ప్రజలు కరోనాకు భయపడొద్దు.. ఎయిమ్స్ ప్రకటన..

కోవిడ్19 తేలిక పాటి వ్యాది దీనికి ప్రజలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వ్యాఖ్య. ఆల్ ఇండియా ఇన్స్టిట్యుట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కోరోనా వైరస్ చైర్మన్ మేదంతా డాక్టర్ నరేష్ త్రేహాన్ ఎయిమ్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ మెడిసిన్ డాక్టర్ నవీత్ వింగ్ డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ సునీల్ కుమార్ తో కలిసి కొన్ని అంశాలను మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా రణదీప్ గులేరియా మాట్లాడుతూ ప్రస్తుతం కోవిడ్19  పై ప్రజలు ప్యానిక్ అవుతున్నారని కోవిడ్19 తేలిక పాటి వ్యాధి మాత్రమే అని అన్నారు.ప్రజలు తీవ్ర భయాందోళన కు గురి అవుతున్నారని భయ బ్రన్తులకు గురి అవుతున్నారని ఈ తేలిక పాటి సమస్యకు రెమిడీ సివిర్ మందు  అవసరం లేదని అన్నారు. ఆక్సిజన్ సిలెండర్లను సైతం ఇళ్ళలో నిల్వలు ఉంచారని దీనివల్లే ఆక్సిజన్ కొరత ఏర్పడిందని అనవసరమైన ఆందోళన భయ బ్రాంతులను సృష్టిస్తున్నారని రణ దీప్ గులేరియాఅన్నారు. 

ఎన్నికల సంఘంపై హత్య కేసు?

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలోనే ఐదు రాష్ట్రాలో ఎన్నికలు జరిగాయి. మరికొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో పార్టీలు కోవిడ్ రూల్స్ పాటించలేదు. వేలాది మంది సభలు, ర్యాలీలు నిర్వహించాయి. పార్టీల ముఖ్య నేతలు కనీసం మాస్కు ధరించకుండానే ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. దీంతో ఎన్నికల వలనే దేశంలో కరోనా వేగంగా విస్తరించిందనే ఆరోపణలు వస్తున్నాయి.  కరోనా సమయంలో ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు వస్తుండగా.. తాజాగా మద్రాస్ హైకోర్టు ఘాటుగా స్పందించింది. ఎన్నికల ర్యాలీల సమయాల్లో కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడటంలో విఫలమై ప్రస్తుత కరోనా సంక్షోభానికి కారణమైన భారత ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టాలని తీవ్ర  వ్యాఖ్యలు చేసింది. కరోనా మహమ్మారి సమమయంలో పొలిటికల్ ర్యాలీలను అనుమతిస్తున్నందుకు భారత ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితికి ఎన్నికల సంఘమే కారణమంటూ ఛీఫ్ జస్టిస్ సంజీవ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ‘కోర్టులు పలుమార్లు ఆదేశాలు ఇస్తున్నాయి. అయినా పొలిటికల్ ర్యాలీలు తీస్తున్న రాజకీయ పార్టీలపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మీ ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టాలి’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. కోర్టులు పలుమార్లు ఆదేశించినప్పటికీ ఎన్నికల ప్రచార సమయంలో కొవిడ్ నిబంధనలు అమలు చేయడంలో ఎన్నికల సంఘం విఫలమైందన్న విషయం చీఫ్ జస్టిస్ దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ర్యాలీలు జరుగుతున్నప్పుడు మీరేమైనా వేరే గ్రహం మీద ఉన్నారా.. ఎందుకు చర్యలు తీసుకోలేదు.. అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓట్ల లెక్కింపు రోజు కొవిడ్-19 ప్రోటోకాల్స్ అమలు చేసేందుకు తీసుకోబోయే చర్యలతో కూడిన యాక్షన్ ప్లాన్ బ్లూ ప్రింట్‌ను సమర్పించక పోతే మే2న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియను రద్దుచేస్తామని ఎన్నికల సంఘాన్ని హెచ్చరించింది మద్రాస్ హైకోర్టు ధర్మాసనం.  

ఏపీలో సంపూర్ణ లాక్ డౌన్! మంత్రి నాని క్లారిటీ..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి తీవ్రత అంతకంతకు పెరిగిపోతోంది. పరీక్షలు చేస్తున్న ప్రతి నలుగురిలో ఒకరిక పాజిటివ్ వస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. కొన్ని రోజులుగా రోజుకు 12 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని రోగులతో నిండిపోయాయి. ఆక్సిజన్ కొరతతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. విజయనగరం మహారాజా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఐదుగురు రోగులు చనిపోవడం కలకలం రేపుతోంది.  ఏపీలో ప్రస్తుతం నెట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అయినా కేసులు మాత్రం తగ్గడం లేదు. దీంతో ఢిల్లీ తరహాలోనే ఏపీలోనూ సంపూర్ణ లాక్ డౌన్ పెట్టాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఏపీలో లాక్ డౌన్ పెట్టబోతున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. లాక్ డౌన్ వార్తలపై స్పందించిన వైద్య శాఖ మంత్రి అళ్ల నాని కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో లాక్ డౌన్ పెట్టే పరిస్థితి ఉండదని స్పష్టం చేసిన నాని.. ఈసారి మాత్రం అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పూర్తి స్తాయి లాక్‌డౌన్‌పై  కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు రాలేదన్నారు. అలాంటి మార్గదర్శకాలు వస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. లాక్ డౌన్ పై ఆళ్ల నాని చేసిన తాజా వ్యాఖ్యలతో ఏపీలోనూ సంపూర్ణ లాక్ డౌన్ పెట్టే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు.  రాష్ట్రంలో కరోనా తీవ్రత, చికిత్స, కట్టడి చర్యలపై వైద్యశాఖ అధికారులతో మంత్రి ఆళ్లనాని సమీక్ష నిర్వహించారు.కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ కోసం చాలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. పదివేల పరీక్షలు చేస్తున్నామని చెప్పారు..3000 బెడ్లు పెంచుతున్నామన్నారు. కోవిడ్ కేర్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రెమ్ డెసివిర్, ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తామని ప్రకటించారు. ప్రజలు భాగస్వామ్యంతో కరోనాపై నియంత్రణ సాధించగలమన్నారు.  రాష్ట్రానికి 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని మంత్రి చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ తెప్పిస్తున్నామన్నారు. ఆక్సిజన్ వృథాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెమిడెసివిర్‌ కొరత లేదన్నారు. రెమిడెసివిర్‌ కొరత లేకుండా చూసేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తున్నామన్నారు. 30 శాతం ఆక్సిజన్ వృథా అవుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు ఆళ్ల నాని.   

ఇంద్ర‌కీలాద్రిపై కేసులు.. తిరుప‌తిలో ఆంక్ష‌లు..

