ముగ్గురు పిల్లల తల్లైనా వైసిపి ఐతే ఓకే... అధికారుల నిర్వాకం

ఏపీలో ప్రస్తుతం జరుగుతున్నా ఎన్నికలలో ప్రభుత్వ అధికారులు రూల్స్ కు కొత్త కొత్త అర్ధాలు తీస్తూ అధికార వైసిపికి సేవ చేసుకుంటున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం స్కిన్నెరపురంలో నామినేషన్ల సందర్భంగా.. అధికారులు ముగ్గురు పిల్లల నిబంధనకు కొత్త అర్ధం చెప్పారు. ఇక్కడ వైసీపీ మద్దతుతో అడ్డాల భాను లలిత మహాలక్ష్మి, టీడీపీ మద్దతుతో కునుపూడి నాగదుర్గ అనే మహిళలు నామినేషన్లు వేశారు. అయితే అధికారులు మహాలక్ష్మి నామినేషన్‌ ను ఆమోదించి, మరోపక్క నాగదుర్గ నామినేషన్‌ మాత్రం తిరస్కరించారు. దీని గురించి ఇక్కడి అధికారులను ప్రశ్నిస్తే మహాలక్ష్మికి మొదటిగా ఇద్దరు కవలలు, తరువాత ఒకరు జన్మించడంతో ఆమె నామినేషన్ ను అనుమతించామని, నాగదుర్గకు ముందు ఒకరు.. తర్వాత ఇద్దరు కవల పిల్లలు జన్మించడంతో ఆమె నామినేషన్ ను తిరస్కరించామని చెప్పారు. అధికారులు చెపుతున్న ఈ వింత భాష్యానికి ఆశ్చర్యపోయిన నాగదుర్గ తాజాగా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరారు.

విశాఖపై మాట్లాడొద్దని ఎంపీలకు జగన్ ఆదేశం! ఢిల్లీలో బయటపడిన వైసీపీ చీకటి బాగోతం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీకటి బాగోతం బట్టబయలైంది. ఆంధ్రప్రదేశ్ పై జగన్ రెడ్డి సర్కార్ కు ఎంత చిత్తశుద్ది ఉందో ఆయన సొంత మీడియా సాక్షి టివిలోనే బహిర్గతమైంది. కేంద్రంపై మాట్లాడకుంటా సైలెంట్ గా ఉండాలని తాడేపల్లి  నుంచి అందిన ఆదేశాలు వచ్చాయని చెబుతూ.. ఆ పార్టీ ఎంపీలు అడ్డంగా దొరికి పోయారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు మీడియా సమావేశం నిర్వహించారు. బాలశౌరితో పలువురు ఎంపీలు అప్పటికే కూర్చుని ఉండగా.. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబాబు లేటుగా వచ్చారు. ఆయన వస్తూనే విశాఖ ఉక్కు గురించి నేను మాట్లాడాలా అని బాలశౌరిని అడిగారు.  అయితే పిల్లి అలా అంటుంగానే  వద్దు వద్దు.. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడొద్దని సీఎం చెప్పాడని బాలశౌరి చెప్పడం సాక్షి లైవ్ లో స్పష్టంగా వినిపించింది. అంతేకాదు పార్టీ స్టాండ్ తీసుకున్న తర్వాతే  విశాఖపై మాట్లాడాలని చెప్పాడన్నారు బాలశౌరి. సీఎం స్టాండ్ తీసుకున్నాక చెబుతారని.. అప్పటిదాకా ఏం మాట్లాడొద్దని చెప్పారు. అయితే మరీ నేనేం మట్లాడాలని సుభాష్ చంద్రబోస్ అడగగా.. విశాఖ కాకుండా వేరే విషయాలు మాట్లాడండి.. చంద్రబాబును తిట్టండని పిల్లికి బాలశౌరి చెప్పడం స్పష్టంగా వినిపించింది..  విశాఖ ఉక్కు...ఆంధ్రుల హక్కు’ అంటూ పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తోంది కేంద్ర సర్కార్. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం అమ్మేస్తున్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్నజగన్ రెడ్డి సర్కార్ మాత్రం స్పందించడం లేదు. తమకేమి సంబంధం లేదన్నట్టుగా మొద్దు నిద్ర పోతోంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి  వైసీపీ ప్ర‌భుత్వం క‌నీసం ప్ర‌శ్నించ‌లేక‌పోతోంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం మౌనంగా ఉండటంపై ఆంధ్రా జనం మండిపోతున్నారు. తాజాగా ఢిల్లీలో పార్టీ ఎంపీల గుసగుసలు బయటికి రావడం, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడొద్దని సీఎం చెప్పినట్లు... లీక్ కావడంతో జనాలు మరింతగా రగిలిపోతున్నారు.  సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర హక్కులను తాకట్టు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.   టీడీపీ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కుని తన స్వార్ధ ప్రయోజనాల కోసం సీఎం జగన్ తాకట్టు పెడుతున్నారంటూ నారా లోకేష్ ట్విటర్ వేదికగా  తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఇలా ఒక్కో ప‌రిశ్ర‌మా అమ్మేయ‌డం, అడ‌వులు-కొండ‌ల్ని క‌బ్జా చేయ‌డ‌మేనా ప‌రిపాల‌నా రాజ‌ధాని అంటే జ‌గ‌న్‌రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు లోకేష్. కాకినాడ పోర్టు విజయసాయి రెడ్డి అల్లుడికి వ‌ర‌క‌ట్నంగా రాసిచ్చేశారని విమర్శించారు. విశాఖ ఏజెన్సీలో లేట‌రైట్ గ‌నులు బాబాయ్ సుబ్బారెడ్డికి బ‌హూక‌రించారని, త‌న దోపిడీ మ‌త్తుకి మంచింగ్‌గా మ‌చిలీప‌ట్నం పోర్టుని నంజుకు తింటున్నారన్నారని ఆయన ఆరోపించారు.‌ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్‌ని తన సూట్ కేసు కంపెనీలతో తుక్కు రేటుకి కొని దోపిడీ వికేంద్రీక‌ర‌ణ ప‌రిపూర్ణం చేసుకోబోతున్నారని ఆరోపించారు. ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కుని కాపాడుకుంటామని నారా లోకేష్ ట్వీట్ చేశారు.   

