గిల్లితే గిల్లించుకోవాలి.. నూరు గొడ్ల‌ను తిన్న రాబందు..

గిల్లితే గిల్లించుకోవాలి.. అర‌వొద్దు.. ఇది పోకిరి సినిమాలో పాపుల‌ర్ డైలాగ్‌. మూవీలో మాఫియా లీడ‌ర్ ప్ర‌కాశ్‌రాజ్ చెప్పే డైలాగ్ ఇది. ఈ డైలాగ్‌ సీఎం జ‌గ‌న్‌రెడ్డికి స‌రిగ్గా సూట్ అవుతుందంటూ సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ రఘురామ‌కృష్ణంరాజు. ఏపీలో క‌రోనా ఉధృతంగా ఉన్న వేళ‌.. ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు పెట్ట‌ల‌నుకోవడాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌డుతూ ఈ డైలాగ్‌ను గుర్తు చేశారు. ఎగ్జామ్స్ పెడుతూ.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి గిల్లితే ప్ర‌జ‌లు గిల్లించుకోవాలే కానీ, ప‌రీక్ష‌లు వ‌ద్దంటూ అర‌వొద్దు.. అనేది ర‌ఘురామ‌కృష్ణంరాజు ఉద్దేశ్యం. పోకిరి డైలాగ్‌ను ప్ర‌స్తుత ఏపీ ప‌రిస్థితికి సింక్ చేస్తూ.. సీఎం జ‌గ‌న్‌ను ఎద్దేవా చేసిన తీరు.. జ‌గ‌న్‌నే గిల్లిన‌ట్టుందంటూ జ‌నాలకు న‌వ్వులు తెప్పిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎన్నికలే వద్దంటూ రోడ్డు మీదకు వచ్చిన వారంతా ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు రాఘురామ‌. ‘‘పనికి మాలిన వారందరినీ పంపించావు కదా.. సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు కదా.. ఏమై పోయారు మీరంతా... ఇప్పుడు స్పందించండి. మాట్లాడండి... ప్రజలను చంపే హక్కు ప్రభుత్వానికి లేదు. దయచేసి.. ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌న్న‌ మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి’’ అని ఆయ‌న‌ వ్యాఖ్యానించారు.  మ‌రోవైపు, ఏపీలో క‌రోనా క‌ల్లోలం, ప్ర‌భుత్వం స్పందిస్తున్న తీరుపైనా ర‌ఘురామ విమ‌ర్శ‌లు గుప్పించారు.  ‘‘కరోనా మరణాల సంఖ్య బయటపెట్టండి. శ్మశానాల్లో ఒకలా ఉంటే రిపోర్టుల్లో మరోలా ఉంది. మీరు సలహాలు వినరూ.. ఇచ్చే ధైర్యం ఎవరికీ లేదు. ఎవరూ చెప్పనంత మాత్రాన.. ప్రజలు నోరు మూసుకుని కూర్చుంటారా? నూరు గొడ్లను తిన్న రాబందు.. గాలి వానకు చావలేదా.. తప్పుపై తప్పు చేసుకుంటూ దయచేసి వెళ్లొద్దు. ఇది నా చిరు సలహా. న్యాయమూర్తులను భయపెట్టడం మానేయండి. మీ కేసులను త్వరగా తేల్చుకోండి’’ అంటూ సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై మండిప‌డ్డారు ర‌ఘురామ‌కృష్ణంరాజు. 

స‌బ్బం హ‌రికి సీరియ‌స్‌.. క‌రోనా కాటు.. గెట్ వెల్ సూన్‌..

మాజీ ఎంపీ స‌బ్బం హ‌రికి ఇటీవ‌ల క‌రోనా సోకింది. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని తెలుస్తోంది. విశాఖ‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో వారం రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులు ఎంత ప్ర‌య‌త్నిస్తున్నా.. ఆయ‌న ఆరోగ్యం కుదుట ప‌డ‌టం లేదు. ఇంట‌ర్న‌ల్ ఆర్గాన్స్‌కి ఇన్ఫెక్ష‌న్ సోక‌డంతో ఆయ‌న హెల్త్ కండిష‌న్ సీరియ‌స్‌గా ఉంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.  ఈ నెల 15న స‌బ్బం హ‌రికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. వైద్యుల సూచన మేరకు మూడు రోజులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అయినా, ఆయ‌న కోలుకోక‌పోవ‌డంతో వెంట‌నే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. వారం రోజులుగా స‌బ్బం హ‌రికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అయితే, వైద్యుల ప్ర‌య‌త్నాలు అంత‌గా ఫ‌లించ‌డం లేద‌ని అంటున్నారు. స‌బ్బం హ‌రి ఆరోగ్య ప‌రిస్థితిపై తెలుగుదేశం శ్రేణులు ఆందోళ‌న చెందుతున్నారు.  1995లో విశాఖ‌ప‌ట్నం న‌గ‌ర‌పాల‌క సంస్థ మేయ‌ర్‌గా చేశారు. ఆ త‌ర్వాత కాలంలో కాంగ్రెస్‌లో చేరారు. అన‌కాప‌ల్లి నుంచి పార్ల‌మెంట్‌కు ఎన్నిక‌య్యారు. పార్ల‌మెంట్‌లో ఏపీ వాయిస్ గ‌ట్టిగా వినిపించేవారు. స‌బ్బం హ‌రికి మంచి వ‌క్త‌గా పేరుంది. ప్ర‌స్తుతం ఆయ‌న తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. జ‌గ‌న్‌రెడ్డి తీరుపై, వైసీపీ ప్ర‌భుత్వ విధానాల‌పై ప‌దునైన విమ‌ర్శ‌లు చేయ‌డంలో దిట్ట‌. సూటైన‌, ఘాటైన వ్యాఖ్య‌ల‌తో జ‌గ‌న్ స‌ర్కారును ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జాకోర్టులో దోషిగా నిల‌బెట్టేవారు. అందుకే, ఆయ‌న‌పై క‌క్ష క‌ట్టింది ఏపీ ప్ర‌భుత్వం. గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో.. రోడ్డుకు సెట్ బ్యాక్ వ‌ద‌ల లేదంటూ ఆయ‌న ఇంటి ప్ర‌హారీ గోడ కూల‌గొట్టి.. ప్ర‌తీకారం తీర్చుకుంది. అయినా, ప్ర‌భుత్వ బెదిరింపుల‌కు ఆయ‌న అద‌ర‌లేదు, బెద‌ర‌లేదు. జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌పై విమ‌ర్శ‌లు కొన‌సాగిస్తూనే ఉన్నారు. తాజాగా, స‌బ్బం హ‌రి క‌రోనా బారిన ప‌డ‌టం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టం ఆందోళ‌న‌క‌రం.

కరోనా లక్షణాలున్నా డ్యూటీ.. కన్నీళ్లు పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయ తాండవం చేస్తోంది. అన్ని జిల్లాల్లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరణాలు కూడా ప్రమాదకరంగా నమోదవుతున్నాయి. కరోనా కట్టడి చర్యల్లో ఉన్న ఉద్యోగులు, పోలీసులు కరోనా భారీన పడుతున్నారు. అయితే పోలీసులతో ఉన్నతాధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కోవిడ్ లక్షణాలున్నా బలవంతం డ్యూటీలు చేయిస్తున్నారని చెబుతున్నారు. అనారోగ్యంతో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్ల పరిస్థితి తీవ్రంగా మారుతుందని తెలుస్తోంది.  తాడిపత్రికి చెందిన ఓ కానిస్టేబుల్ సెల్పీ విడియో ఉన్నతాధికారుల వైఖరిని బట్టబయలు చేస్తోంది. ఓ కానిస్టేబుల్ కు కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నా విధులకు హాజరుకావాలంటూ ఆదేశాలిచ్చారు. ఈ నెల 20న కరోనా పరీక్షలు చేయించుకున్న కానిస్టేబుల్ గణేష్‌కు ఎస్ఐ ఖాజాహుస్సేన్ కోర్టు డ్యూటీ వేశారు. అయితే ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. ప్రాణాపాయస్థితిలో ఉన్న కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు. తాను కోవిడ్  బారిన పడినా ఎస్‌ఐ ఖాజా హుస్సేన్ ట్రాఫిక్ డ్యూటీ వేసి వేధించారంటూ గణేష్ అంబులెన్స్‌లో నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలను ఎస్ఐలు పట్టించుకోవడం లేదని, ఒకవేళ తాను చనిపోతే.. తన చావుకు ఎస్ఐ ఖాజా హుస్సేన్ కారణమంటూ కానిస్టేబుల్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ సెల్పీ వీడియో వైరల్ గా మారింది. వీడియోను చూసిన వాళ్లు కంట తడి పెడుతున్నారు. పోలీసుల జీవితాలతో ఉన్నతాధికారులు ఆటలాడుతున్నారని మండిపడుతున్నారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఇంత కర్కశంగా వ్యవహరించడమేంటనీ ప్రశ్నిస్తున్నారు. 

