ఒక్క డోసుతో వైరస్ వ్యాప్తి సగం తగ్గినట్లే!
posted on Apr 28, 2021 @ 2:10PM
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషనే ఉత్తమమైన మార్గమని వైద్య సంస్థలు చెబుతున్నారు. లాక్ డౌన్ వంటి చర్యలు తీసుకున్నా.. జనాలందరికి వ్యాక్సిన్ ఇవ్వడమే ఉత్తమ పరిష్కారమని స్పష్టం చేస్తున్నాయి. కొవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి ఇంగ్లండ్ శాస్త్రవేత్తలు కీలక విషయాలు వెల్లడించారు. కరోనా వ్యాప్తి విషయంలో ఇంగ్లాండ్ శాస్త్రవేతలు చేసిన పరిశోధనల్లో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి.
కరోనా వైరస్ నుంచి రక్షించడమే కాకుండా వ్యాప్తిని కూడా వ్యాక్సిన్ తగ్గిస్తున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మహమ్మారి బారిన పడితే వారి నుంచి కుటుంబ సభ్యులకు వైరస్ సోకే ప్రమాదం 50 శాతం తగ్గుతుందని కనుగొన్నారు. పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్(పీహెచ్ఈ) పరిశోధకులు ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న వారిపై అధ్యయనం జరిపారు. తొలి డోసు తీసుకున్న మూడు వారాల తర్వాత మహమ్మారి బారిన పడిన వారి నుంచి టీకా తీసుకోని కుటుంబ సభ్యులకు వైరస్ సోకే అవకాశం 38-49 శాతం తగ్గినట్లు గుర్తించారు. దీంతో టీకా వైరస్ బారి నుంచి రక్షించడమే కాకుండా.. వ్యాప్తిని కూడా తగ్గిస్తుందన్న విషయం స్పష్టమైందని బ్రిటన్ హెల్త్ సెక్రటరీ మ్యాట్ హాన్కాక్ వెల్లడించారు. మహమ్మారిపై పోరులో వ్యాక్సిన్ ప్రాధాన్యతను ఇది తెలియజేస్తోందన్నారు. ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కనీసం ఒకరు కరోనా బారిన పడిన 24 వేల కుటుంబాల్లో 57 వేల మంది వ్యాక్సిన్ తీసుకోని వారిపై ఈ అధ్యయనం జరిపారు. ఈ ఫలితాల్ని పది లక్షల మంది వ్యాక్సిన్ తీసుకోని వారి సమాచారంతో పోల్చి చూడగా.. తాజా విషయం వెలుగులోకి వచ్చింది.
గతంలో జరిపిన పలు అధ్యయనాల్లో.. ఒక డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత వైరస్ వల్ల తలెత్తే లక్షణాలు 65 శాతం తగ్గినట్లు తేలిన విషయం తెలిసింది. ఇళ్లు, జైళ్లు, లేదా కలిసి నివాసం ఉండే ప్రదేశాల్లో వైరస్ సంక్రమణకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు గతంలోనే గుర్తించారు. బ్రిటన్లో వ్యాక్సినేషన్ సత్ఫలితాలిస్తున్నట్లు పీహెచ్ఈ అధ్యయనంలో తేలింది. మార్చి చివరి నాటికి 60 ఏళ్ల పైబడిన వారిలో 10,400 మరణాలను నియంత్రించగలిగినట్లు వెల్లడించింది.
వ్యాక్సిన్ వల్లే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలరనే నమ్మకంతోనే మన దేశంలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశారు. ప్రస్తుతం 45 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే టీకా ఇస్తుండగా.. మే1 నుంచి 18 ఏండ్లు నిండిన అందరికి టీకా ఇవ్వబోతున్నారు. వ్యాక్సినేషన్ ఎంత త్వరగా జరిగితే.. అంత త్వరగా వైరస్ ను కట్టడి చేసే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే అందరూ వ్యాక్సిన్ ను త్వరగా వేసుకోవడం మంచిది. ఎవరూ ఎలాంటి భయాందోళనకు గురికాకుండా వ్యాక్సిన్ వేసుకోని కరోనాను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది...