లాక్ డౌన్ పెట్టేద్దాం! కేంద్రానికి ఆరోగ్య శాఖ రిపోర్ట్

దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజు రోజుకు కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయి. దేశంలోని 150 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 15 శాతానికి పైగా ఉండటం ఆందోళన కల్గిస్తోంది. దేశంలో కరోనా తీవ్రతపై కేంద్రానికి ఆరోగ్య శాఖ తాజాగా నివేదిక ఇచ్చిందని తెలుస్తోంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను అందులో సూచించారని తెలుస్తోంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 150 జిల్లాల్లో లాక్ డౌన్ పెట్టాలని ఆరోగ్య శాఖ వెల్లడించిందని సమాచారం. లాక్ డౌన్ పెడితేనే పరిస్థితులు నియంత్రణలోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ సిఫార్సు చేసిందని అంటున్నారు. లాక్ డౌన్ తో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉన్నప్పటికీ, కరోనా బాధితులకు అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో లాక్ డౌన్ విధించడం మాత్రమే మార్గమని హెల్త్ మినిస్ట్రీ ఉన్నతాధికారులు సూచించారు. అయితే లాక్ డౌన్ ను మరోమారు విధించే విషయంలో రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. ఇండియాలో ఏప్రిల్ 5న కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా రోజువారీ కేసుల సంఖ్య లక్షను దాటగా, ఆపై 10 రోజుల వ్యవధిలో ఏప్రిల్ 15న రెండు లక్షలకు, మరో వారం రోజుల వ్యవధిలో ఏప్రిల్ 22న 3 లక్షలకు కేసుల సంఖ్య పెరిగింది. అప్పటి నుంచి రోజుకు సరాసరిన దాదాపు మూడున్నర లక్షల కేసులు వస్తూనే ఉన్నాయి. వీటిల్లో 74 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. మహారాష్ట్రతో పాటు ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, కేరళ, కర్ణాటకల్లో కరోనా విజృంభిస్తోంది.  ఈ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కఠిన లాక్ డౌన్ ఆంక్షలు అమలవుతున్నా, మిగతా ప్రాంతాల్లో నిబంధనల అమలు లేకపోవడంతో కేసుల సంఖ్య అనుకున్నట్టుగా తగ్గడం లేదు. లాక్ డౌన్ పెట్టాలన్న ఆలోచన చివరి అస్త్రంగా మాత్రమే ఉండాలన్నది ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయమని, పరిస్థితులను అంతవరకూ తీసుకుని వెళ్లకుండా చూడాలనే భావిస్తున్నామని ఉన్నతాధికారులు సూచించారు. మైక్రో కంటెయిన్ మెంట్ కు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నామని, అయితే, కేసుల సంఖ్య పెరుగుతుంటే, కొన్ని వారాల పాటు లాక్ డౌన్ తో మాత్రమే పరిస్థితి చక్కబడుతుందని హెల్త్ నిపుణులు సూచించిన మీదట ఈ సిఫార్సు చేశామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ నుంచి అందిన సిఫార్సులపై కేంద్రం ఎలా స్పందింస్తుందన్నది ఆసక్తిగా మారింది. 

లాక్ డౌన్ దిశగా తెలంగాణ! 

మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక తరహాలోనే తెలంగాణలో సంపూర్ణ లాక్ డౌన్ పెట్టబోతున్నారా? అంటే ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుండటంతో లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు. బుధవారం హోంశాఖ మంత్రి  మహా ముద్ అలీ  ఆధ్వర్యంలో లకిడికపూల్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. హోమ్ సెక్రెటరీ , డీజీపీతో పాటు పలువురు కమిషనర్లు హాజరయ్యారు. లాక్ డౌన్ పైనే ఈ సమావేశంలో చర్చ జరిగిందని తెలుస్తోంది. ఈనెల 30 వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. ఆ తర్వాత ఏ క్షణమైనా తెలంగాణలో లాక్ డౌన్ పెట్టే అవకాశాలు ఉన్నాయని అధికారిక వర్గాల సమాచారం.  లాక్ డౌన్ పై  రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ ప్రభుత్వ నికి నివేదిక సమర్పించిందని చెబుతున్నారు. ఆ నివేదిక హోంశాఖకు చేరడంతో దానిపైనే ఉన్నతాధికారులతో హోంశాఖ మంత్రి చర్చించారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా కేసుల సంఖ్య పెరిగితే లాక్ డౌన్ విధించుకోవచ్చు అని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిన  నేపథ్యంలో  హోంమంత్రి సమీక్షకు ప్రాధాన్యత ఏర్పడింది.  కరోనా కట్టడి కోసం కర్ఫ్యూ విధించినప్పటికీ అనుకున్న ఫలితాలు రాకపోవడంతో ప్రభుత్వం దశల వారీగా లాక్‌డౌన్ విధించే​దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలోని నిరాశ్రయులు, బిచ్చగాళ్లను నైట్ షెల్టర్లకు తరలించే ప్రక్రియను జీహెచ్ఎంసీ చేపట్టింది.గ్రేటర్‌లో లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా సిద్దంగా ఉండేలా జీహెచ్ఎంసీ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. పూర్తిగా లాక్‌డౌన్​విధిస్తే నిరాశ్రయులు, బిక్షగాళ్లపై ఎక్కువ ప్రభావం పడుతున్నట్టు గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి.రోజంతా అన్ని బంద్​ ఉంటే రోడ్ల పక్కన ఉండేవారికి, నిరాశ్రయులకు ఆహారం, ఇతర అవసరాలకు ఇబ్బందులు ఎదురు కానున్నాయి. వీటిని నివారించడంలో భాగంగా ముందుగానే వారందరిని బల్దియా నైట్​షెల్టర్లకు తరలించే ప్రక్రియను చేపట్టారు. మే నెల మొదటి వారంలోనే లాక్‌డౌన్​విధించే పరిస్థితులు ఉండటంతో ఆ లోపే వీలైనంత ఎక్కువ మందిని తమ పర్యవేక్షణలో ఉంచేలా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారని అంటున్నారు. 

కరోనాను జయించిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా మహమ్మారిని జయించారు. కరోనా సోకడంతో తన ఫామ్ హౌజ్ లో క్వారంటైన్ లో ఉన్నారు కేసీఆర్. ప్రత్యేక వైద్య బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. సీఎం వ్యక్తిగత డాక్టర్ ఎంవీ రావు పర్యవేక్షణలో యశోద హాస్పిటల్ కు చెందిన డాక్టర్ల బృందం బుధవారం ఆయనకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించింది. రాపిడ్ యాంటిజెన్ టెస్టులో కేసీఆర్ కు కరోనా నెగిటివ్ వచ్చింది. ఆర్టీపీసీఆర్ రిజల్ట్ మాత్రం గురువారం రానుంది. యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ రావడంతో కేసీఆర్ కరోనాను జయించారని వైద్యులు చెప్పారు. కేసీఆర్ కు నెగిటివ్ రావడంతో టీఆర్ఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కు ఈనెల 19న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన తన ఫాంహాజ్ లోనే క్వారంటైన్ లో ఉన్నారు.మూడు రోజుల తర్వాత యశోదకు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. సీటీ స్కాన్ రిపోర్టు నార్మల్ గానే రావడంతో ఎలాంటి ఇబ్బంది లేదని డాక్టర్లు నిర్దారించారు. దీంతో మళ్లీ ఆయన ఫాంహౌజ్ కు వెళ్లిపోయారు. అక్కడే ప్రత్యేక డాక్టర్ల బృందం పర్యవేక్షణలో ఉన్నారు.  నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం ఈనెల 14న హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఆ సభలో వేదికపై ఉన్న పార్టీ అభ్యర్థి నోముల భగత్ సహా చాలా మంది నేతలకు కరోనా వచ్చింది. దీంతో నాగార్జున సాగర్ సభలోనే ముఖ్యమంత్రికి కరోనా సోకి ఉంటుందని భావించారు. కేసీఆర్ పాజిటివ్ వచ్చిన తర్వాత కేటీఆర్ , ఎంపీ సంతోష్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. కేసీఆర్ తో పాటు సంతోష్ ఫాంహౌజ్ లో క్వారంటైన్ లో ఉండగా.. కేటీఆర్ తన నివాసంలో ఐసోలేట్ అయ్యారు.

