రైల్వే జోన్ ఎప్పుడో చెప్పలేం! ఏపీపై కేంద్రానికి కనికరం రాదా!

ఆంధ్రప్రదేశ్ పై కేంద్ర సర్కార్ చిన్నచూపు మరోసారి స్పష్టమైంది. ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేకంగా నిధులేమి కేటాయించలేదు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రస్తావన కూడా తేలేదు.  రైల్వే విషయంలోనూ ఏపీపై కేంద్రం కనికరించడం లేదు. బడ్జెట్ లో విశాఖ రైల్వే జోన్ పై ప్రకటన వెలువడుతుందని ఆశించినా నిరాశే మిగిలింది. తాజాగా విశాఖకు రైల్వే జోన్ అంశంపైనా సన్నాయి నొక్కులు నొక్కుతోంది కేంద్రం. విశాఖకు రైల్వే జోన్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేమని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. రైల్వేజోన్‌ ప్రారంభానికి నిర్దిష్ట కాలపరిమితి లేదన్నారు. రైల్వేజోన్‌ డీపీఆర్‌ ఇంకా పరిశీలనలోనే ఉందని గోయల్‌ చెప్పారు.  శుక్రవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు గోయల్‌ ఈ సమాధానం ఇచ్చారు.  విశాఖ రైల్వే డివిజన్‌ను ఆంధ్రా డివిజన్‌లో చేర్చే ఉద్దేశం లేదని కూడా తెలిపారు. రైల్వేజోన్‌ ప్లానింగ్‌కు ఓఎస్‌డీని నియమించామని చెప్పారు.  ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాలని ఏపీ విభజన చట్టంలో ఉంది. దాని కోసం ఆరేండ్లుగా పోరాటం జరుగుతూనే ఉంది. గత టీడీపీ సర్కార్ కూడా విశాఖ రైల్వే జోన్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. కాని కేంద్ర సర్కార్ స్పందించ లేదు. అయితే విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి రైల్వే జోన్ ఇస్తున్నామంటూ   గత ఎన్నికలకు ముందుగ కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసి రెండేండ్లు  కావస్తున్నా... ఆ ప్రక్రియ ప్రారంభమే కాలేదు. పీయూష్‌ గోయల్‌ తాజా ప్రకటనతో విశాఖకు రైల్వే జోన్ ఇప్పట్లో వచ్చే అవకాశమే కనిపించడం లేదు. 

ఒక్కో ఓటుకు  8 వేలు! కడప జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి ఆఫర్ 

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఏకగ్రీవాలు కూడా భారీగానే జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అధికార పార్టీ నేతలు బలవంతంగా ఏకగ్రీవాలు చేయిస్తున్నారనే  ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ  నేతల బెదిరింపులకు సంబంధించిన వీడియో, ఆడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఎన్నికల్లో అనవసర గొడవలు ఎందుకులే అని కొన్ని పంచాయతీలు ఏకగ్రీవమవుతున్నాయి. మరి కొన్ని చోట్ల మాత్రం వేలం పాటలు సాగుతున్నాయి. వేలంలో గెలిచిన అభ్యర్థికే గ్రామ పెద్దలు సర్పంచ్ పీఠాన్ని కట్టబెడుతున్నారు.  వేలంలో వచ్చిన నగదుతో గ్రామంలో అభివృద్ధి పనులకు వినియోగిస్తుంటారు. కానీ ఓ గ్రామంలో మాత్రం వేలపాట డబ్బును ఓటర్లకే పంచాలని నిర్ణియించారు. కడప జిల్లా కమలాపురం మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కమలాపురం మండలంలోని చిన్నపంచాయతీగా ఉన్న ఆ గ్రామంలో కేవలం 240 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ప్రతిసారి రిజర్వేషన్ లో ఉండే ఈ పంచాయతీ ఈసారి జనరల్ కేటగిరీకి వచ్చింది.  పంచాయతీ సర్పంచ్ పీఠంపై కన్నేసిన ఓ అభ్యర్థి.. వైసీపీ మద్దతుతో బరిలో దిగుదామని భావించాడు.  గ్రామ పెద్దల ముందు ఓ బంపర్ ఆఫర్ ఇంచాడు. రూ20 లక్షలు ఇస్తానని.. సర్పంచ్ పదవి తనకే ఇవ్వాలని చెప్పాడు. అందుకు గ్రామస్తులు కూడా ఓకే చెప్పారు. అయితే  ఆ మొత్తాన్ని గ్రామాభివృద్ధికి కాకుండా.. ఓటర్లకు పంచేందుకు ఒప్పందం  చేసుకున్నారు. ఆ లెక్కన గ్రామంలోని ఒక్కో ఓటుకు రూ.8వేల చొప్పున పంచాలని నిర్ణయించారు. దీంతో గ్రామస్తులే సదరు అభ్యర్థికి పోటీ లేకుండా చేయడానికి ఇతరులతో సంప్రదింపులు జరుపుతున్నారు.  నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలంలో ఓ గ్రామపంచాయతీకి స్థానికులు వేలం నిర్వహించారు. గ్రామంలో సర్పంచ్ పదవికి మొదట  ఆరుగురు పోటీలో నిలిచారు.  తనకు సర్పంచ్ పదవి ఇస్తే 29లక్షల రూపాయలిస్తానని ఓ అభ్యర్థి గ్రామ పెద్దలకు ఆఫర్ ఇచ్చాడు. కానీ వారు మాత్రం రూ.50 లక్షలు ఇస్తే ఓకే అని పరిశీలిస్తామన్నారు. దీంతో ఆ అభ్యర్థి దానికి అంగీకరించాడు. ఈ విషయంలో తెలుసుకున్న మరో వ్యక్తి తాను రూ.50.25 లక్షలు ఇస్తానని మందుకొచ్చాడు. చివరకు మొదటగా ముందుకొచ్చిన అభ్యర్థి రూ.50.50 లక్షలు చెల్లించి సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నాడు. పాట పాడిన వెంటనే డబ్బులు కూడా చెల్లించడంతో మిగిలిన వారు పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ నిధులను గ్రామమాభివృద్ధి ఖర్చు చేయాలని గ్రామస్తులు తీర్మానించారు. 

సోము వీర్రాజుతో జనసేన పరేషాన్! ఇక  బీజేపీతో తెగతెంపులేనా ?  

