ఎస్ఈసీ ఆదేశాలకు తలవంచిన మంత్రి పెద్దిరెడ్డి

ఎస్ఈ సి నిమ్మగడ్డ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య గత రెండు రోజులుగా మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పై నిప్పులు చెరిగిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎట్టకేలకు దిగివచ్చారు. కొద్దీ సేపటి క్రితం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎస్‌ఈసీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని, ఆయనకు వ్యతిరేకంగా ఏమి మాట్లాడనని ప్రకటించారు. అంతేకాకుండా తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడనని, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనని అయన చెప్పారు. అయితే నిన్నటి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అయన స్పష్టం చేశారు. మరోపక్క చట్టబద్ధంగా వ్యవహరించని ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకుంటామని అయన హెచ్చరించారు. అయితే ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ సమీక్ష ఏంటి? అని మళ్ళీ ప్రశ్నించారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు అయినా చంద్రబాబు వద్ద నిమ్మగడ్డ బంట్రోతులా పనిచేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఈరోజు ఉదయం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. "రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మాటలు విని ఏకపక్షంగా వ్యవహరించే అధికారులను.. మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ బ్లాక్‌ లిస్ట్‌లో పెడతాం. ఏకగ్రీవమైన అభ్యర్థులకు డిక్లరేషన్‌ ఇవ్వని అధికారుల పేర్లు తీసుకుని.. మార్చి 31 తర్వాత వారికి గుణపాఠం నేర్పుతాం" అని హెచ్చరించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా "మార్చి 31 తర్వాత నిమ్మగడ్డకు చంద్రబాబు ఫోన్‌ కూడా చేయడు. మేము బాబులాగా కాదు. మమ్మల్ని నమ్ముకున్నవాళ్లకు న్యాయం చేస్తాం. నేనేమీ మాట్లాడకపోయినా నాతోపాటు బొత్సపైనా గవర్నర్‌కు లేనిపోనివి ఫిర్యాదు చేశారు. దాంతో శాసనసభ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేశాం. కమిటీ ముందుకు వచ్చి నిమ్మగడ్డ సమాధానం చెప్పాల్సి ఉంటుంది" అని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

వైసీపీ ఎమ్మెల్యేకు స్టేషన్ బెయిల్.. టీడీపీ నేతలైతే జైలు! 

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న  పంచాయతీ ఎన్నికల్లో  అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎస్ఈసీ హెచ్చరిస్తున్నా  వైసీపీ నేతల తీరు మారడం లేదు. పోలీసుల తీరు కూడా వివాదాస్పదంగానే ఉంటోంది. అధికార పార్టీ నేతలకు ఒకలా, టీడీపీ నేతలను మరోలా ట్రీట్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒకే రకమైన ఘటనలు అయినా కేసులు పెట్టడంలో తేడాలు చూపిస్తున్నట్లు  కొన్ని ఘటనల ద్వారా తెలుస్తోంది.   పంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్లు వేయకుండా బెదిరించారనే కేసులో  విశాఖ జిల్లా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు ను పోలీసులు అరెస్టు చేశారు.  ఆయన్ను అరెస్టు చేసి వెంటనే స్టేషన్‌ బెయిల్‌పై విడిచి పెట్టారు. రాంబిల్లి మండలం లాలంకోడూరు పంచాయతీ సీతపాలెం పదో వార్డు సభ్యుడిగా రుత్తల సత్యం అనే వ్యక్తి నామినేషన్‌ వేశారు. అయితే  ఎమ్మెల్యే కన్నబాబురాజు  అభ్యర్థి రుత్తల సత్యం అల్లుడు సంతోష్ కి  ఫోన్‌ చేసి బూతులు తిట్టారు. నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని బెదిరించారు. దీనికి సంబంధించిన ఫోన్ కాల్ బయటికి రావడంతో సంచలనంగా మారింది. బాధితుడి ఫిర్యాదుతో  ‌ఎమ్మెల్యే కన్నబాబు రాజుపై  ఐపీసీ 506,171ఎఫ్‌తో పాటుగా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే కన్నబాబు రాజును అరెస్ట్ చేసిన పోలీసులు వెంటనే బెయిల్ ఇచ్చి పంపించేశారు.     పోలీసుల తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోమవారం  ఏపీ టీడీపీ చీఫ్  అచ్చెన్నాయుడిని నిమ్మాడలో పోలీసులు అరెస్ట్‌ చేశారు.  నిమ్మాడ వైసీపీ సర్పంచ్‌ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో  అచ్చెన్నాయుడిపై  కోటబొమ్మాళి పోలీసులు బెదిరింపు కేసు నమోదు చేశారు. ఏ1గా కింజారపు హరిప్రసాద్, ఏ2గా సురేష్, ఏ3గా అచ్చెన్నాయుడు పేర్లను చేర్చారు. ఈ కేసులో అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్ విధంచడంతో ఆయనను జైలుకు పంపించారు. అచ్చెన్నాయుడు వేసిన బెయిల్ పిటిషన్ కూడా వాయిదా పడటంతో సోమవారం నుంచి ఆయన జైలులోనే ఉన్నారు       వైసీసీ అభ్యర్థిని బెదిరించారన్న కేసులో మాజీ మంత్రి, ఏపీ టీడీపీ చీఫ్ గా ఉన్న అచ్చెన్నను జైలుకు పంపించిన పోలీసులు... అలాంటి ఘటనే జరిగినా వైసీపీ ఎమ్మెల్యేకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి. అక్కడ, ఇక్కడ ఫోన్ లోనే సంభాషణ జరిగింది. అచ్చెన్నాయుడు ఆడియోలో బెదిరించినట్లు ఎక్కడా అనిపించలేదు. కాని వైసీపీ ఎమ్మెల్యే ఆడియోలో మాత్రం ఆయన బెదిరించినట్లు స్పష్టంగా ఉంది. అయినా  వైసీపీ ఎమ్మెల్యేకు స్టేషన్ బెయిల్ రాగా.. సీనియర్ నేతగా ఉన్న ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని మాత్రం జైలుకు పంపించడం చర్చనీయాంశంగా మారింది.