బిసికి సీఎం పీఠం పై ఒక్క రోజులోనే సోము వీర్రాజు యూ టర్న్

ఏపీలో బీసీలను సీఎం చేసే దమ్ము, ధైర్యం కేవలం బిజెపి కి మాత్రమే ఉందని.. చంద్రబాబు కానీ జగన్ కానీ తమ పార్టీ తరపున బీసీ ని ముఖ్యమంత్రి చేయగలరా అని నిన్న వీరావేశంగా సవాల్ విసిరిన ఎపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక్క రోజులోనే యూ టర్న్ తీసుకున్నారు. నిన్న సోము వీర్రాజు పాత్రికేయులతో మాట్లాడుతూ.. చంద్రబాబు, జగన్ లు బీసీలను కేవలం తమ రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. అయితే వారిద్దరూ బీసీలకు చేసింది మాత్రం ఏంలేదని పేర్కొంటూ.. అటు చంద్రబాబు కానీ ఇటు జగన్ కానీ ఒక బీసీ ని సీఎం చేయగలరా అంటూ సవాల్ విసిరారు. కేవలం బీజేపీ మాత్రమే బీసీ ని సీఎం చేయగల దమ్ము కలిగిన పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే వీర్రాజు వ్యాఖ్యలతో మీరు పక్షాలైన బిజెపి, జనసేన మధ్య చిచ్చు రేపినట్లుగా వార్తలు వచ్చాయి.   సోము వీర్రాజు తాజాగా ఇవాళ మీడియాతో మాట్లాడుతూ సీఎం అభ్యర్థిని నిర్ణయించే స్థాయి తనది కాదని, తమది జాతీయ పార్టీ కనుక తమ కూటమి తరపున సీఎం అభ్యర్థి ఎవరు అన్నది బీజేపీ జాతీయ అధినేత జేపీ నడ్డా మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి చర్చించి నిర్ణయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. తాను నిన్న చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు, సీఎం జగన్ లు బీసీలను తమ స్వార్ధ రాజకీయాలకు ఓటు బ్యాంకుగా ఎలా వాడుతున్నాయో చెప్పటానికి మాత్రమేనని ఆయన వివరణ ఇచ్చుకున్నారు.

ఎస్ఈసి నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికినట్టుంది... రోజా సంచలనం

ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారంలో ఎస్ఈసి నిమ్మగడ్డ పై గత కొంత కాలంగా వైసిపి నాయకులు అభ్యంతరకరమైన కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో ఎమ్మెల్యే రోజా కూడా చేరారు. ఎస్ఈసి నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయినట్టుందంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తనకు కావాల్సిన అధికారులను నియమించుకున్న తరువాత కూడా ఏకగ్రీవ ఎన్నికలను ఆపటంతో ఆయనపై ఆయనకు నమ్మకం లేదనిపిస్తోందని చెప్పారు. అంతేకాకుండా ప్రజల తీర్పును గౌరవించకపోతే బాగుండదని రోజా వ్యాఖ్యానించారు. ఎస్ఈసి ఆదేశాలతో గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను బదిలీ చేసిన గతి తెలిసిందే. అయితే ఆ రెడీనందు జిల్లాలలోను మొదటి విడతలో జరిగిన ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించొద్దని, ఫిర్యాదులు పరిష్కరించిన తర్వాతే ఫలితాలు ప్రకటించాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు. ఈ ఫిర్యాదులపై పూర్తి నివేదిక పంపాలని కలెక్టర్లను ఎన్నికల కమిషన్‌ కోరింది. లోపాలు ఉన్నట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కూడా నిమ్మగడ్డ హెచ్చరించారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు జరిగినట్లు గుర్తించామన్నారు. 

ఎస్ఈసి యాప్ కి బ్రేక్.. ఈ నెల తొమ్మిది వరకు ఆపాలన్న హైకోర్టు ? 

  *ఏపీ పంచాయితీ ఎన్నికల సందర్బంగా ఎన్నికల పిర్యాదుల సేకరణకు కోసం ఎన్నికల కమిషన్ రూపొందించిన  ఈ - వాచ్ యాప్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ-వాచ్‌ యాప్‌ను 9వ తేదీ వరకు ఆపరేట్‌ చేయొద్దని న్యాయస్థానం ఎన్నికల కమిషన్ కి ఆదేశించింది. ఈ-వాచ్‌ యాప్‌కు సెక్యూరిటీ డేటా సర్టిఫికెట్‌ కోసం గురువారమే దరఖాస్తు చేశారని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ పేర్కొంది. అనుమతి ఇచ్చేందుకు 5 రోజులు పడుతుందని ఏపీటీఎస్‌ చెప్పింది. ఈలోపు యాప్‌ను పరిశీలించాలని ఏపీటీఎస్‌కు ధర్మాసనం సూచించింది.ఈ నెల 9కి విచారణ వాయిదా పడింది. సెక్యూరిటీ పరిశీలన లేకుండా యాప్‌ను ఉపయోగించడానికి వీల్లేదని పిటిషనర్లు కోరారు. ప్రభుత్వ యాప్‌ ఉండగా ఈ యాప్‌ను ఎందుకు కొత్తగా క్రియేట్  చేశారని పిటిషనర్లు ప్రశ్నించగా.. ఎస్‌ఈసీకి ఒక యాప్‌ను రూపొందించుకునే అనుమతి భారత ఎన్నికల సంఘం ఇచ్చిందని ఎన్నికల కమిషనర్‌ న్యాయవాది స్పష్టం చేశారు. గతంలో ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల కమిషన్‌ కూడా ఇలా తయారు చేసిందని న్యాయవాది వెల్లడించారు.   

విశాఖ ఉక్కు పోతుంటే మౌనమేంటీ జగన్ రెడ్డి! 