కరోనా మందులపై ఎమ్మెల్యే, DMHO వార్ 

కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తోంది. అధికారులను ఆందోళన పెడుతోంది. ప్రజా ప్రతినిధులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనా కట్టడి, చికిత్స విషయంలో ప్రజాప్రతినిధులపై జనాలు ఫైరవుతున్నారు. దీంతో తమ కోపాన్ని కొందరు నేతలు అధికారులపై చూపిస్తున్నారు. నేతల తీరుతో అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు తిరుగుబాటు చేస్తున్నారు.  కరోనా మందుల విషయంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కాన్ఫరెన్స్ కార్యాలయంలో కొవిడ్ సమీక్ష సమావేశం నిర్వహించగా, ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల లెక్కల్లో తేడాపై ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు విసురుకున్నారు.రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల కోసం రాజకీయ పైరవీలు ఎక్కువయ్యాయని రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంజెక్షన్లు ఇవ్వలేదని ఎమ్మెల్యే జోగు రామన్న తనపై కక్ష కట్టారని, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్ కు ఎక్కడ తరలిపోయాయో ఆధారాలు చూపించాలని బలరాం నాయక్ అన్నారు. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పందిస్తూ, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల కోసం తాను ఎవరికీ రికమెండ్ చేయలేదని స్పష్టం చేశారు. సమావేశం తర్వాత రిమ్స్ లో పర్యటించారు ఎమ్మెల్యే జోగు రామన్న.  హాస్పిటల్ లో కోవిడ్ మందులు, చికిత్స పై ఆరా తీశారు. కరోనా రోగులతోనూ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. 

పరీక్షలో నెగిటివ్.. ఊపిరాడక గంటలోనే మృతి! 

కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. పల్లె, పట్నం తేడా లేకుండా పట్టి పీడిస్తోంది. జ్వరం వస్తే చాలు జనం వణికిపోతున్నారు. సాధారణ జ్వరమో, కరోనా రోగమో తెలియక భయపడి పోతున్నారు. కరోనా టెస్టుల ఫలితాల్లోనూ తప్పులు జరుగుతుండటం మరింత ఆందోళన కల్గిస్తోంది. రాపిడ్ యాంటిజెన్ టెస్టుల్లో గందరగోళ ఫలితాలు వస్తున్నాయి. కరోనా లక్షణాలున్నా కొందరికి పరీక్షలో నెగిటివ్ వస్తోంది. ఎలాంటి లక్షణాలు లేనివారికి పాజిటివ్ వస్తోంది. దీంతో నెగిటివ్ వచ్చిన వారు సంతోషంగా ఉంటున్నా.. కొన్ని రోజులకే వారికి పరిస్థితి విషమిస్తోంది. కొందరు ప్రాణాలు కూడా పోగుట్టుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘటన అందరిని కన్నీళ్లు పెట్టిస్తోంది.  నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గం గ్రామానికి చెందిన అశోక్ కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కరోనా నిర్ధరణ పరీక్ష కోసం రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు. తనతో పాటు భార్యను తీసుకెళ్లాడు. పరీక్ష చేయించుకున్న తర్వాత నెగిటివ్ అని తేలింది. దీంతో భార్యభర్తలిద్దరు సంతోషపడ్డారు. కాసేపు చెట్టు కింద సేదతీరదామని భర్త అంటే ఇద్దరూ అక్కడే కూర్చున్నారు. అంతలోనే అతను ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడ్డాడు. గమనించివ భార్య ఏం చేయాలో పాలుపోక గందరగోళానికి గురైంది. ఏమవుతుందో అర్థమయ్యే లోపే అతను మృతి చెందాడు. కళ్ల ముందే కట్టుకున్న వాడి ఊపిరి ఆగిపోవడం చూసి ఆ మహిళ గుండెలవిసేలా రోదించింది. కరోనాతో మృతి చెందాడో లేదో కానీ.. చావైనా.. బతుకైనా తనతోనేని అనుకున్న ఆ మహిళ.. తన పెనిమిటి ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఏమయ్యా.. లేవయ్యా.. ఇంటికి పోదాం పదా పిల్లలు ఎదురు చూస్తుంటారు అంటూ ఆమె రోదించిన తీరు అక్కడున్న వారి చేత కంటతడి పెట్టించింది.

పైశాచిక ఆనందం.. అర్థ‌రాత్రి అరాచ‌కం.. ఎగ్జిక్యూటివ్ కేపిట‌ల్ అంటే ఇదేనా?