బీజేపీతో పొత్తుపై జనసేన యూ టర్న్ తీసుకోనుందా? సోము వీర్రాజుతో పవన్ పార్టీ నేతలు పరేషాన్ అవుతున్నారా ? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ప్రస్తుతం బీజేపీతో కలిసి పని చేస్తోంది జనసేన. అయితే బీజేపీ తీరుతో జనసేన నేతలు మొదటి నుంచి అసంతృప్తిగానే ఉన్నట్లు కనిపించింది. ముఖ్యంగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేస్తున్న ప్రకటనలపై పవన్ పార్టీ నేతలు అసహనంగా ఉంటున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా... ఆయన ఏకపక్ష ప్రకటనలు చేస్తున్నారని కొందరు జనసేన నేతల బహిరంగంగానే విమర్శించారు.   జనసేన నేతలు ఎంతగా మొత్తుకుంటున్నా తన తీరు మార్చుకోవడం లేదు సోము వీర్రాజు. తాజాగా ఆయన చేసిన ప్రకటన ఏపీలో సంచలనంగా మారగా.. బీజేపీ-జనసేన కూటమిలో మాత్రం సెగలు రేపుతోంది. తమ కూటమి గద్దెనెక్కితే బీసీ వ్యక్తిని సీఎంను చేస్తామన్న సోము వీర్రాజు వ్యాఖ్యలు జనసేనలో మంట పుట్టిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నప్పుడు.. ముఖ్యమంత్రి వంటి అత్యంత కీలకమైన అంశంలో సోము వీర్రాజు అలా ఎలా ప్రకటన చేస్తారని జనసేన నేతలు భగ్గుమంటున్నారు. కూటమి తరపున ప్రకటించారా లేక బీజేపీ తరపున ప్రకటించారో చెప్పాలంటున్నారు. అతి పెద్ద జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి  అనాలోచితంగా చేస్తున్న వ్యాఖ్యలు తమకు తలనొప్పి తెచ్చి పెడుతున్నాయని జనసేన నేతలు ఆక్షేపిస్తున్నారు.    జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెంచారు. జిల్లాల వారిగా పర్యటిస్తూ కేడర్ ను బలోపేతం చేస్తున్నారు. జగన్ సర్కార్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నప్పుడు... అధికారంలోకి రాగానే తీరుస్తామని వారికి భరోసా ఇస్తున్నారు గబ్బర్ సింగ్. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తమ నాయకుడు పవన్‌ ముఖ్యమంత్రి అవ్వాలన్నది జనసేన కార్యకర్తల  అభిమతం. కాని ఇప్పుడు సోము వీర్రాజు బీసీ ముఖ్యమంత్రి ప్రకటన చేయడంతో .. పవన్ పార్టీ కార్యకర్తలు మండిపోతున్నారు. కూటమి తరపున బీసీ వ్యక్తి సీఎం అయితే.. తమ నాయకుడి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. వీర్రాజు వ్యాఖ్యలు తమలో గందరగోళాన్ని రేకెత్తించేలా ఉన్నాయని జనసేన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థే దిగుతారని వీర్రాజు గతంలో చేసిన ప్రకటన రెండు పార్టీల మధ్య విభేదాలకు కారణమైంది. రెండు పార్టీల నేతలు అభ్యర్థి విషయంపై పోటాపోటీ ప్రకటనలు చేయడంతో పొత్తు ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. అయితే బీజేపీ పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణిగింది. తిరుపతి పోటీ విషయంలో బీజేపీ పెద్దలతో పవన్ ఓ డీల్ కుదుర్చుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. తిరుపతిలో బీజేపీ బరిలో ఉంటే.. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని పవన్ కమలం పెద్దల ముందు ప్రతిపాదన పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో  సోము వీర్రాజు చేసిన బీసీ ముఖ్యమంత్రి ప్రకటన.. జనసేనలో ప్రకంపనలే రేపుతోంది.   ఇప్పుడు బీసీలను కాదనలేం.. పవన్‌ను వద్దనలేం.. పొరుగు రాష్ట్రంలో కేసీఆర్‌ ఇప్పటికీ దళిత సీఎం వ్యాఖ్యల విషయంలో అక్కడి ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. వీర్రాజు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదు. బీసీలపై ఆయనకు నిజంగా అంత ప్రేమ ఉంటే గత ప్రభుత్వంలో రెండు మంత్రి పదవుల్లో ఒకటి బీసీలకు ఎందుకు ఇప్పించలేకపోయారు’ అని జన సేన నేతలు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు రెండు పార్టీల పొత్తుపైనే ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు.

5 రూపాయలు అడిగిందని కూతురినే కొట్టి చంపాడు!

మానవత్వం మంట కలుస్తోంది.  పిల్లలపై తల్లి దండ్రుల తీరు మారుతుంది. కన్నపిల్లలపైనే  క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.  యమ కింకరులుగా మారుతూ  ప్రాణాలు తీస్తున్నారు. ఐదు రూపాలయ కోసం కన్న కూతుర్ని చంపాడు ఓ కసాయి తండ్రి.  స్వీటు కొనుకునేందుకు ఐదు రూపాయలు అడిగిందని... కన్న కూతురును ఇంటి మెట్లకేటి కొట్టి చంపాడు.  మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో  ఈ కసాయి తండ్రి భాగోతం వెలుగుచూసింది   గోండియా జిల్లా లోనారా గ్రామానికి చెందిన వివేక్, వర్షా దంపతులకు 20నెలల వైష్ణవి అనే కూతురుంది. తల్లి వర్షా చెబుతున్న వివరాల ప్రకారం.. తనకు స్వీటు ఇప్పించమని తల్లిని అడిగింది వైష్ణవి. కూతురు ఏడుస్తుండటంతో  భర్తను ఐదు రూపాయలు ఇవ్వాలని అడిగింది తల్లివర్షా. దీంతో ఆగ్రహానికి గురైన వివేక్ కసాయిగా మారాడు. తన కూతుర్ని , భార్యను తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా.. భార్యను ఇంటి తలుపుకేసి బాదాడు. దీంతో భయంతో బయటికి పరుగులు తీసింది. ఏడుస్తున్న బిడ్డను ఇంటి మెట్ల మీద కొట్టాడు. దీంతో తీవ్రగాయాల పాలైంది వైష్ణవి. ఆమెను టిరోడా ఉప జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే బాలిక మరణించిందని వైద్యులు చెప్పారు. దీంతో భార్య వర్షా .. భర్త వివేక్ పై టిరోడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కసాయి భర్త వివేక్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.  

విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గకపోతే.. రైతు ఉద్యమానికి 100 రెట్ల ఉద్యమం..

"విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు" అంటూ ఆనాడు తెన్నేటి విశ్వనాధం వంటి నాయకులు చేసిన ఉద్యమ ఫలితంగా వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై ఆంధ్ర ప్రదేశ్ ప్రజలనుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోపక్క కేంద్రం తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ప్రజలు మరోసారి ఉద్యమానికి సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన అయన ‘‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. విశాఖ ఉక్కు కర్మాగారం దేశంలోని మిగతా కర్మాగారాల లాగా కేవలం ఒక పరిశ్రమ గా మాత్రమే చూడొద్దు. మా నగరం పేరే ఉక్కు నగరం. ఉక్కు సంకల్పంతోనే సాధించుకున్నాం. విశాఖ ఉక్కు నుంచి విశాఖ ను వేరు చేయడం అంటే మా ప్రాణాల్ని మా దేహాల నుంచి వేరు చేయడమే. విశాఖ ఉక్కు 5 కోట్ల ఆంధ్రుల, 20 కోట్ల తెలుగు ప్రజల మనోభావాలు, రాజీ లేని పోరాటాలకు ప్రతీక. దయచేసి మా సెంటిమెంట్ ని ముట్టుకోవద్దు.1966 నుంచి దశాబ్దకాలం పాటు "విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు" అనే నినాదంతో తెలుగు ప్రజలు సుదీర్ఘ పోరాటం, 32మంది ప్రాణ త్యాగాలు, 64 గ్రామాల ప్రజలు ఇళ్ళు , 22,000 ఎకరాల భూమిని త్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిధ్ధమే. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఢిల్లీలో రైతులు చేసిన ఉద్యమం కంటే... 100 రెట్లు ఉద్యమం, తీవ్రత చవి చూడాల్సి వస్తుంది. ’’ అంటూ గంటా ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో  మరో అరాచకం ! తూ.గోలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం 