ఒక్కరోజులో 14,669 కేసులు.. ఏపీలో క‌రోనా కాటు.. ప‌రీక్ష‌ల‌తో చేటు..

ఒక్కరోజులో 14,669 కేసులు. 2, 4, 6, 8, 10, 14.. రోజురోజుకీ ఏపీలో క‌రోనా కేసులు వేల‌ల్లో న‌మోద‌వుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వైరస్‌బారిన పడుతోన్న బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య సైతం భారీగా ఉండ‌టం బెంబేలెత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 74,681 పరీక్షలు నిర్వహించారు. ఏకంగా 14,669 మందికి పాజిటివ్ వ‌చ్చింది. ఒక్క‌రోజులోనే సుమారు 15వేల మందికి క‌రోనా సోక‌డం మామూలు విష‌య‌మేమీ కాదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌రో మ‌హారాష్ట్ర‌గా మార‌బోతోందా అనే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఢిల్లీ త‌ర‌హాలో కేసులు పెరుగుతుండ‌టం ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది.  కరోనాతో బాధపడుతూ ఏపీలో ఒక్క రోజులోనే 71 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ మొత్తం 1,62,17,831 కరోనా పరీక్షలు నిర్వహిస్తే.. 10,69,544 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  క‌రోనా కేసుల్లో దూసుకుపోతున్న ఏపీ.. కొవిడ్ కట్ట‌డి చ‌ర్య‌ల్లో మాత్రం చాలా వెన‌క‌బ‌డి ఉంది. మందుల కొర‌త‌, ఆసుప‌త్రిలో బెడ్స్ కొర‌త‌, ఆక్సిజ‌న్ కొర‌త‌, స్మ‌శానంలో శ‌వ‌ద‌హ‌నానికి ఇక్క‌ట్లు.. ఇలా అనేక స‌మ‌స్య‌లు. వీట‌న్నిటికీ సీఎం జ‌గ‌న్‌రెడ్డి చేత‌గాని త‌న‌మే కార‌ణ‌మ‌ని టీడీపీ విమ‌ర్శ‌. అస‌మ‌ర్థ ముఖ్య‌మంత్రి వ‌ల్లే రాష్ట్రం క‌రోనా కేంద్రంగా మారిందంటూ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు విమ‌ర్శించారు.  ఏపీ క‌రోనాతో అల్లాడిపోతుంటే.. సీఎం జ‌గ‌న్‌రెడ్డి మాత్రం విద్యార్థుల భ‌విష్య‌త్తు కోస‌మే ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లంటూ వారిని మ‌రింత ప్ర‌మాదంలో నెట్టేస్తున్నారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ రాష్ట్ర ప‌రిధిలోని అంశ‌మంటూ లాజిక్కులు చెబుతున్నారు. కేంద్ర బోర్డుల‌తో పాటు, అనేక రాష్ట్రాలు ప‌ది ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు, వాయిదా వేస్తున్నా.. జ‌గ‌న్ మాత్రం ఎగ్జామ్స్ పెట్టి తీరుతామంటూ మొండి కేస్తున్నారు. రోజుకు దాదాపు 15వేల పాజిటివ్ కేసులు వ‌స్తున్న త‌రుణంలో అన్ని ల‌క్ష‌ల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యే ప‌రీక్షలు పెట్ట‌డం ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో జ‌గ‌న్‌రెడ్డికి అర్థం కావ‌ట్లేదా అంటూ త‌ల్లిదండ్రులు నిల‌దీస్తున్నారు. ఇదేమి మూర్ఖ‌పు నిర్ణ‌యం, వితండ వాదం అంటూ చంద్ర‌బాబు ప్ర‌శ్నిస్తున్నారు. కేవ‌లం ప‌రీక్షా కేంద్రాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకుంటే స‌రిపోతుందా?  విద్యార్థుల రాక‌పోక‌ల‌ స‌మ‌యంలో క‌రోనా సోకే అవ‌కాశం ఉండ‌దా? అనేది చంద్ర‌బాబు అడుగుతున్నారు. టీడీపీ గ‌గ్గోలు పెడుతున్నా.. పేరెంట్స్ ఎగ్జామ్స్ వ‌ద్దంటూ వేడుకుంటున్నా.. స‌ర్కారులో పున‌రాలోచ‌న లేదు. ఎగ్జామ్స్ విష‌యంలో జ‌గ‌న్ మొండివైఖ‌రి వీడ‌టం లేదు.   

జ‌గ‌న్‌కు సీబీఐ కోర్టు నోటీసులు.. బెయిల్ ర‌ద్దు?