నిమ్మగడ్డ ను కుక్కలు కూడా పట్టించుకోవు 

  ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై వైసీపీ ఎమ్మెల్యే మహిళా ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి విరుచుకుపడ్డారు. మార్చి దాటితే  నిమ్మగడ్డను కుక్కలు  కూడా పట్టించుకోదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు 2019లోనే  టీడీపీని సమాధి చేశారని, సమాధి అయిన టీడీపీ కి పునర్ జీవం పోయాలని, టీడీపీని బతికించుకునే బాధ్యతను నిమ్మగడ్డపై చంద్రబాబు, లోకేశ్ పెట్టారన్నారు. అందుకే నిమ్మగడ్డ టిడిపి ని బతికించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుపరిపాలన, సంక్షేమపథకాలతో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏపీలో జగన్ చేస్తున్నారని, సర్పంచులు మెజారిటీ వైసీపీ ఉండాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ ఎన్ని అడ్డంకులు వేసిన, ఆనకట్టలు కట్టిన మెజారిటీ  వైసీపీ దేనని రాజా జోస్యం చెప్పారు. నిమ్మగడ్డ ఎన్నికల కమిష్నర్ గా కాకుండా  ఒక పార్టీకి కార్యకర్తగా పని చేస్తున్నారని ఆరోపించారు. గ్రామాలు అభివృద్ధి చేసుకోవడానికి, ప్రభుత్వ పథకాలు అమలు కోసం.. ఏకగ్రీవం చేసుకున్నామని గ్రామస్థులే చెబుతున్నారని, ఇది విన్నాక ఆయన తల ఎక్కడ పెట్టుకుంటారంటూ నిమ్మగడ్డను ఉద్దేశించి  రాజా  వ్యాఖ్యానించారు. ప్రతి దానికి ఏదో ఒకటి అడ్డువేస్తూ ఆపాదిస్తున్నారని ,భవిష్యత్తులో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటారని రోజా పేర్కొన్నారు. అధికారులు ఎవరికీ అనుకూలంగా పని చేయాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చేస్తే సరిపోతుందన్నారు. అధికారులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే రోజా అన్నారు.   

క్విడ్‌ప్రోకో దోపిడీ  ప‌క్క‌న‌ పెట్టు జగన్ రెడ్డి.. స్టీల్ ప్లాంట్‌ను కాపాడు! 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై తీవ్రంగా స్పందించారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.  విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డికి ఉందని ఆయన  ట్వీట్ చేశారు. ‘‘ఢిల్లీని ఢీకొడ‌తా, మోదీ మెడ‌లు వంచుతాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికే జ‌గ‌న్‌రెడ్డీ.. నీ క్విడ్‌ప్రోకో దోపిడీ బుద్ధిని ప‌క్క‌న‌ పెట్టు’’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలుగువారి ఉద్య‌మ‌ఫ‌లం, విశాఖ మ‌ణిహారం ఉక్కు క‌ర్మాగారాన్ని కాపాడాల్సిన బాధ్య‌త ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉందన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలన్నారు చంద్రబాబు.    విశాఖ ఉక్కు ఆంధ్రుల శాశ్వ‌త‌ హక్కు. దీనిని ప్రైవేట్ ప‌రం చేయాల‌ని చూస్తే మ‌రో ఉక్కు ఉద్య‌మం త‌ప్ప‌దన్నారు చంద్రబాబు. లక్ష‌లాది మంది ఏళ్ల త‌ర‌బ‌డి ఉద్యమించి, 32 మంది ప్రాణ‌త్యాగంతో, అమ‌రావ‌తివాసి అమృత‌రావు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌తో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ని సాధించుకున్నామని చెప్పారు. అటువంటి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ని జ‌నాన్ని ఏమార్చి, తుక్కు కింద కొనేసి ల‌క్ష‌ల కోట్లు కొట్టేద్దామ‌నుకుంటున్న జ‌గ‌న్‌రెడ్డి గ్యాంగ్‌ కుతంత్రాన్ని ప్ర‌జ‌ల ‌మ‌ద్ద‌తుతో అడ్డుకుని తీరుతామన్నారు చంద్రబాబు  అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌కే విశాఖ‌లో ప‌రిపాల‌నా రాజ‌ధాని అన్న జగన్మోహన్ రెడ్డీ.. నువ్వు ఇప్పటికే ఆ పేరుతో విశాఖ‌లో కొండ‌లు కొట్టేశావు. గుట్ట‌లు మింగేశావు. భూములు ఆక్ర‌మించేశావు. ఇప్పుడు విశాఖ ఉక్కుపై పడ్డావా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్ర‌త్య‌క్షంగా 18 వేల‌మంది శాశ్వ‌త ఉద్యోగులు, 22 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు, ప‌రోక్షంగా ల‌క్ష మందికి ఉపాధి క‌ల్పించే విశాఖ ఉక్కుని ప్రైవేట్ ప‌రం చేస్తుంటే, ఒక ముఖ్య‌మంత్రిగా నీ బాధ్య‌త ఏంటి? అని టీడీపీ అధినేత నిలదీశారు.    ‘‘ నీ 31 కేసుల మాఫీ కోసం 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్‌స‌భ, 6గురు రాజ్య‌స‌భ‌ స‌భ్యుల్ని కేంద్రానికి తాక‌ట్టు పెట్టేశావు. ప్ర‌త్యేక‌హోదాని బాబాయ్ హ‌త్య‌కేసుకి మార్టిగేజ్ చేశావు. ఇప్పుడు విశాఖ ఉక్కుపై స్పందించ వద్దంటూ నీ ఎంపీల నోరు కుట్టేశావు. గతంలో స్వర్గీయ వాజ్‌పాయి ప్రభుత్వంలో ఇదే పరిస్థితి వస్తే, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కును కాపాడింది.. అప్పుడు అధికారంలో ఉన్న‌ తెలుగుదేశం ప్ర‌భుత్వం. ఆ పని ఇప్పుడు మీరెందుకు చేయరు?’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.  

అమ్మేయం.. ప్రైవేటీకరిస్తామంతే ! విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రమంత్రి 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం  ఆంధ్రప్రదేశ్ లో కాక రేపుతోంది. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి సాధించుకున్న కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలన్న కేంద్ర సర్కార్ పై నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. విశాఖలో నిరసనలు ఊపందుకున్నాయి. అయితే తాజాగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అంశంపై స్పందించారు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. నీతి ఆయోగ్ సూచనల మేరకే ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతీ పబ్లిక్ సెక్టార్ కంపెనీని అమ్మకానికి పెట్టబోమని వెల్లడించారు. నష్టాల్లో ఉన్న కంపెనీలను మాత్రమే నీతీ ఆయోగ్ సూచనల మేరకు ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ తెలిపారు.  పోలవరం ప్రాజెక్టుపైనా స్పందించారు అనురాగ్ ఠాకూర్.  ఒప్పందం  ప్రకారం పోలవరం ప్రాజక్టుకు నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఈ మధ్య కాలంలో ఏపీ ఆర్థికమంత్రి పోలవరం నిధులపై మూడు సార్లు కలిశారన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు అన్యాయం జరగలేదన్నారు. బడ్జెట్‌ను జాతీయ దృక్పథంతో చూడాలని అనురాగ్ సింగ్ సూచించారు. 

