క‌రోనా క‌ల్లోలంలో ప‌రీక్ష‌లా? జ‌గ‌న్ మూర్ఖ‌త్వంపై చంద్ర‌బాబు ఫైర్‌

జ‌గ‌న్‌ది వితండ వాదం. మూర్ఖ‌త్వం. లాక్‌డౌన్  పెట్టాలనే ఆలోచనలో సర్వత్రా ఉంటే పరీక్షలు పెట్టాలని చూడటం తగదు. పరీక్షా కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోదని.. విద్యార్థులకు రవాణా, ఇతర విధాలుగా కరోనా సోకే ప్రమాదం ఉందన్నారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. దేశవ్యాప్తంగా పరీక్షలు వాయిదా వేస్తే, జగన్ వారికంటే మేధావా అని నిలదీశారు. వితండ వాదం, మూర్ఖత్వంతోనే రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  కరోనా తీవ్రత మరీ ఎక్కువగా ఉన్న చోట లాక్‌డౌన్ పెట్టుకుని వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతిని తాకట్టుపెట్టొద్దన్నారు. 18ఏళ్ల పైబడిన వారికి టీకా ఇచ్చే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశ్నించారు. క్లిష్ట ప‌రిస్థితుల్లోనూ రాష్ట్ర ప్ర‌భుత్వం బాధ్య‌తారహితంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఏపీలో క‌రోనా పాజిటివ్ రేటు 25.8 శాతానికి పెరిగింది. కోర్టుల‌కు కూడా త‌ప్పుడు లెక్క‌లు చెబుతున్నారు. క‌రోనాను ఆరోగ్యశ్రీలో చేర్చామ‌ని చెప్ప‌డం అబ‌ద్ధం.. అంటూ తీవ్ర స్థాయిలో మండి ప‌డ్డారు చంద్ర‌బాబు. వివిధ దేశాల వైద్య నిపుణుల సహకారంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తమ వంతు సహకరిస్తామని తెలిపారు. పార్టీ పరంగా ఎంతవరకు సాయమందించగలమో అంత వరకూ చేస్తామన్నారు టీడీపీ అధినేత‌. అంద‌రినీ క‌లుపుకుపోయి ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు.   

త‌గ్గేదే లే.. ప్రాణాల‌కంటే ప‌రీక్ష‌లే ముఖ్య‌మా?

త‌గ్గేదే లే. విద్యార్థుల ప్రాణాల‌కు ప్ర‌మాదం ఉన్నా వెన‌క్కి త‌గ్గేదే లే. కష్టమైనా, భారమైనా పరీక్షలు నిర్వహిస్తాం. ఇదీ సీఎం జ‌గ‌న్ తాజా ప్ర‌క‌ట‌న‌.  పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై పలువురు విమర్శలు చేస్తున్నారని.. విపత్కర సమయంలోనూ అగ్గి పెట్టాలని చూస్తున్నారని సీఎం జ‌గ‌న్‌ మండిపడ్డారు.  విద్యార్థుల భవిష్యత్‌ సర్టిఫికెట్లపైనే ఆధారపడి ఉంటుందని.. పరీక్షల నిర్వహణకు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం లేదని జగన్‌ అన్నారు. పరీక్షలు నిర్వహించాలో వద్దో కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని వివరించారు.   ‘పరీక్షలు నిర్వహించకపోతే సర్టిఫికెట్లలో పాస్‌ అనే ఉంటుంది. పాస్‌ సర్టిఫికెట్లతో విద్యార్థులకు మంచి సంస్థల్లో సీట్లు వస్తాయా? విద్యార్థులకు ఉన్నత భవిష్యత్‌ ఉండాలనే పరీక్షలు నిర్వహిస్తున్నాం. పరీక్షలు రద్దు చేయాలని చెప్పడం చాలా సులభమైన పనే. పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. రాష్ట్రంలో ప్రతి విద్యార్థి భవిష్యత్‌కు భరోసా ఇస్తున్నా. జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించడం కష్టతరమైన పని. కష్టమైనా, భారమైనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరగకుండా పరీక్షలు నిర్వహిస్తాం. పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటున్నామని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నా’ అని జగన్‌ అన్నారు.   ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై విద్యార్థులు, త‌ల్లిదండ్రుల నుంచి తీవ్ర ఒత్తిడి వ‌స్తుండ‌టంతో సీఎం జ‌గ‌న్ ఈ ప్ర‌క‌ట‌న చేశారు. జ‌గ‌న్ చెప్పిందే నిజ‌మైతే.. ఇంత చిన్న విష‌యం కేంద్రానికి తెలీదా?  దేశంలోకే అత్యున్నత విద్యా బోర్డులైన సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలు ఎందుక‌ని ప‌ది పరీక్ష‌లు ర‌ద్దు చేశాయి? ఆ జాతీయ సంస్థ‌ల‌కు తెలీదా.. స‌ర్టిఫికెట్ల‌లో పాస్ అనే ఉంటుంద‌ని?  వారికి తెలీదా.. పాస్ స‌ర్టిఫికెట్ల‌తో విద్యార్థుల‌కు మంచి సంస్థ‌లో సీట్లు వ‌స్తాయో, రావో? ఇప్ప‌టికే అనేక రాష్ట్రాలు సైతం ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేశాయి. మ‌రో తెలుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌లోనూ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయి. మ‌రి, ఆ రాష్ట్రాలు.. ప‌ని లేక ప‌రీక్ష‌లు ర‌ద్దు చేశాయా? ఎగ్జామ్స్ పెట్ట‌డం చేత‌గాక ప‌రీక్ష‌లు వ‌ద్ద‌నుకున్నాయా? ఒక్క జ‌గ‌న్‌కు మాత్ర‌మే విద్యార్థుల భ‌విష్య‌త్ ప‌ట్టిందా?  మిగ‌తా.. కేంద్ర‌, రాష్ట్రాలు త‌మ పిల్ల‌ల భ‌విష్య‌త్తును కాల‌రాస్తున్నాయా? అని పేరెంట్స్ ప్ర‌శ్నిస్తున్నారు. ప‌రీక్ష‌ల‌కంటే ప్రాణాలు ముఖ్య‌మ‌నే చిన్న లాజిక్ జ‌గ‌న్ మ‌రిస్తే ఎలా అని నిల‌దీస్తున్నారు. క‌రోనా కాటేస్తున్న ప్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో విద్యార్థుల ప్రాణాల‌కంటే ప‌రీక్ష‌లే ముఖ్య‌మ‌న్న‌ట్టు సీఎం జ‌గ‌న్ మాట్లాడిన తీరును తీవ్రంగా త‌ప్పుబడుతున్నారు, వ్య‌తిరేకిస్తున్నారు విద్యార్థుల త‌ల్లిదండ్రులు. మ‌రి, జ‌గ‌మొండి జ‌గ‌న్ వారి ఆవేద‌న‌ను వింటారా? ప‌ట్టించుకుంటారా? ప‌రీక్ష‌ల‌పై ఇలానే పంతానికి పోతారా?