ఏపీ సీఎం జ‌గ‌న్‌రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌న్న ర‌ఘురామ‌కృష్ణ‌రాజు పిటిష‌న్‌పై వివ‌ర‌ణ కోరుతూ సీబీఐ కోర్టు నోటీసులు ఇచ్చింది. బెయిల్ నిబంధ‌న‌ల‌ను జ‌గ‌న్ ఉల్లంఘిస్తున్నార‌ని ర‌ఘురామ పిటిష‌న్‌లో తెలిపారు. వ‌చ్చే నెల 7న సీబీఐ కోర్టు పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్ట‌నుంది.  జ‌గ‌న్‌కు రోజులు ద‌గ్గ‌ర ప‌డుతున్న‌ట్టున్నాయ్‌. జ‌గ‌న్ బెయిర్ ర‌ద్దు పిటిష‌న్‌ను మంగ‌ళ‌వారం సీబీఐ కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. బుధ‌వారం నోటీసులు జారీ చేసింది. బ‌య‌ట ఉంటే జ‌గ‌న్ సాక్షుల‌ను ప్ర‌భావితం చేస్తున్నార‌ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషిన‌ర్‌. వెంట‌నే బెయిల్ ర‌ద్దు చేసి వేగంగా విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరారు. పిటిష‌న్ త‌ర‌ఫు అభ్యర్థ‌న‌లు  విన్న న్యాయ‌స్థానం.. కేసును విచార‌ణ‌కు స్వీక‌రించింది. తాజాగా నోటీసులు జారీ చేయ‌డం రాజ‌కీయంగా ఉత్కంఠ రేపుతోంది.  నాంపల్లి సీబీఐ కోర్టులో తాను వేసిన పిటిషన్‌ మొదట్లో సాంకేతిక కారణాల వల్ల న్యాయస్థానం తిరస్కరించిందని రఘురామ తెలిపారు. ఆ తర్వాత సవరణలు చేసి తిరిగి పిటిషన్‌ వేయడంతో తాజాగా తన పిటిషన్‌ను న్యాయస్థానం స్వీకరించినట్లు జడ్జి వెల్లడించారని వివరించారు. ఉన్నత పదవుల్లో ఉన్న వారే న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వకపోతే పౌరులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిని దృష్టిలో ఉంచుకునే తాను ఈ పోరాటం మొదలు పెట్టానని ఆయన వెల్లడించారు.   ర‌ఘురామ‌కృష్ణంరాజు.. కొన్ని రోజులుగా సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నారు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కోసం విరామం లేకుండా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆయ‌న‌పై ప్ర‌భుత్వ ప్రోద్బంలంతో ఈడీ రైడ్స్ జరుగుతున్నా..కేసులు పెడుతున్నా.. ఏమాత్రం అద‌ర‌డం లేదు.. బెద‌ర‌డం లేదు.. వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. జ‌గ‌న్ అనుస‌రిస్తున్న‌ విధానాల‌పై, అడ్డ‌గోలు పాల‌న‌పై దాదాపు ప్ర‌తీరోజు విమ‌ర్శ‌లు చేస్తుంటారు. ప్ర‌జ‌లను నిత్యం అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఎలాంటి పార్టీ స‌పోర్ట్ లేకున్నా.. వైసీపీ ఎంపీగా ఉంటూనే.. వ‌న్ మ్యాన్ ఆర్మీలా.. జ‌గ‌న్‌రెడ్డిపై మ‌డ‌మ తిప్ప‌ని పోరాటం చేస్తూ అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతున్నారు ర‌ఘురామ‌. తాజాగా, ఆయ‌న దాఖ‌లు చేసిన జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌ను సీబీఐ కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించ‌డం, జ‌గ‌న్‌కు నోటీసులు జారీ కావ‌డంతో ఆ ప్ర‌య‌త్నంలో తొలి విజ‌యం సాధించిన‌ట్టైంది. ర‌ఘురామ త‌లుచుకుంటున్న‌ట్టుగానే.. త్వ‌ర‌లోనే జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు అవుతుందా? జ‌గ‌న్ మ‌ళ్లీ జైలుక వెళ్ల‌క త‌ప్ప‌దా? ఏమో.... ఏదైనా జ‌ర‌గొచ్చు.

ఓటేయకు.. కరోనాకు బలికాకు! 

తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న వేళ జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఏప్రిల్ 30న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. కరోనా పంజా విసురుతుండటంతో పోలింగ్ ఎలా జరుగుతుందన్న ఆందోళన నెలకొంది. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగులు జంకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓటేందుకు జనాలు బయటికి వస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. కరోనా భయంతో వణికిపోతున్న జనాలు పోలింగ్ కేంద్రాలకు రావడం కష్టమేనని  ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.  కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సామాజిక కార్యకర్తలు సర్కార్ తీరుపై మండిపడుతున్నారు. వ‌రంగ‌ల్ ఎంజీఎం ప్రాంగ‌ణంలో కోట శ్యాంకుమార్ అనే వ్య‌క్తి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఓటేయ్య‌డానికి పోకు- కరోనాతో ఖతమై పోకు అంటూ  డాక్ట‌ర్ వేషాధార‌ణ‌లో ప్ల‌కార్డులు చేతబూని నిర‌స‌న వ్య‌క్తం చేశారు.  క‌రోనా అత్యంత ప్ర‌మాద‌క‌రంగా విజృంభిస్తున్న వేళ మిని మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డంపై ఆయ‌న తీవ్రంగా మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల ఆరోగ్యం, ప్రాణాల‌పై ఈ ప్రభుత్వానికి, ఎన్నిక‌ల సంఘానికి ఎంత‌మాత్రం ప‌ట్టింపులేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు శ్యాంకుమార్. బాధ్య‌త‌లేని ప్ర‌భుత్వాల‌కు 10 లక్షల మంది చనిపోయినా, ఎంత‌మాత్రం ఏం కానట్లుగా ఉంటున్నాయి.. కానీ మీ కుటుంబానికి మీరే పెద్ద దిక్కు.. మీ ప్రాణాలు మీ కుటుంబ స‌భ్యుల‌కు ఎంతో వేద‌న‌ను మిగుల్చుతాయి.. ఓటింగ్‌లో పాల్గొని క‌రోనాను అంటించుకోకండి. బాధ్య‌త‌లేని ప్ర‌భుత్వాల‌కు ఓటింగ్‌లో పాల్గొన‌కుండా నిర‌స‌న వ్య‌క్తం చేయండి అంటూ పిలుపునిస్తున్నారు కోట శ్యాంకుమార్. 

లేడీ పైలెట్ పై.. మరో పైలెట్.. 

మహిళలపై వేధింపులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మహిళా రక్షణకు ఎన్ని చట్టాలు వచ్చిన. అవి బూడిదలో పోసిన పన్నీరుగా తయారు అయ్యాయి. మొన్నటికి మొన్న ఒక లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ తన పై అధికారి లైంగిక వేధింపులు తాళలేక. తన సర్వీస్ రివల్ వార్ తో కాల్చుకుని చనిపోయింది. ఆ ఘటన మరువక ముందే, మరో లేడీ ఫైలెట్ ఆఫీసర్ ని తన తోటి ఆఫీసర్ లైంగింకంగా వేధిస్తున్నాడంటూ హైకోర్ట్ ని ఆశ్రయించింది.     భారత వాయుసేనలో లైంగిక వేధింపుల కలకలం చెలరేగింది. తనను ఫ్లయిట్ కమాండర్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ మహిళా పైలెట్ జమ్మూకశ్మీర్ హైకోర్టును ఆశ్రయించింది. పైగా వాయుసేనలోని అంతర్గత ఫిర్యాదుల కమిటీ కూడా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించింది. ఆ మహిళా పైలెట్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు... భారత వాయుసేన (ఐఏఎఫ్)తో పాటు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు కూడా నోటీసులు జారీ చేసింది. మహిళా పైలెట్ ఆరోపణలపై నాలుగు వారాల్లో జవాబు ఇవ్వాలని జస్టిస్ సంజీవ్ కుమార్ ధర్మాసనం ఆదేశించింది. కాగా, మహిళా పైలెట్ పై సదరు ఫ్లయిట్ కమాండర్ పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తగిన ఆధారాలను ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, అభ్యంతరకర రీతిలో తాకడం వంటి పనులు చేశారని కోర్టుకు విన్నవించారు. తాను ఎదుర్కొంటున్న సమస్య పట్ల భారత వాయుసేనలోని అంతర్గత ఫిర్యాదుల కమిటీకి నివేదిస్తే, అక్కడ ఆమెకు న్యాయం జరగలేదని తెలిపారు.       

కరోనా హాట్ స్పాట్లుగా టెస్టింగ్ సెంటర్లు!  