ఆంధ్రప్రదేశ్ లో అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలయాలపై వరుసగా జరిగిన దాడులు తీవ్ర కలకలం రేపగా.. తాజాగా రాజకీయ నేతలపై పడ్డారు దుండగులు. తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ వ్యవస్థాపకుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.  పంచాయతీ ఎన్నికల వేళ ఎన్టీఆర్ విగ్రహం కావడం మంటలు రేపుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన జిల్లాలో తీవ్ర దుమారం రేపుతోంది.  తూర్పు గోదావరి జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ట్వీట్టర్ లో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'మూర్ఖత్వానికి మానవ రూపం వైఎస్ జ‌గ‌న్. మహనీయుల విగ్రహాలు కూలుస్తూ జగన్ రెడ్డి మరింత దిగజారిపోయాడు. దేవతా విగ్రహాలు ధ్వంసం చేసిన వైకాపా గ్యాంగ్ ఇప్పుడు మహనీయుల విగ్రహాల పై పడింది. స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారిది విగ్రహం పడగొడితే చేరిగిపోయే చరిత్ర కాదు' అన్నారు లోకేష్. 'తూర్పు గోదావరి జిల్లా, కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వైకాపా గ్యాంగ్ ని కఠినంగా శిక్షించాలి' అని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. 'తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో జరిగిన ఘటన ఇది. స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని రాజకీయ కక్షతో దుష్టశక్తులు నాశనం చేయడం దుర్మార్గపు చర్య. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం అధికారం చేప్పట్టిన నాటి నుండి ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి' గోరంట్ల బుచ్చయ్య విమ‌ర్శించారు. 'మూర్ఖ‌త్వం పరాకాష్ఠ‌కు చేరుకుంటే ఇటువంటి చర్యలు కి దారి తీస్తాయి. మీరు విగ్రహాన్ని ధ్వంసం చేస్తేనో.. లేక దాడులు చేస్తేనో తెలుగుదేశం పార్టీని బలహీన పరచలేరు. పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. అధికార ఒత్తిళ్లు కి తలోగ్గకుండా వ్యవహరించాలి' అని గోరంట్ల బుచ్చయ్య డిమాండ్ చేశారు.  

సామాన్యుడికి మరో షాక్.. వంట గ్యాస్ పై సబ్సిడీకి కేంద్రం రాంరాం..!

మీకు సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ ఉందా.. అయితే సబ్సిడీ సొమ్ము మీ అకౌంట్ లో జమ అవుతుందో లేదో గమనించారా.. లేదంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే గత ఏడాది మే నుండి బ్యాంకు అకౌంట్లలో కేవలం రూ.40.72 మాత్రమే పడుతోంది. అయితే నిజానికి వంటగ్యాస్‌ ధర పెరిగినకొద్దీ సబ్సిడీ మొత్తం కూడా పెరగాలి. కేంద్రంప్రభుత్వం సబ్సిడీ సిలిండర్‌ ధర పెంచిన ప్రతి సారీ పెరిగిన తేడా మొత్తం సబ్సిడీ రూపంలో మన ఖాతాలో పడాలి. అయితే కరోనా రావడానికి ముందు ప్రభుత్వం కూడా అలాగే చెల్లించేది. అయితే గత మే నుంచి ంటే కరోనా మొదలైనప్పటి నుండి కేంద్రం సైలెంట్ గా ఆ పద్ధతికి రాంరాం చెప్పింది. దీంతో సిలిండర్‌ ధర ఎంత ఉన్నా కేవలం రూ.40.72 మాత్రం వేసి చేతులు దులుపుకుంటోంది. 2014-15లో మోదీ సర్కారు వంట గ్యాస్‌ ధరలను బయటి మార్కెట్ రేట్లకు లింక్ చేయాలని నిర్ణయించినపుడు ఆ ఏడాదికి ఒక్కో సబ్సిడీ సిలిండర్‌ మీద రూ.563 సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. అప్పట్లో ఒక్కో సిలిండర్‌ ధర వెయ్యి రూపాయలకు పైగానే ఉండేది.అయితే గత ఆరేళ్లలో సిలిండర్‌ రేటుతో పాటు సబ్సిడీ కూడా తగ్గిపోతూ ఇప్పుడు కేవలం రూ.40 మాత్రమే బ్యాంకు అకౌంట్ లో పడుతోంది. ఈ సొమ్ము కూడా చమురు కంపెనీలే ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనినిబట్టి కేంద్రం వినియోగదారుడికి ఇస్తున్నది సున్నా. దీంతో వంట గ్యాస్‌ సబ్సిడీని కేంద్రం ఎత్తివేసినట్లేనని అందరూ భావిస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్యాస్‌ డీలర్లు, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు కూడా దీనిపై ఇప్పటికే స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోపక్క నిన్న మొన్నటివరకు సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ. 746.50 ఉండేది. అయితే గురువారం నుండి మరో రూ.25 పెంచడంతో రూ.771.50 పైసలకు చేరింది. ఇందులోవ్యక్తం చేస్తున్నారు కేంద్రం ఒక్క పైసా సబ్సిడీ ఇవ్వటంలేదు. కేవలం ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలు మాత్రం ఒక్కో సిలిండర్‌కు రూ.40 చొప్పున వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాయి. ఇపుడు ఒక్కో సిలిండర్‌ రూ. 731.50 కు వినియోగదారుడు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. దీనికి తోడు ఇప్పటి వరకు వంటగ్యాస్‌ ధరలను నెలకోసారి (ఒకటో తేదీన) సవరించేవారు. దీంతో సిలిండర్‌ ధర పెరిగినా, తగ్గినా... నెల రోజులపాటు అదే రేటు అమలులో ఉండేది. ఇప్పటి నుండి వారానికొకసారి వంటగ్యాస్‌ ధరలను సవరించాలనే ప్రతిపాదనకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో నెలకు నాలుగు సార్లు గ్యాస్‌ ధరల్లో మార్పు ఉంటుంది. ఇప్పటికే సబ్సిడీని దాదాపుగా ఎత్తివేయగా... ఇకముందు వారానికోసారి గ్యాస్‌ ధరలు సవరిస్తే మరింత అన్యాయం జరుగుతుందని వంట గ్యాస్‌ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించొద్దు!  గుంటూరు, చిత్తూరు కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశం 

పంచాయతీ ఎన్నికల అంశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించవద్దంటూ కలెక్టర్లకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవరకు ఫలితాలను హోల్డ్‌లో ఉంచాలని పేర్కొంది. తమకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించిన తర్వాతే ఫలితాలు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి నివేదిక పంపాలని చిత్తూరు, గుంటూరు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. లోపాలు ఉన్నట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ హెచ్చరించింది.    ఏపీలో తొలి దశ  పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహగరణ గడువు గురువారంతో ముగిసింది.   గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు జరిగినట్లు ఎన్నికల కమిషన్ గుర్తించింది. మిగితా జిల్లాలకు విభిన్నంగా ఉండటంతో కమిషన్ ఈ వ్యవహారంపై ఆరా తీసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎన్నికలకు సంసిద్ధత పట్ల ఎన్నికల సంతృప్తిని వ్యక్తం చేసింది. కలెక్టర్లు, ఎస్పీలు పూర్తి చర్యలు తీసుకుంటున్నారని అభినందించింది. పోలీసులు వ్యాక్సినేషన్ వేయించుకునే కార్యక్రమాన్ని పక్కనపెట్టి ఎన్నికల విధులు నిర్వహించడానికి ముందుకు రావడంపై ఎస్‌ఈసీ అభినందనలు తెలిపింది. 