ఎగ్జిక్యూటివ్ కేపిట‌ల్ అంటే ఇదేనా? ప‌రిపాల‌న రాజ‌ధాని అంటే ఇలానే ఉంటుందా? అర్థ‌రాత్రి ఈ అరాచ‌కాలేంటి? కూల్చివేత‌ల‌తో ఈ రాజ‌కీయ‌ క‌ల్లోలం దేనికి? ఇదేనా పాల‌నంటే? ఇందుకేనా జ‌గ‌న్‌రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చింది? శిథిలాల‌తో రాజ‌ధాని నిర్మించాల‌ని ఎవ‌రైనా అనుకుంటారా? శాప‌నార్థాల మ‌ధ్య శాసించాల‌ని ఎవ‌రైనా కోరుకుంటారా? ప్ర‌శాంత విశాఖ‌లో ఈ బుల్డోజ‌ర్ల బ‌రితెగింపు ఎందుకు? సాగ‌ర తీరంలో అధికార బ‌ల ప్ర‌యోగం ఏ ప్ర‌యోజ‌నాల‌కు? ఇవీ ఇప్పుడు విశాఖవాసులు స‌ర్కారును నిగ్గ‌దీసి అడుగుతున్న ప్ర‌శ్న‌లు. స‌బ్బం హ‌రి, గీతం వ‌ర్సిటీ, ప‌ల్లా శ్రీనివాస్‌.. విశాఖ‌లో టీడీపీ నేత‌ల ఆస్తులే ప్ర‌భుత్వ టార్గెట్‌. విధ్వంస‌మే వారి విధానం. అరాచ‌క‌మే వాళ్ల అజెండా. కూల్చివేత‌ల వెనుక రాజ‌కీయ కుట్ర‌. ప‌రిపాల‌నా రాజ‌ధానిలో ప్ర‌తిప‌క్ష పార్టీని దెబ్బ‌తీయ‌డ‌మే వారి వ్యూహం. అన్ని క‌లిసి.. వ‌రుస కూల్చివేత‌ల‌తో.. అర్థ‌రాత్రి స్వాతంత్రాన్ని హ‌రించివేస్తున్నాయి.  అర్థ‌రాత్రి స‌మ‌యం. విశాఖ‌ప‌ట్నం ప్ర‌శాంతంగా నిద్ర‌పోతోంది. సాగ‌ర ఘోష మిన‌మా మ‌రెలాంటి అల‌జ‌డి లేదు. అంత‌లోనే పాత గాజువాక‌లో గున‌పాలు, డ్రిల్ల‌ర్ల చ‌ప్పుడు. చెవులు చిట్లిపోయేంత సౌండ్‌. అంతెత్తున క‌ట్టిన కాంక్రీట్ భ‌వ‌నాన్ని బ‌ల‌వంతంగా కూల్చేస్తున్నారు జీవీఎంసీ అధికారులు. ఆ బిల్డింగ్ టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీనివాస్‌కి చెందింది. రోడ్డుకు సెట్ బ్యాక్ వ‌ద‌ల‌లేదంటూ భ‌వ‌నాన్ని కూల్చేశారు సిబ్బంది. క‌నీసం ఉద‌యం వ‌ర‌కు కూడా ఆగ‌లేదు. తెల్లారితే ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌తార‌నే భ‌య‌మేమో. అర్థ‌రాత్రి బ‌ల‌ప్ర‌యోగంతో భ‌వ‌నాన్ని ప‌డ‌గొట్టేశారు. శ‌నివారం రాత్రి వ‌ర‌కూ గాజువాక సెంట‌ర్‌లో గంభీరంగా క‌నిపించిన ఆ భ‌వ‌నం.. తెల్లారేస‌రికి శిథిల భ‌వ‌నంగా మిగిలింది. ప్ర‌భుత్వ అరాచ‌కాల‌కు మ‌రో నిద‌ర్శ‌నంగా మారింది.  ప‌ల్లా శ్రీనివాస్ మామూలు నాయ‌కుడు కాదు. ఇటీవ‌ల‌ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా సుదీర్ఘ‌ దీక్ష చేసి వార్త‌ల్లో నిలిచారు. ప్ర‌జ‌ల ప‌క్షాన.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా దీక్ష‌ చేయ‌డం.. అధికార పార్టీకి ఆగ్ర‌హం తెప్పించింది. ఆ దీక్ష‌కు ఫ‌లిత‌మే.. ఇప్పుడీ ప‌నిష్మెంట్‌. అందుకే, ఆయ‌న్ను టార్గెట్ చేశారంటున్నారు.  అర్థరాత్రి ప‌ల్లా శ్రీనివాస్ బిల్గింగ్ కూల్చివేతకు రాజ‌కీయ కుట్రే కార‌ణ‌మంటున్నారు. నోటీసులు కూడా ఇవ్వ‌కుండా బిల్డింగ్ ఎలా కూల్చేస్తార‌నేది ప‌ల్లా శ్రీనివాస్ ప్ర‌శ్న‌. ఇంత అర్థ‌రాత్రి దొంగ‌ల్లా భ‌వ‌నం మీద ప‌డ‌ట‌మేంట‌ని నిల‌దీత‌. వైసీపీలోకి రావాల‌ని త‌న‌ను ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఆహ్వానించార‌ని.. తాను వైసీపీలో చేర‌నందుకే త‌న భ‌వ‌నాన్ని కూల్చివేశార‌నేది ప‌ల్లా శ్రీనివాస్ ఆరోప‌ణ‌. త‌న‌ భవనాన్ని కూల్చి విజయసాయిరెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని ప‌ల్లా మండిపాటు.   విశాఖ‌లో ఇలా అర్థ‌రాత్రి కూల్చివేత‌ల ప‌ర్వం ఇదే మొద‌టిది కాదు. గ‌తేడాది అక్టోబ‌ర్‌లో ఇలాంటివే రెండు ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. గ‌తంలో విశాఖలో టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి ప్రహరీ, మరుగుదొడ్డిని జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. ప్ర‌భుత్వ స్థ‌లాన్ని ఆక్ర‌మించారంటూ జేసీబీలు, వందలాదిమంది పోలీసులతో సీతమ్మధారలోని ఆయన నివాసం ద‌గ్గ‌ర తెల్లవారుజాము 3.30 గంటలకు విధ్వంసం సృష్టించడం అప్ప‌ట్లో క‌ల‌క‌లం రేపింది. ముంద‌స్తు నోటీసులు ఇవ్వ‌కుండా ఎలా కూల్చేస్తారంర‌టూ అప్పుడూ ప‌ల్లా శ్రీనివాస్ లానే సబ్బం హ‌రి కూడా అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అధికారులు ప‌ట్టించుకుంటేగా! ఉద‌యానిక‌ల్లా ప‌ని పూర్తి చేసి వెళ్లిపోయారు. జగన్‌ ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తున్న వారిలో సబ్బంహరి ఒకరు కావడంతో... ఇదంతా ‘కక్ష సాధింపులో భాగమే’ అనే ఆరోపణలు వెల్లువెత్తాయి.  ఆ త‌ర్వాత గీతం వ‌ర్సిటీ ఎపిసోడ్‌. ఎండాడ, రుషికొండ పరిధిలో 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిని.. గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆక్రమించిందంటూ అధికారులు తెల్లవారుజామున కూల్చివేత‌ల‌కు పాల్ప‌డ్డారు. భారీ పోలీస్ బ‌ల‌గాల నుడ‌మ‌.. గీతం వ‌ర్సిటీ ప్ర‌ధాన గేటు, కాంపౌండ్ వాల్‌, సెక్యూరిటీ బ్లాక్స్‌ల‌ను బుల్డోజ‌ర్ల‌తో కూల్చేశారు. ఫెన్సింగ్ చుట్టి.. ప్ర‌భుత్వ భూమి అంటూ బోర్డు పాతేశారు. సినీ నటుడు బాలకృష్ణ చిన్నఅల్లుడు, టీడీపీ నేత అయిన శ్రీభరత్ గీతం వర్సిటీ చైర్మన్‌గా ఉండ‌టంతో.. ఇది రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్యేనంటూ అప్పుడు సైతం ఇలానే ర‌చ్చ ర‌చ్చ జ‌రిగింది.  ఇలా.. టీడీపీకి చెందిన‌ స‌బ్బం హ‌రి, భ‌ర‌త్‌, ప‌ల్లా శ్రీనివాస్‌ల‌కు చెందిన ఆస్తుల కూల్చివేత‌లు.. జీవీఎమ్‌సీని ముందుంచి చేస్తున్న రాజ‌కీయ ప్రేరేపిత దాడులేన‌నేది ప్ర‌తిప‌క్ష పార్టీ ఆరోప‌ణ‌. కూల్చివేతలకు అధికారులు ఎంచుకొన్న సమయం, కూల్చిన తీరుతో రాజకీయ వేడి మ‌రింత రాజుకుంటోంది. ఏమీటీ సైకోయిజం? అంటూ గ‌తంలోనే చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. సీఎం జ‌గ‌న్ డైరెక్ష‌న్‌లో.. ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చేస్తున్న అరాచ‌కాలంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌రిపాల‌నా రాజ‌ధాని అంటే.. కూల్చివేత‌ల‌తో ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేయ‌డమేనా? అంటూ ప్ర‌శ్నించారు. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు చేస్తున్న అర్థ‌రాత్రి అరాచ‌కాల‌కు స‌రైన స‌మ‌యంలో ప్ర‌జ‌లే స‌రైన బుద్ధి చెబుతార‌ని మండిప‌డ్డారు.   విశాఖ‌లో ప్ర‌తిప‌క్షానికి బ‌ల‌మైన నాయ‌క‌త్వం లేకుండా వారిని న‌యానో, భ‌యానో లొంగ‌దీసుకోవ‌డ‌మే వైసీపీ వ్యూహం. అందుకే ఇలా కూల్చివేత‌లతో వారిపై పొలిటిక‌ల్ ప్రెజ‌ర్ పెంచుతోంది. చిన్న చిన్న లొసుగుల‌ను బూచీగా చూపించి.. అర్థ‌రాత్రి బుల్డోజ‌ర్ల‌ను, పోలీసుల‌ను మోహ‌రించి.. త‌మ దారికి తెచ్చుకునే కుతంత్రం అమ‌లు చేస్తోంది. ఇప్ప‌టికే గంటా శ్రీనివాస‌రావుకు గాలం వేశారు. ఆయ‌న వారి వ‌ల‌కు చిక్కిచిక్క‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌బ్బం హ‌రి, శ్రీ భ‌ర‌త్‌, ప‌ల్లా శ్రీనివాస్‌ల‌కు కూల్చివేత‌లతో హెచ్చ‌రిక‌లు పంపించారు. కుదిరితే వారిని పార్టీలో చేర్చుకోవ‌డం.. కుద‌ర‌కపోతే ప్ర‌భుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడ‌కుండా నోళ్లు మూయించ‌డం.. ఇదే వైసీపీ ప్ర‌భుత్వ విధానం.. అందుకే ఈ అర్థ‌రాత్రి కూల్చివేత‌ల అరాచ‌కం.. అంటోంది ప్ర‌తిప‌క్షం. 

గాలిలో గంటపాటు వైరస్! థర్డ్ వేవ్ డేంజర్  

కరోనా సెకండ్ వేవ్ తో ప్రపంచం వణికిపోతోంది. భారత్ లో పరిస్థితి దారుణంగా తయారైంది. సెకండ్ వేవ్ ఉధృతితో దేశంలో కరోనా కేసులు, మరణాలు ఊహించని విధంగా నమోదవుతున్నాయి. మే రెండో వారం నాటికి భారత్ లో రోజువారి కేసులు మిలియన్, మరణాలు ఐదు వేలకు చేరవచ్చని పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. భారత్ లో ప్రస్తుతం విజృంభిస్తున్న వేరియంట్లలో కొన్ని గాలిలోనూ వ్యాపిస్తున్నాయని సీసీఎంబీ ఇటీవలే ప్రకటించింది. అయితే వైరస్ గాలిలో కొన్ని నిమిషాల పాటే ఉండే అవకాశం ఉందని చెప్పారు.  కరోనా సెకండ్ వేవ్ అత్యంత ప్రమాదకరంగా మారంగా.. ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. గాలి ద్వారా వ్యాపించే కొత్త రకం కరోనా వైరస్‌ను తమ దేశంలో గుర్తించినట్లు శ్రీలంక అధికారులు తెలిపారు. ఇక్కడ ఇప్పటికే కనుగొన్న రకాలతో పోలిస్తే చాలా ఉద్ధృతంగా ఇది విస్తరిస్తోందని చెప్పారు. ఈ కొత్త రకం వైరస్ గాల్లో దాదాపు గంటసేపు మనుగడ సాగించగలదని శ్రీ జయవర్ధనపుర విశ్వవిద్యాలయంలో ఇమ్యునాలజీ విభాగం అధిపతి నీలికా మలవిగే చెప్పారు. శ్రీలంకలో కొన్ని రోజులుగా యువత కొవిడ్‌-19 బారినపడుతోంది. కొత్త రకం స్ట్రెయిన్ కారణంగానే యూత్ అఫెక్ట్ అవుతున్నారని అక్కడి సైంటిస్టులు భావిస్తున్నారు. శ్రీలంకలో వెలుగుచూసిన కొత్త స్ట్రెయిన్ వైరస్ థర్డ్ వేవ్ కి దారితీయవచ్చని ప్రజారోగ్య నిపుణుడు ఉపుల్‌ రోహానా చెప్పారు.      ఇరాక్‌లోని బాగ్దాద్‌లో గల ఒక ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆసుపత్రిలో కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇబ్న్ ఖతీబ్ ఆసుపత్రిలో మంటలు చెలరేగడంతో పలువురు గాయపడ్డారు. ఆక్సిజన్ ట్యాంక్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో 200 మందికి పైగా కరోనా బాధితులతో పాటు వైద్య సిబ్బంది ఉన్నారు. 