ఆధ్యాత్మిక క్షేత్ర‌మైన విజ‌య‌వాడ‌ ఇంద్రకీలాద్రిపై కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా క‌రోనా సోకిన వారి సంఖ్య 52కు చేరింది. సోమవారం ఇద్దరు అర్చకులకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రెండు రోజుల క్రితం కొవిడ్‌తో అర్చకుడు మృతి చెందగా.. మరొక అర్చకుని పరిస్ధితి విషమంగా మారింది. కొవిడ్‌తో జమలమ్మ అనే అటెండర్ మృతి చెందింది. జమలమ్మ మృతితో ఇంద్రకీలాద్రి పై మృతుల సంఖ్య మూడుకు పెరిగింది.  కొవిడ్ కేసుల కార‌ణంగా ఇంద్రకీలాద్రిపై కఠిన ఆంక్షలు విధించారు. దర్శన వేళలను అధికారులు కుదించారు. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు దుర్గమ్మ దర్శనం లభించనుంది. అమ్మవారికి నిర్వహించే అన్ని సేవలతో పాటు పంచహారతులను ఏకాంతంగా నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. కొవిడ్ కేసుల తీవ్రతతో ఉద్యోగులు, అర్చకుల్లో మరింత భయాందోళనలు పెరుగుతున్నాయి. ఆలయంలో విధులు నిర్వహించాలంటేనే అర్చకులు, ఉద్యోగులు వణికిపోతున్నారు.  మ‌రోవైపు.. క‌రోనా ఆధ్యాత్మిక న‌గ‌రాల‌పై పంజా విసురుతోంది. తిరుప‌తిలో భారీగా కేసులు న‌మోద‌వుతున్నాయి. క‌రోనా విజృంభణ కార‌ణంగా తిరుప‌తిని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించారు. న‌గ‌రంలో ఆంక్షలు విధించారు. మంగ‌ళ‌వారం నుంచి మధ్యాహ్నం 2ల‌కే తిరుప‌తిలో షాపులు మూసి వేయ‌నున్నారు. అటు, తిరుపతి తాతాయగుంట గంగమ్మ జాతర ఏకాంతంగా నిర్వహించాలని ఆలయ బోర్డు సభ్యులు నిర్ణయించారు. అలాగే ఏ ఆలయంలోనూ తీర్థప్రసాదాలు ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేశారు.  తిరుపతి నగరాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీషా ప్రకటించారు. తిరుపతిలోని ప్రతి డివిజన్‌లో కరోనా కేసులున్నాయని.. వైరస్‌ కట్టడికి ప్రజలే బాధ్యత తీసుకోవాలని సూచించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో వ్యాపార సంఘాలు, ఆటో, జీపు డ్రైవర్ల యూనియన్లతో ఎమ్మెల్యే  భూమన కరుణాకర్‌రెడ్డి, నగరపాలక కమిషనర్‌ గిరీషా, ఎస్పీ వెంకటప్పలనాయుడు సమావేశమయ్యారు. కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు స్వీయ నియంత్రణ తీసుకోవడంతో పాటు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టాలనేదానిపై సుదీర్ఘంగా చర్చించారు.   మంగ‌ళ‌వారం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరిచేలా తాము నిర్ణయం తీసుకున్నట్లు వ్యాపార సంఘాలు అధికారులకు తెలిపాయి. వైరస్‌ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి నగరాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా నగరపాలక కమిషనర్‌ ప్రకటించారు. 

పరీక్షలు రద్దు చేయండి! గవర్నర్ కు లోకేష్ లేఖ 

దేశమంతా కరోనాతో అల్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాత్రం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంది. కరోనా పంజాతో కేంద్రం తన పరిధిలో ఉన్న అన్ని పరీక్షలను వాయిదా వేయడమో, రద్దు చేయడమో చేసింది. కరోనా తీవ్రత ఎక్కువున్న రాష్ట్రాలన్ని పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి. ఇంటర్ పరీక్షలను వాయిదా వేశాయి. తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలు పరీక్షలను రద్దు చేశాయి. అయితే తెలంగాణ, ఒడిశాతో పోలిస్తే భారీగా కరోనా కేసులు నమోదవుతున్నా జగన్ రెడ్డి సర్కార్ మాత్రం పరీక్షలపై పంతానికి పోతోంది. ఏది ఏమైనా పరీక్షలు నిర్వహిస్తామని చెబుతోంది. విపక్షాలు వద్దని మొత్తుకుంటున్నా.. విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నా... తమ ప్రాణాలు రక్షించాలని టీచర్లు వేడుకుంటున్నా సర్కార్ మాత్రం తన మొండి వైఖరి వీడటం లేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  పదో తరగతి పరీక్షలపై  జగన్ రెడ్డి సర్కార్ పంతం వీడకపోవడంతో గవర్నర్ ను ఆశ్రయించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.  రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దుకు జోక్యం చేసుకోవాలని కోరతూ  లేఖ రాశారు. ప్రభుత్వం నిర్వహించే ఇంటర్, పదో తరగతి పరీక్షలకు 16.3లక్షల మంది హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. కరోనా రెండో దశ తీవ్రతలో పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ప్రాణసంకటంగా మారుతుందన్నారు. దేశంలోని దాదాపు 20 రాష్ట్రాలు 10, 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు వాయిదా వేయటం లేదా రద్దు చేశాయని... ఇందుకు విరుద్ధంగా ఏపీలో పరీక్షలు నిర్వహించాలనుకోవటం కరోనా వైరస్‌ను మరింత వ్యాప్తి చేయటమే అని లేఖలో తెలిపారు.  లక్షలాది మందికి సురక్షితమైన వాతావరణం కల్పించటం అసాధ్యమన్నారు నారా లోకేష్. ఏ ఒక్క విద్యార్థి కరోనా బారిన పడి చనిపోయినా అది క్షమించరాని నేరమే అవుతుందని  చెప్పారు. పరీక్షల నిర్వహణపై తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ వివరాలను గవర్నర్‌ ముందు ఉంచారు. 2 లక్షలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కరోనా కల్లోల సమయంలో పరీక్షల నిర్వహణ వద్దంటూ తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించారని అన్నారు. కరోనాను అదుపు చేసే చర్యలు తీసుకోకపోగా విస్తృతికి మరింత అవకాశం కల్పించే నిర్ణయాలు ఎంతమాత్రం తగదని సూచించారు. తమకున్న విశేష అధికారాలతో పరీక్షల నిర్వహణపై జోక్యం చేసుకోవాలని కోరారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన అభిప్రాయాలతో కూడిన 1778 పేజీలను లేఖకు జత చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. 

క‌రోనాకు కొబ్బ‌రినూనె.. కొవిడ్ వార్డుల్లో మ‌త ప్ర‌చారం.. ఇదేమి రాజ్యం?