ఐఎఎస్ లను ఫుట్ బాల్ ఆడుకుంటున్న ఏపి పర్కార్ ..

అఖిల భారత సర్వీసుల్లో అగ్రస్థానంలో ఉండేది ఐఎఎస్ లే. అలాంటి టాప్ స్థాయి అధికారులను ఏపి ప్రభుత్వం ఫుట్ బాల్ ఆడుకుంటోంది. సీనియర్లు , జూనియర్లనే తేడా కూడా గమనించడంలేదు. సీనియర్లతో ఎలా పనిచేయించుకోవాలి..జూనియర్లను ఏయే పోస్టుల్లో నియమించాలన్న ఆలోచనే చేయకుండా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఐఎఎస్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జూనియర్లు, సీనియర్లు ఎంతెంత మంది ఉన్నారనే దానిపై ఎక్సర్ సైజ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు బాధ్యతలు అప్పగించడంపై  ద్రష్గి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  ఎవరు ఏ ఏ పోస్టుల్లో ఎంత కాలం ఉంటున్నారో అర్ధం కావడం లేదు.  తాజాగా టిటిడిలో జెఇవోగా పనిచేస్తున్న బసంతో కుమార్ ను అక్కడి నుంచి తప్పించి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా జిఎడికి అటాచ్ చేసింది. అలాగే ప్రాధాన్యత పోస్టులో కొనసాగుతూన్న వివేక్ యాదవ్ ను అకస్మాత్తుగా అక్కడి నుంచి బదిలీ చేసి గుంటూరు కలెక్గర్ గా నియమించింది. ఇందులోను రాజకీయమేనని ఆరోపిస్తున్నారు. బదిలీలతో ఖాళీలైన పోస్టుల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వడం లేదు. అస్మదీయులకే ఆయా శాఖల అదనపు బాధ్యతలు అప్పగిస్తోంది ప్రభుత్వం . సిఎం జగన్ కు పరిపాలనపై పట్టు లేక పోవడంతో సిఎంవో లోని ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్  ఐఎఎస్ లందరిపై పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయనను ప్రసన్నం చేసుకుంటే చాలు సిఎంతో పనిలేదని ఐఎఎస్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.  ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న అజేయ కల్లం గతంలో ఐఎఎస్ బదిలీల బాధ్యత నిర్వర్తించేటప్పుడు ఇలాంటి సమస్యలు తలెత్తలేదని అంటున్నారు. ఇదంతా జగన్ అనుభవ రాహిత్యమే కారణమైతే.. ఆయన పాలనపై ద్రప్టి  పెట్టకపోవడం ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కూడా స్వతంత్రంగా వ్యవహరించలేక పోతున్నారని ఐఎఎస్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘానికి ఓటర్ల లిస్టును సకాలంలో అందించకపోవడంతో మంచి అధికారులుగా పేరున్న పంచాయతీ శాఖ ఉన్నతాధికారులైన గోపాల క్రష్ణ ద్వివేది, గిరిజా శంకర్ ఎస్ఈసి వద్ద అభాసు పాలయ్యారు. సిఎం జగన్ అవగాహన, అనుభవ రాహిత్యంతో ఒకే ఒక్క అధికారిపై ఆధార పడడం వల్లనే అని ఐఎఎస్ లు వాపోతున్నారు.   పోలీస్ వ్యవుస్థ మోత్తం మరో సలహాదారు సజ్జల రామక్రష్ఱా రెడ్డి చేతుల్లో ఉండడంతో ఆ వ్యవస్థ మోత్తం అస్థవ్యవస్థగా తయారైంది. డిజిపిని డమ్మీ చేసి పోలీస్ వ్యవస్థను సజ్జల గుప్పిట్లో పెట్టుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై గుడ్ న్యూల్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పోలవరంపై పార్లమెంట్ లో కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టు  అయ్యే ఖర్చునంతా కేంద్రమే భరిస్తుందని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలవరం పనులు ఎంత వరకు వచ్చాయి? ఎంత భూసేకరణ చేశారు? కేంద్రం ఇప్పటి వరకు ఎన్ని నిధులు ఇచ్చింది? అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు పార్లమెంట్‌లో  లిఖిత పూర్వక సమాధానం చెప్పింది. పోలవరం ప్రాజెక్టు కోసం 2014 నుంచి ఇప్పటి వరకు 10,848.36 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు 1.11 లక్షల ఎకరాల భూమిని సేకరించినట్లు తెలిపింది. భూసేకరణ, పునరావాసం అంచనా రూ.28,172.21 కోట్లుగా పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్స్ హెడ్ వర్క్స్ 69.68 శాతం పూర్తయ్యాయని కేంద్ర సర్కార్ తెలిపింది. ఎడమకాల్వ తవ్వకం 92 శాతం, లైనింగ్ పనులు 70శాతం పూర్తయినట్లు వెల్లడించింది. నిర్మాణ బాధ్యతలను ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అథారిటీ పర్యవేక్షిస్తోందని పేర్కొంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో కేంద్రమే ఖర్చును పూర్తిగా భరించనుందని స్పష్టం చేసింది. ఇక 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు ద్వారా నీళ్లందించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