లాక్ డౌన్ తోనే కరోనా కట్టడి! ముంబైలో తగ్గుతున్న కేసులు

దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. వైరస్ కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఢిల్లీలో సంపూర్ణ లాక్ డౌన్ విధించగా... చాలా రాష్ట్రాల్లో నెట్ కర్ఫ్యూ అమలవుతోంది. కొన్ని ప్రాంతాల్లో వీకెండ్ లాక్ డౌన్ విధించారు. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లోకల్ గానే లాక్ డౌన్ విధించుకుంటున్నారు. అయితే కరోనా  కట్టడికి లాక్ డౌన్ ఏకైక మార్గమని తెలుస్తోంది. కరోనాతో విలవిలలాడిన ముంబైలో లాక్ డౌన్ తర్వాత కేసులు కొంత తగ్గడమే ఇందుకు నిదర్శనం.  కరోనా కేసులు భారీగా పెరగడంతో మహారాష్ట్ర సర్కార్ లాక్‌డౌన్ అని చెప్పకున్నా... దాదాపుగా అలాంటి తరహాలోనే కఠిన రూల్స్ అమలు చేస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ముంబై నగరంలో సత్ఫలితాలనిచ్చింది. ముంబైలో గతంతో పోల్చుకుంటే కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య 50 శాతానికి పడిపోయింది. ఏప్రిల్ 4న ముంబైలో 11,163 కేసులు నమోదు కాగా.. శనివారం కేవలం 5,888 కరోనా కేసులే నమోదయ్యాయి.  లాక్‌డౌన్ వల్ల ముంబైలో కరోనా వ్యాప్తి తగ్గిందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏప్రిల్ 19న కూడా ముంబైలో 8000 కేసులు నమోదయ్యాయి. కానీ.. కేవలం వారం రోజుల గడిచే సరికి 24 గంటల్లో 5,888 కరోనా కేసులే నమోదు కావడం ముంబై నగర ప్రజలకు కాస్త ఊరట కలిగించే విషయం.ముంబైలో ఆదివారం నమోదైన కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య కూడా శనివారంతో పోల్చుకుంటే తగ్గింది. ముంబైలో ఆదివారం కొత్తగా 5,192 కరోనా కేసులు, 46 కరోనా మరణాలు నమోదయ్యాయి. ముంబైలో  పాజిటివిటీ రేట్ కూడా గత వారం 18 శాతం ఉండగా.. ప్రస్తుతం 15 శాతానికి పడిపోయింది. శుక్రవారం ముంబైలో 7,221 కరోనా కేసులు నమోదు కాగా.. శనివారం 5,888 కేసులు మాత్రమే నమోదయ్యాయి. శుక్రవారంతో పోల్చుకుంటే శనివారానికి కొత్తగా నమోదయిన కేసుల సంఖ్య 20 శాతం తగ్గింది. ముంబైలో లాక్‌డౌన్ తరహా కఠిన ఆంక్షలు అమలు చేయడం వల్లనే కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లు స్పష్టమవుతోంది. ముంబై నగరంలో మొత్తం 120 కంటైన్మెంట్ జోన్లను ప్రభుత్వం గుర్తించింది. మే 1 వరకూ ముంబైలో కఠిన ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంది.మే 1 తర్వాత కూడా ఈ ఆంక్షలను పొడిగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఏపీలో దొంగల రాజ్యం! కరోనా కల్లోలంలో కూల్చివేతలా..

విశాఖలో టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు ఇంటిని జీవీఎంసీ అధికారులు కూల్చడంపై రాజకీయ రచ్చ సాగుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి అధికారులు ఇంటిని కూల్చడంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. జనాలంతా కరోనాతో వణుకుతుంటే.. జగన్ రెడ్డి సర్కార్ ఇలాంటి చర్యలకు దిగడం ఏంటనే ప్రశ్నిస్తున్నారు.  ప్రజల ప్రాణాలు గాలికొదిలి ప్రతిపక్ష నేతల భవనాలు కూల్చే పనిలో జగన్ రెడ్డి బిజీగా ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ భవనాన్ని కూల్చివేతపై స్పందించిన .. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు  అంటూ నినదించి కార్మికుల పక్షాన నిలిచినందుకే పల్లా శ్రీనివాస్‌పై కక్ష చర్యలకు దిగారన్నారు. విశాఖ ఉక్కుని తుక్కు రేటుకి కొట్టేయాలని ప్లాన్ చేసిన జగన్ రెడ్డికి అడ్డొచ్చారనే అక్కసుతోనే ఆదివారం పూట పల్లా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కనీసం నోటీసు ఇవ్వకుండా, చట్టాన్ని తుంగలో తొక్కి యుద్ధవాతవరణంలో భవనాన్ని కూల్చివేయడాన్ని, కక్షసాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జగన్ రెడ్డి జేసీబీ ఊపులకు భయపడే వారు ఎవరూ లేరని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటికరణ కాకుండా ఉండటానికి టీడీపీ దేనికైనా సిద్ధమేనని నారా లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలి, పనిదినాల్లో అక్రమాలు, సెలవుదినాల్లో విధ్వంసాలకు పాల్పడుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.  ఇంట్లో మనుషులు లేని సమయం చూసి దొంగలు పడ్డట్టు కోర్టు సెలవు రోజుల్లోనే జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష్య పూరితంగా టీడీపీ నేతల ఇల్లు, భవనాలు కూల్చివేస్తోందని మండిపడ్డారు. విశాఖలో టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ భవనాన్ని జీవీఎంసీ అధికారులు కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తెల్లవారుజామున దొంగల్లా వచ్చి భవనాన్ని కూల్చడం దారుణమన్నారు. విద్వేషం, విధ్వంసం లేకుండా వైసీపీకి ఉనికి లేదన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేసిన పల్లా శ్రీనివాస్‌పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం దుర్మార్గమన్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ప్రజా వేదిక మొదలు ప్రతిపక్ష నేతల ఇళ్లు ఎన్ని కూల్చారో లెక్కేలేదన్నారు. రాష్ట్రాన్ని మనుషులు పాలిస్తున్నారా? లేక రాక్షసులు పాలిస్తున్నారా? అన్నది అర్ధం కావడంలేదన్నారు. రోజురోజుకి వైసీపీ రాక్షస సంస్కృతి  శృతి మించుతోందన్నారు. అధికారం శాశ్వతం కాదని, తగిన మూల్యం చెల్లించక తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

ఏపీలో ఆగని కక్ష రాజకీయం.. టీడీపీ నేత ఇల్లు కూల్చివేత

దేశమంతా కరోనా కల్లోలంతో అల్లాడుతోంది. మహమ్మారి పంజాతో పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. కరోనా కట్టడికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి ప్రభుత్వాలు. ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా విలయ తాండవం చేస్తోంది. కొన్ని రోజులుగా 11 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనాతో జనాలు వణికిపోతుండగా ఏపీ సర్కార్ మాత్రం కక్ష రాజకీయాలకు పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. సంగం డెయిరీ కేసులో శనివారం తెల్లవారు జామున టీడీపీ సీనియర్ నేత దూళిపాళ నరేంద్రను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఆ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే విశాఖలోని టీడీపీ నేత ఇంటిని జీవీఎంసీ అధికారులు రాత్రికి రాత్రే కూల్చేశారు.  విశాఖకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‎కి చెందిన బిల్డింగ్‎ను జీవీఎంసీ సిబ్బంది కూల్చివేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణం జరిపారంటూ జీవీఎంసీ అధికారులు బిల్డింగ్‎ను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న పల్లా శ్రీనివాస్ అక్కడికి చేరుకున్నారు. రాత్రి సమయంలో నిర్మాణాన్ని తొలగించడం అన్యాయమని..నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని ఎలా తొలగిస్తారని జీవీఎంసీ సిబ్బందిని ప్రశ్నించారు. రోడ్డుకు సెట్ బ్యాక్ వదలలేదంటూ బిల్డింగ్ కూల్చివేశామని అధికారులు తెలిపారు. రాత్రికిరాత్రే భవనాన్ని కూల్చివేస్తారని అధికారులపై మండిపడ్డారు. దీనిపై సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున్న అక్కడికి చేరుకున్నారు. దీంతో ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీయకుండా భారీగా పోలీసులు మోహరించారు.