కొవిడ్‌కు ఇంత వ‌ర‌కూ మందే లేదు. వ్యాక్సిన్ ఒక్క‌టే నివార‌ణ‌ మార్గం. క‌రోనాకు మందు కనుగొనేందుకు ప్ర‌పంచ దేశాల శాస్త్ర‌వేత్త‌లంతా విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయినా, ఆ మాయ‌దారి మ‌హ‌మ్మారికి మందు చిక్క‌డం లేదు. అలాంటిది.. జ‌స్ట్ కొబ్బ‌రి నూనె రాస్తే చాలు.. క‌రోనా త‌గ్గిపోతుందంటూ ఓ బ్యాచ్ రంగంలోకి దిగిపోయింది. అది అలాంటిలాంటి మామూలు కొబ్బ‌రినూనె కాదు. దేవుడి నూనె. ఆ నూనె త‌ల‌కు రాసి.. ప్రార్థ‌న‌లు చేస్తే క‌రోనా న‌య‌మ‌వుతుందంటూ కాకినాడ జీజీహెచ్ కొవిడ్ వార్డుల్లో మ‌త ప్ర‌చారం నిర్వ‌హిస్తుండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.  తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్ కొవిడ్ వార్డుల్లో మత ప్రచారం జోరుగా సాగుతోంది. కొబ్బరినూనెను తలకు రాసి ఓ ముఠా ప్రార్థనలు చేస్తోంది. ప్రార్థనతో వ్యాధి నయం అవుతుందని హితోక్తులు చెబుతోంది. ఆసుపత్రి సిబ్బంది సహకారంతో యథేచ్ఛగా మత ప్రచారం సాగుతోంది. జనరల్, సర్జికల్ వార్డుల్లోనూ కొబ్బరి నూనె రాస్తూ సదరు ముఠా ప్రార్థనలు నిర్వహిస్తోంది. రాత్రి వేళల్లోనూ మత ప్రచారం నిర్వహిస్తూ కొందరు మహిళలు ప్రార్థనలు చేస్తున్నారు. అయితే వార్డుల్లోకి రాకూడదని ఆస్పత్రి సిబ్బంది వారించినప్పటికీ... ‘నువ్వు ఎక్స్‌ట్రాలు మాట్లాడకు.. నా ఇష్టం.. నేను వస్తానంతే’ అని ఆ మహిళ హెచ్చరించడం ఆ వీడియోలో ఉంది. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరిడెంట్ గానీ.. అధికారులు ఇంతవరకూ స్పందించలేదు. అంటే, పాల‌కులు, అధికారులే ప‌రోక్షంగా ఈ మ‌త ప్ర‌చారానికి సాయ‌ప‌డుతున్నారా? అనే అనుమానం.  క‌రోనాతో ఓవైపు ప్రాణాలు నిలుస్తాయో లేదో అనే ఆందోళ‌న బాధితుల్లో. ఇదే మంచి అవ‌కాశ‌మంటూ.. ప్రాణ సంక‌టంలో ఉన్న వారిని ప్రార్థ‌న‌ల‌తో త‌మ వైపున‌కు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం దారుణం. ఏపీలో పేట్రేగిపోతున్న మ‌త మార్పిడిల‌కు నిద‌ర్శ‌నం. అందుకు, ఇదేనా స‌మ‌యం?  ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఇంత జ‌రుగుతుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్న‌ట్టు? అంటే, వారిపై పెద్ద‌ల ఒత్తిడి ఉందా? అధికారంలో ఉన్న‌వారే కొవిడ్ వార్డుల్లో మ‌త ప్రార్థ‌న‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నారా? అనే అనుమానం అందిరిలోనూ. మ‌రి, దీనికి స‌ర్కారు ఏం స‌మాధానం చెబుతుంది?

దిగొచ్చిన అమెరికా.. మేముసైత‌మంటూ సాయం..

అగ్ర‌రాజ్యం స్వార్థం వీడింది. మేముసైత‌మంటూ దిగొచ్చింది. ఇన్నాళ్లూ త‌మ‌కు అమెరికా ప్ర‌యోజ‌నాలే  ముఖ్య‌మంటూ మొండిగా వ్య‌వ‌హ‌రించింది. వ్యాక్సిన్ త‌యారీకి కావ‌ల‌సిన ముడి స‌రుకు స‌ర‌ఫ‌రా చేయ‌కుండా చీఫ్‌గా బిహేవ్ చేసింది. అధ్య‌క్షుడు బైడెన్ తీరుపై అమెరిక‌న్ల నుంచే ఒత్తిడి పెర‌గ‌డం, ప్ర‌పంచ దేశాల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో.. అమెరికాకు బుద్ది వ‌చ్చిన‌ట్టుంది. కొవిడ్‌పై పోరాటంలో భారత్‌కు కావాల్సిన సహకారం అందిస్తామంటూ యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ హామీ ఇచ్చారు. కరోనా కట్టడిలో ఉపయోగపడే కీలక వైద్య పరికరాలు, ఇతర సరఫరాలను భారత్‌కు పంపనున్నామని తెలిపారు.    మొదటి దశ విజృంభణ సమయంలో అమెరికా ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి నెలకొనగా.. భారత్‌ తమకు అండగా నిలబడిందని బైడెన్‌ గుర్తుచేసుకున్నారు. అదే రీతిలో ఇప్పుడు ఆపదలో ఉన్న భారత్‌కు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే కొవిషీల్డ్‌ టీకా తయారీకి కావాల్సిన ముడిపదార్థాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తూ ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవన్‌ చేసిన ప్రకటనను బైడెన్‌ తన ట్వీట్‌కు జత చేశారు. అలాగే పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కూడా పంపించనుంది.   మరోవైపు భారత్‌లో కొవిడ్‌-19 విజృంభణ ఆందోళకరంగా ఉందని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ అన్నారు. ఈ నేపథ్యంలో కావాల్సిన సాయం అందించేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. సాయం అందిస్తూనే.. హెల్త్‌కేర్‌ వర్కర్లతో పాటు భారత ప్రజల క్షేమం కోసం ప్రార్థిస్తున్నామని తెలిపారు.    భారత్‌లో కొవిడ్‌ రెండో దశ విజృంభణపై ఆ ఇద్ద‌రు నేతలు స్పందించడం ఇదే తొలిసారి. అంతకుముందు భారత్‌కు అండగా నిలవకపోవడంపై సొంత పార్టీలోని భారత సంతతికి చెందిన నేతల నుంచి బైడెన్ పాలకవర్గం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. మిగులు టీకాలతో పాటు అవసరమైన వైద్య పరికరాలు పంపాలని వారు ఒత్తిడి తెచ్చారు. గతంలో భారత్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ వంటి ఔషధాల్ని అమెరికాకు పంపిన విషయాన్ని గుర్తుచేశారు. దీంతో బైడెన్ దిగొచ్చారు. భార‌త్‌కు స‌హాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.  ఇండియాకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన అమెరికాకు మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల‌ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఆక్సిజ‌న్ ప‌రిక‌రాల కొనుగోలులో భార‌త్‌కు మైక్రోసాఫ్ట్ త‌ర‌ఫున‌ మ‌ద్ద‌తిస్తామ‌ని చెప్పారు. భార‌త్‌లో ప‌రిస్థితి చూసి త‌న హృద‌యం ముక్క‌లైంద‌ని బాధ‌ను వ్య‌క్తం చేశారు స‌త్య నాదెళ్ల‌.  అమెరికాకు చెందిన మ‌రో దిగ్గ‌జ సంస్థ గూగుల్ సైతం భార‌త్‌కు స‌హాయం చేసేందుకు ముందుకొచ్చింది. భార‌త్‌కు ఏకంగా 135 కోట్ల విరాళం ఇవ్వ‌నున్న‌ట్టు గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ ప్ర‌క‌టించారు. కొవిడ్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్న గివ్ ఇండియాకు, యూనిసెఫ్‌కు ఈ ఫండ్ అందించనున్నట్టు తెలిపారు.  భారత్‌కు సహాయమందించేందుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా వంటి దేశాలతోపాటు పాకిస్థాన్ కూడా ముందుకొచ్చింది. ఇండియాలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ఫ్రాన్స్, బ్రిటన్ స‌హాయం చేయ‌నున్నాయి. 

తమ్ముడితో.. తల్లి అయిన టీచర్..