అవినీతి నేతల భరతం పట్టండి! సీజేఐకి కాపు సంఘం నేత లేఖ 

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ  రమణకు సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి,  ఏపి రాష్ట్ర అధ్యక్షులు వేల్పూరి శ్రీనివాసరావు లేఖ రాశారు. దేశంలో ఉన్న అవినీతి ప్రజాప్రతినిధుల భరతం పట్టాలని కోరారు. అనేక మంది అత్యంత అవినీతిపరులైన నేతలు ప్రస్తుతం కీలక పదవుల్లో ఉన్నారన్నారు. అవినీతికి సంబంధించి సిబిఐ, ఈడి కేసులలో ముద్దాయిలుగా ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు , ఎమ్మెల్యేలు బెయిల్ పై సంవత్సరాల తరబడి ఉండటం ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమన్నారు శ్రీనివాసరావు. అవినీతి కేసుల్లో చిక్కుకున్న బడా వ్యాపారులు, కొందరు అధికారులు, ఆర్థిక ఉగ్రవాదులు కూడా బయటే ఉన్నారని చెప్పారు.  సీబీఐ, ఈడీ కేసుల్లో  ఉన్నవారి బెయిల్  వెంటనే రద్దు చేసి, 100 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి 6 నెలలులోనే విచారణ పూర్తి చేసి కఠిన శిక్షలు వేయాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఈ ముద్దాయిలు రాజకీయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని చేసిన లక్షల కోట్ల దోపిడి కారణంగా భారత ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినదని తెలిపారు. ప్రజాప్రతినిధులు అక్రమంగా దోచుకున్న  సొమ్మంతా ప్రజల ఆస్తి అయినందున తక్షణం జప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు.  సామాన్య రైతుబిడ్డ స్థాయి నుండి సుప్రీంకోర్ట్ ప్రధానన్యాయమూర్తిగా ఎదిగిన మీరు భారతదేశ యువతకు మార్గదర్శకులన్నారు శ్రీనివాసరావు సీజేఐకి రాసిన తన లేఖలో పేర్కొన్నారు. తమరి సారధ్యంలో భారతదేశం న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. గతంలో కేంద్ర న్యాయశాఖా మంత్రిగా పని చేసిన  పి.శివశంకర్‌..  న్యాయ వ్యవస్థలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారని వేల్పూరి శ్రీనివాసరావు తన లేఖలో గుర్తు చేశారు. తమరు కూడా రాజ్యాంగ రక్షణకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటంకోసం న్యాయ వ్యవస్థలో వున్న లోపాలు సరిచేసి అనేక కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టి న్యాయ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను కోరారు.  

సంగంపై క‌క్ష‌.. న‌రేంద్ర‌పై ర‌చ్చ‌.. కేసు నిలుస్తుందా?

ధూళిపాళ్ల న‌రేంద్ర‌కు సంకెళ్లు. సంగం డెయిరీ స‌ర్కారు పాలు. అనుకున్న‌దంతా అయింది. ముందు న‌రేంద్ర‌ను సైడ్ చేశారు. ఆ వెంట‌నే సంగంను స్వాహా చేశారు. హ‌మ్మ‌య్యా.. అని ప్యాలెస్‌లో పైశాచిక ఆనందం పొందుతున్నారు. అయితే, ఇల్లు అల‌క‌గానే పండ‌గ అయిపోదు. ఇలాంటి ఆక్ర‌మ‌ణ‌లు కోర్టుల్లో నిల‌బ‌డ‌వు. గ‌తంలో వైఎస్సార్ హ‌యాంలోనూ ఓసారి ఇలానే జ‌రిగింది. సంగం డెయిరీ టార్గెట్‌గా రాష్ట్రంలోని అన్ని డెయిరీల పాల‌క వ‌ర్గాల‌ను ర‌ద్దు చేశారు. అప్పటి ఛైర్మ‌న్ రాజ‌న్‌బాబు కోర్టుకు వెళితే.. జ‌డ్జి చివాట్లు పెట్టి మ‌రీ పాల‌క వ‌ర్గాన్ని పున‌రుద్ద‌రించారు.  ఒక‌టా రెండా.. ద‌శాబ్దాల చ‌రిత్ర‌. పాడి రైతుల‌తో అనేక త‌రాల అనుబంధం. అది కేవలం సంగం డెయిరీ మాత్ర‌మే కాదు.. అది గుంటూరు రైతుల‌ ఆత్మాభిమానం. సంగం పాలు తాగిన ప్ర‌తీ ఒక్క‌రి నిండుగౌర‌వం. అలాంటి సంగం డెయిరీని.. ఒక్క జీవోతో ల‌క్ష‌లాది మంది రైతుల నుంచి దూరం చేస్తామంటే కుదురుతుందా? ఆగమేఘాల మీద డెయిరీని స్వాధీనం చేసేసుకుంటే అంతా అయిపోయిన‌ట్టేనా?  కోర్టులు, చ‌ట్టాలు లేవా? అంటూ ఇప్ప‌టికీ ధీమాగా ఉంటున్నారు ఇక్క‌డి రైతులు. మా సంగం.. ఎప్ప‌టికైనా మాకే సొంతమంటున్నారు.  ప్ర‌భుత్వ కుట్ర‌ల‌కు ఛైర్మ‌న్‌ ధూళిపాళ్ల న‌రేంద్ర మొన‌గాడిలా అడ్డు నిలిచాడు. అందుకే, అరెస్టుతో ముందు ఆయ‌న్ను అడ్డుతొల‌గించుకున్నారు. ధూళిపాళ్ల‌పై పెట్టిన కేసు కోర్టులో నిల‌వ‌నే నిల‌వ‌ద‌ని న్యాయ‌నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడో జ‌రిగిన వ్య‌వ‌హారానికి.. ఇప్పుడు కేసు పెట్టి.. న‌రేంద్ర‌ను ఇరికించే ప్ర‌య‌త్నం చేశార‌ని అంటున్నారు. ఆ కేసులో ఎలాంటి బ‌లం లేద‌ని చెబుతున్నారు.  ధూళిపాళ్ల నరేంద్రపై దాఖ‌లైన FIRలో ప్ర‌ధాన‌మైన‌వి రెండు ఆరోప‌ణ‌లు. 10 ఎక‌రాల స్థ‌లాన్ని సంగం డైరీ ఫౌండింగ్ ఛైర్మ‌న్ డీవీసీ ట్ర‌స్ట్‌కు మ‌ర‌ల్చార‌నేది ఒక ఆరోప‌ణ‌. ఆ 10 ఎక‌రాల వెనుక ఆస‌క్తిక‌ర చ‌రిత్ర ఉంది. 1978లో సంగం రైతులు ఒక రోజు పాలు విరాళంగా ఇస్తే.. ఆ సొమ్ముతో 34 ఎక‌రాల స్థ‌లాన్ని కొన్నారు. అందులోంచి 10 ఎక‌రాలను 2000 సంవ‌త్స‌రంలో డీవీసీ ట్ర‌స్ట్‌కు బ‌ద‌లాయించారు. మ‌రి, ఆ స‌మ‌యంలో సంగం డెయిరీ ఛైర్మ‌న్‌గా ధూళిపాళ్ల లేనే లేదు. న‌రేంద్ర హ‌యాంలో జ‌ర‌గ‌ని బ‌ద‌లాయింపున‌కు, నరేంద్ర ఛైర్మ‌న్‌గా లేని స‌మ‌యంలో జ‌రిగిన వ్య‌వ‌హారానికి.. న‌రేంద్ర‌పై ఆరోప‌ణ చేస్తూ కేసు పెట్ట‌డం ఏసీబీకే చెల్లింది.  ధూళిపాళ్ల ఛైర్మ‌న్ అయ్యాక‌.. ఆ 10 ఎక‌రాల స్థ‌లంలో పాడి రైతులు, డెయిరీ ఉద్యోగుల కోసం హాస్పిట‌ల్ క‌ట్టించారు. ఆ ఆసుప‌త్రిలో సంగం స‌భ్యులంద‌రికీ స‌గం ఖ‌ర్చుకే చికిత్స అందిస్తున్నారు. అది ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. 21 ఏళ్ల క్రితం జ‌రిగిన విష‌యానికి ఇప్పుడు ధూళిపాళ్ల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేస్తే కోర్టులో ఇలాంటి కేసులు నిల‌బ‌డవు అంటున్నారు.   ఇక‌, ధూళిపాళ్ల న‌రేంద్ర‌పై మ‌రో ఆరోప‌ణ ఏంటంటే.. మాక్స్ చ‌ట్టం నుంచి కంపెనీ చ‌ట్టంలోకి సంగం డెయిరీని తీసుకొచ్చే క్ర‌మంలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని. 2011వ సంవత్సరంలో ఇచ్చిన సర్టిఫికెట్స్‌.. DCO ఆఫీస్ రికార్డ్స్ లో కనిపించట్లేదు అని. అప్ప‌టి అధికారి గురునాథం.. ఆ రికార్డ్స్ ఇప్ప‌టికీ ఉండి తీరాలి అంటున్నాడు. కానీ, ఆ స‌ర్టిఫికెట్స్ క‌నిపించ‌డం లేద‌ని.. అధికారులు అంటున్నారు. అందుకు, ఛైర్మ‌న్ ధూళిపాళ్ల న‌రేంద్ర‌నే బాధ్యుడంటూ.. ఆయ‌నే ఆ ఫైల్స్‌ను గోల్‌మాల్ చేశారంటూ కేసు క‌ట్టారు. 2011లో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో అధికారంలో ఉంది. మ‌రి, అప్పుడు లేని కేసులు.. ఇప్పుడే తెర‌పైకి రావ‌డం వెనుక దురుద్దేశ్యం దాగుంద‌ని అంటున్నారు.  స‌రే, కేసులు పెట్టారు. ముందు విచార‌ణ చేయాలి క‌దా. అందులో దోషిగా నిరూపిత‌మైతేనే అరెస్ట్ చేస్తారు గానీ, అలా కాకుండా ముందు అరెస్ట్‌.. ఆ త‌ర్వాత ఎంక్వైరీ అన్న‌ట్టు ఉంది స‌ర్కారు తీరు అని త‌ప్పుబ‌డుతున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే.. సంగం డెయిరీలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని.. ఏ ఒక్క పాడి రైతు గానీ, ఏ ఒక్క సంగం ఉద్యోగి కానీ.. ఫిర్యాదు చేయ‌క‌పోవ‌డం. ఇంత ర‌చ్చ జ‌రుగుతున్నా.. ఏ ఒక్క పాడి రైతు కూడా ధూళిపాళ్ల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడ‌లేదంటే ఆయ‌న ప‌నితీరు, ఆయ‌న‌తో అనుబంధం ఎలా ఉండేదో అర్థం చేసుకోవ‌చ్చు.  సంగం డెయిరీ ట‌ర్నోవ‌ర్‌ను వంద కోట్ల నుంచి 1100 కోట్ల‌కు తీసుకెళ్లిన ఘ‌న‌త ఛైర్మన్‌గా ఉన్న ధూళిపాళ్ల న‌రేంద్ర‌దే. గ‌డిచిన ప‌దేళ్ల‌లో 200 కోట్లు రైతుల‌కు బోన‌స్ ఇవ్వ‌డం.. రైతుల‌కు స‌గం ఖ‌ర్చుకే వైద్యం అందించ‌డం.. న‌రేంద్ర సార‌థ్యంలోనే సాధ్య‌మైంది. అందుకే, టీడీపీ నేత ధూళిపాళ్ల న‌రేంద్ర చేతిలో ఉన్న సంగం డెయిరీని ఎలాగైనా చేజిక్కించుకోవాల‌ని జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు ఎప్ప‌టి నుంచో స్కెచ్ వేస్తోంది. సంగంకి పోటీగా గుజ‌రాత్ నుంచి అమూల్‌ని తీసుకొచ్చింది. ఎక్కువ ధ‌ర‌లు చెల్లిస్తూ రైతుల‌ను డైవ‌ర్ట్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. అయినా, గుంటూరు, ప్ర‌కాశం పాడి రైతులు సంగం వెంటే నిలిచారు. దీంతో.. సంగం డెయిరీని ఎలాగైనా దెబ్బ‌కొట్టాల‌నే క‌సితో.. ధూళిపాళ్ల న‌రేంద్రను అరెస్ట్ చేశారు. ఆ త‌ర్వాత సంగం డెయిరీని ప్ర‌భుత్వ డెయిరీగా మార్చేశారు. ప్ర‌స్తుతానికి ప్ర‌భుత్వం ఫుల్ హ్యాపీ కావొచ్చు కానీ.. ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌. కోర్టులున్నాయి. చ‌ట్టాలున్నాయి. న్యాయం జ‌రుగుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది. అన్నిటికీ మించి పాడి రైతుల ఆశీర్వాద‌ముంది. సంగంకు ఏమీ కాదు.. న‌రేంద్ర‌నూ ఏమీ చేయ‌లేరు.