బెజ‌వాడ‌లో బెడ్స్ ఫుల్‌.. ఏపీలో క‌రోనా క‌ల్లోలం.. సీఎం జ‌గ‌న్ వైఫ‌ల్యం!

కొవిడ్ సోకితే ప్ర‌మాద‌కరం. మీరు విజ‌య‌వాడ‌, ఒంగోలు వాసులైతే అత్యంత ప్ర‌మాద‌క‌రం. స్వ‌ల్ప వ్యాధి ల‌క్ష‌ణాల‌తో హోం ఐసోలేష‌న్‌లో ఉంటే ఓకే. ఒక‌వేళ అనారోగ్యం ముదిరితే.. ఇక అంతే సంగ‌తి. ఎందుకంటే, విజ‌య‌వాడ‌, ఒంగోలు ఆసుప‌త్రుల్లో బెడ్స్ ఖాళీ లేవు. గంట‌ల త‌ర‌బ‌డి వెయిట్ చేసినా బెడ్స్ దొర‌క‌ని దుస్థితి. అంబులెన్సుల్లోనే ప‌డిగాపులు గాస్తున్న క‌రోనా పేషెంట్స్ ఎంద‌రో ఉన్నారు. హాస్పిట‌ల్స్‌లో ఖాళీ లేక‌, స‌కాలంలో చికిత్స అంద‌క వారంతా న‌ర‌క‌యాత‌న ప‌డుతున్నారు. జ‌నాలు క‌రోనాతో పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. కొవిడ్ భ‌యంతో మృత‌దేహాలు తీసుకెళ్ల‌డానికి కూడా కుటుంబ స‌భ్యులు ముందుకు రావ‌డం లేదు. విజ‌య‌వాడ ఆసుప‌త్రి మార్చురీ ద‌గ్గ‌ర ఆరుబ‌య‌టే మృత‌దేహాలు ఉండ‌టం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు నిద‌ర్శ‌నం.  అటు, ప్రకాశం జిల్లా ఒంగోలులో పడకలు లేక కొవిడ్‌ రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గత మూడు రోజులుగా జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అనేక మందికి హాస్పిట‌ల్‌లో చేరాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. ఒంగోలు సర్వజన ఆస్పత్రిలో గత రెండు రోజులుగా కొత్తగా చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. డిశ్చార్జ్‌ అవుతున్న వారి సంఖ్య మాత్రం తక్కువగా ఉంది. ఆస్పత్రిలో మొత్తం 1100 పడకలు ఉండగా.. వాటిలో 850 పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం ఉంది. అవన్నీ కొవిడ్‌ బాధితులతో నిండిపోయాయి. అత్యవసర కేసులు వస్తే ఎవరైనా డిశ్చార్జ్‌ అయితే చేర్చుకుంటున్నారు. వ్యాధి తీవ్రతతో ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉన్నవారికి.. బెడ్స్ లేక నేల మీదే ప‌డుకోబెట్టి ఆక్సిజన్‌ అందిస్తున్నారు. ఒంగోలు, విజ‌య‌వాడ‌తో పాటు ఏపీలో అనేక చోట్ల ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.  మ‌రోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 50,972 పరీక్షలు నిర్వహించగా.. 11,698 కేసులు పాజిటివ్ వ‌చ్చాయి. 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఏపీలో 10,20,926 మంది వైరస్‌ బారినపడ్డారు. 24 గంటల వ్యవధిలో 4,421 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,31,839కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 81,471 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,59,31,722 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా గుంటూరులో 1,581, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 292 కేసులు నమోదయ్యాయి.    కొవిడ్‌తో తూర్పు గోదావరి, నెల్లూరులో ఆరుగురు చొప్పున; అనంతపురం, చిత్తూరులో నలుగురేసి; శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి ముగ్గురు చొప్పున; గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లాలో ఒక్కరు చనిపోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,616కి చేరింది.  ప‌రిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ప్ర‌భుత్వం మాత్రం ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయ‌క‌పోవ‌డంపై ప్ర‌తిప‌క్ష టీడీపీ తీవ్ర స్థాయిలో మండిప‌డుతోంది. విద్యార్థుల ప్రాణాల‌కు ఎవ‌రు సీఎం జ‌గ‌న్ బాధ్య‌త వ‌హిస్తారా? అంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ నిల‌దీశారు. ప్ర‌భుత్వం పంతానికి పోకుండా వెంట‌నే ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.  క‌రోనా క‌ట్ట‌డిలో ఏపీ ప్ర‌భుత్వం దారుణంగా విఫ‌లమైంద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు విమ‌ర్శిస్తున్నారు. కొవిడ్ విష‌యంలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యం నుంచి ప్ర‌జ‌ల‌ను ప‌క్క దారి ప‌ట్టించేందుకే టీడీపీ నేత ధూళిపాళ్ల న‌రేంద్ర‌ను అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. ఏపీలో కొవిడ్ క‌ల్లోలం సృష్టిస్తుంటే.. ఆసుప‌త్రిలో బెడ్స్ లేక రోగులు ఇబ్బంది ప‌డుతుంటే.. ప్ర‌భుత్వం చేత‌గాక‌, చేతులెత్తేసి.. ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ ప్ర‌తిప‌క్షం  ఆక్షేపిస్తోంది. 

కరోనా పాపం ప్రభుత్వానిదే! మోడీని టార్గెట్ చేసిన గ్లోబల్ మీడియా

భారత్‌లో కరోనా విజృంభణపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, ఏబీసీ వంటి సంస్థలు భారత్‌లోని పరిస్థితిపై పలు వార్తలు ప్రచురించాయి. కరోనా పంజాపై విశ్లేషణలు చేస్తున్న అంతర్జాతీయ మీడియా సంస్థలు..  ప్రభుత్వ వైఫల్యం వల్లే భారత దేశం ప్రమాదంలో పడిందని వెల్లడిస్తున్నాయి.  భారత్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి విచారకరమని వ్యాఖ్యానించిన వాషింగ్టన్ పోస్ట్.. జాగ్రత్తలు కొనసాగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపింది. కరోనా ఆంక్షలు ముందస్తుగానే సడలించడంతో కరోనా పేట్రేగిపోయిందని అభిప్రాయపడింది. అతివిశ్వాసం కారణంగానే కరోనాను ఎదుర్కొవడంలో భారత్ ప్రభుత్వం తడబడిందంటూ ది గార్డియన్ తన ఎడిటోరియల్‌లో ఘాటు వ్యాఖ్యలు చేసింది. భారత్‌లోని పరిస్థితి ప్రపంచానికి గుణపాఠం కావాలి అని కూడా వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తప్పటడుగులు, ప్రజల నిర్లక్ష్యమే సంక్షోభం తీవ్రమవడానికి కారణం అని న్యూయార్క్ టైమ్స్ స్పష్టం చేసింది. ఈ కారణాల రీత్యా విజయం దిశగా వెళుతున్న భారత్ కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది అని పేర్కొంది. భారత్‌లో పరిస్థితి ఇలాగే కొనసాగితే..ఇది ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కూడా న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది. ఇన్ఫెక్షన్లను నిరోధించడం, టీకాలు విస్తృతంగా అందుబాటులోకి తేవడమే ప్రస్తుతం భారత్ ముందున్న మార్గమని స్పష్టం చేసింది.  కరోనా నిబంధనలను నిర్లక్ష్యం చేయడమే ప్రస్తుత పరిస్థితి కారణమని ఏబీసీ ఆస్ట్రేలియా తేల్చింది. సరైన చర్యలు తీసుకుని ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదనే అభిప్రాయం నిపుణుల్లో ఉందని పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో లోపాలు, ప్రజల్లో అలసత్వం, కొత్త వేరియంట్లు ఉనికిలోకి రావడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని ప్రచురించింది. భారత్ లో నెలకొన్న ప్రస్తుత సంక్షోభానికి బాధ్యత ప్రభుత్వానిదే అని టైమ్స్ స్పష్టం చేసింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు రాజకీయంగా పైచేయి సాధించడంపై దృష్టి పెట్టడంతో వైరస్ మరో దాడి చేసిందని వ్యాఖ్యానించింది. కరోనాను అడ్డుకోవడంలో రక్షణాత్మక విధానాన్ని త్యజించడం ద్వారా భారత్ మరిపోలేని తప్పు చేసిందని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యానించింది. పేదరికం, జనాభా అధికంగా ఉన్న భారత్‌లో కరోనా కేసులు పెరుగుదల..మరి కొన్ని వారాలు పాటు కొనసాగుతుందని పేర్కొంది. భారత్‌‌ ఆస్పత్రుల్లో దర్శనమిస్తున్న దృశ్యాలు గుండెలు పిండేస్తున్నాయని పాకిస్థాన్‌కు చెందిన డాన్ పత్రిక పేర్కొంది. 