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ను కాపాడాలంటూ కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ఘాటుగా స్పందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కుని తన స్వార్ధ ప్రయోజనాల కోసం సీఎం జగన్ తాకట్టు పెడుతున్నారంటూ ఆయన  ట్విటర్ వేదికగా  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 28 మంది వైసీపీ ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం లాభమని ప్రశ్నించారు. 32 మంది ప్రాణాలు త్యాగంచేసి సాధించుకున్న స్టీల్‌ప్లాంట్.. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు నారా లోకేష్.  విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా వేలాది మంది ప్ర‌త్య‌క్షంగా, ల‌క్ష‌లాదిమంది ప‌రోక్షంగానూ ఉపాధి పొందుతున్నారని చెప్పారు లోకేష్.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికే మ‌ణిహారంగా వెలుగొందుతోన్న విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని అమ్మేస్తుంటే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి మౌనం దాల్చ‌డం దేనికి సంకేతమన్నారు. ఇలా ఒక్కో ప‌రిశ్ర‌మా అమ్మేయ‌డం, అడ‌వులు-కొండ‌ల్ని క‌బ్జా చేయ‌డ‌మేనా ప‌రిపాల‌నా రాజ‌ధాని అంటే జ‌గ‌న్‌రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు లోకేష్. కాకినాడ పోర్టు విజయసాయి రెడ్డి అల్లుడికి వ‌ర‌క‌ట్నంగా రాసిచ్చేశారని విమర్శించారు. విశాఖ ఏజెన్సీలో లేట‌రైట్ గ‌నులు బాబాయ్ సుబ్బారెడ్డికి బ‌హూక‌రించారని, త‌న దోపిడీ మ‌త్తుకి మంచింగ్‌గా మ‌చిలీప‌ట్నం పోర్టుని నంజుకు తింటున్నారన్నారని ఆయన ఆరోపించారు.‌ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్‌ని తన సూట్ కేసు కంపెనీలతో తుక్కు రేటుకి కొని దోపిడీ వికేంద్రీక‌ర‌ణ ప‌రిపూర్ణం చేసుకోబోతున్నారని ఆరోపించారు. ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కుని కాపాడుకుంటామని నారా లోకేష్ ట్వీట్ చేశారు.    

కేటీఆర్ పై క్లారిటీ కోసమేనా ? ఈనెల 7న టీఆర్ఎస్ కీలక సమావేశం

ఈనెల 7వ తేదిన తెలంగాణ రాష్ట్ర సమితి కీలక సమావేశం జరగబోతోంది.  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం  2 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది.  టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డిసిసిబి అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.  పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై  చర్చిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.   తెలంగాణ ప్రభుత్వంలో మార్పులు ఉంటాయని, కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, లీడర్లు ఓపెన్ గానే కేటీఆర్ కాబోయే సీఎం అని ప్రకటనలు చేస్తున్నారు. కొందరు మంత్రులు కూడా ఇదే వాయిస్ వినిపిస్తున్నారు. కేటీఆర్‌ను సీఎం చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో పార్టీకి చెందిన అన్ని స్థాయిల్లోని నాయకులతో కేసీఆర్ సమావేశం జరపబోతుండటం  ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ సమావేశంలో కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయబోయే అంశంపై సీఎం కేసీఆర్ నేతలకు క్లారిటీ ఇవ్వొచ్చనే చర్చ జరుగుతోంది. అయితే పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు, పార్టీ వార్షికోత్సవంపైనే చర్చించడానికే కేసీఆర్ సమావేశం పెడుతున్నారని కొందరు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి మార్పు అంశంలో సమావేశంలో చర్చకు వచ్చే అవకాశమే లేదంటున్నారు. అసలు  కేటీఆర్ ను సీఎం చేసే ఆలోచనే కేసీఆర్ కు లేదని చెబుతున్నారు.   తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ దూకుడుగా వెళుతోంది. వరుస విజయాలతో జోరు మీదున్న బీజేపీకి చెక్ పెట్టడానికి ఏ రకమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలనే దానిపై కూడా  పార్టీ  నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. ఈ మధ్య టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు అనవసర వ్యాఖ్యలతో వివాదాల్లో చిక్కుకుంటున్నారు.అలాంటి నేతలకు కేసీఆర్ స్వయంగా క్లాస్ తీసుకునే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. 

రైల్వే జోన్ ఎప్పుడో చెప్పలేం! ఏపీపై కేంద్రానికి కనికరం రాదా!

ఆంధ్రప్రదేశ్ పై కేంద్ర సర్కార్ చిన్నచూపు మరోసారి స్పష్టమైంది. ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేకంగా నిధులేమి కేటాయించలేదు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రస్తావన కూడా తేలేదు.  రైల్వే విషయంలోనూ ఏపీపై కేంద్రం కనికరించడం లేదు. బడ్జెట్ లో విశాఖ రైల్వే జోన్ పై ప్రకటన వెలువడుతుందని ఆశించినా నిరాశే మిగిలింది. తాజాగా విశాఖకు రైల్వే జోన్ అంశంపైనా సన్నాయి నొక్కులు నొక్కుతోంది కేంద్రం. విశాఖకు రైల్వే జోన్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేమని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. రైల్వేజోన్‌ ప్రారంభానికి నిర్దిష్ట కాలపరిమితి లేదన్నారు. రైల్వేజోన్‌ డీపీఆర్‌ ఇంకా పరిశీలనలోనే ఉందని గోయల్‌ చెప్పారు.  శుక్రవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు గోయల్‌ ఈ సమాధానం ఇచ్చారు.  విశాఖ రైల్వే డివిజన్‌ను ఆంధ్రా డివిజన్‌లో చేర్చే ఉద్దేశం లేదని కూడా తెలిపారు. రైల్వేజోన్‌ ప్లానింగ్‌కు ఓఎస్‌డీని నియమించామని చెప్పారు.  ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాలని ఏపీ విభజన చట్టంలో ఉంది. దాని కోసం ఆరేండ్లుగా పోరాటం జరుగుతూనే ఉంది. గత టీడీపీ సర్కార్ కూడా విశాఖ రైల్వే జోన్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. కాని కేంద్ర సర్కార్ స్పందించ లేదు. అయితే విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి రైల్వే జోన్ ఇస్తున్నామంటూ   గత ఎన్నికలకు ముందుగ కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసి రెండేండ్లు  కావస్తున్నా... ఆ ప్రక్రియ ప్రారంభమే కాలేదు. పీయూష్‌ గోయల్‌ తాజా ప్రకటనతో విశాఖకు రైల్వే జోన్ ఇప్పట్లో వచ్చే అవకాశమే కనిపించడం లేదు. 