కోరిక తీర్చలేదని.. 69 ఏళ్ళ వృద్ధురాలి హత్య

అది ఖమ్మం జిల్లా. కారేపల్లి గ్రామం. అతని పేరు ఉపేందర్. వయసు 43 సంవత్సరాలు. కాల్చిన అడవిపందిని బస్తాలో మూటగట్టాననీ, ఊరి శివారున పడేసి వద్దామని ఉపేందర్‌ స్థానిక యువకుడి సాయాన్ని తీసుకున్నాడు. స్నేహితుడి ద్విచక్ర వాహనంపై వెళ్లి ఆ బస్తాని ఓ చోట పడేశారు. ఇద్దరు చెరో దారి వెళ్లిపోయారు..  అనుమానమొచ్చిన ఉపేందర్‌ స్నేహితుడు. కొత్త దూరం వెళ్లి మళ్ళీ తిరిగివచ్చాడు. ఆ  బస్తాలో ఏముందని విప్పి చూశారు. మనిషిని పోలిన విధంగా ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కట్ చేస్తే..  బజ్యాతండా. ఆమె పేరు అజ్మీర నాజీ. వయసు 69 సంవత్సరాలు. మతిస్థిమితం తప్ఫి. . నాజీ భర్త 20ఏళ్ల క్రితం మరణించాడు. ఈమె ముగ్గురు కుమారులు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ తండాలో ఉంటున్నారు. ఒక కూతురు ఉన్నారు. నాజీ కొంత మతిస్థితిమితం కోల్పోయి కుమారుల వద్ద ఉండకుండా కారేపల్లిలో రహదారుల వెంట, రైల్వేస్టేషన్‌, ఇతర ప్రాంతంలో తలదాచుకుంటూ తిరిగేది. కుమారులు ఇంటికి తీసుకెళ్లినా వారిని దుర్భాషలాడి మళ్లీ కారేపల్లి వస్తుండేది. ఓపెన్ చేస్తే... అజ్మీర నాజీ పై కొన్ని రోజుల నుంచి కారేపల్లికి చెందిన ఆదెర్ల ఉపేందర్‌ అత్యాచారం చేసేందుకు యత్నిస్తున్నాడు. బాధితురాలు ఈ విషయాన్ని గ్రామంలో తెలిసిన వాళ్లందరికీ చెప్పింది. దీన్ని జీర్ణించుకోలేని ఉపేందర్‌ కక్ష పెంచుకున్నాడు. అజ్మీర పాలిట కాలయముడయ్యాడు. 26న రాత్రి సమయంలో నాజీని చీమలపాడు రహదారి వైపు బలవంతంగా తీసుకెళ్లాడు. కాళ్లు, చేతులు, తల భాగాలను నరికి హతమార్ఛి.. వాటిని అక్కడే కాల్చాడు. అనంతరం మొండెం భాగాన్ని మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం తిర్లాపురం రైల్వేట్రాక్‌పై పడేశాడు.       కట్ చేస్తే..  ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రైల్వే పోలీసులు, ఖమ్మం గ్రామీణ ఏసీపీ వెంకట్‌రెడ్డి, ఎస్సై సురేశ్‌ ఘటనా స్థలంలో పరిశీలించారు. అనుమానాలెన్నో...  వృద్ధురాలిని అతి కిరాతకంగా నరికి చంపిన ఉపేందర్‌ ఘటనా వివరాలు చెప్పినప్పటికీ... పోలీసులు అనుమానిస్తున్నారు. తల, కాళ్లు, చేతులు నరికి కాల్చడంతో శవం గుర్తు పట్టడానికి వీల్లేేకుండా ఉండటంతో ఆమె కుమారులు కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. తమ తల్లేనా? అనే రీతిలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాజీ కుమారులు మాత్రం తమకు ఫిర్యాదు ఇవ్వలేదనీ, నిందితుడు చెప్పిన వివరాలతో కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.ఇలా వెలుగులోకి..  రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన ప్రదేశంతోపాటు బజ్యాతండాకు వెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు. అన్నం సేవా సమితి ఛైర్మన్‌ డా.శ్రీనివాసరావు, సభ్యులు నాజీ మృతదేహాన్ని ఖమ్మం మార్చురీకి తరలించారు.            