సంగం వ‌ర్సెస్ అమూల్‌.. జ‌గ‌న్‌రెడ్డి స్కెచ్ ఏంటి?

సంగం డెయిరీ వ‌ర్సెస్ అమూల్. హెరిటేజ్ మిల్క్‌ వ‌ర్సెస్ అమూల్ మిల్క్‌. విజ‌య పాలు వ‌ర్సెస్ అమూల్ పాలు. ఒంగోలు మిల్క్, విశాఖ పాలు, తిరుమ‌ల పాలు.. ఇలా ఏపీలోని పాల కంపెనీల‌న్నిటికీ అమూల్ పాలు ప్ర‌ధాన పోటీ దారుగా మారింది. అమూల్ పాలు తాగుతోంది ఇండియా.. అంటూ ఇన్నాళ్లూ టీవీల్లో మాత్ర‌మే యాడ్స్ చూశాం. ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల‌చే బ‌ల‌వంతంగా అమూల్ మిల్క్ తాగించే ప్ర‌య‌త్నం, కుతంత్రం జ‌రుగుతోందనేది ఆరోప‌ణ. ద‌శాబ్దాలుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రైతుల‌కు కొంగు బంగారంగా ఉన్న పాడి సంస్థ‌ల‌ను ఏక‌మొత్తంగా క‌బ‌లించే కుట్ర చేస్తున్నార‌ని అనుమానం. ఇందులో ప్ర‌భుత్వమే ప్ర‌ధాన పాత్ర‌ధారి, సూత్ర‌ధారి కావ‌డం మ‌రింత ప్ర‌మాద‌కరం అంటున్నారు.  సంగం డెయిరీ ఛైర్మ‌న్ ధూళిపాళ్ల న‌రేంద్ర అరెస్ట్‌తో ఏపీలో క‌ల‌క‌లం. అమూల్ మిల్క్ కోస‌మే ఈ అరెస్ట్ అంటూ ప్ర‌తిప‌క్షం విమ‌ర్శ‌లు. దీంతో.. అస‌లు ఏంటీ అమూల్ మిల్క్‌?  గుజ‌రాత్ నుంచి ఏపీకి ఎందుకొచ్చింది? ఎవ‌రు తీసుకొచ్చారు? వ్యాపారం కోస‌మేనా? మ‌రేదైనా కార‌ణం ఉందా? అనే అనుమానాలు అంద‌రిలోనూ..    అమూల్‌తో ఏపీ ప్ర‌భుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గ‌తేడాది ఏపీలోని ప‌లు గ్రామాల్లో రైతు భ‌రోసా కేంద్రాల ఆధ్వ‌ర్యంలో అమూల్ పాల కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ''ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పాల సేకరణ, రైతులకు చెల్లింపులు జరుగుతాయి. కేవలం మార్కెటింగ్ కోసమే అమూల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. పశు పోషణకు అవసరమైన అన్ని రకాల సహాయం నేరుగా ప్రభుత్వమే అందిస్తుంది. రైతులకు చెల్లింపులు కూడా ప్రభుత్వం ద్వారా జరుగుతాయి. కాబట్టి రైతులకు ఎక్కువ ప్రయోజనం దక్కుతుంది" అనేది ప్ర‌భుత్వం చెబుతున్న మాట‌.  పాల సేకరణ కేంద్రాల ద‌గ్గ‌ర‌ ఫ్యాట్ ఆధారంగా లీటర్ పాల ధరను నిర్ణయిస్తారు. రాష్ట్రంలోని ప్రముఖ డెయిరీలైన హెరిటేజ్, తిరుమల, సంగం, విశాఖ, కృష్ణా, ఒంగోలు మిల్క్ డెయిరీల ఆధ్వర్యంలో ఒక్కొక్కరు ఒక్కో ధర చెల్లిస్తున్నారు. కొన్ని డెయిరీలు 10 శాతం ఫ్యాట్ ఉండే లీట‌ర్ పాల‌కు 65 రూపాయ‌లు చెల్లిస్తుండగా.. చాలా సంస్థ‌లు మాత్రం రైతుల‌కు లీటరుకు 60 లోపే ధ‌ర ఇస్తున్నారు. అమూల్ వ‌చ్చాక వాటి రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం అమూల్ ఆధ్వర్యంలో ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలలో సేకరిస్తున్న పాల కేంద్రాలలో వాటి ధర అత్యధికంగా రూ. 71 వరకూ ఉంది. అమూల్ రాక‌తో మిగ‌తా సంస్థ‌లు పాల సేక‌ర‌ణ ధ‌ర‌ను పెంచాయి. రైతులు పాలు ఎవరికి పోస్తారన్నది వారి సొంత నిర్ణయమని ప్రభుత్వం చెబుతోంది. చేయూత లబ్దిదారులు మాత్రం అమూల్ కేంద్రాలకే పాలు పోయాల్సి ఉంటుంది. అమూల్ సంస్థకు లబ్ది చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. ప్రభుత్వమే నిర్వహించకుండా అమూల్ వంటి సంస్థలకు పెత్తనం అప్పగించిన తీరు మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లుగా లేనిది.. జ‌గ‌న్‌రెడ్డి సీఎం అవ‌గానే అమూల్ సంస్థ ఏపీలో ఎంట్రీ ఇవ్వ‌డంపై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌ధానంగా హెరిటేజ్ మిల్క్‌, సంగం డెయిరీల‌ను దెబ్బ కొట్టేందుకే అమూల్‌ను ఏపీకి తీసుకొచ్చార‌ని అంటున్నారు. ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నాలు అంద‌వంటూ పాడి రైతుల‌ను బెదిరించి.. వారిని అమూల్ వైపు డైవ‌ర్ట్ చేస్తున్నారనే విమ‌ర్శ వినిపిస్తోంది. అమూల్ కోసం వేల కోట్ల రూపాయ‌లు ప్ర‌భుత్వం ఖ‌ర్చు పెట్టే బ‌దులు.. ఆ నిధులేవో డెయిరీ సంస్థ‌ల‌కు, పాడి ప‌రిశ్ర‌మ సంఘాల‌కు కేటాయిస్తే అవే డెవ‌ల‌ప్ అవుతాయిగా అని ప్ర‌శ్నిస్తున్నారు.  అమూల్ వెనుక‌.. త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను దెబ్బకొట్టే పొలిటిక‌ల్ వ్యూహం దాగుంద‌ని విమ‌ర్శిస్తున్నారు. గ‌తంలో సంగం డెయిరీకి పాలు పోసిన రైతులు.. అమూల్ వ‌చ్చిన త‌ర్వాత అటు వైపు మ‌ళ్లారు. అక్క‌డ డ‌బ్బులు రావ‌డం ఆల‌స్యం కావ‌డం.. అంత‌లోనే సంగం డెయిరీ సైతం పాల సేక‌ర‌ణ ధ‌ర పెంచ‌డంతో.. ఆ రైతులు మ‌ళ్లీ అమూల్ నుంచి సంగం డెయిరీకి షిఫ్ట్ అయ్యారు. ఇలా ప‌లు జిల్లాల్లోని పాడి రైతులు అమూల్ నుంచి స్థానిక పాల స‌హ‌కార సంఘాల వైపు తిరిగి వెళ్లిపోతున్నార‌ని తెలుస్తోంది.  సంగం డెయిరీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు ఆ సంస్థ‌పై అనేక ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. సంగం డెయిరీలో తక్కువ వెన్న శాతం ఉన్న ఆవుపాలను 70 శాతంపైగా సేకరించి వాటికి అధిక వెన్న శాతం ఉన్న గేదే పాలను చేర్చి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారనేది పొన్నూరు ఎమ్మెల్యే రోశ‌య్య ఆరోప‌ణ‌. అలాగే రైతులకు బోనస్ పేరుతో క్యారేజీలు, హాట్ బాక్స్‌లు  పంచుతున్నారని.. బోనస్ అంటే ఇదేనా అని గ‌తంలో ఎమ్మెల్యే కిలారి రోశయ్య ప్రశ్నించారు. బినామీ పేర్ల‌తో ఛైర్మ‌న్ ధూళిపాళ్ల న‌రేంద్ర డ‌బ్బులు దోచుకుంటున్నార‌ని విమ‌ర్శించారు.  అయితే, వైసీపీ విమ‌ర్శ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఖండించే వారు సంగం డైయిరీ ఛైర్మన్‌గా ఉన్న టీడీపీకి చెందిన‌ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. బినామీ పేర్లతో రైతులున్నట్లు ప్రభుత్వం నిరూపించాలని సవాల్ చేశారు. ఆవు పాలను సేకరించి అధిక ధరకు అమ్ముతున్నారని ఆరోపణలు చేయడంపై ఆధారాలు చూపాలని అప్ప‌ట్లో ధూళిపాళ్ల డిమాండ్ చేశారు. అమూల్ అత్యధికంగా ఆవు పాలనే సేకరించి విక్రయిస్తుందన్నారు.  మ‌రోవైపు, అమూల్ వ‌చ్చినా.. సంగం డెయిరీ డిమాండ్ త‌గ్గ‌క‌పోవ‌డంతో ప్ర‌భుత్వంలో అస‌హ‌నం పెరిగింద‌ని అంటున్నారు. సంగం డెయిరీలో అవినీతి, అక్ర‌మాలు జ‌రిగాయంటూ ఛైర్మ‌న్ ధూళిపాళ్ల న‌రేంద్ర‌నే అరెస్ట్ చేసే వ‌ర‌కూ ప‌రిస్థితి ముదిరింది. పాల పంచాయితీ ఏపీలో రాజ‌కీయంగా ర‌చ్చ రేపుతోంది. 