ఆమె ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్. లాక్ డౌన్ కావడం వల్ల ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్  క్లాసులు చెపుతుంది. టీచర్ బంధువు అయిన ఒక యువకుడు వాళ్ళ ఇంటికి వచిపోతూ వచ్చిపోతు ఉండేవాడు. ఉన్నట్లుండి ఆ టీచర్ కి వాంతులు అయ్యాయి. తల్లి దండ్రులు ఫుడ్ పడక అనుకున్నారు. రోజులు మారాయి. నెలలు కడిచాయి. కట్ చేస్తే.. ఈ టీచర్ పెళ్లి కాకుండానే తల్లి అయింది. అదేంటని అనుకుంటున్నారా. అయినా.. ఇలాంటి వార్తలు ఎప్పుడు వింటూనే ఉంటాం కదా అనుకుంటున్నారు కాదు. అలా అనుకుంటే మీరు కరోనా మీద కాలు వేసినట్లే. అవును విత్ అవుట్ పెళ్లి, తల్లి కావడం వేరు. ఎవరైనా బావతోనో, భర్త తోనో, లేదంటే లవర్ తోనో తల్లి అవుతారు. కానీ ఈ ప్రైవేట్ టీచర్ వరసకు తమ్ముడు అయ్యే వాడితో తల్లి అయింది. అదెలా అనుకుంటున్నారా.. ఆవిడ చేసిన ఘనకార్యం ఏంటో మీరే చూడండి. కోవిడ్ కారణంగా  స్కూల్స్, కాలేజీ లు తెరవకపోవడంతో తమ బంధువుల అబ్బాయి ఆదీష్ కుమార్ (20) టీచర్ ఇంటికి వస్తూ, పోతూ ఉండేవాడు. ఆదీష్ తనకు వరసయ్యే అక్కతో చనువుగా మెలిగాడు. టీచర్ అయిన అక్క కూడా తమ్ముడే కదా అని కాస్త చనువు ఇచ్చింది. అతనితో సన్నిహితంగా మెలిగింది. ఆ సన్నిహితం కాస్తా సాన్నిహిత్యం గా మారింది. అప్పుడప్పుడు అనుమానం వచ్చి ఈ సీన్ చూస్తున్న తల్లిదండ్రులు కూడా అక్కా, తమ్ముళ్లే కదా అని అడ్డు చెప్పలేదు. తమ్ముడి వరుస అయిన యువకుడితో కూతురు చేసిన పాడుపనిని తలుచుకొని తల్లిదండ్రులు రోధించారు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఆమెకు అబార్షన్ చేయించాలని చూశారు. కానీ అది వీలు కాకపోవడంతో బయట పరువు పోకూడదని యువతిని ఇంట్లోనే బంధించారు. అయితే ఇటీవలే యువతికి నొప్పులు రావడంతో ఇంట్లోనే ఆమెకు పురుడు పోశారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇలాంటి బిడ్డ ఉండకూడదని చెప్పి తల్లిదండ్రులు పసికందును చెత్తకుండీలో పడవేశారు. అయితే, తీవ్ర రక్తస్త్రావంతో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో, ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి మృతి చెందడంతో గుట్టురట్టు అయ్యింది. చుట్టుపక్కల వారి అనుమానాలతో వ్యవహారం పోలీసుల దగ్గరకు చేరింది. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి తల్లిదండ్రులను, తమ్ముడు వరసయ్యే యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన చైన్నై  దిండుగల్‌ జిల్లా పళని  ఆరుకుడిలో జరిగింది.   

కరోనా భారతానికి బాసట! పలు దేశాల నుంచి లిక్విడ్‌ ఆక్సిజన్‌

కరోనా మహమ్మారి భారత్ లో  ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకూ భయంకరంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా ఊహకు అందని విధంగా ఉంటున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. హాస్పిటల్స్ లో ఆక్సిజన్ అందక రోగులు విలవిలలాడుతున్నారు. డాక్టర్లు, నర్సుల చేతుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు.  కరోనా కల్లోలంతో అల్లాడుతున్న భారత్ కు  ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. ఆదుకునేందుకు ముందుకొస్తున్నాయి.  క‌రోనాతో పోరాడుతున్న ఇండియాకు అవ‌స‌ర‌మైన అన్ని రకాల స‌హాయం చేస్తామ‌ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు క‌మ‌లా హ్యారిస్‌ స్పష్టం చేశారు. క‌ష్ట స‌మ‌యాల్లో ఇండియా త‌మ‌కు అండ‌గా నిలిచింద‌ని, ఇప్పుడు తాము కూడా అదే ప‌ని చేస్తామ‌ని బైడెన్, కమలా ట్వీట్టర్ వేదికగా స్పందించారు.ఇండియాకు అత్యవ‌స‌ర‌మైన మందులు, ప‌రిక‌రాలు పంపిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా  మ‌హ‌మ్మారి తొలినాళ్లలో మా హాస్పిట‌ల్స్ కొవిడ్ పేషెంట్లతో కిక్కిరిసిపోయి ఒత్తిడిలో ఉన్న స‌మ‌యంలో ఇండియా మాకు సాయం చేసింది. ఇప్పుడు మేము కూడా ఇండియాకు అవ‌స‌ర‌మైన సాయం చేస్తాం అని బైడెన్ త‌న ట్వీట్‌లో స్పష్టం చేశారు.  భార‌త్‌కు 80 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ను పంపిస్తోంది సౌదీ అరేబియా. అదానీ గ్రూపు, లిండే కంపెనీ సహకారంతో ఈ ఆక్సిజన్‌  పంపుతున్నట్లు  రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అదానీ గ్రూపు చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఈ విష‌యాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు చెబుతున్న‌ట్లు చెప్పారు .ప్రపంచం నలుమూలల నుంచి ఆక్సిజన్‌ను భారత్‌కు తరలించే  మిషన్‌లో నిమగ్నమయ్యామ‌ని అన్నారు. 80 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌తో  నాలుగు క్రయోజనిక్‌ ట్యాంకులు స‌ముద్ర మార్గం ద్వారా  దమ్మామ్‌ నుంచి ముంద్రా పోర్టుకు బయలుదేరాయని అదానీ వివ‌రించారు. అమెరికాతో పాటు ఇంగ్లాండ్, బ్రిటన్, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, జర్మనీ, చైనా  దేశాలు.. భారత్‌ అవసరాల మేరకు సాయం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, భారతీయులు త్వరలోనే మహమ్మారిని ఓడిస్తారని విశ్వసిస్తున్నామని ప్రకటించాయి. భార‌త్‌లో క‌రోనా ప‌రిస్థితి చూసి త‌న హృద‌యం ముక్క‌లైందని  మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య‌నాదెళ్ల తెలిపారు. క‌రోనా వేళ భార‌త్‌కు సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చిన అమెరికాకు స‌త్య‌నాదెళ్ల థ్యాంక్స్  చెప్పారు. ఆక్సిజ‌న్ ప‌రికరాలను కొనుగోలు చేసేందుకు వీలుగా భార‌త్‌కు ఈ స‌మ‌యంలో త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తెలిపారు. భార‌త్ కు సాయం చేసేందుకు త‌మ కంపెనీ కూడా త‌మ వ‌న‌రుల‌ను ఉప‌యోగిస్తుంద‌ని చెప్పారు.

విశాఖలో ఆక్సిజన్.. విజయనగరంలో విషాదం! ఈ పాపం ఆయనదే..నా?