టీకా కోసం భారీగా క్యూలు.. చేతులెత్తేస్తున్న రాష్ట్రాలు

దేశంలో కరోనా కల్లోలం స్పష్టిస్తోంది. మంగళవారం దేశంలో 3 వేల 2 వందల మందికి పైగా చనిపోవడం కలకలం రేపుతోంది. రోజూ ముడున్నర లక్షలకు పైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మేలో మరింత ముప్పు ఉంటుందని, రోజుకు 10 లక్షల కేసులు కూడా రావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనాను కట్టడి చేయాలంటే అందరికి వ్యాక్సిన్ ఇవ్వడమే పరిష్కారమని సూచిస్తున్నారు. కేంద్ర సర్కార్ కూడా వ్యాక్సినేషన్ పై ఫోకస్ చేసింది. ప్రస్తుతం 45 ఏండ్ల పైబడిన వారికి మాత్రమే టీకాలు ఇస్తుండగా.. మే 1 నుంచి 18 ఏండ్లు నిండిన వారందరికి టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించింది. రాష్ట్రాలతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ వారికి టీకాలు వేసే అవకాశం కల్పించింది కేంద్రం. ఇంతవరకు బాగానే ఉన్నా మే 1నుంచి టీకాలు వేయడానికి సరిపడా వ్యాక్సిన్లు ఉన్నాయా అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. రెండు రోజుల్లో మూడవ దశ వ్యాక్సినేషన్ మొదలు కావాల్సి వున్నా... రాష్ట్రాలకు మాత్రం టీకాలు వెళ్లలేదని తెలుస్తోంది. దీంతో మూడో దశ వ్యాక్సినేషన్  కార్యక్రమం సాఫీగా మొదలయ్యేలా కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తుంటే చాలా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కు తీవ్ర అవాంతరాలు ఏర్పడేలా ఉన్నాయి. అందుకు కారణం డిమాండ్ కు తగినంతగా టీకాల సరఫరా లేకపోవడమే. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే టీకాలు నిండుకున్నాయి. కొత్తగా చాలినన్ని టీకా వయల్స్ ఏ రాష్ట్రానికీ సరఫరా కావడం లేదు. దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు ఇవ్వాలంటే దాదాపు 90 నుంచి 100 కోట్ల డోస్ లు కావాలి. ఈ ఏజ్ గ్రూప్ లో సుమారు 45 కోట్ల మందికి పైగా ప్రజలు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. 60 ఏళ్లు దాటిన వారందరికీ, ఆపై 45 ఏళ్లు దాటి వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారికీ టీకాలు ఇస్తున్నా, అదింకా లక్ష్యాన్ని తాకలేదు. ఇప్పటివరకూ సుమారు 15 కోట్ల డోస్ లను మాత్రమే పంచారు. అందులో రెండు డోస్ లు తీసుకున్న వారి సంఖ్య 2 కోట్లను కూడా దాటలేదు. చాలా రాష్ట్రాలు 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారికి టీకాలు ఇవ్వాలంటే, తమకు వెంటనే వయల్స్ పంపాలని డిమాండ్ చేస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం 12 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు కావాలని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ లను కోరింది. వచ్చే ఆరు నెలల కాలంలో ఇవి పంపాలని కోరింది. ఇదే తరహా విజ్ఞప్తులు పలు రాష్ట్రాల నుంచి వ్యాక్సిన్ కంపెనీలకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, తెలంగాణ, యూపీ, రాజస్థాన్, కేరళ, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ తదితర అన్ని ప్రాంతాల నుంచి వ్యాక్సిన్ కంపెనీలకు లేఖలు అందుతున్నాయి. టీకాలకు ధర నిర్ణయం విషయంలో సందిగ్ధతలు నెలకొని వున్నాయి. తాము కొనుగోలు చేసే టీకాలను ఉచితంగా రాష్ట్రాలకు సరఫరా చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ కంపెనీలు కేంద్రానికి ఇచ్చే టీకాలకే తగ్గింపు ధరలను అమలు చేస్తామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమ ప్రజలకు ఉచితంగా టీకాలు ఇస్తామని చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి. అందుకయ్యే ఖర్చును తామే భరిస్తామని చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే మూడు నెలల కాలంలో ఎన్ని టీకాలు అందుబాటులో ఉంటాయి? ఎంత మందికి వాటిని ఇవ్వవచ్చు? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లేవు. మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించలేమని ఆంధ్రప్రదేశ్, గోవా ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయి. వ్యాక్సిన్ తయారీ కంపెనీలు కేంద్రం కోరిన డోస్ లను సరఫరా చేయడానికే మరింత సమయం పట్టేలా ఉంది. దీంతో రాష్ట్రాలకు టీకాలను పంపించేందుకు ఇంకెంత సమయం పడుతుందోనన్న ఆందోళన కూడా ఉంది.  కొవిన్ వెబ్ సైట్ లో, ఆరోగ్య సేతు యాప్ లో 18 ఏళ్లు పైబడిన వారంతా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకుంటున్నారు. కానీ  రిజిస్టర్ చేసుకున్న వారికి ఎప్పుడు వ్యాక్సిన్ ఇస్తారన్న స్పష్టత మాత్రం లేదు. 