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రాష్ట్రంలోనూ పంజా విసురుతోంది. లక్షణాలు ఉన్నా లేకున్నా భయంతో జనాలు టెస్టుల కోసం పరుగులు పెడుతున్నారు. దీంతో  ప్రైవేట్ ల్యాబులు, ప్రభుత్వ కరోనా టెస్టింగ్ సెంటర్ల దగ్గర రద్దీ కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో క్యూలైన్లలో భౌతిక దూరం కూడా పాటించడం లేదు.  కరోనా సోకిన వారు.. సోకని వారు అంతా ఒకే దగ్గర గుమి గూడుతున్నారు. దీంతో టెస్టింగ్ సెంటర్లే ఇప్పుడు కరోనా హాట్ స్పాట్లుగా మారుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. సీటీ స్కాన్ కోసం జనాలు ఎగబడుతున్నారు. క్లోజ్డ్ రూమ్ లో చేసే సీటీ స్కాన్ సెంటర్ల ద్వారా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని వైద్యులు అంచనా వేస్తున్నారు.  వైద్య శాఖ అధికారులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. క‌రోనాతో ఎవ‌రూ భయపడాల్సిన అవసరం లేదని, ల‌క్ష‌ణాలు లేకున్నా భయంతో పరీక్ష చేయించుకునేందుకు ప‌రుగులు తీయొద్ద‌ని తెలంగాణ ప్ర‌జారోగ్య సంచాల‌కుడు డాక్ట‌ర్ శ్రీనివాస‌రావు సూచించారు. కొంద‌రు ల‌క్ష‌ణాలు లేకున్నా ప‌రీక్ష‌లు చేయించుకుంటుండ‌టంతో లక్షణాలు ఉన్నవారు స‌కాలంలో ప‌రీక్ష‌లు చేయించుకోలేక‌పోతున్నార‌ని అన్నారు. ల‌క్ష‌ణాలు లేని వారు టెస్టింగ్ సెంటర్ల‌ వద్దకు వెళ్లి వ్యాధి కొని తెచ్చుకోవ‌ద్ద‌ని కోరారు. కొవిడ్ లక్షణాలు కేవలం రెండు మూడు రోజులు ఉంటాయని..తగ్గకపోతేనే పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్నా టెస్టింగ్ కోసం వెళుతూ కొందరు అనవసరంగా వైరస్ భారీన పడుతున్నారని శ్రీనివాస‌రావు తెలిపారు.  క‌రోనా విజృంభిస్తున్నందున రానున్న రెండు, మూడు వారాలు చాలా కీల‌క‌మ‌ని  డాక్ట‌ర్ శ్రీనివాస‌రావు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే తెలంగాణ‌లో ప‌రిస్థితి కాస్త మెరుగ్గానే ఉంద‌ని చెప్పారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ‌లో క‌రోనా వ్యాప్తి త‌క్కువ‌గానే ఉంద‌ని అన్నారు. క‌రోనాపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెరిగింద‌ని, రాష్ట్రంలో 90 శాతం మంది మాస్కులు ధ‌రిస్తున్నార‌ని పేర్కొన్నారు. తెలిపారు. వందేళ్లకు ఒక‌సారి ఇలాంటి విపత్తులు వస్తుంటాయ‌ని అన్నారు. క‌రోనా క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ముందుంద‌ని చెప్పారు. వ‌చ్చే నెల వివాహాలు, శుభ‌కార్యాలు జ‌రిగేందుకు అవ‌కాశం ఉన్నందున ప్రజలు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచించారు. రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్ వేగంగా కొన‌సాగుతుంద‌ని, ఇప్ప‌టివ‌ర‌కు 45 లక్షల మంది పైగా వాక్సిన్ వేసిన‌ట్టు ఆయ‌న తెలిపారు. విడతల వారిగా మిగితా వారికి సైతం వాక్సిన్ వేస్తామ‌న్నారు డాక్ట‌ర్ శ్రీనివాస‌రావు.  

ఏపీలో ప‌రీక్ష‌లు.. ప్ర‌ధాని జోక్యం!

ఏది ఏమైనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీరుతాం అంటోంది ఏపీ స‌ర్కారు. విద్యార్థుల భ‌విష్య‌త్ కోస‌మే ఎగ్జామ్స్ అంటున్నారు సీఎం జ‌గ‌న్‌. ప‌రీక్ష‌ల‌పై జ‌గ‌న్ ప్ర‌భుత్వం మొండిగా ముందుకు పోతుండ‌టంతో త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న పెరిగిపోయింది. ప‌రీక్ష‌ల‌కు వెళితే.. త‌మ పిల్ల‌లు క‌రోనా బారిన ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని ఆవేద‌న చెందుతున్నారు. ప‌రీక్ష‌లకు వెళితే ఓ టెన్ష‌న్‌.. వెళ్ల‌కపోతే మ‌రో ప్రాబ్ల‌మ్‌. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈల‌తో స‌హా దేశంలోని ప‌లు రాష్ట్రాలు ప‌రీక్ష‌లు ర‌ద్దు, వాయిదా వేస్తుంటే.. ఏపీలో సీఎం జ‌గ‌న్‌రెడ్డి తీరు త‌మ పిల్ల‌ల పాలిట ముప్పుగా మారింద‌నేది పేరెంట్స్ భ‌యాందోళ‌న‌. అందుకే, ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో ప్ర‌ధాని మోదీ జోక్యం చేసుకోవాలంటూ ఆయ‌న‌కు లేఖ రాశారు న‌ర‌సాపురం ఎంపీ.  ఏపీలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పరీక్షలను విద్యార్థి లోకం తీవ్రంగా పరిగణిస్తోందని, దీనిపై ఏపీలో ఒకింత అధిక ఆందోళన నెలకొని ఉందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతోందని, విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రధాని జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తే లక్షల్లో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వైరస్ బారినపడే అవకాశాలున్నాయని, వారు వ్యాప్తికి కారకులు కావడమో, లేక వారే బలికావడమో జరుగుతుందని రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ సర్కారుకు ఇదేమీ కనిపిస్తున్నట్టుగా లేదని, అందుకే ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేందుకు సిద్ధమైందని ఆరోపించారు. "ప్రధాని గారూ కరోనా కట్టడికి మీరు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మీరు జోక్యం చేసుకుని తీరాల్సిన అత్యంత కీలక సమయం ఇది. పరీక్షలు రద్దు చేశామనో, వాయిదా వేశామనో చెబుతూ ఎలాంటి ప్రకటన సీఎం కార్యాలయం నుంచి రావడంలేదు. ఏపీ విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మీరే ఆదేశాలు ఇవ్వండి" అని తన లేఖలో కోరారు ర‌ఘురామ‌.

గోవాలో లాక్‌డౌన్.. ముచ్చ‌ట‌గా 3 రోజులు మాత్ర‌మే..