ఇండియాలో 30  కోట్ల మందికి కరోనా! సీరో సర్వేలో తేల్చిన ఐసీఎంఆర్ 

ప్రపంచాన్ని ఇంకా వణికిస్తోంది కరోనా మహమ్మారి. ఏడాది దాటినా ఇంకా ప్రభావం చూపిస్తూనే ఉంది. రూపు మార్చుకుని కొన్ని దేశాల్లో మరింత ప్రమాదకరంగా మారింది మాయదారి వైరస్. ఇండియాలోనూ కరోనా కేసులు ఇంకా వేలల్లోనే నమోదవుతున్నాయి. ఆరు నెలల క్రితంతో పోల్చితే కేసుల సంఖ్య భారీగానే తగ్గినా.. ఇంకా ముప్పు పూర్తిగా పోలేదంటున్నారు వైద్య నిపుణులు. అయితే ఇండియాలో కరోనాకు సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్వహించిన సీరో సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి.    ఇండియాలో గత సంవత్సరం డిసెంబర్ నాటికే ప్రతి ఐదుగురిలో ఒకరికి పైగా కరోనా బారిన పడ్డారని ఐసీఎంఆర్ సీరోలాజికల్ సర్వే గణాంకాలు చెబుతున్నాయి. అంటే దేశంలో దాదాపు 28 కోట్ల మందికి డిసెంబర్ నాటికే కరోనా సోకిందన్నమాట.  ఢిల్లీ మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో సీరో సర్వే నిర్వహించగా, 21.4 శాతం మందికి కరోనా సోకి తగ్గిపోయి, యాంటీ బాడీలు వృద్ధి చెందాయని తేలింది. 10 నుంచి 18 సంవత్సరాల వయసున్న వారిలో 25.3 శాతం మందిలో యాంటీ బాడీలు కనిపించాయి. ఈ గణాంకాల ఆధారంగా ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా వైరస్ సోకిందన్న నిర్ధారణకు వచ్చామని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ తెలిపారు.    ఆగస్టులో జరిపిన సీరో సర్వేతో పోలిస్తే  కరోనాను ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తిని కలిగివున్న వారి సంఖ్య 0.7 శాతం నుంచి 21.4 శాతానికి పెరిగింది. 18 సంవత్సరాల కన్నా అధిక వయసున్న వారిలో 21.4 శాతం, టీనేజ్ లో ఉన్న వారిలో 25.3 శాతం, పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల్లో ఉంటున్న వారిలో 31.7 శాతం, పట్టణాల్లో నివసిస్తున్న వారిలో 26.2 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 19.1 శాతం వరకూ కరోనా రోగ నిరోధక శక్తి ఉందని తమ సీరో సర్వేలో  వెల్లడైంది. మగవారిలో 20.3 శాతం, ఆడవారిలో 22.7 శాతం మంది కరోనాను ఎదుర్కొన్నారని ఐసీఎంఆర్ డైరెక్టర్ వివరించారు.  హెల్త్ కేర్ విభాగానికి వస్తే డాక్టర్లు, నర్సుల్లో 26.6 శాతం, పారామెడికల్ స్టాఫ్ లో 25.4 శాతం, ఫీల్డ్ స్టాఫ్ లో 25.3 శాతం, అడ్మిన్ స్టాఫ్ లో 24.9 శాతం మందిలో యాంటీ బాడీలు ఉన్నాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాలకు చెందిన 700 పట్టణాలు, గ్రామాల్లో ఈ సర్వే జరిగిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.  ఇక ఢిల్లీలో తాజాగా నిర్వహించిన సీరో సర్వేలో ఢిల్లీలోని 56.1 శాతం మంది శరీరంలో యాంటీ బాడీల వృద్ధి కనిపించిందని వెల్లడైంది. ఢిల్లీ వాసుల్లో సగం మందికి పైగా కరోనా బారిన పడి ఏ విధమైన మందులు తీసుకోకుండానే కోలుకున్నారని  తేలింది. ఏ ప్రాంతంలోనైనా ఓ వ్యాధి ప్రబలితే.. 50 శాతానికి పైగా హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిన తరువాతే దాని వ్యాప్తి నియంత్రణలోకి వచ్చినట్టని వైద్యశాఖ నిర్దారిస్తుంది.ఈ లెక్కన కరోనా మహమ్మారిని దేశ రాజధాని ఢిల్లీ జయించిందని చెబుతున్నారు.   

పెళ్లి ఆఫర్‌తో ప్రత్యర్థికి మద్దతిచ్చిన బ్రహ్మచారి.. అక్కడి ఎన్నికలలో సూపర్ ట్విస్ట్

దేశంలో ఆడపిల్లల జనాభా తగ్గిపోవడంతో బెండకాయలు ముదిరినట్లుగా యువకులు 40 ఏళ్ళు వచ్చినా బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో పెళ్లి చేసుకోవడం కోసం వారు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ ఎఫెక్ట్ అక్కడ పంచాయతి ఎన్నికలలో కూడా పడింది. తాజాగా కర్ణాటకలో పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రామనగర్‌ జిల్లా కోడంబళ్లి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకునేందుకు ఈనెల 11న షెడ్యూలు ఖరారు చేశారు. బీసీ ఏ కేటగిరికి అధ్యక్ష స్థానం రిజర్వు కాగా, కాంగ్రె్‌సకు చెందిన వ్యక్తి ఆ రేసులో ఉన్నారు. అతనికి ఇదే పంచాయతీలో జేడీఎస్‌కు చెందిన వార్డు సభ్యుడు రవి మద్దతు అవసరమైంది. మరోపక్క రవి బ్రహ్మచారి.కావడంతో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రామనగర్‌ జిల్లా గ్రామీణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు "నువ్వు మాకు మద్దతు ఇవ్వు...ఒక మంచి పిల్లను చూసి నీ పెళ్లి చేసే బాధ్యత మాది’అంటూ రవికి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. దీంతో ఇంకేముంది మనోడు కాంగ్రెస్ క్యాండిడేట్ కు సపోర్ట్ చేయడానికి సిద్దమైపోయాడు. రవి తాజా వ్యవహారంతో జేడీఎస్‌ నాయకులు ఖంగుతిన్నారు. పెళ్లి కోసం పార్టీకి వ్యతిరేకంగా పనిచేయొద్దంటూ స్థానిక నాయకులు హెచ్చరించారు. అయినా రావియా మాట వినకపోవడంతో చివరికి మాజీ సీఎం కుమారస్వామి చేత కూడా ఫోన్‌ చేయించారు. అయినా రవి మాత్రం ససేమిరా అన్నాడు. నాకు పాలిటిక్స్ కంటే నా పెళ్లి ముఖ్యమని తేల్చి చెప్పేశాడు. ఈ జగమొండి బ్రహ్మచారి తీరుతో మండిపడిన కుమారస్వామి అతడిపై వేటు వేయాలని సూచించినట్టు, స్థానిక నాయకత్వం తెలిపింది. ఐతే ఈనెల 11 దాకా వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు సమాచారం.

సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా చిన్నపరెడ్డి! 

