద్వివేది. కారణమేదైనప్పటికీ.. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ ఆదేశాలను అయన ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారు. దీంతో అయన తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేవలం బదిలీతోనే సరిపెట్టకుండా... గోపాలకృష్ణ ద్వివేదీతో పాటు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్‌ ల పై అభిశంసన ప్రొసీడింగ్స్‌ను ఎస్‌ఈసీ జారీ చేశారు.   ద్వివేదీపై వచ్చిన ప్రధాన అభియోగం.. కొత్త ఓటర్ల జాబితాను సిద్ధం చేయకపోవడం. సాక్షాత్తు హైకోర్టుకు మాట ఇచ్చి కూడా ఆయన 2021 జాబితా ప్రకారం.. కొత్త ఓటర్ల లిస్ట్‌ను ప్రకటించలేదు. దీంతో అర్హులైన యువ ఓటర్లకు ఓటు హక్కు లేకుండా పోయిందని… దీనికి బాధ్యత అంతా ద్వివేదీనేనని నిమ్మగడ్డ విడుదల చేసిన అభిశంసన ప్రొసీడింగ్స్‌లో స్పష్టం చేశారు. అభిశంసన ప్రొసీడింగ్స్ లో ద్వివేదిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసే ప్రయత్నం చేశారని నిమ్మగడ్డ ఆరోపించారు. అంతేకాకుండా తన ప్రొసీడింగ్స్.. ద్వివేదీ సర్వీస్ రికార్డుల్లో పొందు పరచాలని అయన స్పష్టం చేశారు. అదే సమయంలో వారు ఎన్నికల విధులు నిర్వహంచడానికి అర్హులు కాదని స్పష్టం చేశారు.   దీంతో నిమ్మగడ్డ మాత్రమే కాకుండా ద్వివేదీపై హైకోర్టు కూడా ధిక్కరణ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 2019 ఓటర్ల జాబితా ఆధారంగా తనకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండాపోయిందని.. గుంటూరుకు చెందిన అఖిల అనే యువతి హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ సమయంలో… పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ద్వివేదీ నిర్లక్ష్యాన్ని ప్రత్యేక అఫిడవిట్ రూపంలో ఎస్‌ఈసీ కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. మరోపక్క డివిజన్ బెంచ్ విచారణ సమయంలో.. కొత్త ఎన్నికల జాబితా ప్రకటిస్తామని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చింది కానీ అలా ప్రకటించలేదు. దీంతో విచారణలో ఈ అంశం కూడా ధర్మాసనం కనుక పరిగణనలోకి తీసుకుంటే.. ద్వివేదీకి కష్టాలు తప్పవని అధికార వర్గాలలో చర్చ నడుస్తోంది. మొత్తానికి ఇటు ఎస్ఈసీ, అటు జ‌గ‌న్ మ‌ధ్య ద్వివేదీ న‌లిగిపోయార‌ని… దీంతో ఆయ‌నే బ‌ల‌య్యేలా ఉన్నార‌న్న అభిప్రాయం న్యాయ‌నిపుణుల్లో వ్య‌క్త‌మ‌వుతుంది.