దేశ‌మంతా క‌రోనా క‌ల్లోలం. గోవాలో మాత్రం జిల్ జిల్ జిగా. టూరిస్టుల హంగామా. అస‌లే ఎండాకాలం కావ‌డం.. కొవిడ్‌తో భ‌యం పెర‌గ‌డంతో.. సిటీలో ఉండ‌టం క‌న్నా.. గోవా అయితే బెస్ట్ అనుకుంటూ ఇప్ప‌టికీ చాలా మంది జ‌నాలు గోవా టూర్ వేస్తున్నారు. గ‌తంలో మాదిరి కాకున్నా.. ప్ర‌స్తుతం గోవాకు చెప్పుకోద‌గ్గ స్థాయిలో ప‌ర్యాట‌కులు వ‌స్తున్నారు. సాగ‌ర తీరంలో సంద‌డి చేస్తున్నారు. అయితే, వైర‌స్‌కు గోవా, హైద‌రాబాద్‌, ఢిల్లీ అనే తేడా ఉండ‌దుగా. అందుకే, అక్క‌డా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గోవాలో మంగళవారం 2,110 మందికి కరోనా సోకింది. 31 మంది చ‌నిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,591.  గోవాలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తుండ‌టంతో.. అక్క‌డి ప్ర‌భుత్వం గ‌త్యంత‌రం లేని పరిస్థితుల్లో లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది. గురువారం నుంచి ఆంక్షలు అమ‌ల్లోకి రానున్నాయి. ఏప్రిల్ 29వ తేదీ రాత్రి 7 నుంచి.. మే 3వ తేదీ ఉదయం వరకు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. అంటే, ముచ్చ‌ట‌గా మూడు రోజులు మాత్ర‌మే. అదేంటి, మ‌రీ మూడు రోజుల లాక్‌డౌన్ ఏంటి అనుకుంటున్నారా. అది అంతే. ఎంతైనా గోవా క‌దా.  అత్యవసర సేవలు, పారిశ్రామిక కార్యకలాపాలకు మాత్రం అనుమతి ఉంటుంది. ప్రజా రవాణా, క్యాసినోలు, హోటళ్లు, పబ్బులు మూసివేయ‌నున్నారు. అత్యవసర వస్తువుల రవాణా కోసం మాత్రం రాష్ట్ర సరిహద్దులు తెరిచే ఉంటాయి.  సో.. స‌మ్మ‌ర్‌లో గోవా వెళ్లాల‌నుకునే వాళ్లు.. ఓ మూడు రోజులు ఆగి టూర్ ప్లాన్ చేసుకోవ‌చ్చు. వెళ్లాక చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ప్ర‌స్తుత సెకెండ్ వేవ్ హ‌ర్ర‌ర్‌లో అస‌లు గోవాకు వెళ్ల‌కపోవ‌డం ఇంకా బెట‌ర్‌. బుద్ధిగా ఇంట్లో కూర్చొని.. కొవిడ్ నుంచి కాపాడుకోండి. బాగుంటే మ‌రోసారి గోవా వెళ్లొచ్చు కానీ, ఇప్పుడు మాత్రం వ‌ద్దు అంటున్నారు వైద్యులు.

హిందూ కరోనా మృతులకు అంత్యక్రియలు.. ముస్లిం యువకులకు సెల్యూట్ 

కరోనా మహమ్మారి ప్రజలను బలి తీసుకుంటోంది. ప్రాణాలు తీయడమే కాదు మానవ సంబంధాలను తెంచేస్తోంది. సొంతవారే మానవత్వం లేకుండా ప్రవర్తించేలా చేస్తోంది. కరోనా సోకితే.. కుటుంబ సభ్యులే దగ్గరికి రాని పరిస్థితి. కరోనాతో చనిపోతే అంత్యక్రియలకు కూడా ముందుకు రావడం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేమున్నామంటూ ముందుకొచ్చి వారి అంత్యక్రియలను పూర్తి చేస్తున్నారు నలుగురు యువకులు. ముస్లింలు అయినా.. కరోనాతో మృతి చెందిన హిందువులకు సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకుంటున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో నలుగురు ముస్లిం సోదరులు చేస్తున్న పనికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు.   నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి ఒంటరిగా ఉంటున్నారు. ఇటీవల ఆయనకు కరోనా రావడంతో నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో కొద్ది రోజులు చికిత్స పొంది ఎవరికీ చెప్పకుండా వచ్చేశాడు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అమ్రాబాద్ నుంచి తిరుమలాపురం వెళ్లేందుకు వాహనాలు లేకపోవడంతో అక్కడే ఓ పాత ఇంటి ముందు పడుకున్న అతను నిద్రలోనే మృతి చెందాడు. గుర్తించిన స్థానికులు పోలీసులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. అయితే  మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో అమ్రాబాద్ కు చెందిన నలుగురు ముస్లింల యువకులు ముందుకొచ్చి వైద్య అధికారి నాగరాజు ఇచ్చిన పిపిఈ కిట్లను ధరించి మృతదేహాన్ని ట్రాక్టర్ ద్వారా తిరుమలాపురం గ్రామానికి తరలించి ఖననం చేశారు. అంత్యక్రియల్లో ముస్లిం యువకులకు గ్రామ సర్పంచ్ శారద. ఎస్ఐ వెంకటయ్య సహకారం అందించారు.  అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి లోను కరోనాతో ఇద్దరు మృతి చెందగా అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో సర్పంచ్ ఆధ్వర్యంలో పిపిఈ కిట్లను ధరించి పంచాయతీ టాక్టర్లు ద్వారా మృతదేహాలను తరలించి శ్మశాన వాటిక వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. మండల పరిధిలోని ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే ముస్లిం యువకులు అక్కడికి చేరుకుని వారి సాంప్రదాయ ప్రకారమే కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. వీరి సేవ పట్ల అధికారులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు అభినందిస్తున్నారు. జనాలు దండం పెడుతున్నారు. 

మాస్క్ రచ్చ.. కార్పోరేటర్ పై కక్ష..

ఉన్నమాట అంటే ఊరికి నాకు చేటు అన్నట్లు ఉంది.. ఇప్పుడు సమాజంలో పరిస్థితి. యువకులు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు.  మాస్క్ పెట్టుకోలేదని మందలించాడని. ఓ యువకుడు ఏకంగా కార్పొరేటర్ పైనే చేయి వేసుకున్నాడు.  కరోనా విజృంభిస్తున్న కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని 32వ డివిజన్‌ కార్పొరేటర్‌ వెంకటకృష్ణచారి ఇవాళ ఉదయం బ్రాడీపేటలో పర్యటించారు. బ్రాడీపేట నాలుగో లైన్‌లోని సాయిచరణ్‌ బాయ్స్‌ హాస్టల్‌ వద్ద యువకులు గుమిగూడి ఉండటాన్ని గమనించారు. అక్కడికి వెళ్లిన కార్పొరేటర్‌ మాస్కు ధరించని యువకుడిని గట్టిగా మందలించారు. ఈ విషయంలో మాటామాటా పెరిగి ఓ యువకుడిపై కార్పొరేటర్‌ చేయి చేసుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ యువకుడు ‘మా తల్లిదండ్రులే నన్ను కొట్టరు.. మీరు కొడతారా?’ అంటూ కార్పొరేటర్‌పై తిరగబడ్డాడు. తన స్నేహితులతో కలిసి కార్పొరేటర్‌ వెంకటకృష్ణచారిని తిరిగి కొట్టాడు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్‌ అనుచరులు అక్కడికి చేరుకుని వసతి గృహంలోని యువకులను బయటకు తీసుకొచ్చి దాడి చేశారు. సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరు యువకుల్ని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.    విషయం తెలుసుకున్న నగర మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఘటనపై ఆరా తీశారు. కార్పొరేటర్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో మాస్కులు లేకుండా తిరగటం ప్రమాదకరమని చెబితే ఇలా దాడి చేయడమేంటని కార్పొరేటర్‌ ప్రశ్నించారు. బ్రాడీపేటలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున హాస్టళ్లను మూసివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.    

కూతురి  ప్రియుడ్ని.. నరికిన తండ్రి.. 