ప‌క్క‌నే మంచి నీటి చెరువు. ఒడ్డున ఉన్న వాళ్లు దాహంతో మృతి. అచ్చం ఇలానే జ‌రుగుతోంది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో. విజ‌య‌న‌గ‌రం  మ‌హారాజా ఆసుప‌త్రిలో కొవిడ్ పేషెంట్స్ ఆక్సిజ‌న్ కొర‌త‌తో చ‌నిపోవ‌డం బాధాక‌రం. ఇది ముమ్మాటికీ ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే. ప‌క్క‌నే ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌లో.. ట‌న్నుల‌కు ట‌న్నులు మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి అవుతోంది. ఇక్క‌డి నుంచి యావ‌త్ దేశానికి ప్రాణ వాయువు స‌ర‌ఫ‌రా జ‌రుగుతోంది. అయినా, విశాఖ ప‌క్క‌నే ఉన్న విజ‌య‌న‌గ‌రంలో ఆక్సిజ‌న్ అందక రోగులు ప్రాణాలు వ‌ద‌ల‌డాన్ని ఏమ‌నాలి? ఇంకేమ‌నుకోవాలి? ఈ త‌ప్పు ఎవ‌రిది? ఆ పాపం ఇంకెవ‌రిది?  నిస్సందేహంగా పాల‌కుల‌దే. ప్ర‌జ‌ల ప్రాణాలు పోతున్న పట్ట‌కుండా.. చేత‌గాక‌, చేతులెత్తేస్తున్న‌.. ఈ అస‌మ‌ర్థ‌ స‌ర్కారుదే. నారా లోకేశ్ మాట‌ల్లో చెప్పాలంటే.. తాడేప‌ల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఐపీఎల్ మ్యాచ్‌లు చూస్తున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డిదే ఈ నేరం.. ఈ పాపం.  మ‌హారాజా ఆసుప‌త్రిలో 290 మంది కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. అందులో 25మంది ఐసీయూలో ఉన్నారు. వారికి అత్య‌వ‌స‌ర చికిత్స చేస్తూ.. ఆక్సిజ‌న్ అందిస్తున్నారు. ఆదివారం అర్థ‌రాత్రి  రోగుల‌కు స‌డెన్‌గా ఆక్సిజ‌న్ అంద‌లేదు. ఆక్సిజ‌న్ లేక ప‌లువురు రోగుల ప్రాణాలు పోవ‌డం క‌ల‌క‌లంగా మారింది. ఆక్సిజ‌న్ ప్రాబ్ల‌మ్‌తో ఇద్ద‌రు మాత్ర‌మే చ‌నిపోయారంటున్నారు విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్‌. కాదు, మా క‌ళ్ల ముందే న‌లుగురు చ‌నిపోయార‌ని చెబుతున్నారు ప్ర‌త్య‌క్ష సాక్షులు. మృతుల సంఖ్య 10 వ‌ర‌కూ ఉండొచ్చంటూ ప్ర‌చార‌మూ జ‌రుగుతోంది. వివాద‌మూ చెల‌రేగుతోంది. మృతులంతా ఆక్సిజ‌న్ లేక‌నే చ‌నిపోయార‌నేది వాస్త‌వం. పైపులు ప‌గిలి, ఆక్సిజ‌న్ ప్రెజ‌ర్‌లో తేడా వ‌చ్చి చ‌నిపోయార‌ని చెబుతున్నారు డాక్ట‌ర్లు.  ఆక్సిజ‌న్ కొర‌త లేద‌నేది వారి మాట‌. అయితే, బాధితుల వ‌ర్ష‌న్ మ‌రోలా ఉంది. హాస్పిట‌ల్‌లో ఆక్సిజ‌న్ కొర‌త ఏర్ప‌డింది. అందుకే, తాము బ‌య‌టి నుంచి ఆక్సిజ‌న్ సిలండ‌ర్స్ కొనుక్కొచ్చి త‌మ వారికి అందిచ్చామ‌ని అంటున్నారు. ఆక్సిజ‌న్ దొర‌క్కే వారు చ‌నిపోయార‌ని అక్క‌డి వాళ్ల ఆరోప‌ణ‌.  ఓవైపు దేశ‌వ్యాప్తంగా ప‌లు హాస్పిట‌ల్స్‌లో ఆక్సిజ‌న్ కొర‌త‌తో ప‌దుల సంఖ్య‌లో రోగులు ప్రాణాలు వ‌దులుతున్నారు. ఈ ఘ‌ట‌న‌లు అన్ని రాష్ట్రాల‌ను, అన్ని ఆసుప‌త్రుల‌కు హెచ్చ‌రిక లాంటివి. వాటిని చూసైనా మ‌న పాల‌కులు అప్ర‌మ‌త్తంగా ఉండాల్సింది. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాపై నిరంత‌రం ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల్సింది. అలాంటిది, పాల‌కుల ఉదాసీన‌త వ‌ల్లే విజ‌య‌న‌గ‌రం, మ‌హారాజా ఆసుప‌త్రిలో రోగులు ప్రాణాలు కోల్పోయార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ ఉక్కు క‌ర్మాగారంలో అంత పెద్ద మొత్తంలో ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి జ‌రుగుతూ.. వివిధ రాష్ట్రాల‌కు ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌ల‌తో విశాఖ ఆక్సిజ‌న్‌ను భారీగా త‌ర‌లిస్తూ.. దేశానికి మ‌న విశాఖ ఊపిరి పోస్తుంటే.. ఆదే ఆక్సిజ‌న్ అంద‌క‌.. మ‌న విజ‌య‌న‌గ‌రం బిడ్డ‌లు బ‌లి అవ‌డ‌మేంట‌నే ప్ర‌శ్న‌లు స‌ర్కారును నిల‌దీస్తున్నాయి. ఇది సీఎం జ‌గ‌న్‌రెడ్డి చేత‌గానిత‌నం కాక మ‌రేమిట‌ని విప‌క్షం నిగ్గ‌దీసి అడుగుతోంది.  సకాలంలో ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే జగన్ రెడ్డి చోద్యం చూస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ అందక రోగులు మృతి బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయిన ఆక్సిజన్ ఇతర రాష్ట్రాలకు తరలిపోతోందన్నారు. ఆక్సిజన్ బ్లాక్‌లో అమ్ముకుంటున్న కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని.. ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

నైట్ కర్ఫ్యూ లో రికార్డింగ్ డ్యాన్సులు 

ఒక వైపు కరోనా వైరస్. మరో వైపు మృతుల శవాలతో  ప్రపంచం అంత ప్రాణభయంతో టెన్షన్ టెన్షన్ గా ఉంది. ఇంకో వైపు కరోనాని కంట్రోల్ చేయడానికి అన్ని దేశాలు తలలు బాదుకుంటున్నాయి. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి 9 తొమ్మిది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. కానీ కొన్ని ప్రాంతాల్లో జనం కరోనా అంటే లెక్కచేయడం లేదు. కర్ఫ్యూ  టైం లో రికార్డింగ్ డాన్సులు వేస్తున్నారు. డ్రామాలు వేస్తున్నారు.    హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలంలోని నక్కగూడెం, మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెం, పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ గ్రామాలలో ఈ కర్ఫ్యూ వర్తించదని తెలుస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా ఆ గ్రామాలలో డ్రామాలతోపాటు ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రికార్డింగ్ డ్యాన్స్ టీమ్ లను తీసుకువచ్చి రికార్డింగ్ డ్యాన్సులను శనివారం రాత్రి నిర్వహించారు. నిర్వాహకులు రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ పోగ్రామ్ లు నిర్వహించినట్లు సమాచారం. వీటిని చూసేందుకు ఒక్కొక్క స్టేజి వద్దకు సుమారు 500 పైగానే స్థానిక ప్రజలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవారు వచ్చినట్లు సమాచారం. కర్ఫ్యూ సమయంలో కరోనా నిబంధనలు పాటించకుండా ఇలా రికార్డింగ్ డ్యాన్స్ లు, డ్రామాలు చేయడంతో వీటిని చూసేందుకు వెళ్ళిన వారిలో ఎంతమందికి కరోనా ఉందోనని ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. చూసేందుకు వెళ్లిన ప్రజలలో ఏ ఒక్కరికీ మాస్క్ లేకపోవడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. రాత్రి 9 దాటితే దుకాణాలతోపాటు రోడ్లపై తిరగొద్దని చెప్పే పోలీసులు ఉన్నతా ధికారులకు ఇక్కడ నిర్వహిస్తున్న డ్రామాలు, డ్యాన్స్ లు కనిపిచడం లేదా అని ప్రజలు బహిరంగంగానే చర్చించుకొంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడి వల్లనే అధికారులు ఈ డ్రామా డ్యాన్స్ లు నిర్వహిస్తున్నారని తెలిసి పోలిసులు కూడా పట్టించుకోవడం లేదని సమాచారం . ఏది ఏమైనా ఈ రికార్డింగ్ డ్రామా డ్యాన్సులు పై అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారా లేక ప్రజాప్రతినిధులు ఒత్తిడి వల్ల వదిలేస్తారో .. వేచిచూడాల్సివుంది.