ఒక్కో ఓటుకు  8 వేలు! కడప జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి ఆఫర్ 

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఏకగ్రీవాలు కూడా భారీగానే జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అధికార పార్టీ నేతలు బలవంతంగా ఏకగ్రీవాలు చేయిస్తున్నారనే  ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ  నేతల బెదిరింపులకు సంబంధించిన వీడియో, ఆడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఎన్నికల్లో అనవసర గొడవలు ఎందుకులే అని కొన్ని పంచాయతీలు ఏకగ్రీవమవుతున్నాయి. మరి కొన్ని చోట్ల మాత్రం వేలం పాటలు సాగుతున్నాయి. వేలంలో గెలిచిన అభ్యర్థికే గ్రామ పెద్దలు సర్పంచ్ పీఠాన్ని కట్టబెడుతున్నారు.  వేలంలో వచ్చిన నగదుతో గ్రామంలో అభివృద్ధి పనులకు వినియోగిస్తుంటారు. కానీ ఓ గ్రామంలో మాత్రం వేలపాట డబ్బును ఓటర్లకే పంచాలని నిర్ణియించారు. కడప జిల్లా కమలాపురం మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కమలాపురం మండలంలోని చిన్నపంచాయతీగా ఉన్న ఆ గ్రామంలో కేవలం 240 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ప్రతిసారి రిజర్వేషన్ లో ఉండే ఈ పంచాయతీ ఈసారి జనరల్ కేటగిరీకి వచ్చింది.  పంచాయతీ సర్పంచ్ పీఠంపై కన్నేసిన ఓ అభ్యర్థి.. వైసీపీ మద్దతుతో బరిలో దిగుదామని భావించాడు.  గ్రామ పెద్దల ముందు ఓ బంపర్ ఆఫర్ ఇంచాడు. రూ20 లక్షలు ఇస్తానని.. సర్పంచ్ పదవి తనకే ఇవ్వాలని చెప్పాడు. అందుకు గ్రామస్తులు కూడా ఓకే చెప్పారు. అయితే  ఆ మొత్తాన్ని గ్రామాభివృద్ధికి కాకుండా.. ఓటర్లకు పంచేందుకు ఒప్పందం  చేసుకున్నారు. ఆ లెక్కన గ్రామంలోని ఒక్కో ఓటుకు రూ.8వేల చొప్పున పంచాలని నిర్ణయించారు. దీంతో గ్రామస్తులే సదరు అభ్యర్థికి పోటీ లేకుండా చేయడానికి ఇతరులతో సంప్రదింపులు జరుపుతున్నారు.  నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలంలో ఓ గ్రామపంచాయతీకి స్థానికులు వేలం నిర్వహించారు. గ్రామంలో సర్పంచ్ పదవికి మొదట  ఆరుగురు పోటీలో నిలిచారు.  తనకు సర్పంచ్ పదవి ఇస్తే 29లక్షల రూపాయలిస్తానని ఓ అభ్యర్థి గ్రామ పెద్దలకు ఆఫర్ ఇచ్చాడు. కానీ వారు మాత్రం రూ.50 లక్షలు ఇస్తే ఓకే అని పరిశీలిస్తామన్నారు. దీంతో ఆ అభ్యర్థి దానికి అంగీకరించాడు. ఈ విషయంలో తెలుసుకున్న మరో వ్యక్తి తాను రూ.50.25 లక్షలు ఇస్తానని మందుకొచ్చాడు. చివరకు మొదటగా ముందుకొచ్చిన అభ్యర్థి రూ.50.50 లక్షలు చెల్లించి సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నాడు. పాట పాడిన వెంటనే డబ్బులు కూడా చెల్లించడంతో మిగిలిన వారు పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ నిధులను గ్రామమాభివృద్ధి ఖర్చు చేయాలని గ్రామస్తులు తీర్మానించారు. 

సోము వీర్రాజుతో జనసేన పరేషాన్! ఇక  బీజేపీతో తెగతెంపులేనా ?  

బీజేపీతో పొత్తుపై జనసేన యూ టర్న్ తీసుకోనుందా? సోము వీర్రాజుతో పవన్ పార్టీ నేతలు పరేషాన్ అవుతున్నారా ? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ప్రస్తుతం బీజేపీతో కలిసి పని చేస్తోంది జనసేన. అయితే బీజేపీ తీరుతో జనసేన నేతలు మొదటి నుంచి అసంతృప్తిగానే ఉన్నట్లు కనిపించింది. ముఖ్యంగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేస్తున్న ప్రకటనలపై పవన్ పార్టీ నేతలు అసహనంగా ఉంటున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా... ఆయన ఏకపక్ష ప్రకటనలు చేస్తున్నారని కొందరు జనసేన నేతల బహిరంగంగానే విమర్శించారు.   జనసేన నేతలు ఎంతగా మొత్తుకుంటున్నా తన తీరు మార్చుకోవడం లేదు సోము వీర్రాజు. తాజాగా ఆయన చేసిన ప్రకటన ఏపీలో సంచలనంగా మారగా.. బీజేపీ-జనసేన కూటమిలో మాత్రం సెగలు రేపుతోంది. తమ కూటమి గద్దెనెక్కితే బీసీ వ్యక్తిని సీఎంను చేస్తామన్న సోము వీర్రాజు వ్యాఖ్యలు జనసేనలో మంట పుట్టిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నప్పుడు.. ముఖ్యమంత్రి వంటి అత్యంత కీలకమైన అంశంలో సోము వీర్రాజు అలా ఎలా ప్రకటన చేస్తారని జనసేన నేతలు భగ్గుమంటున్నారు. కూటమి తరపున ప్రకటించారా లేక బీజేపీ తరపున ప్రకటించారో చెప్పాలంటున్నారు. అతి పెద్ద జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి  అనాలోచితంగా చేస్తున్న వ్యాఖ్యలు తమకు తలనొప్పి తెచ్చి పెడుతున్నాయని జనసేన నేతలు ఆక్షేపిస్తున్నారు.    జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెంచారు. జిల్లాల వారిగా పర్యటిస్తూ కేడర్ ను బలోపేతం చేస్తున్నారు. జగన్ సర్కార్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నప్పుడు... అధికారంలోకి రాగానే తీరుస్తామని వారికి భరోసా ఇస్తున్నారు గబ్బర్ సింగ్. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తమ నాయకుడు పవన్‌ ముఖ్యమంత్రి అవ్వాలన్నది జనసేన కార్యకర్తల  అభిమతం. కాని ఇప్పుడు సోము వీర్రాజు బీసీ ముఖ్యమంత్రి ప్రకటన చేయడంతో .. పవన్ పార్టీ కార్యకర్తలు మండిపోతున్నారు. కూటమి తరపున బీసీ వ్యక్తి సీఎం అయితే.. తమ నాయకుడి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. వీర్రాజు వ్యాఖ్యలు తమలో గందరగోళాన్ని రేకెత్తించేలా ఉన్నాయని జనసేన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థే దిగుతారని వీర్రాజు గతంలో చేసిన ప్రకటన రెండు పార్టీల మధ్య విభేదాలకు కారణమైంది. రెండు పార్టీల నేతలు అభ్యర్థి విషయంపై పోటాపోటీ ప్రకటనలు చేయడంతో పొత్తు ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. అయితే బీజేపీ పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణిగింది. తిరుపతి పోటీ విషయంలో బీజేపీ పెద్దలతో పవన్ ఓ డీల్ కుదుర్చుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. తిరుపతిలో బీజేపీ బరిలో ఉంటే.. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని పవన్ కమలం పెద్దల ముందు ప్రతిపాదన పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో  సోము వీర్రాజు చేసిన బీసీ ముఖ్యమంత్రి ప్రకటన.. జనసేనలో ప్రకంపనలే రేపుతోంది.   ఇప్పుడు బీసీలను కాదనలేం.. పవన్‌ను వద్దనలేం.. పొరుగు రాష్ట్రంలో కేసీఆర్‌ ఇప్పటికీ దళిత సీఎం వ్యాఖ్యల విషయంలో అక్కడి ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. వీర్రాజు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదు. బీసీలపై ఆయనకు నిజంగా అంత ప్రేమ ఉంటే గత ప్రభుత్వంలో రెండు మంత్రి పదవుల్లో ఒకటి బీసీలకు ఎందుకు ఇప్పించలేకపోయారు’ అని జన సేన నేతలు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు రెండు పార్టీల పొత్తుపైనే ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు.