కబ్జాలపై సీఎందే ట్రైనింగ్ ! 

కొవిడ్ మహమ్మారి సమయంలోనూ తెలంగాణలో రాజకీయ మంటలు కొనసాగుతున్నాయి.  మున్సిపాలిటీలకు ఎన్నికల ప్రచారంలో పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ, అధికార టీఆర్ఎస్ నేతలు వ్యక్తిగత దూషణలతో కాక రేపుతున్నారు. తాజాగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.  ఓరుగల్లు ప్రజలు కబ్జాకోరులను అడ్డుకుంటారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండిసంజయ్ వ్యాఖ్యానించారు.  వరంగల్‌లో ఇప్పటికే కోచ్ ఫ్యాక్టరీ ఉంది.. ఆ కోచ్ ఫ్యాక్టరీకి కోచ్ కేసీఆరే అని చెప్పారు. కబ్జాలపై ఇక్కడి ఎమ్మెల్యేలకు కోచింగ్ ఇచ్చేది సీఎం కేసీఆరే అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్‌లోనే కబ్జాలు పెరిగాయని బండి సంజజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీ షీటర్లు, తలలు నరికిన వారికి, నగర బహిష్కరణ చేసిన వ్యక్తులకు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చిందని బండి ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు తప్పుడు అభ్యర్థులను ఎంపిక చేశామని భద్రకాళీ గుడి వద్ద ముక్కునేలకు రాయాలని ఆయన సవాల్ చేశారు. వరంగల్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ సమస్యలపై బీజేపీ పోరాటం చేసింది, అందుకే ప్రజల నుంచి అనూహ్య స్పందన కన్పిస్తోందని తెలిపారు. అన్ని సర్వేల్లో బీజేపీ గెలుస్తుందని తేలిందన్నారు బండి సంజయ్.  సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఉండడంతో అధికార టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ నాయకులను చూసి ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని బండి సంజయ్ తెలిపారు.

కేసీఆర్ కు గాంధీలో చికిత్స! యువకుడి నిరసన 

తెలంగాణలో కొవిడ్ తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. శుక్రవారం రాష్ట్రంలో కొత్తగా ఏడు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాలు భారీగా పెరిగిపోయాయి. రోగులతో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ నిండిపోయాయి. బాధితులకు బెడ్లు దొరక్క, సకాలంలో ఆక్సిజన్ అందక చనిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా సోకడంతో ఆయన తన ఫాంహౌజ్ లో క్వారంటైన్ లో ఉన్నారు. మంత్రి కేటీఆర్. ఎంపీ సంతోష్ కుమార్ కుడా కరోనా భారీన పడి ఐసోలేషన్ లో ఉన్నారు.  ఈ నేపథ్యంలో కొవిడ్ రోగులకు చికిత్స అందించే హైద్రాబాద్ లోని   గాంధీ ఆసుపత్రి ఎదుట  కరీంనగర్ కు  చెందిన యువకుడు వినూత్న నిరసన చేపట్టాడు.  పేద, మధ్య తరగతి రోగుల కోసం కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ లో చేర్చాలని, లేకుంటే సీఎం కెసీఆర్, మంత్రి కేటీఆర్లను గాంధీ ఆస్పత్రిలో చేర్చాలంటూ ఆ యువకుడు ప్లకార్డు ప్రదర్శించారు. కరోనా విళయతాండవం చేస్తున్న మన రాష్ట్రంలో ఇదే అదునుగా భావిస్తూ ఎన్నో ప్రయివేటు ఆసుపత్రులు కరోనా వైద్య చికిత్సల పేర పేద, మధ్యతరగతి ప్రజలను దోచుకుంటూ, మరింత పేదరికంలోకి నెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి సదుపాయాలు లేని గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్లలేక ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయివేటు హాస్పిటల్ లో చెర్పించి అప్పుల పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా బారిన పడ్డ సీఎం కేసీఆర్ ఇటీవల టెస్టుల కోసం యశోదా హాస్పిటల్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా వస్తే ఎంతటి పెద్దోడైనా గాంధీకి వెళ్లాల్సిందే అన్న సీఎం.. ప్రైవేట్ ఆసుపత్రికి ఎలా వెళతారంటూ పలువురు వ్యాఖ్యానించారు. పెద్దలకు ఓ న్యాయం.. పేదలకు ఓ న్యాయమా అని ప్రశ్నించారు. అందులో భాగంగానే తాజాగా ఈ యువకుడి ఫొటోను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు

ప్రజలందరికి వ్యాక్సిన్ ఫ్రీ.. డబ్బు ముఖ్యం కాదన్న కేసీఆర్ 

తెలంగాణ ప్రజలందరికి కొవిడ్ వ్యాక్సిన్ ఉచితంగానే ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.  రాష్ట్ర జనాభా, ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి అనేక సెక్టార్లలో పనిచేస్తున్న జనాభా కలుపుకుని, తెలంగాణ రాష్ట్రంలో సుమారు నాలుగు కోట్లమంది దాకా ప్రజలు వున్నారని చెప్పారు. వీరిలో ఇప్పటికే 35 లక్షల మందికి పైగా వ్యక్తులకు వాక్సినేషన్ ఇవ్వడం జరిగిందని, మిగతా అందరికీ వయసుతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో వున్న ప్రతివారికీ వాక్సినేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి  నిర్ణయించారు. ఇలా మొత్తం అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి సుమారు 2500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందనీ, ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదనీ, అందరికీ వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందనీ  కేసీఆర్ అన్నారు.త్తం రాష్ట్రంలో వున్న అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  ఇప్పటికే భారత్ బయోటెక్ వాక్సినేషన్ తయారీ చేస్తున్నదని, రెడ్డీ ల్యాబ్స్ తో సహా మరికొన్ని సంస్థలు వాక్సినేషన్ తయారీకి ముందుకు వచ్చాయని, కాబట్టి వాక్సినేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది వుండబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రెండు-మూడు రోజుల్లో తనకు అవసరమైన వైద్య పరీక్షలు జరిగి, పూర్తి స్వస్థత చేకూరిన తరువాత సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి అన్నారు. వాక్సినేషన్ కార్యక్రమం పటిష్టంగా, విజయవంతంగా అమలు చేయడానికి జిల్లాలవారీగా ఇంచార్జులను నియమించడం  జరుగుతుందని సిఎం కేసీఆర్ చెప్పారు.  వాక్సినేషన్ కార్యక్రమంతో పాటు, రెమిడీసివిర్ తదితర కరోనా సంబంధిత మందులకు, ఆక్సిజన్ కు ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలు ఏ విధమైన భయభ్రాంతులకు గురికావద్దని, కరోనా సోకినవారికి పడకల విషయంలోనూ, మందుల విషయంలోనూ ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తుందని చెప్పారు. ప్రజలను కోవిడ్ బారి నుండి కాపాడడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, పెద్ద ఎత్తున సానిటేషన్ చేపట్టుతుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ప్రజలను అధైర్య పడవద్దని, ఏ మాత్రం నిర్లక్ష్యంగా వుండవద్దని సిఎం కోరారు. గుంపు గుంపులుగా ఉండవద్దని, ఊరేగింపులలో పాల్గొనవద్దని, అత్యవసరమైతేనే తప్ప బయట తిరగవద్దని, స్వయం క్రమశిక్షణ పాటించాలని ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల క్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం కరోనా మహమ్మారి విషయంలో చేయాల్సినదంతా పటిష్టంగా చేస్తుందని కేసీఆర్ మరోసారి చెప్పారు.  