రిజైన్ మోడీ! నెటిజన్ల డిమాండ్.. కమలనాధుల పరేషాన్

ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి.. ఇదే ఎప్పటినుంచో ఉన్న సామెత. చాలాసార్లు ఇది నిజమవుతుంది కూడా. కాలం కలిసిరాకపోతే ఏదైనా జరుగుతుందని చెప్పడానికి ఈ సామెతను వాడుతుంటారు. రాజకీయ. వ్యాపార రంగాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు ఇండియాలోనూ అదే జరుగుతోంది. ఒకప్పుడు సోషల్ మీడియాలో వెలుగు వెలిగిన నేత.. ఇప్పుడు ట్రోలింగ్ కు గురవుతున్నారు. నెటిజన్ల నుంచి దారుణమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు.  ఒక సామాన్యుడు చాయ్ వాలా దేశానికి ప్రధాని కాకూడదా? అని 2014 ఎన్నికల్లో దీనంగా అడిగిన మోడీకి రెండు సార్లు ఆ పదవిని ఇచ్చారు దేశ ప్రజలు. సోషల్ మీడియానే ఆయుధంగా వాడి గద్దెనెక్కిన మోడీకి ఇప్పుడు అదే సోషల్ మీడియా పక్కలో బల్లెంలా తయారైంది.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి సోషల్‌ మీడియాలో ఏ చిన్న కామెంట్‌ చేయడానికి కూడా భయపడేవారు. కొందరు కమెడీయన్లు, కార్టూనిస్టులు ఇలాంటి ప్రయత్నం చేయడంతో వ్యవహారం సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది. కాని ఇప్పుడు మాత్రం సీన్ పూర్తిగా మారిపోయింది.  దేశంలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. రోజురోజుకు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా ప్రమాదకరంగా ఉంటున్నాయి. దేశంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర సర్కార్ తీరుపై జనాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీకి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీపై నెటిజన్లు మండిపడుతున్నారు. కరోనాను అదుపు చేయడంలో దారుణంగా విఫలమయ్యారని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  #ResignModi హాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.   కేంద్ర సర్కార్ పై ఉన్న వ్యతిరేకతను ట్విట్టర్ ద్వారా తీర్చుకుంటున్నారు నెటిజన్లు.కరోనాను అదుపు చేయడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందని.. దీనికి బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి పదవి నుంచి మోడీ తప్పుకోవాలని ట్విట్టర్ మారుమోగుతోంది. ‘రిజైన్ మోడీ’ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ప్రస్తుతం ట్రెండింగ్ మారింది. ఇప్పటికే దీనిపై దేశ ప్రజలంతా 230000కు పైగా మంది ట్వీట్స్ చేసి మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా కల్లోలంలో ఏం చేయలేని మోడీ దిగిపోవాలంటున్నారు.   సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ కలిగిన మోడీకి ట్విట్టర్‌లో ఈ స్థాయిలో నిరసన సెగ తగలడం ఇదే తొలిసారి. గత ఏడాది ఆగస్టులో సోషల్ మీడియాలో మొదటి సారి మోడీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన నిర్వహించిన మన్ కీ బాత్ పై నెటిజన్లు డిస్ లైక్ ల మోత మోగించారు. జేఈఈ నీట్ పరీక్షలపై మాట్లాడని మోడీ వీడియోను 18 లక్షల మంది చూస్తే 74 మంది లైక్ చేస్తే.. 5 లక్షల మంది డిస్ లైక్ చేశారు.  Where is Modi అంటూ ట్విటర్‌లో భారీ ఎత్తున ట్రోలింగ్‌ జరిగింది.  పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడిన మాటలపై తీవ్ర విమర్శలు వచ్చాయి.  ప్రధాని మోడీకి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని నెటిజన్లు ఆరోపించారు. సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్నా ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడంపై మండిపడుతున్నారు.  ఉద్యోగాలు కావాలంటూ నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది. ‘మోడీ రోజ్‌గార్ దో’, ‘మోడీ ఉద్యోగమివ్వు’ వంటి ట్వీట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఒక్క రోజులోనే ఇలాంటి ట్వీట్లు ఏకంగా 50 లక్షలు రావడం గమనార్హం. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటూ ఇచ్చిన హామీ ఏమైందని గొంతెత్తుతున్నారు.  

14 ఏళ్ళ ప్రేమ, పెళ్లి.. ఆ తర్వాత ఇలా..  

ఆమె పేరు విజయ. అతని పేరు ఆంజనేయులు. ఇద్దరు ప్రేమించుకున్నారు. 14 ఏళ్ళ కింద పెళ్లి కూడా చేసుకున్నారు.  హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్  పరిధి. రహమత్‌నగర్‌ సమీపంలోని ఎస్పీఆర్‌ హిల్స్‌ రాజీవ్‌గాంధీనగర్‌లో నివాసముంటున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.  కట్ చేస్తే.. ఈ నెల 26వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో విజయ తన తల్లి మణెమ్మ కు ఫోన్‌ చేసింది. పిల్లలు జాగ్రత్త అంటూ చెప్పి ఫోన్‌ కట్‌ చేసింది. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం విజయ ఇంట్లో తలుపులు వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న మణెమ్మ తన కుమార్తె మృతికి అల్లుడు, అతని కుటుంబ సభ్యులే కారణమంటూ  జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ముందు విజయ  రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఓపెన్ చేస్తే.. విజయ రాసిన లేఖ లో ..ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. పెళ్లయిన నాటి నుంచి నా భర్త పెట్టే బాధలు భరించలేకపోతున్నా.. రోజు చిత్రహింసలే.. తీవ్రంగా కొట్టడంతో పాటు ఉద్యోగానికి వెళ్లమని చెప్ఫి. అక్కడున్న ఉద్యోగులతో కలిపి లేని పోని అభాండాలు వేసేవాడు.. చివరికి నన్ను మర్డర్ చేయాలని చూశాడు .. నా భర్తకు వాళ్ల అన్నయ్య చంద్రయ్య అండ ఉంది.. నన్ను చంపేస్తే వాళ్ల అక్క బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానంటూ లేనిపోని మాటలు చెప్పాడు.. నా చావుకి ముఖ్య కారణం అతని సోదరులే.. నేను చనిపోతున్నాను.. నా భర్తను వదిలిపెట్టవద్ధు. నా పిల్లలను మాత్రం మా అమ్మనాన్న, సోదరుల వద్ద ఉంచండి’’ అంటూ విజయ తన లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. వియజ లేఖలో ఇలాంటి  నిజాలు బయట పడ్డాయి..లేఖ చదివిన పోలీసులు విజయ భర్త ఆంజనేయులును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.         

ప్రేమకోసం.. అన్నను చంపిన నటి.. 

ప్రేమ కోసం ప్రేమించిన వాళ్ళు చనిపోవడం చూశాం. లేదా అదే ప్రేమని మర్చిపోయి వేరే జీవితం స్టార్ట్ చేసేవాళ్లను చూశాం.. కానీ ప్రేమ సొంత అన్ననే చంపింది ఓ యువతి.. ఆ యువతీ ఎవరో కాదు. తను ఓ సినిమా నటి.    ఆమె పేరు షనయ. ఆమె కొంతకాలంగా నియాజ హమీద్ కటిగర్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం నడిపింది. ఇద్దరు కొంత కాలంగా చెట్టపట్టాలు వేసుకుని సినిమాలు, షికార్లు అంటూ  తిరిగారు.. ప్రేమలో పీకలలోతు మునిగారు. ఒక్కసారిగా కరోనా వల్ల ప్రపంచానికి బ్రేక్ పడినట్లు. షనయ ప్రేమ విషయం సోదరుడు రాకేశ్‌ కాట్వే తెలియడంతో వారి ప్రేమకు బ్రేక్ పడింది.   ఇక అంతే షనయ తన సోదరుడికి భూమి మీద నూకలు చెల్లాయి. తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడన్న కారణంతో రాకేశ్‌ కాట్వే మర్డర్ కి పధకం సినిమా తార. తన ప్రియుడి సాయంతో హత్యకు రంగం సిద్ధం చేసింది. అందుకోసం మరో ముగ్గురి సాయం తీసుకుంది.   ప్రణాళిక ప్రకారం.. హుబ్బల్లిలోని తన ఇంట్లోనే రాకేశ్‌ గొంతు కోసి హత్య చేశారు. రంగంలోకి దిగిన పోలీసులకు దేవరా గుడిహల్‌ అటవీ ప్రాంతంలో రాకేశ్‌ తల, మిగిలిన శరీరభాగాలు వేర్వేరు ప్రాంతాల్లో గుర్తించారు. కాగా.. ఈ కేసులో ఇప్పటికే నియాజహమీద్ కటిగర్ (21), తౌసిఫ్ చన్నాపూర్ (21), అల్తాఫ్ ముల్లా (24), అమన్ గిరానివాలే (19)లను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా షనయను కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. షనయ 2018లో కన్నడ చిత్రం ‘ఇదం ప్రేమం జీవనం’లో తొలిసారి నటించింది. ఇటీవలే ఒక అడల్ట్‌ కామెడీ చిత్రంలోనూ నటించింది. కన్నడ చిత్రసీమలో ఇప్పుడీ ఘటన చర్చనీయాంశంగా మారింది.  

కరోనాతో ప్రధాని మోడీ పిన్ని మృతి

ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మోడీ పినతల్లి నర్మదాబెన్ గుజరాత్ లో కరోనాతో కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. నర్మదాబెన్... మోడీ తండ్రి దామోదరదాస్ సోదరుడు జగ్జీవన్ దాస్ సతీమణి. ఇటీవలే కరోనా బారినపడిన ఆమె అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  మరణించారు. నర్మదాబెన్ న్యూ రాణిప్ ప్రాంతంలో నివసిస్తున్నారు. నర్మదాబెన్ మడతిపై ప్రధాని మోడీ తమ్ముడు ప్రహ్లాద్ స్పందిస్తూ... తమ పిన్నమ్మ పది రోజుల కిందట అహ్మదాబాద్ ఆసుపత్రిలో చేరిందని వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా ఆమె ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలిపారు. ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిందని చెప్పారు. నర్మదాబెన్ భర్త జగ్జీవన్ దాస్ చాన్నాళ్ల క్రితమే మరణించారని ప్రహ్లాద్ మోడీ చెప్పారు. 