పీపీఈ కిట్ తో వధువు.. కోవిడ్ పాజిటివ్ వరుడు..

కళ్యాణం వచ్చిన కకొచ్చిన ఆగదంటారు. ఈ వార్త చదివాకా మీరు కూడా అవును అని ముక్కుమీద వేలు వేసుకుంటారు. అతని పేరు శరత్ మన్. ఆమె పేరు అభిరామి. వారిద్దరికీ పెద్దలు పెళ్లి కుదిర్చారు. ముహూర్తం ఫిక్స్ చేశారు. పెళ్లి పత్రికలు వేయించారు. బంధు మిత్రులకు అందరికి ఆహ్వానం అందించారు.  అంతా అనుకున్నట్లు జరుగుతుందని రెండు కుటుంబాలు సంతోషించారు. త్వరలో ఏడు అడుగులు నడువబోతున్నాం. ఇన్నాళ్లు వేరుగా ఉన్న వాళ్ళు ఒక్కటి అవుతున్నామని  ఆ ఇద్దరు మురిషిపోయారు. అంగరంగ వైభవంగా వారి పెళ్లి జరగాలనుకున్నారు. కట్ చేస్తే.. శరత్ మన్ కి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఒక్కసరిగా రెండు కుటుంబాలు నిశ్శబ్దం లో ఉండిపోయాయి. శరత్ మన్ చికిత్స తీసుకుంటున్నాడు. వారు ఇద్దరు ఏం అనుకున్నారో ఏమో. అభిరామి పీపీఈ కిట్ తో శరత్ మన్ దగ్గరికి వచ్చి తాళి కట్టించుకుంది. ఇప్పుడు వాళ్ళ పెళ్లి పిక్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. ఈ సంఘటన కేరళలోని అళప్పుజ వైద్య కళాశాల జరిగింది.  

భార్య‌తో గొడ‌వ‌.. ముగ్గురి మ‌ర్డ‌ర్‌.. సైకో మొగుడు..

భార్య‌తో గొడ‌వ‌. ఆమె వ‌దిలేసి వెళ్లిపోయింది. అత‌ను మాత్రం వ‌ద‌ల‌టం లేదు. మ‌ళ్లీ ఆమె వెంట‌ప‌డుతున్నాడు. ఆమె వ‌ద్దు పొమ్మంటోంది. కాపురానికి వ‌చ్చేదే లేదంటోంది. ఇంట్లో వాళ్ల‌తో చెప్పించాల‌నుకున్నాడు. కానీ, అత‌ని గురించి తెలిసిన కుటుంబ స‌భ్యులు ఆమెకే మ‌ద్ద‌తుగా నిలిచారు. ఇత‌నికి స‌హ‌క‌రించేది లేద‌న్నారు. కొంత కాలంగా వాళ్లింట్లో ఇదే గొడ‌వ‌. ఈసారి అత‌నిలో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. భార్యతో వివాదంలో త‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం లేదంటూ.. మృగంలా మారాడు. ఉన్మాదిలా ప్ర‌వ‌ర్తించాడు. త‌న త‌ల్లిని, చెల్లిని, త‌మ్ముడికి రోక‌లి బండ‌తో కొట్టి..కొట్టి.. చంపాడు. దారుణంగా వారిని హ‌త‌మార్చాడు. క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో జ‌రిగిన ఈ ఘోరం స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.  తెల్లవారుజామున తల్లి ఇంటికి వచ్చిన కరీముల్లా.. నిద్రిస్తున్న తల్లి గుల్జార్ బేగం, తమ్ముడు మహమ్మద్ రఫీ, చెల్లెలు కరీమున్నీసాలను రోకలి బండతో దారుణంగా హతమార్చాడు. ముగ్గురు కుటుంబ స‌భ్యుల‌ను అతి కిరాతకంగా చంపి.. ఆ త‌ర్వాత తీరిగ్గా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని హైదర్‌ఖాన్ వీధిలో జరిగింది ఈ ఘటన. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

త‌గ్గేదే లే.. క‌రోనా క‌ల్లోల‌మే..

మ‌ళ్లీ మూడున్న‌ర ల‌క్ష‌ల కేసులు. మ‌రోసారి 2వేల‌కు పైగా మ‌ర‌ణాలు. దేశంలో క‌రోనా విల‌యం ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. గ‌డిచిన 24 గంట‌ల్లో 3,52,991 పాజిటివ్‌ కేసులు వ‌చ్చాయి. 2,812 మంది మ‌ర‌ణించారు. మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163కి చేరగా.. ఇప్పటివరకు 1,92,123 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ కేసుల్లో క్రియాశీల కేసుల వాటా 15.82 శాతానికి పెరిగింది. కొవిడ్‌తో బాధపడుతోన్న వారి సంఖ్య 28,13,658కి చేరింది. ఆదివారం ఒక్కరోజే 2,19,272 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా కోటీ 43లక్షల మంది వైరస్‌ను ఓడించ‌గా.. రికవరీ రేటు 83.05 శాతానికి పడిపోయింది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం 14,19,11,223 మంది వ్యాక్సిన్ తీసుకువ‌డం ఒక్క‌టే కాస్త ఆశాక‌ర ప‌రిణామం.    ఎప్ప‌టిలానే మ‌హారాష్ట్ర‌లో మ‌ర‌ణమృదంగం మోగుతోంది. దేశవ్యాప్తంగా నమోదవుతోన్న మొత్తం మరణాల్లో మహారాష్ట్ర వాటానే అధికంగా ఉంది. తాజాగా అక్కడ 832 మంది మరణించగా.. 66వేలకు పైగా పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. 7 లక్షలమందికి పైగా కరోనాతో బాధపడుతున్నారు.  అటు, దేశ రాజ‌ధాని ఢిల్లీలో 22,933 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఆదివారం 350 మంది ప్రాణాలు వదిలారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 35వేలు, కర్ణాటకలో 34వేల మందికి కరోనా సోకింది. కేరళ, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్, రాజస్థాన్‌లో వైరస్ భారీగా విజృంభిస్తోంది.   తెలంగాణ‌లోనూ క‌రోనా కుమ్మేస్తోంది. కొత్త‌గా 6,551మందికి పాజిటివ్ వ‌చ్చింది. తాజాగా, 43మంది చ‌నిపోగా.. 3,804 మంది కోలుకున్నారు. జీహెచ్ఎమ్‌సీ ప‌రిదిలో 1,418 మందికి క‌రోనా సోక‌గా.. తెలంగాణ‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 65,597కి చేరింది. 

ఆక్సిజన్ అందక ఐదుగురు మృతి! విజయనగరంలో ఘోరం 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా  మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. రోజు రోజుకు కేసులతో పాటు మరణాలు పెరిగిపోతున్నాయి. ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్  అన్ని రోగులతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా దారుణ దృశ్యాలే కనిపిస్తున్నాయి. హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరతతో చూస్తుండగానే కరోనా రోగులు ప్రాణాలు విడుస్తున్నారు.  ఏపీలోని విజయనగరం జిల్లా ఆస్పత్రిలో ఘోరం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆక్సిజన్ అందక ఐదుగురు కరోనా పేషెంట్లు మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని స్థానిక వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికీ  ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరణ  కాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ప్రైవేట్ ఆక్సిజన్ సిలిండర్ల కోసం రోగుల బంధువులు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రి ప్రాంగణంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే వార్డుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులు తీవ్రభయాందోళన చెందుతున్నారు.  విజయనగరం ప్రభుత్వ హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక ఐదుగురు చనిపోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ..  సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ అందక ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతుంటే.. సీఎం జగన్ ఐపీఎల్ మ్యాచ్‌లు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి గారు పేరాసిట్మాల్, బ్లీచింగ్ కబుర్లు మాని ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని లోకేష్ సూచించారు.  ‘‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు పోతుంటే తాడేపల్లి నివాసంలో జగన్ రెడ్డి గారు ఐపీఎల్ మ్యాచ్లు మిస్ అవ్వకుండా చూస్తున్నారు. విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఐదుగురు చనిపోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ప్రతిపక్షంగా ప్రతి రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వివరిస్తున్నా ప్రభుత్వం మొద్దునిద్ర పోయింది. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, మందులు అందక ప్రజలు నరకయాతన పడుతున్నారని నారా లోకేష్ ట్వీట్ చేశారు.  