మనుషుల్లో మానవత్వం మచ్చుకైనా లేకుండా పోతుంది.. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా.. పరువు కోసం పరువు హత్యలు చేస్తున్నారు.. పిల్లలు ప్రేమించుకుంటే పెళ్లి చేయాల్సిన తల్లి దండ్రులు.. ఆ పిల్లల పైన కత్తులతో దాడులు చేస్తున్నారు.. పిల్లల మరణాలకు కారకులు అవుతున్నారు.  అది గుంటూరు జిల్లా. పెదకాకాని మండలం. కొప్పురావూరు గ్రామం. అతని పేరు వెంకటేష్. అదే గ్రామానికి చెందిన భాస్కర్ రావు అనే వ్యక్తి కూతురు  ఇంటర్మీడియట్ చదువుతుంది. భాస్కర్ రావు అమ్మాయికి , వెంకటేష్ కి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమ గా మారడానికి ఎంత కాలం పట్టలేదు. మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత కలిసి బతుకుదామనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు వెంకటేశ్‌ను పిలిపించి గ్రామంలో పంచాయతీ పెట్టారు. అప్పటి నుంచి గ్రామానికి దూరంగా ఉన్నాడు  వెంకటేశ్‌. అయినా ఆ యువతితో  తరచూ ఫోన్‌లో సంభాషిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు.  అమ్మాయి వాళ్ళ ఫాదర్ వెంకటేష్ ని గ్రామానికి పిలిపించాడు. తనతో మాట్లాడాలంటూ.. అర్ధరాత్రి గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు ఆ యువతి తండ్రి భాస్కర్ రావు, మరో ఐదుగురు కలిసి వెంకటేశ్‌పై మారణాయుధాలతో దాడి చేసి కాళ్లు, చేతులు నరికేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. దాడికి పాల్పడ్డ ఆరుగురు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శోభన్ బాబు తెలిపారు.    

కొవిడ్ కట్టడికి కోవాగ్జిన్ వరం! అమెరికా పరిశోధకుల రిపోర్ట్

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ మహ్మమారి కట్టడికి భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాక్సిన్ అద్బుత ఔషదమని అమెరికా వైద్య నిపుణులు చెబుతున్నారు.  617 కరోనా వేరియంట్లతో పాటు ఇండియన్ డబుల్ మ్యూటాంట్ స్ట్రెయిన్‌ను కోవాగ్జిన్ సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు  వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ , నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ఆంథోనీ ఫౌసీ తెలిపారు. ఇండియా కంపెనీ తయారుచేసిన కోవాగ్జిన్ కరోనాకు గొప్ప విరుగుడు కావచ్చని ఆయన వెల్లడించారు.  కోవాక్సిన్‌ను హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. తొలుత క్లినికల్ ట్రయల్‌లో ఉన్నప్పుడు జనవరి 3 న అత్యవసర ఉపయోగం కోసం ఆమోదించబడింది. పరీక్ష ఫలితాల తరువాత టీకా 78 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉందని ఐసిఎంఆర్ తెలిపింది. కోవాక్సిన్ చనిపోయిన వైరస్ ను ఉపయోగించి తయారుచేసిన వేరియంట్ . ఇక భారతదేశంలో కరోనావైరస్ కేసులు పెరగడానికి దోహదం చేస్తాయని భయపడిన COVID-19  వేరియంట్ అయిన B.1.617 డజనుకు పైగా దేశాలలో కనుగొనబడిందని WHO తెలిపింది.  మరోవైపు భారత్ ను ప్రపంచం ఫెయిల్ చేశాయని ఆంథోనీ ఫౌచీ ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ కు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత గండం నుంచి భారత్ ను బయటపడేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.ప్రపంచంలో అన్ని దేశాలకు వైద్య సాయం అందించడంలో ధనిక దేశాలు అసమానతలను ప్రదర్శించాయని మండిపడ్డారు. ఆ అసమానతలకు భారత్ లోని పరిస్థితులే నిదర్శనమని చెప్పారు. ఇప్పటికైనా ధనిక దేశాలు స్పందించి ప్రపంచ దేశాలకు అవసరమైన సాయం చేయాలని ఆయన సూచించారు. అన్ని దేశాలకు సమాన వసతులు కల్పించాలన్నారు. భారత్ లో ఆక్సిజన్ చాలక చాలా మంది చనిపోతున్నారని, అక్కడ భయంకర పరిస్థితులున్నాయని ఆంథోనీ ఫౌచీ చెప్పుకొచ్చారు. ఆసుపత్రుల్లో బెడ్లు కూడా చాలినన్ని లేవని అన్నారు. ఆ గండం నుంచి భారత్ ను గట్టెక్కించేలా ధనిక దేశాలు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఒక దేశంతో మరో దేశానికి ఇప్పుడు ప్రపంచమంతా ముడిపడి ఉందని, ధనిక దేశాలు తమ దగ్గర ఉన్నవి లేని దేశాలకు ఇచ్చి ఉదారత చాటుకోవాలని సూచించారు.