5 రూపాయలు అడిగిందని కూతురినే కొట్టి చంపాడు!

మానవత్వం మంట కలుస్తోంది.  పిల్లలపై తల్లి దండ్రుల తీరు మారుతుంది. కన్నపిల్లలపైనే  క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.  యమ కింకరులుగా మారుతూ  ప్రాణాలు తీస్తున్నారు. ఐదు రూపాలయ కోసం కన్న కూతుర్ని చంపాడు ఓ కసాయి తండ్రి.  స్వీటు కొనుకునేందుకు ఐదు రూపాయలు అడిగిందని... కన్న కూతురును ఇంటి మెట్లకేటి కొట్టి చంపాడు.  మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో  ఈ కసాయి తండ్రి భాగోతం వెలుగుచూసింది   గోండియా జిల్లా లోనారా గ్రామానికి చెందిన వివేక్, వర్షా దంపతులకు 20నెలల వైష్ణవి అనే కూతురుంది. తల్లి వర్షా చెబుతున్న వివరాల ప్రకారం.. తనకు స్వీటు ఇప్పించమని తల్లిని అడిగింది వైష్ణవి. కూతురు ఏడుస్తుండటంతో  భర్తను ఐదు రూపాయలు ఇవ్వాలని అడిగింది తల్లివర్షా. దీంతో ఆగ్రహానికి గురైన వివేక్ కసాయిగా మారాడు. తన కూతుర్ని , భార్యను తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా.. భార్యను ఇంటి తలుపుకేసి బాదాడు. దీంతో భయంతో బయటికి పరుగులు తీసింది. ఏడుస్తున్న బిడ్డను ఇంటి మెట్ల మీద కొట్టాడు. దీంతో తీవ్రగాయాల పాలైంది వైష్ణవి. ఆమెను టిరోడా ఉప జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే బాలిక మరణించిందని వైద్యులు చెప్పారు. దీంతో భార్య వర్షా .. భర్త వివేక్ పై టిరోడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కసాయి భర్త వివేక్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.  

విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గకపోతే.. రైతు ఉద్యమానికి 100 రెట్ల ఉద్యమం..

"విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు" అంటూ ఆనాడు తెన్నేటి విశ్వనాధం వంటి నాయకులు చేసిన ఉద్యమ ఫలితంగా వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై ఆంధ్ర ప్రదేశ్ ప్రజలనుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోపక్క కేంద్రం తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ప్రజలు మరోసారి ఉద్యమానికి సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన అయన ‘‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. విశాఖ ఉక్కు కర్మాగారం దేశంలోని మిగతా కర్మాగారాల లాగా కేవలం ఒక పరిశ్రమ గా మాత్రమే చూడొద్దు. మా నగరం పేరే ఉక్కు నగరం. ఉక్కు సంకల్పంతోనే సాధించుకున్నాం. విశాఖ ఉక్కు నుంచి విశాఖ ను వేరు చేయడం అంటే మా ప్రాణాల్ని మా దేహాల నుంచి వేరు చేయడమే. విశాఖ ఉక్కు 5 కోట్ల ఆంధ్రుల, 20 కోట్ల తెలుగు ప్రజల మనోభావాలు, రాజీ లేని పోరాటాలకు ప్రతీక. దయచేసి మా సెంటిమెంట్ ని ముట్టుకోవద్దు.1966 నుంచి దశాబ్దకాలం పాటు "విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు" అనే నినాదంతో తెలుగు ప్రజలు సుదీర్ఘ పోరాటం, 32మంది ప్రాణ త్యాగాలు, 64 గ్రామాల ప్రజలు ఇళ్ళు , 22,000 ఎకరాల భూమిని త్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిధ్ధమే. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఢిల్లీలో రైతులు చేసిన ఉద్యమం కంటే... 100 రెట్లు ఉద్యమం, తీవ్రత చవి చూడాల్సి వస్తుంది. ’’ అంటూ గంటా ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో  మరో అరాచకం ! తూ.గోలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం 