63  అడిగితే.. 7.5 శాతమే ఫిట్మెంట్ ! టీఎస్ ఉద్యోగులకు పీఆర్సీ కమిటి షాక్ 

ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న తెలంగాణ ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది.  సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న తమకు మంచి జరుగుతుందనకుంటున్న వారి ఆశలపై నీళ్లు చల్లింది పీఆర్సీ కమిటి. ఉద్యోగుల మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్‌ మాత్రమే ఇవ్వాలని సిఫారస్ చేస్తూ.. తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం నివేదిక ఇచ్చింది. పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించింది. కనీస వేతనం రూ. 19 వేలు, గరిష్ట వేతనం రూ. 1,62,700లుగా వేతన సవరణ కమిషన్​ సూచించింది. సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ ను ఇవ్వాలని రికమండ్ చేసింది. 32 నెలలపాటు కొనసాగిన అధ్యయనం గత నెల 31న సీఎస్​కు అందించింది. దీన్ని దాదాపు 28 రోజుల పాటు సీల్డ్​ కవర్​లోనే ఉంచిన అధికారులు.. బుధవారం ఉదయం విడుదల చేశారు. హెచ్​ఆర్​ఏ శ్లాబుల్లో మార్పులు చేసింది. 11, 13, 17,24గా నిర్ణయించారు.  గతంలో 12,14,20,30 శాతంగా శ్లాబులు ఉన్నాయి. వాస్తవంగా ఉద్యోగులు మాత్రం 63 శాతం ఫిట్ మెంట్  అడిగారు. ఇందుకోసం పోరాటాలు కూడా చేశారు. 63 శాతం అడిగితే కనీసం 40 శాతమైనా ఇస్తారని భావించారు. గత ఏడాది జూలైలోనే ఏపీ ప్రభుత్వం.. అక్కడి ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించింది. దీంతో తమకు అంతకంటే ఎక్కువే వస్తుందని తెలంగాణ ఉద్యోగులు భావించారు. కాని పీఆర్సీ కమిటి మాత్రం కేవలం 7.5 శాతం ఫిట్ మెంటే సిఫారస్ చేసింది. హెచ్‌ఆర్‌ఏ తగ్గించాలని, గ్రాట్యూటీ పరిమితి రూ. 12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచాలని సూచించింది.   శిశు సంరక్షణ సెలవులు 90 నుంచి 120 రోజులకు పెంపుదల చేయాలని కోరింది. సీపీఎస్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంచాలని సర్కార్ కు పీఆర్సీ కమిటి సిఫారస్ చేసింది.  పీఆర్సీ కమిటి సిఫార్సు చేసిన అంశాలను రాతపూర్వకంగా ఉద్యోగ సంఘాలకు ఇవ్వనున్నారు సీఎస్, బుధవారం నుంచి 13 గుర్తింపు సంఘాలతో సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ చర్చలు జరపనుంది. ఇందులో టీఎన్జీవో, టీజీవో, రెవెన్యూ సంఘాలు, పలు టీచర్ల సంఘాలు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్, డ్రైవర్ల యూనియన్ ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. చర్చలకు అటెండ్ అయిన అన్ని సంఘాల సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తీసుకున్న తరువాత సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ సీఎం కేసీఆర్​కు బ్రీఫ్ నోట్ ఇవ్వనుంది. ఈ నెలాఖరులో సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో చర్చించి పీఆర్సీ ఫిట్ మెంట్ ప్రకటించనున్నారు. వారం, పది రోజుల్లో చర్చలు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించటంతో ఉన్నతాధికారులు ప్రాసెస్‌ను స్పీడప్ చేశారు. 2018 జులై 1 నుంచి ఈ వేతన సవరణ అమలుకు కమిషన్‌ సిఫార్సు చేసింది. ఉద్యోగుల పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వం 2018 మే 18 న   సీఆర్ బిశ్వాల్ చైర్మన్ గా మహ్మద్ ఆలీ రఫత్, ఉమా మహేశ్వరావులతో కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ గడువును ప్రభుత్వం మూడు సార్లు పెంచింది. చివరగా 2020 ఫిబ్రవరిలో పెంచింది. రిపోర్ట్ అందజేయాలని సీఎం ఆదేశించడంతో 31 నెలల స్టడీ తరువాత 2020  డిసెంబర్ 31 న సీఎస్ సోమేశ్ కుమార్ కు అందచేసింది.  పీఆర్సీ కమిటి సిఫారసులపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. 32 నెలల పాటు కసరత్తు చేసి ఇంత తక్కువగా సిఫారస్ చేయడమేంటని మండిపడుతున్నారు. తమకు గౌరవప్రదమైన ఫిట్మెంట్ ప్రకటించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.