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కు త్వరలో జరగనున్న ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకంగా మారింది. సీఎం కేసీఆర్ సొంత గడ్డ దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కుదేలైంది కారు పార్టీ. అటు  గులాబీ పార్టీగా వరుసగా షాకులిస్తున్న బీజేపీ దూకుడు పెంచింది. నాగార్జున సాగర్ లోనూ గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రంలో  బలాన్ని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. తమకు గట్టి పట్టున్న నాగార్జున సాగర్ లో సత్తా చాటాలని చూస్తోంది. దీంతో తమకు సిట్టింగ్ స్థానమైన సాగర్ ను నిలబెట్టుకోవడం అధికార పార్టీకి సవాల్ గా మారుతోంది.   నాగార్జున సాగర్ ఉప ఎన్నికతోనే భవిష్యత్ రాజకీయ మనుగడ ఉంటుందనే భావనలో ఉన్న గులాబీ బాస్.. అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. నాగార్జున సాగర్ టికెట్ తమకే వస్తుందనే ధీమాలో ఉన్నారు దివంగత ఎమ్మెల్యే నోముల భగత్. మంత్రి జగదీశ్ రెడ్డి క్లాస్ మేట్, లోకల్ లీడర్ ఎంసీ కోటిరెడ్డి కూడా రేసులో ఉన్నారు. సాగర్ నియోజకవర్గానికే చెందిన ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డితో పాటు శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్లు అధికార పార్టీలో వినిపిస్తున్నాయి. అయితే అన్ని అంశాలు పరిశీలించిన సీఎం కేసీఆర్.. ఎమ్మెల్సీ తేరా చిన్నప రెడ్డి పేరును దాదాపుగా ఖరారు చేశారని టీఆర్ఎస్ వర్గాల సమాచారం.    టికెట్ ఎంపికలో కేసీఆర్ గతంలో ఎప్పుడు లేనంతగా కసరత్తు చేశారని తెలుస్తోంది. నోముల భగత్ పేరు పరిశీలించినా... దుబ్బాక ఫలితం అధికార పార్టీని భయపెడుతుందని చెబుతున్నారు. దుబ్బాకలో  దివంగత సోలిపేట రామలింగారెడ్డి సతీమణకి టికెట్ ఇచ్చారు. అయితే ఎన్నికల్లో ఆమెనే పార్టీ మైనస్ అయ్యారని గులాబీ నేతలు అంచనాకు వచ్చారు. సాగర్ లోనూ భగత్ కు టికెట్ ఇస్తే అలాంటి ఫలితం వస్తుందేమోనన్న ఆందోళన టీఆర్ఎస్ పెద్దల్లో ఉందట. భగత్ కు రాజకీయ అనుభవం లేకపోవడం మైనస్ గా ఉందంటున్నారు. ఎంసీ కోటిరెడ్డి పేరును మంత్రి జగదీశ్ రెడ్డి ప్రతిపాదిస్తున్నా.. అతనికి నియోజకవర్గంలో పలుకుబడి లేదని కేసీఆర్ సర్వేలో తేలిందట. అంతేకాదు నియోజకవర్గ ప్రజల్లో కోటిరెడ్డిపై వ్యతిరేకత కూడా ఉందని రిపోర్టు వచ్చిందంటున్నారు.   శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని సాగర్ లో పోటీ చేయించాలని కేసీఆర్ ముందు భావించారని తెలుస్తోంది. మే నెలలో ఆయన ఎమ్మెల్సీ పదవి కాలం ముగియనుండటంతో .. ఉప ఎన్నిక బరిలో నిలపాలని ఆలోచించారట. అయితే  సాగర్ లో పోటీ చేయడానికి పార్టీ పెద్దల ముందు గుత్తా కొన్ని డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. తనకు కేబినెట్ లో చోటు కల్పిస్తామని హామీ ఇస్తేనే సాగర్ లో పోటీ చేస్తానని కేటీఆర్ తో గుత్తా చెప్పారని సమాచారం. దీంతో గుత్తా అభ్యర్థిత్వంపై కేసీఆర్ వెనక్కి తగ్గారని చెబుతున్నారు. ఒకరికి అలాంటి హామీ ఇస్తే.. ముందు ముందు సమస్యలు వస్తాయని గులాబీ పెద్దలు భావించారని చెబుతున్నారు.    నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా జానా రెడ్డి లేదా ఆయన తనయుడు బరిలో ఉండే అవకాశం ఉంది. జానారెడ్డి గతంలో ఇక్కడి నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గంలో ఆయనకు చాలా పట్టుంది. ఆర్థికంగానూ బలవంతుడు. అందుకే జానారెడ్డి లాంటి ఉద్దండ లీడర్ ను ఎదుర్కొవాలంటే ఆర్థికంగా బలవంతుడైన తేరా చిన్నపరెడ్డి అయితేనే కరెక్టుగా  ఉంటుందనే అంచనాకు కేసీఆర్ వచ్చారని తెలుస్తోంది. అంతేకాదు చిన్నపరెడ్డిపై నియోజకవర్గ ప్రజల్లో కొంత సెంటిమెంట్ కూడా ఉంది. 2009 నుంచి టీడీపీ అభ్యర్థిగా  ఆయన పలు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నల్గొండ ఎంపీగా కూడా బరిలో నిలిచారు. కాని ఎప్పుడూ గెలవలేదు. ఎన్నికల్లో పోటీ చేసి భారీగా డబ్బులు ఖర్చు చేశారని ప్రజల్లో ఆయనపై సానుభూతి ఉంది.  ఇది కూడా తమకు కలిసివస్తుందని గులాబీ బాస్ లెక్కలేస్తున్నారని చెబుతున్నారు. ఇలా అన్ని అంశాలు పరిశీలించాకే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డిని సీఎం కేసీఆర్ దాదాపుగా ఖరారు చేశారని సమాచారం.    మరోవైపు తేరా చిన్నపరెడ్డికి బీజేపీ నేతలు గాలం వేస్తున్నారని తెలుస్తోంది.  ఇటీవలే నాగోల్ లో బీజేపీ ముఖ్యనేతలతో చిన్నపరెడ్డి సమావేశం అయ్యారని వార్తలు వచ్చాయి. నాగార్జున సాగర్ టికెట్ ఇస్తామని కమలం పార్టీ ఆయనకు ఆఫర్ ఇచ్చిందని ప్రచారం జరిగింది. అయితే బీజేపీ నేతలతో సమావేశం జరిగిందన్న వార్తలను ఖండించారు చిన్నపరెడ్డి. కాని బీజేపీ నేతలు ఆయనతో టచ్ లో ఉన్నది నిజమేనని తేరా సన్నిహితులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత అలర్టైన టీఆర్ఎస్ పెద్దలు.. తేరాతో మాట్లాడి కూల్ చేశారనే చర్చ కూడా తెలంగాణ భవన్ లో జరుగుతోంది. టీఆర్ఎస్ నుంచే పోటీ చేయాలని అప్పుడే ఆయనకు కేటీఆర్ చెప్పారని కూడా చెబుతున్నారు.

సామాన్యుడి నెత్తి మీద వంటగ్యాస్ పిడుగు

కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ రేట్ల‌ను ప్ర‌తిరోజు పెంచుతుండడంతో ప్రజలు ఇప్పటీకే అల్లాడిపోతున్నారు. ఒక పక్క లీట‌రు పెట్రోల్ ధర 100రూపాయ‌ల వైపు ప‌రుగుపెడుతున్నా… కేంద్రం నుండి ఎటువంటి స్పంద‌న లేదు. పెరుగుతున్న డిజిలి ధరలతో దేశంలో నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయని పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు తాజా బడ్జెట్ లో దీనిపై అగ్రి సెస్ అంటూ మ‌రింత వ‌డ్డించేందుకు సిద్ధం కాగా… అన్ని వైపుల నుండి తీవ్ర నిర‌స‌న రావడంతో కొద్దిగా వెనక్కు తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా సామాన్య, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లకు షాక్ ఇస్తూ.. కేంద్రం వంట‌గ్యాస్ ధ‌ర‌ల‌ను భారీగా పెంచేసింది. తాజా ఆదేశాల ప్రకారం.. ఈ కొత్త ధరలు నేటి నుండి అమల్లోకి వచ్చాయి. సబ్సిడీ సిలిండర్‌పై రూ.25, కమర్షియల్ సిలిండర్‌పై రూ.184 పెంచారు.దీంతో హైద‌రాబాద్ లో నిన్నటివరకు రూ 746 గా ఉన్న 14.2 కిలోల సబ్సిడీ వంట‌గ్యాస్ ధ‌ర పెరిగిన రేటు ప్రకారం సిలిండ‌ర్ కు 771.25రూపాయ‌ల‌కు చేరుకుంది.