ముక్కు నేలకు రాస్తానంటున్న హరీష్! 

కరోనా కల్లోలంలోనూ తెలంగాణలో రాజకీయ మంటలు ఆగడం లేదు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలు, సవాళ్లతో కత్తులు దూస్తున్నారు అధికార, విపక్ష నేతలు. సిద్దిపేట ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. సిద్దిపేటలో జోరుగా ప్రచారం చేస్తున్న మంత్రి హరీష్ రావు... విపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. తాను చెప్పేది అసత్యమైతే ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేశారు.  సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి హరీష్‌రావు. బీడీ కార్మికులకు జీఎస్‌టీ పెట్టి బీజేపీ ప్రభుత్వం వారి చాట గుంజుకుని పని లేకుండా చేసిందని విమర్శించారు. భారత దేశంలో ఏనాడైనా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు బీడీ కార్మికులకు రూపాయి ఇచ్చరా.. ఇస్తే ముక్కు నేలకు రాస్తా అంటూ సవాల్ విసిరారు. మండు వేసవిలో కూడా ఇంటింటికీ నల్లా ద్వారా త్రాగునీరు ఇస్తున్నామన్నారు. అన్నం పెట్టిన చేయిని కాపాడుకుంటరా లేక ఓట్ల కోసం వచ్చి  నెత్తి మీద చేయి పెట్టేవాళ్ళు కావాలా అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కోసం బడ్జెట్‌లో 11 వందల కోట్లు పెట్టామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఎవరు గెలిస్తే అభివృద్ది జరగుతుందో ఆలోచించుకుని ఓటేయాలని సిద్దిపేట ప్రజలను కోరారు మంత్రి హరీష్ రావు.                   

అనుకున్నదొక్కటి అయినదొకటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట..

అనుకున్నదొక్కటి అయినదొకటి. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. అదేంటి పాట పాడుతున్నడు అనుకుకుంటున్నారా.. మనిషికి దురాశ పెరిగితే ఇలాంటి పాటలు మాత్రమే పాడుకోవాలి. మనిషి కి  ఆశ ఉండాలి. కానీ అత్యాశ ఉండకూడదు అంటారు మన పెద్దవాళ్ళు. కానీ  ఈ మధ్య కాలం లో మనుషులకు అత్యాశ ఎక్కువైయింది. అందుకోసం ఈజీ మనీ కి అలవాటు పడ్డారు.  ఈజీ గా డబ్బులు వస్తాయంటే  ఆలస్యమెందుకు అడుగేసేయి ముందుకు అంటూ వెనక ముందు చూసుకోవడం లేదు. చివరికి చిక్కులో పడుతున్నారు. ఇప్పుడున్న సమాజంలో ఒకడి ఆశ, అవసరం.  మరొకడికి పెట్టుబడిగా మారుతుంది. కొంత మంది అక్రమంగా డబ్బులు దండుకోవడం  కోసం  రకరకాలుగా మోసాలకు పాలుపడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మోసపోయే వాళ్ళు అనంత కాలం. మోసం చేసే వాళ్ళు ఉంటున్న్టే ఉంటారు. గత కొన్ని రోజుల కింద నాగ స్వరం కాయలు  ఉంటే కోట్లు వస్తాయంటూ ముమ్మరంగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.. ఇప్పుడు తాజాగా మోసగాళ్లు కొత్త నాటకానికి తెరలేపారు.  ఓపెన్ చేస్తే.. తెలంగాణ ప్రాంతం. అది కామారెడ్డి జిల్లా. చిన్న మల్లారెడ్డి గ్రామము. ఈ గ్రామానికి చెందిన కస్తూరి నర్సింహులు అనే వ్యక్తికి  ఒక అనౌన్ నెంబర్ నుండి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ లో అవతలి వ్యక్తి మీ దగ్గర పాత ఐదు రూపాయల నోటు ఉందా..? అయితే మీరు లక్షాధికారి అయిపోవచ్చు..? అయితే ఆ ఐదు రూపాయల నోటు మీద ట్రాక్టర్ బొమ్మ ఉండాలి. అప్పుడు మీకు 11.74  లక్షలు వస్తాయంటూ ఆశ చూపి అస్త్రం వేశారు.  కట్ చేస్తే..  డబ్బులకు ఆశపడిన నర్సింహులు సంబరంతో నోటుపై ట్రాక్టర్ బొమ్మ ఉందని దుండుగులకు చెప్పాడు. అయితే మీకు రూ.11.74 లక్షలు ఐటీ, అకౌంట్ క్లియరెన్స్ ద్వారా అకౌంట్‎లోకి పంపుతామని ఆశ చూపించి నర్సింహులును నమ్మించారు. కానీ, మీకు ఆ డబ్బులు రావాలంటే మాకు ట్యాక్స్ రూపంలో కొంత చెల్లించాల్సివుంటుందని చెప్పారు. వారు చెప్పినట్లుగానే ఆ దుండగులకు కొంత డబ్బును విడతల వారీగా రూ.8.35 లక్షలు ఆన్‎లైన్ ద్వారా చెల్లించారు. డబ్బులు ట్రాన్స్‎ఫర్ చేశాక దుండగుల నుంచి ఎటువంటి సమాచారం లేదు. దీంతో తను మోసపోయాడని తెలుసుకున్న నర్సింహులు పోలీస్ స్టేషన్‎కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఫోన్ కాల్ ఎక్కడ నుంచి వచ్చిందని పోలీసులు ఆరా తీయగా పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   