జ‌గ‌న్‌ కాదు.. కంసుడు..! ప‌రీక్ష‌ల‌పై లోకేశ్ ఫైర్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యార్థుల పాలిట జ‌గ‌న్‌రెడ్డి కంసుడు అని తేలిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిప‌డ్డారు. క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న ద‌శ‌లో కేంద్రం, దాదాపు అన్ని రాష్ట్రాలూ ప‌రీక్ష‌లు ర‌ద్దు, వాయిదా వేస్తే.. ఒక్క ఏపీలోనే ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని మొండిగా ముందుకెళ్ల‌డం జ‌గ‌న్‌రెడ్డి మూర్ఖ‌త్వానికి నిద‌ర్శ‌నమన్నారు. విద్యార్థుల భ‌విష్య‌త్తు అంటూ దీర్ఘాలు తీస్తున్న జ‌గ‌న్‌రెడ్డి అధ్వాన‌పాల‌న‌లో వారు బ‌తికి ఉంటే క‌దా భ‌విష్య‌త్తు? అని మండిపడ్డారు.  ఏపీలో క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌లమైంద‌న్నారు లోకేశ్‌. రాష్ట్రంలో అంబులెన్సులు రావని, ఆక్సిజ‌న్ లేదని, జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. క‌రోనా శ‌వాల‌తో మార్చురీలు నిండిపోయాయన్నారు.  అంత్య‌క్రియ‌ల‌కు శ్మ‌శానాల‌లో క్యూలు ఉన్నాయని, ఆస్ప‌త్రిలో బెడ్డు దొర‌క్క‌ రోడ్డుపైనే కుప్ప‌కూలిపోతున్నారని తెలిపారు. ఇవ‌న్నీ ప‌ట్టించుకోకుండా ప‌రీక్ష‌ల పేరుతో 15 ల‌క్ష‌ల‌ మందికి పైగా విద్యార్థుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడ‌టం ఫ్యాక్ష‌న్ సీఎంకి త‌గ‌దని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఒక్క డోసుతో వైరస్ వ్యాప్తి సగం తగ్గినట్లే! 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషనే ఉత్తమమైన మార్గమని వైద్య సంస్థలు చెబుతున్నారు. లాక్ డౌన్ వంటి చర్యలు తీసుకున్నా.. జనాలందరికి వ్యాక్సిన్ ఇవ్వడమే ఉత్తమ పరిష్కారమని స్పష్టం చేస్తున్నాయి. కొవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి ఇంగ్లండ్‌ శాస్త్రవేత్తలు కీలక విషయాలు వెల్లడించారు. కరోనా వ్యాప్తి విషయంలో ఇంగ్లాండ్ శాస్త్రవేతలు చేసిన పరిశోధనల్లో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి.  కరోనా వైరస్‌ నుంచి రక్షించడమే కాకుండా వ్యాప్తిని కూడా వ్యాక్సిన్ తగ్గిస్తున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత మహమ్మారి బారిన పడితే వారి నుంచి కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకే ప్రమాదం 50 శాతం తగ్గుతుందని కనుగొన్నారు.  పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌(పీహెచ్‌ఈ) పరిశోధకులు ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిపై అధ్యయనం జరిపారు. తొలి డోసు తీసుకున్న మూడు వారాల తర్వాత మహమ్మారి బారిన పడిన వారి నుంచి టీకా తీసుకోని కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకే అవకాశం 38-49 శాతం తగ్గినట్లు గుర్తించారు. దీంతో టీకా వైరస్‌ బారి నుంచి రక్షించడమే కాకుండా.. వ్యాప్తిని కూడా తగ్గిస్తుందన్న విషయం స్పష్టమైందని బ్రిటన్‌ హెల్త్‌ సెక్రటరీ మ్యాట్‌ హాన్‌కాక్‌ వెల్లడించారు. మహమ్మారిపై పోరులో వ్యాక్సిన్‌ ప్రాధాన్యతను ఇది తెలియజేస్తోందన్నారు. ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కనీసం ఒకరు కరోనా బారిన పడిన 24 వేల కుటుంబాల్లో 57 వేల మంది వ్యాక్సిన్‌ తీసుకోని వారిపై ఈ అధ్యయనం జరిపారు. ఈ ఫలితాల్ని పది లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకోని వారి సమాచారంతో పోల్చి చూడగా.. తాజా విషయం వెలుగులోకి వచ్చింది.  గతంలో జరిపిన పలు అధ్యయనాల్లో.. ఒక డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత వైరస్‌ వల్ల తలెత్తే లక్షణాలు 65 శాతం తగ్గినట్లు తేలిన విషయం తెలిసింది. ఇళ్లు, జైళ్లు, లేదా కలిసి నివాసం ఉండే ప్రదేశాల్లో వైరస్‌ సంక్రమణకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు గతంలోనే గుర్తించారు. బ్రిటన్‌లో వ్యాక్సినేషన్‌ సత్ఫలితాలిస్తున్నట్లు పీహెచ్‌ఈ అధ్యయనంలో తేలింది. మార్చి చివరి నాటికి 60 ఏళ్ల పైబడిన వారిలో 10,400 మరణాలను నియంత్రించగలిగినట్లు వెల్లడించింది. వ్యాక్సిన్ వల్లే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలరనే నమ్మకంతోనే మన దేశంలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశారు. ప్రస్తుతం 45 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే టీకా ఇస్తుండగా.. మే1 నుంచి 18 ఏండ్లు నిండిన అందరికి టీకా ఇవ్వబోతున్నారు. వ్యాక్సినేషన్ ఎంత త్వరగా జరిగితే.. అంత త్వరగా వైరస్ ను కట్టడి చేసే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే అందరూ వ్యాక్సిన్ ను త్వరగా వేసుకోవడం మంచిది. ఎవరూ ఎలాంటి భయాందోళనకు గురికాకుండా వ్యాక్సిన్ వేసుకోని కరోనాను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది...  

సంగం డెయిరీపై 20 ఏళ్ల కుట్ర.. జీవోపై హైకోర్టులో పిటిష‌న్‌..

సంగం డెయిరీపై 20 ఏళ్ల కిందటే కుట్రలు జరిగాయని అన్నారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాడని గుర్తు చేశారు. ప్రస్తుత వ్యవహారంపై స్పందిస్తూ.. ధూళిపాళ్ల నరేంద్ర చైర్మన్ కాకముందే భూ బదలాయింపు జరిగిందని చంద్రబాబు స్పష్టం చేశారు. అమూల్ కోసం సంగం డెయిరీని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న అంశంపై అరెస్ట్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. పాడి రైతులకు చెడు చేయడం తగదని హితవు పలికారు. నాడు యడ్లపాటి వెంకట్రావు సంగం డెయిరీని ప్రారంభించారని, ఆ తర్వాత సంగం డెయిరీని ధూళిపాళ్ల వీరయ్య ఎంతో అభివృద్ధి చేశారని.. న‌రేంద్ర హ‌యాంలో ఓ వెలుగు వెలిగింద‌ని.. చంద్ర‌బాబు వెల్లడించారు.  మ‌రోవైపు.. డెయిరీ యాజమాన్య హక్కులను బదలాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను వ్యతిరేకిస్తూ సంగం డెయిరీ డైరెక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. డెయిరీ స్వాధీనానికి ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.19ను రద్దు చేయాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేశారని సంగం డెయిరీ డైరెక్టర్లు ఆరోపించారు. అటు, తనపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 

దేశంలో కోవిడ్ సూపర్ స్పైడర్ ఆయనే!

దేశంలో కరోనా  పంజా అంతకంతకు పెరిగిపోతోంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ విజృంభణ మాత్రం ఆగడం లేదు. మంగళవారం దేశంలో  3,60,960 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రికార్డ్ స్థాయిలో 3 వేల 293 మంది కరోనా కాటుకు బలయ్యారు. గత 24 గంటల్లో 2,61,162 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.  ప్రస్తుతం దేశంలో 29 లక్షలకు పైగా యాక్టివ్ కేసులుండటం ఆందోళన కల్గిస్తోంది. ఢిల్లీ, యూపీ, గుజరాత్,  మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, పంజాబ్ , కర్ణాటక రాష్ట్రాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.  దేశంలో కరోనా వ్యాప్తికి కేంద్ర సర్కార్ నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు, మీడియా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం.. రాజకీయ నేతల నిర్వాకాల వల్లే భారత్ భయంకర పరిస్థితుల్లోకి వెళ్లిందని చెబుతున్నాయి. తాజాగా భారతీయ వైద్య సంఘం కూడా కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీనే కొవిడ్‌ సూపర్‌ స్ర్పెడర్‌ అని, దేశంలో ప్రస్తుత దుస్థితికి ఆయనే కారణమని  ఆ సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ నవ్‌జ్యోత్‌ దహియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌  నిబంధనలను ఉల్లంఘించి బెంగాల్‌లో ప్రధాని ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల ర్యాలీలు, హరిద్వార్‌లో కుంభమేళాలు నిర్వహించారని, ఫలితంగా కొవిడ్‌ వ్యాప్తి పెరిగి మరణాలు పెరుగాయని, ఆస్పత్రులకు అంబులెన్సుల తాకిడి పెరిగిందని అన్నారు. ‘‘చాలా మంది రోగుల మరణాలకు మెడికల్‌ ఆక్సిజనే కారణం. దేశంలో చాలా చోట్ల ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటుచేసే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం వద్దే అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి’’ అని దహియా చెప్పారు. ప్రధాని మోడీని ఉద్దేశించి దహియా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కుంభమేళా వల్లే ఢిల్లీ, యూపీ, గుజరాత్ లో కరోనా వేగంగా విస్తరిస్తుందని కేంద్ర వైద్య వర్గాలు కూడా చెబుతున్నాయి. ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోంలోనూ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీనికంతటికి ఎన్నికల ర్యాలీలే కారణమనే విమర్శలు వస్తున్నాయి. ప్రధాని మోడీ 20 ఎన్నికలు ర్యాలీల్లో పాల్గొనగా.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 30 సభలకు హాజరయ్యారు. వీటిని ఉదహరిస్తూ అంతర్జాతీయ మీడియా మోడీ, అమిత్ షాను టార్గెట్ చేస్తూ వరుస కథనాలు ప్రచురిస్తున్నాయి. 