అడ్డుకుంటే ఉరి.. ఆక్సిజ‌న్ ఆటంకంపై కోర్టు వార్నింగ్‌..

జీవించడం ప్రజల ప్రాథమిక హక్కు. ప్రాణవాయువు అందించలేకపోవడం నేరపూరిత చర్య. ఆక్సిజన్ సరఫరాను ఎవరైనా అడ్డుకున్న ఒక్క సందర్భాన్ని తమ దృష్టికి తీసుకురావాలనీ.. అతడిని తాము ‘‘ఉరి తీస్తా’’మని కోర్టు తెలిపింది. ‘‘ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు..’’ అని ఢిల్లీ హైకోర్టు  ధర్మాసనం హెచ్చ‌రించింది. ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్న అలాంటి అధికారులపై కేంద్రం చర్యలు తీసుకునేలా.. వారి గురించి కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలపాలని ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.  ఆక్సిజ‌న్ కొర‌త‌పై ఢిల్లీ ప్ర‌భుత్వంతో పాటు ప‌లు ఆసుప‌త్రులు హైకోర్టును ఆశ్ర‌యించాయి. విచార‌ణ సంద‌ర్భంగా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతపై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఎవరైనా ప్రాణవాయువు సరఫరాకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలను తప్పవని హెచ్చరించింది. ‘ఇది సెకండ్‌ వేవ్‌ కాదు, సునామీ. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తారస్థాయి చేరలేదు. మే నెల మధ్యలో ఆ సంఖ్యను దాటవచ్చు. అందుకు  ఎలా సిద్ధమవుతున్నాం’ అని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది.   ప్రస్తుతం రాజధాని నగరానికి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ లభించకపోతే వ్యవస్థ కుప్పకూలిపోతుందని విచారణలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కొరత కారణంగా గత 24 గంటల్లో దారుణమైన ఘటనలు కళ్ల ముందు కనిపించాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం కేవలం 297 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే కేంద్రం నుంచి లభించిందని చెప్పింది కేజ్రీవాల్ స‌ర్కారు.  స్పందించిన కోర్టు.. ఢిల్లీకి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఎప్పుడు లభిస్తుందంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. అలాగే ఆక్సిజన్ సరఫరాకు అడ్డుపడే వారి వివరాలు ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంటనే సొంతంగా ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రాణవాయువు అందించలేకపోవడాన్ని నేరపూరిత చర్యగా అభివర్ణించిన కోర్టు.. జీవించడం ప్రజల ప్రాథమిక హక్కని ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. సరఫరాకు ఆటంకం కలిగిస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. 

రోగులకు ఆక్సిజన్ లేదు.. సెంట్రల్ విస్టా అవసరమా? 

దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. రోజూ 2 వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. అనధికారికంగా చనిపోతున్న వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉందని అంటున్నారు. కరోనా రోగులకు హాస్పిటల్స్ లో ఆక్సిజన్ అందడం లేదు. ఆక్సిజన్ నిండుకోవడంతో ఢిల్లీ ఆస్పత్రిలో 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్న తరుణంలో అనవసరమైన ప్రాజెక్టులపై ఖర్చులెందుకని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనవసరమైన ప్రాజెక్టులు, ప్రజా సంబంధాల ప్రచారం కోసం ఖర్చు చేయడానికి బదులుగా వ్యాక్సిన్లు, ఆక్సిజన్, ప్రజారోగ్య సేవలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.  సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులను కొనసాగించడాన్ని రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. కోవిడ్-19 మహమ్మారి ప్రజలను బాధిస్తున్న సమయంలో ఈ ప్రాజెక్టు పనులకు ప్రాధాన్యమివ్వడాన్ని ఆయన ప్రశ్నించారు. టెస్ట్‌లు జరగడం లేదని, వ్యాక్సిన్లు అందుబాటులో లేవని, ఆక్సిజన్ కొరత వేధిస్తోందని, ఐసీయూ బెడ్స్ అందుబాటులో లేవని, ఇటువంటి సమయంలో ఈ ప్రాజెక్టుపై ఎందుకు శ్రద్ధ చూపిస్తున్నారని నిలదీశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో మూడు సెక్రటేరియల్ బిల్డింగ్స్ నిర్మాణం కోసం బిడ్స్‌ను ఆహ్వానించినట్లు పేర్కొంటున్న న్యూస్ ఐటెమ్‌ను ఈ ట్వీట్‌తోపాటు రాహుల్ గాంధీ జత చేశారు.  అనవసరమైన ప్రాజెక్టులపైనా, ప్రజా సంబంధాల ప్రచారంపైనా ఖర్చు చేయడానికి బదులుగా, వ్యాక్సిన్లు, ఆక్సిజన్, ఇతర ఆరోగ్య సేవలపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు రాహుల్ గాంధీ. ఈ సంక్షోభం రానున్న రోజుల్లో మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. దీనిని ఎదుర్కొనడానికి దేశం సంసిద్ధంగా ఉండాలన్నారు. ప్రస్తుత దయనీయ స్థితి భరించలేనిదన్నారు. ప్రభుత్వ, పార్లమెంటరీ కార్యాలయాల సముదాయాన్ని సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు. ఇది న్యూఢిల్లీలోని రైజినా హిల్స్‌లో ఉంది. ప్రస్తుత పార్లమెంటు భవనం సమీపంలోనే ఈ నిర్మాణాలు జరుగుతాయి

ఉచితంగా టీకాలు.. దిగొచ్చిన కేంద్రం..

కేంద్ర,  రాష్ట్రాల‌కు వేరు వేరు రేట్ల‌కు వ్యాక్సిన్‌లు ఇవ్వ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. కేటీఆర్ లాంటి వాళ్లు ఇదేమి అన్యాయ‌మంటూ ప్ర‌శ్నించారు. దీంతో కేంద్రం దిగొచ్చింది. న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేపట్టింది. తాము సేకరించే కరోనా వ్యాక్సిన్లను అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.  ‘‘భారత్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు టీకాలను రూ. 150 చొప్పున కొనుగోలు చేస్తున్నాం. అలా సేకరించిన వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తున్నాం. ఇకపై కూడా అది కొనసాగుతుంది’’ అని కేంద్ర ఆరోగ్యశాఖ ట్వీట్‌ చేసింది.   కరోనా టీకా ధరలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరాం రమేశ్‌ ఇటీవల ఓ ట్వీట్‌ చేశారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌ టీకా ఒక్కో డోసును కేంద్రం రూ.400 కొనుగోలు చేయనున్నట్లు ఉన్న ఓ పత్రిక కథనాన్ని జైరాం రమేశ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇది అమెరికా, యూకే, ఐరోపా సమాఖ్య, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా చెల్లిస్తున్న ధర కంటే ఎక్కువ అని త‌ప్పుబ‌ట్టారు. భారత్‌లో తయారైన టీకాకు భారత్‌లోనే అత్యధిక ధర చెల్లించడం ఏంటని ప్రశ్నించారు. టీకా ఒక్కో డోసును రూ.150 చొప్పున విక్రయించినా తమకు లాభమే అని గతంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం వెంటనే ధరల్ని పునఃసమీక్షించాలని కోరారు. ఈ ట్వీట్‌కు కేంద్రం తాజాగా బదులిచ్చింది. తాము సేకరించే వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఉచితంగానే ఇస్తామని తెలిపింది.   దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ కేంద్రం టీకా పంపిణీని వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా  మే 1వ తేదీ నుంచి 18ఏళ్లు పైబడిన వారందరూ టీకా తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అంతేగాక, వ్యాక్సిన్ల కొనుగోలులో రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పించింది. రాష్ట్రాలు, ప్రయివేటు కేంద్రాలు అదనపు డోసుల కోసం నేరుగా ఉత్పత్తిదారులను సంప్రదించొచ్చని తెలిపింది. టీకా తయారీదారులు తమ ఉత్పత్తిలో 50శాతం రాష్ట్రాలు, బహిరంగ మార్కెట్లో విక్రయించొచ్చని వెల్లడించింది. సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల కొవిషీల్డ్‌ కొత్త ధరలకు ప్రకటించింది. కేంద్రానికి రూ.150.. రాష్ట్ర ప్రభుత్వాలకు డోసుకు రూ. 400, ప్రయివేటు ఆసుపత్రులకు డోసుకు రూ. 600 చొప్పున విక్రయించనున్నట్లు తెలిపింది. అయితే ఈ ధరలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒకే దేశం ఒకే పన్ను అని చెబుతూ ఒకే దేశం రెండు వ్యాక్సిన్ల ధరలా అంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి.  కేంద్ర ఆరోగ్య శాఖ తాజా ప్ర‌క‌ట‌న‌తో వివాదం స‌మాప్తం.