కందకాలు కాదు వారధులు కావాలి! రైతుల ఆందోళనలపై ఎంపీల కన్నీళ్లు

కేంద్ర కొత్త వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు సభలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దేశాన్నికి  వెన్నెముకైన రైతులతో ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదంటూ తప్పు పట్టారు. ఊరికే ఊకదంపుడు ప్రసంగాలు చెప్పడం ఆపేసి చర్చల ద్వారా సమస్యకు పరిష్కార మార్గం కనుగొనాలని మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రోడ్లపై కందకాలు తవ్వుతూ ముళ్ల కంచెలు వేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేయడం కాదు, వారధులు నిర్మించి రైతుల మనసులు, మన్ననలు  గెలుచుకోవాలని  ప్రతిపక్ష పార్టీల నేతలు ముక్తకంఠంతో నినదించారు. రాజ్యసభలో రైతు ఆందోళనపై మాట్లాడిన ప్రతిపక్ష నేతలు.. ప్రసంగాల మధ్యోలో తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘‘ప్రభుత్వం విమర్శను స్వీకరించే స్థితిలో లేదు. వాళ్లకు వ్యతిరేకంగా వచ్చే ప్రతి పదం దేశద్రోహంగా మారిపోతుంది. దేశభక్తి అనేది బట్టల్లో కనిపించాదని,  మనిషి హృదయంలో ఉంటుంది. ఈరోజు బిజెపి ఇంత పెద్ద మెజారిటీతో అధికారంలో ఉన్నారంటే దానికి కారణం రైతులే కారణమని, ఈ విషయం గుర్తుంటే మీరు ఇంకోలా ఆలోచిస్తున్నారని,  రైతులు తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతుంటే . మీరేదో రైతులకు దానధర్మాలు చేస్తున్నట్లు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో అలాంటి వాటికి తావులేదు’’ అని రాష్ట్రీయ జనతా దళ్ సీనియర్ నేత మనోజ్ ఝా అన్నారు.  ‘‘చేతులు జోడించి వేడుకుంటున్నాను. దయచేసి రైతుల ఆవేదనను అర్థం చేసుకోండి. విపరీతమైన చలిలో వారు ఆందోళన చేస్తున్నారు. వారికి నీళ్లు ఆపేశారు, మూత్రశాల సౌకర్యం తీసేశారు, రోడ్లపై మేకులు వేస్తున్నారు, కందకాలు తొవ్వుతున్నారు, ముళ్ల కంచెలు వేస్తున్నారు. అన్నదాతలపై ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం శత్రు దేశాల సైనికులపై ఇలా ఒక్కసారి కూడా వ్యవహరించలేదు’’ అని అయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఆందోళన చేసేవారు, విమర్శలు చేసే వారికి ఖలిస్తానీ, నక్సల్స్, పాకిస్తాన్ ఏజెంట్లు అంటూ రంగు పూస్తున్నారని, సీఏఏ వ్యతిరేక ఆందోళనపై ప్రభుత్వం ఇలాగే వ్యవహరించింది. రైతు ఆందోళనపై ఇలాగే వ్యవహరిస్తోంది. ఎవరి మాటా పట్టించుకోకుండా, కనీసం వినకుండా దేశాన్ని  పాలిస్తున్నారు. వినే ఓపిక లేదంటే నువ్వు నియంతవే అని మోడీ సర్కార్ ని ఎత్తి చూపుతూ..   రోడ్లపై గోడలు కట్టి ఆందోళనను ఆపాలని చూస్తున్నారు. గోడలు కాదు, వంతెనలు వేసి రైతుల హృదయాలను గెలుచుకోండి’’ అని మనోజ్ ఝా  చెప్పారు.  ‘‘ఈరోజు రైతుల ఆందోళనను దేశ అంతర్గత వ్యవహారంగా మాట్లాడుతున్నాం. మరి అమెరికా వెళ్లి ‘అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్’ అని నినాదాలు చేసింది ఎవరు? మళ్లీ వీళ్లే దేశ అంతర్గత విషయాల గురించి వేరే వాళ్లు మాట్లాడకూడదని అంటున్నారు. ఇక్కడ చిన్న చిన్న స్వేచ్ఛలు ఉన్నందుకు కృజ్ణతలు చెప్పాలి. అవి ఎలాంటివంటే, మైక్రోఫోన్‌లు మ్యూట్‌లో పెట్టుకొని మాట్లాడటం, టెలివిజన్ ఫీడ్‌ను సెన్సార్ చేయడం, మార్షల్స్ చేత ఎంపీలను బయటికి పంపడం లాంటి చిన్న చిన్న స్వేచ్ఛలు ఉన్నాయి’’ అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత డేరెక్ ఓబ్రెయిన్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ‘‘ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలతో ప్రజా వ్యతరేక పాలన కొనసాగుతోంది.  వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తే దేశద్రోహులని అంటున్నారని, రైతు వ్యతిరేకులు ఈ చట్టాలను తీసుకువచ్చారని. ప్రతి దశలో దేశ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారని , మీరు అత్యంత మెజారిటీతో ఈరోజు అధికారంలో ఉండవచ్చు, కానీ అసమ్మతి అనేది ప్రజాస్వామ్య రూపం మీ అంతు చూస్తుందని ’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. 

బీజేపీ గెలిస్తే బీసీనే సీఎం! సోము వీర్రాజు సంచలనం 

ఆంధ్రప్రదేశ్ లో బలపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. తెలంగాణలో దుబ్బాల అసెంబ్లీ ఉప ఎన్నిక తర్వాత  బీజేపీ జోరు పెరిగింది. అదే స్పూర్తితో త్వరలో జరగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికను తమకు అనుకూలంగా మలుచుకోవాలని కమలదళం ప్రణాళికలు రచిస్తోంది. హైకమాండ్ డైరెక్షన్ లోనూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు ఏపీ బీజేపీ నేతలు. తాజాగా రాష్ట్ర‌ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు హీట్ పుట్టించే వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీసీలంతా బీజేపీతోనే ఉన్నారని చెప్పారు. అంతేకాదు బీజేపీ అధికారంలోకి వ‌స్తే బీసీనే ముఖ్య‌మంత్రి అవుతారంటూ సంచలన ప్రకటన చేశారు సోము వీర్రాజు.  బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడమే కాదు.. ప్రత్యర్థి పార్టీలకు సవాల్ కూడా విసిరారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. త‌మ పార్టీ చెప్పినంత ధైర్యంగా.. టీడీపీ, వైసీపీ చేయ‌గ‌ల‌దా అని ప్ర‌శ్నించారు. బీసీలను సీఎం చేస్తామని చెప్పగల దమ్ము దైర్యం వైసీపీ, టీడీపీలకు ఉందా సోము వీర్రాజు సూటిగా అడిగారు.  బీసీలను సీఎం చేసే దమ్ము ఒక్క బిజెపికే ఉందన్నారు. తాము ఎవరికో పదవి ఇవ్వటానికి పోరాటం చేయటంలేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  సమగ్రాభివృద్ధి చేయటమే బిజపి మొదటి లక్ష్యం అన్నారు సోము వీర్రాజు.     బీసీని ముఖ్యమంత్రి చేస్తామని సోము వీర్రాజు చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీని వెనక బీజేపీకి బలమైన కారణమే ఉందని, తిరుప‌తి ఉప ఎన్నిక‌ కోసమే సోము ఈ ప్రకటన చేశారని చెబుతున్నారు. తిరుప‌తిలో బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువే.   అందుకే వారిని కాకా పెట్టడానికే  సోమువీర్రాజు ప్రకటన చేశారనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో వైసీపీ, టీడీపీలను ఇరుకునే పెట్టే ప్రయత్నం చేశారంటున్నారు. ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెర లేపినా  ఆశించిన ఫ‌లితాలు రావ‌డంలేదు. ఒకరిద్దరు నేతలు తప్ప కొత్తగా ఎవరూ కమలం గూటికి చేరలేదు. అందుకే ఏదో ఒకటి చేసి పార్టీ గ్రాఫ్ పెంచాలని బీజేపీ భావిస్తుందని తెలుస్తోంది. బీజేపీ ప్రయోగించిన బీసీ ముఖ్యమంత్రి అంశం తిరుపతి ఉప ఎన్నికతో పాటు ఏపీలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి మరీ..  