అంబులెన్సులు లేకుంటే గుర్రాలను వాడండి!

కరోనా కట్టడి చర్యలపై తెలంగాణ ప్రభుత్వం‌పై హైకోర్టు మరో‌సారి విరుచుకుపడింది. ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వేగంగా విస్తరిస్తున్నందున మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. నైట్ కర్ఫ్వూ‌తో పాటు సమావేశాలను, ఫంక్షన్లను 50శాతానికి కుదించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ కంట్రోల్ రూమ్ కోసం మరిన్ని టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేయాలని సూచించింది. అంబులెన్స్‌లు అందుబాటులో లేని సమయంలో మృతదేహాలను తరలించడానికి గుర్రాలను వాడాలని న్యాయస్థానం సలహా ఇచ్చింది. అంబులెన్స్ డ్రైవర్లు, హాస్పిటల్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.   ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు అన్నీ ఆర్టీపీసీఆర్  టెస్టులకోసం వేచి చూడకుండా వైద్యం అందించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం సరైన అఫిడవిట్‌ను ఫైల్ చేయాలని హితవు పలికింది. వాయు మార్గాలను ఆక్సిజన్ రవాణాకు సిద్ధంగా ఉంచాలని భారత వాయిసేనను హైకోర్టు కోరింది. కేంద్రం కూడా రాష్ట్రానికి సరిపడా ఆక్సిజన్ సరఫరా చేసేలా చూడాలని సలహా ఇచ్చింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై కూడా డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. వృద్ధులకు, వికలాంగులకు వైద్య సదుపాయం సరైన విధంగా చూడాలని సూచించింది. నైట్ షెల్టర్లను, సరైన సౌకర్యాలను కల్పించాలని, ప్రైవేట్ హాస్పిటల్స్‌ను కూడా కోవిడ్ సేవలు అందించే విధంగా ఉత్తర్వులు ఇచ్చి ప్రస్తుత కోవిడ్ హాస్పిట‌ల్స్‌పై ఒత్తిడి తగ్గించాలన్ని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.  రాష్ట్రంలో కేవలం నాలుగే సోషియల్ డిస్టెన్స్ కేసులు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉందని హైకోర్టు మండిపడింది. పోలీస్ శాఖ సమర్పించిన నివేదికపై అసహనం వ్యక్తం చేసింది. పోలీసులకు మాస్క్ కంపల్సరీ చేయమన్న హైకోర్టు.. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల అధికారి ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని ఈసీకి హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వానికి చివరి అవకాశం ఇస్తున్నామని హైకోర్టు పేర్కొంది. పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి ఆదేశించింది. తదుపరి విచారణ మే 5కి వాయిదా వేసింది.  

హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ క్లోజ్!

కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. వైరస్ పంజాతో తెలంగాణ రాష్ట్రం వణికిపోతోంది. కేసులతో పాటు మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు శివారు ప్రాంతాలైన మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నగర ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కీలక నిర్ణయం తీసుకుంది. వీసా రెన్యువల్స్, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూలు సహా అన్ని సాధారణ వీసా సేవలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.  మే 3వ తేదీ నుంచి ఈ సేవలను తాత్కాలికంగా ఆపేస్తున్నామని యూఎస్ కాన్సులేట్ జనరల్ తెలిపింది. తదుపరి ప్రకటన వెలువడేంత వరకు ఇది అమల్లో ఉంటుందని చెప్పింది. సాధారణ అమెరికన్ సిటిజన్ సర్వీసెస్ మంగళవారం నుంచే రద్దయ్యాయి. స్థానిక పరిస్థితులు అనుకూలించేంత వరకు సేవలను రద్దు చేస్తున్నట్టు కాన్సులేట్ జనరల్ చెప్పింది. ఇప్పటికే షెడ్యూల్ చేసిన అత్యవసర అపాయింట్ మెంట్లను కొనసాగించేందుకు యత్నిస్తామని తెలిపింది.  

ఏపీలో హెల్త్‌ ఎమర్జెన్సీ! జ‌గ‌న్‌కు మూడేళ్లు క‌ష్ట‌మే?

ఏపీలో రాత్రి క‌ర్ఫ్యూ పెట్ట‌డం తుగ్ల‌క్ చ‌ర్య‌గా అభివ‌ర్ణించింది బీజేపీ. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొవిడ్ క‌ల్లోలం క‌ట్ట‌డికి హెల్త్ ఎమ‌ర్జెన్సీ పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి మందుల కొరత లేకుండా చూడాలన్నారు. ఔషధాలపై 3 నెలలు జీఎస్టీ లేకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్షుకుమార్‌రాజు. ఏపీలో భవనాలు కూల్చివేత, చిన్న చిన్న షాపుల తొలగింపుపై అధికార యంత్రాంగానికి ఉన్న శ్రద్ధ.. కరోనా వ్యాప్తి నియంత్రణపై లేదని విమర్శించారు. కొవిడ్‌ సమయంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఎంత వరకు సమంజసం? అని ప్రశ్నించారు. ఇంకా మూడేళ్ల పాటు జగన్‌ సీఎంగా ఉంటారని తాను అనుకోవడం లేదని విష్ణుకుమార్‌ రాజు వ్యాఖ్యలు చేశారు.  విష్ణుకుమార్‌రాజు అనే కాదు.. ఏపీలో ఎవ‌రిని అడిగినా ఇదే మాట అంటున్నారు. క‌రోనా కుమ్మేస్తుంటే.. ఏపీలో భ‌వ‌నాల కూల్చివేత‌లు ఏంట‌ని అంతా నిల‌దీస్తున్నారు. టీడీపీ నేత‌లే టార్గెట్‌గా విశాఖ‌లో విధ్వంస ర‌చ‌న కొన‌సాగుతోంది. ప‌ల్లా శ్రీనివాస్‌, స‌బ్బం హ‌రి, గీతం వ‌ర్సిటీ.. ఇలా అక్ర‌మ నిర్మాణాల పేరుతో టీడీపీ నేత‌ల క‌ట్ట‌డాల‌పై బుల్డోజ‌ర్లు ప్ర‌యోగిస్తూ భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తున్నారు. భీమిలీ రోడ్డులో చిన్న చిన్న షాపుల‌ను కూల్చేయ‌డంపైనా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  ఇక‌, టీడీపీ నేత ధూళిపాళ్ల న‌రేంద్ర అరెస్టు, సంగం డెయిరీని ప్ర‌భుత్వ ప‌రం చేయ‌డం.. దేవినేని ఉమాను నోటీసుల‌తో బెదిరించ‌డం.. ఇలా క‌రోనా క‌ట్ట‌డి కంటే కూడా టీడీపీ క‌ట్ట‌డి మీదే ప్ర‌భుత్వం ఎక్కువ ఫోక‌స్ పెడుతోందంటూ ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.  కొవిడ్ స‌మ‌యంలో ప‌ది, ఇంట‌ర్ విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు పెట్టేందుకు స‌ర్కారు షెడ్యూలు ప్ర‌క‌టించ‌డం మ‌రింత దారుణం. ఇంత దారుణ ప‌రిస్థితుల్లో ప‌రీక్ష‌ల పేరుతో స్టూడెంట్స్ ప్రాణాల‌తో చెల‌గాటం ఆడ‌టం ఏంట‌ని జ‌నం నిల‌దీస్తున్నారు. అయినా.. జ‌గ‌న్ స‌ర్కారుకు ఇవేమీ ప‌ట్ట‌డం లేదు. ఇలాంటి ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను చూసే బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు లాంటి వాళ్లు జ‌గ‌న్ సీఎంగా మ‌రో మూడేళ్ల పాటు ఉండ‌టం క‌ష్ట‌మంటూ జోష్యం చెబుతున్నారు. నిజ‌మే మ‌రి... ముఖ్య‌మంత్రి తీరు అలా ఉంది మ‌రి..