కుమారుడి పెళ్లి పత్రికలో రైతు నినాదం

రైతుల ఉద్యమానికి మద్దతుగా హర్యానాలో ఓ  రైతు తన  కుమారుడి పెళ్లి  శుభ‌లేఖ‌పై రైతుల ఉద్య‌మ నినాదాలు రాసుకొచ్చాడు. నినాలతో  పాటు చోటురాం, భగత్‌సింగ్ ఫొటోల ముద్రించాడు. రైతులు లేకపోతే ఆహారం లేదని తన కుమారుడి పెళ్లికి అందరు వచ్చి రైతుల ఉద్యమానికి మద్దతు పలకాలని  ఆ శుభలేఖ లో కోరాడు.. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై ఢిల్లీ స‌రిహ‌ద్దుల వ‌ద్ద రైతులు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు తెలుపుతోన్న విష‌యం తెలిసిందే. దేశంలోని ప‌లు ప్రాంతాల నుంచి వారి ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఇదే స‌మ‌యంలో హర్యానాలో ఓ వ్యక్తి తన వంతు బాధ్యతగా రైతులు  చేస్తున్న ఉద్యమానికి వినూత్న ప‌ద్ధ‌తిలో ఇలా ఖైతల్‌- దుంద్రేహీ  గ్రామానికి చెందిన ప్రేమ్‌సింగ్‌ గోయత్ అనే రైతు తన కుమారుడి వివాహ వేడుక‌కు అంద‌రూ రావాల‌ని, రైతుల ఉద్య‌మానికి కూడా మ‌ద్ద‌తు తెలపాల‌ని చెప్పాడు. శుభ‌లేఖ‌పై రైతులు లేకపోతే ఆహారం లేదనే నినాదాన్ని ముద్రించాడు. అలాగే, ట్రాక్టర్‌పై రైతు ఉన్న చిత్రాలతో పాటు స్వాతంత్య్రం రాక‌ముందు రైతుల హక్కుల కోసం పోరాడిన నేత చోటురాం, బ్రిటిష‌ర్ల‌కు చుక్క‌లు చూపించి భారతీయుల్లో పోరాట స్ఫూర్తిని నింపిన భగత్ ‌సింగ్‌ చిత్రాలను త‌న కుమారుడి పెళ్లి ప‌త్రిక‌లపై వేయించాడు.‌ ఇది ఇలా ఉండగా రైతుల చక్కా జామ్ (రాస్తారోకో) నేపథ్యంలో బలగాలు, శనివారం పోలీసులు అప్రమత్తమయ్యారు. జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన హింసను దృష్టిలో పెట్టుకుని.. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులకు తోడుగా 50 వేల మందికిపైగా పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపారు. ఎక్కడికక్కడ పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.మరోవైపు 10 మెట్రో స్టేషన్లను మూసేస్తున్నట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది. మండీ హౌస్, ఐటీవో, ఢిల్లీ గేట్, విశ్వవిద్యాలయ స్టేషన్, లాల్ ఖిల్లా, జామా మసీదు, జన్ పథ్, సెంట్రల్ సెక్రటేరియట్, ఖాన్ మార్కెట్, నెహ్రూ ప్లేస్ స్టేషన్లను మూసేస్తున్నట్టు తెలిపింది

ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా! స్టీల్ ప్లాంట్ కోసం  త్యాగం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృమవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా వామపక్షాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇతర రాజకీయ పార్టీలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. విశాఖపట్నం  ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు  తన పదవికి రాజీనామా చేశారు.  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి ఆయన  రాజీనామా చేస్తూ స్పీకర్ కు లేఖ పంపారు  గంటా  శ్రీనివాస రావు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం  నిర్ణయం తీసుకున్న  వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని లేఖలో విన్నవించారు.ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కు కర్మాగారం కోసం పోరాటం చేయబోతున్నట్లు గంటా శ్రీనివాస రావు ప్రకటించారు. రాజకీయేతర జేఏసీ ఏర్పాటు చేస్తానని తెలిపారు.

మేకులు కొట్టిన చోటే మొక్కలు నాటిన రైతులు.. మోడీ సర్కార్ కు మరో పంచ్ 

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులలో రైతులు చేస్తున్న పోరాటం ఇటు దేశంలోనే కాకుండా అటు ప్రపంచం దృష్టిని కూడా ఆకర్షించిన సంగతి తెల్సిందే. మరోపక్క ఇప్పటివరకు తిరుగులేని రీతిలో దూసుకెళుతున్న మోడీ సర్కారు మొట్టమొదటిసారి ఈ వ్యవహారంలో మాత్రం విఫలమైందని చెప్పాలి. ఇది ఇలా ఉండగా మొన్న రిపబ్లిక్ డే రోజున రైతు ర్యాలీ మాటున హింసాకాండ జరగడంతో కేంద్రం అప్రమత్తమై రహదారులను దిగ్బంధం చేయడం కోసం ఏకంగా ఢిల్లీ - యూపీ సరిహద్దుల్లోని గాజీపుర్ వద్ద కేంద్ర బలగాలు.. పోలీసులు పెద్ద ఎత్తున రోడ్లకు మేకుల్ని దిగ్గొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆరోజు ర్యాలీ లో జరిగిన హింసతో రైతులకు ఎటువంటి సంబంధం లేదని ఇదంతా కొన్ని అరాచక శక్తుల కుట్ర అని రైతు ఉద్యమ నాయకులు స్పష్టం చేసారు. జాతీయ రహదారిపై పోలీసులు ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద మేకుల పక్కనే.. రైతులు తాజాగా మొక్కల్ని నాటి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేకాకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల పక్కనే పూల మొక్కల్ని నాటేందుకు రైతులు సిద్ధమయ్యారు. మరోపక్క రోడ్డు పక్కన పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధులు తెలియచేస్తున్నారు. దీని కోసం సమీపంలోని నర్సరీల నుంచి పూలమొక్కల్ని తెస్తున్న రైతులు.. వాటిని నాటుతున్నారు. ఉద్యమం చేస్తున్న రైతులు కొత్త కొత్త ఆలోచనలతో మోడీ సర్కార్ కు తమదైన పద్దతిలో జవాబివ్వడాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి.