ఆంధ్రప్రదేశ్ లో అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలయాలపై వరుసగా జరిగిన దాడులు తీవ్ర కలకలం రేపగా.. తాజాగా రాజకీయ నేతలపై పడ్డారు దుండగులు. తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ వ్యవస్థాపకుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.  పంచాయతీ ఎన్నికల వేళ ఎన్టీఆర్ విగ్రహం కావడం మంటలు రేపుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన జిల్లాలో తీవ్ర దుమారం రేపుతోంది.  తూర్పు గోదావరి జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ట్వీట్టర్ లో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'మూర్ఖత్వానికి మానవ రూపం వైఎస్ జ‌గ‌న్. మహనీయుల విగ్రహాలు కూలుస్తూ జగన్ రెడ్డి మరింత దిగజారిపోయాడు. దేవతా విగ్రహాలు ధ్వంసం చేసిన వైకాపా గ్యాంగ్ ఇప్పుడు మహనీయుల విగ్రహాల పై పడింది. స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారిది విగ్రహం పడగొడితే చేరిగిపోయే చరిత్ర కాదు' అన్నారు లోకేష్. 'తూర్పు గోదావరి జిల్లా, కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వైకాపా గ్యాంగ్ ని కఠినంగా శిక్షించాలి' అని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. 'తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో జరిగిన ఘటన ఇది. స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని రాజకీయ కక్షతో దుష్టశక్తులు నాశనం చేయడం దుర్మార్గపు చర్య. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం అధికారం చేప్పట్టిన నాటి నుండి ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి' గోరంట్ల బుచ్చయ్య విమ‌ర్శించారు. 'మూర్ఖ‌త్వం పరాకాష్ఠ‌కు చేరుకుంటే ఇటువంటి చర్యలు కి దారి తీస్తాయి. మీరు విగ్రహాన్ని ధ్వంసం చేస్తేనో.. లేక దాడులు చేస్తేనో తెలుగుదేశం పార్టీని బలహీన పరచలేరు. పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. అధికార ఒత్తిళ్లు కి తలోగ్గకుండా వ్యవహరించాలి' అని గోరంట్ల బుచ్చయ్య డిమాండ్ చేశారు.  

సామాన్యుడికి మరో షాక్.. వంట గ్యాస్ పై సబ్సిడీకి కేంద్రం రాంరాం..!

మీకు సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ ఉందా.. అయితే సబ్సిడీ సొమ్ము మీ అకౌంట్ లో జమ అవుతుందో లేదో గమనించారా.. లేదంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే గత ఏడాది మే నుండి బ్యాంకు అకౌంట్లలో కేవలం రూ.40.72 మాత్రమే పడుతోంది. అయితే నిజానికి వంటగ్యాస్‌ ధర పెరిగినకొద్దీ సబ్సిడీ మొత్తం కూడా పెరగాలి. కేంద్రంప్రభుత్వం సబ్సిడీ సిలిండర్‌ ధర పెంచిన ప్రతి సారీ పెరిగిన తేడా మొత్తం సబ్సిడీ రూపంలో మన ఖాతాలో పడాలి. అయితే కరోనా రావడానికి ముందు ప్రభుత్వం కూడా అలాగే చెల్లించేది. అయితే గత మే నుంచి ంటే కరోనా మొదలైనప్పటి నుండి కేంద్రం సైలెంట్ గా ఆ పద్ధతికి రాంరాం చెప్పింది. దీంతో సిలిండర్‌ ధర ఎంత ఉన్నా కేవలం రూ.40.72 మాత్రం వేసి చేతులు దులుపుకుంటోంది. 2014-15లో మోదీ సర్కారు వంట గ్యాస్‌ ధరలను బయటి మార్కెట్ రేట్లకు లింక్ చేయాలని నిర్ణయించినపుడు ఆ ఏడాదికి ఒక్కో సబ్సిడీ సిలిండర్‌ మీద రూ.563 సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. అప్పట్లో ఒక్కో సిలిండర్‌ ధర వెయ్యి రూపాయలకు పైగానే ఉండేది.అయితే గత ఆరేళ్లలో సిలిండర్‌ రేటుతో పాటు సబ్సిడీ కూడా తగ్గిపోతూ ఇప్పుడు కేవలం రూ.40 మాత్రమే బ్యాంకు అకౌంట్ లో పడుతోంది. ఈ సొమ్ము కూడా చమురు కంపెనీలే ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనినిబట్టి కేంద్రం వినియోగదారుడికి ఇస్తున్నది సున్నా. దీంతో వంట గ్యాస్‌ సబ్సిడీని కేంద్రం ఎత్తివేసినట్లేనని అందరూ భావిస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్యాస్‌ డీలర్లు, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు కూడా దీనిపై ఇప్పటికే స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోపక్క నిన్న మొన్నటివరకు సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ. 746.50 ఉండేది. అయితే గురువారం నుండి మరో రూ.25 పెంచడంతో రూ.771.50 పైసలకు చేరింది. ఇందులోవ్యక్తం చేస్తున్నారు కేంద్రం ఒక్క పైసా సబ్సిడీ ఇవ్వటంలేదు. కేవలం ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలు మాత్రం ఒక్కో సిలిండర్‌కు రూ.40 చొప్పున వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాయి. ఇపుడు ఒక్కో సిలిండర్‌ రూ. 731.50 కు వినియోగదారుడు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. దీనికి తోడు ఇప్పటి వరకు వంటగ్యాస్‌ ధరలను నెలకోసారి (ఒకటో తేదీన) సవరించేవారు. దీంతో సిలిండర్‌ ధర పెరిగినా, తగ్గినా... నెల రోజులపాటు అదే రేటు అమలులో ఉండేది. ఇప్పటి నుండి వారానికొకసారి వంటగ్యాస్‌ ధరలను సవరించాలనే ప్రతిపాదనకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో నెలకు నాలుగు సార్లు గ్యాస్‌ ధరల్లో మార్పు ఉంటుంది. ఇప్పటికే సబ్సిడీని దాదాపుగా ఎత్తివేయగా... ఇకముందు వారానికోసారి గ్యాస్‌ ధరలు సవరిస్తే మరింత అన్యాయం జరుగుతుందని వంట గ్యాస్‌ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించొద్దు!  గుంటూరు, చిత్తూరు కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశం 

పంచాయతీ ఎన్నికల అంశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించవద్దంటూ కలెక్టర్లకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవరకు ఫలితాలను హోల్డ్‌లో ఉంచాలని పేర్కొంది. తమకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించిన తర్వాతే ఫలితాలు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి నివేదిక పంపాలని చిత్తూరు, గుంటూరు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. లోపాలు ఉన్నట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ హెచ్చరించింది.    ఏపీలో తొలి దశ  పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహగరణ గడువు గురువారంతో ముగిసింది.   గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు జరిగినట్లు ఎన్నికల కమిషన్ గుర్తించింది. మిగితా జిల్లాలకు విభిన్నంగా ఉండటంతో కమిషన్ ఈ వ్యవహారంపై ఆరా తీసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎన్నికలకు సంసిద్ధత పట్ల ఎన్నికల సంతృప్తిని వ్యక్తం చేసింది. కలెక్టర్లు, ఎస్పీలు పూర్తి చర్యలు తీసుకుంటున్నారని అభినందించింది. పోలీసులు వ్యాక్సినేషన్ వేయించుకునే కార్యక్రమాన్ని పక్కనపెట్టి ఎన్నికల విధులు నిర్వహించడానికి ముందుకు రావడంపై ఎస్‌ఈసీ అభినందనలు తెలిపింది. 