చికిత్స చేయడం లేదని కరోనా రోగి పరార్! సూర్యాపేటలో కలకలం

సూర్యాపేట జిల్లాలో విచిత్రం చోటుచేసుకుంది. కరోనా ట్రీట్‌మెంట్ చేయడంలేదని ఓ పేషంట్ ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో జరిగింది. కరోనాతో ఆస్పత్రిలో చేరి రెండు రోజులైనా వైద్యులు చికిత్స చేయడంలేదని చంద్రశేఖర్ అనే కరోనా పేషంట్ సోమవారం రాత్రి హాస్పిటల్ నుంచి పారిపోయాడు. కరోనా రోగి హాస్పిటల్ నుంచి పారిపోవడంతో కలకలం రేగింది.  అయితే హాస్పిటల్ నుంచి పారిపోయిన వ్యక్తి చివ్వెంల మండలంలోని వల్లభాపురం గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో.. గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. గ్రామానికి వచ్చిన పోలీసులు.. ఆ వ్యక్తిని విచారించగా.. అసలు విషయం చెప్పాడు. దాంతో పోలీసులు వెంటనే 108 ద్వారా జనరల్ హాస్పిటల్‌‌కు తరలించారు

ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్.. సీఎంను నిలదీసిన షర్మిల 

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇందిరా పార్కులో రెండు రోజులగా సీతక్క దీక్ష చేస్తుండగా.. పోలీసులు వచ్చి ఆమెను అక్కడి నుంచి తరలించారు. సీతక్క దీక్షను భగ్నం చేయడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీతక్క అరెస్టుపై వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని నిరాహార దీక్ష చేస్తున్న సీతక్కకు ఎలాంటి పరిష్కారం చూపకుండానే ప్రభుత్వం, పోలీసులు కలిసి ఆమె దీక్షను భగ్నం చేశారని ఆరోపించారు. దీన్ని తాము ఖండిస్తున్నామని షర్మిల ప్రకటన విడుదల చేశారు. ప్రజల ప్రాణాలపై పాలకులకు పట్టింపు లేకపోయినా, ఒక మహిళగా సీతక్క ప్రజల తరఫున నిలిచి వారి ఆరోగ్యం కోసం దీక్ష చేశారని షర్మిల కొనియాడారు. సీతక్కను  తాము అభినందించడమే కాకుండా, సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని షర్మిల వెల్లడించారు. ప్రశ్నించడమే నచ్చని పెద్దమనిషి కేసీఆర్ కు ఒక మహిళ పోరాటం చేస్తుంటే నచ్చుతుందా? అని ప్రశ్నించారు. ఆ అంశం జీర్ణించుకోలేకనే ప్రశ్నించే గొంతుకలను మట్టుబెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా వ్యతిరేకిగా పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ కు రేపు ఆ మహిళల ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యమాలే బుద్ధి చెబుతాయని షర్మిల హెచ్చరించారు. 

సంగంపై స‌ర్కారు క‌క్ష‌.. ఏపీ డెయిరీలో విలీనం.. జ‌గ‌న్ మొండిత‌నం!

సంగం డెయిరీ ప్ర‌భుత్వ ప‌ర‌మైంది. సీఎం జ‌గ‌న్ పంతం నెర‌వేరింది. అనుకున్న‌ది మొండిగా సాధించుకున్నారు. అరెస్టుల‌కు తెగించారు. త‌న తండ్రి వైఎస్ మొద‌లు పెట్టిన కుట్ర‌ను జ‌గ‌న్ పూర్తి చేశారు. టీడీపీని టార్గెట్ చేస్తూ.. ఆప‌రేష‌న్ సంగం డెయిరీ చేప‌ట్టి.. ఇన్నేళ్లూ ప్ర‌జ‌ల ప‌క్షాన నిలిచిన సంస్థ‌ను.. ఇప్పుడు ప్ర‌భుత్వ ప‌రం చేశారు. ఆ మేర‌కు జీవో జారీ అయింది.  గుంటూరు జిల్లా వడ్లమూడి ద‌గ్గ‌ర ఉన్న సంగం డెయిరీని ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంగం డెయిరీలో వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక సమర్పించింది. ఏసీబీ నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్ర‌భుత్వం వెల్లడించింది.  అంతకుముందు సంగం డెయిరీని గుంటూరు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేసింది. బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కాసేపటికే ఉపసంహరించుకుంది. జీవో 515ను ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని తీసుకొస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై సంగం డెయిరీ రోజువారీ కార్యకలాపాల బాధ్యతను తెనాలి సబ్‌కలెక్టర్‌కు అప్పగించింది. ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకునే అధికారాలను సబ్‌కలెక్టర్‌కు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది స‌ర్కారు. ద‌శాబ్దాల కుతంత్రం నేటికి సాకార‌మైంది.  టీడీపీ నేత‌, సంగం డెయిరీ ఛైర్మ‌న్ ధూళిపాళ్ల న‌రేంద్ర అరెస్ట్‌తోనే సంగం డెయిరీ ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరింది. తెల్ల‌వారుజామున 100 మందికి పైగా పోలీసులు న‌రేంద్ర ఇంటిపై దాడి చేసి ఆయ‌న్ను బ‌ల‌వంతంగా అరెస్ట్ చేశారు. 2013లో సంగం డెయిరీని మ్యాక్స్‌ చట్టం నుంచి కంపెనీ యాక్ట్‌లోకి మార్చే ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ కేసు న‌మోదు చేసింది. ఆ కేసులో భాగంగానే ఛైర్మ‌న్‌ ధూళిపాళ్ల న‌రేంద్ర‌ను, ఎండీ గోపాలకృష్ణన్‌ను అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు త‌ర‌లించారు.  ధూళిపాళ్లను అరెస్ట్ చేసి త‌మ‌కు అడ్డులేకుండా చేసుకున్న ప్ర‌భుత్వం.. మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే సంగం డెయిరీని ప్ర‌భుత్వ ప‌రం చేస్తూ ఆదేశాలు జారీ చేయ‌డం వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. ఇందులోనూ వ్య‌వ‌హారం సాఫీగా సాగ‌లేదు. స‌ర్కారుకే క్లారిటీ లేదు. ముందు సంగం డెయిరీని గుంటూరు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేసింది. ఆ త‌ర్వాత‌.. తూచ్ అంటూ ఆ ఉత్త‌ర్వులు ర‌ద్దు చేసింది. ఆ త‌ర్వాత మ‌రో జీవో జారీ చేసి.. ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సంగం డెయిరీని తీసుకొచ్చింది. అయితే, సంగం డెయిరీపై ప్ర‌భుత్వ నిర్ణ‌య‌మే అంతిమ‌మేమీ కాక‌పోవ‌చ్చు. ధూళిపాళ్ల న‌రేంద్ర ఇప్ప‌టికే హైకోర్టులో దాఖ‌లు చేసిన క్యాష్ పిటిష‌న్‌పై విచార‌ణ కొన‌సాగుతోంది. హైకోర్టు తీర్పే అంతిమం. అప్ప‌టి వ‌ర‌కూ.. సంగం డెయిరీకి, పాడి రైతుల‌కు ఆశ‌లు మిగిలే ఉంటాయి.  సంగం డెయిరీ. గుంటూరు, ప్ర‌కాశం పాడి రైతుల‌కు పెన్నిధి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల కుటుంబాలకు ఆధారం. 2వేల కోట్ల వ‌ర‌కూ ఆస్తులు. దాదాపు 200 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు. సుమారు వెయ్యి కోట్ల ట‌ర్నోవ‌ర్‌. ఇలా, సంగం డెయిరీ ఆర్థిక వ‌ట‌వృక్షంగా ఎదిగింది.  సంస్థ ఆవిర్భావం నుంచి టీడీపీకి చెందిన వారే డెయిరీ చైర్మన్లుగా ఉన్నారు. ప్రస్తుతం డెయిరీకి ధూళిపాళ్ల‌ నరేంద్రకుమార్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సంగంపై పైచేయి సాధించేందుకు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హ‌యాం నుంచే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అయినా, టీడీపీ ప‌ట్టు కోలేదు. వైఎస్‌ హయాంలో ఆర్డినెన్స్‌ ద్వారా పాల‌క వ‌ర్గాన్ని ర‌ద్దు చేసి.. డెయిరీని స్వాధీనం చేసుకోవడానికి ఆదేశాలిచ్చారు. వీటిపై అప్పటి చైర్మన్‌ కిలారి రాజన్‌బాబు కోర్టులో స్టే తీసుకురావటంతో వైఎస్‌కు ఎదురుదెబ్బ త‌ప్ప‌లేదు.  జ‌గ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక‌.. సంగం డెయిరీపై ప్ర‌తీకార చ‌ర్య‌లు మ‌రింత పెరిగాయంటారు. సంగం డెయిరీని దెబ్బ కొట్టేందుకే గుజ‌రాత్‌కు చెందిన అమూల్ మిల్క్‌ను ఏపీకి తీసుకొచ్చార‌ని చెబుతారు. అమూల్ త‌ర‌ఫున పాల సేక‌ర‌ణ‌కు అధిక ధ‌ర‌లు చెల్లిస్తూ.. రైతుల‌ను అటువైపు మ‌ళ్లించే ప్ర‌య‌త్నాలు జోరుగా జ‌రుగుతున్నాయి. అయినా, సంగంతో ద‌శాబ్దాల అనుబంధం ఉన్న పాడి రైతులు నేటికీ సంగం డెయిరీకే పాలు విక్ర‌యిస్తున్నారు. దీంతో.. అమూల్‌కు పాలు అమ్మ‌క‌పోతే ప్ర‌భుత్వ ప్రోత్సాహ‌కాలు ఇవ్వ‌మంటూ అధికారులు, పాల‌కులు బెదిరింపుల‌కు దిగ‌న సంఘ‌ట‌న‌లు ఇటీవ‌ల కాలంలో వివాదాస్ప‌ద‌మ‌య్యాయి.  రైతులు త‌మ దారికి రావ‌డం లేద‌ని భావించిన స‌ర్కారు.. ధూళిపాళ్ల అరెస్ట్‌తో దూకుడు ప్ర‌ద‌ర్శించింది. ముందు ధూళిపాళ్ల‌ను జైల్లో వేసి.. ఆ త‌ర్వాత హ‌డావుడిగా ఇప్పుడీ జీవో జారీ చేసింది. ద‌శాబ్దాలుగా పాడి రైతుల ప‌క్షాన నిలిచిన సంగం డెయిరీ.. ఇప్పుడిక ప్ర‌భుత్వ డెయిరీ. రైతుల‌తో రుణం తీరిపోతుందా?  లేక‌, హైకోర్టు సంగం డెయిరీ ప‌క్షాన నిలుస్తుందా? చూడాలి...