ఊపిరి తీయాలనుకున్న సంస్థే ఊపిరి పోస్తోంది..  సాహో విశాఖ స్టీల్ ప్లాంట్ 

ఊపిరి తీయాలనుకున్నారు.. అమ్మకానికి పెట్టేశారు.. కార్మికులు, జనాల ఆందోళనను పట్టించుకోలేదు. అయితే ఊపిరి తీయాలనుకున్న సంస్థే నేడు దేశప్రజలకు ప్రాణం పోస్తోంది. ప్రాణ వాయువును అందించి ప్రజల ప్రాణాలు నిలబెడుతోంది. అమ్మకానికి పెట్టాలని చూసిన సంస్థే.. ఆయుషు పోస్తూ అపర సంజీవనిలా నిలుస్తోంది. దేశానికి ప్రాణం పోస్తున్న ఆ సంస్థే ఆంధ్రుల హక్కుగా పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్.        కరోనా కల్లోలంతో దేశమంతా దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్ లేక రోగులు విలవిలలాడుతున్నారు. విపత్కర సమయంలో దేశానికి పెద్ద దిక్కుగా నిలుస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారం. ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసి దేశానికి ప్రాణం పోస్తోంది. కరోనా సోకి మృతువుతో పోరాడుతున్న వేలాది మందికి జీవధారగా మారింది. దేశమంతా ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ వైపు చూస్తుందంటే దాని విలువ ఎంత ముఖ్యమే అర్ధం చేసుకోవచ్చు.  విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏంటీ?...ఆక్సిజన్ తయారు చేసి కరోనా రోగుల కు అందించడమేంటి అనుకుంటున్నారా.. ఇనుమును తయారు చేసే క్రమంలో భూమి లో దొరికే హెమటైట్  లేదా ఫెర్రస్ ఆక్సైడ్ లేదా ఐరన్ ఓర్ ను స్టీల్ గా మార్చాలి అంటే 2000 డిగ్రీల సెల్సీయస్ వద్ద బ్లాస్ట్  ఫర్నేస్ లో దానిని మండించి కరిగించాల్సి వుంటుంది. ఈ ప్రక్రియలో కర్బన సమ్మెళనమైన  "కోక్ " ను మరియు ఐరన్ ఓర్ ను దానికి కాల్షియం కార్బోనేట్ ను కలిపి మండిస్తూ ఇనుమును వేరు చేయడానికి ఆక్సిజన్ ను రసాయన ప్రక్రియ కోసం ఫర్నేస్ లోకి పంపుతారు..అంటే  హెమటైట్ ముడి ఖనిజం నుండి స్టీల్ వేరు కావడానికి ఆక్సిజన్  కావాలన్న మాట. మరి దానికి కావలసిన ఆక్సిజన్ ఎక్కడినుండి తేవాలీ ? అందుకే స్టీల్ ఫ్యాక్టరీ సొంతంగా ఆక్సిజన్ తయారీ యూనిట్ ను నెలకొల్పుకుంది. ఈ ఆక్సిజన్ తయారీ యూనిట్ నుండే మనకు ఆక్సిజన్ తయరు చేసి కరోనా రోగుల ప్రాణాలు నిలపడానికి సరఫరా చేస్తోంది. వాతావరణంలోని గాలి లో 21% ఆక్సిజన్ మరియు 78% నైట్రోజన్ ఉంటుంది.  Air compressor  ద్వారా గాలిని తీసుకొని మలినాలు వేరుచేస్తారు. ప్రత్యేక కోల్ టవర్ ద్వార  మలినాలు వేరు చేసి జియోలైట్  బెడ్ తో నింపబడిన  PSA generator  ద్వారా నైట్రొజన్ ను వేరు చేసి ఆక్సిజన్ సేకరిస్తారు.ఇలా పలుమార్లు శుద్దీకరించబడిన ఆక్సిజన్ ను మెడికల్ ఆక్సిజన్ గా సిలిండర్ లలొ నింపి సరఫరా చేస్తారన్నమాట. విశాఖ స్టీల్ ప్లాంట్ ను జగన్ రెడ్డి సర్కార్ సహకారంతో అమ్మాలని చూస్తే.. ఆ సంస్థే నేడు దేశానికి జీవం పోస్తోంది. "యాభైరెండు అంగుళాల ఛాతీ" కి కూడా అవసరమైతే ఊపిరిలూదడానికి సిద్దంగా ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటూ ప్రధాని మోడీ టార్గెట్ గా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికైనా  మోడీ సర్కార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్ర ప్రజలు కోరుతున్నారు.   

ఏపీ, తెలంగాణ‌కి ఆక్సిజన్ ఆపేయండి.. ఇదేమి శాడిజం?

దేశ‌మంతా ఆక్సిజ‌న్ డిమాండ్‌. దేశ‌వ్యాప్తంగా కొవిడ్ క‌ల్లోలం. అందుబాటులో ఉన్న ఆక్సిజ‌న్‌ను.. అవ‌స‌రం మేర‌కు అవ‌స‌రం ఉన్న‌చోట‌కు త‌ర‌లిస్తోంది కేంద్రం. ఇదే ఇప్పుడు రాష్ట్రాల మ‌ద్య చిచ్చుకు కార‌ణ‌మ‌వుతోంది. ఢిల్లీకి రావ‌ల‌సిన ఆక్సిజ‌న్‌ను యూపీ ఆపేస్తోందంటూ కేజ్రీవాల్ మొత్తుకుంటున్నారు. ఆ వివాదం స‌మ‌సిపోకుండానే.. మ‌రో రాష్ట్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌పై ప‌డి ఏడుస్తోంది. మా రాష్ట్రంలో త‌యార‌య్యే ఆక్సిజ‌న్‌ను ఏపీ, తెలంగాణ‌కు త‌ర‌లించ‌ద్దొంటూ ఏకంగా కేంద్రానికి లేఖ రాసింది త‌మిళ‌నాడు. ప్ర‌ధాని మోదీకి త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామి రాసిన లేఖ క‌ల‌క‌లం రేపుతోంది.  తమిళనాడు నుంచి తెలుగురాష్ట్రాలకు వెళ్తున్న 80 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సరఫరాను వెంటనే నిలిపివేయాలని కోరుతూ సీఎం పళనిస్వామి.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని, ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత వేధిస్తోందని అందువల్ల తమ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్న ప్రాణవాయువును తక్షణమే నిలిపివేయాలని కోరారు. రాష్ట్రంలో 400 మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుండగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 310 మెట్రిక్‌ టన్నులు ఖర్చవుతోందని లేఖలో తెలిపారు. కానీ, కొవిడ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో భవిష్యత్‌లో 450 మెట్రిక్‌ టన్నుల ప్రాణవాయువు అవసరయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలుగురాష్ట్రాలకు సరఫరా అవుతున్న 80 మెట్రిక్‌టన్నుల సరఫరాను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని లేఖలో కోరారు.    గతఏడాదితో పోల్చుకుంటే ప్రస్తుతం 58 వేల కేసులు అధికంగా నమోదవుతున్నాయని పళని వివరించారు. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి అవసరమైనంత ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించలేదని లేఖలో పేర్కొన్నారు ‘‘ రాష్ట్రంలో ప్రస్తుతం 310 మెట్రిక్‌టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ ఖర్చవుతోంది. కానీ కేంద్రం మాత్రం 220 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కేటాయించింది. శ్రీపెరంబదూర్‌లో ఉత్పత్తి అవుతున్న 80 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ తెలుగు రాష్ట్రాలకు వెళ్లిపోతోంది.’’ అని లేఖలో రాశారు.  తమిళనాడు కంటే తక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లోనూ ఉక్కు కర్మాగారాలు ఉన్నాయనీ, అక్కడ ఉత్పత్తి అయిన ఆక్సిజన్‌ను ఆయా రాష్ట్రాలు వినియోగించుకుంటే శ్రీపెరంబదూర్‌లో ఉత్పత్తి చేస్తున్న ఆక్సిజన్‌ను చెన్నై లోని వివిధ ఆస్పత్రులకు అందజేయవచ్చని అన్నారు. అలాగని తమిళనాడు ఎలాంటి ఆంక్షలు పెట్టదని, పొరుగు రాష్ట్రాలకు వీలైనంత వరకు తోడ్పాటు అందిస్తుందని స్పష్టం చేశారు. కానీ, ఇక్కడి అవసరాలకు సరిపడా ఆక్సిజన్‌ సరఫరా లేకపోతే చెన్నై సహా మరికొన్ని జిల్లాల్లో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడుతుందని అన్నారు.   త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామి.. ప్ర‌ధాని మోదీకి రాసిన లేఖ రాష్ట్రాల మ‌ధ్య వైష‌మ్యాల‌ను పెంచేలా ఉంద‌ని జాతీయ వాదులు త‌ప్పుబ‌డుతున్నారు. ఆక్సిజ‌న్ అవ‌స‌రం ఉన్న చోట‌కే కేంద్రం ప్రాణ‌వాయువును స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ని చెబుతున్నారు. ఇలాంటి సున్నిత విష‌యాల్లో కాస్త సంయ‌మ‌నం పాటించాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి హిత‌వు ప‌లుకుతున్నారు.