ఐఎఎస్ లను ఫుట్ బాల్ ఆడుకుంటున్న ఏపి పర్కార్ ..

అఖిల భారత సర్వీసుల్లో అగ్రస్థానంలో ఉండేది ఐఎఎస్ లే. అలాంటి టాప్ స్థాయి అధికారులను ఏపి ప్రభుత్వం ఫుట్ బాల్ ఆడుకుంటోంది. సీనియర్లు , జూనియర్లనే తేడా కూడా గమనించడంలేదు. సీనియర్లతో ఎలా పనిచేయించుకోవాలి..జూనియర్లను ఏయే పోస్టుల్లో నియమించాలన్న ఆలోచనే చేయకుండా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఐఎఎస్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జూనియర్లు, సీనియర్లు ఎంతెంత మంది ఉన్నారనే దానిపై ఎక్సర్ సైజ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు బాధ్యతలు అప్పగించడంపై  ద్రష్గి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  ఎవరు ఏ ఏ పోస్టుల్లో ఎంత కాలం ఉంటున్నారో అర్ధం కావడం లేదు.  తాజాగా టిటిడిలో జెఇవోగా పనిచేస్తున్న బసంతో కుమార్ ను అక్కడి నుంచి తప్పించి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా జిఎడికి అటాచ్ చేసింది. అలాగే ప్రాధాన్యత పోస్టులో కొనసాగుతూన్న వివేక్ యాదవ్ ను అకస్మాత్తుగా అక్కడి నుంచి బదిలీ చేసి గుంటూరు కలెక్గర్ గా నియమించింది. ఇందులోను రాజకీయమేనని ఆరోపిస్తున్నారు. బదిలీలతో ఖాళీలైన పోస్టుల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వడం లేదు. అస్మదీయులకే ఆయా శాఖల అదనపు బాధ్యతలు అప్పగిస్తోంది ప్రభుత్వం . సిఎం జగన్ కు పరిపాలనపై పట్టు లేక పోవడంతో సిఎంవో లోని ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్  ఐఎఎస్ లందరిపై పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయనను ప్రసన్నం చేసుకుంటే చాలు సిఎంతో పనిలేదని ఐఎఎస్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.  ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న అజేయ కల్లం గతంలో ఐఎఎస్ బదిలీల బాధ్యత నిర్వర్తించేటప్పుడు ఇలాంటి సమస్యలు తలెత్తలేదని అంటున్నారు. ఇదంతా జగన్ అనుభవ రాహిత్యమే కారణమైతే.. ఆయన పాలనపై ద్రప్టి  పెట్టకపోవడం ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కూడా స్వతంత్రంగా వ్యవహరించలేక పోతున్నారని ఐఎఎస్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘానికి ఓటర్ల లిస్టును సకాలంలో అందించకపోవడంతో మంచి అధికారులుగా పేరున్న పంచాయతీ శాఖ ఉన్నతాధికారులైన గోపాల క్రష్ణ ద్వివేది, గిరిజా శంకర్ ఎస్ఈసి వద్ద అభాసు పాలయ్యారు. సిఎం జగన్ అవగాహన, అనుభవ రాహిత్యంతో ఒకే ఒక్క అధికారిపై ఆధార పడడం వల్లనే అని ఐఎఎస్ లు వాపోతున్నారు.   పోలీస్ వ్యవుస్థ మోత్తం మరో సలహాదారు సజ్జల రామక్రష్ఱా రెడ్డి చేతుల్లో ఉండడంతో ఆ వ్యవస్థ మోత్తం అస్థవ్యవస్థగా తయారైంది. డిజిపిని డమ్మీ చేసి పోలీస్ వ్యవస్థను సజ్జల గుప్పిట్లో పెట్టుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై గుడ్ న్యూల్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పోలవరంపై పార్లమెంట్ లో కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టు  అయ్యే ఖర్చునంతా కేంద్రమే భరిస్తుందని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలవరం పనులు ఎంత వరకు వచ్చాయి? ఎంత భూసేకరణ చేశారు? కేంద్రం ఇప్పటి వరకు ఎన్ని నిధులు ఇచ్చింది? అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు పార్లమెంట్‌లో  లిఖిత పూర్వక సమాధానం చెప్పింది. పోలవరం ప్రాజెక్టు కోసం 2014 నుంచి ఇప్పటి వరకు 10,848.36 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు 1.11 లక్షల ఎకరాల భూమిని సేకరించినట్లు తెలిపింది. భూసేకరణ, పునరావాసం అంచనా రూ.28,172.21 కోట్లుగా పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్స్ హెడ్ వర్క్స్ 69.68 శాతం పూర్తయ్యాయని కేంద్ర సర్కార్ తెలిపింది. ఎడమకాల్వ తవ్వకం 92 శాతం, లైనింగ్ పనులు 70శాతం పూర్తయినట్లు వెల్లడించింది. నిర్మాణ బాధ్యతలను ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అథారిటీ పర్యవేక్షిస్తోందని పేర్కొంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో కేంద్రమే ఖర్చును పూర్తిగా భరించనుందని స్పష్టం చేసింది. ఇక 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు ద్వారా నీళ్లందించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