ఎస్ఈసీ ఆదేశాలు పట్టించుకోను! నిమ్మగడ్డ పిచ్చొడన్న పెద్దిరెడ్డి

 ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల 21 వరకు ఇంటికే పరిమితం చేస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమర్ ఇచ్చిన ఆదేశాలు సంచలనంగా మారాయి. ఎస్ఈసీ నిర్ణయంపై స్పందించిన పెద్ది రెడ్డి.. మరోసారి నిమ్మగడ్డను టార్గెట్ చేశారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశాల్ని ఖాతరు చేయాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. మంత్రిని ఇంట్లో పెట్టాలనే ఆలోచన దుర్మార్గమన్నారు పెద్దిరెడ్డి. ఆయన పిచ్చివాడని.. పట్టించుకోవాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. నిమ్మగడ్డ ఎస్ఈసీగా పనిచేయడం లేదని.. చంద్రబాబు బంట్రోతులా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. ''చంద్రబాబు లాగే నిమ్మగడ్డకు పిచ్చి ముదిరింది. నిమ్మగడ్డ ఎస్ఈసీలా కాకుండా చంద్రబాబు బంట్రోతులా పనిచేస్తున్నారు. ఆయన తెలిసీ తెలియని మూర్ఖుడు. నిమ్మగడ్డకు సిగ్గులేదు. ఇంగితజ్ఞానం లేదు. అలాంటి వ్యక్తులు జారీచేసిన ఆదేశాలను అమలు చేయలేం. మంత్రిని ఇంట్లో బంధించాలన్న ఆలోచన దుర్మార్గం. నాకు సంబంధించిన శాఖలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈయన ఎవరూ నాకు ఆదేశాలివ్వడానికి? నిమ్మగడ్డ ఇంకా నా వెంట ఉండాలి. కానీ చంద్రబాబు వెంట ఉండి ఆయన చెప్పినట్లు చేస్తున్నారు. నిమ్మగడ్డ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. నిమ్మడ్డ రమేష్ కుమార్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు. నేను ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా జరిగేది జరుగుతుంది. నేను ఇంట్లో ఉంటా. బయటా ఉంటా. ఆయన ఆదేశాలను మేం పట్టించుకోం.'' అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.  ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశాలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఎస్‌ఈసీ నుంచి తనకు ఇంకా ఆదేశాలు రాలేదని తెలిపారు. ఎస్‌ఈసీ ఆర్డర్స్‌ను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తాను రాజకీయాలు మాట్లాడను, వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోనని డీజీపీ తెలిపారు.

మంత్రి పెద్దిరెడ్డి ఇంటికే పరిమితం! ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో సంచలనం 

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు . ఇప్పటివరకు అధికారులపైనే చర్యలకు సిఫారస్ చేసిన నిమ్మగడ్డ.. ఈసారి ఏకంగా మంత్రినే టార్గెట్ చేశారు. ఎన్నికలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికే పరిమిత చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 21 వరకు మంత్రి పెద్ది రెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని డీజీపీని ఆదేశించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. మీడియాతో మాట్లాడేందుకు కూడా పెద్ది రెడ్డి అవకాశం ఇవ్వొద్దన్నారు. పంచాయతీ ఎన్నికలు నిజాయితీగా, నిష్పక్షపాతంగా జరగడానికే  ఈ చర్యలు తీసుకున్నామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు .ప్రజలు నిర్భయంగా వచ్చి ఓటేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు . మంత్రి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని, వైద్య సదుపాయాల కోసం కూడా వెళ్లవచ్చని ఉత్తర్వుల్లో ఎస్‌ఈసీ పేర్కొంది. కిషన్‌సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఈ చర్యలు తీసుకున్నామని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఏకగ్రీవాలపై పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అన్నారు. పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లను ఉత్తర్వులకు ఎన్నికల కమిషన్ జతచేసింది. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ఏకగ్రీవాలను ప్రోత్సహించడం కోసమేనని అర్థమవుతోందని పేర్కొన్నారు. బలవంతపు ఏకగ్రీవాలను ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని ఎస్‌ఈసీ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల్లో స్వయం పాలన సాగాలని 73 రాజ్యాంగ సవరణలో ఉందని, ఇటువంటి వ్యాఖ్యలను గతంలో కోర్టులు కూడా తప్పుపట్టాయని ఎస్‌ఈసీ రమేష్‌కుమార్ గుర్తుచేశారు.  స్థానిక ఎన్నికలకు సంబంధించి జిల్లా అధికారులపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారులు ఏకగ్రీవాలకు వెంటనే డిక్లరేషన్ లు ఇవ్వాలని స్పష్టం చేశారు. చిత్తూరు,గుంటూరు జిల్లాల అధికారులు ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించాలన్నారు. జిల్లా అధికారులను ఎస్ఈసీ భయపెడుతున్నారని పెద్ది రెడ్డి ఆరోపించారు. జిల్లా అధికారులు ఎస్ఈసీ మాటలు విని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. తాము అధికారంలో ఉన్నంతకాలం అలాంటి అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామని చెప్పారు మంత్రి పెద్ది రెడ్డి.  ఉద్యోగస్తులను ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై  గవర్నర్ సెక్రటరీకి టీడీపీ బృందం ఫిర్యాదు చేసింది. మంత్రి పెద్దిరెడ్డిని వెంటనే కాబినెట్ నుంచి తొలగించాలని ఫిర్యాదులో టీడీపీ నేతలు పేర్కొన్నారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన వారిలో బోండా ఉమ, వర్ల రామయ్య, బుద్దా వెంకన్న, అశోక్ బాబు, మరెడ్డి శ్రీనివాసరెడ్డి, గద్దె రామ్మోహన్ తదితరులున్నారు. టీడీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు రాజ్ భవన్‌ వెళ్లారు. అయితే గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ సెక్రటరీని టీడీపీ నేతలు కలిశారు.  