ఎల‌క్ష‌న్ టెన్ష‌న్‌.. క‌రోనా ఫియ‌ర్‌..

ఓవైపు క‌రోనా. మ‌రోవైపు ఎన్నిక‌లు. ప్ర‌చారం ముగిసింది. పోలింగ్‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఉద్యోగుల్లో ఆందోళ‌న మొద‌లైంది. ఎల‌క్ష‌న్ డ్యూటీ చేయాలంటే హ‌డలిపోతున్నారు. ఇంట్లో ఉంటేనే ఎక్క‌డ క‌రోనా కాటేస్తుందోన‌నే భ‌యం. అలాంటిది.. వంద‌ల మంది ఓటేసే చోట విధులు నిర్వ‌హించ‌డ‌మంటే క‌త్తి మీద సామే. వారం రోజుల పాటు జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంతో వైర‌స్ ఓ రేంజ్‌లో విజృంభించింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలు ఇప్ప‌టికే క‌రోనా హాట్ స్పాట్‌లుగా మారాయి. ఏప్రిల్ 30న అక్క‌డ‌ పోలింగ్ జరగనుంది. పోలింగ్ స‌మ‌యం రాబోతోందంటే సిబ్బంది వ‌ణికిపోతున్నారు. ఎంత కొవిడ్ జాగ్ర‌త్త‌లు తీసుకున్నా.. వైర‌స్ ముప్పు నుంచి ర‌క్షించుకోగ‌ల‌మా అనే భ‌యం వారిని వెంటాడుతోంది.  రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చిన రాష్ట్ర ఎలక్షన్ కమిషన్.. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. కరోనా టైమ్​లో ఎన్నికలను ఆపాలని వివిధ రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోలేదు. కరోనా కేసులు పెరుగుతుండటంతో తమ ద‌గ్గ‌ర‌కు ప్రచారానికే రావద్దన్నారు జ‌నం. అలాంటిది, శుక్ర‌వారం ఓటు వేసేందుకు ఎంత మంది వ‌స్తారో అనే అనుమానం లేక‌పోలేదు. క‌రోనా భ‌యంతో పోలింగ్ శాతం త‌గ్గుతుందేమోన‌నే అంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుండటంతో జిల్లాల్లో కలెక్టర్లు, ఇతర అధికారులు నియంత్రణ చర్యల్లో తలమునకలై పని చేస్తున్నారు. ఈ టైమ్​లో ఎన్నికలు పెట్టడంతో ప్రభుత్వ సిబ్బంది జంకుతున్నారు. నోటీసులు ఇస్తారనే భయంతో కొందరు విధుల్లో చేరేందుకు వస్తున్నా.. తీరా పోలింగ్ నాటికి ప‌రిస్థితి ఎలా ఉంటుందోన‌నే టెన్ష‌న్ లేక‌పోలేదు.  తెలంగాణలో రోజుకు 10 వేల‌కు పైగా కేసులు వ‌స్తున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో క‌రోనా జాగ్ర‌త్త‌లు తీసుకుంటామంటూ ఎస్ఈసీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. శానిటైజర్, మాస్కులు ఏర్పాటు చేస్తామని, ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా చూస్తామని చెప్తున్నా.. పోలింగ్ కేంద్రం బయట అలాంటి పరిస్థితులు ఉండే అవకాశాలు తక్కువ. రాజకీయ పార్టీల కార్యకర్తలు, ఓటర్లు గుమిగూడి వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంది. ఎన్నికలు జరగనున్న రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలు ఉన్న జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగానే ఉన్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో రోజుకి 300కి పైగా కేసులు వస్తున్నాయి. సిద్దిపేట, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 200కి పైగా.. ఖ‌మ్మం, నాగ‌ర్ క‌ర్నూల్‌, న‌ల్గొండ‌లో వంద‌కి పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఎన్నిక‌లు జ‌రిగే జిల్లాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 20 వేల వర‌కూ ఉన్నాయి. కరోనా సోకిన వారిలో 80 శాతం మందికి లక్షణాలు తెలియడం లేదు. మొత్తం 11.30 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇలాంటి సందర్భంలో తనకు కరోనా సోకిందని తెలియక ఒక్క పాజిటివ్ ఓటరు వచ్చినా.. చాలా మందికి వైర‌స్‌ వ్యాప్తి అయ్యే ప్రమాదం ఉంది. పోలింగ్ సిబ్బందితోపాటు ఓటర్లకూ వైరస్ సోకే అవకాశం ఉంది. నాగార్జున‌ సాగర్ బై ఎలక్షన్​లోనూ ఇదే జరిగింది. అక్కడ క్యాంపెయిన్​లో పాల్గొన్న లీడర్లతో పాటు కార్యకర్తలకు, పబ్లిక్​కు వైరస్ సోకింది. దీంతో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటికే ఎలక్షన్ డ్యూటీలో నిమగ్నమైన అధికారుల్లో దాదాపు 10 శాతం మందికి పాజిటివ్ వచ్చిన‌ట్టు తెలుస్తోంది. దీంతో తమకు కరోనా సోకుతుందేమోనని ఇతర సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో ప్రాణాల కంటే డ్యూటీ ముఖ్యం కాదంటూ ఎలక్షన్ ట్రైనింగ్​కు కొందరు అధికారులు వెళ్లలేదు. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో 1,530 పోలింగ్ కేంద్రాలున్నాయి. ప్రతి పోలింగ్ సెంటర్​కు ఐదుగురు చొప్పున ఎన్నికల అధికారులు పనిచేయాల్సి ఉంటుంది. దీనికి అదనంగా మరో 20 శాతం సిబ్బందిని నియమించారు. ఇతర పనులకు కొంత సిబ్బంది అవసరం ఉంటుంది. ఇలా, 30న జరగనున్న మినీ మున్సిపల్ ఎన్నికలకు దాదాపు 11 వేల మందిని ఎస్ఈసీ వాడుకుంటోంది. ఇందులో 30 శాతం మంది ట్రైనింగ్​కు డుమ్మా కొట్టారు. దీంతో ఆఫీసర్లు డైలమాలో పడ్డారు. కరోనా టైమ్​లో తమ కుటుంబాలకు ఇబ్బంది కలిగించి, ప్రాణాల మీదకు తెచ్చుకునే ఈ డ్యూటీ చేయలేమని కొందరు సిబ్బంది లీవ్ పెట్టగా.. ఇంకొందరు తమ ఆరోగ్యం బాగా లేదని డ్యూటీకి రాలేమని చెబుతున్నారు. దీంతో మున్సిపోల్స్ నిర్వహణ ఆయా జిల్లాల కలెక్టర్లకు స‌వాల్‌గా మారింది. అధికారుల్లో పోలింగ్ టెన్ష‌న్ నెల‌కొంది.