నీ ఇంటికే వచ్చి తేల్చుకుంటా ! జగన్ కు చంద్రబాబు వార్నింగ్
posted on Feb 2, 2021 @ 2:21PM
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పై దాడితో విజయవాడలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పట్టాభిరామ్ కారులో ఆఫీసుకు వెళుతుండగా కొందరు దుండగులు రాడ్లతో దాడి చేశారు. కారు ధ్వంసం కాగా.. ఈ దాడిలో పట్టాభిరామ్ గాయపడ్డారు. ఈ ఘటనతో పార్టీ అధినేత చంద్రబాబు సహా టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. దుండగుల దాడిలో ధ్వంసమైన పట్టాభి కారుతో సహా టీడీపీ నేతలు సీఎం జగన్ నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. తనపై జరిగిన దాడి పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన పట్టాభి, ఇతర టీడీపీ నేతలు సీఎంను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే వారిని పట్టాభి నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలకు, పోలీసులకు తోపులాట చోటుచేసుకుంది. పట్టాభి ఇంటికి టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉండడంతో పోలీసు బలగాలను భారీగా మోహరించారు.
దుండగుల దాడిలో గాయపడిన పట్టాభిని పరామర్శించారు చంద్రబాబు. వైసీపీ సర్కార్, సీఎం జగన్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. 'రాష్ట్ర ముఖ్యమంత్రి, ఓ మంత్రి, ఇంకొంత మంది రౌడీలు రెచ్చిపోతున్నాను. వైసీపీ నేతలు గూండాలుగా తయారైపోయారు. వారికి కళ్లు నెత్తికెక్కి ఏమైనా చేయగలమని భావిస్తున్నారు. కొంత మంది కలిసి ఓ పథకం కూడా వేశారు. పట్టాభిపై దాడికి ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలి' అని చంద్రబాబు నాయుడు అన్నారు.
'ప్రభుత్వ అవినీతిని పట్టాభి ప్రశ్నిస్తున్నారు అందుకే ఆయనపై దాడులకు పాల్పడ్డారు. వైసీపీ నేతలు బరి తెగించి దాడులు చేస్తున్నారు. పట్టాభిని చంపాలనే దాడి చేశారు. ఇంతకు ముందు కూడా పట్టాభిపై దాడి జరిగింది. ఇనుప రాడ్లు, ఇతర మారణాయుధాలతో దుండగులు వచ్చి దాడి చేశారు. డ్రైవర్ ను బయటకు లాగేశారు. పట్టాభి బలంగా ఉంటారు కాబట్టి తట్టుకోగలిగారు. వేరే వారయితే తట్టుకోలేకపోయే వారు. వైసీపీ నేతలు ఏమనుకుంటున్నారు?' అని చంద్రబాబు నాయుడు అన్నారు.
టీడీపీ నేతలందరూ వైసీపీ దాడులను ఎండగడుతున్నారు. దీంతో వైసీపీ నేతలు టీడీపీ నేతలపై దాడులకు దిగుతున్నారు. ఇది పులివెందుల కాదు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి' అని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఓ వైపు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. ఇక్కడ పట్టాభిపై దాడి చేశారు. ప్రజాస్వామ్యంపై దాడి అంటే ఇది ప్రజలపై దాడి. ప్రజల కోసం పోరాడుతోన్న వారిపై దాడులు చేస్తారా? ఎంత మందిని చంపుతారు? చంపేస్తారా అందర్నీ? చంపండి చూస్తాం. ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి' అని చంద్రబాబు నాయుడు చెప్పారు.
'మీ బూతు మంత్రులకు చెప్పుకో జగన్.. ఇటువంటివి జరిగితే చూస్తూ ఊరుకోబోము. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఇటువంటి దాడులు జరిగాయా? మా నేతలు ఎవరైనా తప్పుగా మాట్లాడితేనే నేను వారిని కంట్రోల్ చేసేవాడిని. గతంలో టీడీపీ నేతలపై దాడులు జరిగితే డీజీపీ సరైన రీతిలో స్పందిస్తే ఇప్పుడు మళ్లీ దాడి జరిగేవి కాదు' అని చంద్రబాబు నాయుడు చెప్పారు.
'మీకు జీతం ఎవరు ఇస్తున్నారు? జగన్ ఇవ్వట్లేదు. ప్రజలు కడుతోన్న పన్నులతో మీకు జీతం వస్తోంది. మేము ప్రజల తరఫున పోరాడుతున్నాం. అటువంటి మాపై దాడులకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే అర్హత జగన్ కు లేదు. వెంటనే రాజీనామా చేయాలి' అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఈ రోజు మావాళ్లందరూ కలిసి ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తారు.. ఈ దాడులను కట్టడి చేయాలని ఆయనను అడుగుతారు. ఎందుకిలా దాడులు చేయిస్తున్నారని అడుగుతారు. మా ప్రాణాలు కావాలా? అని అడుగుతారు. ఆ తర్వాత ఆయన స్పందన ఎలా ఉంటుందో చూసి పోరాడతాం' అని చంద్రబాబు అన్నారు.