సీక్రెట్ సర్వేలో బీజేపీకి షాకింగ్ రిపోర్ట్.. స్వయంగా రంగంలోకి అమిత్ షా

ఏపీలో ఈసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించి అధికారం చేపట్టేందుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసిన ఆ పార్టీకి నోటా కంటే కూడా తక్కువగా కేవలం ౦.84శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆ పార్టీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేనతో జట్టు కట్టి బలం పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎపి అభివృద్ధి చెందాలంటే మా కూటమిని గెలిపించాలంటూ జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. రాజధాని లేని ఏపీకి గొప్ప రాజధాని నిర్మించాలన్నా.., పోలవరం త్వరగా పూర్తి కావాలన్నా.. మావాళ్లే సాధ్యం అవుతుందని అటు సోషల్ మీడియాలోనూ ఇటు ప్రెస్ మీట్లలోనూ నాయకులు టెవ్వరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం "ఏపీ ఇలా ఉండడానికి మీ పార్టీ , మీ నేతల నిర్వాకమే కారణం.. అసలు ఏపీని కనీసం ఎదగకుండా నాశనం చేస్తున్నది కూడా మీరే" అంటూ బీజేపీని ఎక్కి పడేస్తున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ దన్నుతో అధికారం చేపట్టాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నం లో జనసేనను పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంతో జనసేన కేడర్ తీవ్ర అసంతృప్తికి గురౌతున్న సంగతి తెల్సిందే. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కూడా ఎక్కువ కాలం నిలిచేలా లేదని రాజకీయ విశ్లేషకుల అంచనా. మరోపక్క బీజేపీకి బాగా కలిసి వచ్చిన హిందుత్వ ఎజెండాతో జనంలోకి చొచ్చుకుపోవాలని చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఏపీలో దేవాలయాల పై జరుగుతన్న దాడులు, దేవత విగ్రహాల ధ్వంసం పై ఎక్కడికక్కడ ఉద్యమం చేస్తున్నా అనుకున్న ఫలితాలు కనిపించడం లేదు అయినా కానీ బీజేపీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. దీంతో ఏపీలో బీజేపీ తాజా పరిస్థితిపై పార్టీ కేంద్ర అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇక్కడ క్షేత్రస్థాయిలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని కోసం 2020 మధ్య లో ఓసారి, అలాగే గడచినా నెల జనవరిలో మరో సారి ఏపీలో బీజేపీ తీరుపై ఒక సీక్రెట్ సర్వే చేయించినట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా వచ్చిన రిపోర్ట్ ను అంతకు ముందు వచ్చిన రిపోర్ట్ తో పోల్చి చూసి పార్టీ అధిష్టానం కంగు తిన్నదట. గడచిన ఆరు నెలల్లో ఏపీలో బీజేపీ పరిస్థితి మరింత దిగజారిందని తెలిసిందట. 2020 మధ్యలో చేసిన సర్వేలో నాలుగు జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో బీజేపీ పరిస్థితి కొంత మెరుగు పడిందని..అయితే గత నెల లో చేసిన సర్వేలో మళ్ళీ రాష్ట్ర బీజేపీ పరిస్థితి ఏమాత్రం బాలేదని వెల్లడయినట్లు సమాచారం. దీంతో ఏపీ బీజేపీ పెద్దలు, అలాగే పరిశీలకులకు కేంద్ర పెద్దలు తలంటినట్లుగా తెలుస్తోంది. ఇది ఇలాఉండగా త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో.. బీజేపీకి కొరకరాని కొయ్యగా ఉన్న మమతా బెనర్జీని ఓడించి అక్కడ అధికార పీఠం చేపట్టాలని బీజేపీ తీవ్రంగా పోరాడుతోంది. దీనికోసం స్వయంగా అమిత్ షా ఒక డేడికేటెడ్ టీమ్ తో వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడి ఎన్నికలు పూర్తయిన తరువాత అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి ఏపీ రాజకీయ వ్యవహారాలపై దృష్టి పెడతారని.. దీని కోసం అయన ఏపీలో పలు పర్యటనలు కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే దేశంలోని అత్యధిక రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నోటా కంటే తక్కువ ఓట్ల శాతం సాధించిన ఏపీలో ఏ విధంగా బలపడుతుందో వేచి చూడాలి.

 అంగట్లో ఆంధ్రుల హక్కు! ఉద్యమాల ఉక్కుకు దిక్కెవరు?

విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు.. ఇది 1963లో ఏపీలో మార్మోగిన నినాదం. ఆంధ్రా జనాలు ఏకమై వినిపించిన గళం. ఉవ్వెత్తున సాగిన ఉద్యమంలో 32 మంది ప్రాణ త్యాగం చేశారు. అంధ్రా ప్రజల ఉక్కు సంకల్పానికి దిగొచ్చింది అప్పటి కేంద్ర సర్కార్. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ను ప్రారంభించింది. అది ఇంతింతై వటుండింతై అన్నట్లుగా ఎదిగి..  రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమగా, నవరత్న కర్మాగారంగా నిలిచింది.  విశాఖ పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తొచ్చేది స్టీల్ ప్లాంటే. అంతగా విశాఖతో పెనవేసుకుపోయింది ఉక్కు కర్మాగారం. ఇప్పుడు 18 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 20 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నారు.  ఆ రోజుల్లో  దేశంలో అప్పటికే 4 ఉక్కు కర్మాగారాలున్నాయి. 1963లో తీర ప్రాంతంలో మరో పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది. నిపుణులు అధ్యయనం చేసి విశాఖపట్నం మేలని తేల్చారు. ఆ తర్వాతే రాజకీయం మొదలైంది. ఉక్కు కర్మాగారాన్ని తమ ప్రాంతాలకు తరలించుకు వెళ్లేందుకు కొన్ని రాష్ట్రాలు ప్రయత్నించాయి. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన అవకాశం ఆఖరు నిమిషంలో చేజారే దుస్థితి తలెత్తింది. దీనిపై తొలుత చిన్నపాటి ఆందోళనలే జరిగాయి.  గుంటూరుకు చెందిన తమనంపల్లి అమృతరావు అనే వ్యక్తి గుంటూరు నుంచి వచ్చి విశాఖ కలెక్టర్‌ కార్యాలయం ముందు నిరాహారదీక్షకు దిగారు. ఈ పరిణామంతో ఉద్యమంలో కదలిక వచ్చింది.  విశాఖపట్నంలో పోరాటం ఊపందుకుంది. 1966లో తెన్నేటి విశ్వనాథం అధ్యక్షతన  అఖిలపక్ష సంఘం ఏర్పడింది. ఓ వైపు అమృతరావు నిరాహార దీక్ష... మరోవైపు అఖిలపక్షం ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు కొనసాగాయి.   ఉక్కు ఉద్యమం తిరుపతి, విజయవాడ సహా ఇతర ప్రాంతాలకూ విస్తరించింది. వేలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ కోసం యువకులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు ప్రారంభించారు. కొన్నిచోట్ల పోలీసుస్టేషన్లను, ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేయడం, రైల్‌రోకోలు, రాస్తారోకోలకు దిగడం తదితర కార్యక్రమాలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హింసాత్మక ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. విశాఖ ఉక్కు కోసం జరిగిన ఆందోళనల్లో మొత్తం 32 మంది మృత్యువాత పడినట్లు అధికారికంగా తేల్చారు.అప్పటి రాష్ట్రప్రభుత్వం ఉద్యమాన్ని ఎంతగా కట్టడి చేయాలని ప్రయత్నించినా ఫలించలేదు.  ప్రజల పోరాటానికి ప్రజాప్రతినిధులు బాసటగా నిలిచారు. కొందరు తమ శాసనసభ సభ్యత్వాలకు, పార్లమెంటు సభ్యతాలకు రాజీనామా లేఖలు ఇచ్చేశారు. మరోపక్క నిరాహారదీక్షలో కూర్చున్న అమృతరావు ఆరోగ్యం క్షీణించింది. ఆయన మరణించే ప్రమాదం ఉందని జిల్లా అధికారులు తేల్చారు. నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి.. ప్రధాని ఇందిరాగాంధీకి అదే విషయాన్ని చెప్పారు. చివరకు ఆమె విశాఖలోనే ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తూ అధికారిక లేఖను అందించారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఆ లేఖను తీసుకుని 1966 నవంబరు 3న విశాఖ వచ్చారు. ఆ లేఖను అందరికీ చూపి అమృతరావుతో దీక్ష విరమింపజేశారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనుమతించినప్పటికీ ఆర్థిక కారణాలు చూపి పనులు మొదలు పెట్టకపోవడంతో మళ్లీ అలజడి రేగింది. దీంతో ప్రధాని ఇందిరాగాంధీ 1971 జనవరి 20న విశాఖ వచ్చి పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఫ్యాక్టరీ కోసం 64 గ్రామాల పరిధిలో 22 వేల ఎకరాల భూమి సేకరించారు. కర్మాగారం నిర్మాణానికి 20 ఏండ్లు పట్టింది. 1992లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు చేతుల మీదుగా విశాఖ స్టీల్ ప్లాంట్ జాతికి అంకితమైంది.    ఆంధ్రుల పోరాటంతో  ఏర్పాటయిన విశాఖ ఉక్కులో నూటికి నూరుశాతం కేంద్రం పెట్టుబడులు ఉన్నాయి. ఏటా 6.3 మిలియన్‌ టన్నుల ఉత్పాదక సామర్థ్యం ఈ పరిశ్రమ సొంతం. ఉత్పత్తి సామర్థ్యం 63 లక్షల టన్నులు. అయితే 2017 నుంచి విశాఖ ఉక్కు భారీ నష్టాలతో నడుస్తోంది.  ఇదే సాకుగా చూపి ప్రైవేట్ పరం చేస్తోంది కేంద్ర సర్కార్. విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవు. ముడి ఇనుమును మార్కెట్‌ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దాంతో ఉత్పత్తి వ్యయం అధికంగా ఉంటోంది. ముడి ఇనుము, కోకింగ్‌ కోల్‌, డోలమైట్‌ వంటి ముడి సరకుల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరిగింది.  దీంతో ఉత్పత్తి తగ్గించుకోవలసి వచ్చింది. ఇదే నష్టాలకు అసలు కారణమని గతంలోనే నిపుణులు నివేదికలు ఇచ్చారు. ఇవేమి పట్టించుకోకుండా ప్రైవేట్ కు ఇచ్చేందుకు సిద్దమైంది కేంద్రం. కార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తున్నా కరికరం చూపకుండా తాము అనుకున్నది చేసేస్తోంది. కేంద్ర సర్కార్ నిర్ణయంతో  పోరాడి సాధించుకున్న  విశాఖ ఉక్కు ఇక అంధ్రుడికి గతమే అయ్యేలా ఉంది.  ఆంధ్రుల హక్కును కేంద్ర సర్కార్ హరిస్తున్నా..  జగన్ రెడ్డి సర్కార్ మొద్దు నిద్ర పోతోంది. దీంతో ఉద్యమాల ఉక్కుకు దిక్కెవరని ఏపీ జనాలు ఆవేదం చెందుతున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం మౌనంగా ఉండటంపై  మండిపోతున్నారు. కర్మాగారం భూముల విలువ రూ.లక్ష కోట్లకు పైనే. అంతటి విలువైన భూమిని ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లనివ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తున్నా వైసీపీ ప్ర‌భుత్వం క‌నీసం ప్ర‌శ్నించ‌లేక‌పోతోంద‌ని టీడీపీ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోరాడి ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తోంది.    గత డిసెంబరులో స్టీల్‌ రేట్లు పెరగడంతో మంచి అమ్మకాలు జరిగాయి. ఒక్క డిసెంబరులోనే రూ.2,200 కోట్లు విక్రయాలు చేసి, రూ.200 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇదే ధరలు కొనసాగితే రెండేళ్లలో లాభాల బాటలోకి వస్తుందని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడానికి అనేక మార్గాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం స్టీల్‌కు డిమాండ్‌ పెరిగింది. టన్ను టోకున రూ.50 వేలు చొప్పున విక్రయిస్తున్నారు. గత డిసెంబరులో రూ.200 కోట్ల నికర లాభం వచ్చింది. సమీప భవిష్యత్తులోను ఇదే ఒరవడి కొనసాగుతుందని, అమ్మకాలు బాగుంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఒక్క రెండేళ్లు మార్కెట్‌ బాగుంటే నష్టాలను రికవరీ చేసి మళ్లీ లాభాల బాటలోకి వస్తామని, ప్రైవేటీకరణ చేయవద్దని, వాటాలు విక్రయించవద్దని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.   విశాఖ కర్మాగారానికి గనులు కేటాయిస్తే సంస్థకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  వేలాది మంది సామాన్య, మధ్యతరగతి వారికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్న భారీ ప్రభుత్వరంగ సంస్థల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.   