ఇండియాలో 30  కోట్ల మందికి కరోనా! సీరో సర్వేలో తేల్చిన ఐసీఎంఆర్ 

ప్రపంచాన్ని ఇంకా వణికిస్తోంది కరోనా మహమ్మారి. ఏడాది దాటినా ఇంకా ప్రభావం చూపిస్తూనే ఉంది. రూపు మార్చుకుని కొన్ని దేశాల్లో మరింత ప్రమాదకరంగా మారింది మాయదారి వైరస్. ఇండియాలోనూ కరోనా కేసులు ఇంకా వేలల్లోనే నమోదవుతున్నాయి. ఆరు నెలల క్రితంతో పోల్చితే కేసుల సంఖ్య భారీగానే తగ్గినా.. ఇంకా ముప్పు పూర్తిగా పోలేదంటున్నారు వైద్య నిపుణులు. అయితే ఇండియాలో కరోనాకు సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్వహించిన సీరో సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి.    ఇండియాలో గత సంవత్సరం డిసెంబర్ నాటికే ప్రతి ఐదుగురిలో ఒకరికి పైగా కరోనా బారిన పడ్డారని ఐసీఎంఆర్ సీరోలాజికల్ సర్వే గణాంకాలు చెబుతున్నాయి. అంటే దేశంలో దాదాపు 28 కోట్ల మందికి డిసెంబర్ నాటికే కరోనా సోకిందన్నమాట.  ఢిల్లీ మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో సీరో సర్వే నిర్వహించగా, 21.4 శాతం మందికి కరోనా సోకి తగ్గిపోయి, యాంటీ బాడీలు వృద్ధి చెందాయని తేలింది. 10 నుంచి 18 సంవత్సరాల వయసున్న వారిలో 25.3 శాతం మందిలో యాంటీ బాడీలు కనిపించాయి. ఈ గణాంకాల ఆధారంగా ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా వైరస్ సోకిందన్న నిర్ధారణకు వచ్చామని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ తెలిపారు.    ఆగస్టులో జరిపిన సీరో సర్వేతో పోలిస్తే  కరోనాను ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తిని కలిగివున్న వారి సంఖ్య 0.7 శాతం నుంచి 21.4 శాతానికి పెరిగింది. 18 సంవత్సరాల కన్నా అధిక వయసున్న వారిలో 21.4 శాతం, టీనేజ్ లో ఉన్న వారిలో 25.3 శాతం, పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల్లో ఉంటున్న వారిలో 31.7 శాతం, పట్టణాల్లో నివసిస్తున్న వారిలో 26.2 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 19.1 శాతం వరకూ కరోనా రోగ నిరోధక శక్తి ఉందని తమ సీరో సర్వేలో  వెల్లడైంది. మగవారిలో 20.3 శాతం, ఆడవారిలో 22.7 శాతం మంది కరోనాను ఎదుర్కొన్నారని ఐసీఎంఆర్ డైరెక్టర్ వివరించారు.  హెల్త్ కేర్ విభాగానికి వస్తే డాక్టర్లు, నర్సుల్లో 26.6 శాతం, పారామెడికల్ స్టాఫ్ లో 25.4 శాతం, ఫీల్డ్ స్టాఫ్ లో 25.3 శాతం, అడ్మిన్ స్టాఫ్ లో 24.9 శాతం మందిలో యాంటీ బాడీలు ఉన్నాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాలకు చెందిన 700 పట్టణాలు, గ్రామాల్లో ఈ సర్వే జరిగిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.  ఇక ఢిల్లీలో తాజాగా నిర్వహించిన సీరో సర్వేలో ఢిల్లీలోని 56.1 శాతం మంది శరీరంలో యాంటీ బాడీల వృద్ధి కనిపించిందని వెల్లడైంది. ఢిల్లీ వాసుల్లో సగం మందికి పైగా కరోనా బారిన పడి ఏ విధమైన మందులు తీసుకోకుండానే కోలుకున్నారని  తేలింది. ఏ ప్రాంతంలోనైనా ఓ వ్యాధి ప్రబలితే.. 50 శాతానికి పైగా హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిన తరువాతే దాని వ్యాప్తి నియంత్రణలోకి వచ్చినట్టని వైద్యశాఖ నిర్దారిస్తుంది.ఈ లెక్కన కరోనా మహమ్మారిని దేశ రాజధాని ఢిల్లీ జయించిందని చెబుతున్నారు.   

పెళ్లి ఆఫర్‌తో ప్రత్యర్థికి మద్దతిచ్చిన బ్రహ్మచారి.. అక్కడి ఎన్నికలలో సూపర్ ట్విస్ట్

దేశంలో ఆడపిల్లల జనాభా తగ్గిపోవడంతో బెండకాయలు ముదిరినట్లుగా యువకులు 40 ఏళ్ళు వచ్చినా బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో పెళ్లి చేసుకోవడం కోసం వారు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ ఎఫెక్ట్ అక్కడ పంచాయతి ఎన్నికలలో కూడా పడింది. తాజాగా కర్ణాటకలో పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రామనగర్‌ జిల్లా కోడంబళ్లి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకునేందుకు ఈనెల 11న షెడ్యూలు ఖరారు చేశారు. బీసీ ఏ కేటగిరికి అధ్యక్ష స్థానం రిజర్వు కాగా, కాంగ్రె్‌సకు చెందిన వ్యక్తి ఆ రేసులో ఉన్నారు. అతనికి ఇదే పంచాయతీలో జేడీఎస్‌కు చెందిన వార్డు సభ్యుడు రవి మద్దతు అవసరమైంది. మరోపక్క రవి బ్రహ్మచారి.కావడంతో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రామనగర్‌ జిల్లా గ్రామీణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు "నువ్వు మాకు మద్దతు ఇవ్వు...ఒక మంచి పిల్లను చూసి నీ పెళ్లి చేసే బాధ్యత మాది’అంటూ రవికి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. దీంతో ఇంకేముంది మనోడు కాంగ్రెస్ క్యాండిడేట్ కు సపోర్ట్ చేయడానికి సిద్దమైపోయాడు. రవి తాజా వ్యవహారంతో జేడీఎస్‌ నాయకులు ఖంగుతిన్నారు. పెళ్లి కోసం పార్టీకి వ్యతిరేకంగా పనిచేయొద్దంటూ స్థానిక నాయకులు హెచ్చరించారు. అయినా రావియా మాట వినకపోవడంతో చివరికి మాజీ సీఎం కుమారస్వామి చేత కూడా ఫోన్‌ చేయించారు. అయినా రవి మాత్రం ససేమిరా అన్నాడు. నాకు పాలిటిక్స్ కంటే నా పెళ్లి ముఖ్యమని తేల్చి చెప్పేశాడు. ఈ జగమొండి బ్రహ్మచారి తీరుతో మండిపడిన కుమారస్వామి అతడిపై వేటు వేయాలని సూచించినట్టు, స్థానిక నాయకత్వం తెలిపింది. ఐతే ఈనెల 11 దాకా వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు సమాచారం.