ఆడియో బయటపడినా అదే బుకాయింపు ! ఎవరిని బెదిరించలేదంటున్న  కన్న బాబురాజు  

ఏపీలో జరుగుతున్న  పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ నేతలు బరి తెగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  నామినేషన్లు వేయవద్దంటూ  ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను వైసీపీ నేతలు బెదిరిస్తున్న ఘటనలు భారీగా వెలుగు చూస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ  అధికార పార్టీ నేతల బాగోతాలు బట్టబయలవుతున్నాయి. అయినా తాము ఎవరిని బెదిరించడం లేదని బుకాయిస్తున్నారు అధికార పార్టీ నేతలు.  తాను బెదిరించిన ఆడియో వైరల్ గా మారినా... తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చేసుకున్నారు. విశాఖ జిల్లా  ఎలమంచిలి   ఎమ్మెల్యే కన్నబాబు రాజు. తనపై పెట్టిన కేసులో వాస్తవం లేదన్నారు.  తానూ ఎవర్ని బెదింరించలేదని  వెల్లడించారు, ఒక వేళ తాను ఎవర్నైనా బెదిరించినట్టు ఆధారాలు చూపిస్తే   ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు కన్నబాబు రాజు. ఏకగ్రీవమైతే గ్రామానికి రూ. 15 లక్షలు వస్తుందని, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చునని చెప్పానని వివరించారు.  అంతే గాని తాను ఎవరినైనా బెదిరించలేదని, బెదిరించినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేస్తానని తెలిపారు.    రాంబిల్లి మండలం లాలంకోడూరు పంచాయతీ సీతపాలెం పదో వార్డు సభ్యుడిగా రుత్తల సత్యం అనే వ్యక్తి నామినేషన్‌ వేశారు. అయితే  ఎమ్మెల్యే కన్నబాబురాజు  అభ్యర్థి రుత్తల సత్యం అల్లుడు సంతోష్ కి  ఫోన్‌ చేసి బూతులు తిట్టారు. నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని బెదిరించారు. దీనికి సంబంధించిన ఫోన్ కాల్ బయటికి రావడంతో సంచలనంగా మారింది.  ఆ ఆడియో ఆధారంగా చూపుతూ   రాంబిల్లి పోలీస్ స్టేషన్‌లో  ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు సత్యం. దీంతో ‌ఎమ్మెల్యే కన్నబాబు రాజు, అతని అనుచరుడు డీఎస్‌ఎం రాజుల పై ఐపీసీ 506,171ఎఫ్‌తో పాటుగా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.  తనపై నమోదైన కేసుపై  స్పందించిన ఎమ్మెల్యే కన్న బాబురాజు ..  తాను ఎవరిని బెదిరించలేదని కవరింగ్ ఇచ్చుకున్నారు.  ఆడియోలో బెదిరింపుల పర్వం బయటపడినా.. ఎమ్మెల్యే బుకాయించడంపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.  

ఏపీలో ఉదయం 9 గంటలకే స్కూల్ 

లాక్ డౌన్ తర్వాత స్కూళ్లు తెరుచుకున్నాయి. విద్యార్థుల హాజరు కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ  నేపథ్యంలో పాఠశాలల పని వేళలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.   ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ఉన్న పాఠశాలల సమయాల్లో విద్యాశాఖ మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు ప్రాథమిక పాఠశాలు, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నిర్వహణ సమయం మార్పు చేశారు. మన బడి నాడు–నేడు, మధ్యాహ్న భోజన పథకంపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. పాఠశాలలన్నీ ఉదయం 9 గంటల నుంచే ప్రారంభం కావాలని విద్యాశాఖ అధికారులను ఆయన ఆదేశించారు.  ఉదయం వేళ సాధ్యమైనంత త్వరగా స్కూళ్లలో బోధన ప్రారంభించడం మంచిదని సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు. ఉదయం పూట పిల్లల్లో చురుకుదనం బాగా ఉంటుందని, వారి మెదడు కూడా విషయాలను శీఘ్రంగా గ్రహించగలుగుతుందని, ఆ సమయంలో పాఠ్యబోధన సాగిస్తే పిల్లలు ఆయా అంశాలను త్వరితంగా, లోతుగా అవగాహన చేసుకోగలుగుతారన్నారు జగన్. ప్రపంచంలో పాఠశాలలన్నీ ఉదయం 8 లేదా 8.30 గంటలకల్లా ప్రారంభమవుతున్నాయని, అందుకు భిన్నంగా రాష్ట్రంలో ఆలస్యంగా 9.30కు ప్రారంభం కావడం వల్ల అనుకున్న ఫలితాలను సాధించడానికి వీలుండదన్న చర్చ జరిగింది. ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే వాటిని పరిష్కరించుకొని రాష్ట్రంలో కనీసం 9 గంటలకల్లా స్కూళ్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

2019 ఓటర్ల జాబితానే ఫైనల్ ! ఎస్ఈసీని సమర్ధించిన హైకోర్టు 

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏపీ ఎన్నికల సంఘం తీసుకున్న మరో నిర్ణయాన్ని హైకోర్టు సమర్దించింది. పంచాయతీ ఎన్నికలకు 2019 జనవరి 1 నాటి ఓటర్ల జాబితానే ఫైనల్ అని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. 2019 ఓటర్ల జాబితా అంశంపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టి వేసింది. ఏపీలో 2021 ఓటర్ల జాబితా సిద్ధం కాకపోవడంతో... 2019 ఓటర్ల జాబితా అధారంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఎస్ఈసీ. దీంతో  3.6 లక్షల మంది ఓటు హక్కు కోల్పోతున్నారని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 2021 జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్‌ కోరారు. పిటిషనర్‌ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమంటూ ఏపీ హైకోర్టు తేల్చిచెప్పింది.  ఎన్నికల ఏర్పాట్లలో జిల్లాలో పర్యటిస్తున్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. గురువారం  నెల్లూరు జిల్లా అధికారులతో ఆయన  సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో స్థానిక పరిస్థితులు, భద్రత ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిమ్మగడ్డ.. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ను గౌరవించకపోయినా ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. గౌరవాలకు, భేషజాలకు పోవాల్సిన అవసరంలేదన్నారు. సుప్రీం కోర్టు సూచన మేరకు తాను ఎన్నికలు నిర్వహిస్తున్నానని,  తన విధులను తాను బాధ్యతగా నిర్వహిస్తానని తెలిపారు.  రాష్ట్రంలో కరోనా అదుపులోకి రావడం సంతోషమన్నారు నిమ్మగడ్డ. ఎన్నికల నిర్వహణకు ఇదే సరైన సమయమని, ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు.  తెలంగాణలో కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గుర్తు చేశారు.