ఎన్నికలు బహిష్కరిస్తాం.. ? విశాఖ జిల్లా సీలేరు ఓటర్లు..

ఏపీలో ఓటర్లుకు ఎన్నికలు అంటే బోరుకొట్టిందా.. ఎన్నికలు అంటే ప్రజలు నిజంగానే భయపడుతున్నారా ..ఎన్నికలు అంటే నోట్లు, ఓట్లు మాత్రమే అనుకున్నారా.. అంటే కాదనే అంటున్నారు విశాఖ ప్రజలు. అందుకు ప్రజల అసౌకర్యాలే కారణం అంటున్నారు సీలేరు ప్రాంత ఓటర్లు. పోలింగు కేంద్రాలు తమ ప్రాంతానికి ఎక్కడో దూరంగా ఏర్పాటు చేస్తున్నారని, తమ ప్రాంతానికి దగ్గర్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు  చేస్తేనే ఓట్లు వేస్తామనే నిర్ణయానికి వచ్చారు సీలేరు ప్రాంత ప్రజలు. ఓటు వేయాలంటే దాదాపు 22 కిలోమీటర్లు నడవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు .. 21 వ శతాబ్దం లో కూడా ప్రజలు ఇలాంటి పరిస్థితులు ఎదురుకోవడం బాధకలిగించే విషయమని, ఎన్నికలంటే పాలకులు ఓట్లు మాత్రమే అనుకుంటున్నారని ప్రజల పాట్లు పట్టడం లేదని సీలేరు ఓటర్లు చెపుతున్నారు. తమ పంచాయతీ పరిధిలోని పరమశింగవరం, కొండజర్త గ్రామాల వారు పది కిలోమీటర్ల మేర కొండలు, గుట్టలు దాటుకుంటూ పంచాయతీ అ కేంద్రానికి రావాల్సి ఉంటుందని, మళ్లీ ఇక్కడ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో వున్న ధారకొండ వెళ్లి ఓటు వేయాలంటే కష్టసాధ్యమని ప్రజలు, ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు కళ్ళు తెరిచి తమ ప్రాంతం లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలనీ కోరారు..