గుడ్ న్యూస్.. రాష్ట్రానికి ఎక్కువ కోవిడ్ టీకాలు 

దేశంలో కరోనా పంజా విసురుతోంది. కొన్ని రాష్ట్రాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రధాన ఆయుధమని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో మే1 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసేలా కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. 18 ఏండ్లు నిండిన వారందరికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు వీలుగా రాష్ట్రాలు కూడా నేరుగా టీకాలు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది.  కేంద్రం తాజా ఆదేశాలతో వ్యాక్సిన్ కోసం రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వ్యాక్సిన్లు సరిపడా లభిస్తాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి గుడ్ న్యూస్ అందింది. హైదరాబాద్ కేంద్రంగా తయారవుతున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను రాష్ట్రానికి సరిపడా ఇస్తామని ఆ సంస్థ ఎండీ తెలిపారు.  భారత్ బయోటెక్ ప్రతినిధులతో సీఎస్ సోమేశ్ కుమార్  సమావేశమయ్యారు. ఈ భేటికి భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల, ఇతర ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు భారత బయోటెక్ ఎండీతో చర్చలు జరిపినట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. తెలంగాణలో ఉచిత వ్యాక్సిన్ ఇస్తుండడంతో అందుకు సరిపడా డోసులు సరఫరా చేయాలని భారత్ బయోటెక్ ప్రతినిధులను కోరినట్లు చెప్పారు. ఈ విషయంపై  భారత్ బయోటెక్ సంస్థ ఎండీ సానుకూలంగా స్పందించినట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. 

వాట్స్ అప్ పై హైకోర్టు లో రచ్చ...

వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులు పొట్టే అభ్యంతర పోస్టులకు అడ్మిన్ బాధ్యుడు కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఓ వాట్సాప్ గ్రూపు అడ్మిన్ పై నమోదైన లైంగిక వేధింపుల కేసులు కొట్టివేస్తూ కోర్టు ఈ వాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వాఖ్యలు చేసింది. గ్రూప్ అడ్మిన్ కు సభ్యులను చేర్చే, తొలగించే పరిమితమైన అధికారులు మాత్రమే ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. ఇతర సభ్యులు చేసే పోస్టులను నియంత్రించే, సమీక్షించే అధికారాలను అడ్మిన్ కు ఉండవని ఈ సందర్భంగా కోర్టు వాఖ్యానించింది. అసలు ఈ కేసు విషయానికి వస్తే.. ఓ గ్రూపులో కొందరు వ్యక్తులు మహిళా సభ్యులను అసభ్య పదజాలంతో దూషించినా ఆ గ్రూప్ అడ్మిన్ గా ఉన్న కిశోర్‌ తరోనే(33) స్పందించలేదని, ఆ సభ్యులను గ్రూప్ నుంచి తొలగించలేదని దిగువ కోర్టులో ప్రాసిక్యూషషన్ ఆరోపించింది. కనీసం క్షమాపణ కూడా కోరలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనిపై ఐపీసీ 354, 509, 107 సెక్షన్ల కింద, ఐటీ చట్టం 67వ నిబంధన కింద కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ అడ్మిన్‌ హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఈ వాఖ్యలు చేసింది. గ్రూపులో ఎవరైనా అభ్యంతరకర పోస్టులు చేస్తే అతను మాత్రమే చట్టపరమైన చర్యలకు బాధ్యుడు అవుతాడని కోర్టు స్పష్టం చేసింది.   

వైసీపీ నేత, యాంకర్ శ్యామల భర్త అరెస్ట్

ప్రముఖ తెలుగు బుల్లితెర యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు రిమాండ్ కు తరలించారు.  రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో నర్సింహారెడ్డిపై చీటింగ్ కేసు నమోదైంది. తన వద్ద నుంచి కోటి రూపాయలు తీసుకుని, తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని అతనిపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. 2017లో తన వద్ద కోటి రూపాయలు తీసుకున్నాడని... డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని... లైంగిక వేధింపులకు కూడా గురి చేశాడని తన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ఈ వ్యవహారంలో సెటిల్మెంట్ చేసుకోవాలని మరో మహిళ కూడా రాయబారం నడిపిందని ఆమె తెలిపింది. బాధితురాలి  ఫిర్యాదు మేరకు నర్సింహారెడ్డిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. యాంకర్ శ్యామల దంపతులు బుల్లితెరతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్ గానే ఉన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీళ్లద్దరు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారం కూడా చేశారు. ఏపీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలతో శ్యామల దంపతులకు మంచి సంబంధాలున్నాయి. ఇటీవలే తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్న వైఎస్ షర్మిలను కూడా కలిసి మద్దతు తెలిపారు.