ముగ్గురు పిల్లల తల్లైనా వైసిపి ఐతే ఓకే... అధికారుల నిర్వాకం

ఏపీలో ప్రస్తుతం జరుగుతున్నా ఎన్నికలలో ప్రభుత్వ అధికారులు రూల్స్ కు కొత్త కొత్త అర్ధాలు తీస్తూ అధికార వైసిపికి సేవ చేసుకుంటున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం స్కిన్నెరపురంలో నామినేషన్ల సందర్భంగా.. అధికారులు ముగ్గురు పిల్లల నిబంధనకు కొత్త అర్ధం చెప్పారు. ఇక్కడ వైసీపీ మద్దతుతో అడ్డాల భాను లలిత మహాలక్ష్మి, టీడీపీ మద్దతుతో కునుపూడి నాగదుర్గ అనే మహిళలు నామినేషన్లు వేశారు. అయితే అధికారులు మహాలక్ష్మి నామినేషన్‌ ను ఆమోదించి, మరోపక్క నాగదుర్గ నామినేషన్‌ మాత్రం తిరస్కరించారు. దీని గురించి ఇక్కడి అధికారులను ప్రశ్నిస్తే మహాలక్ష్మికి మొదటిగా ఇద్దరు కవలలు, తరువాత ఒకరు జన్మించడంతో ఆమె నామినేషన్ ను అనుమతించామని, నాగదుర్గకు ముందు ఒకరు.. తర్వాత ఇద్దరు కవల పిల్లలు జన్మించడంతో ఆమె నామినేషన్ ను తిరస్కరించామని చెప్పారు. అధికారులు చెపుతున్న ఈ వింత భాష్యానికి ఆశ్చర్యపోయిన నాగదుర్గ తాజాగా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరారు.

విశాఖపై మాట్లాడొద్దని ఎంపీలకు జగన్ ఆదేశం! ఢిల్లీలో బయటపడిన వైసీపీ చీకటి బాగోతం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీకటి బాగోతం బట్టబయలైంది. ఆంధ్రప్రదేశ్ పై జగన్ రెడ్డి సర్కార్ కు ఎంత చిత్తశుద్ది ఉందో ఆయన సొంత మీడియా సాక్షి టివిలోనే బహిర్గతమైంది. కేంద్రంపై మాట్లాడకుంటా సైలెంట్ గా ఉండాలని తాడేపల్లి  నుంచి అందిన ఆదేశాలు వచ్చాయని చెబుతూ.. ఆ పార్టీ ఎంపీలు అడ్డంగా దొరికి పోయారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు మీడియా సమావేశం నిర్వహించారు. బాలశౌరితో పలువురు ఎంపీలు అప్పటికే కూర్చుని ఉండగా.. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబాబు లేటుగా వచ్చారు. ఆయన వస్తూనే విశాఖ ఉక్కు గురించి నేను మాట్లాడాలా అని బాలశౌరిని అడిగారు.  అయితే పిల్లి అలా అంటుంగానే  వద్దు వద్దు.. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడొద్దని సీఎం చెప్పాడని బాలశౌరి చెప్పడం సాక్షి లైవ్ లో స్పష్టంగా వినిపించింది. అంతేకాదు పార్టీ స్టాండ్ తీసుకున్న తర్వాతే  విశాఖపై మాట్లాడాలని చెప్పాడన్నారు బాలశౌరి. సీఎం స్టాండ్ తీసుకున్నాక చెబుతారని.. అప్పటిదాకా ఏం మాట్లాడొద్దని చెప్పారు. అయితే మరీ నేనేం మట్లాడాలని సుభాష్ చంద్రబోస్ అడగగా.. విశాఖ కాకుండా వేరే విషయాలు మాట్లాడండి.. చంద్రబాబును తిట్టండని పిల్లికి బాలశౌరి చెప్పడం స్పష్టంగా వినిపించింది..  విశాఖ ఉక్కు...ఆంధ్రుల హక్కు’ అంటూ పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తోంది కేంద్ర సర్కార్. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం అమ్మేస్తున్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్నజగన్ రెడ్డి సర్కార్ మాత్రం స్పందించడం లేదు. తమకేమి సంబంధం లేదన్నట్టుగా మొద్దు నిద్ర పోతోంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి  వైసీపీ ప్ర‌భుత్వం క‌నీసం ప్ర‌శ్నించ‌లేక‌పోతోంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం మౌనంగా ఉండటంపై ఆంధ్రా జనం మండిపోతున్నారు. తాజాగా ఢిల్లీలో పార్టీ ఎంపీల గుసగుసలు బయటికి రావడం, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడొద్దని సీఎం చెప్పినట్లు... లీక్ కావడంతో జనాలు మరింతగా రగిలిపోతున్నారు.  సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర హక్కులను తాకట్టు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.   టీడీపీ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కుని తన స్వార్ధ ప్రయోజనాల కోసం సీఎం జగన్ తాకట్టు పెడుతున్నారంటూ నారా లోకేష్ ట్విటర్ వేదికగా  తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఇలా ఒక్కో ప‌రిశ్ర‌మా అమ్మేయ‌డం, అడ‌వులు-కొండ‌ల్ని క‌బ్జా చేయ‌డ‌మేనా ప‌రిపాల‌నా రాజ‌ధాని అంటే జ‌గ‌న్‌రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు లోకేష్. కాకినాడ పోర్టు విజయసాయి రెడ్డి అల్లుడికి వ‌ర‌క‌ట్నంగా రాసిచ్చేశారని విమర్శించారు. విశాఖ ఏజెన్సీలో లేట‌రైట్ గ‌నులు బాబాయ్ సుబ్బారెడ్డికి బ‌హూక‌రించారని, త‌న దోపిడీ మ‌త్తుకి మంచింగ్‌గా మ‌చిలీప‌ట్నం పోర్టుని నంజుకు తింటున్నారన్నారని ఆయన ఆరోపించారు.‌ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్‌ని తన సూట్ కేసు కంపెనీలతో తుక్కు రేటుకి కొని దోపిడీ వికేంద్రీక‌ర‌ణ ప‌రిపూర్ణం చేసుకోబోతున్నారని ఆరోపించారు. ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కుని కాపాడుకుంటామని నారా లోకేష్ ట్వీట్ చేశారు.   

బిసికి సీఎం పీఠం పై ఒక్క రోజులోనే సోము వీర్రాజు యూ టర్న్

ఏపీలో బీసీలను సీఎం చేసే దమ్ము, ధైర్యం కేవలం బిజెపి కి మాత్రమే ఉందని.. చంద్రబాబు కానీ జగన్ కానీ తమ పార్టీ తరపున బీసీ ని ముఖ్యమంత్రి చేయగలరా అని నిన్న వీరావేశంగా సవాల్ విసిరిన ఎపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక్క రోజులోనే యూ టర్న్ తీసుకున్నారు. నిన్న సోము వీర్రాజు పాత్రికేయులతో మాట్లాడుతూ.. చంద్రబాబు, జగన్ లు బీసీలను కేవలం తమ రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. అయితే వారిద్దరూ బీసీలకు చేసింది మాత్రం ఏంలేదని పేర్కొంటూ.. అటు చంద్రబాబు కానీ ఇటు జగన్ కానీ ఒక బీసీ ని సీఎం చేయగలరా అంటూ సవాల్ విసిరారు. కేవలం బీజేపీ మాత్రమే బీసీ ని సీఎం చేయగల దమ్ము కలిగిన పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే వీర్రాజు వ్యాఖ్యలతో మీరు పక్షాలైన బిజెపి, జనసేన మధ్య చిచ్చు రేపినట్లుగా వార్తలు వచ్చాయి.   సోము వీర్రాజు తాజాగా ఇవాళ మీడియాతో మాట్లాడుతూ సీఎం అభ్యర్థిని నిర్ణయించే స్థాయి తనది కాదని, తమది జాతీయ పార్టీ కనుక తమ కూటమి తరపున సీఎం అభ్యర్థి ఎవరు అన్నది బీజేపీ జాతీయ అధినేత జేపీ నడ్డా మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి చర్చించి నిర్ణయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. తాను నిన్న చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు, సీఎం జగన్ లు బీసీలను తమ స్వార్ధ రాజకీయాలకు ఓటు బ్యాంకుగా ఎలా వాడుతున్నాయో చెప్పటానికి మాత్రమేనని ఆయన వివరణ ఇచ్చుకున్నారు.

ఎస్ఈసి నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికినట్టుంది... రోజా సంచలనం

ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారంలో ఎస్ఈసి నిమ్మగడ్డ పై గత కొంత కాలంగా వైసిపి నాయకులు అభ్యంతరకరమైన కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో ఎమ్మెల్యే రోజా కూడా చేరారు. ఎస్ఈసి నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయినట్టుందంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తనకు కావాల్సిన అధికారులను నియమించుకున్న తరువాత కూడా ఏకగ్రీవ ఎన్నికలను ఆపటంతో ఆయనపై ఆయనకు నమ్మకం లేదనిపిస్తోందని చెప్పారు. అంతేకాకుండా ప్రజల తీర్పును గౌరవించకపోతే బాగుండదని రోజా వ్యాఖ్యానించారు. ఎస్ఈసి ఆదేశాలతో గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను బదిలీ చేసిన గతి తెలిసిందే. అయితే ఆ రెడీనందు జిల్లాలలోను మొదటి విడతలో జరిగిన ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించొద్దని, ఫిర్యాదులు పరిష్కరించిన తర్వాతే ఫలితాలు ప్రకటించాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు. ఈ ఫిర్యాదులపై పూర్తి నివేదిక పంపాలని కలెక్టర్లను ఎన్నికల కమిషన్‌ కోరింది. లోపాలు ఉన్నట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కూడా నిమ్మగడ్డ హెచ్చరించారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు జరిగినట్లు గుర్తించామన్నారు. 

ఎస్ఈసి యాప్ కి బ్రేక్.. ఈ నెల తొమ్మిది వరకు ఆపాలన్న హైకోర్టు ? 

  *ఏపీ పంచాయితీ ఎన్నికల సందర్బంగా ఎన్నికల పిర్యాదుల సేకరణకు కోసం ఎన్నికల కమిషన్ రూపొందించిన  ఈ - వాచ్ యాప్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ-వాచ్‌ యాప్‌ను 9వ తేదీ వరకు ఆపరేట్‌ చేయొద్దని న్యాయస్థానం ఎన్నికల కమిషన్ కి ఆదేశించింది. ఈ-వాచ్‌ యాప్‌కు సెక్యూరిటీ డేటా సర్టిఫికెట్‌ కోసం గురువారమే దరఖాస్తు చేశారని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ పేర్కొంది. అనుమతి ఇచ్చేందుకు 5 రోజులు పడుతుందని ఏపీటీఎస్‌ చెప్పింది. ఈలోపు యాప్‌ను పరిశీలించాలని ఏపీటీఎస్‌కు ధర్మాసనం సూచించింది.ఈ నెల 9కి విచారణ వాయిదా పడింది. సెక్యూరిటీ పరిశీలన లేకుండా యాప్‌ను ఉపయోగించడానికి వీల్లేదని పిటిషనర్లు కోరారు. ప్రభుత్వ యాప్‌ ఉండగా ఈ యాప్‌ను ఎందుకు కొత్తగా క్రియేట్  చేశారని పిటిషనర్లు ప్రశ్నించగా.. ఎస్‌ఈసీకి ఒక యాప్‌ను రూపొందించుకునే అనుమతి భారత ఎన్నికల సంఘం ఇచ్చిందని ఎన్నికల కమిషనర్‌ న్యాయవాది స్పష్టం చేశారు. గతంలో ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల కమిషన్‌ కూడా ఇలా తయారు చేసిందని న్యాయవాది వెల్లడించారు.   

విశాఖ ఉక్కు పోతుంటే మౌనమేంటీ జగన్ రెడ్డి! 

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ను కాపాడాలంటూ కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ఘాటుగా స్పందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కుని తన స్వార్ధ ప్రయోజనాల కోసం సీఎం జగన్ తాకట్టు పెడుతున్నారంటూ ఆయన  ట్విటర్ వేదికగా  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 28 మంది వైసీపీ ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం లాభమని ప్రశ్నించారు. 32 మంది ప్రాణాలు త్యాగంచేసి సాధించుకున్న స్టీల్‌ప్లాంట్.. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు నారా లోకేష్.  విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా వేలాది మంది ప్ర‌త్య‌క్షంగా, ల‌క్ష‌లాదిమంది ప‌రోక్షంగానూ ఉపాధి పొందుతున్నారని చెప్పారు లోకేష్.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికే మ‌ణిహారంగా వెలుగొందుతోన్న విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని అమ్మేస్తుంటే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి మౌనం దాల్చ‌డం దేనికి సంకేతమన్నారు. ఇలా ఒక్కో ప‌రిశ్ర‌మా అమ్మేయ‌డం, అడ‌వులు-కొండ‌ల్ని క‌బ్జా చేయ‌డ‌మేనా ప‌రిపాల‌నా రాజ‌ధాని అంటే జ‌గ‌న్‌రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు లోకేష్. కాకినాడ పోర్టు విజయసాయి రెడ్డి అల్లుడికి వ‌ర‌క‌ట్నంగా రాసిచ్చేశారని విమర్శించారు. విశాఖ ఏజెన్సీలో లేట‌రైట్ గ‌నులు బాబాయ్ సుబ్బారెడ్డికి బ‌హూక‌రించారని, త‌న దోపిడీ మ‌త్తుకి మంచింగ్‌గా మ‌చిలీప‌ట్నం పోర్టుని నంజుకు తింటున్నారన్నారని ఆయన ఆరోపించారు.‌ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్‌ని తన సూట్ కేసు కంపెనీలతో తుక్కు రేటుకి కొని దోపిడీ వికేంద్రీక‌ర‌ణ ప‌రిపూర్ణం చేసుకోబోతున్నారని ఆరోపించారు. ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కుని కాపాడుకుంటామని నారా లోకేష్ ట్వీట్ చేశారు.